చీలిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్

  సిబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో నాలుగవ ముద్దాయిగా రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేరును జతచేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ రెండుగా చీలిపోయింది. సబితా ఇంద్రారెడ్డిని దాల్మియా సిమెంట్స్ కు సానుకూలంగా ఫైళ్ళపై సంతకాలు చేశారని సిబీఐ ఆరోపించింది. ఈ విషయంలో సబితా ఇంద్రా రెడ్డికి వెన్నుదన్నుగా కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి, జె.గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ బాసటగా నిలిచారు. సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి అని, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే ఆమె ఆ ఫైళ్ళపై సంతకాలు చేశారని వీరు అంటుండగా, జె.సి. దివాకర్ రెడ్డి మాత్రం ఛార్జిషీట్లలో ఉన్న మంత్రుల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని, వై.ఎస్. రాజశేఖరా రెడ్డి చెప్పినంత మాత్రాన మంత్రులు ఫైళ్ళపై సంతకాలు చేయడం తప్పుపడుతున్నారు. తాను వై.ఎస్. క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా ఇలాంటి ఫైళ్ళపై సంతకాలు చేయడానికి నిరాకరించి ఫైళును వెనక్కు పంపినట్లు తెలిపారు. అలాగే సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని, రాజీనామా చేయాలో వద్దో హోమమంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించుకోవాలని అంటున్నారు.

నివాళులు అర్పించడంలో కూడా రాజకీయం

  ఆదివారం 14 ఏప్రిల్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన టిడిపి నేత మోత్కుపల్లి నరశింహ, ఎర్రబెల్లి దయాకర్ లకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయమై తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ కు నివాళులు అర్పించిన తరువాత మోత్కుపల్లి నరసింహ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాము ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తే తమను కోదండరాం అవమానించారని, తెలంగాణా జెఎసి చైర్మన్ కోదండరాం ఉద్యమం పేరిట కోట్లాది రూపాయలు దండుకున్నారని, ప్రొఫెసర్ గా ఉండి ఒక్క విద్యార్థికీ పాఠం చెప్పని కోదండరాం ఉద్యమం చాటున కొన్ని పార్టీలను బలోపేతం చేసేందుకే పనిచేస్తున్నారని, దళితులను ఉద్యమానికి దూరం చేస్తున్న కోదండరాం కు వ్యతిరేకంగా ఎస్సీలంతా ఏకం కావాలని, గతంలో దళితమంత్రిని కూడా కించపరిచేలా కోదండరాం మాట్లాడిన విషయం గమనించాలని, అంబేద్కర్ విగ్రహానికి దండ వేసే అర్హత కోదండరాం కు లేదని, అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించే సందర్భంగా రాజకీయాలకు పాల్పడిన ఘనత కోదండరాంకే దక్కుతుందని మోత్కుపల్లి కోదండరాంపై విరుచుకుపడ్డారు.

