rahul gandhi

యువరాజవారి ప్రవచనాలు

  యువరాజవారు “నాన్సెన్’ అని అన్నంత మాత్రానే ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు సైతం చిరిగి చెత్త బుట్టలోకి తరలిపోతాయి. ఆయన కనుసైగ లోక్ పాల్ బిల్లు ఎగురుకొంటూ పార్లమెంటు ఆమోదం పొందేస్తుంది. ఆయన తీక్షణంగా చూస్తే చాలు...కొమ్ములు తిరిగిన కేంద్ర మంత్రులు కూడా తత్తరపడుతూ తమ పదవులకు రాజీనామాలు చేసేసి, పార్టీ సేవకి బిరబిరా పరుగులు తీస్తారు. మరి ఇంత పవర్ఫుల్ యువరాజవారు మనదేశంలో అనేక వ్యవస్థలు కొంత మంది వ్యక్తుల చెప్పుచేతలలో నడవడం చాలా అన్యాయమని వాపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఎఫ్‌ఐసిసిఐ -ఫిక్కీ) సమావేశంలో యువరాజవారు దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలను పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం, వ్యవస్థలో అవినీతి పీల్చిపిప్పి చేసేస్తున్నాయని పాపం! చాలా బాధపడిపోయారు.   ఇంత బాధపడుతున్నమన మోస్ట్ పవర్ఫుల్ యువరాజవారు ఉల్లిపాయలు మొదలు బియ్యం, పప్పులు, నూనెల వరకు ప్రతీ వస్తువుల ధరలు రెక్కలు కట్టుకొని ఆకాశానికి ఎగిరిపోతూ సామాన్యుడి బ్రతుకుభారం చేస్తుంటే మరి దానిని అరికట్టడానికి ఆయన ఏమి చేసారు? ఆయన ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తున్నశరత్ పవార్ మహారాష్ట్రలో ఉల్లి, చెరుకు, పంచదార మార్కెట్లను తన గుప్పిట్లో పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తుంటే యువరాజవారు ఎందుకు చూస్తూ ఊరుకోవలసి వచ్చింది?   కోట్లాది ప్రజలు, పసిపిల్లలు ఒకపూట అన్నానికి కూడా నోచుకొక ఆకలి చావులు చస్తుంటే, మరోవైపు గోదాములలో లక్షలాది టన్నుల బియ్యం, గోధుమలు ముక్కిపోతుంటే కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అదిలించినా యువరాజవారు ఎందుకు మేల్కొనలేదు? సమస్యలను గుర్తించినప్పుడు వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా, పేదరికం గురించి, సామన్యుల సమస్యలు, కష్టాల గురించి ఎంతో బాధపడిపోతూ ఎన్నిఊకదంపుడు ఉపన్యాసాలు చేసినా వాటివలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు.   అధికారం, ప్రభుత్వం అన్నీతన చేతిలో ఉంచుకొని, “సమస్యలు తీర్చవలసి ఉంది. అవినీతిని తొలగించవలసి ఉంది. అధిక ధరలు తగ్గించవలసి ఉంది. ప్రభుత్వం పనిచేయవలసి ఉంది” అంటూ ప్రజల వద్దకు వచ్చి చెప్పడం తమ చేతకాని తనాన్ని ప్రదర్శించుకోవడమే.   ఇస్రో శాస్త్రవేత్తలు ఒక ఉపగ్రహ ప్రయోగంలో విఫలమయితే, అది ఎందుకు విఫలమయిందో తెలుసుకొని ఆలోపాలను సవరించుకొంటూ ముందుకు సాగుతున్నందేనే నేడు వారు మనదేశానికి గర్వకారణమయిన ‘మంగళ యాన్’ న్ని దిగ్విజయంగా ప్రయోగించగలిగారు. మరి అదేవిధంగా దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేటికీ తమ ప్రభుత్వంలో, వ్యవస్థలలో లోపాలను సరిచేయడంలో ఎందుకు అశ్రద్ద వహిస్తోంది? అంటే దానికి చిత్తశుద్ది కొరవడటమే కారణమని చెప్పవచ్చును.   ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నమన యువరాజవారు, తను గుర్తించిన ఈ సమస్యలను సవరించడానికి, సరిద్దదానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఇలా మైకు, ప్రేక్షకులు, అవకాశం దొరికినప్పుడల్లా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం వలన ఏమి ప్రయోజనం? మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆ మాటలకు కూడా ఎటువంటి విలువ ఉండదు. అదే పొంతన ఉంటే అది అమాద్మీలా తిరుగులేని ప్రజామోదం పొందుతుందని రుజువయింది కూడా. ప్రజలలో ఇంత రాజకీయ చైతన్యం చూసిన తరువాత కూడా వారిని ఇంకా ఇంకా ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలతో మెప్పించగలమని ఆయన భావిస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీయే నష్టపోవడం తధ్యం.

Samajwadi Party offers Devyani ticket for LS polls

దేవయానికి ఎంపీ టికెట్టిస్తారట...

      ఇళ్ళు కాలి ఒకడేడుస్తుంటే...చలిమంట వేసుకుంటాం అన్నట్టుంది దేశంలో రాజకీయ పార్టీల తీరు. మనదేశపు మహిళా దౌత్యాధికారి 'దేవయాని'కి జరిగిన అవమానం అమెరికా భారత్ ల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే౦త స్థాయికి చేరిన విషయం తెల్సిందే. 'దేవయాని'పై అమెరికా అధికారులు తీరును నిరసించిన భారత్, క్షమాపణతో పాటు ఆమెపై అక్రమ౦గా బనాయించిన కేసుల్ని సైతం ఎత్తేయాలని డిమాండ్ చేస్తోంది.   మరోవైపు తన కూతురి పట్ల అగ్రరాజ్యం వ్యవహరించిన పద్దతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న 'దేవయాని' తండ్రి ఉత్తమ్ క్షమాపణ,కేసుల ఉపసంహరణ కోరుతూ ఆమరణ దీక్షకు సైతం దిగుతానని హెచ్చరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటు పలు స్వచ్చంద సంస్థలు అమెరికా వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నాయి. ఇంత గందరగోళ౦ నేలకొంటుంటే..సమాజ్ వాదీ పార్టీల అవన్నీ  వదిలేసి 'దేవయాని'కి పార్టీ టిక్కెట్ ఆఫర్ చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ చూడడం సిగ్గుచేటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు...ఇటీవల సచిన్ టెండూల్కర్ ను సైతం రమ్మంటూ సమాజ్వాదీ పార్టీ ఆహ్వానించడాన్ని వీరు గుర్తు చేస్తూ పార్టీ సిద్దాంతాల మీద కాకుండా వ్యక్తుల పాప్యులారీటీ మీద ఆధారపడి ఆ పార్టీ నడవాలనుకుంటో౦దని అంటున్నారు.                                                                                   

nara lokesh

ప్రత్యర్ధి పార్టీలపై లోకేష్ నిశిత విమర్శలు

  ట్వీట్ వీరుడు నారా లోకేష్ అప్పుడప్పుడు జనాల మధ్యకు కూడా వచ్చిహడావుడి చేస్తుంటారు. నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టీఎన్ఎస్ఎఫ్ వర్కుషాపులో పాల్గొన్నఆయన తమ రాజకీయ ప్రత్యర్దులయిన కాంగ్రెస్, వైకాపా, తెరాసలపై సునిశితమయిన విమర్శలు చేసారు. నిత్యం తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసే వైకాపా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, “తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో చంద్రబాబు చొరవ వల్ల రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలు తరలి వచ్చిఎనలేని సంపదను సృష్టిస్తే, ఆ తరువాత వచ్చిన వైయస్సార్ ప్రభుత్వం వెనుకుండి కధంతా నడిపించిన జగన్మోహన్ రెడ్డి ధాటికి కొత్తగా ఒక్క ఐటీ కంపీనీ కూడా రాష్ట్రానికి రావడానికి భయపడ్డాయని, వైయస్స్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఫ్యాబ్ సిటీలు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేకపోయినా, అనేకమంది అధికారులను, మంత్రులను వ్యాపారవేత్తలను కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాయని లోకేష్ ఎద్దేవా చేసారు. వైయస్స్ మొదలుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు వల్ల కూడా ప్రజలకు ఎటువంటి లాభం కలగకపోయినా, అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నివిధాల లాభపడ్డారని ఆరోపించారు.   జగన్మోహన్ రెడ్డి తనకు ఎంతకీ బెయిలు దొరకకపోవడంతో చివరికి సోనియా గాంధీని బ్రతిమాలుకొని బెయిలు తెచ్చుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ళ తెదేపా హయంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే, దానిని ఆ తరువాత వచ్చిన వైయస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని విమర్శించారు.   తెదేపా ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టేనాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఉండేదని, చంద్రబాబు కృషితో ఐదు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచగలిగారని తెలిపారు. విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, పరిశ్రమలు ఉంటేనే ఉద్యోగాలు ఉంటాయని గ్రహించిన తెదేపా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి రంగానికి పెద్ద పీట వేసిందని ఆయన అన్నారు. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి పరిశ్రమలు మూతపడుతున్నాయని, తత్ఫలితంగా మళ్ళీ నిరుద్యోగ సమస్య తీవ్రం అయ్యిందని తెలిపారు.   తెదేపాను నిత్యం విమర్శించే కేసీఆర్, తెదేపా ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మని చంద్రబాబు సవాలు విసిరితే తన ఫాంహౌస్ లోకి దూరి దాకోన్నారని లోకేష్ ఎద్దేవా చేసారు. తెదేపా-కాంగ్రెస్-వైయస్సార్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై తెదేపా చర్చకు సిద్దమని, జగన్మోహన్ రెడ్డి తమ సవాలు స్వీకరించడానికి సిద్దమేనా? అని లోకేష్ ప్రశ్నించారు.   సమావేశంలో పాల్గొన్న యువత నుద్దేశించి మాట్లాడుతూ అవినీతిపరుడయిన జగన్ కావాలో, లేకపోతే డిల్లీ నుండి పిలుపు రాగానే చేతులు కట్టుకొని పరుగులుపెట్టే కాంగ్రెస్ నేతలు కావాలో లేకపోతే తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్దికి కృషి చేసే తెదేపా కావాలో మీరే నిర్ణయించుకోండని సలహా ఇచ్చారు.

sonia gandhi telangana

అమ్మ గారి చెయ్యి

    Vijaya Kumar Ponnada   'ఇవాళ చాలా సుధినం అని నేను మనవి చేస్తా వున్నాను. భారతదేశంలోనే అతి పెద్దయిన మా పార్టీ అధ్యక్షురాలికి గుడి కట్టడానికి ఇవాళ శంఖుస్థాపన చేసే భాగ్యం నాకు దక్కింది. ' అని వూపిరి ఓ సారి గట్టిగా పీల్చుకుని, మళ్ళీ మొదలెట్టాడు భజనరావు. 'నిజానికి ఆవిడ గారు మనకి చేసిన సేవలు ఇంతా అంతా కాదు. ఆ మాటకొస్తే ఆవిడ అసలు మనకి ఎందుకు చేయాలీ అని నేను ఈ సభా ముఖంగా మిమ్మల్నందరినీ ప్రశ్నిస్తా వున్నాను? ఆవిడదేమయినా మన పేటా? మన వూరా? మన రాష్ట్రమా? పోనీ మన దేశమా? కాదు ఎక్కడో ఇటలీలో పుట్టి ఇక్కడకొచ్చి మనల్ని వుద్దరిస్తున్నారు. మొన్న యన్నీబీసేంట్ అనే ఆవిడా, నిన్న మథర్ తెరెస్సా, ఇవాళ ఇక ఈవిడా. రేపు ఇక ఎవ్వరూ వుండరని నేను నొక్కి వొక్కాణిస్తున్నను.' మన దేశానికి వచ్చి, రాజీవుగాంధిగారి మరణాంతరం తిరిగి ఇటలీ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, నాలాంటి తమ్ముళ్ళు, అన్నలు, అక్కలూ, చెల్లేళ్ళు ఆవిడకి అడ్డంగా నిల్చుని, మీకు మేమున్నాము, అని చెప్పి వొప్పించి, ఖాళీగా వుండకుండా, ఏదో కాలక్షేపానికి వారు వొద్దంటున్నా అందరం కలసి, పార్టీ అధ్యక్షపదవి ఇచ్చాము. ఇవాళ ఆవిడ అలా పార్టీ కుర్చీకి అత్తుక్కు పోయారంటే ఆవిడ నిరంతర కృషే అని వేరే చెప్పనక్కర్లేదు. గిట్టని వాళ్ళు, విపక్షాల వాళ్ళు ఆవిడకి పదవి కాంక్ష ఎక్కువంటారు. అదే నిజమయితే ఆవిడ ఈనాడు మన్మోహనంగారి స్థానంలో ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చునేవారు. నాకు తెలుసు ఆవిడ ప్రధాని మంత్రి అభ్యర్ధికోసం ఎంత శ్రమ పడ్డారో.' అని కళ్ళలోంచి వచ్చే నీళ్ళని చొక్కాతో తుడుచుకుంటూ, 'ఎన్నికలయ్యాకా ప్రధానిగ ఎవరిని కూర్చోపెట్టాలా అని ఆవిడ చాలా వ్యధ చెందారు. ఒకరోజు ఆవిడ తన డాక్టరు దగ్గరకి వెళ్ళినప్పుడు లోపల నుంచి మాటలు వినిపించాయి. 'లాభంలేదు సింగు గారు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పైగా వృధాప్యం వల్ల కాస్త చూపు మందగించింది, వినికిడి కూడా తగ్గింది. ఇక రెస్టు తీసుకోండి ' అన్న మాటలు వినిపించాయి. అప్పుడే సింగు గారు చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని, వచ్చే దుఖాన్ని ఆపుకుంటూ, ఇక ఆగలేక పరిగెత్తుకుంటు వెళ్ళిపోయారు. అది చూసిన అమ్మాగారు, వెంటనే 'యూరేఖా ' అని అర్కెమిడిసులా అరచి 'నేను అనుకున్న లక్షణాలున్న ప్రధాన మంత్రి దొరికాడోచ్ ' అని ఆయన వెనకాలే పరిగెత్తుకెళ్ళి, ఆయన్ని పట్టుకుని ప్రధానిని చేసారు ' అన్నాడు భజనరావు. 'మన దేశానికి మన వారే ప్రధాని కావలన్నది ఆవిడా ఆకాంక్ష. ఆవిడ త్యాగనిరతికి ఓ తార్కాణం.' 'ప్రణభ్ ముఖర్జీ గారు రాజీవగాంధీగారితో పడక వేరే వాళ్ళ వూరెళ్ళిపోయి ఓ కుంపటి కొనుక్కుని, దానికి 'రాష్ట్రీయ సమాజవాదీ కాంగ్రెస్ ' అని పెట్టుకుని, స్వయం పాకం మొదలెట్టారు. అప్పుడు సొంతగా చెయ్యి కాల్చుకునే ఆయన్ని చూసి సదరు రాజీవ్గాంధీగారే జాలి పడి 'వేరే కుంపటి ఎందుకు, 'చెయ్యి ' కాలుతుంది, మాతో చెయ్యి కలిపేయండి ' అనేసరికి, ఆయన కుంపటి ఆర్పెసి, వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలసి పోయారు. మరి అలా సమయానికి వచ్చి చేరినా ఆతరువాత, నాకు ఇది కావాలీ అది కావాలీ అని పెచీ పెట్టలేదు. అది చూసి అమ్మగారు తాను 'భారతరత్న ' తీసేసుకోగల స్థితిలో వున్నా, అలాకాదని ప్రణబ్గారికి, 2008లో 'పద్మ విభూషణ్ ' బిరుదుని ఇచ్చేసారు. 'ఆతరువాత, ప్రధాని పోస్టు ఇవ్వరూ అని అడిగితే, చస్! వల్ల కాదు. కావస్తే రాష్ట్రపతి పదవి తీసేసుకోండి ' అని త్యాగం చేసారు ' అని మళ్ళీ చొక్కతో కళ్ళనీళ్ళు తుడుచుకుని, చొక్క తడిసిపోయిందని అది తీసేసి, మరో చొక్క వేసుకున్నాడు, భజనరావు.  'ఇవాళ కూడా ఆవిడ చాలా సాదా సీదాగానే వున్నారు. వాళ్ళబ్బాయి పదవిలేక, చేసేది ఏమీలేక, మీటుంగులు గట్రాలు పెట్టుకుని, వచ్చిన వారికి పలాయన వేగం గురించి మరియు ప్రయాగ శాస్త్రములో పాటాలు చెప్పి, కాలక్షేపం చేస్తున్నా అతనికి ప్రధాన మంత్రి పదవి ఇవ్వటానికి ససేమిరా వొప్పుకోటల్లేదు. మళ్ళీ గిట్టని వాళ్ళు 'అబ్బే అదేంలేదు, అతగాడిది ఇంకా కుర్ర తనం. పైగా అతన్ని ప్రధానిని చెయ్యలంటే చాలా కష్టం. అతను చెప్పింది వినిపించుకోడు తప్ప, చెముడు లేదు. ముందు చూపు లేదు తప్ప, అతని చూపు బానే వుంది, ఇక మాట్లాడం మొదలెడితే ఆపడు ' అని అంటారు.   ఈ మధ్యన ఓ వెబ్సైట్ వాళ్ళూ ఈవిడగారికి 12 వేల పైచిలుకు కోట్లున్నాయని రాసి పారేసారు. అయితే కొంచం అటూ ఇటుగా అన్నారు. దాంటో అమ్మగారు కుమిలి పోయారు. 'ఆ దిక్కుమాలినాళ్ళకి లెక్కలు రావా? సరిగ్గ లెక్కెట్టి చెప్పమను ' అని కోప్పడ్దరు. దాంతో వాళ్ళూ నాలిక్కరుచుకుని, మళ్ళీ లెక్కలెట్టడం మొదలెట్టారు. ఈ సారి గిట్టని వాళ్ళు 'నిజమే వాళ్ళకి బుద్దిలేదు. సరిగ్గ లెక్కెట్టకుండా చెప్పేసారు. వాళ్ళు చెప్పినదానికంటే ఇంకా చాలా ఎక్కువే వుంటుందన్నారు.' 'ఏది ఏమయినా మన దేశం చాలా గొప్పదేశం. లేక పోతే ఆంగ్లేయులని తరిమి కొట్టి, ఇటలీ వాళ్ళకి పీటేస్తారా చెప్పండి? ఈవిధంగా మనం ప్రపంచంలోనే ఓ కొత్త వొరవడికి నాంది పలికాము. ఏ దేశం వారయినా, ఏ దేశంలోనయినా తమ సత్తా చూపొచ్చని, దానికి మా అమ్మగారి తరువాతే ఎవరినయిన చెప్పుకోవాలి. ఆవిడని నేను కోరుకునేది ఒక్కటే. ఇలా మన దేశంతో ప్రారంబించినా ఆవిడ ప్రస్థానం, పక్క దేశాలకి కూడా పాకి, వచ్చే పుట్టిన రోజుకి ఆవిడ మరో మాలుగు దేశాలకి అధిపత్యం వహించాలని ఈ సభా ముఖంగా ఆవిడకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పక్క దేశాల్లోను ఇలా ఆవిడకి గుడి కట్టే అదృష్టం నాకే దక్కాలని, ఇప్పుడు కట్టబోయే గుడి తాలూకా దేవతని వేడుకుంటున్నాను.' అని కళ్ళలో నీళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి అవి ఆనందంతో వచ్చినవిలెండీ!

congress

ఆమాద్మీ చీపురు దెబ్బలు సమ్మగా ఉన్నాయిట

  డిల్లీలో 15 ఏళ్లుగా అధికారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నఈ కీలక తరుణంలో ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బలు తిని అధికారానికి దూరమయింది. డిల్లీ ప్రజలను మళ్ళీ మంచి చేసుకోవాలంటే వారి మద్దతు ఉన్నఆమాద్మీకి తను మద్దతు ఈయడం మంచిదనే ఆలోచనతోనో, లేక నాలుగు రాష్ట్రాలలో తలకు బొప్పి కట్టినందునో తెలియదు గానీ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలంగా సాగిస్తున్న తన సాంప్రదాయ రాజకీయ పద్దతులను పక్కనబెట్టి, మళ్ళీ ఆమాద్మీకే బేషరతు మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది.   అయితే కాంగ్రెస్ ఊహించినట్లు ఆమాద్మీ ఎగిరిగెంతేయలేదు. పైగా కాంగ్రెస్ హయాంలో గత 15ఏళ్లుగా జరిగిన కుంభకోణాలను త్రవ్వితీస్తాము. విద్యుత్ మీటర్ల గోల్ మాల్ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి నేరం రుజువయిన వారినందరినీ కటకటాల వెనక్కి పంపిస్తాము. కాంగ్రెస్, బీజేపీ నేతలు డిల్లీలో సాగిస్తున్న అక్రమ నీటి మాఫియా వ్యాపారాలకు అడ్డుకట్టవేసి వారి చేత ఇంతవరకు బొక్కినదంతా కక్కిస్తాము. ఎవరు పడితే వారు ఎర్రబుగ్గ కార్లేసుకొని డిల్లీ వీదుల్లో తిరగడాన్ని నిషేదిస్తాము,” అంటూ కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీనే భయపడే విధంగా లేఖ వ్రాసి వాటికి మీకు అభ్యంతరం లేకపోతే మాకు మద్దతు ఇవ్వచ్చునంటూ ఒక లేఖ వ్రాసి ఆమాద్మీ చేతులు దులుపుకొంది.   అదే అమాద్మీ కాక మరొక పార్టీ అయితే కాంగ్రెస్ మరోలా వ్యవహరించేది. కానీ నాలుగు రాష్ట్రాలలో తల బొప్పికట్టిన తరువాత, ఇంత ప్రజాదారణ కల ఆమాద్మీతో కొంచెం సంయమనంగానే వ్యవహరించాలని నిశ్చయించుకొని, ఆ పార్టీ వ్రాసిన లేఖకు జవాబు ఇచ్చింది.   కాంగ్రెస్, డిల్లీ ఇన్-చార్జ్ షకీల్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ, “ఆమాద్మీ తన లేఖలో లేవనెత్తిన 18అంశాలలో 16 పూర్తిగా పరిపాలనా సంబందమయినవే. గనుక వాటి గురించి మేము ఎటువంటి వివరణ ఈయవలసిన అవసరం లేదు. మిగిలిన రెండు అంశాలలో డిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఈయడానికి మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది గనుక, ఆమాద్మీ దాని గురించి ప్రభుత్వంతో చర్చించవలసి ఉంటుంది. ఇక డిల్లీలో ఇప్పటికే బలమయిన లోకాయుక్తా వ్యవస్థ ఉంది. దానిని ఇంకా బలపరచాలని ఆమాద్మీ భావిస్తే దానికోసం మమ్మల్ని సంప్రదించనవసరం లేదు,” అని అన్నారు.   అంటే అమాద్మీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంత కాలంగా కాంగ్రెస్ కప్పెట్టిన కుంభకోణాలను వెలికి తీసి చర్యలు చేపడితే తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అంగీకరించినట్లే భావించవలసి ఉంటుంది. ఇటువంటి షరతులకి అంగీకరించడం కొరివితో తల గోక్కోవడమేనని తెలిసి ఉన్నపటికీ ఆమాద్మీ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడం చాలా విడ్డూరమే. అయితే, తన పార్టీ నేతలను ఆమాద్మీ జైలుకి పంపిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొంటుందని ఆశించడం అవివేకం. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గ్రహ స్థితి ఏమీ బాగాలేనందునే కనీసం ఆమాద్మీ చీపురు దెబ్బలు తింటేనయినా ఆ దోషం పోతుందేమోననే చిన్న ఆశతోనే బహుశః ఇందుకు అంగీకరించి ఉండవచ్చును.   కాంగ్రెస్ పార్టీకి తను షాక్ ఇస్తే, కాంగ్రెస్ కూడ ఈవిధంగా తన అన్ని షరతులకి అంగీకరిస్తూ ఈవిధంగా జవాబీయడంతో ఆమాద్మీ కూడా షాకయింది. అందుకే ఆ పార్టీ నేతలందరూ మళ్ళీ ఈరోజు అత్యవసరంగా డిల్లీలో తమ పార్టీ కార్యాలయంలోఈరోజు సమావేశమవుతున్నారు. రేపటితో డిల్లీ శాసనసభ కాలపరిమితి ముగియనుండటంతో, ఒకవేళ ఆమాద్మీ పార్టీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటుకి చొరవ తీసుకోకపోతే డిల్లీపై రాష్ట్రపతి పాలన విదింపబడవచ్చును. అయితే, ఆమాద్మీ తనను తాను నిరూపించుకొనేందుకు దొరికిన ఈ అపూర్వమయిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోదని ఆశిద్దాము.

dharamana

ఆ తంతు కూడా ముగించేసిన ధర్మాన

  ధర్మాన ప్రసాదరావు సీబీఐ కేసుల పుణ్యామాని తన మంత్రి పదవి ఊడగొట్టుకొన్నారు కానీ, లేకుంటే నేటికీ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతూనే ఉండేవారు. ఆయనను కాపాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు, కానీ ఫలితం లేక పోవడంతో ఇక చేసేదేమి లేక ధర్మాన రాజీనామా చేసి బయటపడ్డారు. పదవిలో ఉన్నంత కాలమే ఎవరినయినా అందరూ గుర్తిస్తారు. అవి పోయిన మరుక్షణం వారిని కాంగ్రెస్ పార్టీలో పలకరించేవారు ఉండరు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మోపిదేవి, ధర్మాన, సబిత వంటి వారే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.   అటువంటప్పుడు వారు మళ్ళీ ఒంటరి పోరాటానికయినా సిద్దపడాలి, లేకుంటే వేరే పార్టీలలోకయినా మారిపోవలసి ఉంటుంది. ఎన్నికలు తరుముకొస్తున్నఈ తరుణంలో మొదటి ఆప్షన్ కంటే రెండవదే ఆచరణీయంగా ఉంటుంది గనుక ధర్మాన కూడా వైకాపాలోకి దూకేసేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. అయితే పార్టీ మారేందుకు నిశ్చయించుకొన్నతరువాత ఈ జంపింగ్ ప్రక్రియలో శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన తంతు, అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టి పోయడం, జగన్మోహన్ రెడ్డికి గొప్పదనం గురించి బాకా ఊదడం తదితర కార్యక్రామాలను ఆయన అందరి కంటే కొంచెం విభిన్నంగా నిర్వహించారు ఆయన తన అనుచరులతో కలిసి మొన్న శ్రీకాకుళంలో బహిరంగ సభకు తక్కువ, కార్యకర్తల సమావేశానికి ఎక్కువ అనదగ్గ ‘సమాలోచన’ అనే బహిరంగసమావేశం ఏర్పాటు చేసి ఆ తంతు శాస్త్ర ప్రకారం పూర్తి చేసేసారు.   ఆయన ఈ సమావేశంలో తన కాంగ్రెస్ కళ్ళద్దాలను తీసి పక్కకు పడేయగానే అంతవరకు దేవతలా కన్పించిన సోనియా గాంధీ ఆయనకు దయ్యంలా, 125 సం.లచరిత్ర గల గొప్ప పార్టీ అని స్వయంగా పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా కనబడింది. ఇక వైకాపా ఇచ్చిన కళ్ళద్దాలను పెట్టుకోగానే అంతవరకు స్పష్టంగా కనబడిన జగన్మోహన్ రెడ్డి యొక్క సీబీఐ రికార్డులు, అక్రమ సంపాదన చరిత్రలు ఏవో అర్ధం పర్ధం లేని పిచ్చిరాతలులా కనబడటం మొదలయ్యాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో ఇంతవరకు తను చూడలేకపోయిన గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా వైకాపా కళ్ళద్దాలు ధరించాగానే స్పష్టంగా కనబడతునట్లు ఆయన సభా ముఖంగా ప్రకటించారు.   ఇక శాస్త్రోక్తంగా తన ధర్మం తను నిర్వహించారు గనుక ఇక జగన్ వచ్చి వైకాపా కండువా కప్పడమే ఆలస్యం. మరీ ఆలస్యం చేస్తే అందరూ ‘ఇదేమి ధర్మం ధర్మానా?’ అంటే అనుకొంటే అనుకోవచ్చునేమోగానీ ఆయన మాత్రం మళ్ళీ ఇదే తంతు మరొకమారు నిర్వహించేసి ఏ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకో జంపయిపోయే ప్రమాదం ఉంది. లేకుంటే సబ్బంహరిలాగే ఆయన కూడా తన కాంగ్రెస్ కండువాను ఓసారి గంజి పెట్టి ఉతికించేసుకొని మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరే అవకాశము లేకపోలేదు.

chandrababu

అసలయిన విభజనవాది ఎవరు?

  జగన్మోహన్ రెడ్డి తనను తాను సమైక్య ఛాంపియన్ గా ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో రాష్ట్ర విభజనపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ, తనతో ఎవరూ కూడా కలిసి రావడం లేదంటూ ఆవేదన పడిపోతుంటారు. తనొక్కడే మిగిలిన వారందరి కంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్లు పదేపదే గట్టిగా చెప్పుకొంటారు. పనిలోపనిగా తనకు ప్రధాన పోటీదారులయిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను ప్రజల ముందు దోషులని సర్టిఫై చేయడం కూడా మరిచిపోరు.   కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఎంత తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, ఆయన ఆ ప్రక్రియకు ఎక్కడా అడ్డుతగలకుండా పరోక్షంగా సహకరిస్తున్నందున ఆయనను అనుమానించక తప్పదు.   అయితే చంద్రబాబు నోట ఇంతవరకు సమైక్యాంధ్ర రాలేదనే జగన్ ఆరోపణ కేవలం ఆయనను సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకే. రాష్ట్ర విభజనకు తెదేపా అంగీకరించిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు వ్యక్తిగతంగా, మానసికంగా కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేఖమనే సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే ఆయన ఇంతవరకు జై తెలంగాణా! అనిగానీ, జై సమైక్యాంధ్ర! అనిగానీ అనలేకపోతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ కారణంగానే తెదేపా తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతున్నదని చంద్రబాబుకి తెలిసి ఉన్నపటికీ, ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.   కానీ, తెలంగాణాలో రాత్రికి రాత్రి దుకాణం బంద్ చేసుకోచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ సమస్య లేదు గనుక ఒట్టొట్టి సమైక్యరాగామాలపిస్తూ చంద్రబాబుని కూడా తనతో కోరస్ పాడమని బలవంతం చేస్తూ, ఆయన పాడట్లేదు గనుక ఆయన సీమాంధ్ర ద్రోహి అని ప్రచారం చేసుకొని, తనొక్కడే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డిని తెలంగాణా ప్రజలు ఇంతకంటే ఎక్కువగానే అసహ్యించుకొంటున్న సంగతి ఆయనకి కూడా తెలిసే ఉంటుంది.   రాష్ట్ర విభజనకు మానసికంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, దానివల్ల తన పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నపటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు విభజనకు అంగీకరిస్తే, రాష్ట్ర విభజన జరిగితేనే తనకు రాజకీయ లబ్ది కలుగుతుందని మనసులో తీయని కలలు కంటూ, పైకి మాత్రం జగన్ సమైక్యరాగం ఆలపిస్తున్నారు. నిజానికి నేతి బీరకాయలో నెయ్యి వంటిది జగన్ సమైక్యవాదం. అందువల్ల అసలయిన విభజనవాది ఎవరో ప్రజలే తేల్చి చెప్పాలి.          మడమ తిప్పని వంశమని, విస్వసనీయత తమ ఇంటి పేరని, నీతి నిజాయితీలు తన లోటస్ పాండ్లో విరబూసే కలువలని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటలు పలికేందుకు కూడా ఇబ్బందిపడుతున్నారు. తనను నమ్ముకొన్న తెలంగాణా నేతలకి హ్యాండిచ్చేసి ఇప్పుడు సమైక్య ముసుగులో రాష్ట్ర విభజన కోరుకొంటున్న జగన్మోహన్ రెడ్డి కంటే రాష్ట్ర విభజనను అయిష్టంగా అంగీకరిస్తున్న చంద్రబాబే మేలు కదా!    

jagan

ఎన్నికల వరకు ఈ జగన్నాటకం కొనసాగవలసిందే

  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం విడిపోతున్నందుకు చాలా ఆందోళన చెందుతున్నట్లు, దానిని అడ్డుకొనేందుకు తనొక్కడే చాలా కృషి చేస్తున్నట్లు, తనతో ఎవరూ కలిసి రావడం లేదని ఆవేదన చెందుతున్నట్లు చాలా చక్కగా నటిస్తున్నపటికీ, నిజానికి వైకాపా రాత్రికి రాత్రి తెలంగాణా నుండి సీమాంధ్రకు దూకేయడంతోనే రాష్ట్ర విభజనకు ఆ పార్టీ సిద్దమని స్పష్టమయిన సంకేతం ఇచ్చింది. జగన్ చేస్తున్నవాదనలు, ప్రయత్నాలను కాసేపు పక్కన బెట్టి ఆలోచిస్తే, తెలంగాణాను పూర్తిగా వదులుకొన్న వైకాపాకు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే సీమాంధ్రలో ఎంతో కొంత లబ్ది పొందగలదనేది ఎవరూ కాదనలేని సత్యం.   ఇంతవరకు జగన్ చేస్తున్న ప్రతీ ప్రయత్నమూ కూడా సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నదే తప్ప, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాదు. రాబోయే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే, వైకాపా ప్రజలలో పేరుకుపోయున్న ప్రభుత్వ వ్యతిరేఖతను, వారిలో జ్వలించే సమైఖ్య సెంటిమెంటును ఉపయోగించుకొని రాజకీయ లబ్ది పొందగలదు. అప్పుడే అది చేస్తున్న సమైక్య పోరాటాలకు ఫలితం ఆశించలదు. అందుకే, జగన్మోహన్ రెడ్డి మనసులో రాష్ట్ర విభజనను కోరుకొంటున్నపటికీ, పైకి మాత్రం అవసరమయిన దానికంటే చాలా బిగ్గరగా సమైక్యాంధ్ర అంటూ నినదిస్తున్నారు. ఎన్నికలవరకు సీమాంధ్ర ప్రజలలో ఈ సమైక్య సెంటిమెంటును బలంగా ఉండేట్లు జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే వైకాపా లబ్ది పొందగలదు.   తెరాస తెలంగాణా సెంటిమెంటును ఏవిధంగా ఉపయోగించుకొని రాజకీయంగా ప్రయోజనం, పైచేయి సాధించిందో అదేవిధంగా వైకాపా కూడా సమైక్య సెంటిమెంటుతో 2014ఎన్నికలలో లబ్ది పొందాలని భావిస్తోంది. అందుకే జగన్ కేవలం 30యంపీ సీట్లు సాధించడం గురించి, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు గురించి తరచూ మాట్లాడుతుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన గత కొంతకాలంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మిషతో దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాధినేతలను, పార్టీ నేతలను కలుస్తున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో తనకు, తన పార్టీకి ఒక గుర్తింపు ఏర్పరచుకొని, వారితో సంబంధాలు పెంచుకోవడానికి, తాను కాంగ్రెస్ వ్యతిరేఖిననే భావన రాష్ట్ర ప్రజలకు కలుగజేయడానికి తిప్పలు పడుతున్నారు. అయితే అతను కలిసిన రాజకీయ నేతలలో ఎంతమంది అయన మాటలను, ప్రయత్నాలను నిజంగా నమ్ముతున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ తో ఆయనకున్నరహస్య అనుబందం గురించి వారికి తెలియదని అనుకోలేము.   ఏమయినప్పటికీ, జగన్ స్వయంగా చెప్పినట్లు కడదాకా అంటే 2014ఎన్నికల వరకు ఈ సమైక్యపోరాటం చేస్తూనే ఉంటారు.

rahul gandhi

జనలోక్ పాల్ బిల్లు కోసం రాహుల్ వఖల్తా ఎందుకో

  నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి, స్వంత యంపీలే యూపీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, కనీసం తాము అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా బిల్లుని ఆమోదింపజేసుకోలేని దుస్థితి. మిగిలిన మూడు రాష్ట్రాలలో పరాజయం కంటే గట్టిగా ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ చీపురు దెబ్బకి డిల్లీలో పరువుపోవడం కాంగ్రెస్ ను చాలా కలవరపరుస్తోంది. ఇది సరిపోనట్లు జనలోక్ పాల్ బిల్లుకోసం అన్నాహజారే నిరాహార దీక్ష మొదలుపెట్టడం మూలిగే ముసలి నక్క మీద తాటిపండు పడ్డట్లయింది కాంగ్రెస్ పార్టీకి. ఒకేసారి చుట్టుముట్టిన ఇన్నిసమస్యలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, తన సహజసిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మాత్రం మానుకోలేదు.   ఈరోజు యువరాజు రాహుల్ గాంధీ తన భజన బృందాన్ని వెంటేసుకొని డిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ జనలోక్ పాల్ బిల్లు ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించడం విశేషం. అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ జన లోక్ పాల్ బిల్లుపట్ల మొదటి నుండి చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని, అందుకే ఈసారి పార్లమెంటులో ఈబిల్లును ఆమోదింపజేయాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉందని అన్నారు.   ఆమాద్మీ చేతిలో తమ పార్టీ ఓడిపోయినందునో లేకపోతే అన్నాహజారే రాలెగావ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారనో తామీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని, ఈ బిల్లు వల్ల దేశంలో అవినీతిని సమర్ధంగా నియత్రించవచ్చని భావించినందునే పార్లమెంటులో ప్రవేశపెట్టామని, ఈ బిల్లు ఆమోదానికి బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని ఆయన కోరారు. ఈ బిల్లుతో దేశంలో అన్ని సమస్యలను పరిష్కారమయిపోతాయని తాము భావించడం లేదని, కానీ ఆదిశలో ఇదొక మంచి ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు.   అన్నాహజారే జనలోక్ పాల్ బిల్లు కోసం డిల్లీలో నిరాహార దీక్ష చేసినప్పుడు ఎన్నడూ ఒక్కసారి కూడా మాట్లాడని రాహుల్ గాంధీ ఇప్పుడు హటాత్తుగా జ్ఞానోదయం అయినట్లు జనలోక్ పాల్ బిల్లు గురించి వఖల్తా పుచ్చుకొని మాట్లాడటానికి కారణాలు ఆయనే స్వయంగా చెప్పకనే చెప్పుకొన్నారు. అయితే అవినీతిలో మునిగి తేలుతున్నతమ కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాటం చేస్తోందని చెప్పడం ఈ సం.లో అతిపెద్ద జోక్ అని అందరూ అంగీకరించక తప్పదు.

bjp

తెదేపాతో పొత్తులు మేలని భావిస్తున్న బీజేపీ

  వాపును చూసి బలుపని భావిస్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తాము చేసిన పోరాటాల వల్ల యావత్ తెలంగాణాలో పార్టీ చాలా బలపడిందని, అందువల్ల వచ్చేఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచేయవచ్చని భ్రమలో ఉన్నారు. అందుకే తెదేపాతో పొత్తులని ఆయన తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం అటువంటి వెర్రి భ్రమలలోలేదు. అందుకే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికలలో పొత్తులు తదితర అంశాలపై పార్టీలోని కొందరు తటస్థ వ్యక్తుల ద్వారా ఒక రహస్య నివేదిక రప్పించుకొంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ నివేదికలోని కొన్ని ఆసక్తికరమయిన అంశాలు బయట పడ్డాయి.   ఎవరితో పొత్తులు లేకుండా పోటీ చేస్తే ఈసారి కాకపోయినా వచ్చేసారి ఎన్నికలకయినా పార్టీ బలోపేతం అవుతుందనే కిషన్ రెడ్డి వంటి కొందరు నేతల ఆలోచనలు కేవలం కాకి లెక్కలు కట్టుకోవడం వంటిదేనని ఆ నివేదికలో పేర్కొనబడింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణా కోసం ఎంత పోరాటం చేసినప్పటికీ, ప్రజలు కాంగ్రెస్, తెరాస, తెదేపాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారని, ఇక హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, మరియు నల్గొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నసీమాంధ్ర ప్రజల తొలి ప్రాధాన్యత తెదేపాకే ఇస్తారనేసంగతి గత ఎన్నికలలోనే రుజువయిందని, అందువల్ల తెలంగాణాలో సైతం బీజేపీ ఒంటరిగా పోటీచేయడం శ్రేయస్కరం కాదని నివేదికలో పేర్కొనబడింది.   జంట నగరాలు, ఆ పరిసర ప్రాంతాలలో దాదాపు 34 నియోజక వర్గాలలో విస్తరించి ఉన్నారు. ఈజిల్లాలు, నియోఅజక వర్గాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. అయితే నేరుగా వారి ఓట్లను బీజేపీ పొందడం అసంభవం గనుక, వారి మద్దతు కలిగి ఉన్నతెదేపాతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా బీజేపీ కూడా లాభపడుతుందని, నివేదికలో పేర్కొనబడింది.   ఇక తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నవరంగల్, కరీంనగర్, మరియు మెదక్, నిజామాబాద్, నల్గొండ కొన్ని ప్రాంతాలలో తెరాసకు మంచి బలం ఉన్నకారణంగా అక్కడ బీజేపీ తనంతట తాను పోటీ చేసి గెలిచే అవకాశాలు అంతగా లేవని పేర్కొంది. గత ఉప ఎన్నికలలో బీజేపీ 11 స్థానాలకు పోటీ చేస్తే కేవలం మెహబూబ్ నగర్ సీటు మాత్రమే గెలుపొందడం బీజేపీ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొంది.   అప్పుడు పరకాల్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్ధికి కేవలం 9,000 ఓట్లు మాత్రమే రాగా, తెదేపా బలపరచిన అభ్యర్ధి తెరాస అభ్యర్ధికి గట్టి పోటీ ఇచ్చి 31,000 సాధించగా, తెరాస కేవలం 2,000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, అందువల్ల బీజేపీ చాలా బలంగా ఉందని భావిస్తున్న చోట కూడా తమకంటే తెదేపా బలపరచిన అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు రావడం గమనిస్తే వచ్చేఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే కంటే తెదేపాతో పొత్తుల వలెనే ఇరువురికీ ప్రయోజనం ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.   ప్రస్తుతం తెలంగాణా ప్రాంతాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల ఓట్లన్నీతెదేపాకే పడే అవకాశాలు బాగా ఉన్నాయని, అందువల్ల కాంగ్రెస్, తెరాసలకు బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణాలోఎదగాలంటే తెదేపాతో పొత్తులు మేలని, తద్వారా తరువాత ఎన్నికలకి పార్టీ మరింత బలపడవచ్చని నివేదిక స్పష్టం చేసింది.   తమ పార్టీ చెప్పటిన తెలంగాణా ఉద్యమాల వలన సీమాంధ్రలో తన ఉనికిని కోల్పోయిన బీజేపీని కాపాడుకోవాలంటే, అక్కడ బలంగా ఉన్న తెదేపాతో పొత్తులు పెట్టుకోక తప్పదని, తద్వారా అటు తెదేపా, ఇటు బీజేపీ ఇరువురు ప్రయోజనం పొందవచ్చని నివేదికలో పేర్కొనబడింది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తెరాసతో, సీమాంధ్రలో వైకాపాతో అవగాహనకు వచ్చినట్లయితే, బీజేపీ ఒంటరిగా పోటీచేయాలనుకోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది.   తెలంగాణా కోసం బీజేపీ చేసిన పోరాటాలు, ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా బీజేపీకి చాలా లబ్ది చేకూరే అవకాశం ఉంది. గనుక, ఇటువంటి సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని పూర్తి ప్రయోజనం పొందాలంటే బీజేపీ తప్పనిసరిగా తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం మేలని నివేదికలో పేర్కొనబడింది.

Telangana Bill may miss winter session

2014 ఎన్నికల లోపు తెలంగాణ సాధ్యమా?

      ఇప్పటి పరిస్థితులు చూస్తోంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 ఎన్నికల లోపు సాకారం అయ్యేలా కనిపించడం లేదు. విభజన ముసాయిదా బిల్లును కేంద్ర హోంశాఖ గురువారం ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి పంపించింది. బిల్లుపై శాసనసభలో అభిప్రాయ సేకరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గరిష్ఠంగా ఆరు వారాలు సమయమిచ్చారు. 'జనవరి 23వ తేదీలోపు' అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. వాటిని క్రోడీకరించి ఢిల్లీకి పంపించేందుకు మరో మూడు రోజులు అదనంగా గడువు ఇచ్చినట్లు సమాచారం. అంటే... జనవరి 26వ తేదీ వరకు సమయం ఉన్నట్లే. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ముగిసేంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి అధికారం లేదు.  దీనిని బట్టి చూస్తే శీతాకాల సమావేశాలు ముగిసే లోపు తెలంగాణ బిల్లు పార్లమెంట్ చేరడం కష్టంగా కన్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 ముగియనున్నాయి. అయితే కేంద్రం కనుక పార్లమెంటు సమావేశాలు పొడిగించడమో,లేక మళ్లీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమో చేస్తే తప్ప తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం కష్టం కావచ్చు. కేంద్రం , కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ పై మరీ పట్టుదలతో ఉంటే తప్ప ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమో, లేక సమావేశాలలను పొడిగించడమో చేయకపోవచ్చు. అసెంబ్లీ లో బిల్లుపై అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత తెలంగాణ ముసాయిదా బిల్లు హోంమినిస్ట్రీరికి.. తిరిగి రాష్ట్రపతికి వెళ్లి , అక్కడ నుంచి పార్లమెంటుకు ఆమోదానికి వెళ్ళుతుంది.

Governor invites Aam Aadmi Party for talks

'ఆమ్ ఆద్మీ' ఏం చేస్తాడు..?

      ఢిల్లీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవాజ్ జంగ్ పిలుపు మేరకు హర్షవర్దన్ గురువారం సాయంత్రం ఆయనతో భేటీ అయ్యారు.తగిన బలం లేనందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదన్న పార్టీ వైఖరిని హర్షవర్ధన్ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు రెండో అతిపెద్ద పార్టీ అయిన ఆమ్ ఆద్మీకి గవర్నర్ ఆహ్వానం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం వచ్చిందని ఏఏపీ అధికార ప్రతినిధి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. అయితే ఏఏపీ మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఎవ్వరి మద్దతూ తీసుకోకూడదన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. కాని ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ ని కలవనున్న ఆమ్ ఆద్మీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడొనన్న ఆసక్తి ఢిల్లీ ప్రజల్లో నెలకొంది.   

Telangana Bill sent to AP Assembly

రాజ్‌భవన్ కు తెలంగాణ బిల్లు?

      రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుట్టిన రోజునే తెలంగాణ బిల్లుకు 'లైన్ క్లియర్' చేసినట్లు ఢిల్లీలోని విశ్వనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అభిప్రాయం చెప్పేందుకు శాసనసభకు ఆరు వారాలు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రే బిల్లు గవర్నర్ కార్యాలయానికి చేరినట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతుండగా... అందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ముసాయిదా బిల్లు రాజ్‌భవన్ చేరినట్లు తెలియడం గమనార్హం. విభజన ముసాయిదా బిల్లును కేంద్రమంత్రివర్గం ఈనెల 5న ఆమోదించింది. ఆ మరుసటి రోజే దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సంతాప సభలో పాల్గొనేందుకు మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్లిన రాష్ట్రపతి... బుధవారం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఆ వెంటనే బిల్లు ముసాయిదాను 'క్లియర్' చేసినట్లు తెలిసింది. అయితే, తమకు రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు అందలేదని హైదరాబాద్‌లోని అధికార వర్గాలు చెబుతున్నాయి. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా దీనిపై ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశాయి. గురువారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు... రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లులోని వివిధ అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ నిపుణులతో నిశితంగా చర్చించినట్లు తెలిసింది. తన కార్యాలయం నుంచి అసెంబ్లీకి వెళ్లే బిల్లు పూర్తిస్థాయిలో పక్కాగా ఉండాలని, అందులో ఎలాంటి న్యాయపరమైన లొసుగులు, ఇబ్బందులు ఉండరాదనే భావనతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

congress party

కాంగ్రెస్ తప్పిదాలకు రాహుల్ రాజకీయ భవిష్యత్ బలి

    కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలిచినందుకు సంతోషపడాలో లేక నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయినందుకు ఏడవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందిప్పుడు. అలాగని మిజోరాంలోనయినా  సంతోషించదగ్గ గొప్ప విజయమేమీ కాదు. క్రిందటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి 32 సీట్లు వస్తే, ఈ సారి కేవలం 22మాత్రమే వచ్చాయి. అక్కడ ఎటువంటి బలమయిన ప్రతిపక్షమూ, పోటీ గానీ లేకపోయినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలవడం చూస్తే, కాంగ్రెస్ పార్టీకి అక్కడ కూడా నూకలు చెల్లిపోతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః రానున్న సాధారణ ఎన్నికలలో ఆ సంగతి స్పష్టమయిపోవచ్చును.   ఈసారి మిజోరం ఎన్నికలలో కాంగ్రెస్ చిహ్నంతోనో లేకపోతే సోనియా, రాహుల్ పేరు చెప్పుకోనో గెలవలేదు. వరుసగా తొమ్మిది సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవుతున్న ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా వ్యక్తిగత ప్రభావము, పేరు ప్రతిష్టలతోనే ఈసారి కాంగ్రెస్ పార్టీ మిజోరంలో గెలవగలిగింది, లేకుంటే అక్కడ కూడా తుడిచిపెట్టుకుపోయేదే.   ఇక ఈ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పరిస్థితి చూస్తే దేశంలో దాదాపు అన్ని ముఖ్యమయిన రాష్ట్రాలలో ఓడిపోతూ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్ కుచించుకు పోయినట్లు అర్ధం అవుతోంది. దక్షిణాదిన రెండు దశాబ్దాల తరువాత బీజేపీ తప్పిదం వలన కర్ణాటకలో మళ్ళీ అధికారం దక్కించుకొన్నపటికీ, అంతకంటే విలువయిన, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన కారణంగా పోగొట్టుకోబోతోందని ఇప్పటికే దాదాపు స్పష్టమవుతోంది. ఏవిధంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి ఇక గడ్డు కాలం మొదలయినట్లే కనిపిస్తోంది.   అయితే సరిగ్గా రాహుల్ గాంధీ ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలనుకొనే సమయంలో దేశమంతటా ఈవిధంగా ఎదురుగాలులు వీయడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సోనియాగాంధీకి చాలా ఆందోళన కలిగించే విషయమే. అయితే అందుకు ఎవరినో నినదించనవసరం లేదు. అంతా స్వయంకృతాపరాధమే. కాంగ్రెస్ తప్పిదాలు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్ధకంగా మార్చివేయడమే దురదృష్టకరం.

Cong MPs pass no confidence motion

కాంగీయుల కొత్త డ్రామా!

      రాష్ట్ర విభజనను ఆపేస్తాం అని స్టేట్‌మెంట్లు ఇచ్చి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టిన సీమాంధ్ర ఎంపీలు పరిస్థితిని విజయవంతంగా రాష్ట్ర విభజన ముంగిలి వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త డ్రామాకి తెరతీశారు. ఆ కొత్త డ్రామా పేరు ‘అవిశ్వాస తీర్మానం’. తమ సొంత పార్టీ మీదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రం విడిపోకుండా చూస్తామన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల వాదన. అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి వీలుగా సీమాంధ్ర ఎంపీలు గతంలో స్పీకర్‌కి అందజేసిన తమ రాజీనామా లేఖల్ని ఎంచక్కా వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రావడం, నెగ్గడం సంగతి దేవుడెరుగు గానీ, తాము గతంలో చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకునే అవకాశం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు దక్కిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఎలాగూ విడిపోబోతోంది. అలాంటప్పుడు స్పీకర్ దగ్గర తమ రాజీనామాలు ఎందుకనుకున్నారో ఏమోగానీ, కొత్త పథకం వేసి రాజీనామా లేఖలు వెనక్కి తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సొంత తెలివి కాదని, దీని వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం బుర్ర కూడా వుండే వుంటుందని అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ మీదే అవిశ్వాసం పెట్టి సీమాంధ్రుల దృష్టిలో త్యాగధనుల ఇమేజ్ సంపాదించుకునే వ్యూహం కూడా ఇందులో వుండొచ్చంటున్నారు. యుపిఎ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు ఎంపీలను కాంగ్రెస్ పార్టీ డిస్మిస్ చేసినట్టయితే వారికి సీమాంధ్రలో హీరో ఇమేజ్ వచ్చే అవకాశం వుంది.  రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎలాగూ గెలిచే అవకాశం లేదు. అధిష్ఠానాన్నే ఎదిరించి పదవులను త్యాగం చేసిన ఇమేజ్‌తో ఇండిపెండెంట్లుగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ సన్నిధానానికి చేరే వ్యూహం కావచ్చని కూడా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని త్యాగాల బిల్డప్పులు ఇచ్చినా సీమాంధ్రలో ఇప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలు ఏరకంగానూ గెలిచే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఉపప్రధానిగా చంద్రబాబు నాయుడు?

      లోక్ సభకు సెమీఫైనల్ గా భావించే నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాయి. నాలుగు రాష్ట్రాలనూ కమలనాథులు దక్కించుకున్నారు. ఆ పార్టీకి కురిసిన ఓట్ల వెల్లువలో కాంగ్రెస్ అభ్యర్ధులు కొట్టుకుపోయారు. ఉత్తరాది నుంచి మధ్య భారతదేశం వరకు కాంగ్రెస్ సోదిలో లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు బిజెపి అధిష్టానం కన్ను దక్షణాది పై పడింది. ఇక్కడ తమ పార్టీ వేళ్ళూనగొనడానికి వ్యూహాలను రచిస్తుంది.     దక్షిణాదిలో వెంకయ్య నాయుడు ప్రభావం ఆశించిన ఫలిత౦ మేరకు లేకపోవడం, యాడ్యురప్ప పార్టీ పై అవినీతి మచ్చలు ఉండడం, ఎన్డీఏ భాగస్వామైన జయలలిత తమిళనాడు కే పరిమితం కావడంతో బిజెపి అధిష్టాన౦ కన్ను చంద్రబాబు నాయుడు పై పడింది. జనాల్లో మోడీ, బాబు ఫ్యాక్టర్ బలంగా పనిచేస్తుందని నరేంద్ర మోడీ వర్గం ఆలోచిస్తుంది. ఒక్కసారి విభజన జరిగాక సీమాంద్రలో కూడా రాజకీయాలు మారతాయి. అప్పుడు ఎవరు బాగా అబివృద్ది చేస్తారన్న అంశం ముందుకు వచ్చి, మోడీ, చంద్రబాబుల కాంబినేషన్ జనంలో బాగా పనిచేస్తే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్రం సమైక్యంగానే ఉన్న పక్షంలో చంద్రబాబు, మోడీల సమర్ధత పై ప్రచారం చేసి రాజకీయంగా లబ్ది పొందాలన్నది వారి ఉద్దేశంగా ఉంది.   గతంలో తన గుజరాత్ అభివృద్దికి చంద్రబాబు నాయుడు ఆదర్శమని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతేకాక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బిజెపి ప్రధాని అభ్యర్ది మోడీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఉప ప్రధాని అభ్యర్ధిగా చంద్రబాబు నాయుడును ప్రకటిస్తే దక్షణాదిలో బిజెపికి వున్న లోటును పుడ్చుకోవచ్చునని మోడీ వర్గం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్డీఏ కన్వీనర్ అవుదామనుకున్న తమిళ నాయుడు ముఖ్యమంత్రి జయలలిత ను కూడా ఒప్పించి చంద్రబాబు నాయుడు ను ఎన్డీఏ కన్వీనర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయం. చంద్రబాబు జాతకరీత్య కూడా 2014 లో జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తాడని జోతిష్యులు కూడా చెబుతున్నారు. మోడీ, బాబులు కలిస్తే అది టీడీపీ, బీజేపీలకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి కూడా మేలు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతుంటే...రాష్ట్రంలో టిడిపిని నడిపించే సారధ్య బాధ్యతలు ఎవరూ తీసుకుంటారు. నారా లోకేషా, నందమూరి బాలకృష్ణా లేక ఎన్టీఆర్ మనవరాలా? అనే దానిపై కూడా రాజకీయవర్గాలలో కూడా జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల వరకు ఈ వ్యవహారం ఓ కొల్లిక్కి రావచ్చు.                             

కాంగ్రెస్, బీజేపీలకు 'చీపురు' దెబ్బ

    రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలకు ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ డిల్లీలో చుక్కలు చూపించింది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనం చేసేందుకు ఉద్భవించిన ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమీషన్ చీపురు కట్టను ఎన్నికల చిహ్నంగా కేటాయించడం యాదృచ్చికమే అయినా, ఆమాద్మీకి అదే కలిసి వచ్చిన అంశంగా మారింది. ఆమాద్మీ(సామాన్య పౌరుడు) చేతిలో ఆ చీపురు కట్టే వజ్రాయుధంగా మారి, రాజకీయ దిగ్గజమయిన కాంగ్రెస్ పార్టీని డిల్లీ నుండి పూర్తిగా ఊడ్చిపెట్టేయగా, బీజేపీ అధికారం దక్కించుకోనీయకుండా  ఆ చీపురుకట్టనే ఆమాద్మీ ఇప్పుడు అడ్డువేస్తున్నాడు.   ఆమాద్మీ పార్టీ విజయం వెనుక ఆ పార్టీ కృషి ఎంత ఉందో, అంతకు మించి అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలోఉన్నవిముఖత కూడా దానికి ఆ పార్టీకి కలిసి వచ్చింది. రాహుల్ గాంధీ ఆమాద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ, “ఆమాద్మీ ప్రజలతో మమేకమయ్యి వారి భావాలకు అనుగుణంగా వ్యవహరించినందునే విజయం సాధించిందని, అందువల్ల తమ పార్టీ కూడా నేటి వరకు అనుసరిస్తూ వచ్చిన రాజకీయ కోణం నుండి కాక ప్రజాకోణం నుండే పరిపాలన సాగించవలసి ఉంటుందని” అనడం గమనిస్తే ఆయన తమ పార్టీ చేస్తున్న తప్పులను, నడుస్తున్న దారి తప్పని గ్రహించినట్లే ఉన్నారు. ప్రజాసంక్షేమం కోసమే రాజకీయాలు చేయాలి కానీ, రాజకీయాలకు ప్రజా సంక్షేమం బలి చేయకూడదనే సత్యం ఆయన చాలా ఆలస్యంగా గ్రహించారు. అయితే ఆ సత్యం తెలుసుకోవడానికి కాంగ్రెస్ చాలా భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది.   అయితే ఇకనయినా కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకొని నిజాయితీగా రాజకీయాలు చేస్తుందని నమ్మకం లేదని ఆయన తల్లి సోనియా గాంధీ మాటలే స్పష్టం చేసాయి. ఈ ఎన్నికలలో అధిక ధరలు మరి కొన్ని ఇతర చిన్న పెద్ద అంశాలు తమ ఓటమికి కారణమయ్యాయని, తమ వైఫల్యాలకు కారణాలను సమీక్షించుకొంటామని, అయితే ఈ ఫలితాలు రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావమూ చూపించాబోవని” ఆమె అన్నారు. ప్రస్తుతం జరిగిన శాసనసభ ఎన్నికలకి, 2014లో జరుగబోయే సాధారణ ఎన్నికలకి చాలా తేడా ఉంటుందని ఆమె అన్నారు. తగిన సమయంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి పేరు ప్రకటిస్తామని ఆమె అన్నారు.   ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ఆత్మవిమర్శ చేసుకొంటామని, తమ వైఫల్యాలకు కారణాలు తెలుసుకొని పార్టీని చక్కదిద్దుకొంటామననే పడికట్టు పదాలను వల్లెవేసినట్లే, ఈసారి కూడా ఆమె మరోమారు వల్లె వేయడం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణిలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం అవుతోంది.   ప్రతీ ఎన్నికలలో పరాభవం చవి చూస్తున్నా కూడా తన పనితీరు మాత్రం ఎన్నడూ మెరుగు పరుచుకోదు. పాలనలో సమర్ధత కనబరచదు. అవినీతికి దూరంగా ఉండలేదు. అయినప్పటికీ స్వంత డబ్బాకొట్టుకోవడం కూడా మరచిపోదు. బహుశః మిజోరం ఎన్నికలలో సాధించబోతున్నవిజయం గురించి మాట్లాడుతూ తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవన్నట్లు, కాంగ్రెస్ అంత త్వరగా తన పాత అలవాట్లను, పద్దతులను, ఆలోచన శైలిని వదులుకోలేదు.   కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన ప్రజలే మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో సమర్ధ పాలన అందించినందుకు బీజేపీకి మళ్ళీ మూడోసారి పట్టం కట్టారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ను గద్దె దింపి బీజేపీకి పగ్గాలు అప్పగించారు. డిల్లీలో చీపురు కట్టతో ఊడ్చి బయటకు సాగనంపారు. అందువల్ల యదావిధిగా పడికట్టు మాటలు వల్లే వేసే బదులు, నిజంగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని తమ వైఫల్యాల కారణాలను గుర్తించగలిగితే కాంగ్రెస్ పార్టీకే మంచిది. లేకుంటే ఈసారి మోడీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ దేశం నుండే ఊడ్చుకుపోయినా ఆశ్చర్యం లేదు.          

కేసీఆర్ని ట్విట్టిపోసిన వర్మ!

      ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెంటిమెంట్స్ వుండవని అందరూ అనుకుంటారు. ఆయన కూడా తనకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవని చెబుతూ వుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదేమో, వర్మ మనసులో ఏదో మూల సెంటిమెంట్ వుందేమో అని ట్విట్టర్‌లో ఆయన పెట్టే కామెంట్లను చూస్తే అనిపిస్తూ వుంటుంది. వర్మ ప్రదర్శించే ఆ సెంటిమెంట్ కూడా తన వ్యక్తిగత విషయాల్లో లేదు... ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విషయంలో వుంది. తెలుగువారందరూ ఒక్కటిగానే వుండాలన్న ఆలోచనలో వుంది.   రామ్ గోపాల్ వర్మ గతంలో అనేక పర్యాయాలు రాష్ట్రం విడిపోకూడదన్న అర్థం వచ్చేలా ట్విట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. అమెరికాలో కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవని కామెంట్ చేశారు. కేసీఆర్ అమెరికాకు తన మకాం మార్చి అమెరికా పౌరులకు విభజన పాఠాలు చెప్పాలని సూచించారు. కేసీఆర్ లాంటి నాయకులు అమెరికాని విభజించాలని వాదించి గెలవగలరని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు జరగలేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ‘సమర్థుడైన’ నాయకులు లేకపోవడమే కారణమని వర్మ ట్విట్ చేశారు. కేసీఆర్ అమెరికా పౌరుడిగా పుట్టి వుంటే ఆయన ఏం సాధించేవారో చూడాలని వుందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు.  రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ మీద ట్విట్టర్‌లో చాలా పోస్టులు ట్విట్ చేశారంటే రాష్ట్ర విభజన అంశం ఆయన్ని ఎంతగా బాధిస్తోందో తెలుస్తోంది. ముంబైలో సెటిలైపోయిన వర్మకే ఇంత బాధగా వుంటే, అన్నిటిలోనూ హైదరాబాద్ మీదే ఆధారపడిన సీమాంధ్ర ప్రజలకు ఎంత బాధగా వుంటుంది? విద్యార్థులు, ఉద్యోగులు ఎంత బాధపడతారు? ప్రతి తెలుగు హృదయం ఎంత తల్లడిల్లుతుంది? అన్నట్టు.. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా అమెరికాలో పుట్టి వుంటే ఎలా వుండేదంటే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజలందరూ ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలసి మెలసి వుండేవారు. మరి కేసీఆర్ అమెరికాలో పుడితే.... మన ఒక్క రూపాయికి వెయ్యి అమెరికా డాలర్లు వచ్చేలా పరిస్థితి తయారై వుండేది.  

విభజనతో విద్యార్ధులకు కొత్త ఇక్కట్లు

  సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కేంద్రం చాలా ఆషామాషీగా తూతూ మంత్రంగా పూర్తి చేసేసి చేతులు దులుపుకొంది. అనేక క్లిష్టమయిన అంశాలకు, సమస్యలకు తాత్కాలిక ఉపాయాలు చూపించి దానితో ఎలాగో సరిబెట్టుకోమని ఉచిత సలహా ఇస్తోంది. నీళ్ళు, విద్యుత్, ప్రాజెక్టులు వంటి క్లిష్టమయిన సమస్యలకు అది ఎటూ సరయిన పరిష్కారం చూపలేకపోయింది. కనీసం హైదరాబాద్ విషయంలో నయినా సరయిన పరిష్కారం చూపుతుందేమోనన్న ప్రజల ఆశ అడియాసగానే మిగిలిపోయింది.   దశాబ్దాల సమిష్టి కృషి కారణంగా రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దబడ్డ హైదరాబాద్ నగరంతో యావత్ రాష్త్ర ప్రజలు ఏదో రూపంగా బలమయిన సంబంధాలు కలిగిఉన్నారు, అధారపడి ఉన్నారు. కొన్ని లక్షల మందికి ఆ నగరం ఉపాధి కల్పిస్తే, అనేక వేలమంది విద్యారులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అది గమ్యస్థానంగా నిలిచింది. అందువలన  ఈ రాష్ట్ర విభజన వలన అటువంటి విద్యార్ధులు భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారబోతోంది.     మొన్న కేంద్రం ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లులో, “రెండు రాష్ట్రాలలో విద్యార్ధులందరికీ ఉన్నత విద్య అభ్యసించేందుకు సమానావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలలో ప్రస్తుతం అమలులో ఉన్నస్థానిక కోటా పద్దతినినే యదాతధంగా ఐదేళ్ళకు మించకుండా అమలుచేసేందుకు ఆమోదించబడినది,” అని పేర్కొంది.   అయితే హైదరబాద్ ని పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతున్నపుడు కేవలం ఐదేళ్ళు మాత్రమే ఈవిధానం ఎందుకు అమలుచేస్తున్నట్లు? పదేళ్లు అమలు చేయడానికి అభ్యంతరమేమిటి? ఐదేళ్ళ కోర్సులయిన యంబీబీయస్ వంటి వైద్య విద్యలో వచ్చే సంవత్సరం నుండి ఇతరులకు ప్రవేశం ఇస్తారా, లేదా? ఒకవేళ ఈగడువు ముగిసే సమయానికి కోర్సు మధ్యలో ఉన్నవారి పరిస్థితి ఏమిటి? ఈ ఐదేళ్ళ గడువు ముగిసే ముందు సంవత్సరంలో ఇటువంటి దీర్ఘకాలిక కోర్సులలో చేరదలచిన వారి పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే కేంద్రం ఎంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొందో అర్ధం అవుతుంది.   ఇక స్థానిక కోటాలను పరిశీలిస్తే, హైదరబాద్ ఉస్మానియా పరిధిలో జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్, కరీం నగర్, ఖమ్మం, మెహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాలు ఉన్నాయి.   అదేవిధంగా రాయలసీమలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప మరియు నెల్లూరు జిల్లాలున్నాయి.   ఇక విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థానిక కోటా పరిధిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలున్నాయి.   ఒక విద్యార్ది ఆయా ప్రాంతాలలో కనీసం నాలుగు సం.లకు తక్కువ కాకుండా విద్యాభ్యాసం చేసి ఉంటే, అతడు లేదా ఆమె స్థానిక విద్యార్ధిగా పరిగణింపబడుతారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారి విషయంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనయినా వరుసగా ఏడు సం.లు విద్యాభ్యాసం చేసినట్లయితే ఆ ప్రాంతంలో స్థానికుడిగా పరిగణింపబడతారు. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అప్పుడు కూడా ఇదే స్థానిక విధానం ఐదేళ్ళవరకు అమలు చేస్తారా? రెండు రాష్ట్రాలు తమ తమ ప్రాంత విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వదలచుకొంటే అప్పుడు ఈ స్థానిక విధానం ఏవిధంగా అమలు చేస్తారు? అనే విషయంపై బిల్లులో ఎటువంటి వివరణ లేదు.   ఇటువంటి లోపభూయిష్టమయిన విధానాల వలన రెండు రాష్ట్రాలలో విద్యార్ధులకు అవస్థలు, సమస్యలు తప్పకపోవచ్చును. ఇటువంటి లోపాలు మిగిలిన వ్యవస్థలలోను లెక్కకు మించి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటివల్ల రెండు రాష్ట్రాలలో ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు తప్పదు.