ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీపై ఊహాగానాలు నిజమేనా..! 

ఏపీ హైకోర్టు లో రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు తీర్పులు వచ్చిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనాల ముందు పలు కేసుల పై విచారణ కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ జేకే మహేశ్వరీ బదిలీ కానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై బుధ, గురు వారాలలో ఒక ప్రకటన వెలువడవచ్చని ఆ వార్తల సారాంశం. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ను అర్ధంతరంగా తొలగించడం వరకు ఏపీ సర్కారు తీసుకున్న అనేక చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఏపీ హైకోర్టు సిజి జస్టిస్‌ జేకే మహేశ్వరి బదిలీ పై నారాయణ మాట్లాడుతూ "ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరిని బదిలీ చేయించడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సీఎం జగన్ ఈ విషయంపై కేంద్రంలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇదే విషయం పై త్వరలో ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలను కూడా కలవనున్నారు” అని సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ఈ బదిలీ వ్యవహారం పై ప్రజలలో పలు అనుమానాలతో పాటు ఈ విషయం పై ఉత్కంఠ కూడా నెలకొంది.

తిరుపతిలో బీజేపీ పంచతంత్రం! ఏపీలో అధికారం దిశగా శంఖారావం

తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. కేసీఆర్ సొంత జిల్లా దుబ్బాక అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక విజయంతో తెలంగాణలో కమలం దూకుడప పెంచింది. దుబ్బాక జోష్ తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెమటలు పట్టించి అనూహ్యా  ఫలితాలు సాధించింది.  రెండు వరుస విజయాలతో ఇప్పుడు తెలంగాణలో కమలదళం బలమైన శక్తిగా అవతరించింది. వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో అధికారం ఖాయమనే ధీమాలో ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ పార్టీ బలోపేతానికి స్కెచ్ వేస్తోంది బీజేపీ. అక్కడ దుబ్బాక విజయాన్ని తమ జైత్రయాత్రకు పునాదిగా వేసుకోగా..  ఏపీలో  తిరుపతిని అందుకు వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో త్వరలో జరగనున్న లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఏపీలో అధికారం దిశగా తొలి అడుగు వేయాలని ప్లాన్ చేస్తోంది. అందుకే తిరుపతి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు.. గెలుపే లక్ష్యంగా పంచ తంత్రాన్ని రచించారని చెబుతున్నారు.    తిరుపతి ఉప ఎన్నికలో గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గ్రేటర్ రాయలసీమ డిమాండ్ వినిపించింది. రాష్ట్ర విభజన తర్వాత తాజాగా మళ్లీ ఆ నినాదం తెరపైకి వచ్చింది. ఇటీవల జరిగిన గ్రేటర్ రాయలసీమ పుస్తకావిష్కరణలో మళ్లీ సీమ నేతలంతా తమ వాయిస్ ను మరోసారి గట్టిగా వినిపించారు. తెలంగాణ ప్రజలను ఆదర్శంగా తీసుకొని గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమించాలని  పిలుపునిచ్చారు. దీన్నే ఇప్పుడు అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. నిజానికి రాయలసీమ గురించి ఉమ్మడి ఏపీలోనే బీజేపీ గట్టిగా మాట్లాడింది. కర్నూల్ లో హైకోర్టు పెట్టాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ తెరపైకి రావడంతో.. రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమలనాధులు ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ రాయలసీమకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందని చెప్పడం ద్వారా సెంటిమెంట్ రగిలించి.. దాన్ని తిరుపతి ఉప ఎన్నికలో క్యాష్ చేసుకోవాలని కార్యాచరణ సిద్ధం చేశారని చెబుతున్నారు. ఇది బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.   ఎక్కడ ఎన్నికలున్నా బీజేపీ ఎక్కువగా వినిపించేది హిందుత్వ నినాదమే. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ హిందుత్వ కార్డును బలంగా ఉపయోగించాలని కాషాయ పార్టీ నిర్ణయించిందని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చాకా హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీటీడీ, విజయవాడ కనకదర్గ వంటి ప్రముఖల ఆలయాల్లోనూ వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో జగన్ డిక్లరేషన్ అంశం పెద్ద దుమారమే రేపింది. క్రైస్టవ ప్రచారాలు ఎక్కువయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక క్రైస్తవ పాస్టర్లకు జగన్ ప్రభుత్వం భృతి ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హిందూ సాంప్రదాయాలు మంటగలిపేలా కావాలనే కొందరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.   ఇవన్ని ఇలా ఉండగానే  విజయవాడ మూడో పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు జరపడం రచ్చగా మారింది.  పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి  శాంటాక్లాజ్ టోపీలు ధరించడం  తీవ్ర కలకలం రేపుతోంది. వీటన్నింటిని తమ ప్రచారాస్త్రాలుగా మార్చుకుని ప్రజలను తమవైపు తిప్పుకోవాలని ఏపీ బీజేపీ నేతలు ప్రణాళికలు రచించారని చెబుతున్నారు. ఇప్పటికే ఎంపీ జీవీఎల్ హాట్ కామెంట్స్ చేసి రాజకీయ హీట్ పుట్టించారు. తెలంగాణ బండి సంజయ్ చేసిన కామెంట్ల తరహాలోనే సర్జికల్ స్ట్రైక్ ప్రకటన చేశారు.  తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని జీవీఎల్  అన్నారు.  ఏపీలో మత రాజకీయాలు చేయడంలో పోటీ పడుతున్న వైసీపీ, టీడీపీలపై రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.    తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు అదనపు బలం కానుంది. ముఖ్యంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చరిష్మా బాగా కలిసివచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలో పవన్ కు భారీగా అభిమానులున్నారు. పవన్ సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే తిరుపతిలో పవన్ తో విస్త్రతంగా ప్రచారం చేయించేలా కమలం నేతలు రోడ్ మ్యాప్ తయారు చేశారని తెలుస్తోంది. పవన్ తో వీలైనన్ని ఎక్కువ సభలు పెట్టించి.. ఆయన అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గ ఓట్లన్ని గంపగుత్తగా కమలానికి మళ్లేలా పావులు కదుపుతున్నారని సమాచారం. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా పవనే ఉండనున్నారని, అందుకు గబ్బర్ సింగ్ కూడా అంగీకరించారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీకి బాగా కలిసి రావచ్చనే అభిప్రాయం రాజకీయ అనలిస్టులు కూడా వ్యక్తం చేస్తున్నారు.    తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాస్ ఉంటారని చెబుతున్నారు. దాసరి ఎంపికలోనూ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన దాసరి శ్రీనివాసులు.. తిరుపతి అభివృద్ధికి బాగా కష్టపడ్డారనే టాక్ ఉంది. తిరుపతిలోని శ్రీసిటి, మీనాక్షి సెజ్ లకు అనుమతులు, భూసేకరణ విషయాల్లో శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారట. ఆ సెజ్ లతో తిరుపతి పరిసర గ్రామాల్లోని యువతకు భారీగా ఉపాధి దొరికింది. దాసరి శ్రీనివాస్ కు తిరుపతి ఏరియాలో మంచి పరిచయాలు ఉన్నాయంటున్నారు. అంతేకాదు తిరుపతి ఎంపీ పరిధిలోనే కృష్టపోర్టు ప్రాంతం కూడా వస్తోంది.  కృష్ణపోర్టు ఏర్పాటులో కూడా దాసరి శ్రీనివాసే ప్రధాన పాత్ర పోషించారట. ఇది కూడా తమకు కలిసివస్తుందని కమలనాధులు అంచనా వేస్తున్నారు. దాసరి శ్రీనివాస్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. తిరుపతి పరిధిలో ఆ వర్గ ఓట్లే ఎక్కువగా  ఉన్నాయంటున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే బీజేపీ హైకమాండ్ దాసరి శ్రీనివాస్ వైపు మొగ్గు చూపుతుందని తెలుస్తోంది. దాసరిని ఎంపిక చేస్తే బీజేపీకి మరింత ప్లస్ అవుతుందనే ప్రచారం తిరుపతి నియోజకవర్గంలో జరుగుతోంది.    చివరి అస్త్రంగా వలసలను ప్రోత్సహిస్తోంది బీజేపీ. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోని అసమ్మతి నేతలను గుర్తించి వారికి వల వేస్తోంది. ఇప్పటికే తిరుపతి కార్పొరేషన్ కు చెందిన 15 మంది మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. త్వరలోనే మరికొందరు కమలం గూటికి చేరుతారని చెబుతున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వలసల బాధ్యతలను ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డికి బీజేపీ హైకమాండ్ అప్పగించిందట. జిల్లాలో బలమైన నేతగా ఉన్న వాకాటి... ఇప్పటికే వైసీపీ, టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే లోపే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు. రెండు పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా కమలం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.    మొత్తంగా పంచతంత్రంతో  తిరుపతిలో గెలిచి.. ఏపీలో అధికారం దిశగా పావులు కదపాలని బీజేపీ పక్కా వ్యూహాలు సిద్ధం చేసిందని చెబుతున్నారు. ఇవన్ని వర్కవుట్ అయితే మాత్రం తిరుపతి లోక్ సభను కమలం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులుచెబుతున్నారు. బీజేపీ ఎక్కడైనా గెలవాలని స్కెచ్ వేస్తే సాధించే వరకు విశ్రమించదనే టాక్ ఉంది. అయితే తిరుపతిలో అది ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాలి మరీ..

