ఉన్నవి ఆరు ఖాళీలు.. 18 నెలల తర్వాత సగం భర్తీ!

మిగిలిన మూడూ ఎప్పడు.. స్ట్రాటజీ ఏంటి?
ఇది ఎవరి మార్క్ రాజకీయం నటరాజా!!! 

కాబోయే హోం మంత్రి నేనే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  నాలుగు సార్లు.. ఎమ్మెల్యే డెఫినెట్ గా బెర్త్ కన్ ఫర్మ్ అంటూ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ మారుమూల నుంచొచ్చా.. కేబినెట్ లో సీటు ఖాయం అంటూ ప్రేమ్ సాగర్ రావ్,  ఉమ్మడి రంగా రెడ్డికి పదవిలేదని మల్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆశావహుల ఆశలన్నీ ఆశలుగానే.. కలలు కల్లలుగానే.. మిగిలాయ్! ఇక ఎమ్మెల్సీలు దయాకర్ రావు, విజయశాంతి.. సంగతి సరేసరి. కట్ చేస్తే వివేక్, వాకిట, అడ్లూరితో భర్తీకి ఫుల్ స్టాప్ పెట్టకుండా,  కామా పెట్టడంలో అర్ధమేంటన్నది  ఇప్పుడందరినీ తొలిచేస్తోన్న ప్రశ్న. 

అందరిలోకీ ఒకింత ఆశ్చర్యకరమైన ఎన్నిక వివేక్ దే. ఒక పక్క దళిత సంపన్న నేత. మరొక పక్క మీడియా అధినేత. అన్నింటికన్నా మించి బీజేపీ నుంచి వచ్చినా మేనేజ్ చేయగలిగిన సత్తా. ఇటు కుమారుడు వంశీ చూస్తే మొన్నటి పుష్కరాలపుడు యాంటీ గవర్నమెంట్ యాగీ.  అయినా సరే..  బెర్త్ కొట్టడమంటే మామూలు విషయం కాదు.  అంతా తావీజ్ మహిమ!  అంటున్నారు కొందరు. ఇక వాకిట శ్రీహరి మహబూబ్ నగర్ వాసి. సీఎం కూడా సేమ్ జిల్లా. దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించినట్టు భోగట్టా. ఇదిలా ఉంచితే అడ్లూరి. కవ్వంపల్లిని ఊరించి ఊరించి లాస్ట్ కి అడ్లూరి నోట్లో లడ్డూ పెట్టింది అధిష్టానం. అదేమంటే ఎప్పటి నుంచో లాయల్ కదా? అంటున్నారు.  

ఇప్పుడు వీరి సంగతి కాదు కానీ.. రాజగోపాల్, ప్రేమ్ సాగర్, సుదర్శన్.. వీరి పయనమెటు? ఆల్రెడీ హోంత్రి  ఖాయం అంటూ తన అనుచరులకు, కార్యకర్తలకు చెప్పుకు తిరిగిన  కోమటిరెడ్డి బ్రదర్. అంతేనా.. చామలను బోన్ గిరి ఎంపీగా గెలిపిస్తే.. నీకు మంత్రిత్వం ఖాయమంటూ సీఎం నుంచే హామీ ఉన్నా ఏం ఫాయిదా?  దీంతో చిలుకూరు ఫామ్ హౌస్ లో అలకపాన్పు ఎక్కారు. ఇక ప్రేమ్ సాగర్ రావు.. ఎక్కడో మారు మూలండీ బాబూ.. ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి లేకుంటే ఎట్టా? అన్నదాయన ఆవేదన.  సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ అంటే మరీ అంత లోకువా అంటున్నారు.

ఇక మైనార్టీల నుంచి మంత్రి లేకనే పోయె. ఇప్పటి వరకూ మంత్రివర్గంలో పాటించిన సామాజిక న్యాయమేపాటి? అని చూస్తే.. రెడ్లు- 4, బీసీలు-3, ఎస్సీ మాల-3, ఎస్సీ మాదిగ-2, ఎస్టీ కోయ-1, ఎస్టీ లంబాడ-1, బ్రాహ్మణ-1, కమ్మ- 1, వెలమ-1 గా ఉంది. ఇదీ కాంగ్రెస్ మార్క్.. సామాజిక న్యాయం కథ, కమామిషు. మొన్నంటే మొన్న మాదిగలంతా కలసి..  ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను, పీసీసీ చీఫ్‌మహేష్ ని వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ ని కలిసి మొరపెట్టుకున్నందుకు అడ్లూరి రూపంలో ఒక పదవైతే దక్కింది.  డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రు నాయక్ కూడా హ్యాపీయే. మిగిలిన సామాజిక వర్గాల్లో అసంతృప్తులు అధికంగా ఎవరున్నారయా అంటే వాళ్లలో కూడా రెడ్లే ఎక్కువ.

అయితే ఈ మూడింటిని భర్తీ చేసే మూడ్ ఎప్పుడన్నది ఒక హాట్ టాపిక్. ఎంతైనా ఇది కాంగ్రెస్ పార్టీ బాసూ..  ఆ మాత్రం వెయింటింగ్ తప్పదు. ఇచ్చిన వాళ్లతోనే కాదు ఇవ్వని వాళ్లను కూడా వాడుకుని ఎలాగోలా నెగ్గుకు రావల్సి ఉంటుంది. అవునుగానీ ఇంతకీ ఈ మూడు మిగుల్చుడు- నాన్చుడు స్ట్రాటజీ ఎవరిదన్నది ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో కొత్త చర్చ. 

అయితే ఇదంతా   మీనాక్షి దేవి మహిమగా భావన. కారణమేంటంటే.. మీరేం ఖంగారు పడకండి ఖర్గేగారూ! నాదగ్గరో ఫార్ములా ఉందని తొలుత మీనాక్షి నటరాజనే కామెంట్ చేశారట.  ఇదెలాగంటే.. విస్తరణకంటూ ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తే.. కొందరి అసంతృప్తుల నుంచి వచ్చే జ్వాల  రాబోయే స్తానిక ఎన్నికలను తగలబెట్టినా పెట్టేస్తుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చూశాంగా. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మీనాక్షమ్మ.. సగమిచ్చి సగం వదులుదాం. ఎందుకంటే మన దగ్గరున్నవే ఆరు. వాటిలో ఆరింటికి ఆరిచ్చేసినా.. అరవై ముంది ఆశావహుల్లో ఆ అసంతృప్తిని ఎలాగూ చల్లార్చలేం. అదే సగం ఇచ్చి సగం దాచాం అనుకోండి. ఆ సగంలోని మూడింటి కోసం రేపటి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు.. ముప్పై మంది వరకూ కష్టపడతారు. మేం ఇంత కష్టపడ్డాం  కాబట్టి మాకూ మంత్రి పదవి ఇవ్వమని అడగటానికి బాగుంటుంది. కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటారని.. మీనాక్షి వేసిన నటరాజ్ మార్క్ స్కెచ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. 

మరి చూడాలి..  ఈ అసంతృప్త నేతలలో  మీనాక్షమ్మ బుజ్జగింపులకు ఎంత మంది తలొగ్గుతారో.  మిగిలిన ఆశావహులు ఈ స్ట్రాటజీకి లోబడి ఎంతగా పని చేస్తారో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ గురూ! సముద్రం. ఈ సముద్రంలో ఎన్ని పదవుల పన్నీరు పోసినా.. ఆ సముద్ర ఉప్పు అంత తేలిగ్గా తగ్గేది కాదన్నది ఫైనల్ టాక్. ఏమంటారు!