అవును కాంగ్రెస్ ను నమ్మి మోసపోయాము: దాడి

  కాంగ్రెస్ యంపీ సబ్బం హరి ఇంకా వైకాపాలో చేరక ముందే, “వైకాపా ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని” ప్రకటించినందుకు ఆయన మొహం మీదనే వైకాపా తలుపులు వేసేసి, ఆయనతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని తెగతెంపులు చేసుకొంది. అసలే కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఆవిధంగా ఆగ్రహించడం సహజమే.   కానీ ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మరో నేత దాడి వీరభద్రరావు మీడియాతో మాట్లాడుతూ “సోనియాను నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టించారని, ఆమెను నమ్మి జగన్ మోసపోయారని, అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని,” అనడం చూస్తే ఆయన వైకాపాపై వస్తున్నఆరోపణలు ఖండిస్తున్నారా లేక నిజమేనని దృవీకరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే జగన్ సోనియాను నమ్మడం, కాంగ్రెస్ కు మద్దతు పలకడం గురించి ఇప్పుడు ఆయనే స్వయంగా ద్రువీకరిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని హామీ ఇస్తున్నారు.   ఎందువల్ల అంటే వైకాపా చేస్తున్న సమైక్యఉద్యమం వల్ల పార్టీకి సీమాంద్రాలో ఆశించినంతగా స్పందన రాకపోవడానికి ప్రధాన కారణం, తమ పార్టీకి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్నాయనే ఆరోపణలేనని అనేకమంది నేతలు అభిప్రాయ పడుతున్నందున, బహుశః దాడి వీరభద్రరావు ద్వారా ఆ అనుమానాలు నివృత్తి చేయాలని వైకాపా ఉద్దేశ్యం కావచ్చును. కానీ, ఆయన ఇచ్చిన వివరణ మూలంగా ఉన్నఅనుమాలు నివృత్తి కాకపోగా అవి మరింత బలపడేందుకు దోహదపడింది. అందువల్ల సబ్బం హరికి ఎదురయిన అనుభవమే ఇప్పుడు దాడికి కూడా ఎదురవబోతోందా? వేచి చూడాల్సిందే.

టిడిపి దారిలో 'పవర్ స్టార్'..!!

      గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజీకీయాల్లోకి వస్తున్నాడంటూ వస్తున్న వార్తలకు తెరపడటం లేదు. తాజా పరిణామాల దృష్ట్యా చూసుకుంటే పవన్ టిడిపిలో చేరనున్నాడు అనే వార్తలకు మరింత బలం చేకూరుతోంది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్త అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన అన్నయ్య ఆ పార్టీతోనె చేతులు కలపడం పవన్ కు జీర్ణించని పరిణామం అని అందరూ చెప్పుకుంటుదే. తాజాగా వస్తున్న వార్తల్లో విశేషమేమిటంటే...పవన్ కళ్యాణ్తో పాటు అన్నయ్య నాగబాబు కూడా టిడిపి లో చేరబోతున్నారని టాక్ మొదలైంది. ఈ మేరకు స్వయంగా ఆయన నందమూరి బాలకృష్ణతో భేటి అయినట్లు సమాచారం. ఈ రెండు విషయాలపై అటు పవన్ నుంచి, ఇటు టిడిపి పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, కామెంట్స్ కానీ రాలేదు. అలాగే ఈ రెండు విషయాల్లో వాస్తవమేమిటనేది పక్కనపెడితే ప్రస్తుతం ఈ ఊహాగానాలు మాత్రం రాష్ట్రం అంతా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో కాలమే నిర్ణయించాలి.     Video Courtesy ABN ANdhrajyoti              

కిరణ్ విభజనను అడ్డుకోలేరు

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం జవాబు ఇచ్చింది. కిరణ్ విభజనను అడ్డుకోలేరని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ తేల్చిచెప్పారు. రాష్ట్రాల విభజనను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరని, రెండేళ్లపాటు సంప్రదింపులు జరిపిన తరవాతనే తెలంగాణ మీద అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అన్నారు. మంత్రుల బృందం ప్రస్తుతం అన్ని విషయాలు పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా బిల్లును తయారు చేస్తుందని ఆయన తెలిపారు. ఇదే విషయం దిగ్విజయ్ ని అడిగితే ఆయన నవ్వి ఊరుకున్నారు. మొత్తానికి కిరణ్ ఇప్పుడు ఏం చేస్తారు అన్నది వేచిచూడాలి.

రాజ్యాంగంలోనే రాష్ట్ర సమైక్యతను కాపాడగల క్లాజు [ఇ]?!

  ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]       రాజనీతి శాస్త్రాన్ని కాస్తా స్వతంత్రభారతదేశంలో "పదవీరాజకీయ శాస్త్రం''గా మార్చిన 'ఘనులు' కాంగ్రెస్ నాయకులు! అలాంటివాళ్ళు దేశ సమాఖ్య (ఫెడరల్)వ్యవస్థను ప్రజాప్రయోజనాల రక్షణకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల సుస్థిరతకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు తోడునీడగా ఉండకుండా కేవలం ఎన్నికలలో విజయం సాధించడం కోసం 'పావు'గా వినియోగించుకుంటూ వస్తోంది. అలాంటి తాజాగా చేతివాటంగా అందివచ్చిన 'పావు' - స్వతంత్ర భారతంలో భాషాప్రయుక్త ప్రాతిపదికపై మొట్టమొదటిసారిగా ఏర్పడిన పెద్దరాష్ట్రమైన తెలుగువారి "ఆంధ్రప్రదేశ్''ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో తమ నాయకురాలైన ఇటాలియన్ సోనియా రాజకీయ కుటుంబ ప్రయోజనాలకోసం అశాస్త్రీయంగా నిట్టనిలువునా చీల్చడానికి తీసుకున్న నిర్ణయం! ఆంధ్రప్రదేశ్ లో భాగమైన తెలంగాణా ప్రాంతంలో 15 పార్లమెంటు సీట్లకోసమని వేర్పాటువాదులయిన కొందరు రాజకీయ నిరుద్యోగులతో చేతులు కలిపి కాంగ్రెస్ ఈ పనిచేసి, తెలుగుజాతికి విద్రోహం తలపెట్టి, ఆ విద్రోహాన్ని సమర్థించుకోడానికి మరికొన్ని తప్పులు చేస్తూ పోతోంది. ఇందుకు అది ఆధారపడుతున్నది రాజ్యాంగంలోని 2,3,4 అధికరణలమీద. ఈ మూడింటి సారాంశం - భారత యూనియన్ లో కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి, ఉన్న రాష్ట్రాలనుంచి భూభాగాలను చీల్చి మరొక రాష్ట్రంలో విలీనం చేయడానికి పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని చెప్పడం. 3వ అధికరణ ప్రకారం - నూతన రాష్ట్రాలను ఏర్పర్చడమే గాక, ప్రస్తుతమున్న రాష్ట్రాల వైశాల్యాన్ని పెంచడానికి, లేదా కుదించడానికి, లేదా వాటి సరిహద్దుల్ని మార్చడానికి లేదా ఆ రాష్ట్రాల పేర్లను కూడా మార్చడానికి శాసనం రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉంది!     అయితే పాలనాధికారాన్ని చేపట్టే రాజకీయపార్టీలు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తమ "బ్రూట్ మెజారిటీ''ద్వారా తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించడానికి ఈ అధికరణవల్ల అవకాశం దొరికింది! రానురానూ ఈ తప్పుడు సంప్రదాయం ఎక్కడికి దారితీస్తోంది? పాలనా పగ్గాలు పట్టుకున్న అధికారపక్షాలు భారత సమాఖ్య వ్యవస్థలోని రాష్ట్రాల ప్రజల మెజారిటీ అభీష్టాన్ని, ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాల చట్టసభలనూ ఖాతరు చేయకుండా కూడా కొత్తరాష్ట్రాలను స్వార్థప్రయోజనాలకోసం ఏకపక్షంగా ఏర్పర్చచే దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది పంజాబ్-హర్యానాలుగా పంజాబ్ విభజనతోనే మొదలయింది! పంజాబ్ శాసనసభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా సభ ఆమోదముద్ర లేకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ అధికారపక్షం పంజాబ్ ను విభజించేసింది! రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ఐక్యతను బలిగొన్నది! అదే పద్ధతిని ఇప్పుడు దేశంలోని తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను బలిగొనజూస్తోంది! ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తనకు తననే ఆంధ్రప్రదేశ్ లో ఆత్మాహుతికి సిద్ధమవుతోంది! కొందరు వేర్పాటువాద నాయకుల వత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ఆంధ్రప్రదేశ్ ను 3వ అధికరణ ఆధారంగా విభజించడానికి సిద్ధమయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలైన ఇటాలియన్ సోనియా నాయకత్వంలో హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర విబజనకోసం మూడు రకాల ప్రతిపాదనలతో ఒక "నోట్'' (పత్రం) తయారుచేసింది. దాన్ని మంత్రి షిండేకి సమర్పించింది. ఇదో విచిత్రమైన పత్రం! దీనికి పునాది రాజ్యాంగంలోని 3వ అధికరణమే అయినా, హోంశాఖ "నోట్''లో మొదటి అంశం పూర్తిగా ప్రజల పరిశీల దృష్టికి యింకా వచ్చినట్టులేదు! అది - "పదిజిల్లాలతో ఏర్పడగల తెలంగాణా రాష్ట్రంలో ఆ పదిజిల్లాలతో పాటు తెలంగాణలో ఐచ్చికంగా ఏ ఇతర జిల్లాలయినా సరే వచ్చి చేరదలిస్తే అవన్నీ చరవచ్చు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పిమ్మట తెలంగాణాగానే ఏర్పడుతుంది'' ["Along with 10 districts, any other disstricts that voluntarily come forward to join in Telangana will be taken into consideration and Telangana will be formed]!   