చంద్రబాబు నోటి మాటగా సాధించుకొచ్చిన దానికి...

  తెలంగాణా శాసనసభ విద్యుత్ పై సోమవారం ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో ఆంధ్రానుండి రాష్ట్రానికి రావలసిన వాటాను ఇప్పించే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినట్లే తెలంగాణా రాష్ట్రానికి కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు ఒకటి మంజూరు చేయాలని తీర్మానం చేసారు. అయితే అసలు శాసనసభలో ఈ తీర్మానం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అని ఆలోచిస్తే తెలంగాణా ప్రభుత్వం మొదటి నుండి కూడా కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించడం వలన, నేరుగా అడిగినట్లయితే దాని సహాయం దొరకకపోవచ్చనే అనుమానంతోనే ఈ ఆలోచన చేసినట్లు అర్ధమవుతుంది.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ లో తమకు న్యాయంగా ఈయవలసిన వాటా ఈయడంలేదు కనుక కేంద్రం జోక్యం చేసుకొని ఇప్పించాలని తీర్మానంలో కోరుతున్నారు. కానీ అంతకంటే ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూర్చొని ఈ సమస్య పరిష్కారం కోసం ఒక్కసారయినా మాట్లాడి విఫలమయ్యి ఉంటే, అప్పుడు న్యాయం చెప్పమని కేంద్రం వద్దకు వెళ్ళినా అర్ధం ఉండేది. ఇద్దరం కూర్చొని సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకొందామని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పినా, 300మెగావాట్స్ విద్యుత్ ఇస్తామని చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ తనకు సహకరించడం లేదని ఆరోపిస్తూ ఇప్పుడు కేంద్రానికి ఈ తీర్మానం రూపంలో పిర్యాదు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు తను నిత్యం దూషించే ప్రతిపక్షాల మద్దతు కూడా కోరడం కేసీఆర్ కే చెల్లు.   ఇక తీర్మానంలో రెండో అంశం పైలట్ ప్రాజెక్టు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పైలట్ ప్రాజెక్టు సాధించుకోవడానికి ఎటువంటి తీర్మానాలు చేసి పట్టుకొని వెళ్లి అడగలేదు. కేవలం నోటిమాటగా అడిగి తెచ్చుకోగలిగారు.కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేప్పట్టక ముందు నుండే కేంద్ర మంత్రులందరినీ ప్రసన్నం చేసుకోవడంతో ఆయన ప్రమాణ స్వీకారం నాడే కేంద్ర విద్యుత్ శాఖమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రానికి నిరంతరాయ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నోటిమాటగా సాధించుకొచ్చిన దానికోసం కేసీఆర్ శాసనసభ చేత తీర్మానం చేయించవలసి వచ్చిందంటేనే ఆయన తన వైఫల్యాన్ని స్వయంగా దృవీకరిస్తున్నట్లయింది.   కొత్త రాష్ట్రానికి మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తన ప్రజల దృష్టిలో గొప్ప హీరోగా కనబడాలనే తాపత్రయంతో అధికారం చేప్పట్టిన మొదటి రోజు నుండే కేంద్రంతో కూడా యుద్ధం మొదలు పెట్టేసారు. ‘కేసీఆర్ ఎవరికీ భయపడడు’ అని ప్రజలు తన గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఆవిధంగా చేసారేమో? కానీ దాని వలన తెలంగాణా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేకపోయినా నేడు విద్యుత్, పైలట్ ప్రాజెక్టు కోసం కూడా ఒక తీర్మానం చేయవలసిన దుస్థితి ఏర్పడింది.   ఇక్కడ శాసనసభలో విద్యుత్ సంక్షోభంపై వాదోపవాదాలు,తీర్మానాలు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు బెంగుళూరు వెళ్లి కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యని కలిసి తుంగభద్రా నదీ జలాల పంపకాలు, దాని సమస్యలపై చర్చించి వచ్చారు. కాంగ్రెస్, తెదేపాలకు చెందిన వారిరువురూ పార్టీల పరంగా శత్రువులు అయినప్పటికీ వారి చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరగడం, చంద్రబాబుకి కర్నాటక ముఖ్యమంత్రి శాలువా కప్పి గౌరవించడం గమనార్హం. వీటన్నిటి బట్టి అర్ధమవుతున్న సంగతి ఏమిటంటే నోరు మంచిదయితే ఊరు కూడా మంచిదవుతుందని. అందరితో సఖ్యతగా ఉన్నట్లయితే ఏ తీర్మానాలు అవసరం ఉండవని.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రానికి, బీజేపీకి కూడా మంచిదే

  రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిస్తామని మోడీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ కేవలం సాంకేతిక కారణాల వలననే ఆలస్యం జరుగుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకపోవడంతో ప్రజలు కూడా అపార్ధం చేసుకొంటున్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు ఇటీవల ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని ఇదే విషయం గురించి మాట్లాడేందుకు కలిసినప్పుడు, మరొక రెండు వారాలలోగా కేంద్రప్రభుత్వం ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకొంటుందని తెలిపారు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖల నుండి రాష్ట్రానికి చెందిన కొన్ని ఫైళ్ళు రావలసి ఉందని, అవి రాగానే తక్షణమే ప్రత్యేక హోదాపై ఒక నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు.   స్వంతంగా రాజధాని కూడా లేని రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా అయినా కేటాయిస్తే తప్ప భారీ పరిశ్రమలు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపవు. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తే తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడటం కష్టం. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రోక్కుకోనంత కాలం నిధుల కోసం కేంద్రంపైనే ఆధారపడక తప్పదు కనుక అది కేంద్రానికి కూడా భారంగానే ఉంటుంది. అందువలన రాష్ట్రం తిరిగి తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేసేందుకు కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేక హోదా ప్రకటించవలసిన అవసరం ఉంది. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడం వలన కేవలం రాష్ట్రానికే కాక కేంద్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది.   అనేక పెద్ద, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పరిశ్రమలు పెడదామనే ఆలోచనతో వేచి చూస్తున్నారు. ఇంకా ఆలశ్యం చేసినట్లయితే వారు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తరలిపోయే అవకాశాలున్నాయి. అదేజరిగినట్లయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి భారీ పరిశ్రమలను, ఐటీ సంస్థలను రప్పించేందుకు చేస్తున్న కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. త్వరలో ఆయన ఇదే పనిమీద సింగపూరు కూడా వెళ్ళబోతున్నారు. అందువల్ల కేంద్రప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే ఆయనే రాష్ట్రాన్ని చక్కబెట్టుకోగలరు. ఎన్డీయే ప్రభుత్వం మిత్రధర్మం పాటిస్తూ రాష్ట్రానికి ఉదారంగా సహాయపడితే రాష్ట్రంలో ప్రజలు కూడా బీజేపీని ఆదరించే అవకాశం ఉంటుంది.

అందుకే ఆంధ్రా, తెలంగాణాలకి నిధులు విడుదల కాలేదా?

  ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపా భాగస్వామిగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని కాంగ్రెస్, వైకాపాల ఆరోపిస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేప్పట్టి ఇప్పటికి ఐదు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంతవరకు నిధులు కానీ ఎటువంటి ప్రాజెక్టులు గానీ మంజూరు చేయకపోవడమే వారి వాదనలకు ఆధారం. అయితే కేంద్రం మరే ఇతర రాష్ట్రాలకు కూడా ఇంతవరకు నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసిన దాఖలాలు లేవనే సంగతి ప్రతిపక్షాలు ప్రస్తావించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అన్యాయం జరిగిపోతోందన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకొని తెలంగాణాపట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తోందని చేసిన ఆరోపణలు, ఆంద్రప్రదేశ్ పట్ల కేంద్రం చాలా సానుకూలంగా ఉందని స్పష్టం అవుతోంది. ఆ కారణంగానే రేపు జరుగబోయే కేంద్రమంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలో తన పార్టీకి కాక, తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చారు.   రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ ఖచ్చితంగా అమలుజేస్తామని, రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ కూడా పదేపదే స్పష్టం చేస్తున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ప్రభుత్వ విధి విధానాలను, వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళనం చేసి, దేశాన్నిఅభివృద్ధి పధంలో పరుగులు తీయించాలని తపిస్తున్నారు.   ఆ ప్రయత్నంలోనే అయన కొన్ని మంత్రిత్వ శాఖలను విలీనం చేయడం, అనవసరమయిన కమిటీలను రద్దు చేయడం వంటి పెనుమార్పులు చేస్తున్నారు. చివరికి దశాబ్దాల నాటి ప్రణాళికా సంఘాన్ని కూడా ఆయన రద్దు చేసి, దాని స్థానంలో దేశావసరాలకు, అభివృద్ధికి దోహదపడే సరికొత్త ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవిధంగా కేంద్రప్రభుత్వం ఇప్పుడు సంధికాలంలో ఉందని చెప్పవచ్చును.   బహుశః ఈ మార్పులు చేర్పులు కారణంగానే, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయడంలో ఆలస్యం జరుగుతోందని భావించవచ్చును. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు వివరించకుండా, హామీలు అమలు చేస్తామని చెపుతుండటం వలన ప్రతిపక్షాలకు ఈ అవకాశం దక్కిందని చెప్పవచ్చును. వారి ఆరోపణల కారణంగానే ప్రజలలో కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పవచ్చును.   ప్రజలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అనుమానాలు లేవనెత్తడంలో ప్రతిపక్షాలు సఫలమయితే దాని వలన ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందనే సంగతి ప్రభుత్వం గుర్తించి, నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యానికి కారణాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే మంచిది. లేకుంటే ప్రతీ అంశం నుండి రాజకీయ మైలేజీ పొందాలని చూసే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఈ అంశంపై కూడా మైలేజీ పొందాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తారని చెప్పడానికి నేడు ఆయన డిల్లీ యాత్రే ఒక ఉదాహరణ.   హుడ్ హూద్ తుఫాను భాదితుల కోసం మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లు పరిహారం తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కోరేందుకు బయలుదేరుతున్నట్లు సమాచారం. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం విఫలమయితే తానే కెన్ద్రమ్పైఒత్తిది తెచ్చి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించానని చెప్పుకొన్నా ఆశ్చర్యం లేదు. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిధులు, ప్రాజెక్టుల మంజూరులో ఎందువలన జాప్యం జరుగుతోందో ప్రజలకి వివరించే ప్రయత్నం చేయడం మంచిది.

శాసనసభ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల యుద్ధం

  ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా బడ్జెట్ సమావేశాలలో ఊహించినట్లే రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు అధికార తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. అధికార పార్టీ సభ్యులు కూడా చాలా ధీటుగానే వారికి బదులిస్తున్నారు. ఈ సమావేశాలకు మూడు రోజుల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంతో 1000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. కనుక తమ ప్రయత్నలోపం ఏమి లేదని తెరాస సభ్యులు వాదిస్తుంటే, అసలు రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం పూర్తిగా కమ్ముకొనే వరకు గత ప్రభుత్వాలను నిందిస్తూ కాలక్షేపం చేసి, ప్రతిపక్షాల విమర్శల నుండి తప్పించుకొనేందుకే హడావుడిగా విద్యుత్ ఒప్పందంపై సంతకాలు చేసినంత మాత్రాన్న ఇప్పటికిప్పుడు రాష్ట్రానికి విద్యుత్ వస్తుందా? రానప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏవిధంగా తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది? తీర్చలేనప్పుడు ఈ ఒప్పందం ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెట్టడానికి తప్ప వేరే ప్రయోజనం ఏముందని ప్రతిపక్షాలు అధికార తెరాసను సభలో నిలదీస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి కలిగిందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అప్పుడు తెరాస ‘ఇది గత ప్రభుత్వాల నిర్వాకమే’ నని ఎప్పటిలాగే ప్రత్యారోపణలు చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించడం కూడా షరా మామూలే.   అయితే శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వలన తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమిటి? అని ఆలోచిస్తే ఏమీ ఉండబోదనే చెప్పవలసి ఉంటుంది. అధికారపార్టీ తన అసమర్ధతను, తప్పులను కప్పిపుచ్చుకొంటూ తనను తాను ప్రతిపక్షాల దాడి నుండి కాపాడుకొనేందుకు గట్టిగా ఎదురుదాడి చేస్తుంటే, ప్రతిపక్షాలు ఇదే అదునుగా అధికార పార్టీని శాసనసభ సాక్షిగా ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాయి.   అయితే వాటికి ఆ అవకాశం కల్పించింది మాత్రం తెరాస ప్రభుత్వమేనని చెప్పక తప్పదు. రాష్ట్రంలో నానాటికీ విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతున్నప్పటికీ, రైతుల ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పటికీ, తక్షణమే స్పందించవలసిన ప్రభుత్వం గత ప్రభుత్వాలను నిందిస్తూ, పొరుగు రాష్ట్రంతో, కేంద్రంతో, చివరికి కృష్ణా బోర్డు యాజమాన్యంతో కూడా గొడవలు పడుతూ కాలక్షేపం చేసింది. అప్పటికీ ప్రతిపక్షాలన్నీ ఆందోళనలు మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పదేపదే గట్టిగా హెచ్చరిస్తూనే ఉన్నాయి కూడా. కానీ ప్రభుత్వం తన ఉదాసీనతను వీడలేదు. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వలననే నేడు ఇన్ని విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ సంక్షోభానికి గత ప్రభుత్వాలే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపెట్టిన సిద్దాంతాన్ని మంత్రులు అందరూ సమర్దించారు తప్ప ఎవరూ కూడా సమస్య పరిష్కారానికి ఆయనకు తగిన సలహా ఇచ్చే దుస్సాహసం చేయలేకపోయారు. ఇదొక పొరపాటు అనుకొంటే, కేసీఆర్ కనిపెట్టిన ఆ సిద్దాంతం ప్రభుత్వాన్ని కాపాడకపోగా అది ప్రతిపక్షాలను ఐక్యపరిచేందుకు బాగా ఉపయోగపడింది. అందుకే నేడు ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా అధికార తెరాసపై దాడి చేస్తున్నాయి. అంటే ఈ రాజకీయ యుద్ధం పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగానే జరుగుతోందని చెప్పవచ్చును.   కనుక ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా, ఓడినా చివరికి ప్రజలకు ఒరిగేదేమీ ఉండబోదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కాకపోతే తను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సభలో ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తాయనే భయం ప్రభుత్వానికి ఏర్పడవచ్చును. కానీ అది శ్మశాన వైరాగ్యం, ప్రసూతీ వైరాగ్యం వంటిదే!

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్దమే, కానీ..

    రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం గుర్తించిన తూళ్ళూరు మండలంలో గల నేలపాడు, లింగాయపాలెం, దొండపాడు, శాఖమూరి, రాయపాడు, వెంకటపాలెం తదితర గ్రామాలలో రైతులు ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఈయబోమని తెగేసి చెప్పినట్లు ఒక ప్రభుత్వ వ్యతిరేఖ మీడియా పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. కానీ ఈరోజు తూళ్ళూరు గ్రామంలో మరొక ప్రముఖ తెలుగు ఛానల్ నిర్వహించిన పబ్లిక్ పాయింట్ కార్యక్రమంలో మాట్లాడిన రైతులందరూ ఆ వార్తలను ముక్తకంటంతో ఖండించారు. ఇంతవరకు ఏ మీడియాకు చెందిన ప్రతినిధులు తమ గ్రామానికి రాలేదని చివరికి తమ శాసనసభ్యుడు, మంత్రులయినా ఇంతవరకు గ్రామానికి రాలేదని, అటువంటప్పుడు తాము భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని వార్తలు వ్రాయడం ఏమిటని వారు ప్రశ్నించారు. అయితే ఒకసారి ఆర్డీఓలు, యం.ఆర్.ఓ. తదితర అధికారులు మాత్రం కొన్ని గ్రామాలలో పర్యటించి భూసేకరణ గురించి క్లుప్తంగా వివరించి, తమ డిమాండ్లను అడిగి తెలుసుకొన్నారని తెలిపారు. కానీ వారు తమకు ల్యాండ్ పూలింగ్-దాని విధివిధానాల గురించి కానీ, ప్రభుత్వం ఇవ్వబోయే ప్యాకేజి గురించి గానీ ఎటువంటి అవగాహన కల్పించలేదని,అందువల్లే రైతులలో భయాందోళనలు చెందుతున్నారని అన్నారు.   స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీలకు చెందినవారు వారి భయాందోళనలు మరింత పెరిగేలా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. చాలా గ్రామాలలో రైతులు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఈ వ్యతిరేఖ ప్రచారం వలన, అవగాహన లోపం వలననే భయాందోళనలకు గురయ్యి, పూర్తిగా నష్టపోతామేమోననే భయంతోనే తమ భూములను నష్టానికి అమ్మేసుకొంటున్నారని మరి కొందరు రైతులు విచారం వ్యక్తం చేసారు.   తమ భూముల గురించి మీడియా హైదరాబాదులో కూర్చొని వార్తలు ప్రచురించడాన్ని, ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడాన్ని రైతులు తప్పుపట్టారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని వారు కోరారు. లేదా ఈ 14గ్రామాల ప్రతినిధులను ఆయనతో హైదరాబాద్ లోనే సమావేశపరచాలని వారు డిమాండ్ చేసారు.   ఒకవేళ అది సాధ్యం కాకపోతే స్థానిక యం.యల్యే. మంత్రి స్వయంగా అన్ని గ్రామాలలో పర్యటించి రైతుల డిమాండ్లు తెలుసుకొని, ఈ ల్యాండ్ పూలింగ్ విధివిధానాల గురించి, ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న ప్యాకేజీ గురించి రైతులకు సరయిన అవగాహన కల్పించి వారికి భరోసా ఇచ్చినట్లయితే, రైతులు కూడా సంతోషంగా తమ భూములను ఇచ్చేందుకు అంగీకరిస్తారని చెప్పారు. ముందుగా అధికారులు, మంత్రులు క్షేత్ర పర్యటనకు వచ్చి రైతులతో నేరుగా మాట్లాడితే ఇటువంటి గందరగోళాన్ని నివారించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇక ఈరోజు మీడియాతో మాట్లాడిన తూళ్ళూరు మండల రైతులు తమ డిమాండ్లను, కొన్ని ఆసక్తికరమయిన విషయాలను మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసారు. అవేమిటంటే:   1. ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించేటప్పుడు పంటభూముల ప్రస్తుత మార్కెట్ రేట్లను, అందులో పండుతున్న పంటల వలన వస్తున్న రాబడిని, ప్రస్తుతం భూమి ఉన్న గ్రామం, ప్రదేశం, వాటికి గల లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ సౌకర్యాలు వంటివి అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని అందుకు తగినట్లుగా ప్యాకేజి ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.   2. మంచి దిగుబడి, కౌలు రాబడి వచ్చే పంట భూములకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరుతున్నారు. అటువంటి పొలాలు, దిగుబడి ఉన్న రైతులకు అధిక ధరలు చెల్లించితే ఇతర రైతులు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయబోమని అన్నారు.   3. బంగారం, భూములను బ్యాంకులలో తనఖా పెట్టుకొని ఏవిధంగా తాము బ్యాంకుల నుండి రుణాలు పొందగాలుగుతున్నామో అదేవిధంగా ప్రభుత్వానికి తాము ఇచ్చిన భూమికి ప్రతిగా ప్రభుత్వం తమకు ఇచ్చే భూమిపై రుణాలు పొందేందుకు వీలుగా దాని విలువను నిర్దారిస్తూ తమకు ప్రభుత్వం ‘హక్కు పత్రాలు’ తప్పనిసరిగా ఇవ్వాలని, వాటిని బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు గౌరవించి రుణాలు మంజూరు చేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తద్వారా తమ భూములు ప్రభుత్వానికి స్వాధీనం చేసిన తరువాత, పిల్లల పై చదువులకి, పెళ్ళిళ్ళులకు ఇతర అవసరాలకు ఎవరి ముందు చేతులు జాచే దుస్థితి కలగకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.   4. ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకోవడానికి చూపుతున్న ఉత్సాహం, రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా చూపితే బాగుంటుందని వారు అభిప్రాయ పడ్డారు. అదేవిధంగా తాము ఏ ప్రాంతంలో భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేసామో, రాజధాని నిర్మించిన తరువాత తిరిగి అదే ప్రాంతంలో కనీసం ఎకరానికి 200గజాల కమర్షియల్ స్థలం కేటాయించాలని, సమీప ప్రాంతాలలోనే మరో వెయ్యి గజాలు కేటాయించాలని కోరారు.   5. అదేవిధంగా ప్రస్తుతం ఎకరానికి దాదాపు రూ.70,000 నుండి 1,00,000 వరకు ఆదాయం వస్తున్న పంట భూములకు ప్రభుత్వం కేవలం ఎకరానికి రూ.25, 000 మాత్రమే ఇస్తే తాము ఏవిధంగా కుటుంబాలను పోషించుకోగాలము? ఏవిధంగా పిల్లల పై చదువులు, పెళ్ళిళ్ళు చేసుకోగలము? తీవ్ర అనారోగ్యం ఏర్పడితే ఏవిధంగా ఖర్చులను తట్టుకోగాలము? అని వారు ప్రశ్నించారు. కనుక నష్టపరిహారం గురించి ప్రభుత్వం రైతులతో చర్చించిన తరువాతనే తన నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు.   6. కేవలం పెద్ద రైతులనే కాక, చిన్నకారు సన్నకారు రైతులను, వ్యవసాయ కూలీలను, వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న గ్రామీణులను, చేతి వృత్తుల పనివారి శ్రేయస్సు గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని వారు కోరారు.   7. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందిన్చినట్లయితే తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసారు. దేశ, విదేశాలలో పై చదువులు చదువుకొంటున్న, స్థిరపడిన తమ పిల్లలు కూడా రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వానికి భూమిని ఇమ్మనే తమను గట్టిగా కోరుతున్నారని, దాని వలన అందరికీ లాభం చేకూరుతుందని వారు భావిస్తున్నట్లు రైతులు, గ్రామస్తులు తెలిపారు.   8. తూళ్ళూరు మండలంలో గల 14 గ్రామాలలో తొమ్మిది గ్రామాల రైతులు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి తమ భూములు అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నారని, మిగిలిన 5గ్రామాల ప్రజలలో నెలకొన్న ఈ సందేహాలను, భయాందోళలను తొలగించేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసినట్లయితే మొత్తం 22, 600 ఎకరాల వరకు భూమి లభిస్తుందని వారు తెలిపారు.

తెలంగాణా రాష్ట్ర తొలి బడ్జెట్ నేడే

  తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొట్టమొదటి రాష్ట్ర బడ్జెట్ ఈరోజు రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టబోతున్నారు. రోటీన్ బడ్జెట్లకు పూర్తి భిన్నంగా తెలంగాణా అవసరాలకు సరిపడేవిధంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపదేవిధంగా బడ్జెట్ ను చాలా జాగ్రత్తగా రూపొందించేమని మంత్రి అన్నారు. తను ఈరోజు ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ లో రాష్ట్రంలో అన్ని వర్గాలకు వరాలే తప్ప ఎటువంటి కొత్త పన్నులు లేవని ఆయన స్పష్టం చేసారు. ఇది అత్యంత ప్రజారంజకమయిన బడ్జెట్ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆయన ఈరోజు పది గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు.   తాజా సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ రూ.1.05 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. దానిలో సింహభాగం అంటే 60శాతం తెరాస పార్టీ ఎన్నికలలో ఇచ్చిన అనేక హామీలను అమలుచేసేందుకే కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రణాళిక వ్యయం రూ.48,000కోట్లు ఉండవచ్చునని సమాచారం. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న చెరువుల పునరుద్దరణ మరియు ఆధునీకరణ, త్రాగు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.3000కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు సమాచారం.   తెలంగాణా ప్రభుత్వం బడ్జెట్ గురించి కొంచెం అతిగా చెప్పుకోవడం వలన, సహజంగానే అన్ని వర్గాలలో దానిపై చాలా ఆశలు రేపినట్లయింది. కానీ బడ్జెట్లో అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎన్నడూ సాధ్యం కాదనే సంగతి విస్మరించి ప్రభుత్వం చేసుకొన్న అనవసరపు ప్రచారం వలన బడ్జెట్ కేటాయింపులతో సంతృప్తి చెందని వర్గాల నుండి తీవ్ర విమర్శలు మూటగట్టుకోవలసి వస్తుంది.   ఈ బడ్జెట్లో వరాలే తప్ప పన్నులు ఉండవని చెప్పినప్పటికీ, ఆ తరువాత ప్రభుత్వం పన్నులు వడ్డించకుండా ఉండదు. బడ్జెట్ ఎంత భారీగా ఉంటే రాబడి కూడా అంతే నిష్పత్తిలో ఉన్నప్పుడే అందులో చేసిన కేటాయింపులకు నిధులు మంజూరు చేయడానికి వీలుంటుందని అందరికీ తెలుసు. తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇంతవరకు నిధులు కేటాయించడం లేదు. అటువంటప్పుడు తనపై నిత్యం కత్తులు దూస్తున్న తెలంగాణా ప్రభుత్వానికి ఉదారంగా నిధులు అందజేస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కనుక బడ్జెట్ భారీగా ఉన్నట్లయితే, నిధులు సమకూర్చుకోనేందుకు మున్ముందు ప్రజలపై పన్నుల మోత కూడా తప్పకపోవచ్చును.   పన్నులు విధించకపోతే బడ్జెట్ కేటాయింపులలో కోతపెట్టక తప్పదు. అంటే ప్రభుత్వం చాల ఘనంగా బడ్జెట్ రూపొందించినప్పటికీ, దానిని యధాతంగా అమలుచేయలేకపోతే అది ప్రజలను మభ్యపెట్టేందుకే ఆకర్షణీయంగా రూపొందించినట్లు అవుతుంది. కానీ కేంద్రం ఎటువంటి సహాయం చేయకపోయినా, ప్రజలపై మున్ముందు కొత్త పన్నులు వడ్డించకుండా తెరాస ప్రభుత్వం తన బడ్జెట్ ను యధాతధంగా యధాతధంగా అమలుచేయగలిగితే, అది తప్పకుండా తెలంగాణా ప్రభుత్వ సమర్ధతకు, దీక్షాదక్షతలకు నిదర్శనమని అంగీకరించవలసిందే.   అయినా మరో కొద్ది సేపటిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కనుక తినబోతూ గారెల రుచి ఎలా ఉందని అడగడం దేనికి? తిన్నాకే దాని రుచి తెలుసుకొందాము.

కేంద్రం వైఖరిపై తెదేపాలో అంతర్మధనం?

  ఆంద్ర పట్ల అపారమయిన ప్రేమ కురిపిస్తున్న కేంద్రం తెలంగాణా పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆరోపించారు. బీజేపీ-తెదేపాలు మిత్ర పక్షాలే అయినప్పటికీ, తెదేపా ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వంలా చేతులు ముడుచుకొని కూర్చోకుండా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతోంది. కానీ గడిచిన ఈ ఐదు నెలల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమిచ్చిందని చూస్తే కొంచెం బొగ్గు, కొంచెం విద్యుత్, నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే కనబడుతున్నాయి తప్ప వేరేమీ కనబడటం లేదు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గత ప్రభుత్వమే కాదు మోడీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. విభజన బిల్లులో పేర్కొన్న ఉన్నత విద్యా వైద్య సంస్థలు, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, పోలవరం ప్రాజెక్టు వంటి అనేక హామీలు ఎప్పుడు అమలు చేస్తారో ఎవరికీ తెలియదు. కనీసం హుద్ హుద్ తుఫాను కోసం ప్రధాని మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లు కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అయినప్పటికీ తెదేపా-బీజేపీలు కేంద్రంలో రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నందున నిధులు, ప్రాజెక్టులు సాధించుకోవడానికి తెదేపా ప్రభుత్వం ప్రయత్నలోపం చేయకుండా కృషి చేస్తోందే తప్ప ఎన్నడూ బీజేపీని, కేంద్రాన్ని విమర్శించలేదు.   అయితే కేంద్రం తన హామీలను అమలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంతో అప్పుడే ఐదు నెలలయిపోతున్నా ఇంతవరకు రాష్ట్రంలో అభివృద్ధి, నిర్మాణ కార్యక్రమాలకు కనీసం శంకుస్థాపన చేయడానికి కూడా వెనకాడవలసిన పరిస్థితి. ఇది ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఒక మంచి అవకాశం ఇస్తోంది.   రాష్ట్రంలో చక్కటి ప్రభుత్వం, చక్కటి పారిశ్రామిక విధానాలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా వంటివి అన్నీ ఉన్నప్పటికీ కొత్తగా రాష్ట్రానికి భారీ పరిశ్రమలేవీ రాకపోవడానికి కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయకపోవడమేనని చెప్పవచ్చును. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతగా శ్రమిస్తున్నప్పటికీ, కేంద్రం అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరి వల్ల పారిశ్రామిక వేత్తలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఒకవేళ ఇంకా ఆలశ్యం జరిగితే వారు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రానికి కొత్తగా భారీ పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే గాని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి త్వరగా మెరుగుపడటం కష్టం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా బలంగా లేకపోయినట్లయితే తను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమవుతుంది.   ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది లేకపోయినా ఇదే పరిస్థితి ఇంకా కొనసాగినట్లయితే తప్పకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. అది రాష్ట్రంలో పార్టీపై పెను ప్రభావం చూపవచ్చును కూడా. బహుశః అందుకే తెదేపాలో కూడా అంతర్మధనం మొదలయినట్లు కనబడుతోంది.   మంత్రి రావెళ్ళ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ, “మేము కేవలం రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తులు పెట్టుకొన్నాము. కానీ అది సాధ్యం కానప్పుడు పొత్తులపై పునరాలోచించుకోవలసి వస్తుంది,” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత గల ఒక మంత్రి ఈవిధంగా చెప్పడం కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని కొట్టిపడేయలేము కనుక, కేంద్రం వైఖరిపై తెదేపాలో అంతర్మధనం జరుగుతున్నట్లు అది సూచిస్తోంది. ఒకవిధంగా ఇది కేంద్రానికి ‘సవినయ హెచ్చరిక’ వంటిదేనని భావించ వచ్చును. రాష్ట్రానికి కేంద్ర సహాయం ఎంత అవసరమో, రాష్ట్రంలో బీజేపీకి తెదేపా అండ కూడా అంతే అవసరం. కనుక కేంద్రం ఇప్పటికయినా మేల్కొని తక్షణమే తన హామీలను అమలుచేయడం ఇరు పార్టీలకి కూడా మంచిది.

కాంగ్రెస్ ని వదిలి చంద్రబాబుపై విమర్శలేల?

  ఈ ఐదు నెలల కాలంలో తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం బాగా ముదిరిపోయి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న తెలంగాణా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించడం మొదలుపెట్టాయి. అసలు సమస్యల కంటే వారి విమర్శలు, చేపడుతున్న బస్సు యాత్రలు, ధర్నాలే ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో మరింత పలుచన చేస్తుండటంతో వారిని ఎదుర్కొనేందుకు ‘ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి గత ప్రభుత్వాలే కారణమని’ తెరాస ఎదురు దాడి ప్రారంభించింది.   అయితే తెలంగాణా తెదేపా నేతలు తెరాస నేతల దాడిని త్రిప్పి కొడుతూ, “రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్రలో కూడా తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేదని, కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నాలుగు నెలలలోనే పరిస్థితులను పూర్తిగా చక్కదిద్ది రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేసారని, కానీ కేసీఆర్ మాత్రం గత ప్రభుత్వాలను నిందిస్తూ తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని” ధీటుగా జవాబీయడంతో తెరాస అధినేత కంగు తిన్నట్లయింది. గత ప్రభుత్వాల మీద నింద మోపి, సమస్య నుండి చేతులు కడుకొందామని తెరాస ప్రభుత్వం భావిస్తే ఆశించిన ఫలితం దక్కపోగా తన పరువు తానే తీసుకొన్నట్లయింది.   తప్పులను విమర్శించినా తట్టుకోవచ్చునేమో కానీ వేరొకరితో అదీ తను తీవ్రంగా ద్వేషించే వ్యక్తితో పోల్చి చూపుతూ తన అసమర్ధతను ఎత్తి చూపితే భరించడం ఎవరికయినా కష్టమే. బహుశః అందుకే, ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి గత ప్రభుత్వాలే కారణమని ఇంతవరకు వాదిస్తున్న తెరాస మంత్రులు అందరూ కూడా గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, ఇప్పుడు ‘చంద్రబాబు నాయుడే దోషి’ అని వాదించడం మొదలుపెట్టారు.   తెలంగాణా రాష్ట్రంలో కూడా తన పార్టీని నిలబెట్టుకోవాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు, తెరాస మంత్రులు చేస్తున్న ఈ విమర్శల వలన అక్కడ తన పార్టీకి తీరని నష్టం కలుగుతుందని గ్రహించగానే, ఆయన కూడా ఇక ఎంత మాత్రం ఉపేక్షించకుండా, స్వయంగా కేసీఆర్ పై ఎదురు దాడి మొదలుపెట్టారు. ‘తెలంగాణాలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ముందు చూపులేకపోవడమే’నని ఆయన చేసిన విమర్శ తుపాకీ గుండులా నేరుగా తగలవలసిన చోటనే తగలడంతో కేసీఆర్ విలవిలలాడిపోయారు. సాటి ముఖ్యమంత్రినని చూడకుండా చంద్రబాబు తనకు ముందు చూపులేదంటూ ఘోరంగా అవమానించారని బాధపడుతూ ఎదురుదాడి చేసేందుకే ప్రయత్నించారు తప్ప మేల్కొని సమస్య పరిష్కారానికి ప్రయత్నించకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగిపోయాయి. దానితో ఆయనపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ధర్నాలు, ర్యాలీలు మరింత జోరుగా చేయడం ఆరంభించాయి.   బహుశః అందుకే ఆయన విజయవాడలో సభపెట్టి చంద్రబాబు బండారం బయటపెడతానని బెదిరించి ఉండవచ్చును. నిజానికి కేసీఆర్ పై చంద్రబాబు నాయుడు ప్రతివిమర్శలు చేసి ఉండి ఉంటే, అది పట్టుకొని ‘తెలంగాణా ప్రభుత్వంపై ఆంద్ర సర్కార్ జులుం చేస్తోంది’ అంటూ తిరిగి ఎదురుదాడి చేసేందుకు ఆయనకు అవకాశం దక్కేది. కానీ చంద్రబాబు ‘విజయవాడలోనే కాదు...కావాలంటే కేసీఆర్ ఆంధ్రాలో ఎక్కడయినా సభ పెట్టుకోవచ్చును,’ అని గడుసుగా బదులివ్వడంతో ఆయనకు ఆ అవకాశం లేకుండా పోయింది.   రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ కు ఈ దుస్థితి కలిగించిన తెరాస అధినేత కేసీఆర్, తన రాష్ట్రంలో సమస్యలనే పరిష్కరించుకోలేక సతమతమవుతూ ఇప్పుడు ఆంధ్రలో సభపెట్టి ఆంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎండగడతానని బెదిరించడం హాస్యాస్పదం. అది కేసీఆర్ వల్ల కానిపని. బహుశః అందుకే చంద్రబాబు కూడా చాలా గడుసుగా కేసీఆర్ ని స్వాగతించారు.   ఏమయినప్పటికీ ఇంతకు ముందు రెండు రాష్ట్ర ప్రజల మధ్య జరిగిన యుద్ధం, విభజన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మొదలయింది. అదిప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యుద్ధంగా రూపుదిద్దుకోవడం చాల దురదృష్టకరం. దీనివలన రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోవడమే తప్ప ఎవరికీ మేలుజరుగదు.

నోరు మంచిదయితే...

  నోరు మంచిదయితే ఊరు కూడా మంచిదవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తనకా సూత్రం వర్తించదని భావిస్తారు. అందుకే ఆంధ్ర పాలకులని, ప్రభుత్వాన్నితిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే, ఆంధ్రపారిశ్రామిక వేత్తలు తెలంగాణా అభివృద్ధికి తోడ్పడాలని కోరగలుగుతారు. ఆంధ్రప్రజల పిల్లలకు ఫీజులు చెల్లించమని తెగేసి చెపుతూనే జీ.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాసను జరా గుర్తుంచుకోమని విజ్ఞప్తి చేయగలుతారు. కేంద్రం తన అధికారాలు లాక్కొందని ఒకసారి, ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేసిందని ఇంకోసారి, విద్యుత్ ఈయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మరొకసారి, విభజన చట్టం సరిగ్గా అమలు చేయడం లేదని మరొకసారి కేంద్రంపై కత్తులు దూస్తూనే, తెలంగాణాను ఆదుకోవలసిన బాధ్యత మీదేనని నొక్కి చెప్పగలుగుతారు.   అయితే అడగందే అమ్మయినా అన్నం పెట్టదనే పెద్దల మాటను కూడా ఆయన పెద్దగా పట్టించుకొన్నట్లు కనబడరు. అందుకే ఏదో చంద్రబాబు డిల్లీ వెళ్లి వస్తున్నప్పుడు తను వెళ్లకపోతే ప్రతిపక్షాలు అరిచి గోల చేస్తాయని ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు ఆయన డిల్లీ చక్కర్ కొట్టి వస్తుంటారు. అసలు ఎంత కష్టమొచ్చిపడినా అంతా లోకల్ గానే చక్కబెట్టేయాలని చూస్తుంటారు. అందుకే ఆయనగారికి మమ్మల్ని కలిసే తీరిక ఎక్కడుందీ? అని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి అప్పుడెప్పుడో సన్నాయి నొక్కులు నొక్కారు కూడా.   సాధారణంగా ఎవరయినా కష్టాలలో ఉన్నప్పుడు ఇరుగుపొరుగు సాయమో లేక స్నేహితులు, దూరబంధువుల సాయం కోసమో ప్రయత్నిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం అందుకు పూర్తి విరుద్దం. కష్టకాలంలో కూడా గిరి గీసుకొని కూర్చోవడమే కాకుండా, అందులోనే కూర్చొని అందరి మీదకి బాణాలు వేస్తూ ఎవరూ కూడా తన దగ్గిరకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. విద్యుత్ ఇస్తామని చెపుతున్న ఆంద్రప్రభుత్వాన్ని కోర్టుకీడుస్తామని హూంకరిస్తుంటారు. విద్యుత్ ఇవ్వలేదని కేంద్రాన్ని మాటలతో జాడించి వదిలి పెడతారు. నీళ్ళు వాడుకోమని చెప్పిన కృష్ణా బోర్డు తమ మీద కక్ష కట్టిందని ఎదురు దాడి చేస్తారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంజనీరింగ్, ఇంటర్ మీడియేట్ కోర్సులు నడుపుకొందామని అడిగితే మాదారి మాదే మీదారి మీదే అంటారు. మరి ఈ స్టైల్లో వ్యవహరిస్తుంటే బంగారి తెలంగాణా ఎలా సాధ్యమో ఎవరూ చెప్పలేకపోతున్నారు.   ఏమయినప్పటికీ ప్రభుత్వాన్ని నడపడం అంటే ఉద్యమాలు నడిపినంత వీజీ కాదని స్పష్టమవుతోంది. ఉద్యమంలో ఏదయినా డిమాండ్ చేయవచ్చు, కానీ ఇక్కడ అన్ని ఎక్సప్లనేషన్లు మాత్రమే! కరెంటు ఎందుకు ఇవ్వలేక పోయావని ప్రజలు, ప్రతిపక్షాలు నిలదీస్తే వారికి ఎక్సప్లనేషన్ ఈయాలి. రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటున్నారు? అని ప్రతిపక్షాలు నిలదీస్తే వారికి ఎక్సప్లనేషన్ ఈయాలి. పొరుగు రాష్ట్రంతో, కేంద్రంతో జల సంఘంతో ఎందుకు తగవులాడవలసి వస్తోందో ప్రజలకి ఎక్సప్లనేషన్ ఈయాలి. ఈ ఐదేళ్ళపాటు బాగా రాటు తేలితేనే కానీ ఏదీ సెట్ అయ్యేట్లు లేదు మరి!

నిధుల మళ్లింపులో ఆంద్ర ప్రభుత్వం తొందర పడిందా?

