high temparatures in telangana

వచ్చే మూడు రోజులూ తెలంగాణ అగ్నిగుండమే!

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భాగ్యనగరంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాలులు వీస్తాయని పేర్కొంది. అయితే నైరుతి రుతుపవనాలు మాత్రం సరైన సమయానికే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 

book on pinnelli

ఇది పుస్తకం కాదు.. పాపాల పుట్ట!

మనం చాలాసార్లు ఒక ప్రకటన చూసి వుంటాం.. అందులో నటుడు రంగనాథ్ అంటూ వుంటారు... ‘ఇది పంపు కాదు.. పాతాళ గంగ’ అని.. మాచర్ల ఎమ్మెల్యే హోదాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాల మీద ‘పిన్నెల్లి పైశాచికం’ పేరుతో ఒక పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకం చదివినవాళ్ళు ఎవరైనా ఆందోళనతో నోరు తెరుస్తారు.. ‘ఇది పుస్తకం కాదు.. పాపాల పుట్ట’ అని పెద్దగా అరుస్తారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన దగ్గర్నుంచి ఆయన చేసిన హత్యలు, అన్ని వర్గాల వారి మీద చేసిన దాడులు, కబ్జాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు... వీటన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. పిన్నెల్లి బాహాటంగా చేసిన ఘోరాలలో కొన్నిటిని మాత్రమే ఈ పుస్తకంలో పబ్లిష్ చేశారు. లెక్కలకి అందని ఎన్నో ఘోరాలు ఈ పుస్తకంలో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఆర్థిక విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఆయన చేసిన అవినీతి విలువ రెండు వేల కోట్లకు పైగా అనే విషయం బుర్ర పేలిపోయేలా చేస్తుంది. పిన్నెల్లి చేసిన నేరాలను చాప్టర్లవారీగా విభజించారు. వాటిలో 1. గ్రానైట్ అండ్ గ్రావెల్ దోపిడీ - రూ. 1,433 కోట్లు, పిఆర్కే టాక్స్, మద్యం దోపిడీ - రూ. 4 వందల కోట్లు, భూ కబ్జాలు - 376 ఎకరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల భూముల కబ్జా, ఇతరుల ఆస్తుల కబ్జాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై పిన్నెల్లి దాడులు, అక్రమ కేసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ముఠా చేసిన హత్యలు, పిన్నెల్లి పైశాచికం, పిన్నెల్లి నేర వారసత్వం.. ఇలాంటి సబ్ హెడ్డింగ్స్ కింద పిన్నెల్లి చేసిన దారుణాలన్నీ వివరంగా ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆధారాలు, పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చారు.  ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, మంచి పరిపాలన వుండాలని కోరుకునేవాళ్ళందరూ ఈ పుస్తకం తప్పక చదవాలి. అయితే పిల్లలు, వృద్ధులు, సున్నిత హృదయులు, హార్ట్ పేషెంట్లు ఈ పుస్తకానికి దూరంగా వుంటే మంచింది. ఎందుకంటే, ఈ పుస్తకంలో వున్న ఘోరాలు చదివి వాళ్ళకు ఏమైనా అయ్యే ప్రమాదం వుంది మరి!

modi completely depend on sympathy

మోడీ ఈ సారి సానుభూతినే నమ్ముకున్నారా?

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, శాపనార్ధాలు సహజం. అయితే ఓటమి భయం తలకెక్కిన పార్టీ నేతలు మాత్రం ఆ విమర్శలు, తిట్లను సానుభూతిగా మార్చుకునేందుకు ప్రయత్నించడం కద్దు. అయితే ఆ ప్రయత్నంలో తాము ప్రత్యర్థులపై చేసిన విమర్శలను కన్వీనియెంట్ గా మరిచి పోతారు. ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. విపక్షాల విమర్శల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు నన్న ఇన్ని సార్లు విమర్శించారు. ఇన్ని తిట్లు తిట్టారు అంటూ ఎన్నికల సభలలో, ఇంటర్వ్యూలలో చెప్పుకుంటూ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటి వరకూ ఆరు విడతల పోలింగ్ ముగిసింది. చివరి విడత వచ్చే నెల 1న జరగనుంది. అంటే ఇప్పటికే పార్టీలన్నీ ఫలితాల విషయంలో ఒక అంచనాకు వచ్చేసి ఉంటాయి. ఆరు విడతల్లో జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ కూటమికి ఆ కూటమి తమతమ విజయావకాశాలపై ఒక అంచానకు వచ్చేసి ఉంటాయి. పరిశీలకులు, పోల్ స్ట్రాటజిస్టులు మాత్రం ఈ సారి ఎటువంటి ట్రెండ్ కనిపించలేదని స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ప్రధాని మోడీ సహా కమలనాథులంతా ప్రచారంలో ఊదరగొట్టినట్లు ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు. పదేళ్ల మోడీ పాలనపై ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించిందంటున్నారు. అంతే కాకుండా 2014, 2019 ఎన్నికలలో సాధించిన విధంగా బీజేపీ సొంతంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించడం కూడా కష్టమేనంటూ విశ్లేషణలకు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ అయితే స్పష్టంగా బీజేపీ అధికారం కోసం కూటమి భాగస్వామ్య పార్టీలు గెలుచుకునే స్థానాలపై ఆధారపడక తప్పదని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలోనే చివరి దశలోనైనా పుంజుకోవాలన్న ఉద్దేశంతో మోడీ పూర్తిగా సానుభూతిపై ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. సాధారణంగా రాజకీయాలలో విమర్శకు ప్రతి విమర్శ సహజం. అలాగే ఆరోపణలను ఖండిస్తూ ప్రత్యారోపణలు చేయడమూ కద్దు. కానీ ప్రత్యర్థులు చేసిన విమర్శలను లెక్కపెట్టుకుని మరీ ఇన్ని విమర్శలు చేశారు. అన్ని విమర్శలు చేశారంటూ ప్రజా సానుభూతి పొందాలని చూడరు. కానీ ప్రధాని మోడీ ఇప్పుడా పనే చేస్తున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విపక్షాలు ఇప్పటి వరకూ తనపై 101 విమర్శలు చేశారంటూ లెక్కలు చెప్పారు. ఆ విమర్శలు తిట్ల స్థాయిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆయన వ్యాఖ్యలు ఓటమి భయాన్నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి విపక్ష కాంగ్రెస్ పై మోడీ చేసినన్ని విమర్శలు.. ఏ రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకుడు కానీ ప్రత్యర్థి పార్టీలపై చేసి ఉండరు. కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి జరిగిన ప్రతి అంశాన్ని గుర్తు చేసుకుని మరీ మోడీ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. అటువంటి మోడీ హఠాత్తుగా అనూహ్యంగా విపక్షాలు తనను తిట్టిపోస్తున్నాయంటూ బేల కబుర్లు చెప్పడం పరిశీలకులను సైతం విస్మయపరిచింది.  అసలు తొలి విడత పోలింగ్ ముగిసిన మరుక్షణం నుంచీ మోడీ వాణి బారింది. ప్రసంగాల బాణి మారింది. దేశంలో విద్వేషాలు రగిల్చేలా ఆయన ప్రసంగాలు ఉన్నాయి.  మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల కారణంగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కొన్ని ఇబ్బందులకు గురౌతాయని తెలిసినా వెనుకాడలేదు.  దీనితో సెఫాలజిస్టులు చెబుతున్నట్లు మోడీ హవా ఈ ఎన్నికలలో కనిపించడం లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

CV Anand Mudra in Telangana ACB

తెలంగాణ ఎసిబిలో  సివి ఆనంద్ ముద్ర

బిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ఆకాశాన్నంటితే పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే అవినీతిని పాతాళంలో తొక్కేయడానికి పావులు కదుపుతోంది. కెసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణాల్లో అవినీతి ఒకటి. ఎంఎల్ సి కొనుగోళ్ల కేసులో  రేవంత్ రెడ్డిని ఇరికించి  చుక్కలు చూపించిన కెసీఆర్ ప్రభుత్వం హాయంలో అధికారులు అవినీతికి పాల్పడి కెసీఆర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి నివారణ కోసం ఫోకస్ పెట్టింది. బిల్ కలెక్టర్ నుంచి ఏసీపీ వరకూ ఎవరైనా లంచం తీసుకున్నారని ఫిర్యాదు వచ్చినా… తీసుకుంటున్నారని సమాచారం వచ్చినా ఏసీబీ అధికారులు వదిలి పెట్టడం లేదు. ట్రాప్ చేసి పట్టేసుకుంటున్నారు. హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ బాలకృష్ణ , ఏసీపీ ఉమామహేశ్వర్ రావు లాంటి పెద్ద చేపల్ని పట్టుకుని జైలుకు పంపిన ఏసీబీ … చిన్న చిన్న లంచాలే కదా అని కింది స్థాయి వారిని ఉపేక్షించడం లేదు. అవినీతి అనే క్యాన్సర్ ను మొదలకంటా తుడిచేయాల్సిందేనన్న ఉద్దేశంతో అందర్నీ ప ట్టేసుకుంటున్నారు. ఆదిలాబాద్ నుంచి ఎల్బీనగర్ వరకు ఏ మున్సిపాలిటీలో అయినా లంచం తీసుకుంటున్నారని సమాచారం వస్తే ప ట్టేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కనీసం అరవై కేసుల్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఎంత మొత్తం అవినీతి అని కాదు.. లంచం అనే మాట వినిపిస్తే దూకుడుగా వెళ్లి అవినీతి పరుల్ని పట్టుకుంటున్నారు. గత ఐదేళ్లుగా ఏసీబీ నిద్రావస్థలోనే ఉంది. అడపాదడపా దాడులు చేయడం తప్ప.. సంచలనాత్మకంగా ఎవర్నీ పట్టుకోలేకపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ ను నియమించారు. ఆయన సిన్సియారిటీ గురించి … పోలీసు వ్యవస్థలో అందరికీ తెలుసు. సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఏసీబీ ఇమేజ్ మారిపోయింది . ముందు ముందు ఇంకెన్ని సంచలన కేసులు వెలుగులోకి తెస్తుందో కానీ.. ఇప్పటికి మాత్రం ఏసీబీ అంటే.. ఉద్యోగులు హడలి పోతున్నారు. లంచాల ప్లాన్లు ఉంటే.. ఇప్పుడే వద్దనుకుంటున్నారు.

cm cbn slogans in shamshabad airport

శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం బుధవారం (మే 29) ఉదయం సీఎం చంద్రబాబు అన్న నినాదాలతో మారుమోగిపోయింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. భార్య భువనేశ్వరితో కలిసి ఈ నెల 19న అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం (మే29) స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ సందర్భంగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.    పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా వారు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.   కాగా చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ నేతలు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఎవరికీ చెప్పకుండా ఆయన విదేశాలకు వెళ్లడమేంటంటూ పలువురు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు గుప్పించారు. అదే సమయంలో కోర్టు అనుమతి తీసుకుని మరీ సకుటుంబంగా విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ విషయం మాత్రం వారు ప్రస్తావించలేదు. జగన్ విదేశీ పర్యటనకు  అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కోర్టు ఆయనకు పలు షరతులు విధించి ఆ తరువాత విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 

keeravani compose telangana state

అందెశ్రీకే లేని అభ్యంతరం బీఆర్ఎస్ కు ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతం ఇప్పటికే  దిగజారిన ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది. అసలు ఆ గీత రచయత అందెశ్రీకే లేని అభ్యంతరం బీఆర్ఎస్ కు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది.  తెలంగాణ రాష్ట్ర గీతం ఆంధ్రా వ్యక్తి కంపోజ్ చేయడమా అంటూ గుండెలు బాదేసుకుంటూ బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు కానీ గీత రచయత అందశ్రీ మాత్రం తన గీతానికి కీరవాణి బాణీ కట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలన్న తాపత్రేయం తప్ప బీఆర్ఎస్ అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి బాణీ సమకూర్చడంలో తప్పేమిటో అర్ధం కాదు.  బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో  కేసీఆర్ సర్కార్ తెలంగాణ క్రీడా ప్రతినిథిగా పుల్లెల గోపీచంద్ ను నియమించడం తప్పు కానప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీ కట్టే బాధ్యతను కీరవాణికి అప్పగించడంలో తప్పేమిటన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. అలాగే నటి సమంతను తెలంగాణ హ్యాండ్ లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినప్పుడు కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ వాదం గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు నిలదీశారు. ఏది ఏమైనా రాష్ట్రం ప్రాతిపదికన ప్రజల మధ్య చీలిక తీసుకురావడం ఎంత మాత్రం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. కీరవాణి తెలంగాణ వ్యక్తి కాదంటూ బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధమైనవనడంలో సందేహం లేదు.  

why ycp hurry accept defeat

ఓటమి ఒప్పేసుకోవడానికి వైసీపీకి అంత తొందరెందుకు?

వారం రోజులు.. సరిగ్గా వారం రోజులు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలిపోతుంది. అయితే అధికార వైసీపీకి మాత్రం అంత వరకూ ఆగో ఓర్పూ సహనం లేకుండా పోయింది. అందుకే ఇప్పటి నుంచే తమ ఓటమికి సాకులు వెతుక్కుంటూ తమ పార్టీ ఓటమికి పూర్తి కారణం చంద్రబాబునాయుడే అంటూ చెప్పుకుంటోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు తమ తప్పిదాలన్నిటికీ తెలుగుదేశం పార్టీయే కారణమంటూ నిందలు మోపుతోంది.  పోలింగ్ జరిగిన నాటి నుంచీ వైసీపీ తన ఓటమిని తానే చాటుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటోంది.  వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అవ్వడానికి చంద్రబాబే కారణమని ఆక్రోషిస్తోంది.  ఇంకా ఓట్ల లెక్కింపునకు వారం రోజులు గడువు ఉండగానే .. తాము ఎందుకు ఓడిపోయామో చెప్పుకోవడానికి వైసీపీ నేతలు పోటీలు పడుతున్నారు.  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో దాదాపు 82 శాతం ఓటింగ్ పోలైనపుడు, వైసీపీ చంకలు గుద్దుకుంది. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారుణంగా పడినదంతా ప్రభుత్వ సానుకూల ఓటేనంటూ ఊరూ వాడా ఏకం చేసింది. అయితే ఆ ధీమా, ఆ విశ్వాసం రోజులు గడుస్తున్న కొద్దీ కనుమరుగౌతోంది.   పోలింగ్ సరిగా జరగలేదని, రీ పోలింగ్ కావాలని డిమాండ్లు మొదలు పెట్టింది. విధ్వంసం జరిగిన చోట్ల తెలుగుదేశం రీపోలింగ్ కు ఎందుకు డిమాండ్ చేయడం లేదని దబాయించడం మొదలెట్టింది.   చంద్రబాబుపై పడి ఏడవడం మొదలెట్టింది. చంద్రబాబు ట్యాన్ కు మోడీ సైతం డ్యాన్స్ చేస్తున్నారంటూ సజ్జల మీడియా ముందు ఉక్రోషం వెళ్లగక్కారు. వైసీపీ నేతల మాటలు వింటుంటే,   వారి గాభరా చూస్తుంటే.. బహుశా పరాజయం ఎంత ఘోరంగా ఉండబోతోందో వారికి తెలిసిపోయిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.    

ycp resady another violance

మరో విధ్వంసానికి వైసీపీ రెడీ.. పేర్ని నాని వ్యాఖ్యల అర్ధం అదేనా?

వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో వెడుతోంది. తన తప్పులు, తప్పిదాలు, తన  దౌర్జన్యాలూ, దాష్టికాలూ అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత ఐదేళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తై, పార్టీ ఓటమి ఖరారైందన్న అంచనాల నేపథ్యంలో కూడా మరోసారి విధ్వంసానికి ప్రణాళికలు రచించి, ఆ జరగబోయే విధ్వంసానికి తెలుగుదేశం కూటమి కారణమని ముందస్తుగానే చెప్పేస్తోంది. ఇందుకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని మాటలే తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో  వైసీపీ విభేదిస్తున్న సంగతి తెలిసిందే.  అలా విబేదించడానికి, ఆ మార్గదర్శకాల పట్ల అభ్యంతరం చెప్పడానికీ వైసీపీకి పూర్తి అధికారాలు ఉన్నాయి. అయితే తన అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఆగకుండా వైసీపీ విధ్వంసం, హంస చెలరేగే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నది. అందుకు కారణం తెలుగుదేశం కూటమేనని ఇప్పటి నుంచే గుండెలు బాదేసుకుంటోంది. అంటే హింసకు ముందే ప్రణాళికలు రచించి.. కౌంటింగ్ సందర్భంగా హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఆ జరగబోయే హింసకు కారణం తెలుగుదేశమేనని ఇప్పటి నుంచే గుండెలు బాదేసుకుంటోంది. మంగళవారం (మే28) మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని మాటలు వింటే ఈ విషయం విస్పష్టంగా అర్ధమైపోతుంది.  సాధారణంగా పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే సమయంలోనూ కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగడం కద్దు. అయితే పోలింగ్ ముగిసిన తరువాత రోజుల తరబడి అల్లర్లు, విధ్వంసం కొనసాగడం గతంలో ఎన్నడూ లేదు. పోలింగ్ ముగిసిన తరువాత ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. దానిని మార్చడం ఎవరి వల్లా కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.  కానీ అలా జరుగుతుంది అంటూ పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి మరీ చెబుతున్నారు.  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో గందరగోళం జరగబోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ గందరగొళానికి ఎన్నికల సంఘం నిర్ణయం, ఎన్నికల సంఘం అలా నిర్ణయం తీసుకోవడానికి కారణమైన తెలుగుదేశమే కారణమని ముందస్తు ఆరోపణలు గుప్పించేస్తున్నారు.  కౌంటింగ్‌లో కేంద్రాలలో 10-15 మంది పార్టీల ఏజంట్లు ఉంటారు. ఆ సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలలో ఏ చిన్న తేడా కనిపించి ఏ ఒక్కరూ అభ్యంతరం చెప్పినా కౌంటింగ్‌ రసబాసగా మారుతుంది. కౌటింగ్ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిపించాలని మేము కోరుతున్నాము. కానీ రసాభాసగా మార్చేందుకు కుట్ర జరుగుతోంది అని ఆరోపిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ ప్రక్రియని నిర్వహించేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్‌ ప్రతీ బ్యాలెట్ పేపర్ వెనుక వైపు సంతకం చేసి ఇస్తారు. కానీ ఒక్కోసారి సంతకం చేయడం మరిచిపోయినా అది సరిపోలక పోయినా ఆ ఓట్లు పరిగణనలోకి తీసుకునేవారు కారు.   కానీ  ఈసారి రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.  రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా పర్వాలేదని ఈసీ చెప్పినప్పుడు, పోస్టల్ బ్యాలట్ పత్రాలపై వారి సంతకాలను సరిపోల్చాల్సిన అవసరమే ఉండదు. కానీ సంతకంలో చిన్న తేడా వచ్చినా రసాభాస తప్పదని పేర్ని నాని హెచ్చరిస్తున్నారంటే.. ఈ వంకతో కౌంటింగ్‌ కేంద్రాలలో వైసీపి ఘర్షణలు జరిగేలా  జరిగేలా కుట్రలు చేస్తోందని అర్ధమౌతోంది. ఎందుకంటే తాను చేసిన దానికీ, చేయబోయిన దానికి కారణం తెలుగుదేశం అని ఆరోపించడం వైసీపీకి తొలి నుంచి అలవాటైన విద్య కనుక.  పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపి ఇంతగా ఆందోళన చెందడానికి కారణం ఆ ఓట్లన్నీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్న ప్రభుత్వోద్యోగులవి కావడం వల్లనే.  కనుక వాటి లెక్కింపు సవ్యంగా జరగకుండా ఉండేందుకు ఆ పార్టీ నానా తంటాలూ పడుతోంది. అసలు ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు ఉపయోగించుకోవడమంటేనే వారిలో ప్రభుత్వం పట్ల ఎంత ఆగ్రహం గూడుకట్టుకుని ఉందో అవగతమౌతుంది. అదే సమయంలో దాదాపు లక్షకు పైగా పోస్టల్ బ్యాలెట్ లపై ఆర్వో సంతకం, సీలు లేదంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను చెల్లనివిగా  చేసేందుకు ప్రభుత్వ స్థాయిలో ఎంత కుట్ర జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ కారణంగానే తెలుగుదేశం కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సంతకం, సీలు లాంటి టెక్నికల్ ఇష్యూస్ కి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని చెప్పింది.  ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో గొడవలు జరుగుతాయంటూ పేర్ని నాని గుండెలు బాదుకోవడం చూస్తుంటే.. కౌంటింగ్ కేంద్రాల వద్ద గలాభా సృష్టించేందుకు వైసీపీ భారీ ప్రణాళికలే రచించిందని అర్ధమౌతోంది.  

pawan win pithapuram by a margin of 30thousand votes

30వేల పైచిలుకు మెజారిటీతో పవన్ విజయం.. జేడీ లక్ష్మీనారాయణ జోస్యం

పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి అన్నా, ఆయన కుటుంబం అన్నా తనకు ఎంతో గౌరవాభిమానాలున్నాయని చెప్పారు. ప్రజారాజ్యం అభ్యర్థిగా తాను గతంలో ఎన్నికలలో పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా విజయంపై ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. దీంతో పిఠాపురంలో గెలిచేది ఎవరన్న దానిపై కాకుండా అక్కడ పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది.  ఈ తరుణంగా జేడీ లక్ష్మీనారాయణగా గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధినేత వీవీ లక్ష్మీనారాయణ కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్ దే విజయం అని చెప్పడమే కాకుండా ఆయనకు 30 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని జోస్యం చెప్పారు.  తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పిఠాపురంలో పవన్ కల్యాణ్ పెర్ఫార్మెన్స్ పై తన పరిశీలనను, అభిప్రాయాలను పంచుకున్నారు.  పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ముఫ్ఫై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారనీ చెప్పారు. వాస్తవానికి పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ రికార్డు స్థాయి మెజారిటీతో అంటే దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం 30 వేల మెజారిటీ అని భావిస్తున్నారు.  మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పని చేసిన లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా ఉన్న సమయంలో  కేసులను దర్యాప్తు చేశారు.   వీటిలో సత్యం కంప్యూటర్స్ కార్పొరేట్ కుంభకోణం, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసు, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. 2018లో ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన  ఆయన 2019 ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.   ఆ తరువాత ఆయన జనసేన నుంచి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచీ  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు, యువతలో చైతన్యం కలిగిస్తూ వచ్చారు.  ఇటీవలే ఆయన జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయంపై లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Stickers war in Pithapuram

పిఠాపురంలో స్టిక్కర్ల వార్

పిఠాపురంలో  ఏది జరిగినా  సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్  పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిన‌ప్ప‌ట్టి నుంచీ ట్రెండింగ్ లో ఉన్న సెగ్మెంట్ ఇది. అక్కడ ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్‌ కూడా అంతే ఆసక్తిగా కొన‌ సాగింది. యువ‌త అర్థ‌రాత్రి వ‌ర‌కు ఓటు వేశారు. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త…చాలా పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు.  జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ పవన్ అభిమానులు బైకులు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మనల్నెవడ్రా ఆపేది అనే కొటేషన్స్ తో రచ్చ చేస్తున్నారు.  ‘మా MLA పవన్' అంటూ రాయించుకుంటున్నారు.    అటు  జనసేన కార్యకర్తలకు ధీటుగా వైసీపీ అభ్యర్థి వంగా గీతా అభిమానులు కూడా స్టిక్కర్లు  వేయించుకుంటున్నారు.  కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీతా అంటూ బైక్ లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు.  ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రిజల్ట్స్ కు ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఫ్లెక్సీలతో హంగామా చేస్తున్నారు. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో నడుస్తుందనడానికి ఈ సంఘ‌ట‌న‌లు అద్దం ప‌డుతున్నాయి.  పవన్‌ అనుచరులు మొదలు పెట్టిన మైండ్‌ గేమ్‌కి వైసీపీ  కౌంటర్‌ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్‌ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీత కు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. టూవీలర్‌ల నెంబర్‌ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు.  ఇక్క‌డ‌ పొలిటికల్ హీట్  ఏ మాత్రం తగ్గడంలేదు.   పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్  బరిలో ఉండగా, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. అయితే వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడి ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 

sajjja also accepted ycp defeat

చివరాఖరికి సజ్జల కూడా వైసీపీ ఓటమి ఖాయమని తేల్చేశారుగా?

వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామన్న జగన్ రెడ్డి మాటలు అబద్ధమని కూడా తేల్చేశారు. పోలింగ్ జరిగిన నాటి నుంచి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేశారు. పోలిసులు పూర్తిగా తెలుగుదేశంతో కుమ్మక్కైపోయారు. నిజాయితీగా పని చేసే అధికారులను మార్చేశారు అంటే శోకన్నాలు పెట్టిన సజ్జల ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి మాచర్లలో ఈవీఎం ధ్వంసమైనా తెలుగుదేశం రీపోలింగ్ కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదంటూ ప్రశ్నలు గుప్పించారు. రీపోలింగ్ డిమాండ్ చేయలేదంటే అక్కడ  తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పోలింగ్ జరిగినట్లే కదా అని ఆయనే జవాబు కూడా చెప్పేశారు. సాధారణంగా విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నపార్టీ రీపోలింగ్ కోసం డిమాండ్ చేయదు. అదే fవిాషయాన్ని సజ్జల చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నానని భావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు వ్యూహాల ముందు ఎవరూ పనికిరారని అన్యాపదేశంగా అంగీకరించేశారు. ఎవరైనా సరే చంద్రబాబు మాట వినాల్సిందేనని చెప్పారు. చివరాఖరికి మోడీ కూడా చంద్రబాబు ట్యూన్ కు డ్యాన్స్ చేయాల్సిందేనని సజ్జల అన్నారు. వాస్తవానికి సజ్జల   చెబుదామనుకున్నారంటే.. చంద్రబాబు పోల్ మేనేజ్ మెంట్ ద్వారా పోలింగ్ మొత్తం  తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మారిపోయిందనీ, అందుకకు బీజేపీ సహకరించిందనీ చెప్పేశారు. అలా చెప్పడం ద్వారా ఆయన చంద్రబాబును పొగడడమే కాకుండా వైసీపీ ఓటమిని కూడా అంగీకరించేశారు. ఇక ఇప్పటి వరకూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ క్యాడర్  జారిపోకుండా ఉండేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు,  ఇచ్చిన హైప్ అన్నీ వ్యర్థంగా మారిపోయాయి.

Bomb threat to Nampallicourt

నాంపల్లికోర్టుకు బాంబు బెదిరింపు 

హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది.   తెలంగాణ‌లో వ‌రుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఒకే రోజు ప్రజాభ‌వ‌న్‌, నాంప‌ల్లి కోర్టుకు ఇలా బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్స్ రావ‌డం గ‌మ‌నార్హం. మొద‌ట ప్ర‌జాభ‌వ‌న్‌లో బాంబ్ పెట్టామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు. కానీ, ఎలాంటి బాంబ్ లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపీరి పీల్చుకున్నారు. దాంతో ఈ ఫేక్ కాల్ చేసిన వ్య‌క్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఒక‌వైపు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే తాజాగా నాంప‌ల్లిలోని కోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. నాంప‌ల్లి కోర్టులో బాంబు పెట్టామ‌ని, మ‌రి కాసేప‌ట్లో కూల్చేస్తామ‌ని ఆగంత‌కుడు పోలీసుల‌కు ఫోన్ చేశాడు. దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయిన పోలీసులు హైకోర్టులో బాంబ్ స్క్వాడ్ బృందాల‌తో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. కానీ, ఎలాంటి బాంబ్ ఆన‌వాళ్లు ల‌భ్యం కాక‌పోవ‌డంతో ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

guduvda and gannavaram key constituencies

గుడివాడ, గన్నవరం.. ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లంటే?

సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రిపోల్, పోస్ట్ పోల్ అంచనాలన్నీ తెలుగుదేశం కూటమి విజయాన్నే సూచిస్తున్నాయి.   ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తరువాత 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలౌతుంది.  ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓట్ల లెక్కింపు మచిలీపట్నంలోకి కృష్ణా వర్సిటీలో జరుగుతుంది.  జిల్లాలో అందరి దృష్టి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపైనే ఉంది. ఈ నియోజకవర్గాలలో ఉండటానికి పోటీలో పన్నెండీసి మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే జరుగుతున్నది. గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా,  తెలుగుదేశం తరఫున వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొత్తం 17 రౌండ్లలో జరుగుతుంది.  ఫలితం మధ్యాహ్నానికే వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ పోలింగ్ సరళిని బట్టి చూస్తే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము స్పష్టమైన ఆధిక్యత సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మరో వైపు వైసీపీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.  ఇక గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పోటీ ప్రధానంగా తెలుగుదేశం అభ్యర్థి  యార్గగడ్డ వెంకటరావు, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 22 రౌండ్లలో సాగుతుంది. దీంతో ఈ నియోజకవర్గ ఫలితం తేలేందుకు ఒకింత ఆలస్యం కావచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా పోలింగ్ సరళిని బట్టి చూస్తే యార్లగడ్డ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. 

కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్ 

బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా బెయిల్ విషయంలో ఇంకా  క్లారిటీ రాలేదు.   ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు దర్యాఫ్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తైన అనంతరం ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

కేటీఆర్ మాట్లాడ్డం బంద్‌ చేస్తే మంచిది!

అధికారంలో వున్నప్పుడు ఏం మాట్లాడినా అందరూ ఆహా, ఓహో అని చప్పట్లు చరుస్తారు. అధికారం పోయిన తర్వాత పట్టించుకునేవారే వుండరు. ముఖ్యంగా అధికారంలో వున్నప్పుడు తన మాటే వేదంగా నడిపించుకున్న కేటీఆర్ లాంటి వాళ్ళ మాటలకు అసలు విలువే వుండదు. ఆ విషయాన్ని అధికారం పోయి ఇంతకాలమైన గ్రహించలేని కేటీఆర్ తానింకా అధికారంలోనే వున్నాన్న భ్రమల్లో బతుకుతూ అదే ధో్రణిలో మాట్లాడుతున్నారు. ఆమధ్య ఉగాది రో్జున పంచాంగ శ్రవణం సందర్భంలో పంతులుగారు సాక్షాత్తూ కేటీఆర్ ముందే కూర్చుని, నోరు అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ చిలక కాదు కదా.. ఒక గండభేరుండం. అందుకే ఆ హితబోధ పట్టించుకోలేదు. ఎంత గండభేరుండమైనా గాలివాన ముందు తల వంచాల్సిందే కదా.. ప్రస్తుతం గాలివానలో చిక్కుకున్న కేటీఆర్ తల వంచడం మరచిపోయి తలెత్తి మాట్లాడుతున్నారు. చివరికి అవి తలవంపులుగా మారుతున్నాయి. ఆదిలాబాద్‌లో రైతులు ఆందోళన చేశారట. వాళ్ళ మీద పోలీసులు లాఠీఛార్జ్ చేశారట. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి, కేరళకి వెళ్ళడం సిగ్గుచేటు అని కేటీఆర్ ఒక స్టేట్‌మెంట్ మీడియా మొహాన కొట్టేసి చేతులు దులుపుకున్నారు. అక్కడితో తన పని అయిపోయిందని అనుకుని ఆయన రిలాక్స్ అయితే అవ్వచ్చేమో, కానీ ఆయనకు ఆ మాట అనడానికి నైతికంగా ఎంత అర్హత వుందే అర్థం చేసుకోవాలి. రైతుల ఆందోళన పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలనే ఉసిగొల్పి, పరిస్థితిని లాఠీఛార్జ్ వరకు వచ్చేలా రచ్చ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు. బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ఎవర్నయినా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారా? ఎవరూ నోరు ఎత్తకుండా ఆందోళనకారులందర్నీ బూటు కాళ్ళ కింద వేసి తొక్కేశారే... అప్పుడేమయ్యాయి ఈ నీతి సూత్రాలు? ఏదో సినిమాలో సునీల్ డైలాగ్ ఒకటి వుంటుంది.. సార్ రూల్స్ పెడతారు... పాటించరు... అని.. మీ తీరు అలాగే వుంది కేటీఆర్ గారూ! అందువల్ల మీరు ఇలాంటి బాధ్యతారాహిత్యమైన మాటలు, ఫ్లాష్‌బ్యాక్ మరచిపోయి చేసే కామెంట్లు మానుకుంటే మంచిది.

చినజీయార్ స్వామి కాళ్లు మొక్కినప్పుడు తెలంగాణ గుర్తురాలేదా కేసీఆర్?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఏమైనా అభినవ గజనీయా? గతంలో ఆయన చేసినవేవీ ఆయనకు ఇప్పుడు గుర్తుకు లేవా? లేక తన కన్వీనియెన్స్ కోసం మరిచిపోయినట్లు నటిస్తున్నారా? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం జయహే తెలంగాణకు ప్రసిద్ధ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించే విషయమై బీఆర్ఎస్ గగ్గోలు పెట్టేస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి సంగీతమందించడమా అంటూ గుండెలు బాదేసుకుంటోంది. అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనమేంటని గొంతెత్తి అరుస్తోంది.  వాస్తవానికి కీరవాణి ఎప్పుడో మూడు దశాబ్దాల కిందటే.. హైదరాబాద్ లో స్థిరపడ్డారు. అంతే కాదు ఆస్కార్ అవార్డు గెలుచుకుని యావత్ భారత దేశానికీ గర్వకారణంగా నిలిచారు. అటువంటి కీరవాణి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం అందిస్తుంటే బీఆర్ఎస్ నేతలు గంగవెర్రులెత్తిపోతున్నారు. ఇంత అన్యాయమా, ఇది తెలంగాణకు ద్రోహం చేయడం కాదా అంటూ ఊరూవాడా ఏకం చేసేస్తున్నారు. తన పార్టీ నేతలు, శ్రేణులూ ఇంత గొడవ చేస్తుంటే కేసీఆర్ మాత్రం పూర్తిగా మౌనముద్ర దాల్చారు. గజనీలా గతంలో తాను చేసినవేవీ గుర్తు లేనట్లు.. తన వాళ్ల వాచాలతను తీర్చుకోమని వదిలేసి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నారు.  తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్లు పని చేసిన కేసీఆర్ తన హయాంలో ప్రోత్సహించిన వారంతా ఆంధ్రావ్యక్తులేనన్న సంగతిని కన్వీనియెంట్ గా మరచిపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి అందివచ్చిన అవకాశంగా భావించి తమ వారిని అవాకులూ చెవాకులూ పేలుతున్నా కిమ్మనకుండా ఊరుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గీతాన్ని రచించినది తమిళుడైన శంకరంబాడీ సుందరాచారి. అలాగే అమరావతిపై విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం రచించినది తెలంగాణ వ్యక్తి అయిన సుద్దాల అశోక్ తేజ. ఈ విషయంలో ఆంధ్రులెవరూ ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. అంతెందుకు కేసీఆర్ మానస పుత్రిక, బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన మేఘా కృష్ణారెడ్డి. ఆ ప్రాజెక్టును ప్రారంభించినది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కేసీఆర్ గజినీలా మర్చిపోయారా? అప్పట్లో మేఘా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబెట్టడంపై అప్పటి మంత్రి హరీష్ రావు పూర్తిగా సమర్ధత ఆధారంగానే మెఘాకు కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు.   ఇక కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పునర్నిర్మించి యాద్రాద్రి ఆలయ చీఫ్ ఆర్టిటెక్ట్ ఆనంద సాయి కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. అదే ఆంధ్రప్రదేశ్ కు చెంది స్వామి చినజీయర్ స్వామిని కేసీఆర్ తన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి మరీ పాద సేవ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  అలాగే విశాఖ పట్నానికి చెందిన స్వామి స్వరూపానంద స్వామికి కేసీఆర్  ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో విలువైన భూములను కట్టబెట్టిన సంగతీ  తెలిసిందే. ఇంతెందుకు అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ జనమే ఉండేవారు. గజినీలా ఇప్పుడవన్నీమర్చిపోయి రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ సెంటిమెంటు అంటూ యాగీ చేస్తే జనం నమ్మరు.  

బీజేపీ అపర చాణిక్యం! బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ ఖాతాలోకే!

ఉత్తరాదిలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి వున్నా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీ తొమ్మిది స్థానాలు గెల‌వ‌బోతోంది. ఏపీలో జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా బీజేపీకి ప్రమాదం లేదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించడానికి వ్యూహాత్మ‌కంగా ఎత్తుగ‌డ‌లు వేసింది. సికింద్రాబాద్ సీటును ప‌ణంగా పెట్టి మొత్తం తెలంగాణాలో ఓట్ల‌ను త‌నకు అనుకూలంగా మ‌లచుకుంది. ఎంఐఎం సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండ‌ని పిలుపునివ్వ‌డంతో తెలంగాణా వ్యాప్తంగా హిందు ఓట‌ర్ల‌పై ప్ర‌భావం ప‌డి బీఆర్ ఎస్ ఓట్లు బీజేపీకి మ‌ళ్ళాయి. తెలంగాణాలో కాషాయ‌పార్టీకి బాగానే కలిసొచ్చింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి భారీ ఎత్తునే ప‌డ్డాయి.   గ్రౌండ్ లెవెల్లో 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్ని చూసిన‌ట్లైతే.... బీజేపీ 9, కాంగ్రెస్ 7, ఎంఐఎం 1. 1. ఆదిలాబాద్ః  కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్యే ఫైట్ క‌నిపిస్తోంది. అయినా బీజేపీకే ఎడ్జ్ వుంది.  మంత్రి సీత‌క్క బాగా వ‌ర్క్ చేశారు. పోల్ మేనేజ్‌మెంట్ బాగా చేశారు. బీజేపీకి గ‌ట్టి పోటీ ఇచ్చినా,  భైంసా, ఆదిలాబాద్ హిందుత్వ ఓటు బ్యాంక్ తో పాటు, ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 4 గురు బీజేపీ ఎమ్మెల్యేలు వున్నారు. దీంతో బీజేపీ విజ‌యావ‌కాశాలు పెరిగాయి. ప్ర‌ధాన పోటీ  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య వున్న‌ప్ప‌ట్టికీ ఇక్క‌డ బీజేపీకే గెలుపు అవ‌కాశాలున్నాయి.   2. నిజామాబాద్ః బీజేపీకే ఎడ్జ్ క‌నిపిస్తోంది. హిందుత్వ ఎజెండే ప‌ని చేసింది. బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్ ఇమేజ్ తో పాటు ఆయ‌న ప్ర‌సంగాలు,  డైలాగ్స్ ఓట‌ర్ల‌ను బాగానే ఆక‌ట్టుకున్నాయి. పైగా ఇక్క‌డి నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు బీజేపీకి వుండ‌టంతో అర‌వింద్‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. పోటీ బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ఉన్నా బీజేపీకీ గెలుపు అవ‌కాశాలున్నాయి.  3. క‌రీంన‌గ‌ర్ః బీజేపీకే ఎడ్జ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. బండి సంజ‌య్‌కి సానుభూతి వ‌చ్చింది. ఆయ‌న స్వంత ఇమేజ్‌తో పాటు, మైనార్టీ ఓట్లు కూడా ప‌డ్డాయి. ఇక్క‌డ పోటీ బీజేపీ - బీఆర్ ఎస్ మ‌ధ్య ఉంది. కాంగ్రెస్ డ‌మ్మీ అభ్య‌ర్థి.  ఇక్క‌డ బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూడా చేతులెత్తేశారు. కాబ‌ట్టి బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.  4. పెద్ద‌ప‌ల్లిః 7 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. మంత్రి శ్రీధ‌ర్ బాబు ఇంఛార్జ్ గా ప‌ని చేశారు.  బీజీపీ వీక్ అయినా బాగా పుంజుకుంది. పోల్ మేనేజ్‌మెంట్ స‌రిగా చేయ‌లేదు కాంగ్రెస్‌. దీంతో బీజేపీకి బాగా ప్ల‌స్ అయింది. మోడీ వేవ్ వుండ‌టంతో రెండు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ క‌నిపించింది. అయితే ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ వుంద‌ని చెప్ప‌వ‌చ్చు.  5. వరంగ‌ల్ః మంద‌కృష్ణ మాదిగ ప్ర‌భావం బాగా ప‌నిచేసింది. కాంగ్రెస్ మాదిగ‌ల్ని ప‌ట్టించుకోలేద‌నే ప్ర‌చారం ఓట‌ర్ల‌లో బాగా వెళ్ళింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ బ‌లంగా వుంది. ఎందుకంటే ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 3 చోట్ల బీజేపీ సెకెండ్ ప్లేస్ లో వుంది. ఇక్క‌డ బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ అభ్య‌ర్థులు వీక్‌. బీజేపీ అభ్య‌ర్థి బీఆర్ ఎస్ నుంచి వ‌చ్చారు. ఆర్థికంగా కూడా బ‌ల‌మైన నేత.  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య గ‌ట్టి పోటీ వున్న‌ప్ప‌ట్టికీ, బీజేపీకే ఎడ్జ్ వుంది.  6. భువ‌న‌గిరిః బీజేపీకే అనుకూలంగా వున్నా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ జోక్యంతో సీన్ మారింది. సి.ఎం. రేవంత్ రెడ్డి ఇక్క‌డ గెలుపును  ప్ర‌తిష్టాత్మ‌క‌గా తీసుకున్నారు. కోమ‌టి బ్ర‌ద‌ర్స్‌ను పొగుడుతూ సి.ఎం. చేసిన ప్ర‌సంగాలు వైర‌ల్ అయ్యాయి. సి.ఎం. అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి అనే డైలాగ్‌తో మొత్తం సీన్ మారింది. ఇక్క‌డ బీజేపీ గ‌ట్టి పోటీ ఇస్తున్న‌ప్ప‌ట్టికీ కాంగ్రెస్ అభ్యర్థికే గెలుపు అవ‌కాశాలున్నాయి. 7. న‌ల్గొండః కాంగ్రెస్ అభ్య‌ర్థికి అనుకూలంగా ఉంది. బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చినా ఇక్క‌డ‌ గెలుపు కాంగ్రెస్ అభ్య‌ర్థిదే. 8. చేవెళ్ళః బీజేపీ భారీ మెజార్టీ తో ఇక్క‌డ గెల‌వ‌నుంది. బీజేపీ అభ్య‌ర్థి కుటుంబ‌నేప‌థ్యం, ఆయ‌న చేస్తున్న సామాజిక సేవా కార్యక్ర‌మాలతో పాటు మోడీ వేవ్ బాగా క‌లిసి వ‌చ్చింది. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన రంజిత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స‌పోర్ట్ చేయ‌లేదు. బీఆర్ ఎస్ ఎఫెక్ట్ కూడా అంత‌గా లేదు. కాబ‌ట్టి ఈ నియోజ‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థి భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నారు. 9. మెద‌క్ః ఇక్క‌డ బీఆర్ ఎస్ - బీజేపీ మ‌ధ్యే పోటీ ఉన్న‌ప్ప‌ట్టికీ  ఎడ్జ్ బీజేపీకే వుంది. బీఆర్ఎస్‌కు 6 గురు ఎమ్మెల్యేలున్నా పోల్ మేనేజ్‌మెంట్ చేయ‌లేక‌పోయారు. బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద్‌రావు  ప్ర‌సంగాలు, ఆయ‌న మాట తీరు ప్ర‌జ‌ల్లో బాగా వెళ్ళింది. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి ప‌రిమితం అయింది. బీజేపీ అభ్య‌ర్థిగా గెలుపు అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. 10. మ‌ల్కాజ్‌గిరిః ఎన్నిక‌ల‌కు ముందే ఈటెలకు ఒన్ సైడ్ అనే ప్ర‌చారం జ‌రిగింది. ఇక్క‌డ గెల‌వ‌డాన్ని ఈటెల ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ప్ర‌చారం చేశారు. ఆయ‌న కోడ‌లు బాగా యాక్టివ్‌గా తిరిగారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి నాన్ లోకల్ కావ‌డంతో ఇక్క‌డ పోటీ బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య వుంది. అయితే ఇక్క‌డ ఈటెల గెలుపు ఒన్ సైడ్ అని చెప్ప‌వ‌చ్చు.  11. నాగ‌ర్‌క‌ర్నూల్ః కాంగ్రెస్ పార్టీకి ఈజీ గా గెలిచే సీటు అనుకున్నారు. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుక‌బ‌డ్డారు. అంత‌గా ప్ర‌చారం చేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీ మాల అభ్య‌ర్థిని బ‌రిలో దింపింది. అయితే ఇక్క‌డ‌ మాదిగ ఓట్లు ఎక్కువ‌గా వున్నారు కాబ‌ట్టి వాళ్ళే కీల‌కం. వాళ్ళంతా బీజేపీ వైపే మ‌ళ్ళారు. బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ యువ‌కుడు. మాదిగ కుల‌స్థుడు. అత‌ని  తండ్రి గ‌తంలో మంత్రిగా చేశారు. ఇవ‌న్నీ భ‌ర‌త్‌కు బాగా క‌ల‌సి వ‌చ్చాయి. దీంతో పాటు క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నాగ‌ర్ క‌ర్నూల్‌లో వుండ‌టంతో అదీ ప్ల‌స్ అయింది. 2019 లో బీఆర్ ఎస్ నుంచి రాములు 2 ల‌క్ష‌ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు భ‌ర‌త్‌కు తండ్రికి ల‌భించిన ఓట్లు ప్ల‌స్ అవుతాయ‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. నాగ‌ర్ క‌ర్నూల్‌లో  బీజేపీ భారీ మెజార్టీతో గెల‌వ‌బోతోంది. 12. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ః ఇక్క‌డ‌  బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. సి.ఎం. స్వంత నియోజ‌క‌వ‌ర్గం. బీజేపీ అభ్య‌ర్థి డికె అరుణ‌కి స్థానికంగా మంచి ప‌ట్టు వుంది. ఆర్థిక బ‌లం వుంది. గెలిస్తే మంత్రి అవుతారు. మోదీ వేవ్ క‌లిసి వ‌స్తుంద‌నుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి వంశీ గెలుపు కోసం సి.ఎం. రేవంత్ బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అయితే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి మ‌ధ్య కొంత ఆధిప‌త్య‌పోరు క‌నిపించింది. అది  కాంగ్రెస్‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. మ‌రో వైపు బీఆర్ ఎస్ ఓట్లు కూడా బీజేపీకే ప‌డ్డాయి. సి.ఎం. రేవంత్‌రెడ్డి ఎనిమిది స‌భ‌ల్లో పాల్గొని ప్ర‌చారం చేశారు. పోటీ బీజేపీ కాంగ్రెస్ మ‌ధ్య ఉన్న  కాంగ్రెస్ కే ఎడ్జ్ క‌నిపిస్తోంది. 13. ఖ‌మ్మంః కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. బీజేపీ సెకెండ్ ప్లేస్‌కు ఎదిగింది. ట్రైబ‌ల్ ఏరియా లో బీజేపీ బాగా బ‌ల‌ప‌డింది.  బీఆర్ఎస్‌ 3వ స్థానానికి ప‌డిపోయింది. ఇక్క‌డ భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. 14. మ‌హ‌బూబాబాద్ః కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంది. బీఆర్ఎస్ గ‌ట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు కాంగ్రెస్‌కు క‌లిసి వ‌చ్చింది.  15. జ‌హీరాబాద్ః బీజేపీ - కాంగ్రెస్ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. ఇక్క‌డ గెలుపు అవ‌కాశం బీజేపీకే వుంది. పోల్‌మేజేజ్‌మెంట్ గ‌ట్టిగా చేసింది బీజేపీ. నార్త్ ఇండియా వాళ్ళు ఇక్క‌డ ఒట‌ర్లుగా ఉన్నారు. వారి ఆధిప‌త్యం ఎక్కువ‌. ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తి వుండ‌టంతో అది బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. కామారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, ఈ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో వుండ‌టం బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. ప్ర‌స్తుత బీజేపీ అభ్య‌ర్థి... గ‌తంలో బీఆర్ ఎస్ నుంచి 2 సార్లు గెలిచారు. ఇప్పుడు బిజేపీలోకి వ‌చ్చి పోటీ చేశారు. ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థికి హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం అనిపిస్తోంది. 16. సికింద్రాబాద్ః కాంగ్రెస్ - బీజేపీ మ‌ధ్యే పోటీ వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ముస్లిం ఓట్లు 6 ల‌క్ష‌కు పైగా వున్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి దానం నాగేంద‌ర్ ఆర్థికంగా బ‌ల‌వంతుడు. పోల్ మేనేజ్‌మెంట్ చేయ‌డంలో ఆయ‌న‌కు తిరుగులేదు. పైగా ఎంఐఎం త‌మ అభ్య‌ర్థిని పోటీలో పెట్ట‌క‌పోవ‌డం, కాంగ్రెస్‌కు క‌లిసి వ‌స్తుంది. ఎంఐఎం వ్యూహాత్మ‌కంగా, ఉద్దేశ‌పూర్వ‌కంగానే కాంగ్రెస్‌కు ఓటు వేయ‌మ‌ని, బీజేపీని ఓడించ‌మ‌ని పిలుపునిచ్చింది. ఎంఐఎం చేసిన ప్ర‌చారం, మొత్తం తెలంగాణాలో హిందూ ఓట్ల‌పై ప్ర‌భావం చూపింది.  బిజెపి-ఎంఐఎం క‌లిసి గేమ్ ప్లాన్ ప్లే చేయ‌డంతో బీజేపీ తెలంగాణాలో భారీ ఎత్తున సీట్లు గెలిచే అవ‌కాశం దొరికింది. బీజేపీ ఎత్తుగ‌డ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి భారీ న‌ష్టం చేకూర్చింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రో వైపు కిష‌న్‌రెడ్డి డ‌బ్బు పంచ‌లేదు. లోక‌ల్‌గా అందుబాటులో వుండ‌ర‌నే ప్ర‌చారం కూడా ఆయ‌న‌కు మైన‌స్ చేసింది.  మొత్తానికి ఎంఐఎం ప్ర‌చారం, సికింద్రాబాద్‌లో డ్యామేజ్ చేసినా, తెలంగాణాలో బీజేపీకి అలా క‌లిసివ‌చ్చింది. 17. హైద‌రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి యూట్యూబ్ వ్యూస్ మీద చూపిన  ఆస‌క్తి ఓట‌ర్ల‌పై చూపించ‌లేదు. కేవ‌లం సోష‌ల్ మీడియా ప్ర‌చారాన్నే న‌మ్ముకుని న‌ట‌న‌లో జీవించారు. గొప్ప న‌టిగా పేరు పొందారు కానీ రాజ‌కీయ నాయ‌కురాలిగా రాణించ‌లేక‌పోయారు. బీజేపీ అభ్య‌ర్థి ఎంఐఎం అభ్య‌ర్థికి క‌నీస పోటీ ఇవ్వ‌లేక‌పోయారు. ఎప్ప‌ట్టి లాగా భారీ మెజార్టీతో ఎంఐఎం ఈ సారి కూడా విజ‌యం సాధించ‌నుంది.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