సొంతింట పట్టులేక.. పొరుగుకు నల్లారి పరుగు

  ఇంట గెలవకనే రచ్చ గెలిచేందుకు పోయినట్టుంది మాజీ సీఎం కిరణ్ వ్యవహారం. ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ బుధవారం పురుడు పోసుకుంటోంది. ఇందుకు గోదావరి తీరం రాజమండ్రి వేదిక కానుంది. రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన సొంత జిల్లాలోని తిరుపతిని కాకుండా అయన రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు పట్టులేకపోవడమే అని విమర్శకులు అంటున్నారు. మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీపై గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై గానీ ఎప్పుడూ పట్టులేదు. జిల్లా ప్రజల్లోనూ తనదంటూ ముద్ర వేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపించడమంటే ఇంట గెలవకనే రచ్చ గెలిచే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తరువాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఇచ్చిన జిల్లాను, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే అపవాదును మాజీ సీఎం మూటగట్టుకుంటున్నారు. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర రాజధానికే పరిమితమయ్యారు.

కప్పలకు తీసిపోని రాజకీయ నేతలు

    భూమి గుండ్రంగా ఉన్నట్లుగానే తాము మళ్ళీ తెదేపాలోకే వచ్చిపడ్డామని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆనంద బాష్పాలు రాలుస్తూ చెప్పిన మాటలు అక్షరాల నిజమే. అయితే భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణం చేయడానికి ఒకరోజు పడితే, ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీల చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తవడానికి ఐదేళ్ళు అంటే ఎన్నికల నుండి మళ్ళీ ఎన్నికల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ ఐదేళ్ళు పూర్తయి ఎన్నికలు వచ్చేసాయి గనుక అనేకమంది నేతలు స్వంత గూళ్ళు వెతుకొంటూ తిరుగుతున్నారు. అయితే పార్టీ సిద్దాంతాలకు, ఆశయాలకు అతీతులయిన చాలా మంది నేతలు మాత్రం అన్ని పార్టీలను తమ స్వంత పార్టీలుగానే భావిస్తూ ఎందులో బెర్తు కన్ఫర్మ్ అయిపోతే అందులో ఎక్కేసి సెటిల్ అయిపోతుండటంతో, అక్కడ ఆల్రెడీ చాలా కాలంగా రుమాళ్ళు, దుప్పట్లు వేసుకొనున్న వాళ్ళు అలిగి వేరే గూట్లోకి జంపైపోతున్నారు. వాళ్ళ రాకతో మళ్ళీ ఆ పార్టీలో కూడా అదే సీను రిపీటవుతోంది. అంటే నేతలందరూ ఉన్న ఈ నాలుగు పార్టీల మధ్య పరుగులు తీస్తూ నాలుగు స్తంభాలాట లేదా మ్యూజికల్ చేయిర్స్ ఆట ఆడుకొంటున్నారని అర్ధమవుతోంది. వారి జంపింగ్స్ అన్నీ పూర్తిగా కవర్ చేయాలంటే ఈ మూడు నెలలు ప్రత్యేకంగా కాలమ్స్ కానీ వీలయితే ప్రత్యేక పత్రికలూ గానీ పెట్టుకోక తప్పదు.   ఇప్పుడు అసలు కధలోకి వస్తే, తెదేపాలోకి టీజీ వెంకటేష్ వచ్చిపడగలిగినందుకు ఆనంద బాష్పాలు రాలిస్తే, కర్నూల్ టికెట్ కోసం ఆశపెట్టుకొన్న రాంభూపాల్ చౌదరి తనకు చంద్రబాబు హ్యాండిచ్చారని కన్నీళ్లు కార్చారుట. అదేవిధంగా అనంతపురం ఎమ్.పి వెంకట్రామిరెడ్డిని వైకాపాలోకి వచ్చిపడటంతో, అదే ప్రాంతానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే. గురునాధరెడ్డి హార్ట్ అయిపోయి దేనిలోకో దానిలోకి వెంటనే జంపైపోయేందుకు డిసైడ్ అయిపోయినట్లు తాజా వార్త. ఆయన దేనిలోకి జంప్ చేస్తే అక్కడి నేత కూడా ఆయన లాగే హర్టయ్యిపోయి, మళ్ళీ వేరే పార్టీలోకి జంపైపోవడం ఖాయం. గనుక ఈ భాగోతాలు సైకిల్ చక్రంలా తిరుగుతూనే ఉంటాయి.   తాజా సమాచారం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట తెదేపా ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి తెరాసలోకి జంపయ్యారు. తెలంగాణ జెఎసి కో ఛైర్మన్ గా ఉన్న శ్రీనివాసగౌడ్ కి కేసీఆర్ మహబూబ్ నగర్ నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ చేసేయడంతో ఆ నియోజక వర్గం ఇన్ చార్జీగా ఉన్న ఇబ్రహిం బాగా అప్ సెట్టయిపోయినట్లు తాజా సమాచారం.   ఇక కిరణ్ కొత్తపార్టీ ఇంకా రాజమండ్రీలో మొదటి సభ పెట్టుకొని పార్టీ గురించి, అందులో జనాల గురించి చెప్పుకోక మునుపే, దానికీ అప్పుడే బోణీ అయిపోయింది. నిన్నటి దాక ఆయనకు హ్యాండ్ పట్టుకొని తిరిగిన రాజమండ్రి నగర శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు, ఆయనకు హ్యాండిచ్చేసి వైకాపాలో చేరిపోయారు.   ఇక తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ మీద మనసు పారేసుకొన్నారని తెలియగానే, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అలర్టయిపోయి, ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని అప్పుడే రోడ్డెక్కినట్లు లేటెస్ట్ అప్ డేట్స్ ఉన్నాయి. మరికొద్ది సేపటి లో దిగ్విజయ్ సింగ్ ఆంద్ర, తెలంగాణాలకు పీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించగానే బహుశః ఈ లిస్టులో మరిన్ని కొత్త పేర్లు వ్రాసుకోవలసి ఉంటుందేమో!

