Read more!

శ్రీసాయిసచ్చరిత్రము అయిదవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము 


అయిదవ అధ్యాయము

 

 

పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట :

ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామము ఉంది. అక్కడ ధనికుడైన మహమ్మదీయుడు ఒకడుండేవాడు. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోతున్నప్పుడు అతని గుఱ్ఱము తప్పిపోయింది. రెండు మాసాలు వెదికినా దాని జాడ తెలియకుండా పోయింది. అతను నిరాశ చెంది తన భుజంపై జీను వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామానికి వెళ్తుండగా సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన తరువాత ఒక మామిడిచెట్టు దగ్గరకు వచ్చాడు. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని కనిపించాడు. అతను తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉన్నాడు. చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగటానికి ప్రయత్నము చేస్తున్నాడు. దారి వెంట వెళ్తున్న చాంద్ పాటీలును చూసి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత సమయము విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. జీను గురించి ప్రశ్నించాడు. అది తాను పోగొట్టుకున్న గుఱ్ఱముదని చాంద్ పాటీల్ బదులిచ్చాడు. ఆ దగ్గరలో ఉన్న కాలువ ప్రక్కన వెతుకు అని ఫకీరు చెప్పాడు. చాంద్ పాటీలు అక్కడికి వెళ్లగా గడ్డి మేస్తున్న గుఱ్ఱమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఈ ఫకీరు సాధారణ మనిషి కాదని, గొప్ప ఔలియా (సిద్ధపురుషుడు) అయి వుండవచ్చు అని అనుకొన్నాడు. గుఱ్ఱమును తీసికొని ఫకీరు వద్దకు వచ్చాడు.

 

 

చిలుము తయారుగా ఉంది. కాని చిలుము వెలిగుంచుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉంది. ఫకీరు సటకాను భూమిలోకి గుచ్చిన వెంటనే నిప్పు వచ్చింది. మళ్ళీ అక్కడే సటకాతో నేలపై కొట్టగా నీరు వచ్చింది. ఫకీరు చ్చాపీ (గుడ్డముక్క)ను నీతితో తడిపి, నిప్పుతో చిలుమును వెలిగించాడు. అలా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి, తరువాత చాంద్ పాటీలుకి అందించాడు. ఇదంతా చూసిన చాంద్ పాటీలు ఆశ్చర్యపోయాడు. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటీలు వేడుకున్నాడు. ఆ మరుసటి రోజే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అక్కడ కొంత కాలము ఉన్నాడు. ఆ పాటీలు గ్రామానికి మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెళ్ళి సమీపించింది. పెండ్లి కూతురుది షిరిడీ గ్రామము. అందుకే కావలసిన సన్నాహాలు అన్నీ చేసుకొని పాటీలు షిరిడీ ప్రయాణమయ్యాడు. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరాడు. ఎలాంటి చిక్కులు లేకుండా వివాహము జరిగిపోయింది. పెండ్లివారు ధూప్ గ్రామానికి తిరిగి వెళ్ళారు కానీ ఫకీరు మాత్రము షిరిడీలో ఆగి, అక్కడే స్థిరముగా వుండిపోయాడు.

ఫకీరుకు 'సాయి'నామము ఎలా వచ్చింది :

 

 

 

పెండ్లివారు షిరిడీ చరగానే ఖండోబా మందిరానికి సమీపములో ఉన్న భక్త మహల్సాపతిగారి పొలములో వున్న మఱ్ఱిచెట్టు క్రింద బస చేశారు. ఖండోబా మందిరానికి ఆనుకుని వున్న ఖాలీ స్థలములో బండ్లు విడిచి పెట్టారు. బండ్లలో ఉన్న వారు ఒకరి తరువాత ఒకరు దిగారు. ఫకీరు కూడా దిగాడు. బండి దిగుతున్న యువ ఫకీరును చూసి భక్తమహల్సాపతి, "రండి సాయీ!'' అని స్వాగతించాడు. తక్కినవారు కూడా ఆయనను 'సాయి'అని పిలువటం ప్రారంభించారు. అది మొదలు వారు 'సాయిబాబా'గా ప్రఖ్యాతి పొందారు.

ఇతర యోగులతో సహవాసము :

 

 

 

సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నారు. బాబా షిరిడీకి రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరాలనుండి నివశిస్తూ ఉండేవాడు. బాబా అతనితో సాంగత్యాన్ని ఇష్టపడేవారు. అతనితో కలిసి మారుతీ మందిరములోనూ, చావడిలోను ఉండేవారు. కొంతకాలం ఒంటరిగా ఉన్నారు. అంతలో జానకీదాసు గోసావి అనే ఇంకొక యోగి అక్కడికి వచ్చారు. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుతూ ఉండేవారు లేదా బాబా ఉన్నచోటుకి జానకీదాసు వెళ్ళేవారు. అలాగే, పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వస్తుండేవాడు. ఆయన గృహస్థుడు; పేరు గంగాగీరు. ఒకరోజు, బాబా స్వయముగా కుండలతో నీళ్ళు తెచ్చి పూలచెట్లకు పోస్తుండటం చూసి అతను షిరిడీ గ్రామస్థులతో ఇలా అన్నాడు "ఈ మణి ఇక్కడ ఉండటం వల్లనే షిరిడీ పుణ్యక్షేత్రమైంది. ఈయన ఈనాడు కుండలతో నీళ్ళు మోస్తున్నాడు. కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజంగా పుణ్యము చేసుకున్నది. కనుకనే సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకొ గలిగింది''

 

 

ఏవలా గ్రామములో ఉన్న మఠములో ఆనందనాథుడు అనే యోగిపుంగవుడు ఉండేవాడు. అతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒక రోజు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడటానికి వచ్చాడు. అతను సాయిబాబాబు చూసి ఇలా అన్నాడు "ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్యమానవుడిలా కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయివంటి వాడు కాడు. ఈయనొక అమూల్యమైన వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలుస్తుంది'' అలా అంటూ ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళిపోయాడు. ఇది శ్రీసాయిబాబా యవ్వనంలో జరిగిన సంగతి.

బాబా దుస్తులు - వారి నిత్యకృత్యములు :

 

 

 

యవ్వనంలో బాబా తమ తలవెంట్రుకలు కత్తిరించుకొక జుట్టు పెంచుకుంటూ ఉండేవారు. పహిల్వాను లాగా దుస్తులు వేసుకొనే వారు. షిరిడీకి మూడుమైల్ల దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసికొని వచ్చి నేలను చదును చేసి, వాటిని నాటి, నీళ్ళు పోస్తూ ఉండేవారు. ప్రతిరోజూ వామన్ తాత్యా అనే కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చి కుండలను ఇస్తూ ఉండేవారు. బాబా స్వయముగా బావినుండి నీళ్ళు చేది, ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి, భుజంపై పెట్టుకుని మోస్తూ తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలము ఆ కుండలను వేపచెట్టు మొదలు బోర్లిస్తూ ఉండేవారు. కాల్చనని కావడంతో అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అవుతుండేవి. ఇలా మూడు సంవత్సరములు గడిచాయి. సాయిబాబా కృషివలన అక్కడ ఒక పూలతోట పెరిగింది. ఆ స్థలములో     యిప్పుడు బాబా సమాధి ఉంది. దానినే సమాధి మందిరము అంటారు. దాన్ని దర్శించడం కోసమే అనేకమంది భక్తులు విశేషముగా వెళుతున్నారు.

వేపచెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము :

 

 

 

అక్కల్ కోటకర్ మహారాజ్ గారి భక్తుడు భాయికృష్ణజీ ఆలీబాగ్ కర్. ఇతను అక్కల్ కోటకర్ మహారాజ్ గారి చిత్రపటాన్ని పూజిస్తూ ఉండేవారు. అతను ఒకప్పుడు షోలాపూరు జిల్లాలోని అక్కల్ కోట గ్రామానికి వెళ్ళి, మహారాజ్ గారి పాదుకలు దర్శించి పూజించుకోవాలని అనుకున్నాడు. అతను అక్కడికి వెళ్ళాక ముందే స్వప్నములో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇలా చెప్పారు "ప్రస్తుతము షిరిడీ నా నివాసస్థలము. అక్కడికి పోయి నీ పూజ జరుపుకో'' అందుకే, అక్కల్ కోట వెళ్ళాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుని భాయికృష్ణజీ షిరిడీ చేరుకొని, బాబాను పూజించి, అక్కడే ఆరు మాసాలు ఆనందముతో గడిపారు. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణమాసములో ఒక శుభదినాన వేపచెట్టుకింద ప్రతిష్ఠ చేయించారు. ఇది 1834వ సంవత్సరం, శ్రావణ మాసములో (అనగా క్రీ.శ. 1912)లో జరిగింది. దాదా కేల్కర్, ఉపాసనీబాబా అనేవారు పూజను శాస్త్రోక్తముగా జరిపించారు. దీక్షిత్ అనే బ్రాహ్మణుడు పాదుకలకు నిత్య పూజ చేయడానికి నియమించాబడ్డారు. దీనిని పర్యవేక్షించు బాధ్యతను భక్త సగుణ్ మేరు నాయక కు అప్పగించబడింది

