మరో ఘోర రోడ్డు ప్రమాదం...12మంది మృతి

  రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హర్మద ఏరియాలోని సికర్ రోడ్డులో వాహనలపై డంపర్ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. అతి వేగంతో వచ్చిన ట్రక్కు నియంత్రణ కోల్పోయి ఎదురు వస్తున్న వాహనాలను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాదాపు 5 కి. మీ. మేర వాహనాలను ఢీకొడుతూ వెళ్లింది.  ట్రక్కు డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది.రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.    

అన్న క్యాంటీన్లు... దేవాలయాలు : రామ్మోహన్ నాయుడు

  శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల్లో  కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తో కలసి పర్యటించారు. ఈ సంధర్భంగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. తొలుత కోటబొమ్మాళి లో పార్టీ కార్యాలయంలో జిల్లా వాసుల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం కోటబొమ్మాళి డిసిసిబి భవనానికి శంకుస్థాపన చేశారు. కోటబొమ్మాళి వీధులను పరిశీలించి అభివృద్ధికి పలు సూచనలు చేశారు.  అనంతరం కోటబొమ్మాళి ప్రధాన రహదారిలో అన్నా క్యాంటీన్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా అక్కడివారికి భోజనాన్ని వడ్డించడం తో పాటు.. తర్వాత వారితో కలసి అన్నా క్యాంటీన్ లోనే మంత్రులు భోజనం చేశారు. అన్న క్యాంటీన్ పరిసరాలు, భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సంధర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, స్వయంగా వడ్డించడం, వారితో కలసి భోజనం చెయ్యడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..  బృహత్తర లక్ష్యంతో అన్నా క్యాంటీన్ లను ప్రారంభించారని.. ఇక్కడ భోజనం చేసే వాళ్ళ కళ్లలో సంతోషం వెలకట్టలేనిది అని అన్నారు.  గత సర్కారు అన్నదానానికి కూడా రాజకీయం అంటగట్టారని.. తద్వారా ఎంతోమంది నష్టపోయారని స్పష్టం చేశారు. వారు ఈ పథకాన్ని నిర్వీర్యం చెయ్యాలని చూసినా.. చంద్రబాబు గారి స్పూర్తితో రాష్ట్రంలో చాలా చోట్ల నిర్విరామంగా పథకం తెదేపా శ్రేణులు కొనసాగించాయని, టెక్కలి నియోజకవర్గంలో బాబాయ్ అచ్చెన్నాయుడు, తాను ఈ పథకాన్ని కొనసాగించిన సంగతిని గుర్తు చేశారు.  కూటమి సర్కారు కొలువు తీరిన తరువాత మరింత వేగంతో అన్నా క్యాంటీన్ లో రాష్ట్రంలో ఏర్పడ్డాయని, కోటబొమ్మాళి లో కూడా రెండు నెలల వ్యవధిలో అన్నా క్యాంటీన్ ఏర్పడింది అంటే.. అది అచ్చెన్నాయుడు పనితీరుకు నిదర్శనం అని తెలిపారు. ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసిపోని నాణ్యత, పోషక విలువలతో అన్నా క్యాంటీన్ లో భోజనం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.  సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లు దేవాలయాలు అని రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు.  కోటబొమ్మాళికి, కింజరాపు కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని..  ఇక్కడ గెలిచిన వాళ్ళు కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు అంటే స్థానిక ప్రజల ప్రేమనే కారణం అని స్పష్టం చేశారు. ఇప్పటికే అభివృద్ధి దిశగా వేగంగా దూసుకుపోతున్న కోటబొమ్మాళి ను మోడల్ మండలం గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. యాభై ఏళ్లకు సరిపడా అభివృద్ధి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, కొత్తమ్మ తల్లి ఆలయాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, శ్రేణులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు : మంత్రి పొన్నం

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారికంగా ఇప్పటి వరకూ 19 మంది చనిపోయారని మంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలను కుటుంబాలకు రూ.5 లక్షలు, ఆర్టీసీ తరుపున మరో రూ. 2 లక్షల  క్షతగాత్రులకు రూ. 2 లక్షల  పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతోంది. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 19 మందిలో 13 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు. ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

  రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌ ముగ్గురు కుమార్తెలు  తనూష, సాయి ప్రియ, నందిని హైదరాబాద్‌లో చదువుతున్నారు. ఇటీవల పెళ్లి ఉండటంతో సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.  మరోవైపు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన అఖిలరెడ్డి అనే యువతి కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. ఎంబీఏ చదువుతున్న కుమార్తె మృతితో అఖిల తల్లి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనాస్థలానికి వచ్చి బోరున విలపించారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లివేడుకలో సందడిగా గడిపిన ఈ ముగ్గురూ ఇవాళ విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

ఈ టీచర్లు ఏంటో ?

  దైవంతో సమానంగా భావించే పరిస్థితి నుంచి కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. అందులో మహిళా టీచర్లు ప్రమేయం ఉండడం బాధాకరమైన విషయం ఇప్పుడు సమాజం ఇలాంటి ఉపాధ్యాయుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది విశాఖలోని సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేని సాయి తేజ ఎందుకు అకాల మరణం చెందరన్న విషయంపై విద్యార్థులు ఆందోళన చెందారు కారణాలు అన్వేషించారు. అయితే అతని స్నేహితులు ఇచ్చిన సమాచారంతో మొబైల్ డేటాను పరిశీలించారు అందులో ఊహించని నమ్మలేని నిజాలు కనిపించాయి. ఆ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు సాయి తేజ తో విభిన్నంగా చాటింగ్ చేశారు.  అందులో ఒకరు సన్నిహితం అవ్వాలన్న ప్రయత్నం చేస్తే మరొకరు ఆ విషయాన్ని తెలుసుకొని బ్లాక్మెయిలింగ్ చేశారు. అలా ఇద్దరు టీచర్ల విభిన్న ఒత్తిడితో సాయి తేజ మానసికంగా దిగులు చెందాడు. అందుకే అతను ప్రాణం తీసుకున్నాడాని కుటుంబ సభ్యులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎంపీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఇద్దరు మహిళ టీచర్లను వెంటనే అరెస్ట్ చేయాలని సాయి తేజ కుటుంబ సభ్యులు కాలేజీ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.  ఈ విషయం ఇప్పుడు నెటిజన్లలో చర్చగా మారింది విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లు ఈ రకంగా ప్రేమ వ్యామోహం తో డిగ్రీ విద్యార్థిని మానసికంగా వేధించడం సరికాదంటున్నారు. అయితే ఇలాంటి వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో బయటికి వచ్చినప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు ఆపోజిట్ సెక్స్ విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పురుష టీచర్లు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది కానీ ఇప్పుడు విశాఖలోని సమతా కాలేజ్ వ్యవహారంలో మహిళ టీచర్ల తప్పుడు ప్రవర్తన గాడి తప్పిన సమాజానికి ఒక చిరునామాగా చెప్పుకుంటున్నారు

మొన్న వ‌ర్మ ఈ సారి వ‌ర్మ... శ‌ర్మ ఇద్ద‌రూ వండ‌ర్స్

  మొన్న ఆసియా  క‌ప్ తిల‌క్.. వ‌ర్మ రూపంలో భార‌త్ ప‌రం  కాగా..నేడు విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర్మ‌, శ‌ర్మ ఇద్ద‌రూ క‌లిసి  భార‌త్ కి ప్ర‌పంచ కప్పు సాధించి పెట్టారు. ఎప్ప‌టిలాగానే సౌతాఫ్రికా ఫైన‌ల్స్ ఫీవ‌ర్ తో క‌ప్పు చేజార్చుకోవ‌డంలో వీరు కీల‌క పాత్ర పోషించారు.  ఇంత‌కీ ఎవ‌రా  శ‌ర్మ- వ‌ర్మ అంటే దీప్తీ  శ‌ర్మ‌- ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ కాగా,. అదే ష‌ఫాలీ శ‌ర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచి.. ఈ కాంబోకి తిరుగులేద‌ని నిరూపించారు.  ఇంత‌కీ  దీప్తీ  శ‌ర్మ ఈ సీరీస్ మొత్తంలో సాధించిన  వికెట్లు ఎన్ని? ష‌ఫాలీ ఈ మ్యాచ్ లో చూపించిన మ్యాజిక్ ఎలాంటిదో చూస్తే.. ష‌ఫాలీ  వ‌ర్మ ఈ మ్యాచ్ లో 87 ప‌రుగులు సాధించి.. త‌ద్వారా  గౌర‌వ‌ప్ర‌ద‌మైన  స్కోరు ప్ర‌త్య‌ర్ధి ముందుంచ‌డంలో కీల‌క  పాత్ర  పోషించింది. ఇక దీప్తీ  శ‌ర్మ ఈ టోర్నీలో 215 పరుగులు సాధించ‌డంతో పాటు 22 వికెట్లతో ఆల్ రౌండ్ షో చేసి చూపించింది, అర్ధ సెంచరీ సాధించడం మాత్ర‌మే కాక‌ ఫైనల్‌లో కీలకమైన ఐదు వికెట్లు పడగొట్టి, దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్‌కు క‌ప్పు సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించింది. ఒక టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన రికార్డును సైతం బ‌ద్ద‌లు కొట్టిందీ దీప్తి శ‌ర్మ‌.  ఈ టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసిన  విమెన్ క్రికెట‌ర్స్ లో టాప్ గా నిలిచింది. నిజం చెప్పాలంటే ఇదొక క‌ల‌లాగా అనిపిస్తోంది. ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ లో తాను జ‌ట్టుకు ఇంత ఉప‌యోగ‌ప‌డ‌తాన‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని అంటారు దీప్తి. ఎనీ హౌ కంగ్రాట్స్ దీప్తీ అండ్ ష‌ఫాలీ అండ్ ఆల్ విమెన్ క్రికెట‌ర్స్ అంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా వీరిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది.  

చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా?

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొదట ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలుపగా.. తాజాగా వాటి సంఖ్య 25కి చేరింది. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. యాక్సిండెట్‌కు రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్ధానికులు అంటున్నారు. రోడ్డు చిన్నగా ఉండటం రద్దీ వల్ల తరచూ ప్రమాదలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితమే 4 వరుసల రహదారి మంజూరు అయిందని తెలిపారు. రోడ్డు విస్తరిస్తే చేట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యూనల్‌కు వెళ్లారన్నారు. దీంతో పనులు  ఆగిపోయాని స్ధానికులు తెలిపారు. మరోవైపు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిప్పర్‌ రాంగ్‌రూట్‌లో వచ్చి బస్సును ఢీకోట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారని తెలిపారు. మరోవైపు  సహాయ చర్యల పర్యవేక్షణకు సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం కోసం 9912919545, 9440854433 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం  ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు  తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు.  అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని , అందుకు అవసరమైన  అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు. చేవేళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై, ఎప్పటికప్పుడు అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని  డీజీపీ, సీఎస్‌తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు.  ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని  సీఎం ఆదేశించారు. బస్సు ప్రమాదనికి రోడ్డు సరిగా లేకపోవడమే కారణమని స్ధానికులు అంటున్నారు. రోడ్డు చిన్నగా ఉండటం రద్దీ వల్ల తరచూ ప్రమాదలు జరుగుతున్నాయని వారు వాపోయారు. ఐదేళ్ల క్రితమే 4 వరుసల రహదారి మంజూరు అయిందని తెలిపారు. రోడ్డు విస్తరిస్తే చేట్లు నాశనం అవుతాయని కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యూనల్‌కు వెళ్లారన్నారు. దీంతో పనులు  ఆగిపోయాని స్ధానికులు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి

హైదరాబాద్ సమీపంలో  సోమవారం (నవంబర్  3) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది దుర్మరణం పాలయ్యారు.  మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.  తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా    చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో  కంకర లోడుతో అతి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.  ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణీకులు ఉన్నట్లు చెబుతున్నారు.   బస్సులో ఉన్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులే  అని చెబుతున్నారు.  ఆదివారం (నవంబర్ 2) సెలవు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లి.. తిరిగి సోమవారం (నవంబర్3) హైదరాబాద్‌లోని కాలేజీలకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.  పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఒకే రోజు.. ఇండియా రెండు అద్భుత విజయాలు

