మార్కులు కాదు.. తెలివి ముఖ్యం!

పుట్టుక‌తో వ‌చ్చే మేధాశ‌క్తి, తెలివితేట‌ల అభివృద్ధే  విద్య ల‌క్ష్య‌మ‌ని మార్టిన్ లూధ‌ర్ కింగ్ జూనియ‌ర్ అన్నారు. వంద‌కి వంద మార్కులు వ‌స్తేనే గొప్ప తెలివిగ‌ల‌వాడు అనుకోరాదు. క్లాసులో నేర్చుకుంటున్న విద్య‌కు స‌మ‌య‌స్పూర్తి జోడించి స‌మాజంలో వ్య‌వ‌హ‌రించేవారు విజేత‌లు అవుతార‌ని అంటూంటారు. చ‌దువునేర్వ‌డం అంటే కేవ‌లం పీజీలు, డాక్ట‌రేట్లు సంపాదించ‌డం కాద‌ని వారి వాద‌న‌.  స్కూల్లో చ‌దువుకునే రోజుల్లో అంత బాగా చ‌ద‌వులో రాణించ‌కున్నా, ఆ త‌ర్వాత చ‌దువు ప‌ట్ల ఆస‌క్తి పెరిగి విద్యలో రాణించి జీవితంలో గొప్ప స్థాయిలో నిల‌వ‌డం హ‌ర్ష‌ణీయ‌మే. అయితే  విద్యార్ధి ద‌శ‌లో అద్భుతంగా  రాణించ‌లేక‌పోయినా ఉన్న‌త వుద్యోగాలు చేసిన‌వారు, చేస్తున్న‌వారూ వున్నారు. అదుగో అలాంటి  వారు గుజ‌రాత్ ఐఏఎస్ అధికారి. ఆయ‌న టెన్త్ మార్కుల లిస్ట్ చూస్తే ఈ మ‌హానుభావుడు ఐ ఎ ఎస్ అధికారి ఎలా అయ్యాడా అని అనుమానించ‌కపోరు.  ఇక్క‌డే కింగ్ జూనియ‌ర్ మాట గురించి ఆలోచించాలి. పాఠ‌శాల చ‌దువులో వెన‌క‌బ‌డ్డ మాత్రాన తెలివి త‌క్కువ వాడు, ఎందుకు ప‌నికిరానివాడు అవుతాడ‌నుకోవ‌డం పెద్ద పొర‌పాటు. కానీ చ‌దువుకునే వ‌య‌సు లో త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు మార్కుల కోస‌మే బ‌డి, ట్యూష‌న్ల‌కు క‌ట్టిప‌డేయ‌డం ప‌రిపాటిగా మారింది. మ‌రీ ఈ రోజుల్లో అస‌లు పిల్ల‌ల‌కు చ‌దువుకోవ‌డం త‌ప్ప వేరే వ్యాప‌కం లేకుండా పోయింది. ఇది ఎంత‌వ‌ర‌కూ ఆరోగ్య‌క‌రం అనేది వేరే విష‌యం. కానీ వంద‌కి వందా వ‌చ్చి తీరాల్సిందే అని నిబంధ‌న‌తో బ‌ల‌వంత‌పు చ‌దువులు చ‌దివించ‌డంలోనే పెద్ద‌లంతా పిల్ల‌ల మీద మాన‌సిక వొత్తిడి తెస్తున్నారు. అస‌లు అంతగా పెద్ద‌లు ఓవ‌రాక్ష‌న్ చేయ‌న‌వ‌స‌రం లేద‌ని, స‌హ‌జ‌తెలివి వుంటే చాల‌ని అవినీష్ శ‌ర‌ణ్ రుజువు చేసారు. ఈ గుజ‌రాత్ ఐఎఎస్ అధికారి  గుజ‌రాత్ బారూచి కి చెందిన మ‌రో ఐఎఎఎస్ అధికారి తెషార్ సుమేరా  మార్కుల లిస్ట్  ట్విట‌ర్‌లో  షేర్  చేసేడు. దాన్ని చూస్తే ఖంగారు ప‌డ‌తారు. ఇంగ్లీషులో  వంద‌కి  35, గ‌ణితం  36, సైన్స్‌లో 38  వ‌చ్చా యి!  అస‌లు 90 శాతం త‌క్కువ మార్కులు వ‌స్తేనే ఆ విద్యార్ధి ఎందుకు ప‌నికి రాడ‌న్న నిర్ణ‌యానికి రావ‌డం, అదే ప్ర‌చారం చేయ‌డం కంటే దారుణం మ‌రోటి వుండ‌దు.  తుషార్ భ‌విష్య‌త్తులో ఏ వుద్యోగానికీ, ప‌నికీ ప‌నికి రాడ‌ని అత‌ని గ్రామ‌స్తులే కాదు స్వ‌యంగా స్కూలు వాళ్లే చెప్ప‌డం విడ్డూరం. చిత్రంగా అత‌ను ఐఎఎస్ చ‌దివి పెద్ద అధికారిగా వారికి ద‌ర్శ‌న‌మిచ్చాడు!  అన్న‌ట్టు ఈ ట్విట‌ర్ పోస్టును 17 వేల‌మంది చూసి ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. తుషార్ ఆ విధంగా జీవితంలో గొప్ప విజ‌యాన్ని సాధించ‌డం చాలామంది గుజ‌రాతీ విద్యార్ధుల‌కు గొప్ప స్పూర్తిగా నిలిచింది. మ‌రం చేత‌, గ‌ణితంలోనో, సైన్స్‌లోనో పోనీ ఇంగ్లీషులోనో అనుకున్న‌దాని కంటే బాగా త‌క్కువ మార్కులు వ‌చ్చినంత మాత్రాన పిల్ల‌లు చ‌దువులో బాగా వెన‌క‌బ‌డిపోయార‌న్న అభిప్రాయానికి త‌ల్లిదండ్రులు రాకూడ‌దు.

ఏకగ్రీవం దిశగా రాష్టపతి ఎన్నిక .. సామ్నాసంకేతం ?

రాష్ట్ర పతి ఎన్నికను ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా తీసుకోవడం లేదా? అందుకే, ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నాయా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అది కూడా, ఇంకెవరి నుంచో కాదు, ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్రను పోషిస్తున్న, బీజేపీ మాజీ మిత్ర పక్షం, మహారాష్ట్ర అధికార కూటమికి నేతృత్వం వహిస్తోన్న శివసేన పార్టీ, ఈ సందేహాన్ని వ్యక్త పరిచింది.  సందేహాన్ని వ్యక్త  పరచడమే కాదు, ఇలా అయితే ఎలా? రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్ట లేకపోతే.. వచ్చే ఎన్నికల్లో సమర్థుడైన ప్రధానమంత్రి అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని హెచ్చరించింది. శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్‌ పేజీలో ప్రచిరించిన వ్యాసంలో ప్రతిపక్షాల ఐక్యత పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించ  వలసిన అవసరం ఉందని, పేర్కొంది.  అంతే కాదు, కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావనకు వచ్చినా, ఆయన నో’ అన్న నేపధ్యంలో మమతా బెనర్జీ మహాత్మాగాంధీ మనవడు,  పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఫరుక్‌ అబ్దుల్లా పేర్లను ప్రతిపాదించారు. అయితే ఈ పేర్ల  విషయంలో శివసేన పెదవి విరించింది. బీజేపీ అభ్యర్ధికి ఆ ఇద్దరిలో ఎవరూ గట్టి పోటీ ఇవ్వలేరని, కేవలం పోటీ చేశామంటే చేశామనేందుకు  మాత్రమే పనికొస్తారని  ‘సామ్నా’ సంపాదకీయ వ్యాసంలో పేర్కొంది. బీజేపేని దీటుగా ఎదుర్కొని గట్టిపోటీ ఇచ్చేందుకు బలమైన అభ్యర్థి అవసరం అంటూ ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక  విషయంలో ప్రతిపక్షాల తీరును పరోక్షంగానే అయినా గట్టిగా  ఎండగట్టింది. అదేవిధంగా ఎన్డీయే అభ్యర్థిగా సమర్థుడైన వ్యక్తిని నిలబెట్టే అవకాశం ఉండకపోవచ్చని,  ప్రస్తుత రాష్ట్రపతి రాంమ్ నాథ్ కొవింద్ ఎంపిక సమయంలోనూ బీజేపీ ముందు ఇద్దరు ముగ్గురు  పేర్లను చర్చకు తెచ్చి చివరకు కొవింద్’ను ఏంక చేసిందని సామ్నా వ్యాసం పేర్కొంది. ఇప్పుడు కూడా, ప్రస్తుతం వినిపిస్తున్న వారు కాకుండా ఇంకొకరని తెర మీదకు తెచ్చే అవకాసం ఉందని సామ్నా అభిప్రాయపడింది. అంటే, ప్రతిపక్షాలు బలమైన అభ్యర్ధిని నిలిపితే గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని తద్వారా బీజేపీ  దూకుడుకు కళ్ళెం వేయవచ్చనే అభిప్రాయం సామ్నా వ్యక్తపరిచింది. అయిత, ఎవరా  బలమైన అభ్యర్ధి, అనే  ప్రశ్నకు సామ్నా సమాధానం ఇవ్వలేదు.  రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నిరాకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రశ్నకు ఇప్పడు కాదు, ఆరు నెలల క్రితమే సమాధానాలు కనుగొని ఉండవలసింది అని నిష్టూరమడింది. అంతే కాకుండా, ఇంకొక  అడుగు ముందుకేసి, దీంతో ప్రతిపక్ష పార్టీల  చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని  మరో రాయి విసిరింది.  అయితే మరో రెండు రోజుల్లో, జూన్ 20,21 తేదీలలో  శరద్ పవార్ నాయకత్వంలో ముంబై ప్రతిపక్ష పార్టీల సమావేశం జరగనున్న సమయంలో శివసేన,  ఈ బాంబు ఎందుకు పేల్చింది? అదికూడా, శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాష్ట పతి ఎన్నిక ఏకగ్రీవం విషయంగా చర్చలు జరిపిన రోజునే సామ్నా సంపాదకీయ వ్యాసంలో  ప్రతిపక్షాల ఐక్యత పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాసం రావడం అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది.  కాగా, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు, ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి  రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ  నేపధ్యంలోనే రాజ్ నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో   గురువారం ఫోను ద్వారా  చర్చలు జరిపారు.  సో.. సామ్నా వ్యాసం రాష్ట్రపతి ఎన్నిక  ఏకగ్రీవానికి సంకేతామా? అంటే, అయినా కావచ్చని, నిజానికి కాంగ్రెస్, ఎన్సీపీ సహా చాలా వరకు పార్టీలు పోటీ కంటే ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్నాయని అంటున్నారు.

