ఏడుపాయల జాతర.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి దామోదర రాజనర్సింహ

  తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో  మూడు రోజుల పాటు జరిగే జానపదుల జాతర బుధవారం (ఫిబ్రవరి 26) మొదలైంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఈ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య 15లక్షలకు పైగా ఉంటుందన్నది అధికారుల అంచనా.  మహాశివరాత్రి పర్వదినం కూడా కావడంతో జాతర మొదటి రోజైన బుధవారం (ఫిబ్రవరి 26) భక్తులు పోటెత్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు అచరించి దుర్గమ్మను దర్శించుకున్నారు.  ఇక గురువారం (ఫిబ్రవరి 27)గురువారం ఎద్దుల బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. తొలుత పాపన్నపేట సంస్థానాధీశుల బండి తిరుగుతుంది. ఇక జాతర చివరి రోజు రథోత్సవం ఉంటుంది.  

తెలంగాణ పాఠశాలల్లో సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు తప్పని సరి!

తెలంగాణలోని అన్ని పాఠశాతల్లోనూ తెలుగుబోధన ఇక తప్పని సరి. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. పాఠశాలల్లో మాతృభాష బోధన తప్పని సరి చేస్తూ   విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తెలుగు బోధనను నిర్బంధం చేస్తూ చట్టం అమలులో ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలు కాని పరిస్థితి ఉంది. దీంతో తెలంగాణ సర్కార్ ఆ చట్టాన్ని పక్కాగా అములు చేయాలన్న ఉద్దేశంతో తాజా ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ తాజా ఉత్తర్వుల మేరకు   2025-26  నుంచి అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులకు తప్పనిసరిగా తెలుగు బోధన అమలు చేస్తారు. పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఇది  సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌ చదివేవారికీ వర్తిస్తుంది.   ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై విద్యార్థులకు  సెకండ్ లాంగ్వేజీగా తెలుగు తప్పని సరి.  

ఒంగోలు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్లలో వైసీపీ ఖాళీ?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన అటకెక్కింది. జనం ఛీ కొట్టి మరీ గద్దె దింపేశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో గెలిపించి అందలం ఎక్కించిన జనమే జగన్ ఐదేళ్ల పాలనతో విసిగి, వేసారి ఐదేళ్లకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేసి విపక్షంగా గొంతెత్తే అర్హత కూడా లేదని  ఓటు ద్వారా ఆ పార్టీని ఊడ్చిపారేశారు. ఇప్పుడు ప్రజాతీర్పు ప్రభావం ఆ పార్టీ చేతిలో ఉన్న స్థానిక సంస్థలపైనా పడుతోంది. దౌర్జన్యాలతో, దాష్టీకాలతో  స్థానిక సంస్థలపై ఆధిపత్యం సొంతం చేసుకున్న వైసీపీ ఇప్పుడు వాటిని కూడా కోల్పోతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని  ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీ బలం కేవలం నాలుగుకు పడిపోయింది. ఇప్పటికే  మేయర్, డిప్యూటీ మేయర్ సహా 17 మంది కార్పొరేటర్లు పార్టీని వీడి వెళ్లిపోయారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని నేతృత్వంలో  26 మంది కార్పొరేటర్లు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన గూటికి చేరారు. వీరందరినీ జనసేనాని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలా చేరిన వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ కూడా ఉన్నారు. వీరి చేరికతో ఒకప్పుడు ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి  ఉన్న 43 మంది కార్పొరేటర్ల బలం ఇప్పుడు కేవలం నాలుగుకు పడిపోయింది.   అదే విధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. వీరంతా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నేతృత్వంలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.  

వల్లభనేనిపై మరో రెండు కేసులు.. కస్టడీలో విచారణకు సహకరించని వైసీపీ నేత

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ సిట్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై మరో రెండు కేసులు నమోదు చేశారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులను మోసం చేశారని కేసు నమోదు చేశారు. అలాగే తేలప్రోలులో వివాదంలో ఉన్న శ్రీధర్ రెడ్డి పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పి, ఆ భూమిని కబ్జా చేసినందుకు వంశీ, ఆయన అనుచరులుపై మరో కేసు నమోదు అయింది. సిట్ ఏర్పాటు తరువాత ఒక్క రోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులుపై మొత్తం మూడు కేసులు నమోదు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసులన్నిటినీ  సిట్‌కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇలా ఉండగా పోలీసుల విచారణలోవల్లభనేని వంశీ పోలీసులకు సహకరించడం లేదట. ఏది అడిగినా.. తెలీదు, గుర్తులేదు, మరచిపోయా.. అంటూ తాను నిర్మించిన అదుర్స్‌ సినిమాలోని డైలాగులే చెప్తున్నారట.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్దన్‌ను బెదిరించి, కిడ్నాప్‌ చేసిన కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్‌, ఏడో నిందితుడు వెలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్‌, ఎనిమిదో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు  కస్టడీకి తీసుకున్నారు. అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.  ముగ్గురు నిందితులను విచారించడానికి ముగ్గురు ఏసీపీలు రంగంలోకి దిగారు. వల్లభనేని వంశీని సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ దామోదర్‌ విచారించారు. శివరామకృష్ణప్రసాద్‌ను ట్రాఫిక్‌ ఏసీపీ వంశీధర్‌గౌడ్‌, లక్ష్మీపతిని సీసీఎస్‌ ఏసీపీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క నిందితుడికి సుమారు 30 ప్రశ్నలు సంధించారు. రెండు గంటల పాటు వారిని విచారించారు. విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే వంశీ సమాధానాలు చెప్పారంట. చాలా వాటికి అబద్ధాలు చెప్పారని విచారణాధికారులు భావిస్తున్నా రు. అసలు సత్యవర్దన్‌ ఎవరో తనకు తెలియదని ముందుగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. 

‘గ్రాడ్యుయేట్ ’గెలుపు ఎవరిది?

గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించబోయేది ఎవరు? 18 ఏళ్ల క్రితం గెలుపునకు దూరమైన తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో తన సత్తా చూపిస్తుందా? శాసనమండలి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా నిలబడిన రాజాకు ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అధికార పార్టీని ఎలా మెలిక పెడుతున్నారు? నువ్వా నేనా అంటూ సాగుతున్న ప్రచారం ముగిసిపోయిన సందర్భంలో ఇక గెలుపు వాకిట ఎవరు నిలబడబోతున్నారు? కృష్ణ ,గుంటూరు జిల్లాలో హీట్ పెంచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది? ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగనున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి25)  సాయంత్రం నాలుగు గంటలతో ప్రచార గడువు కూడా ముగిసిపోయింది.  గుంటూరు,  కృష్ణాజిల్లాల పరిధిలో మొత్తం 33 అసెంబ్లీ స్థానాలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోకి వస్తాయి. గురువారం (ఫిబ్రవరి 27) ఉదయం 8 గంటల నుంచి, సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.  అధికారులు గుంటూరు జిల్లాలో 483 పోలింగ్ స్టేషన్ల ను ఏర్పాటు చేశారు.  వీటిలో 144 సమస్య సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఈ సమస్యత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతను కల్పించనున్నారు.   ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి, ఇద్దరు కీలక అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం 25 మంది గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచినా,  అందరి చూపు మాత్రం , కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ,సిట్టింగ్ ఎమ్మెల్సీ, పిడిఎఫ్ అభ్యర్థి,  కె ఎస్ లక్ష్మణరావు పైనే ఉంది. తెలుగుదేశం అధికారంలో ఉండగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అధికార పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.  శాసనమండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత తొలి  ఎన్నికల్లో  తెలుగుదేశం విజయం సాధించింది.  కానీ ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఆ రెండు ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులే విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఒకటి కాదు ,రెండు కాదు, మూడు పార్టీల భాగస్వామ్యంతో కూటమి అభ్యర్థిగా నిలబడిన తెలుగుదేశం అభ్యర్థి  ఆలపాటి రాజేంద్రప్రసాద్   సిట్టింగ్ ఎమ్మెల్సీ  లక్ష్మణరావుకు ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.   కాగా కొందరు వైసీపీ నేతలు కూడా పరోక్షంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం  వైసీపీ  కూటమి అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీల్లోని కొందరు నాయకులు పరోక్షంగా పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కు మద్దతు పలుకుతున్నారన్న ప్రచారం ఉంది.ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిదన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.   2007లో ఉమ్మడి గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి... ఆ ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగిన చిగురుపాటి వరప్రసాద్ విజయం సాధించారు. అయితే ఆయన  లోకల్  విజయవాడ ఎమ్మెల్సీ గానే గుర్తింపు పొందారు.   ఈ నేపథ్యంలో 2013 లో తిరిగి చిగురుపాటి వరప్రసాద్ కు తెలుగుదేశం అధిష్టానం మరోసారి అవకాశం ఇచ్చింది.   ఆ ఎన్నికల్లో  చిగురుపాటి వరప్రసాద్ ఓటమి పాలయ్యారు. ఆయనపై పిడిఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు  విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో సాధారణ ఎన్నికలకు నెల ముందు పట్టబద్రులు ఎన్నికలు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో సైతం పిడిఎఫ్ అభ్యర్థి, విజయం సాధించారు... ఆ ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పోటీ చేసి విజయం సాధించారు.. అలా వరుసగా రెండుసార్లు పిడిఎఫ్ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో  విజయాలు సాధించారు. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పీడీఎఫ్ భావిస్తోంది.   అయితే  తెలుగుదేశం ప్రస్తుతం అధికారంలో ఉంది.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని 33 అసెంబ్లీ స్థానాల్లో  దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ఈసారి ఎలాగైనా పిడిఎఫ్ అభ్యర్థికి షాక్  ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది.   తెలుగుదేశం కూటమి అభ్యర్థి ఆల పాటి రాజేంద్రప్రసాద్  విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాలనూ చుట్టేశారు.  మాజీ మంత్రిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్న ఆలపాటికి మామూలుగా అయితే ఎన్నికల లెక్కలు వేయటం పెద్ద సమస్య కాదు, మాస్ పల్స్ ఎలా పట్టుకోవాలో తెలిసిన నాయకుడిగా ఆలపాటి రాజాకుపేరు ఉంది. అయితే ఇక్కడ జరుగుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో వారు ఎవరికి ఓటు వేస్తారన్నది ఇతమిథ్థంగా చెప్పడం అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    మరో వైపు పిడిఎఫ్ అభ్యర్థి  లక్ష్మణరావు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   ఉపాధ్యాయ సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకుల్ని కలుపుకొని ఇంటింటికి తిరిగి గ్రాడ్యుయేట్ ఓట్లు అభ్యర్థి స్తు న్నారు. ఈ నేపథ్యంలో  పోరు హోరాహోరీగా ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో కూడా వినిపిస్తోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లోని విజయం సాధించాలని ఆలోచనతో అభ్యర్థులు ఉంటే,  ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, రెండవ ప్రాధాన్యత ఓటు వరకు ఫలితాలు వచ్చే అవకాశం లేదని   పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు భిన్నంగా జరుగుతాయి.  తొలి ప్రాధాన్యత ఓటు కోసమే అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు.   ప్రస్తుతం గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థుల ఓటర్ల లిస్టు పరిశీలిస్తే మూడు లక్షల 47 వేల వరకు ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో ఎవరు ఎక్కువ శాతం ఓట్లు దక్కించుకుంటారనే దానిపై ఈ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కానీ తొలి ప్రాధాన్యత ఓటులో 51 శాతం మించి అభ్యర్థి ఓట్లు దక్కించుకుంటేనే మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఓటర్ల జాబితా  పరిశీలిస్తే  2,06,456 మంది పురుష గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించు కోబోతున్నారు. అలాగే  1,40, 615  మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా మూడు లక్షల3, 47,116 మంది ఓటర్లు పాల్గొనాల్సి ఉంది ....అయితే శివరాత్రి,తో పాటు , ఇప్పటివరకు ఉపాధ్యా యులకు ప్రైవేట్ స్కూళ్లకు పూర్తిస్థాయిలో సెలవుల విషయంలో క్లారిటీ లేకపోవడంతో గందరగోళం నెలకొని ఉంది,... ఉపాధ్యాయులకు పోలింగ్ రోజు సెలవు ఇవ్వకపోతే ప్రభుత్వ స్కూళ్లలో నుండి టీచర్లు ఓటింగ్కు హాజరయ్యే అవకాశం ఉండదు ఫలితంగా ఓటింగ్ పర్సంటేజ్ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఫలితంపై ఉంటుందనడంలో సందేహం లేదు.  కేవలం 55 నుండి 65 % మంది ఓటర్లు మాత్రమే పోలింగ్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ  స్వల్పంగా ఉంది. ఉంది.  బుధవారం (ఫిబ్రవరి 26) ఉదయం భక్తుల క్యూకాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరుగంటల కంటే తక్కువ సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ భక్తులకైతే శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటలలోపే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది.   ఇక మంగళవారం(ఫిబ్రవరి 25) శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చింది. మంగళవారం శ్రీవారిని 65,127 మంది దర్శించుకున్నారు. వారిలో 19,307 మంది భక్తులు తలనీ లాలను సమర్పిం చుకున్నారు.మహా శివరాత్రి కావడం వల్ల తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.  