అనం మాటల యుద్ధం అందుకే మొదలు పెట్టారా

  ఆర్ధిక మంత్రి రామనారాయణరెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డిపై అతని కుటుంబ సభ్యులపై చేసిన తీవ్రవిమర్శలు ఊహించినట్లే కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్య మంటలు రేపాయి. దానికి కాంగ్రెస్ నేతలు ఒకరొకరిగా తమవంతు వ్యాక్యానాలు, విమర్శలు జోడిస్తూ ఆ మంటలు చల్లారకుండా చూస్తున్నారు. అయితే ఇది యాదృచ్చికంగా మొదలుపెట్టిన యుద్ధం మాత్రం కాదని చెప్పవచ్చును. తీవ్ర సమస్యలలో చిక్కుకొని ప్రతిపక్షాల దాడికి విలవిలలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తనకి బాగా అబ్బిన విద్యనే మళ్ళీ మరో మారు లాఘవంగా ప్రదర్శించి ఊహించిన ఫలితాలు రాబట్టిందని చెప్పవచ్చును.   పెరిగిన కరెంటు చార్జీలపై ప్రతిపక్షాలన్నీ ఐకమత్యంగా ప్రభుత్వంపై చేస్తున్నపోరాటాన్నిఅలాగే దీర్ఘకాలం కొనసాగిస్తే ప్రజలలో అది మరింత ప్రభుత్వ వ్యతిరేఖత పెంచుతుందని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల, మీడియా, మరియు ప్రతిపక్షాల దృష్టిని మళ్ళించగల అంశం కోసం ఎదురు చూస్తుంటే, సీబీఐ చార్జ్ షీటు నెత్తి మీద పిడుగులా పడింది. దానితో కాంగ్రెస్ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి దూకినట్లయింది. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన నాటి నుండి ఒక సమస్య నుండి మరో సమస్యలోకి పయనిస్తున్నకాంగ్రెస్ ప్రభుత్వం, నెత్తిన పిడుగులా పడిన ఊహించని ఈ సమస్యకు మొదట దిగ్భ్రాంతి చెందినా, తరువాత మెల్లగా కోలుకొని తన కాంగ్రెస్ మార్క్ తెలివి తేటలు ప్రదర్శించింది.   ఈ ఆంశంలోనే డా.రాజశేఖర్ రెడ్డి, అతని కొడుకు జగన్ మోహన్ రెడ్డి అవినీతి భాగోతాలు కూడా ఇమిడి ఉండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు వారిని విమర్శించడం ద్వారా ప్రతిపక్షాలన్నిటికీ పని కల్పించడమే కాకుండా, అందరి దృష్టిని మళ్లించగలిగింది. ఇప్పుడు అందరి దృష్టీ మంత్రి ఆనం రామి నారాయణ రెడ్డి చేసిన తీవ్రవిమర్శల మీద, దానికి వస్తున్న ప్రతిస్పందన మీద ఉంది తప్ప, దీనికి ప్రధాన కారణమయిన ‘సీబీఐ చార్జ్ షీటు-హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని పదవి నుండి తొలగించాలనే డిమాండ్’ మీద లేదిప్పుడు.   ఇదే విధంగా ఆమె విషయం మరికొంత కాలం నాన్చగలిగితే ఆ తరువాత ఆమెను కూడా ధర్మాన ప్రసాదరావులాగే వెనకేసుకు రావడం పెద్ద కష్టమేమి కాదని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును. దీనిని బట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించలేదేమో కానీ, తన సమస్యలను మాత్రం ఈ విధంగా చాలా తెలివిగా చాకచక్యంగా పరిష్కరించుకోగలదని అర్ధం అవుతుంది.

ఉపఎన్నికలు లేనట్టే ..

ఢిల్లీలోని ఎపిభవన్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ, కేంద్రమంత్రి పసబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా పార్టీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, స్పీకర్ నిర్ణయాధికారాలపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోలేదని, సాధారణంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన తరువాత ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి పంపుతారని, సార్వత్రిక ఎన్నికలకు ఏడాది గడువుండగా శాసనసభ స్థానాలకు ఖాళీ ఏర్పడితే ఉప ఎన్నికలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2006 - 2011 మధ్యకాలంలో 76 ఉపఎన్నికలు వచ్చాయని, మొత్తం 294 స్థానాల్లో మూడోవంతు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయని, పదేపదే ఉపఎన్నికలు రాకుండా అడ్డుకునే అధికారాలు ఎన్నికల సంఘానికి లేవనీ, దీనికి సంబంధించి ఏదైనా చట్టం కేంద్రం రూపొందించాలని తెలిపారు.

