మహిళల వన్డే వరల్డ్ కప్.. ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఇండియా

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్​ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా లీచ్ ఫీల్డ్  119 పరుగులతోనూ, ఎలీస్ పెర్రీ  77 పరుగులతోనూ చెలరేగడంతో   49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయ్యింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా 48.3 ఓటర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనలో  జెమీమా రోడ్రిగ్స్‌ అద్భుతంగా ఆడి 127 పరుగులతో నాటౌట్ గా నిలవగా, స్కిప్పర్ , హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 89 పరుగులతో రాణించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరగా, ఆస్ట్రేలియా జట్టు ఓటమితో టోర్నీ నుంచి వైదొలగింది. నవంబర్ 2న జరిగే ఫైనల్ లో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.   వరల్డ్ కప్ అందుకోవాలన్న లక్ష్యానికి టీమ్ ఇండియా విమెన్స్ టీమ్ ఒక్క అడుగు దూరంలో ఉంది. చావో రేవో అన్న సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఆసిస్ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.  జెమియా రోడ్రిగ్స్ అద్భుత సెంచరీలో చెలరేగింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీతో కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడింది. రఫ్పాడించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(89) సైతం అద్భుతంగా రాణించి సెంచరీ మిస్ చేసుకుంది.  తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లీచ్ ఫీల్డ్   దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమె 119 పరుగులు చేయగా, . ఎలీస్ పెర్రీ  77 పరుగులతో రాణించింది,  . ఆష్లీన్ గార్డ్‌నర్ చివరిలో మెరుపు ఇన్నినంగ్స్ ఆడి 66 పరుగులు చేసింది.  ఇక  భారత బౌలర్లలో శ్రీచరణి 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్, అమన్‌జ్యోత్ కౌర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

పెద్దవాగులో భార్యాభర్తలు గల్లంతు... ఒకరు మృతి

మొంథా తుపాను కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో   గత  నాలుగు రోజులుగా కురు స్తున్న  భారీ వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే రంగా రెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం  వద్ద ఉన్న పెద్ద వాగు వరద నీటితో పొంగి ప్రవహిస్తోంది.   ఆ క్రమంలో బైక్ పై వెడుతున్న దంపతులు  పెద్ద వాగు దాటుతుండగా... వరద ప్రవాహంలో  బైక్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. దీంతో భార్యాభర్తలు వాగులో పడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు, పోలీసు సిబ్బంది గమనించి వెంటనే వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భర్తను కాపాడగలిగారు. భార్య కృష్ణ వేణి వరదనీటిలో మునిగి మృతి చెందారు.  ఈ దంపతులు  ఇబ్రహీం పట్నం నేర్రపల్లి గ్రామంలోని బంధువుల ఇంటి నుంచి   భువనగిరి వెళ్తుం డగా ఈ ప్రమాదం జరిగింది.  

వారం రోజుల్లో పది కేసులు సాల్వ్.. 20 మంది అరెస్టు!

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఘనత క్రిమినల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న దాదాపు 20 మందిని హైదరాబాద్ క్రైమ్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేసి దాదాపు పది కేసులను ఛేదించారు.  వీటిలో మూడు కోట్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్,  డిజిటల్ వాలెట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులు కూడా ఉన్నారు. హైదరాబాద్ సైబర్ పోలీసులు  అక్టోబర్ 22 నుండి 28 వరకు అంటే వారం రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాలపై దృష్టి సారించి... మొత్తం 10 ప్రధాన కేసులను ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో మోసా లకు పాల్పడుతున్న   20 మందిని  అరెస్టు చేశాడు. విచారణలో దేశంలోని పలు రాష్ట్రాలలో సైబర్ నేరాలకు పాల్పడు తున్న ముఠాలు విస్తరించి ఉన్నట్లు గా తేలింది. అరెస్టు చేసిన 20 మందిలో  14 మంది ట్రేడింగ్ మోసాలకు పాల్ప డినట్లుగా పోలీ సులు గుర్తిం చారు. అరెస్టు చేసిన వారి వద్ద నుండి 24 మొబైల్ ఫోన్లు, 19 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పది కేసులలో ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ కేసు ప్రధానమైనది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయి మోసాలకు పాల్పడిన ముఠా వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ మోసంలో కంపెనీకి 3,0091,683 నష్టం వాటిల్లింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఇటువంటి మోసా లు జరిగినట్లుగా దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో ఐదుగురిని  అరెస్టు చేశారు.  చెన్నుపాటి శివ నారాయణ, కడలి నారాయణస్వామి, అడుగుల రాజ్ కుమార్, జడ్డా బ్రహ్మయ్య, పేరి చర్ల వర్మలు  ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయిలో మోసాలకు పాల్ప డ్డారు. ఈ ఏడాది మే నుండి జూలై వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ ఫ్లాట్ ఫామ్ లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా ఓ సంస్థ గుర్తించింది.  కంపెనీ అంతర్గత ఆడిట్ లో టిక్కెట్లు బుకింగ్ చేసిన సంఖ్య, వాస్తవ ఆదాయం మధ్య విపరీతమైన తేడా ఉన్నట్లుగా తేలింది. దీంతో అంతర్గత ఏజెంట్లు, కొంతమంది యూజర్లు వాలెట్ సిస్టంలో ఉన్న టెక్నికల్ లోపాన్ని ఉపయోగించి అక్రమంగా డబ్బులు సంపాదించినట్లుగా తేలింది.  ఈ నిందితులు వాలెట్ రీఛార్జ్ చేసుకొని టికెట్ బుక్ చేసే వారు. వెనువెంటనే ఆ టికెట్ రద్దు చేసేవారు. సాఫ్ట్వేర్ లోపం కారణంగా రిఫండ్ డబ్బు తిరిగి జమ అవ్వడమే కాకుండా అసలు వాలెట్లో ఉన్న మొత్తాన్ని కూడా రెండు సార్లు చూపించేది. ఈ అవకాశాన్ని ఉపయోగించి వారు మళ్ళీ మళ్ళీ అదే పని చేసేవారు. ఈ విధంగా ఫేక్ బ్యాలె న్స్ తో ఇతరులకు టికెట్లు బుక్ చేసి కస్టమర్ల దగ్గర నుండి నేరుగా తమ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకు నేవారు. నింది తులు ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ కోట్లలో డబ్బులు సంపాదిం చారు. అయితే ఈ విధంగా జరిగిన మోసాలను కంపెనీ గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీ సులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆన్లైన్ టికెట్ బుకింగ్ మరియు డిజిటల్ వాలంట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు చేసిన మోసా నికి కంపెనీకి మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లిన ట్లుగా దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాల బారిన పడకుండా సంస్థలు, వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా www. Cyber crime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు

వాట్సాప్ డీపీగా నారా లోకేష్ ఫొటో.. సైబర్ క్రైమ్ కు పాల్పడిన ఇద్దరు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేరు మీద లక్షల్లో లూటీ చేసిన సైబర్ క్రిమినల్స్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ఏకంగా మంత్రి  లోకేష్ పేరుతో  వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. బాధితులను బెదిరించి దాదాపు  54 లక్షల రూపాయలు లూటీ చేసిన నిందితులను సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు, సమాచారం మేరకు గతంలోనే రాజేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడిని విచారించి రాబట్టిన సమాచారం ఆధారంగా గురువారం (అక్టోబర్ 30) సాయి శ్రీనాథ్, సుమంత్ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.   ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న  సాయి శ్రీనాథ్, సుమంత్ లపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మొత్తం 9 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మరో నిందితుడు రాజేష్ తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 2.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

వరద ప్రవాహంలో యువతి గల్లంతు

మొంథా తుపాను ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై  చాలా తీవ్రంగా పడింది. గంటల వ్యవదిలోని భారీ వర్షపాతం నమోదు కావడంతో  వాగులూ, వంకలూ, నదులూ పొంగి పొర్లుతున్నాయి.  జనగామ జిల్లాలో ఎక్కడ చూసినా పొంగిపోర్లుతున్న వాగులూ, జలమయమైన రోడ్లు, ముంపునకు గురైన ప్రాంతాలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  బైకుపై మత్తడి దాటేందుకు ప్రయత్నించిన ఓ ప్రేమ జంట బైకుతో సహా వరదలో కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో యువకుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకోగా, యువతి శ్రావ్య మాత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘపూర్ మండలం తిమ్మాపూరు శివారులో చోటుచేసుకుంది.  గల్లంతైన యువతి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. గల్లంతైన యువతి హనుమకొండలోని వాగ్దేవీ కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో నివసిస్తుంటారనీ, కుమార్తెను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారనీ సమాచారం.  

సార్ నాకు బ్రేక‌ప్ అయ్యింది.. లీవ్ కావాలి!

నాట్ డేటింగ్ లో ప‌ని  చేసే ఒక ఎంప్లాయి త‌న బాస్ కి సెలవు కావాలి అంటూ పెట్టుకున్న అప్లికేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.  ఇంతకీ  ఆ యువకుడు తనకు లీవ్ కావాలంటూ తన బాస్ కు పంపిన సందేశం సారాంశం ఏమిటొ చూస్తే మీరు కూడా నోరెళ్ల బెడతారు అందులో సందేహం లేదు. సరే విషయానికి వస్తే..  సార్ నాకు ఇటీవ‌ల బ్రేక‌ప్ అయ్యింది. దీంతో ప‌ని మీద దృష్టి  సారించ‌లేకపోతున్నా.  ద‌య చేసి ఈ నెల 28 నుంచి- వ‌చ్చే నెల 8 వ తేదీ వ‌ర‌కూ బ్రేక‌ప్ లీవ్స్ కావాలి. కనుక మ‌న్నించి సెలవు మంజూరు చేయాల్సిందిగా  ప్రార్ధ‌న‌.. అంటూ ఆ యువకుడు త‌న  బాస్ కి  మెసేజ్ చేశాడు . ఆ అభ్యర్థనలో నిజాయితీ ఉంది. అది నచ్చి లీవ్ శాంక్షన్ చేసేశాను అని చెప్పారు ఆ సంస్థ సీఈవో జస్వీర్ సింగ్.  ఇప్ప‌టి  వ‌ర‌కూ పెళ్లి, ప్రెగ్నెన్సీ వంటి లీవ్స్ మాత్ర‌మే చూశాం. ఇది తాజా లీవ్ రీజ‌న్ గా  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. అత‌డి నిజాయితీ న‌చ్చింది అన్న ట్యాగ్ లైన్ తో ఈ రీజ‌న్ దూసుకుపోతోంది.  మాములుగా ఇలాంటి కార‌ణాలు చాలా మంది బ‌య‌ట‌కు చెప్పుకోరు. కార‌ణం  బ్రేక‌ప్ అన్న‌దాన్ని ఒక ఫెయిల్యూర్ లేదా అవ‌మాన‌ంగా భావిస్తుంటారు. కానీ కొంద‌రు ఔట్ స్పోక‌న్ ప‌ర్స‌న్స్ ఉంటారు. ఇటీవ‌లి కాలంలో.. ఈ టెండెన్సీ ఎక్కువ‌య్యింది.  ఈ మ‌ధ్య  జ‌నం ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫ‌ర్ చేయ‌డం మాత్ర‌మేకాదు.. ఆర్గానిక్ మైండ్ సెట్ పై కూడా పెద్ద ఎత్తున ఫోక‌స్ చేస్తున్నారు. సిల్లీ రీజ‌న్ అయినా.. అందులో నిజాయితీ ఉంటే వారికి ప్ర‌యారిటీ పెరుగుతోంది. అది గుర్తించాను కాబ‌ట్టే.. అత‌డు అడిగిన వెంట‌నే లీవు ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు ఆ సంస్థ సీఈవో.

2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన

ఏపీ ఫస్ట్ అన్నది చంద్రబాబు నినాదం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంథా రూపంలో పెను ముప్పు ఉన్నదన్న సమాచారంతో తుపాను నష్టాన్ని కనిష్టానికి తగ్గించి, ప్రజలను క్షేమంగా ఉంచడమే లక్ష్యంగా ఆయన గత మూడు రోజులుగా నిద్రాహారాలతో సంబంధం లేకుండా నిర్విరామంగా కృషి చేశారు. ఆయన కృషి, శ్రమ ఫలించాయి. తుపాను వల్ల రాష్ట్రానికి పెద్దగా నష్టం వాటిల్ల కూడదన్న ఆయన సంకల్పబలం ముందు మొంథా తుపాను తోకముడిచింది. అతి భీకరంగా తీరం వైపునకు దూసుకువచ్చిన తుపాను.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తీరం దాటి బలహీనపడింది. తుపాను విపత్తు నుంచి ఏపీని సురక్షితంగా బయటపడేసిన వెంటనే రాష్ట్రానికి ప్రగతి బాటలు పరిచే పనిలో నిగమ్నమైపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గత నాలుగు రోజులుగా తుపాను పరిస్థితిపై నిరంతర సమీక్షలు, రియల్ టైమ్ పర్యవేక్షణతో క్షణం తీరిక లేకుండా  గడిపిన చంద్రబాబు గురువారం ఉదయం కూడా తుపాను ప్రభావిత ప్రాంతాలల సమాయ పునరావాస చర్యలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన మరోమారు విదేశీ పర్యటనకు సిద్ధమైపోయారు. నవంబర్ 2 నుంచి అంటే ఆదివారం నుంచి చంద్రబాబు ఐదు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు.  పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా  చంద్రబాబు ఈ పర్యటనకు బయలు దేరు తున్నారు.  ఈ పర్యటనలో ఆయన పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో  భేటీ అవుతారు. విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌‌ కు పెట్టుబడిదారులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు  లండన్‌లో సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్‌ షోలో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లోని పెట్టుబడి అవకాశాలను    ఈ పర్యటనలో ఆయన పలు గ్లోబల్ కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి, పెట్టుబడుల సహకారం, టెక్నాలజీ మార్పిడి, ఉద్యోగావకాశాల సృష్టి వంటి అంశాలపై చర్చించనున్నారు. నవంబర్‌ 6న సీఎం చంద్రబాబు అమరా వతికి తిరిగి రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కదులుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన ముగించుకుని చంద్రబాబు నవంబర్ 6న అమరావతికి తిరిగి వస్తారు.  

మొంథా తుపాను ఎఫెక్ట్.. ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలు

మొంథా తుపాను తీరం దాటి 24 గంటలు దాటిపోయినా దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాపై  తీవ్రంగానే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో అయితే చారిత్రక నగరం వరంగల్ నీట మునిగింది. ఇక  ఏపీలోని ప్రకాశం జిల్లా మొంథా తుపాను కారణంగా అతలాకుతలమైంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 1.60 క్యూసెక్కుల నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో పలు గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే ముంపు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చదలవాడ విద్యుత్ సబ్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరడంతో ముందుకు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరో వైపు జిల్లా రైతాంగాన్ని మొంథా తుపాన్ కోలుకోలేని దెబ్బ తీసింది. తుపాను, భారీ వర్షాల కారణంగా జిల్లాలో 10 వేల 274 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 870. 18 హెక్టార్లలో ఉద్యనవన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.  ఇక తెలంగాణలో  తుపాను ప్రభావంతో  భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. మూసీ నది వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్ డ్యాం కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లను 10 అడుగుల మేర, 4 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 2 లక్షల 72 వేల 608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  దీంతో దిగువన ఉన్న గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. అధికారులు ఆయా గ్రామల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాగులు, కాలువల పరిసరాలలో ఉండవద్దంటూ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

నాలుగు నెలల్లోగా అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. మంత్రి నారాయణ

రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతి రైతులకు సంబంధించి ప్లాట్ల కే టాయింపు, రిజిస్ట్రేషన్ల లను నాలుగు నెలలలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చిందన్న ఆయన వచ్చే నాలుగు నెలల్లో మిగతా వారికి కూడా ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. తే సోషల్ మీడియాలో కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారని  వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రెజిస్ట్రేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారనీ, ప్రజలను తప్పుదోవపట్టించేలా కొందరు పోస్టులు పెడుతున్నారనీ, వాటిని నమ్మవద్దని అన్నారు.  అమరావతి రాజధాని నిర్మాణంకోసం అప్పట్లో  తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరించిన విషయం తెలిపిందే.  ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా    30,635 మంది రైతుల నుంచి సమీకరించిన 34,911.23 ఎకరాల భూమికి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాల్సి ఉన్న సంగతి విదితమే. ఇప్పటివరకూ 29,644 మంది రైతులు ఇచ్చిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తైందని మంత్రి నారాయణ వివరించారు. మిగిలిన వారికి కూడా నాలుగు నెలలలోపు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. 

ఇక ఫోన్లలో ట్రూకాలర్ యాప్ తో పని లేదు.. ఎందుకో తెలుసా?

