ఆన్లైన్ అప్పుకు మరొకరు బలి! సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్
posted on Dec 17, 2020 @ 10:33AM
ఆన్ లైన్ రుణం ఓ యువతి ప్రాణం తీసుకుంది. రుణం ఇచ్చిన సంస్థ వేధింపులు భరించలేక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలో ఈ విషాద ఘటన జరిగింది. వ్యాపారంలో నష్టపోయిన తండ్రి కష్టాలు చూడలేక ఆన్లైన్ యాప్లో రుణం తీసుకున్న ఓ యువతి గడువులోగా అప్పును తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో రుణ సంస్థ నుంచి వేధింపులు, ఒత్తిడి ఎక్కువయ్యాయి. తట్టుకోలేకపోయిన ఆమె పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం రాజగోపాలపేట చెందిన 24 ఏండ్ల కిర్ని మౌనిక ఏఈవోగా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరి కుటుంబం సిద్ధపేటలో ఉంటోంది. మౌనిక తండ్రి భూపాణి వ్యాపార ప్రయత్నాల్లో డబ్బులు నష్టపోయారు. దీంతో కుటుంబ అవసరాల కోసం ‘స్నాప్ ఇట్ లోన్’ యాప్ నుంచి రెండు నెలల క్రితం రూ. 3 లక్షల రుణం తీసుకుంది. అయితే, గడువు తీరినా ఆమె తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో యాప్ నిర్వాహకులు మౌనికపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగక ఆమె ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లన్నింటికీ మౌనికను రుణ ఎగవేతదారుగా పేర్కొంటూ వాట్సాప్ మెసేజ్లు పంపించారు. రుణ సంస్థ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
పురుగుల మందు తాగి ఇంట్లో పడిపోయిన మౌనికను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మౌనిక మృతి చెందింది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అప్పు కోసం వేధించిన రుణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.