మొంథా తుఫాన్ వస్తోంది...అప్రమత్తంగా ఉండండి : సీఎం చంద్రబాబు

  ఏపీకి 'మొంథా' తుఫాను పొంచివున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొంథా’ తుపాన్ రాష్ట్రంపై ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని... 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదల నుంచి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిళ్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ తుఫాన్ రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని... తగిన వనరులతో సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. తీరప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.  అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పారు. అన్ని ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లలో నీటిమట్టాలను పర్యవేక్షించి నీటి విడుదల శాస్త్రీయంగా జరపాలన్నారు. రియల్ టైమ్‌లో వచ్చే సమాచారాన్ని తక్షణం ప్రభుత్వ యంత్రాంగంలోని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్  బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కాకినాడలో హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించాలని సూచించారు.  ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు అన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ టవర్స్, సివిల్ సప్లైస్ వంటి అత్యవసర సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఇన్‌ఛార్జి అధికారులను నియమించి, తుఫాను నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం

    హైదరాబాద్‌ నగరంలో శనివారం సాయంత్రం సమయంలో చాదర్‌ ఘాట్ ప్రాంతంలోని విక్టోరియా గ్రౌండ్ వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా సంచ లనం సృష్టించింది. సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్యతో పాటు పోలీస్ సిబ్బంది సెల్ఫోన్ దొంగలను పట్టుకుని ప్రయత్నంలో  సెల్‌ఫోన్ స్నాచర్ కత్తితో ఒక్కసారిగా డిసిపి చైతన్య పై దాడి చేయడానికి యత్నించాడు. అయితే డిసిపి చైతన్యకు మరియు సెల్ఫోన్ స్నాచర్ మధ్య తోపులాట జరగడంతో డిసిపి చైతన్య గన్మెన్ వెపన్ కింద పడిపోయింది. దీంతో డిసిపి చైతన్య వెంటనే గన్ను తీసుకొని మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.  చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతంలో  సెల్‌ఫోన్ స్నాచింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో వెంటనే సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ దొంగ డీసీపీపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనకు ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో డీసీపీ చైతన్య స్వయంగా తన గన్ తీసుకుని దొంగపై కాల్పులు జరిపారు.  మొత్తం మూడు రౌండ్ల  కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. తోపులాటలో డీసీపీ గన్‌మెన్ కింద పడి గన్ నేలపై పడగా, వెంటనే డీసీపీ స్వయంగా ఆయు ధాన్ని స్వాధీనం చేసుకొని ఫైర్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయి.  వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ డీసీపీ చైతన్యతో పాటు మిగతా పోలీస్ సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మొత్తం రెండు రౌండ్లు దొంగలపై ఫైర్ చేసినట్లు ఆయన తెలిపారు. నగర పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని  వెల్లడించారు.