ఇకపై మొబైల్ ఫోన్లలో  ట్రూకాలర్ యాప్‌ అవసరం లేదు. ఎందుకంటే..  ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కు మొబైల్ స్క్రీన్లపై ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. ఈ సౌలభ్యం వచ్చే ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు టెలికాం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి.  ఇన్నాళ్లూ మొబైల్‌ ఫోన్‌ లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వస్తే కేవలం నంబర్ మాత్రమే కనిపించేది. కాల్ చేసిన వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్‌ వంటి  యాప్స్‌ను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే వచ్చే ఏడాది మార్చి నుంచి ఇక ఆ అవసరం లేదు.  తొలుత ప్రయోగాత్మకంగా ఒక్కో సర్కిల్ లో ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్న టెలికాం సంస్థలు వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సౌలభ్యాన్ని దేశ వ్యాప్తంగా అందుబాటులోనికి తేనున్నాయి. డిజిటల్‌ అరెస్ట్‌ వంటి సైబర్‌ నేరాలను అరికట్టడం, మోసపూరిత కాల్స్‌ను నియంత్రించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను తీసుకురావాలని టెలికాం సంస్థలు చేసిన ప్రతిపాదనకు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఫోన్‌ కనెక్షన్‌ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని పేరు కనిపించేలా చేయడానికి ట్రాయ్‌ అంగీకరించింది.  

బ్రహ్మంగారి నివాసాన్ని పునర్నిర్మిస్తాం.. కలెక్టర్

మంథా తుఫాన్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురిసిన  వర్షాల కారణంగా కూలిపోయిన కాలజ్ణాని, జగద్గురు శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన నివాస గృహాన్ని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బుధవారం (అక్టోబర్ 29) రాత్రి  పరిశీలించారు. ఈ నివాసాన్ని తిరిగి అద్భుతమైన కట్టడంగా, ,భక్తుల‌మనోభావాలను గౌరవిస్తూ ముందున్న ఆకృతిలోనే నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.   ఈ సందర్బంగా అయన రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు, మఠ నిర్వాహకులు, బ్రహ్మంగారి గృహ సంరక్షకులతో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, గృహం కూలడానికి దారితీసిన కారణాలను ఆరా తీశారు.   ఈ పవిత్ర పురాతన గృహం మట్టి, పలకరాయి, చెక్క స్తంభాల ఆధారంగా నిర్మితమైనదనీ, దీర్ఘకాల వాతావరణ మార్పులూ, ఇటీవలి భారీ వర్షాల కారణంగా చెక్క స్తంభాలు బలహీనపడి, గోడలు కూలిపోయాయని  వారు కలెక్టర్ కు  వివరించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన కలెక్టర్  భక్తుల మనోభావాలనుగౌరవిస్తూ పునర్నిర్మిస్తామన్నారు.  ఇది కేవలం ఒక గృహం కాదు, భక్తుల ఆరాధనకు, మన సంస్కృతికి ప్రతీక అన్న ఆయన   ఈ పవిత్ర స్థలంలో, అదే రూపంలో, అదే నిర్మాణ శైలిలో  బ్రహ్మంగారి నివాసాన్ని  పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటాక్ సంస్థ సహకారంతో, పురాతన శైలిని కోల్పోకుండా, పూర్వపు మట్టి, రాయి, చెక్క వంటి పదార్థాలను ఉపయోగిస్తూ ప్రత్యేక ఆర్కిటెక్చర్ నిపుణుల సలహాలతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.అలాగే ధార్మిక పరిషత్ సలహాలు, తీసుకుంటామని తెలిపారు.

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి బుధ‌వారం (అక్టోబర్ 29) రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయించడాన్ని ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు ఈ విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు. రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 8 నుండి 9గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను తిరుమల తిరుపతి దేవస్థానం ర‌ద్దు చేసింది.   ఇలా ఉండగా శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం (అక్టోబర్ 30) పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత  మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

జలదిగ్బంధంలో వరంగల్ నగరం

మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం తడిసిముద్దైంది. నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బుధవారం (అక్టోబర్ 29) రోజంత ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లు నదులను తలపించాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి తగ్గలేదు.   ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. నగరంలోని దాదాపు 45 కాలనీలు జలమయమయ్యాయి. ఈ కాలనీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. సాయిగణేశ్‌ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్‌, ఎన్‌ఎన్‌ నగర్‌, మైసయ్యనగర్‌ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.   ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను పడవలలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  నగరంలో మొత్తం 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1200 మందిని వాటిలోకి తరలించారు.   భారీ వర్షాల కారణంగా బొందివాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి వరదల తీవ్రత దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.  

వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్టు.. ఏ కేసులోనో తెలుసా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీసీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్టయ్యారు.  వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం (అక్టోబర్ 29) అరెస్టు చేసింది.  తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో రాజకీయ సంబంధం ఉన్న అరెస్టు ఇదే మొదటిది కావడం విశేషం.   విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసకు చెందిన చిన్న అప్పన్న, హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలచూస్తుంటారు.  తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో చిన్న అప్పన్న కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారుల దర్యాప్తులో తేలడంతో అతడిని బుధవారం (అక్టోబర్ 29)  తిరుపతిలోని సిట్ కార్యాలయానికి విచారణ కోసం పిలిచారు.  అక్కడ చిన్న అప్పన్నను హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అరెస్టు చేశారు. ఆ వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి తర్వాత నెల్లూరు ఏసీబీ  న్యాయమూర్తి నివాసంలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో చిన్న అప్పన్నను ఏ 24గా పేర్కొన్నారు.   చిన్న అప్పన్నను ఇదే కేసులో సిట్ గత జూన్ 24న కూడా విచారణకు రావాల్సింగా నోటీసులు పంపింది. అయితే  ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ కొనసాగడాన్ని సవాల్ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై  హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించింది. సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది.  విచారణ మొదలైన కొద్ది రోజులకే ఈ కీలక అరెస్ట్ జరిగింది. చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందనీ, అంతే కాకుండా రానున్న రోజులలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందనీ అంటున్నారు. 

తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు

  మొంథా తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఐదు రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.  బుధవారం ఉదయం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి, పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో... తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సేకరించన సమాచారం వరకు పరిశీలిస్తే... రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు, ప్రత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్టు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను చూస్తుంటే... తుఫాన్ ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు. యధావిధిగా ఆర్టీసీ సర్వీసులు  సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి కల్లా విద్యుత్ సరఫరా చేయాలని, గురువారం నాటికి రహదారుల గుంతలు మరమ్మతు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు యధావిధి కొనసాగించాలని సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు.  మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలన్నారు. పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. జలాశయాల సమర్ధ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం, నిత్యావసరాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా తాగు నీటి సరఫరాకు ఇబ్బంది రాకూడదని, తాగునీరు కలుషితం అయితే సహించేది లేదని, డయేరియా కేసులు నమోదు కాకుండా రూరల్ వాటర్ సప్లయ్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. ప్రకాశం జిల్లాలో మెరుగైన చర్యలు చేపట్టాలి  ఒంగోలు పట్టణంలో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్‌లో పాలనా వైఫల్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. భవిష్యత్‌లో తుఫాన్ రక్షణ చర్యలపై పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రతీ జిల్లాలోనూ తుఫాన్ల సమయంలో తలెత్తే పరిస్థితులను అధిగమించేలా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  రోడ్లు, పునరావాస కేంద్రాలు, విద్యుత్-తాగునీటి సరఫరా వంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజాభిప్రాయం సేకరించి, లోపాలను సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారని అధికారులు వెల్లడించగా, మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తుఫాన్ తీవ్ర స్థాయిలో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని, ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలపై ప్రజల నుంచి సానుకూల స్పందన, సంతృప్తి వ్యక్తమవుతోందని వెల్లడించారు. మొత్తం 1.16 లక్షల మందికి పునరావాసం  రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో 1.16 లక్షల మందికి మొంథా తుఫాను సమయంలో ఆశ్రయం లభించింది. మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం చూపింది. రాష్ట్రంలో 380 కి.మీ. పొడవున పంచాయతీరాజ్ రహదారులు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతినగా  రూ.4.86 కోట్ల నష్టం వాటిల్లింది. 2,294 కి.మీ. పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిని రూ.1,424  కోట్ల నష్టం సంభవించింది.  రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల వరకు నష్టం జరిగింది. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించారు. 2,130 మెడికల్ క్యాంపుల నిర్వహించారు. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తొలిగించారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సీఎస్ విజయానంద్ సహా ఇతర ఉన్నతాధికారులు 

