నైతిక సూక్తులు వల్లిస్తున్న కావూరి

  మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అలిగానందిట వెనకటికి ఓ ఇల్లాలు. ఏలూరు యంపీ కావూరి సాంబశివరావు తనకు కేంద్రమంత్రి పదవి ఈయనందుకు కాదు, నిన్నగాక మొన్న రాజకీయాలలోకి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిపడిన పిల్లకాకి చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చినందుకే అలిగి తన పదవులకి రాజీనామా చేసారు.   చిరకాలంగా నానుతున్న కొల్లేరు సమస్యను అందిపుచ్చుకొన్న ఆయన, అవసరమయితే సమస్య పరిష్కారానికి హై-వే రోడ్లు దిగ్బంధం చేయడానికి కూడా వెనుకాడనని ప్రభుత్వoపై బెదిరింపులకు కూడా దిగారు. పనిలో పనిగా ఆ చేత్తోనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా ఎగదోసే ప్రయత్నం చేసారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో, ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ఇంకా బెట్టుచేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించి, తప్పనిసరి పరిస్థితుల్లో తన ఎంపి పదవికి, సమన్వయ కమిటీకి, పార్లమెంటు స్టాండింగ్ కమిటీలకు చేసిన రాజీనామాలన్నిటినీ ఉపసంహరించుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు.   ఈ సందర్భం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోయాయని ఆవేదన కూడా వ్యక్తం చేయడం విశేషం. ఈ రోజు ఆయనకు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం కల్పించిన కాంగ్రెస్ పార్టీనే తనకు కేంద్రమంత్రి పదవి ఈయలేదని అల్లరి పెట్టాలని చూసిన ఆయన ఇప్పుడు రాజకీయాలలో నైతిక విలువల గురించి మాట్లాడటం విడ్డూరం. స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రిగారు తన హయంలో జరిగిన ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతవహిస్తూ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ కాలంలో అటువంటి నేతలు, నైతిక విలువలు లేవని కావూరి వాపోవడం మరో విశేషం. ఇటువంటి ఉదాహరణలు పేర్కొంటూ, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ ఆయన తన స్వంతపార్టీనే ఇబ్బంది పెడుతూనే అదే నోటితోనే నైతిక విలువల గురించి వాపోవడం ఆయన ద్వంద వైఖరికి అద్దం పడుతోంది. తనకి కోరిన వెంటనే కోరిన పదవి ఇచ్చి ఉంటే, బహుశః ఈ నైతిక విలువల గోల ఉండేది కాదేమో!   బహుశః ఇటువంటి నేతల వైఖరితో విసుగెత్తిపోయినందునే రాహుల్ గాంధీ ఇటువంటి వారిని వదిలించుకొనే ప్రయత్నంలో యువమంత్రం పటిస్తున్నారనుకోవచ్చును. కానీ, దానికి ఇటువంటి నేతల దగ్గర ఒక విరుగుడు మంత్రం ఉంటుంది. తమ స్థానంలో తమ కొడుకులను లేదా కుటుంబములో సభ్యులను ప్రతిష్టించడమే ఆ మంత్రం.

బిజెపిలోకి నాగం జనార్థన్ రెడ్డి

  తెలంగాణా నగారా సమితి నేత, తెలుగుదేశంపార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు నాగం జనార్థన రెడ్డి బిజెపిలో చేరుతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా నాగం జనార్థన రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది ఉత్సవాలకు, పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సంఘటనతో నాగం బిజెపిలోకి చేరుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. నాగంను విలేఖరులు ఈ విషయమై ప్రశ్నించగా జవాబిస్తూ కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఇవ్వదని తేలిపోయింది, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలంటే కేంద్రంలో ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏర్పడాలని, భారతీయ జనతాపార్టీ తెలంగాణా ఇస్తుందనే నమ్మకంతోనే తాను ఈరోజు బిజెపి కార్యాలయానికి వచ్చానని తెలిపారు. భారతీయ జనతాపార్టీలో ఎప్పుడు చేరుతున్నారని విలేఖరులు ప్రశ్నించగా కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. టి.ఆర్.ఎస్. పార్టీ ఒక్కదానితో తెలంగాణా రాష్ట్రం ఏర్పడదని, మిగతా పార్టీలను కూడా కలుపుకుంటేనే వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