100 మంది అభ్యర్థుల ఎంపికలో లోక్ సత్తా సమాలోచనలు

  2014 ఎన్నికలకు లోక్ సత్తా పార్టీ నుండి కనీసం 100 మంది అభ్యర్థులను నిలపాలని పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ కసరత్తు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్, కటారి శ్రీనివాసరావు లు పాల్గొన్నారు. వీలైనంత త్వరలో 40,50 స్థానాలకు అభ్యర్థులకు గుర్తించాలని, ఈసారి కనీసం  వంద స్థానాల్లో పోటీ చేయాలని, ఎంపికైనవారు ఎన్నికలనాటికి పార్టీ అంచనాలను అందుకోలేకపోతే మార్పుచేర్పులు చేద్దామని, మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి త్యాగానిరతులైన నేతలు ఇప్పుడూ ఉన్నారని నిరూపిద్దామని, పార్టీ లక్ష్యసాధనకు, దేశ నిర్మాణానికి ఈ ఏడాది విజయనామ సంవత్సరం కావాలని జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. కటారి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధ్యక్షుడు సూచించిన మేరకు లక్షమంది క్రియాశీల, పదిలక్షల సాధారణ సభ్యత్వాల లక్ష్యాన్ని రెట్టింపు చేయగాలామనే ఆశాభావాన్ని, చట్టసభల ఎన్నికల్లో భారీ ఫలితాల సాధనకు కృషి చేస్తామని, ప్రజాసమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు.

వైఎస్సార్సీపీ లోకి సమైక్యవాది అడుసుమిల్లి

  అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతున్న వైఎస్సార్సీపీ లోకి మరొక మాజీ టిడిపి, కాంగ్రెస్ అభిమాని అడుసుమిల్లి జయప్రకాష్ చేరుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. టిడిపి ఆవిర్భావంతోటే (1983)విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన అడుసుమిల్లి జయప్రకాష్ త్వరలోనే వైఎస్సార్సీపీ లో చేరనున్నట్లు సమాచారం. 1994 నుంచి టిడిపి అర్భన్ అధ్యక్షుడిగా, 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేసిన అడుసుమిల్లి జయప్రకాష్ నాదెండ్ల టిడిపిలో నుంచి బయటకు వచ్చేసిన తరువాత కొన్ని రోజుల పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. హరికృష్ణ ప్రోద్భలంతో తిరిగి టిడిపిలో చేరినా ఎన్నికల పొత్తులో భాగంగా బిజెపికి అవకాశం ఇవ్వడంతో అలిగిన అడుసుమిల్లి కాంగ్రెస్ అభిమానిగా, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు అడుసుమిల్లి జయప్రకాష్. తాజాగా కాంగ్రెస్ కు కూడా గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ లో చేరనున్నట్లు తెలుస్తుంది. 

కెసిఆర్ వలలో టి.కాంగ్రెస్ నేతలు

  కెసిఆర్ తెలంగాణా కాంగ్రెస్ నేతలను తన మాటలగారడీలో పడేస్తున్నారా ...? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. శనివారం మందా జగన్నాథం కెసిఆర్ కెసిఆర్ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. తాజాగా ఆదివారం తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె. కేశవరావు ఇంటికి వెళ్ళి కెసిఆర్ చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా కెసిఆర్ టి.కాంగ్రెస్ నేతలను టి.ఆర్.ఎస్. లో చేరాలని, మీ స్థానాలు పదిలంగా ఉంటాయని, ప్రత్యేక తెలంగాణా కోరుకునే వారంతా ఒక తాటిపైకి రావాలని కె.కేశవరావును కోరినట్లు తెలిసింది. కెసిఆర్ తో చర్చల వివరాలను కేశవరావు వెల్లడిస్తూ కెసిఆర్ టి.కాంగ్రెస్ నేతలను టి.ఆర్.ఎస్. లోకి ఆహ్వానించారని, కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వదు కాబట్టి, తెలంగాణా రాష్ట్రం కోరుకునే వారంతా తమ పార్టీలో చేరమన్నారని, దీనిపై టి.కాంగ్రెస్ నేతలంతా సమావేశమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రజలతో డబల్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్

