సబితకు సెల్యూట్ ఎలా చేస్తారు

        అవినీతి మంత్రి సబితను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సీబీఐ చార్జిషీట్‌లో ఏ4 నిందితురాలుగా ఉన్న సబితకు పోలీసులు సెల్యూట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న విపక్షాలను కించపర్చేలా సీఎం కిరణ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.   రాజకీయ, ఆర్థిక నేరస్తుడు జగన్ అని నారాయణ దుయ్యబట్టారు. జైల్లో ఉన్న అలాంటి వ్యక్తి వద్దకు వెళ్లి బి పారాలు అడుక్కునే స్థితికి రాజకీయాలు దిగజారడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగన్ పార్టీలోకి వెళ్లిన వారికి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన వ్యాఖ్యానించారు.

మా టీవీ దాడి వెనుక ఎవరున్నారో తెలుసు: అల్లు అరవింద్

        నిన్న మా టీవీ మరియు రామానాయుడు స్టూడియోల మీద కొందరు తెలుగు టీవీ కళాకారులు దాడి చేసారు. తెలుగు చానళ్ళలో వస్తున్న అనువాద సీరియల్స్ వెంటనే నిలిపివేయాలని వారు చాలా రోజుల నుండి కోరుతున్నారు. తమిళ అనువాద సీరియల్స్ ప్రసారం చేసే జెమినీ టీవీతో సహా మిగిలిన అన్ని చాన్నాళ్ళ యాజమాన్యాలు ఒప్పుకొన్నపటికీ, అచ్చ తెలుగు టీవీచానల్ అని చెప్పుకొనే మాటీవీ, తెలుగు సినీరంగంలో అనేక పురస్కారాలు అందుకొన్న డా.రామానాయుడికి చెందిన స్టుడియోలో మాత్రం తమిళ అనువాద సీరియల్స్ ప్రసారం, షూటింగ్ కార్యక్రమాలు జరుగుతుండటం వారికి ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనబడుతోంది.   మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరయిన అల్లు అరవింద్ నిన్న తమ కార్యాలయం మీద దాడి జరిగిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘మూడు రోజుల క్రితమే వారితో చర్చలు జరిగాయి. నడుస్తున్న సీరియల్స్ ని అర్ధంతరంగా ఆపడం నిర్మాతలకు నష్టమే కాకుండా, అనేక మంది కళాకారులు సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడతారు. ఇదే విషయం వారు కూడా అంగీకరించి వీలయినంత త్వరలోముగించమని చెప్పి వెళ్ళిపోయారు. కానీ, మళ్ళీ ఈ రోజు వారు అకస్మాత్తుగా మా కార్యాలయం మీద దాడి చేసారు. దీనివెనుక కొందరు వ్యక్తుల ప్రోత్సాహం ఉందని మాకు తెలుసు. కానీ వారు ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడితే వారే ఇబ్బందులు పడతారని తెలుసుకోవాలి,” అని అన్నారు.   ఆయన హెచ్చరించినట్లే ఈరోజు మాటీవీపై దాడి చేసినవారిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్147, 148, 149, 341, 452, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అల్లు అరవింద్ ‘తెర వెనుక ఎవరున్నారో తనకు తెలుసు’నని చెప్పడం బహుశః దర్శకుడు దాసరి నారాయణ రావును ఉద్దేశించే అయి ఉండవచ్చును. ఎందుకంటే, రాష్ట్రంలో సినిమా ధియేటర్లన్నీ ఓ నలుగురు పెద్ద నిర్మతల గుప్పిట్లో ఇరుక్కుపోయాయని, అదే విధంగా ఆ నలుగురు సినిమా రంగంలో మర్రి వృక్షంలా విస్తరించిపోయి మరెవరినీ బ్రతకనీయకుండా చేస్తున్నారని దాసరి గతంలో తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ నలుగురిలో రామానాయడు, అల్లు అరవింద్ కూడా ఉన్నారని బహిరంగ రహస్యమే.   బహుశః ఆ కోపంతోనే దాసరి నారాయణరావు ‘ఆ నలుగురిని’ వ్యతిరేఖించే మరికొందరు చిన్ననిర్మాతలతో కలిసి ఈ విధంగా టీవీ కళాకారులను వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారని అల్లు అరవింద్ అభిప్రాయపడుతున్నట్లు ఉంది. అదీగాక, ఈ ఉద్యమానికి దాసరి నారాయణ రావు మొదటి నుండి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు కూడా. ఏమయినప్పటికీ, తెలుగు టీవీ చానళ్ళలో తెలుగు కార్యక్రమాలు రూపొందించుకోలేని దౌర్భాగ్యం మనకి తప్పట్లేదు. అయినా అందుకు వారెవరూ కూడా సిగ్గుపడట్లేదు.

జగన్ కేసులో నాగార్జున నిందితుడే

        టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ నాగార్జున మీద సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో నాగార్జున కూడా నిందితుడు. దీనిని నేను ఆధారాలతో సహా నేను త్వరలోనే బయటపెడతానని రాజేంద్రప్రసాద్ అన్నారు. నిమ్మగడ్డను సాకుగా చూపి వైఎస్ జగన్ ను కలిసి వస్తున్నాడని, నిమ్మగడ్డ, నాగార్జునల వ్యాపార లావాదేవీలు అందరికీ తెలుసని అయితే దాంతో పాటు ఆయన జగన్ అక్రమాస్తులలో కూడా భాగస్వామి అని ఆరోపించారు. గత నాలుగురోజులుగా టీడీపీ నాగార్జునను టార్గెట్ గా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఆయన ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని , దానిని వైఎస్ హయాంలో క్రమబద్దీకరించుకున్నారని, దానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రచారం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే తన ఆస్తులన్నీ సక్రమం అని, కోర్టు కేసులున్న వాటి గురించి నేను మాట్లాడనని నాగార్జున అనగా, వాటి కాగితాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఒక షేర్ ఖాన్ కి పురస్కారం మరొకరికి తిరస్కారం

  అలనాటి మేటి బాలివుడ్ నటుడు ప్రాణ్ అత్యంత ప్రతిష్టాత్మకమయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించడం అందరికీ సంతోషం కలిగించింది. కొంచెం ఆలస్యమయినప్పటికీ ఆయనకి సముచిత గౌరవం దక్కిందని అందరూ కూడా చాలా సంతోషించారు. దాదాపు 5 దశాబ్దాలపాటు 400 హిందీ సినిమాలలో నటించిన ప్రాణ్ తన విశిష్టమయిన నటనతో ‘విలన్ పాత్రకి’ కూడా ఆరోజుల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆయన తన సుదీర్ఘ సినీ పయనంలో అనేక రకాలయిన పాత్రలు పోషించినప్పటికీ, విలన్ పాత్రలే ఆయనకు పేరు తెచ్చాయని చెప్పవచ్చును. వచ్చేనెల 3వ తేదీన భారతీయ సినీ పరిశ్రమ నూరు వసంతాల పండుగ చేసుకోనున్న సందర్భంగా, ఈ 93 సం.ల కురు వృద్దునికి కూడా ఆనాడే ఈ అవార్డును ప్రధానం చేయాలని నిర్ణయించారు.   ఆయన ‘70లలో విడుదలయిన జంజీర్ సినిమాలో షేర్ ఖాన్ పాత్ర పోషించారు. ఆ సినిమా ఆయనకే కాకుండా ఆయనతో కలిసి నటించిన అమితాబ్ బచ్చన్ కూడా చాలా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత తన పాత్రను సంజయ్ దత్త్ చేస్తున్నాడని తెలిసి ఆయన చాలా ఆనందించారు కూడా. కాకపోతే విచారకరమయిన విషయం ఏమిటంటే ఒక ఆయన సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను అందుకోబోతుంటే, సంజయ్ దత్త్ అక్రమాయుధాల కేసులో త్వరలో జైలుకి తిరిగి వెళ్లనున్నారు. ఒక షేర్ ఖాన్ తన జీవితంలో అత్యన్నత శిఖరాలు చేరుకొంటుంటే మరో షేర్ ఖాన్ తన జీవితంలో అత్యంత దుర్భరమయిన పరిస్థితిని ఎదుర్కోనబోవడం విధిలీల కాక మరేమిటి?

సోనియా, రాహుల్ నియోజకవర్గాలకు నిరంతర కరెంట్

  దేశమంతా విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్న దశలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు మాత్రం విద్యుత్ కోటలు లేకుండా నిరంతర కరెంట్ ఇస్తున్నారు ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (UPPCL)వారు. UPPCL మేనేజింగ్ డైరెక్టర్ ఎ.పి. మిశ్రను వివరణ కోరగా ఈ రెండు విఐపి నియోజకవర్గాలలో తీవ్ర విద్యుత్ కోతలు ఉన్నాయని, మిగతా ప్రాంతాలలోని రోటీన్ ఎడ్జస్ట్ మెంట్ ద్వారా ఈ నియోజకవర్గాలకు నిరంతర విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని, తమకి ఎవరూ ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి సతీమణి డింపుల్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నౌజ్ నియోజకవర్గంలో కూడా విద్యుత్ కోతలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మిగతా విఐపి లు ప్రాతినిథ్యం వహిస్తున్న వారి నియోజకవర్గాలలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తారా అని ప్రశ్నించగా సమాధానాన్ని దాట వేశారు. ఈ సంవత్సరం ఉత్తర ప్రదేశ్ లో విద్యుత్ ఉత్పాదన అంతంతమాత్రంగానే ఉంది. రోజుకు 11,500 మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉండగా కేవలం 8,000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అయినా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నియోజకవర్గాలకు విద్యుత్ లో కోతలు కొస్తే 2014 ఎన్నికల్లో మరి వీరి పరిస్థితి ఏమిటి?    

మీడియాపై రాములమ్మ రుసరుసలు

  మొన్నటి దాకా తన మెదక్ సీటుకి కేసీఆరే స్వయంగా ఎసరు పెట్టేట్లు ఉన్నాడని బెంగపెట్టుకొన్న తెరాస నేత విజయశాంతి, మొన్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం తరువాత రాబోయే ఎన్నికలలో తామిరువురము పోటీ చేస్తామని కేసీఆర్ ఆమె సమక్షంలో ప్రకటించిన తరువాత కొంచెం శాంతించింది. కానీ, ఆ ప్రకటన కూడా స్పష్టంగా లేకపోవడంతో ఇంకా ఆమెకు అనుమానంగానే ఉంది. తనకు మెదక్ నుంచి పార్టీ టికెట్ ఇస్తారా వేరే మరెక్కడికయినా తరిమేస్తారా? లోక్ సభకు టికెట్ అన్నాడా లేక శాసన సభకు టికెట్ అని ఆయన ఉద్దేశ్యమా? మాట నిలకడలేని కేసీఆర్ నిజంగా టికెట్ ఇస్తాడా లేక ఆఖరి నిమిషంలో హ్యాండిస్తాడా వంటి అనేక అనుమానాలు ఆమెకున్నాయి. ఇటువంటి సమయంలో ఆమెను కొందరు విలేకరులు ‘మీరు ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు?’ అని ప్రశ్నించేసరికి ఆమెకు పుండు మీద కారం చెల్లినట్లయింది. “నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తే మీకెందుకు అయినా నాకు లేని ఆత్రుత మీకెందుకు?” అని వారిపై రుసరుసలాడింది. నిజమే! కందకు లేని దురద కట్టి పీటకు ఎందుకు?

ప్రాణ్ కు అమితాబ్ శుభాకాంక్షలు

  బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు 2012 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎన్నిక చేసింది. ఎన్నో బాలీవుడ్ చిత్రాలలో కలిసి నటించిన బిగ్ బి అమితాబ్ ప్రాణ్ కు శుభాభినందనలు తెలిపాడు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో అమితాబ్, ప్రాణ్ గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. "ప్రాణ్ మంచి నటుడు, భారతీయ సినిమా ప్రపంచానికి అతను ఒక మూలస్తంభం వంటి వాడు, అతనికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా వుంది''. మరొక సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లోనూ ఈ విధంగా పోస్టింగ్ చేశాడు. "ప్రాణ్ ఈ అవార్డుకు అర్హుడు. తనకు ఆప్తమిత్రుడు, వ్యక్తిత్వంగల వ్యక్తి అని, అతను ఆరోగ్యంగా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, అతనిఇకి తన శుభాకాంక్షలు'' అని రాశాడు. అమితాబ్, ప్రాణ్ కలిసి నటించిన చిత్రాలలో జంజీర్, డాన్ మరపురాని చిత్రాలు

తెలంగాణ నాయకులపై కక్ష కట్టిన కిరణ్

        తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై కక్ష కట్టి తీవ్రమైన ఒత్తిళ్లకు గురి చేస్తున్నాడని పెద్దపల్లి ఎంపీ వివేక్ పేర్కొన్నారు. రెండు నెలలుగా తెలంగాణ గురించి పోరాడే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంత నాయకులను ముందు పెట్టి తమపై కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇస్తానని, కాంట్రాక్టులు ఇస్తానంటూ సీఎం ఎర వేస్తున్నాడన్నారు. జిల్లాలో నేదునూరి విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన యేండ్లు గడిచినా ఇంత వరకు గ్యాస్, నిధులు ఇప్పించలేదన్నారు. నేదునూరి గతి 'బీ'థర్మల్‌కు పట్టకూడదనే తాను కోల్ లింకేజికి డిమాండ్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు కేటాయించే విషయంలో ముఖ్యమంత్రి పక్షపాతానికి పాల్పడుతున్నారని, వెయ్యికోట్ల నిధులు వెచ్చిస్తే ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రాణహితకు నిధులు కేటాయించకుండా తిరుపతికి రూ.5వేల కోట్లు తీసుకువెళ్లారన్నారు.

విజయమ్మ రాజకీయాలపై పట్టు సాదించినట్లే

  వైయస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షులు విజయమ్మ రాజకీయాలలో ప్రవేశించిన కొత్తలోతన కొడుకు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో నిర్బంధించడం గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ, క్రమంగా రాజకీయాలపై పట్టు సాదిస్తున్న ఆమె ఇప్పుడు జగన్ విషయం పాదయాత్ర చేస్తున్న తన కుమార్తె షర్మిలకు అప్పగించి, తను ఇతర సమస్యల గురించి మాట్లడుతున్నారు. ఒక విధంగా వారిరువురు పని విభజన చేసుకొన్నారని భావించవచ్చును. తద్వారా వివిధ అంశాలకు ఏవిధంగా స్పందించాలో తెలుసుకొన్న విజయమ్మ ఇప్పుడు ప్రతీ విషయాన్ని రాజకీయ కోణంలో మాట్లాడగలిగే నేర్పు సంపాదించుకొన్నారు.   ఇటీవల తెనాలిలో మౌనిక అనే యువతిని కొందరు యువకులు మద్యం మత్తులో నడిరోడ్డుపై వేదింపులకు పాల్పడినప్పుడు, అడ్డుకొన్న ఆమె తల్లి సునీలని త్రోసివేయడంతో ఆమె లారీ క్రిందపడి మరణించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ సంఘటనలోఅన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. అదే క్రమంలో విజయమ్మ కూడా భాదితురాలు మౌనికను పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయిందని, ప్రభుత్వ అసమర్ధత వలన శాంతి భద్రతల పరిస్థితి నానాటికి దిగజారుతోందని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు. సునీల హంతకులను పట్టుకొని కటినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆమె స్పందించిన తీరు చూస్తే ఆమె ఇప్పుడు ఏ అంశంపై మాట్లాడవలసి వచ్చినా దానిని ప్రభుత్వ వైఫల్యానికి ఏవిధంగా ముడిపెట్టవచ్చోఆమె బాగానే గ్రహించినట్లు తెలుస్తోంది.

అమెరికాలో అదృశ్యమైన శరత్ కుమార్ మృతదేహం లభ్యం

  గుంటూరుజిల్లాకు చెందిన శరత్ కుమార్ అమెరికాలో అదృశ్యమైన విషయం విదితమే. అయితే తాజాగా పోతురాజు శరత్ కుమార్ మృతదేహం వాషింగ్టన్ ఎఫ్.డీ.ఆర్. మెమోరియల్ వద్ద అమెరికా పోలీసులు కనుగొన్నారు. అమెరికా పోలీసులు పోతురాజు శరత్ కుమార్ మృతిని ధృవీకరించారు. పోలీసులు శరత్ కుమార్ మృతదేహాన్ని అమెరికాలో వుంటున్న అతని మేనమాకు అప్పగించీరు. అమెరికా తెలుగు సంఘం శరత్ కుమార్ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శరత్ కుమార్ మృతి చెందినట్లు అమెరికా పోలీసులు శుక్రవారం ఉదయం తండ్రి వెంకట కృష్ణమూర్తికి సమాచారం అందించారు. శరత్ కుమార్ అనుమానాస్పద మృతిపట్ల అతని తండ్రి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మాటీవి ఫర్నీచర్, కార్లు ధ్వంసం ...

  తెలుగు ఛానెళ్ళలో వస్తున్నా డబ్బింగ్ సీరియల్స్ ను నిషేధించాలంటూ గత కొద్ది రోజులుగా తమ అసంతృప్తిని తెలియజేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ శుక్రవారం హింసాత్మకంగా మారింది. మాటీవీలో వస్తున్న డబ్బింగ్ సీరియల్స్ ను వెంటనే ఆపివేయాలని మాటీవీ యాజమాన్యాన్ని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ మాటీవీ కార్యాలయానికి కార్లు, మోటార్ సైకిళ్ళపై పెద్ద సంఖ్యలో వచ్చి కార్యాలయం అద్దాలను, కార్యాలయం ముందున్న మూడు కార్ల అద్దాలను, ఆఫీస్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సరికి అందరూ పరారయ్యారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాటీవీ సెక్యూరిటీ గార్డ్ వెంకటయ్య ఎడమకాలుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ దాడిలో మహిళా ఆర్టిస్టులు కూడా పాల్గొనడం విశేషం.

ప్రాణ్ కు 2012 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

  భారతదేశం అందించే ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. 2012 సంవత్సరానికి గాను బాలీవుడ్ విలక్షణ నటుడు, క్యారెక్టర్ నటుడు తన 93వ యేట ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.ప్రాణ్ అసలు పేరు ప్రాణ్ కిషన్ సికంద్.  మే 3న భారతీయ సినిమా వందేళ్ళ పండుగ సందర్భంగా ప్రాణ్ కు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రాణ్ నటించిన జంజీర్ సినిమా అతని కెరీర్ లో ఆణిముత్యం. ప్రాణ్ తెలుగు సినిమాలో కూడా నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన కొదమ సింహం చిత్రంలో ప్రాణ్ విలన్ పాత్రను పోషించారు. దాదాపు 400 పైగా చిత్రాల్లో నటించిన ప్రాణ్ 1998 సంవత్సరంలో హృద్రోగ సమస్యల కారణంగా తెరమరుగయ్యారు.

టీఆర్ఎస్ ఒంటరిపోరాటానికి సిద్ధం

  ఈ రోజు తెరాస పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తమ పార్టీ ఏపార్టీతో పొత్తులు పెట్టుకోదని తెలిపారు. ఇక విజయశాంతి టికెట్ విషయంలో మీడియాలో ప్రచారం అవుతున్న పుకార్లకు తెరదించుతూ తామిరువురం మళ్ళీ పోటీ చేస్తామని అన్నారు. కానీ, మళ్ళీ లోక్ సభకే పోటీ చేస్తారా లేక శాసన సభకి చేస్తారా అనే సంగతి చెప్పలేదు. వచ్చేఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో ప్రధానపాత్ర పోషించాలని ఆశిస్తున్న కేసీఆర్ తను మాత్రం శాసనసభకు పోటీచేయవచ్చును.   ఇక ప్రజలలో తెలంగాణ సెంటిమెంటుని ఎప్పుడు నిద్రలేపి ఏవిధంగా వాడుకోవాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరొకరికి తెలియదు. గనుకనే, వచ్చేఎన్నికలలో దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే ఆలోచనతోనే ఒంటరి పోరుకి తెరాస సిద్దపడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీపట్ల ప్రజలలోఉన్నవ్యతిరేకతకు తోడు, ఆ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా తమని ద్రోహం చేసిందనే భావాన్ని కూడా ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్ళగలిగితే, ఇక కాంగ్రెస్ పార్టీ తమకు గట్టిపోటీ ఈయలేదని తెరాస ఆలోచన చేస్తోంది. భాజపా తమ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ఇస్తామని చెపుతున్నపటికీ, ఆ పార్టీకి ఓట్లు పడకుండా తెరాస తను చేయగలిగినంతా తప్పక చేస్తుంది.   ఇక వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగే సమయానికి జైలు నుండి బయటపడగలితే తప్ప ఆ పార్టీ నుండి తమకు తెలంగాణలో గట్టిపోటీ ఉండకపోవచ్చునని తెరాస భావిస్తోంది. ఒకవేళ జగన్ జైలు నుండి విడుదల అయినా కూడా తెలంగాణ జిల్లాలలో అతని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చును. ఇక, తెలంగాణలో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేది ఒక తెదేపా మాత్రమే. అయితే, తెలంగాణపై తమకున్న పట్టు ఆ పార్టీకి లేదని గ్రహించిన కేసీఆర్, తెలంగాణలో పూర్తి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్న ఈ తరుణంలో ఇక వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకొని, తన విజయంలో వేరే పార్టీలకి భాగం పంచడం అనవసరం అనే ఆలోచనతోనే ఒంటరిపోరుకి సిద్ధం అయినట్లున్నారు. కానీ, సకల మాయోపాయాలకు పెట్టింది పేరయిన కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎన్నికల సమయానికి తెలంగాణ అనుకూల ప్రకటన చేసి కేసీఆర్ ఎత్తుకి పైఎత్తు వేసినా ఆశ్చర్యం లేదు.

తెదేపాకు చంచల్ గూడా జైలర్ సవాలు

  అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి చంచల్ గూడా జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి జైలర్ బి.సైదయ్య జైల్లో రాజభోగాలు సమకూరుస్తు, జగన్ సేవలో తరిస్తున్నాడని, జగన్ జైల్లో ఉన్నపటికీ శాటిలైట్ ఫోన్స్ విరివిగా ఉపయోగిస్తున్నాడని, ములాకాత్ పేరుతో రోజూకి కనీసం 400మంది జగన్ మోహన్ రెడ్డిని కలుస్తున్నారని, జైలులో ఖైదీలకు కూడా ఇప్పుడు జగన్‌ కోసం బయట నుండి వచ్చే వంటకాలనే వడ్డిస్తున్నారని తెదేప నేత వర్ల రామయ్య ఆరోపించారు.   ఈ ఆరోపణలను జైలర్ జైలు సూపరింటెండెంట్ బి.సైదయ్య ఖండింస్తూ “వారు చేసిన ఏ ఒక్క ఆరోపణ నిరూపించినా నేను ఎటువంటి క్రమశిక్షణ చర్యలకైనా నేను సిద్దం. జైలులో నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రోజుకి ఎంతమంది వచ్చేవారో, ఆయనని కలవడానికి ఎవరెవరు వచ్చేవారో మొదలయిన వివరాలన్నీ కూడా రికార్డింగ్‌లో నిక్షిప్తం చేయాబడి ఉంటాయి. గనుక, బయట నుండి నిబందనలకు వ్యతిరేఖంగా మనుషులు, వస్తువులు లేదా ఆహారం లోపలివస్తే తప్పని సరిగా అందులో రికార్డ్ అవుతాయి. అటువంటప్పుడు తెదేపా నేతలు ఇటువంటి ఆరోపణలు చేయడం అర్ధరహితం. వారు ఇకనయినా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి. లేకుంటే చటరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోను,” అని జైలు సూపరింటెండెంట్ సైదయ్య హెచ్చరించారు.   కానీ, టీడీపీ నేత వార్ల రామయ్య మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయన మళ్ళీ అవే ఆరోపణలు చేయడమే కాకుండా, ఇప్పుడు మరో సరికొత్త ఆరోపణ కూడా చేసారు. జగన్ సేవలో తరిస్తున్నజైలు సూపరింటెండెంట్ సైదయ్య జగన్ జైల్లో చేరక మునుపు అతని ఉన్న ఆస్తులు ఎంత, ఇప్పటి అస్తులు ఎంతనే వివరాలు చెప్పాలని డిమాండ్ చేసారు.

జగన్ కు ఉరేసినా తప్పులేదు: ఆనం

      వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంచలగూడ జైలులో జగన్ పార్టీ కార్యాలయాన్ని పెట్టి అరాచకాలను సృష్టిస్తున్నరన్నారు. జగన్ పెద్ద దోపిడీ దారుడు..ఉరి తీసిన పర్వాలేదని ఆనం పేర్కొన్నారు. దోపిడీ అని తెలియక వైయస్ సంతకాలు పెట్టామన్న చోటల్లా మంత్రులు సంతకాలు పెట్టారని చెప్పారు. జగన్ దోపిడీ వల్ల వందల కుటుంబాలు బలైపోయానని అన్నారు. జగన్ ను బయటకు తెచ్చేందుకు విజయమ్మ ఢిల్లీ కి చక్కర్లు కొడుతున్నారని చెప్పారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులలో పేదల బతుకులను అల్లకల్లోలం చేశారని, పేదల భూములు లాక్కొన్నారని ఆయన ఆరోపించారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారని సిబీఐ ఎక్కడ చెప్పలేదని పేర్కొన్నారు. ఒకప్పుడు జగన్ కు పెద్ద మద్దతుదారుడైన ఆనం ఆయనపై తీవ్ర విమర్శలు చేయడం విశేషం.

టిడిపికి దడ పుట్టిస్తున్న దాడి

        మంత్రి గంటా శ్రీనివాసరావుతో టిడిపి నేత దాడి వీరభద్రరావు భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీగా తనను కొనసాగించకపోవడంతో కొన్నాళ్ల క్రితం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దాడి.. ఇప్పుడిలా ప్రత్యర్థి పార్టీ మంత్రితో భేటీ కావడంతో ఆయన పార్టీ మారతారేమోనన్న ప్రచారం జరుగుతోంది. తన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని దాడి తెలిపారు. తాము తరుచూ మాట్లాడుకుంటూనే ఉంటామన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలోని క్రాస్ రోడ్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి తాను మంత్రిని కలిసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన వివాదం కాకుండా పరిష్కారం కోసమే కలిశానన్నారు. ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా చూడటం తన ఉద్దేశమన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని.. తమ పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరినట్లు చెప్పారు.

జగన్ పై కాంగ్రెస్ వైఖరిలో మార్పు

  హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేయడంతో, ఇంతవరకు వైయస్సార్ కుటుంబంతో ఏవిధంగా వ్యవహరించాలో తెలియక తికమడుతూ, జగన్ మోహన్ రెడ్డి పట్ల కొంచెం మెతక వైఖరి అవలంబిస్తున్నకాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. తమ మంత్రులు ఒకరొకరిగా అందరిపై కేసులు నమోదవుతుంటే కక్కలేక మింగలేక సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్.రాజశేఖర్ రెడ్డిని, అతని కుటుంబ సభ్యులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతోంది.   ఈ రోజు నెల్లూరులో ఆర్ధికశాఖా మంత్రి ఆనం రామినారాయాణరెడ్డి స్వర్గీయ వైయస్సార్, మరియు ఆయన కుటుంబ సభ్యులపై నిప్పులు చెరగడంతో కాంగ్రెస్ వైఖరిలో మార్పు వచ్చిందని స్పష్టమయింది. ఆనం మీడియాతో మాట్లాడుతూ “ఆనాడు వైయస్.రాజశేఖర్ రెడ్డి పెద్ద దోపిడీకి పూనుకొన్నాడని తెలియక చాలామంది మంత్రులు ఆయనను గుడ్డిగా నమ్మి ఫైళ్ళ మీద సంతకాలు చేసి, ఈ రోజు తాము చేయని తప్పులకి అన్యాయంగా కేసుల్లో ఇరుకొంటునారు. ఆయనను అడ్డం పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకొన్నాడు. అంత డబ్బు అతను ఎక్కడ దాచిపెట్టాడో ప్రజలకి తెలియ జెప్పాలి. అతను ఆ డబ్బు ఎక్కడ దాచి పెట్టాడో తెలియక అతని చెల్లెలు షర్మిలా పాపం ఊరూరు తిరుగుతూ వెతుకుతోంది. మరో వైపు అతని తల్లి విజయమ్మ కొడుకును విడిపించుకోవడానికి డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోంది. షర్మిల భర్త అనిల్ కుమార్ పేదల గుడిసెలను ను కూడా వదిలిపెట్టకుండా భూకబ్జాలకు పాల్పడ్డాడు. బయ్యారం గనుల తవ్వకాల కోసం ఏకంగా 5 మండలాలను అతను సర్వనాశనం చేసాడు. ప్రజలను అన్ని విధాల దోచుకుతిన్న వైయస్సార్ కుటుంబ సభ్యులను ప్రజలు వెలివేయాలి,” అని నిప్పులు చెరిగారు.

ఎర్రబెల్లి అల్లుడికి జహీరాబాద్ టికెట్

        టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్‌మోహన్‌కు జహీరాబాద్ లోక్‌సభ టికెట్ ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత౦లోనే ఎర్రబెల్లి తన అల్లుడికి జహీరాబాద్ లోక్‌సభ టికెట్ ఇవ్వలని టిడిపి అధినేతను కోరారు. కొద్ది రోజుల క్రితం ఎర్రబెల్లి తన అల్లుడితో కలిసి పాదయాత్రలో ఉన్న బాబును కలిసినప్పుడు టికెట్ కేటాయింపును ఆయన ధ్రువీకరించినట్లు సమాచారం. ఆ నియోజకవర్గంలో పనిచేసుకోవాలని ఆయన మదన్‌కు సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలు కలిపి జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. జహీరాబాద్‌తో కలిపి టీడీపీ ఇప్పటి వరకూ 15 లోక్‌సభ స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హోంమంత్రికి మోహన్ బాబు సపోర్ట్

        ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన మోహన్ బాబు, ఆమెకు సర్టిఫికెట్ ఇచ్చారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎటువంటి తప్పు చేయలేదని మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. అవినీతి ఢిల్లీ నుంచే మొదలవుతుందని, అందువల్ల, అరెస్టులను కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని వ్యాఖ్యానించారు. సబితపై అభియోగాలు రావడం బాధాకరమన్నారు. ఆమె కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దివంగత ఇంద్రారెడ్డి తనకు సోదరుడితో సమానమని చెప్పారు. త్వరలోనే ఆమెకు క్లీన్ చిట్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.