నాగార్జున ప్రభుత్వస్థలం నొక్కేశాడా

  తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టి ఇప్పుడు టాలివుడ్ హీరో నాగార్జునపై పడింది. అతను మాదాపూర్ వద్దగల 14 ఎకరాల తమ్మిడి చెరువును ఆక్రమించుకొని, దానిని స్వర్గీయ వైయస్సార్ హయంలో రెగ్యులరైజ్ కూడా చేయించుకొని, అక్కడ తన విలాసవంతమయిన ‘యన్. కన్వెన్షన్’ అనే ఒక పెద్ద ఫంక్షన్ హాలును నిర్మించాడని తెదేపా నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అతను ఆక్రమించుకొన్న చెరువుకు దగ్గరలోనే తన భూములు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.   ఆ తరువాత కాంగ్రెస్ నేత కే. కేశవ్ రావు కూడా అవే ఆరోపణలు చేయడం విశేషం. సినిమా ముసుగులో ఒక ల్యాండ్ మాఫియా నగరంలో విస్తరిస్తోందని ఆరోపణలు చేసారు. కానీ, నాగార్జున మాత్రం వారి ఆరోపణలకు ఇంతవరకు సరయిన సమాధానం ఇవ్వకపోగా, వారలా తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని మాత్రం అన్నారు. ఇప్పుడు నాగార్జునకు వ్యతిరేఖంగా అవే ఆరోపణలతో లోకాయుక్తలో ఒక పిటిషను కూడా దాఖలయింది. సంబందిత అధికారులను నాలుగు వారాలలోగా ఈ అంశంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది.   యన్.కన్వెన్షన్ యొక్క అధికారిక వెబ్ సైటులో “నగరానికి దూరంగా సహజ సిద్దమయిన ప్రకృతి ఒడిలో టాలివుడ్ నటుడు నాగార్జునకు చెందిన 7ఎకరాల సువిశాలమయిన స్థలంలో ఈ యన్ కన్వెన్షన్ నిర్మింపబడిందని” వ్రాసి ఉంది.

సబిత కుర్చీలో బొత్స కర్చీఫ్

  హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసినందున, ఇక ఆమె ఆ పదవిలో కొనసాగడం సబబుకాదనే భావన ఆమెకే కాకుండా, పార్టీలో, ప్రతిక్షపార్టీలలోకూడా బలంగా ఉన్నందున, ఇక రేపు సోనియా గాంధీ విదేశీపర్యటన ముగించుకొని డిల్లీ తిరిగి రాగానే కాంగ్రెస్ అధిష్టానం ఆమె విషయంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి.   ఇదే విషయమై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ తో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీ వెళ్ళారు. సబితా ఇంద్రారెడ్డి ఆ పదవిలోంచి తప్పుకోవడం దాదాపు ఖాయం అని గ్రహించిన ఆయన, ఇదే అదునుగా భావించి అధిష్టానం ఆదేశించినట్లు పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పుకొంటునందున తనకు హోంమంత్రి పదవిని ఈయాలని ఆజాద్ ను కోరినట్లు సమాచారం. హోంమంత్రి కుర్చీలో ఇంకా ఎవరూ కర్చీఫ్ వేయక మునుపే డిల్లీ వెళ్ళిన బొత్స తెలివిగా ముందుగానే పావులు కదిపారు.   ఇక, బొత్ససత్యనారాయణ తను ముఖ్యమంత్రి కావాలనే కోరికను ఎన్నడూ దాచుకోలేదు. అవకాశం చిక్కినప్పుడల్లా ఆ ప్రసక్తి తెస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక తీర్చుకొనే అవకాశం ప్రస్తుతం ఎలాగు లేదు గనుక, తనకు హోంమంత్రి పదవితో బాటు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇప్పించమని ఆయన ఆజాద్ ను కోరినట్లు సమాచారం. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే రాహుల్ గాంధీ చేసిన ప్రతిపాదన వలన, పీసీసీ పదవి కోల్పోనున్న బొత్ససత్యనారాయణ ఇప్పుడు హోం మంత్రి పదవితో బాటు తనకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా కావాలని కోరడం విశేషం.   అయితే, తను ఉపముఖ్యమంత్రి పదవి కోరుతున్నపటికీ, ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్న దామోదర రాజనరసింహను తొలగించి తనకు ఇమ్మని కోరడం లేదని, ఆయనతో బాటు తానూ కూడా ఉపముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనుకొంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తతం రాయలసీమ నుండి ముఖ్యమంత్రి, తెలంగాణ నుండి ఉపముఖ్యమంత్రి ఉన్నందున, తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆంధ్రా ప్రాంతానికి కూడా న్యాయం జరిగినట్లు ఉంటుందనే (లాజిక్ పాయింట్) ఆయన ఆజాద్ కు వివరించినట్లు సమాచారం.   ఆజాద్ ఈ విషయంలో ఆయనకు ఎటువంటి హామీలు ఈయనప్పటికీ, బొత్ససత్యనారాయణ తన మనసులో మాటను ‘సరయిన సమయంలో సరయిన చెవిలో’ పడేయగలిగారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.   మరి, ఆయన కోరికను సోనియాగాంధీ మన్నిస్తారో లేదో తెలియదు కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేఖించడం ఖాయం. ఆయన పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకే అభ్యంతరం తెలిపిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటికే తనకు పక్కలో బల్లెంలా ఉన్నఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు తోడూ ఇప్పుడు బొత్ససత్యనారాయణను కూడా భరించేందుకు అంగీకరించకపోవచ్చును. అదేవిధంగా బొత్సకు హోంమంత్రి పదవికి ఆయన అభ్యంతరం తెలుపవచ్చును.   తనను వ్యతిరేఖించే ఇటువంటి నేతలతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇష్టపడకపోవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి మాటకే గనుక ప్రాధాన్యం ఇచ్చినట్లయితే, బొత్స తన రవాణా శాఖకే పరిమితమవవచ్చును. కానీ, తన కలలు కల్లలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన నిజంగానే పక్కలో బల్లెంగా మారవచ్చును. త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఎవరిమాటకు ఎంత విలువుందో తేలిపోవచ్చును.

