కృష్ణాజిల్లాపై పట్టు కోసం వైకాపా కృషి

      రాష్ట్ర రాజకీయాలలో కృష్ణా జిల్లాకున్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అత్యంత రాజకీయ చైతన్యం గల జిల్లాలో కృష్ణాజిల్లా ప్రధమ స్థానంలో నిలుస్తుంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలకు ఆ జిల్లాపై పూర్తి పట్టు సాధించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటవంటి ఆ జిల్లాలో పాగా వేసేందుకు వైకాపా చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.   ఇటీవల జగన్మోహన్ రెడ్డి నిమ్మకూరులో నందమూరివారి బంధువును పనిగట్టుకొని వెళ్లి పలకరించడం అందుకే. అయితే వైకాపాను అక్కడి ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది వచ్చే ఎన్నికలలోనే తేలుతుంది. కానీ, వైకాపా మాత్రం ఇప్పటి నుండే బలమయిన అభ్యర్ధులను కూడా సిద్దం చేసుకొంటున్నట్లు తాజా సమాచారం.   మునిగిపోతున్న కాంగ్రెస్ నావ నుండి వైకాపాలోకి దూకడానికి సిద్దంగా ఉన్నవారిలో మంత్రి పార్ధసారధికి బందర్ పార్లమెంట్ సీటు, మండలి బుద్ద ప్రసాద్ కు అవనిగడ్డ అసెంబ్లీ సీటు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా దేవినేని నెహ్రు కొడుకు  దేవినేని అవినాష్ కు పెనమాలూరు అసెంబ్లీ సీటు ఖరారు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాలు,పుకార్లు మొదటి నుంచి పార్టీను నమ్ముకొని టికెట్ వస్తుందన్న నమ్మకంతో వున్నవారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

దిగ్విజయ్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

      ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌పైన టిడిపి సీమాంధ్ర శాసనసభ్యులు శనివారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. నోటీసును స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఎలా చర్చించాలి ? ఏం చేయాలి అన్నది ? ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ విషయంలో దిగ్విజయ్ సింగ్ ఎలా జోక్యం చేసుకుంటాడు అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర అసేంబ్లీలో ఓటింగ్ ఉండదు అని దిగ్విజయ్ సింగ్ ఎలా చెబుతాడని టీడీపీ నేతలు తప్పుపట్టారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. తమ ప్రజల రక్తం, మాంసం దిగ్విజయ్ సింగ్‌కు రుచిగా ఉన్నట్లుందని ఆయన అన్నారు.

ఫోర్బ్స్ జాబితాలో పవన్ నెం.1

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఈ సంవత్సరం బాగా కలిసివచ్చినట్టుగా ఉంది. 'అత్తారింటి దారేది' సినిమాతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్...తాజాగా ఫోర్బ్స్ ఇండియా పత్రిక వెల్లడించిన 2013 టాప్ 100 సెలబ్రిటీల లిస్టులో తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానం ఎగరేసుకుపోయాడు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన భారతీయ సంపాదన పరుల, సెలబ్రిటి జాబితాలో 13వ స్థానంలో నిలిచాడు. ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ ఆదాయం రూ. 57 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. భారత సెలబ్రిటీల జాబితాలో పవన్ కళ్యాణ్ 26 స్థానంలో..పాపులారిటీలో 79 స్థానంలో నిలిచాడు. పవన్ తర్వాత మహేశ్ 54వ స్థానంలో నిలిచాడు. మహేశ్ సంపాదన 28.96 కోట్లు అని ఫోర్బ్స్ పేర్కొంది.

సౌరవ్ గంగూలీ కి బిజెపి గాలం..!

    భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలో క్రీడల మంత్రి కాబోతున్నడా? అంటే అవుననే మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ బిజెపి లో చేరవలసిందిగా గంగూలికి ఆహ్వానం పంపించారట. ఎంపీగా గెలిస్తే క్రీడామంత్రిత్వ శాఖ ఇస్తానని ఆయనకు ఆఫర్ కూడా ఇచ్చారట. తమ పార్టీ ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం తెలియచేస్తాను అని గంగూలీ స్పందించినట్టు బీజేపీ నేతలు వెల్లడించారు. 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో తృణాముల్ కు తగినంత పోటీ ఇవ్వడానికి గంగూలీని రంగంలోకి దించాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా ఉన్న వరుణ్ గాంధీని ఓ మిత్రుడి ద్వారా గంగూలీ కలిశారట. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలు బయటకు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పాగా వేసేందుకు మోడి నిరంతర కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితమయిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రావాలని మోడీ భావిస్తున్నారు.

కెసిఆర్ నెత్తిమీద 'రాయల..' కత్తి

      రాష్ట్ర విభజన బిల్లు పై శాసన సభలో ఎలాంటి ప్రతిష్ట౦భన తలెత్తకుండా రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ తన మిషన్ పూర్తి చేసి వెళ్ళి పోతూ...తెరాస అధినేత కెసిఆర్ కి ఓ విషయాన్ని గుర్తుచేసి పోయారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో చాలాసార్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం పై మేడమ్ సోనియా గాంధీని ఒప్పించానని..ఇక కెసిఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునెలా చేయాలని టీఆర్ఎస్ నేతలకు సూచించినట్టు సమాచారం.   దీనిపై ఇప్పటికీ కూడా కేసీఆర్‌ స్పష్టమైన వైఖరిని కనబర్చడం లేదు. దీంతో రాయల తెలంగాణ అనే అంశాన్ని తిరిగి తెరమీదకు తెస్తున్నారు డిగ్గీ. దీనికి అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. బిల్లులోని అంశాల వారీగా విడివిడిగా సభ్యులు చర్చ జరిపి నివేదికలను పంపితే.. ఆ తర్వాత వాటన్నింటినీ సాకల్యంగా పరిశీలించిన తర్వాత మాత్రమే.. కేంద్రం తెలంగాణ విషయంలో తుది నిర్ణయానికి వస్తుందని దిగ్విజయ్ ప్రకటించారు. కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలనే అభిప్రాయంతోనె ఇంకా రాయల తెలంగాణకు అవకాశం ఉన్నదంటూ డిగ్గీ మాట్లాడారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్‌ కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తలొగ్గడని తెలుసుకున్నఅధిష్టానం...కేసీఆర్‌ మెడపై కత్తి పేట్టేందుకు సిద్ధమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఏం జరుగుతుందనే దానిపై మనం కూడా వేచిచూడాల్సిందే.

తెలంగాణా బిల్లుపై చర్చజరుగుతుందా

  పార్లమెంటు, శాసనసభలలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నతీరు చూస్తే ప్రజలకు వారిపట్ల ఏహ్యభావం పెరుగుతోంది. అయినప్పటికీ వారు నిర్లజ్జగా తమ ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. తమ తమ పార్టీల వ్యూహాలకు అనుగుణంగా వారు చట్టసభలలో ఏదోఒక అంశం లేవనెత్తి దానిపై వెంటనే చర్చజరగాలని బిగ్గరగా అరుపులు కేకలు వేస్తూ అసలు ఏ చర్చజరగకుండా సభను స్థంభింపజేస్తూ విలువయిన ప్రజాధనాన్ని అంతకంటే విలువయిన కాలాన్నికావాలనే వృదా చేస్తున్నారు. ఈ ప్రక్రియనే చట్టసభల సమావేశాలుగా భావించవలసిన దుస్థితి ఏర్పడింది.   ఇక, రాష్ట్ర విభజన బిల్లుని శాసనసభలో వెంటనే ప్రవేశపెట్టాలని కొందరు, వద్దని మరి కొందరు, సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని మరికొందరూ అరుపులు కేకలు పెట్టుకొన్న తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. అయితే సోమవారంనాడు సభ మళ్ళీ సమావేశమయినపుడు కూడా పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఉంటుందని భావించలేము. దానివల్ల కీలకమయిన రాష్ట్ర విభజన బిల్లుపై సభలో ఎటువంటి చర్చజరగకుండానే రాష్ట్రపతి ఇచ్చిన పుణ్యకాలం కూడ పూర్తయిపోయినా ఆశ్చర్యం లేదు.   రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు ఈ రాష్ట్ర విభజన అంశం ద్వారా లబ్దిపొందాలనో లేకపోతే నష్టపోకూడదనో లేకపోతే చర్చ జరగకుంటేనే తమకు మేలని భావించడం వలననో మొత్తం మీద సభలో రాద్దాంతం చేస్తూ రోజులు దొర్లించే ప్రయత్నం చేస్తున్నట్లున్నాయి. అందువల్ల రాష్ట్ర విభజన బిల్లుపై సభలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి.   కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇటువంటి ఒక కీలకమయిన అంశం పట్ల కూడా ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంభించడం చాలా విచారకరం. వారు ఎంతసేపు సభలో తమ పార్టీ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు తప్ప తమను ఎన్నుకొన్న ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడాలని, వ్యవహరించాలని భావించకపోవడం (అటువంటి భాధ్యాతారహితులయిన నేతలను ఎన్నుకొన్న) ప్రజల దురదృష్టం.   సభల్లో కీచులాడుకొనే ఇటువంటి నేతల భద్రత కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి వేలాదిమంది పోలీసులను వినియోగించవలసి వస్తోంది. నగరంలో మహిళలకు, ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసు వ్యవస్థ విఫలమవచ్చునేమో గానీ, ప్రజలనుండి ప్రజాప్రతినిధులకి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవడంలో మాత్రం ఆది ఎన్నడూ విఫలమవ్వదని చెప్పేందుకు నేడు శాసనసభ చుట్టూ మోహరించిన వేలాది పోలీసు బలగాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదంతా చూస్తుంటే ఇటువంటి నేతలను, రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నందుకు ప్రజలు ఈమాత్రం శిక్ష, మూల్యం చెల్లించుకోక తప్పదన్నట్లుంది.

ముఖ్యమంత్రిని దిగ్విజయ్ దారి తెచ్చుకొన్నట్లా కాదా

  రాష్ట్ర విభజన బిల్లుకు సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులందరి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో హైదరాబాద్ కి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమయ్యారో తెలియదు. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం తన దారికి తెచ్చుకోలేకపోయారనే సంగతి మాత్రం స్పష్టం అయింది. ఒకవేళ దారికి తెచ్చుకొని ఉంటే నిన్నసాయంత్రం ఆయన నిర్వహించిన పత్రికా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు. ఆయన ఆ సాహసం చేయలేకపోయినా “ఇంతవరకు ముఖ్యమంత్రి తన వాదనలు వినిపించేందుకు పార్టీ ఆయనకు చాలా అవకాశం ఇచ్చిందని, కానీ ఇక ఆయన కూడా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించక తప్పదని” మీడియా ముందు చెప్పుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.   నిన్న మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులు బొత్ససత్యనారాయణ ఇంటిలో జరిగిన భోజన సమావేశంలో జరిగిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదని దిగ్విజయ్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. అదే విషయం మీడియా ప్రశ్నించినప్పుడు మామధ్య జరిగిన అంతరంగిక చర్చల సారాంశాన్ని మీకు చెప్పలేను అంటూ సమాధానం దాటవేశారు.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షరా మామూలుగా తెలంగాణా బిల్లులో ప్రతీ ఆర్టికల్ పై సభలో వోటింగ్ జరగాలని మీడియాతో చెప్పడం ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం అవుతోంది. అయితే, ఈదశలో కూడా వారిద్దరూ ఒకరికొకరికి పొంతన లేని విధంగా మాట్లాడటం, భిన్న వైఖరులు ప్రదర్శించడం, అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకొనే ఆలోచన కూడా చేయకపోవడం గమనిస్తే ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం రచించి రక్తి కట్టిస్తున్నపెద్ద డ్రామాగా కనిపిస్తోంది. ఈవిధంగా అతితెలివి ప్రదర్శించి ప్రజలను మభ్యపెట్టగలమని కాంగ్రెస్ భావిస్తే అది ఆపార్టీకే చేటు కలిగించడం ఖాయం.

బీజేపీ వైపు చంద్రబాబు అడుగులు

  ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. మొన్నరాజస్తాన్ ముఖ్యమంత్రిగా వసుందర రాజే సింధియా ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అయన వెళ్ళవలసి ఉన్నపటికీ రాష్ట్ర విభజన బిల్లు హైదరాబాద్ చేరుకోవడంతో మొదలయిన రాజకీయ హడావుడి కారణంగా ఆయన వెళ్లలేకపోయారు.   బీజేపీ అగ్రనేత అద్వానీకి శిష్యుడిగా పేరొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అద్వానీతో సహా బీజేపీ అగ్రనేతలందరూ వస్తున్నారు. ఇప్పటికే, బీజేపే-తెదేపాల మధ్య కొంత సఖ్యత ఏర్పడి రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తులకు అనుకూల వాతావరణం ఏర్పడింది గనుక, నేటి చంద్రబాబు పర్యటన ఆ దిశలో పడుతున్న మరొక అడుగుగా భావించవచ్చును.   ఈసందర్భంగా ఆయన బీజేపీ అగ్ర నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల పొత్తులకు ఇంకా చాలా సమయం ఉంది గనుక, ప్రస్తుతం వారు ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల గురించి, పార్లమెంటులో తెలంగాణా బిల్లుపై అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించవచ్చును. బీజేపీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నపటికీ, దానివల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు గనుక, బిల్లుని వ్యతిరేఖించకుండా, అలాగని ఆమోదం పొందకుండా ఉండేలా బీజేపీ వ్యవహరించవచ్చును.   బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి తెదేపాతో ఎన్నికల పొత్తులకు ఎంత వ్యతిరేఖత చూపుతున్నపటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో తెదేపా యొక్క ప్రాధాన్యత గుర్తించి ఆ పార్టీతో స్నేహ సంభందాలు మళ్ళీ పునరుద్దరించుకొనేందుకు ప్రయత్నిస్తుండటం, అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించడం విశేషం.

ఆమాద్మీకి కాంగ్రెస్ బేషరతు మద్దతు

  మొట్ట మొదటి ప్రయత్నంలోనే 28 సీట్లు గెలుచుకొని డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తుడిచేపెట్టేసిన ఆమాద్మీపార్టీకి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది. కేవలం మాటలతో సరిబెట్టకుండా, ఆమాద్మీకి బేషరతుగా మద్దతు ఇస్తునట్లు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఒక లేఖ కూడా వ్రాసింది. అయితే ఇంతవరకు అమాద్మీ పార్టీ నుండి ఎవరు స్పందించకపోవడం విశేషం.   ఇటీవల జరిగిన డిల్లీ శాసనసభ ఎన్నికలలో 32 సీట్లు గెలుచుకొని బీజేపీ ప్రధమ స్థానంలో నిలవగా, ఆమాద్మీ పార్టీ 28సీట్లు గెలుచుకొని రెండవ స్థానంలో, పదిహేనేళ్ళపాటు డిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 సీట్లతో మూడవ స్థానానికి పరిమితమయింది. ఇతరులకు 2సీట్లు వచ్చాయి. 70సీట్లున్న శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36సీట్లు ఉండాలి. కానీ, ఆమాద్మీ, బీజేపీ పార్టీలు ఇతరులకు మద్దతు ఈయబోము, తీసుకోము అని బిగుసుకు కూర్చోకొన్నాయి.   అమాద్మీ కాక వేరే ఏదయినా ఇతర పార్టీ అయిఉంటే, బీజేపీ ఈ పాటికి వారికి గాలం వేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేసేదే. కానీ ఆమాద్మీకి ప్రజలలో ఉన్న విపరీతమయిన ఆదరణను చూసిన తరువాత ఆ పార్టీపై ఎటువంటి ఎత్తులు ప్రయోగించకుండా వేచి చూచే ధోరణి అవలంభిస్తోంది. తద్వారా రోజురోజుకి ఆమాద్మీపై ఒత్తిడి పెరిగిపోయి, చివరికి దిగివస్తుందని బీజేపీ అంచనా వేసింది. కానీ అది ఊహించని విధంగా కాంగ్రెస్ రంగంలోకి దూకి ఆమాద్మీకి బేషరతుగా బయట నుండి మద్దతు ఇస్తామని గవర్నర్ కు లేఖ కూడా పంపింది.   ఇటువంటి సంకీర్ణాలు తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని, అదే చేసినట్లయితే, తమకు ఇతర రాజకీయ పార్టీలకు మధ్య ఎటువంటి తేడా ఉండదని ఇంతవరకు గట్టిగా వాదిస్తున్నఆమాద్మీ, ఇప్పుడు కాంగ్రెస్ తనంతట తానే మద్దతు ప్రకటిస్తున్నపుడు కూడా వద్దంటే, ఇక డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అవుతుంది. మరో నాలుగైదు నెలలలో సాధారణ ఎన్నికలు వస్తున్న కారణంగా వాటితో కలిపి అప్పుడే మరోసారి ఎన్నికలు జరిపించాలని గవర్నర్ భావిస్తే, డిల్లీలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతిని కోరవచ్చును.   ఒకవేళ ఆమాద్మీతన మాటకే కట్టుబడి ప్రభుత్వ ఏర్పాటుకి నిరాకరిస్తే, విలువలకు కట్టుబడి ఉన్నపార్టీగా మంచి పేరు పొందవచ్చును. కానీ, ఆమాద్మీకి ఓటేస్తే ఇదేవిధంగా ఎందుకు పనికిరాకుండా పోతాయని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తే అమాద్మీకి ఇప్పుడు వచ్చినన్ని సిట్లు కూడా రాకపోవచ్చును. అందువల్ల కాంగ్రెస్ బేషరతుగా ఇస్తున్న మద్దతు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేసి, తన పాలనతో డిల్లీ ప్రజలను ఆకట్టుకొనగలిగితే రానున్నఎన్నికల సమయానికి మరింత బలపడవచ్చును. అలాకాకుండా నీతి సూత్రాలు వల్లె వేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా భీష్మించుకొని కూర్చొంటే నష్టపోయేది అమాద్మీపార్టీయే తప్ప కాంగ్రెస్, బీజేపీలు మాత్రం కాదని గ్రహించాలి.

ఇలాంటి విభజన చూడలేదు: చంద్రబాబు

      కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. దేశంలో ఎప్పుడూ ఇలాంటి విభజన చూడలేదని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పెట్టాలో దిగ్విజయ్ సింగ్ ఎలా చెబుతారని, బిఎసిని ప్రభావితం చేసే విధంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడారని ఆయన అన్నారు. బిల్లును చూడకుండా అబద్ధాలు చెప్పే పరిస్థితికి దిగ్విజయ్ సింగ్ వచ్చారని ఆయన దుమ్మెత్తిపోశారు.   ప్రత్యేక విమానంలో విభజన ముసాయిదా బిల్లును తేవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం కుదరలేదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుంటే ఏకాభిప్రాయం అవుతుందా అని అడిగారు. నాలుగైదు సీట్ల కోసం తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.     రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదని దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారని గుర్తు చేస్తూ ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా అని అడిగారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమతో కలుస్తాడని, వైయస్ జగన్ తమవాడే అని దిగ్విజయ్ సింగ్ మరోసారి చెప్పారని, దాన్ని బట్టి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తాము చెబుతున్న విషయంలో వాస్తవం ఉన్నట్లు రుజువైందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల కల నెరవేరుతుంది: కెసిఆర్

      వరంగల్ జిల్లా హన్మకొండలో కడియం శ్రీహరి కుమార్తె వివాహానికి కెసిఆర్ హాజరయ్యారు. ఆతరువాత వరంగల్ జిల్లా నాయకులతో భేటీ ఆయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని, తెలంగాణ ప్రజల కల నెరవేరుతుందని ఈ సంధర్బంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని వర్గాల కలసి ఉద్యమాన్ని చేశాయని ఆయన గుర్తు చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషిద్దామని చెప్పారు.

తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన సీఎం కిరణ్

      తెలంగాణ ముసాయిదా బిల్లుపై సంతకం చేసి అసెంబ్లీ స్పీకర్ నాదేండ్ల మనోహర్‌కు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికు పంపించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లుకు భాషాపరమైన సమస్యలు ఉన్నాయని, నిబంధనల ప్రకారం మూడు భాషల్లో ఉండాల్సిన బిల్లు ప్రతులు ఇంగ్లీష్‌లో ఉందని, తెలుగు, ఉర్దూలోకి అనువదించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.   ముసాయిదా బిల్లుపై చర్చ ఎప్పుడన్నది సోమవారం బిజినెస్ అడ్వజయిరీ కమిటీ (బీఏసీ)లో నిర్ణయం జరుగుతుందని సీఎం కిరణ్ తెలిపారు. బిల్లులోని ప్రతి క్లాజుపై ఓటింగ్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గడువు సరిపోతుందా, లేదా అన్నది ఇప్పేడే చెప్పలేమని సీఎం పేర్కొన్నారు. 371 డి సవరణకు సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. బిల్లులో 371 హెచ్ ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దిగ్విజయ్ సింగ్ ఇంటర్వ్యూ

  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:   1. రాష్ట్ర విభజనపై రాష్ట్రంలో అందరి అభిప్రాయము తీసుకొన్న తరువాతనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకొంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరుప్రాంతల కాంగ్రెస్ నేతలు అంగీకరించారు కూడా. అందువల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్ననిర్ణయాన్నిపార్టీలో అందరూ బద్దులయి ఉండవలసిందే.   2. రాష్ట్ర విభజన బిల్లులోని ప్రతీ ఒక్క ఆర్టికల్ పై శాసనసభలోని ప్రతీ సభ్యుడు నిర్భయంగా తన అభిప్రాయలు తెలియజేయాలని కోరుతున్నాను. శాసనసభలో బిల్లుపై కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుంది. ఓటింగ్ జగదు. సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లును రూపొందిస్తాము.   3. హైదరాబాద్ పై పూర్తి హక్కులు తెలంగాణా ప్రభుత్వానిదే. పదేళ్ళ పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఇక్కడ నివసిస్తున్న ప్రజల ధనమానప్రాణాలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వమే వహిస్తుంది.   4. రాష్ట్ర విభజన పూర్తి రాజ్యాంగ బద్దంగా జరుగుతోంది. అందువల్ల ప్రతిపక్షాల విమర్శలకు నేను జవాబు ఈయనవసరం లేదు. బీజేపీకి మాట నిలకడలేదు. ఎప్పుడు ద్వంద వైఖరి అవలంభిస్తునే ఉంటుంది.   5. జగన్మోహన్ రెడ్డి డీ.యన్.ఏ.కాంగ్రెస్ డీ.యన్.ఏ. సరిపోలుతుందని నేను గతంలో అన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. జగన్ కూడా కాదనలేదు కదా?   6. చంద్రబాబు నేటికి తను ఏమి కోరుకొంటున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఆయన నాపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఆయనంటే నాకు గౌరవమే.   7. జేసీ.దివాకర్ రెడ్డి కి త్వరలో షో కాజ్ నోటీసులు జారీ చేస్తాము.   8. ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన గురించి తన వాదనలు వినిపించేదుకు పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి ఆయన కూడా తప్పనిసరిగా కట్టుబడి ఉండవలసిందే.   9. అన్నా హజారే వంటి మంచి వ్యక్తి పేరు ప్రతిష్టలను కొందరు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని దురూపయోగం చేస్తున్నారు.   10. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో అభివృద్ధి జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. హైదరాబాదులో అనేక పెద్ద సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా సీమాంధ్ర ఏర్పడిన తరువాత అక్కడ కూడా అటువంటివి ఏర్పాటుకి పూర్తి సహకారం అందిస్తాము.   11. పోలవరం ప్రాజెక్టుకి అవసరమయిన నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టులో మిగిలిన అంశాలపై కూడా కేంద్రం,ఏ పూర్తి బాధ్యత తీసుకొంటుంది.   12. రానున్న రెండు నెలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేహ్సాలు నిర్వహిస్తుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి నుండి పార్టీ కార్యకర్త వరకు అందరూ పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించబడుతాయి. వాటిలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధిష్టానంలో పెద్దలు, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఆహ్వానింపబడుతారు.

శాసనసభ సోమవారానికి వాయిదా

      శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ బిల్లు పెట్టి చర్చకు అనుమతించాలని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇటీవల వచ్చిన తుఫానుల కారణంగా నష్టపోయిన అంశంపై చర్చకు సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కోరినా సభ్యులు వినిపించుకోలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఉప సభాపతి, మంత్రి శ్రీధర్ బాబు కోరిన ఎమ్మెల్యే లు ఆందోళనను మానలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.

రాష్ట్ర విభజన బిల్లు రాకతో వేడెక్కిన రాజకీయాలు

    రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహంతీ చేతికి తెలంగాణా బిల్లు రావడంతోనే ఒక్కసారిగా హైదరాబాదులో రాజకీయాలు ఊపందుకొన్నాయి. దానికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ లో మఖాం వేసి కాంగ్రెస్ నేతలతో ఎడతెగని చర్చలు చేస్తుండటం, మరో వైపు శాసన సభ సమావేశాలు కూడా జరుగుతుండటంతో రాష్ట్ర రాజధానిలో వాతావరణం చలిగా ఉన్నపటికీ రాజకీయ వాతవరణం మాత్రం చాల వేడిగా ఉంది.   శాసనసభ, మండలి సమావేశాలలో ఊహించినట్లే సమైక్యాంధ్ర, తెలంగాణా నినాదాలతో రసాభాసగా మారుతూ వాయిదాలు పడుతున్నాయి. ఇక చాలా కాలం తరువాత టీ-కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వెంటనే సభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని కూడా కలిసి బిల్లుకోసం ఒత్తిడి తెస్తున్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే నేరుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహంతీకే ఫోన్ చేసి బిల్లును వెంటనే సభకు పంపాలని కోరారు. ఈరోజు సాయంత్రంలోగా బిల్లుని సభలకు పంపకపోయినట్లయితే మొహంతీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని తెరాస నేత హరీష్ రావు హెచ్చరించారు. అయితే ముఖ్యమంత్రి అనుమతి లేనిదే ప్రధాన కార్యదర్శి టీ-బిల్లును ఉభయ సభలకి పంపకపోవచ్చును.   తెలంగాణా నేతలు బిల్లుకోసం ఒకవైపు తొందరపడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు మాత్రం ఇప్పుడప్పుడే బిల్లును సభలో ప్రవేశపెట్టే ఉద్దేశ్యం లేరు. కొద్ది సేపటి క్రితమే దిగ్విజయ్ సింగ్ గవర్నర్ నరసింహన్ తో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. ఒకవేళ ముఖ్యమంత్రి వెంటనే అనుమతించకపోయినట్లయితే, సభాపతే చొరవ తీసుకొంటారా? లేక బిల్లును ప్రవేశపెట్టమని గవర్నర్ ఆదేశిస్తారా అనే సంగతి త్వరలోనే తేలిపోతుంది.

లాలూకి సుప్రీం బెయిలు మంజూరు

  దాణా కుంభకోణం కేసులో ఐదేళ్ళు జైలు శిక్షపడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురయిన తరువాత సుప్రీం కోర్టుకి వెళ్ళారు. ఈరోజు ఆయన కేసు విచారణ చెప్పటిన సుప్రీం కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. 2జీ కుంభకోణంలో బెయిలుపై విడుదలయిన మాజీ కేంద్రమంత్రి రాజా, కరుణానిధి కుమార్తె కనిమోలి, అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటు బెయిలుపై విడుదలయిన జగన్మోహన్ రెడ్డి తదితరులు, సత్యం కంపెనీ కుంభకోణంలో బెయిలుపై విడుదలయిన రామలింగరాజు ఏవిధంగా తమ కేసుల నుండి ఉపశమనం పొందుతున్నారో, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇక జైలు బాధ నుండి విముక్తి పొందినట్లే భావించవచ్చును.