జగన్ మెడకు హోదా ఉచ్చు .. రాష్ట్రపతి ఎన్నిక తెచ్చిన తంటా!

అవును కావచ్చును, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ /కూటమికి మద్దతు ఇవ్వాలి .. ఎవరికి ఓటు వేయాలి... అనేది ఆయా పార్టీల ఇష్టం కావచ్చును ,కానీ,రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పార్టీలు, ప్రజా ప్రతినిధులు ప్రజల ఆశలు, ఆకాంక్షలు,  మనోభావాలను గుర్తించి, గౌరవించి అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా పార్టీలు నిర్ణయం తీసుకుంటే అది ప్రజల తీర్పును వమ్ము చేయడమే అవుతుంది.   ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే, ఐదు కోట్ల తెలుగు ప్రజలను ఎవరిని, అడిగినా, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఒకటే మాట చెపుతారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎపీ ప్రజాప్రతినిధులు బీజేపీ/ఎన్డీఎ కూటమికి హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామనే షరతు విధించాలని అంటారు. మరి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ఈ డిమాండ్ ను రాష్ట్రపతి ఎన్నికలలో పోటీచేసే పార్టీలు, అభ్యర్ధుల ముందు ఉంచగలుగుతుందా? ముఖ్యంగా, గెలుపు అంచున నిలిచి, వైసీపీ ఓట్లపై అసలు పెట్టుకున్న బీజేపీని వైసీపే  డిమాండ్ చేస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. బీజేపీ/ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్ధి నెగ్గాలి అంటే వైసీపీ ఓట్లు తప్పని సరి.  ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే బలం ఉన్న వైసీపీ ఓటు వేస్తుందా..? అలాంటప్పుడు తమ మద్దతు ప్రకటించాలి అంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ జగన్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా లోకేష్, గతంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,  కేద్రంలో బీజేపీకి పూర్తి బలం ఉంది. ఇలాంటి సమయంలో వేడుకోవడం తప్ప డిమాండ్ చేయలేం అని అన్నారు, కానీ ఇప్పుడు  బీజేపీకి వైసీపీ అవసరం వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు ఓటములకు  వైసీపీ ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే ఈ డిమాండ్ ను వైసీపీ వినియోగించుకోవాలని లోకేష్  డిమాండ్ చేశారు.అలాగే రాజకీయ విశ్లేషకులు సైతం, ప్రత్యేక హోదా సాదించేందుకు రాష్ట్రపతి ఎన్నిక వైసీపీకి సువర్ణ అవకాశం కల్పించిందని అభిప్రాయపడుతున్నారు. అయితే, వైసీపీ ఈ సువర్ణ  అవకాశాన్ని ఎంత వరకు ఉపయోగించు కుంటుంది, అనేదే, ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న. ఈ నేపధ్యంలోనే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్టర్ వేదికగా, ముఖ్యమంత్రి జగన రెడ్డికి సవాలు విసిరారు. ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని వైసీపీ రాజస్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి  ట్వీట్ చేశారని లోకేష్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తారనే ప్రజలు వైసీపీకి 22 మంది ఎంపీలను ఇచ్చారన్నారు. ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడింది నిజమైతే.. ఆ పని చేయండి అంటూ ట్వీట్’ లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి? అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు గతంలో జగన్ మాట్లాడిన మాటల వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు.ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారు అంటూ ట్వీట్ చేశారు.కాగా, రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15వ తేదీన జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభం అయ్యింది. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంది. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉండనుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కించనున్నారు.

సికిందరాబాద్ విధ్వంసం స్క్రీన్ ప్లే డైరెక్షన్ పీకే.. యాక్షన్ టీఆర్ఎస్!

రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న పలుకుబడిని, తగ్గుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ లో ఆందోళన మొదలైందా? తిరిగి పరపతి పెంచుకోవడానికి, బలోపేతం అవుతున్న బీజేపీ ప్రజాదరణను తగ్గించేందుకు ఎం చేయడానికైనా సిద్ధ పడ్డారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సూచనలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తున్నది. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన విధ్వంస కాండ వెనుక ఉన్నది అధికార పార్టీ టీఆర్ఎస్ అని వారు చెబుతున్నారు. ఇందుకు   కారణాలను సైతం వివరిస్తున్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సికిందరాబాద్ లో ఆర్మీ రిక్రూటీ ఆశావహులు శుక్రవారం చేపట్టిన ఆందోళనను టీఆర్ఎస్ అంది వచ్చిన అవకాశంగా తీసుకుని విధ్వంసకాండకు తెగబడిందని అంటున్నారు.  ఆర్మీ రిక్రూట్ మెంట్ లో ‘అగ్నిపథ్’ పథకాన్ని అమలు చేయాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం సికిందరాబాద్ లో జరిగిన విధ్వంస కాండ వెనుక అధికార పార్టీ టీఆర్ఎస్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళన కారులు పరిమిత సంఖ్యలోనే సికిందరాబాద్ స్టేషన్ కు వచ్చారనీ, నినాదాలు చేసి రైళ్లను కొద్ది సేపు నిలువరించడమే లక్ష్యంగా వారు అక్కడికి వచ్చినా, టీఆర్ఎస్ శ్రేణుల వల్లే ఆ ఆందోళన హింసాత్మక రూపం దాల్చిందనీ ఆరోపణలు వినవస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో ఇవే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ‘అగ్నిపథ్’ ఆందోళనలను టీఆర్ఎస్ రాష్ట్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందకు వినియోగించుకునే ఎత్తుగడతోనే ఈ అల్లర్లకు పాల్పడింది. ఇందుకు టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే సలహాయే కారణమని తెలుస్తోంది.  ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకం అమలుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అవరోధం ఏర్పడేలా హింసాత్మక రూపు దాల్చాలన్నది పీకే సలహాను అనుసరించి టీఆర్ఎస్ అమలు చేసిన వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. తొలుత ఆర్మీ రిక్రూటీ ఆశావహులు ఓ 300 మంది వరకూ సికిందరాబాద్ స్టేషన్ కు చేరుకున్నారనీ, వారి వద్ద ప్లకార్డులు వినా మరెటువంటి సామగ్రి లేదనీ చెబుతున్నారు. అయితే క్షణాల్లోనే ఆందోళన కారుల సంఖ్య వేలలోకి పెరిగిపోవడం.. ఆ వచ్చిన వారి చేతుల్లో పెట్రోల్ టిన్నులు, కర్రలు, రాడ్లు వంటి ఆయుధాలు ఉండటాన్ని ఈ సందర్భంగా వారు ఎత్తి చూపుతున్నారు.  ఇక్కడే పరిశీలకలు ఇంత జరుగుతుంటే పెట్రోల్, కర్రలు, రాడ్లు వంటి ఆయుధాలతో జనం పెద్ద సంఖ్యలో సకిందరాబాద్ స్టేషన్ కు వస్తుంటే పోలీసులు, నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.  ఇంత జరిగినా, రైల్వే ఆస్తుల విధ్వంసం జరిగినా హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు కానీ వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కేవలం బీజేపీపైనా, మోడీ ప్రభుత్వంపైనా విమర్శలకే పరిమితమయ్యారు. పైగా ఈ విధ్వంస కాండను సమర్ధించే విధంగా దేశంలో యువత ఆగ్రహానికి ఈ విధ్వంస కాండ ప్రతీక అంటూ అభివర్ణిస్తున్నారు. వీటన్నిటినీ గమనిస్తే పరిశీలకులు చెబుతున్నట్లుగా ఈ అల్లర్ల వెనుక, హింసాకాండ వెనుక టీఆర్ఎస్ ఉన్నదా అన్న అనుమానాలు  సామాన్యులలో కూడా కలుగుతున్నాయి.  అందుకే ఈ సంఘటన అనంతరం  రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనీ, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యతను విస్మరించి రాజకీయ విమర్శలతో పబ్బం గడుపుకుంటోదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సికిందరాబాద్ హింసాకాండ వెనుక అధికార పార్టీ హస్తం ఉందన్న నివేదిక కేంద్రానికి అందిందనీ, ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందనీ చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయంపై స్వయంగా ఆరా తీస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.   

