Top Stories

ముగిసిన ప్రభాకర్‌ రావు విచారణ.. మళ్లీ ఎప్పుడంటే?

  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు విచారణ ముగింది. దాదాపు సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించారు. అయితే   మళ్లీ ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని అధికారులు ప్రభాకర్ రావుకు తెలియజేశారు. దీంతో మరోమారు ఆయన సిట్ ముందుకు రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-2023 మధ్య రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. డీసీపీ విజయ్‌, ఏసీపీ వెంకటగిరి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. తిరుపతన్న, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు పలు విధాలుగా ప్రశ్నలు అడిగారు. అలాగే, ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది
 ముగిసిన ప్రభాకర్‌ రావు విచారణ.. మళ్లీ ఎప్పుడంటే? Publish Date: Jun 9, 2025 9:37PM

కడప కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నయి. షర్మిల ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వర్గాలుగా వాగ్వాదాలకు దిగారు .ఐ ఎం ఎం ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ కార్యకర్తల తో ఏఐసీసీ సభ్యులు సుంకర పద్మశ్రీ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. షర్మిల జిందాబాద్ పద్మశ్రీ డౌన్ డౌన్ టు నినాదాలు చేశారు. కడప జిల్లా పర్యటనలో షర్మిలపై సుంకర పద్మశ్రీ ఆరోపణలు చేశారు . సుంకర పద్మశ్రీ ఏర్పాటు చేసిన సమావేశంలో షర్మిల వర్గం ఆమెను ప్రశ్నించడం జరిగింది. దీంతో రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పడ్డారు. సుంకర పద్మశ్రీ సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీరాములు, నజీర్ అహ్మద్ పాల్గొనగా షర్మిలకు మద్దతుగా జిల్లా డిసిసి అధ్యక్షురాలు విజయ జ్యోతి, పులివెందుల, పొద్దుటూరు, నియోజకవర్గాల అధ్యక్షులు ధ్రువ కుమార్ రెడ్డి, ఇర్ఫాన్ భాషాలు పాల్గొన్నారు
కడప కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు Publish Date: Jun 9, 2025 7:29PM

తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు

  జూన్ చివరి వారంలో తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించానున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు కార్యాలయం ప్రారంభించనున్నారు. దీంతో పాటు పసుపుబోర్డు లోగో ఆవిష్కరణలో కూడా అమిత్‌షా పాల్గొంటారని సమాచారం. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తెలంగా ణ ప్రభుత్వం నెలవారీ అద్దె ప్రాతిపదికన పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి వాస్తు దోషం కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఉపయోగించడం లేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ కార్యాలయం వృథాగానే పడి ఉంది. పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరగా.. అంగీకరించారు. 
 తెలంగాణలో అమిత్‌షా పర్యటన ఖరారు Publish Date: Jun 9, 2025 7:10PM

మహిళలు నిరసన తెలుపుతుంటే సంకరజాతి అంటారా?.. లోకేశ్ ఫైర్

  రిపోర్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే, వారిని వైసీపీ నాయకులు సంకరజాతి అని అభివర్ణించడం దారుణమని  మండిపడ్డారు. "ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?" అంటూ ఆయన వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు అనుసరిస్తున్న వైఖరిని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుపట్టారు. తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడుతున్నారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన, జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని తరిమేసిన అమానవీయ తీరును ఆదర్శంగా తీసుకున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని నారా లోకేశ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఉందని, అలాంటి వారిని కించపరిచేలా మాట్లాడటం సహించరానిదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సజ్జల వ్యాఖ్యల వీడియోను లోకేశ్ పంచుకున్నారు. ఇటీవల సాక్షి టీవీలో ప్రసారమైన ఓ చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.
మహిళలు నిరసన తెలుపుతుంటే సంకరజాతి అంటారా?.. లోకేశ్ ఫైర్ Publish Date: Jun 9, 2025 6:17PM

అఖిల ప్రియకు అస్వస్థత.. వడదెబ్బ అన్న వైద్యులు

తెలుగుదేశం నాయకురాలు,  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.   దొర్నిపాడు మండలం డబ్లుగోవిన్నెలో  జతరకు హాజరైన అఖిలప్రియ అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా గుడి ఆవరణలోనే ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెకు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించిన అనంతరం కోలుకున్నారు.  రెండు రోజులుగా అఖిలప్రియ జాతరకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక సోమవారం (జూన్ 10)  పూజల సందర్భంగా ఉపవాస దీక్ష పాటించారు. అసలే ఎండలు, ఉక్కపోత ఉండటం, ఉపవాసదీక్షలో ఉండటంతో నీరసించి సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. 
అఖిల ప్రియకు అస్వస్థత.. వడదెబ్బ అన్న వైద్యులు Publish Date: Jun 9, 2025 5:31PM

కావాలనే చర్చలో అమరావతి ప్రస్తావన : ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌

  ఏపీ రాజధాని అమరావతి లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం దారుణమని ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ అన్నారు. ఆంగ్లపత్రికలో అమరావతి ప్రస్తావ రాకపోయినా కావాలనే చర్చలోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఇలా మాట్లాడినట్లు తెలుస్తోందన్నారు. చర్చలో ఆ సందర్బానికి జోడించారో వివరణ ఇవ్వాలని కోరారు. రాజకీయ నేతలు నడిపించే మీడియా వద్దు అనే చర్చ ప్రారంభం కావాలన్నారు.  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరినీ క్షమాపణ కోరలేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో కొందరికి బాధ కలిగి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఛానల్‌ను నడుపుతున్న యాజమాన్యం ఎవరో అందరికీ తెలుసు. ఇంత చౌకబారు జర్నలిజం ఎందుకు వచ్చిందో అలోచించాలని ఆయన ప్రశ్నించారు.  వారి పార్టీ అజెండా కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. ఆంగ్లపత్రిక కథనంలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. చర్చలో ఆ సందర్భాన్ని ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. రాజకీయాలు జోడించాల్సిన అవసరం ఎవరికీ లేదు.’’ అని ఆలపాటి పేర్కొన్నారు.
కావాలనే చర్చలో అమరావతి ప్రస్తావన : ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ Publish Date: Jun 9, 2025 5:16PM

కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ .. ఎందుకంటే?

  బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీష్ రావు  భేటీ అయ్యారు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలను కేసీఆర్‌కు ఆయన వివరించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు హాజరయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ విచారణలో ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు దారితీసిన పరిస్థితులు, బ్యారేజీల నిర్మాణం, నిధుల సమీకరణ వంటి పలు కీలక అంశాలపై హరీశ్ రావు కమిషన్‌కు తన వాదనలు వినిపించారు. ప్రాజెక్టు లేఅవుట్‌ను చూపిస్తూ ఆయన వివరణ ఇచ్చారు.  
కేసీఆర్‌తో హరీష్ రావు  భేటీ .. ఎందుకంటే? Publish Date: Jun 9, 2025 4:33PM

బ‌స్‌పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ

  తెలంగాణ వ్యాప్తంగా అన్నిరకాల  ఆర్టీసీ బస్ పాస్ ధరలను 20% పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రూ. 1150 ఉన్న ఆర్డిన‌రీ పాస్ ధ‌ర రూ. 1400కు పెంపు, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీల‌క్స్ పాస్ రూ. 1800కు పెంచారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.  ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని ప్రజలు వాపోతున్నారు.  గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. సాధార‌ణ ఛార్జీల‌తో పాటు బ‌స్ పాస్ ఛార్జీలను పెంచ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై పురుష ప్ర‌యాణికులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మ‌హిళ‌ల‌కు ఫ్రీ జ‌ర్నీ సౌక‌ర్యం క‌ల్పించి, మ‌గాళ్ల‌పై ఛార్జీల బాదుడు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 
బ‌స్‌పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ Publish Date: Jun 9, 2025 3:59PM

నైతిక విలువలకు తిలోదకాలు.. జర్నలిజం ముసుగులో అమానుష వ్యాఖ్యలు!

వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నా వైసీపీకిగానీ దాని మీడియాకి గానీ బుద్ది వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదా? అంటే అవున‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి సున్నితాంశాల ప‌ట్ల ఉండాల్సిన  నిబద్ధ‌త మ‌రచి మ‌రీ జ‌గ‌న్ అనుంగు మీడియా వ్య‌వ‌హ‌రించ‌డం చేటు తెస్తుందా? అంటే అదే నిజ‌మ‌ని తెలుస్తోంది. బేసిగ్గా పొలిటీషియ‌న్లు నోటి మాట అదుపు త‌ప్పిన‌పుడు దాన్నొక రాజ‌కీయ ఆరోప‌ణ కింద లైట్ తీస్కునే వెస‌లుబాటు ఉంటుంది. వెన‌కుండి ఎవ‌రో న‌డిపించి ఉంటార్లెమ్మ‌ని జ‌నం అర్ధం చేసుకుంటారు. ఈ మ‌ధ్య అలాక్కూడా ఎవ్వ‌రూ అర్ధం చేసుకోవ‌డం లేదు. చంద్రబాబు సతీమణి భువ‌నేశ్వ‌రిపై వ‌ల్ల‌భ‌నేని వంశీ అన్న మాట‌లు.. వైయ‌స్ జ‌గ‌న్ ఆయ‌న పార్టీ లీడ‌ర్ల సంస్కారం ఏపాటిదో ఎత్తి చూపించాయి. ఈ విష‌యంలో సాక్షాత్ ఆ పార్టీ మాజీ మంత్రి జోగి ర‌మేష్ చేసిన కామెంట్లే ఉదాహ‌ర‌ణ‌. త‌మ ఘోర ఓట‌మికి ఇలాంటి కామెంట్లే కార‌ణ‌మ‌ని  ఆయన ఎలాంటి శషబిషలూ లేకుండా అంగీకరించారు.   తాము అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తినే రాజ‌ధానిగా అంగీక‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. మాములుగా రాజ‌కీయ‌నాయ‌కులు ప్రేలాప‌ల‌న‌ల‌కు పాల్ప‌డితే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త స‌గ‌టు జ‌ర్న‌లిస్టుల‌కు ఉంటుంది. బేసిగ్గా జ‌ర్న‌లిజంలో పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్ధులు, ప్రాంతీయ క‌ల‌హాలు, కుల,మ‌త, వ‌ర్గ, వైష‌మ్యాల‌ను రెచ్చ‌గొట్టేలాంటి వ్య‌వ‌హార శైలి క‌న‌బ‌ర‌చ‌కూడ‌దు.  డూస్ అండ్ డోంట్స్ లో ఇవ‌న్నీ ఒక పాఠంగా చెబుతారు. కానీ  కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన ఓ చానెల్ లో  నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజు  అటువంటి కనీస ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు.  అమ‌రావ‌తిపై వేశ్య‌ల రాజ‌ధాని అన్న ముద్ర వేయడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. వారి వ్యాఖ్యలపై అమరావతి  ప్రాంత మ‌హిళ‌లు చాలా చాలా సీరియ‌స్ అయ్యారు. వారిపై ఫిర్యాదులు చేయడంతో పాటు వారి దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టారు.   ఇంత‌కీ ఇదెలా వెలుగులోకి వ‌చ్చిందోన‌ని చూస్తే.. ప్ర‌పంచ అత్య‌ధిక జ‌నాభా గ‌లిగిన దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న భార‌త్.. హెచ్ఐవీ బాధితులు అధికంగా ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఈ సంఖ్య త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు పాటు ప‌డుతున్నాయి.  ఏయే రాష్ట్రాల్లో సెక్స్ వ‌ర్క‌ర్ల సంఖ్య ఎలా ఉందో  పీఎంపీఎస్ఈ సంస్థ ఒక స‌ర్వే చేసింది. ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేష‌న్ సైజ్ ఎస్టిమేష‌న్ అనే ఈ సంస్థ  నిర్వ‌హించిన స‌ర్వేలో దేశం మొత్తం మీద  9, 95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేసింది. భార‌త్ లో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలే టాప్‌లో ఉన్నట్టు తేల్చింది.  దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 15.4 శాతం మంది కర్ణాటకలో ఉండ‌గా.. ఏపీలో 12 శాతం మంది ఉన్నార‌నీ.. ఇక‌ తెలంగాణలో 7.6 శాతం ఉన్నట్టు లెక్క‌లు రాసుకొచ్చిందీ సంస్థ‌. అంటే దేశంలోని మహిళా సెక్స్ వర్కర్లలో సుమారు 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అన్న‌ది ఈ స‌ర్వే రిపోర్ట్ సారాంశం.  దీన్ని ఒక అప్ర‌ధాన్య‌త‌కు సంబంధించిన వార్త‌గా ప్ర‌చురించాలి స‌హ‌జంగా అయితే.  కానీ దాన్ని అమ‌రావ‌తి అనే రాజ‌ధానికి లింకు పెట్టి.. ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోనే ఆ వేశ్య‌లంతా ఉన్నార‌ని చెప్ప‌డం అర్ధ‌ర‌హితం, అమానుషం, అనైతికం.  ఇది జ‌ర్న‌లిస్టిక్ విలువ‌ల‌ను స‌మూలంగా తుంగ‌లో తొక్క‌డంతో స‌మానం.  పొట్టకూటి కోసంఆ వృత్తిలో ఉన్న‌వారి రీహాబిలిటేష‌న్ జరగాలి. జర్నలిజం, జర్నలిస్టులు అందుకోసం వార్తలు రాయాలి. విశ్లేషణలు చేయాలి. గతంలో తెలంగాణలోని యాద‌గిరి గుట్టలో కూడా అదే జరిగింది. అప్పట్లో మీడియా యాదాద్రికి వేశ్య ముద్ర వేసి అప‌ఖ్యాతి పాలు చేయ‌లేదు. బాధ్యతగా వ్యవహరించింది. అది క‌నీస సంస్కారం, విజ్ఞ‌త‌తో కూడిన జర్న‌లిజం.   కానీ ఇప్పుడు కొమ్మినేని, కృష్ణంరాజు   జ‌ర్న‌లిజం ముసుగులో అసహ్యమైన, అమానుషమైన, అనైతిక ప్రచారానికి ఒడిగట్టారు.  కొద్ది కాలం కిందట  వైఎస్ సతీమణి భార‌తీరెడ్డిపై తెలుగుదేశం మద్దతుదారు అయిన కిర‌ణ్ చేబ్రోలు అనే వ్య‌క్తి అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుగానూ వెంట‌నే అలెర్ట్ అయిన కూట‌మి ప్ర‌భుత్వం అతనిని అరెస్టు చేసి  జైల్లో పెట్టింది.  ప‌రిణితి ప్ర‌ద‌ర్శించింది. కానీ వైసీపీలో మాత్రం అటువంటి పరిణితి ఇసుమంతైనా కనిపించడం లేదు.  ఇదే వైఖరిని వైసీపీ కొనసాగిస్తే ముందుముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
నైతిక విలువలకు తిలోదకాలు.. జర్నలిజం ముసుగులో అమానుష వ్యాఖ్యలు! Publish Date: Jun 9, 2025 3:42PM

ఆ చానెల్ లైసెన్స్ రద్దు చేయాలి.. ఏపీ మహిళా కమిషన్

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ   ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై  వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి  శైలజ  తీవ్రస్థాయిలో స్పందించారు.  సోమవారం(జూన్ 9)   విజయవాడలో మీడియాతో  మాట్లాడిన ఆమె  రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా ఆ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై   పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు.  జర్నలిస్టు, ఎనలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడతారా?  అని ధ్వజమొత్తారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో  నోటికొచ్చినట్ల మాట్లాడితే కుదరదన్నారు. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని నిలదీశారు. ఆ చానెల్ లో ప్రసారం చేసిన డిబేట్ కు సంబంధించి మహిళా కమిషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న రాయపాటి శైలజ.. రాజకీయ కారణాలతో ఒక ప్రాంతంపై నీచమైన ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. అమరావతి ప్రాంత మహిళలు త్యాగం చేసి... గత ఐదేళ్లుగా అనేక కష్టాలు, నష్టాలు పడ్డారన్నారు.  ప్రభుత్వం మారిన తరువాత అమ రావతి అభివృద్ధి చెందుతోందనీ,  ఇది చూసి ఓర్వలేక అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.  అటువంటి వ్యాఖ్యలు చేసిన వారు, చేయించిన వారు అందరూ శిక్షార్హులేనన్నారు.  రాజకీయ ముసుగులో నడిపే అటువంటి చానల్స్ ను రద్దు చేయాలన్నారు.  జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్‌కు లేఖ రాసి ఆ ఛానల్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మహిళా కమిషన్‌కు ఉన్న అధికార పరిధిలో తమ‌వంతు చర్యలు ఉంటాయని రాయపాటి శైలజ స్పష్టం చేశారు  
 ఆ చానెల్ లైసెన్స్ రద్దు చేయాలి.. ఏపీ మహిళా కమిషన్ Publish Date: Jun 9, 2025 3:22PM

జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా..మహిళా కమిషన్ సీరియస్

  అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు. మహిళల ఆత్మాభిమానాల‌పై దాడి చేయడం గత వైసీపీ ఐదేళ్లుగా సాధారణం అయ్యిందని, మహిళలను రాజకీయ ముసుగులో కొన్ని‌ మీడియా ఛానళ్లు తిట్టిస్తున్నాయని, ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు. జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా ఆమె ప్రశ్నించారు.  జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయ కోణంలో, అనుకూల ఛానెల్ ఉందని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. గుంటూరులో 150 యూనివర్సిటీల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారని వాస్తవాలు తెలియకుండా ఎలా మాట్లాడుతారని ఛైర్ పర్సన్ ప్రశ్నించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తలో ఎక్కడా కూడా ప్రాంతం పేరు లేదు, అలాంటిది జర్నలిస్టు అయ్యుండి ఒక ప్రాంత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడం సరికాదని ఆమె హెచ్చరించారు. చదువుకున్న జర్నలిస్టుగా మహిళలను అవమానించడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు
జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా..మహిళా కమిషన్ సీరియస్ Publish Date: Jun 9, 2025 3:19PM

ఇక అంతా ఢిల్లీ నుంచే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి  ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పడు ఎట్ట కేలకు  ఆ క్రతువు  సగం పూర్తయింది.  మిగిలిన సగం ఎప్పుడన్నది పక్కన పెడితే..  ఇప్పడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది  మాత్రం అందుకోసం కాదు.  మంత్రి పదవులు ఇచ్చిన ముగ్గురు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు గురించి  అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు అందుకు అదనంగా.. మంత్రివర విస్తరణ బృహత్ ప్రణాళికకు సమాంతరంగా సాగు తూ వస్తున్న  హాఫ్ ఫినిష్ డ్ పీసీసీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు చెపుతున్నారు. అలాగే.. పనిలో పనిగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఏర్పాటు చేయ తలపెట్టిన బహిరంగ సభల విషయం ఆదిస్థానంతో చర్చించి, సభలు ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో నిర్ణయించేందు కోసమూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లు చెపుతున్నారు.   ఎందుకోసం అయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు 46 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. మరో నాలుగు రౌండ్లు కొట్టి వస్తే, హాఫ్ సెంచరీకి చేరు కుంటారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రావడం పెద్ద విషయం విశేషం కాదు. అలాగే..  కొన్ని కీలక విషయాల్లో అధిష్టానంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొత్త విషయం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కోట్ల, వైఎస్సార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి రావడం, ఢిల్లీ కనుసన్నల్లో పని చేయడం, తరచూ ఢిల్లీ చక్కర్లు కొట్టడం ఉన్నదే. అయితే ఇప్పడు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది. గతంలో ముఖ్యమంత్రులు రెండు మూడు నెలలకు ఒప్కసారి ఢిల్లీ వెళ్లి వస్తే..  ఇప్పడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలోనే రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. అదలా ఉంటే..  ముందు ముందు ఈ  జోరు ఇంకా పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి, దేశం మొత్తంలో పూర్వ వైభవ స్థితిని పొందే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ముందు ముందు  రాష్ట్ర పార్టీ వ్యవహరాల్లోనే కాకుండా  పాలనా వ్యవహారాల్లోనూ మరింత క్రియాశీల పాత్రను పోషించ వచ్చని అంటున్నారు. ఇప్పటికే  రాహుల్ గాంధీ పలు సందర్భాలలో, పలు వేదికల నుంచి, కులగణన ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా పేర్కొంటున్నారు.చివరకు.. ఈ మధ్యనే మొదలు పెట్టిన  బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ  కులగణనకు తెలంగాణ  మోడల్ ను ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అందుకే.. మంత్రి వర్గ విస్తరణలో, రాష్ట్రంలో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న  రెడ్డి సామాజిక వర్గాన్ని  పూర్తిగా పక్కన పెట్టి, బీసీ, ఎస్సీ లకు మాత్రమే అవకాశం కల్పించారని అంటున్నారు.ఈ పరిణామాలను గమనిస్తే, ప్రభుత్వం రోజు వారీ వ్యవహారాల్లోనూ  ఢిల్లీ పెత్తనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.   నిజానికి  ఇప్పటికే  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల  ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పరిపాలన వ్యవరాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం విషయంలో ఆమె నేరుగా సెక్రటేరియట్ కు వెళ్లి, మంత్రులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పమైంది. అలాగే.. యూనివర్సిటీ ఉపాధ్యయ, విద్యార్ధి సంఘాలతో చర్చలు జరపడాన్ని కూడా  విపక్షాలు తప్పు పట్టాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. విపక్షాలు విమర్శించడమే కాదు..  స్వపక్షంలోనూ లుకలుకలు వినిపించాయి. మీనాక్షి గీత దాతుతున్నారని అధికార పార్టీ నేతలు గుసగుసలు పోయారు.   అలాగే..  తాజా మంత్రివర్గ విస్తరణలోనూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు,ఇతర నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. చివరకు.. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి మీనాక్షి స్వయంగా  నిర్వహించిన సమీక్షల అదారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగిందని అంటున్నారు. అలాగే..  ముఖ్య మంత్రి సహా రాష్ట్ర నాయకులు చేసిన  సి ..ఫార్సులను బుట్ట దాఖలు చేసి,   రాహుల్ గాంధీ కోటాలో ఒకరికి, ఖర్గే ఖాతాలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినట్లు చెపుతున్నారు. తద్వారా ఇక అంతా ఢిల్లీ నుంచే అన్న సంకేతాలు  అధిష్టానం  ఇచ్చిందంటున్నారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణలో బెర్త దక్కని,ఆశావహులను బుజ్జగించి, దారిలోకి తెచ్చే విషయంలోనూ మీనాక్షి నటరాజన్ క్రియాశీల పాత్రను పోషించారు. ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రుల ప్రమేయం లేకుండా వ్యవహరాన్ని చక్క బెట్టారు. తద్వారా  అధిష్టానం దూతగా అధిష్టానం ఆశీస్సులతో ఆమె రాష్ట్ర పార్టీలోనే కాదు..  ప్రభుత్వంలోనూ, మరో పవర్ సెంటర్, (అధికార కేంద్రం) గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే  గతంలో విపక్షాలు చేసిన రబ్బర్ స్టాంప్  ఆరోపణకు బలం చేకురుతోందని అంటున్నారు.
ఇక అంతా  ఢిల్లీ నుంచే! Publish Date: Jun 9, 2025 3:03PM

సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళన

  అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.  గేటుకు తాళం వేయడంతో, గేటు ఎక్కి మహిళలు  నిరసన తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో  దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. డిబేట్‌లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.   తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ డిబేట్‌లో అసభ్య పదాలు వాడినప్పటికీ  క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చ గొట్టే విధంగా డిబేట్‌ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఉద్యమాలు మొదలయ్యాయి. ఆపై మహిళలు కోడిగుడ్లను విసిరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళన Publish Date: Jun 9, 2025 2:32PM

క‌న్న‌ప్పా.. పిల‌క- గిల‌క వివాద‌మేంటి!?

మోహ‌న్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయ‌న శ్రీ విద్యానికేత‌న్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల‌తో పాటు వాటి ఉప ఆల‌యాలు వెర‌సీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం కానీ ఈ సామాజిక వ‌ర్గం ప‌ట్ల గౌర‌వాభిమానాలు గానీ ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే ఒకింత‌ ఎక్కువ‌గానే ఉంటాయ్. తిరుమ‌లలాంటి ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంత‌టి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైందంటే అందుకు కార‌ణం ఈ బ్రాహ్మ‌ణుల నిష్టాగ‌రిష్ట‌త‌లే కార‌ణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.  కానీ..  ఈ ప్రాంతంలో తాను పుట్ట‌డం మాత్ర‌మే కాకుండా, ఇక్క‌డే త‌న విద్యా వ్య‌వ‌స్థ‌ను సైతం స్థాపించి, ఇంకా ఈ ప్రాంతంతో త‌న అనుబంధం పెంచుకుంటూ వ‌స్తున్నారు మోహ‌న్ బాబు. అంటే ఈ ప్రాంత న‌మ్మ‌కాలపై ఆయ‌న‌కుగానీ ఆయ‌న కుటుంబానికి గానీ ఈ సామాజిక వ‌ర్గంపై ఒక మ‌ర్యాద ఉండే ఉంటుంది. కానీ ఇందుకు రివ‌ర్స్ లో వెళ్తోంది మోహ‌న్ బాబు ఫ్యామిలీ. దేనికైనా రెడీ విష‌యంలోనూ స‌రిగ్గా ఇలాంటి వ్య‌వ‌హార‌మే న‌డిచింది. అప్ప‌ట్లో అదో పెద్ద గొడ‌వ‌.  ఫిలింన‌గ‌ర్ లో ఆయ‌న నివాసం ముందు ఆందోళనలూ నడిచాయి.   తాజాగా క‌న్న‌ప్ప లో పిల‌క‌- గిల‌క వ్య‌వ‌హారం మరో సారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో పిల‌క- గిల‌క అంటూ ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేసింది టీమ్ క‌న్న‌ప్ప‌. మొన్న‌టికి మొన్న శివ‌రాత్రి స‌మ‌యంలో సాక్షాత్ ఆ శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రుడి ముందు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టీజ‌ర్ రిలీజ్ చేశారన్న‌ది ఒక వివాదం కాగా.. హార్డ్ డిస్కులు పోయాన్న‌ది మ‌రో వివాదం. తాజాగా ఈ పిల‌క- గిల‌క పోస్ట‌ర్ క‌ల‌క‌లం.  ఈ పిల‌క- గిల‌క పాత్ర‌ల‌ ద్వారా  బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవహేళన చేశారంటూ ఆ సమాజికవర్గాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   క‌న్న‌ప్ప సినిమాలో ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ పాత్ర‌ల‌ను పెట్టార‌ని బ్రాహ్మణ సంఘాలు  విరుచుకుప‌డుతున్నాయి. ఇది బ్రాహ్మ‌ణుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌డంతో స‌మాన‌మన్న‌ది అంటున్నాయి. దీంతో క‌న్న‌ప్ప ప్రీ- రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామ‌ని హెచ్చరిస్తున్నాయి.  నిజానికి క‌న్న‌ప్ప అనే పాత  సినిమాని బ‌ట్టి చూస్తే కాళ‌హ‌స్తీశ్వ‌ర ఆల‌య పూజారి (రావుగోపాల‌రావు పోషించిన పాత్ర‌)   క‌న్న‌ప్ప‌ను నిజంగానే ఇబ్బందుల పాలు చేసిన‌ట్టు క‌నిపిస్తుంది.  మ‌రి అప్పుడిదే బ్రాహ్మ‌ణ  సంఘాలు ఎందుకింత‌గా వ్య‌తిరేకించ‌లేద‌న్న‌ది ఒక వాద‌న కాగా.. రెండోది ఏంటంటే మోహ‌న్ బాబు కుటుంబానికి బ్రాహ్మ‌ణుల‌తో పెట్టుకుంటే బాగా క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది మ‌రో కామెంట్ గా తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌న్న‌ప్ప బ‌డ్జెట్ 100 కోట్ల రూపాయ‌లుగా చెబుతున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్ స్టార్స్ ఇందులో ఉన్నా.. అంతా టాక్ ని బ‌ట్టే రిక‌వ‌రీ అవుతుంది. అందుకంటూ ఒక బూస్టింగ్ అవ‌స‌రం. అలా జ‌ర‌గాలంటే సినిమా ఏదో ఒక ర‌కంగా   వార్త‌ల్లో ఉండాలి. ఇప్ప‌టికే చాలా చాలా ట్రై చేసిన మంచు వారి బృందం..  తాజాగా బ్రాహ్మ‌ణుల‌కు సంబంధించిన వివాదాల తుట్టె కూడా క‌దిపిన‌ట్లు కనిపిస్తోంది. దీంతో త‌మ సినిమా డెఫినెట్ గా వార్త‌ల్లో ఉండ‌ట‌మే కాక‌.. ప్రేక్ష‌క జ‌నం దృష్టిని సైతం ఆక‌ర్షించ‌డం ఖాయ‌ మ‌న్న‌ట్టుగా.. భావిస్తున్నారు. మ‌రి చూడాలి ఏమౌతుందో?
క‌న్న‌ప్పా.. పిల‌క- గిల‌క వివాద‌మేంటి!? Publish Date: Jun 9, 2025 1:08PM