ఈ కథయొక్క పూర్తీ వివరాము :

 

 

 

ఠాణే వాస్తవ్యుడైన శ్రీ బి.వి.రావు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేశారు. వేపచెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరాలన్నీ సగుణ్ మేరు నాయక మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ ల నుండి సేకరించి, పాదుకల పూర్తి వృత్తాంతము, శ్రీసాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము, మొదటి సంచిక, 25వ పేజీలో ఈ విధంగా ప్రచురించారు. 1912వ సంవత్సరములో బొంబాయినుండి డాక్టరు రామారావు కొఠారెయను అనే అతను షిరిడీ వచ్చాడు. వారితో బాటు అతని కాంపౌండర్, మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ ఆలీబాగ్ కర అనే అతను వెంట వచ్చారు. షిరిడీలో వారు సగుణ్ మేరు నాయక్ కు, జి.కె.దీక్షిత్ కు సన్నిహితులయ్యారు. అనేక విషయాలు తమలో తాము చర్చించుకుంటున్నప్పుడు సంభాషణ క్రమంలో బాబా ప్రప్రథమమున షిరిడీ ప్రవేశించి వేపచెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేపచెట్టు క్రింద ప్రతిష్ఠించవలెనని నిశ్చయించుకున్నారు.

 

 

పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించుకున్నారు. ఈ సంగతి డాక్టరు రామారావు కొఠారేకు తెలిపితే ఆయన చక్కని పాదుకలు చెక్కిస్తారని భాయికృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చారు. అందరూ ఈ సలహాకి తమ సమ్మతి తెలిపారు. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టరుగారికి ఈ విషయము తెలిపారు. వారు వెంటనే మళ్ళీ షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించారు. ఖండోబా మందిరంలో ఉన్న ఉపాసనీ మహారాజ్ వద్దకు వెళ్ళి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపించారు. శ్రీ ఉపాసినీ దానిలో కొన్ని మార్పులను చేసి, పద్మము, శంకము, చక్రము మొదలైనవి చేర్చి, బాబా యోగశక్తిని వేపచెట్టు గొప్పతనాన్ని తెలిపే ఈ క్రింద శోకాన్ని కూడా చెక్కించారు.

            సదా నింబవృక్షస్య మూలాధివాసాత్
            సుధా స్రావిణం తిక్తమష్యప్రియం తమ్ !
            తరుం కల్వవృక్షాధికం సాధయంతం
            నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్ !!

ఉపాసనీ సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి, కాంపౌండరు ద్వారా పంపించారు. శ్రావణ పౌర్ణమినాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు 11 గంటలకు జి.కె.దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరమునుండి ద్వారకామాయికి ఉత్సవాముతో వచ్చారు. బాబా ఆ పాదుకలను స్పృశించి ,అవి భగవంతుని పాడుకాలని తెలిపారు. వాటిని వేపచెట్టు మూలంలో ప్రతిష్ఠించండని ఆదేశించారు.

 

 

ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తాసేట్ అనే పార్సీ భక్తుడు ఒకడు మనీ ఆర్డరు ద్వారా 25 రూపాయలు పంపించి వున్నాడు. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్ఠకు అయ్యే ఖర్చు నిమిత్తము ఇచ్చారు. మొత్తము 100 రూపాయలు ఖర్చు అయ్యాయి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరాలు జి.కె.దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశారు. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖ్ డె అనే బ్రాహ్మణుడు (నానుమామా పూజారి) పూజ చేస్తున్దేఆరు. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారె దేపపు ఖర్చు నిమిత్తము పంపేవారు. పాదుకల చుట్టూ కంచె కూడా పంపించారు. ఈ కంచెను, పైకప్పును కోపర్ గం స్టేషన్ నుండి షిరిడీ తీసుకురావడానికి 7-8-0 ఖర్చు సగుణ్ మేరు నాయక ఇచ్చారు. (ప్రస్తుతము జాఖ్ డె పూజ చేస్తున్నాడు. సగుణుడు నైవేద్యమును, దీపాన్ని పెడుతున్నాడు.)