పథకాలకు పేర్లే కాదు పాలన కూడా సేమ్! సీఎం జగన్ తీరుపై జనాల్లో చర్చ

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అంతా వైఎస్సార్ నామ జపమే వినిపిస్తోంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన పథకాలన్నింటికి వైఎస్సార్ పేరే పెట్టారు. పెన్షన్ పథకం నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు అన్నింటికి అదే పేరు. ప్రభుత్వ పథకాల పేర్లపై  జనాల నుంచి వ్యతిరేకత వస్తున్నా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సర్కార్ పథకాలకు పేరు పెట్టడం కాదు పాలనంతా గతంలో వైఎస్సార్ హయాంలో జరిగినట్లుగా చేయాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన మైనింగ్ స్కాంలో అరెస్టై జైలుకు వెళ్లిన సీనియర్ ఐఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని పట్టుబట్టి మరీ ఏపీకి తీసుకురావడం,  ఈ నెలాఖారులో పదవి విరమణ చేయనున్న నీలం సాహ్నీ స్థానంలో  తదుపరి సీఎస్ గా ఆదిత్యనాథ్‌ దాస్‌ ను నియమించాలని నిర్ణయించడాన్ని అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.    వైఎస్ హయాంలో కీలకంగా ఉన్న అధికారులకే జగన్ కీలక పోస్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి.  గతేడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్.. గతంలో  తన తండ్రి దగ్గర  పనిచేసిన పలువురు అధికారులను తెచ్చిపెట్టుకున్నారు. సీనియర్లను కాదని కొందరు జూనియర్లకు కీలక పోస్టులు కట్టబెట్టారు. ఇదే కోవలో తనకూ అవకాశం దక్కుతుందని సీనియర్ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కేంద్రం ఆమెను డిప్యుటేషన్‌పై ఏపీకి పెంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్ధాయి అధికారుల డిప్యుటేషన్ కుదరదని చెప్పేసింది.  సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో  ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ క్యాడర్‌లోనే పనిచేయాల్సి వచ్చింది. చివరకు క్యాట్ ను ఆశ్రయించి అనుకున్నది సాధించారు శ్రీలక్ష్మి. క్యాట్ అదేశాలతో ఆమె ఏపీకి బదిలీ అయ్యారు. శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చేందుకు  జగన్  ప్రభుత్వం కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖను అనుమతి కోరింది. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పోస్టింగ్ ఇవ్వనున్నారు.    వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి ఓ వెలుగు వెలిగారు. గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో ఓబుళాపురం మైనింగ్ కు అనుమతుల విషయంలో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించడం ద్వారా గాలి జనార్ధనరెడ్డికి భారీగా లబ్ధి చేకూరింది. దీంతో శ్రీలక్ష్మి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణల వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత సీబీఐ మైనింగ్ తో పాటు జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు చేయడంతో ఆమె జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది. జైలులో ఆమె ఆరోగ్యం క్షిణించడం ఆ తర్వాత కోలుకోవడం జరిగాయి. గతంలో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన అధికారి కోసం జగన్ సర్కార్.. కేంద్రం దగ్గర లాబీయింగ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. అయితే గతంలో తన తండ్రికి నమ్మినబంటుగా పని చేసిన అధికారి కాబట్టే జగన్ ఇంతగా పట్టుబట్టారని చెబుతున్నారు. తన ప్రభుత్వంలోనూ  శ్రీలక్ష్మికి జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు.    ఏపీ రాష్ట్ర ప్రస్తుత  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆమె తరువాత సీఎస్‌ గా 1987వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే సీఎం జగన్‌ మొగ్గు చూపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను ముందుగా సీఎస్‌ కార్యాలయంలో ఓఎస్డీగా నియమిస్తున్నట్లు సమాచారం. నెలాఖరు వరకూ అయన ఓఎస్డీగా ఉంటూ పాలనా వ్యవహారాలపై అవగాహన పెంచుకోడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సంప్రదాయం కేంద్ర సర్వీసుల్లో ఇప్పటికే ఉంది. నిజానికి  నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్‌ సాహ్ని, ఆ తర్వాతి స్థానాలలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉన్నారు. వీరిలో అజయ్‌ సాహ్ని, సమీర్‌ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్‌ త్రిపాఠి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తున్నారు. మరో ఐఏఎస్ అధికారి సతీష్‌ చంద్ర మాజీ సీఎం చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసారు. ఆయనను సీఎస్‌ గా చేయడానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.  మరో అధికారి జేఎస్వీ ప్రసాద్‌పై కూడా సీఎంకు సదభిప్రాయం లేదని తెలుస్తోంది.    ప్రస్తుతం సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్న నీరబ్ ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే నీరబ్‌కు 2024 జూన్‌ వరకూ పదవీకాలం ఉంది. అంటే మూడున్నర ఏండ్లు ఆయనే సీఎస్. అంత ఎక్కువ కాలం ఒకరినే సీఎస్ గా కొనసాగించడం సరికాదన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఆదిత్యనాథ్‌ వైపే మొగ్గుచూపారని చెబుతున్నారు. అంతేకాదు జగన్ కు మొదటి నుంచి ఆధిత్యనాథ్ నమ్మకస్తుడిగా ఉన్నారు. అందుకే జగన్ కూడా  ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. సీఎంవోలోనూ చోటు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఆదిత్యనాథ్ దాస్ ను సీఎస్ గా నియమించాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా వైఎస్సార్ తరహాలోనే జగన్ పాలనలో ముందుకు వెళుతున్నారని తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై మరో చర్చ జరుగుతోంది. వైఎస్సార్ హయాంలో అవినీతి అరోపణలు ఎదుర్కొన్న వారికి ప్రాధాన్యత ఇస్తే జనాల్లోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