ఒంటరి పోరాటానికే కమలం సై

  తెలుగుదేశం పార్టీ సహా అనేక పార్టీల ఆశలపై బీజేపీ నీళ్లు చల్లేసింది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయిస్తోంది. తమ రాష్ట్రశాఖ అలాగే భావిస్తోందని, జాతీయస్థాయిలో కూడా తమను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం పొత్తుల విషయంలో తీసుకోరని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న అసెంబ్లీలో మూడు స్థానాలు మాత్రమే కలిగి ఉండి, రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ స్థానం కూడా లేకపోయినా.. తెలంగాణా రాష్ట్రం తమవల్లే వచ్చిందన్న ప్రచారంతో ఈసారి నేరుగా పోటీ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. తమ పార్టీ టికెట్లకు కూడా బోలెడంత డిమాండ్ ఉందని, ఒక్కో చోట అయితే ఐదారుగురు కూడా పోటీ పడుతున్నారని అంటున్నారట. ఇక సీపీఎం తరహాలోనే రెండు ప్రాంతాలకు రెండు శాఖలను ఏర్పాటుచేసే ప్రయత్నాలలో బీజేపీ పడింది. తెలంగాణా, ఆంధ్రా శాఖల పేర్లతో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.

కృష్ణా జడ్పీ మహిళల పరం

  కృష్ణా జిల్లా పరిషత్ పీఠంపై మరోసారి మహిళ కాలు మోపనుంది. ఇప్పటివరకు జరిగిన జడ్పీ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే మహిళకు అవకాశం దక్కింది. ఇప్పుడు మరోసారి మహిళ ఆ పీఠాన్ని అధిష్టించనుంది. కృజిల్లాలో 49 మండలాలు ఉండగా 21 స్థానాలు జనరల్‌కు, 13 బీసీలకు, 13 ఎస్సీలకు, రెండు ఎస్టీలకు కేటాయించారు. కృష్ణాజిల్లా పరిషత్ 1960లో ఏర్పడగా, 1962లో చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1964 సెప్టెంబర్ 11న జిల్లా పరిషత్ చైర్మన్‌గా పిన్నమనేని కోటేశ్వరరావు ఎంపికై 1976 జనవరి 19 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1987 నుంచి జడ్పీ చైర్మన్‌ను నేరుగా ఎన్నుకునే పద్ధతి ప్రారంభమైంది. దాదాపు 19 సంవత్సరాల పాటు పిన్నమనేని చైర్మన్‌గా పనిచేశారు. 1995లో కడియాల రాఘవరావు, 2000లో ఎస్సీ మహిళలకు కేటాయించడంతో నల్లగట్ల సుధారాణి జడ్పీ చైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత బీసీలకు వెళ్లడంతో కుక్కల నాగేశ్వరరావు చైర్మన్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు జనరల్ మహిళలకు ఆ సీటు వెళ్లింది.

రంగంలోకి జే గ్యాంగ్?

  జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్లు ఉన్న వారిలో చాలా మంది లోటస్ పాండ్ గూటికి చెరుతున్నారు. ఆ కేసులతో తమకు సంభంధం లేదని కోర్టుకు విన్నవించుకున్న వారందరూ ఒక్కక్కరిగా జే గ్యాంగ్ లో చేరుతున్నారు. జైలులో ఉన్నప్పుడే మాజీ మంత్రి మోపిదేవి చేరికకు రంగం సిధ్ధమైంది. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత జగన్ పార్టీలో చేరిన వారిలో ఎక్కువ మంది సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్నవారే ఉన్నారు. జగన్ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టు సేకరించారనే అభియోగాలు ఎదుర్కొన్న కేవీపీ వియ్యంకుడు రఘురామక్రిష్ణ రాజు వైసీపీలో చేరినట్టే చేరి గోడకు కొట్టిన బంతిలా వచ్చి బీజేపీలో పడ్డారు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపేది తానే అన్నంత బిల్డప్ ఇచ్చే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా తన అన్న కృష్ణదాస్ ధర్మాన జే గ్యాంగ్ లో చేరిపొయారు. యెమార్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన కోనేరు ప్రసాద్ కూడా యువనేత సమైక్యాంద్ర నినాదం నచ్చి వైసీపీ కండువా వేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నయ్య అధికారంలోకి వస్తే కేసుల నుంచి బయటపడొచ్చు అనే ఆలోచనతోనే వీరంతా వైసీపీలో చేరుతున్నారని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్లున్న వారంతా ఒకే గూటికి చేరడం వెనుక ఏదో మతలబు ఉందని గొణుక్కుంటూ ఉన్నారు సామాన్యులు. క్విడ్ ప్రోకోతో వీరికి సంబంధం లేకపోతే జగన్ తో విభేదించాలి కానీ జే గ్యాంగ్ లో ఒకరిగా మారిపోవడం గూడు పుఠానీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందని చెవులు కొరుక్కుంటున్నారు.

Politics for out-of-work stars

      Looks like politics is becoming a haven for out-of-work and retired movie stars. With senior actor Krishnam Raju already joining BJP, we have one more entry-actor Rajasekhar and his wife Jeevitha, who has formally joined the BJP on Monday in the presence of BJP State leader Kishen Reddy.   Now this couple, who have made a full circle and touched the doors of all political parties except CPI, started with the TDP and then joined the Congress during the YSR regime. In between there was a fallout with actor Chiranjeevi and they were on backlash against him and his brother Pawan Kalyan which they even stated in an interview with a prominent news channel about his rude behavior and this has seen Pawan Kalyan imitating how Rajasekhar speaks with an accent in his block buster movie Gabbar Singh and ultimately the PRP merging with the Congress is past history. Post YSR’s death they were seen hobnobbing with Jagan’s YSRC Party.   who made use of the couple’s star status and if rumors are to be believed he was not happy with the extra attention that Rajasekhar got during an event and sidelined them. They were lost for some time and tried to get back to TDP but with no credible status and the lack of support from the inside TDP cadre they moved back. With both of them attending the prestigious Statue of Unity project one-day workshop by the BJP recently it was understood they were getting into the BJP mode. Rajasekhar’s film career is known to be on the downfall with no hit to his credit and also known for his eccentricities he has put forward Jeevitha in the front end with her joining the party formally. Known to be an eloquent speaker and  whether she will be given a party ticket is yet to be seen except for adding to the glam-quotient to the rallies and public meetings conducted by the party. Actress Roja is another meanderer, who first joined the TDP and was also the Woman Wing President of Telugu Mahila Party. She lost during the 2009 state elections, and in August 2009, she quit  the TDP and joined Congress Party. She also quit the Congress party showed her open support to Y. S. Jaganmohan Reddy's political party YSR Congress Party during the political turmoil after he was sidelined by the Congress High Command. Excepting for adding to the glamour we have to wait and see if any of these actors are capable of contesting in the forthcoming elections.

Is Legend eyeing top post in TDP?