కేసీఆర్ ను భయపెడుతున్న ఫేస్ బుక్

  రాష్ట్ర రాజకీయపార్టీలు తమ ప్రత్యర్ధులను దెబ్బ తీసేందుకు ఇప్పుడు సరికొత్త ఎత్తులు, జిత్తులు ప్రదర్శిస్తున్నాయి. కొన్ని నెలలక్రితం తెరాస, వైకాపాలు ఫలానా ఫలానావారు కాంగ్రెస్ తెదేపాలలోనుండి మా పార్టీలో త్వరలో చేరనున్నారని ప్రకటించి ఆ పార్టీలతో మైండ్ గేం మొదలుపెట్టాయి. తద్వారా సదరు పార్టీలలో కలకలం, అనుమానాలు చెలరేగాయి. ఈ మైండ్ గేం బాధితులు కొందరు మీడియా ముందు కన్నీరు కూడా పెట్టుకొన్నారు.   ఆ తరువాత, వైకాపా ఫ్లెక్సీ బ్యానర్ వ్యూహంతో తెదేపాతో చెలగాటం ఆడుకొంది. నిన్న గాక మొన్న పుట్టిన ఒక చిన్న పార్టీ విసిరిన చిన్నపాచికకే ౩౦ సం.ల సుదీర్ఘ చరిత్ర ఉన్నతెదేపా ఈవిధంగా చిత్తయిపోవడం చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. నేటికీ, తెదేపాలో ఆ వేడి ఇంకా చల్లారనే లేదు. వైకాపా తన ఆట ముగించినప్పటికీ నందమూరి సోదరులు మాత్రం ఒకరిపై మరొకరు ఇంకా కత్తులు దూసుకొంటూనే ఉన్నారు.   రాజకీయ యుద్ధాలకు ఇంటర్ నెట్ వేదికగా మరి చాలా కాలమే అయినప్పటికీ, దానిని పూర్తి స్థాయిలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఉపయోగించుకోలేదు. అప్పుడప్పుడు తెదేప యువనేత లోకేష్ మాత్రం వైకాపాను ఎండగట్టడానికి తన ట్వీటర్ ద్వారా అస్త్రాలు సందిస్తుండటం అందరు ఎరిగినదే.   ఇప్పుడు తెరాస పార్టీని ఇరుకున పెట్టేందుకు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి లేదా వ్యక్తులు ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు పేరుతో ఒక ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించడమే కాకుండా, అందులో రాబోయే ఎన్నికల కోసం దాదాపు నలభై మంది పార్టీ అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించడంతో తెరాసలో కలకలం మొదలయింది. పరకాల, స్టేషన్ ఘనపూర్ ఎల్లారెడ్డి, సిర్పూర్ కాగజ్ నగర్ సిట్టింగ్ శాసన సభ్యుల పేర్లు ఫేస్‍‌బుక్‌లో పెట్టిన లిస్టులో లేవు.   అదే విధంగా మెదక్ నుండి కేసీఆర్ పోటీ చేయనున్నాడని పుకార్లు చెలరేగుతున్న నేపద్యంలో మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పేరు కూడా లిస్టులో లేకపోవడంతో ఒక్కసారిగా పార్టీలో తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి.   ఈ విషయం తెలుసుకొన్న కేసీఆర్ ఆ తెలియని వ్యక్తుల మీద తీవ్రంగా మండి పడ్డారు. అసలు తనకు ఫేస్‌బుక్ లో ఖాతాయే లేదని, ఎవరో కావాలనే తమ పార్టీని దెబ్బ తీయడానికి ఈ ప్రయత్నం చేసిఉండవచ్చని ఆయన అన్నారు. ఈ సంఘటనపై తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ పోలి బ్యూరో సభ్యుడు శ్రవణ్ మీడియాకు తెలిపారు.