తప్పు చేస్తే కాలర్‌ పట్టుకుని నడిబజారులో నిలబెడతా! పార్టీ కార్పొరేటర్లకు అక్బర్ వార్నింగ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ  కార్పొరేటర్లకు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కార్పొరేటర్ పదవిని అడ్డుపెట్టుకుని ఎవరినైనా వేధింపులకు గురి చేస్తే ఊరుకోబోనని చెప్పారు. డబ్బు వసూలు చేయడం వంటి పనులు చేస్తే కాలర్ పట్టుకుని నడి బజారులో నిలబెడతానని అక్బర్ హెచ్చరించారు. కార్పొరేటర్లుగా ఎన్నికైన అందరూ కూడా ప్రజాసేవ చేయడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించాలని చెప్పారు అక్బరుద్దీన్ ఒవైసీ. అధికారం ఉంది కదా అని ప్రజలను వేధించొద్దని సూచించారు.    కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలతో హఫీజ్ బాబా నగర్ లోని  ఫలక్ ప్యాలస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను అక్బరుద్దీన్ ఒవైసీ సన్మానించారు. చాంద్రాయణగుట్ట ప్రాంతం తన రక్తం చిందిన నేల అని అన్నారు అక్బర్. ఈ ప్రాంతంపై తనకు ఎంతో ప్రేమ, మక్కువ ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతం తన ప్రాణం, తన శ్వాస అని తెలిపారు. అలాంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులను కలిగించినా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

నయీం కేసు మళ్లీ తెరపైకి      

కరుడు గట్టిన నేరస్తుడు నయీం కేసుపై సమగ్రమైన విచారణ జరపాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ డిమాండ్ చేసింది. రాష్ట్ర గవర్నెర్స్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ 2016 ఆగస్టు 8న నయీం ఎన్‌కౌంటర్‌లో మరణించి నాలుగేళ్లు గడిచినా కేసు విచారణను సమగ్రంగా దర్యాప్తు నిర్వహించడంలో సిట్ విఫలమైందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ తర్వాత నయీం ఇంట్లో లభ్యమైన వస్తువుల వివరాలను అందజేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ సిట్ ను కోరగా, సిట్ సోమవారం వివరాలను అందజేసింది. ఈ సందర్భంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మాట్లాడుతూ నయీం కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడంలో ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) విఫలమైనట్టు విమర్శించారు.   ఒక సామాన్య పౌరుడికి ఆత్మ రక్షణ కోసం తుపాకీ లైసెన్స్ కావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకుని ఉంటుందన్నారు. అలాంటిది నయీంకు 24 తుపాకులకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీటిలో 3 ఏకే-47 తో పాటు ఒక స్టెన్‌గన్ ఉండటం మరింత భయాందోళన కలిగిస్తోందని అన్నారు. సామాన్యులు భూమి కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆధార్, పాన్ కార్డు, లింకు డాక్యుమెంట్లు, ఫోటోతో సహా వేలిముద్రలు తదితర పత్రాలను సమర్పించాల్సి వస్తోంది. కానీ, అవేమీ లేకుండా నయీంకు 752 రిజిస్ట్రేషన్లు ఎలా సాధ్యం అయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. వేల ఎకరాలకు సంబంధించిన దాదాపు 752 రిజిస్ట్రేషన్ దస్తావేజులు లభ్యం కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. నయీం ఇంట్లో 602 సెల్ ఫోన్లు లభ్యం కావడంతో వీటన్నింటీ మంజూరు వ్యవహారంలో కచ్చితంగా నయీంకు పోలీసులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ ఇతర ప్రభుత్వ అధికారుల, రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనే విషయాన్నిఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఆసక్తి రేపుతున్న ఢిల్లీ పయనం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిందో లేదో... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్న ఆయన..సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు ఏపీ సీఎం. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే కేంద్రానికి లేఖరాసిన సీఎం జగన్.. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాను కలవబోతున్నారు. రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ముగిసే వెంటనే.. ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన వ్యాఖ్యలకు కట్టుబడిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే అంశంలో రెండో అభిప్రాయం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని తాము మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు చెప్పిన విషయాన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని అక్టోబర్ 1వ తేదీన రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ నేడు రాష్ట్ర హైకోర్టును కోరారు. దీనిపై తీవ్రంగా మండిపడిన రాష్ట్ర హైకోర్టు, ఈ విషయంలో తమ వ్యాఖ్యల నుంచి వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేసింది. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ స్పష్టం చేయడంతో తాము సుప్రీంకోర్టుకు వెళతామని అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. హైకోర్టు ధర్మాసనం తన వాదన వినకుండానే వ్యాఖ్యానాలు చేసిందని ఆయన ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు వ్యాఖ్యానించడం కోర్టు పరిధిలోకి రాదని కూడా ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ల నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాల సందర్భంగా జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కేసిఆర్ వంగి వంగి దండాలు పెట్టినా జైలుకు పోక తప్పదు.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారో లేదో.. వెంటనే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లడంతో తాజా పరిణామాలను అటు రాజకీయ నాయకులు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ రెండు పర్యటనలపై కొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కేసిఆర్ తన పర్యటన సందర్భంగా బీజేపీ పెద్దల ముందు హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించి ఒక ఆఫర్ ఉంచారని.. దీనిపై చర్చించేందుకు అధిష్టానం సంజయ్ ను ఢిల్లీ పిలిచిందని కొన్ని కథనాలు వచ్చాయి. ఇక మరి కొన్ని కథనాల ప్రకారం కేసిఆర్ అవినీతి చిట్టా కేంద్రానికి చేరిందని దీని పై చర్యలకు సిద్ధం అవుతోందని వార్తలు వచ్చాయి.   ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోతలరాయుడైన కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని తాము ముందే చెప్పామని అయన అన్నారు. ఢిల్లీలో వంగివంగి పొర్లి దండాలు పెట్టినా తాము కేసిఆర్ ను క్షమించే ప్రసక్తే లేదని అయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.   జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను నగర ప్రజలు చావు దెబ్బ కొట్టారని సంజయ్ అన్నారు. ఈ ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. లోపల జరిగేది ఒకటని.. అయితే కేసీఆర్ బయటకు చెప్పేది మరొకటని అన్నారు. హైదరాబాదును వరదలు ముంచెత్తుతుంటే ఫాంహౌస్ వదిలిపెట్టి కేసీఆర్ బయటకు కూడా రాలేదని విమర్శించారు. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారని గుర్తు చేసిన బండి సంజ‌య్… కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారని, ఇదేంట‌ని ప్రశ్నిస్తే మా రాష్ట్రం.. మా నిధులంటున్నార‌ని.. రాష్ట్రమేమైనా మీ అయ్య జాగీరా? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