  Recently, CH Ramesh, the Balakrishna Fans’ Association President has demanded TDP (Chandrababu) to handover the party reins to Balakrishna. They blame Chandrababu for using his services and his star image for in party campaigning but not giving his due share of power in the party. It stirs a controversy in the party circles and lead to rumors about they both having differences between them. Media adding fuel to flames reports that Balakrishna has intentionally did not invited Chandrababu to his Legend audio release function held recently.   However, Balakrishna has condemned the reports of having differences with Chandrababu and hushed up the controversy with his explanation. But, it is to be observed that though he condemned the reports about differences with Chandrababu, he did not condemn the demands raised by his fans for his appointment as party President. So, it is evident that he too agrees with their demand or at least is hoping for some key post in the party or an immediate announcement by Chandrababu about his ticket and constituency.   But, Chandrababu may be planning to announce the names of the party candidates once, he strikes poll alliance with BJP soon. However, he may not afford to elevate him as Party President, even after creating two separate branches of the party in near future, because Balakrishna can't dedicate his full time to party due to his obligation of his film profession. So, his fans can think about their demand only if he agrees to retire from his film profession.

కొత్త పార్టీలు తెదేపాతో సహకరించాలి: బాబు

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పవన్, కిరణ్ కొత్త పార్టీల గురించి నిన్న ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఆపుతానని ప్రగల్భాలు పలుకుతూ, అంతా అయిపోయిన తరువాత చేతులెత్తేసారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలను ఉద్దరిస్తానంటూ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఏమీ చేయలేనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి ఏమి చేయగలరు ఓట్లను చీల్చడం తప్ప? మహా అయితే ఆయనకు ఒక నాలుగయిదు సీట్లు వస్తాయేమో? కొత్తగా వస్తున్న పార్టీలకు ఓట్లు వేయడం వలన విలువయిన ప్రజల ఓట్లు వృధా అయిపోవచ్చును. కొత్త పార్టీలు పెట్టి ప్రజలలో సదిగ్ధం సృష్టించడం కంటే, వారు తేదేపాకు సహకరించినట్లయితే అందరూ కలిసి రాష్ట్ర పునర్మిర్మాణం చేసుకోవచ్చును,” అని అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, తమతో చేతులు కలిపి సహకరించితే బాగుటుందని సూచిస్తున్నట్లే భావించవచ్చును.   పవన్ కళ్యాణ్ కూడా తెదేపాతో చేతులు కలిపేందుకు సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తనకు కనీసం 15 యం.ఎల్యే. మరియు 3-4 యంపీ టికెట్స్ కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లయితే తెదేపాలో చేరడమో లేక ఆపార్టీకి మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే, తెదేపా నేటికీ బీజేపీతో ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తోంది. కనుక, కొన్ని టికెట్స్ పవన్ కళ్యాణ్ కి, మరికొన్ని బీజేపీకి, మరికొన్ని కాంగ్రెస్ నుండి తరలి వస్తున్న నేతలకీ పంచుకొంటూ పోతే ఇక తెదేపాలో ఉన్నవారికెవరికీ టికెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చును. అందువల్ల మహా అయితే 4-5 సీట్లు కేటాయించేందుకు మాత్రం చంద్రబాబు అంగీకరించగలరు. కానీ, పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఏర్పాటుకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పొట్లూరి వరప్రసాద్ విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నందున, ఆయనకు విజయవాడ టికెట్ ఇవ్వాలని పవన్ పట్టుబడితే, తెదేపా ఇవ్వలేదు. కనుక పవన్ తెదేపాతో జత కట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చును.   ఏమయినప్పటికీ, కిరణ్, పవన్ కళ్యాణ్ ల రంగప్రవేశంతో సీమాంధ్రలో రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం. ఈ పాత, కొత్త పార్టీల ప్రభావంతో ప్రజల ఓట్లు చీలడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడటం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే పరితపించిపోతున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, తమవల్లనే ఓట్లు చీలి, ఎవరికీ మెజార్టీ రాకుండా చేసుకొని, రాజకీయ అస్థిరతను సృష్టించడానికి సిద్దపడుతుండటం చాలా శోచనీయం. ఇప్పటికే చాల దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం, ఈ రాజకీయ నేతల, పార్టీల స్వార్ధం, అధికార కాంక్ష కారణంగా ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఒక సుస్థిరమయిన ప్రభుత్వం ఏర్పడలేకపోతే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయం. ఈ సంగతి గ్రహించిన చంద్రబాబు అందుకే ఇటువంటి సూచన చేసారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడదని ఆయనకీ తెలుసు.   రాజకీయ పార్టీలు వాటిని నడిపే నేతల మధ్య సత్సంబంధాలు, సరయిన అవగాహన, రాష్ట్ర ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే, కాంగ్రెస్ అధిష్టానం ఇంత సాహసించగలిగేదే కాదు. రాష్ట్రానికి నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు. అందువల్ల ఇప్పుడు వారి నుండి కొత్తగా ఏమీ ఆశించలేము.

జగన్ అన్నయ్య వదిలేసిన బాణం

  అక్రమాస్తుల కేసులలో జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో పార్టీని జనంలో లైవ్ గా ఉంచేందుకు లోటస్పాండ్ బ్యాచ్ అద్బుతమైన ఐడియాతో ముందుకు వచ్చింది. "జగన్ అన్న వదిలిన బాణం ట్యాగ్ లైన్" తో సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రను ప్రారంభించారు. తమ పార్టీ లక్ష్యం కోసం 'జే-గ్యాంగ్' తలపెట్టిన యాత్రను ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. మరో ప్రజా ప్రస్థానం యాత్రతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. జగన్ జైల్లో ఉన్నా.. పార్టీ బలోపేతానికి కృషి చేసింది.   బెయిల్ వచ్చింది .. మడమ తిప్పాడు..   జైలు నుంచి జగన్ అన్నయ్య బయటి రావడంతోనే చెల్లెమ్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమైంది. తనకంటే ఎక్కువ సోదరికే ఫాలోయింగ్ ఉందని తెలుసుకున్న అన్నయ్య లక్ష్మణరేఖ గీసాడని .. వైఎస్ అభిమానులు గుసగుసలాడుకుంటు న్నారు. పాదయాత్ర ద్వారా తాను చేసిన కృషికి మెచ్చి పార్టీలో కీలక బాధ్యతలతో పాటు, తను ఆశిస్తున్న టికెట్ కూడా జగనన్న ఇస్తాడని ఆశించిందట. సీట్లన్నింటికీ ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకున్న జగన్.. సోదరికి సారీ చెప్పి మరోసారి చూద్దాం అన్నాడట.. అలిగిన చెల్లెమ్మ పార్టీ కార్యక్రమాలకు దూరమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేమీ కాదు.. తనను ఓవర్ టేక్ చేస్తుందనే భయంతో జగన్ చెల్లెలిని దూరం పెట్టారని చెవులు కొరుక్కుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. మరో ప్రజా ప్రస్థానానికి జగన్ అన్నయ్య వదిలిన బాణం కాస్తా .. జైలు నుంచి రిలీజయ్యాక జగన్ అన్నయ్య వదిలేసిన బాణంలా అయిపోయిందని సెటైర్లు వినపడుతున్నాయి. కడప జిల్లా అభ్యర్ధుల జాబితాను జగన్ ప్రకటించేశారు. అందులో షర్మిల పేరు లేదు. జేసీ దివాకర్ రెడ్డి ఆరోపణలు వాస్తమైతే తరువాత జాబితాలో కూడా చెల్లెలికి సీటు దక్కక పొవచ్చు.

సీమాంధ్ర రాజకీయాలపై పవన్, కిరణ్ ఎఫెక్ట్

  మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని తాజా సమాచారం. ఈ పేరుని శ్రీహరి రావు అనే వ్యక్తి కొన్ని నెలల క్రితమే ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరుని కిరణ్ పేరిట బదలాయించినట్లు తెలుస్తోంది.   అయితే రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోతున్న ఈ తరుణంలో కూడా కిరణ్ తన పార్టీకి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ అని పేరు ఎంచుకోవడం గమనిస్తే, ఆయన ప్రజలలో ఉన్న సమైక్య భావనలను, సెంటిమెంటుని వాడుకొనేందుకు సిద్దపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అదీగాక ఆయన శాశ్విత ప్రాతిపాదికన రాజకీయపార్టీ ఏర్పాటు చేయదలచుకొంటే వేరే మరేదయినా పేరుని ఎంచుకొని ఉండేవారు. కానీ, ఈ సమైక్యభావనలు ఎల్లకాలం ఉండబోవని, ప్రజలలో సమైక్యవేడి క్రమంగా చల్లారుతున్నదని తెలిసినప్పటికీ, ఆయన ఇటువంటి పేరుని ఎంచుకోవడం చూస్తే ఆయన తాత్కాలికంగానే ఈ పార్టీని నెలకొల్పుతున్నారని అర్ధమవుతోంది. అంటే ఎన్నికల తరువాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం ఖాయమని భావించవచ్చును.   అయితే మరి కేవలం రెండు మూడు నెలల కోసం ఇంత భారీ ఖర్చు చేసి, ఇంత శ్రమపడి పార్టీని ఎందుకు స్థాపిస్తున్నారు అంటే ఎన్నికలలో ఓట్లు చీల్చి కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువయిన తెదేపాను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం, వీలయితే తన అధిష్టానం కోసం తన వంతుగా మరి కొన్ని యంపీ సీట్లు సాధించిపెట్టడానికేనని చెప్పుకోవచ్చును. అయితే ఆయన ప్రధానంగా తెదేపాకు నష్టం కలిగించాలని పార్టీ పెడుతున్నపటికీ, ఆయన వల్ల తెదేపా కంటే కాంగ్రెస్ అధిష్టానం తో రహస్య అవగాహన కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వారిరువురూ కూడా తెలుగువారి ఆత్మగౌరవం, సమైక్యవాదం కోసం తామే పోరాడుతున్నామని చెప్పుకొంటూ ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు గనుక వారి మధ్య ప్రజల ఓట్లు చీలిపోవచ్చును. అదేవిధంగా ఇద్దరు కూడా రెడ్డి కులస్తులే గనుక ఆ కులస్థుల ఓట్లు కూడా వారిరువురి మధ్య చీలిపోయే అవకాశం ఉంది. కానీ, మిగిలిన పార్టీలలో టికెట్స్ దొరకని అసంతృప్తి నేతలందరూ చివరికి కిరణ్ కుమార్ గూటికే చేరుకొనే అవకాశం ఉంది గనుక ఈ రెండు నెలల సమయంలో కిరణ్ పార్టీ మరింత బలపడితే అప్పుడు ఆయన పార్టీ వల్ల తెదేపాకు కూడా నష్టం తప్పకపోవచ్చును.   ఇక కమ్మ, కాపు, యస్సీ యస్టీ, బీసీ మరియు ఇతర కులస్థులు, మైనార్టీ వర్గాల ఓట్లు ప్రధానంగా తెదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్యే చీలవచ్చును. కానీ, రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారందరూ తెదేపా వైపే చూసే అవకాశం ఉంది. కానీ, ఒకవేళ తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే, జగన్ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపి మైనార్టీ వర్గాలను తనవైపు తిప్పుకొన్నట్లయితే, పోటీ చాలా తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు వీరందరి నడుమ పవన్ కళ్యాణ్ కూడా పోటీలోకి ప్రవేశిస్తుండటంతో, అతని ప్రభావంతో ముందుగా కాంగ్రెస్, ఆ తరువాత వరుసగా తెదేపా, వైకాపా, కిరణ్ పార్టీలు కూడా కొంత మేర నష్టపోయే అవకాశం ఉండవచ్చును. అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మారే రాజకీయ సమీకరణాలు, పార్టీల వ్యూహాల కారణంగా ఈ అంచనాలు కూడా మారిపోవచ్చును.  

తెరాసతో సమరానికి టీ-కాంగ్రెస్ సై

  కొద్ది రోజుల క్రితం తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోమని కుండ బ్రద్దలు కొట్టారు. అయితే, పొత్తులు ఉండవని చెప్పకుండా కమిటీయే చూసుకొంటుందని తెలివిగా తప్పుకొన్నారు. తాము పొత్తులకు అంగీకరించినా టీ-కాంగ్రెస్ నేతలు ఎలాగు అంగీకరించరని కేసీఆర్ ముందే ఊహించారు. వారికి దక్కవలసిన టికెట్స్, మంత్రి పదవులు అన్నీ తామే ఎగురేసుకొని వేల్లిపోతామనే భయంతో వారే పొత్తులు వద్దని తమ అధీష్టానానికి చెప్పుకొంటారని కేసీఆర్ ఊహించారు. అందుకే తెలివిగా పొత్తులు లేవని చెప్పకుండా బంతి కాంగ్రెస్ కోర్టులో పడేసారు. ఆయన ఊహించినట్లుగానే ఈరోజు మాజీ మంత్రి జానా రెడ్డి ఇంట్లో సమావేశమయిన టీ-కాంగ్రెస్ నేతలు తెరాసతో పొత్తులు తమకు అవసరం లేదని, తాము ఒంటరిగానే పోరాడి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలమని ప్రకటించారు.   జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అయితే ఇతర పార్టీలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నదున వాటి పాత్రా ఉందని మేము అంగీకరిస్తున్నాము. కానీ, ఇతర పార్టీలు ఎంత పోరాటం చేసినాకూడా కాంగ్రెస్ ఇవ్వదలచుకోకపోతే తెలంగాణా ఏర్పడేదే కాదని అందరికీ తెలుసు. కనుక ప్రధానంగా ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. తెలంగాణా ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తారని మేము నమ్ముతున్నాము. అందువల్ల మాకు ఎవరి మద్దతు, పొత్తులు అవసరం లేదు. మా అంతట మేమే మా పార్టీని పూర్తి మెజార్టీతో గెలిపించుకొని తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తాము. తెలంగాణా పునర్నిర్మాణం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది తప్ప ప్రాంతీయ పార్టీల వల్ల కాదు."   "ఒకవేళ మా అధిష్టానం కేంద్ర రాజకీయ అవసరాల నిమిత్తం ఎవరితోనయినా ఎన్నికల పొత్తులు పెట్టుకోదలిస్తే మేము ఎటువంటి అభ్యంతరమూ చెప్పము. అందుకు తప్పకుండా సహకరిస్తాము," అని తెలిపారు.

గల్లీ టు డిల్లీ .... ఎనీ సెంటర్ .. ఎనీ పార్టీ..

  విడిపోయే ముందు రాష్ట్రానికి ఎన్నికలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో పార్టీలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. గల్లీ టు డిల్లీ .... ఎనీ సెంటర్ .. ఎనీ పార్టీ.. నుంచి పోటీ చేసే అవకాశాలు అంగడిలోకి వచ్చి పడ్డాయి. ఆలసించినా .. ఆశాభంగం.. మంచి తరుణం మించిన దొరకదు. పార్టీ జెండాలు భుజాన వేసుకుని కాళ్ళరిగేలా తిరిగిన కార్యకర్తలకు ఎట్టకేలకు ఎన్నికల కదన రంగంలోకి దూకే అవకాశం అంది వచ్చింది.   నల్లారి నాన్చుడుతోనే.. తాజా మాజీ ముఖ్యమంత్రి నల్లారి నాన్చుడు ధోరణి పుణ్యమా అని ఎప్పటి నుంచో నిర్వహించకుండా అట్టిపెట్టిన మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఇచ్చింది. మరో పక్క సార్వత్రిక ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6న జెడ్పీ.. మండల ఎన్నికలు? (ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు), ఏప్రిల్ 30న తెలంగాణలో.. మే 7న సీమాంధ్రలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 5 వారాల తేడాలో 5 రకాల ఎన్నికలను అధికారులు నిర్వహించబోతున్నారు.   ఒక్క మన రాష్ట్రంలోనే ఎన్నికల నిర్వహణకు వేలకోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకటి కాకపోతే .. ఇంకొకటి ... ఏళ్ళు తరబడి.. వార్డు నుంచి ఎంపీ స్థానం వరకూ నేతలు పాతుకు పోయారు. కొత్త పార్టీలు లేవు. ఏ ఎన్నిక జరిగినా.. ఓడినా, గెలిచినా వారే అభ్యర్ధులు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వరుస ఎన్నికలు, కొత్త కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. డబ్బుంటే చాలు.. మా పార్టీ టికెట్ ఇస్తాం అంటూ అభ్యర్ధులు వెంట పార్టీ తిరిగే పరిస్థితి. డబ్బు, ఆశక్తి ఉండాలే గాని, కార్పొరేటర్ గా ఓడిపోతే .. ఎంపీటీసీ/జెడ్పీటీసీగా పోటీ చేయొచ్చు. ఇక్కడా గెలవకపోతే ఎమ్మెల్యే/ఎంపీగా పోటీ చేశే అవకాశమూ మిగిలే ఉంది.

ప్రతి ఒక్కరికీ పరీక్షలే

  అవును.. ఇది అందరికీ పరీక్షా కాలమే. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. రాజకీయ నేతలు.. పార్టీలకు కీలక పరీక్షలు ఒకేసారి వచ్చాయి. తమ భవితకు, ఉన్నత చదువుల మెట్టు ఎక్కేందుకు విద్యార్థులకు పదోతరగతి పరీక్ష.. బిడ్డల జీవితాలపై ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులకూ ఇది అగ్ని పరీక్ష.. పదవుల కుర్చీ ఎక్కేందుకు నేతల జాతకాలకు ఎన్నికల పరీక్ష.. మనుగడ కోసం రాజకీయ పార్టీలకు ఇదే కీలక పరీక్ష.. ఇలా అందరికీ ఒకేసారి పరీక్షా కాలం ముంచుకొచ్చింది.   ఈసారి మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు అన్నీ ఒకేసారి రావడం.. అదీ విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడం చిత్రమైన పరిస్థితి. ఎన్నికలు వచ్చాయంటే టీచర్ల పాత్ర అందులో చాలా ఉంటుంది. వారు ఎక్కువగా ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ సరిగ్గా పరీక్షలకు ముందు అలా వెళ్లిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమం సాగడంతో దాదాపు వంద రోజులకు పైగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రైవేటు క్లాసులు పెట్టినా సిలబస్ పూర్తికాలేదు. అరకొర చదువులతోనే పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన దుస్థితి దాపురించింది. దీనికితోడు కరెంటు కోతలు, ఎన్నికల వాతలు విద్యార్థుల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