ఈ "నోట్''ను ఎవరు తయారుచేశారోగాని సదరు పత్రకారుడు సరసుడే కాదు, ప్రజలను విభజించి-పాలించటం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! రాష్ట్ర మెజారిటీ, ప్రజల ఆకాంక్షకు అనువునంగానే ఈ 'నోట్' డ్రాఫ్టింగ్ తయారైనట్టుంది! చివరికి ఏ కేంద్రపాలకపక్షం ఏ "3''వ రాజ్యాంగఅధికరణ ఆధారంగా, ఐక్యంగా ఉన్న తెలుగుజాతిని చీల్చాలని ఉవ్విళ్ళూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని "ఇ''క్లాజు కూడా "రాష్ట్రం పేరును మార్చుకోవచ్చు''నని అభ్యంతరం లేదనీ చెప్పింది! అంటే హోంశాఖవారి అద్భుతమైన 'డ్రాఫ్టింగ్' పర్యవసానంగా వెలువడిన ఆ "నోట్'' తెలంగాణాలోని పదిజిల్లాలతో పాటు మరిన్ని జిల్లాలు, ఎన్ని జిల్లాలు వస్తే అన్ని జిల్లాలు 'తెలంగాణా రాష్ట్రం'గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించినట్టయింది! ఆ లెక్కన రాష్ట్రంలోని మిగిలిన 13జిల్లాలు కూడా ఆ పదిజిల్లాలతో కలిసిపోతే - అదే హోంశాఖ "నోట్'' ఆశిస్తున్న మొత్తం రాష్ట్రం అంతా నిజంగానే అక్షరాలా "తెలంగాణా'' అవుతుంది గదా!! ఎందుకంటే, ఈ మాట వ్యంగ్యంగా అనటంకాదు, ఎగతాళి కోసం అంటున్న మాట అంతకంటే కాదు. నిజానికి "తెలంగాణం'' అంటే తెలుగులకు (తెలుగువారికి) అణెము, అంటే తెలుగువారు నివశించే చోటు అనీ, ప్రాంతం అనీ, నివాసమనీ వ్యవహారార్థమూ, విశిష్టార్థమూనని గుర్తించాలి! పండితులూ, నిఘంటుకారులూ స్థిరపరిచిన స్థిరనివాసమే తెలుగువారి తెలంగాణం! చరిత్ర తెలియని మన తెలుగు రాజకీయ సన్యాసులకన్నా, గిరీశం భాషలో మన 'వెధవాయిల'కన్నా కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రాంతాలతో పాటు సుమారు 300 ఏళ్ళపాటు దక్కన్ వరకూ ఏలికలుగా ఉన్న మహమ్మదీయ పాలకులు తెలుగు పాలకులకన్నా తెలివిగల వాళ్ళు కాబట్టి తాము పాలిస్తున్న నివసిస్తున్న ప్రాంతమంతా తెలుగువారిది కనుకనే మొత్తం తెలుగుప్రాంతాన్ని 'తెలంగాణం' [15-16 శతాబ్దాల దేశపటాల్లో "తెలంగాణం'' అని లిఖితపూర్వకంగా పేర్కొని] అని పేరుపెట్టుకున్నారని గుర్తించాలి!   అందువల్ల "తెలంగాణా రాష్ట్రం'' అంటే మొత్తం తెలుగు ప్రాంతమంతటికీ వర్తిస్తుంది కాబట్టే హోంశాఖ "నోట్'' తెలుగువారి అన్ని జిల్లాలూ వచ్చి చేరమని ("any other districrs that come forward")  ఆహ్వానం పలికి ఉంటుంది! మరో మాటలో చెప్పాలంటే మిగతా 13 సీమాంధ్రజిల్లాలు కూడా వెరసి మొత్తం 23 జిల్లాలతో కూడిందే తెలంగాణం/ఆంధ్రప్రదేశ్ లేదా విశాలాంధ్ర రాష్ట్రం గదా! అందువల్ల ఇప్పుడున్నదంతా 'తెలంగాణం' అదే 'తెలుగునాడు! కాబట్టి రాజ్యాంగంలోని 3వ అధికరణం "ఇ''సెక్షను ప్రకారం "ఆంధ్రప్రదేశ్'' రాష్ట్రాన్ని కృత్రిమంగా విభజించకుండానే పేరును అర్థవంతంగా అమరగల "తెలంగాణా''గా లేదా "తెలుగునాడు''గా మార్చుకోవచ్చు! తద్వారా "విభజన'' అనే పురుగును, లేదా 'కలుపుమొక్క'ను లేదా 'బి.టి.'లాంటి వినాశకర విత్తనాన్ని [టెర్మినేటర్ సీడ్] మనస్సులనుంచి పెకించివేయవచ్చు! తొలుత దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి రాష్ట్రం ఏర్పడినప్పుడు, రెండురకాల పరాయి పీడనా పాలనలనుంచి తెలుగుజాతి ఒక్క గొడుగుకిందికి వచ్చినప్పుడు ఆకారాది క్రమం కోసం అటు ఇంగ్లీషు వర్ణమాలకు, ఇటు తెలుగువర్ణమాలకు తొలి అక్షరంతో 'A'/ 'ఆ'/"ఆంధ్రప్రదేశ్" (Andhra Pradesh) ఏర్పడడం శుభదాయకం అనుకున్నారు పెద్దలు. ఆ ఆశతోనే, పేరు తప్పు సమాసం అయినా "ఆంధ్రప్రదేశ్' పేరును ఎంచుకోవటం జరిగింది. కాని, ఆకారాదిక్రమంలో తొలి అక్షరంతో మనం 8వ షెడ్యూల్ లో అగ్రభాగంలో కనిపించినంతమాత్రాన అభివృద్ధికి చిహ్నం కాదు, అలా లేకపోయినంత మాత్రాన ఒక రాష్ట్రం పేరు కడుపంక్తిలో [ఉదా: తమిళనాడు - Tamilnadu ఉందికాబట్టి ప్రగతిపథంలో అది అట్టడుగున ఉందనీ చెప్పలేం!]   అందువల్ల, వ్యక్తులకుగానీ, రాష్ట్రంకుగాని వారికి (వాటికి) తగినట్టుగా అర్థవంతంగా ఉండాలేగాని 'పేరు' బలాల్ని బట్టి, 'నక్షత్రబలాల్ని' బతి విలువలూ, గౌరవప్రతిష్టలూ సమకూడవు! ఎందుకంటే అబద్ధాలతో, బూతులతో 'ఉద్యమాలు' నిర్మించేవారంతా చచ్చినా కొమరం భీములూ కాలేరు, దొడ్డి కొమరయ్యలూ కాజాలరు; వినాయక వేషధారులంతా ప్రజానాయకులు కారు; గాంధీ పేరుతొ చెలామణీ కాదలచుకునే వారంతా గాంధీలూ కారు, భగత్ సింగ్ పేరు తగిలించుకునే వారు విప్లవకారులూ కాలేరు; అల్లూరి సీతారామరాజును కొలిచేవారంతా ఆయని పేరు ఉచ్చరించడానికీ తాగారు; రుద్రమ పేరు పెట్టుకున్న వారంతా వీరనారీమణులూ కారు; చిత్తం చెప్పులమీద భక్తి శివుడిమీద నిలిపే వారంతా నిజమైన భక్తులూ కారు; యావదాంధ్ర శ్రమజీవుల ప్రతినిధిగా కష్టజీవులకు బతుకునిచ్చే బతుకమ్మ/అదే దుర్గమ్మ/అదే గౌరమ్మను కాస్తా హైజాక్ చేసి క్షుద్ర రాజేకీయాలకోసం వాడుకో జూసే సంపన్నుల బతుకులు బతుకులూ కావు; ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఆంద్ర (తెలుగు) జాతి చరిత్రకూ దాని వేల సంవత్సరాల సంస్కృతీ విభావానికీ ఐకమత్యానికీ దివిటీలుగా నిలిచినా శాతవాహన, కాకతీయ, విజయనగర ప్రజాహిత పాలనా యుగాలను విస్మరించిన తెలుగుజాతి విచ్చిన్నకులూ, అందుకు దోహదం చేసిన ఆధునిక విద్యోజులయిన రాకీయ దుర్యోధన, దుశ్శాసనలూ మూడు ప్రాంతాల ప్రజాబాహుళ్యం గుండెల్లో శాశ్వత శత్రువులుగా నమోదు కాకుండా తప్పించుకోలేరు; తెలుగువారి మహాయుగాల ఆనవాళ్ళను చేరిపివేయడానికి ప్రయత్నించిన ఆధునిక రాజకీయ 'సామంతులు'గా, చరిత్రహీనులుగా వీళ్ళు మిగిలిపోతారు!   