ఔను జగన్ సీబీఐ దత్తపుత్రుడే .. వారం రోజులు అడిగితే పది రోజులు ఇచ్చారు!

అక్రమాస్తుల కేసులో నిందితుడైన జగన్ తన కుమార్తె చదువుకుంటున్న కాలేజీలో స్నాతకోత్సవంలో పాల్గొని కుమార్తె పట్టా తీసుకోవడాన్ని కనులారా చేడాలని భావించారు. అందుకోసం పారిస్ వెళ్లడానికి   వారం రోజుల అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.   అయితే సీబీఐ మాత్రం  అలా ఇవ్వద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సరే కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్న తరువాత  జగన్ పారిస్ యాత్రకు అనుమతి ఇస్తూ తీర్పిచ్చింది. అయితే జగన్ కోరినట్లు వారం రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జగన్ విదేశీ యానానికి అనుమతి ఇచ్చింది.  అసలు జగన్ అడిగితే వారం అయితే.. న్యాయమూర్తి పది రోజుల పర్మిషన్ ఇవ్వడం ఏమిటని విపక్షాలు ఆశ్చర్యపోతుంటే..   జగన్ తరపు లాయర్లు మాత్రం తెగ ఖుషీ అయిపోయారు.   సీబీఐ జగన్ విదేశీ యానానికి అనుమతి ఇవ్వద్దంటూ సీబీఐ న్యాయవాదులు ఉత్తుత్తి కౌంటర్ వేశారా?  విదేశీయానానికి అనుమతి ఇవ్వదన్న తమ పిటీషన్ కు బలం చేకూరేలా అసలు వాదనలైనా వినిపించారా  అంటూ నెటిజన్లు వీరలెవెల్లో ట్రోల్ చేస్తున్నారు. అడిగిన దాని కంటే ఎక్కువ రోజులు పర్మిషన్ ఇవ్వడం విచిత్రమే. సీబీఐ చాలా వరకూ అక్రమాస్తుల కేసుల్లో జగన్ కు సానుకూలంగా ఉంటోందని… విచారణ ఆలస్యం కావడానికి సహకరిస్తోందన్న విపక్షాలు కొంత కాలంగా ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కోర్టుకు హాజరు కాకపోయినా పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నాయి. న్యాయస్థానాల నుంచి మినహాయింపులు కూడా పొందకుండానే విచారణకు రావడం లేదని అంటున్నారు. అయినా సీబీఐ ఏమీ అనడం లేదని. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కూడా కోర్టుకు నివేదించడం లేదనీ అంటున్నారు. అదే సమయంలో జగన్ ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్లారు. కోర్టు నుంచి దావోస్ పర్యటనకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ ముందుగా ప్లాన్ చేసుకుని మరీ లండన్ వెళ్లి ఒకరోజు ఉండి… ఆ తర్వాత దావోస్ వెళ్లారు. అంటే బెయిల్ షరతులు.. కోర్టు షరతులు ఉల్లంఘించినట్లే. ఈ విషయాన్ని కూడా సీబీఐ కోర్టులో ప్రస్తావించలేదు. దీంతో … అంతా ఓ పద్దతి ప్రకారం..జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుమార్తె, హర్షరెడ్డి  పారిస్‌లోని ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే నెల (జులై) 2న జరిగే కాన్వొకేషన్‌’లో ఆమె డిగ్రీ పుచ్చుకోనున్నారు. ఒక తండ్రిగా కుమార్తె కాన్వొకేషన్‌ కార్యక్రమానికి హాజరై, అ వేడుకను చూడాలని అనుకోవడం సహజం. అదీగాక, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అదేమీ పెద్ద విషయం కాదు. కానీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో అది పెద్ద సమస్యే. ఎందుకంటే, ఆయన ముఖ్యమంత్రి మాత్రమే కాదు, అక్రమ ఆస్తుల కేసులో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయ పరి భాషలో చెప్పలంటే ఆయన నిందితుడు. అది కూడా  ఎ1 నిందితుడు.  అవును, అయన ముఖ్యమంత్రి అయితే కావచ్చును, కానీ, ఆయన అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ మీద బయట ఉన్న నిందితుడు. కాబట్టి అయన కదలికలకు షరతులు వర్తిస్తాయి. అంటే అయన ఏమి చేయాలో చేయకూడదు, ఎక్కడికి వెళ్లోచ్చు, ఎక్కడికి వెళ్లకూడదు అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అందుకే ఆయన విదేశాలకు వెళ్ళాలంటే న్యాయస్థానం ముందస్తు అనుమతి అవసరం. ఆయన తమకు ఇష్టమైనప్పుడు, ఇష్టమైన దేశానికి వెళ్లేందుకు వీలులేదు. ఆయన దేశం గడప దాటాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సిందే.  ముఖ్యమంత్రి కావడానికి చాలా ముందుగానే, ఆయన అక్రమాస్తుల కేసులో నిందితుడిగా 16 నెలలు జైలులో ఉండి షరతులతో కూడిన  బెయిల్ మీద బయట కొచ్చారు. ఆ బెయిల్ షరతుల్లో పాస్ పోర్టును కోర్టు అధీనంలో ఉంచడం కూడా ఒకటి. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదు. అందుకే ఎప్పుడు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినా ఆయన కోర్టు అనుమతి తీసుకుంటారు.  అందుకే ఆయన తమ కుమార్తె కాలేజ్‌ స్నాతకోత్సవానికి వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. కుమార్తె కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వీలుగా.. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతును సడలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈనెల 28 నుంచి వారం పాటు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని జగన్‌ కోర్టును కోరారు.  అయితే, పారిస్‌ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ వేసిన పిటిషన్‌పై సీబీఐ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు.పారిస్‌ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. వివిధ కారణాలు చెప్పి జగన్‌ విదేశాలకు వెళ్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ సారి ఏదో కారణం చెప్పి విచారణను ఆలస్యం చేయిస్తున్నారని ఆయన పారిస్ పర్యటనకు వెళ్లనివ్వొద్దని కోర్టులో సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.  అయితే, సిబిఐ అభ్యంతరం చెప్పినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి లభిస్తుందని వైసేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. జఎందుకంటే జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరిన ప్రతి సారీ, సిబిఐ అభ్యంతరం చెపుతూనే వుంది , సిబిఐ కోర్టు అనుమతి ఇస్తూనే ఉంది.  ఈ సారి కూడా అదే జరిగింది. అడిగిన దానికన్నా ఎక్కువ రోజులు విదేశాలలో ఉండేందుకు అనుమతి ఇచ్చేసింది. సీబీఐ న్యాయవాదులు మాత్రం మేం కౌంటర్ వేసినట్లు చేశాం.. అన్నట్లుగానే వ్యవహరించారు తప్ప వాదనల్లో జగన్ విదేశీ పర్యటనను అడ్డుకునే విషయంలో సీరియస్ వాదనలు వినిపించలేదు.   అందుకే నేమో కొందరు జగన్ రెడీ సిబిఐ దత్తపుత్రుడు .. అంటున్నారు.  ఇలా అయన అడిగిందే తడవుగా  అలా అనుమతులు లభిస్తుండటంతో సామాన్య జనంలో కూడా జగన్ నిజంగా సీబీఐ దత్త పుత్రుడేనా అన్న అనుమానం కలుగుతోంది.

భారీ భద్రత మధ్య ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.  నియోజకవర్గంలో అధికారులు ఆరు మోడల్ పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు టౌన్, రూరల్, మర్రిపాడు, చేజర్ల, అనంతసాగరం, ఏఎస్ పేట, సంగం మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,330. ఓటింగ్ కోసం మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 131 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 1132 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం 377 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి 32 మంది పోలీసులు, మరో 1132 మంది కేంద్ర బలగాలను మోహరించారు. పోలింగ్ తీరును చిత్రీకరించేందుకు మొత్తం 78 వీడియో గ్రాఫర్లు పనిచేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను 142 మంది మైక్రో పరిశీలకులు పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉప పోరులో 14 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ అనంతరం ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా.. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఉదయం 10 గంటల వరకూ నియోజకవర్గంలో 20 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

సంక్షోభం పాతదే.. సమస్యే కొత్తది!

మహారాష్ట్ర రాజకీయాలలో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా శివసేన .. ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. మరాఠీల హక్కుల పరిరక్షణ ప్రధాన ఎజెండాగా పార్టీ పురుడు పోసుకున్నా, పార్టీ వ్యస్థాపక అధ్యక్షడు బాల్‌ ఠాక్రే  మరాఠీల హక్కుల పరిరక్షణ,  మరాఠీ అస్తిత్వ వాదాలకు హిదుత్వ ఎజెండాను జోడించి, పార్టీని పటిష్ట పునాదుల మీద నిలబెట్టారు. కాలక్రమలో శివసేన హిందూ మతోన్మాద పార్టీగా ముద్ర వేసుకుంది. ఆ విధంగా సుదీర్ఘ కాలం పాటు,  బీజేపీకి సహజ మిత్ర పక్షంగా కొనసాగింది. అయితే,, 2019 ఎన్నికల్లో  శివసేన  ముఖ్యమత్రి పీఠం కోసం పట్టుపట్టి, బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఎ) సకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పడు, అధికార కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా, ఉన్న శివసేన, సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే’ కు వ్యతిరేకంగా, పార్టీ సీనియర్ నాయకుడు, ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ముఖ్యమంత్రి, శివసేన అధినేత హిందుత్వ ఎజెండా వదిలేశారన్నది షిండే చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఎంవీఎ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల తర్వాత, ఇప్పడు ఇంత హఠాత్తుగా, షిండే, ఆయన అనుచరులకు, ‘ హిందుత్వం’ ప్రమాదంలో పడిందని గుర్తుకు రావడం, ఏమిటో, ఎంవీఎ అసహజ కూటమి అని ఇంత ఆలస్యంగా షిండేకు తెలియడం ఏమిటో ఎవరికీ అర్థం కాకపోవచ్చును, కానీ, క్షేత్ర స్థాయి పరిస్థితులు ఆయన్ని తిరుగుబాటుకు ప్రోత్సహింఛి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సైధాంతిక విభేదాల కారణంగానే, షిండే తిరుగుబాటు జెండా ఎగరవేయ వలసి వచ్చిందని  ఆయన వర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే, శివసేన చరిత్రలో ఇలాంటి సంక్షోభాలు చాలానే ఎదుర్కుందని, సంక్షోభం ఎదురైన ప్రతి సందర్భంలోనూ పార్టీ మరింత బలపడుతూ వచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే, ప్రస్తుత సంక్షోభం, అందుకు కొంత భిన్నమైనదని, పరిశీలకులు సైతం పేర్కొంటున్నారు.  గతంలో శివసేన, బీజేపీ మిత్ర పక్షాలుగా ఉన్నరోజులలోనూ, రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు వచ్చినా, అందుకు సిద్ధాంత విబేధాలు ఎప్పుడూ కారణం కాలేదని పరిశీలకు గుర్తు చేస్తున్నారు. కానీ మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పార్టీల మధ్య సిద్ధాంత విభేదాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. క్షేత్ర స్థాయి పరిస్థితులను బేరీజు వెసుకున్న తర్వాతనే షిండే తిరుగుబాటు చేశారని, అంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రస్తుత సంక్షోభం నుంచి శివసేన బయట పడడం అనుమానమే అంటున్నారు. అలాగే, గతంలో తిరుగుబాట్లకు ప్రస్తుత తిరుగుబాటుకు మధ్య  మరో తేడా కూడా ఉందని అంటున్నారు. గతానికి భిన్నంగా, ఈసారి పార్టీ  అధికారంలో ఉండగా నాయకత్వంపై శివ సైనికులు తిరుగుబాటు చేయడం పార్టీ చరిత్రలో అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో మూడుసార్లు శివసేన లో సంక్షోభం ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే ఉన్నప్పుడు చోటుచేసుకోగా.. ప్రస్తుతం మాత్రం ఆయన కుమారుడు ఉద్ధవ్‌ ఠాక్రే  అధికారంలో ఉన్న సయమంలో నాలుగోది చోటుచేసుకుందని, అందుకే  ప్రస్తుత తిరుబటును భిన్నంగా చూడాలని పరిశీలకులు అంటున్నారు.  కాగా శివసేనకు 1991లో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనను కాదని, మనోహర్‌ జోషిని నియమించండతో పార్టీ సీనియర్ ఓబీసీ నేత ఛగన్‌ భుజభల్  ,పార్టీని వదిలి ఎన్‌సీపీలో చేరారు. ఇప్పటికీ ఎన్సీపీలోనే ఉన్న ఆయన  అఘాడీ ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత 2005లో మాజీ ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణె పార్టీని వీడి కాంగ్రెస్‌లో  చేరారు అనంతరం కాంగ్రెస్‌కూ రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాణె కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.  అలాగే, 2006లోనూ శివసేనకు మరో షాక్‌ తగిలింది. ఉద్ధవ్‌ ఠాక్రే సోదరుడు (కజిన్) రాజ్‌ఠాక్రే. శివసేనను వీడి మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన పేరుతో సొంత కుంపటి పెట్టు కున్నారు.అయితే, తన పోరాటం శివసేన నాయకత్వం (బాల్‌ ఠాక్రే ) మీద కాదని ఇతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్న కొందరిపైనే ( ఉద్దవ్ ఠాక్రే ) మీదనేనని రాజ్‌ఠాక్రే అప్పట్లో చెప్పుకొచ్చారు  తాజాగా ఏక్‌నాథ్‌ షిండే రూపంలో మరోసారి తిరుగుబాటును ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. అయితే, తమకు శివసేన నాయకత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని.. కేవలం సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌, ఎన్‌సీపీల తీరు వల్లే రెబల్స్‌గా మారాల్సి వచ్చిందని చెబుతున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేల బలం ఉందని షిండే వర్గం  చెబుతోంది. మరో వంక తాజా సమాచారం ప్రకారం, ఉద్దవ్ ఠాక్రే ఏ క్షణంలో అయినా  రాజీనామా చేయవచ్చని తెలుస్తోంది.

జట్టుకు ఎంపిక కాలేదని క్రికెటర్ ఆత్మహత్యాయత్నం

ఆటలో గెలుపు ఓటములు సహజం.. జీవితంలో ఎత్తు పల్లాలు సహజం. కష్టం వచ్చిందని, వైఫల్యం ఎదురైందని తనువు చాలించుకునే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదు. కింద పడ్డ చోటే లేవాలి. ఓడిపోయిన చోటే గెలిచి నిలవాలి. ముఖ్యంగా ఆటగాళ్లలో సక్సెస్, ఫెయిల్యూర్ ను సమానంగా తీసుకునే క్రీడా స్ఫూర్తి అత్యంత అవసరం. పాకిస్థాన్ కు చెందిన ఓ క్రికెటర్ చిన్న వైఫల్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేశాడు. దక్షిణ సింధ్ ప్రావిన్స్ కు చెందిన క్రికెటర్ షోయబ్  ఓ ఫాస్ట్ బౌలర్. అయితే, సెలక్షన్స్ లో విఫలమై లోకల్ జట్టులో స్థానం లభించలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన షోయెబ్ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న షోయెబ్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పాకిస్థాన్ లోనే నాలుగేళ్ల కిందట ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. అండర్-19 జట్టులో స్థానం కోల్పోయిన మహమ్మద్ జర్యాబ్ అనే యువక్రికెటర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏ క్రీడలోనైనా ప్రతి ఆటగాడూ ఏదో సమయంలో వైఫల్యాలను ఎదుర్కొనే ఉంటాడు. ఇది స్థానిక స్థాయిలోనైనా, అంతర్జాతీయ స్థాయిలోనైనా ప్రతి క్రీడాకారుడూ ఎదుర్కొనే పరిస్థితి. క్రికెట్ దేవుడిగా అభిమానుల గుండెల్లో కొలువైన సచిన్ టెండూల్కర్ కూడా ఒక సమయంలో ఫామ్ కోల్పోయి విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు. ఏ క్రీడాకారుడైన సరే.. వైఫల్యం ఎదురైనప్పుడు మనో స్థైర్యంతో దానిని అధిగమించాలే తప్ప.. ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలకు పాల్పడటం ఎంత మాత్రం సమంజసం కాదు. అసలు క్రీడా రంగాన్ని ఎంచుకోవడం అంటేనే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం ఉందనే లెక్క. అలా కాకుండా వైఫల్యానికి కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం విచారకరం. 

నిధి చాల సుఖమా.. రాముని సన్నిధి సేవ చాల సుఖమా..!

అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశంలోని హిందువుల ఆకాంక్ష. ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, ఆందోళనలు, ఉద్యమాల తరువాత సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలో.. శ్రీరాముడి జన్మస్థలంలో రామమందిర నిర్మాణానికి అవకాశం, అనుమతి లభించింది. దీంతో అక్కడ భవ్య రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల సేకరణ ప్రారంభించింది. నిథి సమర్పణ్ యోజన కింద విరాళాలను సేకరిస్తోంది. కుప్ప తెప్పలుగా విరాళాలు వచ్చి పడుతున్నాయి. అబ్బో దేశంలో రామ మందిర నిర్మాణం కోసం ఎందరు ఉదారంగా విరాళాలిస్తున్నారో.. దేశంలో ఆధ్యాత్మికత ఎంతగా పరిఢ విల్లుతోందో అని రామ భక్తులు సంబరపడిపోయారు.  కానీ  శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ఇటీవ‌ల నిర్వ‌హించిన ఆడిట్‌లో షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టికీ వ‌ర‌కూ సేక‌రించిన ఇప్పటి వరకూ సేకరించిన విరాళాలలో  22 వేల కోట్ల రూపాయల విలువైన  15,000 చెక్కులు బౌన్స్  అయ్యాయి. ఈ విషయాన్ని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.   అయోధ్యలో రామమందిరం ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.3400 కోట్లు విరాళంగా అందాయి. ఇక బౌన్స్ అయిన 22 వేల కోట్ల రూపాయల విలువైన చెక్కుల విషయానికి వస్తే అవి బౌన్స అవ్వడానికి కారణాలేమిటన్నది మాత్రం విశ్వహిందూ పరిషత్ వెల్లడించలేదు. చెక్కులు బౌన్స్ కావడానికి సంతకం సరిపోలక పోవడం, అక్షర దోషాలు వంటి చిన్న చిన్న కారణాలతో బౌన్సయిన చెక్కులు కూడా ఉన్నాయనీ, వాటిని తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేస్తామని, అవి ఇచ్చిన వారి కన్సంట్ తో అవి క్లియర్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్ల బౌన్సయిన చెక్కులు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. వాటి విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. బౌన్సయిన చెక్కులలో అత్యధికం అయోధ్యలో నివసించే స్థానికులు ఇచ్చినవే అని విశ్వహిందూ పరిషత్ వెల్లడించింది.  అయోధ్యలో నివసిస్తున్న దాతల చెక్కులు అత్యధిక సార్లు బౌన్స్ అయ్యాయని నివేదికలో పేర్కొంది. ఒక్క అయోధ్య జిల్లాలోనే రెండు వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయ్యాయి. 

28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు

రైతుబంధు పంట సాయం కింద నిధుల విడుదలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వానా కాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగే   రైతు బంధు సాయం కింద నిధులను ప్రభుత్వం జమ చేయనుందని  వ్యవసాయ   మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి   స్పష్టం చేశారు. సీఎం నుంచి ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు వివరించారు. మరోవైపు వ్యవసాయ సమస్యలపై రైతులు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించిన ఏ వివరాల కోసమైనా కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవచ్చని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

నింగికి న‌ది ప్రవహించిందా?!

మ‌నం గ‌మ‌నించాలే గాని ఆకాశంలో అద్భుతాలు జ‌రుగుతూంటాయి. సూర్య‌గ్ర‌హణం, చంద్ర‌గ్ర‌హ‌ణ‌మే మ‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలిసిన‌వి.  తోక‌చుక్క ప‌డ‌టం, పెద్ద పెద్ద మెరుపులు వంటివి చూసి ఆశ్చ‌ర్య పోవ‌డం మామూలే. మీరెపుడ‌యినా మ‌బ్బులు కొండ‌మీంచి ప‌డుతున్న ఏటి ప్ర‌వాహంలా ఏక ధాటిగా  వ్య‌తిరేక దిశ‌లో ఆకాశంలో వెళుతూండ‌డం చూశారా?  ఏదో తెల్ల‌టి న‌ది నేల‌మీద‌కి కాకుండా నింగిలోకి వెళుతోన్న‌ట్టు వుంటుంది. అది వివ‌రించ‌డం కంటే చూస్తేనే గొప్ప అనుభూతి, చూసి తీరాలంతే.  ఈ మ‌ధ్య ఆ వింత ని  ద‌క్షిణ ఆస్ట్రేలియాలో జోగార్ గొస్రానీ అనే ఆయన చూసి ఆనందం ప‌ట్ట‌లేక ఏకంగా వీడియో తీసి అంద‌రికీ  తెలిసేలే చేసేడు.   అనేకానేక మ‌బ్బుతున‌క‌లు అమాంతం పెద్ద న‌దిలా మారి ఒక్క‌సారిగా  ఇళ్ల‌ మీంచి ఖాళీ రోడ్ల‌మీదుగా అలా  పైకి ప‌శ్చిమ ఆస్ట్రేలియా స్టెర్లింగ్ రేంజ్ లోని బ్ల‌ఫ్ నాల్ ప‌ర్వ‌త శిఖ‌రం  మీదుగా ఆకాశంలోకి వెళ్ల‌డం అనే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అది చూడ్డానికి ఆకాశంలోకి వెనుదిరిగి వెళుతోన్న న‌దిలా తోచింది  గోస్రానీకి. అంతే క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా వీడియో తీసేడు. నేల నుంచి నింగిలోకి వెళ్లిన  న‌ది అని పేరు  కూడా పెట్టేడు.  ఆకాశంలో ఉన్న‌ట్టుండి మ‌బ్బులు ఒక్క‌సారిగా ప‌ల్చ‌టి వ‌స్త్రంలా మారి ప‌ట్ట‌ణం మీంచి ప‌ర్వతం చుట్టూ తిరిగి ప‌ర్వ‌తం అంచుమీంచి అలా ఆకాశంలోకి ఎవ‌రో పారేసుకున్న పెద్ద వ‌స్త్రంలా ఎగిరిపోయింది. ఇదెలా సంభ‌వం అని ఆశ్చ‌ర్య‌ప‌డే లోగానే అంత అద్భుతం జ‌రిగిపోయింది అని గొస్రానీ అన్నారు.  అది ఆరంభ ద‌శ‌లో చూసి సునామీ అనుకుని కాస్తంత భ‌య‌ప‌డ్డాను. కానీ ఇలా ఆకాశంలో సంభ‌వించి క‌ను విందు చేసే అద్బుతం చూడ‌డం దాన్ని వీడియోలో భ‌ద్ర‌ప‌ర‌చ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు గొస్రానీ.  అయితే గొస్రానీ అనుకున్న‌ట్టుగా అది నిజంగా మ‌బ్బులతో ఏర్ప‌డిన‌ది కాద‌ని అది  నిజానికి సముద్రపు ఏరోసోల్ (ఎస్ ఎస్ ఏ).  సహజ ఏరోసోల్‌లో ఒకటి అని అమెరికా జాతీయ వైద్యశాఖ లైబ్ర‌రీ అధికారులు తెలియ‌జేశారు.  ఎస్ఎస్ ఏ కూడా అచ్చం మ‌బ్బులానే క‌న‌ప‌డు తుంది కానీ గాలి-సముద్ర క‌లిసేచోట క‌లిగే రాపిడితో  నీటి బుడగలు పగిలిపోవడం వ‌ల్ల  ఆ రూపం వ‌స్తుంద‌ని తెలిపారు. కానీ  ఎంతో  అబ్బురపరిచే దృశ్యం.  అత్యంత అరుదుగా ఆవిష్కృతమయ్యే  అద్భుతం!  

ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణపై హైకోర్టు సీరియ‌స్‌

ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన‌ట్టు చేస్తుంటే ఇక కోర్టు లెందుకు?  సామాన్య ప్ర‌జ‌ల కేసుల్లో హైకోర్టు దాకా వెళ్లిన‌వి ఉప‌సంహ‌రించు కోవడానికి బొత్తిగా వీలే వుండ‌దు. కానీ ప్ర‌జా ప్ర‌తినిధులపై కేసులు ఉప‌సంహ‌ర‌ణ‌కు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ తో సంబంధం లేకుండా కేసులు తొల‌గించ‌డానికి మార్గాల‌న్నీ అనుకూలిస్తాయి. ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు  సీరియస్ అయ్యింది.  ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై కేసుల ఉపసంహరణను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో ఏపీజేఎఫ్‌ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజ నేయులు పిటిషన్‌ వేశారు. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్‌ ఆదేశాలతో.. కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగిం చాలంటే.. హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొల గించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. ఎన్ని ఉపసంహరించారన్న దానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా తొలగించారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌కుమార్ తీసుకొచ్చారు. ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

17 బ్యాంకుల‌ను ముంచిన డీహెచ్‌ఎఫ్‌ఎల్ డైరెక్ట‌ర్లు

ప‌ది రూపాయ‌లు సంపాదించ‌డానికి బీదాబిక్కీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లూ నానా యాత‌నా ప‌డుతున్నారు. పైసా పైసా కూడ‌బెట్టి ఇంటి కోస‌మో, బిడ్డ‌ల చ‌దువుకోస‌మో బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. వాటి మీద ఎంతో కొంత వడ్డీ కూడా ప‌డి  ఏ రెండు మూడేళ్ల త‌ర్వాత‌నో తీసుకుంటే కాస్తంత పెద్ద మొత్తం వ‌స్తుంది క‌ల‌లు సాకారం చేసుకోవ‌చ్చ‌న్న ఆశ‌తో బ‌తికేస్తున్నారు.  ఇందుకు పూర్తి విరుద్ధంగా చాలా సునాయాసంగా స‌ద‌రు బ్యాంకుల‌ను చిటికెలో మోసం చేసి కోట్లు కొట్టేసి పారిపోతున్న గెద్ద‌లు ఇటీవ‌లి కాలంలో చాలా త‌యార‌య్యాయి. ఇక్క‌డ బ్యాంకుల‌ను మోసం చేసి సొమ్ముతో విదేశాల‌కు ఉడాయించ‌డం అక్క‌డి నుంచి నేను రాను పో ఏం చేసుకుంటావో చేసుకో అని ఏకంగా అక్క‌డ మ‌కాం పెట్టేస్తున్నారు చాలా ద‌ర్జాగా. వారిని ప‌ట్టుకుని ముక్కుపిండి వ‌సూలు చేయాల్సిన  ప్ర‌భుత్వాలు కూడా హ‌డావుడి చేయ‌డం, హామీలు ఇవ్వ‌డ‌మే త‌ప్ప గ‌ట్టిగా చేస్తున్న‌దీ ఏమీ క‌న‌ప‌డ‌టం లేదు. ఇపుడు మ‌ళ్లీ దేశంలో మ‌రో భారీ స్కామ్ వెలుగు చూసింది.  రూ. 34,615 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి... డీహెచ్‌ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్, ధీరజ్ వాధవాన్‌లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 17 బ్యాంకుల బృందాన్ని రూ. 34,615 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై డీహెచ్‌ఎఫ్ఎల్ కు చెందిన కపిల్, ధీరజ్ వాధావన్‌లపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. రూ. 34,615 కోట్లకు సంబంధించిన తాజా కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఆ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్ సహా మరికొందరిపై సీబీఐ కేసు నమోదైంది. ఇది ఏజెన్సీ దర్యాప్తుల జాబితాలో ఇదే  అతిపెద్ద బ్యాంక్ మోసంగా అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు తర్వాత ఏజెన్సీకి చెందిన 50 మందికి పైగా అధికారుల బృందం ముంబైలో ఎఫ్‌ఐఆర్‌లో లిస్టెడ్ నిందితులకు చెందిన 12 ప్రదేశాల్లో సోదాలు నిర్వ హించింది, ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టి సహా మరో ఎనిమిది మంది ఇతర బిల్డర్లు కూడా ఉన్నారు. వివిధ ఏర్పాట్ల కింద కన్సార్టియం నుండి 2010-2018 కాలంలో... కంపెనీ రూ. 42,871 కోట్ల రుణ సదుపాయాన్ని పొందిందని, అయితే మే, 2019 నుండి ‘తిరిగి చెల్లించే కమిట్‌మెంట్‌’లను డిఫాల్ట్ చేయడం ప్రారంభించిందని బ్యాంక్ ఆరోపించినట్లు అధికా రులు తెలిపారు. రుణదాతలుగా ఉన్న బ్యాంకులు వివిధ సమయాల్లో ఖాతాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయని తెలిపారు. నిధుల మళ్లింపు, రౌండ్ ట్రిప్పింగ్ సహా నిధులను స్వాహాచేయడం ద్వారా మోసం చేశారన్న ఆరోపణలపై మీడియా నివేదికలు వెలువడిన తర్వాత జనవరి 2019 లో డిహెచ్ఎఫ్ఎల్‌ విచారణకు గురైనప్పుడు, రుణదాతలు ఫిబ్రవరి 1, 2019 న సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 1, 2015 నుండి డిసెంబరు 31, 2018 వరకు డిహెచ్ఎఫ్ఎల్‌ కు సంబంధించి ప్రత్యేక సమీక్ష ఆడిట్ నిర్వహించడానికి సభ్యులు కెపిఎంజి ని నియమించిన విషయం తెలిసిందే. కపిల్, ధీరజ్ వాధవన్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు అక్టోబరు 18, 2019 న లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు బ్యాంకులు ముందుకొచ్చినట్లు వెల్లడించారు. కెపిఎంజి తన ఆడిట్‌లో రుణాలు, అడ్వాన్స్‌ల రూపంలో సంబంధిత, పరస్పరం అనుసంధానితమై ఉన్న  సంస్థలు సహా వ్యక్తులకు నిధులను మళ్లించిందని బ్యాంక్ ఆరోపించింది.  డిహెచ్ఎఫ్ఎల్  ప్రమోటర్లతో ఉమ్మడిగా ఉన్న 66 సంస్థలకు రూ. 29,100.33 కోట్లు పంపిణీ చేశామని, వీటికి సంబంధించి  రు.29,849  కోట్ల మేర బకాయిలున్నాయని నివేదిక పేర్కొంది. అటువంటి సంస్థలు, వ్యక్తులకు సంబంధించి పలు లావాదేవీలు భూమి, ఆస్తుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నాయ‌ని బ్యాంక్ ఆరోపించింది. భారీ ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపు, నకిలీ రికార్డులు, కపిల్ సహా ధీరజ్ వాధావన్‌లకు ఆస్తులు సృష్టించిన నిధులను రౌండ్ ట్రిప్ చేయడం వంటి అవకతవకలను ఆడిట్ నివేదించింది.

ఎన్నికల ఫలితాలను కులాలే నిర్ణయిస్తాయి!

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారి పోయిందా?  రాష్ట్ర రాజకీయ స్వభావం వర్గ దృక్పథం నుంచి, కుల సమీకరణ వైపుగా సాగుతోందా? అంటే ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్. రాజకీయ విశ్లేషకులు తిరుమల,అవుననే అంటున్నారు. రాష్ట్ర విభజన అంతరం తెలంగాణా ప్రాంత రాజకీయాలో వచియన్ మార్పులను ఆయన లోతుగ అధ్యయనం చేశారు. విపులంగా విశ్లేషించారు.  తెలంగాణ సెంటిమెంట్’ను సిద్దాంతంగా మలచు కోవడంలో తెరాస విఫలమైంది. అందుకే, ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలవలేక పోయిందని ప్రొఫెసర్ తిరుమల పేర్కొన్నారు. అలాగే, గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయింది. ఫలితంగా  పార్టీ  ప్రతిష్ట దిగజారింది. ప్రజలకు పార్టీకి మధ్య దూరం పెరిగి పోయింది.  ఈ నేపధ్యంలో తెలంగాణ సమాజం కులాల వారీగా విడి పోయింది, ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ’ఎస్టీ సామాజిక వర్గాల్లో కుల ప్రాతిపదికన ఓటు వేసే పరిస్థితి స్పష్టమైంది. ఈ మూడు ప్రధాన సామాజిక  వర్గాలు తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రొఫెసర్ విశ్లేషించారు.  రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాజకీయ నైజం,  స్వభావం మారిపోతున్న నేపధ్యంలో, రానున్న  ఎన్నికలలో ఓటింగ్ సరళి కూడా మారి పోతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ  సెంటిమెంట్ చెదిరి పోయిన నేపద్యంలో, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన, అనేక కులాలు, ఇప్పడు అధికార తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్దమవుతున్నాయని చెప్పు కొచ్చారు. అయినా, తెరాస సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని పేర్కొనారు. మిత్ర పక్షం ఎంఐ ఎంతో కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ రాదని, తిమల ఒక నివేదికలో పేర్కొన్నారు.  అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం, ఇప్పడు మరోసారి కాంగ్రెస్ వైపు మొగ్గు  చూపుతోంది. నిజానికి 1940ల నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. బ్రాహ్మణ, మాల సామాజిక వర్గాలను కలుపుకుని కాంగ్రెస్’కు దన్నుగా నిలిచింది. ఇప్పుదు కూడా  రెడ్డి సామాజిక వర్గం ఓటులో 99 శాతం కాంగ్రెస్ వైపే మొగ్గుచుపుతున్నారు. తెరాసకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని, ఇతర పార్టీలలో ఉన్న రెడ్డి సామజిక వర్గాన్ని పక్కన పెడితే, సాధారణ ఓటర్లు ప్రధానంగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా, తమకు పట్టున్న ప్రాంతలలో కమ్మ సామాజిక వర్గం,ఇప్పటికీ టీడీపీ వైపే మొగ్గు చూపుతోంది. టీడీపీ  సమస్థాగతంగా నిలబడితే, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఓటేసేందుకు సిద్దంగా వుందని అయన విశ్లేషించారు.  ఇక మరో కీలక సామజిక వర్గం  మున్నూరు  కాపుల విషయానికి వస్తే, సంఖ్యపరంగా చూస్తే, చాల బలమైన సామాజిక వర్గం. ఆ బలంతోనే మున్నూరు కాపులకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పదవులు ఇస్తున్నాయి.అయితే మున్నూరు కాపులు ఒక వ్యవస్థీకృత రాజకీయ శక్తిగా నిలిచే పరిస్థితి ఇంకా రాలేదు ఈసారి ఈ సామజిక వర్గం ఓట్లు బీజేపీ, తెరాస సగం సగం పంచుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ తమ విశ్లేషణలో పేర్కొన్నారు.  అలాగే, సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీని  కొమ్ము కాస్తారని పేరున్న పద్మశాలీలు గడచిన రెండు ఎన్నికలో తెరాస వైపు మొగ్గు చూపినా,  ఈ సారి మళ్ళీ, కాంగ్రెస్ కే జై కొడతారని ఆయన వివరించారు. ప్రధానంగా కల్లు వ్యాపారంలో ఉన్న గౌడ సామాజిక వర్గ  కుడా ఈసారి తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చింది. నిజానికి కుల వృత్తుల పై ఆధార పడే వర్గాలు అన్నీ,తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.  యాదవ సామాజిక వర్గం ఓటు బలమున్న సామాజిక వర్గం. అలాగే, రాజకీయంగానూ పట్టున్న సామజిక వర్గం. అయితే, నాయకులు పదవులు పుచ్చుకోవదమే కానీ, తమ సామాజిక వర్గం అభివృద్ధికి పని చేయడం లేదనే ఆరోపణ యాదవ్ నేతలపై వుంది. అందుకే ఆ వర్గం ఓటు ఎటుపడుతుందో ఉహించడం కష్టమని ప్రొఫెసర్ పేర్కొన్నారు. తెరాసతో ముదిరాజుల హనీమూన్ ముగిసింది, ఇప్పడు వారు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ఇతర కులాలు, ఎంబీసీలు రాష్ట్ర జనాభాలో నాలుగో వంతున్నారు. తెరాస ప్రభుత్వం వారి గోడు అసలు పట్టించుకోలేదనే తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్న అ వర్గం, తెరాసను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 15 శాతం వరకు ఉన్న సంచార జాతులు అంతే, తెరాసకు వ్యతిరేకంగా ఉన్నారు, మాలలు, కాంగ్రస్ వైపు మొగ్గు చుపుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యమలో క్రియాశీల పాత్రను పోషించిన, మాదిగలు, బీఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బీఎస్పీ, తెరాసతో  పొత్తు పెట్టుకుంటే, మాదిగల ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ తమ విశ్లేషణలో వివరించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశం ఉందని పేర్కొన్నారు షెడ్యూలు తెగలు ఇప్పటికే పోడు భూముల విషయంగా తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు తున్నారు. ముస్లిం ఓటు పాత నగరంలో సహజంగానే ఎంఐఎంకు పోతుంది. జిల్లాలలో  బీజేపెకి వ్యతిరేకంగా, పోలవుతుందని,   ఇలా ఏలా  చూసినా కుల సమీకరాణాలు, తెరాసకు వ్యతిరేకంగా ఒకటవుతున్నాయి. అయితే ఇంకా ఎటూ తేల్చుకోని సామాజిక వర్గాలు అనేక ఉన్నాయి, ఎన్నికల ప్రకటన వచ్చిన  తర్వాత కానీ, ఈ సామాజిక వర్గాలు ఒక నిర్ణయానికి రాక పోవచ్చును. ఎన్నికల పై డబ్బు ప్రభావం ఎటూ ఉంటుంది. పట్టణ ప్రాంతాల ఉద్యోగులలో, అసంతృప్తి  వుంది. సకాలంలో జీతాలు, పెన్షన్లురాని, ప్రభుత్వ ఉద్యోగాలోనే కాదు, ప్రైవేటు ఉద్యోగులలో కూడా తెరాస ప్రభుత్వం పట్ల వివధ కారణాల వలన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశ్వవిద్యాలయ విద్యార్ధులు, నిరుద్యోగ యువత  ఆందోళన బాట పట్టారు. తెరాస ప్రభుత్వం, మంత్రులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసే తీరు పట్ల  మేథావి వర్గం మండిపడుతోంది.   ఇలా ఎలా చూసినా, కులాల వారీగా సేకరించిన సమాచారం ప్రకారం చూసినా ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తమవుతోంది. సో.. మరో సారి తెరాస గెలవదు. ఆ అవకాశమే లేదు. అయితే, బీఎస్పీ వంటి చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెరాస పరిరిస్థితి కొంత మెరగయ్యే అవకాశం ఉండవచ్చును. అయితే, తెరాస సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా, కేవలం ఎంఐఎం మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు . పార్టీ ఫిరాయింపులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. మరో వంక,బీజేపీ ఎదుగుదలకు కొన్నిఅవరోధాలు ఉన్నా, అవ్యవస్తీకృత  సామాజిక వర్గాలను ఆకట్టుకుని సంస్థాగతంగా  ఆ వర్గాలకు చేరువ కావడంతో పాటుగా ఉత్తర ప్రదేశ్’లోలాగా వెనకబడిన కులాలో మరింత వెనకబడిన కులాలను కలుపుకు పోగలిగే స్థాయిని బట్టే పార్టీ భవిష్యత్ ఆధరపడి ఉంటుందని ప్రొఫెసర్ తిరుపతి  విశ్లేషించారు.

ఆత్మకూరు ఉప ఎన్నిక.. పోలింగ్ కు సర్వం సిద్ధం

ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం పక్షం రోజుల పాటు హోరెత్తి, మంగళవారంతో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, అగ్రనాయకుల ప్రచారాలతో నియోజకవర్గం మొత్తం హోరెత్తించారు. ఈ నెల 23 గురువారం   ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.   పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ మూడేళ్ల పాలనపై ప్రజాభిప్రాయానికి సంకేతంగా రాజకీయ పక్షాలు విశ్లేషించే అవకాశం ఉందనే ఉద్దేశంతో బల నిరూపణకు ఆ పార్టీ అధిష్టానం అగ్ర నాయకులను రంగంలోకి దింపింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి భారీ మెజారిటీ కట్టబెట్టాలనే లక్ష్యంతో నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని, ఎమ్మెల్యేని ఇన్చార్జిగా నియమించి బాధ్యతలు అప్పగించింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేరుగ నాగార్జున, జోగి రమేష్, అంజాద్ బాషా, కారుమూరి నాగేశ్వరరావు, రోజా, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పది రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ ఉప ఎన్నిక ఫలితం ఏ విధంగానూ జగన్ మూడేళ్ల పాలనపై ప్రజా భిప్రాయానికి ప్రతిబింబం కాదు.. కాబోదు. ఎందుకంటే ప్రధాన విపక్షం పోటీలో లేదు. పోటీలో ఉన్న బీజేపీకి నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్రంలోనే ఓటు బ్యాంకు లేదు. ఇక రంగంలో ఉన్న చిన్నా చితకా అభ్యర్థులు నామ మాత్రమే. బీజేపీ పోటీలో ఉన్నా ఈ ఎన్నిక వాస్తవంగా ఏకపక్షమేనని పరిశీలకులు ఇప్పటికే విశ్లేషణలు చేశారు. ఇక ఉప ఎన్నిక పోలింగ్ కు నియోజకవర్గంలో   278 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, పోలింగ్ సజావుగా జరిగేందుకు 1032 మంది పోలీస్ సెంట్రల్ ఆన్ ఫోర్సుతో పాటు 1132 మంది పోలింగ్ సిబ్బంది. 78 మంది వీడియోగ్రాఫర్లు, 148 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలన కోసం వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంల చివరి ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ చక్రధరబాబు, ఎన్నికల పరిశీలకుడు సురేష్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ స్టేషన్ల వారీగా సిబ్బంది నియామకం, ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో  బరిలో 14 మంది ఉన్నారు.  

ఆట‌పాట‌ల‌తోనే విద్యా వికాసం

పిల్ల‌లు బ‌డికి వెళ్ల‌డం, చ‌దువుతో పాటు, ఆట‌పాట‌ల‌తో స్నేహితుల‌తో త‌ర‌గ‌తి బ‌య‌ట కూడా కొంత స‌మ‌యం గ‌డ‌ప‌డం ప‌రిపాటి. టీచ‌ర్లు ఎప్పుడూ చాలా సీరియ‌స్‌గానే పిల్ల‌లతో వ్య‌వ‌హ‌రించ‌డం చాలా స్కూళ్ల‌లో చూసే దృశ్య‌మే. పాఠం చెప్ప‌డం, హోమ్‌వ‌ర్క్ భారీగా ఇచ్చి వాళ్ల‌కి కాస్తంత స‌ర‌దాగా గ‌డిపే స‌మ‌యం కూడా లేకుండా చేయ‌డం  చాలామంది టీచ‌ర్ల‌కు ఓ స‌ర‌దా!   కానీ చాలా త‌క్కువ మంది టీచ‌ర్లే పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డంలోనూ వాళ్ల‌కి మ‌రీ సీరియ‌స్‌గా కాకుండా వాళ్ల మ‌న‌సు తెలుసుకుని చిన్న‌చిన్న క‌థ‌లు చెబుతూ, జోక్స్ వేస్తూ కూడా పాఠాలు చెప్పేవారున్నారు. చ‌క్క‌గా ప‌ల‌క‌రించి మ‌రీ   ఎలా చ‌దువుతున్నారో తెలుసుకునేవారూ వున్నారు.    ఈ పోటోలో కనిపిస్తున్న ఒక స్కూలునే తీసుకుంటే ఆ స్కూలు టీచ‌ర్ త‌న విద్యార్ధుల‌ను ఎంత చ‌క్క‌గా ఆడిస్తూ క్లాసులోకి ఆహ్వానిస్తున్నారో అర్థమౌతుంది!  ఇది పిల్ల‌ల్లో విద్య‌ ప‌ట్ల ఎంతో ఉత్సాహాన్ని, ఆస‌క్తిని పెంచుతుంది. త‌ద్వారా వారి మాన‌సిక స్థితి అద్భుత‌గా వుంటుంది, పాఠం విన‌డం, చ‌ద‌వ‌డం, రాయ‌డం మీదా దృష్టి బాగా కేంద్రీక‌రిస్తారు కూడా! అయితే అలాగ‌ని వారిని మ‌రీ ఆట‌పాట‌ల‌తో క్లాసు స‌మ‌యం వృధా చేయ‌రు. కేవ‌లం అయిదు ప‌ది నిమిషాలే! అంత స‌మ‌యం చాలు వారిని త‌ర‌గ‌తి గ‌ది ప‌ట్ల ఆస‌క్తిగా వుంచ డానికి. ఈ విధ‌మ‌యిన టీచ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌, బోధ‌న‌లే విద్యార్ధుల‌ను ముఖ్యంగా విద్య‌లో అంత‌గా రాణించ‌లేని వారు కూడా విద్య‌ప‌ట్ల శ్ర‌ద్ధ చూప‌డానికి వుప‌యోగ‌ప‌డుతుంద‌ని విద్యావేత్త‌లు, ప‌రిశోధ‌కులు అంటున్నారు.  మ‌రీ ముఖ్యంగా చిన్న త‌ర‌గ‌తి పిల్ల‌లు ఆట‌ పాట‌ల‌తోనే ఎంతో నేర్చుకుంటారు. వారికి ఆ విధ‌మైన బోధ‌నే స‌ర‌యిన బోధ‌నా మార్గంగా విద్యారంగ శాస్త్ర‌వేత్త‌లు, ప‌రిశీల‌కులు పేర్కొన్నారు. భార‌త దేశంలో ఇటీవ‌లి కాలంలో చిన్న త‌ర‌గ‌తుల్లో విద్యాబోధ‌న విష‌యంలో అనేక మార్పులూ వ‌చ్చాయి. పోతే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విషయం, చూస్తున్న ఫోటో, ఏ స్కూలుదో , ఎక్కడదో అన్న వివ‌రాలు అంత‌గా తెలి య‌వు కానీ టీచ‌ర్ ఆ విధంగా పిల్ల‌ల్ని ఆడిస్తూ చ‌దువుప‌ట్ల ఉత్సాహ‌ప‌ర్చ‌డం మాత్రం అంద‌ర్నీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. టీచ‌ర్, విద్యార్ధుల మ‌ధ్య స‌త్సంబంధాలే విద్యార్ధుల‌కు ఎంతో అవస‌రం. విద్య‌, ఆట‌పాట‌ల ప‌ట్ల పిల్ల‌లు ఎక్కువ మొగ్గు చూప‌గ‌ల్గు తారు. ఇందుకు ఇదో గొప్ప వుదాహ‌ర‌ణ‌.  ఈ  వివరాలను ట్విట‌ర్‌లో పోస్టు చేసిన మ‌నూ గులాటీ కూడా స్వ‌యంగా టీచ‌ర్‌. ఈమె ఢిల్లీలో ప్ర‌భుత్వ పాఠశాల‌లో ప‌నిచేస్తున్నారు.

బీజేపీ రాజకీయ వేధింపుల్లో భాగమే.. సచిన్ పైలట్

నేష‌న‌ల్ హెరాల్డ్‌కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఇ.డి) సుదీర్ఘ స‌మ‌యం ప్ర‌శ్నించ‌డం   కేంద్ర ప్రభుత్వ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గానే క‌న‌ప‌డుతోంద‌ని కాంగ్రెస్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ ఆరోపించారు. బుధ‌వారం ఏకంగా 12 గంట‌ల‌పాటు ప్ర‌శ్నించ‌డం  వెనుక  మోడీ సర్కార్     కాంగ్రెస్‌ను టార్గెట్‌గా  చేసుకోవ‌డ‌మే  క‌న‌ప‌డుతోంద‌ని అన్నా రు.  ఇది కేవ‌లం మోదీ స‌ర్కార్‌ను  నిల‌దీస్తున్నందుకు క‌క్ష సాధింపు చ‌ర్య‌గా  కాంగ్రెస్ పార్టీనే కాదు మొత్తం ప్ర‌తిప‌క్షాల‌నూ కేంద్రం టార్గెట్ చేసిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వు తోంద‌ని ఆరోపించారు.   ఇన్‌క‌మ్ టాక్స్‌, సిబిఐ, ఈడీ వంటి సంస్థ‌ల‌తో వ‌రుస దాడులు చేప‌ట్ట‌డం బిజెపి ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును బ‌హిర్గ‌తం చేస్తుంద‌నేది దేశంలో ప్ర‌తీ పౌరుడికీ తెలిసిపోయింద‌న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్ర‌తిప‌క్షం లేకుండా చేసుకోవాల‌న్న ఆతృత బిజెపి  కనిపిస్తున్నదనీ, ఇటువంటి చ‌ర్య‌ల ద్వారా ఆ పార్టీ తన ఉద్దేశాన్ని స్వ‌యంగా బహిర్గ‌తం చేసుకుంటోంద‌ని పైల‌ట్ అన్నారు.  రాహుల్ గాంధీని జూన్ 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కూ ఇ.డి 40 గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించ‌డం దారుణ‌మని  పైల‌ట్ అన్నారు. రాహుల్ త‌న త‌ల్లి సోనియాగాంధీ అనారోగ్యం కార‌ణంగా   వ్య‌క్తిగ‌తంగా పిలిచి ప్ర‌శ్నించ‌డానికి కొంత స‌మ‌యాన్ని ఇవ్వాల‌ని ఆయ‌న త‌ర‌ఫున కాంగ్రెస్ నేత‌లు ఈడీ ని కోరారు. కానీ అందుకు ఇ.డి నుంచి ఎలాంటి సానుకూల స్పంద‌నా రాలేదు. కానీ ఆయ‌న్ను జూన్ 20 రావ‌చ్చున‌ని  ఈడీ . తెలియ‌జేసింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఆయ‌న్ను ప్ర‌శ్నించ‌డం కొన‌సాగింది.  అంతేగాక జూన్ 15న ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలోకి చొచ్చుకుని వ‌చ్చి  నాయ‌కుల‌పై   దాడి చేయ‌డం అమానుష‌మ‌ని పైల‌ట్ వ‌ర్ణించారు. పోలీసులు వృత్తి ధ‌ర్మం కాకుండా గూండాగిరీ ప్ర‌ద ర్శించ‌డం దారుణ‌మని దీనికి ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల‌న్నారు.

ఏపీలో విద్యా సంక్షోభం.. ఇంటర్ ఫలితాల్లోనూ జగన్ సర్కార్ ఫెయిల్!

రాష్ట్రంలో విద్యారంగానికి  పెద్ద పీట వేసి వీల‌యినంత అభివృద్ధి సాధిస్తామ‌ని  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ అర్ధం పర్థం లేకుండా పోయింది. ఎక్క‌డా విద్యా రంగానికి త‌గిన ప్రోత్సాహ‌కాలు లభించ‌క‌పోగా, అస‌లు తెలుగు మీడియం స్థానంలోకి ఇంగ్లీషు మీడియం తేవ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు.   జ‌గ‌న్  మూడేళ్ల పాలనలో పరీక్షల నిర్వహణ ఈ ఏడాదే మొదటిది.  మొద‌టి సారి నిర్వ‌హించిన  ప‌రీక్ష‌లు దారుణ ఫ‌లితాలే ఇచ్చాయి.  మూడేళ్ల‌ పాల‌న‌లో విద్యారంగానికి పెద్ద‌గా  చేసిందేమీ లేద‌న్న‌ది ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ, వాటి ఫలితాలతోనే  తేలిపోయింది.  ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకున్న ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ  బూమ‌రాంగ్ అయి పాల‌కు ల‌కే  వూహించ‌ని  షాక్ ఇచ్చింది.  పిల్ల‌ల భ‌విష్య‌త్ ను దెబ్బ‌తీయాల‌నుకునేవారిని  పాల కులుగా ప్ర‌జ‌లు ఏ విధంగా అంగీక‌రిస్తార‌నేది ఆయ‌నే చెప్పాలి. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల స‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన త‌తంగం అంతా ఇంతా కాదు. మొద‌టి రోజే ప్ర‌శ్నాప‌త్రం లీక్ అయింద‌ని అందుకు నారాయ‌ణ స్కూలు వారినే బాధ్యులుగా పేర్కొంటూ మాజీ మంత్రి టిడీపి నేత నారాయ‌ణ పాఠ‌శాల‌ల య‌జ‌మాని నారాయ‌ణ‌ను అరెస్టు చేసేదాకా నిద్ర‌పోలేదు. ఫ‌లితాల ప్రక‌ట‌న‌లో జాప్యం. అందులోనూ అవ‌క‌త‌వ‌క‌లూ  ప్ర‌జ‌లు గ‌మ‌నించి న‌వ్వుకున్నారు. ఎంతో అద్భుతంగా  ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, అననుకూల ప‌రిస్థితు ల్లోనూ విద్యార్ధులు అద్భుత విజ‌యాలు సాధించార‌ని ప్ర‌చార ఆర్భాటాలు చేశారే గాని వాస్త‌వానికి  ఫ‌లి తాలు అందుకు విరుద్ధంగానే వెల్ల‌డ‌య్యాయి. ఇంత‌కంటే  జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డానికి ముందు జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో పాస్‌ప‌ర్సంటేజ్ సుమారు 90 శాతం వుంది.  దానితో పోల్చిన‌పుడు  ప్ర‌స్తుత ప‌ర్సంటేజ్ ఏ స్థాయిలో స‌రితూగ‌గ‌ల‌తో విద్యామంత్రి బొత్స వివ‌రించాలి.   బుధ‌వారం వెల్ల‌డ‌యిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల విష‌యంలోనూ ప్ర‌భుత్వం ప్ర‌చార ఆర్భాట‌మే క‌న‌ప డింది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన 28 రోజుల్లోనే ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌డం గొప్ప సంగ‌తిగా  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ ఆనంద‌ప‌డ‌వ‌చ్చు. కానీ ఉత్తీర్ణతా శాతం  చూస్తే సంబరపడటానికి ఏమీ లేదన్నది తేటతెల్లమైపోయింది  ఫ‌లితాలు వెల్ల‌డించిన త‌ర్వాత మంత్రి బొత్స విలేక‌రుల‌తో మాట్లాడుతూ  ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో  బాలికలే ఎక్కువ శాతం పాస్‌ అయ్యారని మంత్రి చెప్పారు. ఇంట‌ర్ ఫస్టియ‌ర్‌లో 4,45, 604 మంది, సెకండియ‌ర్‌లో 4,23455 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యా ర‌ని ఆయ‌న తెలిపారు. ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి 72, 299 మంది పరీక్షలు రాశార‌న్న ఆయ‌న  మొత్తంగా 9, 41, 350 మంది విద్యార్థులు ఇంట‌ర్ పరీక్షలకు హాజ‌ర‌య్యా ర‌ని చెప్పారు. ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 2,41,591 మంది ఉత్తీర్ణత సాధించారన్న బొత్స పాస్ ప‌ర్సంటేజీ 54 శాతంగా న‌మోదైం దన్నారు. ఇందులో బాలురు 49 శాతం, బాలికలు 65 శాతం పాస్ అయ్యారని తెలిపారు. సెకండియ‌ర్‌లో 2,58,449 మంది పాస్ కాగా  61 శాతం ఉత్తీర్ణత న‌మోదైంద‌ని ఆయ‌న చెప్పారు. ఇందులో బాలురు 55 శాతం, బాలికలు 68 శాతం పాస్‌ అయ్యారన్నారు.  పాల‌కుల దృష్టిలో అద్భుత ప‌ర్సంటేజ్‌గా ప్ర‌చారం చేసుకోవ‌డానికి త‌ప్ప వాస్త‌వంగా  ఇది ఏ  స్థాయిలోనూ విద్యారంగంలో వూహించ‌ని దారుణ ప‌రిణామంగా  పేర్కొనాలి.  ఇందుకు విద్యాశాఖ‌, సీఎం బాధ్య‌త వ‌హించాల్సివుంటుంది.   ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం 45 శాతం, రెండో ఏడాది 55 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయ‌న‌ వెల్లడించారు. అగ‌స్టు 3వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీ క్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. 

పీఠం దిగడమే మేలు.. ఉద్ధవ్ యోచన?!

ప‌రిస్థితులు అనుకూలించ‌ని స్థితిలో మొండిగా కుర్చీనే అంటిపెట్ట‌కోవ‌డం కంటే మంచి  స‌ల‌హాలను లెక్క లోకి తీసుకునీ పీఠం దిగిపోవ‌డ‌మే ఎంతో మేలు. మొత్తానికి మ‌హారాష్ట్ర అసెంబ్లీ ర‌ద్దు చేయ‌డానికే సి.ఎం. ఉద్ద‌వ్ థాక్రే మొగ్గుచూపుతున్నారు. బిజెపీతో రాజీప‌డ‌టం కంటే త‌ప్పుకోవ‌డం మంచిద‌న్న ఆలో చ‌న‌లో  ఉద్ధవ్ వున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే మంచిద‌ని  మిత్ర‌ప‌క్షాలు కాంగ్రెస్‌, ఎన్సీపీల కూడా  ఒప్పించబోతున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి తోడు  శివ‌సేన కీల‌క నేత సంజ‌య్ రౌత్  కూడా  రాష్ట్ర అసెంబ్లీ ర‌ద్దుకు ప్రస్తుత పరిస్థితి దారితీస్తోంది అంటూ ట్వీట్ చేయ‌డం ఆ త‌ర్వాత  తొల‌గించ‌డం  గ‌మ‌నార్హం.  మహారాష్ట్రలోని మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) సంకీర్ణ సర్కారు సం క్షోభంలో పడింది. విశ్వాస పరీక్ష పెడితే గట్టెక్కడం కష్టమే. లెక్క‌ల విష‌యానికి వ‌స్తే... మహారాష్ట్ర అసెం బ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 106 మంది, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంవీఏ  సర్కారుకు 152 మంది సభ్యుల  బలం ఉంది. అయితే, శివసేన సీనియర్‌ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిండే  కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌కు వెళ్లి పోయారు. షిండేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం మహారాష్ట్రలో  ఒక ఎమ్మెల్యే మరణించడంతో అసెంబ్లీలో సంఖ్యా బలం 287గా ఉంది. అంటే విశ్వాస పరీక్ష పెడితే 144 మంది సభ్యులు ఉండాలి. తాజాగా 40 మంది సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఆ పార్టీ బలం 15కి పడిపోతుంది. ఫలితంగా సభలో సంకీర్ణ సర్కారు బలం 111కి తగ్గిపోతుంది. అయితే 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సభలో కొత్త మెజా రిటీ మార్కు 111కి చేరుతుంది. మరోవైపు కొన్ని వార్తా సంస్థలు షిండేతో 35 మంది ఎమ్మెల్యేలున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్స్‌ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.   ఏది ఏమైనా  ఉద్ధవ్ సర్కార్ మైనారిటీలో పడిందన్నది మాత్రం ఖాయం. మెజారిటీ సభ్యులతో ప్రత్యేక క్యాంప్ మెయిన్ టైన్ చేస్తున్న ఏక్ నాథ్ షిండే మాదే అసలైన శివసేన  అనే అవకాశాలను కూడా  కొట్టిపారేయలేమన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో గౌరవంగా తప్పుకుంటే మేలన్న యోచన ఉద్ధవ్ చేస్తున్నారన్నది వారి అభిప్రాయం. షిండే బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. లేక బీజేపీ సర్కార్ కు మద్దతుగా నిలబడినా తరువాత క్షేత్ర స్థాయిలో షిండే నిర్వాకాన్నీ, బీజేపీ రాజకీయ అవకాశ వాదాన్ని ఎండగట్టడం ద్వారా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని ఉద్దవ్ ధాక్రే భావనగా చెబుతున్నారు.

పాత మిత్రుల అండతో సిన్హా సక్సెస్ అవుతారా?

చివరాఖరుకు ఉత్కంఠకు తెర తొలిగింది. అధికార బీజేపీ / ఎన్డీఎ కూటమి, ప్రతిపక్ష పార్టీల కూటమి ఒకే రోజు, కొద్ది గంటల తేడాతో రాష్టపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్ధుల పేర్లను ప్రకటించాయి. ముందు నుంచి అనుకుంటున్నట్లుగా గానే ఎన్డీయే తరఫున ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్ము పోటీ చేస్తారని, బీజేపే జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా ప్రకటించారు.  ఎన్డీఎ తమ  అభ్యర్ధిని ప్రకటించడానికి ముందే, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా పేరును, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద పవార్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీల  ఉమ్మడి అభ్యర్ధిగా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాల కృష్ణ గాంధీ ఇలా  అనేక  పేర్లు ప్రస్తావనకు వచ్చినా, ఆ ముగ్గురూ పోటీకి సుముఖంగా లేక పోవడంతో, చివరకు యశ్వంత్ సిన్హా పేరు తెర మీదకు వచ్చింది. పవార్, అబ్దుల్లా, గాంధీ పోటీకి అంగీకరించక పోవడానికి,  ఎవరి కుండే కారణాలు వారికి ఉన్నా, ఆవగింజలో అరవయ్యోవంతు అయినా, గెలిచే ఛాన్స్ లేక పోవడం వల్లనే, ఆ ముగ్గురూ  పోటీకి విముఖత చూపారనే ప్రచారం  బలంగా సాగింది. నిజానికి, అందులో కొంత నిజముంది.  బీజేపీ సారథ్యంలోని అధికార కూటమికి తమ అభ్యర్ధి ఎవరైనా గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యా బలముంది. రాష్ట్రపతి ఎన్నిక ఎలెక్టోరల్ కాలేజీలో హాఫ్ వే మార్కు అరంగుళం దూరంలో ఎన్డీయే వోట్ షేర్ వుంది. ఎన్డీఎకు మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్న వైసీపీ, బిజూ జనతాదళ్ వంటి పార్టీల బలాన్ని కలుపు కుంటే ఎన్డీఎ అభ్యర్ధి గెలుపు నల్లేరు మీద నడకే, అవుతుంది. అందుకే ప్రతిపక్ష కూటమికి పెద్ద దిక్కుగా నిలిచిన శరద్ పవార్ కూడా సున్నితంగా నో  అని పోటీకి దూరంగా ఉండి పోయారు. అలా చూసినప్పుడు యశ్వంత్ సిన్హా సాహసం చేసారనే చెప్ప వచ్చును. ఒక విధంగా ఆయన, ఈ వయసులో (85) అయన తమ  వ్యక్తిగత ప్రతిష్టను పక్కన పెట్టి రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగడం ద్వారా ప్రతిపక్షాల గౌరవాన్ని కాపాడారు.  అయితే, ఇప్పడు యశ్వంత్ సిన్హా బరిలో దిగడం వలన లెక్కలు మారి పోతాయా? ఎన్డీఏ  బలం తగ్గి పోతుందా ? ద్రౌపదీ ముర్మూ విజయావకాశాలు మారి పోతాయా అంటే, అలాంటిది ఏమీ ఉండక పోవచ్చును. అయినా, ఇంతవరకు కొంత నిరాసక్తంగా, స్తబ్దుగా, చప్పగా అనిపించి రాష్టపతి ఎన్నిక రాజకీయం ఇప్పుడు కొంత వేడెక్కే అవకాశం అయితే ఉందని రాజకీయ వర్గాలో వినవస్తోంది. ప్రధానంగా బీజేపీలో ఆయనకు ఉన్న సంబంధాల  ప్రభావంపై కొంత చర్చ జరుగుతోంది. సుదీర్ఘ కాలం పాటు బీజేపీలో ఉన్న యశ్వంత్ సిన్హా, ఆ పార్టీ ఓట్లను  ఎంతో  మేరకు అయినా తమ వైపుకు తిప్పుకో గలరా? బీజీపే సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీతో ఉన్న సన్నిహిత సంబంధాలు యశ్వంత్ సిన్హాకు మేలు చేస్తాయా?  అదే విధంగా, ప్రస్తుతం ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న, ఒకప్పుడు అద్వానీ సన్నిహితునిగా ఉన్న సురేంద్ర కులకర్ణి  బీజేపీ ఓటుకు గండి కొడతారా? అలాగే, బీజీపేలో తమ కున్న ఇతర పాత పరిచయాలను ఉపయోగించుకుని యశ్వంత్ సిన్హా, టేబుల్స్ తిరగేస్తారా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు  సమాధానం ఇవ్వడం  కష్టమని  కొందరంటే, అక్కడున్నది మోడీ,  షా  జోడీ అని, క్రాస్ వోటింగ్’ కు నో ఛాన్స్ అని ఇంకొందరు అభిప్రాయ పడుతున్నారు.   అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రి వర్గంలో విదేశాంగ  మంత్రిగా పనిచేసిన  యశ్వంత్ సిన్హాకు, ఆ తరం సీనియర్ నాయకులతో కొంత సన్నిహిత సంబంధాలున్న మాట నిజం. మోడీ, షా జోడీ తెర మీదకు వచ్చిన తర్వాతనే ఆయన పార్టీకి దూరమవుతూ వచ్చారు. అయినా,  ఆయన కుమారుడు జయంత్ సిన్హా మోడీ మంత్రివర్గంలోనూ ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా బీజేపీ ఎంపీగా, ఆర్ధిక మంత్రిత్వ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే యశ్వంత్ సిన్హా, కొడుకు కొడుకే రాజకీయం రాజకీయమే అంటున్నారు.   అదలా ఉంటే, యశ్వంత్ సిన్హా అభ్యర్ధి కావడం వలన  ప్రతి పక్షాలకు పెద్దగా కలిసోచ్చేది ఉండదని, కానీ, నూటికి రెండు వందల  శాతం ఓటమి తధ్యం అని తెలిసి కూడా సిన్హా బరిలో దిగడం వలన ప్రతిపక్షల  గౌరవం కొంత కాపాడారని అనుకోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. అయితే, అటు నుంచి ఇటుకు క్రాస్ ఓటింగ్ జరిగినా జరగక పోయినా ఇటు ప్రతిపక్షం నుంచి అధికార కూటమి వైపుకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కొట్టివేయలేమని అంటున్నారు. ముఖ్యంగా, మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో, నిన్న మొన్నటి మహారాష్త్ర శాసన సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకున్నా, మహారాష్ట్రలో జరుగతున పరిణామాలను గమనించినా, విపక్షాలు తమ వోటును ఎంత వరకు కాపాడుకో గలవు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి, క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించ వలసిన అవసరం బీజేపీకి లేదు, ద్రౌపదీ ముర్మూపేరు ప్రకటించగానే, బిజూ జనతాదళ్ ఆమెకు మద్దతు ప్రకటించింది. దీంతో ఎన్డీఎ బలం 58 శాతానికి చేరింది. వైసీపీ, ఎటూ బీజేపీ స్వయంగా వద్దన్నా ఎన్డీఎకే ఓటు వేస్తుంది.  సో .. ఇప్పటికే ఎన్డీఎ ఓటు 60 పర్సెంట్ క్రాస్ అయిందని అనుకోవచ్చును. ఇక మహారాష్ట్ర పరిణామాల నేపద్యంలో ఇంకొంత బలం యాడ్ అయింది . కాబట్టి,  బీజేపీ ఇంకా క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించవలసిన అవసరం లేదు. అయితే, ఇప్పడున్న  బీజీపే నాయకత్వం, ఒక్క ఓటు తేడాతో ప్రభుతాన్ని త్యాగం చసిన అటల్జీ, అద్వానీజీల నాయకత్వం కాదు,  చైనా పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని పాటిస్తున్న మోడీ , షా  నాయకత్వం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో, కాంగ్రెస్ సహా  ప్రతిపక్ష పార్టీలు తమ ఓటును ఏ మేరకు కాపడుకోగలవు? ఇదే ఇప్పడు ప్రతిపక్ష  ముందున్న ప్రధాన సవాలుగా భావించవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

ఆప్ఘనిస్థాన్ లో భూకంపం.. 280 మంది మృతి.. భారత్ లోనూ ప్రకంపనలు

ఆప్ఘనిస్థాన్ లో భూమికంపించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైన ఈ భూకంపం కారణంగా కనీసం 280 మంది మరణించారు. వేయి మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. బుధవారం ఉదయం సంభవించిన ఈ భూకంప కేంద్రం పాక్ సరిహద్దులోని ఖోస్ట్ నగరానికి 44కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు జియలాజికల్ సర్వే పేర్కంది. ఈ భూకంప ప్రకంపనలు పాకిస్థాన్, భారత్ లోని కొన్ని ప్రాంతాలలో కనిపించినట్లు పేర్కొంది. పలు భవనాలు కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూకంప ప్రభావం అత్యధికంగా తూర్పు ఆప్ఘనిస్థాన్ లోని పక్తికా ప్రావిన్స్ లోనే ఉందనీ, మృతులంతా ఆ ప్రావిన్స్ కు చెందిన వారేనని పేర్కొన్నారు. రాజధాని నగరంలో కూడా భూమి కంపించిందనీ, అయితే అక్కడ ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదనీ ఆప్ఘన్ అధికారులు పేర్కొన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.  

మ‌ళ్లీ కోవిడ్ ముప్పు.. అప్ర‌మ‌త్తత అనివార్యం.. తెలంగాణ సర్కార్ హెచ్చ‌రిక‌!

ఆరోగ్యం విష‌యంలో నిత్యం అప్ర‌మ‌త్తంగా వుండాల్సిన ప‌రిస్థితి  ఏర్ప‌డింది.  వెళిపోయిందనుకున్న భూతం తిరిగి వ‌చ్చింది. రాష్ట్రంలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.  ప్ర‌జ‌లు మ‌ళ్లీ మాస్కులు, భౌతిక దూరం పాటించక తప్పని పరిస్ధితులు దాపురించాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. కోవిడ్ ప్రొటోకాల్ తప్పని సరిగా పాటించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   దేశ వ్యాప్తంగా కోవిడ్ తొలిద‌శ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తాయి, చాలామంది చ‌నిపోయారు. వూహించ‌ని విధం గా  కోవిడ్ వేగంగా విస్త‌రించి ప్ర‌పంచాన్ని ఖంగారుపెట్టింది. యావ‌త్ ప్ర‌జారోగ్య రంగం ప‌నివేళ‌ల ప‌రిమితి లేకుండా ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడేందుకు అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించింది. శాస్త్ర‌వేత్త‌లు ఈ వూహించ ని విప‌త్తు నుంచి ప్ర‌జ‌ల్ని ర‌క్షించ‌డానికి మందులు త‌యారీలో త‌ల‌మున‌క‌ల‌య్యాయి. వాటి వుత్ప‌త్తి,  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంగీకారాలు కాస్తంత జాప్యం చేయ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య విప‌రీతంగా పెరిగి పోయింది. మొత్తానికి  కోవాక్స్‌, కోవిషీల్డ్ ఇంజ‌క్ష‌న్‌లు వ‌చ్చి మ‌ర‌ణాల సంఖ్య‌ను బాగా త‌గ్గించాయి.  కాస్తంత త‌గ్గు ముఖం ప‌డుతు న్న స‌మ‌యంలో రెండో విడ‌త కూడా కోవిడ్ దాడి చేసి మ‌రింత భ‌యపెట్టిం ది.  కానీ  మొద‌టి విడ‌త స‌మ‌యంలో దాని ల‌క్ష‌ణాలు, ప్ర‌భావం వేగం తెలుసుకున్న కార‌ణం గా  ప్ర‌భు త్వాలు, ఆరోగ్యరంగం మ‌రింత జాగ్ర‌త్త‌ల‌కు తీసుకోవ‌డానికి ప్ర‌జ‌లంతా ఏక‌మై అన్ని విధాల స్వ‌యం జాగ్ర‌త్త‌లు పాటించి ఎదుర్కొన‌డంలో విజ‌యం సాధించాం. ప్ర‌పంచ దేశాల్లో ఆరోగ్య రంగం అభివృద్ధికి  ప్ర‌త్యేక కేటాయింపులు చేయ‌డం, ప్ర‌జారోగ్యానికి అధిక ప్రాధాన్య‌త‌నీయ‌డం వంటివి కీల కంగా మారాయి. అన్ని దేశాల అధినేత‌లు ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఉన్న‌త‌స్థాయి  ప్ర‌చార కార్య క్ర‌మాలు చేప‌ట్టారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌లు, సూచ‌న‌ల‌ను అనుస‌రించి  ప్ర‌భుత్వాలు ప్ర‌జారోగ్య రంగం లో వేగ‌వంతంగా  మంచి ఫ‌లితాలు సాధించేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని  ఆదేశా లు జారీ చేసింది. ఫ‌లితంగా భార‌త్‌లోనూ క‌ఠిన ఆంక్ష‌లు విధించి  రెండో విడ‌త కూడా దాటి వేయ గ‌లిగాము. ఇందుకు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు, ఆరోగ్య‌కేంద్రాలు, ఆస్ప‌త్ర‌లు, ప్ర‌జారోగ్య సేవా కేంద్రాలు చేసిన సేవ‌లు ప్ర‌జ‌లు ఎన్న‌టికీ గుర్తు పెట్టుకుంటారు.    కోవిడ్ రెండో విడ‌త దాడి నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత మూడో విడ‌త నాలుగో విడ‌త రావ‌చ్చ‌ని అన్నారు. కానీ అలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌లేదు. ఈ కారణంగా  ప్ర‌జ‌లు అంతా త‌మ త‌మ వృత్తి, వుద్యోగాలు, ప‌నుల‌కు ఉప‌క్ర‌మించ‌డంతో  కాస్తంత నిర్ల‌క్ష్యంగానే  వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. కోవిడ్ కార‌ణంగా ఆర్ధి కంగా ఇబ్బందులు ప‌డిన కార‌ణంగా అనేక సంస్థ‌లు, కార్యాల‌యాలు త‌మ వుద్యోగుల‌ను ఇంటి నుంచి ప‌నిచేయించారు. కార్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌ల‌లో ఉత్ప‌త్తి నిర్వీర్య‌మ‌యిన కార‌ణంగా తిరిగి  రావ‌ల‌సిందిగా  కోర‌డంతో ప్ర‌జ‌లు కోవిడ్   జాగ్ర‌త్త‌ల‌ను గాలికి వ‌దిలేసేరు.  దీని ఫ‌లితంగా దేశంలో,   రాష్ట్రంలోనూ మ‌ళ్లీ కోవిడ్ విస్త‌రిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది.  ఈ కార‌ణంగానే రాష్ట్ర‌ప్ర‌భుత్వం మ‌ళ్లీ  కోవిడ్  జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని హెచ్చ‌రించింది.   ప్ర‌జ‌లంతా త‌ప్ప‌కుండా  మ‌ళ్లీ భౌతిక దూరాన్ని పాటించాల‌ని, మాస్క్‌లు త‌ప్ప‌కుండా వాడాల‌ని,  ప‌ది యేళ్ల లోపువారు, 60 యేళ్లు దాటిన‌వారు బ‌య‌ట తిర‌గ‌రాద‌ని, డాక్ట‌ర్లు  చెప్పిన ఆరోగ్య‌సూత్రాలు  త‌ప్ప కుండా  పాటించాల‌ని, కోవిడ్  ఇంజ‌క్ష‌న్స్  మ‌రో విడ‌త  తీసుకోవ‌డానికి  సిద్ధ‌ప‌డాల‌ని ప్రభుత్వం హెచ్చ రించింది. 

ఎవరీ ద్రౌపది ముర్ము.. ఏమిటామె కథ!

రాష్ట్రపతి అభ్యర్థిగా పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికి ప్రధాని మోదీ అండ్ కో మాత్రం.. చివరి నిమిషంలో ద్రౌపది ముర్ము వైపు మొగ్గు చూపారు. దీంతో అధికార ఎన్డీఏ కూటమి.. తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని బరిలో నిలిపింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఇటీవల పలువురి పేర్లు వినిపించినాయి... వాటిలో ద్రౌపది ముర్ము పేరు కూడా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని సైతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రకటించే అవకాశం ఉందనే ఓ వార్త  మంగళవారం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. అయితే చివరినిమిషంలో మోదీ అండ్ కో.. ద్రౌపది ముర్ముని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడానికి గల రిజన్.. రిజనింగ్ ఏమిటీ..  ఇంతకీ ఆమె ఎవరు ?.. ఆమె స్వస్థలం ఎక్కడ?... ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? తదితర విషయాలు తెలుసుకొనేందుకు నెటిజన్లు.. గుగూల్‌లో తెగ సెర్చి వెతికేస్తున్నారు.   ఆ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గురించిన వివరాలు  క్లుప్తంగా.. భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒడిశా ఒకటి. అలాంటి రాష్ట్రంలో మరింత వెనకబడిన జిల్లాల్లో మయూర్ భంజ్ ఒకటి. ఆ జిల్లాలోని బైడపోసి గ్రామంలో 1958, జూన్ 20 ద్రౌపది ముర్ము ఓ పేద కుటుంబంలో జన్మించారు. గిరిజనుల్లోని సంథాల్ తెగకు చెందిన ఆమె పేదరికపు అడ్డంకులను వరుసగా అధిగమిస్తూ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రమాదేవి డిగ్రీ కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసి.. సాగునీరు,  విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యాకేంద్రంలో ఉపాధ్యాయులురాలిగా   ఆమె స్వచ్ఛందంగా పని చేశారు.  అనంతరం 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత అంటే 2000లో రాయ్‌రంగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాదు.. నాడు అంటే 2000 - 2004 మధ్య నాటి బిజూ జనతాదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా, మత్స్య, వాణిజ్య శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2004లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో ఒడిశాలో ఉత్తమ పని తీరు కనబరిచిన ఎమ్మెల్యేలకు ఇచ్చే నీలకంఠ అవార్డును ఆమె 2007లో అందుకున్నారు.   ఈ ద్రౌపది పని తీరును గమనించిన కమలదళం ఆమెకు బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్ష, ఉపాధ్యక్షరాలిగా కీలక బాధ్యతలు అప్పగించింది. అలాగే 2010, 2013లో మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. అనంతరం బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆమెను కమలం పార్టీ నియమించింది. 2015, మే 18న ద్రౌపది జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపతి ముర్ము చరిత్ర సృష్టించారు.  మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఎన్డీఏ కూటమికి అత్యధిక బలం ఉంది. అలాగే మోదీ ప్రభుత్వానికి పలు రాష్ట్రాల్లోని బీజేపీ యేతర ప్రభుత్వాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక నల్లేరు మీద నడకే అని రాజకీయ మేధావులు సైతం స్పష్టం చేస్తున్నారు. అయితే ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే.. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా ఆమె ఖ్యాతి గాంచనున్నారు. అయితే ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించిన వారే కావడం గమనార్హం.    ఇంకోవైపు ద్రౌపది ముర్ము.. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను   చవిచూశారని. ఆమె బంధువులు పేర్కొంటున్నారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. అయితే ద్రౌపది భర్తతోపాటు ఇద్దరు కుమారులు గతంలోనే మరణించారని వారు చెబుతారు. భర్త, ఇద్దరు కుమారులు మరణించడంతో.. ద్రౌపది తన కుమార్తె ఇతిశ్రీనే సర్వస్వం అయిందని..  ఇతిశ్రీకి వివాహం అయి.. ఆమెకు ఓ పాప కూడా ఉందని వారు పేర్కొంటారు.   ఇటీవలే ద్రౌపది ముర్ము.. తన 64వ పుట్టిన రోజును జరుపుకున్నారు. పుట్టిన రోజు జరుపుకున్న మరునాడే.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం పట్ల ద్రౌపది ముర్ము... సంతోషం వ్యక్తం చేశారు.