  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల కార్మిక శాఖకు చెందిన రూ.1463 కోట్ల ఉమ్మడి నిధుల నుండి ఆంద్రా వాటాను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ జాయింట్ కమీషనర్ మురళీ సాగర్ విజయవాడకు తరలించడంతో రెండు రాష్ట్రాల మధ్య మరో యుద్దానికి శ్రీకారం చుట్టినట్లయింది. తను ఆంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే నిధులను బదిలీ చేసానని చెప్పడంతో ఆంద్ర ప్రభుత్వమే ఆయన చేత ఆపని చేయించిందని ప్రకటించినట్లయింది. ఇంతవరకు ఆంద్ర పాలకులు తెలంగాణాను దోచుకొన్నారని ఆరోపిస్తున్న తెరాస నేతలకు ఇదొక మంచి అవకాశంగా దక్కడంతో దానిని అందిపుచ్చుకొని ఆంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రభుత్వం తెలంగాణా అభివృద్ధికి అడ్డుపడుతోందని, నీళ్ళు మరియు విద్యుత్ లలో తమకు న్యాయంగా రావలసిన వాటాను ఇవ్వకుండా మోసం చేస్తోందని ఆరోపిస్తున్న తెలంగాణా ప్రభుత్వ మంత్రులకు ఇప్పుడు ఆంధ్రప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇదొక మంచి అవకాశంగా దొరికింది.   ఆంద్ర ప్రభుత్వం తమ నిధులను కూడా అక్రమంగా తరలించుకుపోయిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దానికి ఆంద్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు, ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్ తదితరులు గట్టిగా సమాధానం చెపుతున్నప్పటికీ, తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా నిధులు మళ్ళించడం వాస్తవమే కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం ఇబ్బందుల్లో పడినట్లే కనిపిస్తోంది.   రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ నిధులను రెండు రాష్ట్రాలు 52: 48నిష్పత్తిలో పంచుకోవలసి ఉంటుంది. అందుకోసం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని నిధులు పంచుకోవడానికి సరయిన మార్గ దర్శకాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మురళీ సాగర్ కూడా స్వయంగా దృవీకరించారు. బ్యాంకులలో మొత్తం ఎంత ఉమ్మడి నిధులు ఉన్నాయి? వాటిలో ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుంది? దానిని ఎప్పుడు ఏవిధంగా పంచుకోవాలి? అనే విషయాలను కేవలం ఉమ్మడి కమిటీ మాత్రమే నిర్ణయించవలసి ఉండగా, హైదరాబాద్ జంట నగరాలలో వివిధ బ్యాంకులలో ఫిక్సడ్ డిపాజిట్ల రూపంలో ఉంచబడిన ఆ నిధులకు తనే కస్టోడియన్ అయినందున, ఆంధ్రా వాటా నిధులను మాత్రమే విజయవాడకు తరలించానని మురళీ సాగర్ చెప్పడం మరొక తప్పును అంగీకరించినట్లే అయింది.   ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన వాటాను మాత్రమే తీసుకొన్నామని, తెలంగాణాకు దక్కాల్సిన రూ 610 కోట్లకు అదనంగా మరో రూ 25 కోట్లు హైదరాబాద్ బ్యాంకులలోనే ఉంచేమని, కనుక తెలంగాణా ప్రభుత్వం ఈ వ్యవహారంలో అనవసరంగా యాగీ చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. పరకాల ప్రభాకర్ కూడా ఇంచుమించు అదేవిధంగా వాదించారు.   తెదేపా, తెరాస పార్టీల మధ్య రాజకీయ వైరం ఉన్నప్పుడు, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాలపై ఘర్షించుకొంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ఆచితూచి అడుగువేసి ఉండాల్సింది. కానీ ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న కారణంగానే బ్యాంకులలో మురుగుతున్న తన వాటాను తీసుకొని సమస్యల ఉండి బయటపడదామనే ఆలోచనతోనే ఆవిధంగా చేసి ఉండవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్ కేవలం తన వాటాను మాత్రమే తీసుకొన్నప్పటికీ, ముందుగా ఆ విషయాన్ని తెలంగాణా ప్రభుత్వానికి చెప్పకపోవడం వలననే ఈ సమస్య ఉత్పన్నం అయిందని చెప్పవచ్చును.   అయితే అలా చెప్పకపోవడానికి బలమయిన కారణమే కనబడుతోంది. తెదేపా నేతలు, ప్రభుత్వం కూడా విద్యుత్ సంక్షోభం విషయంలో తెరాస ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ దానిని ఇరుకునపెడుతూ, ఇప్పుడు ఉమ్మడి నిధులలో నుండి తమా వాటాను తీసుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వ అనుమతి కోరినా, తెలియజేసినా అది నిరాకరించడమే కాక అడ్డుపడవచ్చుననే భయంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చును. కానీ అది తెలంగాణా ప్రభుత్వానికి ఒక బలమయిన అస్త్రం అందించింది.   కానీ తెలంగాణా పోలీసులు ఆంద్రప్రభుత్వ అనుమతి లేకుండా ఆంద్ర ప్రభుత్వ కార్యాలయంలో జొరబడి బీరువాలు పగులగొట్టి ఫైళ్ళను స్వాధీనం చేసుకోవడం, సదరు అధికారి ఇంట్లో శోదాలు నిర్వహించి అరెస్ట్ చేయడంతో తెలంగాణా ప్రభుత్వం కూడా వారి చర్యలను సమర్దించుకోలేని పరిస్థితి ఏర్పడింది.   అందువల్ల షరా మామూలుగానే మళ్ళీ ఈ వ్యవహారంపై రెండు ప్రభుత్వాలు గవర్నరు వద్ద పంచాయితీ పెట్టాయి. అయితే ఆయన ఇంతవరకు వారి గొడవలలో తలదూర్చకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు కనుక బహుశః ఈ వ్యవహారంలో కూడా ఆయన అదే వైఖరి అవలంభిస్తారేమో? మరి ఈ వ్యవహారం ఏవిధమయిన మలుపులు తిరుగుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు.

మంత్రి వర్గ విస్తరణ చేస్తారనుకొంటే

  నవంబర్ 5నుండి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, పొరుగు రాష్ట్రంతో గొడవలు, మీడియాపై ఆంక్షలు వంటి అనేక అంశాలు ప్రతిపక్షాలకు కావలసినన్ని అస్త్ర శస్త్రాలను అందిస్తున్నాయి. వారిని ఎదుర్కొనేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేసి బలం పెంచుకొంటారని అందరూ భావించారు. కానీ ఆయన ఎవరూ ఊహించని విధంగా ప్రతిపక్షాల నేతలపై ‘ఆకర్ష్ అస్త్రం’ ప్రయోగించి వారిని సమ్మోహితులను జేసి తనవైపు త్రిప్పుకొంటూ అసెంబ్లీలో తన పార్టీ బలం పెంచుకొంటున్నారు.   బహుశః ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్దాంతాన్ని కేసీఆర్ సింపుల్ గా ఫాలో అయిపోతున్నారేమో? ప్రతిపక్ష పార్టీలో ఉన్న యం.యల్.ఏ.లు ఇప్పుడు హటాత్తుగా అధికార పార్టీలోకి రావడంతో వారందరూ తమ గులాబీ బాసును మెప్పించేందుకు తమ పాత బాసులను, పార్టీలను అసెంబ్లీ సాక్షిగా చీల్చిచెండాడే ప్రయత్నం చేయవచ్చు కనుక ఇక తాను  నిశ్చింతగా సమావేశాలు నిర్వహించుకోవచ్చునని కేసీఆర్ ఆలోచిస్తున్నారేమో?   కానీ అంత మాత్రాన్న ప్రతిపక్ష పార్టీలు బెదిరిపోయే రకాలు కాదనే చెప్పవచ్చును. ఇప్పటికే తమ వద్ద ఉన్న అస్త్ర శాస్త్రాలన్నిటినీ వారు ఎలాగూ అధికార పార్టీపై ప్రయోగిస్తారు. ఈలోగా మరిన్ని కొత్తవి సిద్దం చేసుకోవచ్చును కూడా. మెట్రో రైల్ ప్రాజెక్టుపై కేసీఆర్ తో చెడుగుడు ఆడుకొన్న రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సమావేశాలలో మెట్రో ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని ముందే డిక్లేర్ చేసేసారు. కనుక బహుశః ఆయనిప్పుడు ఆ పని మీదనే బిజీగా ఉన్నందునే ఆటను మధ్యలో నిలిపివేసినట్లున్నారు. కనుక మిగిలిన భాగాన్ని శాసనసభలో పూర్తి చేస్తారేమో మరి చూడాలి.   ఇక కాంగ్రెస్ పార్టీ నేతలయితే మరో అడుగు ముందుకు వేసి ‘కేసీఆర్ ప్రభుత్వానికి అప్పుడే రోజులు దగ్గర పడ్డాయని’ డిక్లేర్ చేసేసారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా కరెంటు కష్టాలు, రైతుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చును. కానీ అన్ని విషయాలలో క్రెడిట్ క్లెయిం చేసుకొనే కేసీఆర్, ఈ క్రెడిట్ మాత్రం పూర్తిగా కాంగ్రెస్, తెదేపాల ఖాతాలోనే జమా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్న సంగతి అందరూ గమనిస్తూనే ఉన్నారు. కనుక వారు ఆ పాయింట్లు మాట్లాడినప్పుడు, కేసీఆర్ ఈ పాయింటే లేవనెత్తవచ్చును.   ఆయన ఇంకా బీజేపీకి కూడా అడ్డుకోవలసి ఉంది. కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నప్పటికీ వారు కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు ఏవిధమయిన సహాయ సహకారాలు రాబట్టే ప్రయత్నాలు చేయకుండా తెలంగాణాను ‘ఇగ్నోర్’ చేస్తునందున వారికి కూడా ‘తెలంగాణా ద్రోహుల ట్యాగ్’ తగిలించి వారిని నిలువరించే ప్రయత్నం చేయవచ్చును.   ఆంద్ర ప్రభుత్వం తెలంగాణా అభివృద్ధిని అడ్డుకొంటోందని తిట్టిపోయడానికి కేసీఆర్ వద్ద పెద్ద చాంతాడంత లిస్టు ఉంది. ఆ వంకతో తెదేపాను మరోమారు తిట్టిపోసి, అటువంటి పార్టీకి గులాములు పనిచేస్తూ తెదేపా-తెలంగాణా యం.యల్యే.లు కూడా తెలంగాణా ద్రోహులని మరోమారు సర్టిఫై చేసేసి వారినీ నిలువరించడానికి ప్రయత్నించవచ్చును. కాగల కార్యం గందర్వులే చేసారన్నట్లు ఆ పనిని తెదేపా నుండి తెరాసలోకి జంపయిన తెదేపా సభ్యులే చక్కబెట్టవచ్చును. కనుక తెలంగాణా అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల వద్ద యుద్ధం చేసుకోవడానికి కత్తులు డాళ్ళు సరి సమానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చును.

కడుపులో లేని ప్రేమ కావలించుకొంటే వస్తుందా?

  ఆంధ్రప్రజలపై, పాలకులపై, ప్రభుత్వంపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న విద్వేషం గురించి తెలియనిది కాదు. కానీ ఆయన అప్పుడప్పుడు వారిపై కూడా అకారణంగా ప్రేమ ఒలకబోస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. నిన్న మీర్‌పేటలోని జరిగిన ఒక సభలో కేసీఆర్ మాట్లాడుతూ, “తెలంగాణా లో స్థిరపడ్డ ఆంధ్రావాళ్ళు అందరూ కూడా నా బిడ్డలే. వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చూసుకొంటాము,” అని ఆయన అన్నారు.   ఇదే కేసీఆర్ కొన్ని రోజుల క్రితమే “ఆంధ్రా విద్యార్ధులకు మేమెందుకు ఫీజులు చెల్లించాలి? మా ప్రభుత్వం కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఫీజు రీ ఇంబర్స్ మెంటు చేస్తుంది. మీ పిల్లలకి మీరే చెల్లించుకోండి” అని తెగేసి చెప్పడమే కాకుండా అందుకోసం 1956సం.ని ప్రాతిపాదికగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. చివరికి తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా విద్యార్ధులకి బస్సు పాసులు ఇవ్వడానికి సైతం నిరాకరించారు. కానీ ఇప్పుడు హటాత్తుగా వారిపై ప్రేమ ఒలకబోయడానికి కారణం కూడా ఆయనే స్వయంగా బయటపెట్టుకొన్నారు. “తెలంగాణా అభివృద్ధికి అందరి సహకారం తీసుకొంటాము. ఆంద్ర ప్రాంత పారిశ్రామికవేత్తలకు కూడా మా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుంది,” అని అన్నారు. అంటే ఆయన ఆంధ్ర ప్రజలను, ప్రభుత్వాన్ని, పాలకులను ఒకపక్క ద్వేషిస్తూనే, తెలంగాణా అభివృద్ధికి ఆంద్ర పారిశ్రామిక వేత్తల సహకారం తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెపుతున్నారన్న మాట.   కానీ ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ప్రజలందరూ కలిసి అభివృద్ధి చేసారని, ఆంద్రప్రజలు వాదించినపుడు, ఇదే కేసీఆర్, “హైదరాబాద్ 1956నాటికే అన్ని విధాల అభివృద్ధి చెందింది. ఇందులో మీరు చేసింది ఏముంది?” అని ప్రశ్నించడం కూడా ప్రజలందరికీ తెలుసు.   ఇదే సభలో కేసీఆర్ మాట్లాడుతూ “హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసానని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పుకొంటున్నారు. కుతుబ్ షా కనుక బ్రతికి ఉండి ఉంటే, ఆయన మాటలు విని ఆత్మహత్య చేసుకొని ఉండేవారేమో?” అని ఎద్దేవా చేశారు. కుతుబ్ షా కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెంది ఉన్నప్పుడు, గత పాలకులు హైదరాబాద్ ని సరిగ్గా అభివృద్ధి చేయలేదని దుమ్మెత్తి పోయడం ఎందుకు? అప్పుడే అభివృద్ధి చెందిన నగరాన్ని మళ్ళీ ఇప్పుడు తను కూడా అభివృద్ధి చేస్తానని చెప్పడం ఎందుకు? హైదరాబాద్ ని చంద్రబాబే ప్రధానంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసినప్పటికీ ఆయనను ఎద్దేవా చేస్తున్న కేసీఆర్, రేపు తనే తెలంగాణాని అభివృద్ధి చేసానని చెప్పుకొన్నప్పుడు కూడా ప్రత్యర్ధులు ఇదేవిధంగా ఎద్దేవా చేసే అవకాశం ఉంటుందనే సంగతి కూడా గ్రహిస్తే మంచిది.   ఆంద్ర వలసవాదులు చాలా దుర్మార్గంగా పాలన చేసారని, హైదరాబాద్ కి ఆంధ్రా వాళ్ళు చేసింది ఏమీ లేదని ఒకవైపు దూషిస్తూనే, తెలంగాణా అభివృద్ధికి ఆంద్ర పారిశ్రామిక వేత్తల సహకారం అవసరమని చెప్పడం ఆయనకే చెల్లు. వారిని ఆకర్షించడానికే ఆయన తెలంగాణాలో స్థిరపడ్డ ఆంద్రప్రజల పట్ల లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మన అందరిదీ అనే భావనతోనే ఆంధ్రకు చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, అక్కడ తమ పరిశ్రమలు, విద్యావైద్య సంస్థలు స్థాపించారు. కానీ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణా ఉద్యమాలు మొదలయినప్పటి నుండి వారిలో ఒక అభద్రతా భావం మొదలయింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన కేసీఆర్ వారిలో ఆ అభద్రతాభావం తొలగించే ప్రయత్నం చేయకపోగా దానిని తన మాటలతో మరింత పెంచి పోషిస్తూ వచ్చారు. నేటికీ ఆయన మాటలలో ఆంద్ర ప్రజలు, పాలకుల పట్ల ఏహ్యత, తృణీకార భావనలు ప్రస్పుటంగా కనబడుతూనే ఉన్నాయి. అటువంటప్పుడు మళ్ళీ ఆంధ్రా పారిశ్రామికవేత్తల సహాకారం కోరడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి. కనుక ఇప్పుడు ఆయన ఆంద్ర ప్రజల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా దానిని నమ్మేందుకు ఎవరూ సిద్దంగా లేరని చెప్పక తప్పదు.   బంగారి తెలంగాణా నిర్మిస్తానని పదేపదే చెపుతున్న కేసీఆర్ ముందుగా ప్రజలందరినీ కలుపుకు పోవడం నేర్చుకోవాలి. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో సఖ్యతగా మెలగడం నేర్చుకోవలసి ఉంటుంది. ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అలవరుచుకోవలసి ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా ప్రతీ సభలో ప్రజలకు రంగుల కలలు చూపించినంత మాత్రాన్న అవన్నీ నెరవేరడం సాధ్యం కాదు.

రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని వైకాపా ప్రేరేపిస్తోందా?

సార్వత్రిక ఎన్నికలలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో చాలా మంది నేతలు తమ పార్టీ తప్పకుండా ఎన్నికలలో ఘన విజయం సాధించి రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుందని గట్టిగా నమ్మారు. జగన్ తను ముఖ్యమంత్రి అయిపోయినట్లే కలలు కంటూ తను చేయబోయే ఐదు సంతకాల గురించి కూడా జనాన్ని బాగానే ఊదరగొట్టారు. కానీ ఎన్నికలలో పరిస్థితి తారుమారయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే కోరిక నెరవేరలేదు. ఇప్పుడు పార్టీలో నేతలు మరో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూడక తప్పదు. చూసినా అప్పటి పరిస్థితి ఏవిధంగా ఉంటుదో ఎవరూ చెప్పలేరు. ఈలోగా పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొంటాయో కూడా ఊహించడం కష్టం. బహుశః అందుకే ఇప్పుడు చాప క్రింద నీరులా మెల్లగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వైకాపా నిప్పు రాజేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.   ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆ మధ్యన ఒకసారి నంద్యాల మండలంలో పాండురంగపురం గ్రామంలో జరిగిన ఒక గ్రామసభలో మాట్లాడుతూ, తాను ఏనాడు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోలేదని, కానీ ఇప్పుడు సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నందున ప్రత్యేక రాష్ట్రం కోరుకొంటున్నానని అన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం సాధించుకొంటేనే రాయలసీమ రైతులు బాగు పడతారని ఆయన అన్నారు. వైకాపాలో ఆయన చాలా సీనియర్ నేత. జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీలో మరే సీనియర్ నాయకుడు గానీ ఆయన మాటలను ఖండించకపోవడం గమనిస్తే ఆయన పార్టీ అభిప్రాయాన్నే పరోక్షంగా ప్రకటించినట్లు    భావించవచ్చు. ఇంతకు ముందు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడిన వైకాపా ఇప్పుడు రాష్ట్ర విభజన జరగాలని కోరుకోవడం చాలా ఆశ్చర్యకరమయిన విషయమే. వైకాపా నేత చెప్పిన మాటల ప్రకారం చూస్తే వైకాపా రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నిప్పు రాజేయాలనుకొంటున్నట్లు అర్ధమవుతోంది. అంటే జగన్ తను ముఖ్యమంత్రి అవడం కోసం రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేయడానికి కూడా సంకోచించరని స్పష్టమవుతోంది. రాయలసీమ అన్నివిధాల వెనుకబడుందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజాప్రతినిధులలో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన లేకపోవడమే. రాయలసీమ నుండి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయారు తప్ప ఏనాడు సీమను పట్టించుకొన్న పాపాన్నపోలేదు. అయినప్పటికీ సీమతో సహా మిగిలిన జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాదు మన రాష్ట్ర రాజధానే కదా అనే ఉదారమయిన ధోరణితో ఎన్నడూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అందుకే అందరూ కలిసి హైదరాబాద్ అభివృద్ధిలో పాలుపంచుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజనకు పూనుకొన్నప్పుడు దానికి వ్యతిరేఖంగా చాలా తీవ్రంగా పోరాడారు. ఆ తరువాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై వాడి వేడి చర్చ జరుగుతున్నపుడు సీమ ప్రజలు వెనుకబడిన తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనే తపనతో కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయమని ఉద్యమించారు తప్ప ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేయలేదు. కానీ ఇదే అదునుగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తప్ప బాగుపడలేమని వైకాపా నేతలు సీమ ప్రజలకు హితబోధ చేయడం కేవలం అధికార కాంక్షతో చేసిన ప్రయత్నమేనని చెప్పకతప్పదు. సీమ ప్రజల అసంతృప్తినే మరింత పెంచిపోషించగలిగితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకొంటుందని వైకాపా నేతల ఆలోచన కావచ్చును. బహుశః అందుకే కొందరు నేతలు చాప క్రింద నీరులా రాయలసీమ ప్రజలను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నట్లు అప్పుడప్పుడు వార్తలు వినపడుతున్నాయి. ఒకప్పుడు తెరాస నేతలు కూడా తెలంగాణా ఏర్పడగానే ప్రజల జీవితాలలో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నట్లు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం అందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాలకు ఎంత అనర్ధం జరిగిందో, జరుగుతోందో చూసిన తరువాత కూడా వైకాపా నేతలు అధికారం చేజిక్కించుకోవడం కోసం మరోమారు రాష్ట్ర విభజన జరగాలని కోరుకొంటున్నట్లయితే అంత కంటే దారుణమయిన విషయం మరొకటి ఉండబోదు. అందువల్ల ఇకపై ఏ రాజకీయ నేతయినా మరోమారు రాష్ట్ర విభజన జరగాలని హితబోధలు చేసినట్లయితే, సీమ ప్రజలు అటువంటివారికి తక్షణమే బుద్ధి చెప్పాలి. రాయలసీమ జిల్లాలు కూడా మిగిలిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకొందాము. అవసరమయితే అందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ సాధించుకొందాము. రాజకీయ నాయకుల స్వార్ధం కోసం మరోసారి మన రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది.

ఆంధ్ర, తెలంగాణాలలో వైకాపా ప్రత్యమ్నాయ రాజకీయ శక్తిగా ఎదగగలదా

    వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఓటమి ప్రభావం నుండి క్రమంగా బయటపడి మళ్ళీ మెల్లగా పార్టీని బలోపేతం చేసుకొనే పనిలోపడినట్లుంది. తెలంగాణాలో మళ్ళీ పార్టీ కార్యకలాపాలు ఆరంభించి వచ్చే ఎన్నికలనాటికి అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తెలంగాణాలో తను స్వయంగా అడుగుపెట్టే పరిస్థితి లేదు కనుక తనకు బాగా అచ్చివచ్చిన షర్మిలాస్త్రాన్ని బయటకు తీసి ప్రయోగించబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే రాష్ట్ర విభజన జరుగుతోందని పసిగట్టగానే మూటాముల్లె సర్దుకొని రాత్రికి రాత్రే తెలంగాణా నుండి బయటపడి సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను తెలంగాణా ప్రజలు ఆధారిస్తారా లేదా? అనే సంగతి మున్ముందు తెలుస్తుంది.   ఇక ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాలలోను పార్టీని నిర్వహించదలచుకొన్నారు కనుక పార్టీని జాతీయపార్టీగా మార్చి రెండు రాష్ట్రాలకు ప్రత్యేక శాఖలు, పాలకవర్గాలు, పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని తెలంగాణకు కేటాయించవచ్చును కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో కొత్తగా పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రకటించారు. అదే విధంగా రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పార్టీకి కమిటీలను నియమించి అన్ని సామాజిక వర్గాలకు చెందినవారికి వాటిలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఆయన చెప్పారు.   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యంగా బీసీలకు పార్టీలో తగిన ప్రాధాన్యతనిచ్చి తమ పార్టీ యావత్ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందనే స్పష్టమయిన సంకేతం ఈయడం వలన, అన్ని సామాజిక వర్గాలకు వారు ఆ పార్టీలో చేరడంతో ఆపార్టీకి అన్ని వర్గాల నుండి ఓట్లు పడటంతో ఎన్నికలలో ఘన విజయం సాధించగలిగింది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తన పార్టీ ఓటమికి తనే కారకుడయ్యారని చెప్పవచ్చును.   గత ఐదేళ్ళలో గ్రామస్థాయి నుండి కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఓదార్పు యాత్రలకి, సమైక్య యాత్రల ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడు పార్టీకి అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని వాటిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడం గమనిస్తే వైకాపా తన తప్పును గ్రహించినట్లు అర్ధమవుతోంది. కానీ కమిటీలలో అందరికీ మొక్కుబడిగా చోటు కల్పించి సరిబెట్టకుండా, వారికి కూడా పార్టీలో సమాన గౌరవం, వారిని కూడా పార్టీ నిర్ణయాలలో భాగస్వాములు చేసినప్పుడే ఏమయినా ప్రయోజనం ఉంటుంది.   అయితే అధికారంలో లేని పార్టీ కమిటీలలో సభ్యులుగా చేరడం వలన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కోసం మరో ఐదేళ్ళపాటు జేబులో నుండి డబ్బులు ఖర్చవుతాయే తప్ప వేరే ప్రయోజనమేమీ ఉండబోదని అందరికీ తెలుసు. తీరాచేసి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ కమిటీలను, సభ్యులను పక్కనబెట్టి భారీగా డబ్బు ఖర్చు పెట్టగలవారికే ప్రాధాన్యం ఇస్తారనే సంగతి కూడా అందరికీ తెలిసిన రహస్యమే. కానీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా అవసరం కనుక ఆసక్తిగలవారితో ఏర్పాటు చేసుకోక తప్పదు.   ఇక జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ విశ్వసనీయతకు మారుపేరుగా తరచూ చెప్పుకొంటారు. కానీ ఆ పార్టీలో సరిగ్గా అదే లోపించింది కనుకనే ఆ పార్టీని ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారనే సంగతి ఆయన బహిరంగంగా అంగీకరించకపోయినా, కనీసం ఇకనుండయినా చిత్తశుద్ధితో కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉండవచ్చును. ఏమయినప్పటికీ 11 సీబీఐ చార్జ్ షీట్లలో ఏ-1, ఏ-2 నిందితులుగా ఉన్న వైకాపా అధ్యక్షుడు జగన్ మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మెడలపై సీబీఐ కేసులు కత్తుల్లా వ్రేలాడుతున్నంత కాలం పార్టీ బలోపేతం చేయడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్, తెదేపాలకు ప్రత్యామ్నాయ శక్తిగా వైకాపా దృడంగా నిలబడటం కష్టమేనని చెప్పక తప్పదు.

సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు

  రాష్ట్ర విభజన జరగకముందు నుండే తెలుగు సినిమా పరిశ్రమ నుండి తెలంగాణాకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు వేరు కుంపటి పెట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి, విభజన జరిగిన కొద్ది రోజులకే తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్నారు. అయితే సినీ పరిశ్రమను సాంకేతికంగా విభజించడం సాధ్యమేమో కానీ రెండు రాష్ట్రాలలో ప్రదర్శింపబడుతున్న సినిమాలను, వాటిలో నటించే నటీనటులను, పనిచేసే టెక్నీషియన్లను రాష్ట్రాల వారిగా విభజించడం సాధ్యమయ్యే పనికాదని అందరికీ తెలుసు. అందుకే నేటికీ తెలుగు సినీపరిశ్రమ యధాతధంగా కొనసాగుతోంది. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గొడుగు క్రింద పనిచేసిన తెలంగాణా నిర్మాతలు, దర్శకులు దానినుండి విడిపోయి వేరేగా ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసుకొని తెలంగాణాలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుండటంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వేరేగా ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసుకోవడం అనివార్యమయింది.   అందుకే రాష్ట్రానికి చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు కలిసి నిన్న శనివారంనాడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్నారు. అది రాష్ట్ర సినీ పరిశ్రమకు ప్రానిధ్యం వహిస్తూ దాని అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు దిలీప్ రాజా మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ-గుంటూరు మధ్య కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర రాజధానిలో తెలుగు సినీ పరిశ్రమ త్వరగా నిలద్రోక్కుకొని అభివృద్ధి చెందగలదని తాము భావిస్తున్నామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరమని అన్నారు.   సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పుడు, ఆ తరువాత హైదరాబాద్ కి తరలివచ్చిన తరువాత కూడా విజయవాడ తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రబిందువుగా ఉంటూ వచ్చింది. అన్ని హంగులు ఉండే రాజధానిలో సినీ నిర్మాణానికి అవసరమయిన సామాగ్రి, నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు లభిస్తారు కనుక సినీ నిర్మాణ ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయనే కారణంతోనే సినీ పరిశ్రమలు ఎప్పుడు రాజధాని నగరాలలో ఏర్పాటు అవుతుంటాయి. బహుశః అదే కారణంతో ఇప్పుడు గుంటూరులో సీమాంధ్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొని ఉండవచ్చును.   అయితే సినీ పరిశ్రమకు విభజన సెగలు తగలడం మొదలయినప్పటి నుండీ వైజాగ్ కు తరలి రావచ్చనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణా ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రాకు చెందినదిగా భావిస్తుండటం, ఆంద్ర-తెలంగాణా ప్రభుత్వాల మధ్య నానాటికి ఘర్షణలు పెరిగిపోవడం, ఇప్పటికే వైజాగ్ లో రామానాయుడు ఫిలిం స్టూడియో ఏర్పాటయి ఉండటం, సుందరమయిన వైజాగ్ నగరం సినిమా షూటింగులకి చాలా అనువుగా ఉండటంతో అక్కడ నిత్యం సినిమా షూటింగులు జరుగుతుండటం, మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం తెలుగు సినీ పరిశ్రమని వైజాగ్ కి రప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం వంటి అనేక కారణాల చేత తెలుగు సినీపరిశ్రమ నేడు కాకపోయినా రేపయినా వైజాగ్ కి తరలి తధ్యమనే అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు గుంటూరులో సీమాంధ్ర ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్నందున, సినీ పరిశ్రమ కొత్త రాజధానిలోనే ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు కనబడుతోంది.   కానీ సినీపరిశ్రమకు చెందిన అనేకమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు చాలామంది వైజాగ్ లో భారీగా భూములు కొనుక్కొని ఉన్నందున, విజయవాడకు సినీ పరిశ్రమ తరలివచ్చినప్పటికీ వైజాగ్ లో సినీ స్టూడియోల నిర్మాణం చేప్పట్టవచ్చును. సినీ పరిశ్రమ విజయవాడకు తరలివచ్చినా రాకపోయినా వైజాగ్ లో సినిమా షూటింగులు యధాతధంగా జరగవచ్చును.

రాహుల్ అసమర్థతే నాయకత్వ మార్పుకి ఆలోచనకి ప్రేరణ

  రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే సోనియా తపనే కాంగ్రెస్ కొంప ముంచిందని జానాభిప్రాయమే కాదు కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం కూడా. అందుకే మాజీ కేంద్రమంత్రి చిదంబరం భవిష్యత్తులో గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి పార్టీ పగ్గాలు చేప్పట్టవచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత నుండే సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వాన్ని పార్టీలో నేతలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. బహుశః అందుకే రాహుల్ గాంధీ పార్లమెంటులో పార్టీకి నాయకత్వం వహించకుండా వెనుక బెంచీలలో కునికిపాట్లు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కనీసం మెలకువగా ఉన్న సమయంలో సైతం ఆయన పార్టీకి పునర్వైభవం సాధించేందుకు చేసిన కృషి ఏమీలేదు. పైగా ఈ మధ్యనే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. అందువల్ల ఇప్పుడు ఆయన భవిష్యత్తే కాదు పార్టీ భవిష్యత్తు కూడా అంతా అంధకారంగా కనబడుతోంది.   అధికారంలో ఉన్నపుడే పార్టీని గెలిపించుకోలేని ఆయన, ఇక ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో పార్టీని ఏవిధంగా గెలిపించగలరు? అసలు అంతవరకు పార్టీని ఏక త్రాటిపై నడిపించే సత్తా అయినా ఆయనకు ఉందా? అనే అనుమానం కాంగ్రెస్ నేతలకు కలగడం సహజం.   ప్రధాని నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలు, దైర్యం, తెగువ, జోరు చూసి యావత్ దేశమే కాదు అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాలు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నప్పుడు, అసలు నాయకత్వ లక్షణాలే లేని రాహుల్ గాంధీ పార్టీకి ఏవిధంగా నాయకత్వం వహించగలరు? అవే ఉండి ఉంటే పదేళ్ళ క్రితమే పార్టీ పగ్గాలు చేజిక్కించుకొని, ప్రధాన మంత్రి పదవిలో స్థిరపడి ఉండేవారు కదా? అటువంటి వ్యక్తి చేతిలో పార్టీని పెడితే, పార్టీనే నమ్ముకొన్న కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఏమయిపొతారు? అనే ప్రశ్న కాంగ్రెస్ జనాలకి కలిగినందునే బహుశః చిదంబరం నోట ఆణిముత్యాల వంటి ఈ పలుకులు వెలువడి ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః ఆయనిచ్చిన ఈ ప్రేరణతో త్వరలో మరికొంత మంది సీనియర్లు గొంతు కలిపితే, తల్లీకొడుకులకు కష్టకాలం మొదలయినట్లే భావించవచ్చును.   వచ్చే ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి ఎన్నికలు జరుగుతాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వం గురించి ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు మరో 5-10 ఏళ్ళపాటు పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం బొత్తిగా కనబడటం లేదు కనుక, బహుశః ఈ సారి అధ్యక్ష పదవికి చాలా మందే పోటీ పడవచ్చును. వారిలో చిదంబరం కూడా ఒకరయినా ఆశ్చర్యం లేదు.

