చేతులెత్తేసిన సమంత...!

బ్యాక్ టు బ్యాక్ హిట్స్, టాప్ పొజిషన్ లో ప్లేస్... వీటికి తోడు... గోల్డెన్ లెగ్ అన్న టైటిల్... ఇవన్నీ ఇప్పుడు సమంతను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఆమె ముందు హీరోలందరూ క్యూకట్టేస్తున్నారు. టాలీవుడ్, కాలీవుడ్ నుంచే కాకుండా... ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ట్రై చేసేస్తున్నారు. “మరో ఏడాది వరకూ నా డేట్స్ ఖాళీ లేవు మొర్రో” అని సమంత మొత్తుకుంటున్నా... ఆఫర్ల వెల్లువ కాస్తైనా ఆగడంలేదట. దీంతో ఇక చేసేది లేక సమంత చేతులెత్తేసింది. బాలీవుడ్ సినిమా కాదు కదా... హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినా... మరో ఏడాడి వరకూ పరిశీలించేది లేదని తేల్చేసింది... మన జెస్సీ...‍!      

మంచు లక్ష్మి గుండెల్లో గోదారి?

  ప్రముఖ నటి మంచు లక్ష్మి నటించి నిర్మించిన ‘గుండెల్లో గోదారి’ సినిమా ప్రీవ్యూ చూసిన ఆమె తండ్రి మోహన్ బాబు, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు, ఆ సినిమా గొప్ప కలెక్షన్లు రాబట్టాక పోవచ్చునేమో కానీ, అనేక అవార్డులు మాత్రం స్వంతం చేసుకోవడం ఖాయం అని సినిమా విడుదలకు ముందుగానే జోస్యం చెప్పడం ఆ సినిమా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియజేసింది. ఊహించినట్లే, ‘గుండెల్లో గోదారి’ ఒక మంచి సినిమాగా పేరు సంపాదించుకోవడమే గాక మంచు లక్ష్మి అత్యుత్తమ నటనకు అద్దం పట్టింది.   కానీ, నాలుగు ఫైట్స్, నాలుగు డ్యాన్సులు, ఓ పది పంచ్ డైలాగులు, ఒక ఐటెం సాంగుకి అలవాటు పడిన మన తెలుగు సినిమా జీవులకి ‘గుండెల్లో గోదారి’ వంటి సినిమాలు ‘కిక్కు’ ఇవ్వలేవు, గనుక ఆ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల తనికెళ్ళ భరణి తీసిన అచ్చ తెలుగు సినిమా ‘మిధునం’కు కూడా అదే పరిస్థితి. అచ్చ తెలుగు సినిమా అంటూ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు నాటాలని ప్రయత్నించిన ఆ సినిమా నిర్మాతలు కొంచెం వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీతమ్మ వాకిట్లో మహేష్ బాబు చేత రెండు స్టెప్పులు వేయించబట్టి ఆ సినిమా బ్రతికి బట్ట కట్టగలిగేలా చేసారు. లేదంటే వారి గుండెల్లో కూడా గోదారే పారేదేమో.   ఇక విషయంలోకి వస్తే, మంచు లక్ష్మి గుండెల్లో దుఃఖం కట్టలు తెంచుకొన్న గోదారిలా పారుతుంటే, ఆ బాధతో వైరాగ్యం పెరగడం వల్లనో లేక తెలుగు ప్రేక్షకుల మీద అలిగారో తెలియదు కానీ ఇకపై చిత్రాల్లో నటించబోనని ప్రకటించారు. సినిమా సక్సెస్ కాకపోయినా నిర్మాతలకు తప్పనిసరి తద్దినంగా మారిన సక్సెస్ మీట్‌లో మంచు లక్ష్మీ మాట్లాడుతూ తాను ఇకపై సినిమాలలో నటించడం కానీ, నిర్మించడం గానీ చేయనని ప్రకటించారు. అందువల్లే తాను ఒక్క చిత్రానికి కూడా సంతకం చేయలేదని చెప్పారు. తానూ తిరిగి అమెరికాకు వెళ్లిపోయి తన భర్త ఆనంద్‌తో కలిసి హాయిగా కాపురం చేసుకొంటూ బ్రతకాలనుకొంటునానని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచారు.   ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, ఒక మంచి నటిగా, మంచి అభిరుచి గల నిర్మాతగా పేరుపొందిన మంచు లక్ష్మి సినీ పరిశ్రమను వీడి వెళ్ళిపోవాలని అనుకోవడం సినీ పరిశ్రమే కాకుండా అటువంటి ప్రతిభావంతురాలిని ప్రేక్షకులకు కూడా దూరం చేసుకొంటున్నారని చెప్పవచ్చును.   ఇందుకు ముఖ్య కారణం సగటు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన తీవ్రమార్పులే. ఒక సినిమాను చూసి ‘ఎంజాయ్’ చేయడానికి, అనుభూతి చెంది ఆనందించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం సగటు ప్రేక్షకుడు సినిమా తనకు అవసరమయిన ‘ఎంజాయ్ మెంటు’ ఈయగలిగితే చాలునని భావించడం వల్లనే ఇటువంటి మంచి సినిమాలు గోదాట్లో కొట్టుకు పోతున్నాయి.   అందువల్లే మంచి అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలు కూడా నాలుగు పంచు డైలాగులు, నాలుగు పాటలు, నాలుగు ఫైట్సు, ఒక ఐటెం సాంగు వేసి రీళ్ళు చుట్టేస్తూ ‘మమ’ అనిపించేసి తమ జేబులు నింపుకొంటునారు. యదా ప్రజా తదా రాజా, తదా నిర్మాతః.

ఇండియాలో చిత్రాన్ని నిర్మించనున్న స్టీవెన్ స్పీల్ బెర్గ్

ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇండియాలో హాలీవుడ్ సినిమాని ఇండియాలో రీమేక్ చేయాలని ఉందని తెలిపారు. పాత్రికేయులతో తన మనసులోని మాటను ఇలా చెప్పారు "ఏదో ఒక రోజున అమెరికాలో తయారైన సినిమాను ఇండియాలో రీమేక్ చేస్తానని, ఇండియా డైరెక్టర్, ఇండియా స్క్రిప్ట్ రైటర్, ఇండియా నటీనటులను, సాంకేతిక నిపుణులతో ఒక ప్రయోగం చేస్తానని'' చెప్పారు. అమితాబ్ బచ్చన్, రిలయెన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ తో స్టీవెన్ స్పీల్ బెర్గ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ నిర్మాణసంస్థ డ్రీం వర్క్స్, అనిల్ అంబానీ రిలయన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.  

ఎన్టీఆర్ 'బాద్ షా' టీజర్ వాయిదా

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా'ఆడియో ఫంక్షన్ వాయిదా పడడంతో శివరాత్రి కానుకగా అభిమానులకు మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఇది కూడ వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడడంతో ఈ మూవీ రచయిత గోపీమోహన్ వివరణ ఇచ్చారు.   'బాద్ షా' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ల టైట్ షెడ్యూల్ కారణం వల్ల క్వాలిటీ లేని టీజర్ ని విడుదల చేయకూడదని బాద్షా టీం నిర్ణయించుకుంది. అభిమానులందరికీ థియేటర్స్ లో గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని 'బాద్ షా' యూనిట్ ప్రామిస్ చేస్తోంది. మార్చి 17న జరగబోయే ఆడియో ఫంక్షన్ కి టీం ప్రిపేర్ అవుతోందని చెప్పారు.

'బాద్ షా' ఆడియో రోజు ఎన్టీఆర్ స్పెషల్ టూర్

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'బాద్ షా' మూవీ ఆడియో శివరాత్రి రోజు గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్న, భద్రతా కారణాల వాళ్ళ ఈ నెల 17 కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నానక రామ్ గూడలోని రామానాయుడు స్టూడియో లో ఈ ఆడియో ఫంక్షన్ ఘనంగా జరుగనుంది. ఇదే రోజున ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ స్పెషల్ టూర్ ను ప్లాన్ చేశారు.   యంగ్ టైగర్ ఆడియో విడుదల రోజున తిరుమల వెంకటేశ్వర స్వామిని, సింహాచలం నరసింహ స్వామిని దర్శించుకొని ఫంక్షన్ లో పాల్గొంటారు. ఎన్టీఆర్ తో పాటు శ్రీనువైట్ల, బండ్ల గణేష్ లు కూడా స్పెషల్ ఫ్లైట్ లో స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ ఆడియో వేడుకకు నందమూరి అభిమానులు భారీగా తరలిరనున్నారు.  

అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ లుక్ ఫోటో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'ఇద్దరమ్మాయిలతో' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ శరీరంపై టాటూలు వేసుకుని, ఫ్రెష్ లుక్స్ తో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది. ఫస్ట్ టైం టాలీవుడ్ లో స్పెయిన్ లో ప్రసిద్ధి చెందిన బుల్ రేస్ ను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.   పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.  దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్.      

వెంకీ..రామ్ మల్టీస్టారర్ అప్డేట్స్

        ప్రిన్స్ మహేష్ బాబు తో ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' లాంటి మల్టీస్టారర్ సినిమా చేసిన విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో మరో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన ‘బోల్ బచ్చన్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ను మార్చి 13న లాంచనంగా ప్రారంభించి మార్చి 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్, రామ్ సరసన నటించే హీరోయిన్స్, మిగిలిన వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్, డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న 'షాడో' సమ్మర్ లో రిలీజ్ కానుంది.

ప్రభాస్ 'మిర్చి'లో స్పెషల్ ఫైట్

        యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' మూవీ బాక్స్ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రభాస్ కేరియార్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లేటెస్ట్ గా ఈ చిత్రంలో అభిమానుల కోసం మరో భారీ ఫైట్ ను యాడ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మిర్చి చిత్రం ఇప్పటి వరకు రూ. 45 కోట్లకు పైగా గ్రాస్, రూ. 40 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మిర్చి బిజినెస్ తగ్గు ముఖం పడుతున్న నేపథ్యంలో మళ్లీ ఈ ఫైట్ యాడ్ చేయడం వల్ల మరిన్ని కలెక్షన్స్ రాబట్టేందుకు నిర్మాతలు ప్లాన్ చేసారు.

చిక్కుల్లో హీరోయిన్ అనుష్క, ప్రియమణి

        సినిమాల్లో అసభ్యంగా వస్త్రధారణ చేశారంటూ న్యాయవాది సుబోధి అనుష్క, ప్రియమణిపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణ అనంతరం వారి మీద కేసుల నమోదుకు ఆదేశించింది. ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై పోలీసులను కేసును నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే ఇద్దరు హీరోయిన్లు నోటీసులు అందుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసుపై అనుష్క, ప్రియమణి ఎలా ప్రొసీడ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇప్పటి వరకు కేసుల్లో ఇరుక్కున్న నటీమణులు ఉన్నారు. కానీ ఇలా సినిమాల్లో నటించారని కేసులో ఇరుక్కున్న నటీమణులు వీరే ఉన్నారు.

'గుండెల్లో గోదారి' సినిమా హైలైట్స్

        'గుండెల్లో గోదారి' సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన విడుదల మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు లేకపోయినా, ఇళయరాజా మ్యూజిక్, గోదావరి నేపథ్యంలో సాగే చిత్రమని చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 'గుండెల్లో గోదారి' మూవీ హైలైట్స్ మీ కోసం:     సినిమా ఆర౦భంలో వచ్చే వరద సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. రవిరాజ పినిశెట్టి తనయుడు ఆదిపినిశెట్టి యాక్టింగ్ చాల సహజంగా ఉంది. తాప్సీ, ఆదిపినిశెట్టి మధ్య సాగే లవ్ ట్రాక్ ఆకట్టుకొంటుంది. ఇళయరాజా సంగీతం సినిమాకి మెయిన్ హైలైట్ గా చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫి, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. డైరెక్టర్ కుమార్ నాగేంద్ర మూస ఫార్ములా జోలికి పోకుండా విభిన్నమైన ప్రయత్నం చేశారు.       

నేను ఒక సూపర్ మ్యాన్ ని: రామ్ గోపాల్ వర్మ

  మన తెలుగు చిత్రపరిశ్రమలో కొంచెం తలతిక్క మనిషిగా పేరొందిన రాంగోపాల్ వర్మ, తానూ ఇటీవల విడుదలయిన ‘26/11’ సినిమా నిర్మిస్తున్నపుడు తనకు ఎదురయిన అనుభవాలతో పూర్తిగా మారిపోయానని చెప్పడం మొదలుపెట్టినప్పుడు, కొందరు ఆయన మాటలు నమ్మినా చాలామంది ఈ డ్రామా కూడా ఆయన సినిమా ప్రచారంలో భాగమేనని తేల్చిపడేశారు. ‘వర్మ మారడం అసంభవం’ అని వారు బల్లగుద్ది మరీ చెప్పారు. బహుశః వారి మాటలను నిజం చేస్తున్నట్లు, వర్మలోంచి ఈ మద్యనే మన పాత వర్మ బయటకి వచ్చాడు.   ‘26/11’ సినిమా విజయవంతం అయిన సందర్భంగా మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు తనదయిన శైలిలో ఆయన జవాబులు చెపుతుంటే, మీడియావారు నోరు వెళ్ళబెట్టక తప్పలేదు. రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ “నన్ను నేను ఎల్లపుడూ ఒక సూపర్ మ్యాన్ గా భావించుకొంటాను, కనుక నాకు సహజంగానే స్నేహితులు అవసరం ఉండరు. భావోద్వేగంతో నేనెవరి భుజంపైనో తలవాల్చి సేద తీరాలని కూడా ఎన్నడూ అనుకోలేదు. నేను సినిమా నిర్మించే సమయంలో యూనిట్ సభ్యులతో మాట్లాడుతాను, కానీ వారితో ఏవిధమయిన అనుబంధం ఏర్పరుచుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల, ఒక సినిమా పూర్తీ కాగానే ఆ సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులతో నా సంబందాలు కూడా తెగిపోతాయి."   "నాకు సినిమాలే లోకం. నేను ఎల్లపుడు సినిమాలు తీస్తూనో లేక చూస్తూనో ఉంటాను గనుక పార్టీలు, పెళ్ళిళ్ళు , పండుగల కోసం వెచ్చించేందుకు నాకు సమయం ఉండదు. నా సినిమాలలో పెద్ద హీరోల కంటే చిన్న హీరోలను పెట్టుకోవడానికే నేను ప్రాధాన్యత ఇస్తాను. పెద్ద హీరోలు వారి ఇమాజ్, అనవసర బేషజాలు వంటి బ్యాగేజ్ వెంట మోసుకువస్తారు. దానిని భరించడం నావల్లకాదు. అందువల్ల నేను చిన్నహీరోలకే ఎక్కువ ప్రాదాన్యం ఇస్తాను,” అన్నారు రామ్ గోపాల్ వర్మ.   ‘హమ్మయా! మన రాంగోపాల్ వర్మ ఏమాత్రం మారలేదు’ అని తేలికగా ఊపిరి తీసుకొని మీడియావారు బయట పడ్డారు.

ఇండియన్ గ్రేటెస్ట్ యాక్టర్..అన్న ఎన్టీఆర్

      ఇండియన్ సినిమా వంద సంత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా 'సిఎన్ఎన్ ఐబిఎన్' దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియాన్ యాక్టర్''తెలుగుజాతి గర్వించదగ్గ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వబౌమ నటరత్న పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు'' గారు ఎంపికయ్యారు. నందమూరి తారకరామారావు గారు 53% ఓట్లు దక్కించుకుని ‘ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్'గా మొదటి స్థానంలో నిలవగా, తమిళ నటుడు కమల్ హాసన్ 44% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.   'ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్' హీరోయిన్ లలో శ్రీదేవి మొదటి స్థానంలో నిలిచింది. 39% ఓట్లతో శ్రీదేవి టాప్ లో నిలవగా, బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ 16% ఓట్లతో రెండో స్థానంలో, తెలుగు నటి సావిత్రి 12% ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. 'ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్' మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా గారు 49% ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. 29%ఓట్లతో ఎ.ఆర్. రెహమాన్ రెండవ స్థానంలో నిలిచారు.    

వెంకటేష్ 'షాడో' టైటిల్ సాంగ్

      విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'షాడో'. ఈ సినిమా టైటిల్ సాంగ్ టిజర్ ను వి.వి. వినాయక్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రం గురించి వెంకటేష్ మాట్లాడుతూ...ఆడియో ఫంక్షన్ ను మార్చి 15న చేస్తున్నామని, సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని చెప్పారు. 'షాడో' టైటిల్ సాంగ్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అని అన్నారు. చిత్రంలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.   'షాడో'లో వెంకటేష్ తో పాటు శ్రీకాంత్ మరో మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకీ సరసన తాప్సీ, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ నటిస్తున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

భూ కబ్జా కేసులో సంగీత దర్శకుడు మణిశర్మ

        ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఆయనను ఏ క్షణమైన తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి. నకిలీ భూమి పత్రాలు సృష్టించి వేరే వ్యక్తి భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై మణిశర్మపై కేసు నమోదైంది. తమిళనాడులోని కణాతూర్ దగ్గర కరూర్ కరుప్పన్ అనే వ్యక్తికి 75 సెంట్ల భూమి ఉంది. దాని విలువ దాదాపు పది కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా.   అసలు హక్కుదారుడైన కరుప్పన్ కు ఇటీవల తన భూమిమీద మణిశర్మ హక్కుదారుడుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో వెంటనే తన వద్ద ఉన్న హక్కు పత్రాలతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు కరుప్పన్ పత్రాలు నిజమైనవేనని తేల్చారు. మరి మణిశర్మ వద్ద కాగితాలు ఎలా వచ్చాయి..అవి ఖచ్చితంగా నకిలీవేనని భావిస్తున్నారు. ఆయన ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఉంటారని అంచనాకు వచ్చారు. ఈ మేరకు మణిశర్మ మేనేజరు రఘురామన్ ను పిలిపించి ప్రశ్నించారు. మణిశర్మ కోసం వెతుకుతున్నారు.  

చిరంజీవి 150 సినిమాలో నటిస్తా: డా.రాజశేకర్

  తెలుగు సినిమారంగం నుండి రాజకీయాలలోకి ప్రవేశించిన మెగా స్టార్ చిరంజీవికి, డా. రాజశేఖర్ దంపతులకి మద్య ఉన్నవిరోధం గురించి కొత్తగా చెప్పుకోవలసినది ఏమి లేదు. కానీ, చిరంజీవి ఆ విషయాన్నీ నేరుగా ఎప్పుడుఎవరితోను ప్రస్తావించక పోయినప్పటికీ, డా. రాజశేఖర్ దంపతులు మాత్రం మీడియా ముందు ఆ విషయాన్నీ చాలా సార్లు ప్రస్తావిస్తుంటారు.   ఆయన నటించిన ‘మహంకాళి’ సినిమా ఈ రోజు విడుదల అవుతున్నసందర్భంగా నిన్నఒక తెలుగు న్యూస్ చానల్ ఇచ్చిన ఇంటర్వ్యులో తన మనసులో మాటలు కుండ బద్దలు కొట్టినట్లు బయట పెట్టారు.   ప్రస్తుతం సైద్ధాంతికంగా తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నపటికీ, చిరంజీవి చేరిక తరువాత అక్కడా తమకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని, సాక్షాత్ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటి పార్టీ పెద్దలు సైతం తమతో మాట్లాడేందుకు వెనకాడుతున్నారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం వద్ద చిరంజీవికి ఉన్న పలుకుబడే అందుకు కారణం అన్నారు. అందువల్ల, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇబ్బందులు పడేకంటే, తెలుగుదేశం పార్టీలోకో లేక బీజేపీలోకో మారిపోవాలని అనుకొంటున్నట్లు ఆయన మీడియాకి తెలిపారు.   సినిమా రంగంలో చిరంజీవి ఉన్నంత కాలం తాము అనేక సమస్యలను ఎదుర్కొన్నామని డా.రాజశేకర్ చెప్పారు. అయితే, ఆయన రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత కూడా పరిశ్రమపై ఉన్న ‘మెగా కుటుంబ’ ప్రభావం వల్ల ఇంకా తాము అవే సమస్యలు ఎదుర్కొంటూన్నామని అన్నారు. సినీ పరిశ్రమలో తమ స్నేహితులు వ్యక్తిగతంగా తమ మాటలను మెచ్చుకొన్నపటికీ అదే పనిని నలుగురిలో మాత్రం చేయలేకపోవడానికి కారణం, పరిశ్రమపై ఉన్న ‘మెగా కుటుంబ’ ప్రభావమే అని ఆయన అన్నారు.తమకు అనుకూలంగా మాట్లాడితే మెగా కుటుంబం ఆగ్రహానికి గురయి ఇబ్బందులు వస్తాయనే భయంతో చాలామంది తమను కలిసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారని ఆయన తెలిపారు. మెగా కుటుంబ ప్రభావం వల్లనే తమకు టాలీవుడ్ లో తగినంత సహకారం కూడా కరువయిందని ఆవేదన వ్యక్తం చేసారు.   కానీ, తానూ మనసులో ద్వేషం పెట్టుకొని ఎవరితోను శత్రుత్వం కోరుకోనని డా.రాజశేకర్ చెప్పారు. ఇదివరకు కొంత మంది తనను చిరంజీవి 150వ సినిమాలో ప్రతినాయక పాత్ర ఉంది చేస్తారా? అని అడిగితే తానూ ఏమాత్రం సంశయించకుండా సరేనన్నాని తెలిపారు. ఇప్పటికీ, అటువంటి అవకాశం వస్తే తప్పకుండా చేసేందుకు సిద్ధం అని తెలిపారు. అయితే, తన పాత్ర తన స్థాయికి తగ్గటుగా ఉండాలని అన్నారు. తన అంకుశం సినిమాతో ప్రభావితులైన చాలామంది యువకులు పోలీసు ఉద్యోగాలపట్ల ఆసక్తి చూపడం మొదలుపెట్టారని, మళ్ళీ ఇప్పుడు తన సరికొత్త సినిమా ‘మహంకాళి’ కూడా ఆ స్థాయికి తగ్గకుండా ఉంటుందని అన్నారు.

'3జి' అందాలు

      'రెయిన్ బో' అనే తెలుగు సినిమాలో నటించిన ఈఅమ్మడు పేరు సోనాల్ చౌహాన్. ఆ తరువాత తెలుగులో ఏ సినిమాలోను కనిపించలేదు. బాలీవుడ్ లో 'జన్నత్' లో నటించిన ఎక్కువగా ఆఫర్లు రాలేదు. తాజాగా నీల్ నితిన్ ముకేష్ తో '3G'అనే సినిమాలో నటిస్తున్న సోనాల్ చౌహాన్ హద్దులు దాటినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఏకంగా బికిని వేయడమే కాకుండా ముద్దు సీన్ లలో కూడ రెచ్చిపోయి నటించింది. అందాల ప్రపంచం కదా, సినీ రంగంలో గ్లామర్ తక్కువైతే ఎలాగానుకుందో ఏమో..బికినిలో తడి తడి గా బీచ్ లో అందాలను ఆరబోసిందిలా. ఈ సినిమాతో నటిగా బాలీవుడ్ లో స్థిరపడిపోవాలనే కృతనిశ్చయంతో ఉన్న సోనాల్ కి కాలం కలిసొచ్చేలావుంది.

బీచ్ లో 'గ్రీకువీరుడు' ఆడియో

      కింగ్ అక్కినేని నాగార్జున 'సంతోషం' తరువాత డైరెక్టర్ దశరథ్ తో చేస్తున్న మూవీ 'గ్రీకువీరుడు'. అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఏంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23న ఆడియోను ఆర్.కే.బీచ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం రిలీజైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాగ్ న్యూలుక్ తో మన్మధుడులా ఉన్నారని అన్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ మేన్ గెటప్ లో కనిపించనున్నారు. నయనతార, మీరా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'గ్రీకువీరుడు' తో నాగ్ న్యూ ట్రెండ్ ని సృష్టిస్తాడని ఆయన అభిమానులు అంటున్నారు.

ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో వాయిదా

        యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాద్ షా' ఆడియోను ఈ నెల 10న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆడియో ఫంక్షన్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. శివరాత్రి సంధర్బంగా తమ ఇష్ట దైవం మహా శివుడి పేరు గల 'పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్' ప్రతిష్టాత్మక చిత్రం 'బాద్ షా' ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు.   ఇదే రోజున శివరాత్రి కావడంతో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేవాలయాలకు సెక్యూరిటీ భారీగా ఇవ్వాలని కనుక 'బాద్ షా' ఆడియో కు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ నేపధ్యంలో డీజీపి ఫంక్షన్ ను వాయిదా వేయాలని ప్రొడ్యూసర్ ని రిక్వెస్ట్ చేయడంతో వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ నెల 17న ఆడియో రిలీజ్ చేయనున్నారని సమాచారం.