శబరిమల ప్రవేశం.. ఆమె ఒక్కరే వ్యతిరేకం
posted on Sep 29, 2018 @ 10:38AM
సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఏ వయసు మహిళలైనా శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకోవచ్చునని స్పష్టం చేసింది. శబరిమలకు మహిళల ప్రవేశాన్ని నిషేధించడం వారిపట్ల లింగ వివక్ష ప్రదర్శించడమేనని తేల్చిచెప్పింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది ఈ తీర్పుని సమర్దిస్తుంటే.. కొందరు మాత్రం మతాలకు వారి ఆచారాలకు గౌరవం ఇవ్వాలంటూ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలా వ్యతిరేకించిన వారిలో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఉన్న మహిళ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా ఉన్నారు.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా ఉన్నారు. ఇందూ మల్హోత్రా మాత్రం ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని మాత్రం వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను న్యాయస్థానాలు అడ్డుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ కేసుకు, శబరిమల కేసుకు మధ్య ఉన్న తేడాను చెప్పారు. ట్రిపుల్ తలాక్, సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితులతో పాటు ఇతర సామాజిక సంస్థలు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో అవి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని పేర్కొన్నారు. కానీ శబరమల ఆలయం ప్రవేశం నిషేధంపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు ఎవరూ కూడ కోర్టును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కేరళలో మహిళలు వారి విద్యాభ్యాసం కారణంగా సామాజికంగా పురోభివృద్ధి సాధించారని చెప్పారు. వీరిలో ఎక్కువమంది శబరిమల ఆచరించే పద్ధతులకు వ్యతిరేకంగా లేరని ఆమె అభిప్రాయపడ్డారు. భారతదేశం వేర్వేరు మతపరమైన ఆచారాలను కలిగి ఉందన్నారు. రాజ్యాంగం కేవలం ఎవరైనా ఒక మతాన్ని గౌరవించటానికి ,పాటించటానికి అనుమతిస్తుందన్నారు.. అతను లేదా ఆమె నమ్మే ఆచరించే మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకోవటానికి కాదన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని ఇందూ మల్హోత్రా వ్యతిరేకించడంతో 4-1తేడాతో ఈ తీర్పు వెలువడింది.