తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోం మంత్రి అనిత

  అనకాపల్లి  జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. వరద భాదితులను రాష్ట్ర ప్రభుత్వం  అన్ని విధాలా  ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.  శుక్రవారం  పాయకరావుపేట నియోజకవర్గం యస్. రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి, ప్రజల యోగక్షేమాలు మంత్రి  అడిగి తెలుసుకున్నారు.  తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు.  బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ పూరిళ్ళు మరియు ఐదు సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో భర్త మృతిచెందిన  మైలిపల్లి సత్తియ్యమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి అనిత  సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసారు.  బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ, మైలిపల్లి సత్తియ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను మంత్రి  ఆదేశించారు.  ఎన్.ఎ.ఒ.బి.  ప్రహారి గోడ వలన ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలుపగా తక్షణమే ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను హోం మంత్రి  ఆదేశించారు. ఈ సంధర్బంగా హోం మంత్రి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి  నారా లోకేష్  తుఫాన్ నేపథ్యంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్దంచేయడంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగినట్లు తెలిపారు. 15 రోజుల్లో బంగారమ్మపాలెం గ్రామంలో రోడ్డు వేయడం జరుగుతుందని, మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో పాటు ఇతర కులాల వారికి కూడా తుఫాను ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు.  గ్రామంలో  సోలార్ ఫ్యానల్ ద్వారా  చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, డ్వాక్రా మహిళలతో ఫైలట్ ప్రాజెక్ట్ గా సోలార్ ఫ్యానల్ ద్వారా చేపల ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు.  తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న   ఇళ్ళకు తక్షణమే  పక్కా గృహాలు మంజూరుకు  అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరుగుతుందన్నారు. బంగారమ్మపాలెం గ్రామంలో ఉన్న చిన్న,చిన్న సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

నీట మునిగిన పంట పొలాలను గుర్తించండి : సీఎం చంద్రబాబు

  మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన కాపాడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ తదనంతర చర్యలపై శుక్రవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి శనివారం కల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గం వారీగా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి... ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడకి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు.  అందరూ కలిసి సమన్వయంతో పని చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని... పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా తగు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60 శాతం మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల జిల్లాలో మాత్రం ఆదివారం నాటికి నీటి నిల్వలు లేకుండా చేస్తామని విన్నవించారు.  కేంద్రాన్ని తక్షణ సాయం కోరండి మొంథా తుఫాన్‌తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని సీఎం చెప్పారు.  అలాగే కృష్ణా నదిలో ప్రస్తుతం కొనసాగుతున్న నీటి నిల్వల వివరాల గురించి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అలాగే మొంథా తుఫాన్‌ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని ఆయన అధికారులకు నిర్దేశించారు. శనివారం ఉదయం 10 గంటలకు సుమారు 100 మందిని గౌరవించుకునేలా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.  

గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి : సీఎం చంద్రబాబు

  అమరావతి నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు పూర్తి చేశారు..? వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది..? నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనేదానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఏయే భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని... ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు.. నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు.  ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత మేర జాప్యం జరిగినా.. రానున్న రోజుల్లో  దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మెషీనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని... ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని  అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.  రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తైందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ, అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులు  అందించారు.  ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని.. ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నామో..గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.  రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు. ఇక ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి వరల్డ్ క్లాస్ సిటీ లుక్ రావాలంటే హైరెయిజ్ బిల్డింగులు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో డిజిటల్ మోసం..రూ.51 లక్షల స్వాహా

  హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వీరి వలలో చిక్కి రూ.51 లక్షలు పోగొట్టుకున్నారు. అస‌లేం జ‌రిగిందంటే..! బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీనని పరిచయం చేసుకున్నాడు. బాధితుడి మొబైల్ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారని, అతని పేరు మీద ఇతరులు మరికొన్ని సిమ్ కార్డులు తీసుకున్నారని నమ్మబలికాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటూ సీబీఐ పేరుతో ఉన్న నకిలీ నోటీసులను కూడా చూపించి తీవ్రంగా బెదిరించాడు. ఆ తర్వాత బాధితుడిని వీడియో కాల్ ద్వారా 'డిజిటల్ అరెస్ట్' చేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా, బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కేసు నుంచి బయటపడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులో 95 శాతం బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు, వారు చెప్పిన ఖాతాలకు రూ.51 లక్షలు బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో ఈ వారంలో ఇలాంటి తరహాలో జరిగిన రెండో భారీ మోసం ఇది. కొన్ని రోజుల క్రితమే, 73 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ నేరగాళ్లు ఇదే పద్ధతిలో రూ.1.43 కోట్లు మోసం చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్, హత్య కేసుల్లో నిందితుడి వద్ద ఆమె ఆధార్ కార్డు దొరికిందని, అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు కాజేశారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని కొందరు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తులు అధికారులుగా చెప్పుకుని ఫోన్లు చేస్తే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్‌

  హనుమకొండలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. సమ్మయ్య నగర్‌లో దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు. అనంతరం వరద బాధితులను నేరుగా కలిసి వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. సమస్యలపై స్థానికులు ముఖ్యమంత్రి వారి గోడును విన్నవించారు. అంతకు ముందు సీఎం రేవంత్ హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్ లో తుపాను ముంపు ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను వీక్షించనున్నారు.  కలెక్టర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గురువారమే ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో రద్దు అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే సాధ్యం కాదని అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మొంథా తుపానుతో ఉమ్మడి వరంగల్ జిల్లా, సిద్ధిపేట జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగింది. ఇళ్లు నీటమునిగాయి. వరద నీరు  ఇళ్లలోకి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.  

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

  కర్ణాటకలోని బెంగుళూరుకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్ట్ పై పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూక పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగుళూరు రోడ్డు, బార్లపల్లి వద్ద శుక్రవారం వాహనాల తనిఖీచేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.  ఈ క్రమంలో రెండు బైకుల్లో సుమారు 22 కిలోల గంజాయి తరలిస్తూన్న బెంగళూరుకి చెందిన ఇర్ఫాన్(43), చిన్నమండెం కు చెందిన సయ్యద్ జాఫర్ వల్లి(54), మదనపల్లె కాలనీ గేటుకు చెందిన శివకుమార్ (22) లు పట్టుబడగా, నిందితుల వద్ద 22 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  అనంతరం వారిపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

చర్చలు సఫలం...ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం

  ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గత 20 రోజులుగా ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రాథమికంగా రూ.250 కోట్ల బకాయిలు విడుదల చేసింది. దశల వారీగా మిగిలిన బకాయిలూ చెల్లిస్తామని ప్రకటించింది. అయినా సమ్మె కొనసాగించడంతో మొత్తం బకాయిలు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద నవంబర్‌ చివరికల్లా చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. ఆస్పత్రుల యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది.

మ‌హిళ‌లూ మీరు క్రికెట్ మ‌హ‌రాణులు!

ఓడిపోయిన జట్టు మైదానంలో కుప్పగూలి ఏడ్వటం, గెలిచిన జట్టు విజయనాదం చేస్తూ సంబరాలు జరుపుకోవడం మాత్రమే తెలిసిన క్రికెట్  అభిమానులకు.. గురువారం (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నమైన సీన్ చూశారు గురువారం రాత్రి ఇండియా, ఆస్ట్రేలియా  జట్ల మధ్య విమెన్స్ వరల్ట్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్  జరిగింది. ఇప్పటికే 7 సార్లు ప్రపంచ కప్ గెలిచిన బలమైన ఆసీస్ జట్టు అంత సులభంగా చేజింగ్ టీమ్ కి విజయాన్ని కట్టబెడుతుందని ఎవరిలోనూ ఏ కోశానా నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో భారత మహిళలు అద్భుతం సృష్టించారు.  ఎన్నడూ లేనివిధంగా మూడో స్థానంలో ఆడాలని  మ్యాచ్ కు అయిదు నిమిషాలకు ముందు టీమ్ యాజమాన్యం చెబితే మైదానంలోకి వచ్చిన ముంబై ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి గట్టి పునాది వేయడమే కాకుండా కెప్టెన్ అవుట్ అయిన తర్వాత ఆమె చేయవలసిన స్కోర్ ను కూడా తానే చేస్తానని, చివరి బంతి వరకు నిలిచి పోరాడతానన్న  సంకల్ప బలంతో ముందుకు సాగింది. 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టే క్రమంలో ఎన్నిసార్లు ఆమె అలసిపోయిందో.. కొండలా కనబడుతున్న స్కోరు వణికిస్తున్న క్షణాల్లో కూడా  నిలబడు, గట్టిగా నిలబడు నీకు దేవుడు సహాయం చేస్తాడు అంటూ త‌న‌కు తాను చెప్పుకుని స్ఫూర్తి పొందిందో  మహిళా క్రికెట్ చరిత్రలో, వన్ డే ప్రపంచ కప్ చరిత్రలో కనివిని ఎరుగని చిరస్మరణీయ విజయాన్ని ఇండియా జట్టుకు కట్టబెట్టిన క్షణాల్లో సింహనాదమూ, పెనురోదనా కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి నిన్న కళ్లకు కట్టింది.   తోటి బ్యాటర్  అమన్ జీత్ విజయానికి అవసరమైన చివరి ఫోర్ సాధించాక స్టేడియంలో జేమీమా రోడ్రిగ్స్ కుప్పగూలి విలపించడం, స్టేడియంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతిమంథానా, సహచర క్రీడాకారిణులు కోచ్‌ని, సహాయక సిబ్బందిని గట్టిగా కౌగలించుకుంటూ రోదించడం. ఒక విన్నింగ్ జట్టు శక్తినంతా కూడదీసుకని అద్బుతాన్ని సృష్టించామన్న భావనతో ఆనంద భాష్పాలను ఒలికించడం... తమ కళ్ల ముందు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే భార‌త‌ మహిళల జట్టు విజయాన్ని సాధించ‌డం చూసి అంత మేటి క్రీడాకారులున్న ఆసీస్ మహిళా జట్టు షాకై పోయి చూస్తూ క‌న్నీరు కార్చింది. మైదానంలోని ఇరు జట్లూ విజయ పరాజయాలను పక్కనబెట్టి విలపిస్తుంటే స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు మోద‌మో ఖేద‌మో తెలీని స్థితిలో తాము సైతం కన్నీళ్లు పెట్టడం.. నభూతో నభవిష్యతి అనడం అతిశయోక్తి కాదేమో. గత వరల్ట్ కప్ లో జట్టులో స్థానం కోల్పోయి షాక్ కి గురైన జేమీమా.. ఈ సారి వరల్డ్ కప్‌ జట్టుకు ఎంపికై కూడా చివరి 11 మంది జట్టులో  ఆడతానా లేనా.. అనే అందోళతోనే గడిపిన జెమీమా భారత జట్టు ఆశలను తనవిగా చేసుకుని హీరో చితమైన అత్యుత్తమ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తీవ్రమైన అలసట, శక్తి కోల్పోయిన దశలో కూడా బైబిల్ లోని  నువ్వు గట్టిగా నిలబడు జీసస్ నీకు సాయం చేస్తాడు అన్న మాటలతో తనలో తనే స్ఫూర్తి పింపుకుంటూ ఆమె సాగించిన పోరాటం, అనితర సాధ్యమన్న బ్యాటింగ్ ప్రదర్శన జెనీమా జన్మ ధన్యం అని చెప్పవచ్చు.  ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ రికార్డు ఛేజింగ్ స్కోర్‌ను బద్దలు గొట్టిన ఘటన కావచ్చు. అంతకుమించి 338 పరుగుల భారీ స్కోరును చూసి  ఓటమి తప్పదనుకుంటున్న అభిమానులు, ప్రేక్షకుల హృదయాలు ఉప్పొంగేలా మన మహిళా జట్టు చేసిన విజయనాదం. కీలక మ్యాచ్ లలో వెనుకంజ వేస్తూ తలదించుకుంటున్న క్షణాలను పక్కనబెట్టి..  ఇది నేను సాధించిన ఫిప్టీ, హండ్రెడ్ కాదు, నా ఘనత కానే కాదు ఇది జట్టు విజయం కోసం ఆడుతున్న అత్యుత్త‌మ‌ ఆట, జట్టును గెలిపించాలని పడుతున్న తపన  అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని జెమిమా ఆడిన ఆట ఇది.  ఏ క్రీడలో అయినా ఆనంద భాష్పాల‌ స్థితిని ఈ స్థాయిలో ప్రపంచం ఎన్నడూ చూసి ఉండదు. గెలిచిన జట్టు, ఓడిన జట్టు కూడా విలపించడం ఎన్నడూ చూసి ఉండం. రెండు దశాబ్దాల పాటు  భారత జట్టుకు ఆడి 2017 మహిళా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఓటమి చవిచూసి చేష్ట్యలుడిగిన స్థితిలోనూ నిబ్బరంగా తేరుకుని నిలిచి ప్రెస్ మీట్‌లో విషాదపు క్షణంలోనూ హుందాగా మాట్లాడిన మిథాలీ రాజ్ గుండె నిబ్బరాన్ని ప్రపంచమంతా చూసిందప్పుడు. కంటి చుక్క బయటకు రాకుండా విషాదాన్ని కళ్లలో దాచుకుని నిబ్బరానికి నిర్వచనంగా నిలిచిన మిథాలీని ఆనాడు చూశాం. అది ఆమెకే చెల్లు అనుకున్నాం. కానీ ఈ 2025 అక్టోబర్ 30న ఒక రివర్స్ అద్భుతం క్రీడా ప్రపంచాన్ని కమ్మేసింది. గెలుపు ఓటములను సమాన స్థితిలో చూడాలని బయటకు అందరం చెప్పవచ్చు..  కానీ మైదానంలో అతి పెద్ద స్కోరును ఛేదించాకా..  దాన్ని నిలబెట్టుకోవాలని చూసిన జట్టుకు, ప్రాణాలొడ్డి దాన్ని ఛేదించిన జట్టుకు ఒకేలాంటి స్థితి క‌నిపించ‌డం అరుదు. ఎనీ హౌ కంగ్రాట్స్ జ‌మీమా. ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ బెట‌ర్ ఫ్యూచ‌ర్. అండ్ వ‌న్స్ అగైన్ క‌మాన్ ఇండియా. ఈ సారి క‌ప్పు మ‌న‌దే  కావాల‌ని కోరుతోంది.. స‌మ‌స్త భార‌తీయం

టీమ్ ఇండియా మహిళల జట్టుపై ప్రశంసల వర్షం

మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సెమీఫైనల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దాయాది దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు కూడా టీమ్ ఇండియా మహిళల జట్టుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ భారీ లక్ష్యాన్ని కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఇంకా 9 బంతులు మిగిలుండగానే ఛేదించడం చూస్తుంటే.. అద్భుత ఫామ్ లో ఉన్న భారత మహిళల జట్టు ఈ టోర్నీలో విజేతగా నిలవడం తథ్యమనిపిస్తోందని కనేరియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన అద్భుత సెంచరీతో భారత్ ను విజయతీరాలకు చేర్చిన  జెమీమా రోడ్రిగ్స్‌ ను ఆకాశానికెత్తేశాడు. ఆమె అద్భుత బ్యాటింగ్ స్కిల్స్.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు విజయాన్నందించిందన్నాడు. భారత మహిళల జట్టు చాలా గోప్పగా ఆడుతోందనీ, జట్టు సమష్టిగా విజయకాంక్షతో ఉరకలేస్తోందనీ ప్రశంసించారు. భారత ఆటగాళ్ల ఫిట్ నెస్ స్థాయి గణనీయంగా మెరుగుపడిందన్న కనేరియా ఇది భారత మహిళల క్రికెట్‌ భవిష్యత్ కు గొప్ప శుభసూచికంగా అభివర్ణించారు. 

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చిత్తూరు  అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ హత్య కేసులో మేయర్ అనూరాధ భర్త తరఫు బంధువు సహా ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించారు. ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.   ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ హత్య జరగడాన్ని  పదేళ్ల క్రితం ఈ హత్య జరిగింది.   మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్ లు మృతి చెందారు.   2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ హత్యలు  జరిగాయా.   ఈ కేసులో మేయర్ దంపతుల మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు ఇరవై రెండు మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాధ్, వెంకటేశ్ లపై నేరం రుజువు కావడంతో వీరికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. 

తిరుమల మెట్ల మార్గంలో చిరుత

తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు ఆ మార్గంలో వన్యప్రాణుల సంచారం భయాందోళనలకు గురి చేస్తున్నది. తరుచుగా అలిపిరి నడకమార్గం, మెట్ల మార్గంలో చిరుతల సంచారం కనిపిస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం తిరుమతి మెట్ల మార్గంలో 150వ మెట్టు వద్ద చిరుతను గమనించిన భక్తులు గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోనికి పారిపోయింది. విషయాన్ని భక్తులు వెంటనే   తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.  ఆందోళన అవసరం లేదనీ, మెట్ల మార్గంలో భక్తులు ఎవరూ ఒంటరిగా సంచరించవద్దనీ, ఆ మార్గంలో గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లాలనీ సూచించారు. చిరుత మళ్లీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు.  ఏది ఏమైనా తరచుగా చిరుతలు సంచరిస్తుండటంతో భక్తులు తమ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారాన్ని అరికట్టడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

మొంథా తుపాను నష్టం రూ.5, 265 కోట్లు

మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 5 వేల 265 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుపాను నష్టం, కష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (అక్టోబర్ 30) రోజంతా వివిధ సాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తుపాను ప్రభావానికి గురైన ప్రతి ప్రాంతం, మండలం, గ్రామం నుంచి సమాచారం రాబట్టారు.  మొంథా తుపాను కారణంగా పంటలకు, రహదారులకు జరిగిన నష్టంపై పూర్తి వివరాలు సేకరించారు.   అనంతరం తుపాను కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టం విలువ 5 వేల 265 కోట్ల రూపాయలుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సమీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... తుపానును ఆపలేం కానీ, స్పష్టమైన విజన్ తో, ముందు జాగ్రత్తలు తీసుకుంటే భారీ నష్టం వాటిల్లకుండా నివారించవచ్చునని నిరూపించామని చెప్పారు. తుపాను కారణంగా ప్రాణనష్టం వాటిల్లకుండా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు.  తుపాను నష్టం ఎంతన్నది ప్రాథమిక అంచనా వేశామనీ, ఎన్యుమరేషన్ జరిగిన తరువాత పూర్తి నష్టం ఎంతన్నది తేలుతుందని వివరించారు.  మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామన్న చంద్రబాబు కేంద్రం ఆదుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.   తుపాను సమయంలో అధికారలు, సిబ్బంది చాలాబాగా పని చేశారనీ, తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రతి ఇంటినీ జియో ట్యాగ్ చేయడం ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామనీ వివరించారు. ఆ కారణంగానే ప్రాణనష్టం లేకుండా చేయగలిగామనీ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చేయగలిగామనీ అన్నారు. ఇక పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామన్నారు. పాడైన రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తామని చెప్పారు.  

తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పగబట్టాడా?

