ఒకే రోజు.. ఇండియా రెండు అద్భుత విజయాలు

ఒకటి ఇస్రో సీఎంఎస్03 ప్రయోగం.. రెండు విమెన్ క్రికెట్ టీమ్ విశ్వవిజేతగా నిలవడం ఇండియా ఆదివారం(నవంబర్ 2) రెండు చిరస్మరణీయమైన విజయాలను సాధించింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయేలా సాధించిన ఈ విజయాలు భారత కీర్తి కిరీటంలో మరో రెండు కలికితురాయిలుగా నిలిచాయి. భారత్ ఒకే రోజు రెండు వేర్వేరు రంగాల్లో అద్భుత విజయాలు సాధించింది. ఒకటి అంతరిక్ష ప్రయోగంలో ఇస్రో సాధిస్తే.. రెండోది క్రీడా రంగంలో భారత మహిళలు సాధించారు. ముందుగా ఇస్రో సాధించిన ఘనత విషయానికి వస్తే..  శ్రీహరికోట నుంచి   ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. . ఈ విజయం భారత్‌ కమ్యూనికేషన్‌ రంగాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. . ఈ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపిన సీఎంఎస్ 03 కమ్యూనికేషన్‌ ఉపగ్రహం భారత భూభాగంతో పాటు సమీప సముద్ర ప్రాంతాలపై విస్తృత కవరేజ్‌ అందిస్తుంది. కనీసం 15 సంవత్సరాలపాటు సేవలు అందించేలా రూపొందించిన ఈ మల్టీ బ్యాండ్‌ ఉపగ్రహం అత్యున్నత సాంకేతికతతో రూపొందింది.  ఈ  ప్రయోగ సమయంలో  వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఇస్రో సైంటిస్టులు  సవాళ్లన్నిటినీ అధిగమించి  విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సి 25  క్రయోజెనిక్‌ ఇంజిన్‌  ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన అనంతరం,  మళ్లీ విజయవంతంగా రీ ఇగ్నైట్‌ చేయడం ద్వారా భవిష్యత్తులో ఒకే మిషన్‌లో పలు ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో ఉంచే సాంకేతిక సామర్థ్యానికి మార్గం సుగమం అయ్యిందని చెప్పాలి.  . ఈ ప్రయోగం భారత అంతరిక్ష ప్రగతిలో కీలక మలుపు, ముందడుగు అని ఇస్రో చీఫ్ అన్నారు. ఇక రెండో అద్భుత విజయం.. 47 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సారిగా వన్డే వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించి సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.  ఆల్ మోస్ట్ ఎలాంటి అంచనాలూ లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతం సృష్టించింది. నాకౌట్ స్టేజికి ముందు మూడు పరాజయాలతో.. అసలు సెమీస్ కైనా చేరుతుందా అన్న అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే హర్మన్ ప్రీత్ సేన అనూహ్యంగా, అనితర సాధ్యమన్న రీతిలో పుంజుకుంది. ఇంతకు ముందు రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ వరకూ వచ్చి కూడా కప్ అందుకోలేకపోయిన టీమ్ ఇండియా.. ఈ సారి మాత్రం కప్పు సాధించాలన్న పట్టుదలతో ఆడింది.  సెమీ ఫైనల్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల నుంచి విజయం దిశగా అద్భుత పోరాటం చేసి గెలిచింది.  ఆ క్రమంలో వన్డేల్లో మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఫైనల్ లోనూ ఒత్తిడిని తట్టుకుని దక్షిణాఫ్రికాపై 52 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి గర్వంగా కప్ ను ముద్దాడింది.    

విశ్వవిజేతగా నిలిచిన మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి, మోడీ అభినందనలు

వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని  మోడీ అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో పాలుపంచుకున్న ప్రతి క్రీడాకారిణికీ హృదయపూర్వక అభినందనలు అంటూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. తొలి సారి విశ్వవిజేతగా నిలవడం ద్వారా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అలాగే ఈ విజయాన్ని ఒక చారిత్రకఘట్టంగా అభివర్ణించిన ప్రధాని మోడీ,  ఈ విజయం భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.  జట్టులో అందరూ సమష్టిగా రాణించారని పేర్కొన్న ఆయన జట్టులోని ప్రతిఒక్కరినీ హృదయపూర్వకంగా అబినందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మహిళల వరల్డ్ కప్ విజేత టీమ్ ఇండియా.. హర్మన్ ప్రీత్ సేన విజయనాదం

ఉత్కంఠ పోరులో టీమిండియాదే విజయం మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత మహిళల క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది.  పైనల్ మ్యాచ్ లో భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచారు.  టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు  299 విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిలబడింది. 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రపంచ కప్ ను ముద్దాడింది.  ఈ విజయంతొ భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందనే చెప్పాలి. 1993లో భారత జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తరువాత ఇండియాలో క్రికెట్ రూపురేకలు ఎలా మారిపోయాయో, క్రికెట్ కు ఆదరణ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఇప్పుడు మహిళల క్రికెట్ లొ టీమ్ ఇండియా విజయం దేశంలో మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ పెంచుతుందనడంలో సందేహం లేదు.  సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసంతో ఫైనల్ లోకి ప్రవేశించిన హర్మన్ ప్రీత్ సేన.. దక్షిణాఫ్రికాపైనా అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియాకు అద్భుత ఆరంభాన్నిచ్చింది ఓపెనింగ్ జంట స్మృతి మంధాన, ఫెపాలి వర్మ. షెపాలి వర్మ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇక స్మృతి మంధానా 45 పరుగులు చేసింది. వీరిరువురూ తొలి వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఆ తరువాత ఆల్ రౌండర్ దీప్తి శర్మ వంద శాతం స్ట్రైక్ రేట్ తో 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 398 పరుగులు చేసింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఒవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా స్కిప్పర్ లారా వోల్వార్ట్ ఒంటరి పోరాటంతో 101 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో దీప్పి శర్మ 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాశించింది. దీంతో భారత మహిళల జట్టు తొలి సారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాణించిన షెపాలీవర్మ ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ గా నిలవగా టోర్నీ మొత్తం స్థిరంగా రాణించిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దక్కింది. 

మూడో టీ20లో భారత్ ఘన విజయం...సుందర్ విధ్వంసం

  ఆస్ట్రేలియాతో జరిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187పరుగుల లక్ష్యంతో దిగిన టీమిండియా  కేవలం 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగగా, జితేష్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్) నిలిచారు. ఈ మ్యచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన ఆ ఆస్ట్రేలియా టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా 186 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 25, సూర్యకుమార్ 24, తిలక్ వర్మ 29 రన్స్ చేశారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది.   

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా... భారత్‌ బ్యాటింగ్‌

  ఐసీసీ  మహిళల వన్డే ప్రపంచకప్‌  ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాస్‌ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. భారత్, సౌతాప్రికా జట్లు రెండూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ గెలవలేదు. దీంతో చారిత్రక విజయం కోసం ఇరు జట్లూ తలపడుతున్నాయి. అయితే, భారత్‌కు కాస్త అనుకూలత ఉంది.  గతంలో రెండుసార్లు (2005, 2017) ఫైనల్ ఆడిన అనుభవంతో పాటు, సొంతగడ్డపై భారీ సంఖ్యలో అభిమానుల మద్దతు లభించనుంది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే ఈ వేదికపై మూడు మ్యాచ్‌లు ఆడింది. మరోవైపు, దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో ఇక్కడ ఆడటం ఇదే తొలిసారి. భారత్‌: షెఫాలీ, మంధాన, రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌, దీప్తిశర్మ, రిచా ఘోష్‌, అమన్‌జ్యోత్‌, రాధా యాదవ్‌, క్రాంతి, శ్రీచరణి, రేణుక సింగ్‌. సౌతాఫ్రికా: వోల్వార్ట్‌, బ్రిట్స్‌, అనెకె, సున్‌ లూస్‌, కాప్‌, సినాలో, డెర్క్‌సెన్‌, ట్రయాన్‌, క్లర్క్‌, ఖాక, ఎంలబా  

లండన్‌లో చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం

  సీఎం చంద్రబాబు దంపతులు లండన్ చేరుకున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన చంద్రబాబు దంపతులకు విమానాశ్రయంలో తెలుగు కుటుంబాలు ఆత్మీయ స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అక్కడి తెలుగువారితో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకోనున్నారు. లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది.  సామాజిక సేవా రంగంలో నారా భువనేశ్వరి అందిస్తున్న విశేష కృషికి గుర్తింపుగా 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్' అవార్డును ఆమెకు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా, కార్పొరేట్ పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు 'గోల్డెన్ పీకాక్' అవార్డు లభించింది. హెరిటేజ్ ఫుడ్స్ అధినేతగా ఈ పురస్కారాన్ని కూడా నారా భువనేశ్వరి అందుకోనున్నారు. ఎల్లుండి జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ రెండు అవార్డులను అందుకోనున్నారు.

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

  శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు   కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.15లక్షల పరిహారాన్ని అందజేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో రెండు లక్షల సాయం అందుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి సానుభూతి తెలిపారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 9మంది భక్తులు చనిపోగా 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే  ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.  అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి  15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని.... దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. 

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఎర్రన్నాయుడు : సీఎం చంద్రబాబు

  కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్బంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.  ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డడిగా, ఉన్నత విలువలకు ప్రతిరూపంగా, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా జాతీయ రాజ‌కీయాల్లో సైతం త‌న‌దైన ముద్ర వేసిన తెలుగుతేజం, నా ఆత్మీయ నేస్తం స్వర్గీయ కింజరాపు ఎర్రం నాయుడు వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నాను అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.  ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని మంత్రి లోకేశ్‌ అన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి ఎర్రన్నాయుడు అందించిన సేవలను స్మరించుకుందామన్నారు.

లేడీ కానిస్టేబుల్‌ను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన విద్యార్థినులు

  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. ప్రిన్సిపాల్ శైలజ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆమెను తక్షణం సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.  విద్యార్థినులు ఆరోపించిన ప్రకారం  ప్రిన్సిపాల్ ఫండ్స్ విడుదల చేయడం లేదని, ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని, ఒక్కొక్కరి నుంచి రూ.3,000 చొప్పున ఫీజులు వసూలు చేశారని తెలిపారు. అంతేకాకుండా కుల పేరుతో దూషించిందని కూడా ఆరోపించారు.ఆందోళనను నియంత్రించేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  ఈ క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, కొంతమంది విద్యార్థినులు ఆమెపై దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక విద్యా శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  

బీఆర్ఎస్ కార్యాలయానికి నిప్పు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్‌లో ఫర్నీచర్‌ బయటపడేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా.. చేసుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.  మరోవైపు మణుగూరు తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తుందని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.  కాంగ్రెస్‌ నేతలు నిప్పు పెట్టడంతో చుట్టుపక్కల ఇండ్లలో షార్ట్‌ సర్య్కూట్‌ అయ్యి గృహోపకరణాలకు నష్టం వాటిల్లింది. దీంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది.

భారీ పేలుడు... 23 మంది మృతి

  మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.  రాష్ట్ర గవర్నర్‌ అల్ఫోన్సో డురాజో ఈ ఘటనను ధ్రువీకరించారు.  పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పేలుడుకు గల స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు.మెక్సికో రాష్ట్ర గవర్నర్‌ అల్ఫోన్సో ఈ ప్రమాద ఘటనపై వీడియో ద్వారా స్పందించారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటూ, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ కూడా ఎక్స్‌ ద్వారా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ అల్ఫోన్సోతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ఇందుకోసం రెస్క్యూ బృందాలను వెంటనే పంపించాలని అంతర్గత వ్యవహారాల కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్జ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

  తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం  30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వేంకటేశ్వర స్వామిని దర్శించుకోగా 31,612 మంది తలనీలాలు సమర్పించారు.  హూండీ ద్వారా రూ. 2.98 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఉదయం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.వి.రవీంద్రబాబు, తమిళనాడు మంత్రి రామచంద్ర, హీరో నారా రోహిత్ దంపతులు దర్శించుకున్నారు.  

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్

  కల్తీ మద్యం కేసులో వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం సిట్‌ అధికారులు భారీ పోలీసు బలగాలతో చేరుకొని, ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ముందుగా జోగి రమేశ్ అనుచరుడైన రామును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం హైడ్రామా నడుమ జోగి రమేశ్‌ను అరెస్ట్ చేశారు.  ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేస్తూ జోగి రమేశ్ పోలీసు వాహనంలోకి ఎక్కారు.ముఖ్య నిందితుడు అద్దేపల్లి జనార్థనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జోగి రమేశ్ అరెస్టు జరిగినట్లు సమాచారం. జనార్థనరావు విచారణలో జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని వెల్లడించినట్టు తెలుస్తోంది.  ఈ వాంగ్మూలాన్ని కీలక ఆధారంగా తీసుకుని సిట్‌ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. అయితే జనార్ధనరావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేష్‌కు ఉచ్చు బిగుసుకుంది. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. 

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల సాయం : లోకేశ్‌

  శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తామని మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ.3 లక్షల ఇస్తామని తెలిపారు.వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారిని పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన వారికి భరోసా కల్పించారు. 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో వెంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించారు. ఇంత మంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదని తెలిపారు.  బారికేడ్లు ఏర్పాటు చేసినా భక్తుల రద్దీ కారణంగా సరిపోలేదు. విషయం తెలిసిన వెంటనే మంత్రి, ఎమ్మెల్యే, అధికారులను అప్రమత్తం చేశాం. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని లోకేశ్ తెలిపారు.  కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.

వైభవంగా దివంగత ఆరిగపూడి విజయ కుమార్ జన్మదిన వేడుకలు

  కళా సాహిత్య సేవా రంగాలకు అనితరసాధ్యమైన సేవలు చేసిన దివంగత లయన్ డా.ఆరిగపూడి విజయకుమార్ మానవతా పతాకమని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అభివర్ణించారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ కవి,కళారత్న  డా.బిక్కికృష్ణ అధ్యక్షతన  లయన్ ఆరిగపూడి విజయకుమార్ జన్మదినవేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తల్లిదండ్రులు ఆరిగపూడి పూర్ణచంద్రరావు, నాంచారమ్మల ప్రేరణతో డా.విజయకుమార్ చిన్ననాడే దాతృత్వగుణాన్ని పెంపొందించుకొని కోట్లాది రూపాయలు దానం చేయడం ఆయన మానవత్వానికి,సేవా తత్వానికి పరాకాష్టగా వక్తలు తెలిపారు. ఈ వేడుకల్లో అతిథులుగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ,తెలంగాణ  బి.సి.కమీషన్ మాజీ చైర్మన్ బి.ఎస్.రాములు , ప్రముఖ కవులు డా.పి.విజయలక్ష్మి పండిట్,డా.జెల్ది విద్యాధర్,వంశీ రామరాజు,డా.రాధా కుసుమ, పద్మశ్రీలత తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కొలకలూరి ఇనాక్ రాసి,విజయకుమార్ కు అంకితమిచ్చిన "చలన సూత్రం" గ్రంథాన్ని,బి.ఎస్.రాములపై వచ్చిన "విరబూసిన బతుకు చెట్టు" గ్రంథాన్ని అతిథులు ఆవిష్కరించారు. కవయిత్రి డా.రాధా కుసుమ నిర్వహణలో జరిగిన స్వర్గీయ విజయకుమార్ స్మారక కవి సమ్మేళనం ఆర్ద్రంగా జరిగింది.

కాశీబుగ్గ ఆలయం ప్రభుత్వానికి చెందినది కాదు : మంత్రి ఆనం

  శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సదరు ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదని, అది ఒక ప్రైవేట్ దేవాలయమని కీలక విషయాలు వెల్లడించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయాన్ని హరిముకుంద్‌పండా అనే వ్యక్తి తన సొంత నిధులతో, తనకు చెందిన 12 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఈ ఆలయం ప్రభుత్వ నిర్వహణలో కానీ, దేవాదాయ శాఖ ఆధీనంలో కానీ లేదు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యవహారం" అని వివరించారు. ఆలయ సామర్థ్యానికి మించి భక్తులు రావడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు.  ఆలయ సామర్థ్యం కేవలం 2,000 నుంచి 3,000 మంది మాత్రమే. కానీ, శనివారం ఏకాదశి కావడంతో ఒక్కసారిగా దాదాపు 25,000 మంది భక్తులు తరలివచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. కనీసం ప్రభుత్వానికి లేదా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు దారితీసింది" అని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మంత్రులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన వివరించారు.

దేశ సమైక్యత సంస్కృతి విలువలను కాపాడాలి : వెంకయ్యనాయుడు

  దేశ సమైక్యతను సంస్కృతిని విలువలను  కాపాడడంలో యువత కీలక పాత్ర పోషించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా  శనివారం సాయంత్రం యోగి వేమన విశ్వవిద్యాలయంలోని నూతన పరిపాలనా భవనంలోని అన్నమయ్య సెనేట్ హాలులో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి ఉత్సవ వేడుక సభలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థులకు భారత ఔన్నత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పదనం, తెలుగు భాష తీయదనం, కడప జిల్లా కళా సాహిత్య విశిష్టతను విద్యార్థులకు విరించారు. అనంతరం యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి  వారి మనోభావాలను అందిపుచ్చుకుని విలువైన సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి  మాట్లాడుతూ దేశ సమైఖ్యతకు, దేశ అభివృద్ధికి, దేశ విలువలను కాపాడడంలో నేటి యువత కీలక పాత్ర పోషించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని, విద్యా వికాసంతో పాటు యోగా, క్రీడలు, కళలు, సాహిత్యం, మానసిక వికాసంపై దృష్టి సారించాలని సూచించారు.మన కట్టుబొట్టు, మన సంస్కృతి సంప్రదాయాలు, మన వేశాభాషలు, మన యాస ను కాపాడుకోవడం ముఖ్యం అని అన్నారు. అందం, చందం, హుందాతనం అన్నీ అవసరమే.. వాటితో పాటు మాటతీరు, మర్యాద మనన్నలు, పెద్దలంటే గౌరవం, ఆరోగ్యకరమైన భారతీయ ఆహారపు అలవాట్లను అవలంభించాలని విద్యార్థులకు సూచించారు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయాలి, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయించాలి. ప్రేమనుబంధాలను బలపరుచుకోవాలి, అనురాగంపెంపొందించాలిని హిత‌బోధ చేశారు. సమాజంలో స్నేహ భావాన్ని పెంపొందించాలి. ఈర్ష్య ద్వేషాలను పక్కన పెట్టి.. ఆప్యాయత, అనురాగాలను పెంపొందించాలని బోధించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా.కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, వైసీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్, రిజిస్ట్రార్ పద్మ, యూనివర్సిటీ ఆచార్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.  

వైసీపీ హయాంలో నా ఫ్యామిలీపై కేసులు పెట్టారు : జస్టిస్ ఎన్వీ రమణ

  సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారని ఆయన వెల్లడించారు. వారిపై క్రిమినల్ కేసులు బనాయించారని వ్యాఖ్యానించారు . అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, తనపై మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా అక్రమ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.రాజధాని అమరావతి రైతుల కష్టం, త్యాగాల పునాదులపై నిర్మితమవుతోందని ఆయన అన్నారు.  స్వాతంత్ర్యం తర్వాత రాజధాని కోసం ఇంత సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులదేనని ప్రశంసించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం జరిగిన వీఐటీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.