బర్బరీకుడి కథ తెలుసా...
బర్బరీకుడి కథ తెలుసా!
మహాభారతం ఓ జీవసాగరం. ఒకటా రెండా... అందులో వందలాది పాత్రలు. ప్రతీ పాత్రకీ ఏదో ఒక ప్రత్యేకత. అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు. బర్బరీకుడు ఎవరో కాదు! ఘటోత్కచుని కుమారుడే. అతని తల్లి పేరు మౌర్వి. బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు.
ఒకపక్క బర్బరీకుడు పెరుగుతుండగానే, కురుక్షేత్రం సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నం అయ్యింది. భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది. అలాంటి యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా! బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, నీ సాయాన్ని వారికి అందించమని కోరుతుంది. సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి, పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరీకుడు. కానీ బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు.
‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు.
‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు.
‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు.
కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు. ఆ బాణం చెట్టు మీద అకులన్నింటి మీదా తన గుర్తుని వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది.
‘అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి’ అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు.
ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి. ‘అతను కనుక యుద్ధ రంగంలో ఉంటే ఏమన్నా ఉందా!’ అనుకుంటాడు. పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే, అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు. అందుకే...
‘బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సాయాన్ని అందిస్తావో... నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు పాండవులు, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు తెలుసా!’ అని విశదపరుస్తాడు. కృష్ణుని మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో ‘ఇంతకీ నీకేం కావాలో కోరుకో!’ అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావల్సి ఉందనీ, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వ’మని కోరతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి. మారుమాటాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందనీ, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకి కల్పించమని కోరతాడు. అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.
బర్బరీకుడు పూర్వజన్మలో శాపగ్రస్తుడైన యక్షుడనీ, అతనికి శాపవిమోచనం కలిగించేందుకే తాను అతని తలను కోరాననీ వివరిస్తాడు కృష్ణుడు. అంతేకాదు... కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడనీ, అతణ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు కృష్ణుడు. మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం వల్ల, ఆయన కాలు మిగతా శరీరంకంటే బలహీనపడిపోయింది. అందుకని, శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నం అయినప్పుడు, ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది.
దక్షిణ భారతాన ఖాటు శ్యాంను ఆరాధించేవారి సంఖ్యే కాదు, అసలు ఆ పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ. కానీ ఉత్తరాదిన, ఆ మాటకు వస్తే భారతదేశాన్ని దాటి నేపాల్లోనూ ఖాటు శ్యాం బాబాను ఆరాధించేవారి సంఖ్య అసాధారణం. శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటు శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను కడతేర్చడం చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం.
- నిర్జర.