అమెరికాతో అణ్వస్త్ర యుద్దానికి ఉవ్విళ్ళూరుతున్న ఉత్తర కొరియా

  తీవ్ర యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న ఉత్తర కొరియా దేశ ప్రభుత్వం తన శక్తికి మించినదని తెలిసి ఉన్నపటికీ దక్షిణ కొరియాకు అండగా నిలబడ్డ అగ్రరాజ్యం అమెరికాతో ఏకంగా .అణ్వస్త్రయుద్దానికి సిద్దపడుతూ ఇరుదేశాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ రోజు ఆ దేశ విదేశాంగ శాఖ రాజధాని పయోంగ్ యాంగ్ లో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు వెంటనే తమ దేశం విడిచివెళ్ళడం వారికే క్షేమమని లేఖలు వ్రాసింది. ఈ నెల 10వ తేదీ తరువాత ఏ క్షణానయినా అణుయుద్ధం జరిగే అవకాశం ఉంది గనుక ఆ లోగా వారు దేశం విడిచి వెళ్ళకపోతే వారికి రక్షణ కల్పించలేమని తెలిపింది. బ్రిటన్, రష్యా, చైనా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు లేఖలు అందుకొన్నట్లు దృవీకరించాయి.   దక్షిణ కొరియా దేశంతో దశాబ్దాల తరబడి వైరం పెంచుకొంటూ వస్తున్న ఉత్తర కొరియా ఏనాటికయినా ఆ దేశాన్ని ప్రపంచ పటంలోంచి కనబడకుండా చేరిపేస్తానని భీషణ ప్రతిజ్ఞలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే అణ్వస్త్రాలను సైతం సమకూర్చుకోవడంతో, ఉత్తర కొరియాను అణ్వస్త్ర దేశంగా గుర్తించబోమని ఖరాఖండీగా చెప్పడమే కాకుండా అణు నిరాయుధీకరణకు కూడా అమెరికా పట్టుపట్టింది. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ (30) అణ్వస్త్ర పరీక్ష జరిపి అగ్రరాజ్యానికి సవాలు విసరడంతో పరిస్థితులు విషమించాయి.   అమెరికా కూడా దానికి దీటయిన జవాబుగా దక్షిణ కొరియా దేశంతో కలిసి సైనిక విన్యాసాలు చేసి ఉత్తర కొరియా సరిహద్దులో ఒక డమ్మీ అణ్వస్త్ర బాంబు జారవిడిచింది. అమెరికా చర్యతో మరింత ఆగ్రహించిన ఉత్తర కొరియా, ఉభయ దేశాల సరిహద్దుల వద్దగల రెండు దేశాల సహకారంతో నడుస్తున్నపారిశ్రామికవాడను మూసివేసి యుద్ధ ప్రకటన కూడా చేసింది. తన అణ్వస్త్రాలను దక్షిణ కొరియా వైపు మొహరించిన ఉత్తర కొరియా ఈ రోజు రాజధానిలో గల అన్ని దేశాల రాయభార కార్యాలయాలకు ఈనెల 10లొగా ఖాళీచేసి వెళ్ళిపోవడం మేలని లేఖలు వ్రాసింది. 10వతేదీ నుండి ఏరోజయినా అణ్వస్త్ర యుద్ధం జరుగవచ్చని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉత్తర కొరియా మిత్ర దేశాలయినా చైనా, రష్యాల తో సహా వివిధదేశాలు వారిస్తున్నపటికీ ఆ దేశం యుద్ధానికే ఇష్టపడుతోంది.   ఒకసారి అణ్వస్త్ర యుద్ధం మొదలయితే అది ఎంత దారుణంగా ఉంటుందో తెలిసినప్పటికీ, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్నఅమెరికా వంటి దేశంతో యుద్ధానికి సై అనడం చూస్తుంటే వినాశకాలే విపరీత బుద్ది అనే మన పెద్దల మాటలు గుర్తుకు రాకమానవు. ప్రభుత్వ దురహంకారానికి, యుద్ధ కాంక్షకు అక్కడి అమాయక ప్రజలు, పిల్లలు, మహిళలు అందరూ బలవబోతుంటే ప్రపంచం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటం విచారకరం.

