టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

      సచివాలయం ముందు సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. నష్టపోయిన రైతాంగాన్ని నష్టపరిహారం ఇచ్చి, వసతి సౌకర్యం, భోజనం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులను నివేదికలు తయారు చేసే పనిలో కాకుండా వరదప్రాంతాల్లో వినియోగించాలని ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సీఎం కిరణ్ చర్చలకు ఆహ్వానించినప్పటికీ తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమను సీఎం చర్చలకు పిలవకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాహుల్ పిల్లచేష్టలు

      పిల్లచేష్టలు వదలిపోని నలభయ్యేళ్ళ రాహుల్‌గాంధీని వాళ్ళమ్మ సోనియమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి నానా తంటాలు పడుతూ, అడ్డగోలు విభజనకు కూడా పూనుకుంది. అమ్మ మనసుని అర్థం చేసుకుని హుందాగా వ్యవహరించాల్సిన రాహుల్‌గాంధీ మాత్రం వీలైనప్పుడల్లా తన పిల్లచేష్టల్ని ప్రదర్శిస్తున్నాడు. ఆమధ్య కేంద్రప్రభుత్వ నేరచరితుల ఆర్డినెన్స్ విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడి నాలుక్కరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా గొప్ప విషయంలా ఒప్పుకున్న నిర్ణయాన్ని ఒక్కమాటలో తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ పరువుని నడిరోడ్డు మీదకి ఈడ్చాడు. తలలు పండిన కాంగ్రెస్ నాయకులు కూడా తనముందు దిగదుడుపేనని తేల్చేశాడు.     రాహుల్‌గాంధీ పిల్లచేష్టల ధాటికి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు లోలోపల కుమిలిపోతున్నా, ఎందుకొచ్చిన గొడవ అని ఎవరూ కిక్కురుమనడం లేదు. తాజాగా రాహుల్‌గాంధీ రాజస్థాన్ ఎలక్షన్ మీటింగ్‌లో తన ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని ప్రకటించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం, లేనిపోని ఇష్యూ క్రియేట్ చేయడం రాహుల్ పిల్లచేష్టలకు పరాకాష్ట అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటర్లని ఆకర్షించడానికి ఎలాంటి మాటలు మాట్లాడొచ్చు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా రాహుల్‌గాంధీకి లేకపోవడం సహజమేనంటున్నారు. రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లు రాజస్థాన్‌లో ఓట్లు రాల్చే విషయం అటుంచి, జనాలకి రాహుల్ అంటే చిరాకుపుట్టి కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ ఇప్పటికైనా పిల్లచేష్టలు మానుకుంటే మంచిదని అనుకుంటున్నారు.

పవన్ పాలిట్రిక్స్

      మెగా బ్రదర్స్ పవన్‌కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు రావడం...వీటిపై నాగబాబు లేఖ రాయడంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ పుకార్లను ఎవరూ సృష్టించారన్న దానిపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ ఆసక్తి చర్చ నడుస్తోంది.   ‘అత్తారింటికి దారేది’ సినిమాకి మైలేజ్ పెంచుకోవడానికే పవన్‌కళ్యాణ్ వర్గీయులే ఈ పుకార్లని షికార్లు చేయించారనేది వారి వాదన. సినిమాకి మళ్లీ రిపీటెడ్‌ ఆడియన్స్‌కి థియేటర్‌ కి రప్పించడానికి ఈ ట్రిక్కు కనిపెట్టారట. దీనితో ఈ సినిమాకి ఇంకాస్త మైలేజీ వచ్చిందని అనుకుంటున్నారు. మరి వంద కోట్ల వైపుగా అత్తారింటిని లాగాలంటే... ఇలాంటి ట్రిక్కులు తప్పవు.

మంత్రిగారి నోటి దురద!

      కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలు అధికారుల నిర్లక్ష్యం వల్లే సరిగా అమలు కావడం లేదని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి వాపోతున్నాడు. అక్కడితో ఆగకుండా ప్రభుత్వం పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను కొట్టండని వీధి రౌడీ తరహాలో ప్రజలకు పిలుపు ఇచ్చాడు.   మీ పథకాల్లో, ప్రభుత్వ విధానాల్లో సత్తా లేక, వాటిని సరిదిద్దుకునే దమ్ములేక అధికారులను కొట్టండని పిలుపు ఇవ్వడమేంటని ప్రభుత్వోద్యోగులు సీరియస్ అవుతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనని అంటున్నారు. మంత్రి నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నారు. అధికారులు సరిగా పని చేయకపోతే లోపం ఎక్కడుందో పరిశీలించి దాన్ని సరిదిద్దుకోవాలిగానీ, అధికారులను కొట్టండని పిలుపు ఇవ్వడమేంటి మంత్రిగారూ. మీరు అన్నట్టు తప్పు చేసిన వారిని కొట్టడం న్యాయమే అయితే ప్రజలు ముందుగా కొట్టాల్సింది మిమ్మల్నే! ఎన్నికల కమీషన్‌కి ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో  తమరి మీద వున్న ఆర్థిక నేరాల కేసులను చూపించకుండా దాచిన పాపానికి తమర్ని కొట్టాలా? రాజకీయాల నుంచి తరిమికొట్టాలా? ఈ రెండిట్లో ఏది చేయాలో మీరే తేల్చుకోండని అధికారులు అంటున్నారు. మంత్రిగారు నోటి దురద తగ్గించుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

ఎన్నికల వైతరిణిని దాటేందుకు తరుణోపాయము లేదా?

  తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కొత్త రాష్ట్రం ఎపుడెపుడు ఏర్పడుతుందా? ప్రభుత్వం ఎపుడేర్పడుతుందా? ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయా? అని ఆత్రంగా ఎదురు చూస్తుంటే, సీమాంధ్ర నేతల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.   అధిష్టానం దెబ్బకి పార్టీలో ఉన్నా, పార్టీ మార్చివేరే కండువా కప్పుకొన్నా లేకపోతే సరికొత్త జెండా, సరికొత్త టోపీ, కండువాలు వేసుకొచ్చినా ప్రజలు మాత్రం తమని గుర్తుపత్తేయడం ఖాయమని వారు చాలా దిగులు పడుతున్నారు. ఈ ఎన్నికల వైతరిణిని దాటేందుకు తరుణోపాయమే లేదా?అని వారందరూ బుర్రలు బ్రద్దలు కొట్టుకొంటున్నారు.   అయితే పనబాక, శీలం,పురందేశ్వరి వంటి వారు మాత్రం రోట్లో తలపెట్టాక పోటుకి భయపడుతూ కూర్చుంటే ఎట్లా? అని దైర్యంగా తమ ప్రయత్నాలు తాము చేసుకుపోతున్నారు. కానీ ఇంతకాలం సమైక్యం కోసం మాట్లాడుతున్న నేతలకే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ రాష్ట్ర విభజనని అడ్డుకొంటామని చెప్పిన పాపానికి, విభజన అనివార్యమని స్పష్టం అవుతున్నందున, ప్రజలు వారినే ముందుగా అనుమానించే పరిస్థితులు ఏర్పడటంతో వారు ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్నికలలో ఎలా పోటీ చేయాలని వారు చాలా మధన పడుతున్నారు.   అయితే సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి  సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి దీనికి తరుణోపాయం కనిపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖ గాలులు వీస్తున్నపటికీ, తమ నియోజక వర్గంపై తమకు పూర్తి పట్టు ఉందని, అందువల్ల వచ్చేఎన్నికలలో తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ జెండా పక్కన బెట్టి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయవచ్చని చెప్పారు. అంటే, ఆయన పార్టీపై ఆధారపడకుండా కేవలం తన శక్తి సామర్ధ్యాలతో గెలిచే ప్రయత్నం చేస్తారు గనుక, ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులను తగ్గించే అవకాశం ఉంది. కనుక అధిష్టానం కూడా దీనిని దిక్కారం క్రింద భావించదు. ఎన్నికల తరువాత ఎలాగు ఆయన మళ్ళీ కాంగ్రెస్ గూట్లోనే చేరుతారు గనుక ఇందులో పార్టీకి కూడా అభ్యంతరం చెప్పడానికేమి లేదు.   అందువల్ల సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఈ ప్రభాకర్-ఫార్ములా తమకేమయినా వర్క్ అవుట్ అవుతుందేమో ఆలోచించుకొంటే మంచిది.