ఒకడే ఒక్కడు మెనగాడు... దేశం మెచ్చిన నాయకుడు

రాజ‌కీయ చ‌రిత్ర‌లో చాలామంది నాయ‌కుల‌ను గురించి తెలుసుకుని వుంటాం, కొంద‌రిని చూసి వుంటాం. మ‌రి కొంద‌రి గురించి చ‌దివి వుంటాం. ఇంకొందరి గురించి విని ఉంటాం. నాయ‌క‌త్వ ప‌టిమ కేవ‌లం పార్టీ వ‌ర్గీయులు, అనుచ‌రుల బాగోగులు మాత్రమే చూసుకునే వారు కాదు. నాయ‌కుడు అంటే త‌న చుట్టూ వున్న‌వారిని స‌మానంగా చూడ‌గ‌ల‌గాలి. అంద‌రికీ  చేయ‌గ‌లిగేవాడే నాయకుడు. కేవ‌లం రాజ‌కీయ స‌మ‌స్య‌లే కాకుండా సామాజిక స‌మ‌స్య‌లు, వూహించ‌ని ప్ర‌కృతి బీభ‌త్స స‌మ‌యాల్లోనూ ఎంతో స‌మ‌య‌ స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి అధిక స్థాయిలో న‌ష్టాలు జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌ల్ని ప్ర‌భుత్వ ఆస్తుల‌నూ కాపాడ‌గ‌లిగే చ‌తుర‌త‌, తెలివి తేట‌లు, ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించ‌గ‌లిగిన‌వాడే నిజ‌మైన నాయ‌కుడు అనిపించుకుంటాడు. ఇటీవ‌లి కాలంలో అంత‌టి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టిడిపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మాత్ర‌మే అని జనం అంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రజలు కష్టాల్లో ఉంటే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సహాయం చేయడానికి రంగంలోకి దిగిపోతారు.. పార్టీ శ్రేణులనూ సమాయత్తం చేస్తారు. అలాంటి అస‌లు సిస‌లు నాయ‌క‌త్వ  ప‌టిమ ఆయ‌న‌లోనే చూడ‌గ‌ల్గుతు న్నాం.  ప్ర‌జ‌లు ఎప్పుడు   స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నా ముందుగా స్పందించే నేత‌గా చంద్ర‌బాబుని  నిలబడటం చాలా కాలం నుంచీ గ‌మ‌నిస్తూనే వున్నాం.  చీపురుప‌ల్లి మండ‌లం పుర్రేయ‌వ‌ల‌స జంక్ష‌న్‌లో శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌రిగ్గా ఆ స‌మ‌యంలో చీపురుప‌ల్లిలో  రోడ్డు షో ముగించుకుని అటువేపు వ‌స్తూ ఆయ‌న వాహ‌నం దిగి క్ష‌త‌గాత్రుల‌ను  త‌న కాన్వా య్ లోని ఆంబులెన్స్‌లోనే విజ‌య‌న‌గ‌రం త‌ర‌లించారు. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు తీవ్ర‌గాయాలై రోడ్డ‌మీద ప‌డిపోయారు. అది చూసిన‌వారు వెంట‌నే 108 వాహ‌నానికి స‌మాచారం అంద‌జేశారు. కానీ వాహ‌నం రావ‌డం అల‌స్య‌మ‌యింది. ఇంత‌లో ఆ దారిగుండా విశాఖ విమానాశ్ర‌మానికి వెళుతూన్న చంద్ర‌బాబు వారికి వెంట‌నే స‌హాయం చేసి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. 

జస్ట్ లేటయ్యింది..అర్ధ శతాబ్దం తరువాత అందిన పుస్తకం

పుస్త‌కాలు చ‌దివే అలవాటున్నవాళ్లు వాళ్లకు నచ్చిన పుస్తకాన్ని   లైబ్ర‌రీ నుంచి ఇంటికి తీసుకువెళ్లి చదివి వెంట‌నే తిరిగి ఇచ్చేస్తుంటారు.  మహా అయితే అప్పుడప్పుడు ఒక‌టి రెండురోజులు ఆల‌స్యం జ‌ర‌గ‌వ‌చ్చు. వేరే ప‌నిలో ప‌డి మ‌ర్చిపోయాన‌ని స‌ద‌రు పాఠ‌కుడు ఆన‌క చెప్ప వ‌చ్చు. కానీ కెన‌డా వాంకోవ‌ర్ లైబ్ర‌రీ విష‌యంలో గొప్ప వింతే జ‌రిగింది. ఒక పుస్త‌కం ఏకంగా 51 ఏళ్ల త‌ర్వాత తిరిగి వ‌చ్చింది, అదీ సారీ మ‌రోలా అనుకోవ‌ద్ద‌న్న చిన్న లెట‌ర్‌తో పాటు!  మ‌న వూళ్ల‌లా కాదు అక్క‌డ పుస్త‌కం ఇవ్వ‌డంలో ఆల‌స్యం చేస్తే  పుస్త‌కం అద్ద‌తో పాటు అద‌నపు ఛార్జీలు వ‌సూలు చేస్తారు. కానీ ఈ మ‌హాశ‌యుడు ఎవ‌రోగానీ, ఆ అద‌న‌పు ఛార్జీల‌ను త‌ప్పించుకోవ‌డానికి లైబ్ర‌రీ వారికి  ఒక వుత్త‌రం పెట్టా డు. ఇన్నాళ్ల జాప్యం వూహించ‌నిద‌ని, త‌న‌ను క్ష‌మించ‌మ‌ని ఆ లేఖ సారాంశం! చిత్రంగా వుంది గ‌దూ! ఈ వుత్త‌రం చ‌దివిన త‌ర్వాత ఆ లైబ్ర‌రీ వారు హాయిగా న‌వ్వుకున్నారు. పోయిందేమో అనుకున్న పుస్త‌కం చ‌క్క‌గా తిరిగి వ‌చ్చినందుకు! ఇక  ఆ పాఠ‌కుడు మంచి మ‌న‌సుతో త‌న త‌ప్పు తెలుసుకుని మ‌రీ క్ష‌మించాల‌ని కోర‌డంతో అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు మాట వ‌దిలేసేరు! వాంకోవ‌ర్ లైబ్ర‌రీ వారు త‌మ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో ఒక బొమ్మ‌ను పెట్టారు. 51 ఏళ్ల త‌ర్వాత లైబ్ర‌రీకి  ఎంతో భ‌ద్రం గా తిరిగి వ‌చ్చిన పుస్త‌కం అని! హెన్రీ ఎడ్వ‌ర్డ్ నీల్ అనే ఆయ‌న రాసిన  ది టెలిస్కోప్ అనే పుస్త‌కం అది.  పుస్త‌కం మీద చివ‌రిగా చ‌దువ‌రికి ఇచ్చిన తేదీ 1971 ఏప్రిల్ 20 అని స్టాంప్ కూడా వేసి వుంది.  బొమ్మ‌లో స్టాంప్ పైన 5 సెంట్‌లు చెల్లించ‌వ‌ల‌సి వుంది అని పేర్కొన్నారు. కానీ ఈ అద‌న‌పు ఛార్జీలు లైబ్ర‌రీ తొల‌గించేసి చాలా కాల‌మ‌యింది కూడా!  ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ పుస్త‌కం బొమ్మ‌ను చూసిన నెటిజ‌న్లు ఎంతో ఆశ్చ‌ర్య‌పోతూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటో ద్వారా త‌మ‌కు అస‌లీ లైబ్ర‌రీ సౌత్ హిల్ లైబ్ర‌రీ 51 సంవ‌త్స‌రాల పాత‌ది అని తెలిసింద‌ని! నిజ‌మేనా? అనీ అడుగుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ జగన్ వాత

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ జగన్ చేత, జగన్ కొరకు, జగన్ యెక్క లాంటి వ్యవస్థ. ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్. అందుకే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలనగానే నిరుద్యోగులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఉన్నత చదువులు చదవీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసీ లక్షల్లో జీతాలొచ్చే అవకాశాలుండీ వాటన్నిటినీ వదులుకుని వేతనం తక్కువైనా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. ఉన్న ఊళ్లో ఉద్యోగం.. వేతనం తక్కువైనా ఫరవాలేదు.. కన్న తల్లిలాంటి ఊర్లోనే దర్జాగా ప్రభుత్వోద్యోగం చేస్తూ కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకునే భాగ్యం ఉంటుంది, ఇంకే కావాలి అనుకున్నారు. అయితే జగన్  వారి ఊహలను తల్లకిందులు చేసేశారు. వారి ఆశలను నీరు గార్చేశారు. ఉద్యోగాలలోకి తీసుకునేటప్పుడే వీరందరికీ పరీక్షలు నిర్వహించి పాస్ అయిన వాళ్లనే కొలువులోకి తీసుకున్నారు. రెండేళ్లలో అందరికీ ప్రొబేషన్ ఇచ్చి పర్మినెంట్ చేస్తామన్నహామీ కూడా ఇచ్చారు. అయితే రెండేళ్లు దాటిపోయాయి. యథా ప్రకారం జగన్ మాటతప్పారు. మడమ తిప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కోసం మళ్లీ పరీక్ష నిర్వహించారు. వారిలో సగం మందికి పైగా ఫెయిలయ్యారంటూ చెప్పారు. ప్రోబేషనరీ పరీక్షలో పాసైన వారికే ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని చెబుతున్నారు. ఏతా వాతా జగన్ చెప్పేదేమిటంటే లక్షా ఇరవై వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులలో సగం మందికి పైగా ఉద్యోగులకు ప్రోబేషన్ ఉండదు. ఉద్యోగం పర్మనెంట్ కాదు.  ఇప్ప‌టికే  మూడేళ్లుగా వారు తమ ఉద్యోగాలు ప‌ర్మనెంట్ అవుతాయని ఎదురు చూస్తున్నారు.  ఇప్పుడు ఎదురు చూపులే మిగులుతాయని జగన్ సర్కార్ తేల్చేసింది. పర్మనెంట్ అయిన వారికి కూడా పీఆర్సీ ప్రకారం జీతం ఖరారు చేసినా వారికి నెలకు దక్కే వేతనం 23 వేలకు మించదు.  ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సీఎం జగన్ ను నమ్మి పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యో గాలు కూడా వదులుకుని ప్రభుత్వ ఉద్యోగాలలో  నిర్భ‌యంగా వుండ‌వ‌చ్చ‌ని వచ్చి చేరారు. చివరికి వారు తమ కెరీర్‌లను పోగొట్టుకోవడమే  కాదు.. ఇప్పుడు అరకొర జీతాలకు..  భద్రత లేని కొలువులలో కొనసాగుతున్నపరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అగ్నిపధ్ అనాలోచిత నిర్ణయమేనా?

ఉక్రెయిన్ ఎంత దేశం ? పిట్టంత దేశం... మరి రష్యా, చాలా పెద్ద దేశం. ఏనుగంత దేశం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, రష్యా భూవిస్తీర్ణంతో పోలిస్తే ఉక్రెయిన్ కేవం 30 వంతు (మూడవ వంతు) భూభాగం ఉన్న చిన్న దేశం. ఒక్క విస్తీర్ణం పరంగానే కాదు, జనాభా, సైనిక, ఆర్థిక శక్తి సామర్ధ్యాలు ఇలా ఎలా చూసినా ఈ రెండు దేశాల మధ్య పొంతన పోలిక కుదరదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం  ప్రయోగించడంతో సమానం.అయినా, కొంత నష్ట పోయినా, అంతటి శక్తివంతమైన రష్యా నాలుగు నెలలుగా తమ దేశం పై సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఉక్రెయిన్ నిరోధిస్తోంది.నిలువరిస్తోంది. సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. ఇది ఎలా సాధ్యం? రష్యా సైనిక దాడులను ఉక్రెయిన్ ఎలా నిరోధించ గలుగుతోంది?  పిచ్చుక  బ్రహ్మాస్త్రాని ఎలా తిప్పి కొడుతోంది? కళ్ళ ముందు కనిప్సిస్తున్న ఈ ప్రత్యక్ష ఉదాహరణను గమనిస్తే, ఆధునిక యుద్ద తంత్రం,  యుద్ద సామర్ధ్యం నిర్వచనం మరిపోయిందనే వాస్తవం ఎవరికైనా, ఇట్టే అర్ధ మవుతుంది. ఆధునిక ఆయుధ సంపద లేని సైన్యం, నాడా లేని గుర్రం లాగా ఎందుకూ పని రాదని ఒక ఉక్రెయిన్, ఒక  వియత్నాం ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే సాయుధ బలగాల్లో నియామకాల కోసం, భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపధ్’, ‘అగ్ని వీర్’ పథకాన్ని చూడాలని నిపుణులు అంటున్నారు. అందుకే, ఈ పథకాన్నివ్యతిరేకిస్తున్న శక్తులు రాజకీయ అంధత్వంతో పథకాన్ని వ్యతిరేకిస్తున్నాయనే  నిపుణులు విశ్లేశిస్తునారు.   నిజం, ఆధునిక యుద్ద తంత్రంలో సంఖ్యా బలం కాదు, సాంకేతిక బుద్ది  బలాలే కీలకం అనేది ప్రపంచ దేశాలు అన్నీ గుర్తిస్తున్నాయి. కేవలం నాలుగు కోట్ల జనభా ఉన్నా చిన్న దేశమే (ఇంచుమించుగా ఒక్క తెలంగాణ జనాభాకు సమానం) అయినా ఉక్రెయిన్,  డ్రోన్’లు ఇతర అత్యాధునిక సాంకేతిక ఆయుధాలాను సమకూర్చుకుంది, ఆధునిక యుద్ద తంత్రంతో ముందుకు సాగుతోంది. అందుకే రష్యా అంతటి  దేశం సాగిస్తున్న వైమానిక దాడుల నుంచి తమ  దేశాన్ని రక్షించుకోగలుగుతోంది.  ఒక్క ఉక్రెయిన్ అనే కాదు, అమెరికా, చైనాల సైనిక శక్తి సామర్ధ్యాలను బేరీజు వేసుకున్నా  మనకు ఇదే వ్యత్యాసం కనిపిస్తుంది. అమెరికా సైన్యంతో పోలిస్తే చైనా సైన్యం చాలా పెద్దది. అయినా, అమెరికా సైనిక పాటవం ముందు చైనా దిగ తుడుపే. కారణం,ఆధినిక ఆయుధ సంపదలో అమెరికా ముందుంది, చైనా వెనక పడింది. నిజానికి అమెరికా అగ్రరాజ్య హోదాను నిలబెడుతోంది ఆ దేశ ఆర్థిక పుష్టి కాదు, ఆయుధ సామర్ధ్యమే. ఇక మన దేశం (భారత దేశం) విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం రక్షణ రంగానికి మన దేశం రూ.5,25,166 కోట్లు ఖర్చు చేస్తోంది. అందులో రెవెన్యూ వ్యయం అంటే జీత భత్యాలు, మెయిన్టెనెన్స్ కోసం  రూ. 2,33,000 కోట్లు ఖర్చవుతున్నాయి, అంటే, మొత్తం బడ్జెట్ లో 44 శాతం. ఇక ఆధునిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో పాటుగా, శిక్షణ, పరిశోధనలు   మొత్తం రూ.2,30,670 కోట్లు. ఈ రోజుల్లో యుధ్ధం అంటే సాంకేతికత, ఆయుధాలు ఉపయోగించడంలో నైపుణ్యం తప్ప ఎన్ని లక్షల మంది సైన్యం  ఉన్నారనేది కాదు. మరి సరికొత్త సాంకేతికత, ఆయుధాలు సమకూర్చుకోవాలంటే మిగిలిన ఖర్చు తగ్గించుకోవడం మినహా మరో మార్గం లేదు.  ఒకప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే అంటోనీ ఫ్రాన్స్ నుంఛి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సొమ్ములు లేవని బహిరంగంగా పేర్కొన్నారు. నిధులు లేకనే ఒప్పందం ముందుకు సాగలేదని అంగీకరించారు.  కానీ, 2014లో ప్రభుత్వం మారిన తర్వాత 36 రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయడమే కాదు, 36 కు 36 యుద్ద విమానాలు మన దేశానికి చేరుకున్నాయి. చైనా సరుహద్దుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల రాక‌తో  ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు మ‌రింత సామార్థ్యం పెరిగింద‌ని భావిస్తున్నారు అధికారులు. నిజమే గత  రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా రిక్రూట్మెంట్ లేక సైన్యం చేరేందుకు లక్షలాది మంది యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిలో, సాయుధ బలగాల్లో నియామకాల కోసం, కొత్తగా ‘అగ్నిపధ్’  పథకాన్ని  ప్రకటించడం కొంత ఆందోళన కలిగించే అంశమే. సైన్యంలో చేరేందుకు సిద్దమైన యువకుల ఆందోళనను ఎవరైనా అర్థం చేసుకోవచ్చును. కానీ, పథకం మంచి చెడులను చూడకుండా, యువతను రెచ్చగొట్టి అరాచకాన్ని సృష్టిస్తున్న శక్తులు ఏమి ఆశించి యువతను పెడదారి పట్టిస్తున్నాయి, ఇదే ఇప్పడు అందరూ ఆలోచించవలసిన విషయంగా నిపుణులు భావిస్తున్నారు.

నా దండు క‌ప్ప‌ల దండు.. నాతో పెట్టుకోవ‌ద్దు!

ఇంట్లో పిల్ల‌ల‌తో పాటు కుక్క‌పిల్ల‌నో, పిల్లినో పెంచుకోవ‌డం చాలా మందికి అల‌వాటు. అదో స‌ర‌దా! వాటి సంర‌క్ష‌ణ‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా చేప‌డుతుంటారు. వాటిని ఇంట్లోని సొంత మనుషుల్లాగే, కుటుంబ సభ్యుల్లాగే ప్రేమగా చూసుకుంటుంటారు. పూర్వం గుర్రాలనూ, పులులనూ కూడా పెంచుకునే వారని విన్నాం. ఎవ‌ర‌యినా క‌ప్ప‌ల్ని పెంచేవారుంటారా? ఎన్నడైనా కనీ వినీ ఎరుగుదుమా? కానీ  ఇదుగో నేనున్నానంటూ ఒకాయన ఈమ‌ధ్యే టిక్ టాక్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. ఆ మ‌హానుభావుడు ఎవ‌రో గాని లోకంలో మ‌రేదీ దొర‌క‌న‌ట్టు ఏకంగా 1.4 మిలియ‌న్ల క‌ప్ప‌ల్ని అంటే ఓ పెద్ద క‌ప్ప‌ల దండును పెంచి పోషిస్తున్నాడు! అస‌లు క‌ప్ప‌ల  బెక బెకలు విన‌డమే క‌ష్టం. నీళ్ల‌లోంచి నేల మీద‌కి, నేల‌మీద నుంచి నీళ్ల‌లోకి అలా గెంతుతూ ఆడుతూ బెక బెక మంటూ మహా చికాకు క‌లిగిస్తుంటాయి. వాటిని చూస్తే  ఎప్పుడు మీద‌కు దూకుతాయోన‌ని  భయంతోనో, ఆసహ్యంతోనో ఒళ్లు జ‌ల‌ద‌రింపూ వుంటుంది. అలాంటిది ఆయ‌న ఏదో దేశానికి సైన్యం త‌యారు చేసుకున్న‌ట్టు,   ఫుట్ బాల్ జ‌ట్లకు శిక్షణ ఇస్తున్నట్లు క‌ప్ప‌ల్ని పెంచి పోషించడం నిజంగా విడ్డూర‌మే!  ఈ క‌ప్ప‌ల దండును త‌న తోట‌లో  పెంచుతున్న పెద్ద‌మ‌నిషి వాటి మీద ప్రేమ గురించి మాట్లాడుతూ, పెద్ద సంఖ్య‌లో క‌ప్ప గుడ్లు జాగ్ర‌త్త చేసి వాటి నుంచి తోక క‌ప్ప‌లు పుట్ట‌గానే, వాటిని ర‌క్షించి వాటి పెరుగుద‌ల‌ను ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తూ సంర‌క్షిస్తున్నాన‌న్నాడు. పిల్ల‌ల పెంప‌కంతో స‌మానంగా  దీని ప‌ట్ల ఆయ‌న‌కు ఎంత శ్ర‌ద్ధో! ముందు నీటి కుంటల్లోకి గుడ్లు వదిలి పిల్ల క‌ప్ప‌లుగా బ‌య‌టికి వ‌చ్చాక అవి పెరిగి పెద్ద పెద్ద క‌ప్ప‌లుగా రూపాంత‌రం చెంద‌డంలో వాటికి ఎంతో ర‌క్ష‌ణ క‌ల్పించాడ‌ట‌. ఇలా అవి ఐదు ప‌ది కాదు వంద‌ల సంఖ్య‌లో ఆయన ఇంటి పెర‌టి తోటనంతా త‌మ నివాసం చేసుకున్నాయి. ఇంత పెద్ద క‌ప్ప‌ల దండును త‌యారు చేయ డంలో ఎంతో ఆనందిస్తున్నాన‌ని వీడియో లో త‌న సంతోషాన్ని పంచుకుంటూ తన్మయత్వం చెందాడు. త‌మాషా ఏమంటే, ఇపుడు ఆయ‌న త‌న పెర‌టి తోట‌లో ప‌చ్చిక మీద న‌డ‌వ‌డానికి బొత్తిగా అవ‌కాశం లేద‌ట‌. అటు వెళ్లి అంత‌కుముందులా స‌ర‌దాగా తిరుగుదామంటే పాదాల కింద ప‌డి క‌ప్ప‌లు ఛ‌స్తాయేమోన‌ని భ‌యం ప‌ట్టుకుని అటు వెళ్ల‌డం మానుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేడ‌ట‌! చూశారా ఆ పెద్ద మ‌నిషి క‌ప్ప‌ల ప్రేమ. మ‌నం ఎంత ప్రేమ‌గా పెంచుకుంటున్న కుక్క‌పిల్లో‌, పిల్లి పిల్లో అడ్డు త‌గిలితే కాలితో త‌న్ని అవ‌త‌ల‌కు నెట్టేస్తుంటాం. కానీ ఆయ‌న అస‌లు వాటిని ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని అటు వేపు వెళ్ల‌డం బాగా త‌గ్గించేశాడ‌ట‌! అన్న‌ట్టు ఆయ‌న కప్పల దండును  చూడ్డానికి ఇపుడు వంద‌ల మంది క్యూ క‌డుతున్నార‌ని చెబుతున్నాడు.  ఆయన సామాజిక మాధ్యమంలో వదిలిన ఈ వీడియో ఇప్ప‌టికి 2.8 ల‌క్ష‌ల‌మంది  చూశారు‌. ట్విట‌ర్‌లో దాన్ని రామ్సే బోల్టిన్ అనే అత‌ను షేర్ చేశాడు. చాలా మంది ఈ క‌ప్ప‌ల దండు య‌జ‌మానిని క‌లిసి ఆయ‌న ఈ సైన్యం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోవాల‌నుకుంటున్నారు.  అయితే  ఆయ‌న కప్పల సైన్యాన్ని వ్య‌తిరేకిస్తూ ట్వీట్ చేసిన‌వారూ వున్నారు. ఈపెద్ద మ‌నిషి అన్ని వేల క‌ప్ప‌ల‌తో పెద్ద సైన్యాన్ని త‌యారు చేసిన  ఆనందంలో వున్నాడు గానీ, నిజానికి  ఈ  వ్య‌క్తి  కప్ప‌ల దండు వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తు క‌లిగేందుకు ఆస్కారం వుంద‌ంటున్నారు పలువురు పర్యావరణ వేత్తలు.  కాగా మ‌రొక‌తను   చిన్న‌పుడు తమ నివాసం స‌మీపంలోని చెరువులో అస్స‌లు క‌ప్ప‌లే లేక‌పోవ‌డం ప‌ట్ల విచారించాను, చెరువు అంతా క‌ప్ప‌ల బెక బెక‌తో నిండాల‌ని అనుకునేవాడిని. కానీ ఇన్ని వేల క‌ప్ప‌ల‌ను చూశాక అమ్మో నేను ఇలాంటి ప‌నులు చేయ‌లేదు న‌య‌మే! అని ట్వీట్ చేశాడు.  మొత్తానికి క‌ప్ప‌ల సైన్యంతో ఆ  మ‌నిషి ఎలా వేగుతున్నాడో!

నిఘా నిద్రపోతోందా?.. ప్రభుత్వం పడుకుందా? అసలేం జరుగుతోంది?

తెలంగాణ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆదర్శం అంటూ సొంత భుజాలు తడుముకుంటున్న ప్రభుత్వం రాజధాని నగరం హైదరాబాద్ లో పెచ్చరిల్లుతున్న విధ్వంసకాండకు ఏం సమాధానం చెబుతుంది. పబ్బులు, డ్రగ్గులు, అత్యాచారాలతో ఇప్పటికే రక్షణ లేని నగరంగా ముద్ర వేసుకున్న హైదరాబాద్ వరుసగా రెండు రోజుల పాటు వేర్వేరు నిరసన కార్యక్రమాలలో హింస ప్రజ్వరిల్లడాన్ని ఎలా సమర్ధించుకుంటుంది. గురువారం కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అయితే ఏకంగా పోలీసు కాలరు పట్టుకుని నిలదీశారు. బస్సును నిలిపివేసి దానిపైకి ఎక్కి మరీ నినాదాలు చేశారు. పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోనికి తీసుకున్నారు.   కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ జరపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.  ఓ ద్విచక్ర వాహనానికి రోడ్డుపైనే నిప్పుపెట్టి తగలబెట్టారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాక, బస్సుపైకి ఎక్కి నినాదాలు చేశారు.   రాజ్ భవన్ మార్గంలో పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వైపు ముందుకు కదిలారు. కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసినా పోలీసులు అప్రమత్తం కాలేదెందుకు? నిఘా నిద్రపోతున్నదా? పాలనపై ప్రభుత్వానికి పట్టు దప్పిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. రాజ్ భవన్ ముట్టడి అలా ఉద్రిక్తతలు సృష్టిస్తే శుక్రవారం సికిందరాబాద్ స్టేషన్ లో జరిగిన విధ్వంసంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా వేలాది మంది సికిందరాబాద్ రైల్వే స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్ బయట ఉన్న బస్సును దగ్ధం చేశారు. స్టేషన్ లో ప్లాట్ ఫాంపై ఉన్నరైళ్లకు నిప్పుపెట్టారు. పట్టాలపై ఒక బైక్ ను పడేసి దగ్ధం చేశారు. పార్సిళ్లను పట్టాలపై దగ్ధం చేశారు. ప్లాట్ ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారు. పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు. ఇంత విధ్వంసం అప్పటికప్పుడు హఠాత్తుగా వేలాది మంది వచ్చి చేశారని అనుకోవడానికి లేదు. ముందుగా మాట్లాడుకుని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకునే వచ్చి ఉంటారు. సరే వచ్చిన తరువాత ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది అది వేరే సంగతి. ఈ ఘటనలోనూ ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏమైంది, ఏం చేస్తోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.   ఇంత జరిగినా, వరుస సంఘటనలతో హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా.. సీఎం కేసీఆర్ కానీ, మంత్రులు కానీ వీటిని సీరియస్ గా తీసుకోవడం లేదు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు చేసి చేతులు దులిపేసుకున్నారు. సికిందరాబాద్ ఘటన అయితే యువతలో పెచ్చరిల్లిన అసహనానికి, మోడీ సర్కార్ పై వ్యతిరేకతకు నిదర్శనం అంటూ బీజేపీ టార్గెట్ గా రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారు. రాష్ట్రప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనీ, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ బాధ్యతను విస్మరించి రాజకీయ విమర్శలతో పబ్బం గడుపుకుంటోదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాన్న‌కు ప్రేమ‌తో..!

చేతిలో స్మార్ట్ ఫోన్ వుండాలే గాని సెల్పీలు తీసుకోవ‌డానికి ఎవ‌రూ వెనుకాడ‌రు. సెల్ఫీల పిచ్చి ఈ రోజుల్లో అంతు లేకుండా పోతోంది. అదో స‌ర‌దా, అదో ఆనందం! సెల్ఫీ గురించి అంద‌రికీ తెలిసిందే గ‌దా, ప్ర‌త్యేకించి ఎందుకు చెబుతున్నార‌ని అనుకోవ‌ద్దు. ఇది చాలా స్పెష‌ల్ సెల్ఫీ!   తండ్రీ కొడుకుల సెల్ఫీ. తండ్రి ఒక రైల్లో వెళుతూంటే, ప‌క్క‌నే మ‌రో ట్రాక్ మీద మ‌రో రైల్లో అత‌ని కొడుకు వెడుతూ ప‌ల‌క‌రించు కున్నారు. ఇద్ద‌రూ రైల్వే ఉద్యోగులే! ఇద్ద‌రూ తెల్ల‌ దుస్తుల్లోనే, యూనిఫామ్ లోనే వున్నారు. కాకుంటే వుద్యోగాలే వేరు వేరు. తండ్రి గార్డ్‌గా చేస్తున్నారు. కొడుకు  జూనియ‌ర్ టికెట్ ఎగ్జామినర్  అంటే  జూనియ‌ర్  టి.టి.ఇ!  చిత్రంగా ఇద్ద‌రూ ఎదురెదురు రైళ్ల‌లో ఒకరినొకరు చూసుకుని హ‌లో అనుకున్నారు. అయితే అప్ప‌టికి  రైళ్లు ఇంకా క‌ద‌ల‌లేదు. అదేదో స్టేష‌న్ లో బ‌య‌లుదేర‌డానికి సిద్ధంగా వున్నాయి. ఇద్ద‌రూ అనుకోకుండా వేరు వేరు ప్రాంతాల‌కు ఎదురెదురు మార్గాల్లో వెళుతోన్న రైళ్ల‌లో వుద్యోగ ధ‌ర్మంగా ప్ర‌యాణానికి సిద్ధ‌మయ్యారు. ఇలాంటి  సంఘ‌ట‌న‌లు చాలా అరుదుగా జ‌రుగుతూంటాయి. త‌న  కొడుకు త‌న‌లాగే రైల్వేలో వుద్యోగం చేన్నాడ‌ని ఆయ‌న త‌న స్నేహితుల‌కు, బంధువుల‌కు చెబుతూ ఎంతో మురిసిపోయి వుండవ‌చ్చు. కానీ ఈ సెల్పీ ఆయ‌న ఆనందాన్ని మూడింత‌లు చేసినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.  అంతే మ‌న కుర్ర  టిటిఇ వెంట‌నే ఫోన్ తీసి సెల్ఫీ తీసేడు! ఇపుడు అది వైర‌ల్ అయింది! ఈ సెల్పీని సురేష్ కుమార్ అనే వ్య‌క్తి  ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అయితే తండ్రీ కొడుకులు అలా వూహించని విధంగా ఎదుర‌యి ప‌ల‌క‌రించుకున్న‌ది స‌రిగ్గా ఎక్క‌డ అన్న‌ది, వారు వున్న రైళ్లు ఎటు వెళ్లేవీ   ట్వీట్లో  చెప్ప‌లేదు.  కానీ నెటిజ‌న్లు మాత్రం ఎంతో మెచ్చుకున్నారు. నిజంగా తండ్రి కొడుకుల ప్రేమ‌కు పెద్ద వుదాహ‌ర‌ణ అని మ‌న‌స్పూర్తిగా అభినంద‌న‌లు తెలిపారు. 

అగ్నిపథ్ పథకంపై కేంద్రం సమీక్ష

ఆర్మీ రిక్రూట్ మెంట్ లోకోసం ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై కేంద్రం శనివారం సమీక్ష నిర్వహించనుంది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో కేంద్రం దిగి వచ్చింది. ఈ పథకంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో శనివారం సమావేశమై సమీక్షించనున్నారు. అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలలో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా యువత నుంచి అగ్నిపథ్ కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విపక్షాలు కూడా అగ్నిపథ్ ఆర్మీని అవమానించడమేనంటే విమర్శలు చేశాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం ఒక మెట్టు దిగింది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన త్రివిధ దళాధిపతులు సమావేశమై అగ్నిపథ్ పై సమీక్షించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనకు తలొగ్గి మోడీ ఆ చట్టాలను వెనక్కు తీసుకోవడమే కాక రైతులకు క్షమాపణ చెప్పిన సంగతి విదితమే. ఇప్పుడు అగ్నిపథ్ విషయంలో కూడా వెల్లువెత్తిన వ్యతిరేకతకు తలొగ్గి కేంద్రం సమీక్షించాలని నిర్ణయించింది.

మోడీ తప్పుడు విధానాల వల్లే తెలంగాణ బిడ్డ బలి!..పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే తెలంగాణ బిడ్డ బలయ్యాడని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళన సందర్భంగా పోలీసు కాల్పులలో వరంగ్ కు చెందిన రాకేష్ అనే యువకుడు మరణించిన సంగతి తెలిసిందే. రాకేష్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన రాకేష్ కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఆ కుటుంబంల అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

బీహార్ లో జూన్ 19 వరకూ ఇంటర్నెట్ బంద్

‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న ఆందోళనల నేపథ్యంలో బీహార్ లోని 12 జిల్లాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోనికి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19 వరకూ రాష్ట్రంలోని 12 జిల్లాలలో ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా బీహార్ లో పలు ప్రాంతాల్లో యువత ఆందోళన చేస్తోంది. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆర్మీలో చేరాలనుకుంటున్న యువకులు అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తున్నారు. ఆర్మీ   సర్వీస్ ను కేవలం నాలుగేళ్లకే పరిమితం చేయడంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బీహార్ లో  ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ గురువారం నుంచి జరుగుతున్న ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి.   భభువా రోడ్ రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ అద్దాలను పగలగొట్టిన నిరసనకారులు ఒక కోచ్ కు నిప్పు పెట్టారు.  అర్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు.. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులు స్టేషన్ ఫర్నిచర్ ను ట్రాక్ పై విసిరేసి నిప్పుపెట్టారు. జెహానాబాద్ లో ఆందోళనకారుల నిరసనతో రైల్వే ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. నవాడలో యువకులు రైళ్లను అడ్డుకుని ట్రాక్ పై టైర్లను తగలబెట్టారు.

అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు ఈడీ నిర్ణయం?

కాంగ్రెస్ కు పుండు మీద కారం చల్లినట్లుండే నిర్ణయం ఈడీ తీసుకోబోతోందా? గాంధీ నెహ్రూ కుటుంబ ఆస్తిని ఈడీ జప్తు చేయబోతోందా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఔననే సమాధానం వస్తోంది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఐదే వేల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేయడానికి సన్నాహాలు చేస్తున్నదని తెలుస్తోంది. ది అనలైజర్ కథనం ప్రకారం పరోక్షంగా గాంధీ కుటుంబం, ప్రియాంకా వాద్రాల యాజమాన్యంలోని అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది. ఆ సంస్థకు చెందిన 5వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తునకు ఈడీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం వేధింపులలో భాగమే ఈడీ విచారణ అని అరోపిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు ఈడీ నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ ఆందోళనలను మరింత ఉథృతం చేసే అవకాశం ఉంది. కాగా అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థను 1930లో స్థాపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిర్వహణ కోసం స్థాపించిన ఈ సంస్థ ఆ తరువాత గాంధీ కుటుంబం నిర్వహించింది.  ఈ సంస్థకు విరాళంగా వచ్చిన సొమ్ము దిర్వినియోగం అయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కేంద్రం అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన రూ.90 కోట్ల రుణాన్ని ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపైనే ఈడీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలం రికార్డు చేసింది. విచారణ సోమవారం కూడా కొనసాగనుంది. సోనియా గాంధీ కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు.  

కాంగ్రెస్ డౌన్ బట్ నాట్ అవుట్

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు, ముఠాల కుమ్ములాటలు కొత్త విషయం కాదు, విశేషమూ కాదు. అదొక మాములు విషయం. ఒక సహాజ లక్షణం.నిత్య క్రతువు.అందుకే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు, ముఠాల కుమ్ములాటలు లేకపోతే ఆశ్చర్యపోవాలిగానీ, లేదంటే అందులో ఆశ్చర్య పోవలసిన విషయం, విశేషం మరొకటి ఉందని అంటారు. నిజం ఒక్క, తెలంగాణలోనే కాదు దేశం అంతటా, అంతే. అదే పరిస్థితి.  అయితే, ఇప్పుడు గమ్మత్తుగా దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒకటిగా పోరాడుతున్నారు. నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విచారించదాన్ని వ్యతిరెకిస్తూ దేశ వ్యాప్తంగా   ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు అంతా ఒకటిగా ఎక్కడ లేని ఐక్యతా  ప్రదర్శిస్తున్నారు.నిజంగా, ఇదొక అపూర్వ చిత్రం.   ఇక తెలంగాణ విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి పార్టీలో  జోష్ పెరిగింది. అదే సమయంలో అసమ్మతి కార్యక్రమాలూ జోరందుకున్నాయి. ఒకదాని కొకటి  సమాంతరంగా సాగడంతో, రైలు పట్టాల్లా ఒకదాని కొకటి కలవడం లేదు. అడుగు ముందుకు పడడం లేదు. ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నిలిచి పోయింది. ఇదో ఎవరో చేసిన వ్యాఖ్యానం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వయంగా వ్యక్త పరుస్తున్న ఆవేదన.  నిజానికి, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధిష్టానం ఒకటికి నాలుగు సార్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే, పరిస్థితి ఏమిటో వేరే వివరించవలసిన అవసరం లేదు. అయినా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నా, తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం అయితే ఇంతవరకు లభించలేదు.   అందుకే రేవంత్ రెడ్డి  సారథ్యంలో నిర్వహించిన ఆందోళనలు అన్నీ సక్సెస్ అయినా, అదే సమయంలో పార్టీలో అసమ్మతి కట్లు విప్పుకోవడంతో, సక్సెస్ వెంట ఫెయిల్యూర్ వెంటాడుతూ వచ్చింది. చివరకు పరిస్థితి  బేరీజు వేసుకుంటే సున్నకు సున్నా .. హళ్లికి హళ్లి అన్నట్లుగానే ఉందని పార్టీ పరిశీలకులే అంటున్నారు. కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు  రాష్ట్ర స్థాయి నేతలఫై విశ్వాసం కోల్పోయారు. వీళ్ళంతే, మారరు’ అనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు  సోనియా,రాహుల్‌ గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ.. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో ‘ఏ టూ జెడ్’ అన్ని  గ్రూపుల నాయకులూ పాల్గొన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఇంత మంది నాయకులు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య  ఇంత సయోధ్య  ఉందా? అనే అనుమానం వచ్చే విధంగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. నాయకులే కాదు కార్యకర్తలు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ డౌన్ బట్ నాట్ అవుట్ అనే విశ్వాసాన్ని కలిగించింది. అలాగే ఇక్కడ మరో విషయం కూడా వెలుగు చూసిందని పరిశీలకులు అంటున్నారు. మాకు  మాకు మధ్య వెయ్యున్నా,గాంధీ ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం, కురు పాండవుల్లా మేమంతా ఒకటవుతామనే సందేశాన్ని కాంగ్రెస్ నాయకులు జనంలోకి పంపారని పరిశీలకులు అంటున్నారు.  అయితే, ఈడీ విచారణలు దేశంలో చాలా మంది మీద జరుగుతూనే ఉంటాయి. నిజానికి కొద్ది రోజుల ముందు ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, దళిత నేత మల్లికార్జున ఖర్గేను ఈడీ విచారించింది. ఆయన మందీ మార్బలం లేకుండా ఈడీ కార్యాలయానికి వెళ్లారు, ఈడీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి హుందాగా వచ్చారు. అదే విధంగా రాహుల్ గాంధి, సోనియా గాంధి కూడా హుందాగా విచారణకు హరరైతే, పార్టీ గౌరవం పెరిగేదని సమస్య ఉండేది కాదని, అందుకు విరుద్ధంగా దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయడం వలన, పార్టీ ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉందని పార్టీలో కొందరు గుసగుసలు పోతున్నారు. ఈడీ విచారణ వలన పార్టీలో వచ్చిన ఐక్యత  ఎంత కాలం ఉంటుందో తెలియదు, కానీ, పడిన మచ్చ మాత్రం అంత త్వరగా పోదని అంటున్నారు.  అయితే, గతంలో ఎమర్జెన్సీ అనంతరం షా కమిషన్ విచారణ అధారంగా ఇందిరా గాంధీని  మొరార్జీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అప్పుడు కూడా ఇలాగే, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అరెస్ట్’కు వ్యతిరేకంగా ఆందోళనలు చేసింది.  ప్రజలు ఆమెకు అండగా నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. అదే సమయంలో జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తలెత్తి మొరార్జీ ప్రభుత్వం కూలి పోయింది. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇందిరా గాంధీ  మళ్ళీ ప్రధాని అయ్యారు. ఇప్పడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందనే గంపెడు ఆశతోనే కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు ఇచ్చిందని అంటున్నారు. అయితే, అది 50 ఏళ్ల నాటి ముచ్చట, అప్పుడు టీవీ  లేదు ఇప్పుడు టీవీ కాదు, ప్రతి చేతిలో ఇంటర్నెట్ వుంది.సో.. అప్పుడు జరిగిందే ఇప్పడు జరగాలంటే కాలం వెనక్కి వెళ్ళడం ఒక్కే మార్గం ..అది జరగదు..ఇది మాత్రం జరుగుతుందా.. ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు ..

బీజేపీ పాలిత రాష్ట్రాలలో అగ్నిపథ్ మంటలపై మౌనమేల కిషన్ రెడ్డీజీ!

అగ్నిపథ్ మంటలు దేశమంతటా వ్యాపించాయి. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం అగ్నిపథ్ అంటూ ప్రకటన వెలువడిన క్షణం నుంచీ దేశంలో యువత రగిలిపోతున్నారు. వారి ఆందోళనలు హింసాత్మక రూపం దాలుస్తున్నాయి. వారి ఆవేదనను అర్ధం చేసుకుని, వారిని సముదాయించడానికి చర్యలకు ఉపక్రమించాల్సిన కేంద్రం మరింత  రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నది. అదలా ఉంచితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికిందరాబాద్ అల్లర్లపై చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అత్యంత బాధ్యతా రహితంగా ఉన్నాయి. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని అంటూనే కిషన్ రెడ్డి..ఈ అల్లర్లు అత్యంత పకడ్బందీగా ఒక పథకం ప్రకారం జరిగాయనీ, ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేననీ అన్నారు. ఒక సీరియస్ సమస్యను రాజకీయ విమర్శలకు, ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడమే దురదృష్టకరం. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కిషన్ రెడ్డి ఇటువంటి ప్రకటనలు, విమర్శలు చేయడం శోచనీయం అని పరిశీలకులు అంటున్నారు. సికిందరాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనలు ఏ విధంగా చూసినా సమర్ధనీయం కాదు. వాటిని నివారించడంలో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాన్ని కూడా సమర్థించలేం. కానీ ఈ ఆందోళనలు ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ జరిగాయి. అక్కడా ఆందోళనలు హింసాత్మక రూపం జరిగాయి.  సికిందరాబాద్ రైల్వే స్టేషన్ హింసాత్మక ఘటనలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం అయితే.. యూపీలో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యమేనా? కిషన్ రెడ్డి ఆ విమర్శ చేస్తారా? చేయగలరా? తెలంగాణలో ఉన్నది బీజేపీయేతర ప్రభుత్వం కనుకే ఇక్కడ అల్లర్లు జరిగాయని సూత్రీకరించడం సమంజసమేనా?     వాస్తవానికి ఆర్మీలో నియామకాలకు ‘అగ్నిపథ్’ అంటూ ప్రభుత్వం  ప్రకటన చేసిన క్షణం నుంచీ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.   ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా బీహార్ లో పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి.   హర్యానాలోని ఫరీదాబాద్ బల్లబ్ గఢ్ ప్రాంతంలో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. దీంతో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపేశారు.   తమిళనాడులోనూ ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఇలా దేశ వ్యాప్తంగా అల్లర్లు జరిగినా కిషన్ రెడ్డి కేవలం తెలంగాణలో మాత్రమే శాంతి భద్రతల వైఫల్యం అంటూ విమర్శలు గుప్పించడం రాజకీయం తప్ప మరోటి కాదని పరిశీలకులు అంటున్నారు. అల్లర్లు జరిగిన రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉన్నాయని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

కేసీఆర్ కిట్ ప్రయోజనం అంతంత మాత్రమే.. తగ్గని సిజేరియన్లు

ఆరోగ్యం మ‌హాభాగ్యం అన్నారు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా వుంటే పాల‌కుల‌కూ మంచిదే. ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేకించి వ్య‌యం చేయ‌డం, ఆస్ప‌త్తులు, వ‌స‌తులు అభివృద్ధి చేయ‌డం ప్ర‌భుత్వం చేప‌ట్ట‌వ‌ల‌సిన క‌నీస ధ‌ర్మం. గెలిపించినందుకు ప్ర‌జ‌ల ఆరోగ్యానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌తా స్వీక‌రించాలి. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటాల‌తో సాగిపోతున్న కేసీఆర్ ప్ర‌భుత్వం నిజానికి తెలంగాణాలో ఆస్ప‌త్రుల అభివృద్ధి విష యంలో నిర్ల‌క్ష్యం చేస్తోంద‌నేది తేటతెల్ల‌మ‌యింది. తెలంగాణా ప్ర‌భుత్వం కేసీఆర్ కిట్ పేరిట బాలింత‌ల కు ఇవ్వడం గొప్ప‌గా ప్ర‌చారం చేసుకుంది.   వాస్త‌వంలో ప‌రిస్థితులు అందుకు భిన్నంగానే  వున్నాయి. ప్ర‌భుత్వాస్ప త్రులు పేదల‌కు ఎల్ల‌పుడూ అన్ని వ‌స‌తుల‌తో అందుబాటులో వుంటాయ‌ని, ఎవ్వ‌రూ ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌వ‌ల‌సిన అవ‌స‌రం వుండ ద‌ని ప్ర‌చారం చేసుకుంది.  ఇటీవ‌ల ఒక స‌ర్వే ప్ర‌జారోగ్య విష‌యంలో దేశంలో ఏ రాష్ట్రం ఎలా వుంద‌న్న‌ది వెలుగులోకి తెచ్చింది.  అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణాలోనే సిజ‌రియ‌న్ ఆప‌రేష‌న్లు అధికంగా  జ‌రుగు తున్న సంగ‌తి తేట‌తెల్లం చేసింది.  ప్రయివేటు ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 98శాతం వరకు సీ సెక్షన్లే ఉండడం గమనార్హం. డెలివరీ కోసం చేసే సీ సెక్షన్‌ సర్జరీల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7 శాతం సిజేరియన్లే. ఇది దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. తెలంగాణ తర్వాతి స్థానాల్లో సీ సెక్షన్‌ ఆపరేష న్లు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో ద్వితీయ స్థానంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తృతియస్థానంలో ఉన్నాయి. తెలంగాణలో సీ సెక్షన్‌ ఆపరేషన్లు అధికంగా జరుగుతున్న జిల్లాల్లో కరీంనగర్‌ జిల్లా టాప్‌లో ఉంది. 300 పడకలు, ఆపై ఉన్న పెద్దస్థాయి ఆసుపత్రుల కేటగిరీలో దేశంలోనే అత్యధిక సీ సెక్షన్లు జరి గిన ఆసుపత్రుల్లో కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రి 69.93శాతం ఆపరేషన్లతో దేశంలోనే రెండోస్థానంలో నిలవ డం గమనార్హం. ఇక కేవలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో జరిగే సిజేరి యన్లను పరిగణనలోనికి తీసుకుంటే అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లోనైనా సీ సెక్షన్‌ ఆపరేషన్లు 10శాతం దాటితే అవి తల్లి, బిడ్డ మరణాలు తగ్గించడం కోసం జరిగినవి కావని, కేవలం ధనార్జనే ధ్యేయంగా జరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేస్తోంది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం సీ సెక్షన్లు మొత్తం కాన్పుల్లో కేవలం 10శాతం, ఒక్కోసారి 15 శాతం వరకు మాత్రమే ఉండాలి.  ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా  సీ సెక్షన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయని  నీతి ఆయోగ్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. కరీంనగర్‌ జిల్లా లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఇప్పటికీ  90శాతం సిజేరియన్లే జరుగుతున్నట్లు గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లాలో 77శాతం, మం చిర్యాల, నిర్మల్ లోనూ  90 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 62.36శాతం సీజేరియన్లు  ఈ  ఏడాదికి 79.14 శాతానికి  చేరుకున్నాయ‌ని  వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీల్లో 40 శాతం మంది నేర చరితులే

త‌మ‌ను గెలిపించిన ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసుకుని ధ‌న్యులం కావాల‌ని దీక్ష‌బూని మ‌రీ అధికారంలోకి వచ్చా మ‌ని ప్ర‌జాప్ర‌తినిధులు  ఘనంగా చెప్పుకోవడం వింటుంటాం. కానీ చిత్రంగా ఫ‌లానా హ‌త్య‌ వెనుక, లేదా ఫ‌లానా గూండాల దాడి వెనుక ఫ‌లానా ఎమ్మెల్యే, ఫ‌లానా మంత్రి వున్నార‌ని విని తెగ ఆశ్చ‌ర్య‌పోవ‌డ‌మూ చాలా కాలం నుంచి వున్న‌ది. ప్ర‌జ‌ల సేవే ప‌ర‌మ‌ ధ‌ర్మంగా  ప్ర‌చారం చేసి ఎన్నిక‌ల్లో గెలిచిన‌వారిలో చాలా మందికి అస‌లు మాన‌వ‌త్వ‌మే వుండ‌ద‌న్నది తెలియ‌జేసిన సంఘ‌ట‌న‌లూ జ‌రుగుతున్నాయి. దేశ‌ వ్యాప్తంగా చాలామంది నాయ‌కులు, మంత్ర‌లు నేర‌ చ‌రిత్ర క‌లిగిన‌వారే అని మీడియా బ‌య‌ట‌పెట్టింది.  పెద్దల సభకు విద్యావంతులు, సామాజిక సేవా రంగంలో  నిస్వార్థంగా సేవ చేసిన వారిని పార్టీలు ఎంపిక చేసి మరీ పంపుతాయని అనుకుంటాం కానీ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాస్వామ్య విలువలు పట్టవడనానికి ఇటీవల   రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల్లో 40 శాతం ఎంపీలకు నేరచ‌రిత్ర ఉంద‌నీ, ఇందులో 12 శాతం ఎంపీల‌పై సీరియ‌స్ క్రిమినల్ కేసులు ఉన్నాయనీ నేషనల్ ఎలక్షన్ వాచ్,  అసోసియేషన్ ఫర్ ఎలక్ట్రిక్ రిఫార్మ్స్ (ఏడి ఆర్‌) తెలి పాయి. వీరిలో ఎక్కువ మంచి హత్య, మహిళలపై లైంగిక దాడుల ఆరోప‌ణలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొ న్నాయి. అభ్య‌ర్ధుల నామినేష‌న్ సందర్భంగా దాఖ‌లు చేసిన అఫిడెవిట్లే వారి నేర‌చ‌రిత్ర‌ను వెల్ల‌డిం చ‌డం గ‌మ‌నార్హం.   ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన 57 మంది స‌భ్యుల్లో ఏకంగా 23 మంది (దాదాపు 40 శాతం) పై  క్రిమిన‌ల్ కేసులు వున్న‌ట్లు  ఏడిఆర్ తెలిపింది. అలాగే 12 మందిపై (21 శాతం) హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం, దొంగత‌నం, మ‌హిళ‌ల‌పై నేరాలు వంటి తీవ్ర‌మైన నేర కేసులున్న‌ట్లు కూడా ఏడిఆర్ వెల్ల‌డించింది. పార్టీల‌వారీగా  ఇచ్చిన నివేద‌క  ప్ర‌కారం బిజెపీ నుంచి ఎన్నికైన  22 మంది  రాజ్య‌స‌భ స‌భ్యుల్లో  9 మందికి, 9 మంది కాంగ్రెస్ ఎంపీల్లో న‌లుగురికి, టిఆర్ ఎస్‌,ఆర్జేడీకి చెందిన  ఇద్ద‌రేసి ఎంపీలు, వైసీపీ,   డీ ఎంకే, ఏఐడిఎంకే, స‌మాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), ఎస్‌హెచ్‌ఎస్‌, ఇండిపెండెంట్‌ నుంచి ఒక్కో ఎంపీకి  నేర చరిత్ర ఉన్నట్లు ఏడీఆర్‌ వివరించింది.  రాష్ట్రాల ప‌రంగా చూస్తే.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆరుగురు, మహారాష్ట్ర, బీహార్‌ నుంచి నలుగురు, తమిళ నాడు నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హర్యానా నుంచి ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైనట్లు నివేదిక పేర్కొంది. ఈ నెలలో రాజ్యసభకు ఎన్ని కైన మొత్తం 57 మంది ఎంపీల స్వీయ ప్రమాణ పత్రాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించి నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్,  నేషనల్ ఎలక్షన్ వాచ్ తెలిపాయి. ఈ నివేదిక‌ల్లో పేర్కో న్న 57 మంది ఎంపీలలో 23 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించార‌ని నివేదిక తెలిపింది. కొత్తగా ఎన్నికైన 57 మంది ఎంపీల చర, స్థిరాస్తులను విశ్లేషిస్తూ.. వారిలో 53 మంది (93 శాతం) మిలియనీర్లని తెలిపింది. మొదటి మూడు సంపన్న అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థ సారధి మొత్తం రు. 1,500  కోట్ల ఆస్తితో అగ్రస్థానంలో నిలిచారని నివేదిక పేర్కొంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ మాజీ నాయకుడు కపిల్ సిబల్ నిలిచారు. ఆయ‌న మొత్తం ఆస్తు ల విలువ రు.608 కోట్లకు పై మాటే.  ఇక‌.. పంజాబ్ నుండి కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విక్రమ్ జిత్ సింగ్ సాహ్నీ రు. 498 కోట్ల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు. 2022లో రాజ్యసభకు కొత్తగా ఎన్ని కైన ఎంపీల సగటు ఆస్తుల విలువ  రు. 154.27 కోట్లు అని నివేదిక పేర్కొంది.