మాజీ మంత్రి హరీష్ రావు కు బిగ్ షాక్

మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు న‌మోదైంది.  చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి బాచుప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో  హ‌రీశ్‌రావుతో పాటు మ‌రో ముగ్గురి  పై కేసు నమోదైంది.  హరీష్ రావు నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని చక్ర‌ధ‌ర్ గౌడ్ తన  ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హ‌రీశ్‌రావుపై  బిఎన్ఎస్  యాక్ట్ 351(2), ఆర్‌డ‌బ్ల్యూ3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు బాచుప‌ల్లి పోలీసులు తెలిపారు. హ‌రీశ్‌రావుతో పాటు సంతోశ్‌ కుమార్, రాములు, వంశీపై  కూడా కేసు న‌మోదైంది. ఎఫ్ఐఆర్‌లో రెండో నిందితుడిగా పోలీసులు హరీశ్‌రావు పేరును చేర్చారు.  ఇటీవలె బెయిల్ పై విడుదలైన హరీష్ రావు అనుచరులు   చక్రధర్ గౌడ్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. 

అక్కడ పెళ్ళి - ఇక్కడ చిల్లు.. దూరప్రాంత వేడుకలతో.. దూరమైన అవకాశాలు.

తెలుగు సినిమా నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి  కేదార్  సెలగంశెట్టి, దుబాయి లో అనుమానస్పద మరణం సంచలనంగా మారింది. మన దేశంలో సినిమాలతో పాటుగా ఇతర కాంట్రాక్టు వ్యాపారాలు, ఇతరత్రా ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో పేరు మోసిన కేదార్ కు అక్కడ దుబాయ్ లోనూ ఆ విధమైన వ్యాపారాలు గట్రా ఉన్నాయని సమాచారం.అలాంటి, పేరు మోసిన అయన దుబాయ్ లో ఒక వివహ వేడుక (ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ )లో పాల్గొని, అదే రోజు రాత్రి నిద్రలోనే కన్ను మూశారు. దాంతో ఇప్పుడు డెస్టినేషన్ వివాహాలు చర్చలోకి వచ్చాయి. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినిమా పరిశ్రమ వర్గాల్లో సంచలనంగా మారింది. మరో వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేదార్ మరణాన్ని, కొంత కాలం క్రితం, హైదరాబాద్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసుకు ముడిపెడుతూ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో , పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. అయితే, ఈ కథ ముందు ముందు ఏ మలుపు తిరుగుతుందో .. ఏమో కానీ, కేదార్ మరణం మరో అనూహ్య కోణాన్ని తెరమీదకు తెచ్చింది, అయితే, మనం కేదార్  మరణానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఓ నిర్ధారణకు వచ్చే ఆస్కారం లేదు. కానీ, ఆయన మరణం నేపధ్యంలో దుబాయ్ లో కుటుంబ వేడుకల ‘కొత్త’ ట్రెండ్ ను తెరపైకి తెచ్చాయి. నిజానికి, ఈమధ్య కాలంలో ఇలాంటి వేడుకలు చాలా పెద్ద ఎత్తునే జరుగుతన్నాయి. కేవలం వివాహ వేడుకలే కాదు చివరకు,కిట్టీ పార్టీలకు కూడా జనం పోలో మంటూ ఫ్లైట్ ఎక్కి పోతున్నారు. ఈ నేపధ్యంలోనే ఈమధ్య కాలంలో డబ్బున్న పెద్దోళ్ళు, సెలబ్రిటీలు ఒక్క దుబాయ్ అనే కాదు సీజన్ ను బట్టి ఏ దేశంలో మోర్   ‘సుఖం’ దొరుకుతుందంటే ఆ దేశాల్లో వివాహాలతో పాటుగా ఇతర వేడుకలు జరుపుకుంటున్నారు. చాల కాలంగా జరుగుతున్నదే అయినా, ఇప్పుడు, ఈ ఉదంతంతో కొత్త అంశం ఆసక్తికర చర్చకు దారితీసింది.  