సామాన్యులపై మరో పిడుగు..! పెనుభారం మోపేందుకు కేంద్రం అడుగులు
చలికాలంలోనూ ధరలు మండిపోతుంటే... సామాన్యులపై మరింత పెనుభారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఆర్ధిక మందగమనం... మరోవైపు వినిమయశక్తి పడిపోవడంతో... పన్ను ఆదాయ లోటును పూడ్చుకునేందుకు అడుగులు వేస్తోంది. జీఎస్టీ రేట్లను పెంచేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ప్రస్తుతమున్న జీఎస్టీ స్లాబ్స్ను కుదించి... రేట్లను పెంచేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం జీఎస్టీ స్లాబ్స్ ను, మూడింటికి కుదించి ...8, 18, 28 శాతం చొప్పున అమలు చేయాలని భావిస్తోంది. కేంద్రం ఆశించినస్థాయిలో జీఎస్టీ ఆదాయం రాకపోవడంతోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ ఆర్ధిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం అనుకున్నదాని కంటే 40 శాతం తగ్గింది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 5లక్షల 26వేల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేయగా... కేవలం 3లక్షల 28వేల 365కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా 2017 నుంచి ఇప్పటివరకు నిర్దేశించుకున్న లక్ష్యాలను కేంద్రం అందుకోలేకపోతోంది. అయితే, కనిష్ట పన్ను స్లాబు 5శాతాన్ని 8శాతానికి పెంచితే అదనంగా 3వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. కానీ, ఈ స్లాబ్ రేటును పెంచితే నిత్యవసర ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా ఆహారోత్పత్తులు, సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలు భారీగా పెరగడం ఖాయమంటున్నారు. అలాగే, జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు హెల్త్ కేర్ రంగాన్ని 18పర్సంటేజ్ స్లాబ్లోకి చేర్చే అవకాశం కనిపిస్తోంది. దాంతో, సామాన్యులపై పెనుభారం పడుతుందని చెబుతున్నారు. అలాగే, మొబైల్స్ ఫోన్స్ పైనా జీఎస్టీ రేట్లు పెంచాలని కేంద్రం చూస్తోంది.
ఆర్ధిక మందగమనంతోపాటు మార్కెట్లో గిరాకీ తగ్గిన కారణంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. దాంతో, జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోవడమే కాక, పలు రాష్ట్రాలకు పన్ను పరిహారం చెల్లింపులు పెండింగ్ లో పడ్డాయి. మరోవైపు, ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో, అదనపు ఆదాయం కోసం జీఎస్టీ రేట్లు పెంచడం తప్ప మరో మార్గం లేదని మోడీ సర్కారు భావిస్తోందని అంటున్నారు. ప్రస్తుతమున్న నాలుగు స్లాబులను మూడింటికి కుదించడంతోపాటు రేట్లు పెంచడం... అలాగే జీఎస్టీకి అదనంగా విధించే సుంకాన్ని కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ప్రస్తుతమున్న 5 పర్సంటేజ్ స్లాబ్ను 3శాతం పెంచి 8 చేయడం... అలాగే, 12శాతం స్లాబ్ను ఎత్తివేసి... దాన్ని 18లో విలీనం చేయనున్నారు. ఇక, చివరిదైన 28శాతం స్లాబ్ను యథాతథంగా ఉంచి సెస్ పెంచనున్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 18న జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో స్లాబ్స్ కుదింపు... రేట్ల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.