కార్ పూలింగ్ తో ట్రా‘ఫికర్’కు చెక్

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ఓ ప్రణాళికతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడాన్ లో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రంగా మారడంతో ఆర్టీసీ ఐటీ కంపెనీల ముందుకు ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది. అందుకు ఐటీ కంపెనీలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆర్టీసీ ప్రతిపాదన ఏంటంటే..   ప్రజా రవాణాను విస్తరించేందుకు ఐటీ కారిడార్లో బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతి ఐటీ కంపెనీకి ఒక ఆర్టీసీ బస్సును అద్దె ప్రాతిపదికన కేటాయించడం ద్వారా ఉద్యోగులు సొంత వాహనాలకు బదులుగా బస్సులలో వచ్చేలా ప్రోత్సహించాలన్నది ఒక భాగం కాగా, కార్ పూలింగ్ అన్నది రెండో భాగంగా ఆర్టీసీ ప్రతిపాదన చేసింది.   ఇందులో భాగంగా ముందుగా మైండ్ స్పేస్ ప్రాంతంలో వన్ బస్ పర్ కంపెనీ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. సైబరాబాద్ పోలీసులు కూడా ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు సమసిపోతాయని అంటున్నారు.  సో ముందుగా మైండ్ స్పేస్ ఏరియాలో వన్ బస్ పర్ వన్ కంపెనీ పాలసీలో భాగంగా ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించే 250 కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం సైబరాబాద్ పోలీసులు ఓ సర్వే కూడా చేశారు.  ఆ సర్వే ప్రకారం ఐటీ హబ్  ప్రాంతాలలో  పనిచేసే చాలామంది ఉద్యోగులు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఒకే ఏరియాలో ఉంటూ కూడా ఎవరికి వారుగా సొంత వాహనాల్లో వస్తున్నారు. ఆ కారణంగా పీక్ అవర్స్ లో  ట్రాఫిక్  సమస్య తీవ్రమౌతోంది. ఇలా ఒకే ఆఫీసులో పని చేస్తూ ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు కార్ పూలింగ్ పద్ధతి అనుసరిస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకూ పరిష్కారమౌతుందని ఈ సర్వే ద్వారా తేలిందని అంటున్నారు. అలాగే మైండ్ స్పేస్ ప్రాంతంలోని కంపెనీలలో పని చేసే ఉద్యోగులు దాదాపు 250 కార్లలో తమతమ కార్యాలయాలను హాజరౌతున్నారని సర్వేలో తేలింది. ఈ కార్లను 50 బస్సులతో రీప్లేస్ చేస్తే తక్కువలో తక్కువ పాతిక శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమౌతుందని అంటున్నారు. అంటే వన్ బస్ పర్ వన్ కంపెనీ పద్ధతిలో ఐటీ ఉద్యోగులు సొంత కార్లకు ప్రత్యామ్నాయంగా బస్సులను ఆశ్రయించేలా చేస్తే చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు కడతేరుతాయని అంటున్నారు. అదే సమయంలో ఆర్టీసీ తన బస్సులను ఐటీ కంపెనీలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం కూడా సమకూర్చుకునే అవకాశం కలుగుతుందంటున్నారు.  త్వరలోనే దీనిపై ఐటీ కంపెనీలు, ఉద్యగులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 

కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్

  కర్నూలు జిల్లా చిన్నటేకూరులో వి. కావేరి బస్సు దగ్ధ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బస్సు, బైక్ ప్రమాదాలు వేర్వేరుగా జరిగినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే— బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్, ఎర్రిస్వామి హైవేపై ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో శివశంకర్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.  వెంటనే రోడ్డుపై పడిపోయిన బైక్‌ను పక్కకు తీసేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తుండగా, చీకట్లో వేగంగా వస్తున్న వి. కావేరి బస్సు బైక్‌ను ఈడ్చుకెళ్లింది.దీంతో బైక్ పెట్రోల్ ట్యాంకు లీక్ అయి మంటలు చెలరేగాయి. దీని వల్ల పెట్రోలు లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయని ఎర్రిస్వామి పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.   ప్రమాదానికి ముందు శివశంకర్ మరో యువకుడితో కలిసి బైక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్లిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. పెట్రోల్ బంక్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోలో శివశంకర్ మత్తుతో తూలుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ప్రస్తుతం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ దారుణం రెండు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.  

రాణించిన రోహిత్‌, కోహ్లీ...భారత్ ఘన విజయం

  ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల టార్గెట్‌ను ఒకే వికెట్ కోల్పోయి టీమిండియ ఘన విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగగా , విరాట్ కోహ్లీ 74 పరుగుల అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయింది.  భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. రెన్‌షా (56) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో యువ పేసర్ హర్షిత్ రాణా 4 వికెట్లతో సత్తా చాటగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టిమీండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (24) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు  

శివయ్యపై ఇద్దరు నాగేంద్రుల దర్శనం

  నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. దేవస్థాన పరిసరాల్లో నాగేంద్రుడు సంచరిస్తున్న సంగతి భక్తులకు తెలిసిందే.  అయితే, తాజాగా ఉదయం తెల్లవారుజామున ఇద్దరు నాగేంద్రులు ఒక్కసారిగా విశ్వనాథ స్వామి సన్నిధిలో ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చారు. అందులో ఒక నాగేంద్రుడు శ్వేతనాగ రూపంలో కనిపించి, భక్తులందరికీ కడువిందు చేసినట్లు అక్కడివారు తెలిపారు. ఇప్పటివరకు ఒకే నాగేంద్రుడు దర్శనమిచ్చిన ఈ దేవస్థానంలో ఇద్దరు నాగేంద్రులు ప్రత్యక్షమవడం విశేషంగా మారి, మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

