The appointment of EC is in place of the transferred officers

కొత్త అధికారులను నియమించిన ఈసీ

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.  గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమించారు.

change in ias and ips

మారిన ఐఏఎస్, ఐపీఎస్ ల తీరు.. అధికారం ఎవరిదో తేలిపోయినట్లేగా?

జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్  ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై  అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది. అయితే  విషయాన్ని సర్వేలతో సంబంధం లేకుండా జనం మూడ్ ఏమిటి, ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు ముందుగానే పసిగట్టేయగలరు. ఔను రాజకీయ పరిభాషలో బాబూస్ గా పిలవబడే ఐఎస్ఎస్ అధికారులకు జనం నాడి అందరికంటే ముందే తెలిసిపోతుంది.   అందుకే ఏపీలో  ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో సారి గద్దె నెక్కే పరిస్థితి లేదని వారు ఎప్పుడో పసిగట్టేశారు. వారి విధేయతను మార్చేయడానికి, ప్లేటు ఫిరాయించడానికి ఎప్పుడో రెడీ అయిపోయారు. అయితే అతి కొద్ది మంది మాత్రం తమ విధేయతలను మార్చినా ఫలితం లేని స్థితికి వచ్చేశారు. జగన్ అక్రమ పాలనలో, నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలు విధానాలను అమలు చేయడంలో జగన్ తో అంటకాగి నిండామునిగిపోయిన వారు మాత్రం నిండా మునిగిన వాడికి చలేమిటి అన్నట్లుగా ఎన్నికల కోడ్ ను సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు.  మిగిలిన వారు మాత్రం ఇప్పుడు  తమ ఉద్దేశం ప్రకారం రాబోయేది తెలుగుదేశం కూటమి సర్కారే అన్న నిర్ధారణకు వచ్చేశారు.   ఇప్పటి వరకూ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు, కొందరు ఐపీఎస్ అధికారులు కాబోయే సీఎం అన్న నమ్మకానికి వచ్చేసి చంద్రబాబు ప్రాపకం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అసలు బాబూస్ లో ఈ ప్రయత్నాలు ఎప్పుడో ఆరేడు నెలల కిందటే మొదలయ్యాయి. ఇప్పుడు అవి మరింత ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో కాంట్రాక్ట్ లోకి వెళ్లి మరీ తమ సచ్ఛీలతను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలీ ఒరవడి ఆరేడు నెలల కిందటే మొదలైంది.  ఇంత కాలం జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఆరేడు నెలల నుంచీ జగన్ సర్కార్ కు దూరం జరగడం మొదలైంది.  ఇంత కాలం జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారుల వైఖరి గత ఆరేడు నెలలుగా పూర్తిగా మారిపోయింది. వి జగన్ కరుణా కటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు గత ఆరేడు నెలల నుంచీ చంద్రబాబుతో భేటీకి తహతహలాడుతున్నారు. కొందరైతే రహస్యంగా ఆయనను కలిసి  క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఒక సందర్భంలో చంద్రబాబు ఈ విషయాన్నిస్వయంగా చెప్పారు. ఒక సీనియర్ అధికారి తనను మారువేషంలో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి వివరించారనీ, తానేం చేయలేకపోతున్నానని మధనపడ్డారనీ, ఎదిరిస్తే ప్రాణాలకే ముప్పని భయపడ్డారని చంద్రబాబు చెప్పారు. అంటే కేవలం జగన్ ఒత్తిడితోనే   తాము  తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా  పని చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పుకున్నారు.  బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే   బాబు ప్రాపకం కోసం వెంపర్లాడారు. ఇప్పుడు ఎన్నికల ముగిసిన తరువాత మరింత మంది అదే బాటలో నడుస్తున్నారు. బాబూస్ మారిన వైఖరే రాష్ట్రంలో ప్రభుత్వం మారోబోందన్న సంకేతాలను బలంగా ఇస్తున్నది.   అయితే జగన్ ప్రాపకం కోసం పరిధి దాటి వ్యవహరించి తెలుగుదేశం శ్రేణులనూ నేతలనూ వేధింపులకు గురి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇప్పుడు బాబు ప్రాపకం కోసం వెంపర్లాడే ధైర్యం రావడానికి కారణం.. ఇప్పుడు సర్వీస్ అధికారుల తీరే రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమిదేనన్న భావనను బలపరిచేదిగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

vijaya sai reddy escape

ఆ పాపం ఎ2 విజయసాయిదే... అందుకే...!

జగన్ ప్రభుత్వ పుట్టికి ఆల్రెడీ ఓటర్లు చిల్లు పెట్టేశారు. మెల్లమెల్లగా నీళ్ళు లోపలకి వస్తున్నాయి. జూన్ 4వ తారీఖున జగన్ ప్రభుత్వ పుట్టి ‘మునిగిపోవడం’ ఖాయమని ‘తేలిపోయింది’. జగన్ ప్రభుత్వం మీద ప్రజల్లో మొదటి నుంచే వ్యతిరేకం వుంది. తాను ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు చాలా హ్యాపీగా వున్నారని, తాను, తన దండుపాళెం బ్యాచ్ ఎన్ని పనికిమాలిన వేషాలు వేసినా జనం తనకు ఓట్లు వేస్తారని కలలు కన్న జగన్‌కి జనం బుద్ధి చెప్పేశారు. జగన్ పరిపాలన తీరు ఎన్నో విషయాలలో జనానికి నచ్చలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన నెల నుంచే ‘జగన్ మరోసారి అధికారంలోకి వస్తే అడుక్కు తినడమే.. ఈ ఐదేళ్ళూ భరించక తప్పదు’ అనే ఆలోచనకి జనం వచ్చేశారు. ఈసారి జగన్ బుడుంగ్‌మనడానికి కారణం అతని ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు. ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ తన కొంప ఇంతలా ముంచుతుందని జగన్ ఎంతమాత్రం ఊహించలేకపోయారు. ఈ చట్టాన్ని తేవడం ఇంత ఘోరం చేస్తుందని తెలిస్తే దానిజోలికే వెళ్ళేవాడు కాదన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్‌కి అంత ఇంట్రస్ట్ లేదట. ఏ2 విజయసాయిరెడ్డి ఒత్తిడి కారణంగానే ఈ చట్టాన్ని జనం మీద రుద్దడానికి జగన్ ఒప్పుకున్నారట. అలాగే రైతుల పట్టాదార్ పాసు పుస్తకాల మీద, భూముల సరిహద్దు రాళ్ళ మీద జగన్ ముఖారవిందం వుండాలన్న ఐడియా కూడా విజయసాయిరెడ్డిదేనట. అప్పుడు పట్టాదార్ పాస్ బుక్ వ్యవహారం, ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం... ఈ రెండూ జగన్ మీద రైతుల్లో వ్యతిరేకత పెంచాయి. ఎలక్షన్లలో సీన్ రివర్స్ అయ్యేలా చేశాయి.  పోలింగ్ ముగిసిన తర్వాత ఓటరు నాడిని అర్థం చేసుకున్న జగన్ విజయసాయిరెడ్డికి చాలా సీరియస్‌గా క్లాస్ పీకినట్టు సమాచారం. నేను వద్దు మొర్రో అంటున్నా, అద్భుతాలు చేయొచ్చంటూ నన్నుఒప్పించావు. రేపు నేను ఓడిపోతే నువ్వే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేశాడట. దాంతో చిన్నబుచ్చుకున్న విజయ సాయిరెడ్డి పోలింగ్ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది.

INTELEGENCE REPORT ON KAKINADA

కాకినాడ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక

ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు. ఇలా ఉండగా  ఇదే తరహా హింస కౌంటింగ్ సందర్భంగా కూడా చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం అనుమానిస్తోంది. ఆ మేరకు జూన్ 4న కౌంటింగ్ సందర్భంగానే, ఫలితాల ప్రకటన తరువాత కాకినాడ టౌన్, పిఠాపురం నియోజకవర్గాలలో హింసాకండ చెలరేగే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది.  ముఖ్యంగా ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావు పేటలలో పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందని ఆ నివేదిక సారాంశం. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలో గత ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో ప్రమేయమున్నవారిపై దృష్టికేంద్రీకరించారు.  ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా  గట్టి చర్యలు తీసుకుని హింసను నివారించాలని ఈసీ పోలీసు అధికారులను ఆదేశించింది. అదే విధంగా సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఏపీఎస్పీ బలగాలను ఆ రెండు నియోజకవర్గాలలోనూ మోహరించనున్నారు.  ఇప్పటికే  పోలింగ్ సందర్భంగా కాకినాడలో వైసీపీ, తెలుగుదేశం వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. కాగా తాజా ఇంటెలిజెన్స నివేదికతో కేంద్ర ఎన్నికల సంఘం కాకినాడ పిఠాపురం నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారించింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గట్టి చర్యలకు ఉపక్రమించింది.  

kapu and settibaliji communities favour tdp alliance this time

తూర్పు తీర్పే.. రాష్ట్రం తీర్పు!

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఈ సారి తూర్పు ప్రజల దీవెన ఎవరి ఉంది అంటే.. జిల్లాలో గెలపు ఓటములను ప్రభావితం చేయగలిగే రెండు సామాజిక వర్గాల మొగ్గు ఎటువైపు ఉందన్నది పరిశీలిస్తే సరిపోతుందంటున్నారు. జిల్లాలలో కాపు, సెట్టిబలిజ సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రెండు సామాజిక వర్గాలలో శెట్టిబలిజ సామాజిక వర్గం బీసీల కిందకి వస్తుంది. సంప్రదాయకంగా శెట్టిబలిజలు అంటే బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు ఈ జిల్లాలో వారి మొగ్గు వేరే పార్టీవైపు మళ్లినా అది తాత్కాలికమే. ఎందుకంటే శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారిలో అత్యధికులు చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ పొట్టపోసుకునే వారు. వారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ అండగా నిలుస్తూ వచ్చింది. ఆదరణ వంటి పథకాల ద్వారా చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలాగే రాజకీయంగా కూడా వారి ఎదుగుదలకు తెలుగుదేశం అండగా నిలిచింది.  ఇక కాపు సామాజికవర్గం విషయానికి వస్తే.. ఈ సారి కాపు సామాజికవర్గం మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అంటే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఆ సామాజికవర్గం నిలి చింది.   ఒక అంచనా ప్రకారం కాపుసామాజిక వర్గ ఓటర్లలో 70శాతం మందికి పైగా ఈ సారి తెలుగుదేశం క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు కాపు నేతం పథకం లబ్ధిదారులైన మహిళలు కూడా ఈ సారి తెలుగుదేశం కూటమికే జై కొట్టారు.  2017లోనూ కూటమి ప్రభావం ఏమిటన్నది చవి చూసిన జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ బీసీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.   బీసీల కోసం కార్పొరేషన్లు పెట్టారు. అయితే వాటి ద్వారా అందిన ఆర్థిక సహాయం ఏమీ లేదనుకోండి అది వేరే  విషయం.   ఇక శెట్టిబలిజ సామాజిక వర్గంలో  గౌడ, యాత, ఈడిగ వంటి ఉపకులాల వారు ఆర్థికంగా ఒకింత మెరుగైన స్థితిలో  ఉంటారు. ఈ ఉప కులాలకు చెందిన వారంతా ప్రధానంగా  మద్యం వ్యాపారం అంటే బార్లూ, వైన్ షాపులు నిర్వహించే వారు. జగన్ మోహన్ రెడ్డి మద్యం విధానం కారణంగా వీరంతా బాగా దెబ్బతిన్నారు. కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట ప్రాతాలలో వీరి జనాభా ఎక్కువ.  అలాగే  పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం, అమలాపురం, రాజోలు లలో కూడా వీరు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.  అదే విధంగా అనపర్తి, రాజమహేంద్రవరంలలో కూడా విరి ప్రభావం కనిపిస్తుంది. చివరి క్షణంలో కూటమిని దెబ్బ కొట్టేందుకు జగన్  జిల్లాలో శెట్టిబలిజలకు ఎక్కువ స్థానాలు కేటాయించడం ద్వారా వారి మద్దతు సాధించాలన్న ప్రయత్నం చేశారు. రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గాలలో జగన్ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులకు టికెట్లిచ్చారు.  అదే సమయంలో   సీట్ల సర్దుబాట్ల కారణంగా  తెలుగుదేశం కూటమి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా సీట్లు కేటాయించడానికి అవకాశం లేకుండా పోయింది.  ఇది తమకు లాభిస్తుందని వైసీపీ ధీమాగా ఉంది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు  కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాలు తెలుగుదేశం కూటమివైపే ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొగ్గు తెలుగుదేశంవైపే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

Tet exam starts from today

నేటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ కన్వీనర్ వెల్లడించారు. టెట్ కు ఈసారి మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలిసారిగా టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయం కంటే 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అందుకే అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి.

Kavitha judicial remand ends today

ముగిసిన కవిత జ్యుడిషియల్ రిమాండ్  

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతోనూ ములాఖాత్ అవుతున్నారు.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ, సీబీఐ రెండు రిమాండ్లు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో తీహార్ జైల్లో ఉన్న కవితను అధికారులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తుందా? లేక ఆమెకు బెయిల్ మంజూరు చేసి స్వేచ్ఛను ప్రసాదిస్తుందా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బెయిల్ కోసం కవిత పలుమార్లు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే, ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాత్రం జైల్లోనే మగ్గుతున్నారు.

Chandrababu CM again: Congress leader Chintamohan

చంద్రబాబే మళ్లీ సిఎం : కాంగ్రెస్ నేత చింతామోహన్ 

 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్, దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని... అయితే, బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ కచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోబోతోందని చింతా మోహన్ తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్ కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి 150కి మించి సీట్లు రావని తెలిపారు.

prashant kishore powerful punch to jagan

ప్రశాంత్ కిషోర్ పవర్ ఫుల్ పంచ్.. జగన్ కు దిమ్మతిరిగిందా?

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో  చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల  వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.  ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తయిన తరువాత మూడు రోజులకు తీరిగ్గా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్.. అక్కడ తమ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలౌతుందంటూ ఆయన ఓ ఇంటర్వ్యేూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సారి తాము మరింత ఘన విజయం సాధించి అధికారం చేపడతామన్న ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రశాంత్ కిషోర్ లెక్కలన్నీ తప్పులని కొట్టి పారేశారు. ఆయన ఏపీ ఫలితాలు చూసి కంగుతింటారన్నట్లుగా మాట్లాడారు.  ఆ జగన్ వ్యాఖ్యలకే ప్రశాంత్ కిషోర్ గట్టి రిటార్ట్ ఇచ్చారు. ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులు ఓటమి గురించి ఎన్నడూ ప్రస్తావించరనీ, కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తారనీ అంటూ  ఇప్పడు జగన్ కూడా అదే చేస్తున్నారని చెప్పారు. అయినా మరో పక్షం రోజులలో కౌంటింగ్ జరుగుతుందనీ, ఒక వేళ తన అంచనాలు నిజమైతే  బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో  అమిత్ షా  గెలుపు ధీమా వ్యక్తం చేసి ఎలా ఓడిపోయి తలదించుకున్నారో అలాగే జగన్ రెడ్డి కూడా తలదించుకుంటారని ప్రశాంత్ కిషోర్ చురకలు వేశారు. ఒక వేళ తన అంచనా తప్పైతే తాను తలదించుకోవలసి వస్తుందని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా తన అంచనాలపై ప్రజలలో ఉన్న నమ్మకం, తన ఇమేజ్ దృష్ట్యా  ఇలాంటి అంచనాల విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానన్న ప్రశాంత్ కిషోర్  ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది పక్కన పెడితే జగన్ పార్టీ ఓడిపోబోతోంది. ఇది నిజం అని కుండబద్దలు కొట్టారు.    

vanga geetha change voice  before result

వంగా గీత.. ప్లేటు ఫిరాయించేశారా?

రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత బరిలోకి దిగారు.  వైసీపీ అధినేత జగన్ ఇక్కడ నుంచి పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో సర్వశక్తులూ ఓడారు. ఒక వైపు ముద్రగడ పద్మనాభం తన స్థాయిని దిగజార్చుకుని మరీ పవన్ పై అనుచిత వ్యాఖ్యలతో, అసందర్భ సవాళ్లతో విరుచుకుపడితే.. మరో వైపు జగన్ తన ఎన్నికల ప్రచార చివరి సభను ఇక్కడే నిర్వహించి, జనసేనానిపై తన పాత పెళ్లిళ్ల విమర్శలనే పునరుద్ఘాటించారు.  ఇక పవన్ తరఫున ప్రచారాన్నంతా పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్  ఎస్పీఎస్ఎన్ వర్మ పర్యవేక్షణలో సాగింది. ఆయన ప్రచారానికి అద్భుత స్పందన కూడా కనిపించింది. మరో వైపు వంగా గీత ప్రచారానికి జనస్పందన కరవైంది. పోలింగ్ అనంతరం క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న సమాచారం, పోలింగ్ తరువాత వైసీపీ అంచనాలు అన్నీ కూడా ఇక్కడ నుంచి పవన్ కల్యాణ్ ఘన విజయాన్నే సూచిస్తున్నాయి.  పవన్ విజయం కంటే కూడా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సాధించబోయే మెజారిటీపైనే అందరి ఆసక్తి కేంద్రీకృతమై ఉంది.  ఇక వంగీ గీత కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా తన పరాజయాన్ని అంగీకరించేశారు. ఇటీవల అంటే పోలింగ్ తరువాత ఆమె ఒక సందర్భంగా పవన్ కల్యాణ్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హైకమాండ్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తాను ప్రచారంలో ఎన్నడూ పవన్ కల్యాణ్ ను విమర్శించలేదనీ, ఆయనపై వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. అలాగే చిరంజీవి అన్నా ఆయన కుటుంబం అన్నా తనకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు. 2009 ఎన్నికలలో ఇదే పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను ప్రజారాజ్యం అభ్యర్థిగా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు మెగాఫ్యామిలీ పట్ల అంతులేని గౌరవాభిమానాలు ఉన్నాయని చెప్పుకున్నారు.  అయితే నెటిజనులు మాత్రం వంగీ గీత మాటలను కొట్టి పారేస్తున్నారు. నిజంగా ఆమెకు పవన్ కల్యాణ్ పై అంత గౌరవం, అభిమానం ఉంటే.. వైసీపీ నాయకులు ద్వారంపూడి, ముద్రగడ వంటి వారు పవన్ కల్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలను అప్పడే ఖండించి ఉండాలి కాదా అని నిలదీస్తున్నారు. పోలింగ్ పూర్తయిన తరువాత, ఓటమి ఖాయమని నిర్ణయానికి వచ్చిన తరువాత ఇప్పుడు తీరిగ్గా సెంటిమెంట్ డైలాగులు వల్లిస్తున్న వంగా గీతను తెగ ట్రోల్ చేస్తున్నారు.  ఆమె చెబుతున్న గౌరవం, అభిమానం వంటి మాటలన్నీ ఒట్టి నటనగా కొట్టి పారేస్తున్నారు. 

Ebrahim Raisi death

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం!!

ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Iran President Ebrahim Raisi) దుర్మరణం పాలైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాలివాన, పొగమంచు కారణంగా సహాయక చర్యలు కొంత ఆలస్యమైనప్పటికీ, ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటి.... ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం పాలైన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ ప్రమాదంలో ఇబ్రహీం రైసీతోపాటు విదేశాగ శాఖ మంత్రి హొస్సేనీ అబీరబ్దొల్లహియన్, తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రెహ్‌మతీ కూడా దుర్మరణం పాలయ్యారు.

The fifth round of polling has begun... the top leaders in the circle

 ఐదో విడత పోలింగ్ ప్రారంభం... బరిలో అగ్రనేతలు 

దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇక, ఇవాళ దేశంలో ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది.  ఐదో విడతలో భాగంగా 6  రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 1, లడఖ్ లో 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.  ఐదో విడత బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్ నాథ్ సింగ్, పియూష్ గోయల్, బీజేపీ అధికార రాజీవ్ ప్రతాప్ రూడీ, లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖులు పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 4 దశల పోలింగ్ తో 379 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25న ఆరో దశ, జూన్ 1న ఏడో విడత పోలింగ్ తో దేశంలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

heavy bettings on sharmila majority in kadapa

షర్మిల విజయంపై కాదు.. మెజారిటీపైనే బెట్టింగులు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం గెలుపు ఓటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సారి గెలుపు విషయంలో తెలుగుదేశం కూటమివైపే బెట్టింగు రాయుళ్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి. అంటే బెట్టింగు రాయుళ్లు అత్యధికంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తుందని పందేలు కాస్తున్నారు. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కడప లోక్ సభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తే, వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలో ఉన్నారు.   ఈ నియోజకవర్గంలో ఇరువురిలో గెలుపు ఎవరిదన్న విషయంపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల విజయం సాధిస్తారంటూ లక్షల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే షర్మిల విజయం సాధిస్తుంది అన్నదానిపై కంటే ఆమె  మెజారిటీ ఎంత అన్నదానిపైనే బెట్టింగు రాయుళ్లు పెద్ద మొత్తంలో పందెం ఒడ్డుతున్నారు.  అలాగే జగన్ కు కంచుకోట లాంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బెట్టింగుల తీరు ఆశ్చర్య పరుస్తోంది. ఇక్కడ జగన్ విజయంపై కంటే ఆయన మెజారిటీ భారీగా తగ్గుతుందన్న దానిపై బెట్టింగు రాయుళ్లు పందెం కాస్తున్నారు. అయితే కడప జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం మెజారిటీలపై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతుండటం విస్మయం గొలుపుతోంది. అదే సమయంలో జగన్ కడప కోటకు బీటలువారాయన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తున్నది.   కడప లోక్ సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలపై  కమలాపురం మండలంలోని ఆదినిమ్మాయపల్లి, వల్లూరు గ్రామాల మధ్యన ఉన్న ఒక సూపర్ మార్కెట్ వద్ద ఈబెట్టింగ్  దందా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఒక  ధాన్యం వ్యాపారి పర్యవేక్షణలో ఈ బెట్టింగ్ దందా సాగుతోందని చెబుతున్నారు.  ఇక ఆ తరువాత జిల్లాలో అత్యధికంగా రాజంపేట లోక్ సభ స్థానంలో కూటమి అభ్యర్థి విజయంపై పందెం రాయుళ్లు పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నారు.  అయితే తెలుగుదేశం కూటమి కి అనుకూలంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ కు పందెంరాయుళ్లు ముందుకు వస్తున్నారనీ, వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ కాయడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.   

gopichand thotakura to space

అంతరిక్షంలోకి తెలుగు ‘తోటకూర’

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి తెలుగువాడిగా గోపీచంద్ తోటకూర ఘనత సాధించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్’కి చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. మన గోపీచంద్ తోటకూరతో సహా మొత్తం ఆరుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెప్పర్డ్ 25 (NS 25) అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. అంతరిక్షంలోకి చేరుకున్న వీరందరూ కొద్దిసేపు భారరహిత స్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత కాప్స్యూల్‌లో తిరిగి విజయవంతంగా భూమికి చేరుకున్నారు. దీనితో రోదసీలోకి వెళ్ళి వచ్చిన తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర చరిత్ర లిఖించారు. భారత మూలాలున్న అమెరికా పౌరులు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాచా చారి, శిరీష బండ్ల అంతరిక్ష యానం చేశారు. గోపీచంద్ తోటకూర అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఆయన భారత పౌరుడు. పైగా మన తెలుగువాడు.

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌కి ప్రమాదం: ఆచూకీ లేదు!

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్.లోని జోల్ఫా సమీపంలో హెలికాప్టర్ కూలిపోయినట్టు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్లో వున్న ఇబ్రహీం రైసీ జీవించి వున్నారా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఆయన జీవించి వుండే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూలిపోయిన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడితోపాటు విదేశాంగ శాఖ మంత్రి హోసేన్ అమిరాబ్దోల్లాహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, మరికొంతమంది అధికారులు వున్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ కూలిపోయిన సంఘటనపై ఇరాన్ నుంచి అధికారికంగా ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. హెలికాప్టర్ ప్రయాణిస్తూ వుండగా భారీ వర్షం, గాలుల వల్ల హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు సమాచారం. కూలిన హెలికాప్టర్ కోసం గాలింపు జరుగుతోంది. అయితే వర్షం, గాలులు, మంచు తెరల కారణంగా గాలించడం కష్టంగా మారింది. తమ అధ్యక్షుడికి ఏమీ కాకూడదని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఇరాకీయులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇతర కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. కూలిపోయిన హెలికాప్టర్ 1980 నాటిదని తెలుస్తోంది. అజర్ బైజాన్‌లో ఒక డ్యామ్ ప్రారంభ కార్యక్రమానికి ఇబ్రహీం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ధింపూలో ఏబిటీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మల్లేపల్లి లక్ష్మయ్య

భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.  ఆసియా హైవే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, మయన్మార్ దేశాల్లో బౌద్ధ పర్యాటక స్థావరాలను  అధిక సంఖ్యలో సందర్శించేలా వ్యూహాలను సిద్ధం చేసి ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.  ధింపూ నగరంలోని బబేసా ఎక్స్ప్రెస్ హైవే లోని ఐ- డిజైర్ సంస్థ ప్రాంగణంలో ప్రారంభించిన ఏబీటీవో కార్యాలయం భూటాన్ మరియు పొరుగు దేశాల మధ్య బౌద్ధ పర్యాటకం పుంజుకునేలా కృషి చేస్తుందని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.  సీనియర్ సంపాదకులు కే. రామచంద్రమూర్తి, ఎగ్జాటిక్ ఈవెంట్ అధినేత కేకే రాజా, బుద్ధవనం కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి, ఇంకా భూటాన్ పర్యాటక సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఐ- డిజైర్ అధినేత, పరశురాం బిస్వా,  మల్లేపల్లి లక్ష్మయ్యను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

భూటాన్ లో బుద్ధవనం బ్రోచర్ ఆవిష్కరణ

సందర్శనకు సిద్ధమంటున్న భూటాన్ పర్యాటక ప్రతినిధులు హైదరాబాదులో ఏబిటీవో కార్యాలయానికి సన్నాహాలు భూటాన్ లోని ధింపూ నగరంలో ఆదివారం (మే19) జరిగిన అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక సదస్సు ముగింపు సభలో నాగార్జునసాగర్ లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఆసియాలోనే అరుదైన బౌద్ధ వారసత్వ బుద్ధవనం బ్రోచర్ ఆవిష్కరణ జరిగిందని బుద్ధవనం కన్సల్టెంట్, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్స్ మరియు భూటాన్ పర్యాటక సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన తెలంగాణ బౌద్ధ పర్యాటక స్థావరాలు మరియు బుద్దవనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనేక ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని, తెలంగాణ బౌద్ధ పర్యాటక స్థావరాలను త్వరలో సందర్శిస్తామని భూటాన్ పర్యాటక సమాఖ్య ప్రతినిధి, ఐ-డిజైర్ అధినేత పరశురాం బిస్వా చెప్పారు. సదస్సు ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాయల్ భూటాన్ విశ్వవిద్యాలయ ఆచార్యులు, డా. సౌరవ్ బసు, ఏబిటీవో ప్రధాన కార్యదర్శి డా. కౌలేష్ కుమార్ బుద్దవనం బ్రోచర్ ను ఆవిష్కరించగా, శివనాగిరెడ్డి ప్రతినిధులకు బ్రోచర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ దేశాల స్థానిక ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారని శివనాగిరెడ్డి చెప్పారు.