  ఆర్ధిక శాఖా మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన తరువాత, కాంగ్రెస్ మంత్రులు ఒకరొకరిగా ఆయనతో గొంతు కలుపుతున్నారిప్పుడు. మంత్రి ఆనం జగన్ మోహన్ రెడ్డి జైలు నుండే పార్టీని చక్క బెడుతున్నాడని ప్రకటించిన తరువాత, తెదేపా ఆయన మాటలు తము చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తున్నాయని, ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని జగన్ మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న చంచల్ గూడా జైలు సిబ్బందిపై, ముఖ్యంగా జైలు సుపరిండెంట్ సైదయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఈ విషయంలో స్పందించలేదు. కానీ, తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కూడా తెదేపా ఆరోపణలను దృవపరుస్తూ జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలును తన పార్టీ కార్యాలయంలా మార్చేశాడని ఆరోపించారు. అదే సమయంలో, వైకాపా డబ్బు మదంతో మిడిసిపడుతోందని, ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వచ్చేది దోపిడీ రాజ్యమని తీవ్ర విమర్శలు కూడా చేసారు.   ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిని అతని కుటుంబ సభ్యులను, అతని పార్టీని ప్రజల ముందు తీవ్రంగా విమర్శిస్తూనే, మరో పక్క అతనికి జైల్లో రాచమర్యాదలకు లోటు లేకుండా చూసుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు, నేడు కాకపోతే రేపయినా జగన్ మోహన్ రెడ్డి అవసరం తమ పార్టీకి ఉంటుందనే దూరాలోచనతోనే ఈ విధంగా ప్రజలతో డబల్ గేమ్ ఆడుతున్నారేమో.

కాంగ్రెస్ కు ముందు నుయ్యి వెనుక గొయ్యి

  హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు అవడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో కళoకితులుగా ముద్రపడిన తమ మంత్రులను వదులుకోవాలా లేక వారిని కాపాడుకోవడానికి తమ పార్టీ పరువు పణంగా పెట్టాలా అనే విషయాన్నీ తేల్చుకోలేక కాంగ్రెస్ పార్టీ చాలా సతమతమవుతోంది. వారిని సీబీఐకి బలిఇస్తే ఆ ప్రభావం మిగిలిన మంత్రుల మీద పడుతుంది. అంతే కాకుండా కాంగ్రెస్ తన అవినీతిని తానే స్వయంగా అంగీకరించినట్లవుతుంది. పార్టీ తమను కాపాడదనే భావం మిగిలిన మంత్రులలో కూడా కలిగితే, ఏ ఫైలు మీద సంతకం చేస్తే ఏమి మెడకు చుట్టుకొంటుందో అనే భయం మంత్రులలో ఏర్పడి అది ప్రభుత్వపనితీరు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక, దైర్యంచేసి వారిని వెనకేసుకు వద్దామననుకొన్నా, ప్రతిపక్షాలు వారిని పదవుల నుండి తొలగించమని చేస్తున్న తీవ్ర ఒత్తిడిని తట్టుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టమే. వారి ఒత్తిడిని ఎలాగో భరించినప్పటికీ, ‘కాంగ్రెస్ అవినీతి-కళoకిత మంత్రుల’ గురించి ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న ప్రచారం వలన, ప్రజలలో ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఉన్నవ్యతిరేఖత మరింత పెరిగే అవకాశం ఉంది. అందువలన ఈ సమస్య నుండి ఏదోవిధంగా బయట పడకపోతే వచ్చే ఎన్నికలలో అసలుకే ఎసరు రావచ్చును. అయితే అందుకు కాంగ్రెస్ వద్ద ఉపాయం ఏది లేదు. కానీ, ఈ అంశంపై నుండి ప్రజల దృష్టిని మళ్ళించే విధంగా ఏదో ఒక సరికొత్త నాటకం మొదలుపెట్టే అవకాశం ఉంది.