భారతరత్నకి తక్కువయితే కుదర్దు మరి

  తన మృదుమదురమయిన గళంతో పాటలకు ప్రాణం పోసే పాటల కోయిల శ్రీమతి యస్. జానకికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమయిన పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. అయితే గత 55ఏళ్లుగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర సీమలకు సేవచేస్తూ దాదాపు 20౦౦౦ పాటలు పైగా పాడిన తనకు ఈ అవార్డు ఎప్పుడో ఇచ్చి ఉండవలసిందని కానీ, దానిని ఇచ్చేందుకు కూడా ఇన్ని ఏళ్ళు ఆలోచించడం తనకి చాలా బాధ కలిగించిందని, ఇన్నేళ్ళుగా తానూ చేస్తున్న సేవలకి భారతరత్న ఇచ్చి ఉండి ఉంటే తనకు గౌరవంగా ఉండేదని, అందువల్ల తానూ ఈ అవార్డును స్వీకరించలేనని ఆమె తెలిపారు. ఈ వయసులో కూడా ప్రజలు మరియు చిత్ర సీమ, తనపై కురిపిస్తున్న అపార ప్రేమాభిమానాలే ఈ అవార్డుల కంటే తనకు ఎక్కువ ఆనందం కలిగిస్తాయని ఆమె అన్నారు.   ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రముఖ నటి శ్రీదేవి, ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు బాపు, క్రికెటర్ రాహుల్ డ్రావిడ్, చేనేత కళాకారుడు గజం అంజయ్యలకు పద్మ అవార్డులు అందుకొన్నారు.

ఎన్టీఆర్ ను టిడిపి తప్ప ఎవరైనా వాడొచ్చు!

      ఎన్టీఆర్‌ బొమ్మను ఒక్క టీడీపీ తప్ప ఎవరైనా వాడుకోవచ్చని కొడాలి నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి వ్యవస్థాపక అధ్యక్షుడిని గెంటేసిన చంద్రబాబుకు ఆయన ఫోటోను వాడుకునే అర్హత లేదన్నారు. అధికారం యావతో చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ ఫోటోను కూడా రాద్దాంతం చేస్తున్నాడని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిలను పేద ప్రజలు గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారని చెప్పారు. అలాంటి ఉత్తమ నాయకులను ఎవరైనా అభిమానిస్తారని అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో కొన్ని పిచ్చికుక్కలు మొరుగుతున్నాయని అన్నారు.

గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకొన్న కిరణ్

    ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏవయినా ముఖ్య నిర్ణయాలు తీసుకొనేటప్పుడు అటు పార్టీలో కానీ, ఇటు కేబినేట్ సహచరులతో గానీ సంప్రదించే అలవాటు లేదని విద్యుత్ చార్జీల పెంపు విషయంలో మరో మారు రుజువు చేసుకొన్నారు. కరెంటు చార్జీలపై ప్రతిపక్షాల ఆందోళనలకి ఎంత మాత్రం భయపడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వపక్షంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాక వెనక్కి తగ్గక తప్పలేదు.   అయినప్పటికీ, 200 యూనిట్లు లోపుగా వాడుకోనేవారికే తప్ప మిగిలిన వారికి మాత్రం పెంచిన చార్జీలు యధాతధంగా వర్తింపజేశారు. 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ అధికంగా వాడినా మొత్తం బిల్లు కొత్త చార్జీల ప్రకారమే చెల్లించవలసి ఉంటుంది. ఆయన తీసుకొన్న నిర్ణయం ప్రజలను అవహేళన చేయడమే తప్ప మరొకటి కాదు. ముఖ్యమంత్రి నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు తమ అందోళనలను మరింత ఉదృతం చేయనున్నట్లు ప్రకటించాయి.   ముఖ్యమంత్రి మొండిగా ఎవరినీ ఖాతరు చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తరువాత స్వపక్ష విపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తరువాత వెనక్కి తగ్గటం ఒక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు వలన ఆయన తన పేరు తానే పాడు చేసుకోవడమే కాకుండా, పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. తద్వారా ప్రజలలో ఇప్పటికే ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేఖతని మరింత పెంచి పోషిస్తూ పార్టీకి మరింత నష్టం కలిగిస్తున్నారని వీ. హనుమంత రావు వంటి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.   కానీ, అధిష్టానం అండదండలు ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన బాటలో తానూ ముందుకు సాగిపోతున్నారు. ఎన్నికలకి ఇంకా చాల సమయం ఉంది గనుక ప్రస్తుతం ఆయనకి ఎవరినీ ఖాతరు చేయవలసిన అవసరం ఉండకపోవచ్చును. కానీ రేపు ఎన్నికలు దగ్గిర పడిన తరువాత పార్టీలో కార్యకర్త మొదలు సీనియర్ల వరకు అందరి సహకారం అవసరం ఉంటుంది. ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆయనేమి వైయస్సార్ కాదని తెలుసుకొంటే, పార్టీలో అందరి సహకారం ఎంత అవసరమో ఆయనకి అర్ధం అవుతుంది.   కరెంటు చార్జీలు పెంచడం అనివార్యం అయినప్పుడు ఆ సంగతిని పార్టీలో, ప్రభుత్వంలో చర్చించిన తరువాత వారి అభిప్రాయం తీసుకొని, ఒకసారి ప్రతిపక్షాలను కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి ఉంటే ఈరోజు ఇన్ని ఆందోళనలు ఉండేవి కావు. కానీ, అహం అడ్డు రావడం వలనో లేక ఎవరినీ సంప్రదించవలసిన అవసరం తనకు లేదనే అహంభావం వలనో ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసేసుకొని గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తీసుకువచ్చి చేతులు కాలేక ఆకులు పట్టుకొన్నట్లు వెనక్కి తగ్గక తప్పలేదు. దీని వల్ల ప్రజలలో నవ్వులపాలవడమే కాకుండా, రేపు డిల్లీ వెళ్ళినప్పుడు అధిష్టానం చేత కూడా అక్షింతలు వేయించుకోక తప్పదు. అందువల్ల కనీసం ఇప్పటినుంచయినా తన వ్యవహార శైలి మార్చుకొనకపోతే అది ఆయనకీ, కాంగ్రెస్ పార్టీకీ నష్టం కలిగిస్తుంది చెప్పకతప్పదు.