కర్నూలు బస్సు దుర్ఘటనలో మృతదేహాల కోసం ఎదురుచూపులు

  కర్నూలు బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాల కోసం వారి బంధువులు ఎదురుచూస్తున్నారు. చనిపోయిన వారందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోవడంతో వారిని డీఎన్ఏ సేకరించి ఎవరి చెందిన మృతదేహాలను వారికి అప్పగించేందుకు అధికారులు నిన్నటి నుంచి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే  డీఎన్ఏ సేకరణకు మొత్తం 16 బృందాలను ఏర్పాటు చేశారు.  బస్సు ప్రమాదంలో బస్సులో ఉన్నవారు 19 మంది చనిపోగా వారిలో ఇప్పటికే 14 మంది డిఎన్ఏ ను సేకరించి ల్యాబ్ కు పంపించినట్టుగా అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఐదు మంది డీఎన్ఏల సేకరణ కూడా ఈరోజు పూర్తవుతుందని ఫారెన్సీక్ డాక్టర్లు చెబుతున్నారు. మృతుల దగ్గర నుంచి సేకరించిన డీఎన్ఏ పరీక్షలు పూర్తిచేసుకుని తిరిగి తిరిగి రిపోర్టులు రావడానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ తర్వాతనే మృతదేహాలు అప్పగింత ప్రారంభమవుతుందని చెప్తున్నారు.  దీనితో చనిపోయిన వారి బంధువుల బాధ వర్ణాతీతంగా మారింది. అసలే అయినవారు చనిపోయిన దుఃఖంలో శవాల అప్పగింతకు కూడా అధిక సమయం పడుతుండటంతో, ఎటు పాలుపోనీ నందిగ్ధంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారిలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాసిన చెందినటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఆస్పత్రి మార్చురీ దగ్గర నిన్నటి నుంచి పదిగాపులు కాస్తున్నారు.  అయితే మృతదేహాలు అప్పగింతకు అధిక సమయం పడుతున్న నేపథ్యంలో వీరందరినీ అధికారులు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి తరలించి అక్కడ బసవ ఏర్పాట్లను చేశారు. సమయం ఆలస్యం అవుతున్న కొద్దీ చనిపోయిన వారి బంధువులు ఒకరు ఒకరిగా అక్కడికి చేరుతుండటంతో బంధువుల ఆక్రందనలు చూసేవారికి సైతం కంటతడి తెప్పిస్తున్నాయి..

పెద్ద అంబర్ పేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

కర్నూలు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఫిట్ నెస్, డ్రైవర్ల నైపుణ్యంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ ఆనుమానాలకు బలం చేకూర్చేలా  తాజాగా  మరో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. శనివారం (అక్టోబర్ 25)తెల్లవారు జామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు, ముందు భాగం ధ్వంసమయ్యాయి. అదృష్ట వశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇకమరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తాపడింది. ఈ సంఘటన శనివారం (అక్టోబర్ 26) ఉదయం జరిగింది. మియాపూర్ నుంచి గుంటూరు వెడుతున్న న్యు గో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.   

ఏపీకి ‘మొంథా’ తుపాను ముప్పు..రెడ్ అలర్ట్

  అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పుటికీ అంతలోనే ఉన్న పళంగా వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది.  మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,  కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.  రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అటు ఏపీలోని తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది.  ‘మొంథా’ తుపాను.. రాష్టంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుపాను చాలా ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.  ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరం దాటే సమయంలో 90-110 కి.మీ. వేగంతో గాలుల వీస్తాయి. విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు ప్రభావం ఉండనుంది. తీర ప్రాంత జిల్లాల్లో 28,29 తేదీల్లో సెలవులు ప్రకటించాలని అధికారులు సూచించారు.