చిత్తూరు కాంగ్రెస్ నేతలకి కిరణ్ పార్టీ వల

  చిత్తూరు జిల్లా రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పడవ నుంచి దూకేసిన ఎమ్మెల్యేలు ఏ ఒడ్డుకు చేరుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. దరి ఎంపిక చేసుకునే సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత కుంపటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో అయోమయం చోటుచేసుకుంది. కొత్త పార్టీ ప్రకటన తర్వాత కిరణ్ సోదరుడు కిషోర్ పావులు కదపడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పలువురితో మంతనాలు జరిపినట్టు తెలిసింది.   గంగాధరనెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, చిత్తూరు ఎమ్మెల్యేలు గుమ్మడి కుతూహలమ్మ, డాక్టర రవి, షాజహాన్‌బాషా, సీకే.బాబులు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మాత్రం ఒక అడుగు ముందుకేశారు. శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అనుచరులతో హైదరాబాద్ చేరుకున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ రవి, అరుణమ్మతో పాటు టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగిన ప్పటికీ ఆయన ప్రస్తుతానికి ముఖం చాటేసినట్టు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు.   కిరణ్‌కుమార్‌రెడ్డితో గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ భేటీ అయ్యారు. మధ్యాహ్నం కిరణ్ ఇంటికి వెళ్లిన ఆమె గంటకు పైగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే కిరణ్‌తో భేటీ కావడం అనుమానాలకు తావిస్తోంది. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా రెండు రోజులుగా అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగిస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాల వైపు కూడా దృష్టి సారించారని సమాచారం.   చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఇంకా గుంభనంగా వ్యహరిస్తున్నారు. ఆయన ఎటువైపు మొగ్గుతారనేది ఊహకు అందడం లేదు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికలపై ఆయన దృష్టి సారించారు. ఈ కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని సీకే అనుచరవర్గాలు అంటున్నాయి. నగరి మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి చెంగారెడ్డి పరిస్థితి కూడా ఇంతే. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేరని ఆయన అనుచరవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కిరణ్ పార్టీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు చర్చలు జరిగినట్టు తెలిసింది.

అన్నదమ్ముల సవాల్

  పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం వేదికా రెండూ ఖరారయిపోయాయి. మార్చి14, హైదరాబాదులోని మాదాపూర్ హైటెక్స్ లో ఆయన వర్తమాన రాజకీయాలపై ప్రసంగించిన తరువాత తన పార్టీని ప్రకటిస్తారు.   ఇక ఆయన పార్టీ పెట్టడంపై రామ్ చరణ్ స్పందిస్తూ “బాబాయి పార్టీ పెట్టడం అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. నాకు రాజకీయాలపై సరయిన అవగాహన లేదు. నేను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఆయనకు ఎప్పుడు మద్దతు ఇస్తాను. అయితే రాజకీయంగా నాన్నగారికే మద్దతు ఇస్తాను,” అని అన్నారు. రామ్ చరణ్ మాటలను బట్టి చూస్తే, ఈ విషయంలో మెగా కుటుంబంలో మరి కొంత దూరం పెరగబోతోందని స్పష్టమవుతోంది.   నిరుడు ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం తరపున ప్రచారంలో పవన్ కళ్యాణ్ “కాంగ్రెస్ నేతలందరినీ పంచెలూడదీసి తరిమితరిమి కొట్టాలి” అని ఎద్దేవా చేసారు. కానీ తను ఎంతో ఉన్నతంగా ఊహించుకొన్న అన్నగారు చిరంజీవి కేంద్రం మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ షాకయ్యాడు. అప్పటి నుండే వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. మళ్ళీ మొన్న రాష్ట్ర విభజన సందర్భంగా చిరంజీవి వ్యవహరించిన ద్వంద వైఖరితో ఆయనకు మానసికంగా కూడా దూరమయ్యాడు. ఆవిషయం మొన్న నాగబాబు కుమారుడు సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో స్పష్టంగా బయటపడింది.   ఇప్పుడు అన్నగారు చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా పోరాడేందుకు ఆయన పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతుండటంతో ఇక ఆ దూరం మరింత పెరిగి ఎన్నికల సమయానికి అది శత్రుత్వంగా మారే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయకపోడు. అప్పుడు కాంగ్రెస్ నేతలు అతను చిరంజీవి సోదరుడని విడిచిపెట్టలేరు కనుక వారు తీవ్రంగానే విమర్శించవచ్చును. ఇది మెగా బ్రదర్స్ ముగ్గురికీ, వారి కుటుంభ సభ్యులకు, వారి అభిమానులకు కూడా చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు కల్పించడం ఖాయం.

కొత్త వి"నాయకులు"