సీఎం జగన్ పై పాయల్ హాట్ కామెంట్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సినీనటి, ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మార్గాని భరత్ రామ్ తో కలిసి పాయల్ రాజ్ పుత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. స్టార్స్ అందరూ డిసెంబర్ నెలలోనే పుడుతారని.. మన డైనమిక్ సీఎం జగన్ తోపాటు తాను కూడా డిసెంబర్ లోనే పుట్టానని అన్నారు. ఏపీలో సీఎం జగన్ క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేదానినని తెలిపారు. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉందని.. గోదావరి అందాలు చాలా బాగున్నాయని పాయల్ అన్నారు.   మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కు క్రీడలపై ప్రత్యేకమైన అభిరుచి ఉండడం మన అదృష్టమన్నారు. సీఎం జగన్ క్రీడాకారులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, క్రీడాకారుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

కేంద్రం దగ్గర కేసీఆర్ ప్రాజెక్టుల చిట్టా! సీఎంవో నుంచే సమాచారం లీక్?  

ప్రగతి భవన్ లో లీకు వీరులున్నారా? కేసీఆర్ రహస్య చిట్టా మొత్తం కేంద్రం చేతికి వెళ్లిందా? లీకేజీ సమాచారంతో టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పంజా విసరబోతుందా? అంటే తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. పాలనా వ్యవహారాలకు సంబంధించి కేసీఆర్ రహస్యంగా దాచాలనుకున్న విషయాలన్నీ బహిర్గతమైనట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన మూడో టీఎంసీ ఎత్తిపోతలకు బ్రేక్ వేస్తూ కేంద్ర జలవనరుల శాఖ నుంచి వచ్చిన లేఖ ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ లో అలజడి రేపుతుందని చెబుతున్నారు. కేంద్ర మంతి గజేంద్ర షెకావత్​… సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయట. లేఖలో చాలా విషయాలను పాయింట్​ టు పాయింట్​ కేంద్రం అడిగిందట. కేంద్ర మంత్రి నుంచి వచ్చిన లేఖతో కేసీఆర్ ఇంతకాలం రహస్యంగా ఉంచిన ప్రాజెక్ట్ డీపీఆర్​లు కేంద్రం దగ్గర ఉన్నట్లు  స్పష్టమవుతోందట. కేంద్రం నుంచి లేఖ వచ్చిన రోజే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడం మరింత ఆసక్తిగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్ లు, అవినీతి ఆరోపణలపై సంజయ్ నుంచి బీజేపీ పెద్దలు మరింత సమాచారం తీసుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.    కేసీఆర్ సర్కార్ చేపట్టిన ఇరిగేషన్​ ప్రాజెక్టులకు సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులపై జలశక్తి, కేఈఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీలు చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడుగుతూనే ఉన్నాయి. డీపీఆర్​లు సమర్పించాలని లేఖలు రాస్తూనే ఉన్నాయి. కేంద్రం కూడా దీనిపై చాలాసార్లు సీఎంకు అధికారికంగా లేఖలు పంపింది. అపెక్స్​ కౌన్సిల్​ కూడా డీపీఆర్​లు ఇవ్వాలని కోరింది. కానీ రాష్ట్రం మాత్రం అవన్నీ పాత ప్రాజెక్టులంటూ కొట్టిపారేస్తుందే కానీ డీపీఆర్​లు మాత్రం కేంద్రానికి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం ఆ డీపీఆర్ లు కేంద్రం దగ్గర ఉన్నాయని.. షెకావత్ నుంచి వచ్చిన లేఖ తర్వాత సీఎం కేసీఆర్ అంచనాకు వచ్చారని సమాచారం. కేంద్రం చేతికి చెక్కిన ప్రాజెక్టుల డీపీఆర్ లతో రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఆ డీపీఆర్ లలో చాలా లోపాలు ఉన్నాయంటున్నారు. ప్రాజెక్టులో  అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయట. ప్రైస్​ ఎస్కలేషన్​తో పాటు ఇసుక దందా, నిర్మాణాల్లో వైఫల్యాల వంటి అంశాలన్నీ కేంద్రం గుర్తించినట్లు చెప్పుతున్నారు. ఈ డీపీఆర్​లు కేంద్రానికి వెళ్లడం సీఎం కేసీఆర్​కు అగ్ని పరీక్షేనని చెబుతున్నారు.    టీఆర్ఎస్ సర్కార్ దాచిపెట్టిన రహస్యాలు ఎలా లీక్​ అయ్యాయనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రగతి భవన్​కు ఎవరైనా వెళ్లడం అత్యంత కష్టం.  చాలా సెక్యూరిటీ అంశాలను దాటుకుని  డీపీఆర్​లు బయటకు వెళ్లడం అంత ఈజీ కాదంటున్నారు. కేసీఆర్ అధికారిక నివాసం నుంచి పక్కాగా లీకులు ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. కొంతమంది ఉన్నతాధికారులను అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. దీంతో  తన దగ్గరే ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిందెవ్వరనే అంశంపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారట గులాబీ బాస్. ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ టీం ఉంటోంది. సీనియర్​ ఐఏఎస్​లు, ముందు నుంచి తనకు అండగా నిలిచిన అధికారులకు ప్రగతిభవన్​లో స్థానం కల్పించారు కేసీఆర్. కొంతమంది సెంట్రల్​ సర్వీసుల్లో ఉన్న వారిని డిప్యూటేషన్​పై తెచ్చుకున్నారు.  అయితే ఇంత నమ్మకంగా ఉన్నా డీపీఆర్​ల విషయంలో నమ్మకద్రోహం చేసి కేంద్రానికి సహకరించిదెవ్వరనే అంశం  మిస్టరీగానే ఉందట.  కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన​ అధికారులపైనే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక డీపీఆర్​లు కేంద్రం చేతికి చిక్కడంతో తమకు సమస్యలు తలెత్తుతున్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. అది కూడా కేంద్రంతో కొంత వివాదం మొదలైన నేపథ్యంలోనే డీపీఆర్​లు వెళ్లడం అధికార పార్టీని  మరింత కలవరపెడుతోందట. కేసీఆర్ సర్కార్ పై ఇప్పటికే దూకుడుగా వెళుతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే రాష్ట్ర బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని, కేంద్ర దగ్గర ఉన్న సమాచారం రాష్ట్ర నేతలకు కూడా చేరిందనే అనుమానాలను టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ డీపీఆర్ ల ద్వారా  ఏదో విధంగా తమను ఇరికించే ప్రయత్నాలు కేంద్ర సర్కార్ చేయవచ్చని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారట.  మరీ ఈ విషయం ఎంత వరకు వెళుతుందో.. కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో.. చూడాలి మరీ..

