ఏప్రిల్ లో అల్లు శిరీష్ ‘గౌరవం’ మూవీ

        అల్లు శిరీష్ హీరోగా అరంగేట్రం చేస్తున్న మూవీ ‘గౌరవం’. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం గౌరవం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ నిర్మాణంలో రాధామోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హానర్ కిల్లింగ్స్ నేపధ్యంలో సాగుతుంది. తమిళ్, తెలుగు బాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తెస్తారని తెలుస్తోంది. విక్కీ డోనర్ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తుంది.   ఈ సినిమా గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..గౌరవ౦ సిటీకి, పల్లెటూరికి మధ్య నాగరికత తేడాను చూపే చిత్రమని, ఇందులో అల్లు శిరీష్, యామీ గౌతమ్ పాత్రలకు మంచి పేరు వస్తుందని అన్నారు. తమన్ సంగీతం, సినిమాటోగ్రాపి ప్రధాన ఆకర్షణ నిలుస్తాయని చెప్పారు.  

రామ్ చరణ్ 'ఎవడు' టీజర్ టాక్

        మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సంధర్బంగా 'ఎవడు' టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 'ఎవడు' టీజర్ లో చరణ్ మరోసారి తన పవర్ చూపించాడు. ఈ వీడియో లో చరణ్, విలన్స్ ని కొట్టే సన్నివేశాలు కేక పుట్టిస్తున్నాయని అంటున్నారు. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులని ఆకట్టుకొంటుంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి 30 సెకండ్లలో ఎనర్జిటిక్ టీజర్ ను చూపించారు. తుఫాన్ థ్రిల్ నుంచి కోలుకోకముందే 'ఎవడు' టిజర్ రిలీజ్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ టీజర్ చూసిన మెగా అభిమానులు రామచరణ్ 'ఎవడు' తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తాడని చెబుతున్నారు.

నిజ జీవితానికి దూరంగా బాలీవుడ్: సిద్దార్థ్

  టాలివుడ్ లవర్ బాయ్ సిద్దార్థ్ సినీ పరిశ్రమ గురించి చాల నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెపుతుంటాడు. అందుకు చిత్ర నిర్మాణానికి సంబంధించి వివిధ శాఖలపై అతనికున్న పట్టు ఒక కారణం కాగా, కేవలం తెలుగు సినిమాలకే పరిమితమయిపోకుండా, తమిళ్, హిందీ సినిమాలు కూడా చేస్తుండటం వలన ఇతర చిత్ర పరిశ్రమల గురించి కూడా మంచి అవగాహన కలిగి ఉండటం రెండో కారణం.   త్వరలో అతను నటించిన హిందీ సినిమా ‘చస్మే బద్దూర్’ విడుదల కానున్న సందర్భంగా బాలివుడ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక మాయ ప్రపంచం సృష్టించి అందులో వారిని విహరింపజేస్తున్నాయి. నిజ జీవితానికి ఏమాత్రం దగ్గరలేనప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమాలు చూసి ఆనందిస్తున్నారంటే దానికి కారణం వారి దైనందిన జీవితాలలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళ నుంచి బయట పడటానికేనని చెప్పవచ్చును. బాలివుడ్ ఒక కొత్త సినిమా నిర్మించడానికి మరి కొన్ని ఇతర సినిమాలపై ఆధారపడితే, దక్షిణాది చిత్రసీమ మాత్రం తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ, వాటినుండి కధలను అల్లుకొంటుంది. దక్షిణాదిన సినీ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటే, బాలివుడ్ లో సినిమా ప్రచారం చేసుకోవడంలో నేర్పు కనబరుస్తారు. ఈ విషయంలో దక్షిణాది సినీ పరిశ్రమ బాలివుడ్ నుంచి చాల నేర్చుకోవలసి ఉంది.”   “ అయితే, దక్షిణాదిన తయారవుతున్న మాస్ మసాల కమర్షియల్ సినిమాలను హిందీలోకి రిమేక్ చేసుకొంటున్న బాలివుడ్ ఎన్నడూ కూడా దక్షిణాది పరిశ్రమకు కృతజ్ఞతలు చెప్పలేదు సరికదా అది తన హక్కు అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఏమయినప్పటికీ, ఉత్తర దక్షిణ సినీ పరిశ్రమలు చేతులు కలిపి ముందుకు సాగితే అది యావత్ భారత చిత్ర పరిశ్రమకు మేలు చేస్తుంది. నాకు బాలివుడ్ లో నటించడం కేవలం హాబీ మాత్రమే, కానీ దక్షిణాది సినిమాలలో నటించడం మాత్రం నా వృత్తిగా భావిస్తాను. అందుకే, నేను బాలివుడ్ కంటే దక్షిణాది సినిమాలపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాను,” అని సిద్దార్థ్ అన్నాడు.

జంజీర్, తూఫాన్ ట్రైలర్స్ నిలిపివేయాలి బాంబే కోర్టు

  రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటి బాలీవుడ్ సినిమా జంజీర్ దీని తెలుగు అనువాదం తుఫాన్ ట్రైలర్స్ ప్రసారం చేయకూడదని బాంబే హై కోర్టు ఆర్డర్లు జారీ చేసింది. 1973 లో అమితాబ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దివంగత ప్రకాష్  మెహ్రా నిర్మించారు. ప్రకాష్ మెహ్రా కు ముగ్గురు కుమారులు అమిత్ మెహ్రా, పునీత్ మెహ్రా, సుమీత్ మెహ్రా. జంజీర్ రిమేక్ విషయంలో వీరి నడుమ వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే పునీత్, సుమీత్ మెహ్రాలు ఈ చిత్ర రిమేక్ హక్కులను అమిత్ మెహ్రాకు అమ్మారు. అయితే అమిత్ మెహ్రా వీరిద్దరికీ డబ్బు చెల్లించడం లేదు. దీంతో పునీత్ మెహ్రా, సుమీత్ మెహ్రాలు బాంబే హైకోర్టులో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోస్, ట్రైలర్స్, హిందీలోగాని, తెలుగులోగాని నిలిపివేయాలని అప్పీలు  చేసింది. దీంతో బాంబే హైకోర్టు బుధవారం ఈ చిత్ర ట్రైలర్స్ పై ప్రసారాన్ని నిలిపివేయాలని ఆర్డర్స్ జారీ చేసింది.

రామ్ చరణ్ 'తుఫాన్' కు హైకోర్ట్ షాక్

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బాలివుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా, సంజయ్ దత్త్, ప్రకాష్ రాజ్, శ్రీ హరి తదితరులు నటించిన హిందీ సినిమా జంజీర్, దాని తెలుగు వెర్షన్ తుఫాన్ సినిమాల ట్రయలర్ విడుదల, ప్రదర్శనపై బొంబాయి హైకోర్టు స్టే విదించింది. ఈ సినిమాను నిర్మించిన అమిత్ మెహ్రా రిమేక్ హక్కుల విషయంలో తమను మోసగించాడంటూ ఆయన సోదరులు పునిత్ మెహ్రా మరియు సుమిత్ మెహ్రాలు కేసువేయడంతో బొంబాయి హై కోర్టు నిన్న స్టే ఉత్తర్వులు జారీ చేసింది.   1973లో విడుదలయిన అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాను వారి తండ్రి ప్రకాష్ మెహ్రా నిర్మించారు. అందువల్ల, ఆ సినిమాకు రిమేక్ గా తయారయిన జంజీర్ మరియు తుఫాన్ సినిమాలలో తమకు కూడా రిమేక్ హక్కులు కలిగి ఉనందున, తమకు న్యాయంగా చెల్లించవలసిన సొమ్మును చెల్లించడానికి నిరాకరిస్తూ తమ సోదరుడు అమిత్ మెహ్రా మోసం చేస్తునందున సినిమా ట్రయలర్ విడుదల కాకుండా నిలిపి వేయాలని పునిత్ మెహ్రా మరియు సుమిత్ మెహ్రాలు కేసు వేయడంతో కోర్టు స్టే విదించింది.   ఇది కాకుండా అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాకు కధ అందించిన రచయితలు సలీం ఖాన్ మరియు జావేద్ అక్తర్ ఇరువురూ కూడా నిర్మాత అమిత్ మెహ్రా తమ కధను (తమ అనుమతి లేకుండా) వాడుకొంటున్నందుకు రూ.6 కోట్ల పరిహారం చెల్లించాలంటూ బొంబాయి హైకోర్టులో కేసులు వేసారు. సినీ రచయితల సంఘంలోనూ, యఫ్.డబ్ల్యు.ఐ.సి.ఈ.లో, వివాదాల పరిష్కార కమిటీ (డీయస్.సి)లోను కూడా పిర్యాదులు చేసారు.   మెగాభిమానులు అందరూ తమ హీరో రామ్ చరణ్ తేజ్ తుఫానులా దూసుకు వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో కోర్టులు ఆయన సినిమాకి జంజీర్ (సంకెళ్ళు) వేసి ఆపడంతో కొంచెం నిరాశ తప్పలేదు. ఈ సినిమాలను సకాలంలో విడుదల అయ్యేందుకు నిర్మాత అమిత్ మెహ్రా వీలయినంత త్వరగా ఈ కేసుల పరిష్కారం చేసుకోవలసి ఉంటుంది.లేకుంటే అది సినిమా విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

  ఈ ఏడాది హోలీ పండుగ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలకి కొత్త రంగులద్దింది. 2007లో చిరుత పులిలా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రామ్ చరణ్ తేజ్ బాక్సాఫీసులు బద్దలు కొట్టగల అసలుసిసలయిన మగధీరుడుగా నిలిచి, టాలివుడ్ లో అంతటా తానే అన్నట్లు రచ్చరచ్చ చేసేస్తూ నాయక్ అనిపించుకొన్నాడు.   ఇప్పుడు హిందీ చిత్ర సీమలోకి జంజీర్ (సంకెళ్ళు)తో అడుగుపెడుతున్నరామ్ చరణ్ తేజ్, బాలివుడ్ ను కూడా తన జంజీర్ లో బందించకమానడని చెప్పవచ్చును. జంజీర్ సినిమా ట్రైలర్ చూసిన అమితాబ్ బచ్చన్, రామ్ చరణ్ తేజ్ పై ట్వీట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించారంటే ఆ సినిమా ఏవిధంగా ఉండబోతోందో అర్ధం అవుతుంది.   ఇక, రాష్ట్రంలో ఇంతవరకు వచ్చిన అన్ని తుఫాన్లు ప్రజలకి తీవ్ర నష్టాలు, కష్టాలు తెచ్చిపెట్టగా, ఇప్పుడు రాష్ట్రం మీదకి దూసుకు వస్తున్నఈ తుఫాన్ మాత్రం అటు నిర్మాతలకి కాసుల వర్షం, ఇటు ప్రజలకి ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ మెగాభిమానులకి ఎంతో ఆనందం తెచ్చిపెట్టబోతోంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ తుఫాన్ వీలయినంత త్వరగా రావాలని కోరుకొంటున్నారు.   రామ్ చరణ్ తేజ్ ఇంత వరకు చేసిన 5 సినిమాలలో 4 సినిమాలు- చిరుత, మగధీర, రచ్చ, నాయక్ సూపర్ హిట్టవగా, త్వరలో విడుదల కానున్న ‘తుఫాన్’ మరియు ‘జంజీర్’ సినిమాలు ఆ లిస్టుకి మరో రెండు సినిమాలను జతచేయనున్నాయి. అంటే రామ్ చరణ్ తేజ్ చేసిన 7 సినిమాలలో 6 హిట్స్ అన్నమాట. రామ్ చరణ్ తేజ్ ఈ 7 సం.లలో చేసిన కృషి, పడిన కష్టం వలననే ఇటువంటి అరుదయిన రికార్డులు సాధించగలిగాడని చెప్పవచ్చును.   రాశి కంటే వాసి మిన్న అని నమ్మే మెగా కుటుంబం నుండి వచ్చిన వాడవడం వలన రామ్ చరణ్ తేజ్ ఆలస్యమయినా తనకు తగిన కధలను ఎంచుకోవడంలో చూపిన నేర్పు, అదృష్టవశాత్తు వాటిని అంత చక్కగా తీర్చి దిద్దగలిగిన ప్రతిభావంతులయిన దర్శకులు ఆయనకు దొరకడంతో ఈ అరుదయిన రికార్డు సాదించగలిగారు.   ఇప్పుడు జంజీర్, తుఫాన్ సినిమాలకు దర్శకత్వం వహించిన అపూర్వ లకియా కూడా రామ్ చరణ్ తేజ్ సినీ జీవితంలో మరో రెండు మైలు రాళ్ళు ఏర్పాటు చేస్తాడని ఆశిద్దాము. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రామ్ చరణ్ ఎవడు ఎంతటి వాడో త్వరలో మనకి చూపించనున్నాడు.   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి తెలుగు వన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అయన మరిన్ని మంచి సినిమాలు చేసి తెలుగు చిత్ర సీమ కీర్తి పతాకను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని కోరుకొంటోంది. …

ప్రముఖ నటి సుకుమారి కన్నుమూత

        మురారి చిత్రంలో మహేష్ బాబు బామ్మ శబరి పాత్రలో నటించిన సుకుమారి (74) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఇంటి పూజగదిలో దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. సుకుమారి కి ఓ కుమారుడు డాక్టర్ సురేష్ ఉన్నారు. తమిళ,తెలుగు, హిందీ, మాలయళీ, ఒరియా, బెంగాలీ బాషల్లో రెండు వేలకు పైగా చిత్రాలలో నటించారు. తెలుగులో నాగార్జున నిర్ణయం, మహేష్ మురారి, పల్లెటూరి బావ చిత్రాలలో నటించిన ఆమెకు 'కుదిరితే కప్పు కాఫీ' చివరి తెలుగు చిత్రం. 2003లో పద్మశ్రీ పురస్కారం పొందారు.  తమిళ మళయాళ బాషల్లో విడుదలైన 'నమ్మగ్రామం' చిత్రానికి గాను 2011లో ఉత్తమ సహాయనటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.     

సమంతతోనే సిద్ధార్థ్ పెళ్ళి?

    హీరో సిద్ధార్థ్ పెళ్ళికి రెడీ అయ్యాడు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నేను పెళ్ళికి రెడీ అని ప్రకటించేశాడు. కాని ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఆ మధ్య రంగ్ దే బసంతి' చేసే కాలంలో సైఫ్ అలీఖాన్ చెల్లెలు సోహా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడని, పెళ్ళి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి. మరి ఎందుకో ఆ కధ పెళ్ళి వరకు రాకుండానే కంచికి చేరింది.       తెలుగులో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా చేసేప్పుడు ఆ సినిమా హీరోయిన్ తమన్నాకీ, ఆయనకీ మధ్య 'సమ్‌థింగ్' నడుస్తోందంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఇటీవల కొంత కాలంగా సిద్ధార్ద్ ..సమంతాలు ప్రేమలో మునిగి తేలుతున్నారని ఫిల్మ్ నగర్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు సమంత, సిద్దార్ద్ లు కలిసి గుళ్ళుగోపురాల వెంట తిరిగి పూజలు చేయడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి. మరోవైపు సమంత కూడా తాను ప్రేమలో పడ్డానని, టైం వచ్చినప్పుడు తన లవర్ వివరాలు వెల్లడిస్తానని చెబుతోంది. ఇవన్ని చూస్తుంటే సిద్దార్ద్, సమంత ఒకటవ్వడం ఖాయమని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

రామ్ చరణ్ తుఫాన్ ట్రైలర్ పై అమితాబ్ స్పందన

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' గా వస్తుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను నిన్న హైదరాబాద్ లో కేంద్రమంత్రి, మెగా స్టార్ చిరంజీవి విడుదల చేశారు. తాజాగా ఈ ట్రైలర్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు.   'జంజీర్' సినిమా రికార్డ్ లు క్రియేట్ చేయడం ఖాయమని అన్నారు. జంజీర్ ట్రైలర్ ను చూశానని, చాలా పవర్ ఫుల్ గా వుందని..సినిమా టీంకు నా అభినందనలు' అంటూ అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. 1973లో అమితాబ్ బచ్చన్ హీరోగా చేసిన సూపర్ హిట్ ‘జంజీర్'ను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ గెస్ట్ రోల్ చేయడం విశేషం.   తుఫాన్ లో ఎసిపి పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అపూర్వ లిఖియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో సంజయ్ దత్ చేస్తున్న షేర్ ఖాన్ పాత్రని తెలుగులో శ్రీహరి చేస్తున్నారు.

నయనతార పెళ్ళి పై వార్తలు

        నయనతార మళ్ళీ వార్తల్లోకెక్కింది. ప్రభుదేవాతో ప్రేమపెళ్లి దాక వచ్చి తెగదెంపులు చేసుకున్నాక..తన సినీ కేరియార్ పైన దృష్టి పెట్టింది. తాజాగా నయనతార పెళ్ళి పై వార్తలు జోరందుకున్నాయి. ఆ మధ్య తమిళ నటుడు ఆర్య గృహప్రవేశానికి వచ్చిన నయనతార, అతనిని త్వరలో పెళ్ళి చేసుకోబోతుందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ పెళ్ళి వార్తలపై నటుడు ఆర్య స్పందించారు. “అందరు హీరోయిన్ల లాగే నయనతార కూడా తనకు మంచి స్నేహితురాలని, ఆమెను నేను పెళ్లి చేసుకుంటానని వార్తలు వస్తున్నాయి అయితే ఆమె నా మంచి చెడ్డలు పట్టించుకునే స్నేహితురాలు మాత్రమే. భవిష్యత్ ఏమిటో చెప్పలేను గాని ఆమె నాకు ప్రస్తుతానికి ఆత్మీయురాలు” అని ఆర్య అన్నారు. మరి వీటిపై నయన ఎలా స్పందిస్తుందో చూడాలి.

ప్రకాష్ రాజ్ ను మెచ్చుకున్న స్పీల్ బర్గ్

        హాలీవుడ్ లో గొప్ప దర్శకుడిగా పేరున్న స్టీవెన్ స్పీల్ బర్గ్ తాను చూసిన చిత్రంలో ఆ నటుడి నటనను ప్రశంసిస్తే ఆ నటుడు ఎంత హ్యాపీగా ఫీలవుతాడో ఊహించలేం. సరిగ్గా ఇదే అనుభవం ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు దక్కింది. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబయి వచ్చిన స్పీల్ బర్గ్ గౌరవార్ధం ఓ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు ఆహ్వానం అందుకున్న ప్రకాష్ రాజ్ అక్కడికి వెళ్లాడట. విందులో ప్రకాష్ రాజ్ ను చూసిన వెంటనే గుర్తుపట్టిన స్పీల్ బర్గ్ “నేను మీరు నటించిన ‘కాంజీవరం’ సినిమా చూశాను. అందులో మీ నటన అద్భుతం. కేవలం కళ్లతోనే అద్భుతమయిన హావభావాలు పలికించారు. చాల కష్టమయిన పాత్ర. అయినా చాలా బాగా మెప్పించారు” అని అన్నారట. అంతే స్పీల్ బర్గ్ గుర్తుపడితే చాలనుకుంటే..ఏకంగా తన సినిమా, అందులో నటన గురించి మాట్లాడేసరికి ప్రకాష్ రాజ్ షాక్ తిన్నాడట.

చేగువెరగా నటించనున్న ప్రభాస్

                మిర్చి సినిమా విజయవంతం అవడంతో మంచి ఊపు మీదున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న జానపద చిత్రం ‘బాహుబలి’ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోకూడా అనుష్క అతనితో జత కట్టబోతోంది. ఇక, ప్రభాస్ త్వరలో మొదలు పెట్ట నున్న మరో చిత్రం పేరు ‘ఒక్క అడుగు’. గతంలో అతను నటించిన సూపర్ హిట్ సినిమా ‘చత్రపతి’లో కోటా శ్రీనివాసరావును ఎదుర్కొంటూ ప్రభాస్ పలికిన డైలాగుల్లో బాగా పాపులర్ అయిన ‘ఒక్క అడుగు’ అనే డైలాగునే ఈ సినిమాకు పేరుగా నిర్ణయించారు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు మొట్ట మొదటిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అర్జెంటిన దేశ విప్లవ నాయకుడు చేగువెర పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో దాదాపు 20నిమిషాల సేపు ఆ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు. చేగువెరను చాల అభిమానించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన సినీ జీవితంలో కనీసం ఒక్కసారయినా చేగువెరగా నటించాలని కోరుకొంటున్నట్లు మీడియాకు చాల సార్లు చెప్పినప్పటికీ, ఆయన కంటే ముందుగా ప్రభాస్ కు ఆ అవకాశం దక్కింది. ఈ సినిమాను కృష్ణంరాజే తన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.

నందమూరి వంశం నుండి మరో బాల నటుడు

                              తెలుగు చిత్ర సీమకు హీరోయిన్లను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవలసి ఉందేమోగానీ, హీరోలకి మాత్రం కరువులేదు. నందమూరి, అక్కినేని, మెగా స్టార్, సూపర్ స్టార్, రెబెల్ స్టార్ మొదలయిన అన్ని కుటుంబాలు తెలుగు చిత్ర సీమకు హీరోలను అందించే అక్షయ పాత్రలంటే అతిశయోక్తి కాదు. కొత్తగా ప్రవేశిస్తున్నవారు కూడా తమ తాతముత్తాతల పరపతి మీద ఆదారపడకుండా తమ స్వీయ శక్తితోనే పైకి వచ్చి ప్రజలను మెప్పిస్తున్నారు. అభిమానులను సంపాదించుకొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరియు నందమూరి కుటుంబాల నుండి మరో ఇద్దరు నటులు త్వరలో మన ముందుకు రాబోతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు యొక్క అనేక సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణమాధవ్‌ ‘హృదయం ఎక్కడున్నది’ అనే ఒక రొమాంటిక్ చిత్రం ద్వారా హీరోగా వస్తుంటే, హరి కృష్ణ మనుమడు మాస్టర్ యన్టీఆర్ (జానకిరాం కుమారుడు) ‘స్కేటింగ్ మాస్టర్’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. కాంగ్రెస్ నాయకురాలు మరియు మంత్రి గల్లా అరుణా కుమారికి కృష్ణ మాధవ్ మేనల్లుడు. ఇతను, మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి కనబరచడంతో అమెరికాలో నటన, డ్యాన్స్, ఫైట్స్ మొదలయిన వివిధ అంశాలలో శిక్షణ కూడా పూర్తిచేసుకొన్నాడు. ఈ సినిమాకు వీ. ఆనంద్ దర్శకుడు, సంజయ్ మరియు పవన్ నిర్మాతలు. కన్నడ నటిమణులు అనుష మరియు సంస్కృతి షినోయ్ ఈ సినిమాలో కృష్ణ మాధవ్ తో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియజేయబడుతాయి. ఇక మాస్టర్ యన్టీఆర్ నటించిన ‘స్కేటింగ్ మాస్టర్’ సినిమా పేరుకు తగ్గట్టుగానే స్కేటింగ్ నేపద్యంలో ఉంటుంది. ఇటీవల విడుదలయిన ‘గుండెల్లో గోదారి’ సినిమా హీరో ‘ఆది’ ఈ సినిమాలో నటించడమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగు పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో వర్ధమాన నటులు బల్లెం శ్రీవెంకట్, రెహమాన్, స్నేహిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కెమెరా: గోపి ; సంగీతం: శ్రీ వెంకట్.

'బాద్ షా' డిసైడ్ అయ్యాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అయితే ఇది వరకే రిలీజ్ డేట్ ని ప్రకటించిన ఈ మధ్య తెలుగు సినిమాల విడుదలలో ఏర్పడిన గందరలగోళం కారణంగా అభిమానులకు ఖచ్చితమైన సమాచారం వుండాలని మళ్ళీ ప్రకటిస్తున్నట్లు చెప్పారు.         ఈ చిత్రం మార్చి 29న సెన్సార్ జరగనుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ద్వారా విడుదలైన డైలాగులు ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌ షా'. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడతున్నకొద్దీ నందమూరి అభిమానులలో ఆనందం రెట్టింపవుతోంది.  తాజాగా ఈ చిత్రంపై మీడియాలో, ఫ్యాన్స్ లో హైప్ ఏర్పడడంతో ఈసారి 'బాద్ షా' సూపర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని అంటున్నారు. 'బాద్ షా'డిసైడ్ అయ్యాడు ..మరి కలెక్షన్లు వన్ సైడ్ అవుతాయో లేదో చూడాలి.     

బాలీవుడ్ తారలకు చెడ్డరోజులు

  బాలీవుడ్ తారలకు మళ్ళీ చెడ్డరోజులు మొదలయినట్లు ఉంది. మొన్న సుప్రీం కోర్టు 1993 లో జరిగిన ముంబై ఉగ్రవాదుల దాడుల కేసులో ప్రముఖ బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు 5 సం.లు జైలు శిక్ష విదిస్తూ తీర్పునీయగా, మళ్ళీ నిన్న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు బాలీవుడ్ తారలు సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబు, నీలమ్‌లకు వ్యతిరేఖంగా నేరాభియోగాలు నమోదుచేసింది.   ఈ ఐదుగురు 1998లో ‘హమ్‌సాథ్ సాథ్ హై’ అనే హిందీ సినిమా షూటింగ్ కోసం వారు రాజస్థాన్ జోధ్పూర్ వెళ్ళినప్పుడు షూటింగ్ విరామం రోజున సమీప గ్రామంలో అడవి జింకలను వేటాడినట్లు వారిపై గ్రామస్తులు పోలీసులకు పిర్యాదుచేయడంతో వారిపై కేసు నమోదు అయింది. నాటి నుండి నేటి వరకు సాగుతూ వస్తున్నఆ కేసు నిన్నమళ్ళీ కోర్టు ముందు వచ్చింది. శనివారంనాడు కోర్టులో వారిపై నేరాభియోగాలు నమోదుచేయబడ్డాయి. అయితే తాము నిర్దోషులమని వారు వాదించినట్లు సమాచారం.   ఈ కేసులో మొదటి ముద్దాయిగా పేర్కొనబడుతున్న బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం లండన్ ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకొంటున్నందున ఆయన తప్ప మిగిలిన వారందరూ నిన్న కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 27కు వాయిదా వేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 51, 9/51, 9/52 సెక్షన్ల కింద నమోదయిన అభియోగాలు కానీ నిరూపించబడితే వారిలో ఒక్కొకరికీ కనీశం 6సం.లు జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బాలివుడ్ కి ఏది మరో పెద్ద ఎదురుదెబ్బవుతుంది.   సంజయ్ దత్త్ కు క్షమాబిక్ష ప్రసాదించమని ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మహారాష్ట్ర ప్రభుత్వానికి మరియు మహారాష్ట్ర గవర్నరుకూ విజ్ఞప్తులు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం బాలివుడ్ కు కొంత ఊరట కలిగిస్తున్నది. సినిమాలలో సమాజాన్ని, దేశాన్ని రక్షించేసే మన హీరోలు నిజ జీవితంలో మాత్రం తద్విరుద్దంగా ప్రవర్తించడం తమ సినిమా భ్రమలోంచి బయటపడకపోవడం వలననే జరుగుతోందని చెప్పవచ్చును. సినిమాలలో చెల్లినట్లే నిజ జీవితంలో తమ ఆటలు చెల్లవని ఇటువంటి తీర్పులు వారికి గుణ పాఠాలు నేర్పిస్తున్నాయి.