ఈటల రాజేందర్‌ కు మొదటి పరాజయం!

తెలంగాణలో అపజయం ఎరుగని నేతల్లో ఈటల రాజేందర్‌ ఒకరు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల.. ఈ 20 ఏళ్లలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు కలిపి ఏడు సార్లు పోటీ చేయగా.. ఏడూ సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి ఈటలకు మొదటిసారి పరాజయం ఎదురైంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఈటల 2004లో కమలాపూర్‌ నుంచి పోటీ చేసి మొదటిసారి గెలుపొందారు. 2008 ఉప ఎన్నికలో మరోసారి కమలాపూర్‌ నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలో, 2014 ఎన్నికల్లో,  2018 ఎన్నికల్లో వరుసగా హుజూరాబాద్‌ నుంచి గెలుపు జెండా ఎగురవేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన, 2021 ఉప ఎన్నికలో కూడా హుజూరాబాద్‌ నుంచి విన్ అయ్యారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల హుజూరాబాద్‌ తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేయగా రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.

జెయింట్ కిల్లర్ యశస్వినీ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. నిన్నటి వరకూ తిరుగులేని నేతలుగా చెలామణి అయిన వారు ఊహించని రీతిలో పారాజయం పాలైనారు ఉన్నారు. వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఒకరు.  పాలకుర్తిలో  ఎర్రబెల్లి దయాకరరావుపై పాతికేళ్ల యువతి విజయం సాధించారు. ఎర్రబెల్లికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకుర్తిలో పోటీ చేసిన యశస్వినీ రెడ్డి చేతిలో మంత్రి ఎర్రబెల్లి పరాజయం పాలయ్యారు.   తెలుగుదేశం టికెట్ పై విజయం సాధించి ఆ తరువాత బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ఎర్రబెల్లి కేసీఆర్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. జిల్లాలో అన్నీ తానై చక్రం తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నీ తన కనుసన్నలలోనే జరగాలనే విధంగా ఆయన వ్యవహరించారు. 

గుణపాఠమా.. తిరస్కారమా?

గత ఎన్నికలలో అంటే 2018 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించి,  ఆ తరువాత బీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు ఈ సారి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అలా పార్టీ మారి ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీలోకి దిగిన 12 మంది ఎమ్మెల్యేలలో తొమ్మది మందిని ప్రజలు తిరస్కిరించారు. వారిని ఓడించి గుణపాఠం చెప్పారు.   గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన హరిప్రియ నాయక్, రేగా కాంతరావు, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్రవెంకటరమణా రెడ్డి, ఆత్రం సక్కు, డి.సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ  మారిన వారిని ఈ సారి చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరింది. సరే ఈ సారి ఎన్నికలలో  ఎల్బీనగర్ నుంచి, సుదీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డిలు మాత్రమే గెలుపొందారు. వీరిలో ఆత్కం సక్కుకు కేసీఆర్ టికెట్ నిరాకరించగా పోటీకి దూరంగా ఉన్నారు. మిగతా 9 మందీ టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర రావులు సైతం ఓటమి పాలయ్యారు. ఇక బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు స్థానాల్లోనూ కూడా వెనుకంజలో ఉన్నారు. 

మొదటిసారి భారీ మెజారిటీతో గెలిచిన భట్టి!

మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్క వరుసగా నాలుగోసారి గెలిచారు. మొదటి మూడు సార్లు తక్కువ మెజారిటీతోనే గెలుపొందిన భట్టి.. ఈసారి మాత్రం భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ నాలుగు ఎన్నికల్లోనూ భట్టికి ప్రత్యర్థి లింగాల కమల్ రాజే కావడం విశేషం. 2009 లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన కమల్ రాజుపై భట్టి 1400 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014 లో సీపీఎం అభ్యర్థి కమల్ రాజుపై 12 వేల మెజారిటీతో విజయం సాధించారు. 2018 లో కమల్ రాజు టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగగా 3500 ఓట్ల తేడాతో భట్టి హ్యాట్రిక్ కొట్టారు. 2023 లో కమల్ రాజు మరోసారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా, భట్టి ఏకంగా 35 వేల భారీ మెజారిటీతో గెలిచారు. 2014 లో మాత్రమే మంచి మెజారిటీతో గెలిచిన భట్టి, ఈసారి భారీ మెజారిటీతో సంచలనం సృష్టించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటి వరకూ గెలిచిన అభ్యర్థులు

