ఇక అంతా ఢిల్లీ నుంచే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి  ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పడు ఎట్ట కేలకు  ఆ క్రతువు  సగం పూర్తయింది.  మిగిలిన సగం ఎప్పుడన్నది పక్కన పెడితే..  ఇప్పడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది  మాత్రం అందుకోసం కాదు.  మంత్రి పదవులు ఇచ్చిన ముగ్గురు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు గురించి  అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు అందుకు అదనంగా.. మంత్రివర విస్తరణ బృహత్ ప్రణాళికకు సమాంతరంగా సాగు తూ వస్తున్న  హాఫ్ ఫినిష్ డ్ పీసీసీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు చెపుతున్నారు. అలాగే.. పనిలో పనిగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఏర్పాటు చేయ తలపెట్టిన బహిరంగ సభల విషయం ఆదిస్థానంతో చర్చించి, సభలు ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో నిర్ణయించేందు కోసమూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లు చెపుతున్నారు.  

ఎందుకోసం అయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు 46 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. మరో నాలుగు రౌండ్లు కొట్టి వస్తే, హాఫ్ సెంచరీకి చేరు కుంటారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రావడం పెద్ద విషయం విశేషం కాదు. అలాగే..  కొన్ని కీలక విషయాల్లో అధిష్టానంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొత్త విషయం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కోట్ల, వైఎస్సార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి రావడం, ఢిల్లీ కనుసన్నల్లో పని చేయడం, తరచూ ఢిల్లీ చక్కర్లు కొట్టడం ఉన్నదే. అయితే ఇప్పడు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది. గతంలో ముఖ్యమంత్రులు రెండు మూడు నెలలకు ఒప్కసారి ఢిల్లీ వెళ్లి వస్తే..  ఇప్పడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలోనే రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు.

అదలా ఉంటే..  ముందు ముందు ఈ  జోరు ఇంకా పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి, దేశం మొత్తంలో పూర్వ వైభవ స్థితిని పొందే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ముందు ముందు  రాష్ట్ర పార్టీ వ్యవహరాల్లోనే కాకుండా  పాలనా వ్యవహారాల్లోనూ మరింత క్రియాశీల పాత్రను పోషించ వచ్చని అంటున్నారు. ఇప్పటికే  రాహుల్ గాంధీ పలు సందర్భాలలో, పలు వేదికల నుంచి, కులగణన ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా పేర్కొంటున్నారు.చివరకు.. ఈ మధ్యనే మొదలు పెట్టిన  బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ  కులగణనకు తెలంగాణ  మోడల్ ను ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అందుకే.. మంత్రి వర్గ విస్తరణలో, రాష్ట్రంలో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న  రెడ్డి సామాజిక వర్గాన్ని  పూర్తిగా పక్కన పెట్టి, బీసీ, ఎస్సీ లకు మాత్రమే అవకాశం కల్పించారని అంటున్నారు.ఈ పరిణామాలను గమనిస్తే, ప్రభుత్వం రోజు వారీ వ్యవహారాల్లోనూ  ఢిల్లీ పెత్తనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  

నిజానికి  ఇప్పటికే  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల  ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పరిపాలన వ్యవరాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం విషయంలో ఆమె నేరుగా సెక్రటేరియట్ కు వెళ్లి, మంత్రులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పమైంది. అలాగే.. యూనివర్సిటీ ఉపాధ్యయ, విద్యార్ధి సంఘాలతో చర్చలు జరపడాన్ని కూడా  విపక్షాలు తప్పు పట్టాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. విపక్షాలు విమర్శించడమే కాదు..  స్వపక్షంలోనూ లుకలుకలు వినిపించాయి. మీనాక్షి గీత దాతుతున్నారని అధికార పార్టీ నేతలు గుసగుసలు పోయారు.  

అలాగే..  తాజా మంత్రివర్గ విస్తరణలోనూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు,ఇతర నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. చివరకు.. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి మీనాక్షి స్వయంగా  నిర్వహించిన సమీక్షల అదారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగిందని అంటున్నారు. అలాగే..  ముఖ్య మంత్రి సహా రాష్ట్ర నాయకులు చేసిన  సి ..ఫార్సులను బుట్ట దాఖలు చేసి,   రాహుల్ గాంధీ కోటాలో ఒకరికి, ఖర్గే ఖాతాలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినట్లు చెపుతున్నారు. తద్వారా ఇక అంతా ఢిల్లీ నుంచే అన్న సంకేతాలు  అధిష్టానం  ఇచ్చిందంటున్నారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణలో బెర్త దక్కని,ఆశావహులను బుజ్జగించి, దారిలోకి తెచ్చే విషయంలోనూ మీనాక్షి నటరాజన్ క్రియాశీల పాత్రను పోషించారు. ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రుల ప్రమేయం లేకుండా వ్యవహరాన్ని చక్క బెట్టారు. తద్వారా  అధిష్టానం దూతగా అధిష్టానం ఆశీస్సులతో ఆమె రాష్ట్ర పార్టీలోనే కాదు..  ప్రభుత్వంలోనూ, మరో పవర్ సెంటర్, (అధికార కేంద్రం) గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే  గతంలో విపక్షాలు చేసిన రబ్బర్ స్టాంప్  ఆరోపణకు బలం చేకురుతోందని అంటున్నారు.