షారుఖ్, సుకుమార్ కాంబోలో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్..!
on Jun 9, 2025
బాలీవుడ్ స్టార్స్ చూపు తెలుగు మార్కెట్ పై పడింది. ఇక్కడ మార్కెట్ పెంచుకోవడం కోసం.. తెలుగు దర్శకులు, నిర్మాతలతో సినిమాలు చేయడానికి వారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.
'పఠాన్', 'జవాన్' సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి.. బాలీవుడ్ స్టార్స్ లో ఎవరికీ సాధ్యంకాని ఫీట్ సాధించిన షారుఖ్.. ఈసారి అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో షారుఖ్ ఓ భారీ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇది రూపొందనుందట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లని వినికిడి.
'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు సుకుమార్. ఆయన గత మూడు చిత్రాలు 'రంగస్థలం', 'పుష్ప-1', 'పుష్ప-2' మైత్రి బ్యానర్ లోనే రూపొందాయి. ఆ ఉత్సాహంతోనే సుకుమార్-షారుఖ్ ప్రాజెక్ట్ కి అత్యంత భారీ బడ్జెట్ పెట్టడానికి మైత్రి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు టాలీవుడ్ స్టార్స్ తో బడా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర భాషల స్టార్స్ తో సినిమాలను చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ముఖ్యంగా హిందీ హీరోలతో వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే సన్నీ డియోల్ తో 'జాట్' చేసింది. ఆమిర్ ఖాన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు షారుఖ్-సుకుమార్ కాంబో తెరపైకి వచ్చింది. మున్ముందు ఈ లిస్టులో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కూడా చేరే అవకాశముంది.
ఏది ఏమైనా ఇప్పుడు షారుఖ్-సుకుమార్ కాంబినేషన్ మాత్రం సంచలనంగా మారింది. కేవలం అనౌన్స్ మెంట్ తోనే.. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లో ఒకటిగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం షారుఖ్ 'కింగ్' మూవీ చేస్తున్నాడు. సుకుమార్ కూడా రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