పోలీసుల తలపై శాంటాక్లాజ్ టోపీలు! సర్జికల్ స్ట్రైక్ అవసరమన్న బీజేపీ నేతలు  

సర్జికల్ స్ట్రైక్. 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసినప్పుడు మార్మోగిన పదం. కొన్ని రోజుల పాటు దేశ వ్యాప్తంగా సర్టికల్ స్టైక్స్ పైనే చర్చ జరిగింది. అప్పటి నుంచి ఎక్కడైనా పెద్ద ఘటన జరిగితే సర్జికల్ స్ట్రైక్ అని చెప్పుకుంటూ  ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సర్జికల్ స్ట్రైక్ పదం మరోసారి ప్రకంపనలు రేపింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కామెంట్లు రాజకీయ కాక రేపాయి. సంజయ్ సర్జికల్ స్ట్రైక్ కామెంట్ల చుట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారమంతా సాగింది. గ్రేటర్ లో ఊహించని ఫలితాలు సాధించిన బీజేపీ విజయంలో సర్జికల్ స్ట్రైక్ అంశం కీలకంగా నిలిచిందని రాజకీయ వర్గాల అభిప్రాయం.   తెలంగాణలో బీజేపీ దూకుడుకు ఉపయోగపడిన సర్జికల్ స్ట్రైక్ పదం ఇప్పుడు ఏపీలోనూ మార్మోగుతోంది. అక్కడ కూడా కమలనాధులే జగన్ సర్కార్ పై పోరాటంలో తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఏపీలో హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీటీడీ, విజయవాడ కనకదర్గ వంటి ప్రముఖల ఆలయాలతో పాటు ఇతర గుడుల్లో  వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హిందూ సాంప్రదాయాలు మంటగలిపేలా కావాలనే కొందరు ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని బీజేపీతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. క్రైస్తవ పాస్టర్లకు జగన్ ప్రభుత్వం భృతి ఇవ్వడంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇవన్ని ఇలా ఉండగానే  తాజాగా క్రిస్మస్ వేడుకల అంశం ఏపీలో రాజకీయ కాక రేపుతోంది. పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు జరపడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.     విజయవాడ పట్టణ మూడో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో గత వారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి, శాంటాక్లాజ్ టోపీలు ధరించారు. పోలీసులు మూడు సింహాల టోపీలను పక్కనపెట్టి శాంటాక్లాజ్ టోపీలు ధరించడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు, ఏపీ సర్కార్ తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వమే క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రత్యర్థుల ఆటకట్టించడానికి ఒక సర్జికల్ స్ట్రైక్ అవరమైతే.. ఆంధ్రప్రదేశ్ లో రెండు సర్జికల్ స్ట్రైక్ అవసరమని జీవీఎల్ అన్నారు. ఏపీలో మత రాజకీయాలు చేయడంలో వైసీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయని, ఆ రెండిటిపైనా రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం ఉందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో దసరా సంబరాలు ఎప్పుడైనా చేశారా అని జీవీఎల్ ప్రశ్నించారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యలో కూడా ముస్లిం ఓట్ల కోసం పోలీసులను వేధించారని చెప్పారు. లౌకిక పార్టీల పేరుతో వైసీపీ, టీడీపీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.   పోలీసులు శాంటాక్లాజ్ టోపీలు ధరించి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వీడియోను ట్వీట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ నేతలు. 41 రోజులు అయప్ప మాల ధరించిన పోలీసులు కూడా నాలుగు సింహాలున్న టోపీని గౌరవిస్తారు.. పవిత్ర రంజాన్ మాసంలో 41 రోజులు ఉపవాస దీక్ష చేసే ముస్లింలు కూడా నాలుగు సింహాలున్న టోపీని అంతే గౌరవంతో చూస్తారు.. మరి క్రిస్మస్ సమయంలో ఆ అవసరం లేదా? లేకుంటే ఆంధ్రాలో నాలుగు సింహాల టోపీకి విలువ తగ్గించారా? అని ఏపీ సర్కార్ ను కడిగి పారేస్తున్నారు  కమలం నేతలు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కోవిడ్ నిబంధనలు అమలు చేస్తారు.. ప్రతి సంవత్సరం జరుపుకోనే వినాయక చవితి పండుగకు విగ్రహాలు పెట్టకూడదంటారు.. మరి వీరికి మాత్రం ఏ నిబందనలూ వర్తించవా?' అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.    తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ వేడుకలు, సర్జికల్ స్ట్రైక్ అంశాలకు ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. లౌకిక పార్టీల పేరుతో వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తున్న కమలం నేతలు.. తిరుపతి ఉప ఎన్నికలో రెండు పార్టీలకు బుద్ధి  చెబుతామని అంటున్నారు.

మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా.. అమరావతే ఏపీ రాజధాని

రాజధాని అమరావతి అంశం గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, తాజాగా రాజధాని అంశంలో బీజేపీ వైఖరి ఏంటో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బీజేపీ లక్ష్యమని, ఇందులో రెండో ఆలోచనకు తావు లేదని చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో జరిగిన 'భారతీయ కిసాన్ సంఘ్' సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.   ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా తాను మాట్లాడుతున్నానని సోము వీర్రాజు చెప్పారు. అమరావతిలో రూ. 1800 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ హాస్పిటల్ ఆగలేదని, దుర్గమ్మ ఫ్లైఓవర్ ను పూర్తి చేశామని తెలిపారు. మోదీ అమరావతి వైపే ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. బీజేపీ కార్యాలయాన్ని కూడా విజయవాడలోనే కడుతున్నామని చెప్పారు. బీజేపీ మాట తప్పే పార్టీ కాదని, అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ తరపున ఉద్యమం చేస్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే.. అమరావతిని బాగా అభివృద్ధి చేసి చూపిస్తాం అని వీర్రాజు చెప్పుకొచ్చారు.

కేసీఆర్ పై కమలం దూకుడేనా? కాళేశ్వరానికి బ్రేకులు అందుకేనా? 

తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తుస్సమందా? కేసీఆర్ కు కమలం ఉచ్చు బిగిస్తోందా? బండి సంజయ్ కి బీజేపీ హైకమాండ్ ఎలాంటి సిగ్నల్స్ ఇస్తోంది? తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర సర్కార్ నిర్ణయాలు, బీజేపీ హైకమాండ్ వ్యూహాలు కూడా అలాంటి సంకేతమే ఇస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని గంటలకే కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ ప్రణాళికకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెడ్ సిగ్నల్ చూపింది. రెండు టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌కు మాత్రమే కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకున్నదని, డిజైన్ మార్పుతో మూడో టీఎంసీకి ప్రణాళిక రూపొందించడం కొత్తదానిగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించిన తర్వాత హైడ్రాలజీ అధ్యయనం, సాంకేతిక అంశాల పరిశీలన, అంచనా వ్యయం, పర్యావరణ ప్రభావం, అంతర్ రాష్ట్ర అంశాలు తదితరాలన్నింటిపై స్టడీ పూర్తయిన తర్వాత మాత్రమే తగిన అనుమతులు తీసుకోవాలని కేంద్ర జలవనరుల తేల్చిచెప్పింది.    ఈనెల 11న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. మొదటగా కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ నే కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇరిగేషన్ సమస్యలతో పాటు గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో చేపడుతున్నమూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతిపైనే కేంద్ర మంత్రి ప్రధానంగా చర్చించారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాని ఇప్పుడు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే  కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్రం కొర్రీలు వేయడం.. అది కూడా ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి కలిసి వచ్చిన కొన్ని గంటల్లోనే జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తాజా నిర్ణయంతో కేసీఆర్ పై బీజేపీ ఆగ్రహంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీని ఇరుకున పెట్టేందుకే కేసీఆర్ హస్తిన వచ్చారని భావిస్తున్న కేంద్ర పెద్దలు.. ఆయనకు కౌంటర్ వ్యూహం అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ ఎత్తిపోతకు బ్రేక్ వేశారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.    దాదాపు 14 నెలల తర్వాత గత శుక్రవారం సడెన్ గా హస్తినకు వెళ్లారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపిన కేసీఆర్.. మోడీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల కోసం కేంద్రంతో యుద్ధం చేస్తామని కూడా ప్రకటించారు. రైతులకు మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ ఫ్లైటెక్కారు కేసీఆర్. ఢిల్లీలోనూ బిజిబిజీగా గడిపారు గులాబీ బాస్. మొదటి రోజే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవగా.. శనివారం ప్రధాని మోడీని కలిశారు. మాములుగా శని, ఆది వారాలు పీఎంవో ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వదు. కాని శనివారం రోజు కేసీఆర్ తో ప్రధాని మోడీ 45 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. బీజేపీతో రాజీ కోసమే కేసీఆర్ హస్తిన వెళ్లారని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తన అవినీతి బయటకి రాకుండా బీజేపీ పెద్దలకు మోకరిల్లారని మండిపడ్డారు. వామపక్ష నేతలు కూడా గులాబీ అధినేత, బీజేపీ పెద్దల సమావేశాలపై తీవ్రంగా స్పందించారు.    కేసీఆర్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోడీ, అమిత్ షాలతో సమావేశం కావడం తెలంగాణ బీజేపీలోనూ కలకలం రేపింది. ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియక కమలం నేతలు టెన్షన్ పడ్డారు. కేసీఆర్ సర్కార్ పై దూకుడుగా వెళుతున్న సమయంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలు తమకు ఇబ్బందిగా మారాయనే చర్చ తెలంగాణ బీజేపీ నేతల నుంచి వచ్చింది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు నిజంగానే బీజేపీతో కేసీఆర్ రాజీ అయ్యారనే చర్చలు జనాల్లోనూ జరిగాయి. అయితే కేసీఆర్ పర్యటన తర్వాత బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలతో.. ఢిల్లీలో ఆయన చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న కమలం దళం.. కేసీఆర్ ను ఇరికించే వ్యూహాలకే పదును పెడుతుందని చెబుతున్నారు. అందులో భాగంగానే బండి సంజయ్ ను ఢిల్లీకి పిలిపించారని టాక్. కేసీఆర్ సర్కార్ పై ఎలా ముందుకు వెళ్లాలి, గులాబీ పార్టీని ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై హైకమాండ్ నుంచి సంజయ్ కి రోడ్ మ్యాప్ రావొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ తో పాటు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచి.. గులాబీ పార్టీలో మరింత గుబులు రేపేలా కాషాయం దళం కార్యాచరణ ఉండబోతుందంటున్నారు.    ఢిల్లీ పర్యటనలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్లే కేసీఆర్ కూడా దిగొచ్చారని చెబుతున్నారు. అందుకే ఇంత కాలం పట్టించుకోని ఉద్యోగ నియామకాలపై ఫోకస్ చేశారనే చర్చ జరుగుతోంది. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు సడెన్ గా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని చెబుతున్నారు. సర్కార్ పై కోపంగా ఉన్న ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు.. మూడేండ్లుగా పెండింగులో ఉన్న పీఆర్సీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వంపై ప్రజా గ్రహానికి కారణమైందని భావిస్తున్న ఎల్ఆర్ఎస్ పైనా రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని, ప్రజలకు  భారీ ఊరట ఇచ్చేలా ఆ నిర్ణయం ఉండవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతోనే కేసీఆర్ మళ్లీ జనాలకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

66 మంది విద్యార్థులకు కరోనా! మద్రాస్ ఐఐటీ క్లోజ్

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నా.. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో కరోనా కలకలం రేపింది. ఐఐటీ క్యాంపస్ లో 774 మంది విద్యార్థులు ఉండగా, 66 మంది స్టూడెంట్స్, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. ఒకే రోజు 32 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ కేసుల సంఖ్య మరింతగా పెరగనుందని వైద్య నిపుణులు చెప్పారు. దీంతో ఐఐటీని మూసి వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.    ఐఐటీలోని అన్ని విభాగాలు, లైబ్రరిని వెంటనే మూసివేశారు. అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిశోధకులు, ప్రాజెక్టుల సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని యాజమాన్యం సూచించింది. క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు, హాస్టల్ గదుల్లో మాత్రమే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతిదూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్క్యులర్ ను విడుదల చేసింది. విద్యార్థులు, సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారు అధికారులకు సమాచారం ఇవ్వాలని మద్రాస్ ఐఐటీ యాజమాన్యం సూచించింది.

