Read more!

శ్రీసాయిసచ్చరిత్రము ఆరవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము 


ఆరవ అధ్యాయము

 

 

సంసారమనే సాగరంలో జీవుడు అనే ఓడను సద్గురుడే సారంగు అయి నడుపుతున్నప్పుడు అది సులభముగా సురక్షితముగా గమ్యము చేరుకుంటుంది. సద్గురువు అనగానే సాయిబాబా స్ఫురణకు వస్తున్నారు. నా కళ్ళ ఎదుట సాయిబాబా నిలబడినట్లు, నా నుదుట ఊదీ పెడుతున్నట్టు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు అనిపిస్తున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కళ్ళనుండి ప్రేమ పొంగి పొరలుతున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రలయాగ్నితో కూడ కాలనటువంటి వాహనమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగలగానే భాస్మమైపోతుంది. అనేక జన్మములో ఆర్జించిన పాపమంతా పటాపంచలై పోతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు వినడానికే విసుగుచెందేవారి వాక్కు నెమ్మది పొందుతుంది. శ్రీసాయి సుందరరూపము వీక్షించడంతోనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదము అవుతుంది; కన్నులనుండి ఆనందాశ్రువులు పొంగి పొరలుతాయి; హృదయము భావోద్రేకముతో ఉక్కిరిబిక్కిరి అవుతాయి. 'నేనేతాన' అను (పరబ్రహ్మస్వరూపము) స్ఫురణ మేల్కొని, ఆత్మసాక్షాత్కార ఆనందము కలిగిస్తుంది. 'నేను నీవు' అనే భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభావము సిద్ధింప చేస్తుంది. నేను వేదపురాణాది సద్గ్రంధములు చదువుతున్నప్పుడు నా సద్గురుమూర్తే అడుగడుగునా జ్ఞాపకానికి వచ్చుచున్నాడు' నా సద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా నా ముందు నిలబడి, తన లీలలను తామే వినిపింప చేస్తున్నట్టు తోస్తుంది. నేను భాగవత పారాయణకు పూనుకోగానే శ్రీసాయిబాబా ఆపాదమస్తకము శ్రీకృష్ణునిలా కనిపించును. భాగవతమో, ఉద్ధవగీతమో తామే పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా యివ్వటం జ్ఞాపకానికి వస్తుంది. నాకై నేను ఏదైనా వ్రాయడానికి సిద్ధపడినప్పుడు, ఒక మాతగాని వాక్యముగాని వ్రాయటం రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనా ధార అన్తులేనట్టు సాగుతుంది. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా అణచివేస్తారు. తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి   సంతృప్తులను చేసి ఆశీర్వదిస్తారు. సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసినవారికి ధర్మార్థకామమోక్షాలు కరతాలకమవుతాయి. భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళడానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తీమార్గములనే నాలుగు దిక్కులు ఉన్నాయి. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. అది ముళ్ళు గోతులతో నిండి ఉంటాయి. సద్గురువు సహాయముతో ముళ్ళు, గోతులను తప్పించుకుని ముందుకు సాగితే గమ్యస్థానము అవలీలగా చేరుకోవచ్చు. ఈ సత్యాన్ని దృఢంగా నమ్మమని శ్రీసాయిబాబా నొక్కివక్కాణించేవారు.

 

 

స్వయంసత్తాకమైన బ్రహ్మాన్ని, జగత్తుని సృష్టించే ఆ బ్రహ్మము యొక్క శక్తి (మాయ), సృష్టి అనే ఈ మూడింటి గురించి తత్త్వవిచారము చేసి, వాస్తవానికి మూడూ ఒక్కటే అని సిద్ధాంతీకరించి, బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యాలను రచయిత ఈ క్రింద ఉదాహరిస్తున్నాడు :
"నా భక్తుని యింట్లో అన్నము, వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు. నాలోనే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనస్ఫూర్తిగా నన్నే ఆరాదిన్చేవారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను. కాబట్టి వస్త్రాలు, ఆహారముల కోసం ప్రయాస పడవద్దు. నీకేమైనా కావాలంటే భగవంతుణ్ణి వేడుకో. ప్రపంచములోని కీర్తిప్రతిష్టల కోసం ప్రాకులాడటం మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందడానికి, భగవంతుని కరుణాకటాక్షాలు సంపాదించడానికి ప్రయత్నించు. ప్రపంచ గౌరవము అనుకునే భ్రమను విడిచిపెట్టు. మనస్సులో ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుకో. సమస్త ఇంద్రియాలను మనస్సును భగవంతుని ఆరాధన కోసమే నియమించు. మిగిలినవాటి వైపు మనస్సు పోనివ్వకు. ఎప్పుడూ నన్నే జ్ఞాపకానికి ఉంచుకో. మనసును ధనం సంపాదించడానికి, దేహ పోషణకు, గృహ సంరక్షణ మొదలైన విషయాల పట్ల సంచరించాకుండా గట్టిగా నిలుపుకో. అప్పుడు అది నెమ్మది వహించి, శాంతం వహిస్తుంది. చింతారహితము అయి వుంటుంది. మనస్సు సరియైన సాంగత్యములో ఉన్నదనడానికి ఇదే గుర్తు. చంచల మనస్సుకు స్వాస్థ్యము చిక్కదు''

 

 

బాబా మాటలను ఉదాహరించిన తరువాత గ్రంథకర్త షిరిడీలో జరుగే శ్రీరామనవమి ఉత్సవాలను వర్ణించడానికి పూనుకున్నాడు. షిరిడీలో జరిగే ఉత్సవాల అన్నింటిలో శ్రీరామనవమే గొప్పది. సాయిలీల (1925- పుట 197) పత్రికలో షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల గురించి విపులంగా వర్ణించబడింది. దాని విషయాలు ఇక్కడ వివరించబడుతున్నది.
కోపర్ గాంవ్ లో గోపాల్ రావు గుండ్ అనే అతను పోలీసు సర్కిలు ఇన్స్ పెక్టర్ ఉండేవాడు. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీసాయి ఆశీర్వాదముతో అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో "ఉరుసు'' ఉత్సవము (ఉరుసు - సమాధిచెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల [సమాధుల] దగ్గర ప్రతి యేట భక్తులు జరుపుకొని ఆరాధనోత్సవము) నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. తన ఆలోచనను తాత్యాకోతేపాటీలు, దాదాకోతేపాటీలు, మాధవరావు దేశపాండే తదితర మిగిలిన సాయిభక్తుల ముందుంచాడు. వారంతా దీనికి ఆమోదించారు. బాబా ఆశీర్వాదము, అనుమతి పొందారు. ఇది 1897లో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. గ్రామకులకర్ణి (కారణము) దానిపే ఏదో వ్యతిరేకంగా చెప్పటంవల్ల అనుమతి దొరకలేదు. కాని బాబా ఆశీర్వదించి ఉండడంతో, మళ్ళీ ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరపడానికి నిశ్చయించుకున్నారు. ఈ ఉరుసు ఉత్సవాన్ని జరుపుకోవటంలో హిందూ-మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశ్యము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూస్తే బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టం అవుతుంది.

 

 

ఉత్సవము జరుపుకోవడానికి అనుమతి అయితే వచ్చింది కానీ, యితర అవాంతరాలు కొన్ని తలెత్తాయి. చిన్నగ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉంది. గ్రామమంతటికి రెండు నూతులుండేవి. ఒకటి ఎండాకాలములో ఎండిపోయేది. రెండవ దానిలోని నీళ్ళు ఉప్పగా ఉండేవి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేశారు. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయాయి. ఆ నీరు కూడా చాలకపోవడంతో తాత్యాపాటీలు దూరమునుండి మోటల ద్వారా నీరు తెప్పించారు. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసాయి. కుస్తీపోటీల కోసం ఏర్పాట్లు చేయబడినాయి. గోపాలరావు గుండుకు ఒక మిత్రుడు ఉన్నాడు. వారి పేరు దాము అన్నాకాసార్. అతనిది అహమద్ నగరు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేదు. అతనికి కూడా బాబా ఆశీర్వాదముతో పుత్ర సంతానము కలిగింది. ఉత్సవం కోసం ఒక జండా తయారు చేయించాలని గోపాలరావు అతనికి పురమాయించాడు. అలాగే నానాసాహెబు నిమోకర్ ను ఒక నగిషీ జెండా తీసుకురమ్మని కోరాడు. ఈ రెండు జండాలను ఉత్సవంతో తీసుకొనిపోయి మసీదు రెండు మూలలలో నిలబెట్టారు. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంభిస్తున్నారు. బాబా తాము నివశించిన ఈ మసీదును 'ద్వారకామాయి'అని పిలిచేవారు.

 

 

చందనోత్సవము :
సుమారు అయిదేళ్ళ తరువాత ఈ ఉత్సవాముతో పాటు యింకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యింది. కోరాఃలా గ్రామానికి చెందిన అమీరుశక్కర్ దలాల్ అనే మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గోరవార్థము చేస్తారు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్దు ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపాలతో బాజాబజంత్రీలతో ఉత్సవాన్ని సాగిస్తారు. ఉత్సవము ఊరేగిన తరువాత మసీదుకు వచ్చి మసీదు గూటి (నింబారు)లోను, గోడలపైన ఆ చందనాన్ని చేతితో అందరూ తడతారు. మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీరుశక్కరు నిర్వహించారు. తరువాత అతని భార్య ఆ సేవను కొనసాగించారు. ఒకేరోజు పగలు హిందువులతో జండా ఉత్సవాన్ని, రాత్రిపూట మహామ్మదీయులతో చందనోత్సవము ఎటువంటి అరమరికలు లేక జరుగుతున్నాయి.

 

 

ఏర్పాట్లు :
షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనే వారు. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటీలు చూసుకుంటూ ఉండేవారు. ఇంటిలోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అనే భక్తురాలు చూసుకుంటుండేది. ఉత్సవ రోజులలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకోవడమే కాక, ఉత్సవాలని కావలసిన సరంజామా అంతా సిద్ధపరుస్తూ ఉండేది. అంతేకాదు, స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేసేది. మసీదుగోడలు బాబా వెలిగించే ధునిమూలంగా మసిపట్టి ఉండేవి. మండుతున్న దునితో సహా, మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి, మసీదుగోడలను చక్కగా కడిగి వెల్ల వేయిస్తూ ఉండేది. ఆమె ఇదంతా బాబా (రోజు మార్చి రోజు)చావడిలో పడుకున్నప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే ముందే పూర్తి చేస్తూ ఉండేది. పేదలకు అన్నదానము అంటే చాలా ప్రీతి. అందుకే ఈ ఉత్సవ సమయంలో పేదలకు అన్నదానము విరివిగా చేస్తుండేవారు. భోజనపదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంట్లో విస్తారంగా వండబడేవి.  అనేకమంది సంపన్నులైన బాబా భక్తులు స్వచ్చందంగా పూనుకుని ఈ సేవలో పాల్గొనేవారు.

 


ఉరుసు శ్రీరామనవమి ఉత్సవాముగా మారిన వైనము :
ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి రోజు వైభవంగా జరుగుతుండేవి. రాను రాను అది వృద్ధి అవుతూ ప్రాముఖ్యము సంతరించుకుంది. 1912లో ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీసాయినాథసగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనే అతను దాదా సాహెబు ఖాపర్డే (అమరావతి)తో కలిసి ఉత్సవానికి వచ్చారు. వారు దీక్షిత్ వాడాలో బసచేశారు. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పడుకొని ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకామహాజని పూజా పరికరాలు పళ్ళెముతో మసీదుకు వెళ్తున్నారు. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వెంటనే కాకామహాజని దగ్గరకు పిలిచి అతనితో, "ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమిరోజు చేయమండంలో భగవంతుని ఉద్దేశ్యము ఏదో ఉంది ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము. కనుక ఈ రోజున రామజన్మోత్సవము ఎలా జరపకూడదు?'' అని అడిగారు.

 

 

కాకామహాజనికి ఈ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించడానికి తీర్మానించుకున్నారు. కానీ, భగవస్సంకీర్తన చేయడానికి, అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించడం కష్టము. ఈ సమస్యను కూడా చివరికి భీష్మయే పరిష్కరించారు. ఎలాగంటే, అతని దగ్గర రామాఖ్యానమనే శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉండటంతో, అతనే దానిని సంకీర్తన చేయడానికి, కాకామహాజని హార్మోనియం వాయించడానికి తీర్మానించారు. చక్కెరతో కలిపినా శాంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. బాబా అనుమతి పొందడానికి వారు మసీదుకు వెళ్ళారు. సర్వజ్ఞుడైన బాబా "వాడాలో ఏమి జరుగుతున్నది'' అని మహాజనిని ప్రశ్నించారు. బాబా అడిగిన ప్రశ్నలోనే అంతరార్థము మహాజని గ్రహించలేక, ఏమీ జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్నారు. బాబా అదే ప్రశ్న భీష్మని అడిగారు. అతను శ్రీరామనవమి ఉత్సవాన్ని చేయాలి అనే తమ ఆలోచనను బాబాకు వివిరించి, అందుకు బాబా అనుమతి ఇవ్వాలని కోరారు. బాబా వెంటనే ఆశీర్వదించారు. అందరూ సంతోషించి రామజయంతి ఉత్సవానికి సంసిద్దులయ్యారు. ఆ మరుసటి రోజు మసీదును అలకరించారు. రాధాకృష్ణమాయి ఒక ఊయల ఇచ్చింది. దాన్ని బాబా ఆసనము ముందు వ్రేలాడదీశారు. శ్రీరామజన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యింది. భీష్ముడు కీర్తన చెప్పడానికి లేచాడు. మహాజని హార్మోనియం ముందు కూర్చున్నారు. అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతా చూసి, మహాజనిని పిలిపించారు. రామజన్మోత్సవము జరపడానికి  బాబా ఒప్పుకుంటారో లేదో, ఏమౌతుందో అనే జంకుతూ అతను బాబా దగ్గరకు వెళ్ళారు. అది అంతా ఏమిటని, అక్కడ ఊయల  ఎందుకు కట్టారని బాబా అతన్ని అడిగారు. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదని అందుకే ఊయల కట్టారని అతను చెప్పాడు. బాబా మసీదులో వుండే భగవంతుని నిర్గుణస్వరూపమును సూచించే 'నింబారు' (గూడు)నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి, యింకొకటి భీష్మకు పంపించారు.

 

 

హరికథ ప్రారంభమయ్యింది. రామకథాసంకీర్తనము ముగియగానే, బాజాభజంత్రీల ధ్వనుల మధ్య 'శ్రీరామచంద్రమూర్తికీ జై' అనే జయజయద్వానాలు చేస్తూ, పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు 'గులాల్' (ఎర్ర రంగుపొడి) జల్లుకున్నారు. అంతలో ఒక గర్జన వినబడింది. భక్తులు చల్లుకుంటున్న గులాల్ ఎలాగో వెళ్ళి బాబా కంటిలో పడింది.  బాబా కోపంతో బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు. ఇది చూసి చాలామంది భయముతో పారిపోయారు. కానీ బాబాయొక్క సన్నిహితభక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదాలు అని గ్రహించి కదలక అక్కడే ఉండిపోయారు. శ్రీరామజయంతినాడు రావణుడనే అహంకారాలు, అరిషడ్వర్గములను సంహరించాదానికి శ్రీసాయిరూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించడం సహజమేకడా అని భావించారు. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపగించుకోవడం ఒక రివాజు. దీన్ని తెలిసినవారు గమ్మున ఊరుకున్నారు. తన ఊయలను బాబా విరుస్తారేమోనని భయంతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి  ఊయలను తీసుకొని రమ్మంది. మహాజని వెళ్ళి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు వచ్చి ఊయలను తీయవద్దని చెప్పారు. కొంతసేపటికి బాబా శాంతించారు. ఆనాటి మహాపూజ హారతి మొదలైనవి ముగిశాయి. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుతుండగా ఇంకా దాని అవసరము ఉందనీ, కనుక దాన్ని విప్పవద్దనీ బాబా అతన్ని వారించారు. రామనవమి మరుసటి రోజు జరుపు గోపాలకలోత్సవముతోగాని ఉత్సవము పూర్తికాదనే విషయము అప్పుడు భక్తులకు స్ఫురించింది. మరునాడు శ్రీకృష్ణజ్ఞానము రోజు పాటించే 'కాలాహండి' అనే ఉత్సవము జరిపారు. కాలాహండి అంటే నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారముకలిపి వ్రేలాడకడతారు. హరికథ అయిపోయిన తరువాత దీన్ని కట్టెతో పగలకొడతారు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచి పెడతారు. శ్రీకృష్ణపరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులైన గొల్లపిల్ల వాళ్ళకు పంచి పెడుతుండేవారు. ఆ మరుసటి రోజు ఇవన్నీ పూర్తియిన తరువాత ఊయలను విప్పడానికి బాబా సమ్మతించారు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోతుండగా, పగటివేళ పతాకోత్సవము, రాత్రి పూత చందనోత్సవము కూడా యథావిధిగా జరిగాయి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవాముగా మారింది. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశాలు క్రమంగా పెరిగాయి. చైత్రపాడ్యమి నుండి రాధాకృష్ణమాయి 'నామసప్తాహము' ప్రారంభిస్తుండేది. భక్తులందరూ వంతులవారీగా అందులో పాల్గొంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామునే భజనలో చేరుతుండేది. శ్రీరామనవమి త్సవాలు దేశమంతటా  జరగటంతో హరికథా కాలక్షేపము చేసే హరిదాసులు దొరకడం దుర్లభంగా ఉండేది.

 

 

శ్రీరామనవమికి 5,6 రోజులముందు 'ఆధునిక తుకారామ్' అని పిలువబడే బాలాబువ మాలీ అనే సంకీర్తనకారుణ్ణి కాకామహాజని యాదృచ్చికంగా కలవడం జరిగింది. శ్రీరామనవమి రోజు సంకీర్తన చేయడానికి మహాజని అతన్ని షిరిడీకి తీసుకువచ్చారు. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో, తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధకవటె గ్రామములో ప్లేగు వ్యాపించి ఉండటం చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉన్నారు. కాకాసాహెబు దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతను షిరిడీ వచ్చి హరికథాసంకీర్తనము చేశారు. బాబా అతన్ని తగినట్లు సత్కరించి 1914 సంవత్సరములో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు షిరిడీలో సంకీర్తన చేసే బాధ్యతను శ్రీదాసగణు మహారాజుకు బాబా అప్పగించటం ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడింది.
1912నుండి ఈ ఉత్సవము రానురాను వృద్ధి చెందుతుండేది. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనెతుట్టెలా ప్రజలతో కిటకిటలాడుతుండేది. అంగళ్ళ సంఖ్యా పెరిగిపోయింది. కుస్తీపోటీలలో అనేకమంది ప్రముఖ మల్లులు పాల్గొనేవారు. పేదలకు అన్నసంతర్పణ విరివిగా జరిగుచున్దేవి. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగాయి. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రథము, పాత్రలు వెండిసామానులు, బాల్టీలు వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలైనవి బహుకరింపబడ్డాయి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చాయి. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీటిని ఏమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండెడివారు.ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే హిందువులు, మహమ్మదీయులు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసిమెలసి ఉత్సవాములలో పాలుపంచుకొనేవారు. ఈనాటి వరకు ఎటువంటి మతకలహాలు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5000 నుండి 7000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్యా 75,000కు పెరిగింది. అంతపెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడినప్పటికీ ఎన్నాడూ అంటువ్యాధులు కాని, అల్లర్లు కానీ సంభవించలేదు.

 

 

మసీదుకు మరమ్మత్తులు :
గోపాలరావుగుండునాకు ఇంకొక మంచి ఆలోచన తట్టింది. ఉరుసు ఉత్సవము ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకున్నారు. మసీదు మరమ్మత్తు చేయడానికి రాళ్ళను తెప్పించి చెక్కించారు. కానీ ఈపని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబు చాందోర్కరుకు ఆ సేవ లభించింది. రాళ్ళ తాపడం చేసే కార్యక్రమము కాకాసాహెబు  దీక్షిత్ కు ఇష్టం లేకపోయింది. కాని భక్తుడైన మహాల్సాపతి కల్పించుకొని, ఎలాగో బాబా అనుమతిని పొందారు. బాబా చావిడిలో పడుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపడం చేయడం ముగించారు. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చోవడం మాని చిన్న పరుపుమీద కూర్చునేవారు. గొప్ప వ్యయప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభామండపము పూర్తి చేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది. సౌకర్యముగా వుండేది కాదు. కాకాసాహెబు దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు వేయదలిచారు. ఎంతో డబ్బు పెట్టి ఇనుపస్తంభాములు మొదలైనవి తెప్పించి పని ప్రారంభించారు. రాత్రి అంతా శ్రమపడి స్తంభములు నాటేవారు. మరుసటి రోజు ప్రాతఃకాలంలోనే బాబా చావడినుండి వచ్చి అది అంతా చూసి కోపముతో వాటిని పీకి పారేసేవారు.

 

 

ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుపస్తంభాన్ని ఒక చేతితో పెకిలిస్తూ, రెండవచేతితో తాత్యాపాటీలు పీకను పట్టుకున్నారు. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి, అగ్గిపుల్లతో విప్పంటించి, ఒక గోతిలో పారేశారు. బాబా నేత్రములు నిప్పుకణముల వలె వేలుగుచుండెను. ఎవరికీ బాబావైపు చూడడానికి ధైర్యము చాల లేకపోయింది. అందరూ భయకంపితులయ్యారు. బాబా తన జేబులోంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరారు. అది శుభసమయంలో చేసే ఆహుతిలా కనపడింది. తాత్యా కూడా చాలా భయపడ్డారు. తాత్యా కేమీ జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియలేక పోయింది. కల్పించుకుని బాబా పట్టునుండి తాత్యాను విడిపించడానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్టిరోగి బాబా భక్తుడైన భాగోజి శిందే కొంచెము ధైర్యము కూడగట్టుకుని ముందుకు వెళ్లగా బాబా వాణ్ణి ఒక పక్కకు త్రోసివేశారు. మాధవరావు సమీపించబాగా బాబా అతనిపై ఇటుకరాయి విసిరారు. ఎంతమంది ఆ జోలికి పోదలిచారో అందరికీ ఒకే గతి పట్టింది. కాని కొంతసేపటికి బాబా శాటించారు. ఒక దుకాణదారుని పిలిపించి వాని దగ్గరనుంచి ఒక నగిషీ జరీపాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించడానికా అన్నట్టు  దాన్ని స్వయంగా తాత్యా తలకు చుట్టారు. బాబా యొక్క ఈ వింతచర్యనుచూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అంత త్వరలో బాబాకి ఎందుకు కోపము వచ్చింది? ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించారు? వారి కోపము తక్షణమే ఎలా చల్లబడింది? అని అందరూ ఆలోచనలో పడిపోయారు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతిమూర్తివలె కూర్చుని అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుతూ ఉండేవారు. అంతలో అకారణంగా కోప్పడేవారు. అటువంటి సంఘటనలు అనేకం వున్నాయి. కాని ఏది చెప్పవలేననే విషయము తేల్చుకోలేకపోతున్నాను. అందుకే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్తాను.

ఆరవ అధ్యాయము సంపూర్ణము.