పెళ్ళిపందిరికీ తప్పని "పన్ను"పోటు

  సామాన్యప్రజలకు ప్రభుత్వం అనేక విధాలుగా పన్నులు వేసి బాదుతోంది. ఇప్పుడు తాజాగా ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కేంద్రమండలి ఇంటిముందు పెళ్ళిపందిరి, షామియానా వేసినా ఈ సేవలకు గాను 12 శాతం పన్ను చెల్లించాల్సిందేనని అంటోంది. పెళ్ళిపందిరే కాదు షామియానా వేసినా దానికీ సేవాపన్ను వర్తిస్తుందని తేల్చిచెప్పింది. వేడుక జరుపుకొనే స్థలం, పందిరి లేదా షామియానా విస్తీర్ణం, నిర్వహణ తీరును బట్టి పన్ను విధింపు ఉంటుందని ఒక ప్రకటనలో తెలియచేసింది. వేడుకపందిరి, షామియానా నెలకొల్పిన నిర్ణీత ప్రదేశంలో విద్యుత్ అలంకరణాలు, లౌడ్ స్పీకర్లు, భోజన ఏర్పాట్లు, ఫర్నీచర్ తదితర సేవల వినియోగం జరుగుతుంది కాబట్టి అక్కడ జరిగే కార్యకలాపాలన్నీ సేవాపన్ను పరిథిలోకే వస్తాయని ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల కేంద్రమండలి స్పష్టం చేసింది.

భారత సంతతి రాజ్ చెట్టికి బేబీ నోబెల్ ...

  ఢిల్లీలో జన్మించి 2009 నుంచి హార్వార్డ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాజ్ చెట్టి(33)ని బుల్లి నోబెల్ పురస్కారం వరించింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర రంగలో నోబెల్ తర్వాతి స్థానం ఈ పురస్కారానిదే కావడం విశేషం. 40 ఏళ్ళలోపు అమెరికన్ నిపుణులకు ఆర్థిక సిద్ధాంతం, అవగాహనకు విశిష్ట సేవలందించిన అమెరికన్ నిపుణులకు ఈ పురస్కారం అందజేస్తారు. ఈ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ సంతతి వ్యక్తి ఇతను. అనువర్తిక స్థూల-ఆర్థిక రంగలో కొత్తతరం ఉత్తమ శాస్త్రవేత్త రాజ్ చెట్టి అతితక్కువ కాలంలో నిరూపించుకున్నారు. బేబీ నోబెల్ అవార్డు క్రింద ప్రతిష్టాత్మక జాన్ బాట్స్ క్లర్క్ మెడల్ ను బహుకరిస్తారు. ఈ పురస్కారం పొందిన ప్రతి ముగ్గురిలో ఒకరు నోబెల్ బహుమతి అందుకుంటారని ప్రతీతి.

"టైమ్స్ నౌ" సర్వేపై చంద్రబాబు స్పందన

  రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై టైమ్స్ నౌ అనే ఆంగ్ల ఛానల్ సర్వేపై చంద్రబాబు ఇలా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీయేనని, వైఎస్సార్సీపీ కి ఏడాది క్రితం 30 లోక్ సభ సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని, ఇప్పుడు తాజాగా జరిపిన సర్వేలో 12 సీట్లే వస్తాయని, ఇంకో ఏడాది దాటితే ఒక్క సీటు కూడా రాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా వుండేవి, రాష్ట్రంలో పరిపాలన ఎలా వుండేది, విద్యారంగంలో కొత్త మార్పులు వచ్చాయి, రోడ్లు, వైద్యం, తాగునీరు, విద్యుత్ తదితర అంశాల్లో ఎలా చేశాం అన్న విషయాల్ని ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదేళ్ళ పాలనలో వ్యవస్థలను ఎలా నాశనం చేసిందీ ప్రజలకు తెలుసునని, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలంటే అన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు.

