తెదేపా, తెలంగాణా భాజాపాలో విభజన

  నరేంద్రమోడీకి నీరాజనాలు, ఇటీవల ఎన్నికల ఫలితాలు.. వీటి పుణ్యమాని దేశవ్యాప్తంగా భాజాపా శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతుంటే రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ గందరగోళంలో మునిగిపోయింది. హైదరాబాద్‌లో నరేంద్రమోడి నిర్వహించిన బహిరంగ సభలో తొలిసారి పొత్తు పొడిచింది. అక్కడ నుంచి ఇరు పక్షాలూ దశల వారిగా సన్నిహితమైనట్టు కనిపిస్తుంది. భాజాపా అగ్రనేతలు చంద్రబాబుతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. తెలుగుదేశంతో పొత్తు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర శాఖ అభిప్రాయాలను అగ్రనాయకత్వం పట్టించుకోవటం లేదు. దీంతో ఇప్పటి దాకా భాజాపా రాష్ట్రస్థాయి నేతలుగా ఉన్నవారు తమ ప్రాధాన్యం తగ్గిపోతుందేమోననే భయంతో కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే రాష్ట్రనాయకుల్లో కొందరు తెదేపాతో పొత్తును పూర్తి స్థాయిలో ఆహ్వానింస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇది పార్టీకి మంచి ఊపునిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో చీలికలు వచ్చే ప్రమాదం కనిపిస్తుంటే.. మరో వైపు పులి మీద పుట్రలా సీమాంద్ర భాజాపా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యగళమెత్తింది.  సీమాంద్రకు నష్టం కలిగేలా విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ త్వరలో సీమాంద్ర భాజాపా నేతలు తమ జాతీయనాయకుల్ని కలిసి చర్చించనున్నారు. ఏదేమైనా ఢిల్లీ  కోట మీద పాగా వేసే దిశగా దూసుకుపోతున్నపరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం చింతించదగినదే.

కన్ను లొట్టపోయిందిట..

  ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి ఓ కన్ను లొట్టపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే జెసి దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన నిర్ణయం కారణంగా దాపురించిన పరిస్థితుల్ని అభివర్ణిస్తూ ఆయన గురువారం ఈ కామెంట్‌ చేశారు. ఈ కాంమెట్‌ చేస్తున్నప్పుడు ఆయన తన ఎడమ కన్నును ఒకటికి రెండు సార్లు మూసి తెరిచి, దానిని చూపిస్తూ ఏకపాత్రాభినం కూడా చేసేశారు. మరి ఆయన దృష్టిలో పార్టీ పరిస్థితి బాగున్న కన్ను ఏప్రాంతామో.. ఆయనే చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సందర్భంగా ఆయన ఇంకో విచిత్రమైన విషయం కూడా చెప్పారు అదేమిటంటే.. రాష్ట్రం విడిపోతే కిరణ్‌ పార్లీ పెట్టరట. సమైక్యంగా ఉంటేనే పెడతారట. పనిలో పనిగా జగన్‌ పార్టీ సమైక్యం కోసం బాగా ప్రత్నిస్తున్నారని అభినందనలు కూడా అందించేశారు. ఏమిటి జెసి గారూ. ఒకే రోజు మీరిన్ని నిజాలు చెబితే జనం జీర్ణించుకోవద్దూ..

`లాస్ట్‌ బాల్‌` టైముందోచ్‌..

    రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌ మహాక్రీడా ప్రియుడని మరోసారి నిరూపించుకున్నారు. సమైక్యం కోసం వీలున్నప్పుడల్లా డైలాగుల బౌండరీలు, స్పీచ్‌ల సిక్సర్లు కొడుతున్నకిరణ్‌గారు.. ఇటీవల కొంత సైలెంట్‌గా ఉన్న విషయం విదితమే. ఫుడ్‌పాయిజన్‌ అంటూ అసెంబ్లీకి డుమ్మా కొట్టేసిన ఆయన విపక్షాల విమర్శల్ని తిప్పి కొట్టేందుకు తీరుబాటుగా అసెంబ్లీ వాయిదా వేసి మరీ సిద్దమయ్యారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఇంకా ప్రవేశ పెట్టలేదని తేల్చి చెప్పారు. అయితే విభజన అంశంపై శాసనసభ అభిప్రాయం చెప్పాల్సిందేనన్నారు. బిల్లుపై చర్చ జరిగితే తమ ఎమ్మెల్యేల వైఖరులేంటో ప్రజలే తెలుసుకుంటారన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విభజన జరిగిన తీరు తెన్నులను తాను అధ్యయనం చేశానని ఆ అధ్యయన ఫలితాలు అసెంబ్లీ స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌లకు అందించానన్నారు. తొలుత బీహార్‌, యుపి అసెంబ్లీలు విభజన తీర్మానాన్ని తిరస్కరించాయని, రెండేళ్ల తరువాత మాత్రమే అంగీకారం తెలిపాయని ఆయన వెల్లడించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, సీమాంద్రకు అనుకూలం కాదని అయతే ప్రజా ప్రయోజనాలకే మాట్లాడుతున్నానని ఆయన వివరించారు. తాను వాస్తవాలు మాట్లాడుతుంటే విపక్షనేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన నిజాయితీరి ఎవరి సర్ఠిఫికేట్‌ అవసరం లేదన్నారు. తానేమీ పోరాటం విరమించలేదని, లాస్ట్‌ బాల్‌కి ఇంకా టైముందని అంటూ.. తానేంటో నిరూపిస్తానని కూడా అన్నారు సో.. చివరి బంతి ఎప్పుడు పడుతుందో, దాన్ని కిరణ్‌ గారు బౌండరీ దాటిస్తారో తనతో పాటు అందర్నీ క్లీన్‌బౌల్డ్‌ చేస్తారో.. వెయిట్‌ అండ్‌ సీ.

మనీ మేటర్‌ తేల్చండి.

  సీమాంద్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకి విభజన తర్వాత బ్యాలెన్స్‌ షీట్‌ ఏమిటనే డౌటొచ్చింది. అందుకే వీరంతా కలిసి అధిష్టానానికి లేఖ రాయలని నిర్ణయించుకున్నారు. ఇందులో తెలంగాణ ముసాయిదా బిల్లు విధివిధానాలపై మరింత స్పష్టత కావాలని కోరనున్నారు. అంతేకాకుండా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వివరాలను కూడా వెల్లడించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇ:తకీ ఈ లేఖకు అర్ధమేమిటి? విభజనను ఆపలేమని, కనీసం అస్థుల అప్పుల సంగతైనా తేల్చుకుందామని వీరు భావిస్తున్నారా? లేక వీలున్నంత కాలం ఈ గందరగోళాన్ని సాగదీయాలనుకుంటున్నారా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు రాజకీమవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

తప్పున్నా...తప్పుకోమనకూడదు..

      ఇలాంటి విచిత్రమైన స్టేట్ మెంట్లు ఇవ్వగలిగిన నాయకులు మన రాష్ట్రంలో కొంతమందే ఉన్నారు. చాలా కాలం తర్వాత గురువారం నోరువిప్పిన మాజీమంత్రి డీ.ఎల్ రవీంద్ర రెడ్డి కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పజెప్పాలంటూ సోనియా గాంధీ పై జె.సి. దివాకర్ రెడ్డి చేసిన కామెంట్ పై ఆయన లేట్ గా అయినా వెరైటీగా స్పందించారు. ''రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి అధిష్టానమే కారణం. అయితే సోనియా గాంధీ తప్పు చేసి ఉండవచ్చు. కానీ ఒక్క తప్పుకే అలా తప్పుకోమనకూడదు''అంటూ ఆయన విచిత్రంగా వ్యాఖ్యానించారు.   ఒకవైపు అధినేత తప్పు చేశారంటూనే మరోవైపు తప్పుకోకూడదంటూ విమర్శనూ, మద్దతునూ కలగలిపి డీఎల్ ఇచ్చిన స్టేట్ మెంట్ లోతులు వెతికే పనిలో పడ్డారు విశ్లేషకులు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదన్న డీఎల్....జె.సి, గాదె వె౦కట రెడ్డి లాంటి నేతలు మాత్రం కిరణ్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మిగిలినవారు ఎటు ఎటు దూకుతారో అని బాగానే గమనిస్తున్న డీ.ఎల్ ఇంతకీ తానే పార్టీలోకి జంప్ జిలానీ అవుదామనుకుంటున్నారో చెప్పాలని కొందరు గుసగుసలాడుతున్నారు.  

సమైక్య'అత్త'కు..విభజన 'అల్లుడు'..

      గురువారం అసెంబ్లీ ఆవరణలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. సమైక్యం కోసం గట్టిగా మాట్లాడే టిడిపి నేత నన్నపనేని రాజకుమారిని తెరాస నేత కెటిఆర్ పరామర్శించారు. ''అత్తమ్మా పడిపోయావ్ గా ఎలా ఉన్నావ్'' అంటూ ఆరాతీశారు. శాసనమండలిలో జరిగిన తోపులాటలో నన్నపనేనిని తెరాస ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తోసేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ...స్వామిగౌడ్ కావాలని ఆమెని పడేయలేదంటూ వివరణ ఇచ్చారు. టీవిల్లో నన్నపనేని పడిపోయిన వైనం చూసిన నాన్న కెసిఆర్ చాలా బాధపడ్డారని కూడా ఆయన చెప్పారు. ఈ సంధర్బంగా నన్నపనేని కూడా కెటిఆర్ తో ముచ్చటించారు. మొత్తం మీద ఆంధ్రా అత్తకు తెలంగాణ అల్లుడుకు మధ్య చోటుచేసుకున్న ఈ కుశల ప్రశ్నల పర్వం..ప్రాంతాలకతీతంగా అందరినీ ఆకట్టుకుంది.

జనవరి 3 నుంచి మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు

      అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఒకసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తెలంగాణ, సమైక్య నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. జనవరి 3 నుంచి అసెంబ్లీ రెండో విడత సమావేశాలు ప్రారంభంకానున్నాయి.   జనవరి 3 నుంచి 10 వరకు రెండో విడత సమావేశాలు, జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాతి సెలవులు, జనవరి 16 నుంచి 23 వరకు మూడో విడత సమావేశాలు జరుగనున్నాయి. అయితే అసెంబ్లీ నిరసవధిక వాయిదాపై టీఆర్ఎస్, బీజేపీ, టీటీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ఏకపక్షంగా వాయిదా వేశారని టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేయగా, తెలంగాణ టీడీపీ నేతలు పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

సీమాంధ్ర ప్రజలకు సీయం హ్యాండ్

  “ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ప్రభుత్వాలకు ప్రజలే శలవులు ప్రకటిస్తారు. ఆఖరు బంతి వరకు ఆట సాగుతుంది. దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతమయినవి. నేను నేటికీ సమైఖ్యవాదానికే కట్టుబడి ఉన్నాను. నా అభిప్రాయంలో, ఆలోచనలలో వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉంటాను. నేను పైలిన్ తుఫానును ఆపలేకపోవచ్చునేమో కానీ, తప్పకుండా రాష్ట్ర విభజన ఆపగలను. నాచేతులతో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభిచే అదృష్టం దక్కినందుకు గర్వ పడుతున్నాను. కానీ, నా హయాంలోనే రాష్ట్ర విభజన జరగడం నా దురదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇన్ని నెలలుగా రోడ్లమీధకు వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తుంటే ప్రపంచమంతా గమనించింది. కానీ ఇది గమనించడానికి కేంద్రానికి కళ్ళు చెవులూ లేవా? ఇటువంటి పదునయిన మాటలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకాలంగా అధిష్టానాన్ని గట్టిగా ఎదిరిస్తూ, సమైక్య చాంపియన్ గా మంచి పేరు సంపాదించుకొన్నారు. అయితే ఇప్పుడు అదంతా కంటశోషగా మిగిలిపోయినట్లు కనబడుతోంది.   టీ-బిల్లు శాసనసభకు రాగానే రాష్ట్రంలో ప్రళయం వచ్చేస్తుందనే అంతగా ఆయన అనుచరులు అందరూ కూడా చల్లబడిపోయారు. చివరికి ముఖ్యమంత్రి కనుసైగతో రంగంలో దూకేసే ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు మెరుపు సమ్మె చేయాడానికి సరయిన ముహూర్తం దొరక్కపోవడంతో మీనమేషాలు లెక్కబెడుతూ కూర్చోవలసి వచ్చింది పాపం.   ఇక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో తెలంగాణా బిల్లుపై వీర ప్రసంగం చేసేసిన తరువాత ఆయన అయన సహచరులు వీరతిలకం, వీర గంధం ఒళ్లంతా పూసేసుకొని రాజీనామాలు చేసేసి వీధుల్లోకి వచ్చేసి ఆందోళనలు చేసేస్తారని ప్రజలెవరూ కూడా ఇక ఆందోళన చెందనవసరం లేదు.   అయితే ఆరు నెలలుగా గారడి సాము చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనీసం శాసనసభలో విభజనకు వ్యతిరేఖంగా నాలుగు మంచి మాటలయినా చెపితే విని పులకించిపోదామని టీవీలకు చెవులు కళ్ళు అప్పగించి కూర్చొన్న ప్రజల ఆశలను అడియాస చేస్తూ, ఈ రోజు ఆయన శాసనమండలిలో మొక్కుబడిగా మూడే మూడు నిమిషాలాలో ఆ తంతు కూడా ముగించేసారు.   బీహార్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అక్కడి శాసనసభ అనుసరించిన పద్దతులని తాను అధ్యయనం చేసానని, అందువల్ల సభలో సభ్యులందరూ కూడా అధ్యయనం చేస్తే మేలని ఒక ఉచిత సలహా ఇచ్చారు. సభ ముందుకు వచ్చిన సమస్య చాలా సున్నితమయినది కనుక, సభ్యులందరూ సంయమనం పాటించాలని కోరారు. చర్చల ద్వారా ఎటువంటి సమస్యనయినా పరిష్కరించు కోవచ్చు గనుక దీనిపై సభలో సభ్యులందరూ హుందాగా చర్చలో పాల్గొని పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. అందుకోసం స్పీకర్ , చైర్మన్ ఇరువురూ సభకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. అవసరమయితే మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసుకొనైనా ఉభయ సభలు సజావుగా సాగేలా చేయడం మన అందరి భాద్యత అని ఆయన హితబోధ చేసారు. ఆ తరువాత సభలో సమైక్యాంధ్ర నినాదాలు మొదలవడంతో సభ వాయిదా పడింది.   ఇక శాసనసభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవదికంగా వాయిదా వేసారు. అందువల్ల ఇక సీమాంధ్ర ప్రజలు ఉభయ సభల నుండి ఏమీ ఆశించడం అత్యాస, అడియాసే అవుతుందనే సత్యం ఎంత త్వరగా గ్రహిస్తే అంతే మన శాంతి దక్కుతుంది.

కెసిఆర్ కు మోత్కుపల్లి సలహా

      తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుకు తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు ఒక సలహా ఇస్తున్నారు. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే దేనితోనూ సంబంధం లేకుండా తెలంగాణ వచ్చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే మోత్కుపల్లి అంటున్నారు. టీఆర్ఎస్ విలీనం విషయంలో కేసీఆర్ వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలని, సోనియాగాంధీతో కేసీఆర్ కు మంచి సంబంధాలే ఉన్నాఎందుకో ఆలస్యం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ వెంటనే వచ్చేందుకు కేసీఆర్ విలీనానికి సిద్దం కావాలని, అవసరం లేనప్పుడు ఢిల్లీలో ఉండే కేసీఆర్..ఇప్పుడు ఫాం హౌస్ లో ఎందుకున్నాడని ప్రశ్నించారు.

కిరణ్ తీరు మొగుడు కొట్టినట్లు.. పెళ్లాం ఏడ్చినట్లు

      శాసనమండలిలలో తెలంగాణ బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం ఉదయం ప్రసంగించారు. విభజన అంశం సున్నితమైనదని, ఇలాంటి అంశాలపై జాగ్రత్తగా మాట్లాడితే ఎవరికీ ఇబ్బందులు రావని ఆయన తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా చర్చ జరగాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విభజన సమయంలో చర్చ ఎలా జరిగిందో అందరూ అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే మరోసారి బీఏసీ సమావేశం పెడదామని సీఎం కిరణ్ తెలిపారు. అయితే సీఎం ప్రసంగంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేయగా అందరికీ అర్థమయ్యేందుకే అన్ని చెబుతున్నామని సీఎం కిరణ్ వివరణ ఇచ్చారు.   మరోవైపు ముఖ్యమంత్రి తీరు మొగుడు కొట్టినట్లు.. పెళ్లాం ఏడ్చినట్లు నటిస్తే అప్పులోడు వెళ్లిపోయినట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి మండలి సభ్యుడు స్వామి గౌడ్ అన్నారు. కిరణ్ చర్చపై మాట్లాడినా సీమాంధ్ర సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. నొప్పి వస్తే కాళ్లు చేతులు కొట్టుకోకుండా డాక్టర్ వద్దకు వెళ్తేనే తగ్గుతుందని, అలాగే మీ సమస్యలు తీరాలంటే చర్చ జరగాలన్నారు.

టేక్ డైవర్షన్ ప్లీజ్: కాంగ్రెస్ పార్టీ

  తన ప్రతిష్ట మసకబారిన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ప్రజల, ప్రతిపక్షాల, మీడియా దృష్టిని కూడా వెంటనే వేరే అంశం మీదకు మళ్ళించడం అలవాటు. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఓటమి, ముఖ్యంగా డిల్లీలో ఆమాద్మీ చీపురు దెబ్బలతో పూర్తిగా పరువుపోగోట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్ళ క్రితం తను అటకెక్కించేసిన లోక్ పాల్ బిల్లును క్రిందకు దింపి, దుమ్ము దులిపి హడావుడిగా పార్లమెంటు చేత ఆమోదింపజేసింది. ఇది రాహుల్ బాబు చొరవ వలనే జరిగిందని యువరాజావారికి ఆ క్రెడిట్ కట్టబెట్టే ప్రయత్నం కూడా చేసింది. కానీ సభలోనే ఉన్నపెద్ద ముత్తెదువ సుష్మా స్వరాజ్ వెంటనే అడ్డుపడి ఆ క్రెడిట్ అంతా ఈ బిల్లు కోసమే కడుపు మాడ్చుకొంటున్న అన్నాహజారేకే దక్కాలని గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ కంగుతింది.   ఇంకా మరో ఆరు బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందవలసి ఉంది గనుక సమావేశాలను మరికొంత కాలం పొడిగించాలని యువరాజావారు ఆ(దే)శించినప్పటికీ, ‘అవిశ్వాసం..అవిశ్వాసం’ అంటూ సభలో చిందులు వేస్తున్నతమ పార్టీ యంపీల మాటవిని స్పీకర్ అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెడితే, లోక్ పాల్ తో పెంచుకొన్న రేటింగ్ కాస్త మళ్ళీ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంటుందని రాజమాత భయపడ్డారో మరేమో తెలియదు, కానీ ఆమె మనసులో ఆలోచనలని భూతద్దం వేసి చదివేసినట్లు, స్పీకర్ మీరా కుమార్ పార్లమెంటును నిరవదికంగా వాయిదా వేసేసి చేతులు దులుపుకొన్నారు.   ఇక పార్లమెంటులో ఏ కుంభకోణాల గురించి ఎవరికీ జవాబులు, సంజాయిషీలు చెప్పుకొనే ఆగత్యం లేదు గనుక, కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన దేవయాని ఉదంతం అందిపుచ్చుకొని మళ్ళీ హడావుడి చేస్తూ ప్రజల దృష్టి అటువైపు మళ్ళించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే డిల్లీలో అమెరికన్ ఎంబసీ ముందు ఉన్న ట్రాఫిక్ బ్యారికేడ్స్ తొలగించినంత మాత్రాన్నఈ సమస్య పరిష్కారం కాదని దేశముదురు కాంగ్రెస్ పార్టీకి తెలియకపోలేదు. కానీ తెలుగు సినిమాలు హిట్ట్ అవడానికి నాలుగు పంచ్ డైలాగులు ఒక ఐటెం సాంగ్ ఎలా అవసరమో, ఈ ఇమ్మోషనల్ ఇండో-అమెరికన్ డ్రామాతో ప్రజల దృష్టి ఆకట్టుకోవాలంటే ఇటువంటి హడావుడి కూడా అంతే అవసరమని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తనకు బాగా తెలిసిన, అలవాటయిన టక్కుటమార విద్యలన్నిటినీ ప్రదర్శిస్తూ అందరి దృష్టి మళ్ళించేందుకు తెగ కష్టపడుతోంది.   నిజానికి దేవయాని విషయంలో పరిష్కారం కోసం భారత విదేశంగా శాఖ, అమెరికా విదేశాంగ శాఖా మరియు అమెరికా ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరుపవలసి ఉంది. బహుశః అవి కూడా సమాంతరంగా జరుపుతున్నపటికీ, అది సామాన్య ప్రజల కంటికి కనబడదు గాబట్టి ప్రజలందరికీ అర్ధమయ్యే విధంగా ఈ డ్రామాలు ప్రదర్శిస్తోంది.   కాంగ్రెస్ ఊహించినట్లుగానే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా కూడా దేవయాని అంశంలోకి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు గనుక, వారిని అందులో బిజీ బిజీగా ఉంచుతూనే, మరో పక్క వచ్చేనెల 17నుండి జరగనున్న కాంగ్రెస్ మహాసభలలో రాహుల్ బాబు యువరాజ పట్టాభిషేకానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడదీసిన తరువాత ముఖ్యమంత్రుల నియామానికి, పనిలోపనిగా మొన్ననే జైలునుండి బయటకు వచ్చిన లాలూ ప్రసాద్ ను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టెసింది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తున్నఈ విద్యలపై విద్యార్ధులు పీ.హెచ్.డీ. కూడా చేయవచ్చును.

విలువలకే అమాద్మీ ప్రాధాన్యం

  అమాద్మీ కోరినట్లుగానే 16 అంశాలపై తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చినప్పటికీ అమాద్మీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వెనుకంజ వేస్తుండటంతో, కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.   ఈ నేపధ్యంలో ఆపార్టీ నేత అరవింద్ కేజ్రీ వాల్ మీడియాతో మాట్లాడుతూ, “వ్యక్తిగతంగా నాకు కాంగ్రెస్, బీజేపీల మద్దతు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు నా ఇష్టాఅయిష్టాల కంటే, ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తాము. అందుకే మేము డిల్లీలో 25లక్షల మంది ప్రజల నుండి అభిప్రాయం సేకరిస్తున్నాము. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరితే తప్పకుండా వారి ఆదేశాలను శిరసావహిస్తాము. వద్దంటే ప్రతిపక్షంలో కూర్చొంటాము."   "ఇంతవరకు ప్రజలు ఓట్లు వేయడం వరకే భాద్యత, ఆ తరువాత మొత్తం వ్యవహారమంతా నాలుగు గోడల మధ్య సూట్ కేసులతో కూర్చొనే రాజకీయ నాయకులదే అన్నట్లు సాగుతోంది. కానీ, మేము ఆ దుస్సంప్రదాయానికి పూర్తి భిన్నంగా, పూర్తి పారదర్శకతతో ప్రజల మధ్యనే ఈ వ్యవహారంపై తగు నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. అయితే దీనిని అలుసుగా తీసుకొని కొందరు నేతలు, వారి పార్టీలు మేము బాధ్యత తీసుకోవడానికి భయపడి పారిపోతున్నామని చాటింపు వేస్తున్నారు. అందుకు మేము భయపడేది లేదు."   "ప్రజలెన్నుకొన్న ప్రతినిధులు, వారి ద్వారా ఏర్పడే వ్యవస్థలు పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉండాలనే మా ఆలోచన, డబ్బు సూటు కేసులతో రాజకీయాలు చేసే వారికి చాలా విడ్డూరంగా, అర్ధం లేనిదిగా కనిపించవచ్చును. కానీ, నిజానికి ప్రజా ప్రతి నిధులు, వ్యవస్థలు ఈవిధంగానే జవాబుదారీతనంతో పనిచేయాలని ప్రజలు భావిస్తారు. అందుకే మేము ప్రజలకే మేము కట్టుబడి ఉంటాము తప్ప ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలకు, విమర్శలకు కాదు."   "చాలా మంది ప్రజలు, మా పార్టీలో కూడా అనేకమంది కాంగ్రెస్ బేషరతు మద్దతు ఇస్తోంది గనుక దానిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఈ నాలుగు నెలల సమయంలో మా సమర్ధత నిరూపించుకొనగలిగితే రానున్నసార్వత్రిక ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించవచ్చని సూచిస్తున్నారు. వారు చెపుతున్నది నిజమే అయినప్పటికీ, మొన్న జరిగిన ఎన్నికలలో మా పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా ప్రచారం చేసి, వారి భ్రష్ట రాజకీయాల నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వారితోనే చేతులు కలపితే, మాపార్టీ కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది. అందుకే ప్రస్తుత పరిస్థితి వారికి వివరించి, మేము ఏవిధంగా వ్యవహరించాలని వారి అభిప్రాయం కోరుతున్నాము."   "ప్రజలను యస్.యం.యస్., ఈ-మెయిల్ మరియు ఇతర మార్గాల ద్వారా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయమని కోరాము. వారి స్పందన, సలహాల మేరకు మేము త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకొంటాము,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

లోక్ సభకు చంద్రబాబు!!

      తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఏర్పాటుతో వాటిలో ఏదో ఒకదానికి పరిమితం కావడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి వచ్చే ఎన్నికల్లో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన సమయం లేనందున అసెంబ్లీకి కాకుండా కేవలం లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లోక్‌సభకు పోటీచేసే అవకాశముందనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.   చంద్రబాబు ఇప్పటిదాకా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించలేదు. ఆరుసార్లుగా అసెంబ్లీకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా కుప్పం నుంచే పోటీకి సన్నాహాలు చేసుకొంటున్నారు. కానీ అసెంబ్లీకి ఆగి, లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగితే చంద్రబాబు ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీలకు దీటుగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటడానికి వ్యూహరచన చేసుకుంటోంది. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ సీమాంధ్రపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. కేవలం లోక్‌సభ ఎన్నికలు జరిగితే సినీ హీరో బాలకృష్ణ కూడా సీమాంధ్రలో ఒక చోటి నుంచి లోక్‌సభకు పోటీచేసే అవకాశముందని, బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి అత్యధిక సీట్లు గెలుచుకోవడమే టీడీపీ వ్యూహమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

వైయస్ జగన్ కు నారా లోకేష్ సవాల్

      వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి నారా లోకేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్దమని, జగన్మోహన్ రెడ్డి తమ సవాలు స్వీకరించడానికి సిద్దమేనా? అని లోకేష్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతకీ బెయిలు దొరకకపోవడంతో చివరికి సోనియా గాంధీని బ్రతిమాలుకొని బెయిలు తెచ్చుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే, దానిని ఆ తరువాత వచ్చిన వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని విమర్శించారు.   తెదేపా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, చంద్రబాబు కృషితో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచగలిగారని తెలిపారు. విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయని గ్రహించిన తెదేపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేసిందని ఆయన అన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయని, తత్ఫలితంగా మళ్ళీ నిరుద్యోగ సమస్య తీవ్రం అయ్యిందని తెలిపారు. తెదేపాను నిత్యం విమర్శించే కేసీఆర్, తెదేపా ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని చంద్రబాబు సవాలు విసిరితే తన ఫాంహౌస్ లోకి దూరి దాకోన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.

కొండను తవ్వి లోక్‌పాల్‌ పట్టారా?

  బోలెడంత హంగామా చేసి, మిన్నునూ మన్నునూ ఏకం చేసినంత పని చేసి చివరికి లోక్‌పాల్‌ను సాధించారు. అంతా అయ్యాక.. ఇప్పుడు సాధించిన వారే అంటున్న మాటలు వింటుంటే.. సగటు జీవికి పై విధంగా సందేహం కలగడంలో ఆశ్యర్యం లేదు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొందరు రాజకీయ నేతలు, ఉద్యమకారులు స్పందించిన తీరు చూండండి మరి.. లోక్‌పాల్‌ సాధనలో కర్త కర్మ క్రియ అయిన అన్నా హజారే దీక్ష విరమణ అనంతరం ఏమన్నారంటే. 'లోక్‌పాల్‌ సభ ఆమోదం పొందడం హర్షణీయం.. అయితే దీనితో అంతా అయిపోతుందనుకోలేం. అవినీతి వ్యతిరేఖపోరాటంలో ఇదో ముందడుగు మాత్రమే'ఈ బిల్లు రావాల్సిదేనని కాంగ్రెస్‌ తరపున గట్టిగా పట్టుపట్టి హజారేతో సైతం శభాష్‌ అనిపించుకున్న రాహుల్‌గాంధీ ఏమన్నారంటే.. ' లోక్‌పాల్‌ ఆమోదం పొందడం పట్ల సంతోషంగా ఉంది. అయితే లోక్‌పాల్‌తో మాత్రమే అవినీతి నిర్మూలన సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి చట్టాలు మరిన్నిరావాలి' ఆది నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్న ఆమ్‌ఆద్మీనేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏమన్నారంటే.. 'ఈ బిల్లులో అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన చట్టంపై స్పష్టత లేదు, బిల్లు విషయంలో కాంగ్రెస్‌ అన్నాహజారేనే తప్పు దారి పట్టించింది'.]   అవినీతి పోరాటంలో అన్నాహజారేకు పూర్తి మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు ఏమాన్నారంటే.. ' లోక్‌పాల్‌ బిల్లు ఆమోదం వెనుక అన్నాహజారే కృషి వెలకట్టలేనిది. ఈ బిల్లును మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం జరగాలి'. నేరమయరాజకీయాలకు వ్యతిరేకంగా ఆంద్రప్రదేశ్‌లో లోక్‌సత్తాను ఏర్పాటుచేసిన జయప్రకాష్‌ నారాయణ్‌ ఏమన్నారంటే.. ' ఈ బిల్లు రాజకీయలబ్థి కోసం మాత్రమే. కేవలం 2 వేల మందికి పరిమితమైన దీని ద్వారా సాధించేదేమి లేదు'.

మళ్ళీ ముఖ్యమంత్రికి డిల్లీ పిలుపు దేనికి?

  మంగళవారం లోక్ సభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అవిశ్వాసం తీర్మానం అని ఎగిరేగిరిపడిన కాంగ్రెస్ యంపీలు కూడా తట్ట బుట్టా సర్దుకొని మళ్ళీ రాష్ట్రానికి తిరిగివచ్చేస్తారు. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రాష్ట్ర విభజన బిల్లుపై కసరత్తు మొదలుపెట్టేందుకు సిద్దం అవుతోంది.   ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో కానీ, శాసనమండలిలో గానీ తెలంగాణా బిల్లుపై చర్చ జరిగే వాతావరణం కనబడటం లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీబిల్లుపై మాట్లాడి బుక్కయిపోకూడదనే ఉద్దేశ్యంతో ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుపడుతూ, బహుశః రాష్ట్రపతి ఇచ్చిన జనవరి23 గడువు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగించే అవకాశాలున్నాయి.   తెదేపా, వైకాపా మరియు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఈ ఉద్దేశ్యాన్నికనిపెట్టిన తెరాస, టీ-కాంగ్రెస్ మరియు బీజేపీలు బిల్లుపై ఎటువంటి చర్చలేకుండానే రాష్ట్రపతికి త్రిప్పిపంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇక ఇటీవల దిగ్విజయ్ సింగ్ తో బొత్స సత్యనారాయణ ఇంటిలో భోజన సమావేశం తరువాత పూర్తిగా చల్లబడిపోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బిల్లుపై ఇదివరకులా రంకెలు వేయడం లేదు. అదేవిధంగా ఆయన సహచర మంత్రులయిన గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, టీజీ వెంకటేష్ తదితరులు కూడా ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయారు.   అందువల్ల పూర్తి అనుకూలంగా ఉన్న ఇటువంటి సమయంలో బిల్లును తిరిగి వెనక్కి రప్పించుకోగలిగితే, వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చుననే ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిల్లీకి పిలిచి ఉండవచ్చును.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ విధేయుడుగానే ఉంటారని, రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తారని గతంలో దిగ్విజయ్ సింగ్ చాలా సార్లు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు గనుక, ఇక ఎన్నికల వరకు ఆయనను మార్చే అవసరం కూడా లేదు. కనుక, ప్రస్తుతం శాసనసభలో ఉన్న తెలంగాణా బిల్లుపై కనీసం తెలంగాణా సభ్యుల ఆమోద ముద్ర వేయించేసి, వీలయినంత త్వరగా రాష్ట్రపతికి త్రిప్పి పంపమని కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆదేశించవచ్చును.

యువరాజ పట్టాభిషేకం

  నిజంగా నువ్వు చాలా గ్రేట్ మమ్మీ!   ఏమిటి నువ్వు కూడా మన కాంగ్రెస్ నేతల్లాగే భజన చేస్తున్నావు? కొంపదీసి సహవాస దోషమా ఏమిటి?   బాగుంది.. యువరాజుని నేను భజన చేయడమేమిటి? నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయి మన పరువు పోయిందని మన కంటే ఎక్కువగా ప్రజలు, ప్రతిపక్షాలే మనకి గుర్తుచేసి మనల్ని ఏడిపిస్తుంటే వాళ్ళని లోక్ పాల్ బిల్లుతో భలే మాయ చేసావు మమ్మీ. నిజంగా యువార్ గ్రేట్ మమ్మీ! ఈ వెర్రి జనాలు అప్పుడే ఆ సంగతి మరిచిపోయి, లోక్ పాల్ బిల్లుని చూసి ఎలా చంకలు కొట్టుకొంటున్నారో చూస్తే నవ్వాపుకోలేక పోతున్నామమ్మీ! పైగా మనోళ్ళు అందరూ అది నా గొప్పదనమేనని ఓ..కోరస్ గా ఒకటే భజన చేసేస్తుంటే..నాకు కూడా మొన్న ఎన్నికలలో ఓడిపోయిన దుఃఖం పూర్తిగా పోయింది మమ్మీ! రియల్లీ యువ్వార్ గ్రేట్ మమ్మీ!   ఒరేయ్!కన్నా ఇక ఆపరా ఆ భజన రోజూ మనవాళ్ళ భజనలు వినివినీ చెవులు చిల్లులు పడిపోతుంటే ఇక నువ్వు కూడా తయారయ్యావా?   ఏమిటి మమ్మీ నేను నీ ట్రిక్ చూసి చాలా థ్రిల్ అయిపోయి ఆనందం పట్టలేక చెపుతుంటే భజన అని అలా తీసి పారేస్తావు?   ఆ పోనీలే..కోప్పడకు.. అయితే ఇంతకీ ఏమంటావు? నేను గ్రేట్ అంతేనా?   యస్ మమ్మీ! యువ్వార్ రియల్లీ గ్రేట్! టెర్రిఫిక్.. లేకుంటే ఇంతవరకు మనం తయారుచేసిన లోక్ పాల్ బిల్లు ఒట్టి వేస్ట్ అంటూ మనల్ని తిట్టి పోసిన ఆ అన్నాహజారే చేతే మన “కాంగ్రెస్ పార్టీయే లోక్ పాల్ బిల్లు కోసం చాలా శ్రమ పడింది. అందుకు పార్టీకి చాలా థాంక్స్” అని కూడా చెప్పించావు. అందుకే యువ్వార్ రియల్లీ ఎక్సట్రార్డినరీ పర్సన్న్..అని నేను అంటుంటే నువ్వేమో భజన అంటూ తీసి పారేస్తున్నావు.   ఏమిటో రా.. మీ డాడీ పోయినప్పటి నుండి ఈ భజనలు వినివినీ ఉన్నమాట చెప్పినా కూడా నాకు భజనలాగే వినిపిస్తోంది. అయినా ఒకటి గుర్తుంచుకో జనాలు అడిగారని ఏదీ వెంటనే ఇచ్చేయకూడదు. వాళ్ళు మనల్ని బ్రతిమాలుకొని, తిట్టుకొని ఇక వల్ల కాదనుకొంటున్నప్పుడే ఏదయినా ఇవ్వాలి. ఇది కూడా అంతే.అప్పుడు మనం ఇచ్చిందే గొప్పనుకొని ఆ తిట్టిన నోళ్ళతోనే మనకి భజనలు చేస్తారు.. ఇంకా భక్తి ఎక్కువయిపోతే  మనకి గుళ్ళు గోపురాలు కూడా కట్టి పూజిస్తారు. నువ్వు కూడా ఇటువంటి ట్రిక్స్ నేర్చుకోకపోతే ఇక దేశాన్ని ఎలా పాలిస్తావు? ఈ ప్రతిపక్షాలని, ప్రజలని ఎలా మేనేజ్ చేస్తావురా కన్నా... నువ్వు చూస్తే ఎప్పుడూ పార్టీ ప్రక్షాళన, రాజకీయ ప్రక్షాళన, దేశం, యువత, అభివృద్ధి అంటూ ఏవేవో మనకి అలవాటులేని మాటలన్నీ మాట్లాడుతుంటావు తప్ప.. మన మోహన్ అంకుల్ కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడవు. ఇలాగయితే ఎలారా కన్నా? మళ్ళీ ఆ మోడీ అంకుల్ ఆ కుర్చీలో ఒకసారి సెటిల్ అయిపోతే ఇక అతనిని అందులోంచి లేపడం ఇక ఎవరి తరమూ కాదు..ముందే చెపుతున్నాను... జాగ్రత్తపడు. ఆ..   ఏమిటి మమ్మీ నేను మరీ అంత మొద్దబ్బాయిలా కనిపిస్తున్నానా నీకు కూడా? నాకు మాత్రం ఆ కుర్చీలో కూర్చోడం ఇష్టం లేకనే అలా మాట్లాడుతున్నానంటావా? నేను వద్దని అంటుంటే వాళ్ళు నాకు అసలు పదవీ వ్యామోహం లేదని ఎలాచెప్పుకొంటున్నారో ఎప్పుడయినా విన్నావా? ఈ జనరేషన్ గ్యాప్ వలన నువ్వు నా కాన్సెప్ట్ సరిగ్గా క్యాచ్చ్ చేయలేకపోతున్నావు మమ్మీ. పోనీ... నీ కాన్సెప్ట్ ప్రకారం ఇద్దరం కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగినా ఒక్క రాష్ట్రంలో గెలిచామా చెప్పు? ఇప్పుడు జనాలకి ఇష్టమయిన నాలుగు మాటలవే..కావాలంటే ఓసారి ఏ ఫేస్ బుక్కులోకో ట్వీటర్లోకో వెళ్లి చూడు నీకే అర్ధం అవుతుంది నేను చెపుతున్న మాటలే జనాలు బాగా లైక్ చేస్తారని.   అవునురా కన్నా... నువ్వు చెప్పిందే నిజమనుకో.. అయినా ముసలి దాన్నయిపోతున్నాను కదా...నాకా ఫేస్ బుక్కులు అవీ ఏమి తెలుస్తాయి చెప్పు...బహుశః అలాంటి మాయ మాటలు చెప్పే ఆ చీపురు పార్టీ వాళ్ళు డిల్లీలో జనాలని తమ బుట్టలోపడేసుకొన్నారు. లోకంలో ఎక్కడా నీతి నిజాయితీ లేకుండా పోయాయిరా అబ్బాయ్! లేకుంటే 15ఏళ్ల నుండి మనం కారులోంచి కాలు క్రింద పెట్టకుండా కనుసైగ చేస్తే వచ్చి ఓటేసే డిల్లీలో జనాలు ఎవరో చీపురు పట్టుకొని వచ్చి ఓటేయమని అడిగితే వాళ్ళకీ ఓటేసేయడమే.. బుర్ర బుద్దీ లేకపోతే సరి!   పోనీలే..నువ్వు కూడా వచ్చేఎన్నికలలోగా జనాలకి బాగా ఎక్కే ఆ నాలుగు మంచి ముక్కలు మాట్లాడటం నేర్చుకో...   అప్పుడెప్పుడో మీ నాయనమ్మ కూడా ఇలాగే ఈ జనాలు తిక్కతిక్కగా వ్యవహరిస్తుంటే ‘గరీబీ హటావ్’ అంటూ ఓసారి గెలిచింది. ఏవో ఇరవయ్యో, ముప్పయ్యో సూత్రాలంటూ మరోసారి గెలిచింది. నువ్వు కూడా అలాంటివే ఏవయినా నేర్చుకోరా.. బాబు! ఓసారి నువ్వా మన్మోహన్ అంకుల్ కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటె మన జనాలు నీకు కూడా భజనలు, స్తోత్రపాటాలు చదువుతుంటే చూడాలని ఉందిరా కన్నా. ఆ ఒక్కటీ సాధించు చాలు..మరి నాకింకేమీ అక్కరలేదు.   స్యూర్ మమ్మీ... ఐ విల్ ట్రై మై బెస్ట్..బట్ ఆంటిల్ దెన్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అండ్ సప్పోర్ట్ మమ్మీ..   ఓ.. వైనాట్ బేటా..నేనేమిటి.. మన కాంగ్రెస్ గ్యాంగ్ అంతా నీ వెనుకే ఉంటారు.. ప్రొసీడ్..

కిషన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్న బిజెపి

  రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకి మద్దతిస్తామని మొదటి నుంచి చెబుతున్న బిజెపి పునరాలోచన చేస్తుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపి౦చిన బిజెపి అధిష్టానం దీనిపై సుదీర్ఘ౦గా చర్చించిన తరువాత తెలంగాణ బిల్లుకు మద్దతిస్తే కాంగ్రెస్ కి తప్ప బిజెపికి ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నట్టు సమాచారం.   ఈ సంధర్బంగా తెలంగాణలో ఎన్నిసీట్లు వస్తాయని ఆరా తీయగా కిషన్ రెడ్డి చెప్పిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బిజెపి అధిష్టానం కిషన్ రెడ్డి నోటి పవర్ని కాస్త తగ్గించమని ఆదేశాలు జారీ చేశారట. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు ఇస్తే తెలంగాణకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించి మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ దుకాణం సర్దేసే పరిస్థితి తెచ్చావని అధిష్టానం అన్నట్లు తన సన్నిహితుల వద్ద కిషన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారట.  దీంతో తెలంగాణ బిల్లుకి బిజెపి మద్దతు డౌటేనని అంటున్నారు రాజకీయ నిపుణులు.