ఢిల్లీ 'టి' సంగ్రామం: బిల్లు లోకసభలోనే!

      తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం వ్యూహం బెడిసికొట్టి తిరిగి బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. కేంద్రం వ్యూహాత్మకంగా బిల్లుని మొదట లోక్ సభలో బదులుగా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమయింది. ఒకవైపు బిల్లుకి బీజేపీ మద్దతు కోరుతూనే, ఒకవేళ బిల్లుకి బీజేపీ మద్దతు ఈయకపోయినట్లయితే అదే బిల్లుతో బీజేపీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే ఆలోచనతో సంప్రదాయానికి విరుద్దంగా విభజన బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది. అనేక ఆర్ధిక అంశాలతో కూడిన రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో చర్చించి, ఆమోదించకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని హమీద్ అన్సారీ తేల్చిచెప్పడంతో, కేంద్ర౦ ఇరకాటంలో పడింది. లోకసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. అందుకు ప్రణబ్ ముఖర్జీ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు తాజాగా బిల్లుని లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశంపై కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకొని చర్చించుకొంటున్నారు. దీంతో బిల్లును సభలో ప్రవేశపెట్టే విషయంపై చర్చించేందుకు లోకసభ స్పీకర్ మీరా కుమార్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు లోకసభ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమికి లోక్ సభలో తనకు తగినంత సభ్యుల బలం కాగితాలమీద కనిపిస్తున్నపటికీ, బిల్లును ఓటింగుకి పెడితే వారిలో ఎంతమంది అనుకూలంగా ఓటు వేస్తారో తెలియదు. ఇదే అదునుగా బీజేపీ తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు బిల్లుపై చర్చకు పట్టుబట్టవచ్చును. అదే జరిగితే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది!  

ఆమాద్మీ శకం ముగిసినట్లేనా

  భక్తుడు కోరుకొన్నదే దేవుడు వరంగా ఇస్తాడన్నట్లు, జన్ లోక్ పాల్ బిల్లు పేరుతో రాజినామాకు సిద్దపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ కు ఆ శ్రమ లేకుండానే, డిల్లీలోని ముండ్కా నియోజకవర్గం స్వతంత్ర శాసనసభ్యుడు రామ్‌బీర్‌ షోకీన్‌ ఆమాద్మీ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకోబోతున్నట్లు నిన్న ప్రకటించారు. ఆమాద్మీ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయనందుకు తను మద్దతు ఉపసంహరించుకొంటున్నానని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే వినోద్ కుమార్ బిన్నీ అనే ఆమాద్మీ పార్టీ శాసనసభ్యుడు తనకు మంత్రి పదవి ఈయలేదని తిరుగుబాటు చేస్తే, అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేసారు. కానీ, అతను ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తుండటం వలన ఇంకా ప్రభుత్వం నిలబడి ఉంది. 70 మంది సభ్యులు ఉన్న డిల్లీ శాసనసభలో ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 36 మంది మద్దతు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆమాద్మీ ప్రభుత్వానికి 28మంది స్వంత పార్టీ సభ్యులు, 8మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో కలిపి మొత్తం 36 మంది మద్దతు ఉంది. కానీ, ఇప్పుడు రామ్‌బీర్‌ షోకీన్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ సంఖ్య 35 అవుతుంది గనుక ఆమాద్మీ ప్రభుత్వం శాసనసభలో మెజార్టీ కోల్పోయి ప్రభుత్వం పడిపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఎలాగు జన్ లోక్ పాల్ బిల్లుని సాకుగా చూపి, తన ప్రభుత్వాన్ని తానే కూల్చుకోవడానికి సిద్దపడ్డారు గనుక, ఇప్పుడు రామ్‌బీర్‌ షోకీన్‌ మద్దతు ఉపసంహరణతో ఆయన చేతికి మసి అంటకుండా ఆ పని పూర్తయిపోతుంది.   అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేప్పటినపుడు దేశ రాజకీయాలలో ఒక సరికొత్త శకం, ప్రభుత్వపాలనలో ఒక నూతన ఒరవడి మొదలయిందని ఆయన ప్రభుత్వంపై డిల్లీ ప్రజలే కాకుండా యావత్ దేశప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకొన్నారు. రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వ పాలన తీరుని సమూలంగా మార్చివేస్తానని హామీలు గుప్పించిన అరవింద్ కేజ్రీవాల్ అది తన శక్తికి మించినదని గ్రహించడం వలనో లేక ప్రభుత్వ యంత్రాంగంలో తను ఆశించిన విధంగా మార్పు తేలేననే అసహనంతో తన నిస్సహాయతకు తానే సిగ్గుపడుతూ దానిని కప్పిపుచ్చుకొనేందుకు ఘర్షణ వైఖరి అవలంభిస్తూ చేజేతులా తన ప్రభుత్వాన్ని కూల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారో కానీ, నేడు రామ్‌బీర్‌ షోకీన్‌ ఆయన కోరిక తీర్చబోతున్నారు.   తమని అధికారంలో రాకుండా అడ్డుకొనేందుకే కాంగ్రెస్ ఆమాద్మీ పార్టీని ప్రోత్సహించి, మద్దతు ఇస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు నిజమని నమ్మవలసి వస్తోంది. సరిగ్గా ఎన్నికల గంట మ్రోగే ముందు, ఆమాద్మీ ప్రభుత్వాన్ని తన చేతికి మసి అంటకుండా దింపేసి, సాధారణ ఎన్నికలతో బాటు డిల్లీలో కూడా మళ్ళీ శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ డిల్లీ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోనేందుకే ఈ తాత్కాలిక ఏర్పాటు చేసుకొన్నట్లుంది. అత్యంత ప్రజాదారణ కలిగిన అమాద్మీ ప్రభుత్వానికి తాము బేషరతుగా మద్దతు ఇచ్చామని అయినా దానిని ఆమాద్మీ సద్వినియోగపరుచుకొని తను ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోయినా కనీసం సరిగ్గా పరిపాలించలేకపోయిందని చాటింపు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇక నిర్భయంగా డిల్లీ ప్రజలను ఓట్లు అడగవచ్చును.   ఈ వైఫల్యంతో ఇక ఆమాద్మీ పార్టీ ఇక దేశంలోనే కాదు కనీసం డిల్లీలో కూడా మళ్ళీ ఓట్లు అడగలేని పరిస్థితి కల్పించుకొంది. ఆమాద్మీ ప్రయోగం ఈవిధంగా విఫలం కావడం యావత్ దేశప్రజలకు తప్పక విచారం కలిగిస్తుంది. డిల్లీ వంటి అతి చిన్నరాష్ట్రంలో గట్టిగా నెలరోజుల పాటు ప్రభుత్వాన్ని నడుపలేని ఆమాద్మీ పార్టీ రానున్న ఎన్నికలలో దేశ వ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలనుకోవడం చూస్తే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది.

ఇక సీమాంధ్ర వంతు

  కాంగ్రెస్ పార్టీలో సహజసిద్దమయిన నాటకీయ పరిణామాల తరువాత రాజ్యసభ ఎన్నికలు ముగిసాయి. అధిష్టానం తను ప్రతిపాదించిన ముగ్గురు అభ్యర్ధులతో పాటు తెరాస అభ్యర్ధి కేశవ్ రావుని కూడా గెలిపించుకొంది. మరి కాకతాళీయమో లేక వ్యూహాత్మకమో కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది సేపటికే కేంద్ర క్యాబినెట్ తెలంగాణా బిల్లుని కూడా ఇంచుమించుగా యధాతధంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. క్యాబినెట్ ఆమోదించిన బిల్లుని ఈరాత్రే రాష్ట్రపతికి పంపించవచ్చని కూడా తెలియజేసింది. టీ-బిల్లు రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేసుకొని రాగానే ఈనెల 12న రాజ్యసభలో ప్రవేశపెడతామని కొత్త ముహూర్తం కూడా ప్రకటించేసింది. వీటితో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రసన్నం అయినట్లయితే, ఆ పార్టీని విలీనమో లేకపోతే కనీసం ఎన్నికల పొత్తులకయినా ఒప్పించగలిగితే, ముందు అనుకొన్న పధకం ప్రకారం ఇక తెలంగాణాలో వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు.   ఇక కాంగ్రెస్ పార్టీపై భగ్గుమంటున్న సీమాంధ్రలో చాలా చాకచక్యంగా నిర్వహించవలసిన పనులు కొన్ని మిగిలిపోయాయి. మొట్ట మొదట తన సమైక్య సింహం కిరణ్ కుమార్ రెడ్డిపై వేటువేసి పార్టీ నుండి బయటకు సాగనంపి, సీమాంధ్ర ప్రజలలో ఆయనకు సానుభూతి, దానితో బాటు సమైక్యవీరుడుగా ప్రత్యేక గుర్తింపు కలిగించాలి. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించేలోగా దిగ్విజయ్, షిండే, చాకో వంటివారు రంగంలో దిగి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ, కొత్త పార్టీ స్థాపనకు తగిన వాతావరణం సృష్టించాలి. ఆ తరువాత కొత్తపార్టీ తన అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేక, ఆ జాబితా ప్రకారం వారిపై పోటీ చేసే తన డమ్మీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలసి ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో దారితప్పుతున్నట్లు కనబడుతున్న తన మరో సమైక్యసింహాన్ని కూడా ఎన్నికలలోగా తన చిలకలను ప్రయోగించయినా సరే మచ్చిక చేసుకొని మళ్ళీ దారికి తెచ్చుకోవలసి ఉంటుంది.   ఆ తరువాత యువరాజవారి సైన్యాధ్యక్షతలో సొనియా-రాహుల్ భక్తజన శ్రేణులందరూ ఉత్సాహంగా కదనరంగంలోకి దూకి తెదేపాను డ్డీకొనాలి. వీలయితే తన రెండు సమైక్య సింహాలతో హోరాహోరీ యుద్ధం చేస్తున్నట్లు నటించాలి. అంతిమంగా ఆ రెండింటిని గెలిపించుకొని మళ్ళీ వెనక్కి రప్పించుకోవాలి. అందుకు చాలా శ్రమ పడాలి. కానీ, యువరాజవారి పట్టభిషేకం జరగాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు మరి.

Teluguone Exclusive తెలంగాణ తూచ్...!

      ఢిల్లీలో విభజన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో స్పష్టత కంటే గందరగోళ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ బిల్లుపై నెలకొన్న సస్పెన్స్...అదిరిపోయే ట్విస్టులతో టీ-20 మ్యాచ్ లాగా ఢిల్లీలో ఆఖరి పోరాటం సాగుతోంది. తాజాగా కేంద్రమంత్రుల వర్గం నుంచి తెలుగువన్ కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అసాధ్యమో కూడా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా కొన్ని దశల్ని దాటాల్సివుంది. కానీ ఈ దశలన్నిటినీ దాటేంత సమయం కేంద్రంలో వున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడుతున్నారు. యుపీఏ-2కు ఇవే చివరి సమావేశాలు. కాబట్టి సభ జరిగే ప్రతిరోజు కేంద్రానికి చాలా ముఖ్యమైనవి. తెలంగాణ బిల్లు నుంచి మతహింసనిరోధక బిల్లు వరకూ చాలా ముఖ్యమైన బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదింప చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో వుంది. కాని వరుసగా లోకసభ లో వాయిదాల పర్వం కొనసాగుతుండడంతో, విభజన బిల్లుని త్వరగా సభ ముందుకు తేవాలని అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గురువారం లోక్ సభలో విభజనకు సంబంధించి ప్రధాని మన్మోహన్ ప్రకటన చేయాల్సి వుంది. తెలంగాణ ఏర్పాటుతో సీమంధ్రకు ఎలాంటి అన్యాయం జరగదని, సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాల ఆదుకుంటామని స్వయంగా మన్మోహన్ చేత ప్రకటన చేయించాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి సీమాంధ్ర నేతలు షాకిచ్చారు. సభను పది నిమిషాలు కూడా సజావుగా జరగకుండా అడ్డుకున్నారు. ఇకపై కూడా ఇలాగే సభను అడ్డుకొనేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పరిణామాలు అధిష్టానానికి మింగుడుపడకపోయినా, ఏం చేయాలోనన్న దానిపై కూడా స్పష్టత లేదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బిజెపి పార్టీ కాంగ్రెస్ తెచ్చిన బిల్లుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవంటూనే...కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఉభయసభల్లో గొడవ చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతుంటే తెలంగాణ బిల్లు ఎలా పాస్ అవుతుందని సుష్మాస్వరాజ్ ప్రశ్నించినట్లు తెలిసింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ సభ్యుల గొడవ, గందరగోళం మధ్య తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చుననే అనుమానాన్ని సుష్మాస్వరాజ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉభయ సభల్లో గొడవ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలను సభల నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వారు అంగీకరించకపోవచ్చునని ఆమె చెప్పినట్లు తెలిసింది. ఫిబ్రవరి 21పార్లమెంట్ సమావేశాలకు ఆఖరిరోజు. కాని ఇప్పటిదాకా విభజన బిల్లు పార్లమెంట్ మొఖం కూడా చూడలేదు. ఫిబ్రవరి10న టి-బిల్లు రాజ్యసభ ముందుకు రాబోతున్నది అని షిండే ప్రకటించారు. అయితే అసలు ఇంతవరకు బిల్లు క్యాబినెట్ ముందుకు రాలేదు. గురువారం క్యాబినెట్ ముందుకి బిల్లు వస్తుందని అంతా భావించిన అది శుక్రవారానికి వాయిదా పడింది. ఈ రోజు బిల్లుకి క్యాబినెట్ ఆమోదం లభిస్తే అక్కడ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. రాష్ట్రపతి న్యాయసలహా కోరాలని భావిస్తే బిల్లు ఆమోదం పొందడం కష్టం. అలాగాకాకుండా తన వద్దే వుంచుకొని రెండు, మూడు రోజులు పరిశీలించిన కేంద్రానికి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 12న మధ్యంతర రైల్వే బడ్జెట్, ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఫిబ్రవరి 15 శనివారం సెలవు, ఫిబ్రవరి 16 ఆదివారం సెలవు, మిగిలింది రెండే రోజులు అవి ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14... ఫిబ్రవరి 12న మధ్యంతర రైల్వే బడ్జెట్, ఫిబ్రవరి 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కాబట్టి వాటిపై రెండు, మూడు రోజులు చర్చకు సమయం కేటాయించక తప్పదు. అప్పటికి పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటాయి. కేంద్ర క్యాబినెట్, రాష్ట్రపతి, రాజ్యసభ ఇలా విభజన బిల్లు అన్నీ ప్రక్రియలను దాటుకొని ఫిబ్రవరి 12నాటికి బిల్లు లోకసభ కు రావాలి. కాని ఫిబ్రవరి 12న రైల్వే బడ్జెట్ వుంది కానుక ఆ రోజు విభజన బిల్లు ప్రవేశపెట్టరు. ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 16 శని, ఆదివారాలు పార్లమెంట్ కి సెలవు దినాలు, ఫిబ్రవరి 17 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వుంటుంది కాబట్టి మిగిలింది రెండే రోజులు అవి ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14...ఆ రెండు రోజుల్లో బిల్లు లోక్ సభలో పెట్టి అమోదించుకోవాలి. కాని ఆ వేగాన్ని అందుకోవడం కష్టమని కాంగ్రెస్ పార్టీ టాస్క్ మాస్టర్లు అధిష్టానానికి తేల్చిచెప్పడంతో..ఆ పార్టీ దిక్కు తోచనిస్థితిలో పడిపోయిందట. కాబట్టి చివరాఖరికి చేపోచ్చేదే౦టంటే...ఇప్పుడప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు...ఇది పేరు చెప్పడం ఇష్టంలేని కొంతమంది కేంద్రమంత్రుల నుంచి మాకందిన బోగట్టా!

కిరణ్ కుమార్ రెడ్డిపై వేటు వేస్తే

  కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిన్న డిల్లీలో దీక్ష చేయడంతో ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం రేపు రాజ్యసభ ఎన్నికలు పూర్తవగానే, ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పించబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజన ప్రకటన చేసినప్పటి నుండి ఆయన ఏదో ఒక రూపంగా తన నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడని కాంగ్రెస్ పెద్దలే స్వయంగా కితాబులు ఇస్తూ వచ్చారు తప్ప ఏనాడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత కేంద్రప్రభుత్వం పంపిన టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఆయన శాసనసభలో తీర్మానం చేయించినప్పుడు కూడా ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు డిల్లీలో దీక్ష చేసినందుకు ఆయనను పదవిలో నుండి తొలగించాలనుకొంటే, అసలు ఆయన దీక్ష చేయకుండా ముందే ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.   కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో కలిసి డిల్లీలో నిరసన దీక్ష చెప్పట్టబోతున్నారనే సంగతి ఆయన అనుచరుల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన దీక్ష చేసినట్లయితే అది తనకు తీరని అప్రదిష్ట కలిగిస్తుందని తెలిసి ఉన్నపటికీ, కాంగ్రెస్ ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ వంటి తన విధేయులను కూడా వారించలేదు. వారించి ఉంటే దీక్షలో ముఖ్యమంత్రి ఒంటరివారయ్యే వారు. ఆయనే అవమానం పాలయ్యేవారు. కానీ కాంగ్రెస్ వారించలేదు. అందుకే అధిష్టానానికి విదేయులయిన కేంద్రమంత్రులు, యంపీలు, శాసన సభ్యులు, చివరికి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా అందరూ దీక్షలో కూర్చొన్నారు.   రాష్ట్ర విభజనపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధిష్టానమే వారికి స్వేచ్చ ప్రసాదించిందని ఇంతకాలం గొప్పగా చెప్పుకొన్నప్పుడు, ఇప్పుడు వారు దీక్ష చేసి నిరసన తెలియజేస్తే మాత్రం ఎందుకు ఆగ్రహించాలి? ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేసి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, పార్టీకి అప్రదిష్ట కలిగించారని కాంగ్రెస్ అధిష్టానం భావించి ఆయనపై వేటు వేయదలచుకొంటే మరి పార్టీ పరువు కాపాడవలసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా దీక్షలో పాల్గొన్న సీమాంధ్ర నేతలందరిపై కూడా వేటు వేయవలసి ఉంటుంది. కానీ, వారందరినీ అడగకుండానే క్షమించేసి, కేవలం ముఖ్యమంత్రిపైనే వేటు వేస్తే, ఆయనని, కాంగ్రెస్ అధిష్టానాన్ని అనుమానించక తప్పదు.   పార్టీ తరపున నిలబడిన రాజ్యసభ సభ్యుల గెలుపుకోసం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషి అధిష్టానం పట్ల ఆయన విధేయతకు అద్దం పడుతోంది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఈ సాకుతో పదవిలో నుండి తప్పిస్తే, అది ఆయనకు శిక్షగా కాక సమైక్య చాంపియన్ గా ఎదిగేందుకు బహుమానం ఇస్తున్నట్లుంది. రాష్ట్ర సమైక్యత కొరకు తన అధిష్టానాన్నే ధిక్కరిస్తున్న కారణంగా ప్రజలలో జేజేలు అందుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే పదవిలో నుండి తప్పించినట్లయితే, ఆయన బిల్లు ఆమోదం పొందేవరకు కూడా కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రజలలో మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టుకొని ప్రజలలోకి వెళితే దాని ఫలితం ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే జమా అవ్వాలంటే, అందుకు ఇదే మంచి పద్ధతి.

రాజ్యసభ రాజకీయం!

      ప్రస్తుత లోక్‌సభ చివరి సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ఆమోదించేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సభని జరగనివ్వమని, బిల్లుకు అడ్డుపడిపోతామని సీమాంధ్ర ఎంపీలు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం సభను సజావుగా నడిపితేనే బిల్లుకు మద్దతు వుంటుందని చెబుతుంది. ఇదిలావుంటే ప్రభుత్వం కూల్‌గా ఈనెల 10న రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించింది.   ప్రస్తుతం తెలంగాణ బిల్లు చుట్టూ ఏర్పడిన పరిస్థితులను చూస్తే ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించేలా చేసి, లోక్‌సభలో బిల్లుకు జెల్లకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతాన్ని, లోక్‌సభలో బిల్లుకు చిల్లు వేయడం ద్వారా సీమాంధ్ర ప్రాంతాన్ని సంతృప్తి పరచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ గండాన్ని ఇలా గట్టెక్కించి మిగతా విషయాన్ని వచ్చే ఎన్నికల తర్వాత చూసుకోవచ్చనే యోచనలో కేంద్రం ఉన్నట్టు భావిస్తున్నారు. ఎన్నికలలో తమను గెలిపిస్తే లోక్‌సభలో కూడా బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని చెబుతూ తెలంగాణ ప్రాంత ఓటర్లకి గాలం వేసే ఉద్దేశంలో ఇటు కాంగ్రెస్‌తోపాటు అటు బీజేపీ కూడా వున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లుకు కాలదోషం పట్టదు కాబట్టి తెలంగాణ సమస్య అనే రావణ కాష్టాన్ని శాశ్వతంగా కాలుతూ వుండేలా చూడటం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ వ్యూహంలా వుందని పరిశీలకులు అంటున్నారు.

నిండు నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ కప్: 2

      సాధనా దినం: జంతర్ మంతర్ నుంచి మా సమైఖ్య ప్రతినిది -  " సంపూర్ణ ఆంద్ర టీం ప్రాక్టిస్ మ్యాచ్ కి మద్దతు గా జనసంద్రంగా మారింది జంతర్ మంతర్. లోక్ మరియు రాజ్యసభ గ్రౌండ్స్ నిరవధిక వాయిదా వల్ల సంపూర్ణ ఆంద్ర కెప్టెన్ కిరణ్ తన రెండో బంతిని ఇక్క్డడ నుంచి వెయడం ఈ రోజు విశేషం. రెండో బంతి దూసుకొని వెల్తు వివిధ ప్రతిపక్షపార్టీలను ప్రేరేపిస్తూ తన గమ్యాన్ని చేరుకొంది. ఆట చివరి ఒవర్ రెండో బంతి ముగిసేసరికి సంపూర్ణ ఆంద్ర స్పష్టమైన అధిక్యంతో నిజాం మీద ఉంది. ఉక్కిరి బిక్కిరి అయిన నిండు నూరేళ్ళ ఆంద్రప్రదేశ్ కప్ ని సమర్పిస్తున్న తలతిక్కల కేంద్ర ప్రభుత్వం మరియు నిజాం టీం కళ్ళు తేలవేయడం ఈ రోజు ప్రత్యేకత. హైలెట్స్ ఆఫ్ ద డే : 1. చెయూతని ఇస్తున్న చంద్రన్న 2. మన దారి కి వచ్చిన మోదీ 3. వెల వెల పొయిన నెహ్రు గాట్ 4. లోక్ మరియు రాజ్య సభ గ్రౌండ్స్ నిరవదిక వాయిదా 5. తల తిక్కల కేంద్ర ప్రభుత్వం ఇంకా మొండి వైకరి వీడకపొవడం 6. ఇప్పుడే నిద్ర లేచిన సీమా౦ద్ర బి.జె.పి, రేపు ఢిల్లీ పయనం 7.  స్లెడ్జింగ్ / బాల్ టంపరింగ్ / ధూశన / ఆటగాళ్లని కొనే సంస్క్రుతి కి తెర లేపిన  8. చురకలు అంటించిన సుష్మ. .....Suresh Karothu

నిండు నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ కప్

      సంపూర్ణ ఆంద్ర మరియు నిజాం సంపూర్ణ ఆంద్ర ఇన్నింగ్స్ 300 / 1 ఇయర్ నిజాం 299 / 4 ఇయర్స్ హైలెట్స్: సంపూర్ణ ఆంద్ర కెప్టెన్ కిరణ్ తన టీం లగడపాటి / శైలజానాద్ / అశొక్ బాబు మిగతా వాళ్లతో చివరి ఓవర్ గురించి చర్చిస్తున్నరు... నిజాం టీం చివరి ఓవర్ వరకు వెయిట్ చెయకుండా సంబరాలు అంబరన్ని అంటే ట౦టూ చేస్తున్నారు ... చివరికి... కెప్టెన్ కిరణ్ చివరి ఓవర్ వెయడానికి నిర్ణయించు కొన్నారు. 2014.జనవరి.31 - మెదటి బంతి ------ పుర్తిగా నిజాం కోట ని పడగొట్టి అసెంబ్లీలో .. ముజువాణి వోట్ తో క్లీన్ బౌల్డ్ ఆకస్మిక మార్పుల వళ్ళ ఆట హైదరబాద్ నుంచి డిల్లీ కి మర్చడం అయింది. ఓవెర్ టూ డిల్లీ , అక్కడ మా సమైక్యాంధ్ర ప్రతినిది విరామం తరువాత... విరామం / వాణిజ్య ప్రకటనలు / సమాలోచనలు : వాణిజ్య ప్రకటనలు : 1. మీ రాష్టం లో విభజన దోమల బెడద ఎక్కువ ఉందా .... వాడండి సమైక్య బిల్లలు ... 2. కుల , మత , ప్రాంత విద్యేశాలు రెచ్చగొట్తే కా౦గ్రేస్ పార్టిని సమూలంగ ఒక్క ఉతుక్కే నాశనం చేస్తుంది సమైక్య వాషింగ్ పౌడర్ .... 3. నిండు నూరేళ్ళ ఆంద్రప్రదేష్ కప్ ని సమర్పిస్తున్న వారు ... తల తిక్కల కేంద్ర ప్రభుత్వం.... ఇప్పుడు డిల్లీ నుంచి అక్కడ మా సమైక్య ఆంద్ర ప్రతినిది వివరణ - "నిన్న రాత్రి ఆకస్మతుగా ఆట హైదరబాద్ నుంచి డిల్లీ కి మర్చడం వల్ల ... మొదట బంతి కి విరిగిన వికెట్త్ ముక్కలు ప్రత్యేక విమానం లొ థర్డ్ అంపైర్ వద్దకు పరిశీలనకు పంపారు. సంపూర్ణ ఆంద్ర మరియు నిజాం టీంస్ స్పెషల్ విమానంలో డిల్లీ కి చెరుకొన్నారు. స్లెడ్జింగ్ కి పాల్పడిన సంపూర్ణ ఆంద్ర ఆటగాళ్లు చిరంజీవి / పనబాకా / కావురి ని టీం కెప్టైన్ కిరణ్ జీవిత కాల నిషేదం విదించాలని టీం కోచ్ అశోక్ బాబు కి విజ్ఞప్తి చెసారు. ఇక రెండు టీం ల అబిమానుల బలా బలాలు : సమైక్య ఆంద్ర - త్రుణమొల్ / జె.డి.యు / చిన్న చిన్న ప్రంతీయ పార్టిలు నిజాం - కాంగ్రెస్ అటు ఇటు తెల్చుకోలేక ఉన్న - బి.జె.పి రెపటి మాచ్ కి సాదనగ సంపూర్ణ ఆంద్ర టీం జంతర్ మంతర్, నిజాం టీం నెహ్రు గాట్ ని ఎంచుకొన్నయి. "   ......Suresh Karothu

బొత్సకెందుకో ఉలుకు?

      పైకి సమైక్య నినాదం.. లోపల మాత్రం విభజనవాదం... సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల ఈ ఉభయచర ధోరణే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యే పరిస్థితులు తీసుకొచ్చింది. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసింది. పచ్చని తెలుగు జాతితో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆటలాడుకుంటూ, తెలుగువారి చేత కాళ్ళు పట్టించుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులలో వుండే ఉభయచర బుద్ధి తాజాగా మరోసారి బయటపడింది.   ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు ఎవరి పనిలో వాళ్ళు వుంటే, సీమాంధ్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఉన్నత స్థానంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఒక హోటల్‌లో సమావేశమయ్యాడని, వాళ్లిద్దరి మధ్య గంటలకు గంటలు చర్చలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందు తన ఆవేదదను వ్యక్తం చేశాడు. ఇలాంటి నాయకుల ధోరణి వల్లే ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు వచ్చాయని మొత్తుకున్నాడు. కేసీఆర్‌తో సమావేశమైన సదరు నాయకుడు జగన్‌తో కూడా టచ్‌లో వుంటున్నాడని లగడపాటి వెల్లడించాడు. లగడపాటి మాట్లాడుతూ ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అయితే, గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అర్జెంటుగా రంగంలోకి దిగిపోయాడు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడెవరూ కేసీఆర్‌తో సమావేశం కాలేదని ఢంకా భజాయించి చెప్పేశాడు. ఈ ఇష్యూలో బొత్స అత్యుత్సాహం చూసి కేసీఆర్‌తో ఢిల్లీలో సమావేశమైంది, జగన్‌తో టచ్‌లో వుంటున్నదీ బొత్స సత్యనారాయణేనని రాజకీయ వర్గాలు కన్ఫమ్ అయిపోయాయి.

జగన్‌ కోర్టుకి రావాల్సిందే!

      తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయి వున్న జగన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. 16 నెలలు జైల్లో గడిపి బయటకి వచ్చిన జగన్‌ని మొన్నటి వరకూ సీబీఐ కోర్టు అనేక విధాలుగా కట్టడి చేసింది. హైదరాబాద్‌ దాటి వెళ్ళకూడదని ఆంక్షలు కూడా విధించింది. అయితే ఈమధ్యకాలంలో మాత్రం జగన్ మొరపెట్టుకుని మొత్తుకోవడంతో హైదరాబాద్ దాటి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. అయితే జగన్ అందినదానితో సంతృప్తి చెందకుండా అసలు కోర్టు విచారణకే హాజరు కాకుంటే ఎలా వుంటుందన్న ఐడియా వచ్చింది. వెంటనే  జగన్ కోర్టుకు విన్నవించుకున్నాడు. తానొక పార్టీ అధ్యక్షుడిగా వున్నాడు కాబట్టి  చాలా బిజీగా వుంటానని, కాబట్టి సీబీఐ కోర్టు విచారణకు తాను హాజరు కాలేనని, తన తరఫున తన లాయర్ హాజరవుతాడని రిక్వెస్ట్ చేశాడు. అయితే కోర్టు ఈ విషయంలో జగన్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆర్థిక నేరాలు ఆవేశంలో చేసే హత్య కంటే తీవ్రమైనవి. విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వడానికి ఇదేమీ చెల్లని చెక్కుల కేసు లాంటి సాధారణమైన కేసు కాదు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి నీతిబాహ్యమైన అభియోగాలు ఎదుర్కొంటున్న కేసు. ఈ కేసు విచారణకు హాజరు విషయంలో ఎలాంటి మినహాయింపులు కుదరవు’’ అని వ్యాఖ్యానిస్తూ జగన్ చేసుకున్న విన్నపాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల్ని బలహీనం చేసే స్థాయి అభియోగాలు మీ మీద వున్నాయి. కోర్టుకు హాజరు నుంచి మీకు మినహాయింపు ఇవ్వడానికి ఎలాంటి కారణాలూ కనిపించడం లేదు. రోజువారీ వేతనం, ప్రభుత్వ విధుల్లో బిజీగా వుండేవారికి మాత్రమే మినహాయింపులు ఇవ్వొచ్చు’’ అని కోర్టు పేర్కొంది.

జగన్ మీద విమర్శనాస్త్రాలు!

      వైసీపీ అధ్యక్షుడు జగన్ పచ్చి విభజనవాది అని విమర్శిస్తూ ఆ పార్టీకి గుడ్ బై కొట్టి బయటకి వచ్చిన రఘురామకృష్ణంరాజు బీజేపీ తీర్థం పుచ్చుకుని నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన వైసీపీలో నుంచి బయటకి వచ్చిన క్షణం నుంచి జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వున్నారు. ఆ విమర్శనాస్త్రాలలో కొన్నిటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఆత్మగౌరవం చంపులోలేక పార్టీలోంచి బయటికొచ్చా. పార్టీలోంచి బయటకి వచ్చేవాళ్ళు ఇంకా బోలెడంతమంది వున్నారు. త్వరలో జగన్ పార్టీ కుప్పకూలటం ఖాయం.   1. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి పాలగ్లాసుతో శోభనం గదిలోకి అడుగు పెడితే మొగుడు మగాడు కాదని తెలిస్తే పరిస్థితి ఎలా వుంటుందో జగన్ విభజనవాది అని తెలిశాక నా పరిస్థితి కూడా అలాగే తయారైంది. 2. జగన్ జనాల్లో రామాచారిలా వుంటాడు. పార్టీలోని వాళ్ళ దగ్గర మాత్రం అపరిచితుడిలా జుట్టు విదిలిస్తాడు. 3. మొదట్లో జగన్ నన్ను ‘మీరు’ అని పిలిచేవాడు. నేను జగన్ని ‘నువ్వు’ అనేవాడిని. ఆ తర్వాత పరిస్థితి రివర్సయిపోయింది. 4. క్షవరం అయితేగానీ వివరం తెలియదన్నట్టు జగన్ పార్టీలోకి వెళ్ళి క్షవరం చేయించుకున్న తర్వాతే నాకు జగన్ విషయం పూర్తిగా తెలిసింది. రాష్ట్ర ప్రజలకు కూడా క్షవరం కాకుండా వుండాలనే జగన్ గురించి అసలు విషయాలు బయటపెడుతున్నా. 5. నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న సంస్కారం లేని వ్యక్తి జగన్. 6. పౌరాణిక సినిమా చూడాలని వెళ్తే థియేటర్లో షకీలా సినిమా చూపిస్తే ఆ ప్రేక్షకుడి పరిస్థితి ఎలా వుంటుందో, జగన్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి కూడా అలాగే మారింది.  

విభజించి పాలించు-1

  మొన్న శీతాకాల పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ యంపీలు తమ స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడని అధిష్టానం చేత నేటికీ సర్టిఫికెట్లు అందుకొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న అధిష్టానాన్నే ఇబ్బందిపెట్టే విధంగా రేపు డిల్లీలో దీక్షకు కూర్చుంటారనే వార్తలు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అదేదో సినిమాలో పోలీసు వేషం కట్టిన హీరో చట్టాన్ని కాపాడేందుకు తన స్వంత కుటుంబ సభ్యులకే బేడీలు తగిలించి అరెస్ట్ చేసినట్లు, రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, శాసనసభ్యులు అందరూ కలిసి డిల్లీలో దీక్షలు చేయాలను కోవడం చాలా నాటకీయంగా కనబడుతోంది.   ఒకవైపు వారు అధిష్టానం పట్ల ప్రదర్శిస్తున్న భక్తి, వినయ విధేయతలు, మరోవైపు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేఖంగా వారు ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణి రెండూ చాలా అసంబద్దంగా, ఆహేతుకంగా ఉన్నాయి. వారు అధిష్టానానికి పూర్తి అనుకూలంగానో, లేక పూర్తి వ్యతిరేఖంగానో వ్యవహరిస్తూ ఉంటే వారిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ ఉండేవి కావు. కానీ వారీవిధంగా వ్యవహరిస్తుండటం వలన వారినే కాదు, కాంగ్రెస్ అధిష్టానాన్నికూడా అనుమానించవలసి వస్తోంది.   కాంగ్రెస్ పెద్దలు చెపుతున్న ప్రకారం చూస్తే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయడం ఖాయమనిపిస్తోంది. ఇక జైపాల్ రెడ్డి, దామోదర రాజనరసింహ వంటివారయితే ఫిబ్రవరి రెండవ వారానికి ముహూర్తం కూడా ఖరారు చేసేసారు. కేసీఆర్ అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టడం మొదలు రాష్ట్ర ఏర్పాటు వరకు తనకు అన్నీ తేదీలతో సహా చాలా ముందే తెలుసని తెలిపారు.   కాంగ్రెస్ అధిష్టానంతో సహా ఇంతమంది ఇంత నమ్మకంగా చెపుతున్నపుడు, రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషను వేసి ఉండి ఉంటే అది నమ్మ శక్యంగా, అర్ధవంతంగా ఉండేది. కానీ ఆయన, ఆయన సహచరులు జంతర్ మంతర్ దగ్గర కూర్చొని దీక్షలు చేసో లేక పాదయాత్రలు చేయడం ద్వారానో కేంద్రాన్ని ఏవిధంగా ఆపగలరు? ఆపలేరని తెలిసినప్పుడు వారి దీక్షలు, ర్యాలీల వలన లాభం ఏమిటి?   తనకు ఈవిధంగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, యంపీలని, శాసనసభ్యులపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుపోగాఎందుకు వెనకేసుకు వస్తోంది? అని ఆలోచిస్తే నాలుగు కారణాలు కనపడుతున్నాయి.

విభజించి పాలించు-2

  1. ఎన్నికల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సజావుగా నడవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. వారిపై వేటు వేసి చేజేతులా తన ప్రభుత్వాలను తనే కూల్చుకొని కొంటే, దానివలన తనకే తీవ్ర నష్టం కలుగుతుంది. రెండు చోట్ల అధికారం తన చేతుల్లో ఉన్నపుడే ఎన్నికలను సులువుగా చక్కబెట్టుకోగలదు. కనుకనే కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా దిక్కరిస్తున్నపటికీ, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపలేదు.   2. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు ఎంత ధిక్కార స్వరం వినిపిస్తున్నపటికీ, పార్లమెంటులో టీ-బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, వారందరిచేత దానికి అనుకూలంగా ఎలా ఓటు వేయించాలో అధిష్టానానికి బాగా తెలుసు. అంతే గాక కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండేందుకు కూడా వారి మద్దతు అవసరం ఉంది. గనుకనే వారిని ఉపేక్షిస్తోందని భావించవచ్చును.   3. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసినపటికీ కాంగ్రెస్ అధిష్టానం ముందుకే సాగుతోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం తన స్వంత పార్టీని బలిపెట్టుకొని రాష్ట్ర విభజన చేసేంత తెలివి తక్కువది కాదు. రాష్ట్ర విభజన జరగాలి. కానీ సీమాంధ్రలో పార్టీ గెలవాలి. బహుశః అందుకే ముఖ్యమంత్రికీ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకీ కావలసిన మైలేజీ స్వయంగా కల్పిస్తోంది. ఆ మైలేజీ కోసమే ముఖ్యమంత్రి చేత టీ-బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేయించి ‘సమైక్య ఛాంపియన్నుఇప్పుడు ‘సమైక్య సింహం’గా చేసింది.   వచ్చే ఎన్నికల తరువాత తనకు మద్దతు ఇస్తాడనుకొంటున్నతన మరో ‘సమైక్య ఛాంపియన్’ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నమ్మకోవడం కంటే తన “స్వంత సింహాన్నే” నమ్ముకోవడం మేలనే జ్ఞానోదయం బహుశః కాంగ్రెస్ అధిష్టానానికి కలగి ఉండవచ్చును. లేదా వచ్చే ఎన్నికలలో కేంద్రంలో ఓడిపోయినా రాష్ట్రంలోనయినా తన సమైక్య సింహం అధికారంలో ఉండే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇదంతా కాంగ్రెస్ అధిష్టానమే స్వయంగా నడిపిస్తోందేమో!   4. ఇక ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకపోతే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందదు. కానీ, రాష్ట్ర విభజనకు పూనుకొన్న కారణంగా సీమాంధ్రలో అందుకు పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒకవేళ బిల్లుకి మద్దతు దొరికి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయినా కూడా సీమాంధ్రలో మూల్యం చెల్లించక తప్పదు. ఈ గండం గట్టేక్కెందుకే కాంగ్రెస్ అధిష్టానం తన సమైక్య సింహానికి అవసరమయిన మైలేజీ అందిస్తోంది.   ఆయన డిల్లీలో దీక్షలు, పాదయాత్రలు చేస్తే పార్టీ పరువు పోవచ్చును. అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చును. బహుశః సుప్రీం కోర్టు చేత మళ్ళీ చివాట్లు కూడా తినవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. అయినా, భవిష్యత్ ప్రయోజనాలతో పోల్చుకొంటే ఈ కష్టాలు, అవమానాలు చాలా చిన్నవిగా కనబడతాయి. బహుశః అందుకే ఈ తిప్పలన్నీనేమో!

చంద్రబాబు మాట (విభజించి పాలించు-1 &2)

  మొన్న ఉభయ సభలలో టీ బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి తీర్మానం ఆమోదింపజేసిన తరువాత, అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని పక్కన బెట్టి కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు తీసుకువస్తున్నట్లుంది” అని అనడం చూస్తే ఈ అనుమానాలను పూర్తిగా కొట్టిపారేయలేమనిపిస్తోంది. ఇంతవరకు ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానానికి, రాష్ట్ర విభజనకి వ్యతిరేఖంగా చాలా చేసినట్లు పైకి కనబడుతున్నా, అధిష్టానానికి వారు ఇసుమంత నష్టం కూడా కలిగించలేదు. వారి రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు, దీక్షలు, ధర్నాలు గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.   ఇక, అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా ఎవరూ కూడా తెలంగాణా బిల్లుకి ఎటువంటి అడ్డంకులు కల్పించలేదు. డిల్లీలో కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజన ప్రక్రియ చకచక పూర్తి చేస్తుంటే, రాష్ట్రప్రభుత్వం వారు కోరిన విధంగా అవసరమయిన అన్ని ఫయాల్లు, వివరాలు అందిస్తూ సహకరించింది. అందుకే చంద్రబాబు “విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు కేంద్రానికి ఫైళ్ళు పంపుతూ ఎందుకు సహకరించారని ముఖ్యమంత్రిని సభలోనే ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణా, డిల్లీ కాంగ్రెస్ నేతలందరు కలిసి ఒకరినొకరు తిట్టుకొంటూ, లోలోన సహకరించుకొంటూ రాష్ట్ర విభజన ప్రక్రియను ఇంతవరకు సజావుగా పూర్తి చేయగలిగారు. ఇక బీజేపీ గనుక బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు కూడా చేస్తారు.   ఇప్పడు చివరిగా దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన కొన్ని స్టేట్మెంటులు కూడా చెప్పుకొంటే కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ విభజించి పాలించు వ్యూహం ఎంత పకడ్బందీగా అమలు చేసిందో అర్ధమవుతుంది.   కిరణ్ కుమార్ రెడ్డి, అతని కుటుంబము కాంగ్రెస్ పార్టీకి చాల విధేయులు, చాల సేవలు అందించారు. ఆయన పార్టీకి అత్యంత నమ్మకస్తుడయిన నాయకుడు.   కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరించేందుకు అంగీకరించారు. ఆయనే దీనిని చివరి వరకు పర్యవేక్షిస్తారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పినట్లే నడుచుకొంటారని నాకు నమ్మకం ఉంది. మేమే మా నేతలకు విభజన బిల్లుపై తమ అభిప్రాయాలు చెప్పుకొనేందుకు అవకాశం ఇచ్చాము. అందువల్ల ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. కనుక ముఖ్యమంత్రి తో సహా ఎవరిపైనా  చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు.   బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం చేస్తారని మేము ముందే ఊహించాము. ఆర్టికల్:3 ప్రకారం రాష్ట్ర విభజన చేసే హక్కు కేంద్రానికి ఉంది గనుక, ఆ తీర్మానం వలన బిల్లుకి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

బాడీ లాంగ్వేజ్ మారిందహో!

      హ్యూమన్ సైకాలజీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఏదైనా ఒక విషయంలో ఎలాగైనా గెలిచి తీరాలని నానా తంటాలు పడిన వ్యక్తులు ఆ విషయంలో ఏదైనా ఎదురుదెబ్బ తగిలితే ఏం చేస్తారు? మొట్టమొదట పెద్ద షాకవుతారు. తమ ప్లానంతా రివర్సయిపోయిందే అని కుమిలిపోతారు. కల్లోలానికి గురవుతారు. ఇలా అయిపోయిందేంటి దేవుడా అని ఆవేదనకి గురవుతారు. మామూలు తెలివైన వాళ్ళయితే కుమిలిపోతూ ఓ మూల కూర్చుంటారు. అదే మహా ముదుర్లయితే తమ ఆవేదన ఎంతమాత్రం బయట పడకుండా జాగ్రత్తపడతారు. అసలేం జరగనట్టు  చిరునవ్వులు చిందిస్తారు. అసలు జరిగినదాన్ని తామెంతమాత్రం పట్టించుకోనట్టు, చాలా లైట్‌గా తీసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తారు.  అంతకుముందు కంటే ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. తమ మీద విజయం సాధించిన వాళ్ళతోనే జోకులేస్తూ మాట్లాడతారు. ప్రస్తుతం రాష్ట్రంలో విభజనవాదుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎంత యాగీ చేసినా అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానాన్ని ఆమోదం పొందనీయకుండా చేయడానికి దేనికైనా రెడీ అన్నట్టుగా వున్న విభజనవాదులు అనూహ్యంగా క్షణాల్లో  తీర్మానం ఆమోదం పొందేసరికి ఒక్కసారిగా షాకయ్యారు. కుమిలిపోయారు. కల్లోలానికి గురయ్యారు. అయితే అదంతా ఒక్క క్షణమే. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి బిల్లుని తిరస్కరిస్తూ ఆమోదించిన తీర్మానం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అసెంబ్లీలో చర్చ ముగిసినందున తామంతా చాలా హ్యాపీగా వున్నట్టు మాట్లాడారు. చూడండి.. ఎంత ఉల్లాసంగా వున్నామో.. ఎంత ఉత్సాహంగా వున్నామో అన్నట్టుగా పోజులిచ్చారు.  ఆ తర్వాత వివిధ ఛానళ్ళలో జరిగిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న విభజన వాదులు ప్రపంచంలోని ఉత్సాహమంతా తమ దగ్గరే వున్నట్టుగా కనిపించడం కోసం నానా తంటాలూ పడ్డారు. గతంలో ఇలాంటి డిస్కషన్స్ లో కావాలని గొడవలు పెట్టుకుని చెలరేగిపోయే నాయకులు కూడా చిరునవ్వులు చిందిస్తూ, జోకులు వేస్తూ, సమైక్యవాదులని ‘అన్నా... అన్నా’ అని మర్యాదగా, ప్రేమగా పిలుస్తూ భలే ముద్దొచ్చారు. ఒక మాంఛి ఎదురుదెబ్బ తిన్న విభజనవాదుల బాడీ లాంగ్వేజ్ అయితే మార్చుకున్నారు గానీ, నిజానికి మారాల్సింది రాష్ట్రం విడిపోవాలన్న వాళ్ళ మైండ్ మ్యాపింగ్ అని రాజకీయ విశ్లేషకులు, సమైక్యవాదులు అంటున్నారు.

మెలికల మాస్టార్లు!

      రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2013 అసెంబ్లీ సభ్యుల మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురైంది. యాస్ పర్ రూల్స్ అండ్ రెగ్యులరేషన్స్ ప్రకారం ‘గౌరవనీయులైన రాష్ట్రపతి గారూ, మీరు రాష్ట్ర పునర్విభజన కోసం మాకు పంపిన బిల్లు అత్యంత పనికిమాలిన, అసంపూర్ణంగా వున్న బిల్లు. అందువల్ల మేం దీన్ని తిరస్కరిస్తూ మీకే తిప్పి పంపుతున్నాం’ అనే అర్థం వచ్చే సందేశాన్నిస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర శాసనభ్యులు తిరస్కరించారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం తమ సహజ శైలిలో విపరీతార్థాలు లాగుతూ, మెలికల మీద మెలికలు వేస్తూ మాట్లాడుతూ ఆత్మానందం పొందుతున్నారు.   అసెంబ్లీ నిర్ణయంతో టోటల్‌గా డంగైపోయిన విభజనవాదుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ అంశాన్ని లైట్‌గా తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అంతా మంచే జరిగిందని, ఇక ఢిల్లీలో మా సత్తా చూపిస్తామని చెబుతున్నారు. అసెంబ్లీ తీర్మానానికి అసలు విలువే లేదని, తాము మాట్లాడే మాటలకే బోలెడంత విలువుందని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగతావాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఏదోలే పాపం అనిసానుభూతితో అర్థం చేసుకోవచ్చు. అయితే బాధ్యతాయుతమైన, కీలకమైన పదవుల్లో వున్నవారు కూడా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఏమనుకోవాలి? శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. సీఎం ప్రవేశపెట్టిన, అసెంబ్లీ ఆమోదించిన బిల్లు తిరస్కరణ తీర్మానం రాష్ట్రపతి దగ్గరకి వెళ్ళదట, అసెంబ్లీ బిల్లు తిరస్కరించిందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే తెలియజేస్తారట. మల్లు భట్టి విక్రమార్క చేసిన ఈ ప్రకటన ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా వుందని, రాజ్యాంగాన్ని ప్రశ్నించేలా వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ తనకున్న ప్రాంతీయాభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి అత్యుత్సాహం చూపించారని భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ లాంటి ఉన్నత స్థానంలో వున్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం భావ్యం కాదని అంటున్నారు.

దానం.. కాస్త నిదానం!

      రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ దానం నాగేందర్ తన దూకుడు తగ్గించుకుని నిదానంగా వుండాల్సిన అవసరం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో ఆయన నేపథ్యం ఎలాంటిది అయినప్పటికీ, ఆయన ఎంత దూకుడు కలిగిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్ర హోదాలో వున్నారు. అందువల్ల ఆ హోదాకి తగ్గట్టుగా వ్యవహరిస్తే పద్ధతిగా వుంటుందని పలువురు భావిస్తున్నారు. కొంతకాలం రాష్ట్ర విభజన వద్దని, మరికొంతకాలం హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, మరికొంతకాలం హైదరాబాద్‌ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని నినదించిన ఆయన ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతూ వుండటంతో వీర విభజన వాదిలాగా తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికలలో అటు సమైక్యవాదులతోపాటు ఇటు విభజనవాదుల ఓట్లు కూడా తన అకౌంట్‌లో వేసుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే రెండు మూడు రోజుల క్రితం తెరాస నాయకుడు కేకే అసెంబ్లీకి వచ్చినప్పుడు దానం గారు ధడేల్‌మని ఆయన కాళ్ళమీద పడిపోయారు. అంత బహిరంగంగా, అంతమంది ప్రజా ప్రతినిధుల మధ్యలో దానం లాంటి మినిస్టర్ తన కాళ్ళమీద బోర్లా పడిపోయినందుకు కేకే ఎంత సంతోషించి వుంటారో, భవిష్యత్తులో తెరాస తరఫు నుంచి దానానికి సహకారం ఎలా దానం చేస్తారో ఎవరైనా ఊహించగలరు. కేకేని కాకాపట్టడంలో దానం ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు అందరినీ ముగ్ధులను చేశాయి. కాకా పట్టడం అంటూ జరిగితే ఈ స్థాయిలో పట్టాలని చాలామంది దానం దగ్గర కాకా పాఠం నేర్చుకున్నారు. అయితే దానం అక్కడితే ఆగితే బాగుండేది. కేకే మీద తన అవ్యాజమైన ప్రేమను ప్రదర్శించడం కోసం ఇతరులను బెదిరించే పనులు కూడా దానం గారు చేపట్టారు. రాజ్యసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు చైతన్యరాజు పోటీలో నిలిచారు. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే చైతన్య రాజు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతన్యరాజు గెలవటం అంటే, తెరాస తరఫున బరిలో వున్న కేకే ఓడిపోతారని అర్థం. ఈ పాయింట్ దానాన్ని ఖిన్నుడిని చేసినట్టుంది. అందుకే దానం చైతన్యరాజు దగ్గరకి వెళ్ళి మర్యాదగా పోటీ నుంచి విరమించుకోవాలని బెదిరించినట్టు మాట్లాడారు. మంత్రి గారి బెదిరింపులతో చైతన్యరాజు మనసు కష్టపెట్టున్నారు. ఆయన కళ్ళలో నీరు కూడా తిరిగినట్టు తెలుస్తోంది. చైతన్యరాజు దగ్గర దానం వ్యవహారశైలి క్షమార్హంగా లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.  

జగన్ బాబోయ్ జగన్!

      తనను చూసి తనని వ్యతిరేకించే పార్టీల వాళ్ళు భయపడాలని వైకాపా నాయకుడు జగన్ కోరుకుంటూ వుంటే వుండొచ్చు. అయితే ఆయన్ని చూసి బయటి పార్టీల వాళ్ళు భయపడే సంగతి అటుంచితే, ఆయన పార్టీలో వాళ్ళే జగన్‌ని చూసి భయపడుతున్నారు. జగన్ పేరు చెబితేనే జగన్ బాబోయ్ జగన్ అంటూ ఉలిక్కిపడుతున్నారు. జగన్ వ్యవహారశైలిని తట్టుకోలేక పార్టీలోని అనేకమంది సీనియర్ నాయకులు మెల్లగా పార్టీలోంచి బయటకి జారుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది ఇప్పటికే ఇతర పార్టీల్లో స్థానాన్ని కన్ఫమ్ చేసుకుని, పార్టీ మారడానికి మంచి మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా చాలామంది ఏ పార్టీలో ఖాళీలున్నాయో వెతుక్కుంటున్నారు.   ఇతర పార్టీలలోనుంచి వైకాపాలోకి జంప్ జిలానీలు అవ్వాలని అనుకున్న కొంతమంది ఇప్పుడు అలాంటి ఆలోచనలు  మానుకుని బుద్ధిగా వున్న పార్టీలలోనే గప్‌చుప్‌గా వుంటున్నారు. ఈ పరిస్థితి ఇలా వుంటే, వైకాపా కార్యకర్తలు జగన్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఆయన మీటింగులూ గట్రాలు ఏవైనా ఏర్పాటు చేస్తే వాటికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే జగన్ చుట్టూ కొంతమంది డిటెక్టివ్ పుస్తకాల్లో వర్ణించేలాంటి  ‘దృఢకాయులు’ వలయంలా వుంటారు. ఎవరైనా అభిమానం ముదిరిపోయి జగన్‌కి దగ్గరగా వస్తే వెనకా ముందూ చూడకుండా వాళ్ళని తుక్కురేగేలా కొడుతూ వుంటారు. వాళ్ళు అలా కార్యకర్తల్ని చావబాదుతున్నా జగన్ గారు ఎంతమాత్రం పట్టించుకోకుండా  చిరునవ్వుతో ముందుకు వెళ్తూ వుంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా సందర్భాలలో తలెత్తడంతో పార్టీ కార్యకర్తలు జగన్‌ దరిదాపుల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు. ఈమధ్య ఓ మీటింగ్‌లో తప్పతాగిన ఒక కార్యకర్త గారు జగన్ లేడీస్‌ని మాత్రమే దగ్గరకి రానిస్తున్నారని, వాళ్ళ తలలు మాత్రమే నిమురుతున్నారని, మగ కార్యకర్తలను దగ్గరి కూడా రానివ్వడం లేదని పెద్ద గొంతుతో అరిచేశాడు. అక్కడితో ఆగకుండా జగన్ మీద ఒక రాయి కూడా విసిరేశాడు. దాంతో జగన్ చుట్టూ వున్న దృఢకాయుల బ్యాచ్ సదరు కార్యకర్తని ఎముకల్లో సున్నం కూడా లేకుండా విరగ్గొట్టేశారట. అదీ విషయం!  

బీటల బాటలో యుపిఎ!

      రెండు పర్యాయాలు పరిపాలించి దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుపిఏ శకం త్వరలో ముగిసిపోబోతోంది. వచ్చే ఎన్నికలలో యుపీఏ ఉనికే ఉండబోదన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ యుపీఏ ప్రభుత్వం రాబోతోందని, ఆ ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ నాయకత్వం వహించబోతున్నాడని కలలు కంటున్నారు. వీళ్ళ కలలు ఇలా వుంటే, వాస్తవంలో పరిస్థితులు మరోలా వున్నాయి.   ప్రస్తుతం యుపిఏ భాగస్వామ్య పక్షాలుగా వున్న అనేక పార్టీలు వచ్చే ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టే ఉద్దేశంలో లేనట్టు తెలుస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు, కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నీ యూపీయేలోని మిగతా పార్టీల మెడలకు కూడా చుట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన పార్టీలను కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇది యూపీఏలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్టుగానే పోటీలో నిలబడితే మంచిదని అనేక పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యే వ్యూహాలు రచిస్తున్నాయి. లేటెస్ట్ గా కాశ్మీర్‌కి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రస్తుతం యుపిఎలో వుంది. కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలో మంత్రిగా వున్నారు. అలాగే కాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాకి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోంది. అయితే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే ఆలోచనలో వున్నారు. కాశ్మీర్ పరిపాలనకు సంబంధించినే అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం ఎక్కువ కావడం, తనను శాశించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ వుండటాన్ని ఒమర్ అబ్దుల్లా సహించలేకపోతున్నారు. దాంతో కాశ్మీర్‌కి సంబంధించినంతవరకు కాంగ్రెస్ పార్టీ జోక్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారాయన. అదేవిధంగా ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తే కేంద్రంలో యుపీఏలో భాగస్వామిగా వుండే మాట దేవుడెరుగు.. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని కాశ్మీర్‌లో కూడా అధికారం పోయే ప్రమాదం వుందని ఒమర్ అబ్దుల్లా భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు అర్థమవుతోంది.