1)అశ్వరావుపేట -    ఆదినారాయణరావు(కాంగ్రెస్) 2)ఇల్లందు-కోరం కనుకయ్య(కాంగ్రెస్) 3)భద్రాచలం-తెల్లం వెంకట్రావు(బీఆర్ఎస్) 4)రామగుండం - రాజ్ ఠాకూర్మక్కాన్ సింగ్ (కాంగ్రెస్) 5)ఆందోల్-దామోదర రాజనర్సింహా (కాంగ్రెస్) 6)కొడంగల్-రేవంత్ రెడ్డి(కాంగ్రెస్) 7)చార్మినార్-జుల్పీకర్ ఆలీ (ఎంఐఎం) 8)అంబర్పేట్-కాలేరు వెంకటేశ్(బీఆర్ఎస్) 9)బాల్కొండ-ప్రశాంత్రెడ్డి (బీఆర్ఎస్) 10)బెల్లంపల్లి-గడ్డం వినోద్ (కాంగ్రెస్) 11)నాగార్జున సాగర్-జైవీర్ రెడ్డి (కాంగ్రెస్) 12)నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (కాంగ్రెస్) 13)వేములవాడ-ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) 14)దుబ్బాక-కొత్త ప్రభాకర్రెడ్డి (బీఆర్ఎస్) 15)జుక్కల్-లక్ష్మీకాంతారావు (కాంగ్రెస్) 16)నిర్మల్-ఏలేటీ మహేశ్వర్రెడ్డి (బీజేపీ) 17)జగిత్యాల-జీవన్రెడ్డి(కాంగ్రెస్) 18)హుజూర్నగర్-ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) 19)నారాయణఖేడ్-పటేళ్ల సంజీవరెడ్డి (కాంగ్రెస్) 20)ముషీరాబాద్-ముఠా గోపాల్ రెడ్డి (బీఆర్ఎస్) 21)పాలకుర్తి- ఎం.యశస్విని (కాంగ్రెస్) 22)మెదక్-మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్) 23)ఖానాపూర్-వెడ్మ బొజ్జ (కాంగ్రెస్) 24)చెన్నూరు-గడ్డం వివేక్ (కాంగ్రెస్) 25)బాన్సువాడ-పోచారం శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్) 26)మునుగోడు-రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్) 27)నకిరేకల్-వేముల వీరేశం (కాంగ్రెస్) 28)మేడ్చల్-మల్లారెడ్డి (బీఆర్ఎస్) 29. కొత్తగూడెం.- సాంబశివరావు (సిపిఐ)

శ్రీకాంతాచారి వర్ధంతి రోజే బీఆర్ఎస్ ఘోర ఓటమి!

ఉద్యమ పార్టీగా పేరున్న టీఆర్ఎస్, తెలంగాణ ఆవిర్భావం తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారింది. ఆ తర్వాత పేరులోని తెలంగాణను తీసేసి, టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది. రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన గులాబీ పార్టీ.. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని, దానికి మళ్ళీ విముక్తి కలిగించాల్సిన అవసరముందని ఉద్యమకారులు అభిప్రాయబడ్డారు. అందుకు తగ్గట్టుగానే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చూసింది. పైగా ఈ ఫలితాలు శ్రీకాంతాచారి వర్ధంతి నాడు రావడం చర్చనీయాంశమవుతోంది. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009 న తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి శ్రీకాంతాచారి ఆత్మాహుతి కారణమైంది. ఆ తర్వాత కొంతకాలానికి తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరగలేదు. టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో ఆయన తల్లి శంకరమ్మ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉద్యమకారులను అవమానించిందనే అపవాదు ఎదుర్కొన్న బీఆర్ఎస్.. చివరికి తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి రోజే ఓటమి ఎదురైంది.

అవినీతి అహంకారంతోనే కారు గ్యారేజీకి!

తెలంగాణలో కాంగిరేసు కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసి మరీ విజయపథంలో దూసుకుపోతోంది.  దాదాపు 70 స్థానాలలో కాంగ్రెస్ అధీక్యంలో కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం ఖాయమైంది. టిఆర్ఎస్ 29 స్థానాల్లో, బీజేపీ ఆరు స్థానాలలో ఆధిక్యతను ప్రదర్శిస్తుండగా.. మరికొన్ని స్థానాలలో హోరాహోరీ పోరు జరుగుతోంది. ఐదారు స్థానాలలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా  హోరాహరీ పోరు సాగుతోంది.  హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల పోరులో తొలి ఫలితంలోనే మొదట కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు మొదలవగా.. స్థానాలు పెరిగే కొద్దీ సంబరాల జోరు కూడా పెరుగుతోంది. కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటికి డీపీజీ అంజనీకుమార్‌ వెళ్లారు. రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా చూస్తే తెలంగాణ హస్తగతం  కావడం, బీఆర్ఎస్ ఈ స్థాయిలో ఓటమి పాలవ్వడానికి కారణాలేంటన్నది పరిశీలిస్తే..  తెలంగాణ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సంప్రాదాయక ఓటు బ్యాంక్ ను తమ వైపునకు తిప్పుకోవడంతో కాంగ్రెస్ సఫలీకృతమైంది. అలాగే కేంద్ర నాయకత్వాన్ని పిలిపించి ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీ బాగా పని చేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ను ఢీకొట్టే దిశగా బలంగా అడుగులు వేయగలిగింది. అలాగే తెలంగాణలో  కీలకమైన మైనార్టీల ఓట్లు మైనార్టీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ తన వైపునకు తిప్పుకోగలిగింది.  బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే చర్చ బలంగా ప్రజలలోకి తీసుకెళ్లడంతో.. మైనార్టీలు బీఆర్ఎస్ వైపు వెళ్లలేదన్నది స్పష్టమైపోయింది.  బీఆర్ఎస్ ఓటమిలో అతిముఖ్యమైనదిగా వినిపిస్తుంది తొమ్మిదిన్నరేళ్ళలో ప్రభుత్వ అవినీతి.. బీఆర్ఎస్ నేతల అహంకారపూరిత వైఖరి. ఔను.. ఏ ఛానెల్ డిబేట్లలో చూసినా.. సోషల్ మీడియాలో చూసినా.. ఏ నేతను కదిలించినా ఇదే మాట ముందుగా వినిపిస్తున్నది.   స్థానికంగా గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ లాగా ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి. తమ చేతిలో ఉన్న అధికారాన్ని ప్రజలపై పెత్తనం చేయడానికి ఉపయోగించడంతో ప్రజలలో ఈ స్థాయి వ్యతిరేకత వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాక్షాత్తు కేసీఆర్ నుండి ఆ కుటుంబానికి చెందిన కేటీఆర్, కవిత.. మంత్రుల నుండి ఎమ్మెల్యే వరకూ అందరినోటా అహంకార పూరిత వ్యాఖ్యలే వినిపించేవని.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. అవే అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజానీకం జీర్ణించుకోలేకపోయిందని అంటున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే తెలంగాణ ప్రజలు క్లియర్ కట్ గా గులాబీ పార్టీని దూరం పెట్టినట్లు పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఓటమిలో మరో కారణం అవినీతి. పార్టీ పెద్దల నుండి గ్రామ స్థాయి నేత వరకూ అందరిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎంగా కేసీఆర్ పలువురు పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని తొలి నుండి ఆరోపణలుండగా.. బీసీ బంధు, దళిత బంధులో కూడా ఎక్కడిక్కడ స్థానిక నేతలు చేతి వాటం ప్రదర్శించారనే ప్రచారం జరిగింది. సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్ఎస్ నేతలకు వాటాలు ఇవ్వాల్సిందే అనేలా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  దీనికి తోడు పలు ఆక్రమణలు, కోట్లకు పడగలెత్తిన కేసీఆర్ కుటుంబ సన్నిహితులు, కేసీఆర్ కుటుంబం అంతా రాజకీయాలలో పదవులు దక్కించుకోవడం, బంధువులకు దోచిపెట్టినట్లు ఆరోపణలుండడం కూడా బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ను ముంచేసిన బీజేపీ

తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. అభ్యర్థుల భవితవ్యం కూడా తేలిపోయింది. ఆదివారం (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచీ, పోస్టల్ బ్యాటెట్ సహా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ విజయం దిశగా దూసుకుపోతోంది. గురువారం (నవంబర్ 30)న పోలింగ్ ముగిసిన క్షణం నుంచీ  ఎక్కడ చూసినా  తెలంగాణలో విజయం సాధించే పార్టీ ఏది? కాబోయే సీఎం ఎవరు? అన్న చర్చే జరుగుతోంది.  ఆ చర్చకు ఈ రోజు ముగింపు దొరికింది. తెలంగాణలో రాబోయే  సర్కార్ కాంగ్రెస్ దేనని తేలిపోయింది. పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన  దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. పాతిక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించగా, వాటిలో రెండు మూడు మాత్రమే బీఆర్ఎస్ గులుస్తుందని అంచనా వేశాయి. మిగిలిన అన్నిటి ప్రిడిక్షన్ కాంగ్రెస్ విజయం ఖాయమనే.   అది కూడా స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేపడుతుందనే చెప్పాయి. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే వాస్తవంగా వచ్చాయి. సరే విశ్లేషకులు కూడా క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషిస్తూ ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనే చెప్పారు.  ఇప్పుడు తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని దేశానికే మోడల్ గా మార్చేశాం, తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మార్చేశాం అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోకతప్పని పరిస్థితి. అసలా పార్టీకి  ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?  అలాగే రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అన్న రీతిలో దూసుకొచ్చిన బీజేపీ ఒక్కసారిగా ఎందుకు చతికిల పడింది? సరిగ్గా ఎన్నికల సమయానికి కాంగ్రెస్ ఎలా పుంజుకోగలిగింది? అన్న విషయాలపై రాజకీయవర్గాలలోనే కాదు, జనబాహుల్యంలో కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే బీఆర్ఎస్ ఓటమిని ఖరారు చేసి పోస్టు మార్టం కూడా చేసేశారు. తొమ్మిదేళ్ల పాలనపై ప్రజలలో అసంతృప్తి రావడం సహజం. కేసీఆర్ ప్రభుత్వంపై కూడా అలాగే వ్యతిరేకత కనిపించింది. యువత నుండి సంక్షేమ పథకాల లబ్ధిదారుల వరకూ అన్ని విషయాలలో, అందరిలో వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అయితే ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఎలా ఓటుగా మలచుకోగలిగిందన్న దానిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ విజయాన్ని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయంగా విశ్లేషకులు కాంగ్రెస్ గెలుపును అభివర్ణిస్తున్నారు. కురుక్షేత్ర యుద్దానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య, రాజ్యకాంక్ష, అహంకారం, ఎలాగైనా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్న దురాశ కారణం. అలాగే 2014 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ లో ఈ లక్షణాలన్నీ కనిపించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కురుక్షేత్ర యుద్ధంలో పాండవ విజయానికి అర్జునుడి రథసారథిగా కృష్ణుడు సహాయ పడ్డాడు. తెలంగాణ ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా శ్రీకృష్ణుడిలా కీలక పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక విషయానికి వస్తే..  తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కేసీఆర్ మాస్టర్ మైండ్ పాలిటిక్స్ అవలంబించారు. 2018లో రెండవసారి అధికారం దక్కిచుకున్న అనంతరం భవిష్యత్ లో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) కు భవిష్యత్ లో ప్రత్యర్థి పార్టీగా బలపడే అవకాశం కాంగ్రెస్ కే ఉందని ఊహించి, ఆ పార్టీని దెబ్బతీయడానికే సర్వశక్తులూ ఒడ్డింది. పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో పాటు సంస్థాగతంగా కూడా ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రణాళికలు అమలు చేశారు. ఇదే సమయంలో మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ పుంజుకునేందుకు తెరవెనుక సాయం చేశారు.  కాంగ్రెస్ ను దెబ్బతీయడం కోసమే బీజేపీ దూకుడు పెంచేందుకు సహకారం అందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నామమాత్రమేననీ, బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీయేననే స్థాయిలో ఆ పార్టీకి బిల్డప్ ఇచ్చారు.    ఇంతవరకూ బాగానే ఉంది. కేసీఆర్ వేసిన ప్రణాళికను బాగానే అమలు చేశారు. ఫలితం ఎలా ఉన్నా కాంగ్రెస్ ను దెబ్బతీయడంలో కేసీఆర్ సఫలీకృతం అయ్యారు. అక్కడితో ఆగకుండా తెరాసను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ ను, కాంగ్రెస్ కూటమిని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. అక్కడ కేసీఆర్ వ్యూహాలను, ఎత్తుగడలను అర్ధం చేసుకున్న రాజకీయ పార్టీలు ఆయనకు దూరం జరిగాయి. తెలంగాణ వరకూ అయితే కేసీఆర్ వ్యూహాలు ఫలించాయి. కానీ బీజేపీ  వ్యూహాలు వికటించాయి. ఆ పార్టీ ఎన్నికల ముందు చేసిన సంస్థాగత మార్పులన్నీ కేసీఆర్ సూచనల మేరకే చేసిందన్న అభిప్రాయం బలంగా జనంలోకి వెళ్లిపోయింది. దీంతో కేసీఆర్ దెబ్బతిన్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో బీజీపీ ఆ స్థానాన్ని భారీ చేసేందుకు తెగ ప్రయత్నం చేసింది. అసలు ఉనికే లేని బీజీపీకి కేసీఆర్ బంగారం లాంటి అవకాశాలు కల్పించారు.  దాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ పెద్దలు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ చేసి పార్టీ నిర్మాణానికి వ్యూహాలు రచించారు. వారికి బండి సంజయ్ లాంటి సారథులు కూడా తోడవడంతో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కనిపించింది. ప్రజలు కూడా బీజేపీ వైపు మళ్లనున్నారని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. కానీ  అనూహ్యంగా ఎన్నికల ఏడాదిలో బీజేపీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు మొత్తం తారుమారు చేసేశాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందే తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు ఆ పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చింది. ఈ మార్పుతో పార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. అదే సమయంలో బండి తన ప్రజాసంగ్రామ యాత్రను మధ్యలోనే ఆపేశారు. ఇది ఎందుకు ఆపారో కూడా ఇప్పటికీ ఆ పార్టీ శ్రేణులకు అర్ధం కాని ప్రశ్నే. ఇక సీఎం కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కాంలో నిందితురాలిగా ఆరోపణలు గుప్పించిన బీజేపీ.. ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. చివరికి ఎన్నికలకు రెండు రోజుల ముందు రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వెనక కేంద్రం ఒత్తిడి ఉందన్న ఆరోపణలు వినిపించాయి. వీటన్నిటిని నేపథ్యంలో ప్రభుత్వ అసంతృప్తులు బీజేపీని నమ్మ లేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ.. ఈ రెండు పార్టీల వ్యాహాలను  ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలలో అవగాహనా పెరిగేలా చేయగలిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలకుండా నివారించగలిగింది. తెలుగుదేశం తెలంగాణలో పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లింది. అదే బీఆర్ఎస్ కొంప ముంచింది.

బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలివే!

తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని ఆశపడిన బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. హస్తం పార్టీ 65కి పైగా స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుండగా, కారు పార్టీ 40 లోపు సీట్లకే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. గులాబీ పార్టీ ఘోర పరాజయానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.  - వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత రావడం సహజం. బీఆర్ఎస్ విషయంలో కూడా అదే జరిగింది. - టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలి అనుకోవడం కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పుగా విశ్లేషకులు పరిగణిస్తున్నారు. బీఆర్ఎస్ గా పేరు మార్చడం వల్ల ఈసారి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోలేకపోయారు. మరోవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క అవకాశం అంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. - లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లోపాలు బయట పడటం.  - పరీక్షా పత్రాల లీకులతో విద్యార్థులు, నిరోద్యుగులలో కేసీఆర్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత. - రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదు. మరోవైపు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని రైతులు బలంగా నమ్మడం. - కౌలు రైతులను పట్టించుకోకపోవడం, రైతులకు లబ్ది చేకూర్చే పలు సబ్సిడీలు ఎత్తివేయడం. - డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు, బీసీ బంధు వంటివి దాదాపు ప్రకటనలకే పరిమితమవ్వడం. వాటి ద్వారా అతికొద్ది మంది మాత్రమే లబ్ది పొందటంతో ఇతరుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడం. - తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకపోవడం. - అరాచకాలు, భూకబ్జాలు, అవినీతి వంటి ఆరోపణలతో ఎందరో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ మళ్ళీ వారికే టికెట్లు ఇవ్వడం. - బీజేపీతో చీకటి ఒప్పందం అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళడం. - చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు.

తెలంగాణ హస్తగతం.. సీఎం రేవంతా? భట్టినా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. 119 స్థానాలకు గాను 65కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న హస్తం పార్టీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. దీంతో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చలు మొదలయ్యాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేసులో పలువురు ఉంటారనేది ముందు నుంచి ఉన్న చర్చే. అయితే రేసులో ఎంతమంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం రేవంత్, భట్టి మధ్యనే అనేది విశ్లేషకుల అభిప్రాయం. రేవంత్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా, భట్టి ప్రతిపక్ష నేతగా ఉన్నారు.  రేవంత్ మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ లో నూతనోత్సాహం తీసుకొచ్చి పార్టీని విజయం దిశగా పరుగులు పెట్టించారు. అందుకే రేవంతే సీఎం అనేది మెజారిటీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న అభిప్రాయం. తమ పార్టీకి మళ్ళీ ఊపిరి పోసి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ కి పట్టంకట్టడానికి కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపవచ్చు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అనుమానాలున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం భట్టి పేరుని కూడా ప్రధానంగా పరిశీలించే అవకాశముంది. భట్టి కాంగ్రెస్ కి విధేయుడు, సౌమ్యుడు, పైగా దళిత నాయకుడు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. భట్టిని సీఎం చేస్తే కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకించే అవకాశం లేదు. అలాగే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారు కాబట్టి, కాంగ్రెస్ దళిత నేతని సీఎంని చేస్తే ప్రజల్లోకి మరింత పాజిటివ్ సంకేతాలు వెళ్లే అవకాశముంది. కర్ణాటకలో కూడా తన దూకుడు స్వభావంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన డి.కె. శివకుమార్ ని కాదని సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ హైకమాండ్. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పద్ధతిని అనుసరించి భట్టిని సీఎం చేస్తుందా? లేక రేవంత్ వైపు మొగ్గుచూపుతుందా? అనేది త్వరలోనే తేలనుంది.

ఫస్ట్ రిజల్ట్ కాంగ్రెస్ ఖాతాలో.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన హస్తం!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమైపోయింది. తొలి రౌండ్ నుంచి 60కి పైగా స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తూ హస్తం దూకుడు మీదుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ ను కూడా కాంగ్రెస్ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు నాలుగు రౌండ్ల ఫలితాలలో కొన్ని కీలక స్థానాలు ఇప్పటికే  అధీక్యత వేలల్లో ఉండడంతో ఈ స్థానాలు  కాంగ్రెస్ ఖాతాలో చేరడం ఖాయమైపోయినట్లే భావించవచ్చు. తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తొలి విజయం కూడా కాంగ్రెస్ పార్టీయే సొంతం చేసుకుంది. అశ్వరావు పేట నుంచి ఆదినారాయణరావు విజయం సాధించారు. అలాగే రెండో విజయం కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. ఇల్లెందు నుంచి కూడా కాంగ్రెస్ గెలిచింది. మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేటట్లు కనిపిస్తున్నది. ఈ జిల్లాలో పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించిన సంగతి విదితమే.  ఏది ఏమైనా స్పష్టమైన మెజార్టీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ వెలువడిన తొలి రెండు ఫలితాలనూ తన ఖాతాలోనే వేసుకుంది.   ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట అభ్యర్థి ఆదినారాయణరావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు.   ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ 65కు పైగా సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయం దిశగా దూసుకెళ్తుండగా బీఆర్ఎస్ 40 సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. ఇక పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి తాను పోటీ చేసిన కామారెడ్డి, కొడంగల్ రెండు స్థానాల్లోనూ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కొడంగల్ లో మూడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి ఆయన 4,159 ఓట్ల లీడ్ లో ఉండగా.. కామారెడ్డిలో ఫస్ట్ మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఆయన 2,354 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గెలుస్తాడని భావించిన బీజేపీ కామారెడ్డిలో రెండో స్థానంలో ఉండగా.. సీఎం కేసీఆర్ మూడవ స్థానంలో ఉండడం బీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది. ఇక ఉమ్మడ నల్గొండ జిల్లాలో సూర్యాపేట మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ హస్తం  హవా కొనసాగుతోంది. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు కూడా వెనకబడ్డారు.  ఇక  హైదరాబాద్, రంగారెడ్డిలో కారు జోరు కాస్త కనపడుతోంది. గజ్వేల్ లో కేసీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లోకి రాగా.. కేసీఆర్, కేటీఆర్ స్వల్ప అధీక్యంలోనే ఉండడం ఉత్కంఠ కలిగిస్తుంది. కాంగ్రెస్ కీలక నేతలు రేవంత్ రెడ్డి రెండు చోట్ల అధీక్యంలో ఉండగా.. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ముందంజలో ఉండడం విశేషం. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కాస్త ముందంజలో ఉంది. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్న సిర్పూర్ లో కౌంటింగ్ రసవత్తరంగా మారింది. అక్కడ బీజేపీ, బీఎస్పీ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా లెక్కలు మారుతున్నాయి. కాగా, ప్రస్తుత ట్రెండ్స్ ను పరిశీలిస్తే హంగ్ వచ్చే అవకాశం  ఏమాత్రం కనిపించడం లేదు. చివరి రెండు మూడు రౌండ్లలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హంగ్ వచ్చే పరిస్థితి లేదు. దీంతో అధికారంలోకి రావడం ఖాయమని ఫిక్స్ అయిన కాంగ్రెస్ ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతల ఇళ్ల వద్ద సంబరాలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ భద్రతా బలగాలు మోహరించగా.. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బస్సులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ తాజ్ కృష్ణా వద్ద ప్రత్యేక బస్సులు రెడీగా ఉంచారు. అలాగే శంషాబాద్ లో రెండు స్పెషల్ ఫ్లయిట్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల కోసం మరో నాలుగు హెలికాఫ్టర్లను కూడా పీసీసీ సిద్ధం చేసింది.

వినిపించని విజిల్.. బాగా వెనుకబడిన బర్రెలక్క

ఫలితాలు వస్తున్న తరుణంలో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠనెలకొంది. అయితే తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లో బర్రెలక్క ముందజంలో నిలిచారు. దీంతో నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు స్పష్టమైంది. అయితే ఈవీఎమ్‌లలో మాత్రం బర్రెలక్క వెనకపడింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కంటే ముందు వరుసలో నిలిచిన శిరీష ఈవీఎమ్‌ ఓట్లలో వెనుకంజ వేసింది. విజిల్‌ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన శిరీషకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు వచ్చాయి. దీంతో శిరీషకు మొత్తం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జూపలి కృష్ణరావు 9,797 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో బర్రెలక్క వెయ్యి లోపు ఓట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.