అశోక్ బాబుకు పోలీసులు నోటిసులు

      ఎపి ఎన్జీవో నేత అశోక్ బాబుకు కష్టాల పరంపర మొదలైనట్టుంది. సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యమాని ఒక్కసారిగా మీడియా స్టార్ అయిపోయిన అశోక్ బాబును వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కంగుతినిపిస్తున్నాయి. ఎపిఎన్జీవోల మధ్య లుకలుకలు, సమ్మెను అర్థంతరంగా ఆపేశారని విమర్శలు, ఎపి ఎన్జీవో ఎన్నికలపై దీని ప్రభావం, రాజకీయనాయకుల సహకారం అడగాల్సి రావడం వంటివన్నీ ఒకత్తయితే ఇప్పుడు ఏకంగా ఓయు పోలీసులు నుంచి నోటిసులు అందుకోవాల్సి రావడం మరోకెత్తు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వాఖ్యనాలు చేశారంటూ అశోక్ బాబుకు శనివారం ఓయూ పోలీసులు నోటిసులు జారీ చేశారు. ఈ నెల హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇక్కడే పుట్టాం..కలిసుందాం: కిరణ్

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సమైక్యవాణి విన్పించారు. ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి..’అందుకే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.తాము ఎందుకు కలిసి ఉండాలని కోరుకుంటున్నామో గీతా రెడ్డి వంటివాళ్లు అర్థం చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మాటలకు గీతారెడ్డితో పాటు తదితరులు నవ్వుకున్నారు.శ్రీసిటిలో ఆయన శనివారం పెప్సికో బేవరేజ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. విభజన.. సమైక్య ఉద్యమాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుంటు పడలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం కొసమెరుపు.

వరస్ట్ సీఎం కూడా కిరణ్‌కుమార్ రెడ్డి

      దేశంలోనే వరస్ట్ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అని, రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ కంటే ఎక్కువ ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కిరణ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా సీఎం కిరణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి 3 నుంచి జరిగే సమావేశాల్లో బిల్లుపై చర్చ జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ప్రజలకు కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు. పయ్యావుల సమైక్యవాదం ఆయన వ్యక్తిగతమని ఆయన అన్నారు. విభజనపై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

ఒక్కత్రాటిపైకి వచ్చిన కాంగ్రెస్, తెదేపా నేతలు

  ఏపీఎన్జీవోలు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, సమావేశానికి హాజరయిన అన్ని పార్టీల నేతలు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా కలిసి పోరాడేందుకు అంగీకరించారని తెలిపారు. మళ్ళీ శాసనసభ సమావేశమయినప్పుడు బిల్లును వ్యతిరేఖిస్తున్నట్లు సభ్యులందరూ స్పీకర్ కు అఫిడవిట్స్ సమర్పించాలని తాము కోరినట్లు తెలియజేసారు. మళ్ళీ రెండు మూడు రోజుల్లో అందరూ సమావేశమయ్యి రాష్ట్రపతిని కలిసే విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ జేఏసీ ఏర్పడలేదు గనుక, జిల్లా స్థాయిలో ఏపీయన్జీవోలే ఉద్యమిస్తారని తెలియజేసారు.   తెదేపా నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమైక్యఉద్యమాలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ తరపున హాజరయిన మంత్రి శైలజానాథ్ మరియు యంపీ సబ్బంహరి మాట్లాడుతూ తామందరం కూడా ఉద్యోగ సంఘాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. పార్టీలకతీతంగా అందరూ కలిసి పోరాడితే తప్పకుండా ఫలితం ఉంటుందని వారు అన్నారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు మరియు సీపీఎం సభ్యులు వీరయ్య మాట్లాడుతూ తాము సమైక్యాంధ్ర కొరకు స్వతంత్రంగానే పోరాడుతామని అన్నారు.   ఈ సమావేశంలో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు, రాష్ట్ర విభజనకు అంగీకరించిన తెదేపా సభ్యులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏకాభిప్రాయానికి వస్తే, సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా ఈ సమావేశానికి మొహం చాటేసింది.      

తెదేపా ఎదురు దాడితో ఆత్మ రక్షణలో పడిన తెరాస

  రాష్ట్ర విభజనపై నిర్దిష్టమయిన అభిప్రాయం చెప్పలేక సతమతమవుతున్నతెదేపాపై ఇదే అదునుగా అన్ని రాజకీయ పార్టీలు దాడి ప్రారంభించాయి. ముఖ్యంగా తెరాస నేతలు హరీష్ రావు తదితరులు శాసనసభ, మండలిలో తెదేపా అనుసరించిన ద్వంద వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్ననేపద్యంలో వారిని తక్షణమే ఎదుర్కొనవలసిన అవసరం ఏర్పడింది. తెదేపా తెలంగాణా నేతలు మోత్కుపల్లి నరసింహులు, ఎర్రబెల్లి దయాకర రావు తెరాసపై ఎదురుదాడి ఆరంబిస్తూ, అసలు తెరాసకు నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలనే కోరిక ఉంటే, తెరాసను వెంటనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణా ఏర్పాటుకి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేస్తున్నపటికీ, తెరాస విలీనానికి అంగీకరించనందునే ఏవో కుంటి సాకులు చెపుతూ విభజన ప్రక్రియను సాగదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిన వెంటనే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఉండి ఉంటే, ఈ పాటికి తెలంగాణా రాష్ట్రం కూడా ఏర్పడి ఉండేదని వారు అన్నారు. అందువల్ల ఇప్పటికయినా తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణా ఏర్పాటుకు సహకరించాలని, లేకుంటే ప్రజలు తెరాసను క్షమించబోరని వారు హెచ్చరించారు.   తెరాస తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తుందో లేక తెలంగాణా ప్రజల ఆకాంక్షకే ప్రాధాన్యత ఇస్తుందో తెలపాలని వారు కోరారు. ఈ ఎన్నికలలోగా రెండు పార్టీల విలీనం జరుగకపోయినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటుని వాయిదా వేసే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పడకపోతే ఆ తరువాత పరిస్థితుల గురించి ఎవరూ చెప్పలేరని వారు అన్నారు. నాలుగు కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు, తెరాస వెంటనే కాంగ్రెస్ విలీనం చేసి, రాష్ట్ర ఏర్పాటుకి సహకరించాలని వారు డిమాండ్ చేసారు.   ఈవిధంగా తెదేపా ఎదురుదాడి మొదలుపెట్టడంతో తెరాస ఆత్మరక్షణలో పడింది. తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకపోవడం వలననే తెలంగాణా ఏర్పాటు అవడం లేదని ప్రజలు కూడా నమ్మినట్లయితే ఆ పార్టీకి చాలా ప్రమాదమే.

డిల్లీకి సుల్తాన్ ఆమాద్మీ

  డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకి సరిపడే మెజారిటీ లేకపోవడంతో వెనక్కి తగ్గిన ఆమాద్మీపార్టీకి కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో, కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి సుముఖంగా లేని ఆమాద్మీ పార్టీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలా వద్దా అంటూ డిల్లీ ప్రజల అభిప్రాయం కోరింది. ఇంతవరకు దాదాపు పది లక్షల మంది స్పందించగా వారిలో 75శాతం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరినట్లు ఆమాద్మీ పార్టీ తరపున ప్రతాప్ గంజ్ నుండి ఎన్నికయిన మనిష్ సిసోడియా మీడియాకు తెలియజేసారు. ఈ ఆదివారం రాత్రి పార్టీ సభ్యులు సమావేశమయ్యి పార్టీ నిర్ణయాన్ని సోమవారం ఉదయం ప్రకటిస్తామని తెలిపారు. మెజారిటీ శాతం ప్రజలు ఆమాద్మీనే ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరుతున్నందున బహుశః సోమవారం ఆ పార్టీ తరపున ఎన్నికయిన శాసనసభ్యులు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దత తెలియజేయవచ్చును. ఆ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసే అవకాశం ఉంది.ఒకవేళ సోమవారం కూడా అమాద్మీ ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు రాకపోయినట్లయితే డిల్లీలో రాష్ట్రపతి పాలన విదించే అవకాశం ఉంది. 

కేంద్రమంత్రి జయంతీ నటరాజన్ రాజీనామా

  ఇటీవల నాలుగు రాష్ట్రాలలో ఘోర పరాజయం పొందిన తరువాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ త్వరలో పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన అనగానే జనాలు ఏవేవో ఊహించేసుకొంటారు. కానీ ప్రక్షాళన అంటే అటువారిని ఇటు, ఇటువారిని అటు మార్చడమే తప్ప పార్టీలో అసమర్ధులను ఏరి పారేయడమో లేక అవినీతిపరులను పార్టీనుండి బయటకు పంపడమో కానే కాదు. అందువల్ల యువరాజవారు మొదలుపెట్టిన ప్రక్షాళన కార్యక్రమం కూడ అలాగే మొదలయింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి జయంతి నటరాజన్ పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తన పదవికి రాజీనామా చేసారు. దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడ పడిపోయింది. కేంద్రమంత్రి వీరప్ప మొయిలీకి ఆ శాఖల అదనపు భాద్యతలను అప్పగించారు. పార్టీలో సీనియర్ నేత అయిన ఆమెకు పార్టీలో కీలక భాద్యతలు అప్పగించేందుకే, ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. గులాం నబీ ఆజాద్ తో సహా మరో పదిమంది కేంద్రమంత్రులు కూడా రాజీనామాలు చేసి, పార్టీని ఎన్నికలకు సిద్దం చేసే పనిలోపడతారని సమాచారం.  బహుశః మన రాష్ట్రంలో అసంతృప్త నేతలెవరికో కేంద్ర మంత్రి పదవులు ఎరగా వేసి దారికి తెచ్చుకొంటారేమో మన యువరాజవారు. 

అఖిలపక్షానికి వైకాపా డుమ్మా దేనికో

  ఏపీఎన్జీవోలు ఈరోజు ఏర్పాటుచేస్తున్నఅఖిలపక్ష సమావేశం ప్రధానోద్దేశ్యం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయపార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చి సమైక్యపోరాటం చేయడం. అయితే ప్రస్తుతం అన్నిపార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నందున, ఏపీఎన్జీవోల చేస్తున్నఈ ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చును. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న రాజకీయ పార్టీల నేతలు తమ అహాన్ని, బేషజాలను, పార్టీ జెండాలను, స్వీయ మరియు పార్టీ ప్రయోజనాలను అన్నిటినీ పక్కన బెట్టి సమైక్యంగా కలిసి పనిచేస్తే నేటికీ రాష్ట్ర విభజనను ఆపే అవకాశం ఉంది. కానీ వారు అంత గొప్ప త్యాగాలు చేస్తారని ఆశించడం అడియాస, అవివేకమే అవుతుంది. దీనిని నిర్దారిస్తున్నట్లు వైకాపా తమ పార్టీ ఈ సమావేశంలో పాల్గొనబోదని తెలియజేసింది.   మిగిలిన అన్ని పార్టీల సంగతీ ఎలా ఉన్నపటికీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ, అందరినీ (ముఖ్యంగా తెదేపాను) తమతో కలిసి రమ్మనమని కోరిన వైకాపా, ఇప్పుడు అదే తెదేపా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నకారణంగా తాము ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని కుంటి సాకు చెప్పి మొహం చాటేయడంతో వైకాపా నిజంగా సమైక్యాంధ్ర కోసమే పోరాడుతోందా? లేక ఆ సెంటిమెంటును వాడుకొని రాజకీయ లబ్ది పొందాలని పోరాడుతోందా?అనే అనుమానం కలగడం సహజం.   అన్ని పార్టీలను దూరం పెట్టిన ఏపీఎన్జీవోలు, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే ఆయనను మాత్రమే కలిసి తమ ఉద్యమానికి మద్దతు కోరారు. వారి ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి చిన్న మెలిక పెట్టారు. వారు ఒక సమైక్య తీర్మానం చేసి తీసుకు వస్తే దానిపై మొదటి సంతకము తానే చేస్తానని. అలాగే అన్నిపార్టీలను కూడా అందుకు వారు ఒప్పించాలని షరతు పెట్టారు. ఆవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను ఇరికించవచ్చని జగన్ భావించారు. అయితే అది గ్రహించిన ఏపీఎన్జీవోలు ఆయన పధకంలో పావులుగా మారేందుకు ఇష్టపడలేదు. తనమాట వినకపోతే ఎంతటి ఆత్మీయులనయినా వదులుకొనే గుణం ఉన్న జగన్, ఏపీఎన్జీవోలను వదులుకోవడం పెద్ద విచిత్రం కాదు.   ఏపీఎన్జీవోలు ఆయన ప్రతిపాదనకు ఒప్పుకోకపోయినప్పటికీ, వారందరూ ముక్తకంఠంతో తనకు, తన పార్టీకి బేషరతుగా మద్దతు పలికి ఉండి ఉంటే, బహుశః జగన్మోహన్ రెడ్డి వారిని క్షమించి ఉండేవారేమో! కానీ, ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తనను కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తనకు సమాంతరంగా ఉద్యమం నడుపుతుండటం జగన్ కు ఆగ్రహం కలిగించింది. ఒకవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు అశోక్ బాబు ఇద్దరూ కూడా రంగంలో ఉండటంతో, వైకాపా చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాల వలన సీమాంధ్రలో తనకు, తన పార్టీకి కూడా ఆశించినంతగా మైలేజీ రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమయ్యి ఉండవచ్చును. అయితే జగన్మోహన్ రెడ్డి అదృష్టం కొద్దీ తెదేపా కూడా సమైక్యాంధ్ర రాగం అందుకోలేదు. అందుకొని ఉంటే అప్పుడు తెదేపాతో కూడా పోరాడవలసి ఉండేది.   ఓడిపోవడం తనకు ఇష్టం లేదని మీడియా ముందే కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధిష్టానాన్ని ధిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం చేస్తున్నకిరణ్ కుమార్ రెడ్డితో సమైక్యాంధ్ర ఛాంపియన్ షిప్ కోసం పోటీపడవలసి వస్తోంది. అటువంటప్పుడు ఇప్పుడు అశోక్ బాబుకి కూడా ప్రాధాన్యత ఇస్తే ఆయన కూడా తనకు పోటీ అవుతారనే ఆలోచనతోనే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు విముఖత చూపి ఉండవచ్చును. ఈరోజు ఏపీఎన్జీవోలు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం విజయవంతమయితే, రాష్ట్ర విభజనకి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆసంగతి ఎలా ఉన్నపటికీ, అన్ని పార్టీలు కలిసిపనిచేసేందుకు అశోక్ బాబు ఒప్పించగాలిగితే మళ్ళీ ఆయన కూడా బలం పుంజుకొనే అవకాశం ఉంటుంది.   జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో తన పార్టీని పణంగా పెట్టి మరీ చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వచ్చేఎన్నికలలో సీమాంధ్రలో విజయం సాధించడమే. అటువంటప్పుడు, రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశ్యం ఉందని ప్రకటించిన అశోక్ బాబుకి ఆయన సహకరిస్తారని ఊహించలేము.

ప్రజల చేతికే 'చీపురు'

      ఢిల్లీ గద్దెపై చీపురు ఎక్కుతుందో లేదో అనేది ఇప్పుడు ప్రజల చేతిలోకి వెళ్ళింది. తాము ఢిల్లీ లో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ప్రజలను అడిగి నిర్ణయిస్తామంటూ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆమ్ఆద్మీ పార్టీ ఆ పనిలో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ శాసన సభ్యుల,కార్యకర్తలు వార్డులు వారీగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5.50లక్షల మంది అభిప్రాయాలు సేకరించమని, మరో రెండురోజుల్లో ఈ తతంగాన్ని పూర్తి చేసి సోమవారం నాటికల్లా ప్రజాభిప్రాయం ప్రపంచానికి వెల్లడిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. సో...సోమవారం దాకా వేచి చూద్దాం.

కిరణ్ కొత్త పార్టీ పెడతారా?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇదివరకులాగా అధిష్టానం మీద రంకెలు వేయడం లేదు. అదేవిధంగా ఇదివరకులా సమైక్యమని గొంతుచించుకోవడం లేదు. ఆవిషయం శాసనమండలిలో చేసిన ప్రసంగంతో తేటతెల్లమయింది. అయితే ఇంకా ఆఖరు బంతికి చాలా సమయం ఉందని, నేటికీ తను సమైక్యవాదినేనని చెప్పుకోవడం విచిత్రం. ఏమయినప్పటికీ ఆయన ఈ నాలుగయిదు నెలలలో పెంచుకొన్న తన రేటింగ్ మళ్ళీ క్రమంగా పడిపోవడం మొదలయింది. అందువల్ల ఇప్పుడు ఆయన స్వంత కుంపటి పెట్టుకొన్నా దానికి ఇదివరకంతటి ప్రజాదారణ ఉంటుందానేది అనుమానమే.   అయితే కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి, లగడపాటి, హర్ష కుమార్, సబ్బం హరి వంటి వారు నిజంగా కాంగ్రెస్ అధిష్టానంతో విభేదిస్తున్నా లేక ఆవిధంగా నటిస్తున్నా వారు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే వారి పైన, పార్టీపైనా ప్రజలలో ఇంకా అనుమానాలు పెరిగే అవకాశం ఉంది గనుక  కొత్త పార్టీ ఆవిర్భావం తప్పని సరి కావచ్చును. ఈసారి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎలాగు గెలిచే అవకాశాలు లేవు గనుక, మునిగిపోయే ఆ నావలో పయనించడం కంటే కొత్త నావ ఏర్పాటు చేసుకొని పయనించడమే ఎంతో కొంత మేలు. తద్వారా ఎన్నికలలో గెలిచే అవకాశాలు కొంతయినా మెరుగుపడటమే కాకుండా, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం వారిచేత ఆడిస్తున్ననాటకంలోనే ఇది కూడా ఒక భాగమయి ఉంటే వచ్చేఎన్నికలలో ఓట్లు చీల్చి సీమాంధ్రలో తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొనే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తగు నిర్ణయాలు తీసుకొనే వీలుంటుంది.

కిరణ్ కు 'ఉత్తమ' ఉపశమనం

      మొత్తానికి ఇండియాటుడే పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఉపశమనం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఠమెక్కాక...ఆయనకు ఎదురైనవన్నీ తలనొప్పులే. ఓరకంగా చెప్పాలంటే ఇన్ని రకాల ఒత్తిళ్లు మారే ముఖ్యమంత్రికి ఎదుర్కొలేదనడం కూడా అతిశయోక్తి కాదు. డ్రామాలాడుతున్నావంటూ సీమాంధ్ర నేతలు, తెలంగాణ ద్రోహి అంటూ టి.నేతలు తిట్టిపోస్తుంటే, పాలన అటకెక్కి౦దంటూ పలు సంఘాలు ఆందోళన చేస్తూంటే..దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఆధారంగా ఇండియాటుడే పత్రిక ఇచ్చే ర్యా౦కుల్లో కిరణ్ పాలనకు 'ఉత్తమ' స్థానం దక్కడం విశేషం. శుక్రవారం ఢిల్లీ లో ఈ అవార్డ్ ను అందుకుంటున్న కిరణ్...దీనితోనైనా రీచార్జ్ అవుతారేమో...చూద్దా౦.

కుర్షీద్ చెప్పిన ‘అమెరికా క్షమాపణలు’ ఒట్టి కధే

  భారత దౌత్యవేత్త దేవయాని కొబ్రగాడే పట్ల అమెరికా అనుచిత వైఖరిని భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఆమెపై మోపిన కేసులను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారత్ కోరుతోంది. భారత విదేశాంగ శాఖా మంత్రి సల్మాన్ కుర్షీద్ నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “స్టేట్ సెక్రెటరీ ఆఫ్ అమెరికా జాన్ కెర్రీ నాతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో నేను అందుబాటులో లేకోపోవడంతో జాతీయ భద్రతా సలహాదారు శివశంకర మీనన్ తో మాట్లాడిన ఆయన, మీనన్ కు అమెరికా ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. ఈరోజు జాన్ కేర్రీ నాతో మాట్లాడేందుకు సమయం నిర్దారించబడింది,” అని తెలిపారు."   కానీ, న్యూయార్క్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మీడియాతో మాట్లాడుతూ “మేము ఎటువంటి తప్పు చేయలేదు. మా చట్టాలకు లోబడే వ్యవహరించాము. అందువలన మేమెవరికీ క్షమాపణలు చెప్పనవసరం లేదు. అదే విదంగా దేవయానిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొనే ప్రసక్తి లేదు. కోర్టు పరిధిలో ఉన్నఈ వ్యవహారంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నాకు తెలిసినంతవరకు జాన్ కెర్రీ భారత్ అధికారులతో లేదా మంత్రులతో మాట్లాడేందుకు ఎటువంటి అపాయింటుమెంటు ఇవ్వలేదు,” అని కుండ బద్దలుకొట్టారు.   మేరీ హర్ఫ్ అమెరిక అగ్ర రాజ్యాహంకారానికి అద్దం పడుతుంటే, సల్మాన్ కుర్షీద్ చేసిన ప్రకటన భారత ప్రజలను మోసపుచ్చేదిగా ఉంది. ఈ వ్యవహారం మరికొంత కాలం సాగిన తరువాత, అకస్మాత్తుగా ‘ఇటలీ నావికుల’ వ్యవహారంలాగే ఇదీ చల్లబడిపోయి, ఆ తరువాత వార్తలలోంచి కూడా మాయమయిపోతుంది. కానీ, ఒక భారతీయ మహిళ పట్ల అమెరికా అధికారులు అసభ్యంగా ప్రవర్తించిన తీరు ఆదేశానికి మాయని మచ్చగా మిగిలిపోవడంఖాయం. అయితే అమెరికా మొహం మీద ఇంతకంటే చాలా పెద్ద పెద్ద మచ్చలే ఉన్నందున వాటి మధ్య ఈ మచ్చకూడ కనబడకుండా పోతుంది.

రామోజీరావుకి హైకోర్టు జలక్

  ప్రముఖ దినపత్రిక ఈనాడు యజమాని రామోజీరావు విశాఖలో ఈనాడు కార్యాలయం స్థాపించేందుకు మంతెన ఆదిత్య కుమారవర్మఅనే వ్యక్తి నుండి 1973లో 2.78 ఎకరాల స్థలం మరియు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 సంవత్సరాల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఆ స్థలానికి అప్పట్లో నెలకు కేవలం మూడు వేల రూపాయలు అద్దె చెల్లించడానికి రామోజీరావు అంగీకరించారు. ఆ తరువాత కొంత కాలానికి స్థల యజమానికి తెలియకుండా ఆ స్థలంలో కొంత భాగం రోడ్లు విస్తరణ కోసం విశాఖ నగరాభివృద్ధి సంస్థకు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఆయన దారాదత్తం చేయడమే కాకుండా అందుకు ప్రతిగా వేరేచోట ఆయన తనపేరిట స్థలం కూడా తీసుకొన్నారు. ఇదొక నేరమయితే, లీజు కాలం ముగిసిన తరువాత కూడా ఖాళీ చేయడానికి నిరాకరిస్తూ స్థల యజమానిని ముప్పతిప్పలు పెడుతూ జిల్లా కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు పరుగులు పెట్టిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ కోర్టు ఆయనకు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినప్పటికీ, నేటికీ ఆ స్థలాన్ని సదరు యజమాని స్వాదీనం చేయకుండా కోర్టుల చుట్టూ తిప్పిస్తూ నెలలు సంవత్సరాలు గడిపేస్తున్నారు. ఇటీవల రామోజీ భాదితుడు మంతెన ఆదిత్య కుమారవర్మ మళ్ళీ హైకోర్టు తలుపు తట్టడంతో, కేసు విచారణ పూర్తయ్యేవరకు ఈనాడు కార్యాలయం అదే స్థలంలో కొనసాగాలని రామోజీరావు కోరుకొంటున్నట్లయితే, ప్రస్తుత ప్రభుత్వ విలువ ప్రకారం నెలకు రూ 17 లక్షలు చొప్పున స్థల యజమానికి అద్దె చెల్లించాలని, అంతే గాక పాత బకాయిల క్రింద రూ 2.06 కోట్లను వచ్చేనెల 10వ తేదీలోగా చెల్లించాలని హైకోర్టు రామోజీరావుని ఆదేశించింది.

బ్రజేష్ ట్రిబ్యునల్ కోసం మరో చిట్కా

  యుద్దరంగంలో దూకవలసిన సమయంలో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతూ కాలక్షేపం చేయడం, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మనకేమి కొత్త కాదని ఆల్మెట్టి, బాబ్లీ డ్యాం, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తదితర వ్యవహారాలలో మన రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. ఇప్పుడు ప్రజాగ్రహానికి, ప్రతిపక్షాల విమర్శలకు జడిసి అఖిలపక్ష సభ్యులను వెంటేసుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ని కలిసి, కృష్ణా జలాలపై బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చాలా అన్యాయమని మొరపెట్టుకోనున్నారు. అయితే వివిధ అంశాలను, సమస్యలను పరిష్కరించిమని కోరుతూ ఇంతవరకు మన రాష్ట్రం నుండి చాలా మందే ఆయనను కలిసారు. కానీ ఆయన దేనిపై స్పందించిన దాఖలాలు లేవు. ఆయనొక నిమిత్తమాత్రుడని తెలిసి కూడా ఆయనకు మొరపెట్టుకోవాలనుకోవడం గమనిస్తే, ఈ సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మరోసారి తేటతెల్లమవుతుంది. కనీసం చేతులు కాలకయినా సరయిన ఆకులు పట్టుకోవాలనే జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోయినప్పటికీ, తమకు ఎదురయ్యే ఎటువంటి సమస్యనుండయినా అవలీలగా బయటపడేందుకు ఇటువంటి చిట్కాలు ప్రయోగించడంలో ఆరితేరిపోయాయి.