కిలో టమోటా రూ. 600లు.. ఎక్కడో.. ఎందుకో తెలుసా?

కిలో టామోటా ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు. ఈ మాట వినగానే ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారా? ఈ ధర మన రాష్ట్రంలో, మన దేశంలో కాదు లెండి. మన పొరుగుదేశమైన పాకిస్థాన్ లో. ఔను పాకిస్థాన్ లో ఇప్పుడు టమోటా ధర జనం గుండెల్లో మంట పుట్టిస్తోంది. గింజ మెతుకు దొరకడమే అక్కడ గగనంగా మారిపోయింది. టమోటాల ధరైతే ఆకాశమే హద్దుగా పెరిగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే. ఆ రెండు దేశాల సరిహద్దులో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు దేశాల మధ్యా సరిహద్దులను ఈ నెల 11 నుంచి మూసేశారు. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  ఈ పరిస్థితి పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరు దేశాల ప్రజలూ కూడా ఆహారం, ఔషధాల కొరతతో అల్లాడుతున్నారు. పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు.. ఇలా ఒకటేమిటి అన్ని వస్తువుల ధరలూ చుక్కలనంటాయి. ఇరు దేశాల మధ్యా ఘర్షణలకు ముందు పరిస్ధితితో పోలిస్తే పాకిస్థాన్ లో అన్ని వస్తువుల ధరలూ కనీసం ఐదు రెట్లు పెరిగాయి.  ఆ దేశంలో  ప్రస్తుతం కిలో టమాటాల ధర అక్షరాలా ఆరు వందల రూపాయలు పలుకుతోంది.   సాధారణంగా పాక్‌- అఫ్గాన్‌ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్‌లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్   వెల్లడించింది.  ఈ కారణంగా  అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు ఎందుకూ పనికిరాకుండా పాడైపోయాయి. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయి.   గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో గత వారం ఖతార్‌లోని దోహాలో పాక్, అఫ్గాన్‌ రక్షణ మంత్రులు ఖ్వాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఇందులోభాగంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్ఠంభనకు తెరపడలేదు.   

కర్నూలు బస్సు ప్రమాదం.. లగేజీ క్యాబిన్లో వందల ఫోన్లు!

 కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే.  అయితే ఈ ప్రమాద తీవ్రత ఇంత భారీగా ఉండటానికి డోర్ దగ్గర ఉన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోయి డోర్లు తెరుచుకోకపోవడం ఒక కారణమైతే.. బస్సు లగేజీ క్యాబిన్ లో ఉన్న ఫోన్ల పార్శిల్ ప్రధాన కారణమని అంటున్నారు. బస్సు లగేజీ క్యాబిన్ లో  దాదాపు 46లక్షల రూపాయల విలువైన ఖరీదైన సెల్ ఫోన్ లను బస్సులో పార్సిల్ సర్వీసుగా ఉన్నాయి. ఈ విషయాన్ని ఫొరెన్సిక్ టీమ్ గుర్తించింది. బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగగానే.. ఆ వేడికి ఫోన్లలో బ్యాటరీలు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయి.. మంటలు వేగంగా వ్యప్తి చెందాయి. ఆ కారణంగానే బస్సులోని ప్రయాణీకులు బయటకు రావడం కష్టమైందంటున్నారు.  కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి.  హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్‌ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు   సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం  ఓ కారణమని ఫోరెన్సిక్‌ నిపుణులు అంటున్నారు.   మొబైల్‌ ఫోన్ల బ్యాటరీలతో పాటు బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్‌ బ్యాటరీలు కూడా పేలిపోయాయనీ.. ఈ మంటల తీవ్రతకు బస్సు ఫ్లోర్‌పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.   