మందా జగన్నాథాన్ని వెళ్ళిపోమన్న అరుణ

        కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలనుకునేవారు ఎంత త్వరగా వెళితే అంత మంచిదని మంత్రి డికె అరుణ అన్నారు. జిల్లాలోని గద్వాల్‌లో ఆదివారం డికె అరుణ బస్సు యాత్ర ప్రారంభమైంది. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం పార్టీని వీడతారనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతుందని చెప్పారు. పార్టీని విడిచి పెట్టి వెళ్లాలనుకునే వారు త్వరగా వెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసే విషయంలో తాము వెనుకబడ్డామన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకే తాను ఈ బస్సు యాత్ర చేపట్టానని అరుణ తెలిపారు. ప్రచారంలో వెనుకబడినందునే తాను యాత్ర చేస్తున్నానన్నారు. జిల్లాలో తాను ఏడు రోజుల పాటు ఈ యాత్ర చేస్తానన్నారు.

కోదండరామ్ కు ఆ అర్హత లేదు

      అంబేద్కర్ జయంతి సంధర్బంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన టిడిపి నేత నరసింహులు, తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విగ్రహానికి పూల మల వేయడానికి వచ్చిన టిడిపి నేతలకు వ్యతిరేకంగా ఐకాస కార్యకర్తలు నినాదాలు చేశారు.   అంబేద్కర్ విగ్రహానికి వద్దకు వచ్చే అర్హత కోదండరామ్ కు లేదని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు.  ఒక్క రోజు కూడా పాఠం చెప్పకుండా, లక్ష రూపాయల జీతం తీసుకుంటూ కోదండరామ్ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

టీఆర్ఎస్ లోకి మందా జగన్నాధం!

        మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాధం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. శనివారం పాలమూరుకు వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మూడున్నర గంటలపాటు భేటీ అయ్యారు. ఆయన ఈ నెల 27న ఆర్మూర్ లో జరగనున్న టీఆర్ఎస్ ఆవిర్బావ సభలో పార్టీలో చేరతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా మరికొంత సమయం పట్టవచ్చని, కాకపోతే ఆయన పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు ఎంపీలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. గత మూడేళ్లుగా తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడుతున్న మందా కాంగ్రెస్ తెలంగాణను పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు త్వరలో కేసీఆర్ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