త్వరలో తెలంగాణా మంత్రివర్గ విస్తరణ?

  ప్రస్తుతం తెలంగాణాలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి తోడు విపక్షాల ఆందోళనలు, ధర్నాలు, మరో వైపు రైతుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరిచేస్తున్నట్లు స్పష్టంగానే కనబడుతోంది. ఇవి సరిపోవనట్లు త్వరలో శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల నుండి కొంత ఉపశమనం, పార్టీ సీనియర్ నేతల మద్దతు పొందేందుకు కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేప్పట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.   కేసీఆర్ కీలకమయిన విద్యుత్, మున్సిపల్, సంక్షేమ శాఖలను తనవద్దే అట్టేపెట్టుకొన్నారు. కానీ ఆయన రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించలేకపోతున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తీవ్ర విమర్శల కారణంగా తెలంగాణా ఉద్యమాన్ని ఎంతో సమర్ధంగా నడిపించిన ఆయన ప్రభుత్వాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అవుతున్నారనే భావన ప్రజలలో వ్యాపిస్తోంది. అందువల్ల తను నిర్వహిస్తున్న ఈ అదనపు బాధ్యతలను వేరొకరికి అప్పగించడం ద్వారా ఆ విమర్శల నుండి తప్పించుకొనే వీలు చిక్కడమే కాకుండా ఆయనపై పని ఒత్తిడి కూడా తగ్గుతుంది కనుక ప్రతిపక్షాలను కూడా ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.   ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో కేవలం 12మంది మంత్రులున్నారు. కనుక ఇప్పుడు కొత్తగా మరో ఆరుగురు మంత్రులను తీసుకోవచ్చును. మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ముఖ్యమైన జిల్లాలకు ఇంతవరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కనుక ఆ జిల్లాలకు చెందినవారికి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చును. అదేవిధంగా ఈసారి ఒక మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా నుండి ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి తెరాసలో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చును. ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు ఆయనకే విద్యుత్ శాఖను అప్పగించి తెలుగుదేశం పార్టీకి కట్టడిచేసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.   కేసీఆర్ నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు చాలానే మూట గట్టుకొన్నారు కనుకనే ఆయన మంత్రివర్గ విస్తరణ గురించి, మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయం గురించి తన పార్టీ యం.యల్యేలు, యం.యల్సీల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కానీ అంతిమ నిర్ణయం ఆయనే తీసుకొంటారు కనుక అది కేవలం మొక్కుబడి తంతుగానే భావించవచ్చును. నవంబరు 5నుండి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక ఈలోగానే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.

కాదేదీ ధర్నాలకనర్హం అంటున్న వైకాపా

  హూద్ హూద్ తుఫాను ధాటికి అతలాకుతలమయిన ఉత్తరాంధ్ర జిల్లాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా పర్యవేక్షించారు. చంద్రబాబాబు చొరవ కారణంగానే చుట్టుపక్కల జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి భారీ ఎత్తున కూరలు, దుంపలు, ఉల్లిపాయలు, బియ్యం వంటి నిత్యావసర సరుకులు మూడు జిల్లాలలో విరివిగా పంచబడుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ కారణంగానే నేటికీ స్థానిక బజార్లలలో నిత్యావసర వస్తువుల ధరలు పూర్తి అదుపులో ఉన్నాయి.   అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి విద్యుత్, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య సిబ్బందిని, పడిపోయిన విద్యుత్ స్తంభాలను, చెట్లను తొలగించేందుకు లారీలు, ప్రోక్లేయిన్లు, విద్యుత్, టెలిఫోను స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తదితర యంత్ర సామాగ్రిని చాలా భారీ ఎత్తున ఈ మూడు జిల్లాలకు తరలించడంతో యుద్ద ప్రాతిపాదికన సహాయ, పునరావాస చర్యలు జరుగుతున్నాయి. అందుకే కేవలం పదిరోజుల వ్యవధిలోనే విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలు తేరుకోగలుగుతున్నాయి.   అంతే కాదు ప్రభుత్వం తుఫాను భాదితుల సహాయార్ధం ఒక వెబ్ సైట్ కూడా తెరిచి, అందులో పిర్యాదులు నమోదు చేసుకొంటూ ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని ఇటువంటి పెనుతుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా వేయడం, సహాయ, పునరావాస చర్యలు చెప్పట్టడం, ఆపత్సమయంలో బాధితులకు అవసరమయిన సహాయం అందించడంలో ప్రభుత్వం చాలా వరకు సఫలమయిందనే చెప్పవచ్చును.   ఇరుగు పొరుగు జిల్లాల నుండి తరలి వచ్చిన సహాయ బృందాలను సమన్వయం చేసుకొంటూ, బాధితులందరికీ సహాయం అందేలా చేయడానికి ప్రభుత్వం శక్తి వంచనలేకుండా కృషి చేసింది, చేస్తోంది. వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారినందరినీ సమన్వయము చేసుకొంటూ ఇంత సమర్ధంగా సహాయ చర్యలు చేప్పట్టడం అంత తేలిక కాదని ఎవరికయినా అర్ధమవుతుంది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తుఫాను భాదితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అభిప్రాయపడటం విశేషం. నేటికీ అనేక గ్రామాలలో పునరావాస చర్యలు మొదలవనే లేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి కేవలం ప్రచారార్భాటమే తప్ప సహాయ, పునరావాస చర్యలు చెప్పట్టడంలో ఏ మాత్రం శ్రద్ధ లేదని ఆయన విమర్శించారు. అందుకే వచ్చే నెల 5న తుఫాను పీడిత ప్రాంతాలలో ధర్నాలు, ర్యాలీలు చేప్పట్టాలని పార్టీ నేతలకీ, కార్యకర్తలకీ పిలుపిచ్చారు. అంటే హూద్ హూద్ తుఫాను కూడా ధర్నాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అర్ధమవుతోంది.   బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా ఇటువంటి విపత్సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడలేకపోయినా, కనీసం సహాయ, పునరావాస చర్యలలో వైకాపా కూడా పాలుపంచుకోవచ్చును. దానికీ అభ్యంతరం ఉన్నట్లయితే కనీసం హూద్ హూద్ వెబ్ సైటులో ఏ ఏ ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదో తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రజలు హర్షించేవారు. కానీ కష్టాలలో ఉన్న ప్రజల గోడు పట్టించుకోకుండా దీనినుండి కూడా రాజకీయ మైలేజీ పొందేందుకు ధర్నాలు చేయాలనుకోవడం చాలా శోచనీయం.

తెరాస వ్యూహం బెడిసి కొట్టిందా?

  తెలంగాణా రాష్ట్రంలో నానాటికీ తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభంతో అటు రైతాంగానికి, ఇటు పారిశ్రామికవేత్తలకీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చిక్కుకొన్న తెలంగాణా ప్రభుత్వం, అత్తమీద కోపం దుత్త మీద చూపినట్లుగా, తన కోపాన్ని తెదేపాపై ప్రదర్శించింది. ఈ విద్యుత్ సంక్షోభానికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తూ తెరాస కార్యకర్తలు నల్గొండలో తెదేపా కార్యాలయంపై దాడి చేశారు. కానీ ఆవిధంగా చేసి తెరాస మరొక పెద్ద తప్పు చేసిందనే చెప్పవచ్చును. తెదేపాను దోషిగా చూపించే ప్రయత్నంలో తెరాసయే ప్రజలు మరియు ప్రతిపక్షాల దృష్టిలో దోషిగా నిలబడే పరిస్థితి చేజేతులా కల్పించుకొన్నట్లయింది. ఇప్పటికే మీడియా పట్ల తీవ్ర అసహనం ప్రదర్శిస్తూ విమర్శలు మూటగట్టుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి, తెరాస కార్యకర్తలు చేసిన ఈ నిర్వాకం వలన మరింత చెడ్డపేరు తెచ్చిపెట్టిందనే చెప్పక తప్పదు.   అయితే ఈ సమస్య ఇంతటితో ముగిసిపోలేదు. తెదేపా కార్యాలయంపై దాడికి పాల్పడినందుకు నల్గొండ జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన తెదేపా నేతలను అరెస్ట్ చేయడంతో ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్రతిపక్ష నేతలను తెలంగాణా ప్రభుత్వం అరెస్టులు చేసిందనే అపఖ్యాతి కూడా మూటగట్టుకొన్నట్లయింది.   అరెస్టయిన తెదేపా నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, రమణ తదితరులు మీడియాతో మాట్లాడుతూ రైతులకు 8గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన తెరాస, ఇప్పుడు విద్యుత్ సంక్షోభం పరిష్కరించలేక తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ, తెదేపా కార్యాలయాలపై దాడులుకు చేస్తోందని ఎద్దేవా చేసారు. సరిగ్గా ఇటువంటి గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను పరిష్కరించుకోగలిగినప్పుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విఫలమవుతున్నారని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. తెరాస నేతలు తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా నేతలు విమర్శించారు. ఇదంతా గమనిస్తే తెరాస వ్యూహం బెడిసికొట్టినట్లే కనబడుతోంది.   ప్రస్తుత విద్యుత్ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు తెలంగాణా ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తూ ప్రతిపక్షాల విమర్శలకు మాటలతోనే జవాబు చెప్పి ఉండి ఉంటే, తెలంగాణా ప్రజలు కూడా తెరాస చిత్తశుద్ధిని అనుమానించేవారు కాదు. కానీ ఆ ప్రయత్నం చేయకుండా తెదేపా కార్యాలయంపై దాడి చేయడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 300మెగా వాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చినా దానిని పట్టించుకోకుండా పదేపదే చంద్రబాబు నాయుడుని నిందించడం, తెదేపా కార్యలయలపై దాడులు చేయడం వంటివి ప్రజలకి ప్రభుత్వ సమర్దతపై మరింత అనుమానం రెక్కేత్తించేందుకే దోహదపడతాయి తప్ప ఈ సమస్యకు పరిష్కారం చూపబోవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.