పెట్టుబడులతో వస్తాం.. ఏపీపై యూఏఈ పారిశ్రామికవేత్తల ఆసక్తి

ఏపీలో పెట్టుబడి అవకాశాలను ఆవిష్కరించిన చంద్రబాబు  ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపన,  పెట్టుబడులకు యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఎనలేని ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ సీఎం నారాచంద్రబాబునాయుడు తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆవిష్కరించిన తీరు, పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్న నమ్మకాన్ని కలిగించిందని అంటున్నారు. తన మూడు రోజుల యూఏఈ పర్యటనలో చంద్రబాబు మొత్తం పాతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు రంగాలకు చెందిన సంస్థల అధినేతలతో వేర్వేరుగా భేటీలు నిర్వహించారు.   అదే విధంగా యూఈఏ ప్రభుత్వ ప్రతినిధులు,  మంత్రులతో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, ఏపీలో ఏయే ప్రాంతాలలో ఏయే రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో కూలంకషంగా వివరించారు. ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, ఏఐ రంగం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను వారి కళ్లకు కట్టారు.  విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయనే అంశానికి సంబంధించిన వివరాలను పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా  చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.  రాయలసీమ జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన రంగం, ఎరో స్పేస్, డ్రోన్ సిటీ, హార్టికల్చర్, సెమీ కండక్టర్ వంటి పరిశ్రమలు, గోదావరి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో పాటు..ఆక్వా కల్చర్,   టూరిజం రంగాలలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని సీఏం అక్కడి పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లకు వివరించారు.   ఇక రాజధాని అమరావతి కేంద్రంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నామని, అమరావతి, విశాఖ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ద్వారా వేగంగా అనుమతులు ఇస్తున్నామనీ,  పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని భావిస్తే, అవసరమైతే పాలసీల్లో మార్పులు తేవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ తెలిపారు. భారత్-యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రధానమంత్రి చొరవను సీఎం తన పర్యటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.   చంద్రబాబు ప్రజంటేషన్ కు ముగ్ధులైన యూఏఈ పారిశ్రామిక వేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి, తమ సంస్ధలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఇక  చివరిగా   గల్ఫ్ లోని తెలుగు వాళ్లతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. యూఏఈ, కువైట్, ఖతార్, ఓమన్, బెహ్రయిన్ వంటి 10 గల్ఫ్ దేశాల నుంచి వేల మంది  పైగా తెలుగు ప్రజలు హాజరయ్యారు. చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన ఊహించిన దానికన్న సక్సెస్ అయ్యింది. భారీ పెట్టుబడులు వస్తాయన్న ధీమాతో ఆయన తన పర్యటన ముగించి స్వదేశానికి తిరిగి వచ్చారు.  

వచ్చే నెల నుంచి అందుబాటులోకి భారత్ టేక్సీ

ఓలా, ఉబెర్ వంటి   రైడ్-హెయిరింగ్ సంస్థలకు పోటీగా భారతదేశ సహకార రంగం భారత్' బ్రాండ్‌తో కొత్త టేక్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. వచ్చే నెల నుంచే ఈ సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి.    300 కోట్ల రూపాయల అధీకృత మూలధనంతో, ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా డ్రైవర్లను నియమించుకుని..  డ్రైవర్లకు మెరుగైన రాబడిని అందించడం, ప్రయాణికులకు నాణ్యమైన, సురక్షితమైన, సరసమైన సేవలను అందించడమే లక్ష్యంగా వీటిని అందుబాటులోనికి తీసుకువస్తున్నారు. భారత్ బ్రాండ్ కింద ట్యాక్సే సర్వీసులను 8 సహకార సంస్థలు నిర్వహించనున్నాయి. మల్టీ స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి. ఇందులో  నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీడీసీ), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టి లైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఐఫ్కో), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎమ్ఎమ్ఎఫ్), క్రిషాంక్ భారతీ కోపరేటివ్, ఎన్‌డీడీబీ, నాబార్డ్, ఎన్‌సీఈఎల్ సహా మొత్తం ఎనిమిది సహకార సంఘాలు ఉన్నాయి. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా రానున్న ఈ భారత్ టేక్సీ సేవలు వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్నాయి.  ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి పాతిక శాతం చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇటు  డ్రైవర్లకూ, అటు ప్రయాణీకులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.  తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఆరంభం కానున్న భారత్ టేక్సీ సేవలు ఈ ఏడాది చివరి నుంచీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.  

ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టిఏ దాడులు

కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మరణించిన ఘటనతో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను  క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.  డ్రంకన్‌ డ్రైవ్, బీమా, ఫిట్‌నెస్, పర్మిట్‌ పత్రాలు, బస్సు లోపల భద్రతను నిశితంగా పరిశీలిస్తున్నారు. పర్మిట్‌ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని   బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేస్తున్నారు. రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ చింతలకుంటలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తున్న బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సుల్లో ఫైర్‌ సేఫ్టీ, మెడికల్‌ కిట్లను పరిశీలిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదుచేశారు. చింతలకుంట వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఓ ట్రావెల్స్‌ బస్సును సీజ్‌ చేశారు. మరో నాలుగు బస్సులపై కేసులు నమోదుచేశారు. అలాగే శుక్రవారం అర్థరాత్రి హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి పరిధిలో కూడా ట్రావెల్స్‌ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేశారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల తో పాటు హైదరా బాద్ శివారు ప్రాంతాలలో కూడా రవాణాశాఖ అధికారులు దాడులు కొనసా గుతున్నారు.  శంషాబాద్, వనస్థలిపురం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవే పైన కూడా తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా కెరళా, తమిళ నాడు, కర్ణాటక, ఆంద్రప్రదేశ్, పాండి చ్చేరి, నాగాల్యాండ్, ముంబాయి నుండి హైదరాబాద్ వచ్చే  వాహనాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్టీఏ చేపట్టిన ఈ దాడులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూనే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఆర్టీఏ తీరు ఉందంటూ పెదవి విరుస్తున్నారు.   

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడు తుంటుంది. తిరుమలేశుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు.శనివారం (అక్టోబర్ 25) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లో 20 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 24) శ్రీవారిని మొత్తం71 వేల110  మంది దర్శించుకున్నారు. వారిలో 25,695 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 89 లక్షల రూపాయలు వచ్చింది.  

చంద్రబాబు.. మనిషక్కడ.. మనసిక్కడ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. క్షణం తీరిక లేకుండా అక్కడ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిథులతో చర్చలు జరుపుతున్నారు. రోజుకు తొమ్మదికి పైగా సమావేశాలు, సదస్సులతో ఊపిరి తీసుకునే తీరిక కూడా లేనంతగా ఉన్నారు. అయినా ఆయన చిత్తం అంతా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలపై గురువారం (అక్టోబర్ 23)న అక్కడి నుంచే ఇక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.   అంతేనా రాష్ట్రంలో మంత్రులు, అధికారులతో క్రమం తప్పకుండా టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు.  శుక్రవారం (అక్టోబర్ 24) ఉదయం కర్నూలు శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ, డీఐజీ, కర్నూలు కలెక్టర్, ఎస్పీలతో స్వయంగా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు.  అధికారులు, మంత్రులు దగ్గరుండి ఈ పనులన్నిటినీ పర్యవేక్షించాలన్నారు. అలాగే ప్రమాదఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.

