congress mps

కాంగ్రెస్ యంపీల సంకల్ప డ్రామా

  రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటామని, తమ పదవులకు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాలు చేసేదిలేదని తెగేసిచెప్పిన పనబాక లక్ష్మి, కిల్లి క్రుపారాణీ, జేడీ.శీలం, కావూరిల గురించి సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి అపోహలు లేవు. సీమాంధ్రకు కావలసిన ప్యాకేజీల గురించి మాట్లాడిన పురందేశ్వరి గురించి కూడా ఎటువంటి అనుమానాలు లేవు. చివరికి హైదరాబాద్ ను యూటీ చేయవలసిందేనని వాదించి అకస్మాత్తుగా మాయమయిపోయిన చిరంజీవిని కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరుగకుండా అడ్డుకొంటామని మైకులు పగిలిపోయేలా ఘర్జిస్తూ ఒకసారి రాజీనామాలు, మరోసారి కోర్టులో కేసులు, ఇంకోసారి స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం అంటూ రకరకాల డ్రామాలు ఆడుతున్న ఆ ఆరుగురు కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, హర్ష కుమార్, సాయి ప్రతాప్, సబ్బంహరిల వ్యవహార శైలే చాలా అనుమానాస్పదంగా ఉంది.   వారందరూ రేపటి నుండి సంకల్ప దీక్ష పేరుతో రెండు రోజులు సాగే మరో కొత్త నాటకం ప్రదర్శించబోతున్నారు. అందుకు వేదిక హైదరాబాదులో ఇందిరా పార్క్. వారందరూ తమ యంపీ పదవులకు రాజీనామాలు చేసామని చెప్పుకొంటారు. కానీ నేటికీ అవి ఆమోదం పొందలేదు గనుక యంపీలుగా కొనసాగుతున్నారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టామంటారు. కానీ అది సభలో చర్చకే రాదు. ఇప్పడు రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ రెండు రోజులు దీక్ష చేయబోతున్నారు. కానీ రాష్ట్ర విభజన ఆగబోదు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నపుడు యంపీలయిన వారందరూ అధికారికంగా ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద వారు చేసే దీక్షవల్ల కొత్తగా ఏమి ఒరుగుతుందో వారికే తెలియాలి.   బహుశః తామే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాటం చేస్తున్నామని మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం కావచ్చును. రేపు తెలంగాణావాదులెవరయినా అక్కడకి వచ్చిఅలజడి సృష్టిస్తే, తాము ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నామని చెప్పుకొని సానుభూతి ఓట్లు కూడా ఆశించవచ్చును. తాము ఏ పార్టీలో చేరి, ఏ రంగు కండువా కప్పుకొన్నా ప్రజలందరూ తమ మొహాలను జాగ్రత్తగా గుర్తుంచుకొని రానున్నఎన్నికలలో తమకే ఓట్లు వేయాలని చెప్పేందుకు వారి దీక్ష ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర విభజనను ఆపలేదని వారికి కూడా తెలుసు. వారి రాజీనామాలు, ఉద్యమాలు, దీక్షలు అన్నీ ప్రజలని ఆకట్టుకొని ఓట్లు రాల్చుకోవడానికి కాదని వారు చెప్పదలచుకొంటే, తాము కాని, తమ పుత్రరత్నాలు గానీ తమ కుటుంబంలో మరెవరూ కూడా వచ్చేఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటిస్తే వారిని విశ్వసించవచ్చును. కానీ కోటి విద్యలు కూటి కొరకేనని వారి ఆరాటం అంతా కూడా వచ్చే ఎన్నికలలో గెలిచేందుకేనని అర్ధం చేసుకొని జాలిపడాలి అంతే.

aap

లాంచనంగా అమాద్మీకి బల పరీక్ష

  ఆమాద్మీ పార్టీ డిల్లీ ప్రభుత్వపగ్గాలు చేప్పట్టి అప్పుడే వారం రోజులయిపోయింది. మొదటి మూడు రోజులలోనే తన ఎన్నికల హామీలలో ముఖ్యమయిన రెండు హామీలు-డిల్లీ ప్రజలకు 700 లీటర్ల ఉచిత నీళ్ళ సరఫరా, విద్యుత్ ధరలలో 50 శాతం తగ్గింపును అమలు చేసింది. అంతే గాక డిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్నమూడు విద్యుత్ కంపెనీల రికార్డులను ఆడిటింగ్ చేయిస్తానని ఇచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకొంటూ అరవింద్ కేజ్రీవాల్ నిన్న ఆడిటర్ జనరల్ ని కలిసి, ఆ మూడు విద్యుత్ కంపెనీల రికార్డులను ఆడిటింగ్ చేయవలసిందిగా అభ్యర్దించారు. మూడు కంపెనీలలో ఒకటి ఇప్పటికే ఆయన ప్రతిపాదనను స్వాగతించగా మరో రెండు కంపెనీలు ఇంకా స్పందించవలసి ఉంది.   ఇక కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులందరూ నిన్నడిల్లీ శాసనసభలో ప్రమాణ స్వీకారాలు చేసారు. ఈరోజు శాసనసభలో ఆమాద్మీ బలం నిరూపించుకోవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అమాద్మీకి తన మద్దతు ఉంటుందని ఇప్పటికే మరో మారు స్పష్టం చేసింది గనుక ఈరోజు జరిగే బలనిరూపణ కార్యక్రమం కేవలం లాంచనప్రాయమే. అందువలన ఇక నేటి నుండి ఆమాద్మీ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మరింత జోరుగా ప్రయత్నించవచ్చును.   ప్రభుత్వ పగ్గాలు చెప్పటిన 15రోజులలోనే అన్నాహజారే కోరిన విధంగా జన్ లోక్ పాల్ బిల్లుని సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినందున, ఇప్పుడు దానిపై అమాద్మీ దృష్టి కేంద్రీకరించవచ్చును. కానీ, దీనికి కాంగ్రెస్, బీజేపీల మద్దతు అవసరం ఉంటుంది. రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేఖంగా చేస్తున్న పోరాటానికి నిదర్శనంగా ఇటీవల పార్లమెంటులో అమోదం పొందిన లోక్ పాల్ బిల్లు గురించి మాట్లాడుతున్నారు గనుక, ఇప్పుడు ఆమాద్మీ ప్రభుత్వం ప్రవేశపెట్టే జన్ లోక్ పాల్ బిల్లుకి కూడా మద్దతు ఇచ్చేఅవకాశం ఉంది. కానీ, తమకు అధికారం దక్కకుండా చేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఆమాద్మీకి మద్దతు ఇచ్చి ఇద్దరూ కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్న బీజేపీ ఈ బిల్లును ఏదో ఒక కుంటిసాకుతో వ్యతిరేఖించవచ్చును.   ఇక అమాద్మీ పార్టీ యువతను, సామాన్య, మధ్యతరగతి, ఉద్యోగస్తులు, వ్యాపారులను చేరేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకొంటున్న తీరు, దానికి వస్తున్న అపూర్వ స్పందన, ఒబామా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నపుడు చేసిన ఎన్నికల ప్రచారం, స్పందన కంటే చాలా బాగుందని ఫేస్ బుక్ సర్వేలో తేలింది. అమాద్మీ తను అధికారం చేప్పట్టిననాటి నుండి ఇంతవరకు అమలు చేసిన హామీల గురించి ఫేస్ బుక్ పేజీలలో ప్రజలకు తెలియజేసి, మిగిలిన హామీలను కూడా అమలుచేయడానికి కృషి చేస్తామని, అందు కోసం సదా వారి మద్దతు అవసరమని చేసిన విజ్ఞప్తికి ప్రజల నుండి చాలా మంచి ప్రతిస్పందన వస్తున్నట్లు ఫేస్ బుక్ సర్వేలో తేలింది.

kapus tdp

తె.దే.పాను ‘కాపు’ కాస్తాం...

      రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో... వచ్చే ఎన్నికల్లో ఊహించని విధంగా సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఓ కులం మద్ధతు టోకున లభించనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజికవర్గం తదనంతరం దశలవారీగా చోటుచేసుకున్న పరిణామాలలో కొంచెం కొంచెంగా ఆ పార్టీకి దూరమైంది. తె.దే.పాతో కాపు కులం వైరానికి విజయవాడలో వంగవీటి రంగా హత్య తొలి బీజం వేసింది. అక్కడ నుంచి కాపు కులస్థులు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను కోరుకోవడం, సహజంగానే కమ్మ సామాజికవర్గం డామినేషన్‌ ఉన్న తెదేపాలో తాము ఎదగలేమనే భయంతో... స్వంతంగా ఎదిగే ప్రయత్నం చేయడం వంటివి ఈ దూరాన్ని మరింత పెంచాయి. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్‌కు మద్ధతిచ్చిన కాపు కులస్థులు ఆ పార్టీ కూడా తమను ఓటుబ్యాంకుగానే చూస్తోందని గ్రహించి నిరాశలో కూరుకుపోయారు. అదే సమయంలో 2009లో రాజకీయనగారా మోగించిన చిరంజీవిలో వారికి ఆపద్భాంధవుడు కనిపించాడు. అంతే ఆస్థులూ, ఆభరణాలూ సైతం తాకట్టు పెట్టి చిరంజీవికి అన్ని విధాలుగా సహకరించారు. నిజానికి చిరంజీవికి పడిన 70లక్షల ఓట్లలో కాపు కులస్థుల ఓట్లే అత్యధికం అనడంలో సందేహం లేదు. ఆ ఎన్నికల్లో చిరంజీవి అధికారంలోకి రాకపోయినా వారు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదేమో కాని... నమ్మినవారిని నట్టేట ముంచుతూ ఆయన కాంగ్రెస్‌ బోటెక్కేశారు. దీంతో మరోసారి, అదీ గతంలో ఎన్నడూ లేనంత పెద్దస్థాయిలో మోసపోయినట్టు భావించారు కాపులు.   వీటన్నింటి నేపధ్యం, ప్రస్తుత రాజకీయపరిస్థితులు బేరీజు వేసుకుంటున్న కాపు సామాజికవర్గం తెలుగుదేశం పార్టీ  వైపు మొగ్గు చూపుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా తమను మోసం చేయడమే కాకుండా చిరంజీవి అనే ఏకైక నాయకుడ్ని కూడా తమకు కాకుండా చేసిన కాంగ్రెస్‌ తప్పులు రాష్ట్ర విభజనతో పరాకాష్టకు చేరాయని కాపుల భావన అనీ, ఈ నేపధ్యంలో ఎలాగైనా ఆ పార్టీని ఓడిరచాలని  ఆ సామాజికవర్గం  ఆత్రుతగా ఎదురు చూస్తోందంటున్నారు. రాష్ట్రజనాభాలో దాదాపు 35శాతంగా ఉన్న కాపుల ఓట్లు గెలుపు ఓటములను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేది  తెలిసిందే. కాంగ్రెస్‌, సోనియాలను ఎదిరించినందుకు గాను విభజనకు ముందు కాపులు  వైకాపా వైపు, జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గు చూపినా విభజనానంతరం వారిలో జగన్‌ వైఖరి పట్ల భ్రమలు తొలగిపోయాయి. జగన్‌ కూడా  తర్వాత తర్వాత కాంగ్రెస్‌లో కలవక తప్పదని, ఇదంతా  కాంగ్రెస్‌ ఆడిస్తోన్న నాటకం అని భావిస్తున్న కాపు వర్గం... ఈ కుట్రలను ఛేధించాలని, దీంతో తమ పాత మిత్రుని చెంతకే చేరాలని నిశ్చయించుకుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగానే విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు వంటి పలువురు కాపు నేతలు తె.దే.పా లోకి దూకేందుకు సిద్ధమవడాన్ని వీరు చూపుతున్నారు.  ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా  మలచుకునేందుకు కాపులకు మరింత దగ్గరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ కూడా  ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

congress

మోడీ, రాహుల్ జీవితాలను మలుపు తిప్పే ఎన్నికలు

  రానున్నసార్వత్రిక ఎన్నికలు యూపీయే, ఎన్డీయేలకు చాలా కీలకమయినవి. కేంద్రంలో తిరిగి యూపీయే అధికారంలోకి రాలేకపోతే ఇక రాహుల్ గాంధీ ప్రధాని పదవిపై శాస్వితంగా ఆశలు వదులుకోవలసిందే. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రాన్నిఅభివృద్ధిపదంలో నడిపించినట్లే, నరేంద్ర మోడీ దేశాన్నికూడా ముందుకు నడిపించగలిగితే, కనీసం మరో పదేళ్ళపాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చొని భజన చేసుకోక తప్పదు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియాగాంధీ ఈ ఎన్నికల తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐదు లేక పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చొన్నరాహుల్ గాంధీని ఇక కాంగ్రెస్ లో లెక్కచేసేవారుండకపోవచ్చును. గనుక, ఈ ఎన్నికలలో గెలవడం యూపీయేకి అత్యావశ్యకం. అయితే, దేశమంతటా కాంగ్రెస్ ఎదురు గాలులు వీస్తున్న సంగతి మొన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోనే రుజువయింది. గనుక ఎన్డీయే అధికారంలోకి రావచ్చును. పరిస్థితి తీవ్రతను గమనించిన సోనియా గాంధీ, అది పూర్తిగా చెయ్యి దాటిపోక ముందే రాహుల్ గాంధీని తప్పించి అతని స్థానంలో తన కుమార్తె ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపినా ఆశ్చర్యం లేదు.   దేశమంతా మోడీ జపం చేస్తున్నఈ తరుణంలో ఈ సువర్ణావకాశం ఉపయోగించుకొని మోడీ ప్రధాని కాలేకపోతే ఇక ఆయనకు కూడా మళ్ళీ ఇటువంటి అవకాశం మరోసారి రాకపోవచ్చును. తన జీవితకాల ఆశయాన్నినెరవేర్చుకోవడం ఆయనకు అత్యవసరం గనుక వచ్చే ఎన్నికలలో గెలవడం ఆయనకు అత్యావశక్యమే. ఇక గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొన్నఎన్డీయేకు కూడా ఈ ఎన్నికలలో గెలవడం అత్యావశ్యకమే. లేకుంటే ప్రస్తుతం ఉన్న నేతలందరూ రాజకీయాల నుండి రిటర్మెంట్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చును. అందువల్ల వచ్చే ఎన్నికలలో ఏ కూటమి నెగ్గినా, రెండో కూటమిలో ప్రధాని అభ్యర్ధికి రాజకీయంగా జీవితంలో మళ్ళీ కోలుకోలేనంతగా నష్టం కలగకడం తధ్యం. ఇంతవరకు చెప్పుకొన్నదానిప్రకారం చూస్తే, మోడీ కంటే రాహుల్ గాంధీయే ఎక్కువ నష్టపోతారని అర్ధం అవుతోంది. ఒకవేళ ఎన్డీయే అధికారంలోకి రాలేకపోతే మోడీ మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయి పాలించుకోవచ్చును. కానీ రాహుల్ గాంధీకి కనీసం ఆ అవకాశం కూడా ఉండదు. ఆయన రాజకీయ జీవితం ఉన్నత దశకు చేరక మునుపే ముగింపుకి చేరుకొంటుంది.   అందువల్ల రానున్న ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. రెండు ప్రధాన పార్టీల, ప్రధాని అభ్యర్ధుల జీవన్మరణ పోరాటమని చెప్పుకోవచ్చును.

chandrababu

కొత్తనీరు అంతా మంచిదే కాకపోవచ్చును:తెదేపా కార్యకర్తలు

  ఎన్నికల సమర శంఖం పూరించిన చంద్రబాబు నాయుడు, తెదేపా నుండి గతంలో ఇతర పార్టీలలోకి వెళ్ళినవారిని తిరిగి పార్టీలోకి రప్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడాలనుకొంటున్నసమర్దులయిన నేతలను కూడా పార్టీలోకి ఆకర్షించాలని ప్రయతిస్తున్నారు.    చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అవినీతిమయమయిన కాంగ్రెస్ పార్టీలో చాలా మంది దొంగలు ఉన్నపటికీ, కొందరు సమర్ధులు, ప్రజాదారణకల నేతలు కూడా ఆ పార్టీలో ఉన్నారని, అటువంటి వారు తెదేపాలోకి రాదలిస్తే మనం వారిని స్వాగతిద్దాము” అని అన్నారు.   వైజాగ్ నుండి మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు తెదేపాలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ గంటా రాకను తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తెదేపాలోకి రావడాన్ని పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. తోట శ్రీరాములు, వంగా గీత తదితరలు కూడా తెదేపాలోకి వచ్చేఆలోచనలో ఉన్నారు. నెల్లూరు నుండి కాంగ్రెస్ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, సర్వేపల్లి నుండి అడ్డాల ప్రభాకర్ రెడ్డి తెదేపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకా అనేకమంది కాంగ్రెస్ శాసనసభ్యులు, కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్న గల్లా జయదేవ్ వంటివారు అనేకమంది తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే వారి రాకవల్ల పార్టీలో అలజడి లేవకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఎవరయినా ఇతర పార్టీల నేతలను తెదేపాలోకి చేర్చుకొనే ముందు స్థానిక తెదేపా నేతల, కార్యకర్తలని సంప్రదించి, తప్పనిసరిగా వారి అభిప్రాయలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే కొత్తవారిని చేర్చుకొంటామని ఆయన చెపుతున్నారు. వారిమాట కాదని బలవంతంగా కొత్తవారిని తెచ్చివారి నెత్తిన పెట్టబోమని కూడా ఆయన హామీ ఇచ్చారు.   ఒకేసారి బయట నుండి అనేకమందిని పార్టీలోకి ఆహ్వానిస్తే, చిరకాలంగా పార్టీని అంటిపెట్టుకొని సేవ చేస్తు టికెట్స్ఆశిస్తున్నవారు ఆందోళన చెందడం సహజం, అందువల్ల చంద్రబాబు నాయుడు, కొత్తావారిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నపటికీ, చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగయినా పార్టీ గెలవడం అత్యవసరమయినప్పటికీ, ఆ తొందరలో ఎవరినిపడితేవారి నమ్మిఅవకాశావాదులకు టికెట్స్ ఇస్తే, ఎన్నికలలో గెలిచిన తరువాత వారు పార్టీని మోసం చేసి వేరే పార్టీలలోకి మారిపోయే ప్రమాదం ఉంది.   కొన్ని నెలల క్రితం దాదాపు 11మంది తెదేపా శాసనసభ్యులు ఒకేసారి వైకాపాలోకి చేరడం, వారిపై స్పీకర్ ని అనర్హత వేటు వేయమని పిర్యాదు చేయవలసిరావడం వంటి అంశాలను మరిచిపోకూడదని తెదేపా కార్యకర్తలు కోరుతున్నారు. కొత్త నీరు అంతా మంచిది. పాతనీరు పనికి రాదని బయటపారబోసుకోవడం మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు వారి సలహాలను పాటిస్తారో లేదో, వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారో లేదో క్రమంగా తేలుతుంది.

 seemandhra mps on telangana

ఎంపీల..ఘీంకారాలు...ఏం సాధించాలని?

      ఆ పార్టీ అధ్యక్షురాలేమో రాష్ట్రాన్ని ముక్కలు చేసే విషయంలో మరో మాట లేదంటారు. ఆ పార్టీ ఎంపీలేమో ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వబోమంటారు. ఒకవైపు విభజన బిల్లు మీద చర్చ జరగాలంటారు. మరోవైపు ఆ బిల్లును రాష్ట్రపతి తిప్పి పంపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూంటారు. తాము రాజీనామా చేశామని అయితే స్పీకరు ఆమోదించకపోతే తామేం చేయగలమంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తారు. మిన్ను విరిగి మీదపడినా విభజనను ఆపి తీరుతామని నిబద్ధత ఒలకబోస్తారు. ఇవన్నీ చెప్పింది ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాంగ్రెస్‌ ఎంపీల గురించే. ఓ వైపు విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే వీరు మాత్రం తమ డాంబికాలతో జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. తాజాగా ఆదివారం వీరిలో ఓ 5గురు ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. తమ వాదన వినిపించారు. వీరి వాదనను ప్రణబ్‌ సావధానంగా విన్నారని, రాజ్యంగప్రకారం విభజన అనే విషయంలో సానుకూలంగా స్పందించారని వీరు బయటకు వచ్చి మీడియాతో చెప్పారు. అయితే కొంతకాలంగా ఈ కాంగ్రెస్‌ ఎంపీల ప్రకటనల్లోని డొల్లతనాన్ని అర్థం చేసుకుంటున్నారు కనుక జనం ఏమీ నమ్మలేదనుకోండి. తొలిసారి డిసెంబరు 9న విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచి పరిశీలిస్తే గత 3 సంవత్సరాలుగా తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడడంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షల ప్రకారం నడుచుకోవడంలో వీరు విఫలమైన సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రాంత నేతలు ఒకటే మాట మీద ఉండి తమకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే ఊరుకోమని, పార్టీ మారడం తధ్యమని అధినేత్రిని పదునైన పదజాలంతో, చేష్టలతో హెచ్చరిస్తుంటే... వీరు మాత్రం స్వంత వ్యాపారాల్లో, లాబీయింగుల్లో, లాలూచీల్లో తలమునకలైపోయి తెలంగాణ విషయం మీడియా ప్రస్తావించినప్పుడల్లా ‘అధిష్టానం ఎలా చెబితే అలా ఓకె’ అంటూ పరోక్ష అంగీకారాన్ని చెబుతూ వచ్చారు. అదే విధంగా సీమాంధ్రలో జగన్‌ తమ పార్టీని చీలుస్తున్నా...చీల్చి చెండాడుతున్నా పట్టించుకోకుండా జగన్‌పార్టీ ఎదుగుదలకు మూగసాక్షులుగా నిలిచారు. అవినీతి కేసుల మీద జైలుపాలైన వ్యక్తిని విమర్శించడం మాని పరోక్ష మధ్ధతు తెలియజేస్తూ... చేజేతులా తమ పార్టీ నాశనాన్ని కొనితెచ్చుకున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన అధిష్టానం... ఎన్నికలవేళ ఎలాగోలా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మరో దారి లేక విభజనకు పచ్చజెండా ఊపేసింది.     సరే... ఇంతవరకూ జరిగిందేదో జరిగింది. విభజన నిర్ణయం తర్వాతైనా సరిగా స్పందించారా అంటే అదీ లేదు. నిర్ణయం జరిగిన కొన్ని రోజుల తర్వాత అది కూడా ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగసిన తర్వాత... హడావిడిగా ప్రెస్‌మీట్లు పెడుతూ... తొలుత ఇది జస్ట్‌ కేవలం ప్రకటనే కదా అన్నారు. ఆ తర్వాత సీడబ్యూసీ తీర్మానమే కదా అన్నారు... ఆ తర్వాత బిల్లు రాష్ట్రపతికి వెళ్లాలికదా అన్నారు. ఆనక అసెంబ్లీకి రావాలి కదా... ఇప్పుడేమో తిరిగి రాష్ట్రపతి ఆమోదం పొందాలి కదా..... అంటూ జనాల్ని వెర్రివెంగళప్పలు చేద్దామనే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు. పైగా ఇదంతా అయ్యాక అప్పుడు వచ్చి ఉద్యమిస్తారట. (ఇది అంటోంది కూడా అందరూ కాదు కొందరే) అయినా తమ పార్టీ రాజకీయం కోసమే ఈ విభజనకు పాల్పడిరదంటున్న నేతలు అధినేత్రిని పల్లెత్తుమాట అనకపోవడంలోని అంతర్యం ఏమిటి? అనైతికంగా ఓట్లు  సీట్లు తెచ్చుకోవడం, లాలూచీ పడడం ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్న వైనాన్ని పూర్తిగా బయటపెట్టడానికి జంకు దేనికి?     కొద్దో గొప్పో వీరు చెప్పుకోగలుగుతున్నది అవిశ్వాసతీర్మానం గురించి మాత్రమే. అయినా స్వంత పార్టీ మీద అవిశ్వాసం పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని ఎవరూ ఆశించలేదు. ఇక ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎం.పీ సబ్బం హరి ఏమంటారంటే...‘‘మూడేళ్ల క్రితం అయితే విభజన సాఫీగా జరిగిపోయేదే’’నని. మరో ఎం.పి ఉండవల్లి ఏమంటారంటే... కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం వల్ల తమకు రాజకీయభవిష్యత్తు లేకుండా పోయిందని... ఈ మాటలు వింటుంటే... వీరు విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఉందా? లేకపోతే తమకు రాజకీయంగా నష్టం కాబట్టి తప్పదు కాబట్టి మాట్లాడుతున్నట్టు ఉందా? ఒకవైపు ఆమ్‌ఆద్మీ లాంటి పార్టీలను గెలిపిస్తూ... దేశవ్యాప్తంగా జనం తమ తెలివిడిని తాము నిరూపించుకుంటున్నా.... మన రాష్ట్రంలోని రాజకీయనేతలు మాత్రం ఇంకా జనం చెవుల్లో పూలు పెట్టగలమనే ధీమాతోనే ఉండడం నిజంగా... వారి అజ్ఞానానికి నిదర్శనం. 

congress party

వందేళ్ల పార్టీ... వాడి‘పోయింది’...

      ఎవరైనా చనిపోతే నూరేళ్లూ నిండాయంటూంటాం. కాంగ్రెస్‌పార్టీ కూడా ఇప్పుడు అదే పరిస్థితికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆవిర్భావదినోత్సవం జరుపుకుంటున్న ఆ పార్టీ నిజానికి జరుపుకోవాల్సింది ముగింపోత్సవాలే. వందేళ్ల చరిత్ర తమకుందంటూ గప్పాలు కొట్టుకునే ఆ పార్టీ... ప్రస్తుతం ఉన్నంత ఘోరమైన పరిస్థితిలో ఎప్పుడూ లేదనేది నిస్సందేహం. విచ్చలవిడిగా కార్పొరేట్‌, రాజకీయ అవినీతికి బాటలు పరిచి, అధికారవ్యవస్థను వ్యాపారుల చేతిలో కీలుబొమ్మగా మార్చి ప్రజలను కేవలం ఓటుబ్యాంకులుగా, ఒక కుటుంబాన్ని అధికారంలో ఉంచడానికి ఉపయోగపడే పావులుగా వాడుకుంటూ... వారసత్వరాజకీయాలే దేశానికి శరణ్యంగా మార్చింది. తద్వారా పరోక్ష రాజరికాన్ని దేశప్రజలపై రుద్దింది.     సరిగా గమనిస్తే ఈ మధ్యే కాదు... గత కొన్నేళ్లుగా ఆ పార్టీ ప్రాభవం నామమాత్రమైపోయిన వాస్తవం స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రజావ్యతిరేక పాలన పుణ్యమాని పుట్టుకొచ్చిన చిన్నా చితకా పార్టీలు ప్రజలకు మిగిలిన దిక్కుగా మారిన పరిస్థితికి కారణం వెదకాల్సిన కాంగ్రెస్‌... ఆయా ప్రాంతాల వారీగా పుట్టుకొచ్చిన పార్టీలతో అవసరార్థ పొత్తులు ఏర్పరచుకుంటూ ఏదో రకంగా అధికారంలో కొనసాగడానికి తపించింది. ఫలితంగా ఆ పార్టీ మరింతగా శుష్కించుకుపోయి ఇప్పుడు పూర్తిగా జీవఛ్చవమైంది. దేశంలోని సకల అవలక్షణాలకూ కారణమైన ఆ పార్టీ అధికారమే పరమావధిగా ఆడిన ప్రాంతీయ ఆటలు, వేసిన వెకిలి పన్నాగాలు ఇప్పుడు అదే పార్టీకి పెను శాపంగా మారి దాన్ని అంపశయ్య మీదకు చేర్చాయి. అయినా ఇప్పటికీ ఆ పార్టీ  బుద్ధి తెచ్చుకోలేదని ఆంధ్రప్రదేశ్‌లో అది మొదలుపెట్టిన నీచ రాజకీయపు ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి. దశాబ్థాలుగా నానుతున్న సమస్యను తీర్చేస్తున్నట్టుగా నాటకమాడుతూ ప్రశాంతంగా జీవిస్తున్న తెలుగు ప్రజల మధ్య చిచ్చుకు కారణమైంది. ఒకో  ప్రాంతంలో ఒకో పార్టీని వెనుకనుండి రెచ్చగొడుతూ, తామనుకున్న నాయకుడిని దేశ ప్రధానిగా చేసేందుకు తహతహలాడుతోంది. ఇంత చేసినా ఆ పార్టీకి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ గౌరవం పెరగకపోవడం ప్రజల్లో దాని కుట్రల పట్ల పెల్లుబికుతున్న ఏహ్యభావానికి నిదర్శనం. అనుకున్నది సాధించడానికి తాను కూర్చున్న కొమ్మని సైతం నరుక్కోవడానికి వెనుకాడని ఆ పార్టీ నైజం ప్రజల చేత ఛీకొట్టేలా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ అధికారం ఎండమావేననేది కాంగ్రెస్‌కు తెలుస్తోందో లేదో కానీ... దేశాన్ని ఎన్నో రకాలుగా వెనుకంజ వేయించిన ఆ పార్టీని ఇక కోలుకోనివ్వబొమని జనం అంటున్నారు. హ్యాపీ బర్త్‌ డే టూ యూ కాంగ్రెస్‌.

rahul gandhi

ఆదర్శ యువరాజు మళ్ళీ నాన్సెన్స్ అన్నారహో

  ఒరే బాబు.. నువ్వా మీడియా సమావేశాలకి వెళ్ళకురా నాయినా.. నీ పుణ్యం ఉంటుంది. నా బీపీ ఒకటే ఇదిగా పెరిగిపోతోందిరా అవి చూస్తుంటే..   అదేంటి మమ్మీ.. అవినీతిని పారద్రోలాలని మన పార్టీ ఎప్పటి నుండో పాడుతున్నపాచి పాటనే కదా నేను పాడింది. నేనేం తప్పు మాట్లాడేనని వద్దంటున్నావు?   బావుందిరా నాయినా.. అదివరకు మన ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ ని నువ్వు ‘నాన్సెన్స్’అని తీసిపారేసినప్పుడు మన పరువు కాపాడుకోవడానికి ఎన్నితిప్పలుపడ్డామో చూసిన తరువాతయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటావనుకొన్నాను. కానీ..మళ్ళీ..   అదేమిటి మమ్మీ... నువ్వు కూడా అపోజిషన్ పార్టీలాగ నన్నేఆడిపోసుకొంటావు? మనమిద్దరం కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరిగినా నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయామా? అందుకే మన పార్టీని వచ్చేఎన్నికలలో ఎలాగయినా గెలిపించాలనే తాపత్రయంతో మనల్ని చీపురు కట్టతో ఊడ్చేసిన ఆ అమాద్మీవాళ్ళలాగే నేను కూడాఅవినీతికి వ్యతిరేఖంగా పోరాడుదామన్నాను.... అందుకు నువ్వు సంతోషించకపోగా నన్నే తిడతావేమిటి?   ఆ.. తిట్టక మరేమీ చేస్తాను? అయినా నీకు మరేదీ దొరకనట్లు పోయిపోయి మన ఆదర్శ కుంభకోణం గురించే మాట్లాడి మన కొంపముంచాలా నాయినా...? అందులో నలుగురు మన మాజీ ముఖ్యమంత్రులు, మన కొమ్ముకాసే అనేకమంది అధికారులు ఉన్నారు. వారు పాపం ఏదో ముచ్చటపడి ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం చేసుకొంటే, దానిని కప్పెట్టేందుకు మేము నానా తిప్పలుపడుతూ ఆ కమీషన్ రిపోర్టుని త్రొక్కిపెడుతుంటే , నువ్వు తగుదునమ్మా అంటూ టాట్..మన మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్టును తిరస్కరించడం చాలా తప్పు..మళ్ళీ పునః పరిశీలించవలసిందేనని.. మీడియా ముందే అలా అనేస్తే మేము తలలు ఎక్కడ పెట్టుకోవాలిరా బాబు?   అయినా ఆ రిపోర్టు గురించి నీకేమి తెలుసనీ అలా మాట్లాడేసావు. అందులో మన సుషీల్ కుమార్ షిండే అంకుల్ పేరు కూడా ఉంది తెలుసా? నీ అవినీతి పోరాటంతో పార్టీ గెలవడం మాట దేవుడెరుగు అదే మన కొంప ముంచేలా ఉందిరా అబ్బాయ్...ఇప్పటికే నాలుగు రాష్ట్రాలో తుడిచిపెట్టుకు పోయాము. ఇప్పుడు నీ మాటలతో మహారాష్ట్రాలో కూడా క్లీన్ అయిపోతామేమో..అయినా నీకు పుణ్యం ఉంటుంది గానీ నువ్వా మీడియా సమావేశాలు మానుకోరా అబ్బాయ్! అసలే ఎన్నికల వేళ..నువ్విలా మాటిమాటికి నోరు జారుతుంటే ఇక మనల్ని ఆ నరేంద్ర మోడీయే దింపనవసరం లేదు. మనమే దిగిపోయి మోడీకి ఆ కుర్చీఅప్పగించవలసి వస్తుంది జాగ్రత్త!   ఓహ్! మన వెనుక ఇంత డర్టీ స్టోరీ ఉందన్నమాట! సారీ మమ్మీ..నాకు ఈ స్టోరీ అంతా తెలీక రొటీన్ గా అవినీతి మీద లెక్చర్ దంచుతుంటే ఏదో ఫ్లోలో అలా అనేసాను. ఇంకెప్పుడు అవినీతిపై పోరాటం గురించి మాట్లాడను. ఓకేనా!   ప్రామిస్!   యస్ మమ్మీ! మదర్ ప్రామిస్!   దట్ ఈజ్ గుడ్ బేటా..కీప్ ఇట్ అప్!   ఆ..మమ్మీ! మొన్న కిరణ్ అంకుల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ కి వచ్చినప్పుడు రాష్ట్ర విభజన గురించి నన్ను ఒకే ఒక్కసారి ‘నాన్సెన్స్’ అనమని చాలా రిక్వెస్ట్ చేసారు..మమ్మీ. పాపం! ఆయన అంతగా అడుగుతున్నారు కదా...పోనీ.. ఓసారి ‘నాన్సెన్స్’ అనమంటావా...భలే థ్రిల్లింగా ఉంటుంది....   అయ్య బాబోయ్...ఇదిగో సెక్రెటరీ నిన్నే.. త్వరగా ఆ బీపీ మాత్రలు అందుకో..ఆ క్విక్...

botsa

కాంగ్రెస్ ఓటమిని ఖరారు చేసిన బొత్స

  పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నిన్నగాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఏ ఏ జిల్లాల నుండి ఎంత మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడనున్నారో నావద్ద లిస్టు ఉంది. అధికారం లేనిదే బ్రతకలేమని భావించేవారే పార్టీని వీడుతున్నారు. కానీ ప్రజాసేవకు పదవులతో నిమ్మితం లేదని భావించేవారు మాత్రం ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీని వీడబోరు. దాదాపు 25మంది శాసనసభ్యులు ఇద్దరు మంత్రులు పార్టీని వీడుతారని మావద్ద స్పష్టమయిన సమాచారం ఉంది."   "ఒకేసారి ఇంతమంది పార్టీని వీడటం కొంచెం కష్టమనిపించినప్పటికీ, అటువంటి స్వార్ధపరులు బయటకి వెళ్ళిపోవడమే పార్టీకి మేలని నేను భావిస్తున్నాను. కానీ, ఒక్క విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు పార్టీని వీడి బయటకి వెళ్ళిపోతున్నవారిలో ఏ ఒక్కరూ కూడా మళ్ళీ ఎన్నికయ్యి శాసనసభ లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా అటువంటి వారికి తగిన గుణపాటం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు,” అని అన్నారు.   అధికారం లేనిదే బ్రతకలేమని భావిస్తునవారే తమ పార్టీని వీడుతున్నారని చెప్పడంతోనే ఆయన తమ పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పకనే చెప్పారు. నీళ్లున్నచోటకే కప్పలు, బెల్లం మీదనే ఈగలు ఎలాగా వాలుతాయో, అధికారం ఉన్న చోటికే రాజకీయ నాయకులు కూడా తరలి వెళ్ళిపోతారు. అదే మాటను బొత్స ఇప్పుడు చెప్పారు.తమ పార్టీ గెలుస్తుందని బొత్స చెప్పుకొంటున్నపటికీ, తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదనే గట్టి నమ్మకంతోనే తమ నేతలు పార్టీని వీడుతున్నట్లు అంగీకరించారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావిస్తే వారు వేరే పార్టీలోకి మారేవారు కాదు కదా? అని బొత్స చెప్పకనే చెప్పారు.   అయితే పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న బొత్స పనిగట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈవిషయం టాంటాం చేసుకొని స్వయంగా పార్టీ పరువు ఎందుకు తీస్తున్నారో ఆయనకే తెలియాలి. కానీ బయటకి పోయేవారి సంఖ్యను సగానికి కుదించి కొంతలో కొంత పార్టీకి ఊరటనిచ్చారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారందరూ నిజాయితీపరులు, పదవీ కాంక్ష లేనివారని చెప్పుకోవడం ఈ ఏటి గొప్ప జోక్ అని ఒప్పుకోక తప్పదు. అలాగే బయటకి పోయినవారు దుష్టులు, దుర్మార్గులు, స్వార్ధ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చేవారని ఆయన సర్టిఫై చేయడాన్నిఎవరూ తప్పు పట్టకపోవచ్చును. గానీ, రేపు ఎన్నికల తరువాత మళ్ళీ వారందరూ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతునప్పుడు ఆయన ఇప్పుడు జారీ చేసిన సర్టిఫికెట్స్ అలాగే ఉంటాయా లేక రద్దయిపోతాయో కూడా కొంచెం స్పష్టం చేస్తే బాగుంటుందేమో. ఏమయినప్పటికీ మీడియా సమావేశం పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీ ఓటమిని పీసీసీ అధ్యక్షుడే ఖరారు చేయడం కాంగ్రెస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిందే.

tdp

రాష్ట్ర విభజనపై ఎవరిది అనుమానాస్పద వైఖరి

  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనపై నేటికీ ఒక స్పష్టమయిన వైఖరి అవలంబించకుండా ఇరు ప్రాంత ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్, వైకాపా, తెరాసలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ మూడు పార్టీలకు లేని సమస్య ఒక్క తెదేపాకు మాత్రమే ఉన్నందునే ఆవిధంగా వ్యవహరించవలసి వస్తోందని ఆ పార్టీలకు కూడా తెలుసు. కేవలం తెలంగాణాకే పరిమితమయిన తెరాస, సీమాంధ్రకే పరిమితమయిన వైకాపాలకు రెండో ప్రాంతంలో పోటీ చేసే ఆలోచన, అవసరం కూడా లేదు గనుక ఆ రెండు పార్టీలు విభజనపై తమకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా స్పష్టమయిన వైఖరి అవలంబించగలుగుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నకాంగ్రెస్ పార్టీ, అందుకోసం తన పార్టీని తెరాస, వైకాపాలకు తాక్కట్టుపెట్టుకోవడానికి మానసికంగా సిద్దపడింది గనుక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలందరూ అభ్యంతరాలను, అభ్యర్ధనలను కాదని విభజనపై గట్టిగా మాట్లాడగలుగుతోంది.   ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని ఉంటే నేడు వైకాపా పరిస్థితి ఏటికి ఎదురీదుతున్నట్లు ఉండేది. కానీ దాని అదృష్టవశాత్తు తెదేపా ఆవిధంగా చేయకపోవడంతో వైకాపాకు అది ఆయాచిత వరంగా మారింది. అదేవిధంగా ఒకవేళ వైకాపా కూడా నేటికీ రెండు ప్రాంతాలలో పోటీ చేయాలని భావించి ఉండి ఉంటే, ఆ పార్టీ నోట కూడా సమైక్యమనే మాట వినపడేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును.   తెదేపా రెండు ప్రాంతాలలో ఎలాగయినా పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే నేటికీ స్పష్టమయిన వైఖరి చెప్పలేకపోతోంది. కానీ, రాష్ట్ర విభజనకు ఇచ్చిన లేఖపై నేటికీ తెదేపా కట్టుబడే ఉంది. కానీ సీమాంధ్రలో పార్టీ ప్రయోజనాలు దెబ్బ తింటాయనే భయంతోనే ఆమాటను గట్టిగా చెప్పుకోలేకపోతోంది. అందువల్ల ఆపార్టీ తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతోందని తెలిసి ఉన్నప్పటికీ, మౌనం వహించక తప్పడం లేదు.   కానీ సమైక్యవాదం చేస్తున్న వైకాపా కేవలం సీమాంధ్ర పైనే తన దృష్టి పెట్టడం గమనిస్తే అది మనస్పూర్తిగా రాష్ట్ర విభజనను కోరుకొంటున్నసంగతి స్పష్టమవుతోంది. తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతో పార్టీలోని ఇరు ప్రాంతాల నేతలను తమ తమ ప్రాంతాల ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మాట్లాడేందుకు అంగీకరించవలసి వస్తే, సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించాలనే తాపత్రయంతో వైకాపా భూటకపు సమైక్యవాదం చేస్తోంది.   నిజం చెప్పాలంటే తెదేపా వ్యవహరిస్తున్నతీరుని, అందుకు గల కారణాలను సామాన్య ప్రజలు కూడా స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. కానీ సీమాంధ్రపై పట్టుకోసం సమైక్యవాదం చేస్తున్న వైకాపా వైఖరే చాలా అనుమానాస్పదంగా ఉందని చెప్పక తప్పదు.

apngo

ఉద్యోగుల ఐక్యతను తొలచివేసిన రాజకీయ చీడ పురుగులు

  దాదాపు ఐదారు లక్షల మంది వివిధ శాఖలకి చెందిన ప్రభుత్వోద్యోగులు అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి రెండున్నర నెలలుపైగా అనేక కష్టనష్టాలకు ఓర్చి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు పోరాడారు. అంత సుదీర్గ కాలంపాటు వారిని ఆవిధంగా సంఘటిత పరచిన వ్యక్తి వారి నాయకుడు అశోక్ బాబేనని అంగీకరించక తప్పదు. మొదట్లో ఉద్యోగులందరూ కూడా తమకు ఏ రాజకీయ పార్టీపట్ల అభిమానం ఉన్నపటికీ, ఉద్యమం పార్టీలకతీతంగా సాగినందున పూర్తి ఐఖ్యత ప్రదర్శించగలిగారు. అదీగాక ఆ సమయంలో అందరిలో రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తపన తప్ప మరి దేనికీ అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ఇక కేంద్రమంత్రులు, యంపీలు ఆడిన రాజీనామా డ్రామాలు, రాష్ట్ర విభజనపై కేంద్రం చేసిన హడావుడి వగైరాలు వారినందరినీ ఏక త్రాటిపై నిలిపి ఉంచాయి. సమ్మెజరుగుతునంత కాలం ఎంతో ఐక్యతగా మెలుగుతూ అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించిన ఉద్యోగులు, సమ్మెవిరమించిన తరువాత క్రమంగా ఒకరితో మరొకరు విభేదించడం దురదృష్టకరం. సమ్మె ముగింపు విషయంలో మొదలయిన విబేధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకొన్నట్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నవారి నేతలే మాటలే స్పష్టం చేస్తున్నాయి. అయితే తమలో ఎటువంటి విభేదాలు లేవని పదేపదే వారు చెప్పవలసి రావడమే విభేదాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. బహుశః ఉద్యోగులలోకి కొన్నిరాజకీయ పార్టీలు ప్రవేశించినందునే నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండవచ్చును. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి వికృత రాజకీయ క్రీడలు ఆడుతున్న రాజకీయ పార్టీలు, నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో విఫలమయినా, ఉద్యోగుల ఐఖ్యతను దెబ్బతీయడంలో సఫలమయ్యాఋ. ఉద్యోగులు అనేక కష్టనష్టాలకు ఓర్చిరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమం చేస్తే వారికి బేషరతుగా అండగా నిలవాల్సిన రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం వారిలో చీలికలు సృష్టించడం చాలా దురదృష్టకరం. విజ్ఞులయిన ఉద్యోగులు తమ మధ్యకి ప్రవేశించి తమ ఐక్యతను తొలచివేస్తున్న ఆ రాజకీయ చీడ పురుగులను ఏరి పడేయకపోతే అవి వారిని పూర్తిగా తొలచి గుల్ల చేసేయడం ఖాయం. 

Telangana bill debate

చర్చా ... రచ్చా ...

      నూతన సంవత్సరారంభంలోనే సంక్లిష్టమైన సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎదుర్కోబోతోంది. తెలంగాణా ముసాతిడా బిల్లు రూపంలో రానున్న ఆ కీలక సందర్భానికి మా శాసనసభ్యులు సిద్ధమయ్యారా? మా తరపున పదునైన అస్త్రశస్త్రాలు సంధించనున్నారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం, పాలకవర్గాలు నిన్నం ఒన్నటి దాకా సీమాంధ్ర, తెలంగాణాల పేరిట సమాంతరంగా చీలిపోయి ఉన్నట్టు కనపడడంతో ఎవరి ధోరణి ఎలా వుంటుందనేది కనిసం ఊహకు అందేది, అయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రం రెండు ముక్కలు కాకముందే ప్రజాప్రతినిథులు ఇరవై ముక్కలు ఇంకా ఎక్కువగానే అయిపోయినట్టు అనిపిస్తోంది.   ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిథుల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీలో బిల్లు చర్చకు వచ్చాక జరిగేది ఏమిటనేది సరైన విధంగా అంచనా వేయడం రాజకీయ విశ్లేషకుల వల్ల కావడం లేదు. వ్యూహాత్మకంగా సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి చర్చలో కీలకం కానుంది. ఇప్పటికే సి.ఎం. వైఖరి పట్ల తెలంగాణ మంత్రుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా, సీమాంధ్ర మంత్రుల్లోనూ కొందరి నుండి అదే స్థాయి వ్యతిరేకత తప్పడం లేదు. నిన్నా మొన్నటిదాకా సిఎంకు అత్యంత అనుకూలంగా వ్యవహరించే కొండ్రు మురళి వంటి మంత్రులు సైతం విభజనకు పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతుండడం చూస్తుంటే ఎవరిది డ్రామానో, ఎవరిది నిజమో అర్థంకాని పరిస్థితి. మరోవైపు చర్చలో పాల్గొన్నప్పుడు బిల్లులోని విభిన్న అంశాలపై ఆయా రంగాలకు చెందినా మంత్రులు మాట్లాడాల్సి ఉంటుంది. విద్యుత్, నదీజలాలు, శాంతిభద్రతలు, రాజధాని ... ఇలా ఒక్కో అంశంపై సంబంధిత శాఖ మంత్రి మాట్లాడాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటిదాకా సీమాంధ్ర మంత్రులెవరూ ఆయా అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధం చేసుకుంటున్న దాఖలాలు లేవు, అన్నింటికీ ఆయాదే భారం అన్నట్టు ముఖ్యమంత్రిపై నెపం నెట్టేస్తున్నారు. గెలిచినా, ఓడినా .. సమైక్యాంద్ర కోసం పోరాడిన ఏకైన వీరుడి క్రెడిట్ కోసం నానా తంటాలు పడుతున్న ముఖ్యమంత్రికి ఇది కూడా ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ మంత్రులు పక్కాగా రెడీ అవుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ... మూడున అసెంబ్లీకి రానున్న తెలంగాణ బిల్లుపై చర్చ ... ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.

jc diwakar reddy

జేసీ కోసం తెదేపా పరిటాలను వదులుకోగలదా?

  అనంతపురంలో కాంగ్రెస్ పార్టీకి జేసీ.దివాకర్ రెడ్డి కుటుంబము, తెదేపాకు పరిటాల కుటుంబము పాతకాపుల వంటివి. వారివల్లనే అక్కడ ఆ రెండు పార్టీలు నువ్వా నేనా? అన్నట్లు కొనసాగుతున్నాయి. సీమాంధ్రలో రాష్ట్ర విభజన రగిల్చిన చిచ్చుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. వారిలో జేసీ.దివాకర్ రెడ్డి కూడా ఒకరు.   ఈ విభజన చిచ్చుకు తోడు రెండు నెలల క్రితం పాలెం బస్సు దుర్ఘటన తరువాత దివాకర్ ట్రావెల్స్ సంస్థకు చెందిన అనేక బస్సులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆదేశాలతో రవాణాశాఖా అధికారులు కేసులు నమోదు చేసి కదలనీయకుండా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకే ఈ సాకుతో బొత్ససత్యనారాయణ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్న, దివాకర్ రెడ్డి నేరుగా సోనియా గాంధీ, బొత్ససత్యనారాయణలపై విమర్శలు ఆరంబించారు. ఈ కధ ఇప్పుడు షో-కాజ్ నోటీసుల క్లైమాక్స్ సీనుకి చేరుకోవడంతో, జేసీ బ్రదర్స్ వేరే పార్టీలోకి మారక తప్పని పరిస్థితి ఏర్పడింది.   అనంతపురంలో ఇంతవరకు పరిటాల కుటుంబంపైనే ఆధారపడి ఉన్నతెదేపా, ఇదే అదునుగా జేసీ కుటుంబాన్నికూడా పార్టీలోకి రప్పించగలిగితే, ఇక జిల్లాలో తమ పార్టీకి తిరుగే ఉండదని భావించి ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే తమ రాజకీయ ప్రత్యర్దులయిన జేసీ బ్రదర్స్ కుటుంబాన్ని తెదేపాలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను పరిటాల కుటుంబం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఒకవేళ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే తాము పార్టీని వీడక తప్పదనే బలమయిన సంకేతాలు కూడా ఇచ్చారు.   అయితే ఎలాగయినా పరిటాల సునీతను ఒప్పించి, కనీసం దివాకర్ కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని తెదేపా ప్రయత్నిస్తోంది. పవన్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరిక దాదాపు ఖాయమయినట్లు తాజా సమాచారం. జేసీ బ్రదర్స్ తెదేపాలో చేరకపోయినా, పవన్ కుమార్ రెడ్డికి తెదేపా టికెట్ కూడా ఇచ్చేందుకు సంసిద్దత చూపుతుండటంతో షాక్ తిన్నజిల్లా తెదేపా ఇన్-చార్జ్ పేరం నాగిరెడ్డి కుటుంబంతో సహా తేదేపాకు గుడ్ బై చెప్పి వైకాపాలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన కోడలు సరోజినీ దేవికి టికెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించినట్లు తాజా సమాచారం.   ఇంతకాలం జిల్లాలో తెదేపాకు వెన్నుదన్నుగా నిలచిన పరిటాలను జేసీ కుమారుడి కోసం తెదేపా వదులుకోగలదా? లేక పరిటాల కుటుంబం తాము తీవ్రంగా వ్యతిరేఖించే జేసీ కుటుంబం వచ్చి పార్టీలో జేరితే వారితో ఇమడగలదా? పరిటాల సునీత ఏవిధంగా స్పందిస్తారో త్వరలోనే తెలియవచ్చును.

indian diplomat

భారత్-అమెరికాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన

  భారత దౌత్యాధికారి దేవయాని కొబ్రాగడే అరెస్ట్ వ్యవహారంలో మొదట భారత్ కొంత వెనక్కి తగ్గినట్లు కనబడటంతో, దేవయాని స్వయంగా కోర్టుకి హాజరవనవసరం లేకుండా అమెరికా మినహాయింపు ఇవ్వడంతో క్రమంగా అంతా సర్దుకొంటోందని అందరూ భావిస్తున్నతరుణంలో, అమెరికా దౌత్య కార్యాలయాలలో పనిచేస్తున్నఉద్యోగుల గుర్తింపు కార్డులను, వారికి భారత్ కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను అన్నిటినీ భారత్ రద్దు చేసి, వారికి కూడా భారత్ దౌత్యకార్యాలయాలో పనిచేసే ఉద్యోగులకు అమెరికా ఎటువంటి కార్డులు, సౌకర్యాలు ఇస్తుందో అటువంటివే ఈ రోజు జారీ చేయడంతో కధ మళ్ళీ మొదటికి వచ్చింది.   దేవయానిపై అమెరికా పోలీసులు మోపిన కేసుని రద్దు చేసి, ఆమెపట్ల అవమానకరంగా వ్యవహరించినందుకు అమెరికా క్షమాపణ చెప్పాలని భారత్ కోరుతోంది. అయితే అందుకు అంగీకరించబోమని అమెరికా తెగేసి చెప్పడంతో, దేవయానికి అమెరికా చట్టాల నుండి రక్షణ కల్పించేందుకు ఆమెను ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధిగా శాశ్విత ప్రాతిపాదికన నియమిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దానివలన ఆమెపై అంతకు ముందు మోపబడిన కేసుల నుండి విముక్తి కలిగించలేవని అమెరికా చెప్పడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, అమెరికా దౌత్య ఉద్యోగులకు భారత్ కల్పిస్తున్న విశేష సౌకర్యాలను అన్నిటిని రద్దు చేసి, భారత్ దౌత్య ఉద్యోగులతో అమెరికా ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరిస్తుందో భారత్ కూడా అమెరికా ఉద్యోగులతో అదేవిధంగా వ్యవహరించాలని నిశ్చయించుకొని తదనుగుణంగా చర్యలు చెప్పట్టింది.   ఈగొడవకంతటికీ కారణమయిన దేవయాని ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్తను, భారత ప్రభుత్వానికి తెలియజేయకుండా భారత్ నుండి అమెరికా తన స్వంత ఖర్చులతో రహస్యంగా అమెరికాకు తరలించడంతో అమెరికా కూడా భారత్ కోర్టుల దృష్టిలో నేరం చేసినట్లయింది. దేవయాని అరెస్ట్ తరువాత నుండి రెండు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నపటికీ, అమెరికా ఇసుమంత కూడా వెనక్కి తగ్గేందుకు సముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది.   ఈ వ్యవహారం చివరికి ఏ విధంగా ముగుస్తుందో, ఏ పరిణామాలకు దారి తీస్తుందో కాలమే చెప్పాలి. మారుతున్న కాలంతో బాటు అమెరికా కూడా తన పెద్దన్న ధోరణిని వదులుకొని అందరితో సమానంగా మెలగడం నేర్చుకోవాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ కుర్షీద్ అన్నారు.

 TRS in rethink mode on merger with Congress

తెరాస విలీనం..డౌటే

      ఎన్నికల్లోగా తెలంగాణ రావడం అనుమానస్పందంగా మారినట్టే .. కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కూడా సందేహాస్పదంగా మారింది. గత రెండ్రోజులుగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. సోమవారం విలేఖరులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ ... తెరాస విలీనంపై అడిగిన ప్రశ్నలకు మండిపడ్డారు.   అసలు విలీనానికి తెలంగాణా అంశానికి సంబంధం ఏముందంటూ రంకెలేశారు. తెలంగాణా ఏర్పటనేది రాజ్యాంగపరమైన ప్రక్రియ అనీ, విలీనం పార్టీల మధ్య విషయం అనీ గుర్తు చేశారు. అదే తరహాలో మంగళవారం ఏఐసిసి నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. తాము మాత ఇచ్చాం కాబట్టి తెలంగాణా ఇస్తున్నామన్న దిగ్విజయ్ .. దీనికి విలీనానికి సంబంధం లేదన్నారు. మరి ఇప్పుడిలా మాట్లాడుతున్నా ఇదే నేతలు తెలంగాణ ఇస్తామన్న ప్రకటన వెంటనే తెరాస విలీనం గురించి ఎందుకు మాట్లాడారంటూ రాజకీయ వార్తాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ కుట్రలో భాగంగానే విలీనంపై రెండు పార్టీలు వెనక్కి తగ్గాయనే వాదన వినిపిస్తోంది.

పద్మశ్రీ .. ప్రమోషన్ కి మార్గమా?

      ఇద్దరు లబ్దిప్రతిష్టులైన, తెలుగు సినీ పరిశ్రమలో ఉద్దండులనదగ్గ ప్రముఖుల విషయంలో సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు అటు సినిమా రంగాన్నే కాకుండా యావత్ రాష్ట్రానికి ఓ షాక్ ఇచ్చింది. నిజానికి పద్మశ్రీ పురస్కారాలను ప్రచారానికి వినియోగించుకోవడం అనేది ఒక్క సినిమారంగానికి మాత్రమే పరిమితం కాదు ... మిగిలిన రంగాలలో కూడా ఉంది. సంస్థ బ్రోచర్ల మీద కూడా పద్మశ్రీలు ముద్రించుకుంటున్నవారున్నారు. తమ పేరుకు ముందు ఈ తరహా పురస్కారాలను రాయకపోతే మీడియా ఆఫీసులకు ఫోన్ లు చేసి మరీ తిట్టే ప్రముఖులూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తేర్పుఇ ఇలాంటి వారిలో మార్పుకు దోహదపడుతుందేమో చూడాలి. పురస్కారం పొందిన వ్యక్తి తనకు దక్కిన గౌరవాన్ని పెంపొందించుకునేలా ప్రవర్తించాలే తప్ప దాన్ని మార్కెట్ చేసుకోవాలనుకోవడం తగదనే విషయాన్ని పురస్కారగ్రహీతలు గుర్తుంచుకోవాలి. అలాంటి జ్ఞానోదయం కలిగితే ... ఏటేటా  సదరు పురస్కారాల కోసం ఎగబడే ప్రముఖుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.

ఇదో నవశకమా...'అదే' నాసిరకమా ...

      ఏదైతేనేం ఆమాద్మీ అనే సరికొత్త పార్టీ తొలిసారి భారతరాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డుల్ని స్వంతం చేసుకుని సగర్వంగా అధికారాన్ని అలంకరించనుంది. సామాన్యుడి పక్షం అనే ఆకర్షణీయమైన నినాదంతో అవినీతిని ఊడ్చేస్తాననే అద్భుతమైన ఆశాదీపం వెలుగుల్లో దూసుకొచ్చిన ఈ పార్టీని జనం ఆదరించిన తీరు ... సంప్రదాయ పార్టీల పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర నిరాశా నిస్పృహలకు నిలువుటద్దంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారానికి అవసరమైనన్ని సీట్లు రాకపోయినా ప్రజాభిప్రాయం మేరకు పాలనా పగ్గాలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆమాద్మీ ఇకపై ఎలా పనిచేస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. విఐపి సంస్కృతికి చరమగీతం పాడడం, ఢిల్లీకి స్వయంప్రతిపత్తి కలిగించడం, కాలనీల క్రమబద్ధీకరణ, పక్కా ఇళ్ళ నిర్మాణం ... వంటి ఎన్నో జనాకర్షక, విప్లవాత్మకమైన ప్రణాళికలను ప్రకటించిన ఆమాద్మీ ఆచరణలో అదీ మైనారిటీ ప్రభుత్వంతో ఎలా అమలు చేస్తుందనేది ప్రతిఒక్కరిలోనూ ఆసక్తిని రేకెత్తించేదే. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడానికి అంగీకరించడం ఆమాద్మీకి తొలి మైనస్ పాయింట్. సరే ... ఇప్పుడు తప్పనిసరై తీసుకున్నామనో, ప్రజలు చెప్పారు కాబట్టి అంగీకరించామనో సమర్థించుకోవచ్చు. అయితే అధికారం కోసం భవిష్యతులో కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తడం అనేది చేయకుండా, అవసరమైతే పదవుల్ని తృణప్రాయంగా వదులుకోగాలగాలి. అప్పుడే ఆమాద్మీ నిఖార్సయిన సామాన్యుడి పార్టీగా మనగలుగుతుంది. విప్లవాత్మకమైన ఆలోచనలతో ముందుకొచ్చిన పార్టీలు ఎక్కువకాలం కొనసాగడం, పాలనా పరంగానూ విజయవంతం కావడం తమ రాజకీయ భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదనే వాస్తవం తెలుసు కాబట్టి ... మిగిలిన పార్టీలు, వాటికి అండగా ఉండే కార్పొరేట్లు, వ్యాపారవేత్తలు, మాఫియాలు ... ఆమాద్మీ తరహా రాజకీయం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందనే భయంతో ఉన్న బలమైన నేతలు... కేజ్రీవాల్ కు అడుగడుగునా అడ్డంకులు సృస్టిస్తారనే విషయంలో సందేహం లేదు. వీటన్నింటినీ తట్టుకుని, అధికారం అనే ఆకర్షక వలయంలో చిక్కుకోకుండా ఐదేళ్ళ పాటు ఆమాద్మీ స్వచ్చమైన పాలనను, జవాబుదారీ వ్యవస్థను అందించగలిగితే ... అది నిజంగా అద్భుతమే. అలా జరగాలని ఆశిద్దాం. ఆ అద్భుతం భారతదేశ రాజకీయాల్ని మలుపు తిప్పాలని కోరుకుందాం.

మంత్రి గల్లా అరుణకుమారి కొడుకుకి తెదేపా టికెట్

  సాదారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ పుత్రరత్నాలకు తమ పార్టీ టికెట్స్ ఇప్పించుకొని వారు రాజకీయాలలో స్థిరపడిన తరువాత రిటర్మెంట్ తీసుకోవాలని ఆశిస్తారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు గాలులు వీస్తుండటంతో వారే కాదు, వారి పుత్రరత్నాలకు కూడా తెదేపా, వైకాపాలలో టికెట్స్ కోసం మాట్లాడుకొంటున్నారు.   కాంగ్రెస్ మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు మరియు సినీ నటుడు కృష్ణకి అల్లుడు అయిన గల్లా జయదేవ్ తెదేపా తీర్ధం పుచ్చుకోనేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయనది చిత్తూరు జిల్లా అయినప్పటికీ, అత్తవారిది గుంటూరు కావడంతో అక్కడి నుండే లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు ఆయనకు టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరి కొడుకు పచ్చ కండువా కప్పుకొంటే, మంత్రిగారు కాంగ్రెస్ కండువా కప్పుకొని కొడుకు పార్టీని తిట్టడం కష్టం గనుక మరి ఆమె కూడా తెదేపాలోకి జంపయిపోతారేమో చూడాలి. ఇక బావగారి కోసం మహేష్ బాబు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది గనుక, జయదేవ్ కి టికెట్ ఖాయం చేయడం వల్ల తేదేపాకు లాభమే తప్ప నష్టమేమి ఉండకపోవచ్చును.   జయదేవ్ తో బాటు సినీ నటుడు కృష్ణ సోదరుడు మరియు సినీ నిర్మాత అయిన జీ.ఆదిశేషగిరి రావు తెనాలి నుండి తెదేపా టికెట్ పై శాసనసభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రస్తుతం తెనాలికి ప్రాతినిద్యం వహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గుంటూరు (పశ్చిమం) నుండి పోటీ చేయవలసిందిగా చంద్రబాబు కోరినప్పటికీ, ఆయన తన నియోజక వర్గం వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.   ఇక కాంగ్రెస్ యంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు నుండి లోక్ సభకు టికెట్ ఇచ్చినట్లయితే తెదేపా సైకిల్ ఎక్కేందుకు సిద్దంగా ఉన్నారు.  

కాంగ్రెస్ నేతలు ప్రజలతో టచ్చులోనే ఉన్నారు గురూ

  మన మెగామంత్రి చిరంజీవి మహోదయులు మీడియా ముందుకు వచ్చి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయవలసిన అవసరం గురించి తడబడుతూనే అనర్గళంగా ఒక ఉపన్యాసం ఇచ్చేసి మాయమయిపోతే, ఆ తరువాత ఆ స్థానంలోకి ఏ సబ్బంహరో లేక కిల్లి రాణీగారో ముందుకు వచ్చి మైకు పట్టుకొని సీమాంధ్ర ప్రజలపై తమ కృపా కటాక్షాలు కురిపించి మళ్ళీ కొన్ని రోజులు కనబడకుండా మాయమయిపోతారు. మధ్య మధ్యలో మన లగడపాటి రాజగోపాల్ గారు ప్రత్యక్షమవుతూ గంటలకొద్దీ అనర్గళంగా ఏవేవో మాట్లాడేసి ప్రజలను కన్ ఫ్యుస్ చేసేస్తుంటారు.   వారి మధ్యలోకి టామ్ అండ్ జెర్రీలాగ మన బొత్ససత్యనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి ఎంటరయి కాసేపు హడావుడి చేసి అందరికి కితకితలు పెట్టి మాయమయిపోతుంటారు. ఇక రాష్ట్ర విభజన గురించి గుర్తొచ్చినప్పుడల్లా పాపం! మన ఆనం బ్రదర్స్ వచ్చి తమకు తోచినదేదో మాట్లాడుతూనే ఉన్నారు. గనుక, వారిని తప్పుపట్టడానికి కూడా లేదు. ఈ విధంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొని జనాలతో పూర్తి టచ్చులో ఉంటూనే మళ్ళీ అదే జనాలకి ఎక్కడా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప టెక్నిక్కేనని జనాలు సైతం ఒప్పుకొంటున్నారు కూడా.   పాపం! ఈ టెక్నిక్ ఆకళింపుజేసుకోలేని పెద్దాయన కావూరి సాంభశివరావు వంటి అమాయక మంత్రులు మాత్రం పంచె ఎగేసుకొని జనం మధ్యకి వెళ్లి కోడిగుడ్లతో సన్మానం చేయించుకొని ఆగ్రహంతో “ఒరే! సన్నాసుల్లారా! అర్ధ రూపాయికి కూడా కక్కుర్తి పడే వెదవాల్లారా...ఆ...లంచాలు పెట్టందే ఏ పని చేయని వెదవల్లారా...ఆ...నా మీదే కోడిగుడ్లు విసురుతారా? దమ్ముంటే దగ్గరకి రండి..మీ పని చెపుతాను..”అంటూ పోలీసుల చాటున నిలబడి మైకు పట్టుకొని రంకెలు వేస్తుంటే జనాలు ఆయన తిట్లు విని కోపం తెచ్చుకోకుండా “పాపం! మంత్రిగారు” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటూంటే, ఆయన మాత్రం ఫీలవరూ పాపం!   అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఆయనంత అమాయకులేమీ ఉండరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్న కిల్లి రాణీవారు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుని, ఆయన అనుచరులకి “మీ లిమిట్స్ గుర్తుంచుకోండి” అని ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసిన తరువాత, తను సమైక్యవాదిననే మరో మారు కన్ఫర్మ్ చేసేసి మాయమయిపోయారు. "రాక రాక వచ్చిన కేంద్రమంత్రి పదవిని చస్తే వదులుకోనని" బల్లగుద్ది చెప్పిన మన జేడీ శీలంగారు ఇక తనను రాజీనామా చేయమని ఎవరూ డిమాండ్ చేయరని రూడీ చేసుకోన్నాక, ఈ మధ్యనే మీడియా ముందుకు వచ్చి సమైక్యం కోసం "నేను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని" డిక్లరేషణ్ ఇచ్చేసి మాయమయిపోయారు.   ఇప్పుడు ఆయన స్థానంలోకి వచ్చిన వైజాగ్ కాంగ్రెస్ యంపీ పురందేశ్వరిగారు, “ఉమ్మడి రాజధాని కాన్సెప్ట్ మన రాజ్యాంగంలోనే లేదు. నేను అన్ని సమస్యలను వివరిస్తూ మా సోనియమ్మకు, మన్మొహనుల వారికి రెండు ఉత్తరం ముక్కలు కూడా వ్రాసిపడేశాను. వాళ్ళు పంపిన టీ-బిల్లులో  ప్రింట్ కూడా సరిగ్గా లేదని వాటిలోనే నాలుగక్షరాలు గీకి పడేసాను. అందువల్ల మీరిక నిశ్చింతగా ఉండండి. ఇదివరకు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితేనే వినని మావాళ్ళు ఇప్పుడు నేను వ్రాసి పడేసిన ఈ ఉత్తరం ముక్కలను మాత్రం పట్టించుకొంటారా? వాటిని చింపి చెత్త బుట్టలో పడేయారా? అని వెర్రిమొర్రి ప్రశ్నలు వేసి నన్ను తికమక పెట్టకండి. ఒకవేళ వారు నాఉత్తరం ముక్కలని పట్టించుకోకపోతే, నేను కూడా తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఓటేయకుండా వచ్చేస్తాను. మదర్ ప్రామిస్! అని సీమాంధ్ర ప్రజలకు ప్రామిస్ చేసేసిన తరువాత, ఆమె  కూడా మళ్ళీ జనాల మధ్య నుండి మిస్ అయిపోయారు. జనాలు.. జనాలు...తరువాత ఎవరు మాట్లాడుతారో మీకేమయినా తెలిస్తే చెప్పి పుణ్యంకట్టుకోరా... ప్లీజ్!