వలసలతో కాంగ్రెస్ ప్రక్షాళనం

  కాంగ్రెస్ యంపీ మందా జగన్నాధం తెరాసా అధినేత కేసీఆర్ తో నిన్న 3గంటలు మంతనాలు చేశారు. ఆయన త్వరలో తెరాసాలో జేరబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయనతో బాటు మరో ముగ్గురు కాంగ్రెస్ యంపీలు వివేక్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి మరికొందరు శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారెవరూ ఆ వార్తలను ఇంత వరకు ఖండించకపోవడంతో వారు తెరాసాలోకి మారడం దాదాపు ఖాయమయినట్లే అనుకోవచ్చును. ఈ వార్తల పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం మొదలయినప్పటికీ, అది తాత్కాలికమే. త్వరలోనే వారందిరిపైనా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ మీడియా ముందుకి రావడం కూడా మనం చూడబోతున్నాము.   రాహుల్ గాంధీ పార్టీలోకి కొత్తరక్తం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నఈతరుణంలో, తెలంగాణా అంశంతో పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నమందా, కేశవ్ రావు,గుత్తా, రాజయ్య వంటివారు తమంతట తామే పార్టీ వీడుతున్నపుడు దానిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందే తప్ప అటువంటి వారికోసం ప్రాకులాడకపోవచ్చును. ఈ విషయంలో అందరికంటే ముందే జ్ఞానోదయం పొందిన మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్ ఇద్దరూ కూడా బహుశః అందుకే అకస్మాత్తుగా అధిష్టానానికి అనుకూలంగా తమ తెలంగణా పల్లవిలో కూడా మార్పులు చేసుకొన్నారు. ఇక ముందు కూడా, కాంగ్రెస్ తమ పార్టీ నుండి తెరాసాలోకి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లదలచిన వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయకపోవచ్చును.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చెప్పినట్లు పార్టీను వీడుతున్నవారు తరువాత తీరికగా పశ్చాత్తాపపడతారని చెప్పిన మాటలు మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజమని చెప్పవచ్చును. ఎందుకంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోవారనుభవిస్తున్నస్వేచ్చాస్వాతంత్ర్యాలు వారికి మరే ఇతర పార్టీలోను లభించవని ఖచ్చితంగా చెప్పవచ్చును.   తెరాసలో చేరిన వారు కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినవారు జగన్ మరియు అతని కుటుంబ సభ్యులకు సలాములు చేస్తూ, వారి ముందు చేతులుకట్టుకొని అణిమణిగిఉండక తప్పదు. కాంగ్రెస్ పార్టీలో అవధులు లేని స్వేచ్చా స్వాతంత్రాలు అనుభవించి, తమకంటూ ఒక ప్రత్యేక గౌరవం, ప్రత్యేక వర్గాలు కలిగిఉండే కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు సరికొత్త రాజకీయవ్యవస్థలో, సరి కొత్త వాతావరణంలో తప్పనిసరిగా ఇమడవలసి ఉంటుంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోచేరే కాంగ్రెస్ నాయకులు, వివిదపార్టీల నుండి ఆ పార్టీలోకి వచ్చిచేరుతున్నతమ రాజకీయ ప్రత్యర్దులతోనే చేతులు కలిపి ముందుకు సాగడం చాలా ఇబ్బందికరమయినప్పటికీ తప్పనిసరి అవుతుంది.   ఏమయినప్పటికీ ఈ వలసలవల్ల కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ, ఆ పార్టీ అంతర్గతంగా ప్రక్షాళన అవుతుంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఆ పార్టీ తనను తానూ పునర్నిర్ముంచుకొనే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం ఎంత త్వరగా జరిగితే ఆ పార్టీకి అంత మేలు చేస్తుంది.

ఉస్మానియాలో మళ్ళీ ఉద్రిక్తతలు

  తెలంగాణ ఉద్యమాలకు ప్రాణం పోసే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువే. కొద్దిరోజుల క్రితం విశ్వవిద్యాలయం హాస్టల్ గోడలపై ‘తెలంగాణ కోసం సాయుధ పోరాటానికి సిద్ధం కండి’ అంటూ కొన్ని వాల్ పోస్టర్స్ వెలియడంతో విద్యార్దులతో సహా పోలీసులు కూడా ఉలికిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సాయి అలియాస్ చిన్నఅనే విద్యార్ధిని ప్రశ్నించడానికి తమతో తీసుకువెళ్ళడంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయి హైదరబాద్ నల్లకుంట ప్రాంతంలో అనుష్క డిజైనర్స్ అనే ప్రింటింగ్ ప్రెస్ నడిపిస్తూన్నాడని సమాచారం. విశ్వవిద్యాలయంలో జరిగే తెలంగాణ ఉద్యమాలకి అతనే అవసరమయిన బ్యానర్లు, పోస్టర్లు డిజైన్ చేసి ప్రింటింగ్ చేస్తాడని తెలియడంతో పోలీసులు అతనిని ప్రశ్నించడానికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణ విద్యార్ధి సంఘంలో చురుకుగా పాల్గోనే మరో విద్యార్ధి కోటా శ్రీనివాస్ ను కూడా పోలీసులు తమతో తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకొని పారిపోయాడని ఓయు.జెయేసి అధికార ప్రతినిధి యం..క్రిశాంక్ తెలిపాడు. విద్యార్దులందరూ కూడా తెలంగాణ కోరుకొంటున్నపటికీ, ఎవరూ కూడా అటువంటి తీవ్రఆలోచనలు చేయరని, బహుశః వామ పక్షాలకు చెందిన కార్యకర్తలలెవరో ఆ పోస్టర్స్ పెట్టి ఉండవచ్చునని అతను అభిప్రాయ పడ్డాడు.

వైయస్సార్ తో కాంగ్రెస్ తెగతెంపులకి రెడీ

  నిన్న నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం, అతని కొడుకు జగన్ మోహన్ రెడ్డిని ఉరి తీసినా తప్పులేదని చెప్పడంతో సహజంగానే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతల నుండి ఎదురు దాడి మొదలయింది. ఇక సాక్షి టీవీ చానెల్ అయితే మరో అడుగు ముందుకు వేసి, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆనం రామనారాయణరెడ్డి ‘ఆయన లేని లోటు తీరదని, జగన్ మోహన్ రెడ్డి తమకు నాయకత్వం వహించాలంటూ కన్నీరు పెట్టుకొని మరీ చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేసి, నాడు మంచివాడయిన మనిషి నేడు హట్టాతుగా ఎందుకు చెడ్డవాడయిపోయాడో తెలపాలంటూ చురకలు కూడా వేసింది.   ఇక, ఈ వేడి చల్లారక మునుపే పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు మంత్రి ఆనం మాట్లాడిన మాటలలో తప్పేమీ లేదని అంటూనే, ఆయన మాటలకి తను కూడా మరో నాలుగు ముక్కలు కలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డబ్బుమదంతో దేనినయినా సాదించగలనని భ్రమల్లో అహంకారంతో విర్రవీగుతోందని, కానీ ప్రజల నుండి అధికారం మాత్రం కొనుక్కోలేదని గ్రహించే సమయం వస్తుందని, అప్పుడు కానీ ఆ పార్టీకి బుద్ధి రాదని ఆయన అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చేది దోపిడీ రాజ్యమని దానినే ఇప్పుడు షర్మిల రాజన్నరాజ్యం అని వేరేలా చెపుతోందని, ఆమె మాటలను ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.   ఇంత వరకు వైయస్సార్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏవిధంగా విమర్శలు చేసినా దానికి ప్రాదాన్యం ఉండకపోవచ్చును. కానీ శంఖంలో పోస్తేనే నీళ్ళు తీర్ధం అయినట్లు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ స్వయంగా ఆనం మాటలకు వత్తాసు పలకడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డితో, అతనివల్ల పార్టీకి వచ్చిన గొప్ప పేరు ప్రతిష్టలతో(?) సంబంధాలు తెంపుకోవడానికి సిద్దపడినట్లే భావించవచ్చును. గనుక, ఇక మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా త్వరలో ఒకరొకరు జగన్ మోహన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల మీద, అతని పార్టీ మీద దాడి మొదలుపెట్టవచ్చును. కాంగ్రెస్ పార్టీ గనుక ఒకసారి మైండులో ఫిక్స్ అయితే ఇక జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే జైలు నుండి బయట పడటం గురించి ఆలోచనలు మానుకోవచ్చును.

సబితకు సెల్యూట్ ఎలా చేస్తారు

        అవినీతి మంత్రి సబితను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సీబీఐ చార్జిషీట్‌లో ఏ4 నిందితురాలుగా ఉన్న సబితకు పోలీసులు సెల్యూట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న విపక్షాలను కించపర్చేలా సీఎం కిరణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.   రాజకీయ, ఆర్థిక నేరస్తుడు జగన్ అని నారాయణ దుయ్యబట్టారు. జైల్లో ఉన్న అలాంటి వ్యక్తి వద్దకు వెళ్లి బి పారాలు అడుక్కునే స్థితికి రాజకీయాలు దిగజారడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ పార్టీలోకి వెళ్లిన వారికి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు.