బీజేపీకి షాక్...కాంగ్రెస్‌లో చేరిన మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. వెంగళరావునగర్ మాజీ కార్పొరేటర్,బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్,  సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో  చేరారు. బీజేపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇటీవల షేక్‌పేట్ నుంచి పోటీ చేసిన మాజీ కార్పొరేటర్ చర్కా మహేష్ బీజేపీకి రాజీనామా చేసిన బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కమలం పార్టీకి ఒకరి తర్వాత ఒకరు నేతలు రాజీనామాలు చేస్తున్నారు.  కాంగ్రెస్ ప్రజాపాలన విధానాలు తనను నచ్చయని కిలారి మనోహర్ అన్నారు. గతంలో తాను కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌పై దాడులు జరిగిన సందర్భంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ తనకు అండగా నిలిచారని, ఈ ఎన్నికల సమయంలో వారికి కృతజ్ఞతగా కాంగ్రెస్‌లో చేరుతున్నానని కిలారి మనోహర్ పేర్కొన్నారు.   జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కిలారి మనోహర్ కాంగ్రెస్‌‌లో చేరటం హస్తం పార్టీకి మరింత బలం చేకురుతుంది. ఈ నియోజకవర్గంలో కమ్మ ఓట్లు గణనీయంగా ఉండటంతో కాంగ్రెస్‌‌కు ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు.  

మెడికల్ కాలేజీల పీపీపీ నిర్ణయంపై జోక్యంపై హైకోర్టు తిరస్కరణ

  పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. అది చట్టవిరుద్దం అయితే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవని ఏపీ హై కోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలని పిటిషనర్ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.  కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణని నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ - 590ని సవాల్ చేస్తూ తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కొర్రా వసుంధర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టులో వేసిన పిల్‌పై తాజాగా విచారణ జరిగింది.  ఈ వ్యాజ్యంపై పిటీషన్ తరపున హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరాం, మరో న్యాయవాది అశోక్ రాం వాదనలు వినిపించారు. టెండర్లు ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని న్యాయవాదులు అభ్యర్థించారు. న్యాయవాదుల అభ్యర్థనని తిరస్కరించింది హైకోర్టు. కాలేజీలు, ఆస్పత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలో లాభ, నష్టాలను సమగ్రంగా పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది.

జలదిగ్బంధంలో వరంగల్ రైల్వే స్టేషన్

  తీవ్ర తుపాను మొంథా ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్‌ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని తరువాత కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, ఉరుసులో 23.7, సంగెంలో 23.48 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే విధంగా జనగామ జిల్లా గూడూరులో 23.58, వర్ధన్నపేట (వరంగల్)లో 22.8, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, మహబూబాబాద్‌ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్‌ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోకి వరద నీరు చేరింది. పట్టాలపైకి రెండు అడుగుల మేర నీరు నిలవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ను నిలిపివేయగా, ప్రయాణికులను బస్సుల ద్వారా గమ్యస్థానాలకు తరలించారు.ఇక మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఐదు గంటల పాటు నిలిచిపోయింది. ట్రాక్‌పై నీరు తగ్గకపోవడంతో రైలును వరంగల్‌కు తిరిగి పంపి, దారి మళ్లించారు. అలాగే గుండ్రాతిమడుగు నుంచి వరంగల్‌కు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్ను కూడా మళ్లించారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆహారం, తాగునీరు అందించేందుకు పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. మానవతా సేవలు అందించిన పోలీసులను డీజీపీ అభినందించారు. ఇదిలా ఉండగా, డోర్నకల్‌ రైల్వే స్టేషన్‌ను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. భారీ వర్షాలతో వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువుల్లా మారాయి. మోటార్ల సహాయంతో అధికారులు వరదనీటిని బయటకు పంపే పనులు చేస్తున్నారు.

భద్రాచలానికి 50 కి.మీల దూరంలో మొంథా తుఫాన్

  మొంథా తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది. భద్రాచలానికి దక్షిణ ఆగ్నేయంగా 50 కి.మీల దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశముందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయుగుండం కదలిందని పేర్కొంది. రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.   తెలంగాణలో ఒకట్రెండు ప్రాంతాలకు ఆకస్మిక వరద హెచ్చరికలను విశాఖ వాతావరణ కేంద్రం జారీ చేసింది. పలు ప్రాంతాల్లో 35-45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.  దీంతో ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు హనుమకొండ, వరంగల్, మహబూబ్ బాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తాజాగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించింది.