సుప్రీం ఆదేశాలు భేఖాతర్.. స్థానిక ఎన్నికలకు పాత రిజర్వేషన్లనే అమలు చేయనున్న వైసీపీ ప్రభుత్వం

స్థానిక ఎన్నికల్లో పాత కోటానే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్ల పై సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలను ఇంకొంత కాలం వాయిదా వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లుగా కనిపిస్తుంది. పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశం అందులో భాగమేనన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను కాదని ముందుకెళ్తూ ఉండటంతో వెంటనే ఎన్నికలు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని స్పష్టమవుతోందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలో 60.15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కోరిన సుప్రీం అంగీకరించలేదు. దీంతో 50 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఇవన్నీ తెలిసినప్పటికి మన రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో 60.15 కోటా అమలుకు పరిచేందుకు సన్నహాలు చేస్తుంది. ఇందు కోసం తీసుకురావల్సిన ఆర్డినెన్స్ పై కేబినెట్ లో చర్చించి నిర్ణయించనున్నట్లు సమాచారం. పంచాయితీ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఇప్పటికే హై కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలు సకాలంలో ఎందుకు నిర్వహించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రిజర్వేషన్లను ఖరారు చేయక పోవటంతో ఆ ప్రక్రియ ప్రారంభించ లేక పోయామని యస్ఈసి సమాధానం ఇవ్వడంతో ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల జాప్యం చేసేందుకు హైకోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని తెలిసే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల మెలిక తెచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్లు 50 శాతానికి కుదిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సి ఉన్నా ఇటీవలి శీతాకాల సమావేశాల్లో ఆ పనిచేయలేదు. ఆర్డినెన్స్ ద్వారా 50 శాతం రిజర్వేషన్లను అంశం తెస్తారని అందరూ భావించారు.  దీనికి హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ అంగీకరించవని తెలిసే ముందుకెళ్తూ ఉండటం వెనుక ఏ కారణం గానైనా కొంత మేర జాప్యం చేయవచ్చునన్న వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి రిజర్వేషన్లు పెట్టడంలో బీసీలకే నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కుదిస్తే బీసీల్లో అసంతృప్తి పెచ్చురిల్లుతుందని వైసీపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఎప్పటిలానే రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టు ఆదేశాల ప్రకారం చేశామని ప్రచారం చేసుకునేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారం చేపట్టగానే వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారని సర్వత్రా భావించారు. ఆ ఊపులోనే ఎన్నికలు నిర్వహిస్తే క్లీన్ స్వీప్ చేయవచ్చనుకున్నారు. అయితే సీఎం జగన్ గ్రామ సచివాలయాల ఏర్పాటు పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఆరు నెలల్లోపు పేదలకు వైసీపీ ప్రభుత్వ మార్కు చూపించి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం.. వివిధ పథకాలు ఇంకా అమలు దశలో ఉండడం ఇసుక ఇబ్బందులతో పాటు గ్రామీణ పట్టణ ప్రజల్లో అసంతృప్తి పెల్లుబకడంతో ఇంకొంత కాలం ఆగి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ప్రభుత్వం.  

కేబినెట్ భేటీ ముగిసింది.. అయినా వీడని సస్పెన్స్!!

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో రాజధానికి సంబంధించి జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదిక గురించి, అలాగే స్థానిక ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానులపై నిర్ణయం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం. వీటితో పాటు రాజధాని రైతులకు ఇచ్చే రిటర్నబుల్‌ ప్లాట్స్‌ అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.  సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రాజధానిపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. రిపోర్ట్‌ వచ్చాక ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తామని తెలిపారు. కాగా.. రాజధానిపై వచ్చే నెల 3న బీసీజీ నివేదిక ఉంటుందని సమాచారం. నివేదికపై అధ్యయనం చేసిన తర్వాతే రాజధానిపై ఫైనల్‌గా ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని తెలుస్తోంది. జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలు పరిశీలించిన అనంతరమే ప్రకటన ఉంటుందని సమాచారం.

కేటీఆర్ సీఎం... కేసీఆర్ సూపర్ సీఎం... శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల అర్ధమిదేనా?

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ కేటీఆర్ ... త్వరలో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి అనుకూలంగా కామెంట్స్ చేశారు. కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది కేటీఆరే అన్నారు. ఇది చిన్న పిల్లాడికి కూడా తెలుసంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.... కేటీఆర్ ముక్కసూటి మనిషని... ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే నడిచిన నాయకుడంటూ కొనియాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోందని... భవిష్యత్ లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే, కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నారని, త్వరలోనే పట్టాభిషేకం జరగబోతోందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక... కేటీఆర్ సీఎం... కేసీఆర్ సూపర్ సీఎం అంటూ సంచలన కథనాన్ని కూడా ప్రచురించింది. దాంతో, ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే, వచ్చే ఏడాది అంటే 2020లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు అందుకోవచ్చని అంటున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఇటీవలే కేసీఆర్ ఏడాది పూర్తి చేసుకోవడం... అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కూడా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడంతో.... కొత్త సంవత్సరంలోనే పట్టాభిషేకం జరగొచ్చని చెబుతున్నారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా పట్టాభిషేకం జరగొచ్చని అంటున్నారు. ఏదిఏమైనా నిప్పు లేకుండా పొగైతే రాదు... అంటే, కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనేది కేసీఆర్ ఆకాంక్షగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేని పరిస్థితులు నెలకొనడంతో... ఇఫ్పుడు తనయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని కేసీఆర్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కాకపోతే... మరెప్పుడనే భావనతో కేసీఆర్ ఉన్నారని, దాంతో, అతిత్వరలోనే కేటీఆర్ కి పట్టాభిషేకం జరిగిపోవచ్చని అంటున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు కూడా అందుకు సంకేతాలేనని చెబుతున్నారు.  

గమ్మున ఉండండి :- ఎన్నికల్లో ఓడిన నేతలకు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్

  2018 ఎన్నికల తరువాత టీఆర్ఎస్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అప్పటికే పదవిలో ఉన్న కొందరు నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఓటమి పాలయ్యారు. ఆయా నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరవాతి కాలంలో గులాబీ గూటికి చేరారు. నాటి నుంచి పార్టీలోకి వలసొచ్చిన ఎమ్మెల్యేలకి వారి చేతిలో ఓడిన నేతలకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. కొన్ని నియోజక వర్గాల్లో కొత్త , పాత నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతుంటే మరికొన్ని చోట్ల అంతర్గత గొడవలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తాండూరు, నకిరేకల్, పాలేరు, కొల్లాపూర్, మహేశ్వరం, వైర, పినపాక, ఎల్బీనగర్, ఎల్లారెడ్డి ఇల్లందు నియోజక వర్గాల్లో తాజా ఎమ్మెల్యేలకు గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధులకు అసలు పడటం లేదు. ఓడిన నేతలు.. టిక్కెట్లు దక్కని నేతలు.. టీఆర్ఎస్ క్యాడర్ తో సమావేశమవ్వటం ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి వారు తీసుకెళ్లారు. ఎటువంటి హోదా లేని నేతలు నియోజకవర్గాల్లో రాజకీయాలు చక్కబెడుతుంటే ఎమ్మెల్యేగా తమ పరపతి దెబ్బతింటోందని అధిష్ఠానానికి విన్నవించుకుంటున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పైలెట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జాజుల సురేందర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి ఓడిన నేతలు మాజీ మంత్రులపై ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఆయా నేతలను పిలిపించుకొని మంత్రి కేటీఆర్ మాట్లాడినట్లు గులాబి వర్గాలు చర్చించుకుంటున్నాయి. నియోజక వర్గాల్లో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశాలు నిర్వహించాలి కానీ మిగతా వారెవరూ నిర్వహించడానికి వీలు లేదంటూ అధిష్టానం స్పష్టం చేసింది. ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తూ పోతే పార్టీ కేడర్ చీలిపోయే ప్రమాదముందని కూడా హెచ్చరించింది. నియోజకవర్గాల్లో మాజీలు, సీనియర్లు పర్యటనల కూడా చేపట్టవద్దని గట్టిగా సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా నాలుగేళ్ల పాటు కేడర్ తో మమేకం కాకుండా ఉంటే తమ భవిష్యత్ ముప్పు వాటిల్లుతుందని ఓడిన నేతలు బెంగటిల్లుతున్నారు. తాజాగా పార్టీ పెద్దలు ఇచ్చిన ఆదేశాల పై వారు మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.  

సమావేశంలో స్పష్టత.. మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చెయ్యనున్న కేటీఆర్..

మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటంతో పార్టీ శ్రేణులను అలర్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో మీటింగ్ జరగనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటారు. అభ్యర్ధుల ఎంపిక.. మునిసిపాలిటీల్లో పార్టీ అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మున్సిపాలిటీ లెవెల్ లో త్రీ మెన్ కమిటీని వేసే యోచనలో గులాబీ పార్టీ అధిష్టానం ఉ న్నట్లుగా తెలుస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలకు ఇన్ చార్జిలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ఇంఛార్జులని నియమించారు. గతంలో ఇన్ చార్జిలు అందించిన నివేదికలపై పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. కార్పొరేషన్ లో కేటీఆర్ ప్రచారానికి సంబంధించి సమావేశం తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. రాజకీయంగా ఇబ్బందులు గ్రూపు తగాదాలు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ఏం చేయాలో నేతలకు కేటీఆర్ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. టిక్కెట్లు రాని అసంతృప్తులను దారిలోకి తెచ్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం తర్వాత పార్టీ ఇన్ చార్జిలు అప్పగించిన బాధ్యతలు నిర్వహించేందుకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్షేత్ర స్థాయిలో పని చేస్తారు.  

అమరావతిలో ఆధార్ లేకపోతే జైలుకే :- ఇతర ప్రాంతీయులకు రాజధానిలో ప్రవేశం లేదు

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నేపథ్యంలో రాజధాని అమరావతిలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాజధాని గ్రామాలపై అప్రకటిత కర్ఫ్యూని విధించారు. ఇప్పటికే యాంటీ నక్సల్స్ స్క్వాడ్ స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇతర జిల్లాల నుంచి దాదాపు 2000 మంది పోలీసులు అమరావతిలో మకాం వేశారు. సచివాలయం వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ప్రతి వాహనం నెంబర్ నోట్ చేసుకుంటున్నారు. అనుమానం ఉన్న వారిని ఆపి ఆధార్ కార్డ్ తనిఖీ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రాజధానిలోకి ప్రవేశించే అన్ని రూట్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బయటి వ్యక్తులు ఒక్కరు కూడా రాజధాని లోకి అడుగు పెట్టకూడదని ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందికి ఆదేశాలు అందజేశారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల వారికి రాజధాని గ్రామాల్లో ఆశ్రయం ఇవ్వొద్దని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులపై ప్రకటన చేస్తే ఏఏ గ్రామాల్లో ఏ తరహా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందనే దానిపై నిఘా వర్గాలు పూర్తి సమాచారం సేకరించాయి. దానికి అనుగుణంగా ఆయా గ్రామాలు ప్రాంతాలను ఎంచుకొని బందోబస్తును కట్టు దిట్టం చేస్తున్నారు. అన్ని ప్రధాన కూడళ్లు గ్రామాలకు వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున బారికేడ్ లను.. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే టియర్ గ్యాస్ రబ్బరు బుల్లెట్లు వినియోగించాలని అవసరమైతే లాఠీచార్జి కూడా చేయాలని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్థానికులు పోలీసులను నిలదీస్తున్నారు. మేమేమైనా నక్సలైట్లమా, టెర్రరిస్టులమా అంటూ మండిపడుతున్నారు రాజధాని ప్రజలు. ఆధార్ కార్డులు దగ్గర పెట్టుకొని తిరగాలా అంటూ తిరగబడ్డారు. తాడిపల్లిలోని సీఎం నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేని వారిని ఎవరినీ కూడా పరిసర ప్రాంతాలలోకి రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంత మంది రైతులు తమ నాయకులను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి కునేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వారిని కస్టడీ లోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

అమరావతిలో ఆందోళనలు ఉగ్రరూపం... 29 గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ...

అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ పదిరోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తోన్న 29 గ్రామాల ప్రజలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని గ్రామాల రైతులు, ప్రజలకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, న్యాయవాదులు, విద్యార్ధులు సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అమరావతి రైతులు, ప్రజల నిరసనలతో మందడం గ్రామం అట్టుడుకుతోంది. రోడ్లను దిగ్బంధిస్తున్న రైతులు వాహన రాకపోకలకు అడ్డుకుంటున్నారు. మరోవైపు రాజధాని గ్రామాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. మల్కాపురం, వెలగపూడి ప్రధాన కూడలి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లే మార్గాల్లో బలగాలను మోహరించారు.  అలాగే, మందడంలో గ్రామస్తులెవరూ బయటికి రాకుండా 144 సెక్షన్ విధించారు. అలాగే, తుళ్లూరులో 700మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 29 రాజధాని గ్రామాల్లోనూ పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు... దుకాణాలను తెరిచేందుకు కూడా అనుమతి నిరాకరించారు. దాంతో, అమరావతిలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎటుచూసినా పోలీసులే కనిపిస్తుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇక, మంగళగిరి నిడమర్రులో ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతోన్న ఆందోళనకారులు... భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలంటూ కాలేజీ బస్సుపై దాడి చేశారు. బస్సు అద్దాలు పగలకొట్టారు. దాంతో, నిడమర్రులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అలాగే, రాజధాని రైతులకు అండగా బీజేపీ మౌనదీక్ష చేపట్టింది. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు కూర్చున్నారు.

రాజధాని రగడ మరింత ముదరనుందా?

కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొన్న మరుసటి రోజే సీఎం విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ప్రతిపాదిత రాజధాని ప్రాంత పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. శాసన సభ శీతాకాల సమావేశాల్లో 3 రాజధానుల మాట సీఎం జగన్ నోటి నుంచి వెలువడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని గురించే చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు ఆయన పర్యటనను ఆచితూచి స్వాగతిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలు కర్నూలులో హై కోర్టు ప్రకటనపై తొలుత సానుకూలంగా స్పందించాయి. అయితే రాష్ట్రంలో 3 రాజధానులు ఉండే అవకాశమే లేదని పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని సీఎం మంత్రుల వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది. దీంతో అమరావతి నగరంతో పాటు రాయలసీమ ప్రాంతంలోనూ ఆందోళనలు మొదలయ్యాయి.  రాజధాని నగరంగా ప్రకటించనున్న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక్కసారిగా భూముల ధరలు ఆకాశాన్ని తాకడం భూ కబ్జాల పర్వానికి పెద్ద ఎత్తున తెరలేపడంతో ఈ ప్రాంత వాసుల్లో భయం ఆవహిస్తుంది. ఇప్పటికే విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చుక్కలనంటింది. రాజధాని ప్రకటనతో ఇప్పుడు ఒక్కసారిగా సామాన్యుడికి నిలువ నీడ దక్కనంత ఎత్తుకు ఎగబాకింది. ఈ 6,7 నెలల్లో4000 ఎకరాలకు పైగా కబ్జా చేసినట్టు వస్తున్న వార్తలు ప్రజలను మరింత కలవరపరుస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఏకాభిప్రాయానికి ఇపుడిపుడే రాజకీయ పక్షాలన్నీ వస్తున్నాయి. శాసన సభలో సీఎం జగన్ ప్రకటన చేసినప్పుడు కాస్త గందరగోళంలో పడ్డ పార్టీలు తొలుత అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతించాయి. కానీ అది పాలన వికేంద్రీకరణ అని అర్థం కావటంతో అమరావతినే కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నదే తమ నిర్ణయమని ఇప్పటికే ప్రకటించింది. అమరావతి వల్ల ఏ ఇబ్బందులూ, ప్రతిబంధకాలు, సమస్యలు ఉన్నాయో ప్రజలకూ వివరించకుండా ఏక పక్షంగా తరలింపు నిర్ణయం తీసుకోవడం ఏంటని నిలదీస్తుంది. తన నిర్ణయానికి అందరూ శిరసావహించాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆక్షేపిస్తున్నారు. తన సార్వభౌమాధికారాన్ని గురించి ఆలోచిస్తున్న జగన్ ప్రజాస్వామ్యంలో దేశ సార్వభౌమాధికారాన్ని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పరిగణన లోకి తీసుకోవటం లేదని అంటున్నారు.  అమరావతి నగరం నుంచి పరిపాలనను తరలించటాన్ని టిడిపి తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. రైతులు రాజధాని ప్రాంత వాసుల ఆందోళనకు ప్రత్యక్షంగా మద్దతిస్తోంది. జనసేన వామపక్షాలు కూడా వారికి దన్నుగా నిలుస్తున్నాయి. అమరావతి నుంచి సచివాలయాన్ని తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ఈ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా రాజధాని నగర ప్రాంత పరిధిలో 29 గ్రామాల ప్రజలు ధర్నాలు రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. సచివాలయం హై కోర్టుకు వెళ్లే దారిలో భద్రతను పెంచారు. ఉద్రిక్త నేపథ్యం లోనే క్యాబినెట్ సమావేశం జరగనుంది.  రాజధాని రైతుల నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెద్ద రైతు పేద రైతు అనే విభజన తెచ్చేందుకు యత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద రైతులకు ఒక నిబంధన, చిన్న రైతుల మరో నియమావళిని అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అంటున్నారు. రాజధాని మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశాక చకచకా నిర్ణయాలు అమలు జరుగుతున్నాయి. విశాఖను రాజధానిగా ప్రకటించినందున ఈ నెల 28 న అక్కడకు రానున్న సీఎం జగన్ కు ఘన స్వాగతం పలకబోతున్నామని వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు.ఈ నేపథ్యంలో రాజధాని మార్పును అడ్డుకునే శక్తి కేంద్రానికి ప్రధానంగా ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా లకు మాత్రమే వుందన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. నేటి భేటి తరువాత ఏం జరగబోతోంది తదుపరి ఏ నిర్ణయం తీసుకోనున్నారు అనే అంశంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

రాజధాని మార్పును రైతులు సమ్మతిస్తారా?

రాజధానిని అమరావతిని విశాఖపట్నం తరలించేందుకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతలు ఇప్పటికే మానసికంగా సిద్ధమై తరలింపు ప్రక్రియను ఏ విధంగా చేయాలనే దానిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే జీఎన్ రావు తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కర్నూలులో హై కోర్టు, అమరావతిలో శాసన సభ, శాసన మండలి, రాజ్ భవన్, మంత్రుల నివాసాలు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయాలు, హెచ్వోడీలు, అసెంబ్లీ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని కమిటీ నివేదిక సూచించింది. దీనిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. కమిటీ నివేదికపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు.రాయలసీమ వాసులు కూడా హై కోర్టు ఏర్పాటు వల్ల తమకేమీ ప్రయోజనమని నిలదీస్తున్నారు. అమరావతికి రావాలంటేనే 6 గంటలు పడుతోందని, ఇక విశాఖపట్నం వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాజధాని రైతులతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలలో అమరావతి తరలింపు పై నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రజా ప్రతి నిధుల తీరు పై రాజధాని జిల్లా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ నేపథ్యం లోనే గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో గురువారం సాయంత్రం సీఎం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. రాజధాని తరలింపు రైతులు రెండు జిల్లాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయని సమాధానం చెప్పలేకపోతున్నామని ఎమ్మెల్యేలూ సజ్జల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ఐటి హబ్ లా మార్చి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తామని రైతులకు నష్టం రాకుండా చూస్తామని సజ్జల హామీ ఇచ్చారు. చంద్రబాబు తెలుగుదేశం పై ఎదురు దాడి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీంతో బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అమరావతి నిర్మించాలంటే లక్షా తొమ్మిది వేల కోట్లు అవుతుందని చంద్రబాబు చెప్పారని ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో అంత డబ్బు లేదని స్పష్టం చేశారు. అందువల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.జీఎన్ రావు కమిటి పై ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు. దీంతో రాజధాని తరలింపు ఖాయమని తేలిపోయింది. రాజధాని తరలింపు పై మంత్రి బొత్స కూడా పరోక్షంగా సూచనలు ఇచ్చారు. ఒక్క సచివాలయం మాత్రమే వెళ్తే ఏమవుతుందని రాజధాని రైతులకు పోయేదేముందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఉచ్చులో రాజధాని రైతులు చిక్కుకోవద్దని ఆయన ఆరోపించారు.క్యాబినెట్ సమావేశంలో జిఎన్ రావు కమిటీ నివేదిక పై కూడా చర్చిస్తామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో పట్టణ నగర ప్రాంతాలు రాజధాని సమగ్రాభివృద్ధి కోసం సలహాలు, సూచనలు కోరిన జీఎన్ రావు కమిటీ నివేదిక పై క్యాబినెట్ సమావేశంలో చర్చించటంతో పాటు దీనిని ఆమోదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆందోళన చేస్తున్న అమరావతి రైతుల కోసం ఐటి, పారిశ్రామిక హబ్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే రాజధాని తరలింపును మాత్రం అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.భేటి అనంతరం అమరావతి రైతులు రాజధాని మార్పులను సమ్మతిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

నేడు జరగనున్న క్యాబినెట్ భేటీ కై రంగం సిద్ధం..