మా టీవీ దాడి వెనుక ఎవరున్నారో తెలుసు: అల్లు అరవింద్

        నిన్న మా టీవీ మరియు రామానాయుడు స్టూడియోల మీద కొందరు తెలుగు టీవీ కళాకారులు దాడి చేసారు. తెలుగు చానళ్ళలో వస్తున్న అనువాద సీరియల్స్ వెంటనే నిలిపివేయాలని వారు చాలా రోజుల నుండి కోరుతున్నారు. తమిళ అనువాద సీరియల్స్ ప్రసారం చేసే జెమినీ టీవీతో సహా మిగిలిన అన్ని చాన్నాళ్ళ యాజమాన్యాలు ఒప్పుకొన్నపటికీ, అచ్చ తెలుగు టీవీచానల్ అని చెప్పుకొనే మాటీవీ, తెలుగు సినీరంగంలో అనేక పురస్కారాలు అందుకొన్న డా.రామానాయుడికి చెందిన స్టుడియోలో మాత్రం తమిళ అనువాద సీరియల్స్ ప్రసారం, షూటింగ్ కార్యక్రమాలు జరుగుతుండటం వారికి ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనబడుతోంది.   మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరయిన అల్లు అరవింద్ నిన్న తమ కార్యాలయం మీద దాడి జరిగిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘మూడు రోజుల క్రితమే వారితో చర్చలు జరిగాయి. నడుస్తున్న సీరియల్స్ ని అర్ధంతరంగా ఆపడం నిర్మాతలకు నష్టమే కాకుండా, అనేక మంది కళాకారులు సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడతారు. ఇదే విషయం వారు కూడా అంగీకరించి వీలయినంత త్వరలోముగించమని చెప్పి వెళ్ళిపోయారు. కానీ, మళ్ళీ ఈ రోజు వారు అకస్మాత్తుగా మా కార్యాలయం మీద దాడి చేసారు. దీనివెనుక కొందరు వ్యక్తుల ప్రోత్సాహం ఉందని మాకు తెలుసు. కానీ వారు ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడితే వారే ఇబ్బందులు పడతారని తెలుసుకోవాలి,” అని అన్నారు.   ఆయన హెచ్చరించినట్లే ఈరోజు మాటీవీపై దాడి చేసినవారిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్147, 148, 149, 341, 452, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అల్లు అరవింద్ ‘తెర వెనుక ఎవరున్నారో తనకు తెలుసు’నని చెప్పడం బహుశః దర్శకుడు దాసరి నారాయణ రావును ఉద్దేశించే అయి ఉండవచ్చును. ఎందుకంటే, రాష్ట్రంలో సినిమా ధియేటర్లన్నీ ఓ నలుగురు పెద్ద నిర్మతల గుప్పిట్లో ఇరుక్కుపోయాయని, అదే విధంగా ఆ నలుగురు సినిమా రంగంలో మర్రి వృక్షంలా విస్తరించిపోయి మరెవరినీ బ్రతకనీయకుండా చేస్తున్నారని దాసరి గతంలో తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ నలుగురిలో రామానాయడు, అల్లు అరవింద్ కూడా ఉన్నారని బహిరంగ రహస్యమే.   బహుశః ఆ కోపంతోనే దాసరి నారాయణరావు ‘ఆ నలుగురిని’ వ్యతిరేఖించే మరికొందరు చిన్ననిర్మాతలతో కలిసి ఈ విధంగా టీవీ కళాకారులను వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారని అల్లు అరవింద్ అభిప్రాయపడుతున్నట్లు ఉంది. అదీగాక, ఈ ఉద్యమానికి దాసరి నారాయణ రావు మొదటి నుండి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు కూడా. ఏమయినప్పటికీ, తెలుగు టీవీ చానళ్ళలో తెలుగు కార్యక్రమాలు రూపొందించుకోలేని దౌర్భాగ్యం మనకి తప్పట్లేదు. అయినా అందుకు వారెవరూ కూడా సిగ్గుపడట్లేదు.