మూడు దేశాల్లో భూకంపం

  భారత్ లోని ఉత్తరాది రాష్ట్రాలు, పాకిస్తాన్, ఇరాన్ దేశాలు సోమవారం సాయంత్రం తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి ఇరాన్ లో 45 మందికి పైగా, పాకిస్తాన్ లో 35 మందికిపైగా మరణించారని ప్రాథమిక సమాచారం. ఇరాన్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూ ఉపరితలానికి 33 కిలీమీటర్ల దిగువన సాయంత్రం 4.16 నిముషాలకు భూకంపం సంభవించింది. గత నలభై ఏళ్లలో ఇంతటి భూకంపాన్ని ఎన్నడూ చూడలేదని, కొన్ని వందలమంది మరణించి వుంటారని ఇరాన్ అధికారి పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారావన్ పట్టణంలో జనాభా అధికంగా ఉన్నారని, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తోంది. భూకంపం ప్రభావం పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో అధికంగా కనిపించింది. పాకిస్తాన్ లోని కరాచీ, క్వెట్టా, హైదరాబాద్ నగరాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ భూమి కంపించిందని సమాచారం. ఇండియా రాజధాని ఢిల్లీతో పాటు గుర్ గావ్, జైపూర్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, గుజరాత్, నోయిడా లలో భూమి కంపించింది. రాజస్థాన్ లోనూ భూమి కంపించింది.

కేసీఆర్ వలలో కాంగ్రెస్ చేపలు విలవిలా

  తెలంగాణ కాంగ్రెస్ నేతల హడావుడి తాటాకు మంటల్లాంటిదని మరోసారి ఋజువు చేసారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పలకరించగానే ఉబ్బితబ్బిబయిపోయిన వారందరూ ఒకరింటికి మరొకరు పేరంటాలకి వెళుతున్నట్లు ఓ రెండు మూడు రోజులు హుషారుగా తిరిగేసి చాలా హడావిడే చేశారు. కానీ, స్వపక్షం నుండి వస్తున్న విమర్శలను, మీడియాలో తమపై వస్తున్న విశ్లేషణలు చూసిన తరువాత గాలి తీసేసిన బెలూన్స్ లాగయిపోయారు వాళ్ళందరూ.   అసలు కేసీఆర్ కాంగ్రెస్ నేతల సహాయం కోరి వచ్చేడా? లేక వారితో రహస్య సమావేశాలు జరిపి తద్వారా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడానికేవచ్చేడా అనే అనుమానం కూడా కలుగుతోంది. నిన్న ఆ పార్టీ నాయకుడు కే.తారకరామారావు మాట్లాడుతూ “తమ పార్టీని బలపరుచుకోవడం ఎంత ముఖ్యమో ఎదుటపార్టీని బలహీనపరచడం కూడా అంతే ముఖ్యం” అని చెప్పిన మాటలువింటే కేసీఆర్ వ్యూహాత్మకంగానే మీడియా వాళ్ళ కంట్లో పడేవిదంగానే వారితో సమావేశానికి తరలిరావడం చూస్తే, వారందరినీ కేసీఆర్ ఆడుకొని వదిలేసాడనుకోవలసి ఉంటుంది.అయినా కూడా కేసీఆర్ ఆడిన ఈ ఆటలో తమదేపై చెయ్యని భ్రమలో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఇంకా తెరాస వైపే చూస్తున్నారు.   అయితే కేసీఆర్ రాజేసిన ఈ ఎన్నికల వేడిని భరించాలంటే మళ్ళీ కాంగ్రెస్ గొడుగు క్రిందే సేదతీరడం మంచిదని అర్ధం చేసుకొని, తాము తెరాసలో జేరడంపై వచ్చిన వార్తలన్నీ తిరిగి మీడియాకే అంకితం చేసిపడేశారు కాంగ్రెస్ నేతలు. కానీ, మరోపక్క కేసీఆర్ ఇస్తున్న బంపర్ ఆఫర్ మాత్రం మనసులో ఇంకా ఊరిస్తూనే ఉండడంతో మనసొక చోట మనువొకచోటా అన్నట్లుంది వారి పరిస్థితి. అందువల్లే మళ్ళీ, ఒక వివేకవంతమయిన యంపీ మాట్లాడుతూ, త్వరలో తమ అధిష్టానం తెలంగాణ విషయం కనుక తేల్చకపోతే మళ్ళీ (భవిష్యత్ కార్యాచరణ) తాటాకులు మంటేసుకొంటామని హెచ్చరిస్తున్నారు. అలాగని ఎవరూ కూడా తెరాసలోకి జంపింగ్ తీసుకొంటామని దైర్యంగా, ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.   ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాము నిఖార్సయిన కాంగ్రెస్ వాదులమని చెప్పుకోలేని పరిస్థితి. తమ పార్టీ వారితో కంటే తెరాస వారితోనే భుజాలు రాసుకొని తిరగడం సౌకర్యంగా భావిస్తున్న వారిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నమ్మడం లేదు. అదే విధంగా వారు కూడా తమ పార్టీని నమ్మడం లేదిప్పుడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా ప్రభుత్వ విప్ జగ్గారెడ్డిచేత తమపై దాడి చేయిస్తున్నారని, ఆయనే కేంద్రానికి తప్పడు నివేదికలు పంపిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ జి వివేక్ ఆరోపించడమే ఇందుకు ఒక ఉదాహరణ.   ఇటు స్వంత పార్టీలో ఇమడలేక, అటు తెరాస వైపు వెళ్ళే దైర్యం చేయలేక తెలంగాణ కాంగ్రెస్ యంపీలు చాలా ఇబ్బందికరమయిన పరిస్థితుల్లో ఉన్నారిప్పుడు. ఇది వారికి కేవలం ఇబ్బంది మాత్రమే అయితే ఎలాగో భరించేవారే, కానీ, అది తమ రాజకీయ భవిష్యత్ కూడా సవాలుగా మారడంతో ఇప్పుడు ఎవరిని నమ్ముకోవాలో అర్ధం కాక తలపట్టుకొన్నారు.   కానీ ఇప్పుడు వారు తెలుసుకోవలసిన ముఖ్యమయిన విషయం ఒకటుంది. ఎన్నికల హడావుడిలో పడిన కేసీఆర్ మరో ఏడాది వరకు తెలంగాణ ఊసెత్తడు గనుక, ఆయన వెనుకే లక్ష్మణుడిలా తిరిగే కోదండరాముడు కూడా గమ్మునే ఉంటాడు. కనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా నిజాయితీగా తమ పార్టీనే అంటిపెట్టుకొని, మళ్ళీ సోనియమ్మను ప్రసన్నం చేసుకొని పార్టీ టికెట్స్ సంపాదించుకొని దైర్యంగా ఎన్నికలలో పోటీ చేయడమే ఉత్తమం.   ఉద్యమం అని ఊగిపోయిన కేసీఆర్, కోదండరాములే ఉద్యమానికి ఎన్నికల శెలవులు ప్రకటించేసినప్పుడు, కాంగ్రెస్ నేతలు వారిని, వారి ఉద్యమాన్ని చూసి భయపడటం అనవసరం. మాటనిలకడలేని కేసీఆర్ వంటి వారిని నమ్ముకొని తమ రాజకీయ జీవితాలు పాడు చేసుకోవడం కంటే కన్నతల్లి వంటి సోనియమ్మని, దేశాన్నిమార్చలేకపోయినా పార్టీని మాత్రం మార్చి పడేస్తానని గుర్రం ఎక్కివస్తున్న యువరాజు రాహుల్ గాంధీని నమ్ముకోవడం వారికి అన్ని విధాల మేలు.