వైఎస్ జగన్ వర్గ ఎమ్మెల్యేల తెలివైన వ్యూహం

        రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి నోటిఫై చేయాలని జగన్ వర్గ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 151ఏ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను ఆ ఎమ్మెల్యేలు కోరారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పార్టీల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని టీడీపీ, తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్, టీడీపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలా స్పందిస్తారో చర్చానీయాంశంగా మారింది.

పద్మభూషణ్ అందుకున్న రామానాయుడు

        పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు ఢిల్లీలో ఘనంగా జరిగింది. భారత ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాల కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్‌లో జరిగింది. ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు, క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, ప్రముఖ నటి శ్రీదేవి, ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మా అవార్డులను అందజేశారు. పద్మవిభూషన్, పద్మభూషన్, పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రతిభావంతులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులను ప్రదానం చేశారు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్‌షా..జగన్ పొలిటికల్ బాద్‌షా ఫ్లెక్సీలు

        విశాఖజిల్లాలో బాద్‌షా చిత్రానికి సంబంధించిన ఫ్లెక్సీలు వివాదాన్ని రేపుతున్నాయి. కిన్నెర థియేటర్ దగ్గర జగన్, జూ.ఎన్టీఆర్‌తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ పొలిటికల్ బాద్‌షా...ఎన్టీఆర్ టాలీవుడ్ బాద్‌షా  అంటూ ఫ్లెక్సీలపై రాతలు రాశారు. అయితే ఈ రాతలు రాజకీయాలకు అతీతం అని పెట్టడం విశేషం. కాగా ఈ ఫ్లెక్సీలపై బాలకృష్ణ, జూ.ఎన్టీర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. థియేటర్‌పై దాడిచేస్తామనే హెచ్చరికలతో ఫ్లెక్సీలను తొలగించారు.   మరోవైపు కృష్ణా జిల్లాలో గుడివాడలో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసి ఫ్లెక్సీల్లో టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు ఫోటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. మరో రెండు ఫ్లెక్సీల్లోనూ ఫోటోను కత్తిరించడంతో రావి అభిమానులు ఆందోళనకు దిగారు.

ఎన్నాళ్లని జెండాలు మోస్తారు

        మీరంతా కష్టాల్లో ఉన్నారు.. అధికారంలో లేకపోయినా తొమ్మిదేళ్లుగా జెండాలు మోస్తున్నారు.. ఎన్నాళ్లని మోస్తూ కూర్చుంటాం.. అధికారం వస్తేనే ప్రజలకు న్యాయం చేయగలం..'' అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని, టీడీపీ గెలుపు ఒక చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏడాదిలో రావచ్చు. ఆరు నెలల్లోనైనా రావచ్చు. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలన్నారు. జెండాలు మోసీమోసీ భుజాలు అరిగిపోయాయని, ఇక అధికారంలోకి రావడం తప్పనిసరని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎన్టీఆర్ బాద్‌షా ఫ్లెక్సీలలో జగన్

        వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ను ఇప్పట్లో వదిలేలా కనపడడం లేదు. మొన్న జూనియర్ ఎన్టీఆర్, నిన్న సీనియర్ ఎన్టీఆర్ ను జగన్ పార్టీ ఫ్లెక్సీల లో వాడేసుకుంది. అయితే ఓ వర్గం ఓటర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే ఆ పార్టీ ఈ ఎత్తుగడలను వేస్తుందని భావిస్తున్నారు. తాజాగా 'బాద్ షా' సినిమా విడుదల నేపధ్యంలో ఏర్పాటైన ఫ్లెక్సీల లో జగన్ ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి. చీరాల మోహన్ థియేటర్ వద్ద అభిమానులు జగన్ తో ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ముందు జాగ్రత్తగా థియేటర్ యాజమాన్యం వాటిని తొలగించింది. తిరువూరు వెంకటేశ్వర థియేటర్ వద్ద కొడాలి నాని, ఎన్టీఆర్, వైఎస్ జగన్ లు ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనలతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు.

కిరణ్ తగ్గింపులు ... తృప్తి చెందని విపక్షాలు

  గత కొద్దిరోజులుగా విపక్షాలు విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరాహార దీక్షలు, నిరసనలు తెలుపుతున్న విషయం విదితమే. స్వపక్షంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై గురువారం మంత్రులు, విద్యుత్ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, ఆనం రాంనారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పార్థసారథి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గీతారెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గృహ వినియోగదారులకు కొత్తగా పెరిగిన కరెంటు ఛార్జీల భారంలో 830 కోట్ల రూపాయలను ప్రభుత్వం రాయితీగా భరిస్తుందని, నెలకు 200 యూనిట్ల కంటే తక్కువ యూనిట్లు వాడుకునే వారికి పాత ఛార్జీలనే కొనసాగిస్తామని, 201 యూనిట్ల నుంచి ఆపైన వాడుకునే వారికి మొదటి యూనిట్ నుండి కొత్తగా పెరిగిన ఛార్జీల ప్రకారం చెల్లించాల్సి వుంటుందని పేర్కొన్నారు. అలాగే గృహ వినియోగదారులు రెండు కోట్లు ఉంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో 1.86 కోట్ల ప్రజలకు కరెంటు ఛార్జీల పెంపు నుంచి ఉపశమనం పొందుతారని అన్నారు. విపక్షాలు మాత్రం సిఎం నిర్ణయంతో సంతృప్తికరంగా లేరు. ఈనెల తొమ్మిదిన రాష్ట్రవ్యాప్త బంద్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ ఫోటోలు పెట్టుకోండి ... రేవంత్ రెడ్డి

  టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారంవిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ... జగన్, వైఎస్సార్ ఫోటోలు  పెట్టుకుంటే ప్రజలకు దొంగలు, దోపిడీదారులు గుర్తుకు వస్తారని భయపడి వైఎస్సార్సీపీ ఎన్టీఆర్, జూ. ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకుంటున్నారని, రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు పెట్టుకునే కొత్త బిచ్చగాళ్ళు, పగటి వేషగాళ్ళ పార్టీలను ఇప్పుడే చూస్తున్నామని, ఎన్టీఆర్ నిజాయితీ పరుడని, నిజాయితీకి మారుపేరని అన్నారు. ఆయన ఫోటోను వైఎస్సార్సీపీ పార్టీ ఫ్లెక్సీలపై పెట్టుకుని మలినపరుస్తున్నారని, ఎన్టీఆర్ ఎప్పుడూ వైఎస్సార్ తో రాజీ పడలేదని, జగన్, వైఎస్సార్ ఫోటోలు పట్టుకుని ఓట్లు సంపాదించే రోజులు పోయాయని ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకుందని ఎద్దేవా చేశారు. దావుద్ ఇబ్రహీం, ముషారఫ్ వంటివారి ఫోటోలు పెట్టుకుంటే మంచిదని రేవంత్ రెడ్డి వైఎస్సార్సీపీ వారికి సలహా ఇస్తున్నారు.

అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలి ... చంద్రబాబు

  ప్రధాన ప్రతిపక్షనేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్నారు. బాబు పాదయాత్ర గురువారం పిఠాపురం, ప్రత్తిపాడు నియోకవర్గాలలో సాగింది. పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, పార్టీ కార్యకర్తలు సైనికుల్లా సిద్ధంగా ఉండాలని, అసెంబ్లీ, పార్లమెంటులకు సైకిల్ దూసుకుపోవాలని, తొమ్మిదేళ్ళుగా కార్యకర్తలు పార్టీ జెండాలు మోస్తూనే వున్నారని, ఇంకా ఎన్నాళ్ళు జెండాలు మోస్తూ ఉంటారని, మనలో ఉన్న పట్టుదలకు కసి తోడవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు

రేణుకా చౌదరి ఇంటి పై కోడిగుడ్లు

        తెలంగాణ ఆత్మహత్యలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ఇంటిని గురువారం తెలంగాణవాదులు ముట్టడించారు. రేణుక చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆమె తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున రేణుకా చౌదరి ఇంటిముందు ధర్నాకు దిగారు. పలువురు ఆమె ఇంటి పైకి కోడి గుడ్లు విసిరారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రేణుక దిగి వచ్చే వరకు తాము తమ ఆందోళనను విరమించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీస్తుందని భావించిన పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

పేదలకు సమాజంలో గుర్తింపు లేదు: రాహుల్

        ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ వార్షిక సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ భారత్‌లో ఉన్నన్ని సహజవనరులు ఎక్కడా లేవన్నారు. అలాగే దేశంలో మేధావులకు, నిపుణులకు ఏమాత్రం కొదువ లేదన్నారు. కొన్నేళ్లుగా భారత్ పారిశ్రామికరంగంలో దూసుకుపోతోందన్నారు. దేశ అభివృద్ధికి రోడ్లు, రవాణా, విద్యుత్ చాలాకీలకం అన్నారు. పేద ప్రజలకు సమాజంలో ఏమాత్రం గుర్తింపు లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.   గత ఐదేళ్లలో భారత కార్పోరేట్ రంగం కష్టపడి పనిచేసిందని రాహుల్ అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కార్పోరేట్ రంగం సహకారం అవసరమని, మౌలిక సదుపాయాలు వృద్ధి చేయకుండా ముందుకు వెళ్లడం అసాధ్యమన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు అవసరమని, ప్రపంచ స్థాయి విద్య మన పిల్లలకు అందించాలని రాహుల్ వెల్లడించారు. యుపిఏ పాలనలో దేశం చాలా అభివృద్ధి చెందిందని రాహుల్ చెప్పారు.

అంబానీలను కలిపిన నయనతార పెళ్ళి

  ఒకరిపై మరొకరికి సరయిన రిలయన్స్ లేకపోవడంతో ఐదేళ్ల క్రితం విడిపోయిన ముకేష్ అంభానీ, అనిల్ అంభానీలను నయనతార కలిపింది. అదికాకుండా ఇటీవలే ఆమె పెళ్లి కూడా చేసేసుకోంది. అంభానీసోదరులు ఆమె పెళ్లికి రావడమే కాకుండా వారిరువురూ 1,200 కోట్ల విలువయిన ఒక బిజినస్ ఒప్పందం కూడా అక్కడే చేసుకొన్నారు.   నయనతార పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఆ పెళ్ళికి అంభానీలు రావడం ఏమిటి? అంభానీలను నయనతార కలపడమేమిటి? అన్నదమ్ముల సవాల్ అంటూ విడిపోయిన అంభానీ సోదరులు మళ్ళీ కలిసి 1,200 కోట్ల బిజినెస్ ఏమిటి? అంతా గందరగోళంగా ఉందా? అయితే ఈ కధ పూర్తిగా వినవలసిందే మరి. ఫ్లాష్ బ్యాకులో ముకేష్ అంభానీ, అనిల్ అంభానీలు గొడవలు పడివిడిపోవడం మనం ఇదివరకే చూసేసాము గనుక ఇప్పుడు ఆ స్టోరీ వద్దు. నేరుగా ఇంటర్వెల్ బ్యాంగ్ తోనే కధ మొదలుపెట్టుకొందాము.   ఇక, గ్రీకువీరుడుతో రోమాన్స్ చేస్తున్న మన నయనతార ఇంకా ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ, అంభానీలకి కూడా నయనతార అనే ఒక మేనకోడలు ఉంది. ప్రస్తుతం జరిగింది ఆమె పెళ్ళే. ముకేష్ అంభానీ ముచ్చటపడి ముంబైలో కట్టించుకొన్న తన 27 అంతస్తుల అంటిలా కుటీరంలో ఆమె పెళ్ళికి తన సోదరుడు అనిల్ అంభానీని కూడా ఆహ్వానించారు.   ఆ సందర్భంగా కలిసిన అంభానీ సోదరులు నయనతార పెళ్లి మాట ఎలా ఉన్నా, 1200 కోట్ల విలువయిన ఒక బిజినస్ ఒప్పందం చేసుకొని యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆప్టిక్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ముకేష్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగించుకునేందుకు ఒప్పందం కుదిరింది.   త్వరలోనే దేశంలో 4జి సర్వీసులను ప్రారంభించాలని పట్టుదలగా ఉన్న ముకేష్ అంభానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ కంపెనీ దానికి అవసరమయిన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పెద్దగా పెట్టుబడి అక్కరలేకుండానే (కేవలం 1200 కోట్లతోనే) తనపని పూర్తిచేసుకొనే అవకాశం ఈ ఒప్పందంవలన ఏర్పడగా, భారీ పెట్టుబడి పెట్టి దేశ వ్యాప్తంగా ఆప్టికల్ కేబిల్స్ వేసినప్పటికీ దానినుండి ఆశించిన ఫలితం రాకపోవడంతో నష్టాలు చవిచూస్తున్న అనిల్ అంబానీ కంపెనీ ఆర్‌కామ్‌ కు ఈ ఒప్పందం వలన ఒకేసారి ఊహించని బిజినెస్ దొరికింది. తద్వారా అన్నదమ్ములిద్దరి కంపెనీలు లాభాపడటమే కాకుండా, డబ్బు మొత్తం వారి కుటుంబంలోనే చేతులు మారుతుంది.   ఈ అన్నదమ్ముల అనుబంధం మరింత బలపడితే మున్ముందు ఇద్దరూ చేతులు కలిపి ఒకరికొకరు చేయూతనందించుకొంటూ తమకి చెందిన కంపెనీలలో నష్టాల్లో ఉన్న కొన్నిటిని మళ్ళీ చక్కబెట్టుకోవచ్చును. ఇదివరకే అనిల్‌ అంభానీకు చెందిన మ్యూచ్‌ఫండ్ సంస్థలలో ముకేష్ కంపెనీలు దాదాపు 800 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.   ఇప్పుడు వారిరువురి మద్య ఏర్పడిన సహృద్భావా వాతావరణంతో వారిరువురు కలిసి మరిన్నివ్యాపార ఒప్పందాలు చేసుకొన్నా ఆశ్చర్యం లేదు. ఇది వారికే కాక వారి సంస్థలలో షేర్ల రూపంలో పెట్టుబడిన మదుపరులకు లాభాలను ఆర్జించి పెట్టే అవకాశం కూడా ఉంది. ఏమయినప్పటికీ ఈ అన్నదమ్ముల అనుబంధం ఎంత దృడంగా ఉంటే అంత అందరికీ లాభాలు పండుతాయి.

తలసానికి టీఆర్ఎస్ ప్రతి సవాల్

        దమ్ముంటే కేసీఆర్ సికింద్రాబాద్ లో పోటీ చేసి గెలవాలని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విసిరిన సవాల్ మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు మండిపడుతున్నారు. కేసీఆర్ ను సికింద్రాబాద్ నుండి పోటీచేయాలని సవాల్ విసురుతున్న శ్రీనివాస్ యాదవ్ చేతనయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిద్దిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఒప్పించాలని కొప్పుల ఈశ్వర్ ప్రతి సవాల్ విసిరారు. ''2004లో మా టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ చేతిలో దారుణంగా ఓడిపోయావు'' అలాంటి నీవు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ చేయడం విడ్డూరంగా ఉంది. కేసీఆర్ స్థాయికి నీవు సరిపోవు. కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని ఆయన అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ ను వదలని జగన్ పార్టీ

        వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్, దివంగత ఎన్టీఆర్ ను తమ పార్టీ కోసం తెగవాడేసుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో వైఎస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఫ్లెక్సీ పెట్టడం పెద్ద దుమారం రేపింది. దీంతో ఆ తరువాత దానిని తొలగించారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను పెట్టి షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేశారు.   జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టి నాలుగురోజులు గడవక ముందే సీనియర్ ఎన్టీఆర్ ను కూడా వాడేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి సామాన్యులకు పనికివచ్చిన పథకాలు రెండే రెండు అవి ఒకటి ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలోబియ్యం, రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అని ప్రకటించుకున్నారు. అసలు ఈ పార్టీకి, ఎన్టీఆర్ వున్న లింకేంటో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు.