'విప్పడం' తప్పుకాదట ...

      తనిఖీ పేరుతొ మన మహిళా దౌత్యాధికారి దేవయానికి సంకెళ్ళు వేయడం, దుస్తులు విప్పి మరీ సోదాలు చేయడం ... ఈ విషయంపై భారతదేశం స్పందించిన తీరు పట్ల అమెరికా విచారం వెలిబుచ్చింది. దౌత్యాధికారిపై దురంతానికి భారత్ తీవ్రంగా ప్రతిస్పందించడంతో దిగివచ్చిన అగ్రరాజ్యం ... బుధవారం సంఘటన పట్ల వివరణ ఇచ్చింది. భారతీయుల మనోభావాలు దెబ్బతినడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ భద్రతా పరంగా తాము తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు, కఠినమైన చట్టాలను ఎకరుపు పెట్టింది. ఇదంతా అందులో భాగమే తప్ప కావాలని చేసింది కాదనీ, భారతదేశంతో సహృద్భావ సంబంధాలు మరింత పెంపొందించుకోవాలని తాము కోరుకుంటున్నామంది.

కొనసాగుతున్న శాసనసభ వాయిదాల పర్వం

  తెలంగాణా బిల్లుపై ఎటువంటి చర్చ చేప్పట్టకుండానే శాసనసభ, శాసనమండలి రెండూ కూడా రేపటికి వాయిదాపడ్డాయి. సభలో సీమాంధ్రకు చెందిన తెదేపా, వైకాపా కాంగ్రెస్ సభ్యులు సభాకార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతుండటంతో ఉభయ సభలు రేపటికి వాయిదాపడక తప్పలేదు. సీమాంధ్రకు చెందిన తెదేపా నేతలు రాష్ట్రపతి పంపిన టీ-బిల్లులో విభజనపై సమగ్ర సమాచారం లేదని, అందువల్ల బిల్లుపై చర్చ వాయిదా వేసి కేంద్రం నుండి సమాచారం రప్పించిన తరువాతనే బిల్లుపై చర్చ జరపాలని లేఖ ఇచ్చారు.   ఇక వైకాపా, సభలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేసింది. తెరాస నేతలు అసలు ఎటువంటి చర్చ అవసరం లేదని, తాము తమ అభిప్రాయాలను నేరుగా రాష్ట్రపతికే పంపుతామని తెలియజేస్తూ ఒక లేఖ ఇచ్చారు.    సభ మళ్ళీ మూడోసారి సమావేశమయినప్పుడు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ యొక్క తరువాత సమావేశపు తేదీలను ప్రకటిస్తారని అందరూ భావించినప్పటికీ ఎందువలననో ఆయన ప్రకటించలేదు. వచ్చేనెల 3నుండి 13వరకు, మళ్ళీ 16నుండి 23వరకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చని సమాచారం. కానీ, టీ-కాంగ్రెస్, తెరాస నేతలు బిల్లుపై చర్చను ఈ నెలాఖరులోగానే ముగించి రాష్ట్రపతికి తిప్పి పంపేయాలని స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారు. అసలు సభలో బిల్లుపై చర్చ జరిగే వాతావరణమే లేనందున బిల్లును వెంటనే రాష్ట్రపతికి త్రిప్పి పంపేయాలని కోరుతున్నారు.

ఉద్యమంలో ఉన్నానంటున్న 'నెల'బాలుడు

      "నాది విశాలాంధ్ర వాదం'' అన్నారాయన. సమైక్యం విన్నాం, విభజనవాదం విన్నాం. ఈ విశాలాంధ్ర వాదం ఏమిటి? దీన్ని మోసుకోచిన కొత్త శాల్తీ ఎవరా అనుకుంటున్నారా? రాష్ట్రానికి అత్యధికకాలం ముఖ్యమంత్రిగా చేసింది చంద్రబాబునాయుడు అని మనకు తెలుసు. మరి అత్యల్పకాలం చేసింది ఎవరు? ఆయనేనండీ మన రాష్ట్రానికి నెలరోజుల ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించిన నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన అకస్మాత్తుగా బుధవారం వెలుగులోకి వచ్చారు. "నేను గతంలో విశాలాంధ్ర ఉద్యమాల్లో పాల్గొన్నా''నంటూ ఆయన విలేఖరులకు వివరించారు. ఎవరి బాగు కోసం, ఎవరి లాభం కోసం ఈ విభజన అంటూ గర్జించారు. ఈ విభజనతో ఏమీ సాధించలేమని తేల్చేశారు. అసలు తెలంగాణా ముసాయిదా బిల్లులో పసలేదని, అదంతా తప్పుల తడకనీ తెలంగాణా అని ఉండాల్సిన చోట తమిళనాడు అని ఉందంటూ ఎద్దేవా చేశారు. ఈ తప్పుల బిల్లును పాస్ చేయించాలనే కేంద్రం పప్పులు ఉడకబావని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం సమైక్య, విభజన గందరగోళాలకు కేంద్రంగా మారిన అసెంబ్లీని నడిపే సారథి ఈయన కుమారుడైన నాదెండ్ల మనోహర్ కావడం కొసమెరుపు. ఏమైతేనేం ... సమైక్యానికి మరో గళం కలిసింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సమాప్తం

  ఈ నెల 20వరకు జరుగవలసిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను రెండు రోజుల ముందుగానే ఈరోజు ముగిసాయి. ఈ రోజు లోక్ సభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. అందువల్ల ఇక తెలంగాణా బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమవవలసి ఉంటుంది. లేదా ఫిబ్రవరి నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టవలసి ఉంటుంది.   సమావేశాల ముగిసిన వెంటనే కాంగ్రెస్ యంపీ సబ్బంహరి మీడియాతో మాట్లాడుతూ, తాము చెప్పినట్లే తెలంగాణా బిల్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాకుండా అడ్డుకోగాలిగామని, అందువల్ల ఇక బడ్జెట్ సమావేశాల వరకు టీ-బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశం లేదని, ఒకవేళ వచ్చినా దానిని తాము ఇదేవిధంగా అడ్డుకొంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరగనీయకుండా అడ్డుకొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.

బుధవారం బుద్దొచ్చింది ...

      ఎట్టకేలకు సీమాంధ్ర ఎమ్మెల్యేలకు జ్ఞానోదయం అయినట్టే ఉంది. ఇప్పటిదాకా సమైక్య పార్టీ అనే క్రెడిట్ కొట్టేయడానికి తమలో తాము కొట్టుకుంటూ కూర్చున్న పార్టీల ప్రతినిథులంతా బుధవారం బుద్ది తెచ్చుకున్నారు. విభజించు పాలించు సూత్రాన్ని అనుసరిస్తూన్న కేంద్రం తమలో తమకు చిచ్చుపెట్టి విభజన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసేందుకు వ్యూహం రచించినట్టు కనిపిస్తుండటంతో ... ఇక అంతా కలిసి కేంద్రంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల్లో ఇదే కీలక అంశం. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలకు చెందినా శాసనసభ్యులు కలిసికట్టుగా చేసే ... సమైక్యపోరాటంలో భాగంగా కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించనున్నామని తెలిపారు.

దేవయానితో అనుచితంగా వ్యవహరించలేదు: అమెరికా

  భారత దౌత్యాదికారిణి దేవయాని కోబ్రగాడే పట్ల న్యూయార్క్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడమే గాక నేటికీ ఆమెను ఇతర నేరస్తులతో కలిపి జైలులో బందించి ఉంచారు. అందుకు భారత్ తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తం చేసి, ఆమెను తక్షణమే విడుదల చేసి భారత్ కు త్రిప్పిపంపాలని, జరిగినదానికి అమెరికా ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరింది. భారత్ తన నిరసన తెలియజేసేందుకు అనేక చర్యలు చెప్పటింది.   అయితే న్యూయార్క్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ మీడియాతో మాట్లాడుతూ జరిగినదానిపై ఎటువంటి పశ్చాత్తాపము కనబరచకపోగా, తమ దేశ చట్టాలకి లోబడే దేవయానిపై చర్యలు తీసుకొన్నామని, తమ పోలీసు అధికారులు కూడా నిబంధనల ప్రకారమే ఖైదీలందరినీ ఏవిధంగా విచారిస్తారో అదేవిధంగా ఆమెను కూడా విచారించారని తెలిపారు. అందువల్ల ఇటువంటి అంశం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతంగా కలిగే విధంగా వ్యవహరించకూడదని ఆమె భారత్ కు సుద్దులు చెప్పడం విశేషం. ఏమయినప్పటికీ, దేవయాని పట్ల తమ పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారో లేదో తెలుసుకొంటామని, అలాగే తమ చట్టపరిధిలో ఆమె విడుదలకు గల అవకాశాలను తప్పక పరిశీలిస్తామని హామీ కూడా ఇచ్చారు.   ఒక మహిళా అధికారి అయిన మేరీ హర్ఫ్ సాటి మహిళ పట్ల జరిగిన అనుచిత వ్యవహారాన్ని ఖండించకపోగా ఈవిధంగా మాట్లాడటం సిగ్గు చేటు.

తెలుగు ప్రజలతో ఆడుకొంటున్నస్టార్ బ్యాట్స్ మ్యాన్

  రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా ముందుకు సాగడానికి తెలంగాణావాదులు ఒట్టి హడావుడి తప్పచేసిందేమీ లేదు. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుండి రాష్ట్ర విభజన తీవ్రంగా వ్యతిరేఖిస్తూ, తన అధిష్టానాన్ని సైతం ధిక్కరిస్తూనే, తెలంగాణా బిల్లు శాసనసభకు వచ్చేక అడ్డుకొందామని చెపుతూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ నిలువరించి, రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా ఇంతవరకు తీసుకు రాగలిగారు. ఈ స్టార్ బ్యాట్స్ మ్యాన్ సీమాంధ్ర తరపున ఆడుతూనే తెలంగాణా టీముని గెలిపించేందుకు శాయాశాక్తులా కృషిచేసారు. అందుకు తెలంగాణావాదులందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.   తెలంగాణా బిల్లుపై చర్చను ఎప్పుడు, ఎన్ని రోజులు చెప్పట్టాలనే విషయం తేల్చేందుకు నిన్నశాసనసభ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అదే ధోరణి ప్రదర్శిస్తూ సమావేశంలో మధ్యలోంచి లేచి వెళ్ళిపోయారు. ఓటింగే ఉండని బిల్లుని తాము ఓటింగులో ఓడించేస్తామని ఇంతవరకు సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన ఆయన, ఆయన అనుచరులు ఇప్పుడు బిల్లుకి వ్యతిరేఖంగా అఫిడవిట్లు ప్రవేశపెడతామంటూ మరో కొత్త నాటకం మొదలుపెట్టారు.   ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయినా సీమాంధ్ర ప్రజలు ఏమనుకొనేవారు కాదు. కానీ తమ తరపున పోరాడుతున్నట్లు నటిస్తూ నేటికీ ఈవిధంగా తమను మభ్యపెట్టాలని ప్రయత్నించడమే జీర్ణించుకోలేకపోతున్నారు. విభజనను అడ్డుకొంటానని అటు తెలంగాణా ప్రజలకు, అడ్డుకొంటునట్లు మభ్యపెట్టినందుకు సీమాంధ్ర ప్రజలకు ఆయన తీవ్ర ఆగ్రహం కలిగించారు. అందువల్ల ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారడం ఖాయం. తను ఏ సమైక్యవాదంతో ప్రజల దృష్టిలో ఛాంపియన్ గా ఎదిగారో, ఇప్పుడు దానికారణంగానే పరువుపోగోట్టుకోవడం ఖాయం. మరి ఆయనకు వంతపాడుతూ నేటికీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న సీమాంధ్ర శాసనసభ్యులు, మంత్రులకు అదే దుస్థితి ఎదురవడం తధ్యం.   ప్రజలు బుద్ధి హీనులని భావించి, వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిల్లీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీపురు కట్టతో ఊడ్చిపెట్టేసారు. అది చూసిన తరువాతయినా ఈ కాంగ్రెస్ నేతలకి జ్ఞానోదయం కలుగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభ గడప దాటే వరకు కూడా రోజుకొక కొత్త డ్రామా ఆడుతూ ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేయడం కంటే, కనీసం ఇప్పటి నుండయినా బిల్లుపై సభలో చర్చించి దానిలో లోటుపాట్లు కనుగొని వాటికి తగిన సూచనలు చేసి త్రిప్పి పంపిస్తే తెలుగు ప్రజలందరికీ మహోపకారం చేసిన వారవుతారు. లేకుంటే వారిని ఆ దేవుడు కూడా ఈసారి ప్రజల నుండి కాపాడలేడు. .

వైసిపి నేత ఆత్మహత్యాయత్నం

  వైసిపిలో లుకలుకలు చివరకు నేతల ఆత్మహత్యాయత్నానికి కారణమవుతున్నాయి.తాజాగా ఆ పార్టీ నాయకులు తమకు పదవి ఇస్తానని మోసం చేయటంతొ ఓ మహిళ నాయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను ఆశించిన పదవి దక్కలేదంటూ అనసూయ అనే నాయకురాలు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పార్టీ కోసం తాను ఎంతో ఖర్చుచేశానని, అయినా పార్టీలో తనకు తగిన గుర్తింపఉ లభించటం లేదని గుంటూరు నల్లచెరువుకు చెందిన అనసూయ వైసీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష పదవిని తనకు ఇస్తామని నాయకులు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ పదవిని వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నేటి నుంచే విభజన చర్చ

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లుపై చర్చకు ముహుర్తం కుదిరింది. శాసన సభతో పాటు శాసన మండలిలో కూడా ఈ రోజునుంచి కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లుపై నేతలు చర్చించనున్నారు. మంగళవారం జరిగిన బిఏసి సమావేశంలో అన్నిపార్టీల నేతలు ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు.సభలో చర్చకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటిస్తారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23తో ముగుస్తుండటంతో ఈ లోపు మూడు విడతలుగా చర్చించటానికి నిర్ణయించుకున్న్టుగా సమాచారం. నేడు ప్రారంభించిన మూడురోజుల పాటు తొలివిడతగా చర్చించనున్నారు. ఆ తరువాత క్రిస్‌మస్‌తో పాటు కొత్త సంవత్సర సెలవు తరువాత జనవరి 3 నుంచి పదో తేది వరకు రెండో విడత సభలో చర్చిస్తారు. చివరిసారిగా జనవరి 16న ప్రారంభించి 23తో చర్చను ముగించి బిల్లును తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి పంపాలని ప్రాధమిక నిర్ణయించారు. మంగళ వారం స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ చాంబర్‌లో జరిగిన బిఏసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్‌లో రాష్ట్రంలోని ప్రదాన పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.

లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం

  ఎట్టకేలకు అన్నా హజారే పోరాటం ఫలిచింది. అవినీతిని అరికట్టడానికి ప్రజా ఉద్యమాల ఫలితంగా రూపొందిన ఈ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. చాలా రోజులుగా ఏవిషయంలోనూ కలిసి రాని చాలా పార్టీలు లోక్‌పాల్‌ విషయంలో మాత్రం ప్రభుత్వానికి సహకరించాయి. యుపిఏ మిత్ర పక్షం అయిన సమాజ్‌వాది పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేఖించింది. 2011 డిసెంబర్‌లోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని అంశాలపై రాజకీయ పార్టీల అభ్యంతరాల వల్ల ఆమోదం పొందలేకపోయింది. అయితే తరువాత మెజార్టీ పార్టీల అభిప్రాయ సేకరణ తరువాత కొద్ది పాటి మార్పులతో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం సభలో న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్... లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభించారు. అదే సమయంలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ కూడా బిల్లుకు మద్దతు తెలపటంతో బిల్లు ఆమోదం పొందింది. అయితే ప్రతిపక్షాలు లోక్‌పాల్‌ పరిదిపై మాత్రం పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాయి.కార్పోరేట్ రంగాన్ని కూడా లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి కోరారు. సీపీఐ, బీఎస్పీ, జేడీయూ, అన్నాడీఎంకే, టీడీపీ తదితర పార్టీలు కూడా బిల్లుకు మద్దతు తెలిపాయి. మరోవైపు ఆది నుంచీ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేసింది.