ఒకటి ఇస్రో సీఎంఎస్03 ప్రయోగం.. రెండు విమెన్ క్రికెట్ టీమ్ విశ్వవిజేతగా నిలవడం ఇండియా ఆదివారం(నవంబర్ 2) రెండు చిరస్మరణీయమైన విజయాలను సాధించింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయేలా సాధించిన ఈ విజయాలు భారత కీర్తి కిరీటంలో మరో రెండు కలికితురాయిలుగా నిలిచాయి. భారత్ ఒకే రోజు రెండు వేర్వేరు రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. ఒకటి అంతరిక్ష ప్రయోగంలో ఇస్రో సాధిస్తే.. రెండోది క్రీడా రంగంలో భారత మహిళలు సాధించారు. ముందుగా ఇస్రో సాధించిన ఘనత విషయానికి వస్తే..  శ్రీహరికోట నుంచి   ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. . ఈ విజయం భారత్‌ కమ్యూనికేషన్‌ రంగాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. . ఈ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపిన సీఎంఎస్ 03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహం భారత భూభాగంతో పాటు సమీప సముద్ర ప్రాంతాలపై విస్తృత కవరేజ్‌ అందిస్తుంది. కనీసం 15 సంవత్సరాలపాటు సేవలు అందించేలా రూపొందించిన ఈ మల్టీ బ్యాండ్‌ ఉపగ్రహం అత్యున్నత సాంకేతికతతో రూపొందింది.  ఈ  ప్రయోగ సమయంలో  వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఇస్రో సైంటిస్టులు  సవాళ్లన్నిటినీ అధిగమించి  విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సి 25  క్రయోజెనిక్‌ ఇంజిన్‌  ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన అనంతరం,  మళ్లీ విజయవంతంగా రీ ఇగ్నైట్‌ చేయడం ద్వారా భవిష్యత్తులో ఒకే మిషన్‌లో పలు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ఉంచే సాంకేతిక సామర్థ్యానికి మార్గం సుగమం అయ్యిందని చెప్పాలి.  . ఈ ప్రయోగం భారత అంతరిక్ష ప్రగతిలో కీలక మలుపు, ముందడుగు అని ఇస్రో చీఫ్ అన్నారు. ఇక రెండో అద్భుత విజయం.. 47 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సారిగా వన్డే వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించి సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.  ఆల్ మోస్ట్ ఎలాంటి అంచనాలూ లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతం సృష్టించింది. నాకౌట్ స్టేజికి ముందు మూడు పరాజయాలతో.. అసలు సెమీస్ కైనా చేరుతుందా అన్న అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే హర్మన్ ప్రీత్ సేన అనూహ్యంగా, అనితర సాధ్యమన్న రీతిలో పుంజుకుంది. ఇంతకు ముందు రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ వరకూ వచ్చి కూడా కప్ అందుకోలేకపోయిన టీమ్ ఇండియా.. ఈ సారి మాత్రం కప్పు సాధించాలన్న పట్టుదలతో ఆడింది.  సెమీ ఫైనల్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల నుంచి విజయం దిశగా అద్భుత పోరాటం చేసి గెలిచింది.  ఆ క్రమంలో వన్డేల్లో మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఫైనల్ లోనూ ఒత్తిడిని తట్టుకుని దక్షిణాఫ్రికాపై 52 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి గర్వంగా కప్ ను ముద్దాడింది.    

విశ్వవిజేతగా నిలిచిన మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి, మోడీ అభినందనలు

వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని  మోడీ అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో పాలుపంచుకున్న ప్రతి క్రీడాకారిణికీ హృదయపూర్వక అభినందనలు అంటూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. తొలి సారి విశ్వవిజేతగా నిలవడం ద్వారా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అలాగే ఈ విజయాన్ని ఒక చారిత్రకఘట్టంగా అభివర్ణించిన ప్రధాని మోడీ,  ఈ విజయం భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.  జట్టులో అందరూ సమష్టిగా రాణించారని పేర్కొన్న ఆయన జట్టులోని ప్రతిఒక్కరినీ హృదయపూర్వకంగా అబినందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మహిళల వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా.. హర్మన్ ప్రీత్ సేన విజయనాదం

ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత మహిళల క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది.  పైనల్ మ్యాచ్ లో భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచారు.  టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు  299 విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిలబడింది. 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ ను ముద్దాడింది.  ఈ విజయంతొ భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందనే చెప్పాలి. 1993లో భారత జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తరువాత ఇండియాలో క్రికెట్ రూపురేకలు ఎలా మారిపోయాయో, క్రికెట్ కు ఆదరణ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఇప్పుడు మహిళల క్రికెట్ లొ టీమ్ ఇండియా విజయం దేశంలో మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ పెంచుతుందనడంలో సందేహం లేదు.  సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసంతో ఫైనల్ లోకి ప్రవేశించిన హర్మన్ ప్రీత్ సేన.. దక్షిణాఫ్రికాపైనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియాకు అద్భుత ఆరంభాన్నిచ్చింది ఓపెనింగ్ జంట స్మృతి మంధాన, ఫెపాలి వర్మ. షెపాలి వర్మ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇక స్మృతి మంధానా 45 పరుగులు చేసింది. వీరిరువురూ తొలి వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఆ తరువాత ఆల్ రౌండర్ దీప్తి శర్మ వంద శాతం స్ట్రైక్ రేట్ తో 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 398 పరుగులు చేసింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఒవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా స్కిప్పర్ లారా వోల్వార్ట్ ఒంటరి పోరాటంతో 101 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో దీప్పి శర్మ 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాశించింది. దీంతో భారత మహిళల జట్టు తొలి సారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాణించిన షెపాలీవర్మ ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ గా నిలవగా టోర్నీ మొత్తం స్థిరంగా రాణించిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది. 

మూడో టీ20లో భారత్ ఘన విజయం...సుందర్ విధ్వంసం

  ఆస్ట్రేలియాతో జరిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187పరుగుల లక్ష్యంతో దిగిన టీమిండియా  కేవలం 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగగా, జితేష్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్) నిలిచారు. ఈ మ్యచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన ఆ ఆస్ట్రేలియా టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా 186 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 25, సూర్యకుమార్ 24, తిలక్ వర్మ 29 రన్స్ చేశారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది.   

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... భారత్‌ బ్యాటింగ్‌

  ఐసీసీ  మహిళల వన్డే ప్రపంచకప్‌  ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాస్‌ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. భారత్, సౌతాప్రికా జట్లు రెండూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ గెలవలేదు. దీంతో చారిత్రక విజయం కోసం ఇరు జట్లూ తలపడుతున్నాయి. అయితే, భారత్‌కు కాస్త అనుకూలత ఉంది.  గతంలో రెండుసార్లు (2005, 2017) ఫైనల్ ఆడిన అనుభవంతో పాటు, సొంతగడ్డపై భారీ సంఖ్యలో అభిమానుల మద్దతు లభించనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఈ వేదికపై మూడు మ్యాచ్‌లు ఆడింది. మరోవైపు, దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి. భారత్‌: షెఫాలీ, మంధాన, రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌, దీప్తిశర్మ, రిచా ఘోష్‌, అమన్‌జ్యోత్‌, రాధా యాదవ్‌, క్రాంతి, శ్రీచరణి, రేణుక సింగ్‌. సౌతాఫ్రికా: వోల్వార్ట్‌, బ్రిట్స్‌, అనెకె, సున్‌ లూస్‌, కాప్‌, సినాలో, డెర్క్‌సెన్‌, ట్రయాన్‌, క్లర్క్‌, ఖాక, ఎంలబా  

లండన్‌లో చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం

  సీఎం చంద్రబాబు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన చంద్రబాబు దంపతులకు విమానాశ్రయంలో తెలుగు కుటుంబాలు ఆత్మీయ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అక్కడి తెలుగువారితో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకోనున్నారు. లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది.  సామాజిక సేవా రంగంలో నారా భువనేశ్వరి అందిస్తున్న విశేష కృషికి గుర్తింపుగా 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్' అవార్డును ఆమెకు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా, కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు 'గోల్డెన్ పీకాక్' అవార్డు లభించింది. హెరిటేజ్ ఫుడ్స్ అధినేతగా ఈ పురస్కారాన్ని కూడా నారా భువనేశ్వరి అందుకోనున్నారు. ఎల్లుండి జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ రెండు అవార్డులను అందుకోనున్నారు.

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

  శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు   కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.15లక్షల పరిహారాన్ని అందజేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో రెండు లక్షల సాయం అందుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి సానుభూతి తెలిపారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 9మంది భక్తులు చనిపోగా 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే  ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.  అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి  15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని.... దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. 

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఎర్రన్నాయుడు : సీఎం చంద్రబాబు

  కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్బంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.  ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డడిగా, ఉన్నత విలువలకు ప్రతిరూపంగా, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా జాతీయ రాజ‌కీయాల్లో సైతం త‌న‌దైన ముద్ర వేసిన తెలుగుతేజం, నా ఆత్మీయ నేస్తం స్వర్గీయ కింజరాపు ఎర్రం నాయుడు వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నాను అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని మంత్రి లోకేశ్‌ అన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి ఎర్రన్నాయుడు అందించిన సేవలను స్మరించుకుందామన్నారు.