 

 

మొట్టమొదటి భాయికృష్ణజీ, అక్కల్ కోటకర్ మహారాజ్ భక్తుడు. 1912వ సంవత్సరములో వేపచెట్టు క్రింద పాదుకలు స్థాపించి నప్పుడు అక్కల్ కోటకు వెళ్తూ మార్గమధ్యములో షిరిడీలో దిగారు. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామానికి వెళ్ళాలనుకొని బాబా దగ్గరకొచ్చి అనుమతి యివ్వమని అడిగాడు. బాబా ఇలా అన్నారు "అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడకి ఎలా వెళ్తావు? అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వారే నేను''. ఇది విని భాయికృష్ణజీ అక్కల్ కోట వెళ్ళడం మానుకున్నారు. పాదుకల స్థాపన తరువాత అనేక సార్లు షిరిడీ యాత్ర చేశారు. హేమాడ్ పంతుకు ఈ వివరాలు తెలిసి ఉండవు. తెలిసివుంటే సచ్చరిత్రలో వ్రాయడం మానుకునేవారు.

మొహియుద్దీన్ తాంబోలితో కుస్తీ - జీవితములో మార్పు :

 

 

 

షిరిడీ గ్రామములో కుస్తీలు పట్టడం వాడుకలో ఉండేది. అక్కడ మొహియుద్దీన్ తాంబోలి అనే వాడు తరచుగా కుస్తీలు పడుతుండేవాడు. వానికి బాబాకు ఒక విషయములో భేదాభిప్రాయాలు వచ్చి కుస్తీ పట్టారు. అందులో బాబా ఓడిపోయారు. అప్పటినుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను, నివశించే తీరును మార్చుకున్నారు. లంగోటి బిగించుకొని, (ఫకీరులు ధరించు) పొడవాటి చొక్కా (కఫ్నీ)ని తొడుక్కుని, నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకిగుడ్డలతో సంతోష పడేవారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలు అని అంటుండేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీలలో ప్రేమ. ఒకరోజు కుస్తీపట్టు పడుతుండగా అతనికి వైరాగ్యము కలిగింది. అదే సమయములో 'దేహమును దమించి, దేవుని సహవాసము చేయమ'ని ఒక అశరీరవాణి అతనికి వినిపించింది. అప్పటినుండి గంగాగీరు సంసారాన్ని విడిచిపెట్టారు. ఆత్మసాక్ష్యాత్కారము కోసం పాటుపడ్డారు. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠాన్ని స్టాపించి తన శిష్యులతో నివసిస్తూ ఉండేవారు.

 

 

సాయిబాబా ప్రజలతో కలిసిమెలసి తిరుగుతుండేవారు కాదు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగితే అడిగినదానికి మాత్రమే జవాబిచ్చేవారు. రోజులో ఎక్కువ భాగము వేపచెట్టునీడలో, అప్పుడప్పుడు ఊరు అవతల వున్న కాలువ ఒడ్డునవున్న తుమ్మచెట్టు నీడలో కూర్చుండేవారు. సాయంకాలం ఊరికే కొంతదూరము నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్ గాం వెళ్తుండేవారు. నీమ్ గాంలో బాబాసాహెబ్ త్ర్యంబక్ జీ డేంగలే అనే అతని ఇంటికి తరచుగా వెళ్ళేవారు. బాబాసాహెబు డేంగలే అంటే సాయిబాబాకు అత్యంత ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు రెండు వివాహాలు చేసుకున్నా సంతానము కలుగలేదు. బాబా సాహేబు డేంగలే తన సోదరుని సాయిబాబా దగ్గరకి పంపాడు. బాబా అనుగ్రహముతో నానా సాహెబుకు పుత్రసంతానము కలిగింది. అప్పటినుంచి బాబాను దర్శించుకోడానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. వారి కీర్తి అంతటా వెల్లడయింది.

 

 

అహమద్ నగరు వరకు వ్యాపించింది. అక్కడనుంచి నానాసాహెబు చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలైన అనేకమంది శిరిడీకి రావడం ప్రారంభించారు. రోజంతా బాబాను భక్తులు చుట్టూ ఉండేవారు. రాత్రులలో బాబా పాడుపడిన పాతమసీదులో శయనించేవారు. పొగపీల్చుకొనే 'చిలిం'గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్నీ, తలగుడ్డ, ఎప్పుడూ దగ్గర ఉంచుకునే 'సటకా' (చిన్న చేతికర్ర) మాత్రమే అప్పటిలో ఆయనకు ఉన్న సామానులు.

 

 

తలపై ఒక గుడ్డను చుట్టి, దాని అంచులను జడలాగా మెలిపెట్టి ముడివేసి, ఎడమచెవిపై నుంచి వెనక్కి వ్రేలాడేలా వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతుక కుండా ఉంచేవారు. చెప్పులను తొడిగేవారు కాదు. దినమంతా గోనెగుడ్డపైనే కూర్చునేవారు. (కఫ్నీ క్రింద) లంగోటీ కట్టుకునేవారు. చలిని కాచుకోడానికి ధునికి ఎదురుగా (మసీదు ఈశాన్యభాగములో గల) కొయ్య చేపట్టుపై తమ ఎడమచేతిని ఆనించి, దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి 'అల్లాయే యజమాని' అని పలికేవారు.

 

 

మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండేది. భక్తులందరూ అక్కడే బాబాను దర్శించుకునేవారు. 1912 తరువాత మసీదుకు కొన్ని మార్పులు చేయబడ్డాయి. పాత మసీదును మరమత్తు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపడం చేశారు. బాబా ఈ మసీదుకు రాకపూర్వమే 'తకియా' (రచ్చ)లో చాలాకాలము నివశించారు. బాబా తమ కాళ్ళకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తీ పూర్వకమైన పాటలు పాడేవారు.

నీళ్ళను నూనెగా మార్చుట :

 

 

 

సాయిబాబాకు దీపాలంటే చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించే షాహుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదులోపల రాత్రి అంతా దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు ఇలా జరిగింది. ఒకరోజు నూనె యిచ్చే దుకాణదారులందరూ కూడబలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటిలా వెళ్ళినప్పుడు దుకాణదారులు నూనె లేదని చెప్పారు. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచారు. నూనెవ్యాపారులు ఆసక్తితో ఇదంతా గమనిస్తూ ఉన్నారు. అడుగున ఎందుమూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకుడబ్బాలో నీటిని పోసి కలియబెట్టి, ఆ నీటిని త్రాగేశారు. ఈ విధంగా ఆ రేకుడబ్బాలోని నూనె అవశేశాన్ని పావనం చేసిన తరువాత, మళ్ళీ డబ్బాతో నీరు తీసుకుని, ఆ నీటిని ప్రమిదలలో నింపారు. దూరంగా వుండి పరీక్షిస్తున్న దుకాణదారులు విస్మయం చెందేలా ప్రమిదలన్నీ తెల్లవారే వరకూ చక్కగా వెలుగుతూనే ఉన్నాయి. ఇదంతా చూసి ఆ షావుకార్లు పశ్చాత్తాప పడి బాబాబు మన్నించమని కోరారు. బాబా వారిని క్షమించి, ఇకపై అయినా సత్యాన్ని అంటిపెట్టుకోండిఉండండని హితవు చెప్పి పంపించేశారు.

జౌహరు ఆలీ అనే కపటగురువు :

 

 

 

