ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు పూర్తి

 

బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి  అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులర్పించారు. అంతకుముందు జరిగిన అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు  పాడె మోశారు. పోలీసులు మాగంటి భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. 

మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. .బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు అధికార లాంచనాలతో పూర్తి అయ్యాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఈ నెల 5న ఆయన ఏఐజీలో చేరారు. ఈ నెల 5న ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దాంతో వెంటనే కుటుంబీకులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.