ఎందుకంటే, "ప్రజాప్రతిదుల'' వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలకపక్షాలు,ముఖ్యంగా దీర్ఘకాలంపాటు దేశాన్ని ఏలుతూ వచ్చిన చెడిపోయిన కాంగ్రెస్ తో కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్ళుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ కుత్సితమైన స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి సహితం వేనుదీయలేదు. వాటిల్లో కొన్ని - రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్యూట మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి - రేపటి పాలకపక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలు! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేడ్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవికావు!  స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధవిరుద్ధమైన సవరణ చట్టాలు తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ అధికరణ ఒకటికాగా, ఆ సవరణ కేంద్రం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణక్కు భాషాప్రయుక్త ప్రాతిపదికపైన ప్రజాహితంగా దేశంలోనే తొలిమెట్టుగా తెలుగుజాతినంతనూ ఒక్క గొడుగుకిందికి తెచ్చేందుకు సాధికార కమీషన్ సిఫారసులు ఆధారంగానే 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది; దానికి తగినట్టుగానే రాష్ట్రంలోని మూడుప్రాంతాల మధ్య కాలక్రమంలో ఉద్యోగ సద్యోగాలలో ప్రాంతాలమధ్య సమతుల్యమైన ఆర్థికాది రంగాలలో సాధ్యమైనంత త్వరగా అభ్యుదయాన్ని సాధించడం కోసం ఏ ఇతర రాష్ట్రానికీ లేని ఒక విశిష్టమైన ప్రత్యేకమైన (స్పెషల్) సవరణ చట్టాన్ని 371 (డి) పేరిట రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.   కాగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషాప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు "డి'' క్లాజుద్వారా రాజ్యాంగానికి సవరణ చట్టం తీసుకువచ్చి, దానికి భాష్యం చెప్పాలన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్తుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే యితర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలుగాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్రప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371 (డి) సవరణ చట్టానికి మూడింట రెండువంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దానిద్వారా కేంద్ర క్యాబినెట్టుకూ సాధ్యమవుతుంది గాని అడ్డదారుల్లో కాదు! పైగా, హోంశాఖ చూపిస్తున్న "నోట్''లో, నేడు ప్రజావ్యతిరేకులుగా మారి ప్రజలకోసం పదవుల్ని త్యాగం చేయలేని 'దేహభక్తి'కి తప్ప దేశభక్తికి దూరమైనా నాయకులకు తెలియని ఒకటి రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి యిచ్చిన "ఒకటవ వివరణ''లోనే ఉంది. ఇది రెండురకాల భాష్యానికి అవకాశమిస్తోంది.   ఎలా అంటే, 3వ అధికరణలో 'ఎ'నుంచి 'ఇ'వరకూ ఉన్న క్లాజుల్లో "రాష్ట్రం'' అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యు.టి.)ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! అయితే జనాన్ని పాలకపక్షాలు గందరగోళ పరచడం కోసం చేసిన ప్రయత్నం మినహాయింపు "క్లాజు'' పేరిట "రాష్ట్రం'' అనే పదంలో "కేంద్రపాలిత ప్రాంతం'' చేరి ఉండదని అదే "వివరణ (1)''లో విరుద్ధంగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్రప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ, ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని "కేంద్రపాలితప్రాంతం''గానో (యు.టి) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ట్ర "విభజన'' గురించి ఆలోచించాలిగాని అంతకుముందు కాదని ప్రతిఆదించడానికి కారణం - 3వ అధికరణంలోని ఈ అయోమయపు "వివరణ 1''! కాబట్టి - మొత్తం తెలుగుజాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోడానికిగాను, "ఆంద్ర'' అనే పదా(తెలుగు అనేది తెలియక)నికి అజ్ఞానంతో కొందరు 'ఎలర్జీ' పెంచుకుని తెలుగుజాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగా 3వ అధికరణలోని "ఇ''క్లాజు ప్రకారం గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగువాడికీ అభ్యంతరం ఉండదు, మనసారా ఆహ్వానించి తీరుతాడు! సెంటిమెంటును గౌరవించాలనుకునే వారంతా కోస్తా నుంచి దక్కను దాకా తెలుగువారి నివాసప్రాతంగా ''తెలంగాణా'' పేరు హేతుబద్ధమైన పేరు రాష్ట్రానికి చక్కగా అమరుతుంది, అర్థవంతంగా భాసిల్లుతుంది, అరమరికలులేని తెలుగుజాతికి ఆత్మవిశ్వాస సోర్యోదయంగా చిరంజీవిత్వం కల్గిస్తుంది!