ఈ నేపధ్యంలో, అసలు ఈ డెస్టినేషన్ మ్యారేజెస్ అంటే ఏంటి?  ఎంచక్కా, మన దేశంలో  మన వాళ్ళ మధ్య, మన సంప్రదాయాల ప్రకారం జరుపుకోవలసిన వివాహ వేడుక, ఎల్లలు దాటి, ఏదో దేశంలో పరిమిత సభ్యుల మధ్య జరుపుకోవడం ఏమిటి ? దీని వెనక మతలబు ఏమిటి? అంటే, గొప్పోళ్ళు విదేశాల్లో గొప్పగా జరుపుకునే పెళ్లిళ్లకు పెట్టుకున్న ముద్దు పేరు, ‘డెస్టినేషన్ మ్యారేజెస్’. నిజమే  జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెట్టుకుంటుంది అన్నట్లు, డబ్బున్నోళ్ళు ఎక్కడైనా ఏ వేడుక అయినా, ఎంత ఘనంగా అయినా  జరుపుకుంటారు. విదేశాల్లోనే కాదు, అవకాశం ఉండాలే కానీ, చంద్రమండలం పై కూడా వివాహం చేసుకుంటారు. ఎవరో సినిమా కవి అన్నట్లుగా చేతిలో పైసా ఉండాలే కానీ, కొండమీది కోతైనా దిగివస్తుంది. సో..అందులో తప్పు పట్టాల్సింది ఏముంది, అనిపించవచ్చు. నిజానికి, విదేశాల్లో కాదు, మన దేశంలోనూ గోప్పోళ్ళ పెళ్ళిళ్ళు గొప్పగానే జరుపుకుంటున్నారు కదా,  పేద మధ్య తరగతి పెళ్లి ఖర్చులే రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు  ఉంటుందని అంటున్నారు, కదా అలాంటప్పుడు డబ్బున్న పెద్దోళ్ళు విదేశాల్లో కోట్లు ఖర్చు చేసి వారి వారి ఆర్థిక స్థోమతకు తగ్గ విధంగా వివాహం ఘనంగా జరుపుకుంటే తప్పేముంది, అని కూడా అనవచ్చును.   అలాగే, ఈమధ్యనే జరిగిన అంబానీ కుమారుడి పెళ్లి విషయమే తీసుకుంటే,అది ఎంత ఘనంగా జరిగిందో చూశాం..ఆ పెళ్ళికి అంబానీలు పెట్టిన ఖర్చు రూ.5వేల కోట్ల నుంచి పదివేల కోట్ల రూపాయల వరకు ఎంతైనా ఉండవచ్చని వార్త లొచ్చాయి. సో.. అలాంటప్పుడు, ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ గురించే ఎందుకు ఇంత చర్చ .. వై ..ఇంత ఆందోళన  అన్న ప్రశ్నలు కూడా రావచ్చును.   అయితే, అదీ ఇదీ ఒకటేనా? అంటే కాదు, దేశంలో ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఏ వేడుక చేసుకున్నా, అ సొమ్ములు మన దేశంలోనే ఉంటాయి, దుస్తుల డిజైనర్లు, వేడుకల వేదికల అంకరణలు, క్యాటరింగ్, మంగళవాయిద్యాలు, ఫొటో షూట్లు, పూల వ్యాపారాలు ఇలా వివిధ రంగాల వారికి,  ఆ వేడుకలకు వివిధ సేవలు అందించే వారికీ వారికి ఉపాధి లభిస్తుంది. దేశంలో   పెళ్లిళ్లు, వేడుకల నిర్వహణ అన్నది ఒక పరిశ్రమ స్దాయిలో అభివృద్ధి చెందింది.  వేలాది మందికి ఒక ఉపాధి మార్గంగా మారింది. అంతేనా.. ఈ వేడుకలు, వివాహాలు ఇక్కడే జరుపుకుంటే ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది.  ఆ మేరకు మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అదే, పెళ్ళిళ్ళు విదేశాల్లో జరుపుకుంటే, ఈ ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి గండి పడుతుంది.  మన రూపాయికి రెక్కలొస్తాయి ఎక్కడికో ఎగిరిపోతుంది. అంతే కాదు, ఏ మార్గంలో ఎగిరిపోతోంది అనేది  అంతు చిక్కని చిక్కు ప్రశ్న. అందుకే డెస్టినేషన్ మ్యారేజెస్  విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి .అందోళన వ్యక్తమవుతోంది.  ఎవరిదాకానో ఎందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే రెండేళ్ళ క్రితం (2023లో ) మన్-కీ –బాత్’ కార్యక్రమలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలోని కొన్ని ఉన్నత కుటుంబాలు విదేశాల్లో వివాహాలు చేసుకుంటున్న ధోరణి తనను కలవరపెడుతోందని అన్నారు. ఇదంత అవసరమా...? ఒక్కసారి ఆలోచించండి. అయినవారి మధ్య, ఇక్కడే పెళ్లి వేడుకలు జరుపుకుంటే దేశ సంపద మనవద్దే ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. నిజానికి  ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ సంబంధించి వినవస్తున్న చీకటి కోణాల్లో, ఇది ఒక కోణం, అయితే అసలు కోణం ఇంకొకటుంది. ఇన్నిన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఎలా,  ఏ మార్గంలో విదేశాలకు వెళుతున్నాయి?  అనేది   వేయి కాదు లక్షల కోట్ల డాలర్ల ప్రశ్న. ప్రధాన మంత్రి ఎందుకనో  ఈ విషయాన్ని తమ ప్రసంగంలో ప్రస్తావించలేదు కానీ, ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ లో అసలైన మూడో ముడి ఇదే అంటున్నారు. నిజానికి, సక్రమంగా మన దేశం నుంచి విదేశాలకు డబ్బు పంపాలంటే 30 నుంచి 40 శాతం వరకు పన్ను చెల్లించవలసి ఉంటుంది. పిల్లలను విదేశాల్లో చదివిస్తున్న మధ్యతరగతి ప్రజలకు ఇది అనుభవంలో ఉన్నదే. అలాంటప్పుడు,ఇంతింత డబ్బును సక్రమ మార్గంలోనే విదేశాలకు తరలిస్తున్నారా? హవాలా మార్గంలో వెళుతున్నాయా? అంటే, అందరూ, మొత్తం సొమ్మును రకరకాల మార్గాలలో నే పంపుతున్నారని, ఎక్కువ మొత్తం హవాలా రూట్ లోనే వెళుతున్నదనే, అనుమానాలు అయితే ఉన్నాయి. అదే నిజం అయితే,  డెస్టినేషన్ పెళ్లి పేరున చాలా పెద్ద ఆర్థిక  నేరం జరిగిపోతోందని అనుకోవచ్చును. అంటే, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ముందు ముందు ‘డెస్టినేషన్ మ్యారేజెస్’, మరో భయంకర ఆర్థిక నేరంగా పరిణమించే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే,   ఈ వేడుకలు కూడా మనకు ఉపయోగం లేనివి అనిపిస్తోంది. సో ..  సినిమా నిర్మాత కేదార్  మరణంతో మరోమారు వెలుగులోకి వచ్చిన ‘డెస్టినేషన్ మ్యారేజెస్’ అసలు కథేంటి? అలోచించడమే కాదు, రంగు రుచి వాసనల గుట్టు విప్పవలసిన, విచారించవలసిన అవసరం అయితే వుంది. 

పోసాని కూడా అందగాడేనా జగనూ?.. ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్న మాజీ సీఎం

విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు రోజులు గుడుస్తున్నా ఇంకా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా వైసీపీలోని కమ్మ నేతల అందం గురించి మాట్లాడిన జగన్ ఒక రేంజ్లో ట్రోల్ అవుతున్నారు.. ఆ ఎఫెక్ట్‌తో ఆయన తీరు వైసీపీ నేత‌ల‌కు, కార్యక‌ర్తలకే అంతుప‌ట్టడం లేదంట.  వాస్తవానికి జగన్‌కి ఉన్నంత ఇగో ఫీలింగ్, డామినేషన్ నేచర్ ఇంకే పొలిటీషియన్‌కి ఉండవన్న అభిప్రాయం ఉంది. ఓట్ల వర్షం కురవడానికి తన ఫొటో ఉంటే చాలు ఇంకెవరూ అక్కర్లేదన్నట్లు ఆయన వ్యవహార తీరు ఉండేది. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్ అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరించారు అనడానికి  పలు ఉదంతాలు ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జగన్ ఉన్న వేదిక మీదే అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా ఉన్నారు. బడా ఇండస్ర్టియలిస్ట్ అయిన ఎస్పీవై రెడ్డి ఆజానుబాహుడు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో హుందాగా కనిపించే వారు. ఆయన వేదికపై జగన్ పక్కన నుంచోవడంతో సహజంగానే జగన్ కాస్తంత పొట్టిగా కనిపించి ఫిజికల్‌గా తేలిపోయారంట. దాంతో జగన్ వెంటనే అన్నా నువ్వు డయాస్ దిగు అని ఆ పెద్దాయన్ని వేదిక మీద నుంచి దింపే శారంట. ఈ ఉదంతాన్ని వైసీపీ సీనియర్లు, నంద్యాల నేతలు ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు. అప్పట్లో సీని నటులు జీవితా, రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరి జగన్ కోసం ప్రచారం చేశారు. జగన్‌తో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు. అయితే రాజశేఖర్ తనదైన కాస్ట్యూమ్స్, మేకప్‌తో  వేదికపై తనను డామినేట్ చేస్తున్నారని జగన్ ఆ దంపతులను దూరం పెట్టేశారన్న ప్రచారం గట్టిగానే జరిగింది. రోజాకు కూడా అధికారిక కార్యక్రమాలకు మేకప్‌తో రావొద్దని వార్నింగ్ ఇవ్వడం వల్లే ఆమె అసెంబ్లీలో, పార్టీ కార్యక్రమాల్లో ఒరిజినల్ గెటప్‌తో కనిపించారంట అట్లాంటి జగన్ అధికారం చేజారగానే తన ఇగోలు, డామినేషన్‌లు పక్కన పెట్టి కొత్త రాగం ఎత్తుకుంటూ అభాసుపాలవుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో సహా దొరికిపోయి బెజవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన జగన్.. ఆ పరామర్శ పూర్తయ్యాక జైలు ముందే మీడియా ముందుకొచ్చారు .. చంద్రబాబు  తన కుటుంబం తప్ప కమ్మ సామాజిక వ‌ర్గంలో ఎవ‌ర్నీ పైకిరానివ్వరు.. అందుకే  రాజ‌కీయంగా ఎదుగుతున్న కొడాలి నాని, వ‌ల్ల‌భనేని వంశీ, దేవినేని అవినాశ్ ల‌పై క‌క్షపూరితంగా వ్యవ‌హ‌రిస్తున్నారని సరికొత్త రాగం ఎత్తుకున్నారు. అంతవరకు ఓకే కాని జగన్ తన స్థాయిని కూడా మర్చిపోయినట్లు స్క్రిప్ట్‌లో రాసిచ్చిన డైలాగులు వల్లె వేసి అభాసుపాలయ్యారు. తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడిన జగన్ వాళ్లు అందగాళ్లని కితాబిచ్చారు.  చంద్రబాబు, లోకేశ్ కంటే వ‌ల్లభ‌నేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాశ్ లు అందంగా ఉంటార‌ట‌. తమ సామాజికవర్గానికి చెందిన అలాంటి వాళ్ల రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేకే  చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారంట ... అందులో భాగంగానే క‌క్షపూరితంగా వ‌ల్లభ‌నేని వంశీపై అక్రమ‌ కేసులు పెట్టార‌ట‌.. కొడాలి నాని, అవినాశ్ కూడా గ్లామర్‌గా ఉండ‌టంతో వారినీ త్వర‌లోనే కేసుల్లో ఇరికిస్తారని జగన్ జోస్యం చెప్పేశారు. అరెస్టుల పర్వంలో జగన్ లెక్కలు తప్పి ఇప్పుడు పోసాని కృష్ణమురళీ వంతు వచ్చింది. ఫోన్లో పోసాని భార్యను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్.. ఆ కేసు చూసుకోవడానికి తన న్యాయకోవిదుల్ని కూడా నియమించారు. అంతవరకు బానే ఉన్నా పోసాని గ్లామర్‌ను జగన్ ఎవరితో పోలుస్తారో అన్న సెటైర్లు మొదలయ్యాయి. పోసాని కూడా లోకేష్ కంటే అందగాడని అందుకే అరెస్ట్ చేశారని జగన్ ఎక్కడ స్టేట్‌మెంట్ ఇస్తారో? అని వైసీపీ శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయంట.  అయినా మగవాళ్ల అందం గురించి అందునా రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎం  జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బహుశా అలాంటి వ్యాఖ్యలు చేసిన మొదటి, ఆఖరి మాజీ ముఖ్యమంత్రి జగనేనేమో.

హైదరాబాద్ కు మీనాక్షి నటరాజన్.. స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ  వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్  శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా మీనాక్షీ నటరాజన్ రాష్ట్ర పర్యటనకు రావడం ఇదే  తొలిసారి. రైలు మార్గం ద్వారా హైదరాబాద్ కు వచ్చిన ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆమెకు తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,  ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్లు సిద్ధేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.  మీనాక్షి నటరాజన్ స్వయంగా ఆదేశించడంతో ఆమె రాక సందర్భంగా ఎక్కడా ఫ్లెక్సీల హడావుడి కనిపించలేదు. కాగా మీనాక్షి నటరాజన్ ను ఆమె బస చేసిన దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలూ కూడా ఆమెతో భేటీ అయ్యారు. 

చంద్రబాబును కల్సిన  పిటీ ఉష  

ఎపి  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష భేటీ అయ్యారు. 2029లో ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని  చంద్రబాబు ఆమె మద్దత్తు కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై వీరువురు చర్చించారు. అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ ఏర్పాటు,  స్పోర్ట్స్ సిటీ అభివృద్దిపై చర్చించారు.  రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారటీ  ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు చంద్రబాబు ఆమె మద్దత్తు కోరారు. 

జయప్రద ఇంట విషాదం... సోదరుడు కన్నుమూత

ప్రముఖ సినీ న‌టి, అలనాటి హీరోయిన్  జ‌య‌ప్ర‌ద ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోద‌రుడు రాజ‌బాబు క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం రాజ‌బాబు మ‌ర‌ణించిన‌ట్లు జ‌య‌ప్ర‌ద తెలిపారు.  జయప్రద 14 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యారు. 1976లో కెరీర్ ప్రారంభించి దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2005 ఆమె చివరి చిత్రం. రాజకీయాల్లో  తెలుగుదేశం పార్టీలో అరంగేట్రం చేశారు. విభేధాల కారణంగా ఆమె సమాజ్ వాది పార్టీలో చేరారు. పార్టీ ప్రదాన కార్యదర్శి అమర్ సింగ్  వెన్నంటే ఉన్నారు.  రెండుసార్లు  ఉత్తర ప్రదేశ్ రాంపూర్ లోకసభ నుంచి ఎంపీ గా గెలుపొందారు. ఆయన మరణం తర్వాత జయప్రద స్వంత పార్టీని ఏర్పాటు చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం ఆమె బిజెపిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీలో ఆమె కీలకపాత్ర పోషించారు. 

పోలవరం ప్రాజెక్టు కోసం రూ.6705 కోట్ల రూపాయలు

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ 2025-26లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర విత్తమంత్రి పయ్యావుల కేశవ్ భారీగా కేటాయింపు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఆయన 6 వేల705 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక జలజీవన్ మిషన్ కు 2, 800 కోట్ల రూపాయలు కేటాయించారు.  అలాగే వివిధ శాఖలు, రంగాలు, పథకాలకు ఆయన చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.. వ్యవసాయ, అనుబంధ రంగాలు.. రూ.13,487 కోట్లు పౌరసరఫరాల శాఖ..  రూ.3,806 కోట్లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ..  రూ.1,228 కోట్లు బీసీల సంక్షేమం.. రూ.47,456 కోట్లు ఎస్సీల సంక్షేమం.. రూ.20,281 కోట్లు ఎస్టీల సంక్షేమం.. రూ.8,159 కోట్లు అల్పసంఖ్యాక వర్గాలు.. రూ.5,434 కోట్లు మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం..  రూ.4,332 కోట్లు వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం..  రూ.19,264 కోట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ.. రూ.3,156 కోట్లు రోడ్లు, భవనాలు.. రూ.8,785 కోట్లు యువజన, సాంస్కృతిక శాఖ..  రూ.469 కోట్లు తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం..  రూ.10 కోట్లు నవోదయ 2.0 .. రూ.10 కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం.. రూ.3,486 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన.. రూ.500 కోట్లు ధరల స్థిరీకరణ నిధి..  రూ.300 కోట్లు ఐటీఐ, ఐఐఐటిలు.. రూ.210 కోట్లు దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన..  రూ.745 కోట్లు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌..  రూ.10కోట్లు ప్రకృతి సేద్యం ప్రోత్సాహం..  రూ.62 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు.. రూ. 11,314 కోట్లు మత్స్యకార భరోసా.. రూ.450 కోట్లు

హోంశాఖకు రూ.84570 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ కేటాయింపులు చేశారు. ఇందు కోసం రాష్ట్ర హోంశాకలకు 8570 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందనీ, జగన్ సర్కార్ తీరు కారణంగా పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతిందనీ పేర్కొన్న పయ్యావుల కేశవ్, దాని పర్యవశానంగా రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా, భద్రంగా బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.   పోలీస్ దళం ఆధునీకరణ,  6,100 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈగల్)' ఏర్పాటు, ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, పెట్రోలింగ్ సహా పటిష్ట నిఘా  కోసం పోలీస్ వాహనాల కొనుగోలు, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు 'నవోదయం 2.0' కార్యక్రమం,  ఆల్కహాల్ డీ-అడిక్షన్ సహా వ్యసనాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిధులను కేటాయించారు. 

పథకాలకు నిధుల కొరత లేకుండా పయ్యావుల కేటాయింపులు

వివిధ శాఖలకు, పధకాలకు పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేశారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల కోసం 506 కోట్ల రూపాయలు కేటాయించిన ఆయన, ఆర్టీజీఎస్ కు 101 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే చేనేత, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం 450 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే వివిధ పధకాల కోసం పయ్యవుల కేశవ్ తన పద్దులో చేసిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి.  ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు... రూ.27,518 కోట్లు అన్నదాత సుఖీభవ..  రూ.6,300 కోట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రాయితీలు..  రూ.300 కోట్లు ఆదరణ పథకం.. రూ.1000 కోట్లు మనబడి పథకం..  రూ.3,486 కోట్లు తల్లికి వందనం..  రూ.9,407 కోట్లు అమరావతి నిర్మాణం..  రూ.6 వేల కోట్లు దీపం 2.0 పథకం..  రూ.2,601 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులు..  రూ.4,220 కోట్లు బాల సంజీవని పథకం..  రూ.1,163 కోట్లు  ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పులు.. రూ.3,377 కోట్లు పురపాలక శాఖ.. రూ.13,862 కోట్లు స్వచ్ఛ ఆంధ్ర.. రూ.820 కోట్లు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌.. రూ.400 కోట్లు

రాజంపేట  జైలులో పోసాని... మార్చి 13 వరకు రిమాండ్ 

సినీ నటుడు,రచయిత పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.  పోలీసులు ఆయనను రాజంపేట స‌బ్ జైలుకు త‌ర‌లించారు. ఆయ‌నను క‌స్ట‌డీకి కోరుతూ శుక్రవారం  పోలీసులు పిటిష‌న్ దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది.  పోసానిపై ఇప్ప‌టికే రాష్ట్ర‌వ్యాప్తంగా 14 కేసులు న‌మోదయ్యాయి.  పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధ‌వారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.  అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సమక్షంలో  పోలీసులు  దాదాపు  9 గంట‌ల పాటు విచారించారు. అనంతరం  రాత్రి జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు. రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా వాద‌న‌లు కొనసాగాయి. అనంత‌రం ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు  జడ్జి తీర్పు చెప్పారు . దీంతో పోసాని  వచ్చే నెల   అంటే మార్చి 13 వరకు రిమాండ్ లో ఉంటారు. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు.. కులాల పేరుతో దూషించినట్లు పోసానిపై జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసు విషయంలో పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.  హైద్రాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి   అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై  గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై  బిఎన్ఎస్ సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్  ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని నోటికిచ్చానట్లు  విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోసానిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. తాజాగా కోర్టు ఆయనకు మార్చి 13 వరకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

పయ్యావుల పద్దు.. కేటాయింపులు ఇలా..

పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో సంక్షేమానికీ, అభివృద్ధికీ సమ ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి వయాబులిటీ గ్యాప్ ఫండ్ 2 వేల కోట్లు కేటాయించారు. వివిధ ప్రాజెక్టులలో నిధుల కొరతను అధిగమించడమే లక్ష్యంగా ఈ నిధి ఉపయోగపడుతుంది పాఠశాల విద్య.. రూ.31,806 కోట్లు. బిసి వెల్ఫేర్‌.. రూ. 23,260 కోట్లు. సాంఘిక సంక్షేమం.. రూ. 10,909 కోట్లు. ఈబీసీల అభివృద్ధికి.. రూ. 10,619 కోట్లు. రవాణా శాఖ... రూ. 8,785 కోట్లు. వైద్యారోగ్య శాఖ.. రూ. 19,260 కోట్లు. పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్.. 18,848కోట్లు. జలవనరుల అభివృద్ది శాఖ.. రూ. 18,020 కోట్లు. మున్సిపల్ , అర్బన్ డెవలెప్మెంట్..  రూ. 13,862 కోట్లు. విద్యుత్ శాఖ.. రూ. 13,600 కోట్లు. వ్యవసాయానికి.. రూ. 11,636 కోట్లు.

జగన్ విధ్వంసాన్ని హిరోషిమాపై అణుబాంబు దాడితో పోల్చిన పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతుకు ముందు ఏపీ కేబినెట్ భేటీ  బడ్జెట్ కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.  అప్పలు చేయడం తప్ప, అప్పులు తీర్చడం అన్నదే తెలియని జగన్ ప్రభుత్వం తీరు కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైందన్న పయ్యావుల కేశవ్.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, మరో పక్క రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిరాటంకంగా కొనసాగేలా అన్ని చర్యలూ తీసుకుందని పయ్యావుల చెప్పారు.  గత వైసీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందన్న పయ్యావుల, వైసీపీ ప్రభుత్వ అరాచకం హిరోషిమాపై అణుదాడి కన్నా దారుణంగా అభివర్ణించారు. జగన్ అరాచక, విధ్వంస పాలనను వ్యతిరేకించిన ప్రజలు గత ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్  బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శరణ్యమని భావించి 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టారని పయ్యావుల అన్నారు.  

పయ్యావుల పద్దుకు కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయ్యింది. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం జరిగిన ఈ భేటీలో కేబినెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.  2025-26 ఆర్థిక సంవత్సరానికి కు  రూ. 3.24 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో  బడ్జెట్ రూపొందింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు.   అంతకు ముందు పయ్యావుల కేశవ్    అమరావతిలో ని   టిటిడి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.  2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని వేడుకున్నారు.

గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసు.. ఇక అరెస్టేనా?

గోరంట్ల మాధవ్.. ఈ పేరు వినగానే ఎవరన్నది పెద్దగా తెలిసే అవకాశం లేదు. కానీ న్యూడ్ వీడియో ఎంపీ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. ఔను హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో బూతుకే రోత పుట్టేంత ఛండాలం.  అంత అసహ్యం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా గోరంట్ల మాధవ్ పై వైసీపీ అధినేత ఎటువంటి చర్యా తీసుకోలేదు. పైపెచ్చు ఆయనో ఘన కార్యం చేశారన్నట్లు పార్టీ ఓటమి తరువాత ఆయనకు పార్టీ పదవి కూడా ఇచ్చారు. గత ఎన్నికల ముందు కూడా గోరంట్ల మాధవ్ ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. వైసీపీ వైనాట్ 175 అంటూ  పార్టీ అధినేత జగన్ మాటలను తన నోట కూడా వినిపిస్తూ.. లోకేష్ పాదయాత్ర కాదు, చంద్రబాబు కాశీ యాత్ర చేసినా జగన్ జైత్రయాత్ర ఆపడం ఎవరి తరం కాదంటూ రెచ్చి పోయారు.  అంతేనా తెలుగుదేశంతో జట్టు కట్టినందుకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలపై కూడా నోరు పారేసుకున్నారు. అయితే ఇంత చేసినా వైసీపీ అధినేత జగన్ గోరంట్లకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు.  ఇక తన న్యూడ్ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత కూడా గోరంట్ల మాధవ్  జిమ్ చేస్తుండగా ప్రత్యర్థులు మార్ఫింగ్ చేశారనీ, వీరిపై పోలీసు కేసు పెడతాననీ ప్రకటనలు గుప్పించారు. అయితే ఆ దిశగా ఆయన ఒక్కటంటే ఒక్క అడుగు కూడా వేయలేదు. పోలీసు కేసు పెట్ట లేదు.  కాగా   గోరంట్ల  న్యూడ్ వీడియో ఒరిజనల్ అంటూ అమెరికాలోని ఓ ల్యాబ్స్   సర్టిఫై కూడా చేయడంతో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో అందరికీ అర్ధమైపోయింది. గత ఎన్నికలలో గోరంట్లకు పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఇవ్వకపోవడానికి కూడా న్యూడ్ వీడియోయే కారణం. ఎన్నికలయ్యే వరకూ సైలెంట్ గా ఉంటే.. ఎన్నికలలో విజయం సాధించేది మన పార్టీయే అప్పుడు చూసుకుందాం.. అని గోరంట్లను పార్టీ పెద్దలు బుజ్జగించినట్లు కూడా పార్టీ వర్గాలలో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సరే ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. జగన్ సర్కార్ గద్దె దిగింది. అయినా పార్టీ మాత్రం గోంరట్లను వెనకేసుకునే వస్తోంది. ఆయనకు జగన్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిథి పదవిని ఇచ్చారు. అశ్లీల చర్యలు,  అసభ్య పదజాలం గోరంట్లకు భూషణాలు అనుకున్నారేమో, లేదా తమ పార్టీ వాయిస్ అదే అని భావించారో ఏమో జగన్ ఆయనకు పార్టీ అధికార ప్రతినిథి బాధ్యతలను అప్పగించారు. అలాంటి గోరంట్ల మాధవ్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.  మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి ఫద్మ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదుచేసి  మార్చి 5న విచారణకు రావాల్సిందిగా నోటీసు జారీ చేశారు.   పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. గతంలో పోలీసు ఆఫీసర్ గా పని చేసిన గోరంట్ల మాధవ్  ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది.  బాధితురాలి గోప్యతకు భంగం కిలిగించడం, అనుచిత వ్యాఖ్యల కేసులో గోరంట్ల అరెస్టు కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.    

3.24 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 28) అసెంబ్లీలో పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో కూటమి  ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ప్రవేశ పెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది.  దాదాపు 3.24 లక్షల కోట్లతో ఆంద్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్  అసెంబ్లీ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి,  సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో పెద్ద నపీట వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నిధుల కేటాయింపు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.  అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశ పెడితే, మంత్రి నారాయణ మండలిలో ప్రవేశ పెడతారు. కాగా బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అద్యక్షతన జరిగే కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలుపుతుంది. 

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. 3న ఫలితాలు

తెలుగు రాష్ట్రాలలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాలకూ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికీ, అలాగే తెలంగాణలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానానికీ, కరీంనగర్, నల్లొండ్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకూ గురువారం (ఫిబ్రవరి 28) పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గ్రాడ్యుడేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఓ మోస్తరుగా జరిగింది. అదే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలలో మాత్రం భారీగా జరిగింది. బుధవారం (ఫిబ్రవరి 27) శివరాత్రి కావడంతో జాగారం ప్రభావం కారణంగా ఉదయం పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ తరువాత క్రమంగా పుంజుకుంది.ఇక మార్చి 3న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.   కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మల్సీ స్థానానికి 69.57 శాతం పోలింగ్ జరగగా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 69.50 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో 92.40 శాతం పోలింగ్ నమోదైంది.  ఇక తెలంగాణలో కరీంగన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో పోలింగ్ శాతం 63.4శాతం నమోదు కాగా కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ శాతం 83.24శాతంగా నమోదైంది. నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలో పోలింగ్ శాతం 93.55 శాతంగా నమోదైంది. మొత్తంగా స్వల్ప సంఘటనలు వినా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 

గీతం యూనివర్శిటీలో కెరీర్ ఫెయిర్ లోగో ఆవిష్కరణ

నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లోకెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. యువతీ, యువకులకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ కెరీర్ ఫెయిర్‌లో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయి.  ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆవిష్కరించారు.  2024, 2025లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు  అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాస్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ఉప్మిత్ సింగ్ పాల్గొన్నారు.