ఆ చానెల్ లైసెన్స్ రద్దు చేయాలి.. ఏపీ మహిళా కమిషన్
posted on Jun 9, 2025 3:22PM

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో స్పందించారు. సోమవారం(జూన్ 9) విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా ఆ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు.
జర్నలిస్టు, ఎనలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడతారా? అని ధ్వజమొత్తారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో నోటికొచ్చినట్ల మాట్లాడితే కుదరదన్నారు. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని నిలదీశారు. ఆ చానెల్ లో ప్రసారం చేసిన డిబేట్ కు సంబంధించి మహిళా కమిషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న రాయపాటి శైలజ.. రాజకీయ కారణాలతో ఒక ప్రాంతంపై నీచమైన ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. అమరావతి ప్రాంత మహిళలు త్యాగం చేసి... గత ఐదేళ్లుగా అనేక కష్టాలు, నష్టాలు పడ్డారన్నారు.
ప్రభుత్వం మారిన తరువాత అమ రావతి అభివృద్ధి చెందుతోందనీ, ఇది చూసి ఓర్వలేక అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన వారు, చేయించిన వారు అందరూ శిక్షార్హులేనన్నారు. రాజకీయ ముసుగులో నడిపే అటువంటి చానల్స్ ను రద్దు చేయాలన్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్కు లేఖ రాసి ఆ ఛానల్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా కమిషన్కు ఉన్న అధికార పరిధిలో తమవంతు చర్యలు ఉంటాయని రాయపాటి శైలజ స్పష్టం చేశారు