ముగింపు దశకు మహా కుంభమేళా.. అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో గత 45 రోజులుగా అత్యంత వైభవోపేతంగా, ఆశేష భక్త జనవాహినితో జరుగుతున్న మహా కుంభమేళా బుధవారం (ఫిబ్రవరి 26) శివరాత్రి తో ముగియనున్నది. ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాకుండా.. అంచనాలకు అందని వ్యాపార సామ్రాజ్యంగా కూడా చెప్పుకోవచ్చు.  మహాకుంభమేళాలో ఫిబ్రవరి 22 నాటికే    పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరింది. బుధవారంతో ఈ కుంభమేళా ముగియనున్నది. కుంభమేళా ముగిసే సరికి పుణ్యస్నానాలు చేసినవారి సంఖ్య 65 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  గంగ,యమునా,సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు అచరించడానికి  దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇంతటి మహోత్తర ఆధ్మాత్మిక పండుగ మళ్లీ  144 ఏళ్ల తరువాత గానీ రాదు. దీతో  జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముగింపు సమీపిస్తున్నప్పటికీ మహాకుంభ్ కు వస్తున్న భక్త జనం పోటెత్తుతూనే ఉన్నారు.  మహాకుంభ మేళా కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయగలిగినంతా చేసింది. అయితే మౌనీ అమావాస్య రోజు న అంచనాలకు మించి భక్త జనం పోటెత్తడంతో దురదృష్ట వశాత్తూ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో  30 మంది చనిపోయారు.  రెండు మూడు సార్లు టెంట్లలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ చిన్నచిన్న అపశ్రుతులు వినా మహాకుంభమేళా నిర్వహించడంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.  అధ్యాత్మిక సౌరభాల సంగతి అలా ఉంచితే.. మహా కుంభమేళా  అతి పెద్ద వ్యాపార కేంద్రంగా నిలిచిందని  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఈవేడుక సందర్భంగా వస్తువులు,సేవలు ద్వారా 3లక్షలకోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని సీఏఐటీ పేర్కొంది.ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, దుస్తులు, పూజా సామాగ్రి, హస్తకళలు, ఆరోగ్యరక్షణ, ప్రకటనలు, పౌరసేవలు,టెలీకం,మోబైల్,సీసీ టీవీకేమెరాలు,ఇతర పరికరాల వ్యాపారాలు భారీ స్థాయిలో జరిగాయని గణాంకాలతో సహా వివరించింది.  ఉత్తర ప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టతకు మహాకుంభమేళా ఎంతగానో దోహదపడింది. .యూపీ ప్రభుత్వం మహా కుంభమేళా నిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా ఉపయోగించింది. కుంభమేళా ప్రదేశం 4 వేల ఎకరాల వైశాల్యంలో 2750 సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంది.ఇందులో 250 ఏఐ ఆధారిత కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ సమాచారాన్ని కమాండ్ సెంటర్ కు నిరంతరం అందించాయి. ఎంతమంది వస్తున్నారు,పార్కింగ్ స్థలంలో వాహనాలు సంఖ్య, కూడళ్లలో రద్దీ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా యూసీ సర్కార్ ఈ ఏర్పాట్లు చేసింది.    మహాకుంభ్ సందర్బంగా 45 రోజులపాటు 24X7 దేదీప్యమానంగా వెలుగొందిన ప్రయాగ్ రాజ్  మహాశివరాత్రి తరువాత వెలవెలబోతుంది. దేశ జనాభా 145 కోట్లు. వీరిలో  110 కోట్ల మంది హిందువులు. మహాకుంభ్ ముగిసే సరికి  65 కోట్లమంది పైగా పుణ్య స్నానాలు ఆచరించారంటే.. దాదాపు దేశంలోని హిందువులలో దాదాపు సగం మందికి పైగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యారని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. 

బొత్స ప‌వ‌న్ జ‌పం‌.. వైసీపీలో టెన్ష‌న్‌?

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ రూట్ మార్చారా..?  వైసీపీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని  భావిస్తున్నారా..? వెంటనే కాకపోయినా కొంత కాలం తరువాతైనా  జ‌న‌సేన గూటికి చేరే దిశగా బొత్స వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా.. అంటే రాజకీయవర్గాల నుంచే కాకుండా వైసీపీ వర్గాల నుంచీ అవున‌నే సమాధానమే వస్తోంది. గ‌తంలోనూ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ వైసీపీని వీడుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత బొత్స స‌త్య‌నారాయాణ కొద్ది కాలం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో అత‌ను జ‌న‌సేన పార్టీలో చేరతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. జ‌న‌సేన పార్టీకి చెందిన ముఖ్య‌ నేత‌లు కొంద‌రు బొత్స ను క‌లిసి పార్టీలోకి  ఆహ్వానించార‌న్న వార్త‌లూ వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రావ‌డంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అల‌ర్ట్ అయ్యారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్ర‌క‌టించారు. తెలుగుదేశం కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్ప‌ట్లో .. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్టణం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ బొత్సకే జ‌గ‌న్ ప్రాధాన్యత  ఇచ్చారు. త‌ద్వారా వైసీపీని వీడ‌కుండా బొత్స‌కు జ‌గ‌న్ అడ్డుక‌ట్ట వేశార‌న్న ప్ర‌చారం అప్పట్లో గట్టిగా జ‌రిగింది. ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన త‌రువాత బొత్స స‌త్య‌నారాయ‌ణ వైసీపీలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మండ‌లిలో విప‌క్ష నేత‌గా కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై మంత్రుల‌ను నిల‌దీస్తున్నారు. వైసీపీ త‌ర‌పున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజ‌రు కావ‌డంతో.. శాస‌న మండ‌లిలోనే ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. దీంతో విప‌క్ష నేత‌గా మండ‌లిలో వైసీపీ వాయిస్ను బొత్స బ‌లంగానే వినిపిస్తున్నారు. అయితే, వైసీపీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగు తున్న ప‌రిణామాల‌తో బొత్స అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలను ఆయ‌న త‌ప్పుబ‌డుతున్నారని, అయినా జ‌గ‌న్ బొత్స‌ సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేద‌న్న ప్ర‌చారం వైసీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ప్ర‌ధానంగా అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ స‌హా వైసీపీ ఎమ్మెల్యేలు హాజ‌రు కావాల‌ని బొత్స సూచించార‌ని స‌మాచారం. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించాల‌ని త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి మంచి మెస్సేజ్ వెళ్తుంద‌ని, అసెంబ్లీకి వెళ్ల‌కుండా ఉండ‌టం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైసీపీ ప‌ట్ట‌డంలేద‌న్న భావ‌న క‌లుగు తుంద‌ని జ‌గ‌న్ దృష్టికి బొత్స తీసుకెళ్లార‌ని, కానీ, బొత్స సూచ‌న‌ను జ‌గ‌న్  ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ వ‌ర్గాల్లో గతంలో చ‌ర్చ జ‌రిగింది.  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. ఆయ‌నకు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రి కొన‌సాగిన బొత్స‌.. రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క భూమి పోషించారు. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రిగా కొన‌సాగారు. ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ప్ర‌జాబ‌లం క‌లిగిన నేత‌గా బొత్స ఎదిగారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బొత్స‌కు ఆ సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల మ‌ద్ద‌తు ఎక్కువే. 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరిన బొత్స‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చా రు. వైసీపీ ప్ర‌భుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స ప‌నిచేశారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ ప‌ట్ల అప్ప‌ట్లో బొత్స అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌ను బొత్స ఖండించిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. చిరంజీవి కుటుంబంతో బొత్స‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ బొత్సకు మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌త అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు వెళ్లి బొత్స ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అంతే కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బొత్స విమ‌ర్శించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువే. దీంతో వైసీపీలోని ప‌లువురు నేత‌లు బొత్స తీరును త‌ప్పుబ‌డుతున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని  వైసీపీ ఎమ్మెల్యేలంతా బాయ్ కాట్ చేస్తే.. జగన్ కు కాకపోతే కనీసం పవన్ కు అయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాసనమండలిలో కానీ.. మరో చోట కానీ పవన్ కు  వ్యతిరేకంగా బొత్స‌ మాట్లాడకపోవడం వైసీపీలోనూ చర్చనీయాంశమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి  తన పార్టీ నేతలంతా పవన్ ను దూషించాలని  కోరుకుంటారు. కానీ, బొత్స మాత్రం మా మంచి పవన్ అంటుండటంతో ఆయన చూపు జనసేన వైపు ఉందన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.  బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయంగా ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నేత. సరైన సమయంలో సరైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉంద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రోజు కాకపోతే రేపైనా బొత్స జ‌న‌సేన‌సేలో చేర‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వైసీపీ వ‌ర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.  మ‌రోవైపు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ట్ల‌ బొత్స‌ ప్రేమ‌గా ఉండ‌టానికి మ‌రో కార‌ణం కూడా ఉందంటున్నారు.  బొత్స‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు కాపులే. ప్ర‌స్తుతం ఆ సామాజిక‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఎక్కువ‌గా జ‌న‌సేన వైపే ఉన్నారు. ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తే త‌న‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ సామాజిక వ‌ర్గం ఓటర్లు దూర‌మ‌వుతార‌న్న భావ‌న‌లో బొత్స‌ ఉన్నార‌ట‌. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బొత్స ప్రేమ‌.. వైసీపీ వ‌ర్గాల‌ను టెన్ష‌న్ పెడుతుంది. 

300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే.. ముంబై- అహ్మదాబాద్‌ల మధ్య హైపర్‌లూప్ ట్రాక్

దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య సిద్ధమవుతోంది. దీనికోసం ట్రాక్ పనులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు దేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ ట్రాక్ కూడా రెడీ అయింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో భారతీయ రైల్వే, ఈ హైపర్‌లూప్ ట్రాక్‌ను 422 మీటర్ల మేరకు సిద్ధం చేసినట్లు తెలిపారు. అంటే మీరు ఢిల్లీ నుంచి జైపూర్ వరకు దాదాపు 300 కి.మీ. దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చన్నారు. హైపర్‌లూప్ ట్రాక్‌లో గరిష్ట వేగం గంటకు 600-1200 కి.మీ. కావడం విశేషం. భారతదేశంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే హైపర్ లూప్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. హైపర్‌లూప్ ప్రాజెక్టులో ఓ రైలును ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్‌లో నడిపిస్తారు. అది కూడా అధిక వేగంతో నడుస్తుంది. ఇది ప్రజా రవాణాను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ రైలు ట్రాక్ సిద్ధమైనందున, త్వరలో దానిపై ట్రయల్ రన్స్ ప్రారంభమవుతాయి. దేశంలో వాక్యూమ్ ట్యూబ్ ఆధారిత హైపర్‌లూప్ రైలు ప్రయాణం మొదలవుతున్న నేపథ్యంలో, ఇది దేశంలో ఐదో వేగవంతమైన రవాణా విధానం కానుంది. హైపర్‌లూప్‌లో రైలు ప్రయాణ వేగం గంటకు 600-1200 కి.మీ. వరకు ఉంటుంది. నివేదికల ప్రకారం ఇండియన్ హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. మరోవైపు దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ 2024లో రైల్వే మంత్రి సమాచారం ఇస్తూ, భారత రైల్వేలు 2026 నాటికి దేశంలో మొదటి బుల్లెట్ రైలును నడుపుతాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మొదలయ్యే హై స్పీడ్ బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలా చూసినా కూడా హైపర్‌లూప్ ద్వారా ఈ ప్రయాణ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

సినీ నటి మాధవిలతపై కేసు 

సినీ నటి మాధవిలతపై  అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  తాడిపత్రి మహిళలను కించపరిచే విధంగా మాధవిలత వ్యాఖ్యలు చేశారని  ఎపి మాల మహనాడు డైరెక్టర్  కొంకణి కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు నేపథ్యంలో  పోలీసులు కేసు నమోదు చేశారు.  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవిత మధ్య వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. గత సంవత్సరం డిసెంబర్ 31 న  తాడిపత్రి మహిళల కోసం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం జెసీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరు కావద్దని మాధవిలత తాడిపత్రి మహిళలను కోరారు. మహిళలు సేఫ్ గా ఇంటికి రావాలంటే వేడుకలకు హాజరు కావొద్దని ప్రకటన చేయడంతో జెసీ, మాధవిలత మధ్య మాటలయుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా మాల మహనాడు డైరెక్టర్ ఫిర్యాదుతో వీరి వివాదం మరింత ముదిరింది. 

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రంగులు మారుస్తున్న వైసీపీ!

అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే ఊసరవిల్లి కూడా సిగ్గు పడేలా వైసీపీ తీరు ఉంది. నిన్నటి వరకూ తాము తిట్టిపోసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇప్పడు తమ వాడిగా సొంతం చేసుకుని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. నిన్న తిట్టిన వ్యక్తులనే నేడు పొగడ్తలతో ముంచేయడం, నిన్న కాదన్న విషయాన్నే నేడు ఔనంటూ గట్టిగా వాదించడం వైసీపీకే చెల్లిందన్నట్లుగా ఈ పార్టీ తీరు ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో ఇప్పుడు ఆ పార్టీ అదే చేస్తున్నది. 2023లో రజనీ కాంత్ విజయవాడలో  జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొన్నారు.ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, హదరాబాద్ ఐటీ హబ్ గా మారడానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. వాస్తవానికి రజనీకాంత్ నాడు చేసిన వ్యాఖ్యలలో రాజకీయం ఏ మాత్రం లేదు. కానీ చంద్రబాబు గురించి రెండు మంచి మాటలు చెప్పడమే వైసీపీకి కంటగింపుగా మారింది. దీంతో రజకీకాంత్ పై ఇష్టారీతిగా విమర్శలతో చెలరేగిపోయారు.   చంద్రబాబు పెంపుడు కుక్క అన్న స్థాయిలో  రజనీకాంత్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బూతుల నాని అదేనండి కొడాలి నాని అయితే నోటికొచ్చినట్లు మాట్లాడారు. స్వయంగా సనీ నటి కూడా అయిన రోజా కూడా రజనీకాంత్ పై ఇష్టారీతిగా విమర్శలు చేశారు.  వీళ్లే కాదు వైసీపీలో చిన్నా చితకా నాయకులు కూడా రజనీకాంత్ పై నోరు పారేసుకున్నారు.  అటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు రజనీకాంత్ ను భుజాన వేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల కిందట రజనీకాంత్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్య అత్యవసరం అని నొక్కి చెప్పారు. ఇంగ్లీషు మీడియంలో చదవడం వల్ల వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ఆ మాటలను పట్టుకుని ఇప్పుడు వైసీపీ నేతలు రజకీకాంత్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్య అందించడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని అంటున్నారు.  ఇప్పుడు రజనీకాంత్ ఇంగ్లీషు మీడియంలో పిల్లలకు విద్య అంశంపై చేసిన ప్రసంగం వీడియో క్లిప్పింగులను తమ ప్రాచారం కోసం విరివిగా ఉపయోగించుకుంటున్నారు.  వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించలేదు. ఆ మాటకొస్తే ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీషు మీడియంను తొట్టతొలి సారిగా ప్రవేశ పెట్టింది చంద్రబాబునాయుడే. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను పరిచయం చేసింది చంద్రబాబు నాయుడే. అయితే తెలుగును విస్మరించి పూర్తిగా ఇంగ్లీషు మీడియంకు మారడం అన్న విధానాన్నే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది.  విద్యార్థులకు ఇంగ్లీష్  తెలుగు మీడియంలలో  దేనినో ఒక దానిని ఎంచుకునే ఛాయిస్ ఇవ్వాలని మాత్రమే చెప్పింది.  అదే విధంగా ఇంగ్లీషు మీడియంకు పిల్లలు అలవాటు పడటానికీ, ఇంగ్లీషు మాధ్యమంలో ఉపాధ్యాయులు బోధన చేసేలా నైపుణ్యం పెంచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇంగ్లీషు మీడియంను దశల వారీగా అమలు చేయాలని చెప్పింది. వాస్తవం అలా ఉంటే వైసీపీ మాత్రం నాడు తాము దుయ్యబట్టిన రజనీకాంత్ మాటలను తమ అధినేత జగన్ ను సమర్ధిస్తున్నాయని చెప్పుకుంటూ నానా యాగీ చేస్తున్నది.  

తుని మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలోకే !

తుని మునిసిపాలిటీ తెలుగుదేశం ఖాతాలో పడిపోయింది. మునిసిపల్ కౌన్సిలర్లలో 12 మంది వినా మిగిలిన వారంతా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దీంతో మునిసిపల్ చైర్మన్ కూడా రాజీనామా చేసేశారు. తుని మునిపిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేని కారణంగా వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తున్నది.   రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం గూటికి చేరారు. వైస్ చైర్మన్ స్థానం ఖాళీ అవ్వడంతో మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆ స్థానం వైసీపీకే దక్కేలా చూడటానికి నానా ప్రయత్నాలూ చేశారు. ఎన్నిక జరిగితే వైస్ చైర్మన్ పదవి తెలుగుదేశం దక్కించుకోవడం ఖాయమన్న భావనతో వైసీపీ కౌన్సిలర్లు ఎన్నికకు రాకుండా అడ్డుకున్నారు. నిర్బంధించారు. వారు మునిసిపల్ సమావేశానికి రాకుండా  ఉండేందుకు సామదాన భేద దండోపాయాలను ప్రయోగించారు. ఎన్నిక నిర్వహించడానికి కోరం లేకుండా చేశారు. ఉద్రిక్తతలు సృష్టించారు. ఆ కారణంగా తుని మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటి వరకూ మూడు సార్లు వాయిదా పడింది.  ఇక నాలుగో సారి కూడా కోరం లేని పరిస్థితి ఏర్పడితే.. హాజరైన కౌన్సిలర్లలోనే మెజారిటీ కౌన్సిలర్లు ఎవరికి మద్దతు ఇస్తే వారినే ఎన్నుకుంటారు. కోరం లేదంటూ నాలుగో సారి ఎన్నిక వాయిదా పడే అవకాశం లేదు.  దీంతో దాడిశెట్టి రాజీ ఇక కౌన్సిలర్లను నిలువరించి ఫలితం లేదన్న నిర్ణయానికి వచ్చి చేతులెత్తేశారు. దీంతో వారంతా తెలుగుదేశం గూటికి చేరారు.  ఇప్పడు తుని మునిసిపాలిటీలో తెలుగుదేశం కౌన్సిలర్లు   20 మంది కాగా వైసీపీ కౌన్సిలర్లు 12 మంది మాత్రమే. తుని మునిసిపల్ చైర్ పర్సన్ కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు వైస్ చైర్మన్ తో పాటు చైర్ పర్సన్ ఎన్నిక కూడా జరగనుంది.  ఏ విధంగా చూసినా ఇక్కడ వైసీపీకి పరాజయం, పరాభవం తప్పదని పరిశీలకులు అంటున్నారు.  

