యూట్యూబర్ లోకల్ బాయ్ రిమాండ్ 

.విశాఖపట్నానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ ‘లోకల్ బాయ్’ నానిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.  తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నాని తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ యువకుడు  ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో రూ. 2 కోట్ల వరకు పోగొట్టుకున్నాడు.  ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నానిపై సీరియస్ అయ్యారు. ఆ వీడియోను తొలగించాలని ఆదేశించారు. శనివారం రాత్రి నానిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జగన్ వచ్చారు.. వెళ్లారు!.. అటెండెన్స్ పడిపోయింది.. పనైపోయింది!

జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. తనతో పాటు తన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలనూ వెంటపెట్టుకుని మరీ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోకి నాలుగో గేటులోంచి కారులో రావడం నుంచి లోపలకు వచ్చిన తరువాత  నినాదాల వరకూ అంతా ఆ పార్టీ ముందుగానే నిర్ణయించుకు వచ్చిన డ్రామాగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కేవలం అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడానికే జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరౌతున్నారన్న పరిశీలకుల విశ్లేషణలు, తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ విమర్శలను అక్షరసత్యాలు అన్న విషయాన్ని రుజువు చేసే విధంగానే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు ఉన్నారు.  సోమవారం సభకు హాజరైన వైసీపీ సభ్యులు సరిగ్గా 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఉన్న ఆ కొద్ది సమయం కూడా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారి ఆందోళనను, నినాదాలను సభలో కూటమి సభ్యలు ఎవరూ పట్టించుకోలేదు. సభా నాయకుడు చంద్రబాబు కూడా వారి చిరునవ్వులు చిందిస్తూ.. ఈ డ్రామాలన్నీ మాకు అర్ధమౌతున్నాయన్నట్లు కూర్చున్నారు. దీంతో చేసేదేం లేక జగన్ తన సభ్యులతో సహా అసెంబ్లీని బాయ్ కాట్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచీ, సర్వత్రా జగన్ హాజరు కేవలం తన శాసనసభా సభ్యత్వాన్ని కాపాడుకోవడానేనన్న భావన వ్యక్తమైంది. జగన్ తరహా అంతా అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న తరహాలోనే ఉంటుందంటూ రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించింది. ఒక రోజు భాగ్యానికే తప్ప జగన్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనే అవకాశాలు లేవన్న విశ్లేషణలు వినిపించాయి. వాటికి అనుగుణంగానే అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడం కోసమే వైసీపీ సభ్యలు సోమవారం (ఫిబ్రవరి 24) అసెంబ్లీకి వచ్చినట్లే వచ్చి వాకౌట్ చేశారు. మళ్లీ అరవై రోజుల వరకూ వారు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అనర్హతా వేటు పడి.. ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న భయంతోనే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సభకు వచ్చారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.  

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు 'సోమవారం (ఫిబ్రవరి 24) న ప్రారంభమయ్యాయి. స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ను నామానేట్ చేస్తూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా స్పీకర్ ఎన్నిక మధ్యాహ్నం తరువాత జరిగే అవకాశం ఉంది. దాదాపు 27 ఏళ్ల తరువాత ఢిల్లీ అసెంబ్లీలో తొలి సారిగా బీజేపీ అధికార పక్షంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ  నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేయడానికి సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది.

అసెంబ్లీ బహిష్కరణ జగన్ యూటర్న్.. కారణమేంటంటే?

సింహం సింగిల్ గా వస్తుంది. పులివెందుల టైగర్. మాట తప్పడు, మడమ తిప్పడు.. ఇవీ జగన్ తనకు తానుగా తగిలించుకున్న భుజకీర్తులు. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ప్రజల ముందు దీనంగా సెంటిమెంట్ పండించి, తండ్రిని కోల్పోయాను, బాబాయ్ హత్యకు గురయ్యారు.. కోడి కత్తితో తనపై హత్యాయత్నం జరిగిందంటూ జనాలను నమ్మింది 2019 ఎన్నికలలో ఓట్లు దండుకుని అధికార పగ్గాలు అందుకున్న జగన్.. ఆ తరువాత తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు. క్రమం తప్పకుండా బటన్లు నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సోమ్ములు వేస్తున్నానని చెప్పుకుంటూనే.. మోయలేని పన్నుల భారం మోపి, చివరాఖరకు చెత్త మీద కూడా పన్ను వేసి జనం నడ్డి విరిచారు. తన ప్రభుత్వ విధానాలలో తప్పులను ఎత్తి చూపిన వారిని నానా రకాలుగా వేధించారు. కోవిడ్ సమయంలో వైద్యులకు కనీసం మాస్కులు కూడా సరఫరా చేయడం లేదని నిలదీసిన వైద్యుడిపై పిచ్చివాడన్న ముద్ర వేసి ఆయన చావుకు కారణమయ్యారు. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు, వేధింపులు, కేసులు, అరెస్టుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్లుగా జగన్ పాలన సాగింది. సరే ఐదేళ్ల పాటు తమ ఆగ్రహాన్ని పంటి బిగువున భరించిన ఏపీ జనం.. 2024 ఎన్నికలలో జగన్ కు ఆయన స్థానం ఏమిటొ చూపారు. కనీసం ప్రతిపక్ష నేతగా కూడా  అర్హత లేదని ఆయన సహా ఆయన పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలను మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు కూడా జగన్ గులకరాయి దాడి అంటూ సానుభూతి డ్రామాలకు తెరతీసినా జనం పట్టించుకోలేదు. అయితే అంతటి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తరువాత కూడా జగన్ తీరు మారలేదు.  తనకు 40 శాతం ఓట్లు వచ్చాయనీ, జనం తనను తిరస్కరించలేదనీ చెప్పుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కారణంగానే ఘోర పరాజయం పాలయ్యానంటూ మరోసారి సెంటిమెంట్ ప్లే చేద్దామని చూశారు.  ఇవన్నీ పక్కన పెడితే.. జనం ‘ఛీ’దరించుకుని.. కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేసినా.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ హఠం చేస్తూ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు సైతం వెళ్లారు. గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోవడానికి ఓ ఐదుగురు  ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంటే చాలు అంటూ అసెంబ్లీ వేదికగా తాను చేసిన ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించి మరీ.. తనకు లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని ప్రతిజ్ణ సైతం చేశారు. అయితే అసెంబ్లీ నిబంధలనలు తెలిసి వచ్చిన తరువాత.. ప్రతిపక్ష హోదా మాట దేవుడెరుగు.. ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని అవగతమైన తరువాత.. సింహం, పులి, మాట, మడమ వంటి మాటలన్నిటికీ చెల్లు చీటి పాడేసి అసెంబ్లీకి హాజరు కావడానికి రెడీ అయిపోయారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం (ఫిబ్రవరి 24) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ హాజరౌతారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాలకు జగన్ డుమ్మా కొడితే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ క్లారిటీ ఇచ్చిన తరువాత.. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఫరవాలేదు... ఉన్న శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకుంటే చాలన్న భావనకు జగన్ వచ్చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్ తన అడ్డాగా చెప్పుకునే కడప జిల్లాలలోనే ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఏడు అసెంబ్లీ స్థానాలలో  పరాజయం పాలైంది. సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. దీంతో ఆయన ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టుపట్టి అసెంబ్లీని బహిష్కరిస్తే ఏదో సామెత చెప్పిన చందంగా ప్రతిపక్ష హోదా రాకపోగా, ఉన్న శాసనసభ సభ్యత్వం కూడా పోతుందన్న క్లారిటీ రావడంతో దిమ్మదిరిగి బొమ్మ కనిపించినట్లైంది. దీంతో బుద్ధిగా కనీసం అటెండెన్స్ కోసమైనా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు ఇవే.   ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం తరువాత  సభ వాయిదా పడుతుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలు చర్చించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.  ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని  వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సాధారణంగా అసెంబ్లీ జరుగుతూంటే అన్ని పార్టీల నేతలు .. తమ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తాయి. అయితే జగన్ అలాంటిదేమీ నిర్వహించలేదు. తానేం చెబితే తన పార్టీ ఎమ్మెల్యేలు అది చేసి తీరాలన్నది జగన్ హుకుం.  అందుకే వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హారరౌతున్నారని సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో చెప్పేశారు. అంతే. ఇన్ని రోజులూ ఎందుకు హాజరు కాలేదు. కారణమేంటి అన్న ప్రశ్నలు ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నాయి. వాటిని బయటకు చెప్పే ధైర్యం, ఒక వేళ చెప్పినా సమాధానం దొరకుతుందన్న నమ్మకం వారిలో లేదు.  సరే అసెంబ్లీకి హాజరవ్వాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందీ సభకు హాజరౌతారు. అయితే వారు సెషన్ మొత్తం సభకు వస్తారా? మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగానికి హాజరై.. ఆ తరువాత మళ్లీ డుమ్మా కొట్టేస్తారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.  కేవలంఅనర్హతా వేటు పడకుండా ఒక్క రోజు మాత్రం సభకు హాజరై ఆ తరువాత ఇక మళ్లీ ఇప్పట్లో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

నల్లగొండ జిల్లాలో ఇనుప యుగపు ఆనవాళ్లు `

పరిరక్షించాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి నల్లగొండ జిల్లాలో  గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుప యుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యుడు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం (ఫిబ్రవరి 23)  గుడిపల్లి పరిసరాల్లో కొండగట్టులపై, పంట పొలాల్లో క్రీ.పూ. 2000-1000 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన సమాధి గదులు, నిలువు రాళ్ల వద్ద జరిపిన విస్తృత పరిశోధనల్లో ఆసక్తికర పురావస్తు విశేషాలు వెలుగు చూశాయన్నారు.  ఊరి వెలుపల చీనీ తోటల్లో గల అనేక నిలువురాళ్లు (మరణించిన వారికి గుర్తుగా నిలిపే స్మారక శిలలు) ఒక్కొక్కటిగా కనుమరుగయ్యి ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలి ఉన్నాయనీ, గుడిపల్లి ` శింగరాజుపల్లి రోడ్డుకు కుడివైపున గల ఎల్లమ్మ బండపై గల గూడు సమాధులు నిర్మాణ సామాగ్రి సేకరణలో భాగంగా కంకర రాళ్లౌతున్నాయని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిలువు రాయి ఏడడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు, అడుగు మందంతో ఉన్నాయన్నారు. ఎల్లమ్మ బండపైగల ఇంకా మిలిగి ఉన్న ఒక గూడు సమాధి, నిర్మాణ పరంగా అరుదైనదని, అటూ ఇటూ గల రెండు రాతి వరుసలపై మామూలుగా నిలిపే దీర్ఘ చతురస్రాకారపు కప్పురాయి స్థానంలో, ఒక పెద్దగుండు రాతిని అమర్చారని, ఇలాంటి ఆధారం వెలుగు చూడటం తెలంగాణా రాష్ట్రంలోనే అరుదైన విషయమని శివనాగిరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా పురాచరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన ఈ ఆనవాళ్లను కాపాడుకొని, ఇప్పటికి దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర చిహ్నాలను భావితరాలకు అందించాలని గుడిపల్లి గ్రామస్తులకు శివనాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, దేవరకొండ వారసత్వ కార్యకర్త, యూనస్‌ పర్హాన్‌, గుడిపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి, పడాల సైదులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఇలా గూడు సమాధిపైన గుండురాతిని అమర్చిన విషయం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొందని, వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాలని కొత్త తెలంగాణా చరిత్ర బృందం, కన్వీనర్‌, శ్రీరామోజు హరగోపాల్‌, కో`కన్వీనర్‌,   భద్రగిరీష్‌ అభిప్రాయపడినట్లు శివనాగిరెడ్డి చెప్పారు.

విరాటుడి విశ్వరూపం.. పాక్ పై టీమ్ ఇండియా ఘన విజయం

చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా పాకిస్థాన్ ను చిత్తు చేసి లెక్క సరి చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. అలవోకగా సెంచరీ సాధించి భారత్ కు ఘన విజయాన్ని అందించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పాకిస్థాన్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ  వన్డే సెంచరీ సాధించి ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు.   ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. పాక్ బ్యాటర్లలో  కెప్టెన్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు, షకీల్ 76 బంతుల్లో 62 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లలో కుల్‌దీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు దక్కించుకుకోగా, హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.  ఇక భారత్ బ్యాటర్లలో స్కిప్పర్ రోహిత్ వర్మ 20 పరుగులు చేయగా, శుభమన్ గిల్  శుభ్‌మన్ గిల్ 46, శ్రేయస్ అయ్యర్ 56 పరుగులు చేశారు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ తొలి బంతి నుంచీ సాధికారికంగా ఆడాడు. 111 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. వికెట్ల మధ్య చిరుతలా పరుగెడుతూ సింగిల్స్ సాధించాడు. కోహ్లీ ఏడు ఫోర్లు సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 51వ సెంచరీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. జగన్ తీరిక మారదా?

అందితే జుట్టు లేకుంటే కాళ్లు పట్టుకునే మనస్థత్వం మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది. ఈ విష‌యం చాలాసార్లు రుజువైంది. తాజాగా మ‌రోసారి జ‌గ‌న్ అదే ఫార్ములాను అమ‌లు చేయ‌బోతున్నారు. ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేవ‌ర‌కు అసెంబ్లీకి వెళ్ల‌నంటూ ఇన్నాళ్లు మొండిప‌ట్టు ప‌ట్టిన జ‌గ‌న్‌.. తన అసెంబ్లీ సభ్యత్వంపైనే అన‌ర్హ‌త వేటు పడే పరిస్థితి వచ్చే సరికి యూటర్న్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. అనర్హత వేటు పడితే పులివెందుల నియోజకవర్గం నుంచి మరో సారి గెలుస్తానన్న నమ్మకం జగన్ లో లేకపోవడం వల్లనే ఆయన అసెంబ్లీకి హాజరై ఆ వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. జగన్ సిల్లీ ప్లాన్ చూసి వైసీపీ నేతలు సైతం చీదరించుకుంటున్న పరిస్థితి. వాస్త‌వానికి.. పార్టీలోని ముఖ్య‌నేత‌ల‌ను సైతం జ‌గ‌న్ రాజ‌కీయ అవ‌స‌రానికి వాడుకొని త‌రువాత ప‌క్క‌న‌పెట్టేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ఈ క్ర‌మంలో వైసీపీకి వీరాభిమానులం, రాజ‌కీయాల్లో ఉన్నంత‌కాలం వైసీపీలోనే ఉంటాం అంటూ దీమాగా చెప్పిన‌ వారు సైతం..   ఆ పార్టీని వీడుతున్నారంటే.. ఆయన యూజ్ అండ్ త్రో పాలసీ అర్ధమౌతుంది.   మ‌రోవైపు.. త‌నపై తానే దాడులు చేయించుకొని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొంద‌డంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మించిన రాజ‌కీయ నేత దేశ రాజ‌కీయాల్లో ఎక్క‌డా క‌నిపించ‌రు.  బాబాయ్ హ‌త్య‌, కోడిక‌త్తి డ్రామాతోపాటు ఒక్క ఛాన్స్ ఫ్లీజ్ అంటూ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌.. ఐదేళ్లు ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. వైసీపీ హ‌యాంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌నుల‌ కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. దీంతో 2024 ఎన్నిక‌ల్లో ఏపీలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఏక‌మై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ఫ‌లితంగా కేవ‌లం 11 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అంటే..  ఏపీ ప్ర‌జ‌లు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకు స‌రిప‌డా అసెంబ్లీ స్థానాల‌ను సైతం వైసీపీ పార్టీకి ఇవ్వ‌లేదు. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష నేత హోదా, తన పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వ‌స్తాన‌ని హఠం చేస్తున్నారు. ప్ర‌జ‌లే ఇవ్వ‌ని ప్ర‌తిప‌క్ష హోదాను జ‌గ‌న్, వైసీపీ నేత‌లు కోరుకుంటుండటం ప్ర‌జాతీర్పుపై వారికి ఎంత గౌర‌వం ఉందో తేట‌తెల్లం చేస్తుంది.  ఇటీవ‌ల.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి నానా ర‌భ‌స చేసిన జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నేత వ‌చ్చినా స‌రియైన భ‌ద్ర‌త ఇవ్వ‌రా అంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించి తానో రాజకీయ జోకర్ గా నిరూపించుకున్నారు.   కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ వ‌చ్చారు. ఆ త‌రువాత జ‌గ‌న్‌, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రూ అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రుకాలేదు. ప‌లుసార్లు స‌మావేశాల‌కు హాజ‌రుకావాల‌ని స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్ కోరిన‌ప్ప‌టికీ.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే వ‌స్తామంటూ జ‌గ‌న్ వాదిస్తూ వ‌స్తున్నారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీ అయ్యారు. అయితే, చేతనైంది చేసుకోండి అని జగన్ రెడ్డి కూడా ఇటీవల మీడియా స‌మావేశంలో అన్నారు . అయితే ఆయనదంతా అందితే జుట్టు .. అందకపోతే కాళ్లు పట్టుకునే మనస్థత్వం అని చాలా సార్లు రుజువు అయింది. ఇప్పుడు తనపై అనర్హతా వేటువేస్తే మ‌ళ్లీ  గెలవడం అసాధ్యం అని అర్థం కావడంతో ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి హాజరవ్వాలని అనుకుంటున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  వరుసగా మూడు సెషన్లు లేదా.. అరవై రోజుల్లో ఒక్క‌రోజైనా సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది.  అయితే, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన ద‌గ్గ‌ర నుంచి జ‌గ‌న్ కేవ‌లం ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చాడు. ఆ త‌రువాత జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు స‌మావేశాల‌కు హాజ‌రు కాలేదు. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే వారిపై  అన‌ర్హ‌త వేటే వేసేందుకు అవ‌కాశం ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తారు. సెలవు చీటీ స్పీకర్ కు రాసి పంపినా ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు.. అనుకుంటున్నారేమో కానీ.. ఒక్కరోజు అసెంబ్లీకి పోతే పోలా అని జ‌గ‌న్‌ అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్ తోపాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.  అలా ఒక్కరోజు హాజరైతే ఆ తర్వాత అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నారు.   ఇది సాంకేతికంగా అనర్హత వేటు నుంచి తప్పించుకునే పద్ధతి మాత్రమే.  కానీ, ఇలా అడ్డగోలుగా అసెంబ్లీకి డుమ్మా కొడితే తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? అని వైసీపీ నేతలే అంటున్నారు. జగన్ తాజా   నిర్ణ‌యాన్ని వైసీపీ నేత‌లుసైతం స‌మ‌ర్ధించ‌డం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి‌. ఇలా అయితే, వైసీపీ  మనుగ‌డ ఉండదన్న ఆందోళన వైసీపీ నేతలలో వ్యక్తమౌతోంది. 

మెట్టు దిగి అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం!

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని ఎంత హడావుడి చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆఖరికి స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారాయన. తనకు హోదా వచ్చే వరకు అసెంబ్లీ మెట్లెక్కనని  భీష్మించుకు కూర్చొన్నారు. అంతా తన ఇష్ట ప్రకారమే జరగాలని భావించే మాజీ సీఎంకు శాసనసభ నిభందనలు తెలిస్తే కాని తత్వం బోధ పడలేదు. ఏ శాసనసభ్యుడైనా స్పీకర్‌కు సరైన రీజన్ చూపించకుండా ఆరు నెలల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కి ఉంటుంది. అయితే స్పీకర్లు తమకు ఉన్న ఆ విచక్షనాధికారాల్ని పెద్దగా ఉపయోగించిన సందర్భాలు కనిపించవు. అయితే ఏపీలో స్పీకర్‌గా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజులను జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేధింపులకు గరి చేశారు. వారు ఎక్కడ తమ విచక్షణాధికారాలకు పని చెప్తారో అన్న భయంతో జగన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీకి రావడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ కూడా తెలంగాణలో అనర్హత వేటు భయంతోనే బడ్జెట్ సమావేశాల రోజు అసెంబ్లీలో అటెండెన్స్ వేయించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే భయంతో బెట్టు మాని.. మెట్టు దిగుతున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తున్నారు సోమవారం శాసనమండలిలోని వైసీపీ కార్యాలయంలో మీటింగ్‌ ఉంది.. సభ్యులంతా హాజరవ్వాలని బొత్స సత్యనారాయణ రాసిన లేఖతో జగన్ అసెంబ్లీ షెడ్యూల్ ఖరారైంది.

పెద్దల సభలోకి లోకనాయకుడు.. క్లారిటీ ఇచ్చిన కమల్

మక్కల్ నిది మయ్యమ్ పార్టీ అధినేత, విశ్వనటుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎం కె స్టాలిన్.. ఇప్పటికే తన కేబినెట్ మంత్రి ద్వారా కమల్ హాసన్‌కు సమాచారం పంపారు. ఈ ఏడాది జులైలో డీఏంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌ను పెద్దల సభకు పంపేందుకు డీఏంకే సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఏంకేతో మక్కల్ నిది మయ్యమ్ పొత్తు పెట్టుకొంది. అయితే ఆ ఎన్నికల్లో కోయంబత్తురు నుంచి కమల్ హాసన్ బరిలో నిలవాలని భావించారు.  కోయంబత్తురు నియోకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు. దీంతో డీఏంకే అధినేత, సీఎం ఎం.కె. స్టాలిన్ సలహా, సూచనలతో కమల్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ సైతం తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన సైతం ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అందులో భాగంగా వివిధ సమయాల్లో పలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఏంకే పార్టీ అధినేత, సీఎం ఎం.కె.స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. అందులోభాగంగా కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు డీఏంకే ఈ నిర్ణయం తీసుకుందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను రాజ్యసభకు వెళ్తున్న విషయాన్ని లోకనాయకుడు తాజాగా నిర్ధారించారు.  ఎంఎన్‌ఎం 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో జెండాను ఆవిష్కంచి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కమల్ హసన్ తాను రాజ్యసభకు వెడుతున్న విషయాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా తన పొలిటికల్‌ కెరీర్‌పై కమల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి చాలా ఆలస్యంగా వచ్చానని, 20 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తన ప్రసంగం, స్థానం వేరేలా ఉండేవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పార్లమెంట్‌లో మన పార్టీ గొంతు వినిపించబోతోందని ఆయన చేసిన  వ్యాఖ్యలతో  కమల్‌ హాసన్‌ రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవల జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.

పాక్‌కి షాక్ ఇచ్చి లెక్క సరిచేస్తారా?

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఎన్ని జట్లు తలపడుతున్నా, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరేగా ఉంటుంది. ఆ రెండు దేశాల అభిమానులే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు టీవీల ముందుకు చేరిపోతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియా, పాక్ మధ్య పోరు అంటే హైఓల్టేజ్‌ మ్యాచ్‌. చిరకాల ప్రత్యర్థులైన దాయాది జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం తలపడుతున్నాయి. గత ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించిన పాక్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాక్‌ మొదటి మ్యాచ్ ఓటమితో ప్రారంభించగా.. బంగ్లాపై ఘన విజయంతో భారత్‌ రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది.  ఈ సారి బ్యాట్స్‌మాన్ ఫకర్‌ జమాన్‌ దూరం కావడం పాక్‌ జట్టుకు పెద్ద లోటే. స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ ఫామ్‌ లేమి కూడా వారిని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు బుమ్రా లేకపోయినా.. టీమ్‌ఇండియా పేస్‌ దళాన్ని తొలి మ్యాచ్‌లో అద్భుతంగా షమీ ఐదు వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడింపించాడు. అతడికి హర్షిత్‌ రాణా తోడయ్యాడు. స్పిన్నర్లు కూడా తమవంతు ప్రాత్ర పోషించారు. మరి వీరు పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్‌, సెంచరీ గిల్‌ మరోసారి చెలరేగితే.. టీమ్‌ఇండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్థాన్‌పై గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. తన మునుపటి ఫామ్‌ను అందుకొని రాణిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు  తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన పాకిస్థాన్‌కు భారత్‌తో మ్యాచ్‌ అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ ఆతిధ్య జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును భారత్ ఏమాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. దాయాదుల పోరు అంటే రెండు జట్ల ఆటగాళ్లు ప్రాణంపెట్టి ఆడతారన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. అందులో మూడు సార్లు పాకిస్థాన్‌ నెగ్గి పైచేయి సాధించింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ గ్రూప్‌ స్టేజ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని భారత్‌ నమోదు చేసింది. గ్రూప్‌ బీలో భాగంగా జూన్‌ 4న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌కు 41 ఓవర్లలో 289 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అయితే.. పాక్‌ 33.4 ఓవర్లలో 164 పరుగులే చేసింది. డక్‌వర్త్‌ పద్ధతిలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. యువరాజ్‌ మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.  2017 ఫైనల్‌కు చేరిన భారత్‌.. తిరిగి పాకిస్థాన్‌తోనే తలపడింది. జూన్‌ 18న లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా మ్యాచ్‌ జరగ్గా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో టీమ్‌ఇండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. దీంతో తొలిసారి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. ఆనాటి ఫైనల్‌లో ఘోర ఓటమికి బదులు తీర్చుకొనే అవకాశం ఇప్పుడు టీమ్‌ఇండియాకు వచ్చింది. గత వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన మన మెన్ ఇన్ బ్లూ... మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటున్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగే ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి చాంపియన్ ట్రోఫీలో రెండ జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సీనియర్లకు ఇదే చివరి ట్రోఫీ అని భావిస్తున్న తరుణంలో పాకిస్థాన్‌పై చెలరేగి ఆడి.. కెరీర్‌కు ముగింపు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మహాకుంభ్ లో ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు భక్త జనం పోటెత్తుతున్నారు. శుక్రవారం నాటికే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరువైంది.  మామూలుగా 12ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలుగా కాకుండా  మహాకుంభమేళా 144 సంవత్సరాల తరువాత వచ్చింది. 40 రోజులు పాటు సాగే ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మహా శివరాత్రితో ముగియనున్న కుంభమేళా గడువు దగ్గరపడుతుండటంతో భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది.  హిమాలయాలనుంచి కూడా సాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడం విశేషం. దేశం,విదేశాల నుంచి కూడా కుంభమేళాకు తరలి వస్తున్నారు.  విమానాలు,రైళ్లు,బస్సులు,కార్లు ఇలా ఏ వాహనం దొరికితే దానిలో ప్రయాగ్ రాజ్ బాట పడుతున్నారు భక్తులు.  వాహనాలతో వందల కి.మీ ట్రాఫిక్ జామ్ అవుతున్నది.  భారతదేశ జనాభా 145 కోట్లలో హిందువులు 110 కోట్లకు పైగా ఉన్నారు.వారిలో సగం మందికి పైగా ఇప్పటికే మహాకుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు.  

జగన్‌కి సీఎం అపాయింట్‌మెంట్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

ముఖ్యమంత్రిగా అయిదేళ్లు పరదాల మాటున, ప్యాలెస్ పాలన  ఎలా ఉంటుందో చూపించిన జగన్‌కు ఏపీ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. కనీసం జగన్‌కు ప్రతిపక్షనేత హోదా కూడా లేకుండా చేయడంతో ఆయన దాన్ని వంకగా చూపిస్తూ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు. ఆ క్రమంలో ఆ మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల ఎమ్మెల్యేగానే చూస్తూ టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.  మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితల దగ్గర నుంచి అందరూ జగన్‌ని పులివెందుల ఎమ్మెల్యేగానే సంభోదిస్తున్నారు. ప్రతిపక్షనేత హోదా ఎలాగూ రాదని తెలిసినా జగన్ మాత్రం దాని కోసం న్యాయ పోరాటం చేస్తూ సొంత పార్టీలోనే అభాసుపాలవుతున్నారు. ఓటమి తర్వాత జగన్ ఎప్పుడు, ఎక్కడ ఉంటారో వైసీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ టూ బెంగళూరు ప్యాలెస్‌కు షటిలింగ్ చేస్తూ,  పులివెందులలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చి మాయమవుతున్నారు . మధ్యమధ్యలో జైళ్లకు వెళ్లి రిమాండ్‌లో ఉన్న తన పార్టీ నేతలను పరామర్శించి వస్తున్నారు. అంతేకాని సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానని ఘనంగా ప్రకటించిన ఆయన దాని ఊసే ఎత్తడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పులివెందులు సమస్యలకు లింకు పెట్టి తాజాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  జగన్‌ తన నియోజకవర్గం పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి లేటెస్ట్‌గా ప్రకటించారు.  ఎన్నో ఏళ్ల నుంచి ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలంటే మాజీ సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని, అక్కడ ఎన్నో సమస్యలున్నాయని,  వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌కు ఉందని దెప్పిపొడిచారు. జగన్ అసెంబ్లీకి గైర్హాజరవుతుండటంతో పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ ఉప ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలిచినా అసెంబ్లీకి వెళ్లేది లేదని బీటెక్ రవి యద్దేవా చేశారు. ఏదేమైనా పులివెందుల ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాలం, కర్మం కలిసి రాకపోతే మాజీ సీఎం అయినా, ఇంకెవరైనా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో.

చెత్త బుట్టలోకి చెత్తపన్ను

చంద్రబాబు సర్కార్ చెత్త పన్నును రద్దు చేసింది. జగన్ హయాంలో 2012 నవంబర్  నుంచి రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ సర్కార్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో చెత్తపన్నును రద్దు చేస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  గత ఏడాది డిసెంబర్ 31నుంచీ చెత్త పన్ను రద్దు అమలులోకి వచ్చినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొంది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు చెత్త పన్నును రద్దు చేశారు. 

మహా లుకలుకలు!.. ఫడ్నవీస్ సర్కార్ క్షేమమేనా?

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేతృత్వంలోని సంకీర్ణ  ప్రభుత్వంలో లుకలుకలు బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేల మధ్య సఖ్యత లేమి ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలో మహాయతి కూటమి కొలువుదీరి ఆరునెలలు పూర్తయ్యిందో లేదో.. విభేదాలు రచ్కకెక్కడం గమనార్హం.  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన షిండే వర్గం అధినేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పై నిప్పులు చెరిగారు. తనను తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. అసలు మహారాష్ట్ర ఎన్నికలలో మహాయతి కూటమి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైనప్పుడే కూటమిలో విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పీట ముడి పడింది. షిండే సీఎం పదవి కోసం గట్టి పోటీయే ఇచ్చారు. అయితే చివరికి బీజేపీ హైకమాండ్ సూచన మేరకు డిప్యూటీ సీఎం పదవికి అంగీకారం తెలిపారు. దీంతో ఫడ్నవీస్  సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ ఈ ఆరు నెలల కాలంలో షిండే వర్గం శివసేన, బీజేపీల మధ్య పరిస్థితి  ఉప్పూ నిప్పులాగే ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ షిండే వర్గం ఎమ్మెల్యేలకు భద్రత కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ఏక్ నాథ్ షిండే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహిస్తున్న సమావేశాలకు ఏక్‌నాథ్ షిండే  హాజరు కావడం లేదు.  ఇప్పటి వరకూ చాపకింద నీరులా తన అసమ్మతిని తెలియజేస్తూ వచ్చిన షిండే తాజాగా.. తనను తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ ఫడ్నవీస్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.  2022లో శివసేన పార్టీని చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ ఆఘాడీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన విషయాన్ని అన్యాపదేశంగా గుర్తు చేశారు.   అసలింతకూ షిండే ఈ స్థాయిలో రియాక్ట్ కావడానికి ఫడ్నవీస్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలి ఎన్నికలకు ముందు వరకూ మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం కూటమి విజయం సాధించి ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీనిపై అసంతృప్తిగా ఉన్న షిండేను మరింత రెచ్చగొట్టడానికా అన్నట్లు ఫడ్నవీస్ ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. షిండే సీఎంగా ఉండగా ఆమోదం తెలిపిన ఓ ప్రాజెక్టును షిండే ఏకపక్షంగా నిలిపివేశారు. దీంతో భగ్గుమన్న ఏక్ నాథ్ షిండే తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.  2022లో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలో తనను అందరూ తేలిగ్గా తీసుకున్నప్పుడు.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టానని ఏక్ నాథ్ షిండే గుర్తు చేశారు. ఇప్పుడు ఫడ్నవీస్ తనను తేలిగ్గా తీసుకుంటున్నారనీ, ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొడతాననీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.  ప్రభుత్వాన్ని పడగొట్టి స్వయంగా మీడియా ముందు ఏక్‌నాథ్‌ షిండే వెల్లడించారు. 

జగనన్నా..జనంలోకి రాకన్నా!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి సొంత పార్టీ నుంచే విజ్ణప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ జనంలోకి రాకుండా ఉంటేనే పార్టీ ఆబోరు కొంచమైనా దక్కుతుందన్నది వైసీపీ శ్రేణులు, నాయకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకో జగన్ జనంలోకి వస్తానంటే వద్దు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. జగనన్నా.. జనంలోకి రావద్దన్నా.. అంటే విజ్ణప్తులు చేస్తున్నారు. వైసీపీ నేతలు, క్యాడర్ ఒత్తిడి కారణంగానే జగన్ తన జిల్లాల పర్యటన వాయిదా వేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ రాజకీయ అరంగేట్రం చేసి 15 సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ ఆయన రాజకీయ నేతగా కాకుండా, ఒక ఫ్యాక్టనిస్టుగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  అధికారంలో ఉన్న ఐదేళ్లూ జనానికి ముఖం చూపకుండా, జనం ముఖం చూడకుండా తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమై పాలన సాగించిన జగన్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరవాత జనంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే ఆయన బయటకు వస్తున్నారంటే జనాలను సమీకరించడం ఎలా అన్న భయంతో వణికి పోతున్నామనీ వైసీపీ లీడర్లే చెబుతున్నారు.  అధికారంలో ఉండగా నిత్యం తెలుగుదేశం, జనసేన నేతలూ, క్యాడర్ లపై వేధింపులు, తప్పుడు కేసులు అంటూ కక్ష సాధింపు చర్యలతో గడిపేసిన జగన్ ఎన్నడూ రాష్ట్ర ప్రగతి గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. బటన్ లు నొక్కుతున్నాను కదా?  లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు పడుతున్నాయి కదా?  అది చాలు అన్నట్లుగా జగన్ తీరు ఉంది.  ఇక సీఎంగా తన ఐదేళ్ల పదవీ కాలంలో ఆయన ఎన్నడూ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ప్రెస్ నోట్లు పంపడం, లేదా మీడియా ముందుకు సకలశాఖల మంత్రి సజ్జలను పంపి తన మాట ఆయన నోట వినండి అన్నట్లుగా వ్యవహరించడంతోనే సరిపెట్టేశారు.  2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి కర్తాకర్మాక్రియా తానేనని జగన్ బాహాటంగానే చెప్పుకున్నారు. అదే విధంగా 2024 ఎన్నికలలో కూడా తన ముఖారవిందమే చాలు జనం ఓట్లు వేయడానికి అన్నట్లుగానే వ్యవహరించారు. ఇష్టారీతిగా అభ్యర్థులను మార్చేశారు.  సరే అదంతా పక్కన పెడితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 175 స్థానాలలో పోటీ చేసిన వైసీపీ కేవలం 11 స్థానాలలోనే విజయం సాధించింది. గెలుపునకు కర్తా, కర్మా, క్రియా అన్నీ తానేనని జగన్ ఎలా జభావించారో, ఓటమికి కూడా తానే కారణమని జగన్ భావించి ఉంటే.. పార్టీ పరాజయానికి కారణాలపై, అధికారంలో ఉండగా తాను చేసిన తప్పులపై సమీక్ష చేసుకునే వారు, ఆత్మ  విమర్శ చేసుకుని, పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టేవారు. అయితే జగన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే పరాజయం పాలయ్యామనీ,  సింహంలా సింగిల్ గా వారడం వల్లే కూటమి విజయం సాధ్యమైందనీ, బటన్లు నొక్కి తాను పంచిన సొమ్ములు తీసుకున్న జనం ఓటు వేయకుండా మోసం చేశారనీ కారణాలు చెబుతూ.. ఇప్పటికీ తాను సుద్దపూసనేననీ, జనం తమ తప్పు తెలుసుకుని మళ్లీ తనను సీఎంను చేస్తారనీ భ్రమల్లోనే ఉన్నారు. పార్టీ నేతలూ, క్యాడర్ ను కూడా అలాగే భ్రమల్లో బతకమంటున్నారు.  ఇలా భ్రమల్లో ఉంటూ.. గతంలో వ్యవహరించిన తీరునే జగన్ వ్యవహారశైలి ఉండటం వల్ల వైసీపీకి తప్ప మరెవరికీ ఎటువంటి నష్టం లేదు.  ఆ విషయం స్పష్టంగా తెలుసు కనుక.. వైసీపీ నేతలూ, శ్రేణులూ జగనన్నా జనంలోకి రావద్దన్నా, తాడేపల్లి ప్యాలెస్ కో, బెంగళూరు ప్యాలెస్ కో పరమితమైతే చాలన్నా అంటూ బతిమలాడుతున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చియార్డు సందర్శన చేసిన జగన్  తనకు భద్రత కల్పించలేదంటూ చేసిన విమర్శలపై పార్టీ వర్గాలలోనే అసహనం వ్యక్తం అవుతోంది. ఇక వల్లభనేని వంశీని పరామర్శించేందుకు విజయవాడ జిల్లా జైలుకు వెళ్లిన జగన్ ఆ సందర్భంగా చేసిన ప్రసంగం సొంత పార్టీ నేతలే తలలు బాదుకునేలా ఉంది.  అమ్మ ఒడి అందడం లేదంటూ ఓ  చిన్నారి చేత మాట్లాడించి పండిద్దామనుకున్న డ్రామా కూడా బూమరాంగ్ అయ్యింది.  జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల లబ్ధిదారులమంటూ ఆ చిన్నారి చేసిన వ్యాఖ్యలు జగన్ ను నవ్వుల పాలు చేశాయి. అందుకే ఇక చాలు జగనన్నా.. మరింత పలుచన కావద్దు.. ప్యాలెస్ లోనే కాలం గడుపు అంటూ వైసీపీ క్యాడర్ ఆయనను వేడుకుంటోంది.