దేశంలో ఏపీయే నంబర్ వన్.. పెట్టుబడులతో తరలిరండి.. లోకేష్

దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఏపీ రెండో స్థానంలో ఉంది.. కానీ అతి త్వరలోనే నంబర్ వన్ స్థానినికి చేరుకుంటుంది. ఈ మాట తన ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ అక్కడి పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలతో అన్న మాట. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులతో తరలిరావాలని నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా ట్రేడ్ అఅండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో మెల్ బోర్న్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్  రౌండ్ టేబుల్ సమావేశంలో  లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులకు 2029 నాటికి ఏపీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేందుకు లీప్  పేరుతో సంస్కరణలు అమలు చేస్తున్నామని  వివరించారు. ప్రధానంగా తాము 15 రంగాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పిన ఏపీ ఐటీ మంత్రి..  వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. త్వరలోనే నంబర్ వన్ అవుతామని గట్టిగా చెప్పారు.  ఏపీతో చేతులు కలిపి మీ ప్రాజెక్టులను సక్సెస్ చేసుకోవాలని చెప్పారు. అలాగే విశాఖలో జరగనున్న  గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.  కాగా సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న లోకేష్.. ఆంధ్రప్రదేశ్ ను  ఒక స్టార్టప్ స్టేట్ గా అభివర్ణించారు. చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్న ఆయన  ఏపీ కేవలం ఎంవోయూలు కుదుర్చుకోవడంతో సరిపెట్టదనీ, ఆయా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కోసం కృషి చేస్తుందని ఉదాహరణలతో సహా వివరించారు. ఒక సారి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని, ప్రాజెక్టు ప్రారంభించాలని నిర్ణయించుకుని మాతో చేతులు కలిపితే.. అది ఇక ఎంత మాత్రం కేవలం మీ ప్రాజెక్టుగా ఉండదనీ, అది మన ప్రాజెక్టు అవుతుందని అన్నారు. 

కర్నూలు ప్రమాద ఘటన మృతులకు తెలంగాణ సర్కార్ ఎక్స్ గ్రేషియా

కర్నూలు వద్ద జరిగిన  బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే క్షతగాత్రులకు ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల చొప్పున అందిచనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ  సమావేశంలో ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలు, వేగ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 

అమరావతి పనులపై ప్రపంచ బ్యాంక్ ఏమందంటే?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి జాప్యం లేకుండా నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగుతున్న పనులపై ప్రపంచ బ్యాంక్ సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రశంసల వర్షం కూడా కురిపించింది. అంతటితో ఆగకుండా   రెండో విడతగా అమరావతి నిర్మాణానికి 17వందల కోట్ల రూపాయల విడుదలకు పచ్చ జెండా ఊపింది.  ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ మూడు లేదా నాలుగోవారానికల్లా ఈ నిధులు ఏపీకి అందుతాయి.  ఈ నిధులతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయనడంలో సందేహం లేదు.  అమరావతి మొదటి దశ నిర్మాణానికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఈ ఏడాది మార్చిలో  తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేసింది కూడా. ఆనిధుల్లో   50 శాతం మేర నిధులను ప్రభుత్వం వివిధ పనులకు వ్యయం చేయడం కూడా జరిగిపోయింది. వరల్డ్ బ్యాంకు నిబంధనల మేరకు  తొలి విడత విడుదల చేసిన నిధుల్లో 75శాతం ఖర్చు చేసిన తరువాత మాత్రమే రెండో విడత నిధులు విడుదల అవుతాయి. అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నిధులలో ఇప్పటి వరకూ 50 శాతం వ్యయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొలి వారం నాటికి మరో పాతిక శాతం నిధులను కూడా రాజధాని నిర్మాణం కోసం వ్యయం చేయనున్నట్లు చెప్పింది. అమరావతిలో జరుగుతున్న పనులను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు కూడా ఈ పనుల వేగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకే డిసెంబర్ మూడు లేదా నాలుగో వారంలో రెండో విడత నిధులకు వరల్డ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భావించవచ్చు.  అమరావతి నిర్మాణానికి కేంద్రం గ్యారంటీతో వరల్డ్ బ్యాంకు నిధులను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇస్తున్న నిధులు ఎలా వినియోగం అవుతున్నాయన్న విషయంపై ఆ బ్యాంకు ప్రతినిథులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్న సంగతీ తెలిసిందే.   ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా  రూపొందుతోంది. అంటే అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. మొత్తం ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్(ఏడీబీ), కేంద్రం గ్రాంట్లతోనే నిర్మితమౌతోంది. ఇక ప్రపంచబ్యాంక్, ఏడీబీ రుణాల రూపంలో అందజేస్తున్న నిధులకు సంబంధించిన రీపేమెంట్ బాధ్యత అంతా కేంద్రానిదే.   దీంతో ఎవరెన్ని కుట్రలు పన్నిలా, అడ్డంకులు సృష్టించినా ఇక అమరావతి నిర్మాణ వేగం మందగించే అవకాశమే లేదని పరిశీలకులు అంటున్నారు.