ఏపీ, తెలంగాణాలలో బీజేపీతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. 

ప్రస్తుతం ఏపీ తెలంగాణాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఒకపక్క ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు.. మరోపక్క తెలంగాణలో టీఆర్‌ఎస్‌, మజ్లీస్ పార్టీలు బీజేపీతో ట్రయాంగిల్ లవ్ లో ఉన్నాయని అయన సెటైర్లు వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా పనిచేసిన సమయంలో వచ్చిన కొన్ని అవినీతి జీవోలు, కార్యకలాపాల చిట్టాను కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా బయటకు తీశారని, దీంతో కేసీఆర్‌ హడావిడిగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని అయన ఆరోపించారు.    రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి వారి ఆందోళనలకు సంఘీభావం తెలపాలని నారాయణ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ కనుసన్నల్లో బతుకుతున్నారని నారాయణ ఎద్దేవా చేసారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం అమరావతిని శ్మశానం చేసేందుకు కంకణం కట్టుకుందని అయన ధ్వజమెత్తారు. నారాయణ తాజా కామెంట్ల‌పై వైసీపీ, టీఆర్ఎస్ పార్టీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఒక్క క్షణం ఆగి ఉంటే.. ఎంత బాగుండేది

మనిషి చేసే చిన్న పొరపాటు ఒక్కోసారి తమను కన్నవారిని ఇక ఎప్పటికి కోలుకోలేని విషాదంలో ముంచేస్తుంది. తాజాగా ఇటువంటి దుర్ఘటన ఒకటి హైదరాబాద్ లో జరిగింది. ఐదుగురు యువకులు సరదాగా కారులో షికారుకు బయలుదేరారు. అయితే మితిమీరిన వేగంతో ఒక చౌరస్తా వైపు దూసుకొచ్చారు. ఆ చౌరస్తా వద్ద అప్పటికే రెడ్‌ సిగ్నల్‌ పడినా ఆగకుండా కారును ముందుకు పరుగులు పెట్టించారు. అయితే ఆ తప్పే అటు వారి నిండు ప్రాణాలను బలిగొనడమే కాక వారిని కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. ఇదే సమయంలో గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో మరోవైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్‌, వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురూ మృతి చెందారు.   గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో మృతులంతా ఏపీకి చెందిన యువకులుగా గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మనోహర్‌(23), కాట్రగడ్డ సంతోష్‌(25), నెల్లూరుకు చెందిన కొల్లూరు పవన్‌ కుమార్‌(24), నాగిశెట్టి రోషన్‌(23), విజయవాడకు చెందిన పప్పు భరద్వాజ్‌(20) మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే సంతోష్‌ ఐటీ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా, మనోహర్‌ యానిమేషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. పవన్‌కుమార్‌, నాగిశెట్టి రోషన్‌, పప్పు భరద్వాజ్‌లు మొన్నటి వరకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారు. అయితే లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోవడంతో ఈ ముగ్గురూ ప్రస్తుతం అమీర్‌పేటలో కొత్త సాప్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే అందరూ రాత్రికి హాస్టల్‌ చేరుకున్న తర్వాత సరదాగా సంతోష్ కు చెందిన కారులో బయలుదేరగా.. వాహనాన్ని సంతోషే నడిపాడు.    కొంత సేపు అక్కడక్కడా తిరిగి... స్నేహితులను కలిసి అర్ధరాత్రి తర్వాత తిరిగి హాస్టల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే రాత్రి ట్రిపుల్‌ ఐటీ సర్కిల్‌ నుంచి విప్రో జంక్షన్‌ వద్దకు 2:48 గంటలకు చేరుకునే సరికి అక్కడ రెడ్‌ సిగ్నల్‌ పడి ఉంది. అయితే వాహనాన్ని ఆపకుండా సంతోష్‌ క్యూసిటీ వైపు దూసుకు పోయాడు. అదే సమయంలో మరోపైపు నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో టిప్పర్‌ దూసుకొచ్చింది. అయితే కారును చూసి టిప్పర్‌ డ్రైవర్‌ బ్రేకులు వేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. దీంతో ప్రమాదంలో టిప్పర్‌ కూడా బోల్తా పడింది. ఇక కారులో ఉన్న సంతోష్‌, మనోహర్‌, పవన్‌, రోషన్‌ ఘటనాస్థలిలోనే మృత్యువాత పడగా.. ఆస్పత్రి తరలించిన కొద్దిసేపటికి భరద్వాజ్‌ కూడా కన్నుమూశాడు. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేవలం కొన్ని క్షణాలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి ఉంటే ఆ ఐదుగురు యువకులు ప్రాణాలతో ఉండేవారు... అదే సమయంలో వారిని కన్నవారికి ఈరోజు తీరని శోకం కూడా తప్పేది అని వారి బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

దత్తాత్రేయ కారుకు ప్రమాదం! తప్పిన పెను గండం 

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. తృటిలో ఆయన పెద్ద గండం  నుంచి తప్పించుకున్నారు. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళుతున్న బండారు దత్తాత్రేయ వాహనం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద అదుపుతప్పి రోడ్ పక్కకు వెళ్లిపోయింది. రన్నింగ్ లోనే ఒక్కసారిగా కార్ స్టీరింగ్ లాక్ అవ్వడంతో ఎడమవైపు రోడ్ పక్కకు కారు దూసుకెళ్లింది.  కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో భారీ ప్రమాదం తప్పినట్లు అయ్యింది.   కారు ఎడమ వైపును దూసుకువెళ్లడంతో అంతా బయపడ్జారు. డ్రైవర్ కారును సేఫ్ గా ఆపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే  ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడ లేదు. ఘటనాస్థిలికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు.. దత్తాత్రేయను మరో కారులో నల్గొండకు పంపించారు .నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళుతుండగా దత్తాత్రేయ కారుకు ఈ ప్రమాదం జరిగింది.   బండారు దత్తాత్రేయ వాహనం ప్రమాదానికి గురైందన్న సమాచారంతో రాష్ట్ర బీజేపీ నేతలు, ఆయన అభిమానులు కలవరానికి గురయ్యారు. అయితే ప్రమాదం ఏమి లేదని తెలియడంతో కూల్ అయ్యారు. దత్తాత్రేయ కారు ప్రమాదానికి గురైన ప్రాంతానికి సమీపంలోనే కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాహనం ప్రమాదానికి గురైంది.

అమెరికా ఖజానా డేటా హ్యాక్! రష్యా కుట్రపై అనుమానాలు   

అగ్రరాజ్యం అమెరికాపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. యూఎస్ ట్రెజరీ విభాగంలోని కంప్యూటర్ నెట్ వర్క్ ను రష్యా హ్యాకర్లు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిందనే విషయాన్ని యూఎస్ ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేసింది. ప్రభుత్వ ఖజానా సమాచారం ఉన్న నెట్ వర్క్ పై సైబర్ ఎటాక్ జరిగిందని వెల్లడించింది. ప్రభుత్వ నెట్ వర్క్ పైజరిగిన దాడి కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఈ విషయంలో టెక్నాలజీ నిపుణులు సహకరిస్తున్నారని అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజన్సీ ప్రతినిధులు తెలిపారు.   హ్యాకింగ్ కు గురైన విభాగాలను పరిశీలిస్తున్నామని, హ్యాకర్లు స్వాధీనం చేసుకున్న నెట్ వర్క్ ను తిరిగి సరిదిద్దేందుకు సీఐఎస్ఏ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందని అమెరికా ఆర్థికశాఖ అధికారులు చెప్పారు. అయితే ఈ సైబర్ దాడి గత వారం జరిగిందని  'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. కస్టమర్ల కంప్యూటర్ సిస్టమ్స్ ను పరిశీలిస్తుండే టూల్స్ ను హ్యాకర్లు స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది.    మరోవైపు అమెరికా ఖజానా విభాగంపై పై జరిగిన  సైబర్ దాడి రష్యా ప్రభుత్వం అండతోనే జరిగిందని యూఎస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కు చెందిన ఓ గ్రూప్ ఈ పని చేసుటుందని భావిస్తున్న ఎఫ్బీఐ, సైబర్ దాడిపై విచారణ ప్రారంభించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇదే టీమ్ పలు ప్రభుత్వ ఏజన్సీల వెబ్ సైట్లపై దాడి చేసి, విలువైన సమాచారాన్ని దొంగిలించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

కేసీఆర్ ఎత్తుకు బీజేపీ పైఎత్తు.. 

జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ, టిఆర్ఎస్ ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెల్సిందే. ఎన్నికల తరువాత రైతుల ఆందోళన నేపథ్యంలో జరిగిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది. అటు బంద్ పూర్తి కాగానే కొత్త పార్లమెంట్ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీని, సీఎం కేసీఆర్ ప్రశంసిస్తూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సమయంలో ఉప్పు నిప్పుగా ఉన్న టీఆర్ఎస్ బీజేపీ సంబంధాలపై పలువురు సందేహాలు వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లను కూడా కలవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.   అయితే సీఎం కేసీఆర్ పర్యటన వెనుక పెద్ద లాజిక్ ఉందని తాజాగా తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనూహ్యంగా పెరుగుతుండటం, రాష్ట్రంలో తమ పార్టీ పుంజుకుంటున్న నేపథ్యంలో గులాబీ దళం విషయంలో తమ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఈ వ్యూహం మేరకు కేసీఆర్‌ నాయకత్వంపై టీఆర్‌ఎస్ పార్టీ ‌నాయకుల్లోనే విశ్వాసం సన్నగిల్లే దిశగా పావులు కదుపుతోంది. దీంట్లో భాగంగా, కేసీఆర్‌పై కేసుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. తనపై ఉన్న కేసుల భయంతోనే ఢిల్లీకి కేసీఆర్‌ వెళ్లారన్నది తెలంగాణ ప్రజల కంటే కూడా ముందు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తించాలన్నదే తమ లక్ష్యం అని బీజేపీ నాయకులు చెపుతున్నారు.   మరోపక్క సరిగ్గా ఏడాది కిందట, గత డిసెంబరు మొదటివారంలో కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ లభించలేదని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దానికి భిన్నంగా మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉందని వారు వివరిస్తున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు ‘‘తనకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవచ్చునని కేసీఆర్‌ భావించారు. అయితే ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్‌ కొద్దిరోజుల కిందట ప్రధానిని కలుసుకున్నారు. ఈ రెండు కారణాలను సాకుగా చూపి తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందంటూ బద్నాం చేయాలని గులాబీ ముఖ్యనేతలు ప్లాన్‌ చేసారని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే దీనికి సంబంధించి తమకు ముందే ఉప్పందడంతో మా వ్యూహం మార్చాం. ఈసారి అడిగి అడగగానే కేసీఆర్‌కు మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ‌లు లభించాయి’’ అని బీజేపీ నాయకులు చెపుతున్నారు. తన సొంతపార్టీ ఎమ్మెల్యేలతోపాటు మంత్రులకు సైతం సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని, దీనిని తాము హైలైట్ చేయబోతున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ జాతీయ నాయకత్వం కూడా కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే కేసీఆర్ దానిని తమపై ఎదురుదాడికి వాడుకునే అవకాశం ఉంటుందని.. అందుకే, తమపై ఆ అపవాదు రాకుండా జాగ్రత్తపడ్డామని బీజేపీ నాయకులు తెలిపారు. .   దీంతో సీఎం కేసీఆర్ డిల్లీ పర్యటనకు ముందే తమ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించిందని.. దీంతో కేవలం జిమ్మిక్కులు చేయడానికే కేసీఆర్ ఢిల్లీకి‌ వెళ్లారని బీజేపీ నాయకులు చెప్తున్నారు, అంతేకాకుండా అయన పర్యటనలో లోన జరిగేదొకటి, బయటకు ఆయన చెప్పేదొకటి ఉంటుందంటూ సీఎం పర్యటన తొలిరోజే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ముందే ప్రకటన చేశారని వారు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా తాజా పరిణామమాలతో సీఎం కేసీఆర్‌కు నిద్రకరువయ్యే ఢిల్లీకి వచ్చారని బీజేపీ కేంద్ర, రాష్ట్ర సమన్వయకర్త బాల్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో ఆయన ఢిల్లీలో చక్కర్లు కొట్టారని తెలిపారు. మజ్లీస్ తో స్నేహం కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్ కు గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో ముందునుయ్యి..వెనుక గొయ్యిలా మారిందని అయన అభిప్రాయపడ్డారు.