మావోలకి ఎదురుదెబ్బ: అగ్రనేత సహా 15మంది మృతి

        ఆంధ్రా, చత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా బాసగూడ పీఎస్ పరిధిలో పోలీసులకు- మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. పదుల సంఖ్యలో మావోలు గాయపడ్డారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజారెడ్డి మృతిపై పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో 150 మంది మావోయిస్టుల బెటాలియన్ సమావేశం నిర్వహిస్తుందనే సమాచారంతో సీఆర్పీఎఫ్, ఖమ్మం జిల్లా పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంజయ్ దత్త్ పిటిషను విచారించనున్న సుప్రీం కోర్ట్

  అక్రమాయుధాల కేసులో మూడున్నర సం.ల జైలు శిక్ష అనుభవించవలసిఉన్న బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ ఈ నెల 18వ తేదిలోగా కోర్టు ముందు లొంగిపోవలసి ఉంది.   అతను క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకొంటే పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకోగలదని మహారాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పిన తరువాత, చెలరేగిన రాజకీయ దుమారం చూసి నొచ్చుకొన్నసంజయ్ దత్త్ తానూ క్షమాభిక్ష కోరనని, అది అవసరమయిన వారు చాలా మందేఉన్నారని, తానూ స్వచ్చందంగా జైలు శిక్ష అనుభవించడానికే నిశ్చయించుకొన్నానని మీడియాతో అన్నారు. కానీ, తీవ్రమానసిక క్షోభ అనుభవిస్తున్న ఆయన, లొంగివలసిన సమయం దగ్గిర పడిన తరువాత, ఆయన ఆలోచనలలో కూడా కొంచెం మార్పు వచ్చినట్లుంది.   తను లొంగిపోవడానికి మరో ఆరునెలలు గడువు ఇప్పించవలసిందిగా కోరుతూ ఆయన నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషను వేశారు. క్షమాభిక్ష పెట్టవలసిందిగా కోరుతూ తానూ స్వయంగా మహారాష్ట్ర గవర్నర్ కు దరఖాస్తు చేసుకొనప్పటికీ, అయనకు క్షమాభిక్ష పెట్టవలసిందిగా కోరుతూ సినీనటి జయప్రద వంటివారు అనేక మంది లేఖలు వ్రాశారు. తన క్షమాభిక్ష అభ్యర్ధన ప్రస్తుతం గవర్నర్ పరిశీలనాలో ఉన్నందున కనీసం ఆయన తన నిర్ణయం ప్రకటించేవరకయినా తనకు సమయం ఇప్పించవలసిందిగా ప్రార్దిస్తూ సంజయ్ దత్త్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్నుపరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది. బహుశః రేపు ఆయన పిటిషన్ కోర్టు ముందుకు రావచ్చును.   కానీ, అదే కేసులో నిందితులయిన జబున్నిసా అన్వర్ ఖాజీ, ఇస్సాక్ మొహమ్మద్ హజ్వానే మరియు షర్రిఫ్ అబ్దుల్ గఫూర్ పార్కర్ అనే ముగ్గురు నిందితులు కూడా ఇదేవిధంగా కోరుతూ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజే తిరస్కరించింది. వారిలో జబున్నిసా అన్వర్ ఖాజీకి 5సం.ల జైలు శిక్ష ఖరారు చేయగా, మరో ఖైదీ ఇస్సాక్ మొహమ్మద్ హజ్వానేకు గతంలో టాడా కోర్టు విదించిన 5సం.ల జైలు శిక్షను సుప్రీం కోర్టు యావజీవిత ఖారాగార శిక్షగా మార్చింది. ఇప్పటికే 14సం.ల జైలు శిక్ష అనుభవించిన షర్రిఫ్ అబ్దుల్ గఫూర్ పార్కర్ అనే మరో ఖైదీకి టాడా కోర్టు విదించిన యావజీవిత ఖారాగార శిక్షనే సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసింది.   ఈ నేపద్యంలో సంజయ్ దత్త్ చేసుకొన్న దరఖాస్తును సుప్రీంకోర్టు పరిశీలించడానికి అంగీకరించినప్పటికీ ఆయనకు గడువు పెంచడానికి బహుశః అంగీకరించకపోవచ్చును. అప్పుడిక సంజయ్ దత్త్ ఈ నెల 18న జైలుకి తెరిగి వెళ్ళక తప్పకపోవచ్చును. అదేజరిగితే, అతని మీద దాదాపు రూ 250 కోట్ల పెట్టుబడితో తీయవలసిన సినిమాలన్నీ కూడా ఆగిపోవడం ఖాయం. తద్వారా ఆయా నిర్మాతలకి నష్టాలు తప్పవు.   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటిసారిగా హిందీలో నటిస్తున్న జంజీర్ సినిమాలో సంజయ్ దత్త్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా తెలుగులో తుఫాన్ గా విడుదల అవుతోంది. అదృష్టవశాత్తు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోవడమేకాకుండా, ఇటీవలే సంజయ్ దత్త్ తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పడంతో ఈ సినిమా పెద్ద సమస్య నుండి త్రుటిలో తప్పించుకోగలిగింది.

చంద్రబాబు వద్దంటే ఆపేస్తామా?

        టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు పేదలకు చౌకధరలకు వస్తువులు ఇవ్వద్దంటున్నారు. అమ్మహస్తం పథకాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అమ్మహస్తం పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు శ్రీకాకుళం వరకు రాడట..విశాఖపట్నంలోనే ఆగిపోతారట. అమ్మహస్తాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. మరి మీకు ఇవ్వాలా ? వద్దా ? చేతులు ఎత్తండి అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. చంద్రబాబు చెబితే పథకాలు పెడతామా ? ఆయన వద్దంటే ఆపేస్తామా ? ప్రజల గుండె చప్పుడు వింటామని కిరణ్ అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఆయన వాహనాలతో పాటు ప్రయాణిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు కాన్వాయ్లోని రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్థానిక కాంగ్రెస్ మహిళా నేత మోహినికి గాయాలయ్యాయి. అమెకు సమీపంలోని ఆసుపత్రితో ప్రాధమిక చికిత్స చేయించారు.

జగన్ రాజకీయాలకి జైలు అడ్డం కాదుట

  జగన్ మోహన్ రెడ్డి మీద చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చేసుకొని అక్కడి నుండే పార్టీ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకూడా తోడవడంతో, అందరూ ఊహించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి ఆరోపణలను చూసి బయపడలేదు. బెదిరిపోలేదు. ఖండించలేదు పైగా జైల్లోంచి రాజకీయాలు చేయకూడదని ఏ చట్టం చెపుతోంది? అని ఎదురు ప్రశ్నించేసరికి కాంగ్రెస్ తెదేపా నేతల నోట మాటలేదు.   తెగించిన వాడికి తెడ్డే ఆయుధం అన్నట్లు, అతని తప్పులను కూడా తన మాటకారితనంతో ఆ పార్టీ అధికార ప్రతినిది అంబటి రాంబాబు వెనకేసుకొని వస్తూ వితండవాదన మొదలు పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి నేరం ఋజువయ్యి శిక్ష పడిన ఖైదీ కాదని, అతను కేవలం విచారణలోఉన్న ఖైదీ మాత్రమే గనుక అతనికి జైలు నుండి రాజకీయాలలో పాల్గొనే సర్వ హక్కులు కూడా ఉంటాయని ఆయన అన్నారు. విచారణలో ఉన్న ఖైదీలు రాజకీయాలలో పాల్గొనకూడదని ఏ చట్టం చెపుతోందని ఆయన ప్రశ్నించారు. చట్టంలో ఈ చిన్నపాటి విషయం గురించి తెలియకుండా కొందరు నాయకులూ పిచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేసారు. జగన్ మోహన్ రెడ్డిని ఎవరు కలవాలో, ఎప్పుడు కలవాలో నిర్ణయించుకోవలసినది ఆయనే తప్ప మొరుగుతున్న పిచ్చికుక్కలు కాదని ఆయన అన్నారు. ఆయనను కలుస్తున్న వారి గురించి అభ్యంతరాలు చెపుతున్న వాళ్ళు ఆయనకి ఆ హక్కులేదని నిరూపించామని అంబటి సవాలు కూడా విసిరారు.   దీనికి తెదేపా, కాంగ్రెస్ నేతలు ఏవిధంగా జవాబు ఇస్తారో చూడాలి. ఈ వ్యవహారం చూస్తుంటే  ముదిరి పాకాన్న పడి, చివరికి ఈ విషయంపై కూడా అతనిపై మరో కేసు నమోదు అయ్యేలా ఉంది.

జగన్ ను వేరే రాష్ట్రానికి తరలించండి

        అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇతర రాష్ట్రాలలోని జైలుకు మార్చాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. జగన్ జైలును తన కార్యాలయంగా ఉపయోగించుకుంటుంటే అధికారులు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ మంత్రి మోపిదేవికి ఒక న్యాయం, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులకు ఒక న్యాయం మంచిది కాదని అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయమున్న మంత్రులను తొలగించాలని అన్నారు. తెలంగాణ అంశంపై త్వరగా అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తాము ప్రజల్లోకి వెళ్లలేమని, పైగా పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని చెప్పారు.

రహస్యంగా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ పెళ్ళి

  ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ తానియా వాద్వాను క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నాగ్ పూర్ లోని తన ఇంట్లో కొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. ఏడాది కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ కోసం దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. ఈ విషయమై ఉమేశ్ యాదవ్ ను ప్రశ్నించగా మా ఇద్దరికీ ఏడాది క్రితం పరిచయం అయ్యింది, అది ప్రేమగా మారడంతో మా పెద్దలు, తానియా పెద్దలు పెళ్ళికి అంగీకరించారు. దీంతో ఈ రోజు నిశ్చితార్థం జరుపుకున్నాం, ఐపిఎల్ తరువాత పెళ్ళి చేసుకుంటాం అని అబద్ధం చెప్పాడు. సోమవారం జరిగిన కార్యక్రమానికి తానియా పెద్దలు ఎవరూ హాజరు కాకపోవడం విశేషం. అయితే సోమవారం వీరిద్దరూ రిజిస్టర్ లో సంతకాలు చేస్తున్న వీడియోను నాగ్ పూర్ పత్రిక వెల్లడిచేసింది.

కిరణ్ కు చంద్రబాబు బహిరంగ సవాల్

  విశాఖజిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. గాంధీనగర్ లో జరిగిన బహిరంగ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ... తొమ్మిది సంవతసరాలుగా నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ లు గుర్తుకువచ్చారా? ఎస్సీ. ఎస్టీలకు కేటాయించిన భూములను, నిధులను, ఇతర సౌకర్యాలను దిగమింగి ఇప్పుడు సబ్ ప్లాన్ అంటూ నాటకం ఆడుతున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయంటూ కిరణ్ కుమార్ అబద్ధాలు చెబుతున్నారని, తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కిరణ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి క్యాబినెట్ లో తొంభై శాతం మంత్రులు అవినీతిపరులుగా ముద్రపద్దారని, నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, తమ హయాంలో డీఎస్సీల ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని కానీ ప్రస్తుత ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ల పేరుతొ ఉద్యోగాలను అమ్ముకుంటున్నదని కిరణ్ కుమార్ పై విరుచుకుపడ్డారు.

బోస్టన్ లో వరుస బాంబు పేలుళ్లు,100 గాయాలు

        అమెరికాలోని బోస్టన్‌లో సోమవారం రాత్రి వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.ముందుగా మారథాన్ ప్రాంతంలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మరో రెండు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. ఆ తరువాత జేఎఫ్‌కే లైబ్రెరీ వద్ద మరో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో క్షతగాత్రులైన వారిని సమీప ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ పేలుళ్లకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. ఈ ఘటనతో అమెరికాలోని ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

తెలంగాణ యంపీలకు కాంగ్రెస్ షాక్

  తెలంగాణ కాంగ్రెస్ యంపీలు కోరుకోన్నట్లే, వారు తెరాస అధినేత కేసీఆర్ తో జరుపుతున్న రహస్య సమవేశాల గురించి కాంగ్రెస్ అధిష్టానం చెవుల్లో పడింది. అయితే వారు ఆశిస్తున్నట్లు డిల్లీ నుండి వారిని బుజ్జగించేందుకు ఎవరూ బయలు దేరబోవడం లేదు, కానీ “మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరయినా ఎప్పుడయినా పార్టీలు మారొచ్చు. అందులో అభ్యంతరం పెట్టేందుకు ఏమీ లేదు” అని ఒక పిడుగులాంటి సందేశం కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషిద్ అల్వీ నోటి ద్వారా తాజాగా వెలువడింది. మరో విధంగా చెప్పాలంటే, ‘ఉంటే ఉండండి పోతే పొండని’ ఆయన మాటలకి అర్ధం.   ఇంతవరకు వచ్చిన తరువాత వారు ఇప్పుడు పార్టీలోనే ఉన్నా వారికి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్స్ ఇస్తుందని నమ్మకం లేదు. కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా మారిన నిజామాబాద్ యంపీ మధు యాష్కీ సహచర యంపీలతో సమావేశం అయినప్పటికీ, తానూ పార్టీని వీడేదిలేదని స్పష్టం చేసారు. ఇక రాజయ్య, మంద జగన్నాథ రావు, కే.కేశవ్ రావు ముగ్గురూ కూడా తాము కాంగ్రెస్ పార్టీని వీడేoదుకే నిశ్చయించుకొన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇక మిగిలిన యంపీలు పొన్నాల ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు మరియు శాసనసభ్యులు కోమటి రెడ్డి సోదరులు ఇంకా అయోమయ స్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి నుండి వారు ఎంత త్వరగా బయటపడి నిర్ణయం తీసుకొంటె అంత మంచిది. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో వారికి గౌరవం తగ్గితే, అప్పుడు కేసీఆర్ దృష్టిలో కూడా వారు పలుచన అవడం ఖాయం. అప్పుడు వారి పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది.

టి.ఆర్.ఎస్.పై కాంగ్రెస్ విసుర్లు

  కెసిఆర్ టి. కాంగ్రెస్ నేతలను మభ్యపెట్టి, తన మాయమాటలతో టి.ఆర్.ఎస్. లోకి ఆహ్వానిస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ కెసిఆర్ పై మండిపడుతున్నారు. టి. కాంగ్రెస్ నేతలకు టి.ఆర్.ఎస్.లోకి చేరడానికి డెడ్ లైన్ విధించడం ఏమిటని? తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం తానొక్కడే పాతుపడుతున్నాడని ఫోజులు పెట్టడం, తెలంగాణాపై మాట్లాడేందుకు తమకు మాత్రమే పేటెంట్ హక్కులు ఉన్నాయని కెసిఆర్ భావిస్తున్నారని, తెలంగాణా సీనియర్ నేత కె. కేశవరావు వంటివారు కెసిఆర్ మాయమాటలు ఎలా నమ్ముతున్నారని కెసిఆర్ పై ధ్వజమెత్తారు.  కాంగ్రెస్ ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే  తూర్పు జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టి.కాంగ్రెస్ నేతలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి నష్టం వాటిల్లదని, పెద్దపల్లి ఎంపి వివేక్ కాంగ్రెస్ ను వీడుతారనే వార్తలలో సత్యం లేదని తాను భావిస్తున్నట్లు, కెసిఆర్ టి.కాంగ్రెస్ మంత్రులను తన మాయాజాలంలో ఇరికించుకుంటున్నారని టి.కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ను నమ్మవద్దని హితవు పలికారు.

తెలంగాణ కాంగ్రెస్ యంపీలలో మళ్ళీ భేదాభిప్రాయలు

గతంలో తెలంగాణ కాంగ్రెస్ యంపీలు ‘తెలంగాణ కోసం త్యాగాలు-పార్టీకి రాజీనామాలు’ అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ, తరువాత ఒకరితో ఒకరు విభేదాలంటూ అందరూ తమ పదవుల్లో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ విషయంలో చెప్పుకోవాలంటే మధు యాష్కీ మరియు పొన్నం ప్రభాకర్ కొంత నిజాయితీగా ప్రవర్తించారని చెప్పవచ్చును. తమ అధిష్టానం ఈ రోజు కాకపోయినా రేపయినా తెలంగాణ తప్పకుండా ఇస్తుందని నమ్ముతున్నందునే రాజీనామాలు చేయబోమని వారు స్పష్టం చేసారు.    మిగిలిన యంపీలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. కానీ వారే ఒకప్పుడు తమని సన్నాసులని, తెలంగాణ ద్రోహులని నోటికొచ్చినట్లు తిట్టిపోసిన కేసీఆర్ పార్టీ టికెట్స్ ఇస్తామని పార్టీలోకి ఆహ్వానించగానే నిర్లజ్జగా ఆయన వెనక వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కానీ, అలాగా వెళ్లేందుకు కారణం మాత్రం తాము తెలంగాణ కోసం త్యాగం చేస్తున్నట్లు చెప్పుకోవడం విశేషం. తమ పార్టీ తెలంగాణ ఇవ్వనందుకే పార్టీని విడిచి పెడుతున్నాము తప్ప, ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ఆఫర్ చేస్తున్నదుకు మాత్రం కాదని ప్రజలని నమ్మమంటున్నారు. తెరాసతో చేతులు కలిపితే తెలంగాణ ఉద్యమం బలోపేతం అవుతుందని చెప్పుకొస్తున్నారు. రేపు ఆ పార్టీలో చేరిన తరువాత, తాము ఇంత కాలం భజన చేసుకొస్తున్న ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలను కేసీఆర్ తిడితే మరి వారు భరించగలరో లేదో వారికే తెలియాలి.   ఇక ఈ రోజు తెలంగాణ యంపీలు జి.వివేక్ ఇంట్లో సమావేశం అయ్యారు. ఈసారి మందా జగన్నాథం, కే.కేశవ్ రావు మాత్రం పార్టీని వీడి తెరాస తీర్ధం పుచ్చుకోవాలని సంకల్పం చెప్పుకొని సిద్దం అవగా, వివేక్, రాజయ్య మాత్రమే ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోమరికొంత కాలం వేచిచూద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ,లిద్దరూ కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకొని ఉండాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. మందా మరియు కేశవ్ రావులు ఈ నెల 27న ఆర్మూరులో జరగనున్న తెరాస 12వ ఆవిర్భావ సభలో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం.