జగన్ మాటే జీఎన్‌రావు కమిటీ మాట!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జీఎన్‌రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ తన తుది నివేదికను ఈరోజు సీఎం వైఎస్ జగన్ కు అందజేసింది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై కమిటీ అధ్యయనం చేసి తుది నివేదిక సమర్పించింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేశామని కమిటీ పేర్కొంది. జీఎన్‌రావు మాట్లాడుతూ.. గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని చెప్పారు. ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వెల్లడించారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి అని సూచించామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్లుగా విభజించాలని సూచించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్త, రాయలసీమ రీజియన్లుగా విభజించాలని తెలిపారు. వరదముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించారు. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సెక్రటేరియట్, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉండాలని పేర్కొన్నారు.  శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలని.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు బెంచ్ ఉండాలని కమిటీ సూచించింది.

కర్నూల్ కి హైకోర్టు.. లాయర్ల సంబరాలు!!

హైకోర్టు భవనాలు శివారు ప్రాంతంలో నిర్మించాలనుకుంటే కర్నూలకు సమీపంలోని ఓర్వకల్లు మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి అని న్యాయవాదులు తెలియజేశారు. ఇప్పటికే ఓర్వకల్లులో విమానాశ్రయం, ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్డీవో, సోలార్ పార్కు వంటి పెద్ద సంస్థలే కాక వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో కూడా ఉన్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హై కోర్టు నిర్మాణానికి ఎంత భూమినైనా కేటాయించవచ్చు. కర్నూలుకు పది కిలోమీటర్ల దూరములో హైదరాబాద్-బెంగుళూరు 44 వ జాతీయ రహదారి ఆనుకుని కొట్టం ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిసరాలల్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్ మూతపడింది,దానిలో ఒక ఐటీ కంపెనీ కాలేజీల్లోనే నిర్వహిస్తున్నారు. హై కోర్టు నిర్వహణకు అవసరమైన భవనాలు కూడా ఆ ప్రాంతంలో. స్వల్ప మార్పులతో కోర్టు హాల్స్ ఏర్పాటు చేయవచ్చు. ఈ భవన సముదాయాన్ని గతంలో పరిశీలించారని ప్రచారముంది. నలభై వ జాతీయ రహదారి పై మూత పడిన సఫా ఇంజనీరింగ్ కాలేజీ భవన సముదాయం కూడా అందుబాటులో ఉంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయంటున్నారు న్యాయవాదులు. వీలైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  రాష్ట్ర విభజన అంశం తెరపైకి రాగానే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని లేదా హై కోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు రాజధాని హై కోర్టు ఒకే దగ్గర ఉండాలంటూ అమరావతిలోనే రెండింటిని ఏర్పాటు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు వ్యాఖ్యల తర్వాత న్యాయవాదులు హై కోర్టు కోసం రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారు. కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో నిరంతరం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో 97 రోజులుగా విధులు బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. న్యాయవాదులకు మద్దతుగా రాయలసీమలో రాజధాని హై కోర్టు ఏర్పాటు చేయాలంటూ జిల్లా లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. చివరికి అమరావతి అసెంబ్లీను సైతం ముట్టడించారు. ఈ సమయంలోనే అసెంబ్లీలో రాజధానిపై చర్చ సందర్భంగా కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయొచ్చని సీఎం జగన్ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాయలసీమ జిల్లాల్లో న్యాయవాదులు సంబురాలు చేసుకుంటున్నారు. దశాబ్దాల కల నెరవేరిందని రాయలసీమకు న్యాయం చేశారంటూ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని ఎక్కడ ఉండబోతుందని అటు రైతులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్, న్యాయవాదుల సైతం అయోమయంతో ఎదురు చూస్తున్నారు. మరి  ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

హైదరాబాద్ కోసం కేటీఆర్ కొత్త ఆలోచనలు... ట్రాఫిక్ నియంత్రణనే ప్రధాన లక్ష్యం

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాక ట్రాఫిక్ సమస్యల పై కూడా దృష్టి పెడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన రోడ్ల పైన వాహనాల భారం తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. జీహెచ్ఎంసి సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్ రోడ్లను నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో మేయర్ బొంతు రామ్మోహన్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ లో ఫస్ట్ ఫేజ్ లో 55 స్లిప్ రోడ్లను గుర్తించామని వాటి నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు చేస్తున్నామని అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే 40 రోడ్లకు ఆర్టీసీ సిద్ధమైందన్నారు, ఇందులో 20 రోడ్లలో కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే స్లిప్ ల నిర్మాణం మొదటి దశ ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు. నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగర రోడ్ల పై వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోందని దీన్ని ఎదుర్కొని పౌరులు సులభంగా తమ గమ్యం చేరేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్సు ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. దీంతో పాటు అభివృద్ధి ద్వారా కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రోడ్ల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫుట్ పాత్ ల నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ప్రతి జోన్ లో కనీసం 10 కిలోమీటర్ల చొప్పున జనసమ్మర్దం ఉండే రోడ్ల వెంబడి ఫుట్ పాత్ ల నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను గుర్తించామని ఆయన అన్నారు. ఈ ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సిటీలో ఇప్పటికే బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించిన అంశాన్ని అధికారులకు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న పనుల వివరాలను కేటీఆర్ ఆరా తీశారు. హైదరాబాద్ లోనే పవర్ కారిడార్ లలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఒక నివేదిక సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. హెచ్ఎండీఏ చేపడుతున్న రోడ్ల నిర్మాణంతో జీహెచ్ ఎంసీ చేపడుతున్న రోడ్ల నిర్మాణం ప్రణాళికలను సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.మంత్రి కేటీఆర్ అభివృద్ధి కొరకై చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర స్ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

ఏపీ ఆర్ధిక పరిస్థితిని ఆర్ధిక సంఘం దృష్టికి తీసుకొచ్చిన జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్ కె సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తగిన రీతిలో సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం ఏపీనే అన్న సీఎం జగన్ అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదార రీతిలో సహాయం చేయాలని కోరారు. విభజన హామీల అమలుకు కేంద్రంలో యంత్రాంగం ఉండేలా చూడాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై అధికారులు నివేదికలిచ్చారు. విభజన వల్ల రాజధానిని కోల్పోవడంతో పాటు పారిశ్రామిక సేవా రంగాల వాటా బాగా తగ్గిపోయాయని తలసరి ఆదాయంలో చూస్తే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తర్వాత ఏపీనే వెనకబడి ఉంది. షెడ్యూల్ 9 లో ఉన్న సంస్ధల ఆస్తుల విభజన ఇంకా జరగనేలేదు, షెడ్యూల్ 10 లో 152 ఆస్తులు ఉంటే తెలంగాణకు 107 కాగా ఏపీకి 15 ను మాత్రమే వచ్చాయి. ఇంకా 20 ఆస్తులు తెలంగాణ ఆంధ్రా చేతుల్లో ఉమ్మడిగా ఉన్నాయి. ఏపీ భవన్ విభజన కూడా ఇంకా జరగలేదు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇక్రిశాట్ లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉండి పోయాయి. బీహెచ్ఇఎల్, ఈసీఐఎల్, హెచ్ఏఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయని ఆయన వివరించారు. రాష్ట్రాన్ని పునః నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సిఫారసు చేయాలని సీఎం కోరారు. రెవిన్యూలోటు భర్తీ కింద 19,969.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,979 కోట్లు మాత్రమే వచ్చాయి. వెనకబడిన జిల్లాలకు 24,350 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,050 కోట్లు మాత్రమే వచ్చాయని సీఎం జగన్ ఆర్ధిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.

36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై దిశా నిందితుల ఎన్కౌంటర్ ఘటన తరువాత మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ కుటుంబానికి న్యాయం చేసారని అందరూ జై హో పోలీస్, జై హో సీఎం అంటూ జై జైలు కొట్టారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైకోర్టు చొరవతో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో దూసుకెళ్తొంది. అత్యాచారాలు, చిన్నారుల పై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం పెద్ద ఎత్తున ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1 కాదు 2 కాదు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవటమేకాక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో రెండేసి చొప్పున మిగతా జిల్లాల్లో ఒక్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 365 రోజులు పని చేస్తాయి. కింది కోర్టు పై కోర్టులు అన్న ఆలోచనే లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ జరిపి అక్కడే శిక్షలు ఖరారు చేయనున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూలై 25 న సుమోటో విచారణ సందర్భంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో ఆగస్టు 5 న అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయ శాఖ లేఖలు రాసింది. దాని ఆధారంగా ఈ నెల 5 న తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ అందులో సుప్రీం కోర్టు ఆదేశాలను వివరించింది. దీంతో తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి వేగంగా విచారణ జరగాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని పై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గులాబీ నేతల మధ్య కోల్డ్ వార్.. కారణం అదేనా?

తెలంగాణాలో కొందరు టీఆర్ఎస్ నేతల జోరు తగ్గినట్లు కనిపిస్తొంది. చిన్న విషయానికే మీడియా ముందు హల్ చల్ చేసే నాయకులు సైతం కనుమరుగైపోయారు. సీఎం కొదరు నేతలను పక్కన పెట్టారా లేక వారే దూరంగా ఉన్నారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అడ్డాగా మారింది. టిడిపి, కాంగ్రెస్ కు కంచుకోట అయిన వరంగల్ ను తమ ఖాతాల్లో వేసుకున్నారు టీఆర్ఎస్ లీడర్లు. అయితే ఉద్యమ కాలం నుంచి కొనసాగుతూ కీలకమైన నేతలుగా ఉన్న చాలా మంది నేతలు ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కనబడకుండా పోతున్నారనే విమర్శలు కూడా తలెత్తాయి. వివిధ పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన నేతల కారణంగా పాతతరం వాళ్లు వెనక్కి నెట్టబడుతున్నారన్న భావన టీఆర్ఎస్ నేతల్లో ఉంది.  మొన్నటి సాధారణ ఎన్నికల ముందు కూడా జిల్లా గులాబీ వర్గంలో ఇలాంటి అసంతృప్తులు బయట పడ్డాయి. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు ఒక్కరికే క్యాబినెట్ లో అవకాశం దక్కింది. జిల్లాలో ఆయనే అన్నీ తానై వ్యవహరించారు. ఆరు జిల్లాల పరిధిలో పార్టీ పరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో గిరిజన ప్రాంతమైన మానుకోట నుంచి సత్యవతి రాథోడ్ కు అవకాశం దక్కింది. వరంగల్ సిటీ నుంచి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ గా అవకాశం వచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన ఈటెల రాజేందర్ కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. వీరి మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.  2014 తర్వాత పార్టీలోకి వచ్చి కీలకంగా మారిన నేతలు వారితో వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలిస్తూ పాత వారిని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన నేతల్లో ఉంది. ఉద్యమంలో పనిచేసి నష్టపోయామని అసంతృప్తి పాతతరం నేతల్లో కనిపిస్తోంది. మొన్నటి వరకు జిల్లాలో యాక్టివ్ రోల్ పోషించిన తక్కళ్లపల్లి రవీందర్ రావు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పాలకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్, రెండుమూడుసార్లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న హైదరాబాదుకే పరిమితమయ్యారు తక్కళ్లపల్లి. మరోవైపు మొదటి నుంచి ఉన్న వాళ్లకు సరైన ప్రాధాన్యం కల్పించాలని ఆ పార్టీ సీనియర్ నేత రాజయ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో చెప్పడం చర్చకు దారి తీసింది. పార్టీ నేతల్లో అసంతృప్తి ఇప్పటికిప్పుడు బయటపడకుండా పాత కొత్త తరం నేతల మధ్య కోల్డ్ వార్ మాత్రం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.ఈ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ని తెలంగాణా సీఎం ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.  

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రాణాలను కోల్పోతున్న ఆందోళనకారులు

పౌరసత్వ సవరణ బిల్లు పై పోలీసులకి, వ్యతిరేకిస్తున్న నేతల మధ్య అగ్గి రాజేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. బీజేపీ పాలిత కర్ణాటకలోని మంగళూరులో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులకు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్ ముట్టడించటం సహా పలు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టినందునే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఈ నెల 22 అర్ధరాత్రి వరకు మంగళూరులో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పొరుగు రాష్ట్రం కేరళకు చెందిన ఆందోళనకారులే హింసకు కారణమని కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోనూ నిరసనల ఉధృతరూపం దాల్చాయి. బెంగళూరులోని టౌన్ హాల్ వద్ద అరవై వేలకు పైగా ఆందోళనకారులు రహదారులను స్తంభింపజేశారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వామపక్ష నేతలతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అదుపు లోకి తీసుకోవడం దారుణమని రామచంద్ర గుహ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ హాల్ వద్ద నిరసనకారులు ఎంతకీ కదలకపోవడంతో బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ జాతీయ గీతం ఆలపించారు. గీతం ఆలపించిన తర్వాత ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. భాజపా అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. లఖ్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సంభల్ జిల్లా లోనూ ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. రేపు మధ్యాహ్నం వరకు లఖ్నోలో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలు నిలిపివేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని షాహి ఆలంలో నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. అహ్మదాబాద్ లోని మిర్జాపూర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది ఆందోళనకారులు గాయపడ్డారు.  ముంబైలో కాంగ్రెస్, ఎన్సీపీ సహా వివిధ పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆగస్ట్ క్రాంతి మైదానంలో శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. వీటిలో పలు రాజకీయ పార్టీల కార్యకర్తలూ బాలీవుడ్ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివసేన ప్రదర్శనకు దూరంగా ఉన్నప్పటికీ పౌరసత్వం కల్పించిన హిందూ శరణార్థులను కేంద్రం ఎక్కడ ఎలా ఉంచాలని అనుకుంటోందని ప్రశ్నించింది. నాసిక్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీ జరిగింది. మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఆందోళనలు కూడా ఎగిసిపడ్డాయి. మధ్యప్రదేశ్ లోని 43 జిల్లాలలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ లోనూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, పాత ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకు దూరంగా ఉండాలన్న సూచనలను విస్మరించి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, ఆచార్యులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనల వల్ల 20 మెట్రో స్టేషన్ లు మూసి వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ వైపు ఉచిత వైఫై సేవలను ప్రారంభించగా మరో వైపు ఇంటర్నెట్ సేవలను, ఎస్సెమ్మెస్ లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళనలతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఢిల్లీలో గురుగ్రామ్ మార్గంలో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బంది సకాలంలో చేరుకోలేక 19 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

జనవరి 1 నుండి టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధి కోసం సంస్కరణల బాటపడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జనవరి 1 నుంచి సరుకు రవాణాకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డిపో గూడ్స్ ట్రాన్స్ పోర్టు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి విడతగా 1209 మంది సిబ్బందిని.. 822 ఆర్టీసీ డిజీటీ సర్వీసులను ఆర్టీసీ తెస్తోంది. ఒక్కో డిపోకు 2 డీజీటీ వెహికల్స్ ను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాదులోని 29 డిపోలో సుమారు 60 టీజీటీలు అందుబాటులోకి రానున్నాయి. మిగతా వాటిని జిల్లాలోని డిపోలకు పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1 న ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాల మేరకు టీఆర్ఎస్ ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సరుకు రవాణా విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అందుకు ముహూర్తం విధివిధానాలను ఖరారు చేసింది. జనవరి 1 నుంచి సరుకు రవాణా రంగంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది, ఇందు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక కిలోమీటర్లు తిరిగి కండిషన్ లో ఉన్న వెయ్యి బస్సులను సరుకు రవాణాకు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. వాటిని బస్ బాడీ బిల్డింగ్ లకు పంపిస్తున్నారు, బస్సుల రద్దుతో అదనంగా ఉండే ఉద్యోగులను కార్గో సర్వీసులను వినియోగించుకోనున్నారు.  ఆర్టీసీ సంస్కరణలపై ఉన్నతాధికారులతో రవాణశాఖామంత్రి పువ్వాడ అజయ్ సమీక్షించారు, ఆర్టీసీ అభివృద్దిపై చర్చించారు. సరుకు రవాణాకు వసూలు చేసే చార్జీలపై వేర్వేరు డిపోల పరిధిలో అధ్యయనం చేసి ఆయా డిపో మేనేజర్ లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. సరుకు రవాణా బస్సులకు ఎర్ర రంగు వేయాలని నిర్ణయించారు. సరుకు రవాణా కోసం పని చేసే డ్రైవర్ లు సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆపరేటర్ లకు దీటుగా పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. తమకున్న విస్తృతమైన నెట్ వర్క్ ఆధారంగా సరుకు రవాణా రంగంలో విజయం సాధిస్తామని ఆర్టీసీ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ ఆర్టీసీలో కార్గో సేవలను దశల వారీగా విస్తరించనున్నారు. మొదటి దశలో వివిధ ప్రాంతాలు జిల్లాలో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్ స్వీకరిస్తారు, తరువాత ప్రభుత్వానికి సంబంధించి వస్తు రవాణా చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో మొదట వ్యవసాయ పౌరసరఫరాల శాఖ రవాణాపై దృష్టి సారించనున్నారు. పీడీఎస్ బియ్యం, వ్యవసాయోత్పత్తులు తదితరాలను ఆర్టీసీ కార్గో ద్వారా తరలిస్తారు. తదుపరి విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ శాఖలకు విస్తరించాలని అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రైవేట్ కార్గో సర్వీసులకు ధీటుగా ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తామని అధికారులు విశ్వాసంగా చెప్తున్నారు. మరోవైపు ప్రజాప్రతి నిధులంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని లేఖలు రాసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ నెల 24 న గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల ఉద్యోగులతో వనభోజనాలు చేయాలని నిర్ణయించారు.

ఇవ్వాలా వద్దా అన్న ధర్మసందేహంలో ఆలయ అధికారులు...

శారదా పీఠం వారు పంపిన ప్రతిపాదనకు కొందరు ఆలయ అధికారులు ఏమి చేయాలా అన్న అయోమయంలో పడిపోయారు. జనవరి 3 వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని స్వరూపానందేంద్ర నిర్ణయించారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సాయం చెయ్యాలి అంటూ గత నెల 11 న విశాఖ శారదా పీఠం నుంచి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు లేఖను పంపారు. మహాసభల నిర్వహణకు తగిన ఆర్థిక సహాయం అందించాలని శారదా పీఠం వారిని కోరింది. ఈ లేఖను పరిశీలించి పరిగణన లోకి తీసుకోవాలని మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ కు సిఫారసు చేశారు.కమిషనర్ ఇదే ప్రతిపాదనను శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాల ఈవోలుకు అందజేశారు.  స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభల నిర్వహణ కోసం ఆర్థిక సహాయం కోరారు. హిందూ సనాతన ధర్మ ప్రచారం కోసం ఉద్దేశించిన కార్యక్రమానికి నిధులు ఇచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉంటే, పరిగణనలోకి తీసుకోవటానికి తగిన ప్రతిపాదనలు పంపించండని దేవాదాయ శాఖ కమిషనర్ 5 ప్రధాన ఆలయాల ఈవోలకు లేఖ రాశారు. కమిషనర్ లేఖ అందుకున్నఆయా దేవస్థానాల అధికారులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే భక్తులిచ్చే కానుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అవసరాలకు వాడుకోవాలి, ఎలాంటి ధార్మిక కార్యక్రమాలనైనా దేవస్థానమే నిర్వహించాలి. కానీ తమ ఆలయానికి దేవాదాయ శాఖకు సంబంధం లేకుండా ఒక పీఠం నిర్వహించే సొంత కార్యక్రమానికి దేవుడు డబ్బులు ఇవ్వొచ్చా అనే సందేహం ఆ ఆలయ అధికారులల్లో మొదలైంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహాసభలు నిర్వహించడం మంచిదే, కానీ అందుకు ఇతర దేవస్థానాల సొమ్మును పంపాలి అనడం శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా లేదని దేవాదాయ శాఖ అధికారులల్లో ఒకరు అభిప్రాయపడ్డారు. స్వయంగా సర్కారు పెద్దలకు దగ్గరైన స్వామి కావడం పరిగణనలోకి తీసుకొని పరిశీలించాలని దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాయడంతో ఆయా దేవస్థానాల అధికారులు దీని పై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.మరి ఆలయ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

తెలంగాణలో లోకాయుక్త, ఉపలోకాయుక్త నియామకం

తెలంగాణలో కొన్ని స్థానాలను భర్తి చేయడం ప్రారంభించారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా జస్టిస్ చింతంపంటి వెంకటరాములు, ఉపలోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్ రావు నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ గా జస్టిస్ గుండె చంద్రయ్య, సభ్యులుగా సెషన్స్ కోర్ట్ జిల్లా జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడిషియల్ సభ్యుడిగా మహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, ఉపలోకాయుక్త పదవీకాలం ఐదేళ్ల పాటు ఉండగా, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ లను ఈ నెల ఇరవై కల్లా నియమించాలి అంటూ హై కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నియామక కమిటీలు ప్రగతి భవన్ లో భేటీ అయ్యాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఈ కమిటీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం శాసన సభాపక్ష ఉపనేత పాషా ఖాద్రి, మండలిలో ఎంఐఎం పక్ష నేత జాఫ్రీ ఉన్నారు. హక్కుల కమిషన్ కు సంబంధించిన కమిటీలో అదనంగా హోంమంత్రి మహమ్మద్ అలీ ఉన్నారు. లోకాయుక్త, ఉపలోకాయుక్త హక్కుల కమిషన్ చైర్మన్ సభ్యుల పేర్లను ఈ కమిటీలు గవర్నర్ తమిళిసైకి పంపారు. ఆమె ఆమోదించటంతో ఉత్తర్వులను ఇచ్చారు.  జస్టిస్ సివి రాములు నిజామాబాద్ జిల్లా ఆచన్ పల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. 1978 లో మహారాష్ట్ర లోని యశ్వంత్ లా కాలేజిలో ఎల్ఎల్బి పూర్తి చేసుకున్నారు. ఇరవై నాలుగేళ్ల పాటు ఉమ్మడి ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. ఏపీ హై కోర్టు అడిషనల్ జడ్జిగా 2002లో, జడ్జిగా 2004 లో బాధ్యతలు స్వీకరించగా 2011 లో ఫిబ్రవరి 9 న పదవీ విరమణ చేశారు. ఉపలోకాయుక్తగా నియమితులైన నిరంజన్ రావు, న్యాయ శాఖ కార్యదర్శిగా పని చేశారు. జస్టిస్ జి చంద్రయ్య ఆదిలాబాద్ జిల్లా తిమ్మాపూర్ లో 1954 మే 10న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంఎ చదివారు. ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా 1980లో పేరు నమోదు చేసుకున్నారు.హై కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా కూడా ఈయన పని చేశారు. 2005 లో హై కోర్టు అడిషనల్ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2006 ఫిబ్రవరి 20 న జడ్జీగా నియమితులైన ఆయన 2016 లో పదవీ విరమణ చేశారు. 

పవన్ ఢిల్లీ దెబ్బ... విశాఖ వైసీపీలో గుబులు!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలను తూటాళ్లా వాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పవన్ గురించి జనసేన గురించి చులకనగా మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకూ మెల్లమెల్లగా తత్వం బోధపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారని ఆ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే మిగిలాడని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు తమ నోరు అదుపులో పెట్టుకుంటున్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ తరువాత పవన్ కళ్యాణ్ తన రూటు మార్చుకున్నారు. విమర్శల దాడితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ పరిణామంతో విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలవరపడుతున్నారు.జనసేన పార్టీ అధినేత పవన్ జోరు పెంచడంతో అధికార పక్షం పై మాటల తూటాలు పేల్చుతూ వుండడంతో విశాఖ జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఇటీవల తిరుమలలో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు షాకిచ్చాయి. బిజెపితో తనకేమీ తగాదా లేదని జనసేనాని ప్రకటించడం గమనార్హం. లాంగ్ మార్చ్ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలను జనసైనికులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ నేతలను ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసు అని ప్రజాసమస్యల పై ఢిల్లీ పెద్దల్ని కలుస్తాను అని పవన్ స్పష్టం చేశారు. పరిధి దాటితే తాట తీస్తా అని కూడా గట్టిగా హెచ్చరించారు.  ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో భేటీ అయిన సంగతి తెలిసిందే, బిజెపి చీఫ్ అమిత్ షా అంటే తనకెంతో గౌరవం అని కూడా ఆయన ప్రకటించారు.ఈ ఘటనల తర్వాత విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. బిజెపికి జనసేన దగ్గరవుతోందన్న అభిప్రాయాన్ని కొందరు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో పవన్ పరపతి రోజురోజుకి పెరుగుతూ ఉంటే సీఎం జగన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోందని కూడా కొందరు చెప్పుకుంటున్నారు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సంగతి కూడా అందరికి తెలిసిందే, ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాను కూడా ఆయన కలుస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్భాటంగా ప్రచారం చేశారు.కానీ ఏపీ సీఎం జగన్ వారిద్దరినీ కలవకుండానే అమరావతికి తిరిగొచ్చారు. జగన్ ఢిల్లీ టూర్ తర్వాత విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నిరాశ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బిజెపి పెద్దలు జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అంటూ జనసేన నాయకులు ఎద్దేవా చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. టిడిపి, బిజెపి వామపక్షాల జోరు పెంచడం విశాఖ రాజకీయ చిత్రాన్ని మార్చక తప్పదని వారు విశ్లేషిస్తున్నారు.జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీడ్ కు బ్రేక్ వేయాలంటే విశాఖలో సీఎం జగన్ పర్యటించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చాల్సిన అవసరం ఎంతయిన ఉంది. మరి జగన్ దీనికి ఏ ఎత్తు గడలు వేస్తారో వేచి చూడాలి.

3 రాజధానుల పట్ల సొంత పార్టీలోని నేతలు సైతం వ్యతిరేకత!!

ఏపీకి 3 రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటనకు రకరకాల విమర్శలు ఎదురైయ్యాయి.రాజధాని పట్ల పలువురు అనేక రాకాలుగా స్పందిస్తుండగా, ప్రతిపక్షనేతలే కాదు తమ సొంత పార్టీ నేతల సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. అసెంబ్లీతో పాటు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతి లోనే ఉండాలని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. అడ్మినిస్ర్టేషన్ అంతా ఒకే చోట నుంచి చేస్తే బావుంటుందన్న గోపిరెడ్డి ఇదే విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలన్నది తమ ఉద్దేశమని ఎమ్మెల్యే తెలియజేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలి అన్నది జగన్ ఉద్దేశమని ఆయన అన్నారు. అసెంబ్లీ తో పాటు సెక్రటేరియట్ కూడా ఒకే ప్రాంతంలో ఉండాలనేది తన అభిమతం అని ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒకే చోట నుంచి చేస్తే బాగుంటుందని తన ఆలోచనను వెల్లడించారు. విశాఖపట్నంను ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలన్నది కూడా తన అభిప్రాయమని, ఖచ్చితంగా దీన్ని జగన్మోన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ అంశం పై ఆలోచింపజేసి కమిటీ ఆదేశాలు కూడా తెలియజేయాల్సి ఉందని,కమిటీ  సలహాలను బట్టి,అందరి సలహాలు సూచనలు తప్పక తీసుకొని దాని అనుగూణంగా నిర్ణయం తీసుకుందామని జగన్ గారు వెల్లడించినట్లు గోపిరెడ్డి పేర్కొన్నారు. ఈ అంశాలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రాంతాలన్ని అభివృద్ధి చెందాలని రాయలసీమ గానీ,ఉత్తరాంధ్ర గానీ, కోస్తాంధ్ర లోని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనేది తన అభిమతమని ఆయన వెల్లడించారు. ఏదైతే అడ్మినిస్ర్టేటివ్ క్యాపిటల్ ఎత్తు అసెంబ్లీతో పాటు సెక్రటేరియట్ కూడా ఒకే ప్రాంతంలో ఉంటేనే పనులు సులభంగా ఉంటాయని గోపిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.మరి ఏపీ సీఎం జగన్ రాజధాని పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.

మరో వివాదంలో టీటీడీ... స్వరూపానంద కోసం రూల్స్ బ్రేక్

టీటీడీ అధికారులు మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమల ఆలయ సంప్రదాయాలకు, టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామికి స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరైనా తిరుమల వస్తే, శ్రీవారి ఆలయం ముందు వేద మంత్రాలతో ఇఫ్తికఫాల్ స్వాగతం పలుకుతారు. కానీ, ఆలయ నిబంధనలను, అనాదిగా వస్తోన్న సంప్రదాయాలను పక్కనబెట్టేసిన టీటీడీ అధికారులు ఏకంగా అలిపిరి గేటు దగ్గరకే వెళ్లి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామికి స్వాగతం పలికారు. కేవలం స్వాగతమే కాదు... వేద మంత్రాలతో ...టీటీడీ వేద పారాయణ అర్చకుల చేత ఆహ్వానం పలికించారు. అదే సమయంలో, అలిపిరి గేటు దగ్గరే స్వరూపానందేంద్రను మంత్రి బుగ్గన, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కలుసుకున్నారు. అయితే, టీటీడీ అధికారుల నిర్వాకమంతా బుగ్గన, చెవిరెడ్డి సమక్షంలోనే జరిగిందో ఏమో తెలియదు గానీ, అలా స్వాగతం పలికారో లేదో అంతలోనే మంత్రి, ఎమ్మెల్యే కలిసి స్వరూపానందను శాలువాతో సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, అనాదిగా వస్తోన్న సంప్రదాయాలకు విరుద్ధంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు అలిపిరి గేటు దగ్గర వేద మంత్రాలతో టీటీడీ వేద పారాయణ అర్చకుల చేత స్వాగతం పలికించడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. అసలు, ఎవరి మెప్పు కోసం టీటీడీ అధికారులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రశ్నిస్తున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులను గౌరవించడం హిందూ సంప్రదాయమైనప్పటికీ, టీటీడీ ఆనవాయితీకి విరుద్ధంగా వ్యవహరించడం అపచారమంటున్నారు. అంతేకాదు, శ్రీవారి గర్భాలయంలోని ఏ వస్తువును కూడా బయటికి తీసుకురాకూడదు. శ్రీవారికి అలంకరించిన పూలదండలను కూడా బయటికి తేకూడదు. అలాంటిది గర్భాలయంలో శ్రీవారి శంఖం దగ్గర అలంకరించే బంగారు చిలుకను తీసుకొచ్చి  స్వరూపానంద చేతిలో పెట్టారని, ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధమని మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు శ్రీవారికి సేవ చేయాలే గానీ, ఇలా మఠాధిపతులు, పీఠాధిపతులకు సేవకులుగా మారకూడదని మండిపడుతున్నారు. సంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయం ముందు స్వాగతం పలికితే తమకు అభ్యంతరం లేదు కానీ... ఇలా అలిపిరి గేటు దగ్గరకు, విమానాశ్రయానికి వెళ్లిమరీ రాజకీయ పార్టీ కార్యకర్తల్లా టీటీడీ అధికారులు వ్యవహరించడమంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను మంటగలపడమేనని మండిపడుతున్నారు. టీటీడీ అధికారుల తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, ధర్మానికి విరుద్ధంగా... ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కడం మంచిదికాదని అంటున్నారు. టీటీడీ అధికారులు తమ పరిపతిని పెంచుకునేందుకు, స్వార్థ ప్రయోజనాల కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు.  

అమెరికాలో అభిశంసన అలజడి... ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి గట్టి షాక్ తగిలింది. ఊహించినట్లుగానే అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. డెమోక్రాట్లు అధికంగా ఉండే యూఎస్ దిగువ సభలో ముందుగా ఊహించినట్లే మెజారిటీ సభ్యులు ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి మద్దతిచ్చారు. అయితే, అభిశంసన తీర్మానానికి ముందు డొనాల్డ్ ట్రంప్.... ప్రతినిధుల సభ స్పీకర్‌కు భారీ పేజీల లేఖ రాశారు. డెమోక్రాట్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించాలంటూ కోరారు. అయితే, ట్రంప్ లేఖను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని స్పీకర్... అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. ప్రతినిధుల సభలో మొత్తం 230 సభ్యులుండగా... 197 ఓట్లు.... అభిశంసన తీర్మానానికి అనుకూలంగా, ట్రంప్‌కి వ్యతిరేకంగా పడ్డాయి. దాంతో, అమెరికా చరిత్రలో అభిశంసనను ఎదుర్కొంటున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అయితే, యూఎస్‌ దిగువ సభలో ట్రంప్‌కి ఎదురుదెబ్బ తగిలినా... ఇప్పటికిప్పుడు పదవికి వచ్చే ముప్పేమీ ఉండదు. సెనెట్‌లో కూడా అభిశంసన తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ సెనెట్‌లో ట్రంప్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న రిపబ్లికన్లదే పైచేయి కావడంతో ఇక్కడ అభిశంసన అంత ఈజీ కానే కాదు. ఇదిలాఉంటే, ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన వెంటనే ట్రంప్‌కి వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు జోరందుకున్నాయి. ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని, వెంటనే తొలగించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నిరసన ప్రదర్శనలతో అమెరికా హోరెత్తిపోతోంది.   

రాజధాని రాజకీయం... పార్టీల మధ్య నలిగిపోతున్న రైతులు...    

ఏపీలో రాజధాని రగడ రోజురోజుకీ మరింత తీవ్రమవుతోంది. ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై అమరావతి రైతులు భగ్గుమన్నారు. సీఎం జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ 29 రాజధాని గ్రామాల్లో రైతులు బంద్ నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో పెద్దఎత్తున నిరసన తెలిపారు. రాజకీయాలకు తమను బలి చేయొద్దంటూ రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని, లేదంటే తెలంగాణ తరహా ఉద్యమానికి సైతం వెనుకాడబోమని రాజధాని రైతులు హెచ్చరించారు.  రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు తమకు ప్లాట్లు అప్పగించలేదని, మూడు రాజధానుల వ్యాఖ‍్యలతో అమరావతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే గానీ, పరిపాలనా వికేంద్రీకరణ కాదంటోన్న అమరావతి రైతులు... ఏపీకి మూడు రాజధానులు రావొచ్చంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాజధాని రైతుల బంద్ తో అమరావతిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. సచివాలయానికి వెళ్లే రహదారిపై రాస్తారోకో నిర్వహించి రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో, పలు గ్రామాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే, రాజధానిపై పార్టీల మధ్య జరుగుతోన్న పోరుతో రైతులు నలిగిపోతున్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం రాజధాని కోసం భూములిచ్చినా తమకెందుకీ పరిస్థితి అంటూ ప్రశ్నిస్తున్నారు.  పార్టీల మధ్య రాజకీయ పోరులో అమాయకులైన అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.

బాబుకి షాకుల మీద షాకులు.. వ్యతిరేకిస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే!!

ఏపీలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పలువురు నేతలు టీడీపీని వీడారు. మరికొందరు వీడేలా ఉన్నారు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబుకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆఖరికి అసెంబ్లీలో కూడా చంద్రబాబు వన్ మాన్ ఆర్మీలా పోరాడాల్సొస్తుంది. దీనికి తోడు కొందరు నేతలు వైఎస్ జగన్ సర్కార్ కి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ బాబుని మరింత ఇబ్బందిపెడుతున్నారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో మూడు రాజధానులు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని బాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. కొందరు టీడీపీ నేతలు మాత్రం జగన్ నిర్ణయం శభాష్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. దీంతో బాబు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.  జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన రోజే.. టీడీపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేస్తామని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా చేరిపోయారు. జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల్లోని టీడీపీ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు. అమరావతి మరో వందేళ్లయినా అభివృద్ధి చెందే అవకాశం లేదన్న కొండ్రు మురళి.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖని పరిపాలన రాజధాని చేయడం వల్ల మరింత డెవలప్ అవుతుందని అన్నారు. తనకు పార్టీ కన్నా ప్రాంతం ముఖ్యమని చెప్పిన ఆయన.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీడీపీకి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరేందుకు గంటా రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా.. కొండ్రు మురళి కూడా టీడీపీని వీడాలన్న ఆలోచనతోనే ఈ వ్యాఖ్యలు చేసారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నామినేటెడ్ పదవులను సీఎం ఎప్పటికి భర్తి చేయనున్నారు...

రెండవసారి అధికారంలోకి వచ్చాక గులాబీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల్ని ఇంకా భర్తీ చేయలేదు. ఈ ఏడాదిలో కేవలం 3,4 పదవులు మాత్రమే ఇచ్చారు. అందులో రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి ఒక్కటే కీలకమైనది. ఈ పదవికి కూడా చాలా మంది సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. చివరికి ఈ పదవిని పల్లా రాజేశ్వర్ రెడ్డికి కట్టబెట్టారు. కీలకమైన పలు పదవుల భర్తీలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పదవులను భర్తీ చేస్తాం అంటూ హామీయిచ్చారు కేసీఆర్. చెప్పిన మాట ప్రకారమే పదవుల భర్తీకి ఆర్డినెన్స్ కూడా తీసుకువచ్చారు.ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి ఇంకా పదవులు జాతర మొదలవుతుంది అనుకున్నారు ఆశావహులు. కానీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా పదవుల పై ప్రగతి భవన్ నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్ లో చోటు దక్కని సీనియర్ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాజిరెడ్డి గోవర్దన్, నాయిని నర్సింహరెడ్డి, దానం నాగేందర్, పట్నం మహేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రెడ్యా నాయక్ లాంటి సీనియర్ లతోపాటు పలువురు ఎంపీలు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ పెద్దల వద్ద తమకు తగిన పోస్టులు గురించి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కొందరు అభ్యర్ధులు. రైతు సమన్వయ సమితి పదవి భర్తీ కావడంతో ఇప్పుడు అందరి కన్ను ఆర్టీసీ ఛైర్మన్, మూసీ రివర్ బోర్డు, హుడా లాంటి పదవులపై పడింది. వీటి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు నేతలు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే పార్టీలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న నాయకుల పరిస్థితి గందరగోళంగా మారింది. 2014 లో అధికారంలోకి వచ్చాక పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులని పార్టీలోని సీనియర్ నాయకులకు కట్టబెట్టారు కేసీఆర్. అయితే దాదాపుగా అన్ని కార్పొరేషన్ ల పదవీ కాలం ముగిసి నెలలు కావస్తున్నా వారికి రెన్యువల్ మాత్రం జరగలేదు. రెన్యువల్ కోసం గులాబీ పెద్దల చుట్టూ తిరిగినా ఒకరిద్దరికి మాత్రమే పదవులను కొనసాగించగలిగే అదృష్టం దొరికింది. మెజార్టీ నేతలు మాత్రం రెన్యువల్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. గతంలో పార్టీ కోసం పని చేసే వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేవారు. ఈసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ,ఎంపిలకు కూడా పదవులు ఇస్తామంటున్నారు. దీంతో తమకు రెన్యూవల్ ఉంటుందా లేదా అని కొందరు పదవులు ఉంటాయా ఊడతాయా అని మరికొందరు బెంగ పడుతున్నట్టు సమాచారం.  సీఎం నామినేటెడ్ పదవులను ఎప్పటికి భర్తీ చేస్తారా అని నేతలంతా ఎదురుచూస్తున్నారు.

రాజధాని పై కలవరపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు!!

అసలు రాజధాని ఏంటి అనేది అందరిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం రేపుతోంది. 3 రాజధానులే నిజమైతే కనుక మళ్లీ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనా అని కొందరిలో ఆందోళన ఇప్పటికే మొదలైయింది. కుటుంబ సభ్యులను చూసేది రెండుమూడు వారాలకొక్కసారేనా ఇప్పటి నుంచి ఆ అదృష్టాన్ని కూడా దూరం చేస్తారా అని కుటుంబాలను హైదరాబాద్ లోనే పెట్టిన వారి ఆవేదన. సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు 2016,17లో తరలి వచ్చేశాయి. పిల్లల చదువులు సొంత ఇళ్లు ఇతర అవసరాల రిత్యా హైదరాబాద్ విడిచి వచ్చేందుకు ఉద్యోగులు అయిష్టత చూపారు. దీంతో అమరావతి నుంచి పనిచేయ్యండి, తమకు ఏం కావాలో చెప్పండి అంటూ చంద్రబాబు వారికి అనేక వసతులు కల్పించారు. సచివాలయం హెచ్ఓడీల సిబ్బందికీ వారానికి ఐదు రోజుల పని దినాలు నిర్ణయించారు. కుటుంబాలను వదిలిపెట్టి ఒంటరిగా వచ్చిన వారికి విజయవాడలో ఉచితంగా వసతి కల్పించారు. హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు సులువుగా ఉండేందుకు కేంద్రాన్ని ఒప్పించి కొత్త రైలు వేయించారు. ఉద్యోగులు కూడా ఇబ్బందులున్నప్పటికీ అమరావతికి వచ్చి పని చేస్తామంటూ సంసిద్ధత వ్యక్తం చేశారు. రాజధాని ఇక్కడే ఉద్యోగులు ఇక్కడే ఎన్నాళ్లని హైదరాబాద్ చుట్టూ తిరుగుతాము అనుకొని చాలా మంది ఉద్యోగులు విజయవాడ, గుంటూరుల్లో స్ధిరపడిపోయారు. కొందరు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. పిల్లల చదువులు జీవిత భాగస్వామి ఉద్యోగం వంటి కారణాలు ఉన్నవారు మాత్రం కుటుంబాలనూ అక్కడే ఉంచి ప్రతి వారం హైదరాబాద్ కు వెళ్లొస్తున్నారు. ఇప్పుడు రాజధాని విశాఖపట్నం మారితే మళ్లీ ఇబ్బందులు తప్పవని ఉద్యోగులు పేర్కొంటున్నారు.  మూడు రాజధానులు ఉండొచ్చు అన్న ముఖ్యమంత్రి ప్రకటన పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రత్యక్ష ప్రభావం పడే ఉద్యోగుల్లో దీని పై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశంపై స్పందించక పోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యోగాలకు చిన్న ఇబ్బంది కలిగించే ప్రకటన వచ్చినా ప్రభుత్వం పై విరుచుకుపడే ఉద్యోగ సంఘాలు ఇప్పుడెందుకు మౌనంగా వున్నాయని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో అన్ని సిద్ధం అయిన తరువాత ఇప్పుడు ఎందుకు చెడగొడుతున్నారు అని, రాజధాని నిర్ణయం ఒకసారే జరుగుతుందని అక్కడి ఉద్యోగులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మార్చటం ఎక్కడైనా ఉందా, వచ్చే ఎన్నికల్లో మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్లీ రాజధానిని మారుస్తారా, మళ్లీ తాము తట్టా బుట్టా సర్దుకొని వచ్చేయాలా అని ప్రశ్నిస్తున్నారు.  అంతేకాదు అమరావతి పరిధిలో అనర్హులకు ప్లాట్ల కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. భూమి లేని నిరుపేదలు సాగు చేసుకొని జీవనం సాగించేందుకు వీలుగా ప్రభుత్వం వారికి అసైన్డ్ భూములు కేటాయించింది. వీటిని ఇతరులు కొనడం నిషిద్ధమైనప్పటికీ రాజధానిగా అమరావతి ప్రకటన అనంతరం అసైన్డ్ రైతుల నుంచి పలువురు కొనుగోళ్లు చేశారు. ఆ తర్వాత వాటిని పూలింగ్ కింద ఏపీసీఆర్డీయేకు ఇచ్చి బదులుగా రిటర్నబుల్ ప్లాట్లను పొందారు. దీనిపై పలు ఫిర్యాదులు అందటంతో అమరావతిలోని అసైన్డ్ భూముల అనధికారిక క్రయ విక్రయాలపై ప్రభుత్వం విచారణ జరిపించింది. ఇందులో ఇప్పటి వరకు సుమారు 300 ఎకరాల అసైన్డ్ భూములను అనర్హులైన పలువురు సాగుదార్ల నుంచి కొని సీఆర్డీఏకు పోలింగ్ లో ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్లు పొందినట్లు తేలింది. వీరందరూ పొందిన రిటర్నబుల్ ప్లాట్లన్నింటి విస్తీర్ణం దాదాపు 34 ఎకరాలు ఉన్నట్టు సమాచారం. ఆ ప్లాట్ల కేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరి ఈ రాజధాని రగడ ఎప్పటికి తీరేనో వేచి చూడాలి.

తెలుగు యువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్!!

మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత టీడీపీకి వరసన ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీకి బలమనుకున్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే పార్టీని కూడా వీడారు. వారి స్థానంలో మరొకరిని నియమించటం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి వాటిలో ఒకటి తెలుగు యువత అధ్యక్ష స్థానం. మొన్నటి వరకు ఈ స్థానంలో దేవినేని అవినాష్ ఉండేవారు. విజయవాడలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్, విభజనకు ముందు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014 లో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి టిడిపిలో చేరారు. నెహ్రూ మరణంతో అవినాష్ కు చంద్రబాబు ధైర్యం చెప్పి తెలుగు యువత బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో గుడివాడ నియోజక వర్గం టికెట్ కూడా కేటాయించారు కానీ ఈయన కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదంటూ వైసీపీలోకి మొగ్గు చూపారు. దీంతో పార్టీలో తెలుగు యువత అధ్యక్ష స్థానం ఖాళీ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ పేరు గట్టిగా వినిపిస్తోంది .  అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన పేరు పరిటాల, ఒకప్పుడు పెత్తందారులకు వ్యతిరేకంగా నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న పరిటాల రవీంద్ర, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భూస్వాములకూ, పెత్తందారులకు, నియంతలకు ఎదురు తిరిగిన రవి తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. ఆయనకి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. పరిటాల రవి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాక ఆయన స్థానంలో ఆయన సతీమణి సునీత వచ్చారు. ఆమెను కూడా అభిమానులు కార్యకర్తలు గుండెల్లో పెట్టుకున్నారు. వైయస్ లాంటి బలమైన నేతల ప్రభావంతో కాంగ్రెస్ విజయం సాధించిన కాలంలో కూడా వరుసగా 3 సార్లు గెలిచి అయిదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో రవి వారసుడిగా రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే రవి ఆధిపత్యం మొదలైన నాటి నుంచి తొలిసారి ఈ ఎన్నికల్లో ఓటమి చూసింది పరిటాల ఫ్యామిలీ. రాష్ట్రమంతా వైసిపి గాలి వీయడంతో ఇక్కడ కూడా ఓటమి తప్పలేదు. దీంతో ఒకింత నైరాశ్యంలో ఉండిపోయారు పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్. ఈ క్రమంలో పరిటాల కుటుంబం పార్టీ మారుతుందన్న పుకార్లు  కూడా వినిపిస్తున్నాయి. దీనికి స్పందిస్తూ తాము ఏ పార్టీకి మారడం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది ఆ కుటుంబం. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న శ్రీరామ్ కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారన్న వార్తలొచ్చాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ న్యూస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.మరి ఈ కష్ట కాలం నుంచి యువతను పార్టీ నుంచి జారిపోకుండా బాబు ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.