లాలూపై అనర్హత వేటుకి రంగం సిద్దం

  పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడి ఐదేళ్ళు జైలు శిక్షపడి ప్రస్తుతం రాంచీ జైలులో ఊచలు లెక్కబెడుతున్నపార్లమెంటు సభ్యుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరియు మెడికల్ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల జైలు శిక్షపడిన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ లపై వెంటనే అనర్హత వేటు వేసి, పార్లమెంటులో వారి స్థానాలు ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి సూచించాలని అటార్నీ జనరల్ జీ.ఈ.వాహనవతి లోక్ సభ సెక్రెట్రియెట్ కు సూచించారు. ఇంకా జాప్యం చేసినట్లయితే అది కోర్టు దిక్కారం క్రింద పరిగణింపబడే ప్రమాదం ఉందని ఆయన సెక్రెట్రియెట్ అధికారులను హెచ్చరించారు. రషీద్ పై అనర్హత వేటువేసేందుకు ఇప్పటికే ప్రక్రియ మొదలవగా, ఇప్పుడు వాహనవతి హెచ్చరికతో లాలూపై కూడా అనర్హత వేటుకి రంగం సిద్దం అవుతోంది.

మళ్ళీ టీ-దుఖాణం తెరిస్తే జనాలొస్తారంటారా మాష్టారు

  తెలంగాణా సెంటిమెంటుని గౌరవించడం పూర్తయిన తరువాత, వైకాపా ఓ వారం పది రోజుల పాటు సమన్యాయం కోసం నడుం బిగించింది. కానీ సమన్యాయం కంటే సమైక్యమే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని భావించడంతో సమైక్యశంఖారావం పూరించేసి మూడు దీక్షలు, ఆరు ధర్నాలతో సీమాంధ్ర ప్రాంతాన్ని హోరెత్తించేసింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సైంధవుడిలా మాటి మాటికి అడ్డుతగులుతూ వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా చేయడంతో, జీవితాన్నే మార్చేసే మరో కొత్త ఐడియా కోసం ఆలోచించక తప్పలేదు.   అప్పుడు సమైక్యమంటే సమైక్యం కాదనే ఒక సరికొత్త ఐడియా కనిపెట్టి దానికి ఈవిధంగా డెఫినిషన్ ఇచ్చారు. సమైక్యమంటే తెలుగు ప్రజలందరి కష్టాలు తీర్చడం కోసం చేసే పోరాటమని, కనుక అందులో తెలంగాణా ప్రజల కష్టాలు, సమస్యలు కూడా ఇమిడే ఉన్నాయని వివరించిన తరువాత, కావాలంటే తెలంగాణా కోసం కూడా ఉచితంగా పోరాడిపెడతామని తెలంగాణా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఒక బంపర్ ప్రకటించారు. అంటే సమైఖ్యం నుండి బ్యాక్ టు సమన్యాయం అన్నమాట!   ఇక ఎలాగు సమన్యాయానికి రిటర్నయిపోయిన తరువాత, అదే పాలసీతో తెలుగుదేశం పార్టీ నేటికీ తెలంగాణాలో నిలబడి ఉంటే, మనం మాత్రమే దుఖాణం ఎందుకు బంద్ చేసుకోవాలి? అనే ధర్మసందేహం కలగడంతో ఈ నెల 26న హైదరాబాదులో ఆయన పెట్టబోయే సమైక్యసభకు తెలంగాణాలో రోడ్డున పడ్డ వైకాపా నేతలకు కూడా 'ద్వారములు తెరిచియేయున్నవి' అని ప్రకటించేసారు.   అంతే కాకుండా మెహబూబ్ నగర్ జిల్లాలో అటువంటి వైకాపా బాధిత నేతలతో హైదరాబాదు పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యేరు కూడా. సభను విజయవంతం చేయవలసిన బాధ్యతలు కూడా వారికే ఉదారంగా అప్పగించేశారు. పనిలోపనిగా మళ్ళీ తెలంగాణాలోదుఖాణం తెరిచేందుకు గట్టిగా ప్రయత్నించమని కూడా వారికి నచ్చజెప్పారు. ఎందుకంటే తీవ్ర నీటి సమస్యలతో బాధపడుతున్న అక్కడి ప్రజలను ఆదుకోవాలని ఆయన మనసు చాల తహతహలాడుతున్నపటికీ, వారు కూడా ఆయనకు ఓటేసి గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేస్తే తప్ప, వారి సమస్యలను పరిష్కరించలేని అసహాయత వెలిబుచ్చారు.   విస్వసనీయతకు మారుపేరయిన ఆయనను, ఆయన పార్టీకి మళ్ళీ తెలంగాణా ప్రజలు బాజా బజంత్రీలతో ఎదురేగి స్వాగతం చెపుతారో లేదో చూడాల్సి ఉంది. పాపం కొండా సురేఖే ఇన్ని ట్విస్టులు ఉంటాయని గ్రహించలేక తొందరపడిపోయి పార్టీలోంచి కాంగ్రెస్ లోకి జంపయిపోయింది. అయినా మరేమీ పరువలేదని లగడపాటి వంటి వారు హామీ ఇస్తున్నారు కదా.

పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

      పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ విప్ జారీ చేస్తే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అనుకూలంగా ఓటు వేస్తారని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. తెలంగాణ ప్రకటన వచ్చినప్పటి నుండి రాజీనామా చేయనని, పదవిలో కొనసాగుతానని చెబుతున్న తక్కువ మంది నేతల్లో పనబాక మొదటి వరసలో ఉంటారు. కాంగ్రెస్ నిర్ణయానికే నా ఓటు అని ఆమె చెబుతున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి సీమాంధ్రులకు రక్షణ కల్పించాలని కోరతానని చెప్పిన ఆమె ఇప్పుడు తాజాగా ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలాన్ని సీమాంధ్రకే కేటాయించేలా కేంద్ర మంత్రుల కమిటీకి ఇచ్చే నివేదికలో పేర్కొంటామని తెలిపారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్దంగా ఉండాలని, బీజేపీ విభజన విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని పనబాక అన్నారు.

విభజనపై సీమాంధ్ర నేతలు హామీ ఇచ్చారు: దిగ్విజయ్

    సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అందరినీ కాంగ్రెస్ అధిష్టానం విభజన విషయంలో ప్రశ్నించిందని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంతా హామీ ఇచ్చారని దిగ్విజయ్ వెల్లడించారు. వారు ఒప్పుకున్న తరవాతనే విభజన నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు నిర్ణయం తీసుకున్న తరువాత వారు మాట మార్చడం సరికాదని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలకు ఇబ్బందులు ఉన్న మాటను ఎవరూ కాదనడం లేదని, వారు తమ ప్రాంతానికి మంచి ప్యాకేజీలు, సమస్యల పరిష్కారానికి పలు సూచనలు, ప్రతిపాదనలు మంత్రుల బృందానికి ఇవ్వాలని సూచించారు. ఎవరూ రాజీనామాల గురించి తొందరపడొద్దని సూచించారు.   పైలాన్ తుఫానును అడ్డుకోలేక పోయాం. కానీ తెలంగాణ అనే విభజన తుఫానును ఖచ్చితంగా అడ్డుకుంటాం. దీనికి ప్రజల సహకారం కావాలి’ అని తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దిగ్విజయ్ నిరాకరించారు.

లాలూ నిష్క్రమణతో బీహార్ రాజకీయ సమీకరణాలలో మార్పులు.

      పశువుల దాణా కుంభకోణంలో దోషిగా నిర్దారింపబడి ఐదేళ్ళు జైలు శిక్షపడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై అనర్హత వేటుపడిన తరువాత, బీహార్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్ననితీష్ కుమార్ కి చెందిన జెడీ(యూ) కాంగ్రెస్ పార్టీలు పొత్తులు పెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నపటికీ, లాలూపై వేటుపడిన తరువాతనే పొత్తుల విషయంలో ముందుకు సాగడం మేలనే ఆలోచనతో వేచిచూస్తున్నాయి. ఇప్పుడు ఆ పని కూడా పూర్తవుతోంది గనుక ఇక ఆ రెండు పార్టీలు పొత్తులకి సిద్దపడవచ్చును.   ఇక మాజీ బీహార్ ముఖ్యమంత్రి మరియు లాలూ భార్య అయిన రబ్రీ దేవి మీడియాతో మాట్లాడుతూ తన భర్త జైలుకి వెళ్ళినంత మాత్రాన్నతమ ఆర్ జె డీ పార్టీ ఏమి మూతబడబోదని, గతంలో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఏవిధంగా తాము పార్టీని కాపాడుకొన్నామో ఇప్పుడు కూడా అదేవిదంగా పార్టీని కాపాడుకొంటామని అన్నారు. అయితే లాలూ ప్రసాద్ కి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా చుక్కేదురయ్యి ఐదేళ్ళు జైలు జీవితం గడపవలసి వస్తే, ఆయన పార్టీలో కీలక నేతలు, కార్యకర్తలు అందరూ సహజంగానే బీహార్ లో తిరుగులేని అధికారం సాగిస్తున్న జెడీ(యూ) లోకి జంపయిపోవడం ఖాయం. ఇది కాంగ్రెస్- జెడీ(యూ) కూటమికి కలిసివచ్చే అంశం కాగా, ఈసారి ఎలాగయినా ఎన్నికలలో బీహార్ నుండి అత్యధిక యంపీ స్థానాలు పొందాలనుకొంటున్న బీజేపీకి ప్రతికూలాంశంగా మారవచ్చును.

నేరం మాది కాదు ప్రజలదే

      సమైక్యాంధ్ర ఉద్యమాల నుండి ప్రజలు వెనక్కి తగ్గారు. ఉద్యోగులు చేత చాకచక్యంగా సమ్మెవిరమింపజేయడం కూడా పూర్తయ్యింది. అందుకు దిగ్విజయ్ సింగ్ కృతజ్ఞతలు చెప్పారు కూడా. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా సమైక్యాంధ్ర కాడి పక్కన బెట్టినట్లే మాట్లాడుతున్నారు. కావాలంటే రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందంతో ఉద్యోగులకు సమావేశం కూడా ఏర్పాటు చేయగలనని ఆయన హామీ కూడా ఇచ్చారు. ఇంతవరకు సమైక్యాంధ్ర కోసం ఎంతో పోరాటం చేసి ఎంతో అలసిపోయినప్పటికీ పురందేశ్వరి వంటి కొందరు కాంగ్రెస్ నేతలు, ప్రజలు యదార్ధ పరిస్థితులను గ్రహించాలని ఒక ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా, వారికి మంచి ప్యాకేజీ సాధించేందుకు మరో కొత్త పోరాటానికి నడుం బిగిస్తున్నారు.     ఇక, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజన అంశం కారణంగా రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో బాగా దెబ్బ తిన్నకాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి, రెండు ప్రాంతాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్నికలు వచ్చి మీద పడేలోగా జనాలని మరిపించి వారి నుండి ఓట్లు రాబట్టుకోవడం ఎలాగో ఆలోచించెందుకే ఈ సమావేశాలని ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పనవసరం లేదు. మరో పక్క తెలంగాణా రాష్ట్రం సాదించినందుకు సంబరాలు చేసుకొంటున్నటీ-కాంగ్రెస్ నేతలు సీమాంధ్రకి మంచి ప్యాకేజి వచ్చేలా తాము కూడా హైకమాండుకి గట్టిగా రికమెండ్ చేస్తామని అభయ హస్తం ఇస్తున్నారు. అదేవిధంగా సీమంధ్ర ప్రజలకి అన్నివిధాల అండగా నిలుస్తామని హామీ కూడా ఇస్తున్నారు. మరో పక్క డిల్లీలో కేంద్రమంత్రుల బృందం ఈ రోజు రెండో సమావేశం నిర్వహిస్తూ రాష్ట్రవిభజన ప్రక్రియని ముందుకు తీసుకు వెళుతోంది. అంటే కాంగ్రెస్ అధిష్టానం వ్రాసుకొన్న స్క్రిప్ట్ ప్రకారం అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నాయని అర్ధం అవుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రితో సహా నేతలందరూ తమకు అధిష్టానం కేటాయించిన పాత్రలు అద్భుతంగా పోషించి ఈ సమైక్యడ్రామాను మంచి రక్తి కట్టించారు. కానీ వారి పాత్రలను అర్ధం చేసుకోవడంలో ప్రజలే అపోహలకు లోనయ్యి పాపం! ఏ పాపం ఎరుగని కాంగ్రెస్ నేతలను నిందిస్తున్నారు. ప్రజలకెందుకు ఆ అవకాశం ఈయలని లగడపాటి వంటి వారు తమని తామే తిట్టుకొంటూ అదేనోటితో పార్టీని, పార్టీలో కొందరు నేతలని కూడా తిడుతున్నారు. సీమంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసినా, ప్రజలు చైతన్య వంతులుగాకపోతే పాపం! వారు మాత్రం ఏమిచేయగలరు? తప్పు ప్రజలదే తప్ప వారిది కాదు.   

శ్రీ రావురి భరద్వాజ గారు మృతి

    తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో, ప్రతిభా పాటవాలతో ఎదిగిన  గొప్ప రచయిత, జ్ఞానపీట్‌ అవార్డు గ్రహీత శ్రీ రావురి భరద్వాజ గారు ఈ రోజు(18.10.13) మృతి చెందారు. రావురి భరద్వాజ గారు జులై 5, 1925నాడు శ్రీమతి మల్లికాంబ, శ్రీ కోటయ్య దంపతులకు జన్మించారు. శ్రీ రావూరిగారు తాను అనుభవించిన కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను, అభిశంసలను, నిరాదరణలను, అనుభవాలను,  అనుభూతులను,కథా వస్తువులుగా మలుచుకున్నారు. జీవితమంతా, తెలుసుకుంటూ,తెలుసుకుంటూ ప్రయాణం సాగించాలి అనే భరద్వాజగారు అలానే ప్రయాణం సాగించారు. భరద్వాజగారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చెకురాలని కోరుకుంటోంది తెలుగువన్‌.కామ్‌.

మళ్ళీ కాంగ్రెస్, తెరాసల మధ్య యుద్ధం మొదలవుతుందా

  తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిన వెంటనే మొట్ట మొదట తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి తీవ్ర ప్రయత్నాలు చేసారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ అందుకు చాల కృషిచేసారు. అయితే అవి ఫలించకపోవడంతో ఆ తరువాత రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తుల స్టోరీ కొన్ని రోజులు నడిచింది. కానీ దానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఆ ప్రయత్నాలు కూడా పక్కనపడేసారు.   తెలంగాణా సాదించిన ఘనత తమదంటే తమదని ఆ రెండు పార్టీలు చాటింపు వేసుకొంటూ, రానున్న ఎన్నికలలో ప్రజల నుండి ఓట్లు పిండుకోవాలని రెండు పార్టీలు చాలా ఆరాటపడుతున్నాయి. అయితే ఇంత కాలం టీ-కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకొని కూర్చోవడంతో ఇదే అదునుగా తెరాస నేతలు ఈ ఘనత అంతా తమకే చెందుతుందని గట్టిగా చెప్పుకోగలిగారు. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ నిర్వహించి తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినట్లయితే తెరాస పూర్తి మెజార్టీ సాధిస్తుందని తేల్చి చెప్పింది.   ఈ సర్వే నివేదికపై తెరాస నేత ఈటెల రాజేందర్ స్పందిస్తూ, తెలంగాణాలో మొట్టమొదట తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పరచబోతోందని, తమది భౌగోళిక తెలంగాణ ఎజెండా కాదని, తెలంగాణ పునర్నిర్మాణ ఎజెండా అని అన్నారు.   ఇది సహజంగానే టీ-కాంగ్రెస్ నేతలలోగుబులు పుట్టించింది. ఇంకా దీమాగా చేతులు ముడుచుకొని కూర్చొంటే ఇక ఆ తరువాత చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గ్రహించి ఈ రోజు నుండి పదిరోజుల పాటు పది తెలంగాణా జిల్లాలో జైత్రయాత్రలు మొదలుపెట్టారు. తెలంగాణా ఏర్పాటులో ఇక వెనకడుగు వేసే ఆలోచన లేదని కాంగ్రెస్ అధిష్టానం కూడా ధృడసంకల్పంతో ఉన్నందున వారి జైత్ర యాత్రకు అనుమతిచ్చేసింది.   ఈ రోజు నిజామాబాద్ జిల్లా భోధన్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ జైత్రయాత్రలో దాదాపు టీ-కాంగ్రెస్ నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ.శ్రీనివాస్ తెరాస నేతలను ఉద్దేశ్యించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాక్యాలు చేసారు.   “తెలంగాణాలో చిన్నచిన్న పార్టీలు కూడా తామే తెలంగాణా రాష్ట్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెపుతున్నాయి. కానీ తెలంగాణా రాష్ట్రం సాధించిన కాంగ్రెస్ పార్టీయే ఆ కీలక బాధ్యత కూడా చేపడుతుంది. ఆ సత్తా కేవలం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే ఉంది.” రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మ్రోగించి మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పరిచి, తెలంగాణా పునర్నిర్మాణం చేపడుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.   మరి తెరాసను విలీనం చేసుకోవాలని, లేకపోతే కనీసం ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెరాస అవసరం లేకుండానే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొంటామని చెప్పడం చూస్తే, మళ్ళీ కేసీఆర్ కాంగ్రెస్ నేతలని తిట్లు లంఖించుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇంతవరకు తెలంగాణా ఇస్తున్నందుకు సోనియాగాంధీని పొగుడుతున్న తెరాస నేతలు, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీయే మొదట ప్రభుత్వం ఏర్పాటుచేయాలని సిద్దపడితే ఇక మళ్ళీ తెరాస నేతలు తమ తిట్ల పురాణం తెరుస్తారేమో.

చంద్రబాబు ఎంట్రీతో ట్వీటర్ లో రాజకీయ యుద్ధం షురూ

  ఇంతవరకు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ట్వీటర్ లో తమ రాజకీయ ప్రత్యర్ధులపై మంచి సమయ స్పూర్తితో ఘాటయిన విమర్శలు చేస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు అందరి కంటే ముందుండే చంద్రబాబు మాత్రం, పని ఒత్తిడి కారణంగా ఇంతకాలం ఈ ట్వీటర్, ఫేస్ బుక్కులోకి ప్రవేశించలేదు. అయితే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తాడన్నట్లు ఇటీవలే ట్వీటర్లో ప్రవేశించిన ఆయన కూడా మంచి ఆసక్తికరమయిన ట్వీట్స్ చేస్తూ ఆకట్టుకొంటున్నారు.   రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్ గురించి ఈ వ్దిహంగా వ్రాసారు: “మధ్యప్రదేశ్ నుండి తరిమివేయబడిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ్రయం పొందాలని చూస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారు.”   చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకి ఊహించినట్లుగానే మంచి స్పందనే వచ్చింది. అంతే గాక ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా సైతం ఆయన వ్యాఖ్యలపట్ల ఆసక్తి చూపడం విశేషం. అయితే దిగ్విజయ్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఈ సోషల్ నెట్వర్క్ సైట్లలో తమ రాజకీయ ప్రత్యర్ధులతో పెద్ద యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వారికి చంద్రబాబు కూడా తోడవడంతో, ఇంతవరకు కాంగ్రెస్-బీజేపీల మధ్యనే జాతీయ స్థాయిలో జరుగుతున ఈ సైబర్ యుద్ధం, దిగ్విజయ్ సింగ్ చంద్రబాబుకి ఇచ్చే జవాబుతో ఇక రాష్ట్ర స్థాయిలో కూడా మొదలవవచ్చును. అయితే రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలలో దీనిపట్ల ఆసక్తి, అవగాహన కొరవడటంతో ప్రస్తుతానికి చంద్రబాబుకి ఎదురులేకపోవచ్చును.

13 సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ

      సమైక్య రాష్ట్ర డిమాండ్ కి మద్దతుగా రాజీనామా చేసిన 13 మంది సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. ఈ మేరకు 13 మంది ఎంపీలకు స్పీకర్ కార్యాలయం ఫోన్ ద్వారా వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒత్తిడుల కారణంగానే వీరు రాజీనామా చేసి ఉండవచ్చన్న అభిప్రాయానికి వచ్చి స్పీకర్ మీరా కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది.     తమ రాజీనామాల ఆమోదం కోసం కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అనుణ కుమార్, అంతనం వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. తక్షణమే తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ లగడపాటి ఈరోజు కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ను కూడా కలిసారు. అయితే మళ్ళీ తమ పదువులకు రాజీనామాలు చేస్తామని 13 మంది ఎంపీలు చెబుతున్నారు.

అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది

  రాష్ట్రంలో రెండు లెఫ్ట్ పార్టీలు ప్రజా సమస్యల తరపున ఎన్ని పోరాటాలు చేసినా అవి నేటి వరకు ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థాయికి మాత్రం ఎదగలేకపోయాయి. అందువల్ల తప్పనిసరిగా ఏదో ఒక ప్రధాన పార్టీకి అవి తోకపార్టీలుగానే కాలక్షేపం చేస్తున్నాయి. రెండు వేర్వేరు పార్టీలయినా ఇంతకాలంగా రైట్ టర్న్ తీసుకోకుండా రూల్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ నుండే కలిసి ముందుకు పోతుండటంతో ప్రజలకి కూడా వాటి మధ్య పెద్దగా తేడా కనబడలేదు. పైగా రాఘవులు, నారాయణ ఇద్దరూ కూడా చిలకా గోరింకల్లా ఎప్పుడు కువకువలాడుతూ రాసుకు పూసుకు తిరుగుతుండటంతో ఇంతకాలం వారి కాపురం ఎర్రెర్రగా బాగానే సాగిపోయింది.   కానీ రాష్ట్ర విభజన విషయంలో సీపీయం సమైక్యానికి, సీపీఐ విభజనకి మొగ్గు చూపడంతో ఆ రెండు పార్టీల మధ్య ఎడమొహం పెడమొహం తప్పలేదు. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇటీవల డిల్లీ వెళ్ళినప్పుడు సీపీయం నేతలకి లాల్ సలాం చెప్పి రావడంతో, ఆరెండు పార్టీల మధ్య పొత్తులు పొడవనున్నాయని మీడియాలో ఒకటే లొల్లి మొదలయింది. జగన్ మోహన్ రెడ్డి సీపీయం నేతలకి ఏదో బంపర్ ఆఫర్ ఇచ్చాడనే పుకార్లు కూడా మీడియాలో కనబడ్డాయి.   అసలే కొంచెం నోటి దురద ఉన్న నారాయణ, నలుగురితో నారాయణ అనుకొంటూ వైకాపా సీపీయంల మధ్య పొత్తులు కుదురుతున్నాయని చిన్న స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఎప్పుడు చిరునవ్వులు చిందించే రాఘవులు కూడా భగ్గుమన్నారు. అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది. తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు, మిగిలిన పార్టీలు ఎన్నయినా అననీ, కానీ లెఫ్టో రైటో తెలియకుండా అగమ్యంగా ముందుకు సాగుతూ, చికెన్ కర్రీలో ఇడ్లీముంచుకొని తినే నారాయణ కూడా తమను విమర్శించడమా? అని చాలా బాధపడిపోయిన రాఘవులు, “దమ్ముంటే నీ ఆరోపణలు ఋజువు చేయి...నారాయణ! అంటూ సవాలు విసిరారు. “మేము ‘కలిసుందాము రా’ అంటే నీకు నామోషీగా ఉన్నపుడు, మేమేవరితో కలిసి తిరిగితే నీకెందుకు దురద?” అని కోపగించుకొన్నారు కూడా.   మొత్తం మీద రాష్ట్ర విభజనతో లెఫ్ట్ పార్టీల్లో కూడా ముసలం పుట్టినట్లే ఉంది. అయితే రెండు పార్టీలు మళ్ళీ ఏదయినా మెయిన్ పార్టీకి అటాచ్ కాగానే ఇదంతా మరిచిపోయి మళ్ళీ ఒకరికొకరు లాల్ సలాములు చెప్పుకొని తమ పోరాటాలు కొనసాగించవచ్చును.

వైకాపాలోకి విశ్వరూప్‌

      మాజీ మంత్రి పి. విశ్వరూప్‌ వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.రస్తుతం అమలాపురం శాసనసభకు ప్రాతినిద్యం వహిస్తున్న విశ్వరూప్ వై.ఎస్,రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లలో మంత్రిగా ఉన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కి కట్టుబడి తాను మంత్రి పదవికి రాజీనామా చేశాననీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేయాలనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరానన్నారు విశ్వరూప్‌. సమైక్య ఉద్యమంలో భాగంగా, కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి పలువురు నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారు.

బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు

      బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని సంతకం చేసిన ఫైళ్ళకు దిక్కులేదంటే దేశం ఎక్కడికేల్తోందని ఆయన ప్రశ్నించారు. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి ఫరేఖ్ చేసిన వ్యాఖ్యలపై ప్రదాని ఏమి సమాధానం చెబుతారని అన్నారు.   కాంగ్రెస్ కుట్రను జాతీయ స్థాయిలో బయటపెట్టేందుకే ఢిల్లీలో దీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. దీక్షకు సహకరించిన వారందంకి కృతజ్ఞతలు తెలిపారు.  ఢిల్లీలో అంతా డీలర్లు, బ్రోకర్ల రాజ్యంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత మొత్తం పదిహేను లక్షల కోట్లా అవీనితి జరిగిందన్నారు.