జగన్ శల్యసారధ్యంలో వైకాపా పయనం ఎటువైపు?

  ఇంతవరకు ఏదో సరదాగా సరదాగా సాగుతోందనుకొన్న తెదేపా-వైకాపాల మధ్య యుద్ధం అకస్మాత్తుగా రసవత్తమయిన క్లైమాక్స్ దశకు చేరుకొంది. అందులో ఇప్పుడు అధికార తెదేపాదే పైచేయి సాధించినట్లు కనబడుతోంది. అయితే తెదేపాకు ఆ అవకాశం కల్పించింది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డేనని ఒప్పుకోక తప్పదు. ఈసారి బడ్జెట్ సమావేశాలు మొదలయినప్పుడు అజెండాలో తముకోరుకొన్న అంశాలను చేర్చకపోయినట్లయితే సభలో తాము ‘అగ్లీ సీన్స్ క్రియేట్’ చేస్తామని అధికార తెదేపాను హెచ్చరించడం ద్వారా వైకాపా తెదేపాకు మొదట్లోనే ఒక బ్రహ్మాస్త్రం అందించింది. వీలుచిక్కినప్పుడల్లా అధికార పార్టీ సభ్యులు దానిని వైకాపా మీద ప్రయోగిస్తూనే ఉన్నారు.   ఆ తరువాత తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదంటూ స్పీకర్ కోడెల మీద వైకాపా సభ్యులు విరుచుకుపడటమే కాకుండా సభలో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. స్పీకర్ ని దూషించి పెద్ద పొరపాటు చేసిన వైకాపా సభ్యులు ఆ తరువాత ఆయనపై అవిశ్వాస తీర్మానం కోసం నోటీసిచ్చి మరో తప్పిదం చేసారు. దానిని సభ చర్చకు చెప్పట్టేవరకు సభలో అడుగుపెట్టమని భీకర శపథం చేసి అధికార పార్టీకి మరో ఆయుధం అందజేశారు. కీలకమయిన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బయలుదేరబోతున్నట్లు ప్రకటించి మరో తప్పు చేసారు.   శాసనసభ సమావేశాలకు హాజరవడం ఇష్టం లేకనే జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి ఈ విధంగా చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారంటూ తెదేపా నేతలు విమర్శలు గుప్పించడంతో, చేసిన ప్రతిజ్ఞలను దిగమింగుకొని, బస్సు యాత్రలను రద్దు చేసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు శాసనసభకు హాజరవవలసి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ సభ్యులు అందరూ వారితో సభలో చెడుగుడు ఆడేసుకొన్నారంటే అతిశయోక్తి కాదు.   “జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు అసలు సభని ఎందుకు బహిష్కరిస్తారో...మళ్ళీ ఎందుకు తిరిగి వస్తారో...మళ్ళీ ఎందుకు వాక్ అవుట్ చేస్తుంటారో...ఎవరికీ తెలియదు” అంటూ అధికార పార్టీ సభ్యులు ఎద్దేవా చేస్తుంటే వారికి జగన్మోహన్ రెడ్డి వివరణలు, సంజాయిషీలు ఇచ్చుకోవడం చూస్తుంటే చాలా నవ్వు తెప్పిస్తుంది.   అయితే వైకాపా కష్టాలు అంతటితో తీరిపోలేదు. స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టి అధికార పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడదామని వైకాపా చూస్తే, స్పీకర్ ని దూషించినందుకు 9 మంది వైకాపా సభ్యులను సభ నుండి (ఆరు నెలలపాటు) సస్పెండ్ చేయాలని కోరుతూ స్పీకర్ కి నోటీసు ఇవ్వడంతో వైకపా కంగుతింది. వైకాపా అప్పుడు ప్రభుత్వంతో కాళ్ళబేరానికి రాక తప్పలేదు. తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయకుండావదిలేస్తే, తాము స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకొంటామని బేరం పెట్టింది. సభలో తమకు మెజార్టీ లేదని, తమ నోటీసుకి మద్దతు ఇచ్చేందుకు సభలో వేరే ఇతర పార్టీలు ఏవీ లేవని తెలిసిఉన్నప్పటికీ అధికార పార్టీని ఏదోవిధంగా అప్రదిష్ట పాలుజేద్దామనే తాపత్రయంతో ముందు వెనుక చూసుకోకుండా హడావుడిగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చేసిన వైకాపా ఇప్పుడు దానిని కూడా వెనక్కితీసుకోనేందుకు సిద్దపడుతోంది. అయినా అధికార తెదేపా దిగిరాలేదు.   “అవిశ్వాస తీర్మానం పెట్టుకొంటే పెట్టుకోండి..ఎదుర్కొనేందుకు మేము సిద్దం. కానీ తొమ్మిది మంది వైకాపా సభ్యులను క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి సభలో స్పీకర్ కి క్షమాపణలు చెప్పి, తన పార్టీ సభ్యులు మళ్ళీ సభలో అసభ్యంగా ప్రవర్తించారని లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చినట్లయితే తాము పరిశీలిస్తామని తెదేపా తేల్చి చెప్పడంతో వైకాపా పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.   ఒకవేళ జగన్మోహన్ రెడ్డిసభలో క్షమాపణలు చెప్పి, అందుకు లేఖ కూడా ఇస్తే, అది అధికార పార్టీకి మరో గొప్ప ఆయుధంగా మారుతుంది. దానిని పట్టుకొని అధికార పార్టీ సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వైకాపాతో ఆడేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. పైగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన తప్పును అంగీకరిస్తూ క్షమించమని వ్రాసిన ఆ లేఖ అసెంబ్లీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కనుక అందుకు ఒప్పుకోకపోయినట్లయితే, అప్పుడు తొమ్మిదిమంది వైకాపా యం.యల్యేలు అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు వారందరూ జగన్మోహన్ రెడ్డిని తప్పు పడుతూ పార్టీలో అసమ్మతి వర్గంలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఏవిధంగా చూసినా వైకాపా అడ్డంగా బుక్ అయిపోయినట్లే కనిపిస్తోంది.   అయితే ఈ సమస్య నుండి వైకాపా మెల్లగా ఏదో విధంగా బయటపడవచ్చును. కానీ జరిగినవన్నీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అపరికత్వకు అద్దంపట్టేవిగా ఉన్నాయి. అంతే కాదు ఆయన పార్టీలో సీనియర్లను ఎవరినీ సంప్రదించరనే సంగతి స్పష్టం అవుతోంది. ఆయన ఈ విధంగా పార్టీకి శల్యసారధ్యం చేస్తూ తను చేస్తున్న తప్పులకు పార్టీని భారీ మూల్యం చెల్లింపజేస్తున్నట్లుంది. పాపం వైకాపా!

అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం లేదట!

  కేంద్ర బడ్జెట్ లోఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంతో సర్వత్రా నిరసనలు ఎదురయిన తరువాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను నేరవేర్చుతామని, అన్ని ప్రాజెక్టులకి అవసరమయిన నిధులు సమకూర్చుతామని, ఆర్దికలోటును భర్తీ చేసేందుకు కూడా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి భారీగా నిధులు విడుదల కాబోతున్నట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి స్వయంగా ప్రకటించారు. కానీ తెదేపా, బీజేపీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతోంది? అనే ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నేరుగా జవాబు చెప్పలేదు.   అయితే ఇటీవల ఒక కేంద్రమంత్రి మీడియాతో ‘ఆఫ్ ద రికార్డ్’ అన్నమాటలు ఆ ప్రశ్నలకు జవాబు తెలియజేస్తున్నాయి. “రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తీవ్ర ఆర్దికలోటు ఉందని చెపుతూనే మరోవైపు వేలకోట్ల పంట రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తోంది. అటువంటప్పుడు రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలు ఉన్నాయని ఏవిధంగా భావించగలము? అందుకే ఆర్ధికలోటు భర్తీ చేయడానికి కేంద్రం కూడా ఆలోచించుకోవలసి వస్తోంది,” అని కేంద్రమంత్రి అన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆవిధంగా చెప్పడం నిజమో కాదో తెలియకపోయినా ఆ కారణం మాత్రం నిజంగా ఆలోచించదగ్గదే.   రాష్ట్ర ఆర్దికలోటును భర్తీ చేసేందుకు ఇంతవరకు ఎటువంటి నిధులు విడుదల చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట రుణాలను కొంతవరకు మాఫీ చేసింది. త్వరలో మరికొంత మాఫీ చేసేందుకు సిద్దమవుతోంది. రైతుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ భారం భుజానికెత్తుకొన్న రాష్ట్ర ప్రభుత్వం దానికోసం తన వద్ద ఉన్నంతలో నిధులు కేటాయిస్తోంది. అది చూస్తున్న కేంద్రానికి అనుమానం కలగడం సహజమే.   తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఈ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణాల మాఫీ చేయగలుగుతున్నప్పుడు కేంద్రం ఎందుకు సహాయం చేయాలి? ఒకవేళ చేసినా అప్పుడు మిగిలిన రాష్ట్రాలు కూడా తమకూ నిధులు మంజూరుచేయమని అడగడం మొదలుపెడితే వాటికి కేంద్రం ఏమని జవాబు చెప్పుకోగలదు? అని ఆలోచిస్తే నిధుల విడుదలకు కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్ధమవుతుంది.   బహుశః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రం నుండి ఇదే ప్రశ్నలు ఎదుర్కొని ఉండవచ్చును. అందుకే ఆయన కూడా కేంద్రంతో స్నేహంగా ఉంటూనే రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవాలని చూస్తున్నారు తప్ప ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా కేంద్రంతో యుద్ధం చేయాలనుకోవడంలేదేమో.   అయినా రాష్ట్ర ప్రభుత్వం తనకు వచ్చిన ఆదాయంలో నుండి కొద్దికొద్దిగా తీసిపక్కనుబెడుతూ పంటరుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది తప్ప ఏకమొత్తంగా ఒకేసారి వేలకోట్ల రుణాలు మాఫీ చేసేయడం లేదు. దానివలన రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అంటే మంచికిపోతే చెడు ఎదురయినట్లయిందనుకోవాలేమో.   కానీ పంట రుణాల మాఫీతో, రాష్ట్రానికి ఈయవలసిన నిధుల విడుదలను లంకె పెట్టి తాత్సారం చేసినట్లయితే, దాని వలన కేంద్ర ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. చంద్రబాబు నాయుడు పంటరుణాల మాఫీ చేస్తామని ఎన్నికల కంటే చాలా ముందే ప్రకటించారు. అదే అంశాన్ని ఆయన నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ లతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కూడా ప్రకటించారు. అంటే ఆవిషయం గురించి మోడీకి కూడా ముందే తెలుసని అర్ధమవుతోంది. కనుక ఇప్పుడు పంటరుణాల మాఫీని సాకుగా చూపుతూ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడానికి తాత్సారం చేయడాన్ని ఎవరూ హర్షించరు.

వైకాపా మళ్ళీ సభకు వచ్చింది అందుకేనా?

  శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానానికి వైకాపా నోటీసు ఇచ్చింది. ఆ తీర్మానంపై చర్చ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించేవరకు శాసనసభలో అడుగుపెట్టబోమని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే హడావుడిగా ప్రకటించేశారు. బడ్జెట్ సమావేశాలపై తన అమూల్యమయిన అభిప్రాయాలు తెలుసుకోగోరేవారు మీడియాలో చూసుకోమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేరు. కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి బస్సు యాత్రకు సిద్దమయ్యారు కూడా. దానికి మార్చి26 ముహూర్తం ఖరారు చేసుకొన్నారు కూడా.   అయితే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలానే తన నిర్ణయం తొందరపాటు నిర్ణయమని గ్రహించారో లేక దాని వలన అధికార పార్టీకి చేజేతులా తనను విమర్శించేందుకు అవకాశం దొరుకుతుందని భయపడ్డారో తెలియదు గానీ అంత భీషణ శపథం చేసిన జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యులతో సహా శాసనసభ సమావేశాలకు యధావిధిగా మళ్ళీ ఈరోజు హాజరయ్యారు. తమంతట తాము బడ్జెట్ సమావేశాలను బహిష్కరించడం వలన ప్రజలలో తమకే చెడ్డపేరు వస్తుందని గ్రహించిన వైకాపా అదేదో అధికారపార్టీ చేత బహిష్కరింపబడి బయటకు వచ్చేస్తే ప్రజల సానుభూతి దక్కుతుందనే ఆలోచనతోనే మళ్ళీ సభకు హాజరయ్యినట్లుంది సభలో వారి తీరు చూస్తుంటే. కరెంట్ చార్జీల పెంపుదల మీద ప్రస్తుతం సభలో వారు రభస చేస్తున్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంని చుట్టుముట్టి సభను స్తంభింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.   శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా స్పీకర్ చేత బహిష్కరింపబడితే కానీ తమకు ప్రజల సానుభూతి దొరకదనే ఉద్దేశ్యంతోనే తమ బస్సు యాత్రకి 26వ తేదీని ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లున్నారు. కనుక ఇక స్పీకర్ దే ఆలశ్యమనుకోవాలేమో? వైకాపా సభ్యులు తాము ప్రజా సమస్యల మీద చర్చించాలనుకొంటున్నట్లు చెపుతూనే ఈవిధంగా రాజకీయాలు చేయడం శోచనీయం. వారిప్పుడు బయటకు వెళ్ళిపోయే తొందరలో ఉన్నట్లున్నారు. ఒకవేళ వారు స్పీకర్ చేత బహిష్కరింపబడి బయటపడినట్లయితే ఇక అప్పుడు ప్రభుత్వాన్ని శాస్త్రసమ్మతంగా విమర్శించుకోవచ్చును.

రాజధాని, పట్టిసీమ ప్రాజెక్టుకీ ఓ లెక్కుంది

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగను నిన్న తుళ్ళూరులో జరుపుకొన్నారు. ఆ సందర్భంగా ఆయన రాజధాని నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. సరిగ్గా ఒక్క సం.లోనే పట్టిసీమ ప్రాజెక్టును, 2018 జూన్‌ 2వ తేదీ నాటికి రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తి చేసి తీరుతానని ప్రకటించారు. ఆయన మాటలను జగన్ వంటివారు లైట్ గా తీసుకోవచ్చును. కానీ ఆయన అంత దృడంగా చెపుతున్నారంటే వాటిలో సాదకబాధకాలను, సాధ్యాసాధ్యాలను చాలా లోతుగా అధ్యయనం చేసి, ఆ రెంటినీ సకాలంలో పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికను సిద్దం చేసుకొన్నారని భావించవచ్చును.   రాజధాని ప్రధాన నగర నిర్మాణానికి అవసరమయిన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగినంతా విడుదల చేస్తుందనే నమ్మకం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎంత నిధులు విడుదల చేస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అటువంటప్పుడు దాని మీద ఆధారపడి పనిమొదలుపెడితే 2018 సం.నాటికి రాజధాని ప్రధాన నగర నిర్మాణం పూర్తి కాకపోవచ్చును. కానీ తను ఎట్టి పరిస్థితులలో 2018 సం.నాటికి రాజధాని తొలి దశ నిర్మాణం పూర్తి చేసి తీరుతానని చంద్రబాబు నాయుడు దృడంగా చెపుతున్నారు. అంటే కేంద్రం నిధులు విడుదల చేసినా చేయకపోయినా నిర్మాణం పూర్తిచేసేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్దం చేసుకొన్నట్లు స్పష్టం అవుతోంది.   ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో రాజధాని నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కొన్ని వారాల క్రితం మీడియాలో వార్తలు వచ్చేయి. బహుశః అందుకే ఇటువంటి పరిస్థితుల్లో కూడా 2018 సం.నాటికి రాజధాని ప్రధాన నగర నిర్మాణం పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు అంత దృడంగా చెప్పుతున్నారేమో?   ఇక రాజధాని నిర్మాణంపై చంద్రబాబు నాయుడు ఎంత పట్టుదల శ్రద్ధ చూపుతున్నారో పట్టిసీమ ప్రాజెక్టు మీద కూడా అంతే పట్టుదల, శ్రద్ధ కనబరుస్తున్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా నత్తనడకలతో సాగుతున్న పోలవరం ప్రాజెక్టుని మిగిలిన ఈ నాలుగేళ్లలో పూర్తిచేస్తానని ఆయన గట్టిగా చెపుతున్నప్పటికీ కేంద్ర సహకారం లేనిదే ఈభారీ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం కష్టమనే ఆయనకీ తెలియకపోదు. అది పూర్తయ్యేవరకు దానికి ప్రత్యామ్నాయంగానే ఈ పట్టిసీమ ప్రాజెక్టును మొదలుపెట్టి ఉండవచ్చును.   రాజధాని కోసం చాలా భారీగా పంటభూములను సమీకరించినందున, అంతకు రెట్టింపు భూమిని సాగులోకి తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు ఈ భగీరధ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాలతోబాటు, కరువు ప్రాంతంగా పేరుపడ్డ రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్ళు అందించగలిగితే అక్కడ కూడా కొత్తగా వేల ఎకరాల భూమి కొత్తగా సాగులోకి వస్తుందనే ఆలోచన కావచ్చును.   కానీ రాయలసీమకు చెందిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకొంటున్నారని చంద్రబాబు నాయుడు మాటలను మరింత లోతుగా పరిశీలించినట్లయితే దానివెనుకున్న రాజకీయాలు కూడా కనబడతాయి. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల మీద గట్టిపట్టు ఉంది. కానీ ఇప్పుడు తెదేపా ప్రభుత్వం ఆ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించినట్లయితే, ప్రజలు తెదేపా వైపు మళ్లే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ కూడా వైకాపా బలహీనపడుతుంది. అందుకే వైకాపా వ్యతిరేకిస్తోందని తెదేపా వాదన. అంటే వైకాపా నష్టపోతే తెదేపా బలపడే అవకాశం కూడా ఉందన్నమాట. ఈప్రాజెక్టు నిర్మాణానికి పైన పేర్కొన్న ఇతర కారణాలతో బాటు ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చును. అయితే రాయలసీమ ప్రజలకు మేలు కలుగుతుందంటే అది రాజకీయ నిర్ణయమయినా మరోకటయినా రాష్ట్రంలో ప్రజలందరూ స్వాగతిస్తారు...జగన్మోహన్ రెడ్డిలాంటి వారు తప్ప.  

ఆంద్ర, తెలంగాణా స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలు?

  ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర శాసనసభల స్పీకర్లిరువురుపై ఆయా రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానాలు పెట్టడం చాలా ఆశ్చర్యం, బాధ కలిగిస్తోంది. ఆంధ్రా శాసనసభలో వైకాపా సభ్యులలో కేవలం 8 మందిని మూడు రోజులు సభ నుండి సస్పెండ్ చేసినందుకు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి సభ నుండి వాకవుట్ చేసారు. స్పీకర్ కు వ్యతిరేకంగా తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు చేపడితేనే సభకు తిరిగి వస్తామని లేకుంటే సమావేశాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. బడ్జెట్ పై తన అభిప్రాయాలను మీడియా ద్వారా తెలియజేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించి అందరూ నివ్వెరపోయేలా చేసారు.   వైకాపాకున్న 67మంది సభ్యులలో కేవలం 8 మందిని మాత్రమే సస్పెండ్ చేయబడ్డారు. అది కూడా కేవలం మూడు రోజులకోసం మాత్రమే. కనుక జగన్మోహన్ రెడ్డితో సహా మిగిలినవారందరూ సభా కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా ఏవో కుంటిసాకులు చూపిస్తూ సమావేశాలకు హాజరుకాకపోవడం భాద్యతారాహిత్యమే కాకుండా అధికార పార్టీకి భయపడి సభ నుండి పారిపోయినట్లే అవుతుంది. పైగా బడ్జెట్ తన అభిప్రాయాలను మీడియాలో చూసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆయన అహంకారానికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.   శాసనసభలో వేరే ఇతర పార్టీలు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఉంటే, వైకాపా ఈవిధంగా చేసినా బహుశః ఎవరూ పట్టించుకొనేవారు కారు. కానీ సభలో వైకాపా తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేనప్పుడు వైకాపా ఈవిధంగా సభ నుండి పారిపోవడం బాధ్యతారాహిత్యమేనని చెప్పక తప్పదు. శాసనసభకు హాజరు కాకూడదనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వలన రాష్ట్రంలో 67 నియోజక వర్గాలకు సభలో ప్రాతినిధ్యం లేకుండా చేసారు. చట్టసభలలో ప్రజా సమస్యలు, ప్రయోజనాల గురించి చర్చిస్తారని ప్రజలు ఆశిస్తారే తప్ప ఈవిధంగా పార్టీ ప్రయోజనాల కోసం పోరాటాలు చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకొన్నందుకు ప్రజలు కూడా పశ్చాత్తాపపడేలా చేస్తున్నారు.   ఇక వైకాపా సభ్యులు కుంటిసాకులతో శాసనసభకు వెళ్ళకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెలంగాణా శాసనసభ నుండి సస్పెండ్ అయిన తెదేపా సభ్యులు ఏదో విధంగా మళ్ళీ సభకు హాజరవ్వాలని ప్రయత్నిస్తుండటం విశేషం.   వారు స్పీకర్ ని కలిసి తాము క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, కిషన్ రెడ్డి తదితరులను కలిసి తమను సభలోకి అనుమతించమని ప్రభుత్వంపై ఒత్తిడి చేయమని కోరారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని సభలోకి అనుమతించకపోవడంతో తెదేపా సభ్యులు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు.   తెలంగాణా శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా కాక తెరాసకు అనుబంధ పార్టీగా వ్యవహరిస్తోందనే అపవాదు మూటగట్టుకొంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి గనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెరాస మంత్రులు తమతో ఇంత వినమ్రంగా వ్యవహరిస్తున్నారని, సమావేశాలు ముగియగానే మళ్ళీ కాంగ్రెస్ నుండి తెరాసలోకి వలసలు, జి.హెచ్.యం.సి. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తెరాస నేతల ఆరోపణలు, విమర్శలు అన్నీ ఎదుర్కోక తప్పదని గ్రహించిన కాంగ్రెస్ నేతలు, అవిశ్వాస తీర్మానంలో తెదేపాకు సహకరించడం మంచిదా లేక తామే స్వయంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం మంచిదా అనే సందిగ్దంలో పడ్డారు. కాంగ్రెస్, తెదేపాల ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ తెలంగాణా స్పీకర్ లేదా ప్రభుత్వం మీద సోమవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇదంతా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేందుకేనా?

  సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం, ఆ తరువాత జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. పార్టీకి నాయకత్వం వహిస్తున్న సోనియాగాంధీ, పార్టీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అందుకు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. వహిస్తున్నామని చెప్పుకొన్నారు కూడా. అయితే దానర్ధం కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వేరేవరిచేతిలోనో పెడతామని కాదని వారు చెప్పకనే చెప్పారు.   రాహుల్ గాంధీ గత పదేళ్లుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టుసాధించలేకపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆయనే దిక్కని చెప్పుకోవలసి వస్తోంది. ఆయన కూడా తనకు పదవుల మీద ఎటువంటి వ్యామోహం లేదని చెపుతూనే, తన పద్ధతి ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలనుకొంటారు. పార్టీలో సీనియర్ల కంటే తనే పార్టీని బాగా నడపగలననే భ్రమలో ఉన్నందున వారితో ఏవిషయంలోను ఏకీభవించలేకపొతున్నారు. ఆవిషయాన్ని పార్టీలో సీనియర్ నేత జైరామ్ రమేష్ చూచాయగా చెప్పారు. దానికి ఆయన ‘జనరేషన్ గ్యాప్’ అనే కలరింగ్ ఇచ్చుకొన్నారు. పార్టీలో సీనియర్లకి రాహుల్ గాంధీకి మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన చెప్పుకొన్నప్పటికీ, అత్యంత ముఖ్యమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ శలవు పెట్టివెళ్లి పోవడం, అందుకు ఆ పార్టీ నేతలు చెప్పుతున్న సంజాయిషీలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అంతర్గత సంక్షోభం నెలకొని ఉందని స్పష్టం అవుతోంది. ఆయన తన శలవుని మరికొన్ని వారాలు పొడిగించడంతో ఈ అనుమానాలను స్వయంగా దృవీకరిస్తున్నట్లుయింది.   పార్టీలో హేమహేమీలనదగ్గ నేతలు వందలమంది ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వారందరిని సంప్రదించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవడం తెలివయిన నిర్ణయం అనిపించుకొంటుంది. కానీ రాజకీయాలలో రాణించడానికి అవసరమయిన నిలకడ, నేర్పు, లౌక్యం వంటి లక్షణాలేవీ బొత్తిగా లేని రాహుల్ గాంధీ ఒంటరిగా కూర్చొని పార్టీ గురించి ఆలోచించడానికి శలవు పెట్టడం విచిత్రమే. గత పదేళ్లుగా ఆయన అనేక పాఠాలు నేర్చుకొనే అవకాశం కలిగింది. అదేవిధంగా అనేకసార్లు తనను తాను నిరూపించుకొనే అవకాశాలు కలిగాయి. కానీ ఆయన వాటిని ఉపయోగించుకొని తనలో నాయకత్వ లక్షణాలున్నాయని పార్టీకి, ప్రజలకీ కూడా నమ్మకం కల్పించలేకపోయారు. కానీ అవకాశం చిక్కితే 125 కోట్ల మంది జనాభా ఉన్న సువిశాలమయిన భారత దేశానికి ప్రధానమంత్రి అయిపోదామనుకొన్నారు. ఆయన దురదృష్టమో లేకపోతే ప్రజల అదృష్టమో గానీ ఆయనకు ఆ అవకాశం కూడా దక్కలేదు. కనుక కనీసం తన పార్టీ పగ్గాలయినా చేపడుదామనుకోవడంలో అసహజమేమీ లేదు. కానీ అందుకు కూడా పార్టీలో వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడం ఆ తల్లికొడుకులకు చింత కలిగించే విషయమే.   ఒకవేళ రాహుల్ గాంధీకి ఈ అవకాశం కూడా దక్కకపోతే ఇక ఆయన రాజకీయాలలో ఉండటమే అనవసరం. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతే అప్పుడు రాహుల్ గాంధీ ఏమి చేయాలి? ఆయన భవిష్యత్ ఏవిధంగా ఉంటుంది? అనే ఆలోచనలకు జవాబులు చెప్పడం కష్టమే. అటువంటి పరిస్థితి ఎదురయ్యే వరకు వేచి చూడటం కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిదనే ఉద్దేశ్యంతో ఈ శలవు ఐడియా చేసి ఉండవచ్చును. పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలపై ఒత్తిడి పెంచవచ్చనే ఆలోచనతోనే ఆయన శలవు మీద వెళ్లిపోయుండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఇంట్లోంచి పిల్లాడు అలిగి వెళ్ళిపోయినప్పుడు, “నాయినా నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే ఇంటికి తిరిగి రా...నీ కోసం అమ్మ బెంగ పెట్టుకొంది. నిన్ను ఎవరూ ఏమీ అనము...వెంటనే ఇంటికి తిరిగి వస్తే నువ్వు అడిగినట్లే బండి కొనిస్తాము...”లేదా ఏదో చేస్తామంటూ ఆ పిల్లాడి తల్లి తండ్రులు పేపర్లో ప్రకటనలు వేయిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా అదే పని చేస్తోందని చెప్పవచ్చును.   ఆయన శలవులో వెళ్ళిపోయినప్పటి నుండి “తిరిగి వచ్చిన తరువాత ఆయనే పార్టీ పగ్గాలు చేపడుతారు. ఆయన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కలిగించబోతున్నారు. పార్టీలో సీనియర్లకు ఉద్వాసన పలుకబోతున్నారు,” అంటూ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగానే మీడియాకు లీకులు ఇస్తున్నారు. అంటే ఆయన కండిషన్లలకు తాము అంగీకరిస్తున్నామని సందేశం పంపుతున్నారన్నమాట. కనుక ఆయన తన శలవు పూర్తి చేసుకొని రాగానే పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారేమో.

కాంగ్రెస్ నేతలకి రాష్ట్ర ప్రజల మీద ఇంత ప్రేమ ఏర్పడింది ఏమిటబ్బా?

  రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన తరువాత ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంటూ ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షలాదిమంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలలపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కిటికీలు, తలుపులు మూసివేసి, టీవీ చానళ్ళ ప్రసారాలు నిలిపివేసి అత్యంత హేయమయిన పద్దతిలో విభజన బిల్లుని ఆమోదింపజేసుకొంది.   ఆనాడు ప్రజాభిప్రాయానికి పూచికపుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే ప్రజల కోసం ఎందుకు పరితపించిపోతున్నారు? ఆనాడు ఆంద్రప్రదేశ్ ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే అవ్వన్నీ ఒట్టి డ్రామాలు...వారిని కొన్ని రాజకీయ పార్టీల నేతలు వెనుకనుండి ఆడిస్తున్నారని అవహేళనగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అకస్మాత్తుగా రోడ్లమీదకు వచ్చి ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఎందుకోసం డ్రామాలు చేస్తున్నారు? ఆనాడు ఆంద్రప్రదేశ్ ప్రజల గోడుని పట్టించుకోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు పార్లమెంటులో వారికోసం ఎందుకు పోరాటం మొదలుపెట్టారు? ఇంతకాలం వారందరూ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకొన్నారు? ఇప్పుడే ఎందుకు ఈ డ్రామాలు మొదలుపెట్టారు? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలెవరూ సమాధానాలు చెప్పేందుకు ఇష్టపడక పోవచ్చును. కోడికూయకపోతే తెల్లారకుండా ఉండదు. వారు సమాధానాలు చెప్పకపోయినా రాజకీయ విశ్లేషకులు చెప్పకుండా ఉండబోరు.   రాహుల్ గాంధీకి త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆయన శలవు నుండి తిరిగి రాగానే ఏప్రిల్ నెలలో జరిగే పార్టీ సమావేశాలలో బహుశః ఆ నిర్ణయం తీసుకోవచ్చును. ఒకవేళ ఆయన పట్టాభిషిక్తుడు అయితే పార్టీలో ముసలి గుర్రాలనన్నిటినీ బయటకు పంపడమో లేక పక్కనపెట్టడమో చేస్తారని కాంగ్రెస్ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ అప్పుడే ఆయనను ప్రసన్నం చేసుకొనేపనిలో పడ్డారు. అందుకే ఇంతకాలం వేరే పార్టీలలోకి మారుదామని విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయిన కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు హడావుడిగా తమ ముందు ఉన్న ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొంటూ ధర్నాలు చేసి ఇటు రాష్ట్ర ప్రజల దృష్టిలో, అటు రాహుల్ గాంధీ దృష్టిలో పడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు కూడా స్థానిక అంశాలను దొరకబుచ్చుకొని హడావుడి చేస్తుండటం గమనిస్తే ఈ అనుమానం నిజమేనని అర్ధమవుతుంది.   ఇక కీలకమయిన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన తన కొడుకుపై ఈగ వాలకుండా చూసుకోనేందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అందివచ్చిన ప్రతీ అంశంతో కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తోంది. ఆమె వ్యూహం ఫలించినట్లే ఉంది. అందుకే పార్లమెంటులో సభ్యులు ఎవరూ రాహుల్ గాంధీ ప్రసక్తి తేవడం లేదు. ఈ విషయం గురించి బీజేపీ, ఎన్డీయే సభ్యులు కూడా పార్లమెంటులో లేవనెత్తకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   శలవు మీద వెళ్లిన రాహుల్ గాంధీ తిరిగివచ్చి ఏమి మాయ చేస్తాడో...అని ప్రజలందరూ చర్చించుకొంటున్నారు. ఆనక ఆయన తుస్సుమనిపిస్తే ఆయన ప్రతిష్టతో బాటు కాంగ్రెస్ ప్రతిష్ట కూడా మంట కలుస్తుందనే భయంతో ఆయన శలవుకి అంత ‘హైప్’ ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలు తమకు తెలిసిన ఇటువంటి రకరకాల తక్కు టమార గారడీ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని భావించవచ్చును. స్వామీ కార్యంతో బాటు స్వకార్యం కూడా వారు చక్కబెట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చును. వాటికి ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అనే కలరింగ్ ఇచ్చుకొంటున్నారు అంతే!

ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్రజలతో డబల్ గేమ్ ఆడుతోందా?

  కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజించిందో అందరికీ తెలుసు. అందుకోసం ఏమేమీ చేసిందో, ఏవిధంగా చేసిందో దాని పరిణామాలు ఏవిధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేసినందున, ఏ ఒక్క పనీ కూడా సవ్యంగా, చిత్తశుద్ధితో చేయకపోవడం వలన వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్నట్లయింది. రాష్ట్ర విభజన చేస్తున్న సమయానికే కాంగ్రెస్ అధిష్టానం తన పార్టీ ఆంధ్రాలో ఓడిపోబోతోందనే విషయం గ్రహించింది. అందుకే చివరి ప్రయత్నంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తాయిలం ప్రకటించింది.   గత పదేళ్లుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఏదయినా ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే దానికి ఎటువంటి ప్రక్రియ ఉంటుంది? ఎటువంటి సమస్యలు ఎదురవుతాయనే విషయాలు తెలియవనుకోలేము. అయినా ముందు వెనుకా చూడకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని ప్రధాని డా. మన్మోహన్ సింగ్ చేత పార్లమెంటులో ప్రకటన చేయించేసింది. ఆ తరువాత ఎన్నికల ప్రచార సభలలో కాంగ్రెస్ నేతలు దాని గురించి చాలా గొప్పగా ప్రచారం చేసుకొన్నారు కూడా. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిందిగా కోరుతూ ప్రధాని మోడీకి ఒక లేఖ కూడా వ్రాసారు.   ఇక రాష్ట్ర విభజన బిల్లును రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కర్నాటక రాష్ట్రానికి చెందినవారయినప్పటికీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపిక అయినందున ఈ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో మొదటి నుండి ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలయితే ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల కార్యక్రమం కూడా చేప్పట్టారు కూడా. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ఈ విషయంలో ముందుకీ, వెనక్కీ వెళ్ళలేక తడబడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీసుకొని దానిపై యుద్దం ప్రకటించేసింది. వీరందరి పోరాటాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలని కోరుకొంటునట్లు స్పష్టమవుతోంది.   కానీ మాజీ కేంద్రమంత్రి, విభజన బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన వీరప్ప మొయిలీ ఇప్పుడు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాని వలన ఇరుగుపొరుగు రాష్ట్రాలలో అనేక పరిశ్రమలు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని, అప్పుడు ఆయా రాష్ట్రాలలో పారిశ్రామిక ప్రగతి దెబ్బ తింటుందని, రాష్ట్రాల మధ్య ప్రాంతీయ అసమానతలు పెరిపోతాయని కేంద్రాన్ని హెచ్చరించారు.   అయితే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఎదురవుతాయని వాదిస్తున్న ఆయన ఆనాడు తమ ప్రభుత్వమే దానిని ప్రకటించినపుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అదేవిధంగా తన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సహా అందరూ కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెండు రాష్ట్రాలకు విభజన బిల్లులో పేర్కొన్న అన్ని హామీలు అమలుచేయమని గట్టిగా పోరాడుతున్నప్పుడు ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం వారించకపోవడాన్ని ఏవిధంగా భావించాలి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే రాష్ట్ర విభజన బిల్లులోనే ఏపీకి ప్రత్యేక హోదా హామీని కూడా చేర్చి ఉండేది. కానీ దానికి ఆ చిత్తశుద్ధి, ఉద్దేశ్యం రెండూ కూడా లేవు గనుకనే బిల్లులో చేర్చలేదు. రాజ్యసభలో బీజేపీ మద్దతుతో బిల్లును ఆమోదింపజేసుకోవడానికే అప్పటికప్పుడు డా. మన్మోహన్ సింగ్ చేత హడావుడిగా ప్రకటన చేయించేసింది. కనీసం ఇప్పటికయినా ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకి న్యాయం చేయాలనే ఉద్దేశ్యం కానీ చిత్తశుద్ధి గానీ కాంగ్రెస్ పార్టీకి లేదని వీరప్ప మొయిలీ వాదనలు రుజువు చేస్తున్నాయి.

ఉద్యోగులు ఆంధ్రాకి తరలివచ్చేందుకు అడ్డుపడుతున్న ఆర్టికల్ 371 (డి)

  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి కొనసాగుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వపరిపాలనా వ్యవస్థను విజయవాడకు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ఉద్యోగుల సహకారం లేకపోవడంతో ఫలించడం లేదు. ఉద్యోగులు చెపుతున్న ఇతరత్రా కారణాలతో బాటు మరో బలమయిన కారణం కూడా ఉంది.   రాష్ట్ర విభజన తరువాత కూడా ఆర్టికల్ 371(డి)ని రెండు రాష్ట్రాలలో యధాతధంగా కొనసాగించబడుతోంది. కనుక ఒకవేళ ఏపీ ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చినట్లయితే వారి పిల్లలు స్థానికేతరులుగా పరిగణింపబడుతారు. కనుక వారు రాష్ట్రంలో ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు కోల్పోతారు.   ఆర్టికల్ 371 (డి) లో సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ఆంధ్రా జిల్లాలు 1,2,3 జోన్లుగాను, రాయలసీమ జిల్లాలు 4వ జోన్ గాను విభజించబడ్డాయి. మిగిలిన 5 మరియు 6 జోన్లు తెలంగాణాలో ఉన్నాయి. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు జోన్-5 లో ఉన్నారు. ఈ సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ఒక జోన్ లో ఉద్యోగులు మరో జోన్ లోకి పదోన్నతులతో బదిలీలపై వెళ్ళడానికి కానీ లేదా రిక్రూట్మెంట్లు చేయడానికి వీలులేదు. ఇది కూడా ఉద్యోగుల అభ్యంతరాలకు ఒక ప్రధాన కారణంగా ఉంది. కనుక మరో రెండు మూడేళ్ళలో తుళ్ళూరు వద్ద నూతన రాజధాని నిర్మించినప్పటికీ, ఈ ఆర్టికల్ 371(డి)ని పార్లమెంటులో సవరించి వారికి వెసులుబాటు కల్పిస్తే తప్ప హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడికి తరలివెళ్ళలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇదే విషయాన్ని ఏపీ ఎన్జీవోలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేసారు. బహుశః ఈ కారణంగానే అమరావతి వద్ద తాత్కాలిక రాజధాని నిర్మించి అక్కడికి ప్రభుత్వాన్ని తరలించాలనే ఆలోచనను ఆయన విరమించుకొని ఉండవచ్చును.   కానీ ఇప్పుడు కాకపోయినా రెండేళ్ళ తరువాత అయినా ఉద్యోగులు నూతన రాజధానికి తరలి రావలసి ఉంటుంది కనుక, ఈ అంశంపై అధ్యయనం చేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్ధిక, న్యాయ మరియు మునిసిపల్ శాఖ మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని నియమించారు. వారు ఏప్రిల్ 15 వ తేదీలోగా తమ నివేదికను సమర్పిస్తారు. దాని ఆధారంగా ఆర్టికల్ 371(డి)వల్ల తమకు ఎదురవుతున్న ఈ ఇబ్బందుల గురించి వివరిస్తూ వాటిని సవరించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ వ్రాస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని సంబంధిత కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువెళతారు.   ఆర్టికల్ 371(డి)ని సవరించాలంటే పార్లమెంటులో 2/3వ మంది సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. అంటే ఈ సమస్య చాలా జటిలమయినదేనని స్పష్టం అవుతోంది. మరి దీనిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిధంగా ఎప్పటిలోగా పరిష్కరిస్తాయో చూడాలి.

వెంకయ్య నాయుడు మంచి ప్రయత్నమే చేసారు

  రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేస్తామని కేంద్రం హామీ ఇస్తున్నప్పటికీ అది ఆచరణలో కనబడకపోవడంతో రెండు రాష్ట్రాలలో ప్రజలలో, ప్రభుత్వాలలో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని అది క్రమేపీ పెరుగుతూ వస్తోంది. కానీ బీజేపీ దానిని పసిగట్టడంలో విఫలమయ్యిందో లేక ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమను గట్టిగా ప్రశ్నించవని భావించిందో తెలియదు కానీ ఇంతకాలం ఒట్టి హామీలతో కాలక్షేపం చేసింది. ఆ కారణంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఇరు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువెత్తిన నిరసనలు, నేటికీ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు  ఆందోళనలు ఉద్రుతమయ్యాయి. అప్పుడు కానీ బీజేపీ పూర్తిగా మేల్కొనలేకపోయింది.   కానీ అలాగని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఇంతవరకు ఏమి చేయలేదని కానీ అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోందని కూడా మోడీ ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాదు. కేంద్రం తెర వెనుక తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. కానీ ఇరురాష్ట్రాలలో బీజేపీ నేతలు ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాలతో కుస్తీ పట్లు పట్టేందుకే ప్రయత్నించేరు తప్ప కేంద్రం ఇరు రాష్ట్రాలకు ఏమేమి ఇచ్చింది ఇంకా మున్ముందు ఏమేమి ఇవ్వబోతోంది? అనే విషయాలను ప్రజలకు చెప్పుకోవడంలో అశ్రద్ధ వహించారు. అందుకే ప్రజలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది.   ఇంతకాలం హామీలు అమలుచేస్తామని పదేపదే చెపుతున్న వెంకయ్య నాయుడు తన పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వం పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలలో నెలకొన్న అపోహలను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా మొత్తం 35 మంది కేంద్రమంత్రులను తన చాంబర్ లో సమావేశపరిచి వారిచేతనే రెండు రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ఇంతవరకు ఏమేమి చేసింది, ఏమేమి చేయబోతోంది? హామీల అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే విషయాలపై మీడియాకు సమాధానాలు చెప్పించారు. వారు చెప్పిన ప్రకారం రెండు రాష్ట్రాల కోసం కేంద్రప్రభుత్వం తెరవెనుక చాలా కృషి చేస్తున్నట్లు స్పష్టమయింది.   ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ (ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి), పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు, తిరుపతిలో ఐఐటి, ఐ.ఐ.యస్.ఈ.ఆర్.లకు త్వరలో శంఖుస్థాపన, మంగళగిరిలో ఎయిమ్స్‌ ఆసుపత్రి ఏర్పాటు, కడపలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నెలకొల్పే విషయంపై స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌), ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఫీల్డ్‌ క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, విశాఖలో ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీసు కార్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని సంబంధిత కేంద్రమంత్రులు చెప్పారు. వాటిలో కొన్ని ప్రతిపాదనలు పరిశీలనలో ఉండగా, మరికొన్నిటి కోసం సాంకేతిక అధ్యయనం జరుగుతోంది. తిరుపతిలో ఐఐటి వంటి సంస్థలకు త్వరలోనే శంఖు స్థాపన చేయబోతున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.   ఇక తెలంగాణాకి సంబంధించి, రామగుండంలో ఎంజిఆర్‌ ప్రాంతంలో 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టు రామగుండంలో ఫర్టిలైజేషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌ను పునరుద్ధరన, గ్యాస్‌ ఆధారిత ఎరువుల ప్లాంట్‌ను ఏర్పాటు, హైకోర్టు విభజన, రెండు రాష్ట్రాల మధ్య జాతీయ రహదారుల నిర్మాణం వంటివి వివిధ దశలలో ఉన్నట్లు సంబంధిత కేంద్రమంత్రులు చెప్పారు.   కేంద్రప్రభుత్వం తెరవెనుక ఇంత కృషి చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఇంతవరకు ప్రజలకు చేరవేయడంలో అలసత్వం ప్రదర్శించినందునే ప్రజలలో ఈ అపోహలు కలిగాయి. వెంకయ్య నాయుడు చేసిన ఈ ప్రయత్నం వలన ఆ అపోహలు కొంతయినా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వారు చెపుతున్నవన్నీ వీలయినంత త్వరగా ఆచరణలోకి వచ్చేందుకు వారు గట్టిగా కృషి చేయాలి.

వారి దారులు వేరయినా గమ్యం ఒక్కటే...రాష్ట్రాభివృద్ధి!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు కేసీఆర్ ఇరువురు తమ తమ రాష్ట్రాల అభివృద్ధికి విభిన్న మార్గాలను ఎంచుకొన్నట్లు వారి ప్రభుత్వ కార్య ప్రణాళికలను గమనిస్తే అర్ధమవుతుంది. తెలంగాణాలో భూములు అంత సారవంతమయినవి కావు. పైగా వాటికి నీటి సదుపాయం కూడా లేదు. దానికి తోడు రాష్ట్రంలో విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఈ సమస్యల కారణంగా 65 శాతం గ్రామాలు పేదరికంతో బాధపడుతున్నాయి.   ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ పధకాలను అమలుచేస్తున్నారు. తద్వారా విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా గ్రామాలకు త్రాగునీరు, పంటలకు సాగునీరు అందుతుంది. ఒకసారి చెరువులు నిండితే భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అదేవిధంగా చెరువులలో తీసిన అత్యంత పోషక విలువలున్న పూడిక మట్టిని పంట భూములపై వేసుకొన్నట్లయితే భూమిలో సారం కూడా పెరుగుతుంది. చెరువులు నిండి పంటలకు సకాలంలో నీళ్ళు అందుతుంటే పంటలు కూడా పండుతాయి. తద్వారా క్రమంగా పేదరికం కూడా తగ్గుతుంది. ఈవిధంగా బహుళ ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే నాలుగేళ్లలో తెలంగాణా రాష్ట్రంలో స్పష్టమయిన అభివృద్ధి కనబడటం తధ్యం. బహుశః కేసీఆర్ చేప్పట్టిన ఈ ప్రాజెక్టు యావత్ దేశానికి ప్రేరణ కలిగించినా ఆశ్చర్యం లేదు. కనుక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రాజెక్టుని రాష్ట్రంలో అమలు చేసేందుకు ఇప్పటి నుండే ప్రయత్నిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి.   ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐ.టి, విద్య, స్కిల్ డెవెలప్ మెంట్, పారిశ్రామిక, వాణిజ్య, మౌలికవసతులపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్లున్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం కూడా అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొన్నారు. ఆయన అనుకొన్నట్లుగా వచ్చే నాలుగేళ్లలో రాజధాని నగరానికి ఒక రూపు రేఖలు తీసుకురాగలిగి, పైన పేర్కొన్న అన్ని రంగాలలో అభివృద్ధి చేయగలిగితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలంగాణా కంటే మెరుగయ్యే అవకాశం ఉంది.   రాష్ట్రానికి సువిశాలమయిన సముద్రతీరం ఉంది. కనుక కొత్తగా పోర్టులను నిర్మించి వాటిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో అనుసంధానం చేసే విధంగా విశాలమయిన రోడ్లు నిర్మించడం ద్వారా వ్యాపార కార్యక్రమాలు పెరిగి రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.   అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సారవంతమయిన భూములున్నాయి. వాటికి సాగునీరు అందించడానికి కూడా ప్రభుత్వం అనేక పధకాలు సిద్దం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగినట్లయితే రాజధాని నిర్మాణం వలన 40,000 ఎకరాలలో కోల్పోతున్న పంట దిగుబడి ఇతర ప్రాంతాలలో తిరిగి సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈలోగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా కూడా దిగుబడి పెంచి సమతుల్యం సాధించాలని భావిస్తున్నారు.   ఈ విధంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాభివృద్ధికి విభిన్న మార్గాలు, వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వచ్చేఎన్నికల నాటికి ఇరు రాష్ట్రాలలో జరిగిన అభివృద్ధి వారి చిత్తశుద్ధికి, సమర్ధతకు గీటురాయిగా నిలుస్తుంది.

ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర సహకారమే కీలకం

  రాష్ట్ర విభజన తరువాత తీవ్ర ఆర్ధికసమస్యలలో చిక్కుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అందులో నుండి బయటపడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ ఇంతవరకు కేంద్ర సహకారం లేకపోవడంతో పరిస్థితుల్లో పెద్ద మార్పు కనబడటంలేదు. రాష్ట్రం విద్యుత్ సమస్యలను అధిగమించగలిగింది గానీ ఇంకా ఆర్ధిక సమస్యలను మాత్రం అధిగమించలేకపోతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహకారం కోరుతోంది. తీవ్ర ఒత్తిడి వచ్చిన తరువాత ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వంలో చిన్న కదలిక కనబడుతోంది. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులతో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న భేటీ అయ్యి రాష్ట్రానికి అవసరమయిన నిధులు, ఇతర ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకొన్నారు. బహుశః త్వరలోనే నిధులు విడుదల కావచ్చును. నిధులు విడుదల అయితే పనులు కూడా మొదలవుతాయి. మే నెల రెండవ వారంలో రాజధాని నిర్మాణానికి శంఖు స్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా వచ్చే ఎన్నికలలోగా పోలవరం ప్రాజెక్టు, మెట్రో రైల్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనుకొంటోంది. ఈ మూడూ పూర్తికావాలంటే కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేస్తుండాలి.   రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఉన్న రాజకీయ మరియు సాంకేతిక ఇబ్బందులను గమనిస్తే అది అసాధ్యమనే స్పష్టమవుతోంది. అయినా ఇస్తామని కేంద్రం హామీ ఇస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఒత్తిళ్ళకి తలొగ్గి ఇస్తామని హామీ ఇచ్చి ఆ తరువాత ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తే దాని వలన బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ఇంకా చెడ్డపేరు వస్తుంది. కనుక సాధ్యం కాదనుకొన్నప్పుడు హామీలతో కాలక్షేపం చేయడం కంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం గురించి మాట్లాడుకొని అందుకు ప్రత్యామ్నాయంగా ఏమిచేయవచ్చో అది చేస్తే వాటిపైనా ఈ ఒత్తిడి తగ్గుతుంది. దాని వలన రాష్ట్రానికి కొత్త ఐటి, వాణిజ్య, పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఆర్ధిక సమస్యల నుండి బయటపడాలంటే అందుకే ఇదే ఏకైక మార్గం. రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కు కొనేందుకు కేంద్రం ఇప్పుడు సహాయసహకారాలు అందించినట్లయితే, దానిపై రాష్ట్రం ఆధారపడటం కూడా తగ్గుతుంది. తిరిగి కేంద్రానికే ఆదాయం సమకూర్చగలుగుతుంది.

రాష్ట్ర విభజన నుండి నేర్చుకోవలసిన గుణపాఠం

  రాష్ట్ర విభజన వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంటే, తెలంగాణా రాష్ట్రం దేశంలో గుజరాత్ తరువాత రెండవ ధనిక రాష్ట్రంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దృవీకరించారు. ఆ ఆదాయంలో ప్రధానంగా హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల నెలకొల్పబడిన వేలాది ఐటి మరియు ఇతర పరిశ్రమలు, వ్యాపార సంస్థల నుండే వస్తోందనే మాట కూడా అంతే యదార్ధం. అందుకే హైదరాబాద్ లేని తెలంగాణా మాకు అక్కరలేదని తెలంగాణావాదులు ఆనాడు పట్టుబట్టి మరీ సాధించుకొన్నారు. అదే వారికి నేడు అక్షయ పాత్రగా మారి ఆదుకొంటోందని చెప్పవచ్చును.   రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా బలపడుతుందని తాను ఆనాడే చెప్పానని కేసీఆర్ అన్నారు. ఆయన నిజంగా ఆ మాట అని ఉండి ఉంటే అది ఆయన దూరదృష్టికి నిదర్శనమని ఒప్పుకోక తప్పదు. కానీ పదేళ్లుగా తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పటికీ రాష్ట్రాన్ని పాలించిన మహామహులయిన ఆంద్ర పాలకులెవరూ కూడా ఏదో ఒకనాడు రాష్ట్రం విడిపోతుందని, అప్పుడు హైదరాబాద్ ని వదులుకొని చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇలా నడిరోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుందని ఊహించలేకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక పక్క రాష్ట్ర విభజన కోసం ఉద్యామాలు జరుగుతుండటం కళ్ళార చూస్తూ కూడా వారు మేల్కొనకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం పదేళ్ళ క్రితం నుండయినా ఆంధ్రాలో అన్ని జిల్లాలకు అభివృద్ధిని వికేంద్రీకరించే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండి ఉంటే నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించి ఉండేదికాదు. కానీ పాలకులకి ఆ దూరదృష్టి లేకపోవడం వలన రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను పూర్తిగా విస్మరించి ఒక్క హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేసుకొంటూపోయారు.   కనుక ఈ పరిస్థితులకి ఇప్పుడు వారినే నిందించక తప్పదు. కానీ ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకొని వారిని నిందిస్తూ బాధపడటం కంటే మళ్ళీ అటువంటి ఘోరమయిన తప్పిదం చేయకుండా రాష్ట్రంలో 13 జిల్లాలకు సమానంగా అభివృద్ధిని విస్తరించే ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ పాలకులు ఈ విషయాన్ని మళ్ళీ విస్మరించినా సమాజంలో మేధావులు ఈ విషయాన్ని సదా వారికి గుర్తు చేస్తుండటం చాలా అవసరం.   అయితే ఈ చేదు అనుభవం నుండి నేర్చుకోవలసిన మరో గుణపాటం కూడా ఉంది. అదేమిటంటే రాష్ట్రంలో కనీసం ఒక్క నగరాన్ని గట్టిగా అభివృద్ధి చేసినా అది యావత్ రాష్ట్రాన్ని ఆదుకొంటుందని తెలంగాణా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే అర్ధమవుతోంది. బహుశః ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని తహతహలాడుతున్నారు. అది కేవలం రాజధాని నగరంగా మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్ధిక రాజధానిగా తయారుచేయాలని ఆయన చాలాసార్లు చెప్పడం గమనిస్తే ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధమవుతోంది.   ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి ఏవిధంగా కేటాయిస్తున్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించిన తరువాత దానిపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల అభివృద్ధికి కేటాయించినట్లయితే క్రమంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది.   కానీ అంతవరకు డబ్బు కోసం కటకటలాడక తప్పదు కనుక ఈలోగా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూర్చగల ఐటి, పరిశ్రమలు, వ్యాపార సంస్థల స్థాపనకు ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో కృషి చేయవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడి ఆ దిశలో ఇప్పటికే చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఈ కష్టాల నుండి ఏదో విధంగా ఒడ్డేక్కిస్తారనే అపారమయిన నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు తెదేపాకు అధికారం కట్టబెట్టారు. కనుక ఇటువంటి తీవ్ర వ్యతిరేక పరిస్థితులలో కూడా ఆయన రాష్ట్రాభివృద్ధి చేయవలసిన బాధ్యత వహిస్తున్నారు. కానీ దానర్ధం అన్నీ ముఖ్యమంత్రే చూసుకొంటారనే మంత్రుల, సంబంధిత అధికారుల భావన సరయినది కాదు. వారందరూ అటువంటి భావన నుండి బయటపడి ప్రతీ ఒక్కరు స్వయంగా చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను సదా గుర్తుంచుకొని ప్రజా ప్రతినిధులు అందరూ కూడా తమ తమ నియోజక వర్గాలను వీలయినంత వేగంగా అభివృద్ధి చేసుకొంటే చాలు. రాష్ట్రం ఒడ్డున పడుతుంది.

ఇంతఃకీ శాసనసభ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నట్లు?

  పేరుకే అవి బడ్జెట్ సమావేశాలు. కానీ అక్కడ జరిగేది ఒకరిని ఒకరు కుక్క నక్కా అని తిట్టుకోవడం..నువ్వింత బొక్కేసావు అంటే నువ్వు మాత్రం బొక్కేయలేదా..? అంటూ ఒకరి చరిత్ర మరొకరు త్రవ్వి పోసుకోవడం. నువ్వు అవినీతిపరుడవని ఒకరు అంటే నువ్వు నీ కుటుంబంలో అందరూ కూడా హంతకులు ...అవినీతిపరులే అంటూ అందరూ కలిసి ఇంటిగుట్టు బయటపెట్టుకొంటున్నారు. కాకపోతే ఆంద్ర, తెలంగాణా శాసనసభలలో వేరు వేరు అంశాలను అడ్డుపెట్టుకొని ఈ తిట్ల పురాణం నడుస్తోంది. ఇటువంటి సమావేశాలు కేవలం 17 రోజులకే పరిమితం చేస్తే ఎలాగని జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడిపోయాడు. కానీ ఉన్న ఆ కొద్ది సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదనే ఆలోచనతో అధికార తెదేపాపై విరుచుకుపడుతున్నారు. కానీ ప్రజా సమస్యలను పరిష్కరించనందుకు కాదు. తనకు అధికారం దక్కనీయకుండా చేసిన చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధించాలనే తపనతోనే. అది ఆయన మాటలలో స్పష్టంగా కనబడుతోంది.   తుళ్ళూరులో భూసేకరణ, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దాని కోసం కేంద్రం నుండి నిధులు ఏవిధంగా రాబట్టుకోవాలి? వంటి అంశాలపై సభలో లోతుగా చర్చించాల్సిన ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత దూషణలతో విలువయిన సభా సమయం వృధా చేస్తుండటం చూసి ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు.   తెలంగాణా శాసనసభలో ఇందుకు అతీతం కాదు. కాకపోతే అందులో సభ్యులు మరీ ఇంత లోతుగా వెళ్లి ఒకరినొకరు తిట్టుకొకపోవడమే ఆ రాష్ట్ర ప్రజలు చేసుకొన్న అదృష్టం. కాంగ్రెస్ శాసనసభ్యురాలు డీకే అరుణ, మంత్రి కేటీఆర్ ల మధ్య మొదలయిన వివాదం చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో వాటిని ఉపసంహరించుకోవడంతో ముగిసింది. తెలంగాణా శాసనసభ నుండి తెదేపా సభ్యులందరినీ ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చగా మిగిలిపోనుంది. జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు తెదేపా సభ్యులు చాలా అవమానకరంగా వ్యవహరించారనే మిషతో వారిని సస్పెండ్ చేసారు. కానీ గవర్నరు ప్రసంగిస్తుంటే తెదేపా, కాంగ్రెస్ సభ్యులతో కుస్తీపట్లు పట్టిన తెరాస యం.యల్యేలను ఎందుకు సస్పెండ్ చేయకుండా వదిలేసారు? అనే బీజేపీ సభ్యుడి ప్రశ్నకు తెరాస వద్ద సమాధానం లేదు.   ఇప్పుడు సభలో తెదేపా సభ్యులు లేరు కనుక ఇక కాంగ్రెస్ సభ్యుల వంతు వచ్చినట్లుంది. తెరాస, కాంగ్రెస్ సభ్యుల వాదోపవాదాలకే సమయం సరిపోయింది. ఇరు సభలలో చాలా రాద్ధాంతం జరిగింది. ఇంకా మున్ముందు జరుగుతుంది కూడా. దాని వలన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం నష్టపోవు. ప్రజలే నష్టపోతారు. ఉదాహరణకి రాజధాని భూసేకరణ గురించి సభలో చర్చ జరుగుతుందని రైతులు ఎదురు చూస్తే తాత ముత్తాల రక్త చరిత్రలపై చర్చలు సాగాయి. తెలంగాణాలో పేదలకు ఇళ్లు, భూములు, పెన్షన్లు పంపకాలు, విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలపై చర్చలు జరుగుతాయి అనుకొంటే ‘నోరు మూసుకోమని’ డీకే అరుణ అనడం అందుకు అధికార పార్టీ సభ్యులు ప్రతి చేసిన విమర్శలతో పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది.   మళ్ళీ రేపు రెండు శాసనసభలు సమావేశమవుతాయి. మళ్ళీ ఏదో అంశం అడ్డుపెట్టుకొని ఒకరినొకరు తిట్టుకొంటారు. సమావేశాలు ముగిసేవరకు కూడా బహుశః ఇలాగే సాగవచ్చును. చివరికి ముఖ్యమయిన అంశాల మీద ఎటువంటి అర్ధవంతమయిన చర్చ చేయకుండానే ఆమోదముద్ర పడిపోతుంది. వాటిలో ఏమయినా లోపాలుంటే అందుకు ప్రజలు నష్టపోవాలి. ప్రజాప్రతినిధులు మాత్రం కాదు.

ఇందుకే అయితే 40 రోజులు సమావేశాలు అనవసరమే

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలను కేవలం పదిహేడు రోజులే నిర్వహించాలనే తెదేపా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధాన పతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలను సభలో చర్చించేందుకు వీలుగా కనీసం నలబై రోజులు సమావేశాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై చర్చించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించినప్పుడు, అందులో పాల్గొన్న వైకాపా నేతలు ఈ సమావేశాలలో తాము చర్చించదలచుకొన్న అంశాలతో కూడిన ఒక జాబితాను ఆయనకు అందజేశారు. అయితే వాటిలో కొన్నిటిని ఆయన తిరస్కరించినప్పుడు, తాము ఇచ్చిన అజెండాలో అంశాలను చర్చకు అంగీకరించకపోయినట్లయితే సభలో ఇబ్బంది కలిగిస్తామని హెచ్చరించినట్లు వార్తలు వచ్చేయి. దానిని అధికార ప్రతిపక్షాలు అన్నీ తీవ్రంగా తప్పు పట్టాయి. ఈరోజు శాసనసభ సమావేశాలు మొదలవగానే వైకాపా నేతలు తాము ఇచ్చిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టడం చూస్తే వారే సభలో మరే ఇతర అంశాలు, సమస్యలపై చర్చించేందుకు వెనుకాడుతున్నట్లు ఉంది. పోడియం వద్దకు దూసుకు వచ్చి సభాకార్యకలాపాలకు అడ్డు తగులుతున్న వైకాపా నేతలను వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారించకపోవడం గమనిస్తే ఆయన ప్రోద్బలంతోనే, ఆదేశానుసారమే సభా కార్యక్రమాలు సజావుగా సాగకుండా చేస్తున్నట్లుంది. అటువంటప్పుడు శాసనసభ సమావేశాలు నలబై రోజులు కాదు నాలుగు నెలలు నిర్వహించినా ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు.   వైకాపా సభ్యులు తమ ఆందోళన విరమించి సభా కార్యక్రమాలు సజావుగా సాగనిస్తే వారు పేర్కొన్న అన్ని అంశాలపైన చర్చించడానికి వీలుపడుతుందని స్పీకర్ కోడెల శివప్రసాద్ మరియు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే చెపుతున్నప్పటికీ వారు తమ ఆందోళన విరమించకపోవడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేయవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ సభ సమావేశమయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని తన మైక్ కట్ చేస్తున్నారంటూ దాదాపు ఒక 20 నిమిషాల పాటు మాట్లాడారు.   అసలు ఆయన తన పార్టీ సభ్యులకే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనే సమయం అంతా హరించివేస్తున్నప్పుడు, మళ్ళీ తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని స్పీకర్ ని ప్రభుత్వాన్ని నిందించడం ఒక విచిత్రమనుకొంటే, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే అంశం మీదనే ఆయన సభలో అనర్గళంగా మాట్లాడుతుండటం మరో విచిత్రం. ఈవిధంగా అసలు సమస్యలు పక్కను బెట్టి సభలో వృధా ప్రసంగాలు చేయడం వలన ప్రయోజనం ఏమిటి?   తెలంగాణా శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా ఇంచుముంచు 17 రోజులే సాగుతున్నాయి. అక్కడ అధికార ప్రతిపక్షాలవారు వేరే అంశాలపై పోరాడుతున్నారు. అది వేరే సంగతి. కానీ అక్కడ సభ్యులెవరూ సభని 40 రోజులు ఎందుకు నడపడం లేదని జగన్మోహన్ రెడ్డిలా వితండవాదం చేయడం లేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకొంటూ, ప్రజాసమస్యలపై లోతుగా చర్చించే మాటయితే అటువంటి సమావేశాలకి ఒక అర్ధం ఉంటుంది. కానీ ప్రజాసమస్యలను గాలికొదిలి రాజకీయ పార్టీలు తమ పార్టీ ప్రయోజనాలనే సభ ఎజెండాగా చేయాలనుకొంటే అటువంటి సమావేశాల వలన వాటికీ ప్రయోజనం ఉండవచ్చునేమో కానీ ప్రజలకు మాత్రం ఏమీ ఉండబోదని చెప్పక తప్పదు. అటువంటి వాటి కోసం 40 రోజులు సభను నడిపినా విలువయిన ప్రజాధనం వృధాకావడం తప్ప వేరే ప్రయోజనం ఏముంటుంది?

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమి మాట్లాడుతాడోఆయనకే తెలియదు: జగన్

  పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాలలో తనకంటే ఒకరోజు ముందే పర్యటించబోతున్నారనే సంగతి తెలిసి కంగారుపడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనపై తన మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు. కానీ తన పర్యటన తరువాతే పవన్ కళ్యాణ్ తుళ్ళూరుకి బయలుదేరుతారని తెలిసి ఆయన చల్లబడ్డారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ తుళ్ళూరులో ఒకలాగ, హైదరాబాద్ చేరుకోగానే మరొకలాగా మాట్లాడి అభాసుపాలవడంతో అందరి కంటే ఎక్కువగా వైకాపాయే చాలా సంతోషించి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అదే అభిప్రాయం జగన్ మాటలలో ప్రతిఫలించింది.   నిన్న శాసనసభ సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్, ఒక ప్రశ్నకు బదులిస్తూ, “ఆయన (పవన్ కళ్యాణ్) ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఆయన తుళ్ళూరులో ఏమి మాట్లాడారో, హైదరాబాద్ కి తిరిగి వచ్చి ఏమి మాట్లాడారో అందరూ విన్నారు. మరి రేపు ఏమి మాట్లాడబోతాడో ప్రజలే ఆయనని అడగాలి,” అని సమాధానం ఇచ్చేరు. కానీ తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన భూ కుంభకోణాల గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు మాత్రం నేరుగా సమాధానం చెప్పకుండా, “ఆయన చనిపోయి ఏడేళ్లయింది. చనిపోయిన వ్యక్తి గురించి ఇపుడు కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఇపుడు జరుగుతున్న అక్రమాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని నేర్పుగా సమాధానం దాటవేసారు.   ఏడేళ్ళ క్రితం చనిపోయిన తన తండ్రి పేరు చెప్పుకొని ఇప్పటికీ ఓదార్పు యాత్రలు చేస్తూ, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి చెప్పుకొంటూ రాజకీయ లబ్ది పొందాలని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన హయాంలో జరిగిన అవినీతి గురించి మాత్రం ఎవరూ మాట్లాడకూడదని అంటున్నారు. పైగా తనకు ప్రజలు అవకాశమిస్తే మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపిస్తానని గొప్పగా చెప్పుకొంటున్నారు కూడా! నేటికీ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? డిల్లీలో ఉండే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంస్థ జగన్ కి చెందిన వందల కోట్లు ఆస్తులను ఎందుకు జప్తు చేసుకొంటోంది? అయినా దానిపై జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మీడియా గానీ ఎప్పుడు ఎందుకు స్పందించవు? అని ప్రశ్నించుకొంటే వచ్చే సమాధానం ఆయన నీతి నిజాయితీల గురించి తెలియజేస్తుంది.   నిజమే! పవన్ కళ్యాణ్ బొత్తిగా రాజకీయ అనుభవం లేక తప్పటడుగులు వేస్తూ అభాసుపాలవుతున్నారు. అందుకు ఆయనే నష్టపోతారు. కానీ బొత్తిగా రాజకీయ అనుభవం లేని ఆయన తుళ్ళూరు పర్యటిస్తారనగానే వైకాపా ఎందుకు ఉలికిపడింది? ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? అని ప్రశ్నించుకొంటే ఎవరు ఎంత నీతిమంతులో, ఎవరి పోరాటంలో ఎంత నిజాయితీ ఉందో అందరికీ అర్ధమవుతుంది.   ఒకవేళ ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లయితే, ఆయన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయవచ్చును. ఇంకా అవసరమనుకొంటే కోర్టుకు కూడా వెళ్లి ఆ అక్రమాలను అడ్డుకోవచ్చును. ఆయనను ఎవరూ అడ్డుకోవడం లేదు. కానీ, ఆయన ఈ అంశాలను కూడా తన రాజకీయ లబ్ది కోసమే ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలకు, రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతోందని ఆవేదనతో మాట్లాడుతున్న మాటలు కావవి.   ఇక కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో విఫలమయినప్పటికీ ఇంకా తెదేపా, బీజేపీతో ఎన్డీయేతో అంటకాగుతూ డ్రామాలు ఆడుతోందని ఆక్షేపించారు. అంటే కేంద్రం నిధులు ఇవ్వకపోతే తక్షణమే తెదేపా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారన్న మాట. అయితే అలా చేస్తే కేంద్రం నుండి భారీగా నిధులు వచ్చిపడిపోతాయా? లేక రాష్ట్రం ఇంకా నష్టపోతుందా? అని ఆలోచిస్తే నష్టపోయే అవకాశాలే ఎక్కువని ఎటువంటి రాజకీయ జ్ఞానం లేని వారు కూడా చెప్పగలరు. కానీ తనను తాను గొప్ప రాజకీయ మేధావిగా, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పరితపించిపోయే గొప్ప వ్యక్తిగా భావించుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, కేంద్రంతో తెగతెంపులు చేసుకోమని సలహా ఇస్తున్నారు! దేనికి? అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి లేదా వైకాపా నేతలెవరూ సమాధానం చెప్పకపోవచ్చును. కానీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా ఎన్డీయే కూటమిలో చేరాలని కొందరు ఆరాటపడుతున్నట్లు కనబడుతోంది. ఒకవేళ తెదేపా మా కూటమి నుండి బయటకు వచ్చేస్తే వాళ్ళు లోపలకి ప్రవేశించాలని చూస్తున్నట్లుంది. కానీ అది అసంభవం. తెదేపా, బీజేపీల మధ్య మంచి బలమయిన స్నేహ సంబంధాలున్నాయి. రెండూ కలిసి రాష్ట్రాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి కలిసి పనిచేస్తాయి,” అని చెప్పారు.   కేంద్రం నిధులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించాలి. కానీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఎందుకు? అంటే దానికీ వెంకయ్య నాయుడు సమాధానమే వర్తిస్తుంది. తను బీజేపీతో, కేంద్రంతో చాలా జాగ్రత్తగా, లౌక్యంగా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూనే బీజేపీతో ఎన్డీయే ప్రభుత్వంతో తెదేపా కలిసిపనిచేయడాన్ని ఏదో పెద్ద నేరం అన్నట్లుగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   ఆయన మాటలు వింటుంటే తను చేస్తున్న ఈ రాజకీయాలను ప్రజలు గమనించడం లేదని, గమనించినా వారికి అర్ధం చేసుకొనే శక్తి లేదని భావిస్తున్నట్లుంది. వారికి ఆ శక్తి ఉందో లేదో ఎన్నికలలో చూపారు. ఇంకా గ్రహించలేకపోతే ఎవరు మాత్రం వైకాపాను ఆయన భారి నుండి కాపాడగలరు?

నానాటికి తీసికట్టు మన చట్ట సభల పరిస్థితి

  ఒకప్పుడు రాష్ట్ర విభజన సమయంలో గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తుంటే, తెరాస సభ్యులు ఆయన చేతిలో నుండి ప్రసంగ ప్రతులను లాక్కొని చింపివేసి సభలో నానా రభస చేసిన సంగతి అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇప్పుడు అదే గవర్నరు తెరాస ప్రభుత్వ విధానాలను, ఆశయాలను వివరిస్తూ ఉపన్యసించవలసివస్తోంది. ఆనాడు ఆయన చేతిలో నుండి ఉపన్యాస కాగితాలు లాక్కొన్ని ఆయన ప్రసంగానికి అడ్డు తగిలినప్పుడు, తెరాస యం.యల్యే.లకు ఏమీ తప్పు అనిపించలేదు. కానీ ఈ రోజు తెదేపా, కాంగ్రెస్ యం.యల్యే.లు పోడియంలో నిలబడి పార్టీ ఫిరాయింపు చేసినవారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేస్తుంటే, తెరాస యం.యల్యే.లకు వారిపై పట్టరాని ఆగ్రహం కలిగింది. వారూ తమ స్థానాలలో నుండి లేచి అందుకు అభ్యంతరం చెప్పి ఉండి ఉంటే బాగుండేది. కానీ వారు కూడా పోడియంలోకి దూసుకు వచ్చేసి గవర్నరు నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు స్పీకర్ మధుసూధనాచారి సమక్షంలోనే ప్రతిపక్ష యం.యల్యే.లతో వాగ్వాదాలకు, తోపులాటలకు దిగడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఆ తోపులాటలో ప్రతిపక్ష సభ్యులు కొందరు క్రిందపడిపోయారు.   ప్రతిపక్ష సభ్యులు సభా సాంప్రదాయాలు తుంగలో తొక్కుతూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడం ఒక తప్పయితే, బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికార పార్టీ సభ్యులు గవర్నర్ సమక్షంలోనే వారిపై భౌతిక దాడులు చేయడం మరో తప్పు. అటువంటి పరిస్థితుల్లో సభాపతి స్పీకర్, ముఖ్యమంత్రి మౌనంగా చూస్తూ కూర్చోవడం అంతకంటే పెద్ద తప్పు. అధికార, ప్రతిపక్షాలు ఒకరిని మరొకరు రాజకీయంగా దెబ్బతీయలనుకొంటే అటువంటి కార్యక్రమాలు సభ బయట నిర్వహించుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండబోదు. కానీ ప్రజాసమస్యలను చర్చించి, పరిష్కరించేందుకు ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న చట్ట సభలలో ఈవిధంగా వ్యవహరించడం చాలా దారుణం. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ కలిసి గవర్నర్ పట్ల ఈవిధంగా అమర్యాదగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యానికి మూలస్థంభమయిన చట్టసభలను చివరికి ఈ స్థాయికి దిగజార్చడం చూస్తుంటే చాలా ఆందోళన కలుగుతోంది.   ప్రజలకు మార్గదర్శనం చేయవలసిన ప్రజా ప్రతినిధులే ఈ విధంగా వ్యవస్థలను, చట్టసభలను అపహాస్యం చేయడం, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోవడం చూస్తుంటే అటువంటి వారిని ఎన్నుకొన్నందుకు ప్రజలు కూడా సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి కలుగుతోంది. ఒకవేళ ప్రభుత్వాలు గాడి తప్పుతుంటే వాటిని మళ్ళీ గవర్నరే గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది కనుక ఆయన ఇటువంటి సంఘటనలను ఎంతమాత్రం ఉపేక్షించకుండా బాధ్యులపై కటినమయిన చర్యలు తీసుకొన్నట్లయితే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చును. అలా కాదని ఆయన కూడా ప్రేక్షకపాత్ర వహిస్తే చట్టసభల స్థాయి ఇంకా దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది.

ఆమాద్మీ రోడ్డున పడ్డాడు

  అపూర్వమయిన మెజార్టీతో డిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమాద్మీ పార్టీకి ఇక ఎదురే ఉండబోదని అందరూ భావిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం తీసిపోని విధంగా ఆ పార్టీలో కూడా అప్పుడే తిరుగుబాట్లు, అసమ్మతి స్వరాలు, గ్రూప్ రాజకీయాలు అన్నీ మొదలయిపోయాయి. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా గడవక ముందే పార్టీ మళ్ళీ రోడ్డున పడింది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలను పార్టీలో సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లపై నిరసించడంతో వారిని కీలకమయిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తన కన్వీనర్ పదవికి రాజీనామా అస్త్రం ప్రయోగించవలసి వచ్చింది. తక్షణమే పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యి ఆ ఇరువురు సభ్యులను తప్పించేరు. కానీ ఆ సమావేశానికి హాజరయిన మొత్తం 19 మంది సభ్యులలో 11 మంది మాత్రమే వారి ఉద్వాసనకు మద్దతు పలుకగా మిగిలిన 8మంది వ్యతిరేకించారు. అంటే వారు కూడా అరవింద్ కేజ్రీవాల్ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత కలిగి ఉన్నారని స్పష్టం అవుతోంది. మెజార్టీ నిర్ణయం ప్రకారం యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లను రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పించగలిగారు, కానీ చేజేతులా మరో 8 మంది సీనియర్ నేతలను శత్రువులుగా తయారుచేసుకొన్నట్లయింది.   వారిలో ఒకరయిన మయాంక్‌ గాంధీ మీడియా ముందుకు వచ్చి జాతీయ కార్యవర్గ నిర్ణయాన్ని తప్పుపట్టారు. యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ ఇరువురూ స్వచ్చందంగా రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తప్పుకొనేందుకు అంగీకరించినప్పుడు వారిని ఇంత అవమానకరంగా బయటకు సాగనంపవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు తనను కూడా ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని తన పార్టీ నేతలు ఆదేశించారని, కానీ తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీరును గట్టిగా విమర్శించారు. అంటే నేడో రేపో ఆయనకీ ఉద్వాసన పలికే సమయం ఆసన్నమయిందని స్పష్టం అవుతోంది.   అరవింద్ కేజ్రీవాల్ ని ప్రశ్నించినందుకు ఇద్దరు సభ్యులను బయటకు పంపినందుకు పార్టీలో అసంతృప్తి మొదలయింది. మరి కొందరు ఇప్పుడు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలలో ఓడిపోయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఇదే అదునుగా అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరిటువంటి సమయంలో ఆయనను విమర్శిన్న కారణంగా మయాంక్ గాంధీపై కూడా వేటువేసినట్లయితే మరిన్ని విమర్శలు, పార్టీలో అంతర్గతంగా మరిన్ని సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. అలాగని ఉపేక్షించినా ప్రమాదమే. కనుక ఏదోవిధంగా పార్టీలో ఈ పరిస్థితులను చక్క దిద్దవలసి ఉంటుంది.   తమ పార్టీ మిగిలిన అన్ని రాజకీయ పార్టీల కంటే విభిన్నమయింది. అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. పదవులు, అధికారం, రాజకీయాల కంటే ప్రజలకు సేవ చేయడానికే తామంతా అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొన్న ఆమాద్మీ పార్టీ, దాని నేతలు మిగిలిన రాజకీయ పార్టీలకు ఏమాత్రం భిన్నమయినవారు కారని నిరూపిస్తున్నారు. ఇదివరకు అధికారంలోకి వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాల కారణంగానో లేక సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా దేశాన్నే ఏలేయాలనే దురాశాతోనో అధికారం వదులుకొన్నారు. అందుకు అరవింద్ కేజ్రీవాల్ చాలా సార్లు ప్రజల ముందు లెంపలు వేసుకొన్నారు కూడా. ప్రజలు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి కూడా మళ్ళీ పార్టీని చక్కదిద్దుకోలేక చతికిలపడినట్లయితే ఆయన ప్రభుత్వానికే ప్రమాదం.   డిల్లీ ప్రజలు కోటి ఆశలతో ఆమాద్మీని అఖండ మెజార్టీతో గెలిపించుకొంటే ఆ పార్టీ నేతలు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల ఆశలు నెరవేర్చే ప్రయత్నాలు చేసే బదులు వారిలో వారే కుమ్ములాడుకోవడం చాలా దురదృష్టకరం. వారు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోలేకపోతే ప్రజలు వారికి మళ్ళీ మరో అవకాశం ఇవ్వరని గ్రహిస్తే మంచిది.

కేంద్రంతో మంచిగా ఉంటేనే మేలు

  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో అగ్గి మీద గుగ్గిలంలా కేంద్రంపై మండిపడిన తెదేపా ఇప్పుడు కొంచెం చల్లబడినట్లుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించడం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆలోచనతో వెనక్కి తగ్గాలని నిశ్చయించుకొంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం పోరాడి సాధించుకోవాలని చెపుతున్నాయి. ఎందుకంటే అవి ప్రతిపక్షంలో ఉన్నాయి గనుక. గానీ బీజేపీకి మిత్రపక్షంగా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెదేపా వాటిలాగ కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వితే ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతినవచ్చును. దాని వలన మహా అయితే ఆ రెండు పార్టీలు నష్ట పోవచ్చును. కానీ అంతకంటే ఎక్కువగా రాష్ట్రం నష్టపోతుంది. అందుకే కేంద్రంతో మంచిగా ఉంటూనే దానిపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టుకోవాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాకాక ఆయన కూడా ఆవేశపడి కేంద్రంతో గొడవపడి దానితో తెగతెంపులు చేసుకొని ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా తయారయ్యేదో తేలికగానే ఊహించవచ్చును. అందుకే కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ మంత్రివర్గ తీర్మానం చేసి పంపిద్దామనే ప్రతిపాదనను కూడా ఆయన అంగీకరించలేదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దూరదృష్టికి చక్కటి నిదర్శనం. తనే స్వయంగా మరోమారు ప్రధాని మోడీని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్ర పరిస్థితి, బడ్జెట్ కేటాయింపులపై ప్రజల ప్రతిస్పందన అన్నిటినీ వివరించి తగినన్ని నిధులు విడుదల చేయాలని కోరాలని నిశ్చయించుకొన్నారు.   కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా సమకూరుతున్న ఆదాయంలో 42 శాతాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకి పంచి ఇచ్చేస్తోంది. మిగిలిన దానిలో దేశ రక్షణ, కేంద్ర ప్రభుత్వ నిర్వహణ, అది ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పధకాలకు నిధుల ఏర్పాటు వంటివాటికి కేటాయించడానికి అవసరం ఉంటుంది. మళ్ళీ అందులో సింహభాగం సంక్షేమ పధకాల ద్వారా తిరిగి రాష్ట్రాలకే అందుతుంది. కనుక కేంద్రం ఇప్పటికిప్పుడు వేలకోట్లు నిధులు మంజూరు చేయలేకపోయినా మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రానికి తగినన్ని నిధులు మంజూరు చేయవచ్చును. ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు గనుకనే ఆయన కొంచెం వెనక్కి తగ్గారని భావించవచ్చును.   కేంద్రంతో పేచీపడి అసలు ఏదీ పొందలేక తిప్పలుపడే బదులు, కేంద్రంతో సయోధ్య పాటిస్తూ నేర్పుగా ఓర్పుగా మెసులుతూ నిధులు రాబట్టుకోవడమే ఉత్తమం. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రా ప్రభుత్వాన్ని ఈ సమయంలో కేంద్రం అన్నివిధాల ఆదుకొంటే ప్రజలు కూడా బీజేపీని, మోడీని ఆదరిస్తారు, గౌరవిస్తారు. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనే దాని కలలు కలలుగానే మిగిలిపోవచ్చును.