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల  దాడిలో ముగ్గురు మృతి... 10 లక్షల పరిహారం

అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్బంగా  గుండాల కోనకు వెళుతున్న భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. శేషాచలం అడవుల్లో కాలినడకన వెళుతున్న 14 మంది భక్తులను ఏనుగుల మంద దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు  అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  మిగతా వారు ఏనుగుల మంద నుంచి తప్పించుకున్నారు. ఓబులావారి పల్లె మండలం గుండాల కోన ఆటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారికి చెరో 10 లక్షల రూపాయల పరిహారాన్ని  కూటమి ప్రభుత్వం ప్రకటించింది.  మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

బుల్లి తెరపై ఇక రోజా స్టెప్పులు!

మాజీ మంత్రి రోజా.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో  స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో   1998లో తెలుగుదేశం నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున 2004 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి, ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి  నియోజకవర్గం నుంచీ పోటీ చేశారు. అయితే ఆ రెండు సార్లూ రోజా పరాజయం పాలయ్యారు. వరుసగా రెండు ఎన్నికలలోనూ ఓడిపోయినా చంద్రబాబు ఆమెకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు. కానీ రోజా మాత్రం తన దూకుడుతోనూ, వ్యవహార శైలితోనూ  పార్టీలో ముఖ్య‌నేత‌ల నుంచి, క్యాడ‌ర్ వరకూ అందరి నుంచీ  వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు.  ఫ‌లితంగా ఆమె తెలుగుదేశం పార్టీకి దూరమై  2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.   ఆ తర్వాత చోటుచేసుకున్న రాజ‌కీయ‌ పరిణామాల నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రోజాకు అవ‌కాశం ద‌క్కింది. టూరిజం, క్రీడ‌ల శాఖ మంత్రిగా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అప్పటి వరకూ ఆమె రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నా సినిమాలూ, స్మాల్ స్క్రీన్ ప్రజెన్స్ లను వదల లేదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ అనే కామేడీ షోకు జడ్జిగా వ్యవహరించారు. సినిమా హీరోయిన్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో, అంత కంటే ఎక్కువగా జబర్దస్త్ జడ్జిగా పేరు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాలలో చెప్పారు. అదే సమయంలో బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయి ఉండీ జబర్దస్త్ లో వెకిలి జోకులకు పగలబడి నవ్వడాలేంటన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. అది వేరు సంగతి. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  తరువాత మాత్రం ఆమె జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు.. ఇకపై టీవీ షోలు సినిమాలూ చేయను ప్రజలకే  నా జీవితం అంకితం అంటు ప్రతిజ్ణ కూడా చేశారు. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కల కల్ల అయిపోయింది. ఆమె నగర నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆమె మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దీంతో గతంలో ఇక సినిమాలు, టెలివిజన్ షోలు చేయను అన్న ప్రతిజ్ణను పక్కన పెట్టేసి మళ్లీ బుల్లి తెరపై రీఎంట్రీకి సిద్ధమైపోయారు. నగరిలో ఓటమి పాలు అయిన తరువాత రోజా మళ్లీ జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఆమె జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ, బుల్లి తెర ఎంట్రీ మాత్రం ఫిక్సై పోయింది. ఒక ప్రముఖ టీవీ చానెల్ లో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షోకు రోజా జడ్జిగా వ్యవహరించనున్నారు. ఆ షోకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా రిలీజ్ అయ్యింది. దీంతో అయితే మంత్రి లేకుంటే టీవీ షోలు అన్నట్లుగా రోజా తీరు ఉందన్న సెటైర్లు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.  

 శ్రీరెడ్డికి ఒక కేసులో మాత్రమే బెయిల్ 

ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించిన  కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో రిలీప్ లభించింది. శ్రీరెడ్డిపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి.  విశాఖపట్నంలో నమోదైన కేసులో హైకోర్టు కండీషన్ బెయిలు  మంజూరు చేసింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని శ్రీరెడ్డిని ఆదేశించింది. మరోవైపు, చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్‌కు విచారణ అర్హత లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.అనకాపల్లిలో నమోదైన కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయిరోహిత్‌ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికగా  శ్రీరెడ్డి అభ్యంతరకరమైన భాష వాడారన్నారు.. అయితే న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాలలోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు. వైకాపా హాయంలో చెలరేగిపోయిన శ్రీరెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత  రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో  ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు ముందస్తు బెయిల్ కోసం శ్రీరెడ్డి హైకోర్టు నాశ్రయించారు. విశాఖ పట్నం కేసులో  శ్రీరెడ్డికి రిలీఫ్ వచ్చినప్పటికీ మిగతా ఐదు కేసుల్లో ఊరట లభించలేదు.  తనపై కేసులు నమోదైన తర్వాత శ్రీరెడ్డి ఊసరవెల్లిగా  మారింది. వైకాపాను తిడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తింది.  లోకేశ్ అన్నా నన్ను క్షమించు అని ప్రాధేయపడి విమర్శలపాలైంది. . తాను తప్పు చేసినట్టు శ్రీరెడ్డి ఒప్పుకోవడం చర్చనీయాంశమైంది. 

వ్యభిచారం కేసులో వైకాపా నేత బహిష్కరణ 

వైకాపా నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు పండిత సోమశంకర్ నాయక్ పై వైకాపా వేటు వేసింది.  విజయవాడలో  వెటర్నీ కాలనీ ఓ స్పా సెంటర్ లో వ్యభిచారం చేసిన కేసులో నాయక్ 10 వ నిందితుడు. గత కొంతకాలంగా ఈ స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు ఉప్పందింది. మాచవరం పోలీసులు మాటు వేసి స్పా సెంటర్ పై దాడి చేసిన సమయంలో ఓ గదిలో మహిళ మాత్రమే కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు మంచం క్రింద చూస్తే వైకాపా నేత నక్కినక్కి దాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో వైకాపా కేంద్ర కమిటి కంటి తుడుపు చర్య తీసుకుంది. సదరు వైకాపా నేతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఓ పక్క వైకాపా నేతలు అందగాళ్లు అని ప్రశంసిస్తుంటే మరో వైపు వైకాపా నేతలు వ్యభిచారం కేసుల్లో నిందితులుగా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కుతున్నారు.  ఇటీవల వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలులో  అధినేత జగన్ పరామర్శించడానికి వచ్చినసంగతి తెలిసిందే.  వివాదాస్పద వైకాపా నేతలైన  వంశీ, కొడాలినాని, అవినాశ్ లను అందగాళ్లు అని  జగన్ సంభోధించిన వారం రోజుల వ్యవధిలో బ్రోతల్ కేసులో వైకాపా నేతలు పట్టుబడడం గమనార్హం.   

ఇదీ దేవుడి స్క్రిప్టేగా జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నోట తరచుగా వచ్చే మాట దేవుడి స్క్రిప్ట్. ఈ పదాన్ని ఆయన 2019 ఎన్నికలలో వైసీపీ విజయం నుంచీ మొదలు పెట్టారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ.. సమయం, సందర్భం లేకున్నా దేవుడి స్క్రిప్ట్ గొప్పగా ఉందంటూ వ్యాఖ్యలు చేసే వారు.  2024 ఎన్నికలలో అదే దేవుడు వైసీపీకి అంత కంటే గొప్పగా స్క్రిప్ట్ రాశాడు. ఆ పార్టీకి కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయాన్ని అందించి ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదు పొమ్మన్నాడు. గతంలో జగన్ ప్రతి విషయాన్ని 23 నంబర్ తో ముడిపెట్టి తెలుగుదేశంపై సెటైర్లు గుప్పించేవారు. ఇప్పుడు అదే పని తెలుగుదేశం శ్రేణులు చేస్తున్నాయి.  పదకొండు నంబర్ ను ప్రస్తావిస్తూ తెలుగుదేశం శ్రేణులు జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నాయి. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 24) జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో వాస్తవానికి వైసీపీ పార్టీకి బ్లాక్ 12 కేటాయించారు. అయితే తెలుగుదేశం సోషల్ మీడియా సైనికులు సృజన జోడించి బ్లాక్ 12ను బ్లాక్ 11గా మార్చి ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.  వాస్తవానికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ శపథం చేసిన జగన్.. ఆ ప్రతిజ్ణను పక్కన పెట్టి.. తనపైనా, తన పార్టీ ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుందన్న భయంతో అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టీ పెట్టడంతోనే విపక్ష హోదా ఇవ్వాలంటూ పోడియం ముందు నినాదాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. సరిగ్గా 11 నిముషాల తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక్కడా 11 నంబర్ ను గుర్తు చేస్తూ తెలుగుదేశం జగన్ ను ఎగతాళి చేసింది. అయితే సభా నియమాలు, నిబంధనలపై ఇసుమంతైనా అవగాహన లేని జగన్ కు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి హాజరైనంత మాత్రాని సభలో అటెండెన్స్ వేయించుకున్నట్లు కాదన్న విషయం తెలియలేదు. దీంతో ఆయన అసెంబ్లీ హాజరు వ్రతమూ చెడింది.. ఫలితమూ దక్కలేదన్నట్లుగా తయారైంది.  సరే గవర్నర్ ప్రసంగం తరువాత సభ వాయిదా పడింది. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా అదే 11 సంఖ్యలు ప్రస్తావిస్తూ జగన్ పై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు.  సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలేననీ, ఆ ప్రజలు జగన్ కు కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చి ఆ హోదాకు జగన్ అనర్హుడని తేల్చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలోనైనా జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే ఆ పార్టీ జనసేనకు ఇప్పుడు ఉన్న స్థానాల కంటే కనీసం ఒక్క సీటైనా ఎక్కువ గెలుచుకోవలసి ఉంటుందని గుర్తు చేశారు. అలా కాకుండా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టాలంటే ఇండియాలో కాదు, జర్మనీ వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు.  మొత్తం మీద 11 సీట్ల స్క్రిప్ట్ తో దేవుడు జగన్ కు భలే ఇబ్బందులు తెచ్చిపెట్టాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.