Botsa Secret Meet With Jagan

బొత్సకెందుకో ఉలుకు?

      పైకి సమైక్య నినాదం.. లోపల మాత్రం విభజనవాదం... సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల ఈ ఉభయచర ధోరణే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యే పరిస్థితులు తీసుకొచ్చింది. తెలుగు జాతిని రెండు ముక్కలు చేసింది. పచ్చని తెలుగు జాతితో ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆటలాడుకుంటూ, తెలుగువారి చేత కాళ్ళు పట్టించుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులలో వుండే ఉభయచర బుద్ధి తాజాగా మరోసారి బయటపడింది.   ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు ఎవరి పనిలో వాళ్ళు వుంటే, సీమాంధ్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఉన్నత స్థానంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఒక హోటల్‌లో సమావేశమయ్యాడని, వాళ్లిద్దరి మధ్య గంటలకు గంటలు చర్చలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందు తన ఆవేదదను వ్యక్తం చేశాడు. ఇలాంటి నాయకుల ధోరణి వల్లే ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు వచ్చాయని మొత్తుకున్నాడు. కేసీఆర్‌తో సమావేశమైన సదరు నాయకుడు జగన్‌తో కూడా టచ్‌లో వుంటున్నాడని లగడపాటి వెల్లడించాడు. లగడపాటి మాట్లాడుతూ ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అయితే, గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అర్జెంటుగా రంగంలోకి దిగిపోయాడు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుడెవరూ కేసీఆర్‌తో సమావేశం కాలేదని ఢంకా భజాయించి చెప్పేశాడు. ఈ ఇష్యూలో బొత్స అత్యుత్సాహం చూసి కేసీఆర్‌తో ఢిల్లీలో సమావేశమైంది, జగన్‌తో టచ్‌లో వుంటున్నదీ బొత్స సత్యనారాయణేనని రాజకీయ వర్గాలు కన్ఫమ్ అయిపోయాయి.

 Jaganmohan Reddy assets case

జగన్‌ కోర్టుకి రావాల్సిందే!

      తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయి వున్న జగన్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. 16 నెలలు జైల్లో గడిపి బయటకి వచ్చిన జగన్‌ని మొన్నటి వరకూ సీబీఐ కోర్టు అనేక విధాలుగా కట్టడి చేసింది. హైదరాబాద్‌ దాటి వెళ్ళకూడదని ఆంక్షలు కూడా విధించింది. అయితే ఈమధ్యకాలంలో మాత్రం జగన్ మొరపెట్టుకుని మొత్తుకోవడంతో హైదరాబాద్ దాటి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. అయితే జగన్ అందినదానితో సంతృప్తి చెందకుండా అసలు కోర్టు విచారణకే హాజరు కాకుంటే ఎలా వుంటుందన్న ఐడియా వచ్చింది. వెంటనే  జగన్ కోర్టుకు విన్నవించుకున్నాడు. తానొక పార్టీ అధ్యక్షుడిగా వున్నాడు కాబట్టి  చాలా బిజీగా వుంటానని, కాబట్టి సీబీఐ కోర్టు విచారణకు తాను హాజరు కాలేనని, తన తరఫున తన లాయర్ హాజరవుతాడని రిక్వెస్ట్ చేశాడు. అయితే కోర్టు ఈ విషయంలో జగన్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆర్థిక నేరాలు ఆవేశంలో చేసే హత్య కంటే తీవ్రమైనవి. విచారణకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వడానికి ఇదేమీ చెల్లని చెక్కుల కేసు లాంటి సాధారణమైన కేసు కాదు. తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించి నీతిబాహ్యమైన అభియోగాలు ఎదుర్కొంటున్న కేసు. ఈ కేసు విచారణకు హాజరు విషయంలో ఎలాంటి మినహాయింపులు కుదరవు’’ అని వ్యాఖ్యానిస్తూ జగన్ చేసుకున్న విన్నపాన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల్ని బలహీనం చేసే స్థాయి అభియోగాలు మీ మీద వున్నాయి. కోర్టుకు హాజరు నుంచి మీకు మినహాయింపు ఇవ్వడానికి ఎలాంటి కారణాలూ కనిపించడం లేదు. రోజువారీ వేతనం, ప్రభుత్వ విధుల్లో బిజీగా వుండేవారికి మాత్రమే మినహాయింపులు ఇవ్వొచ్చు’’ అని కోర్టు పేర్కొంది.

Raghurama Krishnam Raju quits YSRCP

జగన్ మీద విమర్శనాస్త్రాలు!

      వైసీపీ అధ్యక్షుడు జగన్ పచ్చి విభజనవాది అని విమర్శిస్తూ ఆ పార్టీకి గుడ్ బై కొట్టి బయటకి వచ్చిన రఘురామకృష్ణంరాజు బీజేపీ తీర్థం పుచ్చుకుని నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన వైసీపీలో నుంచి బయటకి వచ్చిన క్షణం నుంచి జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వున్నారు. ఆ విమర్శనాస్త్రాలలో కొన్నిటిని ఒక్కసారి పరిశీలిద్దాం. ఆత్మగౌరవం చంపులోలేక పార్టీలోంచి బయటికొచ్చా. పార్టీలోంచి బయటకి వచ్చేవాళ్ళు ఇంకా బోలెడంతమంది వున్నారు. త్వరలో జగన్ పార్టీ కుప్పకూలటం ఖాయం.   1. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి పాలగ్లాసుతో శోభనం గదిలోకి అడుగు పెడితే మొగుడు మగాడు కాదని తెలిస్తే పరిస్థితి ఎలా వుంటుందో జగన్ విభజనవాది అని తెలిశాక నా పరిస్థితి కూడా అలాగే తయారైంది. 2. జగన్ జనాల్లో రామాచారిలా వుంటాడు. పార్టీలోని వాళ్ళ దగ్గర మాత్రం అపరిచితుడిలా జుట్టు విదిలిస్తాడు. 3. మొదట్లో జగన్ నన్ను ‘మీరు’ అని పిలిచేవాడు. నేను జగన్ని ‘నువ్వు’ అనేవాడిని. ఆ తర్వాత పరిస్థితి రివర్సయిపోయింది. 4. క్షవరం అయితేగానీ వివరం తెలియదన్నట్టు జగన్ పార్టీలోకి వెళ్ళి క్షవరం చేయించుకున్న తర్వాతే నాకు జగన్ విషయం పూర్తిగా తెలిసింది. రాష్ట్ర ప్రజలకు కూడా క్షవరం కాకుండా వుండాలనే జగన్ గురించి అసలు విషయాలు బయటపెడుతున్నా. 5. నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలన్న సంస్కారం లేని వ్యక్తి జగన్. 6. పౌరాణిక సినిమా చూడాలని వెళ్తే థియేటర్లో షకీలా సినిమా చూపిస్తే ఆ ప్రేక్షకుడి పరిస్థితి ఎలా వుంటుందో, జగన్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి కూడా అలాగే మారింది.  

 congress party

విభజించి పాలించు-1

  మొన్న శీతాకాల పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ యంపీలు తమ స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడని అధిష్టానం చేత నేటికీ సర్టిఫికెట్లు అందుకొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న అధిష్టానాన్నే ఇబ్బందిపెట్టే విధంగా రేపు డిల్లీలో దీక్షకు కూర్చుంటారనే వార్తలు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అదేదో సినిమాలో పోలీసు వేషం కట్టిన హీరో చట్టాన్ని కాపాడేందుకు తన స్వంత కుటుంబ సభ్యులకే బేడీలు తగిలించి అరెస్ట్ చేసినట్లు, రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, శాసనసభ్యులు అందరూ కలిసి డిల్లీలో దీక్షలు చేయాలను కోవడం చాలా నాటకీయంగా కనబడుతోంది.   ఒకవైపు వారు అధిష్టానం పట్ల ప్రదర్శిస్తున్న భక్తి, వినయ విధేయతలు, మరోవైపు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేఖంగా వారు ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణి రెండూ చాలా అసంబద్దంగా, ఆహేతుకంగా ఉన్నాయి. వారు అధిష్టానానికి పూర్తి అనుకూలంగానో, లేక పూర్తి వ్యతిరేఖంగానో వ్యవహరిస్తూ ఉంటే వారిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ ఉండేవి కావు. కానీ వారీవిధంగా వ్యవహరిస్తుండటం వలన వారినే కాదు, కాంగ్రెస్ అధిష్టానాన్నికూడా అనుమానించవలసి వస్తోంది.   కాంగ్రెస్ పెద్దలు చెపుతున్న ప్రకారం చూస్తే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయడం ఖాయమనిపిస్తోంది. ఇక జైపాల్ రెడ్డి, దామోదర రాజనరసింహ వంటివారయితే ఫిబ్రవరి రెండవ వారానికి ముహూర్తం కూడా ఖరారు చేసేసారు. కేసీఆర్ అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టడం మొదలు రాష్ట్ర ఏర్పాటు వరకు తనకు అన్నీ తేదీలతో సహా చాలా ముందే తెలుసని తెలిపారు.   కాంగ్రెస్ అధిష్టానంతో సహా ఇంతమంది ఇంత నమ్మకంగా చెపుతున్నపుడు, రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషను వేసి ఉండి ఉంటే అది నమ్మ శక్యంగా, అర్ధవంతంగా ఉండేది. కానీ ఆయన, ఆయన సహచరులు జంతర్ మంతర్ దగ్గర కూర్చొని దీక్షలు చేసో లేక పాదయాత్రలు చేయడం ద్వారానో కేంద్రాన్ని ఏవిధంగా ఆపగలరు? ఆపలేరని తెలిసినప్పుడు వారి దీక్షలు, ర్యాలీల వలన లాభం ఏమిటి?   తనకు ఈవిధంగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, యంపీలని, శాసనసభ్యులపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుపోగాఎందుకు వెనకేసుకు వస్తోంది? అని ఆలోచిస్తే నాలుగు కారణాలు కనపడుతున్నాయి.

 congress party

విభజించి పాలించు-2

  1. ఎన్నికల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సజావుగా నడవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. వారిపై వేటు వేసి చేజేతులా తన ప్రభుత్వాలను తనే కూల్చుకొని కొంటే, దానివలన తనకే తీవ్ర నష్టం కలుగుతుంది. రెండు చోట్ల అధికారం తన చేతుల్లో ఉన్నపుడే ఎన్నికలను సులువుగా చక్కబెట్టుకోగలదు. కనుకనే కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా దిక్కరిస్తున్నపటికీ, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపలేదు.   2. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు ఎంత ధిక్కార స్వరం వినిపిస్తున్నపటికీ, పార్లమెంటులో టీ-బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, వారందరిచేత దానికి అనుకూలంగా ఎలా ఓటు వేయించాలో అధిష్టానానికి బాగా తెలుసు. అంతే గాక కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉండేందుకు కూడా వారి మద్దతు అవసరం ఉంది. గనుకనే వారిని ఉపేక్షిస్తోందని భావించవచ్చును.   3. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసినపటికీ కాంగ్రెస్ అధిష్టానం ముందుకే సాగుతోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం తన స్వంత పార్టీని బలిపెట్టుకొని రాష్ట్ర విభజన చేసేంత తెలివి తక్కువది కాదు. రాష్ట్ర విభజన జరగాలి. కానీ సీమాంధ్రలో పార్టీ గెలవాలి. బహుశః అందుకే ముఖ్యమంత్రికీ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకీ కావలసిన మైలేజీ స్వయంగా కల్పిస్తోంది. ఆ మైలేజీ కోసమే ముఖ్యమంత్రి చేత టీ-బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేయించి ‘సమైక్య ఛాంపియన్నుఇప్పుడు ‘సమైక్య సింహం’గా చేసింది.   వచ్చే ఎన్నికల తరువాత తనకు మద్దతు ఇస్తాడనుకొంటున్నతన మరో ‘సమైక్య ఛాంపియన్’ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నమ్మకోవడం కంటే తన “స్వంత సింహాన్నే” నమ్ముకోవడం మేలనే జ్ఞానోదయం బహుశః కాంగ్రెస్ అధిష్టానానికి కలగి ఉండవచ్చును. లేదా వచ్చే ఎన్నికలలో కేంద్రంలో ఓడిపోయినా రాష్ట్రంలోనయినా తన సమైక్య సింహం అధికారంలో ఉండే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇదంతా కాంగ్రెస్ అధిష్టానమే స్వయంగా నడిపిస్తోందేమో!   4. ఇక ఒకవేళ బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకపోతే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందదు. కానీ, రాష్ట్ర విభజనకు పూనుకొన్న కారణంగా సీమాంధ్రలో అందుకు పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఒకవేళ బిల్లుకి మద్దతు దొరికి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయినా కూడా సీమాంధ్రలో మూల్యం చెల్లించక తప్పదు. ఈ గండం గట్టేక్కెందుకే కాంగ్రెస్ అధిష్టానం తన సమైక్య సింహానికి అవసరమయిన మైలేజీ అందిస్తోంది.   ఆయన డిల్లీలో దీక్షలు, పాదయాత్రలు చేస్తే పార్టీ పరువు పోవచ్చును. అధిష్టానానికి, కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చును. బహుశః సుప్రీం కోర్టు చేత మళ్ళీ చివాట్లు కూడా తినవలసి వచ్చినా ఆశ్చర్యం లేదు. అయినా, భవిష్యత్ ప్రయోజనాలతో పోల్చుకొంటే ఈ కష్టాలు, అవమానాలు చాలా చిన్నవిగా కనబడతాయి. బహుశః అందుకే ఈ తిప్పలన్నీనేమో!

 congress party

చంద్రబాబు మాట (విభజించి పాలించు-1 &2)

  మొన్న ఉభయ సభలలో టీ బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి తీర్మానం ఆమోదింపజేసిన తరువాత, అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని పక్కన బెట్టి కిరణ్ కుమార్ రెడ్డిని ముందుకు తీసుకువస్తున్నట్లుంది” అని అనడం చూస్తే ఈ అనుమానాలను పూర్తిగా కొట్టిపారేయలేమనిపిస్తోంది. ఇంతవరకు ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానానికి, రాష్ట్ర విభజనకి వ్యతిరేఖంగా చాలా చేసినట్లు పైకి కనబడుతున్నా, అధిష్టానానికి వారు ఇసుమంత నష్టం కూడా కలిగించలేదు. వారి రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు, దీక్షలు, ధర్నాలు గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.   ఇక, అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా ఎవరూ కూడా తెలంగాణా బిల్లుకి ఎటువంటి అడ్డంకులు కల్పించలేదు. డిల్లీలో కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజన ప్రక్రియ చకచక పూర్తి చేస్తుంటే, రాష్ట్రప్రభుత్వం వారు కోరిన విధంగా అవసరమయిన అన్ని ఫయాల్లు, వివరాలు అందిస్తూ సహకరించింది. అందుకే చంద్రబాబు “విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు కేంద్రానికి ఫైళ్ళు పంపుతూ ఎందుకు సహకరించారని ముఖ్యమంత్రిని సభలోనే ప్రశ్నించారు. ఆంధ్ర, తెలంగాణా, డిల్లీ కాంగ్రెస్ నేతలందరు కలిసి ఒకరినొకరు తిట్టుకొంటూ, లోలోన సహకరించుకొంటూ రాష్ట్ర విభజన ప్రక్రియను ఇంతవరకు సజావుగా పూర్తి చేయగలిగారు. ఇక బీజేపీ గనుక బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు కూడా చేస్తారు.   ఇప్పడు చివరిగా దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన కొన్ని స్టేట్మెంటులు కూడా చెప్పుకొంటే కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ విభజించి పాలించు వ్యూహం ఎంత పకడ్బందీగా అమలు చేసిందో అర్ధమవుతుంది.   కిరణ్ కుమార్ రెడ్డి, అతని కుటుంబము కాంగ్రెస్ పార్టీకి చాల విధేయులు, చాల సేవలు అందించారు. ఆయన పార్టీకి అత్యంత నమ్మకస్తుడయిన నాయకుడు.   కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరించేందుకు అంగీకరించారు. ఆయనే దీనిని చివరి వరకు పర్యవేక్షిస్తారు.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం చెప్పినట్లే నడుచుకొంటారని నాకు నమ్మకం ఉంది. మేమే మా నేతలకు విభజన బిల్లుపై తమ అభిప్రాయాలు చెప్పుకొనేందుకు అవకాశం ఇచ్చాము. అందువల్ల ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. కనుక ముఖ్యమంత్రి తో సహా ఎవరిపైనా  చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు.   బిల్లుకి వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీర్మానం చేస్తారని మేము ముందే ఊహించాము. ఆర్టికల్:3 ప్రకారం రాష్ట్ర విభజన చేసే హక్కు కేంద్రానికి ఉంది గనుక, ఆ తీర్మానం వలన బిల్లుకి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

Fate of Telangana bill

బాడీ లాంగ్వేజ్ మారిందహో!

      హ్యూమన్ సైకాలజీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఏదైనా ఒక విషయంలో ఎలాగైనా గెలిచి తీరాలని నానా తంటాలు పడిన వ్యక్తులు ఆ విషయంలో ఏదైనా ఎదురుదెబ్బ తగిలితే ఏం చేస్తారు? మొట్టమొదట పెద్ద షాకవుతారు. తమ ప్లానంతా రివర్సయిపోయిందే అని కుమిలిపోతారు. కల్లోలానికి గురవుతారు. ఇలా అయిపోయిందేంటి దేవుడా అని ఆవేదనకి గురవుతారు. మామూలు తెలివైన వాళ్ళయితే కుమిలిపోతూ ఓ మూల కూర్చుంటారు. అదే మహా ముదుర్లయితే తమ ఆవేదన ఎంతమాత్రం బయట పడకుండా జాగ్రత్తపడతారు. అసలేం జరగనట్టు  చిరునవ్వులు చిందిస్తారు. అసలు జరిగినదాన్ని తామెంతమాత్రం పట్టించుకోనట్టు, చాలా లైట్‌గా తీసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తారు.  అంతకుముందు కంటే ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. తమ మీద విజయం సాధించిన వాళ్ళతోనే జోకులేస్తూ మాట్లాడతారు. ప్రస్తుతం రాష్ట్రంలో విభజనవాదుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఎన్ని అవరోధాలు సృష్టించినా, ఎంత యాగీ చేసినా అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానాన్ని ఆమోదం పొందనీయకుండా చేయడానికి దేనికైనా రెడీ అన్నట్టుగా వున్న విభజనవాదులు అనూహ్యంగా క్షణాల్లో  తీర్మానం ఆమోదం పొందేసరికి ఒక్కసారిగా షాకయ్యారు. కుమిలిపోయారు. కల్లోలానికి గురయ్యారు. అయితే అదంతా ఒక్క క్షణమే. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి బిల్లుని తిరస్కరిస్తూ ఆమోదించిన తీర్మానం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అసెంబ్లీలో చర్చ ముగిసినందున తామంతా చాలా హ్యాపీగా వున్నట్టు మాట్లాడారు. చూడండి.. ఎంత ఉల్లాసంగా వున్నామో.. ఎంత ఉత్సాహంగా వున్నామో అన్నట్టుగా పోజులిచ్చారు.  ఆ తర్వాత వివిధ ఛానళ్ళలో జరిగిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న విభజన వాదులు ప్రపంచంలోని ఉత్సాహమంతా తమ దగ్గరే వున్నట్టుగా కనిపించడం కోసం నానా తంటాలూ పడ్డారు. గతంలో ఇలాంటి డిస్కషన్స్ లో కావాలని గొడవలు పెట్టుకుని చెలరేగిపోయే నాయకులు కూడా చిరునవ్వులు చిందిస్తూ, జోకులు వేస్తూ, సమైక్యవాదులని ‘అన్నా... అన్నా’ అని మర్యాదగా, ప్రేమగా పిలుస్తూ భలే ముద్దొచ్చారు. ఒక మాంఛి ఎదురుదెబ్బ తిన్న విభజనవాదుల బాడీ లాంగ్వేజ్ అయితే మార్చుకున్నారు గానీ, నిజానికి మారాల్సింది రాష్ట్రం విడిపోవాలన్న వాళ్ళ మైండ్ మ్యాపింగ్ అని రాజకీయ విశ్లేషకులు, సమైక్యవాదులు అంటున్నారు.

AP assembly rejects Telangana Bill

మెలికల మాస్టార్లు!

      రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2013 అసెంబ్లీ సభ్యుల మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురైంది. యాస్ పర్ రూల్స్ అండ్ రెగ్యులరేషన్స్ ప్రకారం ‘గౌరవనీయులైన రాష్ట్రపతి గారూ, మీరు రాష్ట్ర పునర్విభజన కోసం మాకు పంపిన బిల్లు అత్యంత పనికిమాలిన, అసంపూర్ణంగా వున్న బిల్లు. అందువల్ల మేం దీన్ని తిరస్కరిస్తూ మీకే తిప్పి పంపుతున్నాం’ అనే అర్థం వచ్చే సందేశాన్నిస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర శాసనభ్యులు తిరస్కరించారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం తమ సహజ శైలిలో విపరీతార్థాలు లాగుతూ, మెలికల మీద మెలికలు వేస్తూ మాట్లాడుతూ ఆత్మానందం పొందుతున్నారు.   అసెంబ్లీ నిర్ణయంతో టోటల్‌గా డంగైపోయిన విభజనవాదుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ అంశాన్ని లైట్‌గా తీసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అంతా మంచే జరిగిందని, ఇక ఢిల్లీలో మా సత్తా చూపిస్తామని చెబుతున్నారు. అసెంబ్లీ తీర్మానానికి అసలు విలువే లేదని, తాము మాట్లాడే మాటలకే బోలెడంత విలువుందని తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగతావాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఏదోలే పాపం అనిసానుభూతితో అర్థం చేసుకోవచ్చు. అయితే బాధ్యతాయుతమైన, కీలకమైన పదవుల్లో వున్నవారు కూడా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఏమనుకోవాలి? శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. సీఎం ప్రవేశపెట్టిన, అసెంబ్లీ ఆమోదించిన బిల్లు తిరస్కరణ తీర్మానం రాష్ట్రపతి దగ్గరకి వెళ్ళదట, అసెంబ్లీ బిల్లు తిరస్కరించిందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే తెలియజేస్తారట. మల్లు భట్టి విక్రమార్క చేసిన ఈ ప్రకటన ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా వుందని, రాజ్యాంగాన్ని ప్రశ్నించేలా వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ తనకున్న ప్రాంతీయాభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి అత్యుత్సాహం చూపించారని భావిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ లాంటి ఉన్నత స్థానంలో వున్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం భావ్యం కాదని అంటున్నారు.

Danam Nagender

దానం.. కాస్త నిదానం!

      రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ దానం నాగేందర్ తన దూకుడు తగ్గించుకుని నిదానంగా వుండాల్సిన అవసరం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో ఆయన నేపథ్యం ఎలాంటిది అయినప్పటికీ, ఆయన ఎంత దూకుడు కలిగిన వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం ఆయన రాష్ట్ర మంత్ర హోదాలో వున్నారు. అందువల్ల ఆ హోదాకి తగ్గట్టుగా వ్యవహరిస్తే పద్ధతిగా వుంటుందని పలువురు భావిస్తున్నారు. కొంతకాలం రాష్ట్ర విభజన వద్దని, మరికొంతకాలం హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, మరికొంతకాలం హైదరాబాద్‌ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని నినదించిన ఆయన ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతూ వుండటంతో వీర విభజన వాదిలాగా తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికలలో అటు సమైక్యవాదులతోపాటు ఇటు విభజనవాదుల ఓట్లు కూడా తన అకౌంట్‌లో వేసుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే రెండు మూడు రోజుల క్రితం తెరాస నాయకుడు కేకే అసెంబ్లీకి వచ్చినప్పుడు దానం గారు ధడేల్‌మని ఆయన కాళ్ళమీద పడిపోయారు. అంత బహిరంగంగా, అంతమంది ప్రజా ప్రతినిధుల మధ్యలో దానం లాంటి మినిస్టర్ తన కాళ్ళమీద బోర్లా పడిపోయినందుకు కేకే ఎంత సంతోషించి వుంటారో, భవిష్యత్తులో తెరాస తరఫు నుంచి దానానికి సహకారం ఎలా దానం చేస్తారో ఎవరైనా ఊహించగలరు. కేకేని కాకాపట్టడంలో దానం ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు అందరినీ ముగ్ధులను చేశాయి. కాకా పట్టడం అంటూ జరిగితే ఈ స్థాయిలో పట్టాలని చాలామంది దానం దగ్గర కాకా పాఠం నేర్చుకున్నారు. అయితే దానం అక్కడితే ఆగితే బాగుండేది. కేకే మీద తన అవ్యాజమైన ప్రేమను ప్రదర్శించడం కోసం ఇతరులను బెదిరించే పనులు కూడా దానం గారు చేపట్టారు. రాజ్యసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు చైతన్యరాజు పోటీలో నిలిచారు. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే చైతన్య రాజు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతన్యరాజు గెలవటం అంటే, తెరాస తరఫున బరిలో వున్న కేకే ఓడిపోతారని అర్థం. ఈ పాయింట్ దానాన్ని ఖిన్నుడిని చేసినట్టుంది. అందుకే దానం చైతన్యరాజు దగ్గరకి వెళ్ళి మర్యాదగా పోటీ నుంచి విరమించుకోవాలని బెదిరించినట్టు మాట్లాడారు. మంత్రి గారి బెదిరింపులతో చైతన్యరాజు మనసు కష్టపెట్టున్నారు. ఆయన కళ్ళలో నీరు కూడా తిరిగినట్టు తెలుస్తోంది. చైతన్యరాజు దగ్గర దానం వ్యవహారశైలి క్షమార్హంగా లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.  

ysrcp leaders scared of jagan

జగన్ బాబోయ్ జగన్!

      తనను చూసి తనని వ్యతిరేకించే పార్టీల వాళ్ళు భయపడాలని వైకాపా నాయకుడు జగన్ కోరుకుంటూ వుంటే వుండొచ్చు. అయితే ఆయన్ని చూసి బయటి పార్టీల వాళ్ళు భయపడే సంగతి అటుంచితే, ఆయన పార్టీలో వాళ్ళే జగన్‌ని చూసి భయపడుతున్నారు. జగన్ పేరు చెబితేనే జగన్ బాబోయ్ జగన్ అంటూ ఉలిక్కిపడుతున్నారు. జగన్ వ్యవహారశైలిని తట్టుకోలేక పార్టీలోని అనేకమంది సీనియర్ నాయకులు మెల్లగా పార్టీలోంచి బయటకి జారుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది ఇప్పటికే ఇతర పార్టీల్లో స్థానాన్ని కన్ఫమ్ చేసుకుని, పార్టీ మారడానికి మంచి మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా చాలామంది ఏ పార్టీలో ఖాళీలున్నాయో వెతుక్కుంటున్నారు.   ఇతర పార్టీలలోనుంచి వైకాపాలోకి జంప్ జిలానీలు అవ్వాలని అనుకున్న కొంతమంది ఇప్పుడు అలాంటి ఆలోచనలు  మానుకుని బుద్ధిగా వున్న పార్టీలలోనే గప్‌చుప్‌గా వుంటున్నారు. ఈ పరిస్థితి ఇలా వుంటే, వైకాపా కార్యకర్తలు జగన్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఆయన మీటింగులూ గట్రాలు ఏవైనా ఏర్పాటు చేస్తే వాటికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే జగన్ చుట్టూ కొంతమంది డిటెక్టివ్ పుస్తకాల్లో వర్ణించేలాంటి  ‘దృఢకాయులు’ వలయంలా వుంటారు. ఎవరైనా అభిమానం ముదిరిపోయి జగన్‌కి దగ్గరగా వస్తే వెనకా ముందూ చూడకుండా వాళ్ళని తుక్కురేగేలా కొడుతూ వుంటారు. వాళ్ళు అలా కార్యకర్తల్ని చావబాదుతున్నా జగన్ గారు ఎంతమాత్రం పట్టించుకోకుండా  చిరునవ్వుతో ముందుకు వెళ్తూ వుంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా సందర్భాలలో తలెత్తడంతో పార్టీ కార్యకర్తలు జగన్‌ దరిదాపుల్లోకి రావాలంటేనే భయపడుతున్నారు. ఈమధ్య ఓ మీటింగ్‌లో తప్పతాగిన ఒక కార్యకర్త గారు జగన్ లేడీస్‌ని మాత్రమే దగ్గరకి రానిస్తున్నారని, వాళ్ళ తలలు మాత్రమే నిమురుతున్నారని, మగ కార్యకర్తలను దగ్గరి కూడా రానివ్వడం లేదని పెద్ద గొంతుతో అరిచేశాడు. అక్కడితో ఆగకుండా జగన్ మీద ఒక రాయి కూడా విసిరేశాడు. దాంతో జగన్ చుట్టూ వున్న దృఢకాయుల బ్యాచ్ సదరు కార్యకర్తని ఎముకల్లో సున్నం కూడా లేకుండా విరగ్గొట్టేశారట. అదీ విషయం!  

Congress

బీటల బాటలో యుపిఎ!

      రెండు పర్యాయాలు పరిపాలించి దేశాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యుపిఏ శకం త్వరలో ముగిసిపోబోతోంది. వచ్చే ఎన్నికలలో యుపీఏ ఉనికే ఉండబోదన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ యుపీఏ ప్రభుత్వం రాబోతోందని, ఆ ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ నాయకత్వం వహించబోతున్నాడని కలలు కంటున్నారు. వీళ్ళ కలలు ఇలా వుంటే, వాస్తవంలో పరిస్థితులు మరోలా వున్నాయి.   ప్రస్తుతం యుపిఏ భాగస్వామ్య పక్షాలుగా వున్న అనేక పార్టీలు వచ్చే ఎన్నికల తర్వాత  కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టే ఉద్దేశంలో లేనట్టు తెలుస్తోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు, కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నీ యూపీయేలోని మిగతా పార్టీల మెడలకు కూడా చుట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన పార్టీలను కూడా శత్రువులుగా చూస్తున్నారు. ఇది యూపీఏలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ఎన్నికలలోపు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనట్టుగానే పోటీలో నిలబడితే మంచిదని అనేక పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యే వ్యూహాలు రచిస్తున్నాయి. లేటెస్ట్ గా కాశ్మీర్‌కి చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రస్తుతం యుపిఎలో వుంది. కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలో మంత్రిగా వున్నారు. అలాగే కాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాకి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోంది. అయితే కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమయ్యే ఆలోచనలో వున్నారు. కాశ్మీర్ పరిపాలనకు సంబంధించినే అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం ఎక్కువ కావడం, తనను శాశించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ వుండటాన్ని ఒమర్ అబ్దుల్లా సహించలేకపోతున్నారు. దాంతో కాశ్మీర్‌కి సంబంధించినంతవరకు కాంగ్రెస్ పార్టీ జోక్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నారాయన. అదేవిధంగా ఈమధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తే కేంద్రంలో యుపీఏలో భాగస్వామిగా వుండే మాట దేవుడెరుగు.. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని కాశ్మీర్‌లో కూడా అధికారం పోయే ప్రమాదం వుందని ఒమర్ అబ్దుల్లా భయపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్టు అర్థమవుతోంది.

 Ex Minister Mareppa fires on Jagan

మాటల తూటాల మారెప్ప!

      ఎంతటివారి మీదైనా మాటల తూటాలు విసరడంలో మాజీ మంత్రి మారెప్ప శైలే వేరు. ఆయన మంత్రిగా వున్నప్పుడు కూడా ఎంతమాత్రం జంకూగొంకూ లేకుండా వాగ్బాణాలు విసిరేవారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే చాలా కామెడీగా వుంటుంది. అయితే ఆ మాటల్లో చాలా లోతు వుంటుంది. ఆ మాటలు ఎవరికి ఎంత లోతు గాయాలు చేయాలో అంత గాయాలు చేస్తూనే వుంటాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా ఎదిగిన మారెప్ప వైఎస్సార్ ఆకస్మిక మరణంతో రాజకీయంగా కొంత వెనకబాటుకు గురయ్యారు.   అయితే వైఎస్సార్ మీద తనకున్న అభిమానాన్ని ఆయన కుమారుడు జగన్ మీద కూడా ప్రసరింపజేశారు. అయితే జగన్ మారెప్ప అభిమానం మీద జెల్లకొట్టాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మారెప్ప  జగన్‌ని తన పిల్లల్ని తానే తినే పాము అంటూ అభివర్ణిస్తూ జగన్ పార్టీకి గుడ్ బై కొట్టేశారు. తాజాగా ఆయన తన మాతృసంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలోని విధానాలు, పరిస్థితుల మీద సూటిగా బాణాలు విసురుతున్నారు. ఈమధ్య రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిట్టింగ్ సభ్యులుగా వున్న కేవీపీ, టీఎస్సార్, ఖాన్‌లకు మరోసారి అవకాశం ఇచ్చింది. దీనిమీద మారెప్ప తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీకి సేవ చేసే వారిని రాజ్యసభకి పంపించకుండా శ్మశానానికి వెళ్ళడానికి సిద్ధంగా వున్న ముసలివాళ్ళకి రాజ్యసభ సీట్లు ఎందుకిచ్చారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మళ్ళీ రాజ్యసభ సీట్లు పొందిన ముగ్గురు పెద్దమనుషుల్నీ ఆయన పేరు పేరున ఘాటుగా విమర్శించారు. వేరే ఎవరైనా ఇలాంటి విమర్శలు చేసి వుంటే సదరు పెద్దమనుషుల అనుయాయులు గయ్యిమని విరుచుకుపడేవారే. అయితే విమర్శలు చేసింది మారెప్ప కావడంతో ఎవరూ కిక్కురుమనడం లేదు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు కాబట్టి ఆయన్ని పార్టీ పరంగా శిక్షించడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ మారెప్ప చేసిన విమర్శలు ఘాటుగా వున్నప్పటికీ, వాటిలో వాస్తవాలు లేకపోలేదన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురి అభ్యర్థిత్వం పట్ల కాంగ్రెస్ పార్టీలోనే భిన్నస్వరాలు గుసగుసల రూపంలో వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు బాహాటంగానే వీళ్ళ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. టీ సబ్బరామిరెడ్డి పార్టీకి ఏ రకంగా ఉపయోగపడ్డారని మళ్ళీ సీటు ఇచ్చారని నిర్మొహమాటంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

Rahul Gandhi first interview

రాహుల్ కామెడీ!

      రాబోయే ఎన్నికల తర్వాత దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కంటున్న రాహుల్‌గాంధీ వ్యవహారశైలి, ఆయన మాట్లాడే తీరు చూసి రాజకీయ వర్గాలు నవ్వుకుంటున్నాయి. ప్రజలు నవ్వాలో ఏడవాలో అర్థంకాక విస్తుపోతున్నారు. ఖర్మకాలి వచ్చే ఎన్నికల తర్వాత ఈయనగానీ దేశ ప్రధాని అయిపోడు కదా అని భయపడిపోతున్నాడు. ఆమధ్య నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని సృష్టించాయి.   రాజకీయ అపరిపక్వతతో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ నెత్తిన బండల్లా మారాయి. ముజఫర్ నగర్ అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే నచ్చలేదు. అలాగే తనకు ప్రాణహాని వుందంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన పిరికిమాటలు ఆయన స్థాయిని చెప్పకనే చెప్పాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేలమట్టం కావడానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు, విచిత్రమైన మాటలు చూసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీదే ఆధారపడి ఆయన్నే కాబోయే ప్రధానిగా ప్రమోట్ చేస్తోంది. సోనియాగాంధీ కొడుకుగా పుట్టిన పుణ్యానికి ఆయనకి దక్కుతున్న అదృష్టమది. లేటెస్ట్‌ గా కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను స్వీకరించిన రాహుల్ ప్రస్తుతం పేపర్లలో ఆఫ్ పేజీ ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఛానెళ్ళలో తన బొమ్మ నిండుగా కనబడేట్టు చూసుకుంటున్నారు. ఈ మధ్య ఒక జాతీయ ఛానెల్లో రాహుల్ గాంధీ ఒక ఇంటర్వ్యూ  ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమాత్రం పరిణతి లేకుండా రాహుల్ చెప్పిన సమాధానాలు నవ్వు తెప్పించేలా వున్నాయని ముక్తకంఠంతో  అంటున్నారు. ఆచితూచి, ఒక పద్ధతి ప్రకారం, ఒక అవగాహనతో మాట్లాడే నరేంద్రమోడీకి  - నోటికి ఏది వస్తే అది మాట్లాడే రాహుల్ గాంధీకి మధ్య పోటీనా అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్‌గాంధీ  ఒక పాపులర్ కమెడియన్‌గా తయారయ్యాడని అంటున్నారు.

 Mothkupalli Likely to Join Congress

అలకలో పిడకలవేట!

      అధికారాన్ని నిలుపుకోవడానికి ఏ అవకాశాన్నీ వదులుకోని శైలి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ ఏ అవకాశమూ లేకపోతే కొత్త అవకాశాలను కల్పించుకునే శైలి కూడా కాంగ్రెస్ పార్టీదే. అత్యుత్సాహంగా తెలంగాణని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఆల్రెడీ గల్లంతైపోయింది. విభజన పాపాన్ని మూటగట్టుకున్నప్పటికీ తెలంగాణ ప్రాంతలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని, వచ్చే ఎన్నికలలో ఇప్పుడున్న సీట్లు కూడా వచ్చే ఆశలు లేవని ఈమధ్య జరిగిన కొన్ని సర్వేలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గెలిచే అవకాశాలున్న ఇతర పార్టీల నాయకులను లాక్కోవడానికి పథకాలు వేస్తోంది.   టీఆర్ఎస్‌తో ఒకవైపు విలీనం చర్చలు జరుపుతూనే ఆ పార్టీ నాయకులను బుట్టలో వేసుకునే పనులు ముమ్మరం చేసింది. తెలుగుదేశం నాయకులను కూడా ఆకట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. లేటెస్ట్ గా రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేయలేదని అలిగిన మోత్కుపల్లి నర్సింహులు మీద కాంగ్రెస్ పార్టీ కన్ను వేసింది. మోత్కుపల్లి అలిగినట్టు ఇలా సమాచారం వచ్చిందో లేదో కాంగ్రెస్ పార్టీ మోత్కుపల్లిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఎవరు కాస్తంత అలిగినా వాళ్ళ మీద ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడానికి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహపడిపోతూ వుంటుంది. గతంలో ఎర్రబెల్లి అలిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆశలు పెట్టుకుని స్వాగత ద్వారాలు తెరిచింది. అయితే ఎర్రబెల్లి మాత్రం అవసరమైతే రాజకీయాల్లోంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని బతుకుతా తప్ప కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. అయినా జ్ఞానోదయం కలగని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నాయకుల మీద గాలాలు, వలలు విసురుతూనే వుంది.  తాజాగా మోత్కుపల్లి మీదకి వల విసిరింది. ఈసారి కూడా కాంగ్రెస్ వల చిరిగిపోయే ఛాన్స్ వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Venkaiah cheppina vedham

వెంకయ్య చెప్పిన వేదం!

      రాష్ట్ర విభజన విషయంలో భారతీయ జనతాపార్టీ మనసు మారుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పిన మాటలు మొన్నటి వరకూ నమ్ముతూ వచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఈ విషయంలో అసలు వాస్తవాలను తెలుసుకుంది. అందుకే బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి గానీ, కిషన్ రెడ్డి నుంచి గానీ తెలంగాణ విషయంలో ఏకపక్ష ప్రకటనలు రావడం లేదు. తెలంగాణ రావాల్సిందే.. కానీ సీమాంధ్రుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని ఇప్పుడు బీజేపీ కొత్త పల్లవి పాడుతోంది.   తెలంగాణ విషయంలో పేనుకు పెత్తనం ఇచ్చినట్టు కిషన్‌రెడ్డికే మొత్తం అధికారం ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బోడిగుండులా అయిపోయింది. దాంతో ఇంతకాలం మౌనం వహించిన బీజేపీ అగ్ర నాయకుడు వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. తెలంగాణ విషయంలో బీజేపీ చేసిన పొరపాట్లను సరిదిద్దే పనిలో ఆయన ప్రస్తుతం వున్నారు. కేంద్రం పంపిన తెలంగాణ బిల్లు తప్పుల తడకలా వుందని, ఈ బిల్లు ఇటు తెలంగాణ వారికి గానీ, అటు సీమాంధ్ర ప్రజలకు గానీ ఆమోదయోగ్యంగా లేదని వెంకయ్య నాయుడు చెబుతూనే వున్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందేమోనన్న భయం మొన్నటి వరకూ సీమాంధ్ర ప్రజల్లో వుండేది. అయితే వెంకయ్య నాయుడు రంగప్రవేశం చేసిన తర్వాత ఆ భయం తగ్గింది. బుధవారం నాడు విజయవాడలో వెంకయ్య ఏర్పాటు చేసిన బహిరంగసభ సీమాంధ్రులలో ధైర్యాన్ని కలిగించింది. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత సులభం కాదన్న విషయం కూడా స్పష్టమైంది. వెంకయ్య నాయుడు వేదం లాంటి ఒక మాట అన్నారు. ‘‘ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియాగాంధీ భారతదేశాన్ని ఏలుతోంది. విజయవాడలో పుట్టినవాడు హైదరాబాద్‌లో వుండకూడదా?’’ అని వెంకయ్య అన్న మాట సీమాంధ్రులలో ధైర్యాన్ని ఎంతగానో పెంచింది. కాంగ్రెస్ పార్టీ చేయాలని తలపెట్టిన అడ్డగోలు విభజనకు భారతీయ జనతాపార్టీ ఒప్పకోదన్న నమ్మకం ఇప్పుడు సీమాంధ్రులలో మరింత బలపడుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని, తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ నుంచి కాపాడగలిగే కీలక వ్యక్తుల్లో వెంకయ్య నాయుడు కూడా ఒకరు.

దుద్దిళ్ళ వారి తంటాలు!

      మావోయిస్టుల చేతిలో అన్యాయంగా చనిపోయిన తన తండ్రి దుద్దిళ్ళ శ్రీపాదరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడం మినహా రాజకీయంగా ఎలాంటి చరిష్మాలేని వ్యక్తి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అని రాజకీయ వర్గాలు భావిస్తాయి. గతంలో రాజకీయాల గురించి ఓనమాలు కూడా తెలియని ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నా, మంత్రి అయ్యారన్నా దానికి కారణం ఆయన ప్రతిభ కాదు.. ఆయన తండ్రి మీద ప్రజలకి వున్న సానుభూతే కారణమంటారు. ‘నీ తండ్రికి పట్టిన గతి మరచిపోయావా?’ అని జేఏసీ నాయకుడు కోదండరామ్ బెదిరించడం వల్లనో, నలుగురితోపాటు నారాయణలా వుండాలన్న ఉద్దేశం వల్లనో గానీ శ్రీధర్‌బాబు తాను కూడా తెలంగాణ రాగం ఆలపించారు.   తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడు కాబట్టి ఏదో తెలంగాణ పాట పాడుతున్నారులే అని మొన్నటి వరకూ అందరూ అనుకున్నారు. అయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌బాబు తెలంగాణ బిల్లు విషయంలో  అతిగా అధికారాలను చేతిలోకి తీసుకోవడంతో మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవిని పోగొట్టుకుని తాను చేసిన త్యాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి పదవి రూపంలో ప్రతిఫలాన్ని పొందాలని శ్రీధర్‌బాబు ఆశస్తున్నట్టు ఆయన వ్యవహారశైలి చూస్తుంటే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వస్తుందో రాదో తెలియని తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోవాలని ఇప్పటికే పాతికమందికి పైగా తెలంగాణ నాయకులు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ సంగతి అలా వుంచితే, కాంగ్రెస్ పార్టీలోనే ఆ లిస్టు చేంతాడంత పొడవుంది. ఆ లిస్టులో మొదటి స్థానంలో వుండటానికి శ్రీధర్‌బాబు తపన పడుతున్నారు. అవకాశం కల్పించుకుని మరీ ముఖ్యమంత్రి మీద విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ హీరోలా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అయితే ఒకవేళ తెలంగాణ వచ్చినా శ్రీధర్‌బాబుని పక్కకి నెట్టేసే శక్తులు చాలా వున్నాయని, ఆ వాస్తవాన్ని గ్రహించలేక శ్రీధర్‌బాబు అనవసరంగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ సీమాంధ్ర ప్రజల అభిమానాన్ని కోల్పోతున్నారని విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్‌కి దగ్గొచ్చింది!

      ఇప్పటికే అనేక అనేక రోగాలు, రొష్టులతో మంచాన పడే స్థితిలో వున్నరాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి మరో వ్యాధి కూడా తగులుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌కి అకస్మాత్తుగా ‘దగ్గు’ పట్టుకుంది. ఆ దగ్గుతో కాంగ్రెస్ నాయకులందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ మందు వాడితే ఈ దగ్గు దగ్గుతుందో అర్థంకాక ఖళ్ళుఖళ్ళుమంటూ దగ్గుతూనే చికిత్స కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ని వేధిస్తున్న ఆ దగ్గు పేరు దగ్గుబాటి దంపతులు.   రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు మొదటి నుంచి దగ్గుబాటి దంపతులకు ఇబ్బందికరంగానే తయారైంది. మరోవైపు విశాఖ సీటు నాదేనని సుబ్బరామిరెడ్డి చేసిన నానా యాగీ ఈ దంపతులకు కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి కలిగేలా చేసింది. కేంద్ర మంత్రి హోదాలో వున్న దగ్గుబాటి పురంద్రీశ్వరి రాష్ట్ర విభజన విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చారు. అయితే సీమాంధ్రుల హక్కులకు భంగం కలిగితే ఎంతమాత్రం సహించేది లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రజల హక్కుల విషయంలో పురంద్రీశ్వరి చేసిన సూచనలన్నీ బుట్టదాఖలు చేసి కేంద్రం ఏకపక్ష బిల్లును రాష్ట్రానికి పంపింది. దీంతో తీవ్రంగా హర్టయిన దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీ మీద విముఖతను మరింత పెంచుకున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ఆలోచనలో వున్నారన్న అభిప్రాయాలు వారి అనుయాయుల నుంచి వ్యక్తమయ్యాయి. నిజానికి సుబ్బరామిరెడ్డి తన యాగీకి ఫుల్‌స్టాప్ పెట్టకుండా వుండి వుంటే కాంగ్రెస్ పార్టీకి వీరిద్దరూ ఎప్పుడో గుడ్ బై కొట్టేసేవారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా ప్రజల్లో తమకున్న గౌరవమే తమని రాజకీయాలలో విజయాలు సాధించేలా చేస్తోందే తప్ప, కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలు కాదని ఈ దంపతులు భావిస్తున్నారు. తాజాగా దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టుగా, వారికి తెలుగుదేశం పార్టీ ఆహ్వానం పలుకుతున్నట్టుగా పర్చూరులో వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్ర రాజకీయ రంగంలో సంచలనం సృష్టించాయి. ఈ ఫ్లెక్సీలు ఎవరు పెట్టి వుంటారన్న విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  రాష్ట్ర విభజనకు ఉత్సాహం చూపించి అడ్డంగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీలో వుంటే కుక్కతోక పట్టుకుని రాజకీయ గోదారి ఈదినట్టే అవుతుందని దగ్గుబాటి దంపతుల సన్నిహితులు భావిస్తున్నారు. ఈ దంపతులు తెలుగుదేశంలోకి రావడం రాష్ట్ర రాజకీయాలలో శుభ పరిణామమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చిన్న చిన్న ఇగోలు వదులుకోవడం తప్ప వీరు తెలుగుదేశంలోకి రావడానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భావిస్తున్నారు. దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను కొంతమంది ఖండిస్తున్నప్పటికీ, నిప్పు లేకుండా పొగ రాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడటం అంటూ జరిగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశం వుంది.

కూకట్‌పల్లి బరిలో అశోక్‌బాబు?!

      జేపీ పప్పులు ఇక కేపీలో ఉడకవని అర్థమైపోతోంది. గత ఎన్నికలలో జయప్రకాష్ నారాయణ్‌ని ప్రేమగా గెలిపించిన కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకరోజు రాష్ట్ర విభజనకు అనుకూలంగా, మరోరోజు వ్యతిరేకంగా మాట్లాడే జేపీ కేపీ ప్రజల మనసులను బాధపెట్టారు. రీసెంట్‌గా అసెంబ్లీలో విభజన బిల్లు చర్చలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా జేపీ మాట్లాడిన తీరు స్థానికంగా మెజారిటీగా వుండే సీమాంధ్ర ప్రజల మనసులు విరగ్గొట్టేసింది. రాబోయే ఎన్నికలలో జేపీకి తగిన పాఠం చెప్పాలని కూకట్‌పల్లి ఓటర్లు భావిస్తున్నారు.   హైదరాబాద్‌లో వున్న సీమాంధ్ర ప్రజల గుండె చప్పుడును అసెంబ్లీలో వినిపించాల్సిన జయప్రకాష్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని కూకట్‌పల్లి ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జేపీ తన రాజకీయ భవిష్యత్తును కూకట్‌పల్లిలోనే వెతుక్కుంటూ వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఈమధ్య లోక్‌సత్తా విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికలలోనూ గెలవాలని భావిస్తున్న కేపీ కలలు కల్లలయ్యే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కలవటానికి జేపీ చూపిస్తున్న ఉత్సాహం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారి మీద ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలో అట్టర్ ఫ్లాప్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టు కట్టడానికి జేపీ చూపిస్తున్న చొరవని ఎవరూ హర్షించడం లేదు. ఈ నేపథ్యంలో కూకట్‌పల్లి సీటు మీద రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టిని నిలిపాయి. సమైక్య ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్న పరుచూరి అశోక్‌బాబుని ఈ నియోజకవర్గం నుంచి జేపీకి పోటీగా నిలపాలనే ఆలోచన అన్ని పార్టీల్లోనూ మొగ్గతొడిగింది. దీనికి సంబంధించి అశోక్‌బాబును ఒప్పించడానికి, తమ పార్టీవైపు అశోక్‌బాబును లాక్కోవడానికి ప్రయత్నాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అశోక్‌బాబు రాజకీయాల్లో చేరనని చెబుతున్నప్పటికీ ఎన్నికల సమయానికి అశోక్‌బాబును జేపీ మీద పోటీకి ఆయన్ని ఒప్పించవచ్చన్న ఆశావాదం రాజకీయ పార్టీల్లో కనిపిస్తోంది. దీనికితోడు ఈమధ్య కాలంలో జేపీని కూకట్‌పల్లిలో ఓడించే అభ్యర్థిని నిలబెడతామని అశోక్‌బాబు ప్రకటించారు. ఆ అభ్యర్థి వేరేవెరో ఎందుకు అవ్వాలి.. అశోక్‌బాబే ఎందుకు కాకూడదన్న ఆలోచనలో రాజకీయ వర్గాలు వున్నాయి.

చైతన్యరాజు వెనుక చాణక్యులు ఎవరు?

      ప్రస్తుతం రాష్ట్ర విభజన నాటకం రాష్ట్రంలో మాంఛి రసపట్టులో వుండగానే, తెలుగు ప్రజలకు రాజ్యసభ ఎన్నికల రూపంలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందుతోంది. రామాయణంలో పిడకల వేటలా, సినిమాలో ఉండే ఉపకథలా తయారైన రాజ్యసభ ఎన్నికల ప్రహసనంలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలను చూసి ప్రజలకి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. రాజ్యసభ సీట్లకు తుమ్మబంక రాసుకుని కూర్చున్నట్టు సెటిలైపోయిన ముగ్గురు ‘పెద్ద’ మనుషులకు మళ్ళీ రాజ్యసభ టిక్కట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిని రగిలిస్తోంది.     నిన్నటి వరకూ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తామని గంట మోగించిన గంట, హారన్ మోగించిన జేసీ దివాకర్‌రెడ్డి ప్రస్తుతం చప్పుడు చేయకుండా వుండిపోయారు. ఎమ్మెల్సీ చైతన్యరాజు మాత్రం తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలబడ్డారు. రాముడు మంచి బాలుడిలా అధిష్ఠానం అడుగుజాడల్లో నడిచే చైతన్యరాజు ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థిగా నిలబడటం వెనుక కాంగ్రెస్ అంతర్గత రాజకీయం చాలా భారీ స్థాయిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాకినాడలో ట్రిపుల్ ఐటీ శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి పల్లంరాజు మంత్రిత్వశాఖలో వుండే ఈ సంస్థలో చైతన్యరాజు భాగస్వామిగా వున్నారు. పల్లంరాజు ఆశీస్సులతోనే చైతన్యరాజుకు ఈ సంస్థలో భాగస్వామ్యం దక్కిందనేది బహిరంగరహస్యం. ఇప్పుడు చైతన్యరాజు తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలబడటం అధిష్ఠానం దగ్గర పల్లంరాజుకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం వుంది. ఇది తెలిసినా చైతన్యరాజు బరిలో నిలిచాడంటే, చైతన్యరాజు అభ్యర్థిత్వం వెనుక పల్లంరాజు హస్తం కూడా వుండే అవకాశం వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్ఠానం దగ్గర ఎప్పుడూ తన పట్టును కోల్పోకుండా నెగ్గుకొస్తున్న కేవీపీని ఈ ఎన్నికలలో దెబ్బతీయడానికే చైతన్యరాజును రంగంలోకి దించారా అనే అనుమానాలను కూడా రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చైతన్యరాజుకు సీఎం ఆశీస్సులు కూడా వుండే అవకాశాలను కూడా తీసిపారేయాలేమని అంటున్నారు. చైతన్యరాజు బరిలో నిలవటం వెనుక మరో వ్యూహం కూడా వుండే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతోపాటు జగన్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా కలిస్తే చైతన్యరాజు గెలిచే అవకాశం వుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే కాంగ్రెస్, వైకాపా తెరచాటు స్నేహం బయటపడే అవకాశం వుంది. అందువల్లే ఒక తిరుగుబాటు అభ్యర్థిని రంగంలోకి దించి, ఆ అభ్యర్థికి వైకాపా ఎమ్మెల్యేల ఓట్లు వేయించాలన్న ఆలోచన ఉన్నట్టు కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలా చేయడం ద్వారా వైకాపా మద్దతుతో మరో రాజ్యసభ స్థానాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వుందని అంటున్నారు. ఈసారి రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏవేవో గజిబిజి వ్యూహాలు వేస్తూ తన సంఖ్యాబలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బుర్ర తిరుగుడు వ్యూహాలు సామాన్య ప్రజలకు ఎంతమాత్రం కొరుకుడుపడటం లేదు.