అదొక అద్భుతం.. ఆమె తోనే సాధ్యం ! భరత మాత నుదిటి సింధూరం

కాశ్మీరాన్ని భారత దేశంతో కలపాలనే శతాబ్దాల కల సాకారమైంది. చీనాబ్ వంతెన నిర్మాణం పూర్తయింది. ఎప్పుడో 132 ఏళ్లకు  పూర్వం ఆనాటి  రాజరిక పాలకులు కన్న కలను  ఈ నాటి ప్రజాస్వామ్య ప్రభుత్వం  సాకారం చేసింది. 
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెనను  ఇటీవలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందిన  చీనాబ్ వంతెన  ఒక సాకేతిక అద్భుతం. భారత రైల్వే చరిత్రలో ఇదొక మైలురాయి. అంతే కాదు  ప్రపంచం ఎదుట మనం భారతీయులం తలెత్తుకుని  నిలిచేలా చేసిన మరో సాంకేతిక అద్భుతం  చీనాబ్ వంతెన నిర్మాణం.
 
అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్ పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. వంతెన అంటే వంతెన కాదు.. అదొక ఇంగినీరింగ్ అద్భుతం.. చీనాబ్ నదీగర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ వంతెన, ప్రపంచ పర్యాటక వింతల్లో ఒకటిగా పేర్కొనే  పారిస్‌లోని ఐఫిల్ టవర్ ను తలదన్నేలా నిర్మితమైన   మహాద్భుతం. అవును ఐఫిల్ టవర్  కంటే 35 మీటర్ల ఎత్తులో చీనాబ్ వంతెన నిర్మాణం అయింది.

 ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేనన్ని వింతలు, విశేషాల సమాహారం చీనాబ్ బ్రిడ్జి. ఈ ఆలోచన సాకారం కావడానికి ఏకంగా 132 ఏళ్లు పట్టింది. 1,315 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి ఇంతకాలం పట్టిందంటేనే అది ఎంతటి కష్ట సాధ్యమైన కార్యమో వేరే చెప్పనక్కర లేదు. అంతే కాదు  ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగల సామర్ధ్యం మనకు ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన మహాద్భుతం.
 నిజానికి..  ఇది ఈనాటి ఆలోచన కాదు. దేశ విభజనకు ముందు అప్పటి కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ నిర్మాణం కోసం తొలి అడుగు వేస్తే..  స్వాతంత్రం  రాకముందు బ్రిటిష్ పాలకుల కాలంలో.. స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల వరకు, రాజా హరిసింగ్ కలను సాకారం చేసేందుకు  అనేక ప్రయత్నాలు జరిగాయి. ఒకప్పుడు,, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రూ.50 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి ప్రణాళికను సిద్దం చేశారు. కానీ, అది అమలు కాలేదు. ఇప్పుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.43,800 కోట్ల వ్యయంతో రాజా హరిసింగ్ కలను సాకారం చేసింది. ఆ రోజున..  ఆ మార్గంలో స్టీమ్ ఇంజిన్ రైలు చాలని అనుకుంటే, ఈ రోజున అదే మార్గంలో వందే భారత్ రైలు పరు గులు తీస్తోంది. 
ఈ రోజున..  ప్రదాని నరేంద్ర మోదీ మొదలు మన దాకా..  అందరం సగౌరవంగా తలెత్తుకుని నిలిచామంటే..  అసాధ్యాలను సుసాధ్యం చేసి.. ఇంతటి మహాద్భుతాన్ని మన ముందు నిలబెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారు. సాకేతిక సాంకేతిక విజ్ఞానాన్ని వడపోసిన మేథా యోధుల మొదలు, రాళ్లెత్తిన కూలీల వరకూ..  ఎందరో..  ఎందరెందరో ఉన్నారు.  అలాంటి  వారిలో  జి. మాధవీలత ఒకరు. 

ఎవరీ మాధవీ లత?..  అంటే,  బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాక్ ఇంజనీరింగ్‌ నిపుణురాలు.  మాధవిలత ఈ ప్రాజెక్టుపై జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా 17 సంవత్సరాలు పని చేశారు.  నిర్మాణం సవాళ్లతో నిండిపోయింది, అయినా ఆమె, తమ బృందంతో కలిసి వీచే ఎదురు గాలులను సవాలుగా తీసుకుని ఎదురు నిలిచి,  డిజైన్ యాజ్ యు గో  విధా నంలో,ప్రపంచాన్ని అబ్బురపరిచే, ఇంజనీరింగ్ అదుతాన్ని ఆవిష్కరించారు..    

చీనాబ్ వంతెన ప్రణాళిక 2005 లో ప్రారంభమైంది, 2022 లో ట్రయల్ రన్‌  పూర్తయింది. నిజానికి..  ఈ ప్రాజెక్ట్ పుర్తయిందంటే..  అందుకు, ప్రధాన కారణం మాధవీలత. కొండలు గుట్టలను పిండి చేస్తూ.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. అధ్బుత నిర్మాణాలతో ముందుకు సాగిన మాధవీలత.. 17 ఏళ్ల  చారిత్రక చీనాబ్ నిర్మాణ ప్రయణాన్ని  మాటల్లో వర్ణించడం సామాన్యులకు సాధ్యం కాదు.  అందుకే.. ఆమె మాటల్లోనే చెప్పాలంటే..  చీనాబ్ వంతెన వంటి సివిల్ ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణం, ప్రణాళిక రూపకల్పనతో మొదలైన తొలి అడుగు నుంచే  సవాళ్ళను ఎదుర్కొంది. ప్రతి అడుగులోనూ అవరోధాలు ఎదురయ్యాయి. ముదుకు సాగే కొద్దీ, భౌగోళిక పరిస్థితిలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను ముందుంచాయి.  నిరంతరం మారుతున్న భౌగోళిక, భూసాంకేతిక పరిస్థితులను పరిగణ నలోకి తీసుకుంటే.. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ఆధారంగా, ముందుగా నిర్ణయించిన పరిష్కారాలతో బలమైన  డిజైన్ రూపొందించడం అసాధ్యంగా మారిందని ఆమె ఇటీవల  ఒక పత్రికలో రాసిన వ్యాసంలో,  వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. అందుకే..  డిజైన్ యాజ్ యు గో విధానం ఎంచుకుని ముందుకు సాగినట్లు చెప్పారు. డిజైన్ యాజ్ యు గో విధానం అవలబించడం  వల్లనే నిర్మాణం పూర్తయిందని వివరించారు. 

నిటారుగా నిలిచిన ఎత్తైన రాతి కొండులు, ఏటవాలుగా నేలకు వాలిన పర్వత  శ్రేణులను అనుసంధానం చేస్తూ నిర్మాణ పనులను సాగించడం,  ముఖ్యంగా స్థంభాల పునాదులు నిర్మించడం ఒక ప్రధాన సవాలుగా మారిందని చెప్పారు. అయితే.. దృఢ చిత్తంతో ముందుకుసాగి అసాధ్యాలను సుసాధ్యం చేశామని మాధవీ లత చెప్పారు.  
నిజానికి..  చీనాబ్ వంతెన సాకారం చేయడంలో..  మెయిన్ పిల్లర్ పాత్రను పోషించిన  మాధవీలతతో పాటుగా  మరెందరో చేసిన కృషి అసాధారణం, అత్యద్భుతం. అందుకే.. ప్రదాని మోదీ.. ఈ అద్భుత సృష్టిలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరినీ పేరు పేరున అభినందించారు. ముఖ్యంగా..  ప్రధాని మోదీ చీనాబ్ వంతెనను ప్రారంభించిన వెంటనే మాధవీ లతను ప్రత్యేకంగా  ప్రశంసిస్తూ, చీనాబ్ వంతెన నిర్మాణంలో మాధవిలత, ఆమె  బృందం చేసిన కృషికి దేశం మొత్తం  గర్విస్తోందని అన్నారు.  ప్రధాని సహా పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న మాధవీలత అనేక పురస్కారాలను అందుకున్నారు.  మాధవీలత ప్రస్తుతం సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్  చైర్‌పర్సన్‌గా ఉన్నారు.  ఆమెకు సహజంగానే, దేశం సెల్యూట్ చేస్తోంది.