విభజన త్వరగా చేయాలి: గవర్నర్

      రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలో పలువురు పెద్దలతో వరుసగా భేటీ అయి..ఒక్కొక్కరితో అరగంట చొప్పున చర్చలు జరిపారు. రాష్ట్ర స్థితిగతులు, రాజకీయ పరిస్థితిపై అందరికీ నివేదికలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. విభజనపై నిర్ణయం తీసుకున్నందున పరిస్థితి సద్దుమణగాలంటే దానిని వేగవంతం చేయాలని, లేదంటే పరిస్థితి మలుపులు తిరిగే అవకాశముందని చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన పట్ల సుముఖంగా లేని ముఖ్యమంత్రి అసెంబ్లీ తీర్మానం ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కీలక దశను ఎలా దాటాలన్న దానిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ అంశంపైనే హోంమంత్రి షిండేకు గవర్నర్ నరసింహన్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందని కూడా పేర్కొన్నట్లు తెలిసింది.

వర్షాలతో రైతన్నకు దెబ్బ మీద దెబ్బ

      రాష్టవ్యాప్తంగా వర్షాలు కుండపోతలా కురుస్తున్నాయి. గత 48 గంటలుగా రాష్ట్రంలోని అన్నిప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పత్తి రైతుకు ఈ వర్షాలు శరాఘాతంగా పరిణమిచ్చాయి. చెరువులు, కుంటులు నిండి పారుతున్నాయి. పైలిన్‌ తుపానుతో ఇబ్బందుల్లో ఉన్న తీరప్రాంత రైతులకు ఈ అల్పపీడనం మూలంగా వచ్చిన తుపాను పులిమీద పుట్రలా మారింది.   శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్‌, కరీంనగర్‌లో ఎడతెరపి లేని వర్షం కురిసింది. ప్రస్తుతం  నెల్లూరు-ఒంగోలు మధ్య అల్పపీడనం కేంద్రీకృతమయివుంది. తీరం సమీపంలో ఉన్నందున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం చెబుతుండడం రైతులకు మరింత ఇబ్బందికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా మందసలో అత్యధికంగా 17 సెం.మీ, పలాస, సోం పేట, ఇచ్ఛాపురంలో 15 సెం.మీ, కాకి నాడ, చోడవరం, అనకాపల్లి, పత్తిపా డులలో 12 సెం.మీ, కళింగపట్నంలో 11 సెం.మీ, తిరుపతి, విశాఖ విమానాశ్ర యం, అరకు, కావలి, ఎలమంచిలి, పెద్దాపురంలలో 9 సెం.మీ, టెక్కలి, కోడే రులలో 8, అచ్చంపేట, గజపతినగరం, ఎర్రగొండపాలెం, వెంకటగిరి, మాచర్ల, దేవరకొండలలో 7, నెల్లూరు, అవనిగడ్డ, రణస్థలం, తణుకు, ఆత్మకూరు, దర్శి, తాడేపల్లిగూడెం, తెర్లాం, పాలకొండలలో 6, రాజమండ్రి, మచిలీపట్నం, కందు కూరు, నాగర్‌కర్నూల్‌, పొదిలి, పాడేరు, శ్రీకాళహస్తి, కైకలూరు, అద్దంకి, చీపురు పల్లి, విజయనగరంలో 5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

మీడియాకి హ్యండిచ్చిన మెగా బ్రదర్స్

    వేలిస్తే చెయ్యందుకొనే మన మీడియా రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయని చెపుతూనే, దానిపై ఎవరి శక్తిమేర వారు ఊహాగానాలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, విశ్లేషణలు వగైరా వగైరాలతో జనాలను, ముఖ్యంగా తెదేపా అభిమానులను మంచి రంజింపజేశారు. కొందరు మరొక అడుగు ముందుకు వేసి, యన్టీఆర్ కి చెక్ పెట్టేందుకే పవన్ కళ్యాణ్ పార్టీలోకి రప్పిస్తున్నారని ఈ వార్తలకి మంచి మసాలా కూడా తగిలించారు. పనిలోపనిగా నాగబాబుకి మచిలీపట్నం నుండి టికెట్ కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేసేసి తమ సత్తా చాటుకొన్నారు. మరొక వారం పదిరోజులు ఆగితే పవన్ కళ్యాణ్ కి కూడా టికెట్ ఖాయం చేసేసేవారే, కానీ నాగబాబు తొందరపడి తాము ఏ పార్టీలో చేరడంలేదని ఈ రోజు ప్రకటించేశాడు. మీడియా ప్రజారాజ్యానికి కూడా తిరిగి ప్రాణం పోయాలని ఆశపడింది కానీ ఆ ప్రయత్నం పైనా నాగబాబు నీళ్ళుజల్లి అందరినీ ఉసూరుమనిపించాడు. అయితే ఇక మెగా సోదరులిద్దరూ రాజకీయాలలో చెయ్యి కాల్చుకొనే ఆలోచనలో లేరనే సంగతి మాత్రం ఖరారయిపోయింది.  