పైన వివరించిన కుస్తీ జరిగిన అయిదేళ్ళ తరువాత అహమదునగరునుండి జవ్హర్ అల్లీ అనే ఫకీరు ఒకడు శిష్యులతో రహతా వచ్చాడు. వీరభద్రమందిరానికి సమీపంలో ఉన్న స్థలములో దిగాడు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురాను అంతా వల్లించగలడు, మధురంగా మాట్లాడేవాడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వాణ్ణి సన్మానిస్తూ గౌరవంతో చూస్తుండేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరానికి దగ్గరగా 'ఈద్ గా' అను గోడను నిర్మించడానికి పూనుకున్నాడు. ఈదుల్ ఫితర్ అనే పండుగరోజు మహమ్మదీయులు నిలుచుని ప్రార్థించే గోడనే 'ఈద్ గా'. ఈ విషయంలో వివాదములేచి, అది ఘర్షణలకు దారి తీసింది. దానితో జవ్హర్ అల్లీ రహతా విడిచి, షిరిడీచెరి, బాబాతో మసీదులో వుండసాగాడు. ప్రజలు వాడి తీపిమాటలకు మోసపోయారు. అతను బాబాబు తన శిష్యుడని చెప్పేవాడు. బాబా అందుకు అడ్డు చెప్పక శిష్యునిలాగా మెసిలేవారు. తరువాత గురుశిష్యులు ఇద్దరూ రహతాకు వెళ్ళి అక్కడ నివశించాలని నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండా వుండేది. శిష్యునికి మాత్రము గురువుని ఎప్పుడూ అగౌరపరచక, శిష్యధర్మాన్ని శ్రద్ధగా చేస్తుండేవారు. అప్పుడప్పుడు వారిద్దరూ షిరిడీకి వచ్చి వెళ్తుండేవారు. కాని ఎక్కువగా రహతాలోనే నివశించేవారు.

 

 

షిరిడీలోని సాయిభక్తులకు బాబా ఆవిధంగా రహతాలో ఉండటం ఎంతమాత్రం ఇష్టం ఉండేదికాదు. అందుకే వారందరూ కలిసి సాయిబాబాను మళ్ళీ షిరిడీకి పిలుచుకురావడానికి రహతా వెళ్ళారు. వారు రహతాలో ఈద్ గా దగ్గర బాబాబు ఒంటరిగా చూసి, వారిని తిరిగి షిరిడీ తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పారు. జవ్హర్ ఆలీ ముక్కోపి అనీ, ఆయన తనను విడిచిపెట్టడనీ, అందువల్ల వారు తన కోసం ఆశ విడిచి, ఫకీరు అక్కడకు వచ్చేలోపు షిరిడీకి వెనక్కి వెళ్లటం మంచిదని బాబా వారికి సలహా యిచ్చారు. వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా జవ్హర్ అల్లీ అక్కడకు వచ్చి బాబాను తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న షిరిడీ ప్రజలపై మండిపడ్డాడు. కొంత వాదోపవాదాలు జరిగిన తరువాత గురుశిష్యులు ఇద్దరూ తిరిగి షిరిడీ వెళ్ళడానికి నిర్ణయమైంది.

 

 

వారు షిరిడీ చేరి అక్కడే నివశిస్తూ ఉండేవారు. కొన్ని రోజుల తరువాత దేవీదాసు ఆ కపటగురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టాడు. చాంద్ పాటిల్ పెళ్ళి బృందముతో బాబా షిరిడీ రావడానికి 12 సంవత్సరాల ముందే పదిపన్నెండేళ్ళ వయసులో దేవీదాసు షిరిడీ చేరారు. వారు మారుతి దేవాలయములో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్టవము, తెజోవంతములైన నేత్రములు కలిగి, నిర్వ్యామోహిత అవతారము వలే జ్ఞానివలె కనపడుతుండేవారు.

 

 

తాత్యాపాటీలు, కాశీనాథ్ షింపీ మొదలైన అనేకమంది దేవీదాసును తమ గురువుగా భావిస్తూ ఉండేవారు. వారు జవ్హర్ అల్లీని దేవీదాసు దగ్గరకు తీసుకొని వచ్చారు. వారి మధ్య జరిగిన వాదనలో జవ్హర్ అల్లీ చిత్తుగా ఓడిపోయి, షిరిడీ నుండి పలాయనం చిత్తగించారు. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి, చాల ఏళ్ళ తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడ్డాడు. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాడి మనస్సులోనుండి తొలగి, తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందాడు. సాయిబాబా వాణ్ణి యథారీతి గౌరవముగానే చూశారు. ఈ విధముగా శిష్యుడు గురువును ఎలా సేవించాలో, ఎలా అహంకారమమకారాలను విడిచి గురుశుశ్రూష చేసి చివరికి ఆత్మసాక్ష్యాత్కారాన్ని ఎలా పొందాలో బాబా ఆచరణాత్మకంగా నిరూపించారు. ఈ కథ భక్తమహాల్సాపతి చెప్పిన వివరముల ఆధారంగా వ్రాయబడింది.

 

అయిదవ అధ్యాయము సంపూర్ణము