కింగ్ నాగార్జున కబ్జా చేశారా?

        ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కు సంబందించిన ఎన్.కన్వెన్షన్ పై లోకాయుక్తలో కేసు నమోదైంది. ఈ కన్వెన్షన్ సెంటర్ పై వచ్చిన అబియోగాలపై విచారించి నివేదిక ఇవ్వాలని లోకాయుక్త అదికారులను ఆదేశించింది. మాదాపూర్ లోని తమ్మిడి చెరువును నాగార్జున ఆక్రమించి దీనిని నిర్మించారన్నది ఈ కేసులో మోపబడిన అబియోగం. ఈ చెరువు గురుకుల ట్రస్ట్ భూములలో ఉంది. దీనికి సంబంధించిన 14 ఎకరాల భూమిని ఆక్రమించి వైఎస్ హయాంలో నాగార్జున రెగ్యులరైజ్ చేసుకున్నాడని టీడీపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా చంచల్ గూడ జైలులో నిమ్మగడ్డ ప్రసాద్ ను కలిసిన నాగార్జున తనను టీడీపీ నాయకులు ఎందుకు టార్గెట్ చేశారో అర్ధం కావడంలేదని అన్నారు. దీంతో పాటు అన్నపూర్ణ స్టూడియోను నాగార్జున వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

సీబీఐను తప్పుపట్టలేని కాంగ్రెస్ నిస్సహాయ స్థితి

  కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతోంది. ఇక్కడ రోజుకొక మంత్రిపేరు సీబీఐ చార్జ్ షీటులోకి ఎక్కుతుంటే, అక్కడ రోజుకొక కాంగ్రెస్ నేత పేరు వికీలీక్స్ బయటపెడుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధినేతలు డిల్లీ వెళ్లి మొరపెట్టుకోవడం చూస్తే రోలోచ్చి మద్దెలతో మొర పెట్టుకొన్నట్లుంది. సబితా ఇంద్రారెడ్డి వేరే పదవిలో ఉండి ఉంటే, పరిస్థితి బహుశః ఇంత తీవ్రంగా కనబడేది కాదేమో! కానీ, ఆమె నేర నియంత్రణ చేయవలసిన హోంశాఖకి మంత్రిగా ఉండటం వలననే, అదికూడా ఆమెపై సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేయడంతో ఆమె చాలా అవమానకరమయిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.   ఇక, ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ స్వయంగా ఆమెపై నేరారోపణలు చేయడంతో ఆ ఆరోపణలను కానీ, అవి చేసిన సీబీఐను గానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టలేని నిస్సహాయ స్థితిలో ఉంది. సీబీఐను గనుక తప్పు పడితే, జగన్ మోహన్ రెడ్డి వ్యవహారంలోనూ దానిని తప్పు పట్టవలసి ఉంటుంది. అలాగని దైర్యంగా సీబీఐను సమర్దించి తమ మంత్రిని జైలుకు పంపలేని నిస్సహాయ స్థితిలో ఉందికాంగ్రెస్ పార్టీ.  గానీ, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మీద, అతని సోదరుడు సంజయ్ గాంధీ మీద వికీలీక్స్ చేసిన తీవ్ర ఆరోపణలను మాత్రం “నాలుగు డాలర్లు విసిరేస్తే ఇటువంటి ఎన్ని లీక్సయినా పుట్టించవచ్చు” అంటూ కాంగ్రెస్ పార్టీ వికీలీక్స్ చేసిన ఆరోపణలను గడ్డిపోచాలా తీసి పారేయగలిగింది.   ఒకప్పుడు ఇటువంటి ఆరోపణలు వస్తే కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశంలో అన్ని పార్టీలకు భయం ఉండేది. కానీ, మారిన సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో ఎంత పెద్ద ఆరోపణలు, అవినీతి భాగోతాలు బయటపడినప్పటికీ ఎవరూ కూడా ఇప్పుడు భయపడటం లేదు, సరికదా ఎదురుదాడి కూడా చేయగలుగుతున్నారు. ఇదెలా ఉందంటే కొన్నిరోగాలు యాంటీ బయాటిక్స్ ని తట్టుకొనే శక్తిని పెంచుకొన్నాక మామూలు డోసులో మందులు వాడితే అవి తగ్గవు. అప్పుడు మరింత ఎక్కువ మోతాదులో మరింత ఎక్కువ శక్తి గల యాంటీబయాటిక్స్ వాడవలసి వచ్చినట్లే, నానాటికి పెరుగుతున్న అవినీతి రోగాలు కూడా సమాజాన్ని తట్టుకొని నిలడగలుగుతున్నాయి. ఈ అవినీతి రోగాలకి కూడా మరింత కటినమయిన శిక్షలు అమలు చేయగలిగితే తప్ప ఇవి కూడా తగ్గవు.