  ఏపి రాజధాని కై రైతులు చేస్తున్న ఆందోళనలు అందరికి తెలిసినవే.నేడు ఏపీ రాజధానుల పై ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. రాజధానుల పై ఏ నిర్ణయం తీసుకుంటారు, 10 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలు చూసి అమరావతి లోనే ఉంచుతారా లేక విశాఖలో ఉండొచ్చని ముందుగా చెప్పినట్లుగా అక్కడికే తరలిస్తారా అనే దాని పై మంత్రి వర్గ సమావేశం తర్వాత స్పష్టత రానుంది. క్యాబినెట్ భేటీ నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే యాంటీ నక్సల్స్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు రంగం లోకి దిగారు. సచివాలయానికి వెళ్లే మార్గాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. కరకట్ట, సీడ్ యాక్సెస్ రోడ్, మందడం, మల్కాపురం, వెలగపూడి పరిధిలోని రహదారులపై భారీగా పోలీసులను మోహరించారు. సచివాలయ దారిలో ఇవాళ రైతుల నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మందడం గ్రామం లింకు రోడ్లలో ముళ్లకంచెలు వేశారు. కేబినెట్ భేటీకి సీఎం సచివాలయానికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆయన కాన్వాయ్ తో ఇప్పటికే ఓ ట్రయిల్ వేశారు. మరోవైపు ప్రభుత్వ తీరు పై రాజధాని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇస్తే ఇప్పుడు దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా పోలీసుల మోహరింపు ఆంక్షల విధింపు పై మండిపడుతున్నారు అక్కడి రైతులు. మొత్తం మీద క్యాబినెట్ భేటీ నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.భేటీ అనంతరం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం ఉత్కంఠం రేకెతిస్తొంది.

జగన్ దూకుడు.. దిశ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకావాలి

దిశ చట్టాన్ని ఇటీవలే అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఇది చట్టంగా మారింది. కాగా, దిశ చట్టం అమలు కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హాజరయ్యారు. దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.   చట్టం చేసి వదిలేస్తే దానిపై విమర్శలు వస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం అమలుకావాలని, అమలు కావడం లేదన్న మాట ఎక్కడా రాకూడదని సీఎం అధికారులను కోరారు. దిశ చట్టం అమలుకు కావల్సిన పకడ్బందీ చర్యలన్నీ తీసుకోవాలని ఆదేశించారు. దిశ చట్టం అమలు చేయాలంటే పటిష్టమైన వ్యవస్థ అవసరం అని, దీనికోసం 13 కోర్టులు పనిచేస్తున్నాయని, వీటికి నిధులు అవసరం అవుతాయని అధికారులు చెప్పడంతో.. నిధులను తక్షణమే విడుదల చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఒక్కో కోర్టుకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులను మంజూరు చేశారు. అలానే తిరుపతి, విశాఖలో ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి అవసరమైన సిబ్బంది కోసం జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు దిశ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగంలో ఓ ఐపీఎస్ అధికారిని నియమిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు.  

ఘోరమైన మూడనమ్మకం... సూర్య గ్రహణం

నేడు సంపూర్ణ సూర్య గ్రహణం అన్న సంగతి అందరికి తెలిసిందే. ఏడాది చివరిలో వచ్చిన ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఎందరో ఆశక్తి చూపించారు. కాగా, ఒకవైపు చంద్రుడి పైకి మనిషిని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు సూర్యగ్రహణం వేళ మూఢ విశ్వాసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కర్ణాటకలో అమానుష ఘటన చోటు చేసుకుంది. సూర్యగ్రహణం వేల మట్టిలో పాతిపెడితే అంగవైకల్యం పోతుందనే మూఢనమ్మకంతో ఒక దివ్యాంగుడైన అబ్బాయిని మెడవరకూ మట్టిలో పాతి పెట్టారు. గ్రహణం పూర్తయ్యేంత వరకు ఆ అబ్బాయిని అలాగే మట్టిలో ఉంచారు. ప్రజలు ఇలాంటి మూఢ విశ్వాసాలను విడిచి పెట్టాలని జన విజ్ఞాన వేదిక సభ్యులు కోరుతున్నారు. సూర్య గ్రహణం నాడు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని రకాల మూఢ నమ్మకాలతో ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. గ్రహణం పూర్తి అయ్యే వరకు  ఎవరూ కూడా ఎటువంటి భోజనాన్ని తీసుకోరు,కనీసం భోజనాన్ని తయారు చేసుకోకూడదు, బయటకు వెళ్లకూడదు అనే నమ్మకాలు చాలానే ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కలబుర్గి అనే ప్రాంతంలో ఎప్పుడూ మూఢనమ్మకాల చర్య  కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా కొంత మంది అంగవైకల్యం ఉన్న  చిన్నారులని, ఇక డాక్టర్ ల వల్ల కూడా వారికి ఎటువంటి ప్రయోజనం లేదు, జన్మించినప్పటి నుంచి వారికి అంగవైకల్యం ఉన్న చిన్నారులకు అనగా 15 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరినీ కూడా..  నాగుల చవితి నాడు ఆ పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోస్తామో అలాంటి ప్రాంతానికి తీసుకెళ్లి పిల్లల్ని అదే పుట్టలో కప్పిపెట్టి ఒక అరగంట పాటు ఉంచితే వాళ్ళ అంగవైకల్యం సరిగ్గా నయమవుతుంది అన్న ఊహాగానాలు ఉన్నాయి. పిల్లలకి ఎటువంటి అపాయం వుండదు, ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతుంది అని చెప్పి ఒక మూఢనమ్మకం తోనే పిల్లల్ని కలబుర్గి లోని  ప్రాంతానికి తాజ్ సుల్తానాపూర్ అనే ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పెట్టటం జరిగింది.  ఈ రోజు సూర్యగ్రహణం కాబట్టి పిల్లల్ని పది గంటల లోపు అంటే ఉదయం తెల్లవారుజాము నుంచి పది గంటల లోపు పిల్లల్ని అలా పెట్టడం జరిగితే వారి అంగవైకల్య లోపం నుంచి బయటపడతారు అనేది ఒక మూఢ నమ్మకంగా ఉంది. అయితే మొత్తం ఒక ఐదు మంది చిన్నారులతో పాటు ఒక 18 సంవత్సరాలు నిండిన ఒక అబ్బాయిని కూడా అందులో పెట్టడం జరిగింది. అయితే సూర్యగ్రహణం రోజు మట్టిలో పాతి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందనే నమ్మకాన్ని కొంతమంది చదువుకున్న విద్యార్థులు కొట్టివేసినప్పటికీ అక్కడున్న తల్లిదండ్రులూ, ఊరి పెద్దలు మాట వినకుండా చిన్నారులను అక్కడికి తీసుకువెళ్ళి పెట్టారు. కానీ చిన్నారులైతే భయబ్రాంతానికి గురికాగా, వారు పసితనంలో ఒక్క సారిగా ఊపిరి బిగపెట్టుకొని మట్టిలో కూర్చున్నప్పుడు వారి పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

రేసులో అజయ్ అండ్ సోమేష్... కేసీఆర్ మొగ్గు ఎవరివైపో...

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. దాంతో, తెలంగాణ కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు మొదలైంది. సీనియారిటీ, సమర్ధత, వైఖరిని పరిగణనలోకి తీసుకుని సీఎస్ ఎంపికపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, సీఎస్ కేసులో ముఖ్యంగా ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరు ప్రముఖంగా తెరపైకి వస్తోంది. అజయ్ మిశ్రా, సోమేష్ కుమార్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుందోనని, వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు సీఎస్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. సీనియారిటీపరంగా చూస్తే 1983 బ్యాచ్ నుంచి బీపీ ఆచార్య, బినయ్ కుమార్... అలాగే 1984 బ్యాచ్ నుంచి అజయ్ మిశ్రా.... 1985 బ్యాచ్ నుంచి పుష్పా సుబ్రమణ్యం... 1986 బ్యాచ్ నుంచి సురేష్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారీ.... 1987 బ్యాచ్ నుంచి రాజీవ్ రంజన్, వసుధా మిశ్రా... 1988 బ్యాచ్ నుంచి శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా.... ఇక, సీఎస్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోన్న సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.... అయితే, ఇంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ... 1984 బ్యాచ్ అజయ్ మిశ్రా... అలాగే 1989 బ్యాచ్ సోమేష్ కుమార్ వైపు మాత్రమే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఒకవేళ అజయ్ మిశ్రాకి అవకాశమిస్తే కేవలం ఆరు నెలలు మాత్రమే అంటే 2020 జూన్ వరకు మాత్రమే సీఎస్ గా కొనసాగనున్నారు. అదే, సోమేష్ ను ఎంపిక చేస్తే మాత్రం 2023 డిసెంబర్ చివరి వరకు సీఎస్ గా పనిచేసే అవకాశముంటుంది. 2023 డిసెంబర్ నెలాఖరులో సోమేష్ కుమార్ ఉద్యోగ విరమణ ఉండటంతో... ఆయన నాలుగేళ్లపాటు సీఎస్ పదవిలో ఉంటారు. మరి, సీఎం కేసీఆర్.... అజయ్ మిశ్రా వైపు మొగ్గుచూపుతారో... లేక దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సోమేష్ కి అవకాశమిస్తారో చూడాలి. అయితే, తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా... సీఎస్ గా రావడానికి పలువురు సీనియర్లు అస్సలు ఇష్టపడటం లేదనే మాట కూడా వినిపిస్తోంది.

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: కార్గో పార్సిల్ పై దృష్టి పెట్టిన కేసీఆర్...

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు.ఎందరో వారి ప్రాణాలను  సైతం కోల్పొయారు.సమ్మె విరమించిన అనంతరం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించారు.అం దులో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ కాలాన్ని పెంచనున్నట్లు ప్రతిజ్ఞ  చేశారు సీఎం కేసీఆర్.ఆయన ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మేరకు ఉత్తర్వుల పై సీఎం కేసీఆర్ సంతకం కూడా చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎం. ఈ బోర్డ్ లో ప్రతి డిపో నుంచి ఇద్దరు ఉద్యోగుల చొప్పున మొత్తం 202 మంది సభ్యులుంటారు. ఇందులో 73 మంది మహిళా ఉద్యోగులు డిపో పరిధిలో వారానికోసారి, రీజియన్ పరిధిలో నెలకొసారి, కార్పొరేషన్ లో మూడు నెలలకొసారి సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవలను మరింత విస్తృత పరచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ ద్వారానే సరుకు రవాణా జరపాలన్నారు. ముంబై, సోలాపూర్, నాగపూర్, భీవండిలకు సరకు ఆర్టీసీ కార్గో ద్వారానే రవాణా చేయాలని సూచించారు. బతుకమ్మ చీరలు, పుస్తకాలూ మద్యం రవాణా కూడా ఆర్టీసీ కార్గోల ద్వారానే జరుగాలన్నారు కెసిఆర్.

నా పేరు చెబితే క్రిమినల్ కేసులు పెట్టండి... విశాఖలో సెంటు భూమి లేదన్న విజయసాయి

విశాఖలో తనకు ఒక్క సెంటు భూమి కూడా లేదన్నారు విజయసాయిరెడ్డి. భూదందాల్లో తనపై వస్తున్న ఆరోపణలను వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. భూ సెటిల్మెంట్లతో తనకు సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విశాఖలో తనకు త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తప్పా... పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ మరెలాంటి ఆస్తులు లేవన్నారు. ఏ వెంచర్ లోనూ భాగస్వామ్యం లేదని తేల్చిచెప్పారు. భూముల విషయంలో ఎలాంటి పైరవీలు చేయలేదని, ఏ అధికారితోనూ మాట్లాడలేదని విజయసాయి స్పష్టత ఇచ్చారు. విశాఖలో భూదందాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ధర్నాలు చేశామని, భూఅక్రమాలకు పాల్పడిందెవరో తనకు తెలుసన్నారు. ఒకవేళ ఎవరైనా తన పేరు చెప్పుకుని భూదందాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు విజయసాయిరెడ్డి సూచించారు.

ప్రకటనకు ఒక్కే రోజే మిగులుంది... విశాఖలో జగన్ కు గ్రాండ్ వెల్ కమ్

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖను అధికారికంగా ప్రకటించనున్నారు. డిసెంబర్ 27న మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖను అనౌన్స్ చేయనున్నారు. డిసెంబర్ 27న ప్రకటన అధికారిక ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 28న విశాఖలో పర్యటించనున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన తర్వాత తొలిసారి పర్యటించనున్న సీఎం జగన్ కు భారీ స్వాగత పలకనున్నట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు స్వాగత కార్యక్రమాలు ఉంటాయన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతామని విజయసాయిరెడ్డి తెలిపారు. సుమారు పాతిక కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి జగన్ కు గ్రాండ్ వెల్ కమ్ చెబుతామన్నారు విజయసాయి.  

మున్సిపోల్స్ లో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తప్పదా?

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ మున్సిపోల్స్ వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల అధికారులా? లేక టీఆర్ఎస్ కార్యకర్తలా అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. అయితే, ఎన్నికలంటేనే కాంగ్రెస్ కు వణుకు పుడుతుందోని... అందుకే ఎన్నికల అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ కౌంటరిస్తోంది. అయితే, కాంగ్రెస్-టీఆర్ఎస్ ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనబెడితే... 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ ఏకపక్ష విజయాలు సాధిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కంచుకోటలో కాంగ్రెస్ ను మట్టికరిపించింది. దాంతో, మున్సిపోల్స్ లోనూ టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అయితే, తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి రాకముందు 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక వార్డులను కైవసం చేసుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు 55 మున్సిపాలిటీల్లో 1399 వార్డులను జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 517 గెలుచుకుంది. టీఆర్ఎస్ 312 వార్డులతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో... ఆనాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ గులాబీ పార్టీయే గెలుస్తూ వచ్చింది. అయితే, 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఊహించనివిధంగా ఎంపీ స్థానాల్లో సగం సీట్లను కాంగ్రెస్, బీజేపీ గెలుచుకున్నాయి. అయితే, ఆ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ సత్తా చాటింది. దాంతో, మున్సిపోల్స్ లోనూ తమదే విజయమని గులాబీ పార్టీ విశ్వాసంతో ఉంది. అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటోందని, ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని టీకాంగ్ నేతలు అంటున్నారు. అలాగే, జాతీయ పరిణామాల ప్రభావం మున్సిపోల్స్ పై ఉంటుందని, ఫలితాలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో... మున్సిపోల్స్ ఫలితాలు ఏకపక్షంగా ఉండబోమని అంటున్నారు. మరి తెలంగాణ మున్సిపోల్స్ లో కొత్త రాజకీయం ఆవిష్కృతం కానుందో? లేక ఎప్పటిలాగే అధికార టీఆర్ఎస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

ఎన్ఆర్పీ పై భయాందోళనలో ఉన్న ప్రజలు: ధైర్యాన్ని నింపుతున్న అమిత్ షా.....

ఇరవై రోజులుగా దేశం నిరసనలతో అల్లకల్లోలమవుతోంది. కుల, మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమయ్యాయి. విద్యార్థులు రోడ్డెక్కారు. పౌరసత్వ సవరణ చట్టం ఒప్పుకోమంటూ అన్ని వర్గాల ప్రజలు నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాత దేశం లోని వివిధ ప్రాంతాల్లో దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఈ చట్టం ప్రకారం పొరుగు దేశాల నుంచి ఆశ్రయం కోసం భారత్ వచ్చిన హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, పార్సి, క్రైస్తవ సమాజాలవారికీ భారత పౌరసత్వం ఇచ్చే నిబంధన ఉంది. ఈశాన్యంతో పాటు దేశం లోని చాలా ప్రాంతాల్లో ఈ చట్టం పై వ్యతిరేకత వస్తోంది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం భారత రాజ్యాంగానికి విరుద్ధమని వాదిస్తున్నారు. అంతేకాదు ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. కానీ కొత్త చట్టాన్ని తక్షణం నిషేధించాలని వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. విచారణకు జనవరిలో తేదీని నిర్ణయించింది. ఇదే సమయంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియాలో తీవ్రంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనల సమయంలో హింస, దహనాలు తరువాత పోలీసులు అతి చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఆ తరువాత నిరసన ప్రదర్శనలు అంతకంతకూ తీవ్రతరమయ్యాయి. అస్సాంలో మొదలైన నిరసన ప్రదర్శనలు జామియా తరువాత ఢిల్లీ సీలంపూర్ ప్రాంతాల్లో తీవ్రతరమయ్యాయి. అక్కడ విధ్వంసం సృష్టించారని పోలీసుల పై మరోసారి ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్ లో కూడా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. కానీ ప్రభుత్వం పౌరసత్వ చట్టంలో మార్పులు వల్ల భారత్ లో ఉన్న ముస్లింలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతోంది మోడీ సర్కార్. కానీ విపక్షాలు ఆందోళనకారులు కొత్త చట్టాన్ని భారత్ లౌకికవాదానికి ముప్పుగా భావిస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఎన్ఆర్సీ ప్రక్రియ, పౌరసత్వ చట్టం అంటే సీఐఏ రెండూ వేరు వేరని చెబుతోంది. కానీ విపక్షాలు నిరసనకారులు ప్రభుత్వ విధానం ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తమ సందేహాలు వ్యక్తం చేస్తూ రోడ్ల పైకి వస్తున్నారు. ఈ తరుణంలో తెరపైకి ఎన్పిఆర్ వచ్చింది. జాతీయ పౌరసత్వ జాబితా ఎన్ఆర్సికి జాతీయ జనాభా ఎన్పిఆర్ కు మధ్య ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు. ఎన్పిఆర్ కారణంగా ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదని ఒక మైనారిటీ పౌరుడి పౌరసత్వం కూడా దీనివల్ల వెనక్కు తీసుకోవడం జరగదని అంటున్నారు.దేశవ్యాప్తంగా జాతీయ జనాభా జాబితా అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్ ను నవీకరించేందుకూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై చర్చించాల్సిన అవసరం లేదని అమిత్ షా అంటున్నారు. ఒకవేళ ఎన్పీఆర్ లో ఎవరి పేరైనా గల్లంతయితే వారి పౌరసత్వానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదని అమిత్ షా హామీ ఇస్తున్నారు. మొత్తం మీద సీఐఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ ఈ మూడు విషయాలు ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. మోదీ సర్కార్ ఈ మూడు అంశాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ కేంద్రం ఎన్ని మాటలు చెప్పినా వీటి పై ప్రజల్లో ఏర్పడిన సందేహాలూ పౌరసత్వం చుట్టూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకని పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదో జరుగుతుందనే భయాందోళనలు ప్రజల్లో భారీగా ఏర్పడ్డాయి. ఈ చట్టం అమలైతే ఏర్పడే పరిణామాలు అంత సౌమ్యంగా ఉండవని అంచనాలూ ప్రజల్లో ఏర్పడ్డాయి. అందుకే సిఐఎ పైన ఎన్ఆర్సి పై ఎంత ఆందోళన వ్యక్తం చేశారో ఇప్పుడు ఎన్పిఆర్ అనేది కేవలం జనాభా లెక్క మాత్రమే అని కేంద్రం చెబుతున్నా ప్రజలలో కాస్త కూడా నమ్మకం కలగటం లేదు.ఈ అంశం పై కేంద్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో,ఎలా ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది అనేది వేచి చూడాలి.

మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటీషన్లు.. మళ్లీ బ్రేక్ పడనుందా?

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి తెలంగాణలో వాతావరణం హీటెక్కింది. అడ్డగోలుగా వార్డుల విభజన, అస్తవ్యస్తంగా కులాల పరంగా ఓటర్ల గణన ఇవన్నీ గతంలో వచ్చిన అభ్యంతరాలు. 70 మునిసిపాలిటీలపై దాఖలైన పిటిషన్ లలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అభ్యంతరాలన్నీ పరిష్కరించాకే ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఆదేశించింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. అభ్యంతరాలు పరిష్కరించినట్టు పేర్కొంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఇప్పుడే అసలు వివాదం మొదలైంది. వార్డుల రిజర్వేషన్ లు ఖరారు కాకుండా ఎలా షెడ్యూలు విడుదల చేస్తారన్న దాని పై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందనేది మరో విమర్శ. అభ్యంతరాలను పరిష్కరించకపోవడం , రిజర్వేషన్ లు ఖరారు చేయకుండా షెడ్యూలు విడుదల చేయడాన్ని విపక్షాల తప్పుపడుతున్నాయి. దీని పై మరోమారు హైకోర్టు మెట్లెక్కేందుకు రాజకీయ పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. మరి కొన్ని పిటిషన్ లు దాఖలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే షెడ్యూల్ విడుదలయ్యాక కోర్టు ఇలాంటి పిటిషన్ లను పరిగణలోకి తీసుకోవద్దని వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడు షెడ్యూల్ మాత్రమే విడుదలైందని నోటిఫికేషన్ వస్తేనే కోర్టులు జోక్యం చేసుకోలేవు అన్నది మరో వాదన. వచ్చే నెల 7న నోటిఫికేషన్ రానుండటంతో ఆలోపు హైకోర్టులో విచారణ జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ముందు ముందు తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అన్నది వేచి చూడాలి.