రాజీలే.. నామాలు లేవు!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, చివరాఖరుకు జరగనే జరిగింది. ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. మారో మూడు ఖాళీలు ఆశావహుల కోసం రిజర్వులో ఉంచారు. అయినా..  మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు సహజంగానే భగ్గుమన్నారు. రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే.. ప్రస్తుత్తానికి  అలాంటి ముప్పేమీ లేదని బుజ్జగింపులతో అంతా సర్దుకుందని  పార్టీ వర్గాల సమాచారం. అలాగే.. ఇంకా చిన్న చిన్న పొరపొచ్చాలు మిగిలి ఉన్నా..  అధిష్టానం జోక్యంతో అన్నీ సర్డుకుంటాయని మంత్రివర్గ విస్త’రణం’ సృష్టించిన సంక్షోభం టీ కప్పులో తుపానులe సమసి పోతుందని కాంగ్రెస్ పెద్దలు విశ్వాసంతో ఉన్నారు.  అయితే..  ఇతరుల విషయం ఎలా ఉన్నా, మంత్రి పదవి కోసమే ఇటు నుంచి అటు,  అటు నుంచి ఇటూ  కాంగ్రెస్, బీజేపీ గోడలు దూకిన కోమటి రెడ్డి,  మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేని, హైదరాబాద్ రంగా రెడ్డి జిల్లాల ప్రాతినిధ్యం కోసం చాలా కాలంగా గొంతు విప్పి మాట్లాడుతున్న మల్ రెడ్డి రంగా రెడ్డి, అలాగే..  నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి  సుదర్శన్ రెడ్డి  కొంచెం గట్టిగానే అసంతృప్తిని వ్యక్త పరిచారు.  ముగ్గురికి ముగ్గురూ రాజీనామా ఆస్త్రాన్ని సందించారు. అయితే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవ హారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఒకరిద్దరు  మంత్రులు రంగంలోకి దిగి, ఎవరికి చెప్పాల్సిన మాట వారికి చెప్పి బుజ్జగించారు. ఆ విధంగా ప్రస్తుతానికి అయితే.. ఆల్ ఈజ్ వెల్  అన్నట్లు అంతా బాగుందనే  పిక్చర్ ఇచ్చారు.  అయితే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుందా..  మంత్రి వర్గ విస్తరణ సృష్టించిన సంక్షోభం నిజంగానే టీ కప్పులో తుపానులా సమసి పోయిందా? పోతుందా? అంటే..  లేదు.  నిజానికి, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అంత సులభంగా చల్లారదు. నిత్యాగ్ని హోత్రంలా  నిత్యం  రగులుతూనే ఉంటుందని పార్టీ పుట్టు పూర్వోత్తరాలు అవపోసన పట్టిన సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. ముఖ్యంగా..  రాహుల్ గాంధీ కులగణన జెండా ఎత్తిన నేపధ్యంలో  పార్టీలో క్యాస్ట్ ఈక్వేషన్స్  ముందు ముందు మరింతగా మారి పోవచ్చని అంటున్నారు. ఇంత వరకు పార్టీలో కొనసాగుతున్న అగ్రకుల ఆధిపత్యానికి గండి పడే సంకేతాలు కనిపిస్తున్న నేపధ్యంలో..  రెడ్డి, వెలమ ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తి అంత తేలిగ్గాచల్లారక పోవచ్చని  అంటున్నారు. మరోవంక త్వరలో చేపట్టే క్యాబినెట్‌ విస్తరణలో మరో మూడు మంత్రి పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. అందులో ఒకటి రాష్ట్ర జనభాలోనే 40 శాతం పైగా ఉన్న,  రాష్ట్ర ఆదాయంలో ఇంచుమించుగా సగం  వాటా  ఇస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు కన్ఫర్మ్ చేస్తు న్నట్లు చెప్పారు.  అయితే.. పీసీసీ చీఫ్  త్వరలోనే మరో మంత్రి వర్గ విస్తరణని హామీ ఇస్తున్నా..   సంవత్సరంన్నరగా సాగుతున్న. విస్తరణ ప్రహసనం,  ప్రస్తుత అనుభవాల దృష్ట్యా..  ఇప్పట్లో మరో విస్తరణ ఉండక పోవచ్చని కాంగ్రెస్ వర్గాలే అంటున్నాయి.  అదీ గాక.. ఒక వేళ పీసీసీ చీఫ్ చెప్పినట్లుగానే త్వరలో’  మంత్రి వర్గ విస్తరణ ఉన్నా..  సీరియస్ గా మంత్రి పదవి ఆశిస్తున్న  ముగ్గురూ, సుదర్శన్ రెడ్డి, రాజ గోపాల రెడ్డి, మల్రెడ్డి రంగా రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో..  ముగ్గురిలో ఇద్దరికి మొండి చేయి తప్పదని అంటున్నారు. ఈ నేపధ్యంలో, భంగపాటుకు గురైన వారిలో  ఎవరేమి చేస్తారు, ముఖ్యంగా హోం మంత్రి కావాలని కలలు కన్న రాజగోపాల రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.   అదలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ  ఆశావహులనే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా, కొందరు  ముఖ్య  నాయకులకు కూడా రుచించలేదని,  అంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక్కొక కులం నుంచి ఒక్కొకరు చొప్పున ప్రతిపాదించిన ఆరేడు పేర్లలో ఒక్కరికీ బెర్త దక్కలేదని అంటున్నారు. ముఖ్యంగా, సుదర్శన్ రెడ్డి ఒక్కరికన్నా అవకాశం ఇవ్వాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి క్షణం వరకు గట్టి ప్రయత్నాలు చేశారని, అయినా అధిష్టానం నో చెప్పిందంటున్నారు. అందుకే  ప్రస్తుతానికి, ఆశావహులతో పాటుగా, ముఖ్య నేతలు  రాజీ పడినా, భవిష్యత్ లో పరిస్థితులు ఎలా మారాతాయో చెప్పలేమని అంటున్నారు.
రాజీలే.. నామాలు లేవు! Publish Date: Jun 9, 2025 12:37PM

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం (జూన్ 9) ఉదయం అరెస్టు చేశారు. ఒక చానెల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయనను తుళ్లూరు తరలిస్తున్నారు. ఒక చానెల్ లో కొన్ని రోజుల కిందట కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమం ప్రసారమైంది.   ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణం రాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.   ఇలా ఉండగా తెలుగుమహిళలు కొమ్మినేని, కృష్ణం రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం (జూన్ 9)అరెస్టు చేశారు. ఆయనను విజయవాడ తరలిస్తున్నారు.  
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ Publish Date: Jun 9, 2025 11:18AM

ఉన్నవి ఆరు ఖాళీలు.. 18 నెలల తర్వాత సగం భర్తీ!

మిగిలిన మూడూ ఎప్పడు.. స్ట్రాటజీ ఏంటి? ఇది ఎవరి మార్క్ రాజకీయం నటరాజా!!!  కాబోయే హోం మంత్రి నేనే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  నాలుగు సార్లు.. ఎమ్మెల్యే డెఫినెట్ గా బెర్త్ కన్ ఫర్మ్ అంటూ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ మారుమూల నుంచొచ్చా.. కేబినెట్ లో సీటు ఖాయం అంటూ ప్రేమ్ సాగర్ రావ్,  ఉమ్మడి రంగా రెడ్డికి పదవిలేదని మల్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆశావహుల ఆశలన్నీ ఆశలుగానే.. కలలు కల్లలుగానే.. మిగిలాయ్! ఇక ఎమ్మెల్సీలు దయాకర్ రావు, విజయశాంతి.. సంగతి సరేసరి. కట్ చేస్తే వివేక్, వాకిట, అడ్లూరితో భర్తీకి ఫుల్ స్టాప్ పెట్టకుండా,  కామా పెట్టడంలో అర్ధమేంటన్నది  ఇప్పుడందరినీ తొలిచేస్తోన్న ప్రశ్న.  అందరిలోకీ ఒకింత ఆశ్చర్యకరమైన ఎన్నిక వివేక్ దే. ఒక పక్క దళిత సంపన్న నేత. మరొక పక్క మీడియా అధినేత. అన్నింటికన్నా మించి బీజేపీ నుంచి వచ్చినా మేనేజ్ చేయగలిగిన సత్తా. ఇటు కుమారుడు వంశీ చూస్తే మొన్నటి పుష్కరాలపుడు యాంటీ గవర్నమెంట్ యాగీ.  అయినా సరే..  బెర్త్ కొట్టడమంటే మామూలు విషయం కాదు.  అంతా తావీజ్ మహిమ!  అంటున్నారు కొందరు. ఇక వాకిట శ్రీహరి మహబూబ్ నగర్ వాసి. సీఎం కూడా సేమ్ జిల్లా. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించినట్టు భోగట్టా. ఇదిలా ఉంచితే అడ్లూరి. కవ్వంపల్లిని ఊరించి ఊరించి లాస్ట్ కి అడ్లూరి నోట్లో లడ్డూ పెట్టింది అధిష్టానం. అదేమంటే ఎప్పటి నుంచో లాయల్ కదా? అంటున్నారు.   ఇప్పుడు వీరి సంగతి కాదు కానీ.. రాజగోపాల్, ప్రేమ్ సాగర్, సుదర్శన్.. వీరి పయనమెటు? ఆల్రెడీ హోంత్రి  ఖాయం అంటూ తన అనుచరులకు, కార్యకర్తలకు చెప్పుకు తిరిగిన  కోమటిరెడ్డి బ్రదర్. అంతేనా.. చామలను బోన్ గిరి ఎంపీగా గెలిపిస్తే.. నీకు మంత్రిత్వం ఖాయమంటూ సీఎం నుంచే హామీ ఉన్నా ఏం ఫాయిదా?  దీంతో చిలుకూరు ఫామ్ హౌస్ లో అలకపాన్పు ఎక్కారు. ఇక ప్రేమ్ సాగర్ రావు.. ఎక్కడో మారు మూలండీ బాబూ.. ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి లేకుంటే ఎట్టా? అన్నదాయన ఆవేదన.  సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ అంటే మరీ అంత లోకువా అంటున్నారు. ఇక మైనార్టీల నుంచి మంత్రి లేకనే పోయె. ఇప్పటి వరకూ మంత్రివర్గంలో పాటించిన సామాజిక న్యాయమేపాటి? అని చూస్తే.. రెడ్లు- 4, బీసీలు-3, ఎస్సీ మాల-3, ఎస్సీ మాదిగ-2, ఎస్టీ కోయ-1, ఎస్టీ లంబాడ-1, బ్రాహ్మణ-1, కమ్మ- 1, వెలమ-1 గా ఉంది. ఇదీ కాంగ్రెస్ మార్క్.. సామాజిక న్యాయం కథ, కమామిషు. మొన్నంటే మొన్న మాదిగలంతా కలసి..  ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను, పీసీసీ చీఫ్‌మహేష్ ని వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ ని కలిసి మొరపెట్టుకున్నందుకు అడ్లూరి రూపంలో ఒక పదవైతే దక్కింది.  డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ కూడా హ్యాపీయే. మిగిలిన సామాజిక వర్గాల్లో అసంతృప్తులు అధికంగా ఎవరున్నారయా అంటే వాళ్లలో కూడా రెడ్లే ఎక్కువ. అయితే ఈ మూడింటిని భర్తీ చేసే మూడ్ ఎప్పుడన్నది ఒక హాట్ టాపిక్. ఎంతైనా ఇది కాంగ్రెస్ పార్టీ బాసూ..  ఆ మాత్రం వెయింటింగ్ తప్పదు. ఇచ్చిన వాళ్లతోనే కాదు ఇవ్వని వాళ్లను కూడా వాడుకుని ఎలాగోలా నెగ్గుకు రావల్సి ఉంటుంది. అవునుగానీ ఇంతకీ ఈ మూడు మిగుల్చుడు- నాన్చుడు స్ట్రాటజీ ఎవరిదన్నది ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో కొత్త చర్చ.  అయితే ఇదంతా   మీనాక్షి దేవి మహిమగా భావన. కారణమేంటంటే.. మీరేం ఖంగారు పడకండి ఖర్గేగారూ! నాదగ్గరో ఫార్ములా ఉందని తొలుత మీనాక్షి నటరాజనే కామెంట్ చేశారట.  ఇదెలాగంటే.. విస్తరణకంటూ ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తే.. కొందరి అసంతృప్తుల నుంచి వచ్చే జ్వాల  రాబోయే స్తానిక ఎన్నికలను తగలబెట్టినా పెట్టేస్తుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చూశాంగా. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మీనాక్షమ్మ.. సగమిచ్చి సగం వదులుదాం. ఎందుకంటే మన దగ్గరున్నవే ఆరు. వాటిలో ఆరింటికి ఆరిచ్చేసినా.. అరవై ముంది ఆశావహుల్లో ఆ అసంతృప్తిని ఎలాగూ చల్లార్చలేం. అదే సగం ఇచ్చి సగం దాచాం అనుకోండి. ఆ సగంలోని మూడింటి కోసం రేపటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు.. ముప్పై మంది వరకూ కష్టపడతారు. మేం ఇంత కష్టపడ్డాం  కాబట్టి మాకూ మంత్రి పదవి ఇవ్వమని అడగటానికి బాగుంటుంది. కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటారని.. మీనాక్షి వేసిన నటరాజ్ మార్క్ స్కెచ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు.  మరి చూడాలి..  ఈ అసంతృప్త నేతలలో  మీనాక్షమ్మ బుజ్జగింపులకు ఎంత మంది తలొగ్గుతారో.  మిగిలిన ఆశావహులు ఈ స్ట్రాటజీకి లోబడి ఎంతగా పని చేస్తారో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ గురూ! సముద్రం. ఈ సముద్రంలో ఎన్ని పదవుల పన్నీరు పోసినా.. ఆ సముద్ర ఉప్పు అంత తేలిగ్గా తగ్గేది కాదన్నది ఫైనల్ టాక్. ఏమంటారు!
 ఉన్నవి ఆరు ఖాళీలు.. 18 నెలల తర్వాత సగం భర్తీ! Publish Date: Jun 9, 2025 10:53AM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీట్ విచారణకు ఏ1 ప్రభాకరరావు

తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన సోమవారం (జూన్ 9) సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. గత 15 నెలలుగా అంటే ఈ కేసు నమోదు కావడానికి కొద్ది రోజుల ముందు నుంచీ ఆయన అమెరికాలోనే ఉన్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పటు చేసుకోవడానికి గ్రీన్ కార్డ్ కూడా తీసుకున్నారు. చికిత్స పేరుతో అక్కడకు వెళ్లిన ప్రభాకరరావు.. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా ఉండేందుకు చేయగలిగినంతా చేశారు. అయితే ఆయనను ప్రకటిత నేరస్థుడిగా గుర్తించే పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించి. ఆ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు హైదరాబాద్ తిరిగి వచ్చారు.  మాజీ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగు చూసిన వెంటనే ముందు జాగ్రత్త పడ్డారు. విచారణను తప్పించుకునేందుకు అమెరికా చెక్కేశారు. అక్కడే  ఉండిపోవడానికి చేయగలిగినన్ని ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలం కావడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.   బీఆర్ఎస్  హయాంలో విపక్షాలకు చెందిన కీలక నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు అప్పట్లో కలకలం రేపిన సంగతి విదితగమే.  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎ తిరిగి అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్  ప్రభాకర్ రావు ద్వారా ఆ పని చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావు కూడా బీఆర్ఎస్ చెప్పినట్లుగా నడుచుకున్నారనీ, ఆయనకు ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు   సహకరించారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును సిట్ విచారించింది. ఆ విచారణలో రాబట్టిన అంశాల ఆధారంగా ప్రభాకరరావు ప్రమేయాన్ని నిర్ధారించుకుందని తెలుస్తోంది.   తనకు పొలిటికల్ అస్సైలమ్ ఇవ్వాలంటూ ప్రభాకరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ప్రభాకరరావు అనివార్యంగా హైదరాబాద్ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమిరేట్స్ విమానంలో దుబాయి మీదుగా ఆయన హైదరాబాద్ కు ఆదివారం (జూన్ 8) చేరుకున్నారు.   సోమవారం (జూన్ 9) జూబ్లీహిల్స్ లోని సిట్  కార్యాలయంలో  విచారణకు హాజరు కానున్నారు. ఇప్పుడు ప్రభాకరరావు సిట్ విచారణలో  ఏం చెబుతారన్న దానిపై ఇప్పడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన నోరు విప్పితే బీఆర్ఎస్ అగ్రనాయకులకు గడ్డు కాలం తప్పదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీట్ విచారణకు ఏ1 ప్రభాకరరావు Publish Date: Jun 9, 2025 10:15AM

మహిళల వ్యక్తిత్వంపై దాడి.. చంద్రబాబు ఫైర్

రాజకీయం, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వారి వ్యక్తిత్వంపై దెబ్బ తీసే వారిని ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. మీడియా డిబేట్ అంటూ ఓ  చానల్ లో రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆడబిడ్డలను గౌరవించడం మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం, మరీ ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని చంద్రబాబు పేర్కొన్నారు. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదన్నారు.  తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన  వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడమన్నారు.  మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 
మహిళల వ్యక్తిత్వంపై దాడి.. చంద్రబాబు ఫైర్ Publish Date: Jun 9, 2025 9:55AM

విజయానికి సరిహద్దు

అతనో సాధారణ మధ్యతరగతి మనిషి. కానీ జీవితంలో ఎలాగైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కసి ఉన్నవాడు. అందుకనే నిరంతరం ఒళ్లు వంచి పనిచేసేవాడు. యజమాని ఏ పని చెప్పినా కిమ్మనకుండా పూర్తిచేసి, తనేమిటో నిరూపించుకునేవాడు. కానీ ఆ పని ఒత్తిడిలో పడి తన కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయేవాడు. ఒక్క ఆదివారం మాత్రమే ఇంటిల్లపాదీ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అవకాశం దక్కేది. తన కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోతున్నానన్న బాధ అతని మనసులో మెదులుతూనే ఉండేది. భార్యాపిల్లలు కూడా అతను తమకోసం మరింత సమయం గడిపితే బాగుండు అని తెగ ఆశపడేవారు. ఇదిలా ఉండగా, ఆ మధ్యతరగతి మనిషి తన ఉద్యోగంలో ఎలాగైనా పదోన్నతి సాధించాలనుకున్నాడు. అందుకోసం మరిన్ని చదువులు చదివితే బాగుండు అనిపించింది. దాంతో ఓ ఏడాదిపాటు అతని ఆదివారాలన్నీ చదువుకే అంకితమైపోయాయి. రోజూ రాత్రివేళ మాత్రమే అతను తన కుటుంబంతో కాసేపు గడపగలిగేవాడు. అతను ఇంట్లో ఎక్కువసేపు గడపడం లేదంటూ భార్యపిల్లలు బాధపడితే... ‘మీకోసమే కదా కష్టపడుతోంది’ అంటూ వారి నోరు మూయించేవాడు. ఆ మాటలో నిజం ఉందని తోచడంతో భార్యాపిల్లలు ఇక మారు మాట్లాడేవారు కాదు. ఓ ఏడాది గడిచిపోయింది. మధ్యతరగతి మనిషి చదువు పూర్తయిపోయింది. ఊహించినట్లుగానే పదోన్నతి కూడా లభించింది. ఆయన చదువు పూర్తయి కోరుకున్న పదోన్నది లభించింది కాబట్టి, ఇకనుంచి తమతో మరింతసేపు గడుపుతాడని ఆశించారు భార్యాపిల్లలు. కానీ పదోన్నది లభిస్తే సరిపోతుందా! దాని సరిపడా పని కూడా ఉంటుంది కదా. పైగా ఆ మనిషి తన పనిలో వెనక్కి తగ్గే రకం కాదయ్యే! దాంతో అహర్నిశలూ కార్యాలయంలోనే గడిపేవాడు. ఏ అర్ధరాత్రికో పిల్లలు పడుకున్నాక కానీ ఇల్లు చేరుకునేవాడు కాదు. ఉదయం అతను లేచేసరికి పిల్లలంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. దాంతో అతను పిల్లలతో మాట్లాడే సందర్భాలే తగ్గిపోయాయి. తను కుటుంబానికి ఏమాత్రం సమయం వెచ్చించలేకపోతున్నానని అతనికి తెలుసు. కానీ ఇదంతా వారి భవిష్యత్తు కోసమే చేస్తున్నానని తల్చుకుని ఓర్చుకునేవాడు. ఉద్యోగంలో మరో మెట్టు పైకి ఎక్కితే ఇంత ఒత్తిడి ఉండదు కదా అని ఎదురుచూసేవాడు. అనుకున్నట్లుగానే ఇంకో ఏడాది గడిచేసరికి అతను డిపార్టుమెంట్ అధిపతిగా మారిపోయాడు. ఇది వరకు అతను పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు అలాకాదయ్యే! బాధ్యత కూడా తోడయ్యింది. ప్రతి ఫలితానికీ జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితి. తనేమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దాంతో అతను ఆ సవాలుని స్వీకరించాడు. ఒకోరోజు ఆఫీసులోనే నిద్రపోయేవాడు. ఇప్పుడు భార్యని చూడటం కూడా తగ్గిపోయింది. దాంతో ఓ రోజు భార్యాపిల్లలు కలిసి అతని ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘సంపాదించిన స్థాయి చాలు. ఇక కుటుంబం గురించి కూడా ఆలోచించమని’ వేడుకున్నారు. ‘మరొక్క ఏడాది ఓపిక పట్టండి. ఇంకో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చాక ఇంక కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తాను,’ అంటూ మాట ఇచ్చాడు. మాట ఇచ్చినమేరకు ఏడాది గడిచిపోయింది. ఊహించినట్లుగానే మరో ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడతను మధ్యతరగతి మనిషి కానేకాదు. తన పనిచేస్తున్న కంపెనీకే వైస్ ప్రెసిడెంట్. ‘రేపటి నుంచి మీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను. మీ బాగోగులను గమనించుకుంటాను,’ అంటూ ఆ రాత్రి భార్యాపిల్లలకి సంతోషంగా చెప్పాడు. కానీ మర్నాడు ఉదయం లేవనేలేదు!!! తను చిన్నవయసులోనే చాలా సాధించాడంటూ ఓదార్చడానికి వచ్చినవారంతా తెగ పొగిడారు. కానీ అతను ఏం కోల్పోయాడో అతని భార్యాపిల్లలకే తెలుసు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.    
విజయానికి సరిహద్దు Publish Date: Jun 9, 2025 9:30AM

ఈ టిప్స్ తో నెలరోజుల్లో కంటి చూపు ఊహించనంతగా మెరుగవుతుంది!

నేటి డిజిటల్ యుగంలో స్క్రీన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. వర్క్ చేయడం నుండి సరదాగా సమయం గడపడం వరకు మొబైల్, సిస్టమ్, టీవీ, సినిమా హాల్ ఇలా ఎక్కడ చూసినా స్కీన్ కాస్తా ఫ్రంట్ ఆఫ్ ద హుమన్ గా మారింది.  దీన్ని దాటి, దీన్ని కాదని ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. మంచి అయినా, చెడు అయినా ఇప్పుడు మొత్తం ఈ స్క్రీన్ నుండే అందుతోంది. అందుకే  గత ఇరవై, ముఫ్పై ఏళ్ళ కిందట లేని కంటి సమస్యలు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సుమారు 10మందిలో 9మందికి అంతో ఇంతో దృష్టిలోపం సమస్య ఉంటోంది. నేటికాలంలో కలుషితమవుతున్న, రసాయనాల నిలయమైన ఆహారం, నీరు, గాలి, పరిసరాలు కూడా ఇందుకు కారణం. దీనికి తోడు జీవనశైలి మరీ దారుణంగా ఉంటుంది కొందరికి. రాత్రెప్పుడో మూడు, నాలుగు గంటలవరకు మొబైల్, సిస్టమ్ లో గడిపి, ఆ తరువాత నిద్రపోతారు. ఉదయం ఎప్పుడో 9 గంటలకు లేస్తారు. ఆ సమయంలో అదరాబదరా తయారయ్యి ఆఫీసులకు,కాలేజీలకు పరిగెడతారు. ఉదయం అల్పాహారం ఈ కారణంగానే చాలామందికి స్కిప్ అవుతుంది. ఆకలేస్తే పాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద పడి అడ్డమైన గడ్డి తింటారు. ఈ అన్ని కారణాల వల్లా కొన్ని కామన్ సమస్యలు ఏర్పడుతున్నాయి చాలామందిలో. వీటిలో పైన ప్రస్తావించిన దృష్టిలోపం సమస్య ప్రధానమైనది.  మన కళ్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. నిజానికి, పిల్లలు  పెద్దలు ఇద్దరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో ఎక్కువ సమయం గడుపడం వల్లే దృష్టిలోపం సమస్య ఏర్పడుతోందనేది వాస్తవం. ఇది చిన్న వయస్సులోనే కంటి సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం  గ్లాకోమా వంటి దృష్టి సమస్యలకు ఈ అలవాటు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితులలో  కంటి చూపును పెంచే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దృష్టిలోపాన్ని సరిదిద్దుకోవడం మంచిది. దృష్టి సామర్థ్యం పెరగడానికి సింపుల్ గా అందరూ చేయగలిగే మూడు టిప్స్ ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేస్తే కేవలం నెలరోజుల్లోపు దృష్టిసామర్థ్యం ఎంతో పెరుగుతుంది.  ఆ టిప్స్ ఏంటో  తెలుసుకుంటే..   అరచేతులతో అద్బుతం.. ఉదయం లేవగానే అరచేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకోవడం చాలామంది చేస్తారు. నిజానికి ఇది దృష్టి సామర్యాన్ని పెంచుతుంది. అరచేతులలో నరాలు, కళ్ల చుట్టూ ఉన్న నరాలకు మధ్య జరిగే సున్నితమైన స్పర్శ  కంటి నరాలను ఉత్తేజం చేస్తుంది.  అరచేతులు వెచ్చగా మారే వరకు  గట్టిగా రుద్దాలి.తరువాత వీటిని  మూసిన కనురెప్పలపై సున్నితంగా  ఉంచాలి. ఈ సందర్భంలో ఎలాంటి ఒత్తిడి ఉపయోగించకూడదు.  చేతుల వెచ్చదనం  కళ్లలోకి ప్రసారమవుతుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. నరాలనుకు శక్తిని ఇస్తుంది. రెప్పలు చేసేమాయ.. కనురెప్పలు వాల్చకుండా తదేకంగా సిస్టమ్ లేదా మొబైల్ వైపు చూడటం వల్ల కళ్లు చాలా తొందరగా అలసిపోతాయి. కనురెప్పలు ఆర్పడమనే వ్యాయామం ఇందుకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యాయామం సులభంగానూ, ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఆచరించాలంటే హాయిగా కళ్లు తెరిచి కూర్చోవాలి. దాదాపు 10 సార్లు వేగంగా రెప్పవేసి, ఆపై 20 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటూ మీ శ్వాసపై దృష్టి సారిస్తూ కళ్లు మూసుకోవాలి. దీన్ని సుమారు 5 సార్లు రిపీట్ చేయండి. ఆరుతూ, వెలుగుతూ ఉండే విద్యుత్ దీపాలు చూడటం, వెలుగుతున్న దీపాన్ని తదేకంగా చూడటం వంటి వ్యాయామాలు  కళ్లను లూబ్రికేట్ చేయడంలో సహాయపడతాయి.  ఎక్కువ సేపు స్క్రీన్‌లను చూస్తూ ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి. కంటి భ్రమణం..  తలను కదల్చకుండా కళ్ళను సవ్యదిశలో కదిలించి, ఆపై ప్రతి దిశలో 5-10 నిమిషాలు అపసవ్య దిశలో ఉంచాలి. సింపుల్ గా చెప్పాలంటే కళ్ళను క్లాక్ వైజ్ లో తిప్పాలి, ఆ తరువాత అపసవ్య దిశలో ఇదే విధంగా చేయాలి. ఇలా  కళ్లను తిప్పడం వల్ల కళ్ల కండరాల దృఢంగా మారతాయి.  రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.                                                                     *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఈ టిప్స్ తో నెలరోజుల్లో కంటి చూపు ఊహించనంతగా మెరుగవుతుంది! Publish Date: Jun 9, 2025 9:30AM

రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు... డిఫెన్స్ లో వైసిపి

అమరావతి రాజధానిపై వైసీపీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత కూడా అమరావతి కోసం అన్ని అప్పుల అవసరమా అని మాజీ సీఎం జగన్ అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ మీడియా రంగంలోకి దిగింది. అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా  ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  జూన్ 4న  వెన్నుపోటు దినంతో ఏదో సాధించామని సంబరపడిపోతున్న వైసీపీ శ్రేణులను ఆ పార్టీ మీడియానే ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేసింది. మీడియాలో జర్నలిస్టు ముసుగులో జరిగిన చర్చపై కూటమి ప్రభుత్వం చర్యలకు  సిద్ధమైంది. రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైఃసీపీ సొంత మీడియాలో ఓ చర్చ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఉపముఖ్యమంత్రి ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. జర్నలిస్ట్ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు, అధికారులు విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ సదరు ఛానల్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కులముద్రలు వేసి మహిళలను అవమానిస్తున్నారంటూ ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక్కడ విలసిల్లిన బౌద్ధాన్నీ అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ.. 14 శాతం బీసీ రైతులు ఉన్నారని వివరించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చెందిన మీడియాలో చర్చ కార్యక్రమం వేదికగా చేసిన కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను.. ఈ ప్రొగ్రామ్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా..   వ్యంగ్యంగా కామెంట్ చేయడంపైనా పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఆ మీడియా యాజమాన్యం సైతం దీనిని సమర్థించుకొనే విధంగా.. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్దఎత్తున ఉద్యమ బాట పట్టారు.  అలాంటి వేళ ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత వరుసగా స్పందించారు. మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీపీ ఫిర్యాదు చేశారు. 
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు... డిఫెన్స్ లో  వైసిపి Publish Date: Jun 9, 2025 6:35AM

అదొక అద్భుతం.. ఆమె తోనే సాధ్యం ! భరత మాత నుదిటి సింధూరం

కాశ్మీరాన్ని భారత దేశంతో కలపాలనే శతాబ్దాల కల సాకారమైంది. చీనాబ్ వంతెన నిర్మాణం పూర్తయింది. ఎప్పుడో 132 ఏళ్లకు  పూర్వం ఆనాటి  రాజరిక పాలకులు కన్న కలను  ఈ నాటి ప్రజాస్వామ్య ప్రభుత్వం  సాకారం చేసింది.  జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనను  ఇటీవలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందిన  చీనాబ్ వంతెన  ఒక సాకేతిక అద్భుతం. భారత రైల్వే చరిత్రలో ఇదొక మైలురాయి. అంతే కాదు  ప్రపంచం ఎదుట మనం భారతీయులం తలెత్తుకుని  నిలిచేలా చేసిన మరో సాంకేతిక అద్భుతం  చీనాబ్ వంతెన నిర్మాణం.   అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. వంతెన అంటే వంతెన కాదు.. అదొక ఇంగినీరింగ్ అద్భుతం.. చీనాబ్ నదీగర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ వంతెన, ప్రపంచ పర్యాటక వింతల్లో ఒకటిగా పేర్కొనే  పారిస్‌లోని ఐఫిల్ టవర్ ను తలదన్నేలా నిర్మితమైన   మహాద్భుతం. అవును ఐఫిల్ టవర్  కంటే 35 మీటర్ల ఎత్తులో చీనాబ్ వంతెన నిర్మాణం అయింది.  ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేనన్ని వింతలు, విశేషాల సమాహారం చీనాబ్ బ్రిడ్జి. ఈ ఆలోచన సాకారం కావడానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. 1,315 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ఇంతకాలం పట్టిందంటేనే అది ఎంతటి కష్ట సాధ్యమైన కార్యమో వేరే చెప్పనక్కర లేదు. అంతే కాదు  ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగల సామర్ధ్యం మనకు ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన మహాద్భుతం.  నిజానికి..  ఇది ఈనాటి ఆలోచన కాదు. దేశ విభజనకు ముందు అప్పటి కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం తొలి అడుగు వేస్తే..  స్వాతంత్రం  రాకముందు బ్రిటిష్ పాలకుల కాలంలో.. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల వరకు, రాజా హరిసింగ్ కలను సాకారం చేసేందుకు  అనేక ప్రయత్నాలు జరిగాయి. ఒకప్పుడు,, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రూ.50 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి ప్రణాళికను సిద్దం చేశారు. కానీ, అది అమలు కాలేదు. ఇప్పుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.43,800 కోట్ల వ్యయంతో రాజా హరిసింగ్ కలను సాకారం చేసింది. ఆ రోజున..  ఆ మార్గంలో స్టీమ్ ఇంజిన్ రైలు చాలని అనుకుంటే, ఈ రోజున అదే మార్గంలో వందే భారత్ రైలు పరు గులు తీస్తోంది.  ఈ రోజున..  ప్రదాని నరేంద్ర మోదీ మొదలు మన దాకా..  అందరం సగౌరవంగా తలెత్తుకుని నిలిచామంటే..  అసాధ్యాలను సుసాధ్యం చేసి.. ఇంతటి మహాద్భుతాన్ని మన ముందు నిలబెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారు. సాకేతిక సాంకేతిక విజ్ఞానాన్ని వడపోసిన మేథా యోధుల మొదలు, రాళ్లెత్తిన కూలీల వరకూ..  ఎందరో..  ఎందరెందరో ఉన్నారు.  అలాంటి  వారిలో  జి. మాధవీలత ఒకరు.  ఎవరీ మాధవీ లత?..  అంటే,  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాక్ ఇంజనీరింగ్‌ నిపుణురాలు.  మాధవిలత ఈ ప్రాజెక్టుపై జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా 17 సంవత్సరాలు పని చేశారు.  నిర్మాణం సవాళ్లతో నిండిపోయింది, అయినా ఆమె, తమ బృందంతో కలిసి వీచే ఎదురు గాలులను సవాలుగా తీసుకుని ఎదురు నిలిచి,  డిజైన్ యాజ్ యు గో  విధా నంలో,ప్రపంచాన్ని అబ్బురపరిచే, ఇంజనీరింగ్ అదుతాన్ని ఆవిష్కరించారు..     చీనాబ్ వంతెన ప్రణాళిక 2005 లో ప్రారంభమైంది, 2022 లో ట్రయల్ రన్‌  పూర్తయింది. నిజానికి..  ఈ ప్రాజెక్ట్ పుర్తయిందంటే..  అందుకు, ప్రధాన కారణం మాధవీలత. కొండలు గుట్టలను పిండి చేస్తూ.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. అధ్బుత నిర్మాణాలతో ముందుకు సాగిన మాధవీలత.. 17 ఏళ్ల  చారిత్రక చీనాబ్ నిర్మాణ ప్రయణాన్ని  మాటల్లో వర్ణించడం సామాన్యులకు సాధ్యం కాదు.  అందుకే.. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..  చీనాబ్ వంతెన వంటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణం, ప్రణాళిక రూపకల్పనతో మొదలైన తొలి అడుగు నుంచే  సవాళ్ళను ఎదుర్కొంది. ప్రతి అడుగులోనూ అవరోధాలు ఎదురయ్యాయి. ముదుకు సాగే కొద్దీ, భౌగోళిక పరిస్థితిలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను ముందుంచాయి.  నిరంతరం మారుతున్న భౌగోళిక, భూసాంకేతిక పరిస్థితులను పరిగణ నలోకి తీసుకుంటే.. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ఆధారంగా, ముందుగా నిర్ణయించిన పరిష్కారాలతో బలమైన  డిజైన్ రూపొందించడం అసాధ్యంగా మారిందని ఆమె ఇటీవల  ఒక పత్రికలో రాసిన వ్యాసంలో,  వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అందుకే..  డిజైన్ యాజ్ యు గో విధానం ఎంచుకుని ముందుకు సాగినట్లు చెప్పారు. డిజైన్ యాజ్ యు గో విధానం అవలబించడం  వల్లనే నిర్మాణం పూర్తయిందని వివరించారు.  నిటారుగా నిలిచిన ఎత్తైన రాతి కొండులు, ఏటవాలుగా నేలకు వాలిన పర్వత  శ్రేణులను అనుసంధానం చేస్తూ నిర్మాణ పనులను సాగించడం,  ముఖ్యంగా స్థంభాల పునాదులు నిర్మించడం ఒక ప్రధాన సవాలుగా మారిందని చెప్పారు. అయితే.. దృఢ చిత్తంతో ముందుకుసాగి అసాధ్యాలను సుసాధ్యం చేశామని మాధవీ లత చెప్పారు.   నిజానికి..  చీనాబ్ వంతెన సాకారం చేయడంలో..  మెయిన్ పిల్లర్ పాత్రను పోషించిన  మాధవీలతతో పాటుగా  మరెందరో చేసిన కృషి అసాధారణం, అత్యద్భుతం. అందుకే.. ప్రదాని మోదీ.. ఈ అద్భుత సృష్టిలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున అభినందించారు. ముఖ్యంగా..  ప్రధాని మోదీ చీనాబ్ వంతెనను ప్రారంభించిన వెంటనే మాధవీ లతను ప్రత్యేకంగా  ప్రశంసిస్తూ, చీనాబ్ వంతెన నిర్మాణంలో మాధవిలత, ఆమె  బృందం చేసిన కృషికి దేశం మొత్తం  గర్విస్తోందని అన్నారు.  ప్రధాని సహా పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న మాధవీలత అనేక పురస్కారాలను అందుకున్నారు.  మాధవీలత ప్రస్తుతం సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్  చైర్‌పర్సన్‌గా ఉన్నారు.  ఆమెకు సహజంగానే, దేశం సెల్యూట్ చేస్తోంది. 
అదొక అద్భుతం..  ఆమె తోనే సాధ్యం ! భరత మాత నుదిటి సింధూరం Publish Date: Jun 9, 2025 5:38AM

ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు పూర్తి

  బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి  అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులర్పించారు. అంతకుముందు జరిగిన అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు  పాడె మోశారు. పోలీసులు మాగంటి భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది.  మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. .బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు అధికార లాంచనాలతో పూర్తి అయ్యాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఈ నెల 5న ఆయన ఏఐజీలో చేరారు. ఈ నెల 5న ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దాంతో వెంటనే కుటుంబీకులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.  
 ప్రభుత్వ  అధికార  లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు పూర్తి Publish Date: Jun 8, 2025 5:34PM

దివంగత నేత ఆనం వెంకట రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వేమిరెడ్డి

  నెల్లూరు రామలింగాపురం సర్కిల్‌లో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.  సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతు  సింహపురి ఉక్కుమనిషి, ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, ఆనం వంశ రాజసానికి ప్రతీక ఆనం వెంకటరెడ్డి ఆయన సేవలను కొనియాడారు.  నెల్లూరు రాజకీయాల్లో, అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి,  కాకర్ల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, పాశం సునీల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గోన్నారు.  
దివంగత నేత ఆనం వెంకట రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వేమిరెడ్డి Publish Date: Jun 8, 2025 5:01PM

నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ వద్ద : సీఎం రేవంత్

  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ బయోగ్రఫీ పుస్తకం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్‌ వరకు ఎదిగారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.  పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. ఆయన శైలి, విధానాల నుంచి నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే వారు నేర్చుకోవాలి. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్‌, దత్తాత్రేయ. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్‌ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారు. మా నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుంది’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.  
నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ వద్ద : సీఎం రేవంత్ Publish Date: Jun 8, 2025 4:29PM

రాజకీయ సంకల్పంతోనే పోలీస్ సంస్కరణలు సాధ్యం : ఏబి వెంకటేశ్వరరావు

  ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ,ఎన్నికల మానిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధ పాలన సాధ్యం అవుతుందని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 8వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై జరిగిన చర్చా గోష్టికి ముఖ్యఅతిథిగా హాజరై ఏబి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. నేడు జైళ్ళలో మగ్గుతున్న లక్షలాది మందిలో 85 శాతం పైగా విచారణ ఖైదీలుగా పేద వర్గాలే ఉన్నారని తెలిపారు.  న్యాయస్థానాలను రెట్టింపు చేయడం ద్వారా  న్యాయాన్ని అందరికీ అందించగలమని తద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే, నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చునన్నారు. పోలీసులలో నైపుణ్యాలను పెంచి ఆధునిక సాంకేతిక పరిణామాన్ని అందించడం, నేర పరిశోధనను, నేర విచారణ నుండి వేరుచేస్తేనే సత్వర న్యాయం సాధ్యమన్నారు. మనతోపాటు బ్రిటన్ నుండి విముక్తి పొందిన సింగపూర్ న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థల్లో అగ్ర భాగాన ఉందని, ఇది రాజకీయ సంకల్పం ద్వారానే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని రకాల దుర్మార్గాలపై న్యాయ విచారణ జరిపి, సంబంధిత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇటీవల తెనాలిలో ముగ్గురు యువకులను ప్రజల మద్య బహిరంగంగా చావ బాది ,ఆ వీడియోను ఉద్దేశ్య పూర్వకంగా ప్రజల ముందు ఉంచి, ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ప్రయత్నించడం అమానుషమని పేర్కొని, సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతమున్న సిబ్బంది, వనరులతోనే 75 శాతం మేర సంస్కరణలు తీసుకొని రావచ్చన్నారు. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఒకవైపు ఉంటే, మరోవైపు పోలీస్ వ్యవస్థలో మార్పుల కోసం, పేదలకు సత్వర న్యాయం కల్పించడానికి అదనంగా కనీసం 1000 కోట్ల వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం శోచనీయమన్నారు.  సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి  ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ ఆర్మీగా మారిందన్నారు. అధికార పార్టీ నేతల కను సన్నలలో క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీని వలన చట్టబద్ధ పాలనకు భంగం వాటిల్లుతుందన్నారు. తెనాలి సంఘటనతో బాధ్యులైన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. మాజీ శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారి సమస్యలను వివ రించడానికి భయపడే వాతావరణం నేడు ఉందని, ఫ్రెండ్లీ పోలీస్ రావాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త ప్రో. డి. ఏ. ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడితే కేవలం వందల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ లుగా విజయం సాధిస్తున్నారని, వీళ్లు కూడా అధికార పార్టీకి దాసోహం కావడం వలన ప్రజాస్వామ్యం ఎలా వికసిస్తుందని ప్రశ్నించారు.
రాజకీయ సంకల్పంతోనే పోలీస్ సంస్కరణలు సాధ్యం : ఏబి వెంకటేశ్వరరావు Publish Date: Jun 8, 2025 3:41PM

భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం..నలుగురు స్మగ్లర్లు అరెస్టు

  అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.  టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ  పీ. శ్రీనివాస్  ఆదేశాలతో అధికారులు, సిబ్బంది అన్నమయ్య జిల్లా బురకాయల కోట అటవీ ప్రాంతం చేరుకుని, వేపూరి కోట ఫారెస్ట్ బీటు పరిధిలో డంపింగ్ పాయింట్ల తనిఖీ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున  వీరు అన్నగారి పల్లి సమీపంలోని వంకగట్టు వద్ద ఒక మోటారు సైకిల్ కనిపించింది.  దానిని సమీపించడంతో అప్పటికే అక్కడ గుమికూడి ఉన్న కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. ఆప్రాంతంలో తనిఖీ చేయగా అక్కడ 48 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారితో పాటు ఎర్రచందనం దుంగలు, మోటారు సైకిల్ ను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం..నలుగురు స్మగ్లర్లు అరెస్టు Publish Date: Jun 8, 2025 3:28PM

జెంటిల్‌మెన్‌ పదానికి దత్తాత్రేయ ప్రతిరూపం : చంద్రబాబు

  హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,  దత్తాత్రేయ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు , విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే బండారు దత్తాత్రేయ అని గుర్తొస్తారని ఆయన అన్నారు.  జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం  దత్తాత్రేయ అని  అన్నారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారన్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆయనది పేరుకు హిందుత్వం, మతం భారతీయం అని చంద్రబాబు పేర్కొన్నారు‘ అలయ్‌ బలయ్‌’ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు. అందరినీ కలిపేందుకు వేదిక రూపొందించారు. ఆయనకు శత్రువులు ఎవరూ ఉండరు. ఆయనకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదు.  దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితం. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. లేఖలు రాయడంలో అంబాసిడర్‌గా నిలిచారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ ఎన్వీ రమణ, గవర్నర్ కమ్మంపాటి హరిబాబు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.   
జెంటిల్‌మెన్‌ పదానికి దత్తాత్రేయ ప్రతిరూపం : చంద్రబాబు Publish Date: Jun 8, 2025 1:57PM