ఢిల్లీలో సబిత భవిష్యత్!

        జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ రాష్ట్ర హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి పేరును కూడా చార్జ్ షీట్ లో చేర్చడంతో, ఆమె శాఖ మార్చడానికి ముఖ్యమంత్రి యోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. హోంమంత్రి పదవి మార్పు చేయకపోతే కళంకిత మంత్రివర్గం అని ప్రతిపక్షాలు చేసే విమర్శలను తట్టుకోవలసి ఉంటుందని కిరణ్ భావిస్తున్నారు. ఒకవేళ ఆమెను పదివి నుంచి తప్పిస్తే, మంత్రి ధర్మానను మాత్రం ఎందుకు కాపాడుతున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. అందుకని విచారణకు ఇబ్బందికలగకుండా..ఆమె శాఖ మార్చనున్నట్లు వినికిడి. కిరణ్ ఆలోచనకు అధిష్టానం ఆమోద ముద్ర లభిస్తే రాష్ట్రంలో హోంమంత్రి మార్పు ఖాయం. శాఖ మార్చితే అభ్యతరం లేదని ఇప్పటికే ముఖ్యమంత్రికి సబితాఇంద్రారెడ్డి కి స్పష్టం చేసినట్లు సమాచారం. అంతిమ తీర్పు అధిష్టానానిదే కాబట్టి, త్వరలో సబిత ఫేట్ ఢిల్లీ లో డిసైడ్ అవుద్ది.

నటి అంజలి క్షేమమే

        రెండు రోజులుగా అదృశ్యమైన సినీ నటి అంజలి క్షేమంగా ఉన్నారు. తల్లి, సోదరుడికి ఫోన్ చేసిన అంజలి కేసు విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా సోదరుడికి తెలిపినట్లు తెలుస్తోంది. బెంగుళూరులో షూటింగ్ హాజరయే అవకాశం ఉన్నట్లు సమాచారం. పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం మీద తీవ్ర ఆరోపణలు చేసిన అంజలి అనుకోకుండా మాయమయింది. అయితే ఆమె ఓ సినిమా షూటింగ్ పాల్గొనేందుకు బెంగుళూరు వెళ్లినట్లు తేలింది. ఆమె అదృశ్యమయిందని ఆమె సోదరుడు ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తన పరువుకు భంగం కలిగించిందని దర్శకుడు కళంజియం కూడా అంజలిపై చెన్నై కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. అయితే గత నెల 31వ తేదీ సాయంత్రం మూడున్నర గంటలకు అంజలి హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఆమె దస్‌పల్లా హోటల్‌లోని 307 గదిలో బస చేసినట్లు, అక్కడి నుంచే ఆమె కనిపించకుండా పోయినట్లు చెబుతున్నారు. ప్రతి రోజూ హోటల్ నుంచే బలుపు సినిమా షూటింగ్‌కు వెళ్లి వస్తుండేవారని అంటున్నారు. సోమవారం బయటకు వెళ్లిన అంజలి తిరిగి రాకపోవడంతో ఆమె సోదరుడు సూరిబాబు గది ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమె ఒక్కరే బయటకు వెళ్తున్న దృశ్యాలు సిసిటివీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అంజలి వ్యవహారం  టాలీవుడ్ తీవ్ర చర్చానీయాంశంగా మారింది.

తల్లి ఒడిని చేరిన చిన్నారి శ్రాగ్వి

        ఎనిమిది నెలల చిన్నారి శ్రాగ్వి కిడ్నాప్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. చిన్నారి శ్రాగ్వి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరికాసేపట్లో చిన్నారిని మీడియా ముందు ఉంచనున్నారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారిని దాచిపెట్టిన నిందితుడి ఇండిపై దాడి చేశారు. నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు, పాపను వారి నుంచి రక్షించారు. చిన్నారి శ్రాగ్వి జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఎన్టీఆర్ పై మండిపడ్డ బాలయ్య ఫ్యాన్స్

        ప్లెక్సీల వివాదంలో నందమూరి అభిమానులను కించపరిచేలా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారని బాలకృష్ణ సేవాసమితి రాష్ట్ర వ్యవస్థాపకుడు, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావులోని రక్తం, పౌరుషం తనలో ఉన్నాయని చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ ముద్రించిన ప్లెక్సీల వివాదంపై ఎందుకు మౌనం దాల్చుతున్నారని ప్రశ్నించారు. కొడాలి నాని పార్టీ మారి చంద్రబాబును, టీడీపీని విమర్శిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్‌కు ఉడుకు రక్తం ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ కళాకారుడైనా, వ్యక్తులైనా ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే తప్పులేదని, అయితే వైసీపీ నేతలకు ఆహక్కు లేదన్నారు.

టిడిపి వ్యాఖ్యలపై కింగ్ నాగార్జున ఆశ్చర్యం

        టీడీపీ నాయకులు ఇటీవల మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నాలుగురోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నపూర్ణ స్టూడియో వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, దాని మీద పోరాటం చేసింది తామేనని అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విమర్శలకు కారణాలు ఏంటో తెలియడం లేదు” అని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. వాన్ పిక్ భూముల కుంభకోణం కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న మాటీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ను అల్లు అరవింద్ తో కలిసి ములాఖత్ లో కలిశారు నాగార్జున. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘వారు అలా ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు.

మమతా బెనర్జీపై దాడి చేసిన సిపిఎం కార్యకర్తలు

  ఢిల్లీలో ప్రణాళికా సంఘం సమావేశంలో పాల్గొనడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, క్యాబినెట్ ఆర్థికమంత్రి  అమిత్ మిత్రా ఢిల్లీకి వచ్చారు. మధ్యాహ్నం 3.45 సమయంలో యోజన భవన్ కు వచ్చిన మమతా బెనర్జీ, అమిత్ మిత్రా లను సుమారు 150 మంది సిపిఎం, ఎస్.ఎఫ్.ఐ. కార్యకర్తలు ఘెరావ్ చేసి మమతా బెనర్జీ పై దాడి చేశారు. ఈ దాడిలో అమిత్ మిత్రా ను ఆందోళనకారులు తోసేసి పిడిగుద్దులు కురిపిస్తూ కిందపడేశారు. ఆయన కుర్తా చిరిగిపోయి దెబ్బలు తగలడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆయనను ఎయిమ్స్ లో అడ్మిట్ చేశారు. మమతా బెనర్జీ స్వల్ప అనారోగ్యానికి గురవడంతో ఢిల్లీలోని ఆమె నివాసంలో వైద్యులు ఆక్సిజన్ అమర్చారు. మమతా బెనర్జీ విలేఖరులతో మాట్లాడుతూ ఆందోళనకారులు తనను ఇనుపరాడ్ తో చంపాలని చూశారని, మంత్రి ఫర్హాడ్ హకీమ్ తనను రక్షించారని, మా ఆర్థికమంత్రిపై దాడి చేసి ఆయనను గాయపరిచారు. నేను తలచుకుంటే పదిలక్షల మందిని ఢిల్లీకి తేగలనని, అయినా ప్రణాళికా సంఘం కార్యాలయం దగ్గర రాజకీయ నిరసనలేమిటి అని, నన్ను చంపడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడమేనని, కానీ తనను చంపితే తప్ప ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ జైపాల్ రెడ్డిని పక్కన పెట్టబోతోందా

        కేంద్ర పెట్రోలియం శాఖామంత్రిగా ఒక వెలుగు వెలిగిన జైపాల్‌రెడ్డి, తనను ఆ శాఖ నుండి తప్పించడంతో ఆగ్రహించి రాబోయే ఎన్నికలలో పోటీ చేయనని ప్రకటించారు. ఆయన చేవెళ్ళ లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. అయితే, ఆయన ఆశించినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఏమాత్రం అనునయించే ప్రయత్నం చేయలేదు. పైగా ఆయన ప్రాతినిద్యం వహిస్తున్న చేవెళ్ళ నుండి గెలుగు గుర్రాలను వెతికి పట్టుకోమని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన దూత అమర్‌కాలేను హైదరాబాద్ పంపడంతో ఆయన కంగు తిన్నారు.   తెలంగాణా అంశంపై ఆయన ప్రత్యక్షంగా నోరు మెదపక పోయినా, కాంగ్రెస్ నాయకులకు, తెరాసా నేతలకు కూడా వెనుక నిలబడి అయనే ప్రోత్సహిస్తున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై ఆగ్రహంతో ఉండటమే అందుకు కారణమని చెప్పవచ్చును. ఈ అవమానం చాలదన్నట్లు ఎన్నికలలో పోటీ చేయనని ఆయన ప్రకటించగానే, చేవెళ్ళలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్ధులు అందరూ పండగ చేసుకొంటున్నారు. ఇది ఎలా ఉందంటే ఏళ్ళు తగలబడి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు అగ్గి దొరికిందని మరొకడు సంబరపడినట్లుంది.   నిన్నపార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ ప్రతినిధి అమర్‌కాలే చేవెళ్ల, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాలపై నేతల అభిప్రాయాలను సేకరించినప్పుడు చేవెళ్ళ టికెట్ కోసం చాల మంధి అభ్యర్ధులు క్యూలో నిలబడ్డారు. వారిలో జైపాల్ రెడ్డి దగ్గర బందువు ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, మేడ్చల్ శాసన సభ్యుడు కే. లక్ష్మా రెడ్డి తదితరులున్నారు.   వారు చేవెళ్ళ లోక్ సభ టికెట్ తమకు ఇప్పించవలసిందిగా అమర్ కాలేకు విజ్ఞప్తులు చేసి, పనిలోపనిగా కొంతమంది కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణపైనా, మరి కొంత మంది హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పైనా పిర్యాదులు కూడా చేసారు. అలాగే, తెలంగాణా అంశం గురించి కూడా అందరూ మరో మారు గుర్తు చేసారాయనకి.   కేంద్రంలో చక్రం తిప్పుతున్నానని గట్టిగా విశ్వసించే సర్వేసత్యనారాయణ కూడా కాలేను కలిసి టికెట్ ఇప్పించమని ప్రాదేయపడటం విశేషం. తనకు గనుక టికెట్ ఇప్పిస్తే ఈ సారి 5లక్షల వోట్ల భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు.   యల్.బీ.నగర్ శాసన సభ్యుడు సుదీర్ రెడ్డి సర్వే సత్యనారాయణకు టికెట్ ఇవ్వడం సంగతెలా ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పట్ల అగౌరవంగా మాట్లాడినందుకు ముందు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతటితో ఆగక మరో అడుగు ముందుకు వేస్తూ తమ వంటి సీనియర్లకు టికెట్స్ ఈయకుండా పార్టీలోకి కొత్తగా వస్తున్నవారికి పార్టీ టికెట్స్ ఇచ్చినట్లయితే వచ్చే ఎన్నికల సమయానికి పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం అని ఒక హెచ్చరిక కూడా చేసి వచ్చారు. ఇక పార్టీలో మరో సీనియర్ నేత పిట్ల కృష్ణ కూడా సర్వే సీటును ఈసారి తనకు కేటాయించమని కోరారు.

హోంమంత్రి సబిత తప్పించుకుంది

        హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కి అరెస్ట్ గండం నుంచి బయట పడ్డారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఐదవ ఛార్జి షీటులో పేర్కొన్న నిందితులకు సమన్లు జారీ చేయాలని సిబిఐ నిర్ణయించుకోవడంతో, సబితా ఇంద్రారెడ్డి కి అరెస్ట్ గండం గట్టేక్కినట్లుగా కనిపిస్తోంది. కోర్టు నుంచి సమన్లు వెలువడినట్టయితే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి అరెస్టు కానవసరం లేదని, కేవలం కోర్టు పిలిపినప్పుడు కోర్టుకు హాజరై ఈ కేసులో ఏమి జరిగిందీ పూర్వాపరాలు చెబితే చాలునని తెలుస్తున్నది. అయితే ఈ జాబితాలో హోంమంత్రి సబిత ఉండడ౦తో మిగిలినవారు కూడా జైలుకు వెళ్లే అవసరం లేకుండా బయటపడినట్లు కనిపిస్తుంది.

హోంమంత్రి సబితా కు ఓదార్పు

        జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ని నిందితురాలిగా చేర్చడంతో ఆమె రాజీనామాకు సిద్దపడ్డారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స వారించడంతో వెనక్కి తగ్గారు. రాజీనామా పై వెనక్కి తగ్గిన హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ని ఓదార్చే౦దుకు కాంగ్రెస్ మంత్రులు ఆమె ఇంటి వద్ద వాలిపోతున్నారు.   మంత్రి కన్నా లక్ష్మీనారాయణ: ఆరోపణలు వచ్చిన వారంతా రాజీనామా చేయాలంటే రాష్ట్రంలో ఎందరో రాజీనామా చేయాల్సి వస్తుందని మంత్రి కన్నా అన్నారు. బిజినెస్ రూల్ ప్రకారమే హోంమంత్రి సబిత వ్యవహరించారని, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. మంత్రి డికె. అరుణ: హోంమంత్రి సబిత ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి డికె. అరుణ తెలిపారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని హోంమంత్రిని కోరినట్లు మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే శేషారెడ్డి: హోంమంత్రి సబిత ఏ తప్పూ చేయలేదని ఎమ్మెల్యే శేషారెడ్డి అన్నారు. మైనింగ్ వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, తప్పు జరిగిందని అనాడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సీబీఐ చార్జిషీట్‌లో పేరు ఉన్నంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసం లేదని ఎమ్మెల్యే శేషారెడ్డి స్పష్టం చేశారు. విప్ శివరాంరెడ్డి: హోంమంత్రి సబిత ఎలాంటి తప్పు చేయలేదని, ఆమెపై ఆరోపణలు రావడం దురదృష్టకరం అని విప్ శివరాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయొద్దని సబితను కోరినట్లు ఆయన తెలిపారు.  

హెరిటేజ్ ని టార్గెట్ చేసిన జగన్ పార్టీ

  ఇంత వరకు యన్టీఆర్ ఫోటోలు తమ పార్టీ బ్యానర్లపై ముద్రించి తెలుగుదేశం పార్టీ లో చిచ్చు పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన దృష్టిని చంద్రబాబు కుటుంబం అద్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ పాల కంపెనీ మీదకు మరల్చినట్లుంది. తద్వారా చంద్రబాబు ఆర్ధిక మూలాలను దెబ్బ తీయవచ్చుననే ఆలోచనచేస్తున్నట్లు ఉంది.   కేరళ రాష్ట్రానికి హెరిటేజ్ పద్మనాభ అనే బ్రాండ్ పేరుతో సప్లై చేస్తున్న పాలను, పాల ఉత్పత్తులపై కేరళ ప్రభుత్వం నెల రోజులు నిషేధం విదించడంతో, ఆ పాలలో హానికరమయిన కెమికల్స్ కొన్ని ఉన్నoదునే వాటిని కేరళ ప్రభుత్వం నిషేదించిందని, గనుక ఆ పాలను రాష్ట్రం లోకూడా వెంటనే నిషేదించాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జూపూడి ప్రభాకరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   హెరిటేజ్ సంస్థ అధ్యక్షుడు సాంబశివరావు రాజకీయాలను పరిశ్రమలతో ముడిపెట్టడాన్ని ఆక్షేపిస్తూ “మా పాల ఉత్పత్తులను అత్యంత ఆధునికమయిన, రక్షితమయిన పద్దతిలో సేకరించి, ప్యాక్ చేసి మా ఖాతాదారులకు గత అనేక సం.లుగా అందిస్తూ వస్తున్నాము, రోజు లక్షలాది మంది ప్రజలు మా పాలను తాగుతున్నారు. అయినప్పటికీ ఇంతకాలం ఒక్క పిర్యాదు కూడా రాలేదు. కేరళ ప్రభుత్వం మా పాలను కేవలం కొన్ని షరతులు, ఒప్పందాలు కుదరకపోవడం చేతనే సరఫరా నిలిపివేయమని ఆడిగింది తప్ప జూపూడి చెపుతున్నట్లు హానికరమయిన రసాయనాలున్నాయని మాత్రం ఎన్నడూ నిలిపివేయలేదు. అయినప్పటికీ, మేము జరిపిన అన్ని పరీక్షలతో కేరళ ప్రభుత్వం సంతృప్తి చెందింది గనుకనే ఇప్పుడు మేము కేరళ రాష్ట్రానికి మళ్ళీ పాలు సరఫరా చేస్తున్నాము. అందువల్ల, జూపూడి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పి, తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. అలా కాని పక్షంలో హెరిటేజ్ కంపెనీ ఆయన మీద న్యాయపరమయిన చర్యలు తీసుకోవడాని కూడా వెనుకాడదు, “ అని హెచ్చరించారు.

హోంమంత్రి సబితా జైలుకే: కోడెల

    జగన్ అక్రమాస్తుల కేసులో హోంమంత్రి సబితను నిందితురాలుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినేట్ దొంగలమయం అని ఆరోపించారు. చేవెళ్ల చెళ్లెమ్మ జైలుకు వెళ్లబోతోందన్నారు. ప్రభుత్వ కార్యాక్రమాలతో పాటు చేవెళ్ల నుంచి వైఎస్ అవినీతి కార్యక్రమాలను ప్రారంభించారని విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు సిగ్గులేకుండా పదవులలో కొనసాగుతున్నారని ధ్వజమెత్తారు. తమ్ముళ్ల అవినీతి చూస్తే సీఎం ఎంత నీతిమంతుడో తెలుస్తుందని కోడెల శివప్రసాద్ ఎద్దేవా చేశారు.   మరోవైపు ఎన్టీఆర్ ఫోటో వివాదంపై నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అని కోడెల శివప్రసాద్ అన్నారు. టీడీపీ పార్టీ ఏనాడూ ఎన్టీఆర్ ఫోటోను పక్కనపెట్టలేదని తెలిపారు. ఎన్టీఆర్ కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కోడెల పేర్కొన్నారు.