అబ్బ మరీ ఇంత సెంటిమెంటయితే తట్టుకోలేము బాబు

  మహాతల్లి ఇందిరమ్మ 'తన శరీరంలో చివరి రక్తం బొట్టుపోయే వరకు దేశసేవ చేస్తానని’ పలికిన కొద్దిరోజులకే హత్య చేయబడటంతో ఆమె మాటలకి చాలా విలువ ఏర్పడింది. ఇక నాటి నుండి నేటి వరకు గల్లీ నుండి డిల్లీ వరకు ప్రతీ రాజకీయ నాయకుడు ఈ లైన్స్ ని తమ ప్రసంగంలో విరివిగా వాడేసుకోవడం మొదలుపెట్టారు.   అయితే ఆమెలా నిజంగా చివరి రక్తం బొట్టు వరకు పనిచేస్తామని చెప్పేందుకు మాత్రం కాదు. ఒకవేళ కర్మకాలి ఎవరి చేతిలోనయినా చస్తే లేక ఏ గుండె జబ్బో వచ్చిమధ్యలో బకెట్ తన్నేసినా, పోయిన తరువాత కూడా జనాలు తమ గురించి చెప్పుకోడానికి ఓ నాలుగు ముక్కలుండాలానే తపనతోనే అందరూ తప్పనిసరిగా తమ ప్రసంగంలో, వీలయితే ట్వీటర్లో కూడా ఈ లైనుండేలా జాగ్రత్త పడుతున్నారు.   అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ ప్రసంగంలో మధ్య మధ్య సోనియా రాహుల్, అధిష్టానం వంటి పదాలను కలుపుకొని ప్రసంగించే ఆనవాయితీని ఎంత నిబద్దతగా పాటిస్తారో, అదేవిధంగా ఈ ‘చివరి రక్తం బొట్టు’, ‘నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు’ ఇత్యాది పదాలను పార్టీలకతీతంగా రాజకీయనాయకులు అందరూ కూడా తమ ప్రసంగంలో తప్పనిసరిగా చెప్పుకొంటారన్న మాట.   ఇక తాజా సమాచార్ ఏమిటంటే, ఇందిరమ్మ మనుమడు రాహుల్ గాంధీ కూడా తనకి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఎందుకని, ఆయన కూడా ఈ లైన్స్ అన్నిఎంచక్కా వల్లె వేసేసారు. ఈ రోజు రాజస్థాన్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన, తన తండ్రి, నాయనమ్మలాగే తన ప్రాణాలకి కూడా ప్రమాదం పొంచి ఉందని, ఉగ్రవాదం, మత తత్వవాదంపై పోరాడుతున్నతనను ఎవరయినా హత్య చేసే అవకాశం ఉందని తనకు తెలుసనీ, అయినా తాను ప్రాణాలు పోతాయని ఏనాడు భయపడలేదని, తనకు తన ప్రాణాలకంటే దేశమే ముఖ్యమని అని స్పష్టం చేసారు. అందువల్ల ప్రజలు కూడా ఈ మతతత్వానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపిచ్చారు.   అయితే అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తులకు సహజంగానే ఆ ప్రమాదం పొంచి ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. అందువల్ల ఆయన మాటలను ఎవరూ కొట్టి పారేయలేరు కూడా. అయితే ఆయన బీజేపీ పాలిత రాష్ట్రానికి వచ్చి ఈ మాటలనడంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు రాహుల్ మాటలకి బీజేపీ నేతలు భుజాలు తడుముకొంటూ ఆయన మీద చాలా కోపగించుకొన్నారు.   కుంభకోణాలు తప్ప వేరేమి ఎరుగని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతకంటే వేరేమి మాట్లాడగలరని వారు విమర్శించారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన తమ పార్టీ గురించి, యుపీయే ప్రభుత్వం సాధించిన ఘన కార్యాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేనందునే ఈ సెంటిమెంటు డైలాగులతో జనాల సానుభూతి పొంది, దానిని ఓట్లుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు గుమ్మడి కాయలను మళ్ళీ రాహుల్ గాంధీ భుజన్నపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ టిడిపిలో చేరడం లేదు: నాగబాబు

      తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు ఖండించారు. తాము ఏ పార్టీలోనూ చేరమని, ప్రస్తుతం మా వృత్తిలో మేము బిజీగా ఉన్నామని ఆయన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. తాము రాజకీయ పార్టీ పెట్టడం లేదని కూడా నాగబాబు స్పష్టం చేశారు. మీడియా కథనాలు అభిమానులను, ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయని వాపోయారు. మీడియా ఈ విధంగా ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.అయితే ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణతో భేటీ అయిన విషయాలను గానీ, పలు జిల్లాలలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో కూడిన ఫ్లెక్సీల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

అభయ నిందితులకు 14 రోజులు రిమాండ్

      హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అభయ కిడ్నాప్, అత్యాచారం కేసు నిందితులు సతీష్, వెంకటేశ్వర్లును పోలీసులు బుధవారం ఉదయం మియాపూర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై విచారణ జరిపిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నిందితుల విచారణ నిమిత్తం రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నిందితులపై గ్యాంగ్‌రేప్, కిడ్నాప్, అక్రమ నిర్బంధం సెక్షన్లతో పాటు నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి నిందితుడు సతీష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

విభజనకి గవర్నర్ గండం

      రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్నారు. రాష్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ తెగ ఉత్సాహపడిపోతూ పావులు చకచకా కదుపుతున్న ఈ తరుణంలో నరసింహన్ చేస్తున్న ఢిల్లీ పర్యటనకి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. బుధవారం నాడు నరసింహన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి చిదంబరంతో విడివిడిగా సమావేశమై అరగంటకు పైగా చర్చలు జరిపారు. అలాగే బుధవారమే ఎ.కె.ఆంటోనీతోపాటు రాహుల్‌గాంధీని కూడా కలుస్తున్నారు. ఈ భేటీలలో నరసింహన్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలనూ పూసగుచ్చినట్టు వివరించే అవకాశం వుంది. నరసింహన్ కేంద్రానికి ఇచ్చే నివేదికలు రాష్ట్ర విభజన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పాయింటే ఇప్పుడు విభజనవాదుల్లో గుబులు పుట్టిస్తోంది. విభజనవాదులు విమర్శించేదాని ప్రకారం గవర్నర్ నరసింహన్ నూటికి నూరుశాతం సమైక్యవాది. తెలంగాణ మీద కేంద్రానికి గవర్నర్ తప్పుడు నివేదికలు పంపుతున్నారని విభజనవాదులు గతంలో అనేకసార్లు ఆయన మీద ఒంటికాలితో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ  సాక్షిగా ఆయన మీద పేపర్లు విసిరారు. నరసింహన్ మాజీ పోలీసు అధికారి. ఎవర్ని ఎప్పుడు ఎక్కడ దెబ్బకొట్టాలో బాగా తెలిసిన వ్యూహకర్త. అలాంటి నరసింహన్ తెలంగాణవాదులు తనను ఎన్నిరకాలుగా విమర్శించినా, హద్దుమీరి ఆరోపణలు చేసినా ఏనాడూ ఆవేశపడలేదు. చాలా సందర్భాలలో ఆయన నోటి వెంట ‘రాష్ట్రం’ బాగుండాలనే మాటలు వినిపించాయి.  అలా విభజన వ్యతిరేకిగా ముద్రపడిన నరసింహన్ ఢిల్లీలో నివేదికలు అందిస్తూ ఉండటం తెలంగాణవాదుల్లో గుబులు పుట్టిస్తోంది. నరసింహన్ ఎలాంటి నివేదికలు ఇస్తారో, తెలంగాణకు ఎక్కడ ఏ పుల్ల అడ్డువేస్తారో అని విభజనవాదులు భయపడుతున్నారు. విభజనవాదులు గతంలో చేసిన విమర్శలను నరసింహన్ మనసులో పెట్టుకుని విభజనకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తారేమోనన్న దడ విభజనవాదుల్ని పట్టి పీడిస్తోంది. తెలంగాణకు గవర్నర్ రూపంలో వచ్చిన గండం గడిచిపోవాలని విభజనవాదులు కోరుకుంటున్నారు.

ఆర్టీసీ ఛార్జీల మోత

      మరోసారి ఛార్జీల మోత మోగించేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. సంస్థకు వస్తున్న నష్టాలను నివారించి ఆర్థిక వనరులను పెంచుకోవడంలో భాగంగా ఛార్జీల పెంపు తప్పదని ఆర్టీసీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఛార్జీల పెంపు ప్రతిపాదనలతో నేడో ..రేపో మంత్రి బొత్స ముఖ్యమంత్రిని కలవనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్టీసీ రూ.400 కోట్ల నష్టాల్లో ఉండడం, విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మెతో రూ.745 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఈ మొత్తాన్ని ఒక్కసారిగా కాకుండా వాటిలో దాదాపు రూ.400 కోట్ల మేరకు భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ మనుగడ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రవాణామంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించడం, పెరిగిన డీజిల్‌ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతించడం ద్వారా సంస్థను కాపాడాలని ఇటీవల కొన్ని సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. సమ్మె వల్ల కోల్పోయిన ఆదాయం రూ.745 కోట్లలో ప్రభుత్వం వాహన పన్ను మినహాయించడం ద్వారా ఆర్టీసీకి రూ.400 కోట్ల భారం తగ్గే అవకాశం ఉండగా రూ.345 కోట్లకు అదనంగా రూ.55 కోట్లను కలిపి డీజిల్‌ ఛార్జీల పెరుగుదల సర్దు బాటుగా ఛార్జీలు పెంచాలని అధి కారులు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపుపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అందులోభాగంగా ప్రజల ఆగ్రహాన్ని చవిచూడకుండా ఉండేందుకు ఛార్జీలను కనీసం కిలో మీటర్‌కు పది పైసలు పెంచడం ద్వారా తాత్కాలికంగా కొంత మేరకు నష్టాలను నివారించు కోవాలని ఆర్టీసీ భావిస్తోంది.

ఇంటింటికీ టిడిపి

      తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్రతో పాటు తమ కార్యకర్తలకు కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా క్యాడరు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టనున్నారు. కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి, కాంగ్రెస్ రాజకీయాలు,విభజనలో ఉన్న కుట్ర,తదితర అంశాలను వివరించాలని చంద్రబాబు నాయుడు కార్యకర్తలను కోరుతున్నారు. విభజన మూలంగా రాష్ట్రంలో ఏర్పడే ఇబ్బందులతో పాటు, అవినీతి నేతలను ఎన్నుకుంటే వచ్చే ఇబ్బందులను కూడా గడపగడపకు ప్రచారం చేయాలని నిర్ణయించారు. నవంబరులో రెండో విడత ఆత్మగౌరవ యాత్ర విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మొదలు కానుంది.

ఎవరికి ఓటు వెయ్యాలో చెబుతా: అశోక్‌బాబు

      అధికారం కోసం అమ్ముడు పోయే పార్టీలకు బుద్ధి చెప్పాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వెయ్యాలో తామే చెబుతామని, ఆ బాధ్యత సీమాంధ్రులు తమకు ఇచ్చారన్నారు. సీమాంధ్రుల పోరాటాన్ని కొందరు నాయకత్వం లేని ఉద్యమంగా అభివర్ణిస్తున్నారని, ఇక్కడ ప్రజలే నాయకులని ఆయన స్పష్టం చేశారు. ఇంతకాలం సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్ఠానానికి తొత్తులుగా మారిపోయారని అశోక్‌బాబు విమర్శించారు. రాజ్యాంగం తెలియని మంత్రులుండడం తమ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. "మన ఉద్యమాన్ని మనమే కొనసాగిద్దాం. నేను, నాతో ఉన్న వారు అమ్ముడుపోయారని చాలా మంది మాట్లాడుతున్నారు. మేమంతా ఎవరికో అమ్ముడుపోలేదు. కేవలం సీమాంధ్ర జిల్లాల ప్రజాభిమానానికి అమ్ముడు పోయాం. ఈ సత్యాన్ని విభజనవాదులు గ్రహించాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

రెండు రాష్ట్రాలకు నరసింహనే గవర్నర్!

      రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్ గా నరసింహన్ ను నియమించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజకీయ, సామాజిక అంశాల మీద గవర్నర్ కు మంచి పట్టున్న నేపథ్యంలో ఆయన హైదరాబాద్ నుండి రెండు రాష్ట్రాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తారని అంటున్నారు. కేంద్రం పిలుపు మేరకు ఆయన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు చిదంబరం,షిండే తదితరులతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే చిదంబరాన్ని కలిసి రాష్ట్ర పరిస్థితులపై , ముఖ్యంగా హైదరాబాద్ అంశంపై ఆయన ఒక నివేదిక ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

ఎందరో ముఖ్యమంత్రులు అందరికీ వందనాలు

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొదటి ప్రభుత్వం ఎవరిది, మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారనేది తెలంగాణాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది. కాంగ్రెస్ నేతలు తామే మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జైత్రయాత్రలు మొదలుబెడితే, ‘మీ హస్తంలో అధికారం పెట్టడానికేనా ఇన్నేళ్ళు మేము ఉద్యమాలు చేసేము?' అని ప్రశ్నిస్తూ తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతని, అందుకోసం మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యతని కూడా తెరాసయే పుచ్చుకొంటుందని, తెరాస నేతలు తమ కారు మీద ఒట్టేసి మరీ చెపుతున్నారు. ఈవిధంగా తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు రెండు పార్టీలు కృతనిశ్చయంతో ఉండగా, కాంగ్రెస్ పార్టీలోనే అనేకమంది నేతలు ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు.   వారిలో జానారెడ్డి, డీ.శ్రీనివాస్, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, డీకే అరుణ, శ్రీధర్ బాబు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఇంకా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంకా ఎందరో నామకనామకులు చాలా మందే ఉన్నారు. మంత్రి అరుణ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ మెహబూబ్ నగర్ నుండి పోటీ చేసి తమను కరుణించాలని వేడుకొన్నారు. మరి ఆయన తన విన్నపాన్నిమన్నించినా, మన్నించకపోయినా తనను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఓసారి కూర్చోనిస్తే చాలని ఆమె చిరు కోరిక.   ఇక తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తను కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ కాదు ఏకంగా దుప్పటే వేసేసానని ప్రకటించేశారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నఅవినాబావ సంబంధం గురించి మరిచిపోయిన ఆయన, అవినీతి రహితమయిన ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీయే మొట్టమొదట ప్రభుత్వం ఏర్పరచవలసిన ఆగత్యం ఉందని ఆయన అన్నారు. ‘కనీసం మరో పదేళ్ళపాటు (?) అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం చాలా ఉందని' ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ  విషయంలో అందరూ ఆయనను అభినందించక తప్పదు. ఎందుకంటే ఒక కుంభకోణం కప్పెట్టేలోగా మరోకటి బయటపడుతూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకి కేరాఫ్ ఎడ్రెస్ గా మారిపోయిన ఈ తరుణంలో కూడా ఏకంగా ‘పదేళ్ళ పాటు అవినీతి రహిత ప్రభుత్వం’ ఏర్పాటు చేయడమంటే మాటలా? అయినా కూడా పాపం పాల్వాయి అందుకు తెగించి మరీ హామీ ఇస్తున్నారంటే, అధిష్టానం ఆయనను ముఖ్యమంత్రి చేసినా చేయకపోయినా జనాలు మాత్రం ఆయన దైర్యానికి తప్పకుండా మెచ్చుకొని తీరాల్సిందే.   తెలంగాణా ప్రజల పాలిట దుర్గామాతవంటి సోనియా గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్న తను రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్దిపదంలో తీసుకుపోతానని ఆయన హామీ కూడా ఇచ్చారు. మరి ఆయన అంత గట్టిగా 10సం.ల వరకు ( అక్షరాల పదేళ్ళవరకు మాత్రమే) అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గ్యారంటీ ఇస్తున్నపుడు, ఆ పెద్దాయన మాట మన్నించి మిగిలిన వారు రేసు లోంచి తప్పుకొంటారనే నమ్మకం మాత్రం లేదు. అందుకే ‘ఎందరో ముఖ్యమంత్రులు అందరికీ వందనాలు’ అని ప్రజలు వారందరికీ ఓ దణ్ణం పెట్టి వారిలో ఎవరికో ఒకరికి ఒటేయక తప్పదు మరి. సీమంద్రాలో కూడా ఈ స్టోరీ సేమ్ టు సేమ్.