స్వంత పార్టీ మీదే ‘దాడి’ ఏలయా?

  రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్లు, కాంగ్రెస్ పార్టీతో వైకాపాకున్నఅనుబంధాలను ఎంత వదిలించుకొందామని ప్రయత్నించినా, అది నక్షత్రకుడిలా జగన్మోహన్ రెడ్డి వెంటపడుతూనే ఉంది. కొద్ది వారాల క్రితం కాంగ్రెస్ యంపీ సబ్బం హరి ఇక నేడోరేపో ఎలాగు వైకాపా కండువా కప్పుకోబోతున్నాను కదా అనే అత్యుత్సాహంతో తను ఇంకా కాంగ్రెస్ యంపీననే సంగతి మరచి, మా పార్టీ (వైకాపా) వచ్చే ఎనికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని ప్రకటించేసి, కాంగ్రెస్-వైకాపాల దోస్తీని ఖరారు చేసేసారు. దానితో ఆయన వైకాపా కండువా కప్పుకొనే భాగ్యం లేకుండా పోయింది.   ఒకవైపు తెలుగుదేశం అదే పాట పదే పదే పాడుతూ ఇబ్బంది పెడుతుంటే, మరో వైపు కాంగ్రెస్ యంపీలు లగడపాటి, హర్షకుమార్ తదితరులు కూడా సోనియమ్మా దత్తపుత్రుడిని చూసుకొని స్వంత కొడుకులవంటి తమని అన్యాయం చేసేస్తోందని మొత్తుకోవడం జగన్ బాబుకి గొప్ప సంకట పరిస్థితి కల్పించింది. తెదేపా ఆరోపణలను ఒట్టి గాలి కబుర్లని తేలికగా తీసి పడేస్తున్నా, నిఖార్సయిన కాంగ్రెస్ యంపీలే తనకి దత్తపుత్రుడు హోదా ఇచ్చేయడంతో ఆయన చాలా అనీజీగా ఫీలయిపోతున్నారు.   సరిగ్గా ఇటువంటి తరుణంలోనే, (రెండోసారి కూడా తనకే యంయల్సీ టికెట్ కన్ఫర్మ్ చేయనందుకు తెదేపాతో ఉన్న ముప్పైఏళ్ల అనుబంధాన్ని పుటుక్కున తెంచేసుకొని వైకాపాలోకి దూకిన) దాడి వీరభద్రరావు, తనని ఆపత్సమయంలో ఆదుకొన్న వైకాపా కూడా ఇప్పుడు ఆపత్సమయంలో ఉందని భావించి, దాని ఋణం తీర్చుకోవాలనే సత్సంకల్పంతో “జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటిస్తే సోనియా గాంధీ ఆయనను మోసం చేసి జైల్లో పెట్టించేసింది. అందువల్ల ఇక మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు,” అని ప్రకటించేశారు.   కానీ జనానికి వారిని నమ్ముకొన్న జగన్ కి మాత్రం ఆయన మాటలు వేరేలా అర్ధం అయ్యేయి. అసలు ఆయన వైకాపాపై వస్తున్నఆరోపణలు ఖండిస్తున్నారా లేక నిజమేనని దృవీకరిస్తున్నారా అనే అనుమానం కలిగింది. ఎందుకంటే జగన్ సోనియాను నమ్మడం, కాంగ్రెస్ కు మద్దతు పలకడం గురించి ఇప్పుడు ఆయనే స్వయంగా ద్రువీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో వైకాపకు గానీ జగన్మోహన్ రెడ్డి కి గానీ ఎటువంటి సంబందమూ లేదని ఎంత గట్టిగా నొక్కి వక్కాణిస్తుంటే అది గోడకి కొట్టిన బంతిలా ఇంకా అనుమానాలు పెంచుతోంది తప్ప తగ్గించడం లేదు. దీనితో మన స్వంత పార్టీ మీదనే ఈ దాడి ఏలయా? అంటూ జగన్, దాడి మాష్టారుకి క్లాసు పీకినట్లు సమాచారం.   అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవలన్నట్లు, కండువా ఉండగానే మాట దిద్దుకోవడం మేలని, దాడి మాష్టారు మరో సవరణ స్టేట్మెంట్ ఇచ్చేరు. “ఎప్పుడో మూడేళ్ళ క్రితం జగన్ బాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం. ఆయన కాంగ్రెస్ లోంచి జంపయిపోయి వైకాపా పెట్టినందుకే 16నెలల అజ్ఞాత వాసం చేయవలసి వచ్చింది.అయినప్పటికీ ఆయన మాత్రం ఏనాడు తనను కరుణించమని సోనియమ్మను ప్రాదేయపడలేదు. కావాలంటే ఆయన కోట్ చూడుడి: “ఇది కడప పౌరుషానికి డిల్లీ అహంకారానికి మధ్య జరుగుతున్నయుద్ధం... డేటెడ్ సో అండ్ సో,” అని ఉదాహరణతో సహా సవరణ ఇచ్చేరు.   అయినప్పటికీ ఆయన తాజా స్టేట్మెంట్ కూడా ‘రెండు పార్టీల మధ్య లింకులు కలిగే యున్నవి’ అని చెపుతున్నట్లే ఉంది తప్ప వాటిని ఖండిస్తున్నట్లు మాత్రం లేదు. మరి దాడి మాస్టారి కండువా కూడా ఎప్పుడయినా జారిపోయేలానే కనిపిస్తోంది. జర కండువా భద్రం మాష్టారు.

కిరణ్ పోతూ పోతూ పొగ పెడతాడా?

      రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సీమాంధ్రలో కొత్తపార్టీ పెట్టబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోయేముందు అల్లాటప్పాగా పోకుండా కాంగ్రెస్ పార్టీకి పొగపెట్టి మరీ పోయేలా కిరణ్ ప్లాన్ చేస్తున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన పక్షంలో బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొదటిరోజే కిరణ్ రాజీనామా చేసే అవకాశం ఉందట. ఆరోజు కిరణ్ అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లడతారట. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలను సుదీర్ఘంగా ఏకరువు పెట్టి, విభజన వాదులను, కాంగ్రెస్ హైకమాండ్‌ని ఘాటుగా విమర్శించి, తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించే అవకాశం ఉందట. రాజీనామా చేసిన వెంటనే రాజ్‌భవన్‌కి వెళ్ళి తన రాజీనామా లేఖను గవర్నర్‌కి సమర్పించే అవకాశం ఉందని సదరు వర్గాలు సెలవిస్తున్నాయి. తన రాజీనామాతో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి తెలంగాణ ప్రక్రియకు అడ్డంకులు కల్పించడంతోపాటు సీమాంధ్రలో కిరణ్ తన మైలేజ్‌ పెంచుకుంటారని వివరిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!

పాలమూరు నుండి రాహుల్ పోటీ చేయాలి

      కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలోని మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని దిగ్విజయ్ సింగ్ వద్ద ప్రతిపాదించినట్లు రాష్ట్ర మంత్రి డీకె అరుణ తెలిపారు. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ఆమె భేటీ అయింది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తరువాత తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందని, సోనియాగాంధీ పట్ల ప్రజలు నమ్మకంగా ఉన్నారని ఆమె తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ జిల్లా నుండి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డిలను రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించారు. రాహుల్ కార్యాలయం నుండి వారికి పిలుపురావడంతో వారు ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో డీకె అరుణ కూడా జిల్లా మంత్రిగా అక్కడికి వెళ్లి రాహుల్ ను జిల్లా నుండి పోటీ చేయాలని కోరినట్లుంది.

మెగా బ్రదర్స్ కి స్వాగతం: యనమల

      మెగా బ్రదర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఆ పార్టీ ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు మెగాబ్రదర్స్ టిడిపిలోకి వస్తే స్వాగతిస్తామని అన్నారు. తెలుగు ప్రజల సమస్యలపై పోరాడడానికి టిడిపి పార్టీ సరియన్ వేదికని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చర్చలు జరిగాయా? లేదా అన్న విషయం తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ నుంచి సీమాంధ్ర నేతలు పలువురు తమ పార్టీలోకి రాబోతున్నారని పేర్కొన్నారు. మరి మెగా బ్రదర్స్ ఈ విషయం మీద నోరు తెరిస్తే గానీ తెలియదు.

యాత్రా ఫలం దక్కాలంటే...

  చంద్రబాబు మళ్ళీ వచ్చే నెల ఐదున విజయనగరం నుండి ఆత్మగౌరవ యాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ సారి యాత్రలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో పర్యటించనున్నారు. కొద్ది వారల క్రితం డిల్లీలో సమన్యాయం కోరుతూ నిరాహార దీక్ష చేసారు గనుక, ఆయన రాష్ట్ర విభజనకు అంగీకరిస్తునట్లేనని స్పష్టం అవుతోంది. అందువల్ల కనీసం ఈ సారయినా అయన తన ఆత్మగౌరవ యాత్రలో దైర్యంగా ఇదే విషయాన్ని స్పష్టం చేయగలిగితే, మొదట్లో ప్రజల నుండి కొంత వ్యతిరేఖత ఎదుర్కొని ఇబ్బందిపడవలసివచ్చినప్పటికీ దీర్గ కాలంలో ఆయన పార్టీకి ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి.   దీనివల్ల తెలంగాణా-తెదేపా నేతలు తమ ప్రాంతంలో ఎన్నికలకు ముందే పార్టీని బలపరచుకొనే అవకాశం కలుగుతుంది. రెండు రాష్ట్రాలలోజరిగే ఎన్నికలలో పోటీచేయడానికి తెదేపా ఏర్పాట్లు కూడా మొదలుపెట్టుకోవచ్చును. లేకుంటే ఈ అయోమయంలో పార్టీ రెండు చోట్ల నష్టపోవడం ఖాయం. రాష్ట్ర విభజనకు తమ పార్టీ అనుకూలమానో లేక వ్యతిరేఖమనో ఆయన ఇంతవరకు స్పష్టం చేయనప్పటికీ, తెదేపా విభజనకు అనుకూలమనే సంగతి ఇప్పటికే స్పష్టమయ్యింది గనుక ఆయన ఇంకా ఈ విషయం దాచిపెట్టి వేరేదో మాట్లాడటం వలన పార్టీకి ఒరిగేదేమీ ఉండకపోగా, ప్రజలలో ఆయన విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతుంది.   కాంగ్రెస్ నేతలు పురందేశ్వరి, పనబాక, జేడీ శీలం వంటివారు రాష్ట్ర విభజన అనివార్యమని, అందువల్ల సీమాంధ్ర ప్రజలకు, ప్రాంతానికి అత్యుత్తమ ప్యాకేజి సాధించేందుకు కృషి చేస్తామని బహిరంగంగానే చెపుతున్నారు. తద్వారా వారు విమర్శలు మూట గట్టుకొంటున్నపటికీ, ఒకవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతున్నపటికీ ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొని, రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను మభ్యపెట్టే నేతల కంటే వీరే నయమనే భావన ప్రజలలో నెలకొంది.   అందువల్ల చంద్రబాబు కూడా తన యాత్రలో స్పష్టమయిన వైఖరి ప్రకటించగలిగితే ఆయన పార్టీకి మేలు చేకూరవచ్చును. లేకుంటే రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రుల బృందంతో కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపి తామే సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయగలిగామని చెప్పుకొంటూ ప్రజల ఓట్లు అడుగుతున్నపుడు, తెదేపా ఇంతకీ తానేమి సాధించిందో చెప్పుకోలేక దిక్కులు చూడవలసిన పరిస్థితి ఏర్పడవచ్చును.   అత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని పెద్దలు ఊరకనే అనలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుంచు కోవాలి. అందువల్ల చంద్రబాబుకి, తెదేపాకి ఈ యాత్రా ఫలం పూర్తిగా దక్కాలంటే మనసులో మాట దైర్యంగా చెప్పెయడమే బెటర్.

అశోక్‌గజపతిరాజుకు అవమానం

      తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, గజపతి రాజ వంశీయులు అశోక్‌గజపతిరాజుకు పైడితల్లి ఆలయంలో అవమానం జరిగింది. సిరిమానోత్సవం సందర్భంగా అశోక్గజపతి రాజు అమ్మవారిని దర్శించుకునేందుకు తన అనుచరులతో కలిసి గుడికి వెళ్లగా ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన అశోక్‌గజపతిరాజు ఆలయం ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. దీంతో ఆలయ అధికారులు ఆయనను శాంతింపజేసి అనుచరులను ఆలయంలోకి అనుమతించడంతో పరిస్థితి సర్దుమణిగింది. మరోవైపు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

పవన్ తో జూనియర్ కి చెక్..!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగైనా టిడిపి వైపు వచ్చేలా ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలోని గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాలలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు దర్శన మిస్తున్నాయి. ఇక ఇంటర్ నెట్ లోనూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడని వీరి ఫోటోలతోనే ప్రచారం జరుగుతోంది. వీటిని ఎవరూ ఏర్పాటు చేస్తున్నారు? రాజకీయ రంగంలో చంద్రబాబుకు ఒక లెక్కుంది. సినీ రంగంలో పవన్ కల్యాణ్‌కు పవరుంది. చంద్రబాబు లెక్కకి, పవన్ కల్యాణ్ పవర్‌కు నందమూరి నటసింహం బాలయ్య తోడైతే ఎదురేముంది?అన్న ఫ్లెక్సీలు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.     జగన్ ఫ్లెక్సీల విషయం, రాజకీయ విభేదాలతో టిడిపికి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టాలనే ఆలోచనతో ...పవన్  టిడిపికి అనుకూలమన్న ప్రచారంతో భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోదంటున్నారు. అందుకే ఒక పద్దతి ప్రకారం పవన్ కళ్యాణ్ బాలయ్యకు సన్నిహితుడని, ఇక కాంగ్రెస్ మీద కోపంతో ఆయన టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారంతో మెల్లగా ఫ్లెక్సీల వరకు లాక్కొచ్చారన్న ప్రచారం మెగా అభిమానుల్లో సాగుతుంది.    కాని తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో ఉంటే, ఆయనను కాదని, పవన్ కళ్యాణ్ వేరే పార్టీలో చేరతారా?పవన్ టిడిపిలోకి వస్తే అన్నయ్య ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.

అవును కాంగ్రెస్ ను నమ్మి మోసపోయాము: దాడి

  కాంగ్రెస్ యంపీ సబ్బం హరి ఇంకా వైకాపాలో చేరక ముందే, “వైకాపా ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని” ప్రకటించినందుకు ఆయన మొహం మీదనే వైకాపా తలుపులు వేసేసి, ఆయనతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని తెగతెంపులు చేసుకొంది. అసలే కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఆవిధంగా ఆగ్రహించడం సహజమే.   కానీ ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో నేత దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ “సోనియాను నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టించారని, ఆమెను నమ్మి జగన్ మోసపోయారని, అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని,” అనడం చూస్తే ఆయన వైకాపాపై వస్తున్నఆరోపణలు ఖండిస్తున్నారా లేక నిజమేనని దృవీకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జగన్ సోనియాను నమ్మడం, కాంగ్రెస్ కు మద్దతు పలకడం గురించి ఇప్పుడు ఆయనే స్వయంగా ద్రువీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని హామీ ఇస్తున్నారు.   ఎందువల్ల అంటే వైకాపా చేస్తున్న సమైక్యఉద్యమం వల్ల పార్టీకి సీమాంద్రాలో ఆశించినంతగా స్పందన రాకపోవడానికి ప్రధాన కారణం, తమ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయనే ఆరోపణలేనని అనేకమంది నేతలు అభిప్రాయ పడుతున్నందున, బహుశః దాడి వీరభద్రరావు ద్వారా ఆ అనుమానాలు నివృత్తి చేయాలని వైకాపా ఉద్దేశ్యం కావచ్చును. కానీ, ఆయన ఇచ్చిన వివరణ మూలంగా ఉన్నఅనుమాలు నివృత్తి కాకపోగా అవి మరింత బలపడేందుకు దోహదపడింది. అందువల్ల సబ్బం హరికి ఎదురయిన అనుభవమే ఇప్పుడు దాడికి కూడా ఎదురవబోతోందా? వేచి చూడాల్సిందే.

టిడిపి దారిలో 'పవర్ స్టార్'..!!

      గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజీకీయాల్లోకి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలకు తెరపడటం లేదు. తాజా పరిణామాల దృష్ట్యా చూసుకుంటే పవన్ టిడిపిలో చేరనున్నాడు అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్త అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన అన్నయ్య ఆ పార్టీతోనె చేతులు కలపడం పవన్ కు జీర్ణించని పరిణామం అని అందరూ చెప్పుకుంటుదే. తాజాగా వస్తున్న వార్తల్లో విశేషమేమిటంటే...పవన్ కళ్యాణ్తో పాటు అన్నయ్య నాగబాబు కూడా టిడిపి లో చేరబోతున్నారని టాక్ మొదలైంది. ఈ మేరకు స్వయంగా ఆయన నందమూరి బాలకృష్ణతో భేటి అయినట్లు సమాచారం. ఈ రెండు విషయాలపై అటు పవన్ నుంచి, ఇటు టిడిపి పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, కామెంట్స్ కానీ రాలేదు. అలాగే ఈ రెండు విషయాల్లో వాస్తవమేమిటనేది పక్కనపెడితే ప్రస్తుతం ఈ ఊహాగానాలు మాత్రం రాష్ట్రం అంతా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో కాలమే నిర్ణయించాలి.     Video Courtesy ABN ANdhrajyoti              

కిరణ్ విభజనను అడ్డుకోలేరు

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం జవాబు ఇచ్చింది. కిరణ్ విభజనను అడ్డుకోలేరని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ తేల్చిచెప్పారు. రాష్ట్రాల విభజనను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరని, రెండేళ్లపాటు సంప్రదింపులు జరిపిన తరవాతనే తెలంగాణ మీద అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. మంత్రుల బృందం ప్రస్తుతం అన్ని విషయాలు పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా బిల్లును తయారు చేస్తుందని ఆయన తెలిపారు. ఇదే విషయం దిగ్విజయ్ ని అడిగితే ఆయన నవ్వి ఊరుకున్నారు. మొత్తానికి కిరణ్ ఇప్పుడు ఏం చేస్తారు అన్నది వేచిచూడాలి.

రాజ్యాంగంలోనే రాష్ట్ర సమైక్యతను కాపాడగల క్లాజు [ఇ]?!

  ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       రాజనీతి శాస్త్రాన్ని కాస్తా స్వతంత్రభారతదేశంలో "పదవీరాజకీయ శాస్త్రం''గా మార్చిన 'ఘనులు' కాంగ్రెస్ నాయకులు! అలాంటివాళ్ళు దేశ సమాఖ్య (ఫెడరల్)వ్యవస్థను ప్రజాప్రయోజనాల రక్షణకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల సుస్థిరతకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తోడునీడగా ఉండకుండా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం కోసం 'పావు'గా వినియోగించుకుంటూ వస్తోంది. అలాంటి తాజాగా చేతివాటంగా అందివచ్చిన 'పావు' - స్వతంత్ర భారతంలో భాషాప్రయుక్త ప్రాతిపదికపై మొట్టమొదటిసారిగా ఏర్పడిన పెద్దరాష్ట్రమైన తెలుగువారి "ఆంధ్రప్రదేశ్''ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తమ నాయకురాలైన ఇటాలియన్ సోనియా రాజకీయ కుటుంబ ప్రయోజనాలకోసం అశాస్త్రీయంగా నిట్టనిలువునా చీల్చడానికి తీసుకున్న నిర్ణయం! ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణా ప్రాంతంలో 15 పార్లమెంటు సీట్లకోసమని వేర్పాటువాదులయిన కొందరు రాజకీయ నిరుద్యోగులతో చేతులు కలిపి కాంగ్రెస్ ఈ పనిచేసి, తెలుగుజాతికి విద్రోహం తలపెట్టి, ఆ విద్రోహాన్ని సమర్థించుకోడానికి మరికొన్ని తప్పులు చేస్తూ పోతోంది. ఇందుకు అది ఆధారపడుతున్నది రాజ్యాంగంలోని 2,3,4 అధికరణలమీద. ఈ మూడింటి సారాంశం - భారత యూనియన్ లో కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి, ఉన్న రాష్ట్రాలనుంచి భూభాగాలను చీల్చి మరొక రాష్ట్రంలో విలీనం చేయడానికి పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని చెప్పడం. 3వ అధికరణ ప్రకారం - నూతన రాష్ట్రాలను ఏర్పర్చడమే గాక, ప్రస్తుతమున్న రాష్ట్రాల వైశాల్యాన్ని పెంచడానికి, లేదా కుదించడానికి, లేదా వాటి సరిహద్దుల్ని మార్చడానికి లేదా ఆ రాష్ట్రాల పేర్లను కూడా మార్చడానికి శాసనం రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉంది!     అయితే పాలనాధికారాన్ని చేపట్టే రాజకీయపార్టీలు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తమ "బ్రూట్ మెజారిటీ''ద్వారా తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించడానికి ఈ అధికరణవల్ల అవకాశం దొరికింది! రానురానూ ఈ తప్పుడు సంప్రదాయం ఎక్కడికి దారితీస్తోంది? పాలనా పగ్గాలు పట్టుకున్న అధికారపక్షాలు భారత సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల ప్రజల మెజారిటీ అభీష్టాన్ని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాల చట్టసభలనూ ఖాతరు చేయకుండా కూడా కొత్తరాష్ట్రాలను స్వార్థప్రయోజనాలకోసం ఏకపక్షంగా ఏర్పర్చచే దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది పంజాబ్-హర్యానాలుగా పంజాబ్ విభజనతోనే మొదలయింది! పంజాబ్ శాసనసభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సభ ఆమోదముద్ర లేకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ అధికారపక్షం పంజాబ్ ను విభజించేసింది! రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ఐక్యతను బలిగొన్నది! అదే పద్ధతిని ఇప్పుడు దేశంలోని తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను బలిగొనజూస్తోంది! ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తనకు తననే ఆంధ్రప్రదేశ్ లో ఆత్మాహుతికి సిద్ధమవుతోంది! కొందరు వేర్పాటువాద నాయకుల వత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ ను 3వ అధికరణ ఆధారంగా విభజించడానికి సిద్ధమయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇటాలియన్ సోనియా నాయకత్వంలో హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర విబజనకోసం మూడు రకాల ప్రతిపాదనలతో ఒక "నోట్'' (పత్రం) తయారుచేసింది. దాన్ని మంత్రి షిండేకి సమర్పించింది. ఇదో విచిత్రమైన పత్రం! దీనికి పునాది రాజ్యాంగంలోని 3వ అధికరణమే అయినా, హోంశాఖ "నోట్''లో మొదటి అంశం పూర్తిగా ప్రజల పరిశీల దృష్టికి యింకా వచ్చినట్టులేదు! అది - "పదిజిల్లాలతో ఏర్పడగల తెలంగాణా రాష్ట్రంలో ఆ పదిజిల్లాలతో పాటు తెలంగాణలో ఐచ్చికంగా ఏ ఇతర జిల్లాలయినా సరే వచ్చి చేరదలిస్తే అవన్నీ చరవచ్చు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పిమ్మట తెలంగాణాగానే ఏర్పడుతుంది'' ["Along with 10 districts, any other disstricts that voluntarily come forward to join in Telangana will be taken into consideration and Telangana will be formed]!   ఈ "నోట్''ను ఎవరు తయారుచేశారోగాని సదరు పత్రకారుడు సరసుడే కాదు, ప్రజలను విభజించి-పాలించటం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! రాష్ట్ర మెజారిటీ, ప్రజల ఆకాంక్షకు అనువునంగానే ఈ 'నోట్' డ్రాఫ్టింగ్ తయారైనట్టుంది! చివరికి ఏ కేంద్రపాలకపక్షం ఏ "3''వ రాజ్యాంగఅధికరణ ఆధారంగా, ఐక్యంగా ఉన్న తెలుగుజాతిని చీల్చాలని ఉవ్విళ్ళూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని "ఇ''క్లాజు కూడా "రాష్ట్రం పేరును మార్చుకోవచ్చు''నని అభ్యంతరం లేదనీ చెప్పింది! అంటే హోంశాఖవారి అద్భుతమైన 'డ్రాఫ్టింగ్' పర్యవసానంగా వెలువడిన ఆ "నోట్'' తెలంగాణాలోని పదిజిల్లాలతో పాటు మరిన్ని జిల్లాలు, ఎన్ని జిల్లాలు వస్తే అన్ని జిల్లాలు 'తెలంగాణా రాష్ట్రం'గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించినట్టయింది! ఆ లెక్కన రాష్ట్రంలోని మిగిలిన 13జిల్లాలు కూడా ఆ పదిజిల్లాలతో కలిసిపోతే - అదే హోంశాఖ "నోట్'' ఆశిస్తున్న మొత్తం రాష్ట్రం అంతా నిజంగానే అక్షరాలా "తెలంగాణా'' అవుతుంది గదా!! ఎందుకంటే, ఈ మాట వ్యంగ్యంగా అనటంకాదు, ఎగతాళి కోసం అంటున్న మాట అంతకంటే కాదు. నిజానికి "తెలంగాణం'' అంటే తెలుగులకు (తెలుగువారికి) అణెము, అంటే తెలుగువారు నివశించే చోటు అనీ, ప్రాంతం అనీ, నివాసమనీ వ్యవహారార్థమూ, విశిష్టార్థమూనని గుర్తించాలి! పండితులూ, నిఘంటుకారులూ స్థిరపరిచిన స్థిరనివాసమే తెలుగువారి తెలంగాణం! చరిత్ర తెలియని మన తెలుగు రాజకీయ సన్యాసులకన్నా, గిరీశం భాషలో మన 'వెధవాయిల'కన్నా కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రాంతాలతో పాటు సుమారు 300 ఏళ్ళపాటు దక్కన్ వరకూ ఏలికలుగా ఉన్న మహమ్మదీయ పాలకులు తెలుగు పాలకులకన్నా తెలివిగల వాళ్ళు కాబట్టి తాము పాలిస్తున్న నివసిస్తున్న ప్రాంతమంతా తెలుగువారిది కనుకనే మొత్తం తెలుగుప్రాంతాన్ని 'తెలంగాణం' [15-16 శతాబ్దాల దేశపటాల్లో "తెలంగాణం'' అని లిఖితపూర్వకంగా పేర్కొని] అని పేరుపెట్టుకున్నారని గుర్తించాలి!   అందువల్ల "తెలంగాణా రాష్ట్రం'' అంటే మొత్తం తెలుగు ప్రాంతమంతటికీ వర్తిస్తుంది కాబట్టే హోంశాఖ "నోట్'' తెలుగువారి అన్ని జిల్లాలూ వచ్చి చేరమని ("any other districrs that come forward")  ఆహ్వానం పలికి ఉంటుంది! మరో మాటలో చెప్పాలంటే మిగతా 13 సీమాంధ్రజిల్లాలు కూడా వెరసి మొత్తం 23 జిల్లాలతో కూడిందే తెలంగాణం/ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర రాష్ట్రం గదా! అందువల్ల ఇప్పుడున్నదంతా 'తెలంగాణం' అదే 'తెలుగునాడు! కాబట్టి రాజ్యాంగంలోని 3వ అధికరణం "ఇ''సెక్షను ప్రకారం "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రాన్ని కృత్రిమంగా విభజించకుండానే పేరును అర్థవంతంగా అమరగల "తెలంగాణా''గా లేదా "తెలుగునాడు''గా మార్చుకోవచ్చు! తద్వారా "విభజన'' అనే పురుగును, లేదా 'కలుపుమొక్క'ను లేదా 'బి.టి.'లాంటి వినాశకర విత్తనాన్ని [టెర్మినేటర్ సీడ్] మనస్సులనుంచి పెకించివేయవచ్చు! తొలుత దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రెండురకాల పరాయి పీడనా పాలనలనుంచి తెలుగుజాతి ఒక్క గొడుగుకిందికి వచ్చినప్పుడు ఆకారాది క్రమం కోసం అటు ఇంగ్లీషు వర్ణమాలకు, ఇటు తెలుగువర్ణమాలకు తొలి అక్షరంతో 'A'/ 'ఆ'/"ఆంధ్రప్రదేశ్" (Andhra Pradesh) ఏర్పడడం శుభదాయకం అనుకున్నారు పెద్దలు. ఆ ఆశతోనే, పేరు తప్పు సమాసం అయినా "ఆంధ్రప్రదేశ్' పేరును ఎంచుకోవటం జరిగింది. కాని, ఆకారాదిక్రమంలో తొలి అక్షరంతో మనం 8వ షెడ్యూల్ లో అగ్రభాగంలో కనిపించినంతమాత్రాన అభివృద్ధికి చిహ్నం కాదు, అలా లేకపోయినంత మాత్రాన ఒక రాష్ట్రం పేరు కడుపంక్తిలో [ఉదా: తమిళనాడు - Tamilnadu ఉందికాబట్టి ప్రగతిపథంలో అది అట్టడుగున ఉందనీ చెప్పలేం!]   అందువల్ల, వ్యక్తులకుగానీ, రాష్ట్రంకుగాని వారికి (వాటికి) తగినట్టుగా అర్థవంతంగా ఉండాలేగాని 'పేరు' బలాల్ని బట్టి, 'నక్షత్రబలాల్ని' బతి విలువలూ, గౌరవప్రతిష్టలూ సమకూడవు! ఎందుకంటే అబద్ధాలతో, బూతులతో 'ఉద్యమాలు' నిర్మించేవారంతా చచ్చినా కొమరం భీములూ కాలేరు, దొడ్డి కొమరయ్యలూ కాజాలరు; వినాయక వేషధారులంతా ప్రజానాయకులు కారు; గాంధీ పేరుతొ చెలామణీ కాదలచుకునే వారంతా గాంధీలూ కారు, భగత్ సింగ్ పేరు తగిలించుకునే వారు విప్లవకారులూ కాలేరు; అల్లూరి సీతారామరాజును కొలిచేవారంతా ఆయని పేరు ఉచ్చరించడానికీ తాగారు; రుద్రమ పేరు పెట్టుకున్న వారంతా వీరనారీమణులూ కారు; చిత్తం చెప్పులమీద భక్తి శివుడిమీద నిలిపే వారంతా నిజమైన భక్తులూ కారు; యావదాంధ్ర శ్రమజీవుల ప్రతినిధిగా కష్టజీవులకు బతుకునిచ్చే బతుకమ్మ/అదే దుర్గమ్మ/అదే గౌరమ్మను కాస్తా హైజాక్ చేసి క్షుద్ర రాజేకీయాలకోసం వాడుకో జూసే సంపన్నుల బతుకులు బతుకులూ కావు; ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆంద్ర (తెలుగు) జాతి చరిత్రకూ దాని వేల సంవత్సరాల సంస్కృతీ విభావానికీ ఐకమత్యానికీ దివిటీలుగా నిలిచినా శాతవాహన, కాకతీయ, విజయనగర ప్రజాహిత పాలనా యుగాలను విస్మరించిన తెలుగుజాతి విచ్చిన్నకులూ, అందుకు దోహదం చేసిన ఆధునిక విద్యోజులయిన రాకీయ దుర్యోధన, దుశ్శాసనలూ మూడు ప్రాంతాల ప్రజాబాహుళ్యం గుండెల్లో శాశ్వత శత్రువులుగా నమోదు కాకుండా తప్పించుకోలేరు; తెలుగువారి మహాయుగాల ఆనవాళ్ళను చేరిపివేయడానికి ప్రయత్నించిన ఆధునిక రాజకీయ 'సామంతులు'గా, చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతారు!   ఎందుకంటే, "ప్రజాప్రతిదుల'' వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలకపక్షాలు,ముఖ్యంగా దీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలుతూ వచ్చిన చెడిపోయిన కాంగ్రెస్ తో కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్ళుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ కుత్సితమైన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి సహితం వేనుదీయలేదు. వాటిల్లో కొన్ని - రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్యూట మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి - రేపటి పాలకపక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలు! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేడ్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవికావు!  స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధవిరుద్ధమైన సవరణ చట్టాలు తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ అధికరణ ఒకటికాగా, ఆ సవరణ కేంద్రం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణక్కు భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ప్రజాహితంగా దేశంలోనే తొలిమెట్టుగా తెలుగుజాతినంతనూ ఒక్క గొడుగుకిందికి తెచ్చేందుకు సాధికార కమీషన్ సిఫారసులు ఆధారంగానే 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది; దానికి తగినట్టుగానే రాష్ట్రంలోని మూడుప్రాంతాల మధ్య కాలక్రమంలో ఉద్యోగ సద్యోగాలలో ప్రాంతాలమధ్య సమతుల్యమైన ఆర్థికాది రంగాలలో సాధ్యమైనంత త్వరగా అభ్యుదయాన్ని సాధించడం కోసం ఏ ఇతర రాష్ట్రానికీ లేని ఒక విశిష్టమైన ప్రత్యేకమైన (స్పెషల్) సవరణ చట్టాన్ని 371 (డి) పేరిట రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.   కాగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషాప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు "డి'' క్లాజుద్వారా రాజ్యాంగానికి సవరణ చట్టం తీసుకువచ్చి, దానికి భాష్యం చెప్పాలన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్తుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే యితర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలుగాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్రప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371 (డి) సవరణ చట్టానికి మూడింట రెండువంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దానిద్వారా కేంద్ర క్యాబినెట్టుకూ సాధ్యమవుతుంది గాని అడ్డదారుల్లో కాదు! పైగా, హోంశాఖ చూపిస్తున్న "నోట్''లో, నేడు ప్రజావ్యతిరేకులుగా మారి ప్రజలకోసం పదవుల్ని త్యాగం చేయలేని 'దేహభక్తి'కి తప్ప దేశభక్తికి దూరమైనా నాయకులకు తెలియని ఒకటి రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి యిచ్చిన "ఒకటవ వివరణ''లోనే ఉంది. ఇది రెండురకాల భాష్యానికి అవకాశమిస్తోంది.   ఎలా అంటే, 3వ అధికరణలో 'ఎ'నుంచి 'ఇ'వరకూ ఉన్న క్లాజుల్లో "రాష్ట్రం'' అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యు.టి.)ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! అయితే జనాన్ని పాలకపక్షాలు గందరగోళ పరచడం కోసం చేసిన ప్రయత్నం మినహాయింపు "క్లాజు'' పేరిట "రాష్ట్రం'' అనే పదంలో "కేంద్రపాలిత ప్రాంతం'' చేరి ఉండదని అదే "వివరణ (1)''లో విరుద్ధంగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్రప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ, ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని "కేంద్రపాలితప్రాంతం''గానో (యు.టి) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ట్ర "విభజన'' గురించి ఆలోచించాలిగాని అంతకుముందు కాదని ప్రతిఆదించడానికి కారణం - 3వ అధికరణంలోని ఈ అయోమయపు "వివరణ 1''! కాబట్టి - మొత్తం తెలుగుజాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోడానికిగాను, "ఆంద్ర'' అనే పదా(తెలుగు అనేది తెలియక)నికి అజ్ఞానంతో కొందరు 'ఎలర్జీ' పెంచుకుని తెలుగుజాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగా 3వ అధికరణలోని "ఇ''క్లాజు ప్రకారం గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగువాడికీ అభ్యంతరం ఉండదు, మనసారా ఆహ్వానించి తీరుతాడు! సెంటిమెంటును గౌరవించాలనుకునే వారంతా కోస్తా నుంచి దక్కను దాకా తెలుగువారి నివాసప్రాతంగా ''తెలంగాణా'' పేరు హేతుబద్ధమైన పేరు రాష్ట్రానికి చక్కగా అమరుతుంది, అర్థవంతంగా భాసిల్లుతుంది, అరమరికలులేని తెలుగుజాతికి ఆత్మవిశ్వాస సోర్యోదయంగా చిరంజీవిత్వం కల్గిస్తుంది!

లాలూపై అనర్హత వేటుకి రంగం సిద్దం

  పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడి ఐదేళ్ళు జైలు శిక్షపడి ప్రస్తుతం రాంచీ జైలులో ఊచలు లెక్కబెడుతున్నపార్లమెంటు సభ్యుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరియు మెడికల్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల జైలు శిక్షపడిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ లపై వెంటనే అనర్హత వేటు వేసి, పార్లమెంటులో వారి స్థానాలు ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి సూచించాలని అటార్నీ జనరల్ జీ.ఈ.వాహనవతి లోక్ సభ సెక్రెట్రియెట్ కు సూచించారు. ఇంకా జాప్యం చేసినట్లయితే అది కోర్టు దిక్కారం క్రింద పరిగణింపబడే ప్రమాదం ఉందని ఆయన సెక్రెట్రియెట్ అధికారులను హెచ్చరించారు. రషీద్ పై అనర్హత వేటువేసేందుకు ఇప్పటికే ప్రక్రియ మొదలవగా, ఇప్పుడు వాహనవతి హెచ్చరికతో లాలూపై కూడా అనర్హత వేటుకి రంగం సిద్దం అవుతోంది.

మళ్ళీ టీ-దుఖాణం తెరిస్తే జనాలొస్తారంటారా మాష్టారు

  తెలంగాణా సెంటిమెంటుని గౌరవించడం పూర్తయిన తరువాత, వైకాపా ఓ వారం పది రోజుల పాటు సమన్యాయం కోసం నడుం బిగించింది. కానీ సమన్యాయం కంటే సమైక్యమే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని భావించడంతో సమైక్యశంఖారావం పూరించేసి మూడు దీక్షలు, ఆరు ధర్నాలతో సీమాంధ్ర ప్రాంతాన్ని హోరెత్తించేసింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సైంధవుడిలా మాటి మాటికి అడ్డుతగులుతూ వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా చేయడంతో, జీవితాన్నే మార్చేసే మరో కొత్త ఐడియా కోసం ఆలోచించక తప్పలేదు.   అప్పుడు సమైక్యమంటే సమైక్యం కాదనే ఒక సరికొత్త ఐడియా కనిపెట్టి దానికి ఈవిధంగా డెఫినిషన్ ఇచ్చారు. సమైక్యమంటే తెలుగు ప్రజలందరి కష్టాలు తీర్చడం కోసం చేసే పోరాటమని, కనుక అందులో తెలంగాణా ప్రజల కష్టాలు, సమస్యలు కూడా ఇమిడే ఉన్నాయని వివరించిన తరువాత, కావాలంటే తెలంగాణా కోసం కూడా ఉచితంగా పోరాడిపెడతామని తెలంగాణా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఒక బంపర్ ప్రకటించారు. అంటే సమైఖ్యం నుండి బ్యాక్ టు సమన్యాయం అన్నమాట!   ఇక ఎలాగు సమన్యాయానికి రిటర్నయిపోయిన తరువాత, అదే పాలసీతో తెలుగుదేశం పార్టీ నేటికీ తెలంగాణాలో నిలబడి ఉంటే, మనం మాత్రమే దుఖాణం ఎందుకు బంద్ చేసుకోవాలి? అనే ధర్మసందేహం కలగడంతో ఈ నెల 26న హైదరాబాదులో ఆయన పెట్టబోయే సమైక్యసభకు తెలంగాణాలో రోడ్డున పడ్డ వైకాపా నేతలకు కూడా 'ద్వారములు తెరిచియేయున్నవి' అని ప్రకటించేసారు.   అంతే కాకుండా మెహబూబ్ నగర్ జిల్లాలో అటువంటి వైకాపా బాధిత నేతలతో హైదరాబాదు పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యేరు కూడా. సభను విజయవంతం చేయవలసిన బాధ్యతలు కూడా వారికే ఉదారంగా అప్పగించేశారు. పనిలోపనిగా మళ్ళీ తెలంగాణాలోదుఖాణం తెరిచేందుకు గట్టిగా ప్రయత్నించమని కూడా వారికి నచ్చజెప్పారు. ఎందుకంటే తీవ్ర నీటి సమస్యలతో బాధపడుతున్న అక్కడి ప్రజలను ఆదుకోవాలని ఆయన మనసు చాల తహతహలాడుతున్నపటికీ, వారు కూడా ఆయనకు ఓటేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేస్తే తప్ప, వారి సమస్యలను పరిష్కరించలేని అసహాయత వెలిబుచ్చారు.   విస్వసనీయతకు మారుపేరయిన ఆయనను, ఆయన పార్టీకి మళ్ళీ తెలంగాణా ప్రజలు బాజా బజంత్రీలతో ఎదురేగి స్వాగతం చెపుతారో లేదో చూడాల్సి ఉంది. పాపం కొండా సురేఖే ఇన్ని ట్విస్టులు ఉంటాయని గ్రహించలేక తొందరపడిపోయి పార్టీలోంచి కాంగ్రెస్ లోకి జంపయిపోయింది. అయినా మరేమీ పరువలేదని లగడపాటి వంటి వారు హామీ ఇస్తున్నారు కదా.

పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

      పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ విప్ జారీ చేస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అనుకూలంగా ఓటు వేస్తారని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. తెలంగాణ ప్రకటన వచ్చినప్పటి నుండి రాజీనామా చేయనని, పదవిలో కొనసాగుతానని చెబుతున్న తక్కువ మంది నేతల్లో పనబాక మొదటి వరసలో ఉంటారు. కాంగ్రెస్ నిర్ణయానికే నా ఓటు అని ఆమె చెబుతున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి సీమాంధ్రులకు రక్షణ కల్పించాలని కోరతానని చెప్పిన ఆమె ఇప్పుడు తాజాగా ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలాన్ని సీమాంధ్రకే కేటాయించేలా కేంద్ర మంత్రుల కమిటీకి ఇచ్చే నివేదికలో పేర్కొంటామని తెలిపారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్దంగా ఉండాలని, బీజేపీ విభజన విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని పనబాక అన్నారు.

విభజనపై సీమాంధ్ర నేతలు హామీ ఇచ్చారు: దిగ్విజయ్

    సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అందరినీ కాంగ్రెస్ అధిష్టానం విభజన విషయంలో ప్రశ్నించిందని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంతా హామీ ఇచ్చారని దిగ్విజయ్ వెల్లడించారు. వారు ఒప్పుకున్న తరవాతనే విభజన నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తరువాత వారు మాట మార్చడం సరికాదని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలకు ఇబ్బందులు ఉన్న మాటను ఎవరూ కాదనడం లేదని, వారు తమ ప్రాంతానికి మంచి ప్యాకేజీలు, సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, ప్రతిపాదనలు మంత్రుల బృందానికి ఇవ్వాలని సూచించారు. ఎవరూ రాజీనామాల గురించి తొందరపడొద్దని సూచించారు.   పైలాన్ తుఫానును అడ్డుకోలేక పోయాం. కానీ తెలంగాణ అనే విభజన తుఫానును ఖచ్చితంగా అడ్డుకుంటాం. దీనికి ప్రజల సహకారం కావాలి’ అని తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు.

లాలూ నిష్క్రమణతో బీహార్ రాజకీయ సమీకరణాలలో మార్పులు.

      పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడి ఐదేళ్ళు జైలు శిక్షపడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటుపడిన తరువాత, బీహార్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్ననితీష్ కుమార్ కి చెందిన జెడీ(యూ) కాంగ్రెస్ పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నపటికీ, లాలూపై వేటుపడిన తరువాతనే పొత్తుల విషయంలో ముందుకు సాగడం మేలనే ఆలోచనతో వేచిచూస్తున్నాయి. ఇప్పుడు ఆ పని కూడా పూర్తవుతోంది గనుక ఇక ఆ రెండు పార్టీలు పొత్తులకి సిద్దపడవచ్చును.   ఇక మాజీ బీహార్ ముఖ్యమంత్రి మరియు లాలూ భార్య అయిన రబ్రీ దేవి మీడియాతో మాట్లాడుతూ తన భర్త జైలుకి వెళ్ళినంత మాత్రాన్నతమ ఆర్ జె డీ పార్టీ ఏమి మూతబడబోదని, గతంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఏవిధంగా తాము పార్టీని కాపాడుకొన్నామో ఇప్పుడు కూడా అదేవిదంగా పార్టీని కాపాడుకొంటామని అన్నారు. అయితే లాలూ ప్రసాద్ కి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా చుక్కేదురయ్యి ఐదేళ్ళు జైలు జీవితం గడపవలసి వస్తే, ఆయన పార్టీలో కీలక నేతలు, కార్యకర్తలు అందరూ సహజంగానే బీహార్ లో తిరుగులేని అధికారం సాగిస్తున్న జెడీ(యూ) లోకి జంపయిపోవడం ఖాయం. ఇది కాంగ్రెస్- జెడీ(యూ) కూటమికి కలిసివచ్చే అంశం కాగా, ఈసారి ఎలాగయినా ఎన్నికలలో బీహార్ నుండి అత్యధిక యంపీ స్థానాలు పొందాలనుకొంటున్న బీజేపీకి ప్రతికూలాంశంగా మారవచ్చును.