సమైక్యరాష్ట్రంలోనే ఎన్నికలు

  ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం జనవరి 1వ తేదీనాటికి రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయని చెపుతూ తెలంగాణా ప్రజలని మభ్యపెడుతోంది. కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తే అసలు ఎన్నికలలోగా తెలంగాణా బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందా లేదా? అనే అనుమానం కూడా కలుగుతోంది.   మరో తాజా కబురు ఏమిటంటే ఒకవేళ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ, ఆ తరువాత జరుగవలసిన అధికారిక ప్రక్రియ అంతా పూర్తవడానికి కనీసం నెల రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటు ఉభయసభలలో ఆమోదం పొందితే, దానిపై నోటిఫికేషన్ వెలువడడానికి కనీసం నెల రోజులు, ఆతరువాత దానిపై రాష్ట్రపతి అధికార ముద్ర వేసి రాష్ట్రావతరణను ప్రకటించడానికి మరొక నెలరోజులు పైగా పట్టవచ్చని హోంశాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి. అందువలన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుకి ఆమోదం తెలిపినప్పటికీ, ఈ ప్రక్రియ అంతా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ (మార్చి రెండవ తేదీలోగా) వెలువడేలోగా పూర్తికావడం అసంభవం, గనుక 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరపవలసి ఉంటుందని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

ఇసుక మాఫియా నేతలకు మావోయిస్టుల హెచ్చరిక

  మన ప్రజాప్రతినిధులు ప్రజాసేవతో బాటు రకరకాల వ్యాపారాలు చేసుకొనే వెసులుబాటు ఉంది. కేవలం ప్రజాసేవకోసమే కట్టుబడినవారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. అటువంటి వారిని ప్రజలు దేవుళ్ళని భావిస్తే, అవకాశం ఉన్నపుడు కూడా రెండు చేతులా సంపాదించుకోవడం చేతకాని దద్దమ్మలని వారి సహచరులు దృడంగా నమ్ముతారు. ఈ రోజు మావోయిష్టుల కళ్ళు ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్న మన ప్రజాప్రతినిధులపై పడింది. మావోయిస్టుల అధికార ప్రతినిధి జగన్ సంతకంతో ఉన్న ఒక లేఖ మీడియాకు చేరింది. అందులో ప్రజాప్రనిధులయిన అనేకమంది శాసనసభ్యులు, మంత్రులు, యంపీలు ఇసుక మాఫియాగా తయారయ్యారని వారు ఇప్పటికయినా తమ ఇసుక మాఫియా వ్యాపారాలను కట్టి బెట్టకపోయినట్లయితే ప్రజల చేతులో వారికి దండన తప్పదని హెచ్చరిక జారీ చేసారు. ఆ లేఖలో కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ, మంత్రి శ్రీధర్ బాబు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు వనమా వెనకటేశ్వర రావు, భద్రాచలం శాసనసభ్యురాలు కుంజ సత్యవతి, బాలసాని లక్ష్మి నారాయణ, కరీం నగర్ కు చెందిన కాంట్రాక్టర్ జగ్గారెడ్డిల పేరిట హెచ్చరిక జారీ అయింది.

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ మూగనోము

  ఆఖరి బంతి వరకు పోరాడతాను.. రాష్ట్రం కన్నా పదవి పార్టీ ముఖ్యంగా కాదు.. నేను పదవిలో ఉండగా రాష్ట్రం విడిపోదు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి ఎవరినైనా ఎదిరిస్తాం.. ఈ మాటలు వింటుంటే బి గోపాల్‌ సినిమాకు పరుచూరి బ్రదర్స్‌ రాసిన డైలాగ్స్‌లా అనిపిస్తున్నాయి కదా.. ఇవన్ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్‌ రెడ్డిగారు రాష్ట్ర విభజన విషయంలో చేసిన కామెంట్స్‌.. మరి ఇంతలా బీరాలు పలికిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు.. తాను పదవిలో ఉండగా రాష్ట్ర విభజన జరగదు అని తెగేసి చెప్పిన కిరణ్‌. ఇప్పుడు తాను ఉన్న సభలోనే తెలంగాణ ఏర్పాటుకు సంబందించిన బిల్లు చర్చ జరుగుతుంటే కిరణ్‌ మాత్రం మౌనం పాటిస్తున్నాడు. ఇన్నాళ్లు ఆఖరి బాల్‌ పడే వరకు పోరాడతానన్న కిరణ్‌ ఇఫ్పుడు మాత్రం అధిష్టానానికి జీహుజూర్‌ అంటున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చే వరకు తన వాదన బలంగా వినిపించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి బిల్లు అసెంబ్లీకి చేరిన తరువాత మాత్రం ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు.. ఎవరు ఏమి అనుకోకుండా ఒకటి రెండు స్టేట్‌మెంట్లు ఇస్తున్నా గతంలో వినిపించినంత బలంగా వాయిస్‌ వినిపించటం లేదు. కిరణ్‌లో వచ్చిన ఈ మార్పులను రాజకీయ విశ్లేషకులు కూడా పలురకాలుగా విశ్లేషిస్తున్నారు. అయితే సమైక్య వాణి బలంగా వినిపించిన కిరణ్‌: సొంత పార్టీ పెట్టో ఆలోచనలో ఉన్నట్టు గతంలో బాగా టాక్‌ నడించింది. అదే సమయంలో సీమాంద్ర జిల్లాల్లో తనకున్న పట్టు ఎంతో తెలుసుకోవడానికి ఓ సర్వే కూడా చేయించుకున్నాడట.. కిరణ్‌ మౌనానికి ఈ సర్వే కూడా కారణం అంటున్నారు ఆయన సన్నిహితులు. సొంత పార్టీ పెట్టాలనుకున్న కిరణ్‌కు రాష్ట్రంలో కేవలం ఒక్క శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉందని తెలిసి దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిందట. సర్వే ఫలితాలతో పాటు, బిల్లు కన్నా ముందే రాష్ట్రనికి వచ్చిన దిగ్విజయ్‌ సింగ్‌ మంత్రాంగం కూడా కిరణ్‌లోని మార్పుకు కారణం అన్న టాక్‌ బలంగా వినిపిస్తుంది. మరి స్టార్‌ బ్యాట్స్‌మెన్‌గా తనని తాను చెప్పుకున్న కిరణ్‌. ఇప్పుడు ఎలాంటి స్టెప్‌ తీసుకుంటాడో చూడాలి.

అవిశ్వాసంపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ఎంపీలు..!

      తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఏర్పడదు. అసలు యూపీఏ ప్రభుత్వాన్నే ఉండనివ్వం. ప్రభుత్వాన్ని పడగొడుతున్నాం. మేము చేస్తున్న ప్రయత్నాలకు అనూహ్యమయిన మద్దతు లభిస్తుంది అని మీడియా ముందు గతంలో యుపిఎ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ లగడపాటి ఇప్పుడు కొత్త మాటలు చెబుతున్నారు.   తాజాగా ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చిన కేంద్రంలో కొనసాగుతున్నది మైనార్టీ ప్రభుత్వం అని, ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనే తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం అనేక రకాలుగా వ్యూహాత్మకంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని, కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బిల్లు అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందునే తాము ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇవ్వలేదన్నారు. కేంద్రం విభజనపై ఎలా ముందుకు వెళ్తుందో చూస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యం కోసం పాటుపడుతున్నారన్నారు. జనవరి దాకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పైన చర్చ జరిగే అవకాశం లేదన్నారు.  

రేపటి నుండి తెలంగాణ బిల్లు పై చర్చ

      తెలంగాణ ముసాయిదా బిల్లుపై రేపటి నుంచి మూడు రోజుల పాటు వరకు చర్చ జరుగుతుందని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బిల్లులో ఏ క్లాజ్‌లు ఉన్నాయో దానిపై ప్రతి ప్రభ్యుడు చర్చించడానికి బీఏసీలో నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. అయితే టీ. బిల్లు సరిగాలేదని, తిప్పి పంపాలని టీడీపీ సభ్యులు కోరారని, కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత దానిని రాష్ట్రపతి కూడా అంగీకరించి రాష్ట్రానికి పంపిన తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపడం సరికాదని, దీనిపై రేపట్నించే చర్చ జరుగుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని బీఏసీ సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్ నాదెండ్ల అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.