ఎపిలో పొంచి ఉన్న ‘మియాచుంగ్’ తుపాను
posted on Dec 1, 2023 @ 4:06PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుంది. ఆదివారం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్య కారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుపాను తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది.
తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అటు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండ్రోజుల్లో అది తుపానుగా మారొచ్చని అంచనా వేసింది.
గత వారం రోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం చేస్తున్నారు.అల్పపీడనం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది.
రేపటికి తీవ్రవాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉంది.
సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.