మోడీ మ్యాజిక్ ఆంద్ర, తెలంగాణాలలో పనిచేస్తుందా?

  సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒకవేళ బీజేపీ దైర్యం చేసి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక పోయుంటే బహుశః నేడు ఆ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితీ కూడా వేరేలా ఉండేవేమో. కానీ ఆనాడు బీజేపీ తెగించి తీసుకొన్న నిర్ణయం వలన నేడు ఆశించిన దానికంటే మంచి ఫలితాలే ఇస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తరాదిన మూడు నాలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యున్న బీజేపీ, మోడీ, అమిత్ షాల చేతికి పార్టీ పగ్గాలు అప్పగించిన తరువాత క్రమంగా యావత్ దేశమంతా పార్టీ విస్తరిస్తోంది.   ఇప్పుడు బీజేపీ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్ ఘర్, గోవా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తన అధికారాన్ని విస్తరింపజేయగలిగింది. అంతే కాదు నాగాల్యాండ్, పంజాబ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో తన ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకొంటోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా అధికారం చేప్పట్టేందుకు చురుకుగా, చాల తెలివిగా పావులు కదుపుతోంది. దాని వ్యూహం ఫలిస్తే బీజేపీ చరిత్రలో మొట్ట మొదటిసారిగా జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావచ్చును. అదేవిధంగా ఈసారి డిల్లీలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.   అంటే కేంద్రంలో అధికారం చెలాయించడమే కాకుండా, దేశంలో 29 రాష్ట్రాలుంటే అందులో ఎనిమిది రాష్ట్రాలలో స్వయంగా అధికారంలోకి రాగలిగితే, మరో 3 రాష్ట్రాలలో భాగస్వామిగా ఉంటోందన్నమాట. ఇంతవరకు దక్షిణాదిన కర్నాటక రాష్ట్రం బీజేపీకి కంచుకోటగా ఉండేది.కానీ మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పుణ్యమాని ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి వదులుకోవలసి వచ్చింది. కానీ మళ్ళీ అక్కడ పార్టీని బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో తిరిగి అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా మారుతుండటంతో వచ్చే ఎన్నికలలో కర్ణాటకలో కూడా బీజేపీ పాగా వేసే అవకాశాలున్నాయి.   బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన దృష్టినిప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలపైకి సారించారు. ఈవిధంగా బీజేపీ తన సామ్రాజ్యాన్ని దేశమంతటికీ విస్తరిస్తుంటే సహజంగానే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న లేదా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఆందోళన చెందడం సహజం. కానీ ప్రధాని మోడీ మిత్రధర్మం పాటిస్తూ తమ ఎన్డీయే భాగస్వామ్య పార్టీలను కేంద్రంలో తగు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారి ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేసారు. కానీ వివిధ రాష్ట్రాలలో ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని అసందర్భంగా మాట్లాడుతూ తమ మిత్ర పక్షాలలో అనవసరమయిన ఆందోళన రేకెత్తిస్తున్నారు.   ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా, ఆంద్ర, తెలంగాణా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకి బీజేపీ తన అధికారం విస్తరించాలంటే ముందుగా అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. కుల, మత, ప్రాంత సమీకరణాలు సరిచూసుకోవలసి ఉంటుంది. ఎంతో కాలంగా అక్కడ బలంగా నిలద్రోక్కుకొనున్న ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవలసి ఉంటుంది. మోడీ మ్యాజిక్, అమిత్ షా రాజకీయ వ్యూహాల వల్లనే బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలలో విస్తరించిందని నిసందేహంగా చెప్పవచ్చును. కానీ ఆ మ్యాజిక్ దక్షిణాది రాష్ట్రాలలో పనిచేస్తుందా లేదా అనేది ఈ ఐదేళ్ళలో ఆయన ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును. ఇవ్వన్నీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మోడీ మ్యాజిక్ తోనే అన్ని రాష్ట్రాలలో పాగా వేసేయడం అసాధ్యమనే చెప్పవచ్చును.

తెదేపా-బీజేపీ వ్యూహాలు వేరు లక్ష్యం ఒక్కటే

  ఇటీవల తెదేపా చేప్పట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఆంధ్రాలో ఊహించనంతగా మంచి స్పందన వచ్చింది. ఆంధ్రాలో 20-25 లక్షల లక్ష్యం పెట్టుకొంటే ఏకంగా 43లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇక తెలంగాణాలో ఏడు లక్షలు లక్ష్యం పెట్టుకొంటే అక్కడ పది లక్షల మంది చేరారు. అంటే కేవలం ఈ 49 రోజుల్లో ఏకంగా 53 లక్షల మంది కొత్త సభ్యులు పార్టీలో చేరారు. ఇది సరికొత్త రికార్దేనని చెప్పక తప్పదు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలుపెట్టాయి. కానీ వాటికి ఇటువంటి స్పందన రాలేదు. అంటే తెదేపాకున్న గట్టి పట్టు ఆ రెండు పార్టీలకు లేదని స్పష్టమవుతోంది.   తెదేపా పెరిగిన తన ఈ బలాన్ని చూసుకొని బీజేపీకి ఎదురు నిలవాలనుకోవడం లేదు, కానీ బీజేపీ నేతలు మాత్రం త్వరలో జరగనున్న జి.హెచ్.యం.సి.(హైదరాబాద్) జి.వి.యం.సి. (వైజాగ్) లలో తమ బలం ఓసారి పరీక్షించి చూసుకోవాలని తహతహలాడుతున్నట్లున్నారు. ఒకవేళ ఆ రెండు ఎన్నికలలో బీజేపీ తమతో కలిసి రాకపోయినట్లయితే, తెదేపా కూడా తన శక్తి ఏమిటో చూపేందుకు వెనుకాడకపోవచ్చును. కానీ బీజేపీ అధిష్టానం అప్పుడే అంత తొందరపడక పోవచ్చును. ఎందుకంటే రెండు రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదులో చొరవ చూపని స్థానిక నేతలను నమ్ముకొని మిత్రపక్షమయిన తెదేపాతో తెగతెంపులు చేసుకోవడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. కనుక ముందుగా పార్టీని బలోపేతం చేసేందుకే బీజేపీ అధిష్టానం గట్టిగా ప్రయత్నించవచ్చును.   ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమందిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తన శత్రువులందరినీ పోగేసుకొని తన మీద యుద్ధానికి సిద్దం అవుతుంటే తెదేపా చూస్తూ ఊరుకొంటుందని అనుకోవడం అవివేకమే.   బీజేపీ కాంగ్రెస్, వైకాపాలలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా ఆయా వర్గాల ప్రజలను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెదేపా నేరుగా ఆయా వర్గాల ప్రజలనే తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. బహుశః అదే సరయిన పద్దతని చెప్పవచ్చును.   కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకొంటున్నవారి కులం వివరాలను కూడా తెదేపా సేకరించింది. అయితే ఆ వివరాలను చాల గుట్టుగా ఉంచడం గమనార్హం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 43లక్షల మంది కొత్తగా సభ్యత్వం తీసుకొంటే అందులో యస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ తదితర కులస్తులే ఎక్కువ సంఖ్యలో ఉంటారని భావించవచ్చును.   తెదేపా ఒక్కో నియోజక వర్గం నుండి కనీసం ఆరు శాతం ప్రజలను సభ్యులుగా పార్టీలో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకొంది. కానీ దాదాపు పది శాతం పైనే చేరడం గమనిస్తే ఆ పార్టీ పట్ల ప్రజలు బాగానే మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏకంగా ఆరు లక్షలమంది సభ్యులు చేరగా, అత్యధికంగా వినుకొండ నుండి 70,000 మంది సభ్యులు చేరారు. ఆ తరువాత వరుసగా కృష్ణా జిల్లాలో నందిగామ, చిత్తూరులో కుప్పం నుండి అత్యధికంగా సభ్యులు చేరారు. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే వైకాపాకు కంచుకోట అని చెప్పుకొనే పులివెందలలో తెదేపాకు ఈసారి 210 శాతం సభ్యత్వం పెరిగింది. ఆ సంగతి తెదేపా రహస్యంగా ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ అది ఎలాగో మీడియాకు పొక్కింది. అంటే తెదేపా చాప క్రింద నీరులా కడపలో కూడా తన బలం పెంచుకొంటున్నట్లు స్పష్టమవుతోంది.   మరి ఇవన్నీ రాష్ట్ర బీజేపీ నేతలకి, బీజేపీ అధిష్టానానికి తెలియవని భావించలేము. కనుక బీజేపీ కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఆచితూచి అడుగులు వేయవచ్చును.

సోనియాతో పాటు రాహుల్ రిటైర్మెంట్ కూడా తప్పదా?

  నిన్న వెలువడిన ఝార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీని పతాక స్థాయికి తీసుకుపోగా, 125సం.ల ఘన చరిత్ర కలిగి, నిన్న మొనటి వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని పూర్తి పతనావస్థకు చేర్చాయి. వరుస విజయాలతో బీజేపీ దేశమంతటా క్రమంగా విస్తరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోతోంది. బీజేపీ ఇంతగా పుంజుకోవడానికి, కాంగ్రెస్ ఇంత దారుణంగా దెబ్బ తినడానికీ కారణం ఆయా పార్టీల అధినేతలు ప్రదర్శిస్తున్న నాయకత్వ లక్షణాలలో తేడాలే. అగ్నికి వాయువు తోడయినట్లుగా నరేంద్రమోడీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తోడవడంతో వారిరువురూ తమ పార్టీని దశదిశలా వ్యాపింపజేస్తుంటే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియాగాంధీకి అసమర్ధుడు, బొత్తిగా నాయకత్వ లక్షణాలు లేనివాడు అయిన రాహుల్ గాంధీ తోడవడంతో ఒక్కో రాష్ట్రంలో ఆ పార్టీ చాప చుట్టేస్తోంది.   ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇరువురు ఇదే దూకుడు ఇక ముందు కూడా ప్రదర్శించినట్లయితే, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా దొరకకపోవచ్చును. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడం బహుశః సోనియా, రాహుల్ గాంధీలిరువురు వల్ల కాదనే చెప్పవచ్చును. రాజకీయ పార్టీలలో సభ్యులకు ఆ పార్టీల వలననే ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందడం సహజ సూత్రమయితే, వ్యక్తులు, వారి వంశ చరిత్రల కారణంగా పార్టీలు మనుగడ సాగించడం చాలా అసహజంగా ఉంటుంది. అటువంటి పార్టీలు ఏదో ఒకనాడు ఇటువంటి పరిస్థితే ఎదుర్కోక తప్పదని కాంగ్రెస్ పార్టీ రుజువు చేస్తోంది. అందువల్ల పార్టీ మనుగడపైనే తమ రాజకీయ జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయని వారిరువురు గ్రహించినట్లయితే కాంగ్రెస్ బ్రతికి బట్ట కట్టవచ్చును.   ఒకవేళ సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీని ఇంకా తన చెప్పు చేతలలోనే ఉంచుకోవాలని చూసినా లేదా రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని ప్రయత్నించినా అతని రాజకీయ భవిష్యత్, అతనితోబాటు దేశంలో వేలాది కాంగ్రెస్ నేతల, కార్యకర్తల భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది. తన ముద్దుల కొడుకును ప్రధానమంత్రిని చేద్దామనుకొన్న సోనియాగాంధీకి ఇది చాలా కష్టంగా అనిపించవచ్చును. కానీ పార్టీని కాపాడుకొనేందుకు పార్టీ పగ్గాలను సమర్దుడయిన వ్యక్తి చేతిలో పెట్టడం చాలా అవసరం. పెట్టినా కూడా, మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందితే తప్ప వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం దక్కకపోవచ్చును. కనుక కాంగ్రెస్ అధిష్టానం ఇకనయినా మేల్కొని ఆత్మవంచన చేసుకోకుండా వాస్తవ పరిస్థితులను సమీక్షించుకొని అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాకాదని పార్టీ ప్రక్షాళన పేరిట కొంతమంది నేతలను అటు వారిని ఇటు, ఇటువారిని అటు మార్చినంత మాత్రాన్న ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు.

స్వంత పార్టీకే ఎసరు పెట్టుకొంటున్న జననేత

  ఆంద్రప్రదేశ్ శాసనసభలో నిన్నరాజధాని అభివృద్ధి మండలి బిల్లు పేరిట అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, చివరికి తిట్లు తోపులాటల వరకు సభలో జరగకూడనివన్నీజరిగాయి కానీ బిల్లుపై లోతుగా చర్చ మాత్రం జరుగకుండానే ఆమోదం ముద్ర పడింది. అందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డినే నిందించక తప్పదు. ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద రాజధాని నిర్మిస్తానని సభలో ప్రకటించినప్పుడు దానిని ఆయన స్వాగతించారు. కానీ ఆయన ఇప్పుడు చెపుతున్నట్లుగా రాజధానిని దొనకొండ లేదా వినుకొండ వద్ద పెట్టుకోమని ఆనాడు సూచించలేదు. ఆ తరువాత తూళ్ళూరులో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి భూసేకరణకు సిద్దమవుతున్నప్పుడు, కృష్ణా జిల్లాలో బలహీనంగా ఉన్న తన వైకాపాను బలోపేతం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సున్నితమయిన ఈ అంశంపై కూడా రాజకీయాలు చేస్తూ భూసేకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఆటంకాలు సృష్టించవచ్చో అన్నీ సృష్టించారు.   ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందంటూ సభలో చాలా రాద్దాంతం చేసిన జగన్, బిల్లుపై లోతుగా చర్చించి, అందులో లోటుపాట్లు ఏమయినా ఉంటే సరిచేసేందుకు ప్రయత్నించకపోగా, తనకు అధికారం దక్కనీయకుండా చేసారనే దుగ్ధతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందించడానికే ప్రాధాన్యం ఇవ్వడం చాలా దురదృష్టకరం. అసలు బిల్లులో లోపాలపై చర్చించకుండా, రాజధానిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయకుండా బిల్లును ఎందుకు వ్యతికించారంటే, భూములు పోగొట్టుకొంటున్న రైతుల సానుభూతి పొంది తద్వారా జిల్లాలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనం కనబడటం లేదు.   అయితే ఆయన ఆ ప్రయత్నమూ దైర్యంగా చేయలేకపోయారనే చెప్పవచ్చును. ఎందుకంటే చంద్రబాబు నాయుడు “ఆ ప్రాంతంలో రాజధాని నిర్మించడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా?” అని అడిగిన ప్రశ్నకు ఆయన అవునని కానీ కాదని గానీ సూటిగా జవాబు చెప్పలేకపోయారు. కానీ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తోందంటూ పదేపదే సభలో నొక్కి చెప్పారు. రైతులకు న్యాయం జరగాలంటే బిల్లులో తను గమనించిన లోపాలను వివరించి దానిపై సభలో చర్చించి వాటిని సవరించేందుకు గట్టిగా కృషిచేయడం ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. కానీ ఆ సాకుతో అధికార పార్టీని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెడుదామని ప్రయత్నాలు చేసి చివరకు ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక తనే దోషిగా మిగిలారు.   జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం చేస్తున్న ఇటువంటి ప్రయత్నాల వలననే ఆ పార్టీ మరింత దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన జిల్లాలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు రాజధాని నిర్మాణానికి ఈవిధంగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తే అక్కడ పార్టీ బలపడుతుందో లేదో తెలియదు కానీ మిగిలిన అన్ని జిల్లాలలో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. రాజధాని నిర్మాణానికి ఆయన అడ్డుపడుతుండటం చూస్తున్న రాష్ట్ర ప్రజలు ఆయనపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడతారనట్లు ఈ విషయాన్ని ఆయన చెవిలో వేసేందుకు వైకాపా నేతలు వెనుకాడుతున్నారు. అందువల్ల ఆయన తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వితండవాదం చేస్తూ పార్టీకి శల్య సారధ్యం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ల సలహా సంప్రదింపులు చేయకుండా ఆయన తనకు తోచినట్లుగా పార్టీని నడిపించుకొంటూ పోతున్నారు. ఆ విధంగా వ్యవహరించడం వలననే  ఆయనను నమ్ముకొన్న తెలంగాణాలో పార్టీ నేతలు ఇంతకు ముందు రోడ్డున పడ్డారు. ఆంధ్రాలో వైకాపా నేతలకు కూడా మున్ముందు అదే పరిస్థితి ఎదురయినా ఆశ్చర్యం లేదు.

మోడీ పధకాలకు మెరుగులు దిద్దుతున్న చంద్రబాబు

  గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చగా, ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో కళకళలాడుతుంటేనే దేశం కూడా కళకళలాడుతుంటుందని మహాత్మా గాంధీజీ ఏనాడో చెప్పారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే పాలించినప్పటికీ, ఆ పార్టీ ఆయన పేరును వాడుకొందే తప్ప ఆయన చెప్పిన ఈ మంచి సలహాను ఎన్నడూ చెవికెక్కించుకోలేదు. అందుకే నేటికీ దేశంలో లక్షలాది గ్రామాలలో దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి.   ప్రధాని మోడీ సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నప్పటికీ, గాంధీ మహాత్ముడు సూచించిన విధంగా ‘స్వచ్చ భారత్’ కార్యక్రమాన్ని, ఆ తరువాత ‘సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పధకాన్ని’ ప్రవేశపెట్టారు. పార్లమెంటు సభ్యులు అందరూ తమ తమ నియోజక వర్గాలలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపుకి పార్టీలకతీతంగా సోనియా, రాహుల్ గాంధీలతో సహా చాలా మంది యంపీలు, కేంద్రమంత్రులు స్పందించారు.   చాలా ఏళ్లుగా ప్రతీ యంపీకి రూ.2 కోట్లు చొప్పున స్థానిక అభివృద్ధి నిధులను కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తోంది. దానిని యంపీలు స్థానిక అవసరాలను బట్టి ఖర్చు చేసే అధికారం కలిగి ఉన్నారు. అది పూర్తిగా వారి విచక్షనాధికారాలకు లోబడే జరుగుతుంది కనుక చాలా మంది దానిని దుర్వినియోగం చేయడమో లేకపోతే అసలు స్థానిక అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం వలన ఆ నిధులు మురిగిపోవడమో జరుగుతుంటుంది. అది గమనించే మోడీ ఈ పధకం ఆరంభించారు. తద్వారా ఆ నిధులతో యంపీలు తమ నియోజక వర్గాలలో ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఆయన ఆశిస్తున్నారు.   అయితే కేంద్ర ప్రభుత్వమే వారికి తగిన నిధులు అందజేసి ఏదో ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయమని కోరినప్పటికీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో అనేకమంది యంపీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొనేందుకు ఇష్టపడటం లేదు. ఎవరి సాకులు, సమస్యలు వారికున్నాయి.   మోడీ ప్రవేశపెట్టిన ఈ పధకం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని బాగా ఆకర్షించింది. ప్రధాని మోడీ ఇచ్చిన స్పూర్తితో ఆయన ‘స్మార్ట్ విలేజ్, స్మార్ట్ ఆంద్రప్రదేశ్’ అనే ఒక పధకం ప్రవేశపెట్టారు. మోడీ తన పధకంలో కేవలం యంపీలను మాత్రమే భాగస్వాములు చేస్తే చంద్రబాబు దానిని మరింత విస్త్రుతపరిచి పరుస్తూ అందులో రాష్ట్ర మంత్రులు, యం.యల్యే.లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలను ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి విద్యుత్ స్వచ్చమయిన నీళ్ళు, రోడ్లు, కాలువలు, కళాశాలలు, ప్రాధమిక ఆసుపత్రులు వంటి మౌలికవసతులు ఏర్పాటు చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలని ఆయన ప్రయత్నించడం చాలా మంచి ఆలోచన. అభినందనీయం కూడా.   అయితే స్వయంగా ప్రధాని మోడీ కోరినా కొందరు యంపీలు స్పందించకపోవడం గమనిస్తే, చంద్రబాబు పిలుపుకి కూడా అటువంటి మిశ్రమ స్పందనే రావచ్చును. కనుక గ్రామాలను దత్తత తీసుకొన్నవారికి ఆయన కొన్ని ప్రోత్సహకాలు, రాయితీలు ప్రకటిస్తే బహుశః మంచి స్పందన రావచ్చును. రాష్ట్రాభివృద్ధిలో అందరూ పాలుపంచుకోవలసిందిగా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల కూడా మంచి ఫలితం కనబడవచ్చును.   తెలంగాణా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో చెరువుల పునరుద్దరణకు కూడా ఇటువంటి ప్రయోగమే చేస్తోంది. దేశ విదేశాలలో ఉన్న తెలంగాణావాసులు తమతమ ప్రాంతాలలో చెరువుల అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ప్రోత్సహిస్తోంది.మూడు చెరువులను దత్తత తీసుకొన్నవారికి వారు కోరుకొన్నవారి పేర్లను పెట్టేందుకు సిద్దమని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇటువంటి వినూత్నమయిన ఆలోచనలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిలో అందరినీ భాగస్వాములు చేయగలిగితే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, ప్రభుత్వంపై కూడా ఆర్ధికభారం పడదు.

ఈ తపన అంతా జి.వి.యం.సి.ఎన్నికల కోసమేనా?

  వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విశాఖ నుండి పోటీ చేసి ఓడిపోవడం ఆ పార్టీకి తీరని అప్రదిష్టగా మిగిలింది. ఆ తరువాత విశాఖకు చెందిన దాడి వీరభద్ర రావు, కొణతాల రామకృష్ణ, గండి బాబ్జి, చొక్కాకుల వెంకట రావు తదితర సీనియర్ నేతలు పార్టీని వీడిపోయారు. త్వరలో మరికొందరు నేతలు కూడా బీజేపీలోకి వెళ్ళిపోయెందుకు మూట ముల్లె సర్దుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇటువంటి సమయంలో విశాఖ నగర మునిసిపల్ కార్పోరేషన్ (జి.వి.యం.సి.) ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వెంటనే అప్రమత్తమయిన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో ధర్నాకు కూర్చొని బలప్రదర్శన చేసారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలు అందరూ కలిసి జనసమీకరణ చేయడంతో భారీగానే జనం వచ్చేరు. కనుక జగన్ చేసిన ధర్నా విజయవంతమయిందనే ఆ పార్టీ చెప్పుకొంది. అంతకు ముందు హూద్ హూద్ తుఫాను బాధితులకు న్యాయం జరగలేదంటూ ఓ పంట రుణాల మాఫీతో కలిపి ఒక రీమిక్స్ ధర్నా కూడా చేసారు.   హూద్ హూద్ తుఫాను బాధితులకు కేంద్రం ప్రకటించిన వెయ్యి కోట్లు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని, నిర్లక్ష్యం చూపుతోందంటూ జగన్ స్వయంగా డిల్లీ వెళ్లి హోంమంత్రిని, ఆర్ధిక మంత్రిని కలిసి వారి చేతిలో విజ్ఞప్తి పత్రాలు పెట్టి చక్కా వచ్చారు. కానీ అప్పటికే కేంద్రం రూ.450 కోట్లు విడుదల చేసింది. అయితే నేటికీ మిగిలిన రూ.450 కోట్లు ఇంకా విడుదల చేయలేదు. కానీ జగన్ మళ్ళీ డిల్లీ వెళ్ళలేదు ఎందుకో? బహుశః జి.వి.యం.సి.ఎన్నికల తేదీలు ఖరారు అయిన తరువాత వెళ్ళడం వలన ఎక్కువ లాభం ఉంటుందని ఆగేరేమో మరి తెలియదు.   ఉంగరం పడిపోయిన చోటే వెతుకోవలసి ఉంటుంది కనుక, జగన్ కూడా ఓడిపోయినా చోటే గెలిచి పోయిన పరువు తిరిగి సంపాదించుకోవాలనే తాపత్రయంతో జి.వి.యం.సి.ఎన్నికల కోసం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లున్నారు. బహుశః అందుకే ఆయన హూద్ హూద్ భాదితుల కోసం అంతగా బాధపడిపోతున్నారేమో. లేకుంటే ఎవరో వాలంటీర్లు ఎక్కడో ఒక చోట విసిరేసిన పులిహోర పొట్లాలు పట్టుకొని అసెంబ్లీలో అంత రచ్చ రచ్చ చేసేవారు కాదు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందించేవారు కాదేమో?   ఆయన పదేపదే పులిహోర పొట్లాల గురించి ప్రస్తావిస్తూ ఎందుకు బాధపడిపోతున్నారంటే, చంద్రబాబు నాయుడు హూద్ హూద్ తుఫాను సమయంలో విశాఖలో వారం రోజులు తిష్టవేసి స్వయంగా సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించి ప్రజలలో చాలా మంచి పేరు తెచ్చుకొన్నారు. కనుక ఆయనపై బురద జల్లితే దాని వల్ల తన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించి, అందుకోసమే ఈ పాచిపోయిన పులిహోర పొట్లాలు పట్టుకొన్నట్లున్నారు. “కుక్కలకు విసిరేసినట్లుగా ప్రభుత్వం పులిహోర పొట్లాలు విసిరేసి వైజాగ్ ప్రజలను అవమానించారని” పదేపదే చెపుతూ చాలా బాధపడిపోతున్నారు. తద్వారా విశాఖ ప్రజల మనసులను గెలుచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లున్నారు.   అయితే పులిహోర పొట్లాల గురించి ఇంతగా బాధపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలల క్రితం ఏదో గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్ పెట్టుకొనేందుకు బల్ల లేకపోతే అప్పుడు తన సెక్యురిటీ గార్డునే వంగోబెట్టి అతని వీపునే బల్లగా చేసుకొని అతని వీపు మైకు పెట్టి ప్రసంగించినప్పుడు, అది అవమానకరంగా భావించలేదు. చేసిన తప్పును ఒప్పుకోకుండా ‘చెయ్యి నొప్పి..వేలు నొప్పి అందుకే తప్పలేదు మరి’ అంటూ నిసిగ్గుగా వైకాపా నేతలు సమర్ధించుకొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరో వాలంటీర్ ఎక్కడో ఒకచోట మీదకు ఎగబడుతున్న జనాలకు అందించలేక ప్యాకెట్లు విసిరేస్తే దానిని పట్టుకొని ఇంతగా చిందులు ఎందుకు వేస్తున్నారు? అంటే జి.వి.యం.సి.ఎన్నికల కోసమేనని చెప్పక తప్పదు.   ఇదేదో బోడి గుండుకి మోకాలుకీ ముడిపెడుతున్నట్లు అనిపిస్తున్నప్పటికీ, విశాఖ ప్రజలను ఆకట్టుకోవడానికి జగన్ పడుతున్న ఈ ఆరాటమంతా చూస్తుంటే జి.వి.యం.సి.ఎన్నికల కోసమేనని అర్ధమవుతుంది. ఇదివరకు సార్వత్రిక ఎన్నికలలో గెలిచేందుకు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినట్లే, ఇప్పుడు జి.వి.యం.సి.ఎన్నికల కోసం హూద్..హూద్...పులిహోర..హూద్...హూద్..పులిహోర...అనే మంత్రం పటిస్తున్నారు. అయితే ఇటువంటి మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో ఎన్నికల తరువాతనే తెలుస్తుంది.

పాకిస్తాన్ ఇకనయినా మారుతుందా లేదా?

  “హలో! స్కూల్లో ఉన్న పిల్లలందరినీ చంపేశాము..ఇప్పుడేమి చేయాలి మేము?”   “ఆర్మీ వాళ్ళు వచ్చేవరకు ఆగండి. వచ్చేక వారిని కూడా వీలయినంత మందిని చంపండి. ఆ తరువాత మిమ్మల్ని మీరు పేల్చేసుకొని చచ్చిపొండి..ఓవర్!”   ఇవి పెషావర్ ఆర్మీ స్కూల్లో పిల్లలను పొట్టనబెట్టుకొన్న తరువాత మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు తమ నాయకుడితో సాగించిన చివరి సంభాషణలు. వారి ఈ ఫోన్ సంభాషణలను పాకిస్తాన్ ఇంటలిజన్స్ వర్గాలు ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ కు అందజేసిందని స్థానిక పత్రికల ద్వారా బహిర్గతం అయ్యింది. అయితే ఇంత ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల సంభాషణలను రహస్యంగా వినగలిగిన పాకిస్తాన్ ఇంటలిజన్స్ వర్గాలు, అదే పని ముందే చేయగలిగి ఉండి ఉంటే అంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు కారు కదా అని ఎవరికయినా అనిపించకమానదు. ఇంటలిజన్స్ వైఫల్యం ఎంతటి దారుణాలకు దారి తీస్తుందో ఈ సంఘటన తెలియజేస్తోంది.   ఒకవైపు పాకిస్తాన్, యావత్ ప్రపంచమూ కూడా ఈ దారుణ సంఘటనకు తీవ్రంగా కలత చెంది ఉండగా, పాకిస్తాన్ దేశంలో బిడ్డలను పోగొట్టుకొన్న తల్లులు వారి శవ పేటికల మీదపడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, తాలిబాన్ ఉగ్రవాదులు వారినందరినీ పరిహసిస్తున్నట్లుగా ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల ఫోటోలను మీడియాకు విడుదల చేసారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అందరూ తుపాకులు చేతబట్టుకొని ఏదో యుద్దానికి బయలుదేరుతున్నట్లుగా ఫోటోకు ఫోజులీయడం చూస్తే వారి హృదయాలు ఎంతగా మొద్దు బారిపోయాయో అర్ధమవుతుంది.   ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభ్యుడు ఒకరు మాట్లాడుతూ ఆ స్కూలు గదుల్లో అత్యంత క్రూర మృగాన్ని వదిలిపెట్టినా బహుశః ఇంతమందిని అది పొట్టన బెట్టుకొని ఉండదు. కానీ మనిషి రూపంలో వచ్చిన ఈ తాలిబాన్ మృగాలు ఏకంగా 148మందిని పొట్టన బెట్టుకొన్నాయి. ఇటువంటి మృగాలకు ఈ భూమి మీద ఉండే అర్హత కూడా లేదు’ అని ఎంతో ఆవేదనతో పలికారు. ఆయన మాటలు అక్షర సత్యాలని అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఎంతటి క్రూర మృగమయినా తన ఆకలి తీర్చుకొనేందుకు మాత్రమే వేటాడుతుంది. ఆ తరువాత తన కంటి ముందే తను వేటాడే జంతువులు తిరుగుతున్నా వాటి జోలికి వెళ్ళదు. కానీ పైశాచిక ఆనందానికి అలవాటుపడిన ఇటువంటి ఉగ్రవాదులు మతానికి వక్రబాష్యాలు చెప్పి మతం పేరుతో ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు.   అసలు ఏ మతం చెప్పింది అభం శుభం తెలియని చిన్నారులను చంపడం తప్పు కాదని? ఏమతం చెప్పింది గర్భిణి స్త్రీలను కాల్చి చంపడం తప్పు కాదని? ఏ మతం సమర్ధిస్తుంది ఇతరుల భార్యలను, అక్క చెల్లెళ్ళను, పిల్లలను చెరచి చంపడాన్ని? ఇది మతోన్మాధం కూడా కాదు. మతం పేరు చెప్పుకొని మానవ రూపంలో తిరుగుతున్న మృగాలు ఆడే పైశాచిక క్రీడ.   అటువంటి వారిని పెంచి పోషించినందుకు పాకిస్తాన్ చాలా భారీ మూల్యం చెల్లించింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు, సైనికాధికారులు, ఐ.యస్.ఐ. సంస్థ అధికారులు, రాజకీయ నేతలకు ఈ సంఘటన కనువిప్పు కలిగించి వారిలో పరివర్తన తీసుకురావాలని అందరూ ప్రార్ధించాలి. వారు పెంచి పోషించిన విషసర్పాలు చివరికి వారి పిల్లలనే కాటు వేసాయి. కనుక ఈసారి తప్పక వారిలో పరివర్తన కలుగుతుందని యావత్ ప్రపంచం ఆశిస్తోంది.   కానీ సరిగ్గా ఇదే సమయంలో ముంబై 26/11దాడులలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి పాకిస్తాన్ కోర్టు సరయిన సాక్ష్యాలు లేవని చెపుతూ బెయిలు మంజూరు చేయడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో కాశ్మీర్ సరిహద్దులలో పూంచ్ సెక్టర్ వద్ద పాక్ ఉగ్రవాదులు షరా మామూలే అన్నట్లు భారత్ లోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నంలో భారత సైనికులమీద కాల్పులు జరిపారు. ఇవన్నీ చూస్తుంటే అసలు పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పటికయినా మారుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మారకపోతే ఇటువంటి నరమేధాలు మరిన్ని చూడక తప్పదు. మరెందరో తల్లుల, స్త్రీల ఉసురు పోసుకోక తప్పదు.

రామోజీ, కేసీఆర్ సమావేశం పర్యవసానాలు ఏమిటో?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ల మధ్య, వారిరువురి పార్టీల మధ్య ఏదో ఒక అనిర్వచనీయమయిన బలమయిన బంధం ఒకటుందనే సంగతి అందరికీ తెలుసు. శత్రువు యొక్క శత్రువు మిత్రుడవుతాడనే సిద్దాంతం ప్రకారం వారిరువురూ కూడా చంద్రబాబు నాయుడుని, తెలుగుదేశం పార్టీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు కనుక భిన్న దృవాలయిన వారిరువురూ దగ్గయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి చనిపోయిన తరువాత ఆయన స్థానంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని ఆశించిన జగన్మోహన్ రెడ్డి ఆశ నేటికీ నెరవేరలేదు. ఎన్నికలలో తన పార్టీ ఓటమికి చంద్రబాబే కారణమని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల తరువాతయినా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది. బహుశః అందుకే జగన్ ఆయనను అంతగా ద్వేషిస్తున్నారని భావించవచ్చును.   ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ది వేరే రకమయిన సమస్య. ఆయన తెలంగాణాలో తన పార్టీకి మరే ఇతర పార్టీ నుండి అసలు పోటీ ఉండకూడదని భావిస్తుంటారు. కానీ తెలుగుదేశం అక్కడ గట్టిగా నిలద్రొక్కుకోవాలని ప్రయత్నించడమే కాకుండా, తెలంగాణాలో బలంగా ఉన్న బీజేపీతో జత కట్టింది కూడా. ఆ రెండు పార్టీలు కలిసి తమ తెరాసకు పెను సవాలుగా నిలుస్తున్నాయనే క్రోధంతోనే కేసీఆర్ చంద్రబాబును ద్వేషిస్తున్నారని చెప్పవచ్చును.   రాష్ట్ర విభజన తరువాత వడ్డించిన విస్తరి అనుకొన్న తెలంగాణా రాష్ట్రంలో కూడా విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మ హత్యలు వంటి అనేక సమస్యలు పుట్టుకు వస్తుండటం, అదే సమయంలో కనీసం కార్యాలయం కూడా లేని పరిస్థితుల్లో ఆంధ్రాలో చంద్రబాబు సరిగ్గా అటువంటి సమస్యలన్నిటినీ ఒకటొకటిగా చాలా నేర్పుగా పరిష్కరించుకొంటూ ముందుకు వెళుతుండటం, తత్కారణంగా ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోఅవలసి రావడం వంటి అనేక కారణాలు ఆయన చంద్రబాబు నాయుడుని ద్వేషించేలా చేస్తున్నాయని చెప్పవచ్చును.   కేసీఆర్, జగన్ లకు మరో ఉమ్మడి శత్రువు కూడా ఉన్నారు. అతనెవరో కాదు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు. కానీ రామోజీరావుని జగన్ ద్వేషిస్తునంతగా కేసీఆర్ ఆయనను ద్వేషించడం లేదని చెప్పవచ్చును. ఆయన ఆంధ్రాకు చెందినవారు కావడం, తను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకి సన్నిహితుడుకావడం చేతనే కేసీఆర్ ఇంతకాలం ఆయనకు దూరంగా ఉంటున్నారు. కానీ ఈ అకారణ ద్వేషం వలన నష్టమే తప్ప ఎటువంటి లాభమూ ఉండదనే ఆలోచనతోనే బహుశః కేసీఆర్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆయనను కలిసి ఉండవచ్చును.   నిజానికి కేసీఆర్ తను ముఖ్యమంత్రి అయితే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నించి చదును చేస్తానని ఒకప్పుడు శపథం చేసారు. కానీ అదే కేసీఆర్ ఇప్పుడు స్వయంగా మంత్రులను వెంటేసుకొని రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్ళారు? వెళ్లి ఆయనతో ఏమి రహస్య మంతనాలు చేసారు? ఆనక రామోజీ రావును, ఆయన కట్టిన ఫిలింసిటీని, త్వరలో కట్టబోయే ఓం సిటీని ఎందుకు పొగిడారు? వారి సమావేశ పర్యవసానాలు ఏ నూతన రాజకీయ పరిణామాలకి దారి తీయబోతున్నాయి? అని ప్రజలందరూ ఆలోచించడం సహజమే. కానీ ప్రజలందరికంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఆందోళన చెందడం సహజం.   ఎందువలన అంటే జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకు, రామోజీరావుకు చెందిన ఈనాడు మీడియాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి అందరికీ తెలుసు. కారణాలు కూడా అందరికీ తెలిసినవే. అటువంటి తన బద్ధ శత్రువు దగ్గరకు తన మిత్రుడు కేసీఆర్ వెళ్లి సమావేశంకావడం, తరువాత ఆయనను పొగడటాన్ని జీర్ణించుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమే. ఒకవేళ రామోజీరావు మధ్యవర్తిత్వంతో కేసీఆర్, చంద్రబాబు నాయుడు మళ్ళీ దగ్గరయితే అప్పుడు తన పరిస్థితి ఏమిటని జగన్మోహన్ రెడ్డి మధనపడుతుండవచ్చును. అదే జరిగితే, ఇప్పటికే రెండు రాష్ట్రాల రాజకీయాలలో, మీడియాలో ఒంటరయిపోయిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు పూర్తిగా ఒంటరివారయిపోతారు. అప్పుడు ఎటు చూసినా శత్రువులే తప్ప మిత్రుడనే వాడు ఒక్కడు కూడా కనబడడు. అందువలన జగన్ ఆందోళన చెందడంలో అసహజమేమీ లేదు. అయితే ఆయన ఇంతవరకు బయటపడలేదు. కానీ నేడు కాకపోతే రేపయినా అందరూ బయటపడక తప్పదు.   ఏమయినప్పటికీ వారిరువురి సమావేశం వలన రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భేదాభిప్రాయాలు తొలగించుకొనే ప్రయత్నాలు మొదలయ్యి, ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొనేందుకు సిద్దపడితే, దాని వలన రెండు రాష్ట్రాలకు, ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. రెండు రాష్ట్రాలలో కూడా అభివృద్ధి జోరందుకొంటుంది. కనుక జగన్ ఆందోళన గురించి పట్టించుకొనవసరం లేదు.

పాక్ నేర్పుతున్న గుణపాఠం

  భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి నేటి వరకూ కూడా అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ మనుగడ కోసం భారతదేశాన్ని బూచిగా చూపిస్తూ రోజులు నెట్టుకొచ్చేయి తప్ప భారత్ తో పోటీపడి దేశాన్ని అభివృద్ధి చేసుకొందామనే ఆలోచనా, ప్రయత్నం ఏ నాయకుడూ చేయలేదు. ఆ కారణంగా ఆ దేశంలో నిరుద్యోగం, దారిద్ర్యం, అవినీతి ఇత్యాది సమస్యలన్నీ పెరుగుతూ వచ్చేయి. వాటి నివారణ కోసం ప్రయత్నించవలసిన ప్రభుత్వాలు, వాటి నుండి వారి దృష్టి మరల్చడానికి భారత్ పట్ల ప్రజలలో విద్వేషాన్ని పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసాయి. ఆ ప్రయత్నాలలో నుండే మత ఛాందసవాదం కూడా క్రమంగా బలపడింది.   నానాటికీ బలపడుతున్న భారత్ వల్ల పాకిస్తాన్ కు చాల ప్రమాదం పొంచి ఉందనే అభద్రతా భావన పాక్ ప్రజలలో పెంచడం ద్వారానే అక్కడి ప్రభుత్వాలు మనుగడ సాగిస్తుంటాయి. అందుకే అక్కడి ప్రభుత్వాలు తమ ప్రజలలో ఆ అభద్రతాభావం పెంచిపోషించేందుకు అప్పుడప్పుడు భారత్ పై దాడులు చేస్తుంటాయి. అందుకోసం ఉగ్రవాదాన్ని కూడా పెంచిపోషించవలసి వచ్చింది.   మత ఛాందసవాదులయిన కొందరు అధికార ప్రతిపక్ష నేతలు, సైనికాధికారులు ఆ ఉగ్రవాదానికి ఎప్పటికప్పుడు నారునీరు పోస్తూ బాగా బలపడేందుకు యధాశక్తిగా కృషి చేసారు. జడలు విప్పిన ఆ ఉగ్రభూతమే నేడు అభం శుభం తెలియని 160 విద్యార్ధుల ప్రాణాలను బలిగొంది. అందుకు పాకిస్తాన్ ప్రజలే కాదు భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాలు కూడా చాలా బాధపడుతున్నాయి. విద్వేషాన్ని పెంచి పోషిస్తే దాని దుష్పరిమాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్ధం చేసుకోవడానికి ఇదొక సజీవ ఉదారణ.   రాష్ట్రాలను దేశాలను ఏలుతున్న ప్రభుత్వాలు, వాటిని నడిపిస్తున్న రాజకీయ పార్టీలు, వాటిని నడిపిస్తున్న స్వార్ధ రాజకీయ నేతలు ప్రజలలో విద్వేష భావనలు వ్యాపింపజేసి తాము లాభపడవచ్చని ప్రయత్నిస్తే వాటి ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.   వేల సం.ల చరిత్రకల భారతదేశం ఏనాడూ కూడా ఇతర దేశాల మీద యుద్దాలకు వెళ్ళలేదు. కానీ తమపై దురాక్రమణలు చేసిన వారిని కూడా తనలో ఐక్యం చేసుకోగలిగింది. అందుకే అదొక అద్భుత ప్రపంచంగా అందరినీ ఆకట్టుకొంటోంది. భారత్ అంటే వంద కోట్ల జనాభా మాత్రమే కాదు. అనేక కులాలు, మతాలు, బాషలు, సంస్కృతుల విశిష్ట సమ్మేళనం. యావత్ ప్రపంచం ఒక ఎత్తయితే భారత్ ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పవచ్చును. వంద కోట్ల మంది ప్రజలలో కనిపించే ఆ పరమత సహనం, శాంతి కాముకతే ఇంత కాలం భారత్ కు శ్రీరామరక్షగా కాపాడుతోంది. అందుకే ఇంత సుస్థిరంగా నిలువగలిగింది. అందుకే క్రమంగా అభివృద్ధి చెందగలుగుతోంది.   అయితే ఇప్పుడు భారత దేశంలో కూడా స్వార్ధ పరులయిన కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నేతలు తమ మనుగడ కోసం ప్రాంతీయ వాదం, మత తత్వవాదం, కులతత్వం వంటి అంటురోగాలను వ్యాపింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఇటువంటి విద్వేష భావనలు, కుల, మత ఛాందసవాదం, బాషా, ప్రాంతీయవాదం వంటి అంటురోగాలను వ్యాపింపజేసే వారిని ప్రజలు దూరం పెట్టడం చాలా అవసరం. లేకుంటే ఇటువంటి దుష్పరిమాణాలే ఎదుర్కోవలసి వస్తుందని మరిచిపోకూడదు.

అన్నీ నీటి మీద రాతలేనా?

  తెలంగాణా రాష్ట్రం ఇస్తే తెరాసను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సోనియాగాంధీకి హామీ ఇచ్చారు. కానీ హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీకే ఆయన హ్యండిచ్చారు. చివరికి తెలంగాణా ఇచ్చిన ఖ్యాతి కూడా ఆమెకు దక్కకుండా చేసారు. అంతే కాదు తెలంగాణా ఇస్తే బొంత పురుగునయినా ముద్దాడేందుకు సిద్దమని చెప్పిన కేసీఆర్, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మట్టి కరిపించారు. కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు కూడా ఆయన ధాటికి ఎదురు నిలవలేకపోవడం విచిత్రం.   తెలంగాణా ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి తన ఉద్యమానికి దళితుల మద్దతు పొందిన కేసీఆర్, కుంటి సాకులతో ఆ హామీని తీసి పక్కన పడేసి తనే స్వయంగా ముఖ్యమంత్రి సింహాసనంలో సెటిల్ అయిపోయారు.   తెలంగాణా ఉద్యమంలో దాదాపు 1200 మంది యువకులు బలిదానాలు చేసుకొన్నారని, తాము అధికారంలోకి రాగానే వారందరి కుటుంబాలను అదుకొంటామని చెప్పిన ఆయన, అధికారం చేప్పట్టిన తరువాత కేవలం 459మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబాలకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించారు. అంటే అప్పుడు ఆయన చెప్పిన లెక్కలు ప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు చెప్పిన తప్పుడు లెక్కలా లేకపోతే మిగిలిన అమరవీరులను గుర్తించడానికి ఆయన ప్రభుత్వం సిద్దపడటం లేదా? అనేది ఆయనే చెప్పాలి.   అటువంటప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదు? అనే ప్రశ్నకు పాపం ఆయనే జవాబు చెప్పుకొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తనను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోదనే విషయం ఉద్యమ సమయంలోనే తనకు తెలుసునని, తన భవిష్యత్ ఏమిటో తనకు అప్పుడే అర్ధమయిందని ఆయన చెప్పడం గమనిస్తే, తెరాస పార్టీ, తెలంగాణా ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఏపాటి విలువిస్తున్నారో అర్ధమవుతుంది.   తెలంగాణా రాష్ట్రం ఏర్పడటమే తరువాయి రాష్ట్రం నలుమూలలా నాలుగు స్థంభాలు నాటేసి విద్యుత్ సంక్షోభాన్ని తుడిచి పెట్టేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మరో మూడేళ్ళు ఆగాలని తాపీగా చెపుతున్నారు. ఆగినట్లయితే కంటి రెప్ప మూసేంత సేపు కూడా విద్యుత్ పోకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తానని మళ్ళీ మరో కొత్త ప్రామిస్ చేస్తున్నారు. అయితే అందుకు ఆయన గట్టిగా ఏమయినా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అటువంటిదేమీ కనబడటం లేదు. అంటే ఈ ప్రామిస్ కూడా ఆయన మిస్ అయ్యే అవకాశాలే ఉన్నట్లు కనబడుతున్నాయి.   ఇక చైనా పాకిస్తాన్ దేశాలతో నదులను పంచుకోగా లేనిదీ ఇంతవరకు కలిసి మెలిసి ఉన్న ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదీ జలాలను, విద్యుత్ ని పంచుకోలేవా? అని విభజనను వ్యతిరేకించిన సమైక్యవాదులను గట్టిగా నిలదీసిన కేసీఆర్, ఇప్పుడు సుప్రీం కోర్టులకి వెళుతున్నారు.   తెలుగు ప్రజలు రాష్ట్రాలవారిగా రెండుగా విడిపోయినా అన్నదమ్ములలాగే కలిసిమెలిసి ఉండగలరు అని చెప్పిన ఆయనే మీ విద్యార్ధులు వేరు మా విద్యార్ధులు వేరు అంటూ ఫాస్ట్ పధకం తీసుకువచ్చి హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొంటున్నారు. కనీసం ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇక నీళ్ళు, విద్యుత్ పంచుకోవడం సరేసరి.   ఇరుగుపొరుగు రాష్ట్రాలు, పార్టీల సంగతి పక్కన బెట్టవచ్చును. కానీ ఇంతకాలం ఆయనతో కలిసి తెలంగాణా కోసం ఉద్యమాలు చేసిన స్వంత పార్టీ నేతలని, ఉద్యమనేతలని కూడా ఆయన పక్కనబెట్టి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుండి వచ్చిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టడం ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమంటే “ఇప్పుడు మాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకొన్నాము కదా అందుకే ఆ పాత రూల్స్ వర్తించవని” తెగేసి చెప్పగలగడం కూడా గొప్పే.   ఈవిధంగా చెప్పిన మాటలను, చేసిన బాసలను, అండగా నిలిచినా వారినీ అందరినీ పక్కన పడేస్తూ, మళ్ళీ సరికొత్త హామీలు చేస్తూ, సరికొత్తవారితో జత కడుతూ కేసీఆర్ గాలిమేడలు (ఆకాశ హర్మ్యాలు) కడుతూ ముందుకు సాగుతున్నారు. ఆ ప్రయత్నంలో తెలంగాణా ప్రజలకు రంగురంగుల కలల ప్రపంచం చూపిస్తున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తుంటే తన, తన పార్టీ, ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బ తిట్టుందనే సంగతి మరి ఆయన గ్రహించారో లేదో తెలియదు కానీ విశ్వసనీయతకు మారు పేరని చెప్పుకొనే ఆంధ్రా పార్టీ ఇప్పుడు తెలంగాణాలోకి అడుగుపెడుతుంటే, మౌనం వహించడం గమనిస్తే మున్ముందు ఆ రెండు పార్టీలు జత కడతాయేమోనని అనుమానించవలసి వస్తోంది.   కేసీఆర్ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళినప్పటికీ, ఎవరిని చంక నెక్కించుకొని, ఎవరిని పక్కనపడేసి నప్పటికీ, మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో కోటి రతనాల వీణ తెలంగాణాని బంగారి తెలంగాణాగా మార్చి చూపగలిగితే పరువలేదు. లేకుంటే ఆయనపై నమ్మకం పెట్టుకొన్నందుకు తెలంగాణా ప్రజలే ఎక్కువ బాధ పడతారు. ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో తెలంగాణా అభివృద్ధి చెందలేదని బాధ పడినవారు, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ తమ జీవితాలలో ఎటువంటి మార్పు కనబడకపోతే నిరాశ చెందడం తధ్యం. అప్పుడు కేసీఆర్ ఏ సెంటిమెంటు ప్రయోగించినా ఫలితం ఉండకపోవచ్చును.

ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా..

  రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని కోరుతూ ఉద్యమిస్తే, వైకాపా అసలు రాష్ట్రవిభజన జరపడానికే వీలులేదని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసింది. ఆనాడు వైకాపా చేప్పట్టిన ఉద్యమం ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగినట్లు కనిపిస్తే, తెదేపా రాష్ట్ర విభజన కోరుకొంటున్నట్లుగా కనబడేది. కానీ నిజానికి తెదేపాయే రాష్ట్రం కలుసుండాలని మనస్పూర్తిగా కోరుకొంటే, వైకాపా రాష్ట్రం విడిపోవడం వలననే ఆంధ్రాలో తను అధికారం సంపాదించగలనని భావించిన సంగతి పెద్ద రహస్యమేమీ కాదు.   రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి గ్రహించినందునే తెదేపా వాస్తవిక దృక్పధంతో రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని కోరింది. ఇదంతా వైకాపాకు కూడా తెలుసు. కానీ తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను దెబ్బతీయడాని కోసం, తాము రాష్ట్రం విడిపోకుండా ఉద్యమిస్తుంటే, తెదేపా రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటోందని ప్రచారం చేసుకొంది. ఒకవేళ వైకాపా నిజంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకొని ఉండి ఉంటే, రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణాను విడిచి పెట్టి బయటకువచ్చేసేదే కాదు. ఎలాగూ రాష్ట్రం విడిపోతోంది కనుక ఆంధ్రాలో అధికారం చేజిక్కించుకోవాలంటే, రెండు రాష్ట్రాలకు సమ న్యాయం అనడం కంటే ప్రజల అభీష్టానికి అనుగుణంగా నలుగురితో నారాయణ అనడమే మంచిదనే ఉద్దేశ్యంతోనే వైకాపా సమైక్య ఉద్యమాలు చేసినమాట వాస్తవం. ఆ సమయంలో తెదేపా దాని అధినేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమయిన ఒత్తిడి ఎదుర్కొని ఉండవచ్చును. కానీ ఆయన తుదివరకు కూడా తన నిర్ణయానికే కట్టుబడి ఉంటూ రెండు రాష్ట్రాలలో తన పార్టీని కాపాడుకోగలిగారు. బహుశః ఆయన కనబరిచిన ఆ స్థిత ప్రజ్ఞతే ప్రజలను ఆకట్టుకోందని చెప్పవచ్చును.   నిజానికి రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతి ఆంద్ర ప్రజలకు కూడా తెలియదనుకోలేము. కానీ విభజన జరిగితే రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందోననే తీవ్ర ఆందోళన, అంతకాలం ఒక్కటిగా ఉన్న తెలుగుజాతి విడిపోతోందనే ఆవేదన, ఇంకా అనేక ఇతర కారణాల చేత ప్రజలు ఉద్యమించారు. వారి ఆ ఆవేదనని, ఆవేశాన్ని తనకు అనుకూలంగా మలుచుకొనేందుకు వైకాపా సమైక్యఉద్యమాలు చేసింది. ఉద్యమ సమయంలో ఆ రెండు పార్టీల వైఖరిని వాటి వెనుక వారి అంతర్యాన్ని ప్రజలు బాగానే అంచనా వేయగలిగారు. అందుకే చిత్తశుద్ధి లేని ఉద్యమాలు చేసిన వైకాపాను ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారు. చేదునిజాలు మాట్లాడిన తెదేపాకు పట్టం కట్టారు.   ఆ తరువాతయినా వైకాపా తన తీరు మార్చుకోలేదని ఆ పార్టీ తీరు గమనిస్తే అర్ధమవుతుంది. అధికారం చేజిక్కించుకోలేక ఆ దుగ్ధతో ప్రభుత్వం చేప్పట్టే ప్రతీ పనికి అడ్డుతగులుతోంది. రాజధాని లేకపోవడం అవమానకరమనే ఆలోచన కూడా లేకుండా రాజధాని నిర్మాణానికి అడుగడునా అడ్డుతగులుతోంది. తీవ్ర ఆర్ధిక సమస్యలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పెంచి ఇస్తూ, పంట రుణాలను మాఫీ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్ట పాలుచేసేందుకు, పనిలోపనిగా తన పార్టీ ఉనికిని కాపాడుకొంటూ, తన ఉనికిని చాటుకొనేందుకు వైకాపా అధినేత జగన్ ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు.   అదేవిధంగా తెలంగాణాను విడిచిపెట్టి వచ్చేయడం చాలా పెద్ద పొరపాటనే విషయం గ్రహించిన తరువాత ఇప్పుడు పరామర్శ యాత్రల పేరుతో మళ్ళీ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల..చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా...అన్నట్లుగా చిత్తశుద్ధిలేని ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీకి ఒరిగేదేమీ ఉండబోదు. పైగా అటువంటి ప్రయత్నాల వలన ఆ పార్టీ గొప్పగా చెప్పుకొంటున్న ‘విశ్వసనీయత’ కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పవచ్చును.  

చంద్రబాబు, కేసీఆర్ దారులు వేరు గానీ లక్ష్యం ఒక్కటే

  ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకు చూస్తుండగానే అప్పుడే ఆరు నెలలు నిండాయి. రెండు రాష్ట్రాలకు వేటికవే ప్రత్యేకమయిన సమస్యలు. ఇరువురు ముఖ్యమంత్రులకు విభిన్నమయిన ఆలోచనలు, ఆశయాలు, అభిరుచులు, ప్రణాళికలు. కానీ ఇద్దరు పటించే మంత్రం మాత్రం ఒక్కటే. అభివృద్ధి. ఈ ఆరు నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి ఏమి సాధించారు? ఏ రాష్ట్రం ఏ దిశలో అడుగులు వేసింది. వేస్తోంది...అని చూస్తే చాలా ఆసక్తికరమయిన విషయాలు కనబడతాయి.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వడ్డించిన విస్తరి వంటి రాష్ట్రం దొరకగా, చంద్రబాబుకి కనీసం విస్తరి కూడా లేని పరిస్థితి. కేసీఆర్ అక్షయపాత్ర వంటి హైదరాబాద్ నగరం దక్కితే, చంద్రబాబుకి కనీసం కార్యాలయం కూడా లేని వింత పరిస్థితి. కేసీఆర్ కి మిగులు బడ్జెట్ తో రాష్ట్రం చేతికి అందివస్తే, చంద్రబాబుకి లోటు బడ్జెట్ తో ప్రభుత్వ పగ్గాలు అందుకొన్నారు. అయితే వారు పగ్గాలు చెప్పట్టేనాటికి రెండు రాష్ట్రాలలో కూడా విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. దాని నుండి ఆంధ్రప్రదేశ్ బయటపడగలిగింది కానీ ఇంతవరకు కూడా తెలంగాణా మాత్రం బయటపడలేకపోయింది.   గత రెండు మూడు దశాబ్దాలుగా అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగింది కనుక అక్కడ పరిశ్రమలు, ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ చక్కగా అమరి ఉన్నాయి. కానీ విభజన తరువాత చూసుకొంటే ఒక్క విశాఖలో తప్ప ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదనే చేదు నిజం బయటపడింది. కానీ తెలంగాణతో పోల్చి చూస్తే ఆంధ్రాలో వ్యవసాయరంగం చాలా బలంగా ఉంది. కారణం నీటి సౌకర్యం, విస్తారంగా సారవంతమయిన భూములు ఉండటమే.   అందువలన తెలంగాణాకు ఇప్పుడు వ్యవసాయం ప్రాధాన్యమయితే, ఆంధ్రాకు పారిశ్రామిక అభివృద్ధి ప్రాధాన్యంగా మారింది. అందుకే ముఖ్యమంత్రుల ప్రాధాన్యతలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కుదుటపరిచేందుకు గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ, వాటర్ గ్రిడ్ ల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. ఇంతవరకు తెలంగాణాలో వ్యవసాయం బోరు బావుల మీదే ప్రధానంగా ఆధారపడి సాగేది. అందువలన విద్యుత్ పరిస్థితిని మెరుగుపరిచేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేసారు. కానీ పూర్తి శ్రద్ద కనబరచినట్లు లేదు. బహుశః ఈ చెరువుల పునరుద్దరణ జరిగితే, వ్యవసాయం కోసం విద్యుత్ పై ఇంతగా ఆధారపడే పరిస్థితి ఉండబోదు కనుక అప్పుడు విద్యుత్ పరిస్థితి కూడా దానంతట అదే మెరుగు పడుతుందనే నమ్మకం కావచ్చును.   కేసీఆర్ ప్రధానంగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలు, బాషల పునరుద్దరణపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. తద్వారా ప్రజలలో మరింత బలంగా తెలంగాణా భావన కలిగించి తన పార్టీని ప్రజలకు మరింత దగ్గిరకి చేర్చే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇక తెలంగాణాలో అత్యధికం శాతం బీసీ, యస్సీ, యస్టీ జనాభే ఉన్నారు గనుక వారికి దగ్గరయ్యేందుకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన అంతర్యం ఏమయినప్పటికీ ఆయన ప్రకటించిన సంక్షేమ పధకాల ఫలాలు వారికి దక్కినట్లయితే తప్పకుండా తెలంగాణాలో సామాజిక విప్లవం వస్తుంది.   ఇక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చాలా మంచి ఆలోచనే కానీ దాని చుట్టూ వంద అంతస్తుల భవనాలు ఇంత అర్జెంటుగా ఎందుకు నిర్మించాలనుకొంటున్నారో ఆయనకే తెలియాలి. రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, తను స్వయంగా ప్రకటించిన రుణాల మాఫీ, పెన్షన్లు, పలు సంక్షేమ కార్యక్రమాలు, మొదలుపెడుతున్న వివిధ ప్రాజెక్టులు వంటివాటిని పరిష్కరించకుండా హైదరాబాద్ నగరానికి మరింత గొప్ప పేరు రావాలనే కారణంతో ఇటువంటి అనవసర పనులను తలకెత్తుకోవడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధీటుగా తను కూడా నగరాన్ని అభివృద్ధి చేసానని చెప్పుకోవాలనే కాంక్షతోనే బహుశః కేసీఆర్ ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారేమో?   ఇక ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులలో కూడా తన లక్ష్యాన్ని మరువకుండా చకచకా ముందుకు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం యొక్క ప్రాధాన్యతలు విద్యుత్ స్వయం సంవృద్ది, పరిశ్రమల స్థాపన, తద్వారా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరచడం, రాజధాని నిర్మాణం. వీటన్నిటిపై ఆయన ఏవిధంగా అడుగులు వేస్తున్నారో స్వయంగా ప్రజలే చూస్తున్నారు.   రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన తన హామీని నిలబెట్టుకొంటూ పంట రుణాల మాఫీ చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్లు కూడా అందజేస్తున్నారు. వ్యవసాయం, సంక్షేమ పధకాల అమలు, ఐటీ మరియు మౌలిక వసతుల రంగాల అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారు. బహుశః త్వరలోనే ఆ రంగాలలో కూడా త్వరలోనే అభివృద్ధి కనబడవచ్చును. ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న ఈ ఆరోగ్యకరమయిన పోటీని ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ ఐదేళ్ళలో ఇరువురు ముఖ్యమంత్రులు ఈవిధంగా పోటీపడుతూ తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసి చూపించగలిగితే, ప్రజలు కూడా మళ్ళీ వారికే పట్టం కడతారు.

చంద్రబాబు ఆరు నెలల పాలన ఎలా సాగిందంటే...

  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల పాలనలో ఆయన నేతృత్వంలో ప్రభుత్వం చాలా చురుకుగా అడుగులు వేసిందని చెప్పవచ్చును. అధికారం చేప్పట్టిన మూడు నెలలలోనే రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న విద్యుత్ సంక్షోభ సమస్యను పరిష్కరించగలిగారు. మున్ముందు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ సరఫరాకు అవసరమయిన అనేక ఒప్పందాలు చేసుకొన్నారు. హీరో మోటార్స్, కృషబ్ కో వంటి భారీ పరిశ్రమలను, అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్రంలో పెట్టేందుకు ఒప్పించగలిగారు. అవన్నీ నిర్మాణాలు పూర్తి చేసుకొని కార్యకలాపాలు మొదలుపెడితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిలో గణనీయమయిన మార్పు కనబడుతుంది.   కానీ చంద్రబాబు నాయుడు అధికారం చేప్పట్టగానే మొట్ట మొదటగా ఐటీ సంస్థలే రాష్ట్రానికి పరుగులు పెడుతూ వస్తాయని అందరూ ఊహించినప్పటికీ ఇంతవరకు ఐటీ సంస్థలేవీ పెద్దగా రాష్ట్రానికి తరలిరాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అందువలన ప్రభుత్వం ప్రకటించిన ఐటీ విధానాన్ని ఒకసారి సమీక్షించుకోవడం మంచిదేమో? బంగారు బాతులవంటి ఐటీ సంస్థలను, పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు, కేవలం ముఖ్యమంత్రే కాకుండా రాష్ట్రంలో మంత్రులు, యంపీలు, యం.యల్.ఏలు, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు అందరూ కూడా పార్టీలకతీతంగా తమ తమ పరిధిలో కృషి చేస్తే బాగుంటుంది.   ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న రాజధాని నిర్మాణం విషయంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినప్పటికీ, నిరాశ చెందకుండా చాలా చురుకుగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని ప్రజలందరూ ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేప్పట్టబోతోందో చర్చించుకొంటున్నారు తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి మాత్రం కాదు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో, చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నందునేనని చెప్పవచ్చును.   చంద్రబాబు నాయుడు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి పెన్షన్ పెంచారు. అదేవిధంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ పంట రుణాల మాఫీ హామీని కూడా అమలు చేస్తున్నారు. తీవ్ర ఆర్ధిక సమస్యల మధ్య అధికారం చేప్పట్టిన చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయం కానీ, రిజర్వు బ్యాంక్ సహాయం గానీ అందకపోయినా, హూద్ హూద్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ యధావిధిగా పెంచిన పెన్షన్లను అందజేస్తుండటం, ప్రభుత్వోద్యోగులకు ఈనెలకానెల టంచనుగా జీతాలు చెల్లిస్తుండటం, వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తుండటం గమనిస్తే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఊహించిన దానికంటే త్వరగానే మెరుగయినట్లు అర్ధమవుతోంది.   రాష్ట్ర విభజనకు ముందు, ఆ తరువాత పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు ఒకసారి బేరీజు వేసి చూసుకొంటే చాలా స్పష్టమయిన తేడా కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఇంత సానుకూల మార్పు కనబడటానికి కారణం ప్రభుత్వ సమర్ధత దానిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్య దక్షతలేనని చెప్పక తప్పదు. అయితే, సమస్యలను అధిగమించేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం కొంత అశ్రద్ధ కనబరుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు గనుక పెద్దగా ప్రచారం చేసుకోకపోయినా, ప్రభుత్వ సమర్ధత పట్ల పూర్తి నమ్మకంతోనే ఉన్నారు.   ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి ఒక్కరే అన్నట్లు కాకుండా మిగిలిన మంత్రులు అందరూ కూడా తమ సమర్ధతను నిరూపించుకొనే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మరింత ప్రజాధారణ దక్కేది. ఒకవేళ పొరుగు రాష్ట్రమయిన తెలంగాణా సహకారం, కేంద్ర సహకారం కూడా దక్కి ఉండి ఉంటే పరిస్థితి మరింకా ఏవిధంగా ఉండేదో?   ఇదివరకు కేంద్రం అధికారంలో ఉన్న యూపీఏ కూటమి రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి కూడా ఆ హామీలన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేస్తానంది. కానీ ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది. రాష్ట్రానికి ఏమి చేసినా చేయకపోయినా కనీసం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి కొంత సహాయ సహకారాలు అందిస్తే వాటి ద్వారా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడే చక్కబెట్టేయగల సమర్ధుడు.   ఆయన వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలవాలని తపిస్తున్నారు కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి తన సత్తా ఏమిటో రాష్ట్ర ప్రజలకు నిరూపించి చూపేందుకు ఎంతయినా కష్టపడతారని నమ్మవచ్చును. ఆయనను ఆదర్శంగా తీసుకొని మిగిలిన మంత్రులు అందరూ కూడా చురుకుగా, గట్టిగా సమిష్టి కృషి చేసినట్లయితే అది వారికి, పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు రాష్ట్రానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది.

ఈ రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది

  శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సే ఈరోజు తెల్లవారు జామున తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీలంకకు పెను సమస్యగా మారిన యల్.టీ.టీ.ఇ.ని దాని అధినేత అధ్యక్షుడు ప్రభాకరన్ న్ని అంతం చేసే ప్రయత్నంలో కొన్నేళ్ళ క్రితం జరిగిన మిలటరీ ఆపరేషన్ లో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వేలాది అమాయకులయిన తమిళ ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపించారని ఆయనపై తమిళ ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ కారణంగానే ఆయన మన దేశంలో అడుగుపెట్టిన ప్రతీసారి వారు నిరసనలు తెలపడం పరిపాటయింది. ఆయన మన దేశంలోనే అడుగుపెట్టడానికి ఇష్టపడని తమిళులకు, ఆయన తరచూ తిరుమల వస్తుండటం, అందుకోసం మొదట తమ రాష్ట్ర రాజధాని చెన్నై (విమానాశ్రయం) లోనే అడుగుపెడుతుండటం, అక్కడి నుండే ఆయన తిరుపతికి వెళుతుండటం, అయినప్పటికీ ఆయనను అడ్డుకోలేని తమ నిస్సహాయత కారణంగా సహజంగానే వారికి మరింత ఆవేశం, ఆగ్రహం కలిగిస్తోంది. వారి ఆ ఆవేశం, ఆవేదనను అర్ధం చేసుకోవచ్చును.   అయితే దాదాపు మూడున్నర దశాబ్దాలుగా శ్రీలంక దేశ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చివేసిన యల్.టీ.టీ.ఇ.ని దాని అధినేత అధ్యక్షుడు ప్రభాకరన్ న్ని, ఉపేక్షించాలని ఆశించడం కూడా తప్పే. పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ తీవ్రవాదులు పేట్రేగిపోయినప్పుడు భారత ప్రభుత్వం కూడా సిక్కుల పరమ పవిత్ర పుణ్య స్థలంగా పేరొందిన అమ్రిత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలోకి మిలటరీ దళాలను పంపించి వారిని నిర్దాక్షిణ్యంగా తుడిచి పెట్టేసింది. శ్రీలంక దేశ అధ్యక్షుడుగా ఉన్న రాజపక్సే కూడా యల్.టీ.టీ.ఇ. నుండి తన దేశాన్ని కాపాడుకొనేందుకు అదేవిధంగా వ్యవహరించారు. ఆయనకు అంతకంటే ప్రత్యామ్నాయం లేదు. అయితే ఆ ప్రయత్నంలో వేలాది మహిళలు , చిన్నారులు, వృద్ధులను కూడా పొట్టన పెట్టుకోవడాన్ని భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాలు ముక్తకంటంతో ఖండించాయి.   కానీ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, చైనా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్, రష్యా వంటి ఏదో ఒక దేశంలో ఇటువంటి విచ్చినకర శక్తులు తలలెత్తిన ప్రతీసారి ఆయా దేశాలు ఇంచుమించు ఇదేవిధంగా ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కష్టం ఏమిటో అనుభవించిన దేశాలకే అర్ధం అవుతుంది కనుక వారు కూడా ఇటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించడంతో సరిపెట్టేస్తూ, ఆయా దేశాలతో యధాతధంగా సంబంధాలు నెరపక తప్పనిసరి పరిస్థితి.   ఆకారణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సార్లు తమ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ నియమ నిబంధనలకు, అవసరాలను ద్రష్టిలో ఉంచుకొని దేశానికి విచ్చేసే విదేశాల అధినేతలకు, ప్రతినిధులకు సముచిత మర్యాదలు, సౌకర్యాలు కల్పించవలసి వస్తుంది. అందుకోసం ఒక్కోసారి స్వంత ప్రజల అభీష్టానికి విరుద్దంగా వ్యవహరించవలసి రావచ్చును. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే విషయంలో కూడా ఇదే జరుగుతోంది.   ఆయన ప్రతీ ఏట తిరుమల శ్రీవారిని దర్శించుకొంటుంటారు. అందుకే ఈరోజు తిరుమలకు చేరుకొన్నారు. ఊహించినట్లుగానే ఆయన కోసం భారీ భద్రత ఏర్పాటు చేయవలసి వచ్చింది. తమిళ పార్టీలకు చెందిన కొందరు ఆయనను అడ్డుకొనేందుకు తిరుపతి చేరుకొన్నారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయన రాకతో సాధారణ భక్తులకు కూడా తీవ్ర ఇబ్బంది కలగడం కూడా సహజమే. ఆ కారణంగా వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడమూ సహజమే.   ఆయనకు ఈ అంశం మీద భారత ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేక పోవచ్చు. కానీ తన అభ్యంతరాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా చైనా దేశానికి చెందిన అణు జలాంతర్గాములను శ్రీలంకలో ‘పార్కింగ్’ చేసుకోవడానికి అనుమతించినందున, ఆ దేశంతో కటినంగా వ్యవహరించవచ్చును. కానీ ఆవిధంగా చేస్తే శ్రీలంక చైనాకు మరింత చేరువవుతుందనే ఆలోచనతోనే భారత ప్రభుత్వం కొంత ఉదాసీనత చూపక తప్పడంలేదనుకోవలసి ఉంటుంది.   ఏది ఏమయినప్పటికీ, రాజపక్సే రాక వలన ఏర్పడుతున్న అనివార్యమయిన ఈ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఎవరూ తప్పించుకోలేరని అంగీకరించక తప్పదు.

రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తధ్యం

  పంట రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ రెండూ కూడా రైతుల మనోభావాలతో ముడిపడున్న చాలా సున్నితమయిన అంశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి వాటిపై కూడా తనదయిన శైలిలో రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని విశ్వప్రయత్నాలు చేసారు. చంద్రబాబు, అయన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందు నుండే పంట రుణాల మాఫీ అంశంపై వైకాపా రభస చేయడం మొదలుపెట్టింది. అదేవిధంగా ఆయన విజయవాడ వద్ద రాజధాని నిర్మించాలనుకొంటున్నట్లు సూచన ప్రాయంగా చెప్పినప్పటి నుండే వైకాపా దానిని వివాదాస్పదం చేసేందుకు ఏమేమి చేసిందో ప్రజలందరూ చూసారు.   అయితే ఇంతకంటే పెద్ద సవాళ్ళనే ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఈ సవాళ్ళను కూడా ధీటుగా ఎదుర్కొని చూపారు. రాజధాని, పంట రుణాల మాఫీ అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రజలలో అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయనే సంగతిని గ్రహించిన చంద్రబాబు కూడా ఎక్కడా పొరపాట్లు దొర్లకుండా ఉండేందుకు, ఈ రెండు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి, అన్ని వివరాలు సేకరించి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగడం వలన మబ్బులు విడిపోయినట్లు ఈ రెండు సమస్యలు కూడా క్రమంగా పరిష్కారింపబడుతున్నాయి.   పంట రుణాల మాఫీపై వైకాపా నానాయాగీ చేసింది. కానీ దానికి ఒక్క వైజాగులో తప్ప రాష్ట్రంలో మరెక్కడా కూడా వైకాపా చేసిన ధర్నాలకు రైతులు, ప్రజల నుండి పెద్దగా స్పందన కనబడకపోవడం గమనిస్తే ప్రజాభిప్రాయం ఏమిటో స్పష్టం అవుతోంది. కానీ అదే సమయంలో రుణ మాఫీ చేసినందుకు రైతుల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై అల్లరిచేసి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీద్దామనుకొన్న వైకాపా తనే ప్రజలలో మరింత చులకన అయ్యింది.   రాజధాని భూముల విషయంలో కూడా మళ్ళీ అదే జరిగింది. ఏదోవిధంగా రైతులను రెచ్చగొట్టి రాజధాని నిర్మాణానికి వారు తమ భూములు ఇవ్వకుండా అడ్డుపడి వారితో కలిసి ఉద్యమించి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని దురాలోచన చేసిన వైకాపాకు అక్కడా నిరాశే ఎదురయింది. ఆపార్టీ చేస్తున్న రాజకీయాలు గమనించగానే చంద్రబాబు నాయుడు కూడా ఒకవైపు దానిని రాజకీయంగా ఎదుర్కొంటూనే, మరోవైపు రైతులు తృప్తి పడేవిధంగా భూసేకరణ విధి విధానాలను రూపొందించి దానిని వారి ముందుంచి ఆయనే నేరుగా వారితో మాట్లాడి ఒప్పించడంతో ఈ సమస్య కూడా క్రమంగా పరిష్కారమవుతోంది. మొదట తూళ్ళూరు మండలంలో రైతులు చాలా ఆందోళన చెందినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన విధివిధానాలను చూసిన తరువాత ఇప్పుడు వారు కూడా రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటమే చంద్రబాబు నాయుడి కార్యదీక్షకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.   ఊహించని ఈ పరిణామాలు వైకాపాకు చెంపపెట్టువంటివేనని చెప్పక తప్పదు. నిజానికి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న రాజధాని నిర్మాణం, పంట రుణాల మాఫీలకు అడ్డుపడగలిగినట్లయితే, ఆయనను, తద్వారా ఆయన పార్టీని రాజకీయంగా చావు దెబ్బ తీయవచ్చని వైకాపా ఆలోచన అయ్యి ఉండవచ్చును. అందుకే అది అంత యాగీ చేసింది. ఇంకా చేస్తుంది కూడా. బహుశః అందువల్లనేనేమో, ఈ రెండు అంశాలు పరిష్కారం కావడం వైకాపాకు ఇష్టం లేనట్లుందని మంత్రులు కూడా అంటున్నారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగబోతున్నాయి కనుక అక్కడ కూడా వైకాపా ఇదే అంశాలను లేవనెత్తి రాద్దాంతం చేసే ప్రయత్నం చేయవచ్చును.   ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అప్రతిష్టపాలు చేయబోయి వైకాపా తనే పదేపదే అప్రదిష్ట పాలవుతోంది. త్వరలో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ అయ్యి, రాజధాని నిర్మాణం కూడా మొదలయితే అప్పుడు వైకాపా తను చేసిన అల్లరికి తలదించుకోక తప్పని పరిస్థితి వస్తుంది. పంట రుణాల మాఫీ, రాజధాని నిర్మాణం వలన ప్రభుత్వానికి, చంద్రబాబుకి, తెదేపాకు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడితే, దానికి అడ్డంకులు సృష్టించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఆయన పార్టీ పేరు కూడా చరిత్రపుటలలోకి ఎక్కుతాయి.

తెలంగాణాలో వైకాపా పునః ప్రవేశం అంతర్యం ఏమిటో

  రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా నుండి బయటపడిన వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో అడుగుపెట్టబోతోంది. అయితే అందుకు అది ఎంచుకొన్న మార్గం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను భుజానికెత్తుకొన్న షర్మిల ఈరోజు నుండి రాష్ట్రంలో పరామర్శ యాత్రలు మొదలుపెట్టబోతున్నారు. మొదటి దశలో మెహబూబ్ నగర్ జిల్లాలో 13 నియోజక వర్గాలలో ఐదు రోజుల పాటు 921 కిలోమీటర్లు పర్యటిస్తారు. ఈ సందర్భంగా 9 నియోజక వర్గాలలో వైయస్స్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.   ఒక రాజకీయ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలోనయినా నిర్భయంగా తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకొనే స్వేచ్చను రాజ్యాంగం ప్రసాదించింది. అందుకోసం ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అవలంభించనవసరం లేదు. కనుక వైకాపా తెలంగాణా రాష్ట్రంలో తన కార్యకలాపాలు నిర్వహించుకోదలిస్తే ఆ పని నేరుగానే చేసుకోవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా ఎప్పుడో ఐదారేళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చే మిషతో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదం.   ఒక వ్యక్తి చనిపోయిన ఐదారేళ్ళ తరువాత ఇప్పుడు షర్మిల వచ్చి వారిని ఓదార్చాలనుకోవడం, వారి కుటుంబానికి తన సోదరుడు జగనన్న అండగా ఉంటాడని హామీ ఇవ్వడం ఆ కుటుంబాలను పరిహసించడమే తప్ప మరొకటి కాదు. పోనీ చేసే ఆపనయినా మనస్పూర్తిగా చేయకుండా ఆ సాకుతో తెలంగాణాలో అడుగుపెట్టి అక్కడ వైకాపాను బలపరుచుకోవాలనుకోవడం చాలా దారుణమయిన ఆలోచన. ఆ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేయబోయే పరామర్శ యాత్రలతో తిరిగి తమ పార్టీ తెలంగాణాలో బలం పుంజుకొంటుందని, వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేస్తామని చెప్పడం ఈ పరామర్శ యాత్రల పరమార్ధం ఏమిటో స్పష్టంగా చెపుతోంది. మానవత్వంతో ఆలోచించేవారెవరికీ ఇటువంటి వికృతమయిన ఆలోచనలు కలగవు.   పార్టీని బలోపేతం చేసుకోదలిస్తే, ఆ బాధ్యత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా తీసుకోవాలి. లేదా పార్టీకి చెందిన సీనియర్ నేతలెవరికయినా ఆ బాధ్యతలు అప్పగించాలి. ఇదివరకు ఆయన జైల్లో ఉన్నందున ఆయన తరపున షర్మిల పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేసారు. అందులో ఆమెను తప్పు పట్టడానికి ఏమీ లేదు. కానీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడయిన జగన్మోహన్ రెడ్డి బయటే తెలంగాణాకు చెందిన హైదరాబాద్ లోనే ఉన్నారు. అటువంటప్పుడు స్వయంగా ఆయన తెలంగాణాలో పర్యటించి పార్టీని బలపరిచే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీతో ఎటువంటి సంబందమూ లేని షర్మిలను ఈ పరామర్శ యాత్రల పేరిట తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి పంపించడం దేనికంటే, బహుశః తెలంగాణా ప్రజల ఆగ్రహం ఎదుర్కోలేననే భయం కావచ్చును. లేదా అధికార తెరాసతో ఉన్న సత్సంబందాలు దెబ్బ తినకూడదనే ఆలోచన కావచ్చు లేదా మహిళ అయిన షర్మిలపై తెరాస, కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు విమర్శలు చేయలేవనే దురాలోచన కావచ్చు లేదా ఇంకేదయినా కావచ్చు. యుద్ధం చేసేందుకు గుండెల నిండా ధైర్యం ఉండాలని అది తనకు పుష్కలంగా ఉందని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా తన సోదరి షర్మిల ద్వారా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆలోచించడం మరో దారుణమయిన ఆలోచన.   జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో అడుగుపెట్టేందుకే వెనుకాడుతున్నప్పుడు అతని తరపున షర్మిల ప్రజలకు ఏవిధంగా హామీలు ఇస్తున్నారు? ఏ హోదాతో ఇస్తున్నారు? ఇస్తే వాటిని అతను అమలుచేస్తారా? ఇటువంటి పార్టీని, అందునా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వైకాపాను తెలంగాణా ప్రజలు మళ్ళీ ఆదరిస్తారా అంటే అనుమానమే. అయినా తెలంగాణాలో ఎందుకు పునః ప్రవేశించాలనుకొంటోంది? దాని వెనుక మర్మమేమిటి? అని ప్రశ్నించుకొంటే వైకాపా చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతుంది.   చిత్తశుద్ధి, నిజాయితీ, మానవత్వం లేని ఇటువంటి ఆలోచనలు, పోరాటాల కారణంగానే వైకాపా తన విశ్వసనీయతను కోల్పోయింది. అయినప్పటికీ గతం నుండి ఎటువంటి గుణపాటాలు నేర్చుకోకుండా తన ధోరణిలోనే ముందుకు సాగిపోతోంది. అయితే అందుకు ఆ పార్టీలో ఎవరినీ నిందించడానికి ఏమీ లేదు. ఈవిధంగా పార్టీకి శల్యసారధ్యం చేస్తున్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డినే తప్పుపట్టవలసి ఉంటుంది. అంతే.

రాజకీయ పార్టీల వైరానికి ప్రజా సమస్యల కలరింగ్?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలన్నీ ప్రజల కోసమేనని చెప్పుకోవచ్చుగాక, కానీ అవన్నీతన పార్టీని బలోపేతం చేసుకోవడానికి, పార్టీ శ్రేణులను చైతన్యవంతంగా ఉంచడానికి, తన పార్టీ ఎప్పటిలాగే చాలా బలంగా ఉందని నిరూపించుకొనే ప్రయత్నంలో బలప్రదర్శన చేయడానికి, అధికారంలో ఉన్న తన రాజకీయ ప్రత్యర్ధి తెదేపాను ఇరుకున బెట్టేందుకేనని అందరికీ తెలుసు. ఆయన ఓదార్పు యాత్రలు చేసినా, సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినా, ఇటువంటి ధర్నాలు దీక్షలు ఏవి చేసినా వాటన్నిటి పరమార్ధం, అంతిమ లక్ష్యం ఇవే తప్ప బయటకు చెపుతున్న కారణాలు మాత్రం కాదని అందరికీ తెలుసు. అయితే ఇటువంటి పోరాటాలకు జనాలు స్వచ్చందంగానో లేక ఆయా పార్టీలు జనసమీకరణ చేయడం వల్లనో భారీగా హాజరవడం కనిపిస్తోంది గనుక తము చేస్తున్న ఆ పోరాటాలకు ప్రజామోదం కూడా ఉందని రాజకీయ పార్టీలు భ్రమించడమే కాకుండా ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ తాము చేస్తున్న ఈ పోరాటాలకు నిజంగా జానామోదం ఉందా లేదా అనేది ఇప్పుడు ఏ రాజకీయపార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ కార్యక్రమంలో జనాలు బాగా ఉన్నారా లేరా? దానికి మీడియా కవరేజి బాగా వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకొంటున్నారు.   ప్రజలు కూడా ఈ రాజకీయ వికారాలను చాలా అసహ్యించుకొంటున్నారనే సంగతి రాజకీయ నేతలకి తెలియదనుకోలేము. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలకంటే తాత్కాలిక ప్రయోజనాలే మిన్న అని భావించే నేతలు, తాత్కాలికంగా ప్రజలను ఆకట్టుకొని తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ బలపడేందుకు ఇటువంటి అంశాలను అందిపుచ్చుకొని అధికార పార్టీపై పోరాటాలు చేయడం చాలా సహజమని ప్రజలు భావిస్తున్నారని, రాజకీయ పార్టీలు భ్రమలో ఉన్నందునే తమ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరంతో చేస్తున్న ఈ పోరాటాలకు ప్రజా సమస్యల కోసం చేస్తున్న పోరాటాలుగా కలరింగ్ ఇవ్వగలుగుతున్నారు.   అయితే ప్రజలు కూడా వారి ఈ రాజకీయ వికృత చేష్టలను గమనిస్తూనే ఉన్నారు. అందుకే తమకు అవకాశం వచ్చినప్పుడు వారికి కొర్రు కాల్చి వాతలు పెడుతున్నట్లు గుణపాటం చెపుతున్నారు. . ప్రజలలో రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తున్న ఈ కాలంలో కూడా రాజకీయ పార్టీల, వాటి నేతల ఆలోచనా తీరులో ఎటువంటి మార్పు కనబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

చిత్తశుద్ధి లేని పోరాటాలు ఎన్ని చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం?

  తెలుగుదేశం పార్టీ అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, కానీ తను మాత్రం అధికారం కోసం అటువంటి అబద్దాలు చెప్పకపోవడంతో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఎన్నికలలో ఓడిపోయామని వై.యస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. ఎన్నికలలో ఓడిపోయినప్పటినుండీ ఆయన ఇదే అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ధర్నాలు కూడా చేశారు, రేపు కూడా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.   అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతుల రుణాలమాఫీ కోసమే చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో ఈ ధర్నాలు చేస్తున్నారా? అని ప్రశ్నించుకొంటే కాదనే అర్ధమవుతోంది. అనేక కేసులలో నిందితుడుగా ఉన్న తనను ప్రజలు ఎందుకు తిరస్కరించారో గ్రహించకుండా, తన ఓటమి నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోకుండా, ఓదార్పు యాత్రల పేరుతో ఏవిధంగా తన పార్టీని బలోపేతం చేసుకొన్నారో అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయ రుణాలమాఫీ కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెపుతూ తన పార్టీని కాపాడుకొంటూ బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారనే సంగతి ప్రజలు గ్రహించలేరని వైకాపా భావించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.   రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదని వాదిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం రుణాల మాఫీకి చేస్తున్న కసరత్తును చూస్తూ కూడా ధర్నాలు చేయాలనుకోవడం గమనిస్తే ఈ వ్యవహారంలో ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతూనే ఉంది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలనే తన చిరకాల కోరిక నెరవేరకుండా చంద్రబాబు అడ్డుపడ్డారనే దుగ్ధ ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయామని ఆయన పదేపదే చెప్పుకోవడమే అందుకు ఉదాహరణ. తనకు అధికారం దక్కకుండా చేసినందుకు చంద్రబాబుపై పగతో రగిలిపోతున్నందునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం (చంద్రబాబు నాయుడు) మెడలు వంచుతానని భింకాలు పలుకుతున్నారని కూడా అర్ధమవుతూనే ఉంది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వంతో పోరాడుతున్నామని చెప్పుకొంటున్న ఆయన, తెలంగాణా ప్రభుత్వం, పోలవరం, నీళ్ళు, విద్యుత్, ఉద్యోగాలు, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్స్ మెంట్, ఇంటర్ మీడియేట్ పరీక్షల నిర్వహణ వంటి అనేక అంశాలలో ఆంద్ర రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తుంటే ఏమాత్రం స్పందించక పోవడం గమనిస్తే, వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పోరాటాలలో నిజాయితీ ఏపాటిదో అర్ధమవుతూనే ఉంది. పొరుగు రాష్ట్రం తన ప్రజలపై, ప్రభుత్వంపై ఇంత దాష్టికం చేస్తుంటే దానితో పోరాడే బదులు, దాని తరపునే వకల్తా పుచ్చుకొని ప్రజలెన్నుకొన్న ఆంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని జగన్మోహన్ రెడ్డి ప్రతిజ్ఞలు చేయడాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన చేపడుతున్న ధర్నాలకు, దీక్షలకు ప్రజా స్పందన కొరవడుతోంది.   రుణాల మాఫీ, రాజధాని భూసేకరణ, హుడ్ హుడ్ తుఫాను, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు కావేవీ విమర్శలకు, పోరాటాలకు అనర్హం అన్నట్లు ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తూ, వాటి నుండి రాజకీయ లబ్ది పొందేందుకు ఆరాటపడుతూ, ఇదంతా ప్రజల కోసమేనని ప్రజలను మభ్యపెడుతూ, తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు మూర్కులు వారికి ఏమీ అర్ధం చేసుకొనే శక్తి లేదనే చులకన భావం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనబడుతోంది.   ఆయన ఈవిధంగా చిత్తశుద్ధిలేని పోరాటాలు చేసినందుకే ఎన్నికలలో వైకాపాను ప్రజలు తిరస్కరించారు. అయినప్పటికీ నేటికీ ఆయన తీరు మారలేదని అర్ధమవుతోంది. ఆయన ఏమి చేసి తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారో అవే వైకాపాకు శాపంగా మారుతున్నాయని చెప్పవచ్చును. ఇదంతా చూస్తున్నప్పటికీ పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయలేక వైకాపాలో సీనియర్లు సైతం నిస్సహాయంగా చూస్తుండి పోయిన్నట్లుంది. ఇదంతా చూస్తుంటే వైకాపాకు ప్రధమ శత్రువు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేనని ఎవరికయినా అనిపించక మానదు.

రాష్ట్రంలో బీజేపీ బలడితే తెదేపాకు ఇబ్బందవుతుందా?

  దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ అందుకోసం అవి ఎటువంటి పద్దతులు అనుసరిస్తున్నాయనేది ఆ పార్టీల తీరును ప్రతిభింబిస్తుంది.   ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు మూడూ కూడా సభ్యత్వ నమోదు ద్వారా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస ఇతర పార్టీల యం.యల్యే.లను తమ పార్టీలోకి ఆకర్షించడం ద్వారా ప్రత్యర్ధ పార్టీలను నిర్వీర్యం చేసి తను బలపడాలని భావిస్తోంది. కానీ ఆంధ్రలో అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం మాత్రం అటువంటి ప్రయత్నాలు చేసేందుకు అయిష్టత కనబరుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఎవరయినా వారంతట వారే వచ్చి చేరాలనుకొన్నవారిని కూడా వారిని పెద్దగా ప్రోత్సహించడం లేదు. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉండటమే అందుకు కారణమని చెప్పవచ్చును. ఇటీవల ఆ పార్టీ ఆరంభించిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఊహించిన దానికంటే చాలా మంచి స్పందన రావడమే అందుకు చక్కటి నిదర్శనం.   తెదేపాకు మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఆరంభించింది. దానితో బాటే కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. వారు కూడా తమ పార్టీ రాజకీయ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తున్న కారణంగా కావచ్చు లేదా మరే ఇతర కారణాల వల్లనయితేనేమి బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. అయితే తమ ఈ ప్రయత్నాలు తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికే తప్ప తెదేపాకు ఇబ్బందికలిగించడానికో లేకపోతే ఆ పార్టీని బలహీన పరిచేందుకో కాదని బీజేపీ సభ్యుడు మరియు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులను తమ పార్టీలో చేరేందుకు అనుమతించబోమని ఆయన స్పష్టం చేసారు. రెండు పార్టీల మధ్య ఈ మైత్రి ఇక ముందు కూడా ఇదేవిధంగా చక్కగా కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకొనవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినప్పుడు, ఆయన వంటి బలమయిన నాయకుడు పార్టీకి అవసరమని భావించినందునే ఆయనను పార్టీలోకి తీసుకొన్నామని ఆయన అన్నారు.   ఈనెల 20,21 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్, వైకాపా నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో మంత్రి కామినేని చేసిన ఈ వ్యాఖ్యలు అందుకు రంగం సిద్దం చేస్తున్నట్లున్నాయి.   ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు బలంగా ఉండటం చాలా మంచి విషయమే. తెదేపా, బీజేపీల మధ్య చక్కటి సయోధ్య ఉన్నంత కాలం బీజేపీ బలపడితే తెదేపాకు, తెదేపా బలపడితే బీజేపీకి మంచిదే. మోడీ, అమిత్ షాల నేతృత్వంలో బీజేపీని ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అదే సమయంలో వారిరువురూ మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా. ఎన్డీయే ప్రభుత్వంలో మిత్ర పక్షాలన్నిటికీ కీలకమయిన కేంద్రమంత్రి పదవులు ఇవ్వడం, అదేవిధంగా మహారాష్ట్రాలో తనతో విభేదించిన శివసేన పార్టీని కూడా తిరిగి ప్రభుత్వంలో భాగస్వామిని చేసుకోవడం అందుకు మంచి ఉదాహారణలుగా చెప్పుకోవచ్చును.   వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ బలపడగలిగినట్లయితే, తెదేపాను మరికొన్ని అదనపు సీట్లు కోరవచ్చును. లేదా రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. అందువలన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నప్పటికీ దాని వలన, అందరూ ఊహిస్తున్నట్లుగా అధికార తెదేపాకు ఎటువంటి నష్టమూ ఉండబోదు.