kcr no appointment to revanth representatives

రేవంత్ ప్రతినిథులకు కేసీఆర్ నో అప్పాయింట్ మెంట్!?

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావం సదర్భంగా జూన్ 2న నిర్వహించే అధకారిక కార్యక్రమానికి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వయంగా లేఖ రాసి దానిని ప్రభుత్వ సలహాదారు హ‌ర్కార వేణుగోపాల్ కు ఇచ్చి స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను, తన లేఖను ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన, రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్లు సీఎంగా ఉన్న నాయకుడికి సముచిత గౌరవం ఇచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రభుత్వ సలహాదారు ఎంతగా ప్రయత్నించినా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వేణుగోపాల్ కు కేసీఆర్ ను కలిసి రేవంత్ లేఖ ఇచ్చి ఆహ్వానించే అవకాశం ఇంత వరకూ దొరక లేదు.  దీంతో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం అనుమానమే అన్న భావన వ్యక్తం అవుతోంది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్దేశంలో లేరనీ, అందుకే ప్రభుత్వ సలహాదారుకు అపపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదనీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయినా అధికారంలో ఉన్న సమయంలో కూడా కేసీఆర్  ఎవరికీ అప్పాయింట్ మెంట్ ఇచ్చే వారు కాదనీ, తనను కలుసుకోవాలని భావించే వారిని ఆయన కలిసిన దాఖలాలు లేవనీ, ఎవరినైనా తాను కలిసి మాట్లాడాలనిపిస్తే మాత్రమే కేసీఆర్ ఆయనను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడి పంపేవారని అంటున్నారు. అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆయన ప్రజలు, నాయకులకు దగ్గర కావడానికి ఇసుమంతైనా ప్రయత్నించడం లేదని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో ఆయన ఇక పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల ద్వారానే వినిపించింది. ప్రస్తుతం అధికారం కోల్పోయి, పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమై ఉండటం చూస్తుంటే కేసీఆర్ అడుగులు రిటైర్మెంట్ దిశగా పడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పోతే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎష్ పార్టీ కూడా మూడు రోజులు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమాలలో పాల్గొనేందుకు  కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం లేదని అనుకున్నా, సీఎం పంపిన ఆహ్వానాన్ని అందుకుని, తాను రాలేకపోవడానికి కారణాలను వివరిస్తూ సున్నితంగా తిరస్కరించి ఉంటే హుందాగా ఉండేదని   బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తోంది.   

ab venkateswara rao

ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతల స్వీకారం

ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా  ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. బాధ్యతల స్వీకారం సందర్బంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు. ‘‘రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్విన వారికి కృతజ్ఞతలు. ఈరోజే నేను పదవీ విరమణ చేస్తాను. పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్న రోజే పదవీ విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చిందని అనుకుంటున్నాను. కారణాలు ఏమైనా ‘ఆల్ ఈజ్ వెల్’ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు.  ఇప్పటికి ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి.  ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి  ఉంటాను.  నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు . యూనిఫాంతో రిటైర్డ్ అవ్వాలనే నా కల నెరవేరినట్లుగా భావిస్తున్నా’’ అన్నారు.

people support to abv

ఏబీవీకి జనం సంఘీభావం!

ఏబీ వెంకటేశ్వరరావు లాంటి నిజాయితీపరుడైన ఐపీఎస్ అధికారి అంటే జగన్ ప్రభుత్వం లాంటి అడ్డగోలు ప్రభుత్వానికి గౌరవం వుండకపోవచ్చు గానీ, ఆయనలోని నిజాయితీని, సామర్థ్యాన్ని, రాజీలేని పోరాటం చేసే తీరును చూసిన ప్రజలకు మాత్రం అపారమైన గౌరవం వుంది. ఏబీ వెంకటేశ్వరరావు యూనీఫామ్‌తోనే రిటైర్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకున్నారు. ఈ పిశాచ ప్రభుత్వం ఆయన్ని ఇబ్బంది పెడుతుంటే చూసి ఆగ్రహించారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడం పట్ల ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఐదేళ్ళపాటు వేధింపులకు గురైనప్పటికీ తాను కోరుకున్నట్టుగా ఈరోజు గౌరవప్రదంగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాలకుల అన్యాయాన్ని, అరాచకాన్ని ఎదిరించి వీరోచిత పోరాటం చేసి గెలిచిన ఏ బీ వెంకటేశ్వరరావుకు సంఘీభావం తెలపడానికి వేల సంఖ్యలో ప్రజలు  సిద్ధమవుతున్నారు. ఈరోజు, అంటే.. 31, మే శుక్రవారం నాడు విజయవాడలోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనరేట్ వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. అక్కడ ఏబీ వెంకటేశ్వరరావుని కలిసి అభినందనలు తెలపడానికి సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మన కోసం, తెగించి పోరాడే వాళ్ళ భుజం తట్టి ప్రోత్సాహించడం మన కనీస ధర్మం అని... ఏబీ వెంకటేశ్వరరావుని అభినందించడానికి బంధుమిత్ర సమేతంగా రండి అని ఆహ్వానిస్తున్నారు.

waiting for exit polls

ఇక ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూపు

సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. ఏడువిడతల ఎన్నికల షెడ్యూలులో భాగంగా జూన్ 1వ తేదీన చివరి విడతగా 57లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రాత్రి ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.ఎగ్జిట్ పోల్స్ దాదాపు అటు కేంద్రంలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విజేతను  ప్రకటిస్తాయి.దీనికోసమే ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పెరిగిన ఓట్లు తమకే పడ్డాయని వైసీపీ కూటమి వర్గాలు చెబుతున్నాయి. అందులోనూ ఫలితాన్ని డిసైడ్ చేసేది మహిళా ఓటర్లేనని చెబుతూ వైసీపీ సంక్షేమం సొమ్ము పందేరం చేసిన  తామే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చెప్పుకుంటోంది. అదే విధంగా  కూటమి వర్గాలు పెరిగిన ఓట్లు తమవేననీ, విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.  సందట్లో సడేమియాగా జ్యోతిష్యులు  గెలుపు ఎవరి దన్న విషయంపై జోస్యాలు చెప్పేస్తున్నారు.  ఇక జాతీయ స్థాయిలో అధికారం మాదంటే మాదంటూ ఎన్డీయే, ఇండియా కూటములు చెప్పుకుంటున్నాయి. బీజేపీ అయితే ఆకాశమే హద్దు అన్నట్లుగా తమ కూటమి 400కు పైగా స్థానాలలో విజయం సాధిచడం ఖాయమని   అయితే ఇప్పటి వరకూ ఆరు విడతల్లో జరిగిన పోలింగ్ సరళిని గమనించిన పరిశీలకులు మాత్రం బీజేపీ  సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించే అవకాశాలు లేవనీ, అలాగే ఎన్డీయే కూటమి కలిసి 300 స్థానాలు వస్తే గొప్పేనని విశ్లేషిస్తున్నారు.   ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు ఇండియా కూటమికి ప్లస్ అయ్యిందనీ, అంత వరకూ అంతర్గత విభేదాలతో సతమతమౌతున్న ఆ కూటమిని కేజ్రీవాల్ అరెస్టు ఏకతాటిపైకి తీసుకువచ్చిందనీ చెబుతున్నారు. ఇక ఎన్డీయే కూటమిలో అనివార్యంగా చేరిన ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించే పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తే.. మళ్లీ పూర్తి సంఖ్యా బలంతో కేంద్రంలో బీజేపీ  నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మోడీ ప్రాంతీయ పార్టీలను మింగేస్తారన్న భయం వాటిలో ఉంది. ప్రాంతీయ పార్టీలలోని ఈ భయమే.. బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు రాకపోతే.. కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ కొలువుదీరినా వాటి స్థానానికి ఢోకా ఉండదు. అదే సమయంలో తమ రాష్ట్ర సమస్యలపై బలంగా గళమెత్తి పరిష్కారించుకోగలిగే వెసులుబాటు ఉంటుందన్న భావన ఎన్డీయే కూటమిలోని ప్రాంతీయ పార్టీలలో వ్యక్తం అవుతోంది.  ఎన్నికల ప్రచారం ముగిసింది. శనివారం(జూన్ 1) చివరి విడత పోలింగ్ కూడా ముగుస్తుంది. దీంతో ఇప్పుడు అందరి చూపూ జూన్ 4న వెలువడనున్న ఫలితంపైనే ఉంది. శనివారం (జూన్ 1) సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. వాటిని బట్టి అధికారంలోకి వచ్చేది ఎవరు అన్నదానిపై ఒక అంచనాకు రావచ్చు. దీంతో అందరి ఎదురు చూపూ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. 

officers changing correcting mistakes

వైసీపీ ఓటమిని పసిగట్టేశారు.. అధికారులు తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారు!

అమరావతికి మంచి రోజులు వస్తున్నాయి. మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న నమ్మకం పెరుగుతోంది. మే 13న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి చూసిన తరువాత అందిరిలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే కాదు సీఆర్డీయే అధికారుల తీరులోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. చేసిన తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు జగన్ ఆడమన్నట్లల్లా ఆడి అమరావతిని నిర్వీర్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన అధికారులు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారు.  అమరావతి నిర్మాణం కోసం తెచ్చిన సామగ్రిని కాంట్రాక్టర్లు ఇతర ప్రాంతాలకు వాటిని తరలించుకుపోతుంటే.. దగ్గరుండి మరీ సాగనంపిన సీఆర్డీయే తీరులో మార్పు వస్తున్నది. ఔను ఎన్నికలకు ముందు నుంచి అమరావతి నుంచి సామాగ్రి తరలించడం అన్నది ఒక యుద్ధ ప్రాతిపదికన సాగిందా అన్నట్లుగా జరిగింది. ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందన్న విషయంలో ఒక స్పష్టతకు వచ్చిన అధికారులు ఒక్క సారిగా అలర్ట్ అయ్యారు.  తరలింపు నిలిపివేయాల్సిందిగా కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతే కాదు తరలించిన సామగ్రినీ వెనక్కు తీసుకురావలని హుకుం జారీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో భాగంగా బెంగాల్ లో ఉన్న సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్ అక్కడి నుంచే ఈ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వీవేక్ యాదవ్ అమరావతి నిర్వీర్యం చేసు విషయంలో జగన్ ఆదేశాల మేరకు అత్యంత కీలకంగా వ్యవహరించారు.  అమరావతిలో రోడ్లను తవ్వి తీసుకుపోతున్నా ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ప్రభుత్వ మార్పుపై ఒక స్పష్టత రావడంతో  ఆయన తప్పులు దిద్దుకునే పనిలో పడినట్లు కనిపిస్తోంది.  

posting to ab venkateswara rao

‘తెలుగువన్’ చెప్పిందే జరిగింది: ఏబీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్!

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు చివరి రోజు పోస్టింగ్ ఇస్తారని, ఒక్కరోజు మాత్రమే పదవీ బాధ్యతల్లో వుండేలా చేస్తారని ‘తెలుగువన్’ ముందే చెప్పింది. తెలుగువన్ చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వర రావు మీద వున్న  సస్పెన్షన్‌ను ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవీ వెంకటేశ్వరరావు మీద కక్షగట్టింది. ఆయన్ని సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ‘క్యాట్’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. క్యాట్ ఉత్తర్వులను జగన్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఆర్డర్స్.పై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం జగన్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏబీవీపై ఉన్న సస్పెన్షన్‌ని ఎత్తివేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వకపోతే అది సీఎస్‌కి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం వుంది కాబ్టి. ఆయనపై వున్న సస్పెన్షన్‌ని ఎత్తివేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్‌లో ఉన్నారు. శుక్రవారం నాడు ఏబీవీ చివరి వర్కింగ్ డే.. రిటైర్మెంట్ డే రోజున ఆయన విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవీ విరమణ చేస్తారు. మొత్తానికి ఇలా జగన్ సర్కార్ ఏవీ వెంకటేశ్వర రావు చివరి వర్కింగ్ డే రోజున పోస్టింగ్ ఇస్తూ తన పైశాచిక ఆనందాన్ని ప్రకటించుకుంది. ప్రింటింగ్ మరియు స్టేషనరీ డిజీ గా ఏబివి కి పోస్టింగ్ ఇచ్చారు.

criminal case on sajjala

సజ్జలపై క్రిమినల్ కేసు

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. కౌంటింగ్‌ ఏజెంట్ల తో సమావేశం సందర్భంగా ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు.   వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడుతూ  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.  ”మనకు అనుకూలంగా, అవతలివాళ్ల ఆటలు సాగకుండా  చేయాలి. రూల్స్ ప్రకారం వెళ్లే వాళ్లు మనకు అవసరం లేదు. ఆర్గ్యూ చేసి, ఫైట్ చేసే వాళ్లే కావాలి అంటూ సజ్జల ఆ సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలా మాట్లాడటం కౌంటింగ్ కేంద్రాల్లో గలాభా సృష్టించాల్సిందిగా కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టడమే అవుతుందనీ, రూల్స్ పాటించక్కర్లేదు అంటూ మాట్లాడిన సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  రాష్ట్రంలో పరిస్థితి మారిపోయిందనడానికి ఇది తార్కాణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో పోలింగ్ సరళిని గమనించిన తరువాత అధికారులు, పోలీసుల తీరులో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్నారు. గతంలో వైసీపీ ఫిర్యాదుల మేరకు మాత్రమే స్పందించే పోలీసులు పోలింగ్ తరువాత తెలుగుదేశం ఫిర్యాదులపై స్పందించడం గమనార్హం. 

ycp defeat sure

రాష్ట్రంలో ప్రభుత్వం మారుతోంది.. జీఏడీ నిర్ణయం సంకేతం అదేగా?

మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఓటమి ఛాయలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు అలర్ట్ అవుతున్నారు. ముందు ముందు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్ కు ఒక రోజు ముందే మంత్రుల పేషీలను స్వీధీనం చేసేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే కౌంటింగ్ కు ఒక రోజు ముందే మంత్రుల పేషీలను ప్రభుత్వ పరిపాలనా శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఈ సమాచారాన్ని ఇప్పటికే మంత్రులకు పంపింది. మంత్రుల కార్యాలయ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడమే కా కుండా మంత్రుల పేషీల నుంచి ఒక్క కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీళ్లేదని విస్ఫష్టంగా చెప్పింది. అలాగే సచివాలయం నుంచి తమ అనుమతి లేకండా వస్తువులు, దస్త్రాలు, తీసుకువెళ్లడానికి వీళ్లేదని సిబ్బందికి జారీ చేసిన ఆదేశాల్లో విస్పష్టంగా పేర్కొంది.  పోరుగు రాష్ట్రం తెలంగాణలో ఇలా కౌంటింగ్ పూర్తై ఫలితం తెలియగానే అలా  మంత్రుల పేషీల నుంచి కీలక ఫైళ్లు మాయం అయిన నేపథ్యంలో ఏపీలో అలా జరగకుండా ప్రభుత్వ సాధారణ పాలనా శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫలితాలకు ముందుగానే మంత్రుల పేషీలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ శాఖ నిర్ణయం తీసుకోవడమే.. అధికార పార్టీ ఓటమి ఖరారైందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ycp plans riots on counting day

కౌంటింగ్ రోజు గలాభాకు వైసీపీ ప్రణాళికలు క్లియర్.. అడ్డుకునుందుకు ఈసీ రెడీ అయ్యిందా?

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం గ‌ద్దె దిగేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఐదేళ్లుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు మే 13న జ‌రిగిన పోలింగ్‌లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా చెక్‌పెట్టారు. ఆ ఫ‌లితాలు జూన్‌ 4న వెల్ల‌డి కానున్నాయి. పోలింగ్ జ‌రిగిన తీరును బ‌ట్టి త‌మ ఓట‌మి ఖాయ‌మైంద‌ని ఇప్ప‌టికే వైసీపీ ఓ అంచ‌నాకు వ‌చ్చింది. పోలింగ్ రోజు బెదిరింపుల‌తో, ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఓటింగ్ శాతం పెర‌గ‌కుండా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై ఆగ్ర‌హంతో ఉన్న ప్ర‌జ‌లు అర్ధ‌రాత్రి 2గంట‌ల వ‌ర‌కు క్యూలైన్ల‌లో వేచి ఉండి మరీ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అయినా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్‌ల‌లో ఈవీఎంల ద్వంసంతోపాటు, త‌మ‌కు అనుకూలంగా పోలింగ్ జ‌రిగేలా ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, రాష్ట్రం మొత్తం ప‌రిస్థితిని చూస్తే పోలింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్ కు పోలీసులు, ఎన్నిక‌ల అధికారులు కొంత‌మేర‌ అడ్డుక‌ట్ట వేశారు. దీంతో ఓట‌మి ఖాయ‌మ‌ని త‌మ అంత‌ర్గ‌త స‌ర్వేల ద్వారా  జ‌గ‌న్ ఆయ‌న వ‌ర్గానికి స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. కూట‌మి విజ‌యం ఖాయ‌మైన క్ర‌మంలో.. కూట‌మి విజ‌యానికి అడ్డుక‌ట్ట వేసేలా వైసీపీ కుట్ర‌ల‌కు తెర‌లేపింది. ఇందుకోసం రెండు ప్లాన్ల‌ను సిద్దం చేసింది. కౌంటింగ్ రోజు కూట‌మి విజ‌యాన్ని అడ్డుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేయడం , అలాకాని ప‌క్షంలో కూట‌మి అభ్య‌ర్థులు ప్ర‌జా మ‌ద్ద‌తుతో కాదు.. ఈసీ స‌హ‌కారం, దొంగ ఓట్ల ద్వారా గెలిచారంటూ ముద్ర‌వేయ‌డం. ఈ రెండు ప్లాన్లుకూడా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో అమ‌లుకాబోతున్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.   ఏపీలో పోలింగ్ జ‌రిగిన తీరునుచూస్తే వైసీపీ ఓట‌మి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఆ విష‌యం వైసీపీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ నేత‌ల‌కు కూడా అర్ధం అయిపోయింది. కానీ, వైసీపీ అధిష్టానం, పెద్ద‌లు మాత్రం మ‌న‌మే గెలుస్తున్నామ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇస్తున్నారు. ఇలా ఏ రాజ‌కీయ పార్టీ నేత‌లైనా చేస్తారు. అందులో త‌ప్పుప‌ట్టాల్సిన ప‌నిలేదు. కానీ, వైసీపీ అధిష్టానం మరో అడుగు ముందు కేసి కౌటింగ్ రోజు పెద్ద ఎత్తున అల్ల‌ర్లు సృష్టించాల‌ని ప్లాన్ వేసింది. ఆ విషయం  ప‌సిగ‌ట్టిన ఇంటెలిజెన్స్  వ‌ర్గాలు, ఈసీ  రాష్ట్ర పోలీస్ బ‌ల‌గాల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి. వైసీపీ నేత‌లు కౌంటింగ్ రోజు అల్ల‌ర్లు సృష్టించ‌టానికి సిద్ధ‌మ‌య్యార‌న్న విష‌యం ఆ పార్టీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట‌ల ద్వారా తేట‌తెల్ల‌మైంది.  రెండు రోజుల క్రితం రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న వైసీపీ పోలింగ్ ఏజెంట్ల‌తో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ  స‌మావేశంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం రూల్స్ మ‌నం పాటించాల్సిన ప‌ని లేద‌ని, ప్ర‌తి అంశంపై అభ్యంత‌రాలు లేవ‌నెత్త‌డం ద్వారా కౌటింగ్ స‌మ‌యంలో గంద‌ర‌గోళం సృష్టించాల‌న్న రీతిలో దిశా నిర్దేశం చేయ‌డం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు.. రూల్స్ ఫాలో అయ్యే వారు ఏజెంట్లుగా వెళ్లొద్దు.. గొడ‌వ‌లు చేసే వారే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని సజ్జల చెప్ప‌డం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ కౌంటింగ్‌ ఏజెంట్ల స‌మావేశం అనంత‌రం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధించేందుకు 100శాతం అవ‌కాశాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కౌంటింగ్ ఏజెంట్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో వారికి కీల‌క  సూచ‌న‌లు చేసిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. కౌంటింగ్ హాల్‌లో ఈవీఎంలు సీల్ తీసే విష‌యంలో, లెక్కించే విష‌యంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా పెద్ద రాద్దాంతం చేయాల‌ని స‌ద‌రు ఏజెంట్ల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు తాము ఎంపిక చేసిన వైసీపీ నేత‌లు వ‌స్తారు. వారి వెంట‌ భారీగా కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకొని కౌంటింగ్‌ కేంద్రాల వ‌ద్ద ఉంటారు. కౌంటింగ్ హాల్‌లో ఏ చిన్న అవ‌కాశం దొరికినా అభ్యంత‌రాలు లేవ‌నెత్తండి. గొడ‌వ చేయండి. అవ‌స‌ర‌మైతే ఈవీఎంల‌ను బ‌ద్ద‌ల‌కొట్టేయండి. వెంట‌నే కౌంటింగ్ హాల్ నుంచి బ‌య‌ట‌కువ‌చ్చి వైసీపీ నేత‌ల‌కు సిగ్న‌ల్ ఇవ్వండి.. త‌రువాత జ‌ర‌గాల్సిన గొడ‌వ‌ను వారు చూసుకుంటారు. కొంద‌రు పోలీసులు, అధికారులు మ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉంటారు. వారి స‌హ‌కారంతో కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద వీరంగం సృష్టించండి. వీలుప‌డితే ఈవీఎం బాక్సుల‌ను మాయం చేసేందుకు సైతం వెనుకాడొద్దు. అలాంటివారే కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లుగా వెళ్లండి.. అంతా ప‌క్కా ప్లాన్‌తో జ‌రిగిపోవాలి. ఏజెంట్లపై కేసులైనా వారిని కాపాడుకునే బాధ్య‌త‌ను వైసీపీ అధిష్టానం తీసుకుంటుంద‌ని స‌జ్జ‌ల క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.    స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అధిష్టానం రెండు వ్యూహాల‌ను సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. మొద‌టిది కౌంటింగ్ కేంద్రంలో ప్ర‌తి చిన్న విష‌యానికి అభ్యంత‌రం చెప్ప‌డం ద్వారా గొడ‌వ‌ను సృష్టించి కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను నిలిపివేయ‌డం. అదే స‌మ‌యంలో వీలుదొరికితే ఈవీఎంల‌ను  ద్వంసం చేయడం. రెండోది.. కౌంటింగ్ స‌మ‌యంలో అభ్యంత‌రాలు లేవ‌నెత్తి గంద‌ర‌గోళం సృష్టించండం. త‌ద్వారా ప్ర‌జా మ‌ద్ద‌తుతో కాదు.. ఈసీ అండ‌దండ‌ల‌తో, దొంగ ఓట్ల‌తో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింద‌నే వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లడం. కౌంటింగ్ కేంద్రం వ‌ద్ద‌ గొడ‌వ మొద‌లుపెట్టిన వెంట‌నే దానిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం ప్ర‌చారం చేసేందుకు వైసీపీ సోష‌ల్ మీడియా, పార్టీ అనుకూల చానెల్స్‌ సిద్ధంగా ఉంటాయి. కూట‌మి అభ్య‌ర్థులు వంద శాతం గెలుస్తార‌ని వైసీపీ అధిష్టానం భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ రెండింటిలో ఏదోఒక ప్లాన్ అమ‌లు జ‌ర‌గాల‌ని వైసీపీ త‌ర‌పున కౌంటింగ్ కేంద్రాల్లో పాల్గొనే ఏజెంట్ల‌కు స‌జ్జ‌ల స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే కౌంటింగ్ రోజు వైసీపీ అధిష్టానం ప్లాన్‌ను ఎన్నిక‌ల సంఘం ఎలా ఎదుర్కొంటుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌జ్జ‌లతోపాటు వైసీపీలోని కీల‌క నేత‌ల‌ను అరెస్టు చేయ‌డం లేదా హౌస్ అరెస్ట్ చేయ‌డం ద్వారా కౌంటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.  ఈసీ సైతం వైసీపీ కీల‌క నేత‌ల‌ను ముంద‌స్తుగా హౌస్ అరెస్టులుచేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి కౌంటింగ్ రోజు నేష‌న‌ల్ మీడియాసైతం ఏపీపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

devotees rush in tirumala

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత రెండు రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం (మే31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 64వేల 115 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32 వేల 711 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 23లక్షల రూపాయలు వచ్చింది. 

monsoon emter kerala

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ చల్లటి కబురు

దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.   నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని తెలిపింది. గురువారం నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు ఐఎండీ ధృవీకరించింది.   మరో మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఎంఐడీ ప్రజలకు చల్లటి కబురు అందించింది.  ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించిన సంగతి తెలిసిందే.   1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.    

victim of political harassment big relief to ab venkateswara rao

పాపం ఓ పోలీస్ ఆఫీస‌ర్! ప‌గ‌వాడికి కూడా ఇలాంటి క‌ష్టం వ‌ద్దు!

శుక్రవారం... అదే రేపు ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కావాల్సి ఉంది. ఈ రోజు అంటే ఒక రోజు ముందు క్యాట్ ఉత్తర్వుల్ని సమర్దించింది హైకోర్టు. ఏబీవీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేసి తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని, క్యాట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు, ఈ రోజు తీర్పు ఇచ్చింది.  జ‌న‌ర‌ల్‌గా మ‌నం చూస్తూ వుంటాం అమాయ‌క ద‌ళితుల్ని న‌క్స‌లైట్లు అని, అమాయక ముస్లింల‌ను టెర్ర‌రిస్టుల‌ని ముద్ర వేసి ఐదు, ప‌దేళ్ళు న‌ర‌కం చూపించిన త‌రువాత వారిది త‌ప్పేమీ లేద‌ని విడిచిపెడుతుంటారు. సేమ్ టూ సేమ్‌ అదే ప‌ద్ద‌తిలో ఇక్క‌డ ఓ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిని రాజ్యం టార్గెట్ చేసింది. రాజ్యం టార్గెట్ చేస్తే సాధార‌ణ ప్ర‌జ‌లైనా, ఉన్న‌తాధికారులైన బ‌లి కావాల్సిందేన‌ని ఎబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్య‌వ‌హారం అద్దం ప‌డుతోంది.   సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌చ్చిన క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రావ‌ద్దంటూ ఏపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత రెండేళ్ల‌కుపైగా స‌స్పెన్ష‌న్ కు గురైయ్యారు. ఆ త‌రువాత  సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు  ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  అయితే ఇంత‌లోనే ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జూన్ 28న‌ ఉత్తర్వులు జారీచేశారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న జ‌గ‌న్ ప్ర‌భుత్వం సస్పెండ్‌ చేసింది.  దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.  ఫిబ్రవరి 7తో ఆయ‌న స‌స్పెన్ష‌న్ ముగిసింద‌ని పేర్కొంది. రెండేళ్ల‌కు మించి అఖిల భార‌త స‌ర్వీసు అధికారుల‌ను స‌స్పెండ్ చేయ‌డం కుద‌ర‌ద‌ని కోర్టు చెప్పింది.  అయితే.. గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.  సుప్రీంకోర్టు త‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తేయ‌డంతో ఆ ఉత్త‌ర్వుల కాపీతో ఏబీ.. సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌ను క‌లిశారు. త‌న‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని కోరారు. అలాగే త‌న‌కు ఆపేసిన జీత‌భ‌త్యాల‌ను కూడా చెల్లించాల‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా నియమించింది.  అయితే.. ఆయ‌న‌ను మ‌ళ్లీ విధుల్లోకి చేరి కొద్ది రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే,  తనపై నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయ‌న‌ యత్నిస్తున్నారని మ‌రోసారి ఆయ‌న‌పై వేటేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.  టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిఘా విభాగం అధిప‌తిగా చ‌క్రం తిప్పిన ఏబీ వెంకటేశ్వ‌ర‌రావు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేశార‌ని.. వాటిని ఉప‌యోగించి ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్ల‌ను ట్యాప్ చేశార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌లు చేసింది.  ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం అనే కంపెనికి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు రూ.35లక్షలు చెల్లించార‌ని చెబుతోంది. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఉత్పత్తులను భారత్‌లో తీసుకురావ‌డానికి య‌త్నించార‌ని తీవ్ర అభియోగాలు ఆయ‌న‌పై మోపింది.  ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు చేప‌ట్టిన‌ ఏబీ వెంకటేశ్వరరావు తనపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెప్పింది. క్రిమినల్‌ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్‌ విధించవచ్చని పేర్కొంటూ ఆయ‌న‌ను జూన్ 28న మ‌రోసారి స‌స్పెండ్ చేసింది. అలా... జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావు  పగబట్టింది.  తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేసింది.  ఆ ఆరోపణలను తేల్చలేకపోయింది. ఆయనను డిస్మిస్ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం తిరస్కరించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయన సర్వీస్ మొత్తం జీతం ఇవ్వాలని .. తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ రకరకాల సాకులు చెబుతూ… జ‌గ‌న్‌ ప్రభుత్వ వేధించింది.   ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్ )ఇచ్చిన ఆదేశాలపై జ‌గ‌న్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వు చేసింది. ఎట్ట‌కేల‌కు ఇవాళ ఆ తీర్పును ప్రకటించింది. ఇందులో క్యాట్ ఉత్తర్వుల్ని హైకోర్టు సమర్దించింది.   హైకోర్టులో పిటిషన్ వేశామన్న కారణంగా పోస్టింగ్ ఇవ్వకపోవడం సీఎస్  తప్పిదమే అవుతుంది. ఈ విషయంలోనూ సీఎస్ జవహర్ రెడ్డి గీత దాటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌

clashess between jagan and jawahar reddy

జగన్, జవహర్‌రెడ్డి మధ్య ఏబీవీ చిచ్చు?

త్వరలో మాజీ కాబోయే ముఖ్యమంత్రి జగన్, త్వరలో మాజీ కాబోతున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మధ్య స్నేహం ఇప్పటి వరకూ మూడు అధికార దుర్వినియోగాలు, ఆరు ఆశ్రిత పక్షపాతాలుగా సాగింది. ఇంతకాలం జగన్ ఆడమన్నట్టల్లా ఆడిన జవహర్ రెడ్డి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తన పాత విశ్వాసాన్ని మరచిపోకుండా జగన్ సేవలో తరిస్తూ వచ్చారు. ప్రతిపక్షాల మీద అనవసరమైన ద్వేషాన్ని పెంచుకుని, మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి తీరాల్సిందే అన్నట్టుగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్‌కి, జవహర్‌రెడ్డికి ఎంత ఫెవీకాల్ లాంటి స్నేహమైనా, జూన్ నాలుగో తారీఖు వరకే. ఇప్పటి వరకూ సాఫీగా సాగిన, ఇద్దరి పదవులు ఊడిపోయిన తర్వాత ఒకరి అవసరం మరొకరికి వుంటే కొనసాగే ఇద్దరి స్నేహంలో ఒక చిచ్చు వచ్చి పడింది. ఆ చిచ్చు పేరే ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని క్యాట్ ఆదేశించింది. తాజాగా హైకోర్టు కూడా ఆదేశించింది. రేపు ఒక్క రోజుతో ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ కెరీర్ ముగుస్తుంది. ఆయనకు పోస్టింగ్ రావడం అంటూ జరిగితే రేపు ఒక్క రోజులోనే జరగాలి. లేకపోతే ఆయన యూనీఫామ్‌లో రిటైర్ అవ్వరు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆర్డర్స్.ని తీసుకుని ఏబీ వెంకటేశ్వరరావు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని గురవారం నాడు కలిశారు. ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత జవహర్ రెడ్డి మీద వుంది. జవహర్ రెడ్డి పోస్టింగ్ ఇస్తే, ఏబీ వెంకటేశ్వరరావు రేపు ఒక్కరోజు డ్యూటీ చేసి, యూనీఫామ్‌లో రిటైర్ అవుతారు.  చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి జగన్‌తో ఏవో లావాదేవీలు వున్నాయి. అందుకే రాజకీయంగా ఆయనకు సహకరిస్తున్నారు. కానీ, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతో ఎలాంటి విభేదాలూ లేదు. ఆయన కూడా డీజీపీ అయ్యే స్థాయి వున్న ఐపీఎస్ అధికారే. జగన్ అక్రమ కేసులు పెట్టి సస్పెండ్ చేశాడు కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అవ్వలేదుగానీ.. లేకపోతే ఏనాడో ఆయన ఆ పోస్టులో కూర్చునేవారే. అంత సీనియర్ అధికారి యూనీఫామ్‌లో రిటైర్ అయ్యేలా చేయడం కనీస ధర్మం అని జవహర్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేపు ఒక్కరోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని జవహర్ రెడ్డి భావిస్తుంటే, లండన్ నుంచి జగన్ ఇవ్వడానికి వీల్లేదని ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది.  అయితే జవహర్ రెడ్డి మాత్రం ఏబీవీకి పోస్టు ఇచ్చే విషయంలో జగన్‌ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జగన్ మాత్రం ఠాఠ్ వీల్లేదని అంటున్నట్టు తెలుస్తోంది. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకపోతే అది ఆ తర్వాత జవహర్ రెడ్డి పీకకి చుట్టుకునే ప్రమాదం వుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది జవహర్ రెడ్డే. నిజానికి ఆయన ఈ విషయంలో జగన్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. అయిప్పటికీ జగన్ హర్ట్ అవకుండా తన బాధ్యతని నెరవేర్చడానికి జవహర్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, జగన్ మాత్రం వీల్లేదంటే వీల్లేదని అంటున్నట్టు సమాచారం. జగన్ లండన్ నుంచి శుక్రవారం నాడు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇష్యూని ఇంకా లాగే ఉద్దేశంతో జగన్, ‘‘నేను వచ్చాక మాట్లాడదాం’’ అని జవహర్‌రెడ్డితో అన్నట్టు సమాచారం. మరి ఆయన వచ్చి, ప్రయాణ బడలిక తీర్చుకుని, కాలయాపన చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  ఏది ఏమైనప్పటికీ, జగన్ ఒప్పుకోకపోయినప్పటికీ రేపు ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంలోనే జవహర్ రెడ్డి వున్నట్టు సమాచారం. దీని కోసం జగన్‌తో బంధం కటీఫ్ అయిపోయినా పర్లేదనే నిర్ణయానికి జవహర్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. దీన్నిబట్టి, ఏదైనా బలమైన అవాంతరం వస్తే తప్ప, ఏబీ వెంకటేశ్వరరావుకు శుక్రవారం నాడు పోస్టింగ్ రావడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Cold weather for the people of Telangana... Rains for three days

తెలంగాణ వాసులకు చల్లటి కబురు ... మూడు రోజుల పాటు వానలు 

నైరుతి రుతు పవనాలు కేరళను తాకిన నేపథ్యంలో తెలంగాణ వాసులకు చల్లని కబురు అందింది. వేసవి కాలానికి ఇక గుడ్ బై చెప్పే విధంగా శనివారం నుంచి వరుసగా మూడు రోజులు వానలు పడనున్నాయి.  ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. జూన్ 1న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని... కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి, మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే రెండుమూడు రోజుల్లోనే విస్తరించవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.

చంద్రబాబును కల్సిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు

ఎపి సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లిలో  జరిగిన హింసాత్మక సంఘటనలు మరెక్కడా జరగలేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు కలిశారు. హైదరాబాద్ లో గురువారం చంద్రబాబును కలిసిన మాణిక్యాలరావు...పిన్నెల్లి సోదరుల  అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుండి మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్ లో తలదాచుకున్నానని, సాక్షాత్తు డీజీపీకి కూడా మొరపెట్టుకున్నానని చంద్రబాబుకు వివరించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ పూర్తిగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు...మాణిక్యాలరావు పోరాటాన్ని అభినందించారు. 

రేవంత్‌రెడ్డికి ఎర్రబెల్లి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్!

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని అంటారు.. అది నిజమే.. ఎందుకంటే, నిన్నటి వరకు నువ్వా నేనా అనుకున్నవాళ్ళు అకస్మాత్తుగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. నిన్నటి వరకూ నువ్వే నేను అన్నట్టుగా వున్నవాళ్ళు సడెన్‌గా నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య వున్న ఫ్రెండ్‌షిప్ అలాంటిదే. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహం వుండేది. అయితే ఓటుకు నోటు కేసు సందర్భంలో తన మీద కుట్ర చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావే అనే అభిప్రాయం రేవంత్ రెడ్డిలో కలిగింది. మిత్రుడిలా వుంటూనే మిత్రద్రోహం చేశారన్న అభిప్రాయాలున్నాయి. ఓటుకు నోటు సంఘటనతో రేవంత్, ఎర్రబెల్లి మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడిందన్నమాట మాత్రం వాస్తవం. కాలం గిర్రున తిరిగింది. ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆయనకు దెబ్బకు దెబ్బతీసే అవకాశం ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా వచ్చింది. ఈ కేసులో కేసీఆర్ కుటుంబంతోపాటు ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా భాగస్వామ్యం వుందని పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేసి, అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎర్రబెల్లి సహకరించారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతానికి విచారణ దశలోనే వుంది. పోలీసు అధికారుల అరెస్టు దగ్గరే వుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పెద్ద పెద్ద పొలిటికల్ తలలే అరెస్టు అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ అరెస్టుల లిస్టులో ఎర్రబెల్లి దయాకర్ రావు వున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘మనిద్దరం గతంలో మంచి ఫ్రెండ్స్. ఓటుకు నోటు కేసు సమయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక మనిద్దరం అవన్నీ మరచిపోదాం. నువ్వు నామీద మనసులో ఏమీ పెట్టుకోకుండా వుంటే చాలు’ అని కామన్ ఫ్రెండ్స్ ద్వారా రేవంత్‌కి ఎర్రబెల్లి స్నేహ సందేశం పంపినట్టు తెలుస్తోంది. ఆ రిక్వెస్ట్ ఇంకా ఓకే కానట్టు సమాచారం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా వున్న ఎర్రబెల్లి వ్యవహారం మీద రేవంత్ ఎలా స్పందిస్తారో అంతు చిక్కకుండా వుంది. పాత స్నేహితుడు కదా అని చూసీ చూడనట్టు వ్యవహరిస్తారో... లేక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారో చూడాలి.

ఏపీలో మొట్టమొదట ఫలితం వెలువడే నియోజకవర్గమేదో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.  అది పక్కన పెడితే జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుంది. కాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కౌంటింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకూ పూర్తి అయిపోతుంది. ఇక మరో 61 నియోజకవర్గాలలో కౌంటింగ్ ముగిసే సరికి సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది. ఇక మిగిలిన మూడు నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తయ్యే సరికి సాయంత్రం గంటలు దాటే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లలో సాగుతుంది అన్నదానిపై ఫలితం కౌంటింగ్ ముగియడానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది. సరే ఇంతకీ రాష్ట్రంలో మొట్ట మొదట ఫలితం వెలువడే నియోజకవర్గం ఏమిటంటే మాత్రం రెండు నియోజకవర్గాల పేర్లు చెప్పుకోవలసి ఉంటుంది. అవి కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాలలోనూ కౌంటింగ్ పదమూడు రౌండ్లలో జరుగుతుంది. అంటే రాష్ట్రంలో తొలి ఫలితం కొవ్వూరు లేదా నరసాపురం నియోజకవర్గాల నుంచి వెలువడుతుందన్నమాట. ఇక అన్నిటి కంటే చివరిగా ఫలితం వెలువడే నియోజకవర్గం రంపచోడవరం. రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం 29 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. అందుకే రాష్ట్రం లో అన్ని నియోజకవర్గాల కంటే చివరన ఈ నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది.  

ఏబీ వెంకటేశ్వరరావుకు ఒకరోజు పోస్టు?

ఐదేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని కేసులు పెట్టి, పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తోంది. ఆ వేధింపులకు ముగింపు వస్తోంది. రేపు ఒక్కరోజుతో ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ముగియనుంది. యూనీఫామ్‌లోనే రిటైర్ అవ్వాలని ఆయన పట్టుదలతో వున్నారు. ‘కాట్’ కూడా వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు కూడా వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరావు గురువారం నాడు చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డిని కలిశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి అందించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి కూడా వెంకటేశ్వరరావు హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని అందించారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి. వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన పక్షంలో ఆయన ఒక్కరోజు మాత్రమే ఆ పోస్టులో వుండి, ఆ తర్వాత రిటైర్ అవుతారు. యూనీఫామ్‌లో రిటైర్ అయిన గౌరవం ఆయనకు దక్కుతుంది. ఇప్పటి వరకు అయితే ఆయనకు ఒక్కరోజు పోస్టు ఇవ్వాలన్న ఉద్దేశంలో సీఎస్ వున్నట్టు తెలుస్తోంది. అలా ఇవ్వని పక్షంలో ఈ దేశంలో మానవత్వం, చట్టం, ధర్మం, న్యాయం అనేవి ఉన్నాయని అనుకోవడం అనవసరం అనే అభిప్రాయానికి నిస్సందేహంగా రావచ్చు.