తెలుగు రాష్ట్రాలపై వర్షాలు పగబట్టాయా అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే.. మొన్న ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటిన పెను తుపాను మొంథా ప్రభావం ఇంకా  కొనసాగుతుండగానే బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. వచ్చే నెల 4 నాటికి అండమాన్  సమీపంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాలకు మరో సారి భారీ నుంచి అతి భారీ వర్షాల బెడద తప్పదని పేర్కొంది.  అదలా ఉంటే  తెలుగు రాష్ట్రాలలో మొంథా తుపాను ప్రభావంతో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మారు భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడింది. తీర ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

ఆహార సంక్షోభం ముంగిట అగ్రరాజ్యం

షట్‌డౌన్ ఎఫెక్ట్ తో అమెరికా  తీవ్ర ఆహార సంక్షోభం ముంగిట నిలిచింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన షట్ డౌన్ కారణంగా   ఆహార సాయం నిలిచిపోనున్న నేపథ్యంలో న్యూయార్క్ రాష్ట్రం  ఎమర్జెన్సీ ప్రకటించింది.  అత్యవసర ఆహార సహాయం కోసం రాష్ట్రం తరఫున 65 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నామని న్యూయార్క్ మేయర్ ప్రకటించారు.  ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అమెరికాలో అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన  సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్ఏపీ) ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత కారణంగా నవంబర్ నెల ఎస్ఎన్ఏపీ ప్రయోజనాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేయాలని   అమెరికా వ్యవసాయ శాఖ  రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది.  షట్ డౌన్ కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకుం టున్నాయి.  లూసియానా గవర్నర్   గత వారమే అత్యవసర పరిస్థితి ప్రకటించి, ఎస్ఎన్ఏపీ లబ్ధి దారులకు ప్రయోజనం చేకూరేలా  రాష్ట్ర నిధులు కేటాయించారు. అదే విధంగా వెర్మంట్ రాష్ట్రం వచ్చే నెల  15 వరకు   నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. న్యూ మెక్సికో   30 మిలియన్ డాలర్ల అత్యవసర ఆహార సహాయాన్ని ప్రకటించింది. షట్ డౌన్  నేపథ్యంలో అమెరికాలోని పాతిక  రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్లు అత్యవసర నిధులు వినియోగించే అధికారం తమకు లేదంటున్న  ప్రజలకు ఆహార సాయం కొనసాగించేందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని వారా దావాలో కోరారు.  

ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులు

లోహపురుష్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్  నుంచి పటేల్ విగ్రహంపై పూలవర్షం కురిపించారు. దేశ ఐక్యతకు పటేల్ చేసిన కృషిని ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.   దేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషిగా పిలుచుకునే సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి వేడుకలు శుక్రవారం (అక్టోబర్ 31)   గుజరాత్‌లోని ఏకతా నగర్‌లో ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమంలో  పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం( అక్టోబర్ 30) న ఏక్తానగర్ కు చేరుకున్నారు.  శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం సర్దార్‌ పటేల్‌ 597 అడుగుల భారీ ఐక్యతా విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు.  అనంతరం వేడుకలకు విచ్చేసిన పౌరులు, అధికారులతో ఏకతా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. అదే సమయంలో అధికారులు హెలికాప్టర్‌ నుంచి సర్దార్‌ వల్లభ్​బాయ్‌ పటేల్‌ విగ్రహంపై పూలవర్షం కురిపించారు.

భిక్షాటన నిషేధం.. ఏపీ సర్కార్ జీవో

ఆంధ్రప్రదేశ్ లో భిక్షాటనపై నిషేధం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేచసింది.    'భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025కు రాష్ట్రగవర్నర్ ఈ నెల 15న  ఆమోదముద్ర వేయగా.. 27న ఏపీ గెజిట్‌లో  ప్రచురితమైంది. దీంతో ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.58 విడుదల చేసింది. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖలు సమన్వయంతో అమలు చేయనున్నాయి.   రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో ఈ చట్టాన్నీ తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.   భిక్షాటనను నిషేధిస్తూ చట్టం అమలులోకి రావడంతో ఇకపై రాష్ట్రంలో  ఎక్కడ భిక్షాటన చేసినా.. తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే ఈ చట్టం కింద యాచకుల్ని శిక్షించరు. ప్రభుత్వాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థల సాయంతో వారికి పునరావాసం కూడా కల్పిస్తారు. ఇప్పటికే మిజోరం   భిక్షాటనను నిషేధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ఇప్పుడు ఏపీ కూడా రాష్ట్రంలో భిక్షాటనను నిషేధించింది. 

నారా రోహిత్ వివాహం..హాజరైన చంద్రబాబు, లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొదరుడు నారా రామ్మూర్తి నాయుడి కుమారుడు, నటుడు నారా రోహిత్ వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. చంద్రబాబు దంపతులు, లోకేష్ దంపతులు ఈ వివాహానికి హజరై వధూవరులు రోహిత్, శిరీషల  ఆశీర్వదించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు. మా ఇంట పెళ్లి సందడి.. మా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, శిరీషల వివాహం ఘనంగా చేశాం అని పేర్కొన్నారు. ఈ వివాహవేడుక మా కుటుంబానికి ఒక పండుగ అంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ణతలు తెలిపారు.  

కిలో నెయ్యికి పాతిక రూపాయల కమిషన్.. చిన్న వెంకన్న రిమాండ్ రిపోర్ట్

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో అరెస్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఆయన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలను ప్రస్తావించారు. జగన్ హయాంలో తిరుమలకు సరఫరా అయిన నకిలీ నెయ్యి వెనుక చిన్న అప్పన్నదే కీలక పాత్ర అని గుర్తించారు. తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చేందుకు భోలేబాబా సంస్థ నుంచి చిన్న అప్పన్న కిలో నెయ్యికి పాతిక రూపాయలు కమిషన్ కోరినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో చిన్న అప్పన్న టీటీడీ వ్యవహారాలన్నీ తానై నడిపించాడని కూడా సిట్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు చెబుతున్నారు.  చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో సీట్ కీలక అంశాలను పేర్కొంది. చిన్న అప్పన్న వైవీసుబ్బారెడ్డి హయాంలో టీటీడీ బోర్డును సైతం ప్రభావితం చేశాడనీ, భోలేబాబా సంస్థ కిలో నెయ్యికి పాతిక రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి నెయ్యి కాంట్రాక్ట్ నుంచి బోలేబాబా సంస్థను తప్పించడంలో చిన్న అప్పన్నదే కీలక పాత్ర అని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అంతే కాకుండా ప్రీమియర్ అగ్రిఫుడ్ సంస్థకు నెయ్యి కాంట్రాక్ వచ్చేలా కూడా చిన్న అప్పన్న చక్రం తిప్పారని పేర్కొంది.   ఆ సంస్థ  ఎక్కువ మొత్తంలో కోట్ చేసి.. క‌మీష‌న్లు ఇచ్చేందుకు అంగీక‌రించడమే అందుకు కారణమని సిట్చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. 

రైతన్నకు అండగా నిలుస్తాం.. పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  ప‌వ‌న్ క‌ల్యాణ్ మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్ప పొలాలను పరిశీలించారు.  కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం (అక్టోబర్ 30) ప‌ర్య‌టించిన ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో బురదలో నడుస్తూ వెళ్లి మరీ నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు.  రైతుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుని వారికి ఆదుకుంటామన్న భరోసా ఇచ్చారు,  తుఫాను ప్ర‌భావంతో ప్రాణ న‌ష్టం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంట‌లు, ఇళ్ల‌కు న‌ష్టం క‌లిగింద‌ని.. దీని నుంచి రైతుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. అనంత‌రం అవనిగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ప్రభావ దృశ్యాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ పరిశీలించారు. జ‌రిగిన న‌ష్టాన్ని క‌లెక్ట‌ర్ బాలాజీ ని అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు అంద‌రూ నిరంత‌రం తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప‌రిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం వల్లనే   ప్రాణ న‌ష్టం కలగలేదన్న పవన్ కల్యాణ్.. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.    న‌ష్టాల‌ను అంచ‌నా వేసి ప్ర‌తి ఒక్క‌రికీ ప్రభుత్వం  న్యాయం చేస్తుంద‌న్నారు.