  వినాయక చవితి వస్తోందంటే చాలు.. ఉత్సవ కమిటీలు హడావిడి అంటా ఇంతా కాదు. పోటాపోటీగా పందిర్లు ఏర్పాటు, విద్యుద్దీపాలంకరణతో ఊరూ వాడా మెరిసిపొతాయి. దోనీ గణపతి, రోబో గణేష్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు గణపతి విగ్రహాలను తీర్చిదిద్ది నిలుపుతారు. అందరూ పూజించేది వినాయకుడినే .. కొలిచేది విఘ్ననాయకుడినే .. గణేష్ నవరాత్రులలో మాత్రం వీధికి ఒకలా గణనాధుడు మనకు కనిపిస్తాడు. కొత్త దేవుడండీ ..సరికొత్తా దేవుడండీ అని భక్తులు పాడుకొనేలా వీధి మారేసరికి గణపతి రూపాలు కూడా మారిపోతాయి. గతేడాది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల నేపధ్యంలో గణపతి కూడా సీమాంధ్ర, తెలంగాణా రూపాలను సంతరించుకున్నాడు. ప్రస్తుతం విభజన పూర్తి అయిపోయింది. దగ్గరలో వినాయకచవితి కూడా లేదు. కానీ సరికొత్త వినాయకులు పుట్టుకొస్తున్నారు. ఈ వినాయకులు ఎవరని మీరు ఆశ్చర్యపోవద్దు. మన దేశంలో ఏ పని కావాలన్న వినాయకుడి మాదిరిగానే వీరినే ముందు దర్శించుకోవాలి. దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. దక్షిణ సమర్పించుకోవాలి. ఆనక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ పూర్తి అయితే స్వాముల అనుగ్రహం పొంది కోరుకున్న పని జరుగుతుంది. వీరి దర్శనం అయితే ఇంకా శివుడిని ప్రార్ధించాల్సిన పని కూడా అంతగా ఉండదు. ఆయన రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో రాష్టపతి లాంటి వాడు. ఆమోదముద్ర వేసి పారేస్తాడు.   రాజకీయ నవరాత్రోత్సవాలు వంటి ఎన్నికలకు ప్రకటన వెలువడింది. ఊరుకో రాజకీయ వి"నాయకుడు" కొలువైపోతున్నాడు. ఇందులో ప్రజల విఘ్నాలు తొలగించేది ఎందరో, దక్షిణలు, నైవేద్యాలు మింగేసి దయాదాక్షిణ్యాలు లేకుండా దోచుకునేది ఎందరో భక్తులైన ఓటర్లకు కొద్దిరోజుల్లో తత్త్వం బోధపడనుంది. ఎన్నికల నవరాత్రోత్సవాలు ముగిసేసరికి జనం కొంత మంది నేతాగ్రేసరులను నిమజ్జనం చెసేస్తారు. ఇవన్నీ కొత్తా దేవుళ్ళం అనిపించుకునేందుకు ఈ ఎన్నికల్లో చాలా మంది బరిలోకి దిగుతున్నారు.   మ్యాచ్ అయిపోలేదని అందరినీ చివరి బంతి వరకూ గ్రౌండ్లో కూర్చో పెట్టి ప్రత్యేక రాష్రం సినిమాను శుభం కార్డు పడేవరకు చూపించిన నల్లారి వారు పార్టీ పెడుతున్నారు. నిజమండీ నమ్మండీ .. స్వయంగా ఆయనే చెప్పేశారు. ఎన్నికల తరువాత కిరణ్ అనే వినాయకుడు కాంగ్రెస్ లో నిమజ్జనం కాక తప్పదని తెలుగు తమ్ముళ్ళు మైకు పట్టుకు అరుస్తున్నారు. జైలు..బెయిల్ పార్టీగా టీడీపీ నేతలు వర్ణిస్తున్న వై సి పీ కూడా 10 జనపథ్ ఆలయంలో విలీనం జరిగితీరుతుందని.. దమ్ముంటే బెట్టింగ్ కాయమంటున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వచ్చిన చిరంజీవి ..ప్రజరాజ్యం పార్టీ స్థాపించి.. వై ఎస్ రాజ్యం ఏర్పడేందుకు ప్రత్యక్షంగా సహకరించాడు. పరోక్షంగా టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు మన అందరివాడు. పార్టీ లక్ష్యం నెరవేరకపోయినా ..తన ‘చిరు లక్ష్యం’ మాత్రం నెరవేర్చుకున్నారాయన. ఓటడిగే ఎన్నిక నుంచి చాటుమాటుగా ఎన్నికయ్యే రూటు చేరుకున్నాడు. కాంగ్రెస్ అనే మహాసముద్రంలో తన ప్రజా రాజ్యాన్ని నిమజ్జనం చేశాడీ వినాయకుడు.   ఎన్నికలకు ముందు తన సైన్యం బరిలో దిగుతుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో వింత వినాయకుడి అవతారం ఎత్తనున్నాడు. అన్న మాదిరిగానే ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ ఎవరిని పవర్ కు దూరం చేస్తాడో అనే టెన్షన్ తో పాత వినాయకులు బిక్క చచ్చిపోయున్నారు. పవన్ ఎవరి పుట్టి ముంచుతాడో అనే భయంతో పార్టీలన్నీ ఎన్నికల నవరాత్రోత్సవ జాగారం చేస్తున్నాయి.   ప్రాంతం కార్డుతో మరికొన్ని పార్టీలు, కులం పేరుతొ ఇంకొన్ని పార్టీలు తమ వినాయకులను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి వినాయకచవితికి ఘనంగా పూజలు అందుకునే వినాయకు విగ్రహాలను నవరాత్రోత్సవాలు ముగిసిన వెంటనే నిమజ్జనం ఆనవాయితీ. ఆలాగే ప్రతి ఐదేళ్ళకు ఓసారి జరిగే ఎన్నికల వేడుకల సందర్భంగా కొత్త దేవుళ్ళను నిమజ్జనం చేస్తారు జనం. మరికొందరు వినాయకులు శివాలయాల్లాంటి జాతీయ ప్రాంతీయ పార్టీల కార్యాలయాల ప్రాంగణాలకు చేరుకొని ఉత్సవ విగ్రహాల్లా పూజలు అందుకుంటున్నారు.   ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్ , కాసాని జ్ఞానేశ్వర్, చిరు ప్రజారాజ్యం, విజయశాంతి తల్లి తెలంగాణా, లక్ష్మిపార్వతి, హరికృష్ణ వంటి వారు స్థాపించిన పార్టీలు ఇప్పుడు వికీపీడియా లో వెతికినా దొరకవు. మరి కొత్తా పార్టీలు పెట్టే వారంతా పాత వినాయకులుగానే మిగిలిపోతారా.. లేదంటే గణేష్ మహారాజ్ కీ జై అనిపించుకుంటారా? అనేది ప్రజాస్వామ్యానికి మహా భక్తులైన ఓటఋ మహాశయులు తేలుస్తారు.

దగ్గుబాటి రాజకీయ సన్యాసం...ఎందుకు?

  రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో పెట్టేందుకు రాష్ట్ర విభజన అంశం ఎత్తుకొన్న సోనియాగాంధీ, అందుకోసం సీమాంధ్రలో తన పార్టీని, పార్టీ నేతల భవిష్యత్తుని బలిగోనేందుకు కూడా వెనుకాడలేదు. ఆమె పుణ్యామాని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు చెల్లచెదురయిపోతే, మరికొందరు ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకోక తప్పలేదు. పాము తన పిల్లలని తానే తిన్నట్లుగా ఉందిది. ఇప్పటికే లగడపాటి రాజకీయ సన్యాసం స్వీకరించగా ఇప్పుడు మరో కరడుగట్టిన కాంగ్రెస్ వాది దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ మరియు కుటుంబ కారణాల రీత్యా తను రాజకీయ ల నుండి తప్పుకొంటున్నట్లు ఆయన తెలిపారు.   అయితే నిన్ననే దగ్గుబాటి దంపతులిరువురూ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించి, మళ్ళీ ఇంతలోనే ఆయన మనసు మార్చుకొని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పరుచూరు శాసనసభ నియోజక వర్గం నుండి మళ్ళీ పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసినందున, త్వరలో బీజీపీ సీమాంధ్ర శాఖను ఏర్పాటు చేసినట్లయితే ఆయనకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మంచి తరుణంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకోవాలని భావించడం వెనుక బలమయిన కారణాలే ఉండి ఉండవచ్చును.       ప్రస్తుతం బీజేపీ-తెదేపాలు ఎడమొహం పెడమొహంగా ఉన్నపటికీ, త్వరలోనే ఆ రెండు ఎన్నికల పొత్తులు పెట్టుకోవచ్చును. ఒకవేళ ఆయన బీజేపీలో చేరినట్లయితే, ఏదో ఒక సందర్భంలో తను వ్యతిరేఖించే తన తోడల్లుడు చంద్రబాబుతో పార్టీ వ్యవహారాల నిమ్మితం కలవ వలసి ఉంటుంది. బహుశః అది ఇష్టం లేని కారణంగానే ఆయన బీజేపీలో చేరేందుకు వెనుకాడి ఉండవచ్చును. అయితే అందుకు రాజాకీయ సన్యాసం తీసుకోనవసరం లేదు. ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా నయినా పోటీ చేసి గెలువవచ్చును. కానీ, రానున్న ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమయిన మెజార్టీ రాని పక్షంలో, ఆయన అయిష్టంగానయినా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయవలసి రావచ్చును. అటువంటి బేరసార రాజకీయాలకు బొత్తిగా ఇష్టపడని కారణంగానే ఆయన రాజకీయాల నుండి తప్పుకొని ఉండవచ్చును.  

మళ్ళీ బాలయ్య గోల?

  నటసింహం మరోసారి జూలు విదిల్చింది. నందమూరి వారసుల బాటలోనే బాలకృష్ణ పయనిస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కోసం బాలయ్య పోరాడాల్సిన పని ఉందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్ మాదిరిగానే పార్టీ అంతర్గత విషయాన్ని రచ్చ చేశారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభిమానులు. యెన్బీకే ఫ్యాన్స్ పేరుతో వివిధ జిల్లాల్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు నిర్వహించిన సమావేశాలు సంచలనం సృష్టించాయి. కంటి చూపుతో చంపేస్తానని సినిమాలో విలన్లను బెదిరించే బాలయ్య బాబు.. కనుసన్నల్లోనే అభిమానులు ఆందోళనకు దిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అభిమానులు డిమాండ్ చేయడం తెలుగుదేశం శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది.   గతంలోనూ చాలా సార్లు అలక పాన్పు ఎక్కిన బాలకృష్ణ ... మళ్ళీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీయార్లు పార్టీకి హ్యాండ్ ఇచ్చే సమయంలో బాలయ్య ఒక్కడు బాబుతోపాటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. బాబు బాలయ్యకు బావ మాత్రమే కాదు.. వియ్యంకుడు కూడా..పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా ఎప్పుడూ బాలయ్య మాట్లాడింది లేదు. అలాంటిది పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలో బాలయ్య అభిమానుల ఆందోళన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పార్టీలో కీలక పాత్ర పోషించాలనుకుంటే బాబుతో మాట్లాడవచ్చు.. తన అల్లుడైన లోకేష్ తో మాట్లాడి ఉండవచ్చు.. ఇవేమీ చేయకుండా అభిమానులతో ఆందోళన ఎందుకు చేయించారనే దాని చుట్టే టీడీపీ నేతల ఆలోచనలు సాగుతున్నాయి.   బాబు దగ్గర మాట చెల్లుబడి కాని నేతలు కొందరు బాలయ్య పంచన చేరి..తెర వెనుక ఉంది డ్రామాలు ఆడిస్తున్నారని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా నందమూరి నాయకుడి అసమ్మతి రాగం బాలయ్య..బాలయ్యా గుండెల్లో గోలయ్య అంటూ టీడీపీ నేతల గుండెల్లో మార్మోగుతోంది. తెగే దాకా లాగే బాబు గారు ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతారో అనే ఆశక్తితో చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఓ పక్క టీడీపీలోకి భారీగా ఇతర పార్టీ నేతలను ఆహ్వానిస్తూ .. పసుపుపచ్చ కండువాలు కప్పేస్తున్నారు బాబు. మరో పక్క తెలంగాణాలో సైకిల్ పార్టులు ఒక్కొక్కటిగా "కారు"లో తరలించుకుపొతున్నారు.   రాష్ట విభజన నేపధ్యంలో సామాజిక తెలంగాణా, అవశేష ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం తనతోనే సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. టీడీపీ అధికారంలోకి వస్తే కొత్త రాష్ట్రం, రాజధాని పునర్ నిర్మాణం సాధ్యమని సీమాంద్ర జనాలు కూడా ఆశతో ఉన్నారు. ఇదే సెంటిమెంట్ తనకు కలిసొస్తుందని బాబు అందుకు తగిన వ్యూహాలు రచించుకుంటున్నారు. తెలంగాణలో నేతలు జారిపోతున్నా, కేడర్ ను కాపాడుకుని పార్టీని నిలబెట్టాలని విశ్వప్రయత్నం చెస్తున్నారు.   ఇంత కీలక సమయంలో బాలయ్య గొడవ బాబుకి చికాకు పెట్టె అంశమే. తెలుగుదేశంలో ఎన్టీయార్ కుటుంబం ప్రతినిధిగా ఉన్న బాలయ్య మనసెరిగి మసులుకుంటే అన్నగారి అభిమానుల అభిమానం చూరగొనొచ్చు .. అదే సర్దుకుంటుంది అని వదిలేస్తే.. ప్రత్యర్హి పార్టీలకు బాలయ్యకు అన్యాయం అనే మరో విమర్సనాస్త్రాన్ని అందించినట్టవుతుంది. మరి బాబుగారు ఏమి చేస్తారో?

కాంగ్రెస్ తో మజ్లిస్ తలాక్ దేనికో

  కాంగ్రెస్.. మజ్లిస్ పార్టీల మధ్య పొత్తు పూర్తిగా చెడిపోయింది. హైదరాబాద్ మేయర్ పదవికి మహ్మద్ మాజిద్ హుస్సేన్ సోమవారం రాజీనామా చేస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎలాగోలా ఆ పార్టీతో పొత్తును కొనసాగించాలని పీసీసీ చీఫ్ బొత్స మంతనాలు సాగించినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. పాత ఒప్పందం ప్రకారమే మేయర్ రాజీనామా చేస్తున్నా.. డిప్యూటీ మేయర్ పదవి తీసుకోడానికి కూడా మజ్లిస్ నేతలు ఆసక్తి చూపించలేదు. దీన్నిబట్టి చూస్తే ఇక కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పడానికి ఎంఐఎం సిద్ధమైపోయినట్లే ఉంది. ఇప్పటికే ఆ పార్టీ కార్యాలయం దారుస్సలాం వద్ద పూర్తిస్థాయిలో సందడి కనిపిస్తోంది. తెలంగాణలో క్రియాశీల పాత్ర పోషించేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. గతంలో జగన్ తనకు మంచి స్నేహితుడని అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తన ఉనికిని చాటుకోడానికి మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాకే మజ్లిస్- కాంగ్రెస్ పార్టీల మధ్య చెడిపోయింది. ప్రధానంగా కొన్ని భూముల విషయమే వివాదానికి కారణమైందని అప్పట్లో వినిపించింది. ఈసారి టీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఒక కూటమిగా ఏర్పడొచ్చని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా పాతబస్తీకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మజ్లిస్ భావిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు యాదవ వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారిని ఎంఐఎం తరఫున ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి కనీసం 3 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది.